Page:278
చోట్ల ఢాకినులు నృత్యం చేస్తున్నారు. ప్రళయమేఘాలు గల ప్రదేశాలు, కిన్నెర- గంధర్వ - దేవతా స్త్రీలు గానం చేస్తున్న ప్రదేశాలు, రుద్రపురములు, బ్రహ్మ పురములు చూచారు. ఇంకా మాయా నిర్మితమైన పట్టణాలు, కదలికలే లేని సరోవరాలు, సిద్ధులు వచ్చిపోయే స్థానాలు, చీకటి రాత్రులచే ఆక్రమించబడిన ప్రదేశాలు, పగలు మాత్రమే ఉన్న ప్రాంతాలు చూచారు. ఈ విషయములన్నీ వారు గమనిస్తూ సాగిపోతున్నారు. మధ్యమధ్యలో ఆకాశమండలమున విశ్రమిస్తున్నారు. జ్ఞప్తిదేవియగు సరస్వతీ జగన్మాత కల్పనా బలమును అనుసరించే ఆయా భూమి ప్రదేశములను చూస్తూ వెళ్ళుచున్నారు.
❖
ఓ రామచంద్రా! ఈ భూమండలము “బ్రహ్మాండము యొక్క హృదయపద్మమా?" అని అనిపిస్తోంది కదా! అష్టదిక్కులచే ఆవరించబడిన ఈ భూమిపై ప్రాణికోట్లు దోమల గుంపువలె ఉంటున్నారు. దీనిచుట్టూ దీనికి మూడింతలు లవణసముద్ర మున్నది. దానికి రెండింతలు శాకద్వీపం, దానికి రెండింతలు క్షీరసముద్రం ఆవరించి ఉన్నది. దానికి రెండితలు 'కుశద్వీపం'. ఆ ద్వీపం చుట్టు ‘దధిసముద్రం’ ఆవరించి ఉన్నది. దానికావల క్రౌంచ ద్వీపం. దానినావరించి ఘృతసముద్రం, దాని చుట్టూ గోమేధిక ద్వీపం, దానికావల ఇక్షు సముద్రం, దానిచుట్టూ పుష్కరద్వీపం, అక్కడ చుట్టు మంచినీటి సముద్రమున్నది. ఆ తరువాత ఒక బిలము ఉన్నది. అది పాతాళమునకు దారి తీస్తోంది. దానికి ఆవల పదిరెట్లు విస్తీర్ణముగల అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో జీవరాశి లేదు. ఆ తరువాత అగ్నిజ్వాలలు, వాయు ప్రవాహం, శూన్యాకాశం, బ్రహ్మాండ కుడ్యము-ఇవన్నీ కూడా, ఒకదానికంటే మరొకటి పదిరెట్లు ఉండి ఉన్నాయి. ఇవన్నీ దాటి ఆ ఇరువురు వనితలు 'గిరి' అను గ్రామం ఉన్న భూమండలం చేరారు.
❖
క్రమంగా వారు 'వసిష్ఠుడు' అనబడు బ్రాహ్మణుని గృహంలో ప్రవేశించారు. ఆ ఇల్లు ఉత్సవరహిత నగరంలాగా, దుఃఖముతో నిండియున్న స్త్రీలాగా, కూలిన వృక్షంలాగా ఉన్నది. గృహపాలకులు లేకపోతే అంతేకదా!
అప్పుడు నిర్మల జ్ఞానము పొందియున్నప్పటికీ ఆ లీలాదేవి కొంత అజ్ఞానముచే ప్రభావితమవటం జరిగింది. ఉబలాటం అణచిపెట్టుకోలేక ... “ఇక్కడ ఉన్న నా బంధువులు నన్ను, ఈ సరస్వతీదేవిని చూడగలుగుదురు గాక!” అని తన చిత్తమున సంకల్పించినది. అంతే... ఆ ఇంటిలోని బంధువులు ఆ ఇద్దరిని ఎదురుగా చూడగలిగారు. వారి రాకచే ఆ గృహములోని దుఃఖమంతా మటుమాయమైంది. వాతావరణమంతా అత్యంత ప్రకాశవంతమైనది. వారి చల్లని చూపులు అనే అమృతం చేత అక్కడి వారందరు పరమానందం పొందారు. ఆ గృహము యొక్క పెద్ద కుమారుడు అయినట్టి జ్యేష్ఠశర్మ వారిద్దరికి పుష్పాంజలి సమర్పించి పాదములకు నమస్కరించాడు.
Page:279
జ్యేష్ఠశర్మ : ఓ వనదేవతలారా! సుస్వాగతం. మీకు జయమగు గాక! మీరాకచే మా దుఃఖాలన్నీ ఒక్కసారి పటాపంచలు అయ్యాయి. సాధుజనులైనవారు దుఃఖజనుల ఆర్తిని పోగొట్టుటే అభ్యాసముగా కలిగివుంటారు. అందుచేతనే మీరిద్దరు మా ఈ గృహమును పావనం చేశారు.
శ్రీ సరస్వతీదేవి : నాయనా! ఈ గృహములోని వారంతా ఏదో దుఃఖమును పొందినట్లున్నారు. కారణమేమిటి? మీకు వచ్చిన కష్టమేమిటి?
జ్యేష్ఠశర్మ : అమ్మలారా! ఈ ఇల్లు ఎల్లప్పుడూ అతిథులకు ఆశ్రయమై, బ్రాహ్మణ మర్యాదలకు ఆధారమై ఉండేది. దీనులు ఇక్కడి ప్రేమ-సహకారములచే ఆనందము పొందుతూ ఉండేవారు. మా తల్లి-తండ్రులు ఈ ఇంట్లో సంచరిస్తూ ఉంటే, ఈ పరిసరమంతా దేవలోకంలోని నందనవనంలా ఉండేది. ఎనిమిది రోజుల క్రితం మా తల్లితండ్రులు మా గృహం విడచి స్వర్గస్తులయ్యారు. ఇంకేమున్నది? మాకీ మూడు లోకములు శూన్యములే అయ్యాయి. నాలుగు - ఐదు రోజుల క్రితం వారి దేహాలకు దహనసంస్కారాలు చేశాము. అటు చూడండి. ఆ పెంపుడు పక్షులు ఇంకా మా తల్లి-తండ్రుల మృతదేహములను గుర్తు తెచ్చుకొని కరుణతో రోదిస్తూనే ఉన్నాయి. అవి అశ్రుధారలతో తమ అమితదుఃఖమును వెలిబుచ్చుచున్నాయి. ఈ గిరి గ్రామ వాసులంతా ఇంకా నెత్తి నోరు బాదుకొని దుఃఖిస్తూనే ఉన్నారు. కొందరు బంధువులు బ్రతకాలని లేకపోవుటచే తిండిని కూడా మానివేశారు. వీథులు నిర్మానుష్యమయ్యాయి. ప్రకృతి కూడా రోదిస్తోంది. ఆ దుఃఖముచే మా మా
అంగములు సత్తువను కోల్పోయాయి. పుష్ప సుగంధం దుర్గంధంగానే తోస్తోంది. మా తల్లిదండ్రులు వచ్చి ఉండటంచేత కాబోలు - స్వర్గనరకవాసులు సంతోషంతో విద్యాధరగానం చేస్తున్నారు. మీ వంటి మహాత్ముల దర్శనం వృథా అవుతుందా? లేదు. మీరు మా దుఃఖమును తప్పక పోగొట్టగలరని నేను అనుకొంటున్నాను.
16. విస్తార దృష్టి
అది వింటున్న లీలావతి సరస్వతీదేవి వైపు అర్థయుక్తంగా చూచింది. పుత్రుడు జ్యేష్ఠశర్మ నుదురు ప్రేమగా స్పృశించింది. ఆమె హస్తస్పర్శచే అతడు “దుఃఖము” అనే దురదృష్టము నుండి క్షణంలో విడివడ్డాడు.
శ్రీ రామచంద్రుడు : హే మహర్షీ! వసిష్ఠా! ఇప్పుడు నాదొక చిన్న సందేహం. ఆ లీలావతి తన ఇతఃపూర్వపు జన్మకు సంబంధించిన పుత్రుడగు ఆ జ్యేష్ఠశర్మకు తన ఇతఃపూర్వపు రూపముతోనే కనబడి ఉండవచ్చును కదా! అట్లు ఎందుకు చేయలేదు?
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రాఘవా! ఈ నేల మొదలైన పదార్థములను చూస్తున్నప్పుడు, భౌతికదృష్టితో చూస్తున్నవారికి ఇక్కడ అనేక పదార్ధములు, నీవు-నేను వంటి అనేక విశేషములు ఉన్నట్లు కనబడుచున్నాయి. జ్ఞానదృష్టి గలవారికి, (ఉత్తమమగు ఆత్మదృష్టిని అభ్యాసయోగముచే అవలంబించిన
Page:280
వారికి)... ఇదంతా ‘పరమాకాశము’ గానే కనబడుతోంది. పాంచభౌతిక దృష్టి బలవత్తరమై ఉన్నంత వరకు అసత్పదార్ధములు (అనగా, వాస్తవమైన ఉనికి లేనివి) కూడా సత్పదార్థమువలె తోచుతాయి. 'మాయ' యొక్క చమత్కారం అదేమరి! ఒక బాలుడు బేతాళదృష్టితో చీకట్లోకి చూచినప్పుడు అతనికి ఆ చీకట్లో ఉన్న బండరాయో, చెట్టో బేతాళుని ఆకారముగానే దర్శనమిస్తోంది. "అసలు బేతాళుడు (దయ్యము) అనబడే పదార్ధమే ఉండదు" అను దృఢదృష్టితో చూస్తే, అక్కడ బేతాళుడే ఉండదు. “ఇది స్వప్నము" అను జ్ఞానం కలిగిన తరువాత ఇక స్వప్న పదార్థములకై “అవి ఎక్కడ ఉన్నాయి?” అని వెతుకువాడెవ్వడు? అదే విధంగా జాగ్రత్ అవస్థయందు కూడా! "ఆత్మవిషయ జ్ఞాన దృష్టి”చే, ఇక్కడి పదార్థములన్నీ 'మిథ్య' గానే గోచరిస్తాయి. పైత్యరోగముచే విచలితమైన మనస్సు గలవానికి ఈ పరిసరమంతా గిఱ్ఱున తిరుగుచున్నట్లు తోచుచున్నది. సత్యజ్ఞానము, సమగ్రమైన అవగాహన లేనివాడే “సంసారము” అనబడుదానిని చూస్తున్నాడు. అనుభవిస్తున్నాడు, “ఈ భూమి మొదలైనవన్నీ ‘భావన-భావికుడు’ల పరస్పర సంబంధమును అనుసరించి మాత్రమే ఉంటున్నాయి. స్వతహాగామాత్రం ఇదంతా ఆకాశసదృశమే” అను బుద్ధి పెంపొందించుకున్నవారికి ఇవన్నీ ఆ రీతిగానే గోచరిస్తాయి.
స్వప్నంలో కనబడే ఆకాశము, భూమి, జనులు మొదలైనవన్నీ శూన్యమే రూపముగా కలిగి యున్నవి కదా! స్వప్నంలో ఒకడు చూచు సుందరస్త్రీ శూన్యరూపమే. అయినప్పటికీ, ఆ స్వప్నానుభవము, ‘స్కలనము’ మొదలైన ప్రభావములు ఈ బాహ్యదేహమునందు కలిగింపజేయుచున్నది. అదేవిధంగా ఆకాశమునందు "ఇది పృథివి” అనునట్టి జ్ఞానము కలిగినప్పుడు, అది అట్లే పృథివి మొదలైన పదార్ధములుగా దర్శనమిస్తోంది. బాలుడు స్వల్పములగు ఆటవస్తువులలో మహత్తరమైన విశేషములు గాంచుచున్నాడు. మరణించబోవువాడు తనచుట్టు జలపాతమును, వాయు ప్రహారమును అనుభవించటం జరుగుతోంది. ఒకానొకడు మూర్ఛలో పరలోకములను గాంచు చున్నాడు. కొందరు పిచ్చివారు తమ ఎదురుగా ఏవేవో జ్ఞాపకములకు సంబంధించిన జనులను, పదార్థముల ఆకారములను గాంచుచున్నారు. చక్షురోగము కలవాడు ఒక్క వ్యక్తినే అనేకమందిగా చూస్తూంటాడు. వారికి ఇవన్నీ అజ్ఞానావేశం ఉన్నప్పుడు వాస్తవముగానే అనిపిస్తూ ఉంటున్నాయి.
దీనిని బట్టి నీవు గ్రహించవలసినది ఏమిటి? ఈ జగత్తులోని పదార్థ సమూహముల ఆకారము లన్నీ కల్పన యందే ప్రతీతమై ఉంటున్నాయి. వాస్తవానికి వీటికి ఎట్టి ఆకృతి లేదు. కనుక ఈ దృశ్యమంతా ‘భావన-భావించువాడు' అను రెండిటి మధ్య ఏర్పడి ఉన్న సంబంధం యొక్క ప్రకటనయే.
ఇక మనం లీలాదేవి విషయానికివస్తే, ఆమె “పృథివి-శరీరములు” మొదలైన వాటినన్నిటినీ ‘అసత్తు’ గానే గ్రహించుచున్నది. “చిదాకాశమే భ్రాంతి బలం చేత నానారూపములను దాల్చుచున్నది” అని ఆమె స్పష్టముగా గాంచుచున్నది. “ఇదంతా చిదాకాశ స్వరూపమగు బ్రహ్మమే” అని గ్రహించినట్టి మననశీలునకు, ... ఈ “నా కొడుకు - నా నా స్నేహితుడు స్నేహితుడు - నా భార్య - నా జాతి" అను పరిమిత
-
Page:281
భావనలు వీగిపోతాయి. అసలీ దృశ్యపదార్ధములు ఏక్షణంలోను ఉత్పన్నమై ఉండలేదు. నీవు చూచేదంతా జన్మరహితమగు బ్రహ్మమేసుమా! సంపూర్ణ జ్ఞానం కలిగిన తరువాత ఇక రాగద్వేషాలు, అహంకార మమకారాలు ఉంటాయా? ఉండవు.
శ్రీరాముడు : మరయితే స్వామి! ఆ లీలావతి జ్యేష్ఠశర్మను ఎందుకు ప్రేమగా స్పృశించింది? శ్రీ వసిష్ఠమహర్షి : అదా? అది అతనికి తత్త్వజ్ఞానము కలుగటం కొఱకే. ఆ స్పర్శ అతనికి ప్రాప్తించటం పూర్వజన్మల ప్రయత్నముల ప్రయోజనమే అయివున్నది. అంతేగాని లీలకు "ఇతడు నా పుత్రుడు. నాకు చెందినవాడే. ఇతనిని నేను కలిగియుండెదను గాక" అనునట్టి బుద్ధి లేదు. అందుచేతనే ఆమె అతనికి ఇతఃపూర్వపు మాతృరూపంలో దర్శనం ఇవ్వలేదు.
ఓ రాఘవా! 'బోధ' అను జ్ఞానానుభవం నీయందు ఉదయించిందా .... ఇక ఆపై నీకు సర్వేసర్వత్రా ఆకాశముకంటే కూడా అత్యంత సూక్ష్మమగు విశుద్ధ బ్రహ్మ పదార్థమే గోచరిస్తుంది. నాయనా! ఈ జాగ్రత్ పదార్థములు, స్వప్నమునందు చూడబడుచున్న పదార్థములు, సంకల్పపురమున అనుభవించబడేవి ... ఇవన్నీకూడా బ్రహ్మమే కాని, ఇంకేమీ కావు.
ఇక మనం మరల లీలాదేవియొక్క మరొక జన్మకు సంబంధించిన విశేషములకు వద్దామా?
17. జన్మ - - జన్మాంతరదృష్టి
అప్పుడు లీలా-సరస్వతులు ఆ గిరి గ్రామములోని బ్రాహ్మణ గృహములో ఉంటూనే అదృశ్యరూపులయ్యారు. ఆ గృహములోని జనులు “ఆహా! వనదేవతలు మన మీద అనుగ్రహంతో దర్శనమిచ్చి మాయమయ్యారు కదా!” అని అనుకొన్నారు. ఆ సంఘటనను తమతమ అనుభవరీతుల ననుసరించి మరలమరల చెప్పుకొన్నారు. దుఃఖములను త్యజించివేశారు. తమతమ పనులయందు ఇతఃపూర్వమువలె నిమగ్నులయ్యారు.
లీల-సరస్వతులిద్దరూ ఆ గృహమండపాకాశంలోనే లీనమై సూక్ష్మరూపమున ఉండి ఉన్నారు కదా! లీలాదేవి .... తాను గిరి గ్రామంలో ఆ ఇంటి ఇల్లాలుగా అనేక సంవత్సరములు ఉండివుండటం, తన మరణం ఎనిమిది రోజుల క్రితమే జరిగి ఉండటం, మొదలైనవిషయాలన్నీ చూచి చాలా ఆశ్చర్యపడింది. కొంచెము విచలితభావంతో ఉన్న లీలను చూచి సరస్వతీదేవి చిరునవ్వు చిలికించింది.
శ్రీరాముడు మహర్షీ! వారిద్దరు అశరీరులు కదా! ఎట్లా సంభాషించుకొంటున్నారు? ఎక్కడ సంభాషించుకొంటున్నారు?
మహర్షి : స్వప్నంలోను, సంకల్పమునందు జరిగే సంఘటనలు ఎట్లా జరుగుచున్నాయి? ఎక్కడ జరుగుచున్నాయి? అందు శరీరములు ప్రవర్తించటం లేదుకదా! అట్లే సూక్ష్మ శరీరమాత్రులగు
Page:282
వారిరువురి సంభాషణలు కూడా కార్యరూపము పొందుచున్నది. భౌతిక శరీరము, నాడీ ప్రాణములు లేకున్నప్పటికీ స్వప్న-సంకల్పాలలోలాగానే వారిద్దరి మధ్య సంభాషణా రూపమగు జ్ఞానము ఉండియే ఉన్నది.
❖
శ్రీ సరస్వతీదేవి : ఓ లీలా! మనం ఇక్కడికి వచ్చినందుకు ఏది తెలుసుకోవాలో, అదంతా తెలుసుకున్నావు. నేను నీ జన్మాంతరవిషయమై చెప్పిన దానికి నిరూపణను గ్రహించావు కదా!
‘బ్రహ్మసత్త' స్వరూపమే ఇదంతా! అజ్ఞానం ఉన్నంతకాలం జగద్భమ కలుగుతూనే ఉంటుంది. జ్ఞానోదయమైన మరుక్షణం జగత్తు ఉండదు. దృశ్యము ఉండదు. అప్పుడు “స్వసత్తసామాన్యము” (All pervading Absolute self) అను స్థితియే శేషించుచున్నది. ఈ జీవులందరు స్వతఃగా మోక్ష స్వరూపులే అయినప్పటికీ, నిష్కారణంగా స్వకల్పితమోహంచేత భ్రమాత్మకమైన జగత్తును అనుభవించుచున్నారు. మరల ఒకానొకప్పుడు జ్ఞానోదయమగుటచే నిదురలేచి, ఇదంతా క్షణంలో కాకతాళీయంగా త్యజించివేస్తున్నారు. ఏది తమ వాస్తవస్వరూపమైయున్నదో అట్టిదానియందు సుస్థిరులై, ‘జగద్వినాశనము’ను అనుభవించుచున్నారు. ఇంతకుమించి ఇందు ఏమి విశేషం లేదు. ఇప్పుడు చెప్పు. ఈ విషయంలో ఇంకా నీకేమైనా సందేహాలు ఉన్నాయా?
లీలాదేవి : హే లోకపావనీ! నేను ఇతఃపూర్వం నాభర్త పద్ముని యొక్క తదనంతరం జీవుడు (విదూరథుడు) రాజ్యమేలుచున్న చిదాకాశ నగరానికి వెళ్ళి ఉన్నాను కదా! అక్కడివారు నన్ను చూడలేకపోయారేమిటి? కాని ఇక్కడ “నేను వీరికి కనబడెదనుగాక” అని సంకల్పించగానే జ్యేష్ఠశర్మ, తదితర బంధువులు నన్ను చూడగలిగారు. అప్పుడుకూడా "వీరు నన్ను చూడటం జరిగితే వీరితో నేను సంభాషించెదను” అను రూపముగల ఇచ్ఛ ఉండేది సుమా!
శ్రీ సరస్వతీదేవి : ఓహో! అదా! అప్పటికి నీకింకా అభ్యాసం దృఢం కాలేదు. “నేను రాజపత్నియగు లీలాదేవిని” అనే ద్వైతభావము నీయందు గాఢంగా మిగిలియే ఉన్నది. ద్వైతము ఉన్నంతవరకు అద్వైతకర్మ యొక్క ప్రయోజనం లభించదు. ఎండలో నిలబడి “నాకు చల్లగా లేదేమిటి? అక్కడ చల్లగా ఉన్నది కదా” అంటే ఎట్లా? అభ్యాసం లేనంతకాలం “నేను లీల” అని పిలవబడుచున్న శరీరమాత్రమును" అను దృఢభావం తొలగదు. అందుచేతనే నీకు అప్పుడు సత్యసంకల్పము ఉదయించలేదు. నీవు కోరుకున్నప్పటికీ అప్పటి సభలో సమావేశమైయున్న నీ పతి, తదితర సభికులు నిన్ను చూడనేలేకపోయారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే, “నేను 'శరీరము' అనబడు నిర్వచనముచే బంధింపబడజాలని నిష్కళంకచైతన్య తత్త్వమును, ఆత్మైక్యస్వరూపమును” అనునట్టి దృఢానుభవం మరికొంతగా బలపడియున్నది. అందుచేత, సత్యసంకల్పురాలవయ్యావు. అనగా, నీవు దేనిని ఎట్లు భావన చేస్తావో, అది ఆ రీతిగానే అనుభవమౌతోంది. “ఇతఃపూర్వపు జన్మయందలి ఈ నా పుత్రుడు నన్ను గాంచుగాక” అనునట్టి నీ అభిలాష ఇక్కడ నెరవేరింది. ఇప్పుడు నీవు నీభర్త వద్దకు వెళ్ళి ఇట్లే సంకల్పిస్తే నిన్ను అతడు తప్పక చూడగలడు.
Page:283
లీలాదేవి : ఆహా! ఈ బ్రహ్మాండముల కల్పనావ్యవహారమంతా ఎంత చిత్రంగా ఉన్నది! గిరి గ్రామంలోని ఈ మందిరాకాశం (Space pertaining to this house) లోనే ఈ బ్రాహ్మణుడు (వసిష్ఠుడు) నా భర్త అయ్యాడు. మరల ఇక్కడే అతడు తన వసిష్ఠదేహమును త్యజించి, “పద్ముడు” అను రాజై విస్తారమైన రాజ్యమును పాలిస్తూ నన్ను అలరించాడు. మేమిద్దరం డెబ్బది ఏండ్లు దాంపత్యం చేశాము. ఈ అంతఃపురంలోనే అతడు మృతి చెందాడు. మరల ఈ అంతఃపురంలోనే వేరైన జనపదంలో విస్తారమైన సామ్రాజ్యానికి చక్రవర్తి అయి విదూరథనామ ధేయంతో రాజ్య మేలుచున్నాడు. ఒక చిన్నకాయలో అనేక వేరువేరు ఆవగింజలు ఉన్నట్లు, ఈ గృహాకాశంలో వేరువేరైన బ్రహ్మాండాలు అనేకం వర్తిస్తున్నాయన్నమాట. అమ్మా! ఏమి ఈ సృష్టి చమత్కారం!
ఇదంతా గమనిస్తుంటే, “ఇప్పుడు మనం నా భర్త ఉండి ఉన్న చిదాకాశ జగత్తుకు సంబంధించిన అంతఃపురానికి అత్యంత సమీపంలోనే ఉండి ఉంటాము కదా!” అని అనిపిస్తోంది. హే జగజ్జననీ! నేను నా భర్తయొక్క వ్యవహారసత్తనంతా ఇక్కడ ఉండే చూడగలిగేటట్లు అనుగ్రహించు. నా భర్తను విడచి నేను ఉండగలనా చెప్పు?
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! భూతల అరుంధతీ! నీకు అనేకమంది భర్తలు ఉండి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యవహారం దృష్ట్యా కూడా ముగ్గురు ఉన్నారు. వారిలో మొదటివాడు 'వసిష్ఠుడు' అను బ్రాహ్మణుడు. అతడు భస్మమై 'పద్ముడు' అనుపేరుగల రాజయ్యాడు. అతని శవమే నీ అంతః పురంలో పుష్పగుచ్ఛములతో కప్పబడియున్నది కదా! అతడే ఈ సంసారమున ‘విదూరథుడు’ అను పేరుతో గొప్పరాజ్యం ఏలుచున్నట్లు చిదాకాశరూపిణివై నీవు వీక్షించావు. ఇప్పుడు విధూరథుడు ‘సంసారము’ అనబడే మహాసముద్రజలంలో పడి భ్రాంతుడై కొట్టుకుంటున్నాడు. భోగసమూహలలో పడి వికలుడై ఉన్నాడు. 'మహాతమస్సు’లో మునిగిపోయి ఏవేవో రాచకార్యములను అత్యంత విశ్వాసముతో నిర్వర్తిస్తూ భ్రమనుండి మేల్కొనటం లేదు.
ఓ వనితా! ఇప్పుడు చెప్పు. సుగంధ కణములు గాలిచే ఒకచోటి నుండి, ఇంకొక చోటికి తీసుకొని పోబడినట్లు, నీవు ఇప్పటికి అనేక దేహములలో ప్రవేశించియున్నావు. మరల వాటిని త్యజించావు. ఆయా జన్మలలో అనేక మంది బంధువులు ఉండి ఉన్నారు. “నాభర్త, నేను చూడాలి-నేను దూరమై ఉండలేను" అను ఆవేదన వెలిబుచ్చుచున్నావు కదా? అనేక జన్మలు చవిచూచినట్టి నీవు “నా భర్త” అని చెప్పుచున్నది ఎవరి గురించి? ఇప్పుడు నిన్ను నేను ఎక్కడికి తీసుకుపోవాలి?
ఈ ‘సంసారము’ అనునది ఒక తీరుగా ఉంటోంది. మరల బ్రహ్మాండముల విషయానికి వస్తే, అవన్నీ మరొక తీరుగా ఉంటున్నాయి. ఈ వ్యవహార పరంపరలన్నీ చైతన్యము యొక్క స్వయం కల్పితములే కదా! అందుచేత జ్ఞానదృష్టితో పరికించి చూచినప్పుడు ఈ సంసార మండపములన్నీ నీ ప్రక్కనే, ఎదురుగానే ఉన్నాయి. అట్లా కాకుండా, సంసార దృష్టితో చూస్తే ఒకదానికి మరొకటి కోటానుకోట్ల యోజనముల దూరంలో ఉన్నాయి. జ్ఞానదృష్టికి ఇవన్నీ ఆకాశస్వరూపములే కదా! నీ ఇతఃపూర్వపు అసంఖ్యాకమైన జన్మలన్నీ ఇట్టివే. సూర్యకిరణములందు అనేక త్రసరేణువులు
Page:284
(కాంతి రేణువులు) ఉదయిస్తున్నట్లు (కిటికీగుండా ఇంట్లో ప్రవేశించే సూర్యకిరణములలో అట్టి త్రసరేణువులను మనం గమనించవచ్చు) కనబడటం లేదా? ఆ మహాచైతన్యము నందు గల ప్రతి పరమాణువునందు అనేక సృష్టిసమూహములు వికసించుచున్నాయి. ఈ బ్రహ్మాండ సమూహముల సృష్టి అంతా మహాకష్టతరంగా, గొప్ప ఘనీభూత స్వభావంతో ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తున్నప్పటికీ... పరమార్థ దృష్టితో చూస్తే ఇవన్నీ కలిపి 'మఱిగింజ' అంతకూడా ఉండవు. రకరకాలైన రత్నములను ఒకచోట ఉంచామనుకో ... అప్పుడు ఆ గుట్ట నుండి బయల్వెడలే రంగురంగుల కిరణముల సమన్వయం ఒక అరణ్యమువలె గోచరిస్తుంది. అట్లాగే ఈ జగత్తులు కూడా మాయవల్లనే ఇట్లు కనిపిస్తున్నాయి. జ్ఞాన చింతనతో చూచినప్పుడు ఈ 'పృథివి' మొదలైనవన్నీ శూన్యరూపములుగానే కనిపిస్తాయి.
“భ్రాంతి” వలన మాత్రమే ఆత్మయందు జగద్వ్యవహారమంతా స్ఫురిస్తోంది. వాస్తవానికి పృథివి మొదలైన పంచభూతజాలమంతా 'సృష్ట్యాది' యందే లేవు. ఆహాఁ! సరోవరంలో తరంగాలు మాటిమాటికీ లేచి లీనమౌతాయి చూచావా? అట్లే “జ్ఞానచైతన్యము” అనే తటాకంలో దేశ కాలముల పట్ల ఏర్పడుచున్న “అనుభవములు” అనునవి అనేక విభాగముల రూపంలో సంసారతరంగాలుగా లేస్తున్నాయి. మరల లీనమైపోతున్నాయి.
లీలాదేవి : హే వాణీ! హే సర్వార్ధశోభితా! నీ కరుణాప్రభావంచేత నా ఇతఃపూర్వపు అనేక జన్మలను ఇప్పుడే - ఇక్కడి నుండే చూడగలుగుచున్నాను. నీవు చెప్పుచున్నదంతా వాస్తవమేనని నాకు తెలియవస్తోంది. ఈ నా వర్తమాన జన్మ సాత్వికము కాదు. తామసికము కూడా కాదు. ఇది రాజసమైనదానివలె నాకు గుర్తుకు వస్తోంది*.
బ్రహ్మమే స్వరూపముగా కలిగి, బ్రహ్మమునుండి వెలువడినట్టి నేను నానా విధములైన యోనులలో జన్మించాను. ఇతఃపూర్వము ఎనిమిది వందల జన్మలు ఎత్తినట్లు ఇప్పుడు స్పష్టంగా గాంచుచున్నాను. ఒకప్పుడు ఒక విద్యాధరిని అయ్యాను. చెడ్డకోరికలచే కలుషిత మనస్కురాలనై మనుష్య జన్మనెత్తాను. మరల ఇంకొక సంసార మండపంలో 'నాగరాజపత్ని (సర్పరాజభార్యను)' అయ్యాను. ఆ తరువాత ఒక ఆటవిక స్త్రీనై ఆకులు ధరించి అడవులలో సంచరించాను. ఆ జన్మలో మానవునకు ఉండవలసిన దయ - - దాక్షిణ్యములను వదలటంచే ఒక వనంలో పూలతీగనై జన్మించాను. అయితే, పుణ్య ప్రదమైన మునుల ఆశ్రమములో ఉండుటచేత, అగ్నిచే దహింపబడిన నేను ఆ మునికి కూతురునై పుట్టాను. అప్పటి పుణ్యకర్మల ప్రభావంచేత ఒక రాజునై నూరేళ్ళు ఉన్నాను. కాని రాజుగా నేను నిర్వర్తించిన పాపముల ప్రభావం చేత 'ముంగిస’నై పుట్టాను. ఆ తరువాత ఒక ఆవునై ఎనిమిదేళ్ళు గడిపాను. ఒక పక్షినై బోయవానికి చిక్కి, అతని వలలోంచి ఎట్లాగో తప్పించు కొన్నాను. తుమ్మెదనయ్యాను. ఒక లేడినై ఒకానొక బోయవాని చేతిలో మరణించాను. ఆ తరువాత
లీలాదేవి ఇక్కడ తాను ఎట్టి మానసిక ప్రవృత్తిచే వర్తమాన జన్మపొందటం జరిగినదో గాంచగలుగుచున్నది; లేక గుర్తు చేసుకోగలుగుచున్నది.
Page:285
‘చేప’నై నీటిలో తేలియాడుచు, ఒక తాబేలు వీపుపై షికార్లు కొట్టాను. ఆ సమయంలో ఒకసారి ఒక జాలరి దెబ్బ తప్పించుకొని నీటిలోకి ఉరికాను కూడా!
అటు తరువాత కిరాత స్త్రీనై జన్మించి కొబ్బరికల్లు త్రాగుచూ ఉండేదానను. మరుజన్మలో ఒక సారసపక్షిగా జన్మించాను. ఆపై స్వర్గలోకంలో 'అప్సరస'గా జన్మించి యువకులతో రతిక్రీడలందు నిమగ్నమైనాను. ఆ తరువాత ఒక తాబేలునై పుట్టి చాలా రోజులు జీవించాను. చెట్టుపై రాజహంసనై కొన్నాళ్ళు ఊయలలూగాను. అప్పుడు ఒక బూరుగు చెట్టుపై అటు-ఇటూ ఊగుచూ దోమలను చూచి, ఆ దోమల పట్ల గల బుద్ధి కారణంగా దోమనై పుట్టాను. అటుపై ఒక లతనై జన్మించి కొండ వాగు యొక్క జలప్రవాహంచేత క్రిందకు పైకి ఊగుతూ ఉండేదానిని. ఆ తదుపరి విద్యాధర పురంలో పుట్టాను. ఆహాఁ! హే జగన్మాతా! వింటున్నావా? ఎండమావులలో నీరు ఉన్నదని భ్రమించి ఒక లేడి పరుగులు తీస్తుంది చూచావా? నేను కూడా అనేక దుఃఖ భరితములైన జన్మలు ఎత్తాను. ఎంతటి భ్రమ, ఎంతగా అనుభవించానో చెప్పలేను! ఆ వేదన, పరితాపం వర్ణనాతీతమనే చెప్పాలి.
18. బ్రహ్మాండ భ్రాంతి
శ్రీరాముడు : ఆ లీలయొక్క జన్మలు బహుచమత్కారంగా ఉన్నాయి. అనేకమంది జీవుల పరంపరలు ఇట్టివేనని నాకు అర్థం అవుతోంది. అయితే మహాత్మా! ఆ బ్రహ్మాండము కోటి యోజనముల విస్తీర్ణం వ్యాపించి వజ్రమువలె కఠినమై ఉన్నదని అనుకొన్నాంకదా! ఆ స్త్రీలిద్దరూ బ్రహ్మాండములను ఛేదించి ఎట్లా బయల్వెడలారు?
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! నీ ప్రశ్న బాగానే ఉన్నదయ్యా! కాని, బ్రహ్మాండము లెచట? వజ్రత్వమెక్కడ? వారిద్దరు ఆ అంతఃపురాకాశంలోనే ఉన్నారు సుమా! ఆ గిరి గ్రామంలోని గృహాకాశంలోనే ‘వసిష్ఠుడు' అను పేరుగల బ్రాహ్మణుడు ఉండి ఉన్నాడు కదా! అదే శూన్యాకాశంలో పద్ముడై గొప్ప రాజ్యమును కూడా ఏలాడు. ఆ అరుంధతి రాణి అయి రాజ్యమును అనుభవించింది. ఆ లీల అనబడే రాణి సరస్వతీదేవిని ఆరాధించి, ఆమె కరుణచే, ఆ గృహాకాశంలోనే ఆమెతో కూడి మనోహరమైన ఆకాశ మండలమును దాటింది. వారిద్దరూ ఆ పరిమిత గృహాకాశంలోనే ఇంకొక బ్రహ్మాండమునకు పయనించటం చేస్తున్నారు. ఇదంతా కూడా .... ఒక నిద్రలోని స్వప్నము నుండి మరొక నిద్రలోని స్వప్నమున ప్రవేశించటం వంటిదే!
అందుచేత, ఇదంతా భ్రాంతిమాత్రమేనని గ్రహించు. వాస్తవానికి 'ఆకాశము' తప్పితే వేరొక వస్తువేలేదు. “బ్రహ్మాండము - సంసారము - దూరము" అను పదజాలమంతా మిథ్యయే. వాసనా ప్రభావం చేతనే వారిద్దరి చిత్తమునందు ఆయా మనోహర దృశ్యములన్నీ ప్రతిఫలిస్తున్నాయి. వాసనలే లేకుంటే, బ్రహ్మాండములెక్కడ? సంసారమెచ్చట? వారి చిత్తము యొక్క చమత్కృతి చేత చిదాకాశము ఆవరణసహితమైన బ్రహ్మాండమువలె కల్పించబడినది. చిదాకాశము సర్వత్రా, సర్వదా
Page:286
జన్మరహితముగా శాంతముగా వెలయుచున్నదని గ్రహించు. చిదాకాశము తనయందు తానే ‘జగత్తు’ రూపమున ప్రకాశిస్తోంది. ఈ తత్త్వము గ్రహించినవారికి ఈ కనబడే జగత్తంతా ఆకాశము కంటే కూడా అత్యంత శూన్యముగా కన్పట్టుచున్నది. అట్లు కొందరు గ్రహించ గలుగుచున్నారు. ఇక మరికొందరో,..... గ్రహించలేకపోవుచున్నారు. ఎందుచేత? అజ్ఞానమే అందుకు కారణం. అట్టి అజ్ఞానానికి ఇదంతా వజ్రమువలె దృఢంగా కన్పట్టుచున్నది.
స్వప్నంలో నగరములు, బంధుజనులు ఆ స్వప్నసమయంలో వాస్తవమైన వాటివలెనే అనుభవ మౌతాయి కదా! కాని అవి సత్యమా? కాదు. అసత్తే అయివున్న ఈ సంసారము కూడా చిత్పదార్థము నందు సత్తువలె ప్రతిభాసిస్తోంది. విశాలమైన ఎడారిలో కనబడే ఎండమావులలోని జలజ్ఞానం వాస్తవం కాదుకదా! బంగారంలో ఆభరణత్వమున్నదా? ఆత్మయందు ఈ దృశ్య సమూహములు అసత్తు అయివుండి కూడా సత్తువలె అగుపిస్తున్నాయి.
19. పూర్వస్మృతులు
ఆ విధంగా లీలాదేవి పూర్వజన్మలను, అందలి కొన్ని సంఘటనలను జ్ఞానదృష్టిచే దర్శిస్తూ నెమరువేస్తోంది. వారట్లు సంభాషించుకొంటూ గిరి గ్రామంలోని బ్రాహ్మణ గృహంలోంచి బయటకు వచ్చారు. వారికి ఎదురుగా ఆ గ్రామంలో విశేషాలన్నీ కనబడుచున్నప్పటికీ, వారు మాత్రం ఎవరికీ కనబడటం లేదు. అప్పుడు ఎదురుగా వారికి ఒక పెద్దకొండ కనిపించింది. ఆ కొండల పైగల అడవిలో విచిత్ర వృక్షాలు, పక్షులు, సెలయేళ్ళు చిత్రమైన ధ్వనులను వినిపిస్తున్నాయి. లీలాదేవిలో తన పూర్వజన్మ జ్ఞాపకాలు పెల్లుబకసాగాయి. సరస్వతీదేవి అది చిరునవ్వుతో గమనిస్తూ లీలను తీసుకొని గ్రామమంతా సంచరించ సాగింది.
ఊరికి చివరిగా ఉన్న దట్టమైన వృక్షసమూహము నుండి పక్షుల కిలకిలారవాలు వినిపిస్తున్నాయి. పొలములన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. మేకలను, పశువులను ఊరిచివర మేపుతున్న బాలురు కొందరు ఒక తాడిచెట్టు క్రిందకు చేరి చద్ది మూటలను విప్పుతూ, పైన కావుకావు మంటున్న కాకులకు భయపడి కాబోలు, జున్ను ముక్కలను ఒడిలో దాచుకొంటున్నారు. ఆ చుట్టుప్రక్కల గల అడవిబాట లలో నిస్సహాయులగు కొందరు బిచ్చగాళ్ళు తమ జీర్ణవస్త్రములతో వచ్చే-పోయే బాటసారులను యాచిస్తూ సంచరిస్తున్నారు. సోమరులు కొందరు వీథులలోని అరుగులపై కూర్చుని త్రోవలో వచ్చే పోయే వారితో సరసవిరసాలు చేస్తున్నారు. పాలు పెరుగు వాసనలకు కాబోలు, కొన్ని ఇళ్ళలో ఈగలు వెట్టిగా ముసురుతున్నాయి. గుడిసెల ముందు పిల్లలు ఒంటికి మట్టిని పూసుకొని ఆడుకొంటున్నారు. ఒక ఇంటి ముందు ఒక వనిత కళాపి చల్లి ముగ్గులు వేస్తూ సహచరులతో పరిహాసాలాడుతోంది. ఆవులు ‘అంబా’ అని అరుస్తున్నాయి. అనేక విచిత్రమైన అలంకరణలతో కొన్ని గృహాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.
Page:287
'శాంతి' మొదలైన సాధన సంపత్తిగల ఆత్మజ్ఞానిని భోగమోక్షాలు సమీపించి పావనం చేసినట్లు, ఆ ఇద్దరు వనితలు గ్రామంలో సంచరిస్తూ ఆ చోటులను పావనం చేస్తున్నారు. అభ్యాస వశంచేత జ్ఞానమయదేహం ధరించిన లీలాదేవి అక్కడ సంచరిస్తూ కూడా పూర్వజన్మల జనన మరణములను, భూత భవిష్యత్ వర్తమాన కాలముల స్థితి గతులను, ఈ సంసారము యొక్క రచనా చమత్కృతుల గురించి యోచిస్తూ ఆశ్చర్యచకితు రాలగుచున్నది.
లీలాదేవి : హే వాగ్వాణీ! విశ్వేశ్వరీ! నీ అనుగ్రహంచేత ఈ దేశమును చూస్తున్న నేను ఈ క్షణంలో ఒకప్పడు ఇక్కడి నా జన్మలోని విశేషాలన్నీ స్మరించగలుగుచున్నాను.
ఇక్కడ నేను 'అరుంధతి' అను పేరుగల బ్రాహ్మణినై జన్మించిన విషయమంతా ఇప్పుడు నాకు గోచరమవుతోంది. నా శరీరము అప్పుడు జీర్ణమై, శుష్కమై, మలినమై ఉండేది. ఎండు దర్భలను చీల్చే అభ్యాసంచేత నా అఱచేయి మోటుబారి ఉండేది. ప్రతిరోజు కవ్వముతో మజ్జిగ చిలుకుతూ ఉండేదానను. నాకు అనేకమంది సంతానం ఉండేవారు. మేము అతిథులను, దేవతలను, ద్విజులను, సాధువులను భక్తితో సేవిస్తూ ఉండేవారము. ఆ విధంగా దేహమున్నంత వరకు పనిపాటలతో గడిపాను. ఎప్పటికప్పుడు ఏదో పనితొందరే. అందుచేత “త్వరగా .... త్వరగా ....” అంటూ పని వాళ్ళను అదలిస్తూ ఉండేదానను. నా భర్త కూడా ఛాందసుడై ఎప్పుడూ ఏవేవో పనులలో మునిగి
- - తేలుతూ ఉండేవాడు. చిత్రం చూచావా? అప్పుడు, "మేమెవరము? ఈ సంసారము ఎట్టిది?” అనునట్టి ప్రశ్నలు మాకు కలలో కూడా తట్టలేదు. క్రమంగా నా శరీరం శుష్కించింది. బొమికలు బైటపడ్డాయి. అయినా సరే, అట్లాగే దుప్పటి కప్పుకొని కూరలు, కట్టెపుల్లలు, పేడ ప్రోగుచేస్తూ ఉండేదానను. ఆ పనిలో ఎంత శ్రద్ధ, ఆసక్తి, ఆవేశం చూపేదాననో మాటలలో వర్ణించలేను.
ఎప్పుడైనా కొంచెం పనిలేకపోతే ఆవు-దూడల చెవులలో పురుగులు తొలగించేదాన్ని. అప్పుడప్పుడు ఆకు-కూరమళ్ళకు నీరు కట్టడానికి పాలేర్లను పురమాయించేదాన్ని. అదిగో, ఆ ఇల్లు చూచావా? ఆ ఇంటి గడపలకు ఎన్నిసార్లు రంగులు దిద్దానో! నా మర్యాద అతిక్రమించకుండానే అక్కడ ఇప్పుడు పనిచేస్తున్న ఆ సేవకులను అదమాయించేదాన్ని. ఈ విధంగా చాలాకాలం గడిచింది. ఇంతలో ఎక్కడి నుండో వృద్ధాప్యం వచ్చిపడింది. నా చెవులు, తల ఉయ్యాలలాగా ఊగుతూ ఉండేవి. అబ్బా! వార్ధక్యం ఎంతటి దుర్భరమైనది! ఒక్క జ్ఞానులను మాత్రమే ముసలితనం బాధించదేమో!
అమ్మా! వాఙ్మయీ! అదుగో. ఆ పుష్పవనం చూచావా? ఆ అశోకవృక్షాల మధ్య ఉద్యాన మండపం ఉన్నది కదా! ఆ ప్రక్కనే చెఱువుగట్టుపై కట్టబడియున్న దూడ నా కళ్ళ ముందే కొద్దిరోజుల క్రితం పుట్టింది. దానికి 'కర్ణిక' అని పేరుపెట్టి ముద్దుగా పిలుస్తూ ఉండేదానను. అది నా వియోగదుః ఖం భరించలేక కాబోలు 'అంబా' అని ఇంకా అరుస్తూనే ఉన్నది. ఈ పరిచారికలకు చెప్పిచెప్పి అలసిపోవలసిందే. వీళ్ళు ఈ దూడ గురించి పట్టించుకోరేం? పాపం వాళ్ళు మాత్రం ఏమిచేస్తారు? నా వియోగం చేత ఇంకా దుఃఖిస్తూనే ఉన్నారు కాబోలు. వాళ్ళ కళ్ళు వాచి ఉన్నాయి చూచావా?
Page:288
నేను ఎటైనా వెళ్ళితే ఒక్కపని సరిగా జరుగదు కదా! ఇక్కడే రోజూ వచ్చి కూర్చుండేదానను. ఎండవేళ ఇక్కడ నీడలో కాస్త నడుంవాల్చేదాన్ని. చక్కటిగాలి వీస్తుంటే క్షణంలో కునుకు పట్టేది. ఇక్కడే నీళ్ళు తాగేదాన్ని. ఆ చెక్క వస్తువుల అమరిక చూచావా? అదంతా తీర్చిదిద్దేది నేనే! అటు చూడు. వాడు మా పెద్దపిల్లవాడు జ్యేష్ఠశర్మ. వాడు పాపం అలసి అలసి ఉన్నాడు. నేను లేకపోతే నా పిల్లలు ఎన్ని పాట్లు పడుచున్నారో కదా! ఈ వనంలో మా పాడి ఆవులు ఇంకా తిరుగుచూనే ఉన్నాయి.
ఈ మా ఇల్లు చూచావా! శరీరానికి ఐదు ఇంద్రియాలు ఉన్నట్లు, మా ఇంటికి ఐదు ద్వారాలు ఉన్నాయి.
సరస్వతీ దేవి, లీల చెప్పేదంతా మౌనంగా, చిరునవ్వుతో “ఊఁ" కొడుతూ వింటోంది.
ఈ మా ఇల్లు అంటే ఎంత ఇష్టమో! అయినా ఏం లాభం? ఇప్పుడు ఎండవేడిమికి చౌడుబారి ఉన్నది. దొడ్లో అంత పేడ దొరుకుచుండగా, చక్కగా అలకవచ్చునుకదా! ఈ పనివాళ్ళు దగ్గరుంటే గాని మాట వినరు. ఈ ఇల్లు నా రెండవ శరీరమువంటిది సుమా! దీనిపై నేను పెంచిన ఆనపపాదును చూచావా? దీని విత్తనాలు మా బంధువుల ఇంటి నుంచి చెప్పించాను. తయారైన ఆనప (సొర) కాయలను వీళ్ళు సరిగ్గా కోస్తున్నారో? లేదో? లేకపోతే, పాడైపోతాయి కదా! పాదుకు నీళ్ళు పోయమని కూడా నేను చెప్పాలి.
అక్కడ తిరుగుచున్న వాళ్ళందరు ఎవరో తెలుసా? వాళ్ళందరు ఆయా ఊళ్ళ నుంచి వచ్చిన మా బంధువులే. అదేమిటి? వీళ్ళ ఆభరణములన్నీ ఏమైనాయి? ఓహో! నేను మరణించాననే దుః ఖంతో వీళ్ళు తమ ఆభరణములన్నీ త్యజించి రుద్రాక్షమాలలు ధరించారా? నా వలన ఎన్ని కష్టాలు ఈ ఇంటికి వచ్చాయి? నా ఈ ప్రియమైన బంధువుల కళ్ళు నిరంతర రోదనంచేత ఎఱ్ఱబడ్డాయి. వీరికి సదుపాయాలన్నీ సక్రమంగా జరుగుచున్నాయో? లేదో? ఈ మా గృహమండపం ఆవలవున్న నదిని చూడు. ఈ నది ఒడ్డున చెట్లు నేలకు వంగి ఉన్నాయి. వాటి కొమ్మలు నేలకు వ్రాలి చివరలు నదీజలమును తాకుతున్నాయి. చూచావా? ఆ తాటిచెట్లకు తాటిపండ్లు సమయానికి కోసుకోకపోతే ఎండిపోతాయి. ఈ పనివాళ్ళు ఏమిచేస్తున్నారో? వీళ్ళకి తిండి ఘనంగా కావాలి. పని విషయాలు పట్టించుకోరు!
88
సరస్వతీదేవి ఆ మాటలన్నీ వింటూ పకాపకా నవ్వింది. మరుక్షణం లీలాదేవి తన వాగ్ధారణి పూర్వసంస్కారములను ఆశ్రయించటం గుర్తించి తానుకూడా కొద్దిసేపు నవ్వుకొని, మరల చెప్పసాగింది.
నా భర్త వసిష్ఠుని జీవాత్మ ఈ గృహాకాశంలోనే వెలసియున్నది. అతడు స్వతఃగా ఆత్మ స్వరూపుడే కదా! అనగా నిష్క్రియుడే కదా! అయితే ఏం? ఇప్పుడు విదూరథ మహారాజై, గొప్ప సామ్రాజ్యమునకు ఆధిపత్యం వహిస్తున్నాడు.
Page:289
ఔను! ఇప్పుడు నాకొక విషయం బాగా గుర్తుకు వస్తోంది. నా భర్త వసిష్ఠ బ్రాహ్మణుడు “నేను మహారాజును అయితే ఎంత బాగుంటుంది!" అని ఎప్పుడూ నాతో అంటూ ఉండేవాడు. “ఏమిటి నీ చాదస్తం! నీవేమిటి? రాజు కావడమేమిటి?” అంటూ నేను కొంచం హాస్యం పట్టించేదాన్ని. అతని వాంఛాబలం చేతనే కాబోలు, ఇప్పుడు ఎనిమిది రోజులలో మహాచక్రవర్తి అయ్యాడు. ఏమి ఆశ్చర్యం! ఆకాశంలో వాయువు - - ఆ వాయువులో సుగంధం ఈ మూడు ఒకదానిని మరొకటి తాకవు. కాని, ఒకదానిలో మరొకటి అదృశ్యస్థితిలో ఉండి ఉంటాయి కదా! నా భర్తకూడా ఈ గృహాకాశంలో అదేవిధంగా రాజ్యపాలనలో తలమునకలై ఉన్నాడు. మాయ ఎంతటి చమత్కార పూరితమైనది! వ్రేలెడెంత ఉండే ఈ గృహాకాశంలో కోటానుకోట్ల యోజనముల విస్తీర్ణము గల మహా సామ్రాజ్యమును చూచుచున్నాడు. మేమిద్దరం ఆకాశస్వరూపులమే కదా! నా భర్త పాలించే రాజ్యం కూడా ఈ గృహమండపా ఆకాశమునందే ఉన్నది. కాని స్వకీయమైన కల్పనా మహిమవలన వేలకొలది పర్వతములతో నిండి ఉన్నట్లు అగుపిస్తోంది. హే లోకమాతా! ఇప్పుడు నా భర్త యొక్క స్థితిని, రాజ్యపాలనను తిలకించాలని కోర్కె కలుగుతోంది. కాబట్టి మనిద్దరం ఆ రాజ్యమునకు వెళ్ళుదామా! ప్రయత్నవంతులకు కష్టమైన కార్యమేముంటుంది?
20. అన్య జగత్ పునః ప్రవేశం
విషఘ్నియగు సరస్వతీదేవి అందుకు చిరునవ్వుతో అంగీకరించింది. వారిద్దరు ఆ గృహంలోని ఆకాశమండలమున ప్రవేశించారు. మేఘమార్గమును, వాయుపథమును, సూర్యచంద్రమార్గములను, ధ్రువలోకమును, సిద్ధ-సాధ్య-భూ-స్వర్గ-బ్రహ్మలోకములను అధిగమించారు. శివలోకం, విష్ణులోకం, విదేహులు-సదేహులు ఉండే లోకములను దూరప్రదేశములను దాటివేస్తూ ఉండగా, ఇంతలో ఒకానొక క్షణంలో లీలాదేవి తన అపరిచ్ఛిన్న స్వరూపమును విస్మరించింది.
ఒక్కసారి వెనుకకు చూచింది. వెనుకగా ఎక్కడాకూడా సూర్య-చంద్ర-నక్షత్ర-గ్రహాదులు కనబడనేలేదు. అభేద్యమైన చీకటి మాత్రమే కనబడుతోంది. ఆ చీకటి నలుదిక్కులా వ్యాపించియున్నది. లీల : మాతా! ఇదేమిటి? సూర్యచంద్రాదుల తేజము ఏమాత్రం కనబడటం లేదేం? ఈ కొండవలె ఘనీభూతమైన చీకటి ఎక్కడి నుండి వచ్చింది?
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! మనం సూర్యచంద్రాదుల తేజము చొరలేనంతదూరం వచ్చేశాం. అందుకే అవి మనకు కనిపించటం లేదు. లోతైన నూతిలో అట్టడుగులో ఉండి చూస్తే భూమిపై ఉన్న మిణుగురుపురుగు - మెఱుపులు కనిపిస్తాయా?
లీల : ఓహో! సూర్యుడు ఒక అణువులాగా కూడా కనబడనంత దూరం వచ్చేశామా? ఎంత ఆశ్చర్యం? ఓ తేజోస్వరూపిణీ! ఇంకా మనం ఎంతదూరం పయనించాలి? ఎటు వెళ్ళుచున్నాం? ఎంత సేపు?
Page:290
శ్రీ సరస్వతీదేవి : ఇక మనకు “బ్రహ్మాండ కర్పరము” అగుపడబోతోంది. సూర్య చంద్ర నక్షత్రములు ఆ బ్రహ్మాండ కర్పరము నుండి లేచిన ధూళికణముల వంటివారే సుమా!
వారిద్దరు అట్లు సంభాషించుకొంటూ బ్రహ్మాండమండపం చేరారు. దానిని వారు ఒక శూన్య ప్రదేశం దాటినట్లు దాటివేశారు. దేనిపట్ల ఎవరికి సత్యత్వబుద్ధి ఉంటుందో అది మాత్రమే వారికి వజ్రంలాగా కఠినమై అగుపడుతోంది.
క్రమంగా శుద్ధ చిత్తులగు ఆ ఇద్దరు బ్రహ్మాండము వెలుపల గోడవలె ఆవరించియున్న జల ప్రదేశాన్ని దాటారు. దానికంటే పదిరెట్లు మంచుచే చర్మమువలె కప్పియున్న చోటును కూడా దాటారు. అటు తరువాత వారు అగ్ని-వాయువు-మేఘ ఆకాశములను చూచారు. ఇక ఆ ఆకాశము నందు “ఇది ఇక్కడ మొదలు. అది అక్కడ చివర" అనబడునదంతా 'గొడ్రాలి కుమారుడు' అను దృష్టాంతములాగా భ్రమమాత్రమే. అదంతా విశాలము, శాంతము, ఆదిమధ్యాంతరహితము అయినట్టి ఆత్మయందే దర్పణంలోని దృశ్యం వలె వెలయుచున్నదని గ్రహించు. వాస్తవానికి చిదాకాశం నందు ఎట్టి భ్రమలకు తావులేదు. ప్రళయ-వాయువులు కూడా చిదాకాశమును తాకలేవు.
ఆ విధంగా వారు ఆ బ్రహ్మాండ మండలములోని పంచభూత - ఆవరణలన్నీ దాటి వేశారు. పరమాకాశమును దర్శించారు. ఆ పరమాకాశంలో ఈ జగత్తువంటి అండ ప్రమాణంగల అనేక అసంఖ్యాక జగత్తులు ఉన్నాయి. సూర్యకిరణములలోని త్రసరేణువుల (Moles of dust in Sunbeams) వలె వారు అక్కడ అనేక ఆవరణలను కూడా చూచారు. ఇంకొక చిత్రం. ఆ ‘మహాకాశం’ అనే శూన్యంలోంచి కోట్లకొలది జగత్తులు లేస్తూనే ఉన్నాయి. మరికొన్ని లయించిపోతున్నాయి. కొన్ని నిశ్చలంగా ఉన్నాయి. కొన్నికొన్ని వంకరటింకరగా తిరుగుతున్నాయి. ఇదంతా ఆయా బ్రహ్మాండములందున్న జీవుల జ్ఞానమును అనుసరించే జరుగుచున్నది సుమా!
ఎవరికి ఎచ్చట ఎట్లు ప్రాక్తన (ఇతఃపూర్వపు) వాసనా జ్ఞానం స్ఫురించటం జరుగుతుందో వారికి ఆ తావులలో అట్టి రూపములే కనిపిస్తూ ఉంటాయి. అందుచేత తత్వజ్ఞుల దృష్టిలో ఈ ఊర్ధ్వ-అధో-మధ్య లోకముల కల్పనయే ఉండదు. వారు వాటిని అసద్వస్తువులుగా దర్శిస్తూ స్వసత్తాసహితులై ఉంటారు. స్వసత్తరూపమగు బ్రహ్మము కాక, ఇక మిగిలినదంతా కల్పనా చాతుర్యమునకు సంబంధించినదే కదా! వారు “వచ్చుట-పోవుట-ఉండుట” అను వ్యవహారమంతా అంతరంగమునందు ఏమాత్రం పొందకుండానే ఉంటున్నారు. సర్వత్రా, సర్వదా, స్వస్వరూపముతో బ్రహ్మానుభవమునందే ఉంటున్నారు.
శ్రీరాముడు : పరమాకాశము నిశ్చలము, అద్వితీయము" అని చెప్పియున్నారు కదా! అందులోంచి జగత్తులు పుట్టటమేమిటి? లయించటమేమిటి?
Page:291
21. బ్రహ్మాండముల చమత్కారం
శ్రీ వసిష్ఠమహర్షి : ఈ 'జగత్తులు' అనబడునవన్నీ చిదాకాశము కంటే వేరు కాదు. కాని, అజ్ఞానుల దృష్టికి స్వకల్పనా కారణంగా అట్లు పదార్థజాలానుభవంలో ప్రాప్తిస్తున్నాయి. వారి అనుభవమును దృష్టిలో పెట్టుకొనే ఇదంతా చెప్పాను. అజ్ఞానము చేతనే ఈ జగత్తులు ఉత్పన్నమై నశిస్తున్నాయి. దీనికి మనకు దృష్టాంతము బాలుని చిత్తము యొక్క కల్పనా వ్యవహారమే. ఆటబొమ్మలలో “ఇది పెళ్ళికూతురు, ఇది పెళ్ళికొడుకు” వంటి వివాహాదికల్పనల్ని కల్పించి బాలుడు అదంతా వాస్తవమువలె క్రీడించుచున్నాడు కదా! ఈ బ్రహ్మాండముల సృష్టి స్థితి లయాలు కూడా అట్టివే. అవి కల్పనయందే ఉద్భవించి, కల్పన చేతనే నశిస్తున్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ “ఊర్ధ్వ-అధో-తిర్యక్ (పైన-క్రింద-వెనుక” కల్పనలు, ఈ బ్రహ్మాండములు ఎక్కడినుండి వస్తున్నాయి? ఇవన్నీ అధిష్ఠానమగు బ్రహ్మము నందు స్వతహాగా ఉన్నవి కావు కదా! కాని బ్రహ్మాండములోకి ఈ పైన-క్రింద-వెనుక ముందు కల్పనలు వచ్చిపడు చున్నాయే? ఈ బ్రహ్మాండముల గురించి మరికొంత వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : రేచీకటి దోషం ఉన్న కన్నులు కలవానికి ఆకాశంలో జడలు కనిపిస్తాయి చూచావా? అవిద్య యందున్న వానికి నాశరహితమగు పరబ్రహ్మము నందు ఈ బ్రహ్మాండములన్నీ అగుపిస్తున్నాయి.
పదార్థములన్నీ ఈశ్వరేచ్ఛను అనుసరించే ప్రవర్తిస్తున్నాయి. అంతేకాని, వాటికి ఎట్టి స్వాతంత్య్రం లేదు. ఈ మన బ్రహ్మాండంలో పార్థివ (స్థూల) భాగము క్రిందకు, ఆకాశం పైన ఉన్నాయి. జ్యోతిశ్చక్రమును దర్శించునట్టి మహాపండితులు, “ఈ బ్రహ్మాండము ఆకాశమున ఉన్నట్టి మట్టి ముద్ద వంటిది. దశదిక్కులు దీని 'కాళ్ళు' వంటివి. ఒక చీమ యొక్క దేహంవలె దీని క్రింది భాగంలో భూమండలం ఉన్నది” అని వర్ణిస్తున్నారు.
కొన్ని-కొన్ని బ్రహ్మాండభూములలో మనుష్యులు లేరు. చెట్టు-పుట్టలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఆకాశభాగంలో మాత్రం దేవతలు, కిన్నెరలు ఉన్నారు. మరికొన్ని బ్రహ్మాండములు అప్పటికప్పుడు కల్పించబడినట్టి ప్రాణసమూహములతో, గ్రామములతో, పురములతో, పర్వతములతో ఉత్పన్నములౌతున్నాయి. ఇవన్నీ చిదాకాశము నందే ఉంటూ, అందులోనే లీనమౌతున్నాయి. మంచుగడ్డలు అనేక ఆకారములు సంతరించుకొంటున్నప్పటికీ స్వతహాగా అంతా జలమే కదా! “ఈ సృష్ట - వస్తువులన్నిటికీ ఆత్మవస్తువే కారణం" అని చెప్పబడుతోంది. అదియే అంతా అయివున్నది.
శుద్ధబోధమయమైన చిదాకాశసముద్రంలో 'బ్రహ్మాండములు” అనే తరంగాలు నిరంతరం లేస్తున్నాయి. మరల అందులోనే లీనమగుచున్నాయి. భవిష్యత్తులో కూడా అనేక బ్రహ్మాండ తరంగాలు లేవబోతున్నాయి. అందులో కొన్ని, "సంకల్పరాహిత్యం చేత, 'అంధకార' స్వరూపములై శూన్యమునందు నిద్రిస్తూ ఉన్నాయి" అని అనుమానించబడుతోంది. కొన్ని కొన్ని బ్రహ్మాండతరంగాలు కల్పాంత
Page:292
సూచకమైన ధ్వనులు చేస్తున్నప్పటికీ, విషయరస మోహితులైన ఆ బ్రహ్మాండములందలి జీవుల చెవులకు అవేమి వినిపించటం లేదు. వారి బుద్ధికి ఏదీ గోచరించటం లేదు.
కొన్ని బ్రహ్మాండములు అప్పుడే ఉద్భవిస్తూ ఉండగా వాటిలో మొట్టమొదటి విశుద్ధములైన జీవసమూహములు లేచుచున్నాయి. మరికొన్ని బ్రహ్మాండములలో మహాప్రళయ సమయం ఆసన్న మగుట చేత సూర్య-చంద్ర-నక్షత్రాదులు భూమిని దగ్ధం చేస్తున్నాయి. భూమి కరిగిపోతోంది. కొన్నిటికి పట్టుకొమ్మ దొరక్క పడిపోతున్నాయి. మరికొన్నిటి యందు లేవవలెననే ఆశ కూడా కలిగియుండటం లేదు. “అట్లు బ్రహ్మాండములు కూలిపోవటం ఎట్లా సంభవం?” అని అనుమానించ వలసిన పనిలేదు. ఇవన్నీ చిద్రూపములే కదా! కనుక బ్రహ్మాండములయొక్క ఉత్పత్తి పతనాలు తప్పకుండా జరుగుచున్న విషయాలే.
కొన్నికొన్ని స్తబ్ధములై ఉన్నాయి. వాయువునందు స్పందము (లేక ప్రసరణ) ఉదయిస్తున్నట్లు “చిత్తత్త్వము” (Knowledge consciousness) నందు పైన చెప్పిన కల్పనలన్నీ ఉదయిస్తున్నాయి. అయితే, ఈ బ్రహ్మాండముల నిజస్వరూపమేమిటి? చెపుతాను. విను. పూర్వపూర్వ జన్మలందు ఆచరించబడిన జ్ఞానకర్మాదుల అనుష్ఠానంచేత ఒకానొక ద్రష్ట (లేక జీవుడు) సంకల్పమాత్రంచేత సృష్టిని నిర్మించగల సామర్థ్యం పొందుచున్నాడు. అట్లు “ప్రజాపతి” అయినట్టి ఒకానొకనిచే ఈ బ్రహ్మాండములు నిర్మించబడుచున్నాయి. తత్కారణంగా ఈ కల్పమున ఉన్న సృష్టికి, ముందు ముందు రాబోయే కల్పములందు ఏర్పడబోయే సృష్టులకు భేదం ఉంటే ఉండవచ్చు. ఈ విషయం శాస్త్రాలు కూడా అంగీకరిస్తున్నాయి.
కొన్ని బ్రహ్మాండములు బ్రహ్మదేవుడు రచించాడు. మరికొన్నిటిని విష్ణువు కల్పించాడు. ఇంకొన్నిటిని ప్రజాపతులు రచిస్తున్నారు. కొన్నింటికి కర్తయే లేడు. అందుచేత అవి వృక్షాదులతో మాత్రమే ఉన్నాయి. అందు బుద్ధిజీవులు లేరు. కొన్ని బ్రహ్మాండములు కొందరు కలిసి విచిత్రంగా సృష్టిస్తున్నారు. కొన్ని బ్రహ్మాండముల సమూహం ఏకైక నియమము ననుసరించి ప్రవర్తిస్తున్నాయి. కొన్నిటిలో సృష్టియే లేదు. కొన్నిటిలో మానవులు మాత్రం లేరు. మిగతావన్నీ ఉన్నాయి. కొన్ని పాషాణములతో మాత్రమే నిండివున్నాయి. కొన్నిటినిండా క్రిములు మాత్రమే ఉన్నాయి. కొన్నికొన్ని కేవలం దేవతలతోను, మరికొన్ని కేవలం మనుష్యులతోను, ఇంకొన్ని ఈ రెండిటితోను నిండి ఉన్నాయి. కొన్నిట్లో చలనములేని జంతువులు మాత్రం ఉన్నాయి.
ఓ రాఘవా! ఇట్టివేయైన సృష్టులతో నిండిన బ్రహ్మాండములు ఇంకా అనేకం ఉన్నాయి. వాటివాటి వ్యవహారాదులు యోగుల ఊహలకు కూడా అందనంతటివి. అవన్నీ శూన్యమునందే ఉండి మహాకాశస్వరూపమై వ్యవహరిస్తున్నాయి. విష్ణువు మొదలైన దేవతలు కూడా తమ జీవితమంతా వెచ్చించినప్పటికీ వాటి పరిణామము తెలియజాలరు. ఆభరణములలో రత్నములు పొదగబడినట్లు, ఈ బ్రహ్మాండములలో 'భూతాకర్షణశక్తి' ఉన్నది. అందుచేతనే అవి జలము, జీవులు మొదలైన వాటిని కోల్పోకుండా ఉన్నాయి. ఓ మహామతీ! ఈ జగత్తుల విషయం నా దృష్టి పథంలో ఉన్నంతవరకు,
Page:293
ఇక్కడ మనకు అవసరమైనంత వరకు వర్ణించాను. వాస్తవానికి వాటినన్నిటిని వర్ణించి నేను చెప్పలేను. ఎన్ని లక్షల కోట్ల బ్రహ్మాండములు ఎన్నెన్ని విభేదములతో ఉన్నాయో ... అదంతా భాషకు, భావానికి అందదని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.
22. విదూరథుని యుద్ధ విన్యాసం
లీలా-సరస్వతులు ఆ విధంగా కబుర్లు చెప్పుకొంటూ పయనిస్తున్నారు. తాము చూస్తున్న జగత్తుల నుండి మరల వెలువడుచున్నారు. అట్లు పయనిస్తూ హఠాత్తుగా ఒకానొక క్షణంలో లీలయొక్క అంతఃపురంలో ప్రవేశించారు. అక్కడ పద్ముని భౌతికదేహం, ఆ ప్రక్కనే సమాధియందు నిమగ్నమైయున్న లీలాదేవి శరీరం ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరు కలతనిద్ర అనుభవిస్తున్నారు. లీలాదేవి అచ్చటికి వెళ్ళాలనే ఇచ్ఛ కలిగి ఉన్నంతమాత్రంచేత వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. మరల అతికొద్ది సేపట్లో లీల సరస్వతీ దేవితోసహా బ్రహ్మాండ కర్పమును భేదించి భర్తయొక్క సంకల్పమయ సంసారంలో ప్రవేశించింది.
ఆ సమయంలో సింధురాజు తన సర్వ సైన్యముతో సహా విదూరథుని (క్రితం ఉపాధిచే లీలాదేవి భర్త పద్ముడు) రాజ్యంపై దండెత్తి ఉన్నాడు. అక్కడ గొప్ప యుద్ధం జరుగుతోంది. భూత, పిశాచ, రాక్షసగణాలు రక్తమాంస పిపాసతో యథేచ్ఛగా యుద్ధభూమిలో సంచరిస్తున్నాయి. మునులు ఆ భయంకర యుద్దం చూచి లోకశాంతి కొరకు దేవస్తవం పఠిస్తున్నారు. ఎందరో వీరులు నేలకూలుచున్నారు.
శ్రీరాముడు : ఓ వసిష్ఠమహర్షీ! ఎట్టి భటుడిని 'వీరుడు' అని అంటాం? ఎట్టి వారు వీరస్వర్గమునకు అర్హులౌతారు?
శ్రీ వసిష్ఠమహర్షి : శాస్త్రానుకూలమైన ధర్మయుద్ధం ఆచరించే ప్రభువు యొక్క ప్రయోజన నిమిత్తం యుద్ధంలో ప్రావీణ్యం చూపేవాడే వీరుడు. అట్టి ప్రయత్నంలో ప్రాణములు త్యజిస్తే అట్టివాడు వీరస్వర్గం అలంకరిస్తున్నాడు. శాస్త్రవిరుద్ధంగా సంచరించే ప్రభువు కొరకు పోరాడి మరణించినవాడు స్వర్గానికిపోడు. అతడు నరకమును పొందుచున్నాడని, అట్టివాడు ఉత్తరోత్తర వేదన- రోదనలను పొందుచున్నాడని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. 'ధర్మరక్షణ' అను ప్రవృత్తిగల రాజు కొరకు, గోబ్రాహ్మణహితము కొరకు, మిత్రుని కొరకు, శరణాగతులను రక్షించటం కొరకు యుద్ధంచేసి మరణించేవాడు స్వర్గమునకు ఆభరణమే అగుచున్నాడు.
స్వదేశరక్షణార్థం పోరాడి మృతి చెందే రాజు, అతని భటులు కూడా స్వర్గమునకు వెళ్ళుచున్నారు. అట్లాకాకుండా, ప్రజాపీడనం చేస్తూ, పరరాజు కొరకు పోరాడుతూ మరణించేవాడు నరకమునే
Page:294
పొందుచున్నాడు. ఒకడు రాజు కావచ్చు. మరెవ్వరైనా కావచ్చు. శాస్త్రవిరుద్ధంగా ఆచరించువాని కొరకు పోరాడి మృతిచెందితే నరకపతనం నిశ్చయం. అధర్మయుద్ధమత్తులై ప్రాణులను చంపి పాపమే మూటకట్టుకొంటున్నారని నేను గుర్తు చేస్తున్నాను. “శూరుడు ఎటువైపు, ఏ స్థితిలో యుద్ధం చేసి మరణించినా స్వర్గమే చేరుకొంటాడు” అను ఒక అభిప్రాయం లోకంలో ప్రచారంలో ఉన్నది. కాని, "శాస్త్రప్రవచనం ప్రకారం ధర్మయుద్ధం ఒసరించినవాడు మాత్రమే స్వర్గం చేరుతాడు” అని చెప్పబడుచున్నది. సదాచార పరాయణులగువారిని రక్షించటానికి యుద్ధం చేసేవారే శూరులు. ఇక తక్కినవారు చేస్తున్నది బాలుర పోట్లాట వంటిది మాత్రమే. ఆకాశమున చరించు దేవతాస్త్రీలు ధర్మయుద్ధం చేసే శూరులను ఆహ్వానించి గౌరవించటానికి ఉత్కంఠతో సిద్ధంగా ఉంటారు.
ఆ యుద్ధ ప్రదేశంలోని ఆకాశం దేవతాస్త్రీలతో, దేవతా-విమానములతో, ఉత్సవ స్థానమువలె శోభిల్లుతోంది. ఇరువైపు రాజులు యుద్ధరచనలలో తలమునకలై ఉన్నారు. లీలా-సరస్వతులు ఇద్దరూ యుద్దవిన్యాసం చూడాలనే ఉత్సుకతతో తమ సత్యసంకల్ప ప్రభావంచే ఆకాశంలోనే ఒక విమానం నిర్మించుకొని, అందు అధిరోహించి యుద్ధ విశేషమంతా చూడసాగారు.
ఇరువైపుల మత్స్య-మకరవ్యూహాలు రచించబడ్డాయి. ఆయుధాల తళతళ మెరుపులు, భీకర శబ్దాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీలాదేవి తన భర్తయొక్క సైన్యం హింసించబడటం చూచి ఓర్చుకోలేక, “నేను కూడా యుద్ధం చేస్తే ఎంతబాగు!” అనుకొంటూ ఉద్వేగపడుతుంటే, విమానంలో ఆ ప్రక్కనే ఆశీనురాలైన సరస్వతీదేవి గంభీరంగా చిరునవ్వు చిలికిస్తూ తన భక్తురాలిపై చేయి వేసి ఉంచుతూనే యుద్ధం వైపు దృష్టి సారిస్తోంది.
అక్కడ యుద్ధ శబ్దాలు గాక ఇంకేమి ఎవరికీ వినబడటం లేదు. అనేకమంది సేవక జనం వేలాది మానవ-జంతు కళేబరాలను తొలగించటంలో నిమగ్నమైయున్నారు. అర్దమృతులు కటిక నేలపై పరుండి మూలుగుచున్నారు. "ప్రళయం దాపురించిందా?” అన్నట్లు యుద్ధ వాతావరణమంతా అతిభయంకరంగా ఉన్నది. "ఓ మిత్రులారా! వీరులారా! విజయమో, వీరస్వర్గమో, అంతే. స్వదేశరక్షణ కొరకు మరణించామా ... ఈ యుద్ధభూమిలోని ధూళిలో ఎన్ని కణాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరములు వీరస్వర్గం అనుభవిస్తాం. మన మాతృదేశపు గడ్డపై జన్మించినవారికి పిరికితనం, భయం గురించి అసలు తెలుసా? లేదు. మన మాతృదేవతలు మనకు చనుపాలలో వీరరసాన్ని ప్రసాదించారు. ఆకాశంలో దేవతాస్త్రీలు మీ వీరత్వము చూచి మురిసి పోతున్నారు. తాము తెచ్చుకొన్న పూలదండలు మీరు చేస్తున్న త్యాగముల ముందు వెలవెలపోవటం చూచి సిగ్గుతో తలవంచుకొంటున్నారు. మనకు వెనుకంజ ప్రసక్తే లేదు. పదండి ముందుకు" అని ఉభయ సైన్యములలోని సేనానాయకులు ఎలుగెత్తి అరుస్తున్నారు. అయినప్పటికీ పిరికిపందలైన కొందరు సైనికులు మాత్రం వెనుకకు మరలుచున్నారు. రక్తప్రవాహం పైనుండి ప్రసరిస్తున్న గాలి దిక్కులను ఎఱ్ఱదనంతో నింపివేస్తోంది. యుద్ధ శబ్దములు, నినాదములు పర్వతగుహలను ప్రతిధ్వనింప
Page:295
చేస్తున్నాయి. తోటివారు నేలకూలుతుంటే ఇరువైపు సైనికులు వీరావేశం పొందుచున్నారు. దిక్కులు పిక్కటిల్లుచున్నాయి. సైనికులు “మేము ముందర .... మేము ముందర ....” అంటూ యుద్ధభూమిలోకి దూకుతున్నారు. ఇంతలోనే అనేకులు నిహతులగుచున్నారు. ద్వంద్వ యుద్ధాలలో కొంచెం విజయం చవిచూచినవారు హాస్య నృత్యగానాలు చేస్తూ, మరొకవైపుకు ఉరుకుచున్నారు. కొందరు ఆయుధం చేయి జారిపోగా, కోపావేశంతో శత్రువు యొక్క ఖడ్గఘాతానికి ఎదురుచూస్తూ తదితర మృతదేహాలకు నమస్కరిస్తున్నారు. ఉపనాయకుని పోగొట్టుకొన్న కొన్ని సైనిక సమూహాలు ఇతర సమూహములతో జేరి యుద్ధం కొనసాగిస్తున్నారు.
ఈ విధంగా యుద్ధం అతిభీకరంగా సాగుతోంది. ఇంతలో ఎనిమిదవ జాము ముగిసింది. ఉభయపక్ష సేనాపతులు యోచించి యుద్ధమును ఆ రోజుకు ఆపు చేయుటకు తమ దూతలను ఒకరివద్దకు మరొకరు పంపారు. ఇరువైపువారు బాగా అలసి ఉండటం చేత యుద్ధవిరామం అందరికీ అంగీకారమే అయింది. క్షణాలలో ఆ కల్లోలమంతా శాంతించింది. ఉభయ పక్షములకు సంబంధించిన సేవకులు యుద్ధరంగంలో ప్రవేశించి క్షతగాత్రులైనవారిని తీసుకొనిపోతున్నారు. అక్కడ మృత్యుదేవతకు కడుపునిండా మృష్టాన్నము లభించినట్లైనది.
క్రమంగా రాత్రి అవటంచేత అంతటా అంధకారం అలముకొన్నది. ప్రాణులందరు నిద్రితు లయ్యారు. రాజమందిరంలో విదూరథుడు మరుసటిరోజు యుద్ధం గురించి మంత్రులతో సమాలోచన చేసి, ఆ తరువాత విశ్రాంతి గైకొనమని ఆజ్ఞాపించి వారినందరిని పంపివేశాడు. తన పానుపుపై పవళించి కళ్ళుమూసుకొని ఒకింత నిదురించాడు.
లీలాదేవి సరస్వతీదేవి ఆకాశమును పరిత్యజించి తలుపు రంధ్రం గుండా రాజగృహంలో ప్రవేశించారు.
23. స్థూలదేహ భ్రాంతి - చిత్త నైపుణ్యం
శ్రీరాముడు : ప్రభూ! సన్నటి తలుపు రంధ్రం గుండా వారు ఎట్లా రాజగృహ ప్రవేశం చేశారు? శ్రీ వసిష్ఠమహర్షి : ఆధిభౌతిక భ్రాంతియుతులైన వారు అణుప్రమాణమైన సన్నటి రంధ్రంలో ప్రవేశించలేరన్నమాట నిజమే. "నేను స్థూలశరీరబద్ధుడను. ఒక స్వల్ప రంధ్రంలో నేనెట్లా ప్రవేశించగలను?” అను సంస్కారము కలవారు అట్లు ప్రవేశం చేయలేరు. కాని, స్థూలదేహబుద్ధిని జయించివేసినవారు, “నేను ఆతివాహిక దేహమును. ఆకాశము కంటే కూడా సూక్ష్మాతిసూక్ష్మ స్వరూపుడను" అను నిశ్చయం కలవారు మాత్రం తమ సంస్కారబలంచేత సూక్ష్మ ప్రదేశమునకు కూడా వెళ్ళిరాగలరు. ఏ వస్తువునకు ఏ స్వభావం స్వతహాగా ఉంటుందో, ఆ వస్తువు ఆ స్వభావమును వీడజాలదు. నీరు మెరకవైపు పారుతుందా? అగ్నిజ్వాలలు అధోముఖంగా ప్రజ్వరిల్లుతాయా?
Page:296
లేదు కదా! "నేను ఈ భౌతిక శరీరమునై ఉండలేదు" అనునట్టి అనుభవపూర్వకమైన 'ఎరుక' గలవారు ఈ పంచభూతతత్త్వమును అధిగమించి ప్రవర్తించగలరు.
అయితే, ఒక్క ముఖ్యమైన విషయం. నీడలో ఉన్నవానికి ఎండవేడిమీ తగలదు కదా! పరమాత్మను తెలుసుకొన్న తరువాత ఎట్టి దుఃఖములు కలిగే ప్రసక్తే ఉండదు. అన్నిటికీ కారణం ఈ చిత్తమే. ఈ చిత్తము శరీరత్వము యొక్క దృఢభావం వదలి చైతన్యమును ఆశ్రయించాలి. అందుకుగాను యోగాభ్యాసాది ప్రయత్నములు చెయ్యాలి. భక్తి-జ్ఞాన వైరాగ్యాది మార్గాలన్నీ ఈ చిత్తముయొక్క 'స్థూలత్వము' అనే జాడ్యం వదలించుటకొరకే. ఒక త్రాడును చూచి "ఇది పాము” అనే అభిప్రాయాలు, అట్టి అభిప్రాయముల వలన కలిగిన వికటచిత్తవృత్తులు తొలగేదెట్లా? "తెలుసుకొనటం” అను ప్రక్రియ వలననే అది సాధ్యం.
1) త్రాడును చూచి 'పాము' అని భావించటం.
2) “కాదు. ఇది త్రాడు మాత్రమే" అని గ్రహించటం.
పై రెండూ కూడా 'తెలుసుకొనటం' అను రూపముగల జ్ఞానశక్తి వలననే ఏర్పడు చున్నాయి కదా! అందుచేత “జ్ఞానశక్తి మాకింతవరకు పరిచయమైన విషయం కాదు” అని ఎవరూ అనకుండెదరు గాక! ఉత్తమప్రయత్నం ఆశ్రయించాలి. అట్టి ప్రయత్నము వలన స్థూలశరీరబుద్ధి నశిస్తుంది. “చిత్తము సంవిత్తును అనుసరించి ఉన్నట్లే, ప్రయత్నము చిత్తమును ఆశ్రయించి ఉంటుంది" అని సకల జనులు గ్రహించండి.
చిత్తము:మరొక విషయం. స్వప్న పురుషునితో లేక సంకల్పములోని పురుషునితో పోల్చదగిన ఆకాశరూపము గల వానిని ఎవరు ఎట్లు దేనిచే నిరోధించగలరు? 'చిత్తము అనునదే ఆకృతిగా కలిగినట్టి ఆతివాహిక దేహమును నిరోధించకలిగినదేదీ ఎక్కడా ఉండదు. ఈ స్థూలశరీరమే జ్ఞానప్రభావం చేత ఆతివాహిక భావమును పొందుతోంది. ఓ రామచంద్రా! పరమాత్మ యొక్క చిత్తవృత్తులను అనుసరించే ఈ భౌతిక దేహము యొక్క ఉత్పత్తి-లయములు జరుగుతున్నాయి సుమా! "ఈ పంచీకరణమునకు (పంచభూత సమన్వయమైన దేహముల నిర్మాణమునకు) అసలు కారణమేమిటి?” అనునట్టి ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం శాస్త్రకారులు వెతికి, “జ్ఞానస్వరూపమగు చిదాత్మ అజ్ఞానమును అంగీకరించుటయే” అనే సమాధానమును నిర్ణయిస్తున్నారు. ఆ అజ్ఞానమే స్థూలదేహ విభాగము ఒనర్చుచున్నది. వాస్తవానికి “అధిష్ఠానసత్త (the absolute self in which every thing else is placed)కు వేరుగా ఏదీ ఎక్కడా లేదు. అందుచేత “చిదాకాశము”, “చిత్తాకాశము”, “మహాకాశము” అనునవి వేరువేరు కావు. అవి వేరుకావని, ఒక్కటేనని గ్రహించుటే “జ్ఞానం”. 'జ్ఞానేచ్ఛ’ను అనుసరించే 'జ్ఞానం' ఉదయిస్తోంది. అందుచేత, చిత్తమునందు ఉదయించే శరీరభావమే దృశ్యవస్తువులందు కూడా స్ఫురిస్తోంది.
ఈ చిత్తము అనబడునది అత్యంత సూక్ష్మమైనది. అది త్రసరేణువుల మధ్య అత్యంత సూక్ష్మమై వెలయుచున్నది. ఒక భావమునకు మరొక భావమునకు మధ్య భావాభావములకు కారణమై
Page:297
వెలయుచున్నది. ఈ చిత్తము ఆకాశము కంటే బాగా అంతర్హితమై ప్రవర్తిస్తోంది. అది అంకురము (మొలచుట అను ప్రక్రియయందు)లో విలీనమై, చిగురాకులందు రసస్వరూపమై వెలయుచున్నది. జలమందలి తరంగంగా, శిలా మధ్యమునందు సౌమ్యంగా, మేఘములలో వర్షస్వభావంగా ప్రవర్తిస్తోంది. తన ఇచ్చ వచ్చినట్లు ఆకాశంలో మనగలదు. కొండ గుహలలో ప్రవేశించగలదు. ఆహా! ఈ చిత్తము యొక్క మహిమ ఏమని చెప్పమంటావు? ఇది అనంతాకాశవ్యాపి అయివుండి కూడా, అదే సమయంలో పరమాణువుగా మారగలదు. పర్వతమై దృఢంగా వెలయునది, ఆ పర్వతంపై 'వనము' రూపమున ప్రకటితమయ్యేదికూడా ఈ చిత్త-శరీరమే.
సముద్రజలమునకు ఆ జలం కంటే సుడిగుండములు వేరా? కావు కదా! కోటానుకోట్ల బ్రహ్మాండములు ఉండవచ్చు. కాని అవన్నీ చిత్తము కంటే ఏమాత్రం వేరు కాదు. ఈ ‘బ్రహ్మాండములు’ అను రూపమును దాల్చుచున్నది ఆ చిత్తాకాశమే. అదియే సృష్ట్యాది యందు ఉద్వేగరహితమైన జ్ఞానస్వరూపముగా వెలయుచున్నది. మరల, అదియే ఆకాశ రూపమున ప్రారబ్ధ కర్మలను అనుసరించు చున్నది. ఎండమావుల పట్ల “ఓహో! అది జలమే” అను జలత్వబుద్ధి ఎందుకు ఉదయి స్తోంది? విచారణ రహితంగా అసత్యమును ఆశ్రయించుటచేతనే కదా! "అతడు గొడ్రాలి రెండవ కుమారుడు” అను అర్ధరహిత ప్రయోగం ఏర్పడుచున్నట్లే చిత్తమునందు 'జగత్తు' అనబడు మహా చమత్కారమంతా జరిగిపోతోంది. వాస్తవానికి ఆకాశాత్మస్వరూపుడే అయినట్టి ఈ జీవుడు తన యందు స్వయంకల్పితంగా ఏర్పడుచున్న భ్రమాత్మకమైన బుద్ధిచే బ్రహ్మాండ రూపుడై విస్తరిల్లుచున్నాడు.
"నేను శరీరమును. కర్మ బద్ధుడను. ప్రారబ్ధకర్మలు నన్ను బంధిస్తున్నాయి. ఈ దృశ్యము లోని ఈ పదార్థములు నేను పొందకపోతే ఎట్లా? ఈ భౌతిక దేహములు నా వారు. ఇక వారో .. పరాయి వారు. ఈ శరీరము క్షీణిస్తున్నప్పుడు నేనే పీడించబడు చున్నాను...”
ఈ జీవుడు ఇటువంటి అనేక అసత్యభావపరంపరలను గాలిలో ఏర్పడే సుడులులలాగా పొందుచున్నాడు. ఫలితంగా, చిత్తము సంకుచితమై ప్రవర్తిస్తోంది. అట్టి సంకుచితత్వము త్యజించ బడినప్పుడు ఈ చిత్తము ఉత్తమోత్తమమైన కల్పనాసామర్థ్యమునే పొందగలదు. అట్టి సామర్థ్యముతో స్వయముగా బ్రహ్మాండములను నిర్మించగలదు. తనకుతానే బ్రహ్మాండమై విస్తరిల్లగలదు. శ్రీరాముడు : మహర్షీ! మీరు చాలా చిత్రమైన విషయం చెప్పుచున్నారు. మా చిత్తమునకు బ్రహ్మాండమై విస్తరిల్లునట్టి శక్తియున్నదా? అది నూతన బ్రహ్మాండములను కూడా కల్పించగలదా? ఎంత ఆశ్చర్యం! మేము, “ఎవరో కల్పించిన జగత్తులో కర్మల ప్రభావం చేతనో, ఆసక్తాదుల కారణంగానో ప్రవేశించాం" అని మాత్రమే అనుకొంటున్నాం. మేము ఈ ప్రకృతి యొక్క నిరంకుశంచే అస్వతంత్రులమై ఉన్నామని భావిస్తున్నాం. ప్రారబ్ధకర్మల చేతిలో కీలుబొమ్మలమై ఉన్నామని నమ్ముతూ వస్తున్నాం. కాని, మీరు చెప్పుచున్న దానినిబట్టి మా చిత్తమునకు మహత్తరమైన ప్రభావం ఉండియే ఉన్నదని తెలియవస్తోంది.
Page:298
ఇక్కడ నాకొక సందేహం కలుగుతోంది. మా చిత్తములన్నీ వేరువేరు జగత్తులను చూస్తున్నాయా? లేక, ఒకే జగత్తును చూస్తున్నాయా? ఈ కనబడే జగత్తు సద్రూపము (స్వతహాగా అస్థిత్వము కలిగి సత్యమైయున్నది) కాదంటారా? ఎందుచేత? ఎట్లు?
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ ప్రియరాఘవా! నేను చెప్పేది నీవు అత్యంత సూక్ష్మబుద్ధితో గ్రహిస్తున్నావు. చాలా సంతోషం. నేను చెప్పేది నిజమే. ప్రతి చిత్తమునకు ఇట్టి అనేక బ్రహ్మాండములు విస్తరిల్లజేయగల శక్తి ఉండియే ఉన్నది. నాయనా! "అసలు ఈ చిత్తము ఎవరికి చెందినది?” అను ప్రశ్నకు మొట్టమొదట సమాధానం తెలుసుకో. “ఆకాశాత్మ స్వరూపుడే తనయందున్న భ్రమతో కూడిన బుద్ధి వలన ఈ విధంగా బ్రహ్మాండమై విస్తరిల్లుచున్నాడు” అని చెప్పాను కదా! అట్టి అసత్యత్వము యొక్క మనన ప్రభావమే 'చిత్తము'గా చెప్పబడుతోంది. కనుక, నీవు-నేను ఈ సభికులు-భూత భవిష్యత్ వర్తమానమునందలి ప్రతి ఒక్కరు .... చిదాకాశ స్వరూపులమే. తరంగములు లక్షలాదిగా ఉండవచ్చు. కాని జలం సర్వదా ఒక్కటే అయి ఉంటోంది కదా! తరంగములు జలమును భిన్నముగా, ఖండముగా చేయుచున్నాయా? లేదు. అట్లే చిదాకాశము సర్వదా అభిన్నము, అఖండము. చిదాకాశస్వరూపుడే బ్రహ్మాండముగా విస్తరిల్లి, మరల ఆ బ్రహ్మాండములో తననుతాను ఒక వ్యష్టి జీవుని (Individual soul) గా గాంచటం జరుగుతోంది. జలమే మహాసముద్రముగా విస్తరిల్లి, అందు ఆ జలమే లక్షల కోట్లాది తరంగములుగా ప్రకటితమవటం లేదా? 'వ్యష్టిజీవుడు' అంటే ఎవరు? "నేను బద్ధుడను, నేను శరీరమును, నేను జన్మలు ఎత్తువాడను, నాకు ఇంకే త్రోవ లేదు” అనునట్టి భావావేశమే వ్యష్టిజీవుని రూపము కదా! స్వయముగా అట్టి భావావేశమును, స్వల్పత్వమును తనకు తానే అతడు ఆపాదించుకొంటున్నాడు. కారణం? (స్వయముగా అసత్యత్వ బుద్ధిని అంగీకరించి అద్దానిని అనుసరించుటచేతనే.)
సరే, నీకీ విషయం మరికొంత సుస్పష్టపడటానికిగాను "ప్రళయానంతర సృష్టి" గురించి చెపుతాను. అప్పుడు నిమిషంలో లెక్కకు మించిన జగత్తులు ఎట్లు ఉద్భవించి, విలీనమైపోతున్నాయో గ్రహించగలవు. విను.
24. ప్రళయానంతర సృష్టి - భ్రమయొక్క 'ప్రవేశం'
ఓ సునిశితమతీ! రామచంద్రా! ఈ జగత్తులో 'మరణము' అనబడే మూర్చ అందరు పొందటం మనం చూస్తూనే ఉన్నాము కదా! దీనినే “ప్రళయరాత్రి” అని కూడా అంటూ ఉంటారు. అట్టి ప్రళయరాత్రి గడచిన తరువాత అందరూ కూడా వేర్వేరు సృష్టులను కల్పించుకొనుచున్నారు. మోహబుద్ధి కలవాడు, లేక, ఒక త్రాగుబోతు "ఈ కొండ భలే నృత్యం చేస్తోంది” అని అనుకొంటాడు చూచావా? అదేవిధంగా మరణించిన వారందరు తమతమ సంస్కారములకు తగినట్టి దృశ్యములను తమ చిత్తమునందే గాంచుచున్నారు.
Page:299
ఇక సమష్టి మనోరూపుడగు హిరణ్యగర్భుని విషయానికి వస్తే, అతడు మహా ప్రళయానంతరం మరల సమష్టి-భోగ సమూహములను విస్తరింపజేయుచున్నాడు. అదేవిధంగా, “నేను వ్యష్టిని అనునట్టి స్వయం సంభావన కలిగినవారు మృత్యువు తరువాత వ్యష్టిభోగ సమూహములను కల్పించుకొనుచున్నారు. ఏది ఏమైనా మహా ప్రళయానంతరం సమష్టి జీవునియందు, వ్యష్టి జీవుని యందు కూడా ప్రవర్తించుచు విరాజిల్లునది శుద్ధ స్వస్వరూపమే. “అట్టి శుద్ధ స్వస్వరూపము ఏకైక అద్వితీయ చిదాకాశమే” .... అని సునిశితమైన బుద్ధితో గ్రహించెదవు గాక. దీనిని బట్టి మనం గ్రహించవలసినదేమిటి? "ఆ చిదాకాశమే బంధముక్తులను తనకు తానే చిద్విలాసంగా, చమత్కార పూర్వకంగా కల్పించు కొనుచున్నది” అని మనం గ్రహించాలి సుమా! అందుకే ....
“ఓ జీవుడా! నీవు ఏమాత్రం స్వల్పుడవు కాదు సుమా! నీయొక్క వాస్తవ స్వరూపము చిదాకాశమే. మరి ఎందుకు విచారిస్తున్నావు? నీకు నీవే బంధమోక్షములను కల్పించుకొని, అనుభవిస్తున్నావు. ఈ రెండిటి ఆవలనున్న నిత్య నిష్కళంక ఆత్మచైతన్యమైయున్న స్వస్వరూపమును గాంచుటే జ్ఞానము యొక్క పరాకాష్ఠ" ....
అని శాస్త్రములు సర్వజనులకు ఎలుగెత్తి బోధిస్తున్నాయి. ఇదంతా మేము స్వానుభవము క్రోడీకరించి చెప్పుచున్నదే.
శ్రీరాముడు : స్వామీ! జీవుడు తాను మరణించిన తరువాత మరల సృష్టిని తన స్మృతిని అనుసరించి పొందుచున్నాడని మీరు అనియున్నారు కదా! ఈ విశ్వసృష్టిని రచించుచున్న సమష్టి జీవుడగు హిరణ్యగర్భుడు కూడా తన యొక్క స్మృతిని అనుసరించే ఈ జగత్తును ఇట్లు నిర్మించియున్నాడని మనం ఎందుకు అనుకోకూడదు? జీవుడు స్మృతిని అనుసరించి మరొకజన్మ పొందుచున్నాడని మనం అంగీకరిస్తే అప్పుడు “ఈ జగత్తును సమష్టి సృష్టికర్త తన స్మృతిలో కల్పనచేసి రచించాడు” అని చెప్పవచ్చు. అప్పుడు “ఈ జగత్తు కారణరహితము” అనే బదులు సమష్టి సృష్టికర్త (లేక హిరణ్య గర్భుడు) దీనికంతటికీ కారణము” అని అనవచ్చు కదా?
శ్రీ వసిష్ఠమహర్షి : "ఈ ‘జగత్తు' అనబడే కార్యమే లేదు” అని ఉపనిషత్తులు మొదలైన ఆత్మవస్తువును ప్రతిపాదించు గ్రంథాలద్వారా శాస్త్రకారులు నిర్ద్వంద్వముగానే చెప్పుచున్నారు. అందుకు శాస్త్రములచే చెప్పబడిన ఒకానొక నిరూపణ చెపుతాను. విను.
మహాప్రళయసమయంలో హరి-హరాది దేవతలు కూడా విదేహముక్తులగుచున్నారు. అప్పుడు ఇంకేమి మిగలనప్పుడు ఇక 'స్మృతి' అనునది ఎవరికి? ఎట్లు? మాబోటి తత్వవేత్తలే ఆ మహాప్రళయ సమయంలో ముక్తులౌతుంటే ఇక బ్రహ్మాదుల విషయం వేరే చెప్పేదేమున్నది?
నాయనా! రామా! ఎప్పుడైతే ఈ చిదాత్మ తన అఖండ విన్యాసత్వమును మరుగు పరుచుకొని, “నేను బద్ధుడను” అను భావమును పొంది ఉంటుందో, అట్టి సమయంలో అది అనేక ఉపాధి పరంపరలను పొందటం త్యజించటం అను తతంగంలో ప్రవేశిస్తోంది. అట్టి తర్వాతి ఉపాధులకు స్మృతియే కారణమగుచున్నమాట నిజమే. అయితే స్మృతి ఉండుటకు, ఉపాధి నిర్మాణములకు
Page:300
వీటన్నిటికి మూలకారణం ఆ చిదాత్మ తనయొక్క పూర్ణమగు మోక్షస్వరూపమును, విస్మరించుటయే. దృశ్యము భావించబడిన చోట ఆత్మ బావము కలుగరు. "ఇక్కడ కనబడుచున్న నీవు-నేను-అతడు-మనస్సు- అహంకారములు-పదార్థములు-వ్యష్టి-సమష్టి-ఇదంతా ఆత్మయే. ఆత్మయొక్క ప్రభావమే” అను రీతిగా ఆత్మ స్మరించబడుచున్నప్పుడు, స్వస్వరూపము అనుభవంకాగా, దృశ్యము యొక్క అదృశ్యత నిత్యానుభవమౌతుంది. ఈ జీవుడు ఇతఃపూర్వమే సర్వదా మోక్షస్వరూపుడై ఉన్నాడు. “ఓయీ, జీవుడా! నీవు సర్వదా స్వతంత్రమగు చైతన్యమూర్తివేగాని “స్మృతి” అనబడు ఒకానొకదానిచే బంధింపబడి అటూయిటూ దొర్లింపబడు జడవస్తువు కాదు. స్మృతికి ముందే నీ స్వరూపమున్నది. 'స్మృతి' యొక్క స్వరూప - - స్వభావములు నిర్ణయిస్తున్నది నీవే” అని మేము సర్వజనులకు గుర్తు చేస్తున్నాం.
“ఈ జీవుడు మృతి తరువాత స్మృతిని అనుసరించి స్వకీయ - - కల్పితమైన సృష్టిని గాంచుచున్నాడు” అనునది (బ్రహ్మపురాణం మొదలైన శాస్త్రములందు) ఇతఃపూర్వమే శాస్త్రకారులచే ప్రతిపాదించబడింది. స్వస్వరూపము గ్రహించబడనంత వరకు ఇట్టి సృష్టులు ప్రవర్తిస్తూనే ఉంటాయి. అట్టి సృష్టులనే “ఆకాశప్రకృతి” అని కూడా అంటారు. అయ్యది వ్యక్తము అవ్యక్తము, జడము-అజడము కూడా అయివున్నది. నీకిక్కడ సృష్టి గురించి, జన్మాదుల గురించి కొన్ని విషయాలు చెపుతాను. విను.
ఈ “ద్రష్ట-దృశ్యము” అనబడు రెండు పదార్థములు సమ్మేళనమైనట్లు తోచుచున్న ఆకాశ ప్రకృతి “చిద్వస్తువు” నందు ప్రతిఫలించినప్పుడు అహంభావము, శబ్ద-స్పర్శ-రూప - రస-గంధములనబడు పంచతన్మాత్రలు, దిక్కులు ... మొదలైన సూక్ష్మభావాలన్నీ ఉదయిస్తున్నాయి. అట్లు ఉదయించిన ‘సూక్ష్మభావ ప్రకృతి' మరికొంత విస్తరిల్లుటచే ఈ సూక్ష్మేంద్రియ పంచకమునకు (శబ్దానుభవం, స్పర్శానుభవం, రూపానుభవం, రసానుభవం, గంధానుభవం పొందటానికి) కారణమగుచున్నది. దానినే మనం 'ఆతివాహిక దేహం' అని అంటున్నాం. కొంతకాలానికి బాలుడు ఆటవస్తువులను, ఆ ఆటవస్తువులు ఆయాఆరోపణలను కల్పించుకొనునట్లు ఆదిభౌతిక దేహము సూక్ష్మదేహ ప్రభావం చేత రూపుదిద్దుకొంటోంది. అప్పుడు స్థూల దేహమును ఆశ్రయించుకొనియున్న ఈ కళ్ళు, చెవులు, చర్మము మొదలైన ఇంద్రియములు వాటికి సమీపంలో ఉన్న పదార్థముల పట్ల మిథ్యాభావములను పొందుచున్నాయి. వాయువునందు స్పందముండటం లేదా? అట్లే జగద్ర్భాంతి కూడా 'చిలువలు-పలుకలు'గా వర్ధిల్లుచున్నది. స్వప్నంలోని స్త్రీ సాంగత్యములాగా ఇదంతా ఈ విధంగా అనుభూతమగుచున్నప్పటికీ ... ఇది అసత్యమే అయివున్నది సుమా!
ఈ జీవుడు ఎక్కడ మరణించటం జరిగినా, అతడు అక్కడే తక్షణమే తన అంతరంగము లోని సంస్కారముల ప్రభావం అనుసరించి “నీవు-నేను-అతడు-పదార్థజాలము” మొదలైన వ్యవహారమంతా గాంచుచున్నాడు. అయితే స్థూలాకాశమునందు ఈ "కాలము - దూరము” వంటి విషయాలు ప్రవర్తిస్తున్నాయి. సూక్ష్మాకాశమునందు ఈ దూరాదులు వర్తించవు. అందుచేత, “ఎంతకాలం
Page:301
తరువాత? ఎంతదూరంలో?” అనే ప్రశ్నలు స్థూలాకాశబుద్ధికి సంబంధించినవి మాత్రమే. సూక్ష్మాకాశమున (నిశితబుద్ధికి) ఇట్టి ప్రసక్తి ఏర్పడదు. ఎంత చిత్రమో చూచావా! వాస్తవానికి ఆకాశమువలె సూక్ష్ముడగు ఈ జీవునకు జన్మాదులు లేవు. కాని ఆగంతుకములైన ఈ దేహాదుల యొక్క భావనలలో పడి జన్మాది భ్రమలకు లోనగుచున్నాడు. భ్రాంతియే అంతటికి కారణం. ఈ భ్రాంతియే .... దేవపురం, సూర్యుడు, నక్షత్రములు, భూమి - మొదలగు వాటితో కూడుకొని సుందరమై కన్పట్టుచున్నది. జరా మరణ-వ్యాధులతో బహుసంకటంగా అగుపిస్తున్న ఈ “దేహఛిద్రము” యొక్క అనుభవమునకు కూడా భ్రమయే కారణమై ఉన్నది. ఓ రాఘవా! ఒక్కసారి పరికించి చూడు. ఈ జగత్తంతా విస్తరించియున్న చరాచర జంతువులన్నీ తమ స్థూల-సూక్ష్మ దేహములతో కూడుకొన్నవై "ఇష్టాను భవముల ప్రాప్తి - అయిష్టానుభవముల పరిహారము” అను రూపముగల అనేక ప్రయత్నములందు నిమగ్నమై ఉంటున్నాయి. అట్టి వ్యవహారం చేతనే “నదులు, కొండలు, భూమి, దిశలు, రాత్రింబవళ్ళు, క్షణములు” అనునట్టి భ్రమలన్నీ కలుగుచున్నాయి. "ఇష్టాయిష్టములే భ్రమలకు దారితీయగలవు” అని గ్రహించెదవుగాక.
“నేనతనికి పుట్టాను. వీరు నా తల్లిదండ్రులు. వీరు నా మిత్రులు. ఇది నా ధనము. ఇది నా కోర్కె. ఇవి నా పుణ్య-పాపములు, నేను బాలుడను, ఇప్పుడు యువకుడను, కాని క్రమంగా వృద్ధాప్యం పొందుచున్నాను.” ఇటువంటి భ్రమాత్మకదృష్టులే జీవుని “పరిమితునివలె” చూపుతున్నాయి. ఈ జగద్భమ మాటిమాటికీ వేరువేరుగా హృదయమునందే స్ఫురించటం జరుగుతోంది.
‘మరణము' అను మూర్ఛను పొందిన ఈ జీవుడు మరల తన హృదయము యొక్క బాహ్యప్రసరణం కారణంగా తనయందే తన సంస్కారములకు, ఇచ్ఛలకు అనుకూలమైన జగత్తును గాంచుచున్నాడు. అదేవిధంగా ఈ జీవించియున్న తరుణంలో జీవునిచే గాంచబడునది కూడా సంస్కారానుగుణంగానే ఉంటోంది కదా! జీవుడు ఇట్లు ఎక్కడ మరణిస్తే అక్కడ ఇట్టి సంసారవనభూమిని దర్శించుచునేఉన్నాడు. ఈ విధంగా త్రిలోకములు, బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, సూర్యాది దేవతలు, పర్వతములు, సముద్రములు, ద్వీపములు ఇట్టివి కోట్లకొలది కనబడుచున్నాయి. మరల నిష్క్రమిస్తున్నాయి. నిరాకారమగు పరబ్రహ్మమునందు ఈవిధంగా ఎన్ని అసత్స్వరూపములు ఉద్భవించాయి? ఎన్ని ఉద్భవించబోతున్నాయి? ఇవన్నీ లెక్కించటం, నిరూపించటం ఎవరితరం చెప్పు!
ఈ విశ్వము ఒక గోడవలె స్థూలంగా ఎదురుగా నిలచియున్నది కదా! వాస్తవానికి ఇదంతా మనస్సు యొక్క సంకల్పమే అయివున్నది. మనో సంకల్పమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. మనస్సే తనకొరకు ఈ దృశ్యవ్యవహారములతో కూడిన సృష్టులను నిర్మించుకొని, అనుభవించి, మరల త్యజించివేస్తోంది. కనుక 'జగత్తు' అనబడునది మనస్సులోనే సంకల్పరూపమున ఉద్భవించి బాహ్యమైన వస్తుజాలమువలె ప్రాప్తిస్తోంది. స్వప్నములోని వస్తుజాలం "అంతరంగమున ఏర్పడియున్న భ్రమ” అయినప్పటికీ అదంతా ఆ స్వప్న సమయంలో “బాహ్యజగత్తు”వలె తోచుచున్నది కదా! ఈ జాగ్రత్ అనుభవం కూడా అట్టిదే.
Page:302
శ్రీరాముడు : అయితే, ప్రభూ, “మనస్సు చంచలము - ఈ విశ్వము స్థిరము" అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఈ విశ్వమంతా మాకు ఎదురుగా ఘనీభూతమై అనుభవమగుచుండగా, “ఇదిలేదు” అనునది సమంజసమెట్లా అవుతుంది?
శ్రీ వసిష్ఠమహర్షి : నాయనా! ఈ కనబడేదానిని కొంచెం విచారించిచూడు. ఈ విశ్వము కూడా చంచలమని, క్షణభంగురమని నీవు తప్పక గ్రహించగలవు.
చిదాకాశమే మనస్సునకు ఆశ్రయమైయున్నది. అట్టి చిదాకాశమే 'పరమపదము’ కూడా. నీరే, కెరటము. నీరే సుడిగుండము కూడా కదా! ఆ రెండింటికీ భేదమేమున్నది? అట్లే ఈ విషయం
విను.
"ద్రష్టయే దృశ్యముగా ప్రసరించుచున్నాడు. (Perceiver is extending himself as perception) ద్రష్ట - దృశ్యములకు భేదమేమీ లేదు.”
"ద్రష్టేవాస్తేదృశ్యమివ దృశ్యంనత్వస్తివస్తుసత్”
ద్రష్టయే దృశ్యంగా అవతరిస్తున్నాడు. ద్రష్టకు వేరుగా దృశ్యమనునది వస్తుతః ఎక్కడా లేదు. ఐంద్రజాలికుడు ఆకాశము నుండి వివిధ వస్తువులను కల్పించి నానావిధములైన వాటిని మన కళ్ళకు సత్యమువలె అగుపడేట్లు చేస్తాడుకదా! అదేవిధంగా అనాదియగు మాయ కూడా నామరూపములను కనుగొనజాలునట్టి జీవభావమును చిదాకాశము నందే (లేక చిత్తాకాశమునందు) స్ఫురింపజేయుచున్నది. 'అహం' అను జ్ఞానం ఉన్నంత మాత్రంచేతనే ఆ 'అహం' అనబడుదానియొక్క ‘ఉనికి’ ప్రభావంచేత పరమార్థ స్వరూపము నందు జగత్తు యొక్క శబ్ద-అర్థములు ప్రాప్తిస్తున్నాయి. అనుభవ మౌతున్నాయి. 'అహం' అనుదాని యొక్క స్వరూపము వాస్తవమునకు అమృతమయమగు చిదాకాశమే అయివున్నది. 'అహం' అను "భావన మరియు ఉనికి” యొక్క ప్రభావం చేతనే, 'నీవు' అను జ్ఞానము కలుగుచున్నది. నీవు అను “శబ్దము- అర్థము” ఆరోపితమైనట్లు, బోధితమగుచున్నది.
“అహమ్ బ్రహ్మాం స్మి”, “తత్ త్వమ్” అను రెండు మహావాక్యములు అహమ్-త్వమ్ (నేను-నీవుల) అభేదమునే సిద్ధాంతీకరిస్తున్నాయి.
25. విదూరథుని సుదీర్ఘ జీవితం
మరల మనం కథలోకి ప్రవేశిస్తున్నాం. ఆకాశస్వరూపులగు లీలా, సరస్వతులిద్దరూ తమ తమ ఇచ్ఛలను అనుసరించే ఆ గృహంలో ప్రవేశించగలిగారు.
చిద్వస్తువు సర్వవ్యాపి కదా! “యథార్థజ్ఞానము”, “సత్యకామ”, “సత్యసంకల్పము”, ఈ మూడు కూడా చిద్వస్తువు యొక్క ధ్యానము చేతనే కలుగుచున్నాయి. సర్వగామి, అప్రతిహతము, సూక్ష్మము
Page:303
అగు చిద్వస్తువును ఎవరు ఎట్లు అడ్డగించగలరు చెప్పు?
ఆ యువతులిద్దరు రాజాంతఃపురంలో ప్రవేశించటంచే అక్కడ ఇద్దరు పూర్ణచంద్రులు ఉదయించినట్లైనది. ఆ చోట సుగంధపూరితమైన పిల్లగాలులు వీచాయి. ఆ సమయంలో ఆ గృహంలో ఒక రాజు తప్ప అంతా యుద్ధరంగమున అలసి ఉండుటచే గాఢనిద్రా పరవశులై ఉన్నారు.
రాజు ఎందుకో పాన్ముపై నుండే కనులు తెరచి చూచాడు. ఎదురుగా రెండు సింహాసనములపై అధిష్ఠితులైయున్న అప్సరసల వంటి వారిద్దరినీ చూచి తటాలున లేచాడు. ప్రక్కనే ఉన్న సువర్ణపాత్రలో నుండి దోసిలి నిండుగా పూలు తీసుకొని వారి పాదములపై ఉంచాడు. ఎదురుగా పద్మాసనాసీనుడై కూర్చుని ఇట్లు పలుకరించసాగాడు.
విదూరథుడు : ఓ దేవతాస్త్రీలారా! మీ ఇద్దరికీ మరల మరల నమస్కారం. మిమ్ములను చూడగానే ఈ “జన్మములు పొందియుండటం” ... అను రూపముగల దాహ దోషములన్నీ తొలగిపోతున్నాయి. బాహ్యాభ్యంతర తమస్సు అంతా పటాపంచలై పోతోంది. మీకు జయమగుగాక!
ఆ ఇద్దరు పద్ముని వాత్సల్యంగా పలకరించారు. ఇంతలో సత్యసంకల్పురాలగు సరస్వతీ దేవి యందు “ఈ నా భక్తురాలు లీలకు తన భర్తకు సంబంధించిన ఇక్కడి సమాచారం తెలియజేసెదను గాక” అను సంకల్పం ఉదయించింది. ఆమె ఇచ్ఛను అనుసరించి ఆ ప్రక్కనే నిదురిస్తున్న మహామంత్రి నిదురలేచాడు. ఆ అప్సరసలిద్దరికి పుష్పాంజలి సమర్పించాడు. రాజు ప్రక్కన వినమ్రతతో ఆశీనుడై కూర్చునియున్నాడు.
శ్రీ సరస్వతీదేవి : ఓ రాజా! నీవెవడవు? ఎవరి పుత్రుడవు? ఎట్లు జన్మించావు? ఇక్కడికి ఎట్లా వచ్చావు? నీ వృత్తాంతమేమిటో సమూలంగా వినగోరుచున్నాము. మీ మహామంత్రి మాకు
వివరించుగాక!
మహామంత్రి : ఓ దేవతలారా! మీకు శుభమగుగాక! మీరు కోరినట్లు మా ఈ ప్రభువు యొక్క వృత్తాంతము నేను చెపుతాను, వినండి.
ఇక్ష్వాకువంశీయుడైన 'కుందరథుడు' అను నాతడు లోకప్రసిద్ధుడైయున్నాడు. ఆయన వంశపరంపరలోని 'నభోరథుడు' అను మా పూర్వరాజు కుమారుడే ఈ మా మహారాజగు 'విదూరథుడు’. ఇతడు తన స్నేహాది సుగుణములచే మా అందరిని సంతోషపెట్టుచూ, మమ్ము పాలించుచున్నాడు. ఇతని తల్లి - తండ్రులగు 'నబోరథుడు - మిత్ర"లు ఇతనికి పదవఏటనే రాజ్యాభిషేకం చేసి తాము ‘వానప్రస్థం’ జేరారు. అప్పటి నుండి ఈతడు యేబది ఏండ్లుగా ధర్మానుసారం రాజ్యపాలన చేస్తున్నాడు. నేడు మీ రాకచే మా పుణ్యం ఫలించింది. ఎంతో తపస్సు చేసినప్పుడు మాత్రమే
వానప్రస్థం : పూర్వం రాజులు వృద్ధాప్యంలో రాజ్యం యువరాజులకు అప్పచెప్పి, నిర్జన ప్రదేశంలో (లేక) అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తపోధ్యానాదులతో శేష జీవితం గడిపివేసేవారు. అదే 'వానప్రస్థాశ్రమం'.
Page:304
మీ వంటి దేవతల దర్శనం లభిస్తుంది. మీ దర్శనముచే ఈ రాజ్యసేవకునిగా నేను, మహారాజుగా, ఈ మా విదూరథుడు కూడా ధన్యులమైనాం.
అప్పుడు సరస్వతీదేవి సింహాసనం దిగింది. ఆరాధనాపూర్వకంగా తనవైపే చూస్తున్న ‘విదూరథమహారాజు’ను సమీపించింది. భక్తులపాలిటి అమృతహస్తమయిన ఆమె అభయ హస్తముతో అతని మస్తకమును స్పృశిస్తూ “నాయనా! వివేకబలంచేత పూర్వజన్మను స్మరించు" అని లాలనగా పలికినది. నాగస్వరం విన్న సర్పమువలె జగన్మాత పలికిన పలుకులకు రాజు అర్ధనిమీలితనేత్రుడు అయ్యాడు. అంతే. అతని హృదయంలోని తమస్సు అంతా తొలగిపోయింది. హృదయం వికసించింది. ఒక్క క్షణంలో తన పూర్వ వృత్తాంతమంతా గ్రహించగలిగాడు.
తాను ‘పద్ముడు' అనే రాజై ఉండటం
- 'లీల' తన ధర్మపత్ని. ఆమెకుగల అత్యంత త్యాగపూర్వకమైన అనురాగం ....
- కాలక్రమంగా తాను దేహమును, రాజ్యమును పరిత్యజించటం ...
సరస్వతీదేవి వృత్తాంతము. లీలాదేవి విలాసము?
అంతా సవివరంగా గ్రహించాడు. సముద్రముపై తేలియాడుచున్న వానివలె అయ్యాడు. "ఆహాఁ! ఎంత ఆశ్చర్యం! నేటికి ఇప్పుడు ఈ సరస్వతీదేవి కరుణ వలన సంసార మాయ అంతా గ్రహించాను. ఇదంతా ఎంత చిత్రమైనది!”
26. జగత్తు యొక్క నిజరూపం
విదూరథుడు : ఓ దేవతలారా! నేను 'పద్ముడు'గా మరణించి మూడు రోజులు మాత్రమే అయినది కదా! మరి ఇక్కడ నాకు అరువది ఏండ్ల అనుభవం గడచిపోయింది సుమా! పైగా, ఈ అరువది ఏండ్లుగా నా తాతలు, తండ్రులు, పుత్రులు, సేవకులు, మిత్రులు, బంధువులు నా స్మరణలో ఉండియే ఉన్నారు. ఓ జ్ఞప్తిదేవతా! ఇదంతా ఏమిటమ్మా? నాకసలు ఏమీ అర్థమగుటలేదు. విషయమంతా నాకు వివరించి చెప్పమని నిన్ను ప్రార్థిస్తున్నాను.
శ్రీ సరస్వతీదేవి : నాయన! 'వసిష్ఠుడు' అను బ్రాహ్మణుడిగా పిలువబడుచున్న శరీరము శిథిలం కావటం జరిగినది. ‘మృత్యువు' అను మూర్ఛను పొందిన తరువాత అంతకు ముందు అధిష్ఠించియున్న దృశ్య వ్యవహారము నీ దృష్టి పథము నుండి తొలగిపోయింది. ఆపై 'పద్ముడు' అని పిలువబడిన ఉపాధిని నీవు ఆశ్రయించావు. గిరి గ్రామంలోని విప్రగృహాకాశమే గొప్ప రాజ్యంగా నీ హృదయంలో ప్రతిబింబించింది. ఇక్కడ ఇప్పుడు నీకు కనబడుచున్నవి కూడా ఆ గృహమండపములోనే ఉన్నాయి. పద్ముడుగా నీవు నన్ను ఉపాసిస్తూ ఉండేవాడవు. పద్ముడుగా గృహములు, రాజ్యములు చూచావు కదా! ఆ అంతఃపురాకాశంలోనే మరణానంతరం ఈ వర్తమాన బ్రహ్మాండమును చూచుచున్నావు.
Page:305
వసిష్ఠ బ్రాహ్మణుని - ఈ విదూరథునికి - పద్ముని సంబంధించిన దృశ్యానుభవములన్నీ ప్రాప్తిస్తున్నది ఎక్కడా బాహ్యమునందు కాదు సుమా! నిర్మలాకాశంకంటే కూడా నిర్మలమైన నీ చిదాకాశమునందే నీ 'ఇచ్చ'ను అనుసరించి ఇవన్నీ ఇట్లు ప్రాప్తిస్తున్నాయి.
“నా పేరు ఇది. ఇది నా జన్మ. నేనీ వంశమున జన్మించాను. వీరు నా తల్లిదండ్రులు. నా తండ్రి నా పదేళ్ళ వయసులో నాకు రాజ్యము ఇచ్చి తాను పరివ్రాజకుడయ్యాడు. నేను శత్రువులను జయించి, మంత్రులతో విశాల సామ్రాజ్యమును, ప్రజలను పరిపాలిస్తున్నాను. యజ్ఞక్రియా సహితుడనై ప్రజలకు అనుకూలమైన విధంగా రాజ్యపాలన సాగిస్తున్నాను. నాకు అరువది (60) ఏండ్లు గడచిపోయాయి. ఇప్పుడు శత్రురాజులు మాపై దండెత్తివచ్చారు. దారుణయుద్ధం జరుగుతోంది. నా కళ్ళు తెరవగానే సింహాసనా రూఢులైన ఇద్దరు దేవతా స్త్రీలను చూచాను. వీరిని పూజించాను. పూజిస్తే వారు నా కోర్కెలు తీర్చగలరు. ఈ దేవి నా పూర్వస్మృతిని వికసింపజేసింది. నేనిప్పుడు కృతకృత్యుడనయ్యాను. నా సంశయములన్నీ తొలగిపోతున్నాయి. ఇప్పుడు నాకెట్టి దుఃఖములు లేవు. ఏక రసరూపమగు సుఖమున మగ్నుడనయ్యాను.”.... ఇట్టివేయగు అనేక భ్రాంతులు అద్దమునందు ప్రతిబింబములవలె నీ శుద్ధ చిత్స్వరూపము నందు ప్రతిబింబిస్తున్నాయి.
అయితే నీవు ఇతఃపూర్వం మరణించినప్పుడే ఇట్టి జ్ఞానపరంపరావ్యవహారం హృదయంలో ఉదయించివున్నది. నీరు ఒకచోటి నుండి మరొకచోటికి ప్రవహిస్తూ ఒక సుడిగుండం నుండి
మరొక సుడిగుండమును ఆశ్రయిస్తూ పోతుంది చూచావా? నీయొక్క ప్రజ్ఞాప్రవాహం కూడా అట్లే ఒక దృశ్యమును వదలి ఇంతలోనే మరొక దృశ్యమును ఆశ్రయించి ప్రతిభాసింపజేయుచున్నది. ఒకానొక సుడిగుండం ఇంకొక దానితో కలసి ప్రవర్తించటం ఎట్లా జరుగుతూ ఉంటుందో, ఈ సృష్టి-విభవము కూడా 'మిశ్రమ-అమిశ్రమ' భావములతో పెంపొందించబడుచున్నది. చిత్రమేమిటంటే, నీ మరణసమయంలో 'చిత్' స్వరూపము నందు ప్రతిభాసితమగుచుండే ఈ జగత్తులన్నీ అసత్స్వరూపములే సుమా! స్వప్నంలో ఒక్క 'నిమిషం' కాలంలో అనేక సంవత్సరాలుగా విస్తరిల్లునట్టి అనుభవము భ్రమవలన కలుగటం జరుగుతోంది. ఊహయందు ఊహచే నిర్మించబడే గంధర్వనగరంలోని సౌధాలకు కూడా గోడలు, పునాదులు అగపడుతాయి. సంకల్ప నగరంలో శత్రువుల జననమరణాలు ఆ సంకల్పములోనే సంకల్పద్రష్టకు కనిపిస్తూ ఉంటాయి కదా! నావ నీటిలో కదులుచూ ఉండగా, ఆ నావలో ఉన్న జనులకు ఒడ్డున ఉన్న చెట్లు కదులుచున్నట్లు తోచదా? స్వప్నంలో, “నేను చచ్చినానట. అప్పుడు నా చుట్టూచేరి నా బంధువులు ఏడ్చుచున్నారు” అని ఒకానొకడు గాంచటం లేదా? హాస్యరసపూర్వకమైన విషయమేమంటే, స్వప్నద్రష్టయే మరణిస్తే, ఆ స్వప్నములోని బంధువులు ఎవరు? ఎక్కడ ఉన్నారు? ధాతువులు ప్రకోపించినప్పుడు పర్వతములు నృత్యమాడుచున్నట్లు కనబడుతుందికదా! ఈ వర్తమానపు - ఇతఃపూర్వపు - ఇక ముందటి జన్మకర్మల వ్యవహారము అట్టిదే. ఇది ఎంత ప్రౌఢంగా ఘనీభూతమై కనిపిస్తున్నప్పటికీ ఈ దృశ్యజగత్తు భ్రాంతిమాత్రమై, మిథ్య అయి ప్రాప్తిస్తోంది.
Page:306
పుత్రా! విదూరథా! వాస్తవానికి నీవు జన్మించటం లేదు. మరణించటం లేదు. నీవు ఉన్నది మరెక్కడో కాదు. సర్వదా శుద్ధవిజ్ఞాన స్వరూపము, శాంతము అయినట్టి పరమాత్మయందే వెలయుచున్నావు. అట్టి నీ స్వస్వరూపమునకు సంబంధించిన వాస్తవ జ్ఞానం నీయందు విచారణ ప్రభావంచే వికసించవచ్చు. లేదా, నీయందు ‘విచారణ' అను వెలుగు తగినంత ప్రభవించకపోవటం చేత, 'దృశ్య తాదాత్మ్యము' అనునది ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుటచే, నీవు ఇట్లే అనేక శరీరములందు సంచరిస్తూపోవచ్చు. ఏది, ఏమైతేనేం? నీ వాస్తవస్వరూపము శుద్ధ- విజ్ఞాన సత్తయే! అట్టి నీ శుద్ధ స్వస్వరూపమునకు కలుగగల బంధముగాని, అవాంతరముగాని లేనేలేదు. ప్రతి ఒక్క తరంగము జలముయొక్క రూపమే అయినట్లు, ప్రతిజీవుని యొక్క వాస్తవ స్వరూపము పరబ్రహ్మమే అయివున్నది.
ఏ దృశ్యజగత్తెతే ఇప్పుడు ఘనీభూతమై ఎదురుగా ఉండి ఉంటోందో .... అట్టి ఈ దృశ్య సర్వసంకల్ప రాహిత్యముచే “నిర్వికల్ప సమాధి” అను “అంతరంగమౌనస్థితి” యందు లేకయే పోవుచున్నది. అయితే, ఆ సమయంలో కూడా "స్వస్వరూపసత్త (లేక) “ఉనికి” ఉండియే ఉన్నది. ఆ ఉనికి 'జాగ్రత్'ను స్వీకరించడానికి అనుక్షణం సిద్ధంగానే ఉన్నది కదా!
కాబట్టి, ఓ లీలాపతీ! నీవు సర్వాత్మకుడవేగాని, వాస్తవానికి ఒకానొక స్వల్ప ఉపాధి మాత్రుడవు కాదు. ఇందులో సందేహం లేదు. నీవు నీయందే దృశ్య-అదృశ్యములనబడు ఉభయ సమయము లందు సర్వదా ప్రకాశించుచున్నావు. “భూపీటము, సూర్యప్రకాశము, 'గిరి' మొదలైన గ్రామాదులు, నీవు నేను” ఇవన్నీ మిథ్యయే అయివున్నాయి. వసిష్ఠవిప్రుని గృహాకాశమండపమే లీలాదేవి-పద్ముల విస్తార రాజ్యమునకు స్థానభూతమైనది. ఆ ఇద్దరి అంతఃపురాకాశ మండపంలోనే ఈ విదూరథ రాజ్యమంతా ఉండివున్నది. అయితే ' మండపాకాశము,' 'ఈ నీవు చూస్తున్న రాజ్యము' కూడా నిర్మలమగు బ్రహ్మమే అయివున్నాయి. అట్టి బ్రహ్మమునందు భూమి, పట్టణములు, అరణ్యములు, పర్వతములు, నదులు మొదలైనవి లేవు. ఈ జనుల పరిభ్రమణము, పరస్పర దర్శనము కూడా మిథ్యయే. “అంతయు చిన్మాత్రముచే పూర్ణమైయున్నది” అని గ్రహించు!
విదూరథుడు : సర్వజ్ఞప్తులకు మూలకారణమైన ఓ జ్ఞప్తిదేవీ! అయితే, ఈ నా అనుచరులంతా ఎవరు? వీరంతా కూడా ఆత్మయందే జన్మించి, ఆత్మయందే వెలయుచున్నారా? లేక, వారి ఉనికికి ఆధారం ఇంకేదైనా వస్తువు ఉన్నదా? స్వప్నంలో చూడబడే నామరూపాలవలె, వీరంతా ఉండి ఉన్నట్లు నాకు అనుభవమవటం మిథ్యానుభవమేనంటావా? వీరందరు ఆత్మయందు సత్స్వరూపులై వెలయుచున్నారా? లేదా? లేక 'ఆత్మ' అనబడునది కూడా మిథ్యయేనా? నీ వాక్యములచే కొంత విషయం చూచాయగా అర్థమౌతున్నప్పటికీ, కొంత అయోమయమే ఏర్పడుచున్నది. నన్ను సందేహాలు ఇంకా పట్టుకొనే ఉన్నాయి.
శ్రీ సరస్వతీదేవి : ఓ విదూరథా! ఆత్మస్వరూపము 'విదిత-వేద్యము' (తెలుసుకొనబడు చున్నది - తెలుసుకొనుచున్నది), శుద్ధస్వరూపము కూడా అయివున్నది. చిదాకాశ స్వరూపమగు “ఆత్మ-తత్త్వము” నందు ఆత్మ కాకుండా వేరుగా సద్రూపమంటూ ఏదీ లేదు. శుద్ధబోధ స్వరూపమగు దానియందు
Page:307
జగమ ఉండి ఉండటమేమిటి? ఆ భ్రమ వాస్తవమైన రూపము పొందటం ఏమిటి? చీకట్లో చూడబడిన త్రాడు విషయంలో “అది పాము కాదు, త్రాడు మాత్రమే" అను సత్యజ్ఞానము ఉదయించిన తరువాత ఇక వికారములకు చోటెక్కడ? "అసత్మ” యొక్క స్వరూపమేమిటో గ్రహించిన తరువాత ఇక జగత్య్రాంతికి చోటు ఉండదు. 'ఎండమావులు' అనగా ఏమిటో గ్రహించే వారికి వాటియందు జలభ్రాంతి శేషించి ఎందుకు ఉంటుంది? స్వప్నము నుండి తేరుకున్న తరువాత స్వప్నములోని సంఘటనలకు అస్థిత్వమెక్కడ?
వత్సా! ‘అజ్ఞానము' అనే మేఘం తొలగితే “స్వస్వరూపాకాశము” స్వచ్ఛమై, పూర్వమైన దానికంతటికి పూర్వమై, ఏకరసస్వరూపమై ప్రకటితమౌతోంది. అట్టి స్వస్వరూపానుభవము” నందు ... “నేను, నీవు, జగత్తు” మొదలైన కుత్సిత శబ్దములకు అర్థమేమిటో కూడా బోధపడదు. వాస్తవానికి ఈ నేను నీవు-జగత్తు అనబడునదంతా వాచారంభము మాత్రమే. నీవు-నీ అనుచరులు పరమాత్మానందస్వరూపులే!
(ఐదవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:308
ఆరవ రోజు
27. స్వపజాగ్రత్తులు
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఇక మనం ఆరో రోజు విచారణ ప్రారంభిస్తున్నాము.
మూఢుడు, అప్రబోధితుడు, ఉత్తమబుద్ధిలేనివాడు .... అగువానికి ఈ అసత్అగత్తు వజ్రతుల్యమై సత్యమువలె అగుపడుచున్నది. అజ్ఞాని, అమాయకుడు అయిన బాలుడు చీకట్లో ఒక మోడుబారిన చెట్టును చూచి "ఇది బేతాళుడే” అని భావించి దుఃఖమును పొందుతాడు చూచావా? అసత్ ఆకారము కలిగియున్నట్టి ఈ జగత్తు కూడా తత్త్వజ్ఞాన ప్రయత్నము లేనట్టి మూర్ఖజనులకు అనేక దుఃఖపరంపరలను కలుగజేయ గలుగుచున్నది. సూర్యకిరణములు ఎడారిలో జంతువులకు నీటియొక్క భ్రమ కలుగజేయుచున్నట్లు, మూఢునకు ఇదంతా సత్యమువలెనే గోచరిస్తోంది, ప్రాప్తిస్తోంది. స్వప్నంలో ఒకానొకడు “నేను మరణించాను” అనే అనుభవం పొందటం లేదా? మూడునకు, మూర్ఖత్వము వహించినవానికి ఈ 'జగత్తు' అను దృశ్యము నుండి ప్రాప్తించని కష్టమంటూ ఏదీ
ఉండదు.
అజ్ఞునకు ఆభరణమే కనబడుతుంది గాని, ఆ ఆభరణములో బంగారము కనిపించదు కదా! బంగారము చూచు కంసాలికి అనేక ఆభరణములలో ఏకత్వమే అనుభవం కాగలదు. “మహాశయ త్వము” లేని వానికి ఈ జగత్తు నందు పరమవస్తువు కనబడకుండా, “నీవు-నేను-పురము-నగరము”
వంటి భ్రమాత్మకమగు విషయములు మాత్రమే గోచరిస్తున్నాయి. ఒకానొక చక్షురోగికి ఆకాశంలో పుష్పాలు, కేశములు, పింఛాలు మొదలైన అసత్యవస్తువులు అగుపిస్తూ ఉంటాయి కదా! అట్లే పరమార్థ దృష్టిహీనునకు ఈ జగత్తు కనిపిస్తోంది. కనుక, రాఘవా! 'అహంకారము' మొదలైన భావములతో కూడుకొనియున్న ఈ జగత్తు ఒక దీర్ఘస్వప్నమువంటిది మాత్రమేనని గ్రహించెదవుగాక! శ్రీరాముడు : 'విదూరథుడు' తనకంటే వేరుగా తాను చూస్తున్న సృష్టిలో కనిపిస్తున్నవారి గురించి సరస్వతీదేవిని అడిగినాడు కదా! స్వప్నసదృశులగు ఆ పురుషులు ఎంతవరకు సత్యమో మరికొంత
వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : శుద్ధ స్వరూమైనట్టి పరమాత్మ మనోబుద్ధులచే ప్రకటింపబడజాలని వాడు. అందుచేత అతనిని ‘అచేత్యుడు' అని చెప్పుచున్నారు. అతడు చిన్మాత్ర స్వరూపుడు, శాంతుడు, నిరతిశయుడు. అతడే సత్యము. నీయొక్క నాయొక్క సర్వుల యొక్క వాస్తవ స్వరూపము అతడే. సర్వగతుడు, సర్వశక్తియుతుడు, సర్వాత్మకుడు అయి వుండి కూడా ఖండునివలె భ్రమాత్మకమైన
చేత్యము = తెలియబడునది.
Page:309
దృష్టికి కానవచ్చుచున్నాడు. అతడు స్వమాయ వలన అర్థక్రియాదులకు అనుకూలమై ఉదయించ సంకల్పించినప్పుడు, తదనుసారమే ఈ క్రియలన్నీ ఏర్పడుచున్నాయి. ఇక్కడ మనం స్వప్నమునే దృష్టాంతంగా తీసుకుందాం. స్వప్నములో చూడబడే నగరంలోని నగరవాసులందరు ఆ స్వప్న సమయంలో సత్యముగానే తోచుచున్నారు కదా! వారిని కల్పించినది ఎవరు? స్వప్నద్రష్టయే కదా! ద్రష్టయొక్క స్వరూపచైతన్యమే స్వప్నాకాశమధ్యమున ఉన్నది. ఆ చైతన్యము స్వపద్రష్టయొక్క వాసనలను అనుసరించి, తనకు ఆధారమైనట్టి ‘చిత్తము’తో కలిసి ప్రకాశత్వం పొందుతోంది. ఫలితంగా, ఆ ద్రష్టకు "నేను మానవుడను .... వీరు నా వాళ్ళు . వారు వేరైనారు” ఇత్యాది రూపములు గల బోధ కలుగుతోంది. అయితే చైతన్య శక్తియొక్క ప్రభావం చేతనే “నేను నరుడను. నేను ఇట్టివాడను” అనునట్టి ‘బోధ’ (Sense of deep understanding) కలుగుచున్నది. అట్టి భావన యొక్క పటిమ చేతనే స్వప్న - జాగ్రత్ జగత్తులు సత్యములైనట్లు అనుభవమగుచున్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! మాయామాత్ర శరీరుడగు “స్వప్నద్రష్ట” (లేక స్వప్న స్వరూపుడు), అతనిచే గాంచబడు స్వప్నదృశ్యము .... ఈ రెండూ కూడా మిథ్యయేనని నేను ఒప్పుకుంటాను. కాని, ఈ 'జాగ్రత్'లో కనబడే జగద్వ్యవహారం 'మిథ్య' అని అనటం ఎట్లా? ఈ 'నీవు-నేను' మొదలైనవన్నీ ఘనీభూతమై మాకు సుస్పష్టంగా అనుభవమగుచుండగా, “ఇదంతా అసత్యము” అని భావించియుండుట ఎట్లు? మీరు “ఇవన్నీ అవాస్తవములే” అని చెప్పుచున్నప్పటికీ మాకు మాత్రం ఈ విషయమై పూర్ణమగు విశ్వాసము కలుగుచుండటంలేదనే చెప్పాలి.
శ్రీ వసిష్ఠమహర్షి : "స్వప్నము నందు .... ఆ స్వప్నములోని వ్యక్తులు, వస్తువులు ఆ స్వప్న సమయంలో వాస్తవమనే అనిపిస్తున్నాయి” .... అని చెప్పటానికి ప్రమాణం ఏమిటి? ప్రత్యక్షానుభవం తప్ప వేరే ప్రమాణం లేదుకదా! ఈ జాగ్రత్ విషయంలో కూడా ప్రత్యక్షానుభవమే ప్రమాణం. “ఇది ఇప్పుడు సత్యము” అని ఈ దృశ్యము విషయంలో భావించబడునదంతా ... ఆయా వ్యక్తులపట్ల, సంఘటనల పట్ల, పదార్థ జాలముపట్ల ఏర్పడియున్న అభిప్రాయ సమూహముల సారమే కదా! (It is all the essence or "culmination of opinions" on persons, incidents and matters). కాని అవన్నీ క్షణక్షణం మార్పు చెందుచూనే ఉన్నాయి. పైగా వాటి మూలము కల్పనయే. కల్పననుసరించే ఈ జాగ్రత్ వ్యవహారమంతా ప్రాప్తించుట జరుగుతోంది. “అనుభవ పరంపరలు” ఏర్పడుచుండగా, మరొక దృష్టిచే .... “ఇదంతా స్వప్నమువలె అసత్యము” .. అనటం మా అనుభవం ప్రకారం సమంజసమే అయివున్నది.
❖
సృష్టి ప్రారంభమునకు ముందు ఉన్నట్టిదేది? సృష్టిరహితమగు శుద్ధచైతన్యము కదా! అట్టి “నిర్మల-అఖండ-అద్వితీయ చైతన్యము నుండి సమష్టి-సృష్టి స్వరూపముగా స్వయంభువు (Self creator) లేక సమష్టి మనస్సు స్వప్నతుల్యుడై, అనుభవాత్మకుడై ప్రకాశించుచున్నాడు. అట్టి 'స్వయంభువు'
= సర్వము గ్రహించునట్టి శుద్ధతత్త్వము;
Page:310
యొక్క సంకల్పరూపమున జనించిన ఈ జగత్తు కూడా స్వప్నతుల్యమే! “సమష్టి జీవుడు, - అతనిచే రచించబడిన ఈ విశ్వము - స్వప్నతుల్యములే” అని ఉత్తమ పరిశీలకులగు వేదాంత శాస్త్రకారులు సిద్ధాంతీకరించుచున్నారు.
అయితే ఇక్కడ “నేను-నీకు, నీవు-నాకు” సత్యమైనవారుగా ప్రాప్తిస్తున్నట్లు, జగత్తులో ఒకరు మరొకరికి సత్యమువలె ప్రాప్తిస్తున్నారు. "స్వప్నంలో కనబడే నగరవాసులు సత్యము కాదు” అని అనుకొందాము? మరి అట్టివారే అయినట్టి ఈ జాగ్రత్ జగత్తులో అనుభవమయ్యే 'నీవు-నేను’ మొదలైనవి సత్యముకానివిగానే అయివుండాలి సుమా!
నావద్ద నీవు సత్యాత్ముడవై ప్రాప్తిస్తున్నట్లే, తదితరములు కూడా 'సత్యాత్మ' అయి ప్రాప్తిస్తున్నాయి. కనుక “ఇక్కడ భ్రమ ఏది? సత్యమేది?" అనునది విభాగించబడినప్పుడు కానీ ఈ జాగ్రత్ యొక్క వాస్తవస్వభావం మనకు అవగతం కాదు. "స్వప్నములో సంసారము సిద్ధించుచున్నది” అనగా, “అప్పటికి అదంతా సత్యమువలెనే ప్రాప్తిస్తున్నది” అనే అర్థం. అందుకు ఈ వర్తమానంలో సత్యమై ప్రాప్తిస్తున్న 'నీవు-నేను' అనునవే దృష్టాంతము (లేక ప్రమాణం).
ఈ విశాలమగు స్వప్నసంసారమున నేను నీకు సత్యమైనట్లు, నీవు కూడా నాకు సత్యమగు చున్నావు. అనగా నీవు నీ స్వప్నమున నన్ను గురువుగా, బోధకుడుగా పొందుచున్నట్లే, నేను నా స్వప్నమునందు నిన్ను దశరథమహారాజు కుమారునిగా, నా ప్రియ శిష్యునిగా, నాకిష్టునిగా నిన్ను గాంచుచున్నాను. వాస్తవానికి శుద్ధ-వ్యాపక - అద్వితీయ చైతన్యము అఖండమై, నీ-నా స్వరూపాలుగా వెలయుచున్నది. దానికి వేరుగా కనబడేదంతా స్వప్నమాత్రమే! "ఇది స్వప్నమాత్రము” అను విషయం సత్యదృష్టి దృఢతరమగుచుండగా స్వయంగా అవగతం కాగలదు.
శ్రీరాముడు : మహర్షీ ! ఈ జాగ్రత్లోని 'నీవు-నేను' మొదలైనవి అధిష్ఠానమగు చైతన్యదృష్టిచే సద్రూపములేకదా! స్వప్నము కూడా ఇట్టిదేకదా! స్వప్నద్రష్ట మేల్కొనిన తరువాత స్వప్నములో చూడబడిన నగరాదులు అట్లే ఉంటాయా? లేక స్వప్న ద్రష్ట మేల్కాంచగానే అవన్నీ తొలగిపోతాయా? శ్రీ వసిష్ఠమహర్షి : ద్రష్ట ఎక్కడుంటే అక్కడ ద్రష్టను అనుసరించే జాగ్రత్ ని, స్వప్నము గాని ఉంటుంది. ‘జాగ్రత్’గా దేనినైతే నీవు గ్రహిస్తున్నావో అదంతా నీవు ఆ విధంగా సంకల్పించుట
చేతనే అట్లు లభించుచున్నదని గ్రహించు. చైతన్యము తనను తాను ఇంద్రియానుభవమాత్రంగా ఖండితముగా దర్శించుచున్నప్పుడు అనగా తనను తాను పరిమితమైనదానిగా దర్శించునప్పుడు
ఆ సమయంలో ఇంద్రియానుభవములపట్ల ఏర్పడియున్న ఘనీభూతమైన భావనయే 'జగత్తు’ అని చెప్పబడుచున్నది. స్వప్న దేశకాలాదులు ... జాగ్రత్ దేశకాలాదులు .... ఇవన్నీ “ఇవి ఇట్లు” అని భావించు దృష్టిలోనే ఏర్పడి ఉంటున్నాయి సుమా!
మరొక చమత్కారమేమంటే, అనేకులు ఒక విషయమును ఒకే తీరుగా దర్శించుచు స్వప్నము పొందుచుండటం జరుగుతోంది.
Page:311
ఒకానొక స్వప్నద్రష్ట యొక్క స్వప్నములోని వ్యష్టిచైతన్యము, ఆ స్వప్నం త్యజించబడిన తరువాత కూడా, ఉనికిని పొందియుండటం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మనం ముందు-ముందు చర్చించబోతున్నాం. 'మాయ'లో సాధ్యము కానిదేది? ఇవన్నీ స్వతహాగా సత్యములు కాకపోయి నప్పటికీ సత్యముల వలెనే వెలయుచున్నాయి. స్వప్నంలోని 'స్త్రీ సంగమము'వలె మోహమును వెలయుచున్నట్లు తోచుచున్నప్పటికీ చైతన్యము దేశకాలాది సంకల్పములను అంగీకరించుట చేతనే ఈ మాయాజాలమంతా ప్రాప్తిస్తోంది. మరల జ్ఞానభావన వికసించటంచే సర్వత్రా అకృత్రిమమగు సమరసభావన వెల్లివిరుస్తోంది. చిదాకాశమే తనయందు 'జగత్తు' యొక్క స్వప్నము కలిగియుండి, ఆ స్వప్నములోని “నీవు-నేను” .... అనబడు పదార్థజాలమంతా తానే అయి, ప్రకటన-అప్రకటనలను నిర్వర్తించుచున్నది. ఇది మాత్రమే ఇక్కడ ఉన్న విశేషం, సన్నివేశం కూడా!
28. యుద్ధరంగ ప్రవేశం
ఆ విధంగా జ్ఞప్తిదేవి కరుణచే విదూరథుని హృదయం జ్ఞానామృతంతో నిండిపోయింది. వివేకము అంకురించింది.
శ్రీ సరస్వతీదేవి : ఓ రాజా! అంతా గ్రహించావు కదా! ఈ లీలకు జ్ఞానబోధ చేయు నిమిత్తమే ఇక్కడకు తీసుకువచ్చాను. ఈమె ఇప్పుడు దృష్టాంతపూర్వకంగా “ఈ బ్రహ్మాండకల్పన అంతా మిథ్య మాత్రమే” అని గ్రహించినది. మేము వచ్చినపని పూర్తి అయినది. నీకు శుభమగుగాక! ఇక మేము సెలవు తీసుకుంటాము.
విదూరథుడు : అమ్మా! జ్ఞప్తిమాతా! మానవులలో ఉత్తములైనవారి దర్శనభాగ్యమే వ్యర్థముకాక, శుభము ప్రాప్తింపజేస్తుంది కదా! ఇక కరుణాసముద్ర స్వరూపిణివగు నీ దర్శనము వృథా అవుతుందా? లేదు. నీ ఆజ్ఞ ప్రకారమే సర్వము జరుగుతుంది. ఒకడు ఒక స్వప్నము నుండి మరొక స్వప్నమునకు వెళ్లునట్లు ... నేను ఈ దేహమును పరిత్యజించి నీ సంకల్పానుసారం పూర్వదేహమును గ్రహిస్తాను. నిన్ను దర్శించినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. నేను సర్వదా నీకు శరణాగతుడనే. నాదొక విన్నపం. ఉత్తములకు తమను ఆశ్రయించిన వారిని త్యజించటం తగదు కదా! అందుచేత, నేను వెళ్ళబోవుచోటికి నా ఈ మంత్రి, మహారాణి కూడా వచ్చేటట్లు అనుగ్రహించు.
శ్రీ సరస్వతీదేవి : అటులనే అగుగాక. ఈ రణరంగమున నీవు మరణించవలసి ఉన్నావు. మీరు ‘ఆతివాహికదేహం'చే పద్ముని నగరం చేరబోవుచున్నారు. అక్కడ జీవచ్ఛవమై, శరీరమాత్రమై పడివున్న నీ దేహము పొందుతావు. అక్కడ నీ మంత్రిని, మహారాణిని కూడా పొందుతావు. ఆపై యథాతథంగా రాజ్యం ఏలుతావు.
మేము ఎట్లు వచ్చామో అట్లే మరలగలము.
4
Page:312
ఆవిధంగా వారు సంభాషించుకొంటూ ఉండగా, ఇంతలో ఒక సైనికుడు అక్కడికి వచ్చాడు. "ప్రభూ! సముద్రము లాంటి శత్రుసైన్యము ఈ వైపునకు వస్తోంది. మన నగరము నాలుగు వైపుల నిప్పు అంటుకొని ‘ఛటఛట' ధ్వనులతో తగులబడిపోతోంది” అని చెప్పసాగాడు.
కోలాహలం మిన్నుముట్టింది. ఒక్కసారిగా పురజనుల గావుకేకలు, అగ్నిశిఖల 'ధగధగ' ధ్వనులు వినవచ్చాయి. ఆకాశమంతా పొగతో నిండిపోయింది. కర్కశ శబ్దఘోషలతో స్త్రీలు, బాలురు, తదితరులు రోదించసాగారు. ఆ అగ్ని ఎంతో రాజసంపదను బూడిద చేసింది. సజ్జనుల మనస్సులలో ఉపదేశములు దాగివుండునట్లు, కొందరు జనులు తగులబడుచున్న ఇళ్ళను వదలి ప్రశాంతమగు కొండగుహలలో సకుటుంబముగా పరుగులు తీసి దాగుకొనియున్నారు. మరికొందరు అగ్నికి ఆహుతి అయిన తమ బంధువుల కళేబరములను వదలి ఈవలకి రాలేకపోతున్నారు. ఆహాఁ! ఈ ప్రాణులను మమకార బంధములు ఎంతగా కట్టి పడేస్తాయి! సైనికులు కూడా "మమ్ములను రక్షించేవారెవరూ లేరా?” అని ఆ అగ్నిశిఖల మధ్యలోంచి ఆక్రందనం చేస్తున్నారు.
ఇంతలో రాజ పట్టమహిషి తన చెల్లికత్తెలతో రాజప్రసాదం ప్రవేశించి, రాజును సమీపించింది. చెలికత్తెలు, “ఓ రాజా! ఆయుధములు ధరించి శత్రుసైనికులు అంతఃపురంలో అకస్మాత్తుగా ప్రవేశిం చారు. మీ భార్యలనందరినీ బంధించి గొనిపోయారు. శాఖ-ప్రశాఖలుగా విస్తరిల్లుచున్న ఈ ఆపదల నుండి మమ్ము రక్షించేశక్తి మీకొక్కరికే ఉన్నది” అని రోదిస్తూ చెప్పుకోసాగారు. అప్పుడు రాజు లీలాసరస్వతుల వైపు చూచి, "ఓ దేవతలారా? నేను యుద్ధసన్నద్ధుడనై వెళ్ళుచున్నాను. నా శత్రురాజులు యుద్ధనీతిని అతిక్రమించి అంతఃపురంలో సైన్యప్రవేశమునకు ఉద్యుక్తులైనట్లున్నారు. ఇక విజయమో, వీరస్వర్గమో తేల్చుకోక తప్పదు. మిమ్ములను విడచి వెళ్ళుచున్నందుకు క్షమించండి. నా భార్యను రక్షించే భారం మీదే" అని పలికి వినమ్రతగా నమస్కరించాడు. ఆయుధ పాణియై భీకరంగా గర్జనచేస్తూ యుద్ధభూమివైపు తరలివెళ్ళాడు. అతని రాకకై వేచియున్న సైనికులు అతనిని అనుసరించారు.
లీలాదేవి యుద్ధభూమికి తరలివెళ్ళుచున్న విదూరథుని వైపు నుండి దృష్టిని మరల్చి రాజ పట్టమహిషి వైపు చూచింది. ఎంత ఆశ్చర్యం! ఆ పట్టమహిషి అచ్చు తనలాగానే .... తన ప్రతిబింబమా అన్నట్లున్నది.
29. చిత్తము ఎట్లా ఉంటే... దృశ్యము అట్లే!
లీలాదేవి : అమ్మా! జగన్మాతా! ఇది గమనించావా? ఈ మహారాణిని చూడు. పద్ముని రాజ్యంలో నేను ఏ రూపము కలిగి ఉన్నానో, ఈమె కూడా అచ్చు అదే రూపము కలిగి ఉన్నదేమిటి? దీనికేమైనా ప్రత్యేక కారణమున్నదా? ఇది కాకతాళీయమా? ఇక్కడి మంత్రులను, సామంతులను చూస్తుంటే “ఇదంతా పూర్వరాజ్యమే” అన్నట్లు తోచుచున్నది? అద్దంలో ప్రతిబింబించే దృశ్యంలాగా
Page:313
వీరు నా ‘వెలుపల లోపల’ కూడా ఉన్నట్లున్నారే? వీరంతా సచేతనులా? లేక కల్పిత రూపము
కలవారా?
శ్రీ సరస్వతీదేవి : హృదయంలో .... వ్యక్తులకు, వస్తువులకు సంబంధించిన జ్ఞానం- కలుగుచున్నది కదా! అదేవిధంగా క్షణకాలంలో అనుభూతులు కూడా కలుగుచూ ఉంటాయి. స్వప్న సమయంలో వస్తువులను, వ్యక్తులను, సంఘటనలను చూస్తున్న చిత్తమే.... ఆయా రూపములన్నీ స్వయముగా ధరించి వ్యవహరిస్తోంది. అంతేకాని స్వప్నంలో చిత్తమునకు వేరైనది, బాహ్యమైనది ఏ సమయమందు ఏదీ లేదు.
చితశక్తియే చిత్తముయొక్క ఆకారమును పొందుచున్నది. చిత్ చైతన్యము అను దర్పణమును అనుసరించే ఈ 'జగత్తు’ అను దృశ్యము అందు ప్రతిబింబిస్తోంది. చైతన్య దర్పణమును అనుసరించే దృశ్యముయొక్క అనుభవం ఉండి ఉంటోంది.
1. కుంభాకార (Concave Lense) దర్పణంలో పెద్ద దృశ్యము చిన్నగా కనబడుతోంది. 2. పుటాకార (Convex Lense) దర్పణంలో చిన్నవి పెద్దవిగా కనిపిస్తాయి.
సంస్కారము ఎట్టిదై ఉంటుందో ... చిత్తమున ప్రతిబింబించే జగత్తు కూడా అట్టిదే అవుతుంది.
వాస్తవానికి చిత్రచైతన్యము సర్వావస్థలందును (జాగ్రత్ - స్వప్న - - సుషుప్తులందును) మధ్యస్థమైయున్నది. కాని, అది ఎక్కడో బాహ్యమున ఉన్నట్లుగా తోచుచున్నది. స్వప్నంలో కనబడే వస్తువులే ఇందుకు మనకు దృష్టాంతము. స్వప్నపదార్థజాలమంతా అంతరముననే ('with-in' only) ఉన్నప్పటికీ ఎక్కడో బయటగా ఉన్నట్లు తోచుచున్నది కదా! ఓ లీలాదేవీ! కొంత సూక్ష్మబుద్ధితో
విను.
“జగత్తు” అనగా ఎక్కడో బాహ్యమున ఉన్నది కాదు. అంతఃపరికల్పితమైన దృశ్యావ గాహనయే (Internally or Inwandly visualised perception) బాహ్యజగత్తువలె ప్రాప్తిస్తోంది. కాబట్టి ఈ జగత్తు అనబడునది బాహ్యమున కాకుండా అంతరంగము నందే భావనారూపమున ఉండియున్నది.
అట్టి అంతఃపరికల్పితమైన ఈ జగత్తే ఎక్కడో బయట ఉన్నట్లు తోచుచున్నది.
లీలాదేవి : : అమ్మా! నీవు చెప్పేది అత్యంత చమత్కారంగా ఉన్నది సుమా! “ఈ మాచే చూడబడేదంతా వాస్తవానికి మేము మా అంతరముననే కల్పనా వ్యవహారముచే అట్లు గాంచుచున్నాము” అని నీవు ప్రతిపాదిస్తున్నట్లున్నావు. కాని మేము వాస్తవానికి ఇదంతా బాహ్యముననే ఉన్నట్లు పొందుచున్నామే? ఎందుచేత?
శ్రీ సరస్వతీదేవి : అట్లు తోచుటకు (లేక పొందుటకు) కారణమేమిటో చెపుతాను. విను.
“ద్రష్ట దృశ్యము” .. ఈ రెండూ చైతన్యమే కదా! కనుక “స్వస్వరూపము ఈ నేను -
నీవు - జగత్పదార్థములతో కూడిన జగత్తు” .... ఇదంతా వాస్తవానికి శుద్ధ చైతన్యమునకు వేరైనది కాదు. అయితే చైతన్యము సర్వవ్యాపకము కదా! అందుచేత “అంతరముననే తోచుచున్న మిథ్యాజగత్తు
Page:314
చిరకాలపు అభ్యాసం వలన, ఎట్టి ఆటంకము లేకుండా, బాహ్యమున సంస్థితమైన వ్యవహారమువలె తోచుచున్నది” అని గ్రహించు. "ఈ దృశ్యప్రపంచము ఇట్లు బయటగా ఇప్పటికిప్పుడే చూస్తున్నాను” అని ఈ జీవుడు అనేక జన్మల అభ్యాసవశంచేత దృఢంగా భావించుటచే అది అతనికి అట్లే ప్రాప్తించుచున్నది కాని, "ఇదంతా నా అంతరంగమే ఇట్లు గ్రాహ్య విషయముగా కల్పించి, దర్శించుచున్నది” .... అనునది గ్రహించలేకున్నాడు. తాను ఎచ్చటికైతే ప్రసరించడో అచ్చట అతనికి ఏ అనుభవం ఏర్పడియే ఉండదు. అయితే ఈ జీవుడే ఒకానొకప్పుడు గురువాక్యశ్రవణ ప్రభావం చేతనో, లేక, శాస్త్రబోధ గ్రహించటం చేతనో, లేక స్వవిమర్శచేతనో లేక ఈ
మూడిటి సమన్వయం చేతనో .... “ఈ చూడబడునదంతా నా అంతరంగమునందే చిత్తముచే సంస్కారరూపమున ఇట్లు అనుభవమగుచున్నది” అని గ్రహిస్తున్నాడు. అట్టి అవగాహన సుస్థిరపడగా అభ్యాసవశం చేత .... “ఔను! నేను చైతన్యమే స్వరూపముగా గలవాడను. ఈ సర్వము కూడా చైతన్యమే. చైతన్యము కంటే వేరుగా 'నేను-నీవు-జగత్తు' అనునవి లేవు" .... అను చైతన్యానుభవం పొందుచున్నాడు. అదియే దివ్యమగు స్వస్వరూపానందానుభూతి. అట్టివాడు మోక్షస్వరూపుడే అగుచున్నాడు. అట్టి అనుభవజ్ఞానము గల జీవుడే శివ స్వరూపుడై శేషిస్తాడు.
ఇప్పుడు, ఈ మహారాణి - ఈ మంత్రులు ఇతఃపూర్వపు రాజ్యములోని వారివలె ఎందుకు ఉంటున్నారో చెపుతాను. విను.
నీ భర్త ఇతఃపూర్వము మరణించియున్నాడు కదా! అట్లు 'పద్ముడు’గా మరణించినప్పుడు శేషించియున్నట్టి సంస్కారములను అనుసరించే, అతడీరూపములను గ్రహించినాడు. మహారాణి విషయమే కాకుండా, మంత్రుల విషయంలో కూడా అట్లే జరిగింది. అతడు ఇప్పుడు కూడా “ఈ నా మంత్రి నా వెంటనే ఉండును గాక” అని నన్ను అభ్యర్థించటం విన్నావు కదా! అయితే వీరందరు మునుపటివలెనే అగుపడుచున్నప్పటికీ “మనస్సు - - బుద్ది - అహంకారము”ల దృష్ట్యా వీరు వారికి అభిన్నులనుకొంటున్నావా? కాదు. వీరు వేరైనవారే. అయితే చైతన్యమునందు వీరంతా 'సద్రూపులే'
సుమా!
జాగ్రత్లో అనుభూతములగుచున్న వస్తువులు స్వప్నవస్తువులవలె కాకుండా కొంత సర్వ సాధారణత్వముతో కూడి ఉన్నట్లనిపిస్తున్నమాట నిజమే. కాని, ఈ జాగ్రత్ వస్తువుల సంబంధము కూడా కాలవశంచేత నశిస్తూనే ఉన్నాయి కదా! అనగా “ఏ ఏ సంబంధములు అత్యంత ఘనీభూతము లగు వాస్తవమని ఒక సమయంలో తోచుచున్నాయో, మరొక సమయంలో అవి అట్లు తోచటంలేదు” .... అనే విషయం పసిపిల్లవాడు కూడా గ్రహించగలుగుచున్నట్టి విషయమే. ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు తొలగిపోయే సంబంధాలు 'వాస్తవము' అని ఎట్లా నిర్ణయిస్తాము?, దృష్టాంతానికి “ఈమెను నేను ప్రేమించాను. ఈమె నా దేవత. ఈమె లేకుంటే నా జీవితమే నిస్సారము” అని భావించబడిన ఒకానొక సంబంధము, మరికొంత కాలం తరువాత, “ఈమె నాకెట్లా ఎందుకు
Page:315
దాపరించింది?” అను రూపమును కూడా పొందవచ్చును కదా! ఇక ఇక్కడేది వాస్తవం? అయితే ఈ జీవుడు ఎప్పటికప్పుడు “ఇది ఇంతే, ఇంత మాత్రమే" అనునట్టి ఘనీభూతభావము కలిగి యుండుటచేత .... ఈ జగదృశ్యము యొక్క చంచలత్వమును, అసత్యత్వమును గ్రహించ లేకపోవు చున్నాడు. అన్నిటికీ కారణం అవిచారణయే సుమా! దూరదృష్టి గల జ్ఞానులగు మహనీయులకు ఈ వర్తమానజగత్తులోని అసత్యత్వము, స్వప్నదృశ్యమువలెనే బుద్ధియందు సుస్పష్టముగా తోచుచున్నది.
ఓ లీలాదేవి! మన ఈ విచారణను అనుసరించి “స్వప్నజాగ్రత్తులలో అనుభూతమగుచున్న వస్తుజాలమంతా, ‘నాస్తిత్వము' అను గతియే కలిగియున్నది” అని తెలియవచ్చుచున్నది. “స్వప్నే జాగ్రదసద్రూపా స్వప్నో జాగ్రత్యసన్మయః”
ద్రష్ట
జాగ్రత్ స్వప్నము
L
జాగ్రత్ సమయంలో స్వప్న సమయంలో
స్వప్నము అసత్యము జాగ్రత్ అసత్యము
స్వప్నకాలంలో జాగ్రత్ ‘అసత్తు' అగుచున్నట్లే, జాగ్రత్కాలంలో స్వప్నము 'అసత్తు’ అగుచున్నది. అట్లే సూక్ష్మబుద్ధితో మరొక విషయం కూడా విను : జన్మించిన క్షణం నుంచి మృత్యువునకు సంబంధించిన స్థితి అసద్రూపమే అగుచున్నది కదా!
జన్మకు పూర్వస్థితి జన్మించియున్న స్థితి జన్మాంతర స్థితి
అట్లే మృత్యుసమయంలో ఈ జన్మయందలి అనుభవములు స్వప్నమాత్రంగా 'అసద్రూపములు’ అగుచున్నాయి. వస్తువులు ధ్వంసమగుచున్నప్పుడు మొట్టమొదట ఆ వస్తువు యొక్క అవయవములు వినష్టమౌతున్నాయి. ఆ తరువాత క్రమంగా ఆ వస్తువు యొక్క అభావం సిద్ధిస్తోంది. అట్లు ఆ వస్తువు తొలగిపోతున్న సమయంలో ఒకానొక విపర్యానుభవం (Altogether a different state of Experience) కలుగుచున్నది కదా! అట్లే (1) జన్మకు ముందు ఎదురుగా ఉండే అనుభవం, (2) జన్మించేటప్పుడు అనుభవం, (3) ఆ శరీరము కలిగియున్నప్పుడు ఏర్పడుచున్న అనుభవం, (4) దేహానంతర అనుభవం ఇవన్నీ ఒకదానిని మరొకటి మ్రింగివేస్తున్నాయి. అయితే లీలా! ఈ అన్ని స్థితి-గతులు ఏ ద్రష్ట యొక్క అనుభవంగా రాక పోకలు చేస్తున్నాయో ... అట్టి ఆ ద్రష్టయే ప్రత్యగాత్మ స్వరూపుడు. అతడే శుద్ధచైతన్య స్వరూపుడు. అతనికి ఈ జన్మమృత్యువులు ఆపాదించబడజాలవు.
Page:316
ఓ ప్రియపుత్రీ! లీలాదేవి! ఈ విధంగా ఈ జగత్తు “సత్తు" (ఉండియున్నది that which exists) కాదు. “అసత్తు" (లేకయున్నది : that which does not exist) కాదు. ఇదంతా చిత్తమును అనుసరించి కేవలము భ్రాంతి రూపంగా భాసిస్తోంది. “మహాప్రళయము” అనబడు ఒకానొక స్థితి శాస్త్రములచే బోధింపబడుచున్నది. ఆ స్థితి యందు జీవుడు ఈ జగత్తు, ఇందలి 'నేను-నీవు' మొదలైన పదార్థములు ఉండవు. ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లభించనిది సత్యమెట్లా అవుతుంది. సత్యమైనది త్రికాలములచే (భూత భవిష్యత్ వర్తమానములచే) అబాధ్యమై (బాధింపబడజాలనిదై, తొలగింపబడజాలనిదై) ఉండాలి. “మరొకప్పుడు లేకపోవునది ఇప్పుడు కూడా ఉండియుండలేదు” అని గ్రహించుటే జ్ఞానము.
అందుచేత, “అధిష్ఠానమగు 'బ్రహ్మము' ఒక్కటే సత్యము” అని గ్రహించు. బ్రహ్మమే ఈ జగత్తు అయివున్నది. ఎందుకంటే, ఆ 'బ్రహ్మము', నందే 'సృష్టులు' అను భ్రాంతులు ఉదయిస్తున్నాయి. సముద్రము నందు తరంగములు లేచుచున్నట్లు బ్రహ్మమునందే ఈ జగత్తులు తోచుచున్నాయి. కానీ - “ఈ ‘జగత్తులు’ అనబడేవన్నీ ఆకాశములో దృష్టిదోషం చేత కనిపించే కేశములు (వెంట్రుకల వంటి ఆకారములు) వలె మిథ్యమాత్రమే” అనటంలో సందేహం లేదు. ఆహాఁ! ఏమి చమత్కారం! ఏమి వైచిత్రం! పెనుగాలియందు వాయువీచికలు లేచి, కొంతసేపు ప్రసరించి, ఇంతలోనే లయించుచున్నట్లు ఈ సృష్టులు కూడా ఉత్పన్నములై మరల బ్రహ్మము నందు విలీనములై పోతున్నాయి. అందుచే, లీలాదేవీ! ఆత్మవస్తువునందు ఒనర్చ బడుచున్న ఈ “నీవు-నేనునీది-నాది-అప్పుడు-ఇప్పుడు" అను విభాగములన్నీ మిథ్యయే అని గ్రహించు. మృగతృష్ణా జలమువలె భస్మప్రాయమై, భ్రమాత్మకమైయున్న సృష్టిపై నీకు విశ్వాసమెందుకో చెప్పు? ఎచ్చటైయితే ఎట్టి భ్రాంతికి ఏమాత్రం చోటు ఉండదో .... అదియే 'పరమపదము’ అయివున్నది సుమా!
గాఢాంధకారమువైపు చూచుచున్న అజ్ఞానబాలుడు, “అవును! అక్కడ ఒక దయ్యము నాకు కనబడుతోంది. ఆ కదలికలు దయ్యానివే! అనుమానం లేదు” అనునట్టి భ్రాంతిని పొందుచున్నాడు. “నాయనా! అక్కడ దయ్యమేమీ లేదు. నీ భ్రమయే నీకు అట్లు తోపింపచేస్తోంది. అవన్నీ వెలుతురులో నీవు చూచే చెట్టు, గుట్ట, గోడలే” అని ఎవరైనా చెప్పినా, అతనికి నమ్మకం కుదరకపోవుటచే “లేదు. అది దయ్యమే” అని పలుకుతాడు, చూచావా? అట్లే జనన మరణములతో కూడుకొనియున్న “అజ్ఞాన-వ్యామోహ ఫలితము" అయివున్న ఈ జగత్తుపై గల అజ్ఞానపూర్వక అభిప్రాయముల వలన ఈ జీవుడు సత్యమేమిటో గమనించలేకపోవుచున్నాడు. దురభ్యాసమే, ... అనగాఅనగా, , “పదార్థములు వాస్తవం. నేను శరీరమాత్రుడను. ఏదో శక్తి చేతిలో కీలుబొమ్మను” .... మొదలైన దురభిప్రాయాల్ని అనేక జన్మలుగా అభ్యసించుటయే అందుకు కారణం. అయితే ఈ 'దురభ్యాసము' “ఆత్మయొక్క స్వభావము నా వాస్తవస్వభావమైయున్నది. మరి నేను ఆత్మనేకదా” .... వంటి "సదభ్యాసము”చే జయింపబడగలదు. ఈ 'జగత్తు' అనబడు భావావేశం జీవునియందు శేషించగా ... అప్పుడు మిగులునది పరమసత్యమగు బ్రహ్మము ఒక్కటే.
Page:317
"ఈ జగత్తు సత్యము కాదు. నాకు ద్రష్టత్వము లేదు. ద్రష్టత్వమే లేనిచోట దృశ్యమెట్లా ఉంటుంది? కనుక 'నేను' అను రూపమున స్ఫురించుదానితోసహా ఈ సర్వము చైతన్య స్వరూపమగు బ్రహ్మము యొక్క ప్రసరణమే అయివున్నది.” అనునట్టి జ్ఞానముచే ఈ జగద్వ్యాకులతలు, విపరీత ధోరణులు తొలగిపోతాయి. అందుకొరకై జీవుడు ఎందుకు ప్రయత్నించరాదో చెప్పు? స్వకీయమగు అజ్ఞానమే అందుకు అడ్డు అగుచున్నది. అజ్ఞానముచే ఉత్తమమార్గములను ఉపేక్షించటం చేతనే ఈ జీవుడు తన వాస్తవ స్వభావమును గ్రహించలేకపోవుచున్నాడు.
‘బ్రహ్మము’ కాక ఇక సత్యమంటూ మరేదీ లేదు. ఈ దృశ్యము సత్యము కాదు. ఒకే పదార్థము “సత్యము-అసత్యము” అనునట్టి రెండు వేరువేరు ధర్మములను పొందలేదు కదా! "మార్పు చెందటం” అను ధర్మము గలిగినట్టి సర్వము విడనాడి “మార్పుచెందని” తత్త్వమును గ్రహించినప్పుడు లభించునదే ఆ బ్రహ్మము యొక్క స్వరూపము.
"ఈ జగత్తుయొక్క మిథ్యాత్వము గ్రహించటం అత్యంత దుర్లభమైన విషయం” అను అభిప్రాయం కలిగి ఉండువారితో మేము ఏమాత్రం ఏకీభవించటం లేదు.
లీలావతి : అమ్మా! అసలు ఈ జగత్తు యొక్క నిజరూపమేమిటి? అట్టి దీని నిజరూపమును గ్రహించగలిగేవారెవరు? మేము ఇందు గ్రహించవలసినదేమిటి? త్యజించవలసినదేమిటి? జననీ! “ఈ జగద్వ్యవహారములు మమ్ము పట్టి పీడించు చుండగానే మేము పరమాత్మను గ్రహించగలమా?” అను సందేహం మమ్ము వదలటం లేదు.
శ్రీ సరస్వతీదేవి : ద్రవ్యాదులందు, ఆకాశమునందు పరమాణువులే ఉన్నాయి కదా! ఆ పరమాణువుల మధ్యగల చైతన్యతత్త్వమే ఈ జగత్తు యొక్క నిజరూపము సుమా! అయితే, అణు సముదాయ మాత్రముచే బాహ్యేంద్రియములకు లభిస్తున్న ఈ నామరూప వ్యవహారము ఈ జగత్తు యొక్క వాస్తవ స్వభావముగాని, రూపముగాని ఏమాత్రం కాదు. ఆకారాదులుగా ప్రాప్తించేదంతా 'మిథ్యయే’ అని గ్రహించు. ఈ “నేను నీవు పదార్దములు” అనునదంతా వాస్తవముగా ఉన్నది కాదు. కాని, 'భ్రమ' కారణంగా అనుభూతమగుచున్నది.
ఇక, ఈ జగత్తు యొక్క వాస్తవస్వరూపము 'బ్రహ్మము' అని గ్రహించునది కూడా బ్రహ్మమే అగుచున్నది. బ్రహ్మమే బ్రహ్మమును గ్రహించగలదు. బ్రహ్మము కానిదేదీ బ్రహ్మమును గ్రహించ జాలదు. (బ్రహ్మైవ పశ్యతి బ్రహ్మన్! నా బ్రహ్మన్ బ్రహ్మపశ్యతి) చిదాత్మయే తన వాస్తవ స్వరూప స్వభావములను మరచి తన తత్త్వమునే జగత్తుగా గాంచుచున్నది. మరొకప్పుడు ఆ చిదాత్మయే తన స్వరూప స్వభావములను ఎరిగి, అట్టి ఎరుకయొక్క దృఢత్వముచే ఈ జగత్తును అద్వితీయమగు స్వస్వరూపముగా గాంచుచున్నది.
“నారుద్రో రుద్రమర్చతి" ..... రుద్రుడు కానివాడెవ్వడూ రుద్రుని అర్చించజాలడు .... అను రుద్రంలోని
వాక్యార్థం ఇదే.
Page:318
అందుచేత ఓ లీలాదేవి! నీవు బ్రహ్మముయొక్క తత్త్వమును గ్రహించుటకే ప్రయత్నం చేయి. "ఇది మాకెట్లు సాధ్యం? మరెప్పుడో, ఎక్కడో ఈ విషయం యోచిద్దాం” ఇట్టి అజ్ఞాన దృష్టి నీవు
పొందకుండెదవు గాక!
సూర్యోదయమైనప్పుడు కిటికీ గుండా, ఇంట్లోకి ప్రవేశించి సూర్యకిరణాలలో 'త్రస రేణువులు' పరిభ్రమిస్తాయి, చూచావా? అదేవిధంగా 'పరమాకాశము' అనబడు దానియందు "బ్రహ్మాండ సమూహములు” వంటి అనేక త్రసరేణువులు (ధూళికణములు) పరిభ్రమిస్తున్నాయి. వాయువునందు 'చలనము' ఆ చలనమునందు పుష్పముల నుండి బయలుదేరిన “సుగంధం” ఇమిడివున్నాయి కదా! ఆకాశము నందు 'శూన్యత్వము' అనునది ఆ ఆకాశముయొక్క స్వరూపము-స్వభావము అయివుంటోంది కదా! ‘అవయవ హీనము' అయినట్టి ఈ జగత్తు అట్లే బ్రహ్మమునందే ఉండి ఉంటోంది. పైకి సాకారంగా అజ్ఞానదృష్టికి కనబడుచున్న ఈ జగత్తు వాస్తవానికి నిరాకారమైనదే సుమా! అయితే “ఇదంతా నిరాకారము” అను అభ్యాసాన్ని ఆశ్రయించాలి. అట్లు గ్రహిస్తున్న అభ్యాస బలంచేత అతిశీఘ్రంగా సర్వవికారాలు వాటంతట అవే తొలగిపోగలవు.
30. భావాతీతం
లీల : “అసలు ఈ విశ్వము ఎక్కడి నుండి వచ్చి ఈ జీవునకు దాపరించింది?”
శ్రీ సరస్వతీదేవి : ఇదంతా ప్రాప్తిస్తున్నది నిజభావనాబలము చేతనే. “భావనలన్నిటికీ ఆవల అఖండమై, శుద్ధమైయున్న “శుద్ధచితతత్త్వము” ... తన వాస్తవ స్వభావములగు అద్వితీయత్వము, సర్వాంతర్యామిత్వము మరచి, స్వకీయ కల్పనలను ఆశ్రయించటం చేతనే అయ్యది ఈ జగత్తు యొక్క అనుభవం పొందుచున్నది” ... అని వేదజ్ఞులు ప్రకటించుచున్నారు.
అందుచేత లీలా! భావనచే ప్రాప్తించినదానిని భావనాబలంతోనే ఎదుర్కోవాలి. ముల్లును ముల్లుతోనే తొలగించాలి కదా! “ఈ జగత్తు పరిపూర్ణబ్రహ్మమునందే నిలిచియున్నది 'పూర్ణమిదమ్' "" .... అనునట్టి భావనాబలమునే ఆశ్రయించాలి.
“ఈ జగత్తు అసత్యము” అని చెప్పుటలో, “ఇదంతా లేదు” అని ప్రతిపాదించటం శాస్త్రముల ఉద్దేశం కాదు సుమా! "రజ్జువునందు సర్పముయొక్క అనుభూతివలే .... బ్రహ్మమే అయివుండి స్వతహాగా నిరాకారమైయున్న ఈ జగత్తునందు నీవు భ్రమాత్మకమైన అనేకత్వమును దర్శించుచున్నావు. అట్టి భ్రమను త్యజించు" అనునదే శాస్త్రముల ఉపదేశసారమైయున్నది.
ఒకానొకచోట ఒక మిథ్యాభావం (False impression) అనుభూతమై ఉంటోందనుకో దురవగాహన తొలగేదెట్లా? సత్యాసత్యముల రెండిటినీ సూక్ష్మబుద్ధి - వివేచనములతో పరిశీలించి “ఇది సత్యము ... ఇది అసత్యము ; ఇది గ్రాహ్యము. ఇది త్యాజ్యము” అని గ్రహించుటచేతనే కదా! మాయ తొలగింపబడిన తరువాత ... ఇక అప్పుడు “ఈ జీవుడే సర్వమునకు పరమకారణము”
Page:319
అను విషయం అనుభవపూర్వకంగా తప్పకుండా తెలియవచ్చుచున్నది. ఈ జీవుడు స్వతహాగానే పూర్ణుడు. అయితే 'నేను జీవుడను' అను జీవభ్రాంతివలననే జీవత్వము ప్రాప్తిస్తోంది. ఈ జగత్తు సత్యమవనీ! కాకపోనీ! ఏది ఏమైనా ఇది చిదాకాశమునందే నెలకొనియున్నది. మోక్షస్వరూపులమగు మేము అట్టి అనుభవమునే కలిగియుంటున్నాము. మమ్ములను ఆశ్రయించు మా భక్తులకు అట్టి విజ్ఞాన యోగమునే ప్రసాదించుచున్నాము. బోధించుచున్నాము.
అసలు ఈ సంసారము యొక్క ఉత్పాదనమునకు మూలకారణం ఏమిటి? "జీవుని యందుగల భోగేచ్ఛయే ఇందుకు మూలకారణము” .... అని చెప్పబడుచున్నది. వాస్తవానికి ఈ “సృష్టి” అనబడు దానికి, ఇందలి సత్యత్వ-మిథ్యత్వములకు సంబంధమే లేదు. ఒక విషయం సత్యము కావచ్చు. మిథ్య కావచ్చు. ఇందులో గొప్ప విశేషమంటూ ఏదీ లేదు. కాని .... “ఇది పొందినప్పుడే నేను సంతోషము పొందువాడనగుదును. లేకున్న దుఃఖితుడను” అను రూపముగల భోగేచ్ఛావృత్తియే సర్వసంసారానర్థములకు ఉత్పత్తిస్థానమగుచున్నది. అనగా, ఈ జీవుడు స్వయముగా శివస్వరూపుడై ఉండి కూడా, తనకుతానే 'ఇచ్ఛ' అను దోషముచే, లేక, "కోరుకొను విషయములు” అను దోషధూళిచే కప్పబడి ఉంటున్నాడు. ఆ ఇచ్ఛలే తదనంతరము అతనికి ఇష్టాయిష్టములుగా, సుఖ-దుఃఖములుగా ప్రాప్తిస్తున్నాయి. ఆ అనుభవం ఒక్కొక్కప్పుడు సంపూర్ణంగా మునుపటివలెనే ఉంటోంది. మరొకప్పుడు ఒకింత పోలికతోనూ, ఇంకొకప్పుడు పూర్తి వ్యతిరిక్తముగానో ఉంటోంది. చూచావా! లీలా! 'ఇచ్ఛ'ను అనుసరించి దృశ్యము పొందబడడం ఈ జీవుని 'సత్యసంకల్పత్వ న్యాయము'ను నిరూపించుచున్నది. కాని, ఈ 'అనుభవములు' అనబడునవన్నీ మిథ్యా స్వరూపములే అయివుండి, జీవకాశమును ఆశ్రయించుకొని ఉంటున్నాయి.
ఈ జీవుని ఇచ్ఛా-సంకల్పముల బలమును అనుసరించి కొన్నిసార్లు శరీరత్యాగానంతరం కూడా వెనుకటివలెనే యత్నములు, సంబంధములు, వ్యక్తులు మొదలైనవి సంభవింపజేసు కుంటున్నాడు. అట్లు జరుగునట్లే మన ఈ విదూరథుని విషయంలో మంత్రులు భార్య మొదలైనవారు ఇతఃపూర్వమువలెనే ప్రతిభాసించటం జరుగుతోంది. అయితే అట్టి ఈ సంసార వ్యవహారమంతా సత్యస్వరూపమగు ఆత్మయందు ఏర్పడి ఉంటోంది. “ఇది సత్యము” అని ఎట్లు ఏది సంకల్పించ బడుచున్నదో, అది అట్లే వాస్తవమై ప్రాప్తించుచున్నది. విదూరథుని శుద్ధ సంకల్పతత్వమగు ఈశ్వరుని ఇచ్ఛను అనుసరించే ఈ పట్టమహిషి లీల అచ్చు నీ వలెనేయున్నది. సర్వమునందు ఏకరీతిగా ప్రసరించి ఉండే ఆత్మచైతన్యమునందు ఇట్లు 'ప్రతిభ' సర్వదా ప్రతిబింబిస్తూనే ఉన్నది. ఆయా రూపములన్నీ ఆయా అంతరంగ భావనాబలం అనుసరించే ఉదయిస్తూ ఉంటాయి. జీవాకాశమునందు మొట్టమొదటగా సంకల్పము ఉదయించి, ఆ తరువాత క్రమంగా ఆ సంకల్పమే బాహ్యమునందు ఇట్లు దృశ్యరూపమున గాంచబడుచున్నది. అంతరంగమున ఉన్నదే బాహ్యమున ప్రకాశించుచున్నది
సుమా!
Page:320
ఓ లీలాదేవి! నీవు, నేను, ఆకాశము, పృథివి, ఈ రాజు, ఇతని పట్టమహిషి, మంత్రులు .... మొదలైనవన్నీ చిన్మాత్రమే స్వభావముగా కలిగినవై అహంభావము నందు స్ఫురించుచున్నాయి. ఈ జగత్తులో కనబడేదంతా 'సత్త' మాత్రస్వభావము కలిగియుండుటచేత, తత్త్వజ్ఞులు “ఈ జగత్తంతా చిదాకాశము యొక్క గర్భమునందే, వాయువునందు స్పందమువలె, ఉండివున్నది” అని చెప్పు చున్నారు. ఇది గ్రహించినప్పుడే, నీ స్వస్వభావము ఏమిటో కూడా గ్రహించి, స్వస్థురాలవు అవుతావు.
31. ఆరాధన - లక్ష్యార్థం
ఇంతలో, క్రోధావేశంతో ఆయుధములు ధరించి యుద్ధరంగమునకు వెళ్ళుచున్న తన భర్తను చూస్తూ ఉన్న “ద్వితీయలీల (విదూరథుని పట్టమహిషి) అతడు కనుమరుగు అవగానే, తన దృష్టిని మరల్చి ఆ ప్రక్కనే ఉన్న సరస్వతీదేవిని చూచింది. వెంటనే ఆమెను సమీపించి ప్రణామం చేసింది. ద్వితీయలీల : హే మాతా! అప్పరసవలె, దేవతామూర్తివలె, కరుణారసమూర్తివలె వెలుగొందుచున్న మీరెవ్వరు? నేను ప్రతిరోజు జ్ఞప్తిదేవతయగు సరస్వతీదేవిని అర్చిస్తూ ఉంటాను. ఓ అంబా! అట్టి నా ప్రియాతిప్రియమగు హృదయదేవత నీవే అయి ఉంటావనిపిస్తోంది. ఆ తల్లి నాకు ప్రతిరోజు రాత్రిపూట దర్శనం ప్రసాదిస్తూ ఉండేది.... అవును. ఆ పరమపావనిని నీవే. ఈ ఆపత్కాలంలో మమ్ము కాపాడటానికి వచ్చావా? నా తల్లీ! నీకు మరల మరల నమస్కరిస్తున్నాను.
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! విదూరథ పత్నీ! నీవు యావజ్జీవితము నాపట్ల చెల్లించిన భక్తి ప్రపత్తులకు నేను ఎంతగానో మెచ్చుకొంటున్నాను. అందుచేత నిశ్చింతురాలవు కమ్ము. నీ ఇచ్ఛ వచ్చిన వరం కోరుకో. ద్వితీయలీల : దేవీ! ఒకవేళ, నా భర్త విదూరథుడు ఈ యుద్ధంలో పరాజయం చవిచూడవలసివస్తే దేహమును త్యజించి మరొకచోటికి వెళ్ళటం జరుగుతుంది కదా! అతడు ఎక్కడికి వెళ్ళునో అక్కడ నేను ఈ దేహముతోనే అతని భార్యనై ఉండునట్లు వరం ప్రసాదించు.
శ్రీ సరస్వతీదేవి : వత్సే! నీవు చిరకాలంగా నిర్విఘ్నంగా ధూప దీప-పుష్పాదులతో అర్చించావు. అందుచేత నీ కోరిక అట్లే నెరవేరుగాక!
ద్వితీయలీల పరమసంతుష్టురాలై కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామం చేసింది. ఇదంతా గమనిస్తున్న పూర్వలీల సరస్వతీదేవి వైపుకు తిరిగి తనకు కలిగిన సందేహం వెలిబుచ్చసాగింది.
పూర్వలీల : ఈశ్వరీ! నీవు సత్యసంకల్పురాలివి కదా! నీవంటి సత్యసంకల్పులకు ఏది ఎట్లు సంకల్పిస్తే అది అట్లే సిద్ధిస్తుంది. నాకొక సందేహం వచ్చింది. నీవు నన్ను ఇతఃపూర్వం గిరిగ్రామం తీసుకువెళ్ళునప్పుడు నా పూర్వశరీరముతో తీసుకుపోలేదు. ఆ శరీరమును పద్ముని దేహము ప్రక్కనే త్యజింపచేయించావు. ఆతివాహిక దేహముతో (మనోమయరూపముతో) మాత్రమే నీవు-నేను
Page:321
కూడా గిరి గ్రామం వెళ్ళాము. నీవు అప్పుడు అట్టి నిర్ణయం ఎందుకు తీసుకొన్నావు? ఇప్పుడు ఈ ద్వితీయ లీల విషయంలో భౌతిక దేహంతో భర్తను ఉత్తరలోకములవరకు అనుసరించటానికి అనుజ్ఞ ఇస్తున్నావే? ఎందుచేత?
శ్రీ సరస్వతీదేవి : ఓ వరవర్ణనీ! నీ ప్రశ్న ఉత్తమమైనదే. కాని, “సరస్వతీదేవి” అను నామ-రూపములతో మీరు ఆరాధించుచున్న నేను వాస్తవానికి ఎవరిని? "నిష్క్రియతత్త్వమగు ఆత్మవస్తువు”ని మాత్రమే. నేను స్వయముగా ఏదీ చేయను. దేనికీ కూడా కర్తనుకాను. నాకు వాస్తవానికి ఈ నామ-రూపాదులు కూడా లేవు. ప్రతిజీవిలో ఇచ్చ-జ్ఞాన స్వరూపిణిగా ఉన్న నాకు భౌతికరూపం ఏమి ఉంటుంది? అయితే ఈ ఈ నామరూపాదులు నన్ను ఉపాసించుచున్న నా భక్తులయొక్క ఉపాసన - ఆరాధనల సౌలభ్యం కొరకు అంగీకరించుచున్నాను. ఈ జీవులు నన్ను ఆరాధించటం ద్వారా చేస్తున్నది. తమతమ స్వస్వరూపారాధనయే. అట్టి ఆరాధనయొక్క ప్రయోజనంగా వారు ఆయా కోరుకొనుచున్న ఫలితములను పొందటం జరుగుతోంది. ఇందులో నేను దేనికీ 'కార్యమును’ గాని, 'కారణమును’
గాని కాను.
సంవిత్ స్వరూపమే అధిష్ఠానముగా గలిగినట్టి 'జ్ఞప్తి' అనునదే నా బాహ్యరూపము. జీవశక్తి స్వరూపమగు 'చిచ్ఛక్తి'యే నేను కదా! ఇట్లు నేను సర్వజీవుల అంతరంగము నందు “సాక్షిత్వము” రూపమున ఉండియే ఉన్నాను. అట్లు ఉండి జీవుల వాంఛితములను సత్తమాత్రంచేతనే ప్రకాశితమొనర్చుచూ ఉంటాను. దీపం వెలుగుచుండుట మాత్రంచేతనే తనకు 'ఇచ్ఛ’ లేకుండానే గదిలోని వస్తువులనన్నిటినీ ఆ దీపం కనబడునట్లుగా చేస్తోంది. నాయొక్క 'ఉనికి' మాత్రంచేత జీవుల హృదయములోని ఆయా వాంఛిత విషయములు ప్రకాశిస్తున్నాయి. ఏ జీవునియందు ఎట్టి శక్తి ఉదయిస్తోందో, అది అట్లే ఫలించుచున్నది. నేను ఎవరి ఇచ్ఛకు కారణము కాదు సుమా! అందరూ ఉపాసిస్తున్నది స్వస్వరూపమునే :
నీవు నన్ను ఆరాధిస్తున్నప్పుడు, నీయొక్క జీవశక్తి "నేను ముక్తిని పొందెదను గాక" అను రూపమున ఉండి ఉన్నది. దానిని అనుసరించే నీకు ఇంతవరకు ప్రబోధం చేశాను. చేస్తున్నాను. నా ప్రవచనము, చర్చ మొదలైనవాటిచే యుక్తిపూర్వకంగా నీకు దోషరహితమైన భావమును ప్రసాదించుచున్నాను. “ముక్తి పొందాలి” అను అంతరంగము నందలి తీవ్రేచ్ఛ మరియు బుద్ధి ఉండి ఉండుటచే 'చితశక్తి' ప్రభావంచేత అట్లే ముక్తిని పొందావు. ఎవని పురుషకారము లేక ప్రయత్నశీలత్వము ఏ రీతిగా ఉంటుందో, అతడు ఆ ఫలమునే యథాసమయమునందు, పొందుచున్నాడు. ఓ సూక్ష్మబుద్ధీ! లీలా! వాస్తవానికి “స్వీయచిచ్ఛక్తి”యే, 'తపస్సు’గానో, లేక ‘దేవత’గానో అయి, “ఆకాశము నుండి వాలే ఫలములా?” అను విధంగా ఆయా మిథ్యా
భూతములగు ప్రయోజనములను సిద్ధింపచేయుచున్నది. అయితే ఈ జీవుడు అట్టి సమయంలో కించిత్ భ్రమకు లోనగుచు, "ఈ పేరుగల దేవుడు, ఆ శక్తిగల దేవత, ఈ విధంగా నాకు ఈ ప్రయోజనములను ప్రసాదిస్తోంది" .... అని భావించుచున్నాడు.
Page:322
అనగా ఎవరు, ఏ పేరుతో, ఎట్లు ఆరాధించినా ... అట్లు ఆరాధించబడునది "స్వీయ చిచ్ఛక్తియే” అని గ్రహించెదవు గాక! స్వీయచిత్ ప్రయత్నము కాకుండా ఇంకెక్కడా ఏదీ లేదు. “ఆరాధన” అనునది పురుషకారము యొక్క రూపము. అట్టి ప్రయత్నశీలత్వమే ఆయా ఫలములను ఇస్తోంది. అందుచేత నీవు ఏది పొంద గోరుచున్నావో అద్దానికి అనుగుణంగా ప్రయత్నించు. అంతేగాని, నామ-రూప- క్రియాక్రమాదుల భేదదృష్టిచే భ్రమ చెందకుండెదవుగాక.
స్వసంవిద్యతత్ అన్య న కించిత్ కదాచన I
ఫలం దదాతి తేనాశు! యథేచ్ఛసి తథాకురు ॥
‘చిద్భావము’ అనునది సృష్టియందంతటా వ్యాపించియున్నది. దాని యత్నానుసారమే 'ఫలశ్రీ' ఉదయించటం జరుగుతోంది. కాబట్టి ఓ లీలా! ఏది ఉత్తమమో, ఏ మార్గము నందు వ్రతశీలురాల వగుట సముచితమో, శ్రేయస్కరమో, మొట్టమొదట బాగుగా విచారణ చేయి. శాస్త్రములు, గురువులు అందుకు నీకు సహకరించగలరు. ఆ పవిత్రమైన మార్గమును గ్రహించి, అందుకొరకే ప్రయత్నించు. ఈ సంసార భ్రమలను త్యజించి ఆత్మ పథమందు 'అచ్యుత స్థితి’ని ఆశ్రయించు.
32. యుద్ధ విశేషాలు
సరస్వతీదేవి ప్రసాదంచేత పూర్వలీల, ద్వితీయలీల, ఆకాశములోంచి యుద్ధ విశేషాలు గమనించసాగారు. జయజయశబ్దములు వెన్నంటి రాగా, విదూరథుడు తన రథములో శత్రుసేనల మధ్య ప్రవేశించాడు. యుద్ధం అతిభయంకరంగా సాగుతోంది. ఇటు - అటువైపు వారిచే నానా విధములైన శస్త్రాస్త్రములు దోమలగుంపువలె విరజిమ్మబడుచున్నాయి. ఎటువైపు చూచినా ధనుచ్చల చట చట, కవచముల ఝణ ఝణ.... శబ్దములు, సైనికుల యుద్ధోన్మాద ఘీంకారాలు, హాహాకారాలు వినబడు చున్నాయి. ఆ యుద్ధంలో సింధురాజుదే కొంచెము పైచేయి కావటం
ఉభయలీలలు గమనించారు.
ఉభయలీలలు : హే జగన్మాతా! ఇదేమిటి? ఈ మన విదూరథుని సైన్యం వెనుకంజ వేస్తూ, "ఓటమిని, చవిచూడబోవుచున్నదా”? అని అనిపిస్తోందే? నీ భక్తుడగు విదూరథునికి నీవు ....
తోడు ఉండి-ఉండగా అపజయం కలుగటమా? శత్రువగు సింధుదేశ రాజు విజయము పొందటమా? అట్లు జరగటం అసాధ్యమని మేము అనుకొంటున్నాము.
శ్రీ సరస్వతీదేవి : బిడ్డలారా! అదిగో, విదూరథుని శత్రువగు ఆ సింధుదేశ రాజును గమనించారా? అతడు “నేను నా శత్రువులపై విజయము పొందెదను గాక! విస్తారమైన రాజ్యమునకు చక్రవర్తిని అగుదును గాక!” అని కాంక్షించినవాడై నన్ను చాలాకాలం ఆరాధించాడు. అందుచేత అతడే ఈ యుద్ధంలో జయించవలసియున్నది. విదూరథునికి విజయము ప్రసాదించే ప్రసక్తి లేదు. అతడు అపజయమే పొందబోవుచున్నాడు. ఎందుచేతనంటారా? వినండి.
Page:323
నేను చిత్స్వరూపిణిని కదా! అందుచేత ఇచ్ఛ-జ్ఞాన-క్రియాశక్తుల రూపమున అందరి మనస్సులలో ఉండియే ఉన్నాను. ఎవడెవడు ఎట్లెట్లు ఎంతగా ఆరాధించుచున్నాడో, అతనికి అట్టి ప్రయత్నము అనుసరించి అట్టి ఫలమునే ప్రసాదించుచున్నాను. ఎవరు ఏ విధంగా ఏ నామ రూపాదులతో ఆరాధించినా చిచ్ఛక్తి స్వరూపమగు నన్నే ఆరాధించి నట్లగుచున్నది. * అగ్నియొక్క ఉష్ణ స్వభావము మారనట్లు, నా స్వభావము కూడా ఒక్క తీరుగానే ఉంటోంది. నేను సర్వదా, సర్వులందు జ్ఞప్తి తత్వమునై (జ్ఞాపకాలను ఆశయములను స్వరూపంగా కలిగి, ఇచ్ఛాశక్తి స్వరూపిణినై) వెలయుచుండగా ఇక నాకు శత్రువులేమిటి? మిత్రులేమిటి? అందరు నా వారే. అంతయు నాదే. నేను అప్రకటిత చైతన్యమూర్తినై, అందరికీ అధిష్ఠానమునై వెలయుచున్నానని గ్రహించండి.
ఇక ఈ వర్తమాన విషయానికి వస్తే .... ఈ విదూరథుడు, “నేను ముక్తుడనగుదును గాక” అనునట్టి తీవ్రేచ్ఛతో నన్ను ఆరాధించాడు. అంతేగాని, ఈ యుద్ధము నందు విజయము పొందటమనేది అతని ప్రప్రథమ లక్ష్యమై యుండలేదు. అతని ఆరాధనకు ప్రయోజనంగా అతడు ముక్తస్వరూపుడు కాగలడు. ఇతని సరిహద్దు దేశపు సింధురాజు, “నేను ఎట్లాగైనాసరే, ప్రక్కరాజ్యమును జయించాలి. చక్రవర్తిని కావాలి” అని నన్ను ఆరాధించుటచే, అతని పట్ల ఆ ప్రయోజనము అట్లే సిద్ధిస్తోంది. యుద్ధంలో గెలిచిన తరువాత ఈ సింధురాజు చక్రవర్తి అవుతాడు. చాలాకాలం ప్రజారంజకంగా ఈ భూమండలం పాలించబోవుచున్నాడు.
❖
ఆ రోజు యుద్ధం ముగిసింది. మరునాడు మరల యుద్ధం ఆరంభమైనది. త్రిశూలములు, గండ్రగొడ్డళ్ళు, బాణములు, అస్త్రములు మొదలైన వాటిచే సంకులసమరం జరిగింది. క్రమంగా ఇరువైపుల సైన్యం పలచబడింది. సింధురాజు-విదూరథ రాజు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వారు అపర నరసింహమూర్తులవలె తమ యుద్ధవిన్యాసాలతో ఆకాశాన్ని కప్పివేశారు. విష్ణువును ఆరాధించి యున్న వారిద్దరు ఒకరినొకరు తీసిపోవుటలేదు. ఆయుధముల శబ్దములతో, ధనుష్టంకారములతో దిక్కులు పిక్కటిల్లాయి.
తన భర్త యొక్క బాణ ప్రయోగ నైపుణ్యం గాంచిన ద్వితీయలీల, "మాతా! దేవీ! చూచావా, నా భర్త యొక్క యుద్ధ విన్యాసం? నా నాథుడు తప్పక గెలుస్తాడు” అని తల త్రిప్పకుండానే చెప్పుకు పోతోంది. అది చూచి పూర్వలీల - సరస్వతులు గుంభనగా నవ్వుకొంటున్నారు.
యేయథామాంప్రపద్యన్తో తాంస్తదైవభజామ్యహామ్ ।
మమవర్మానువర్తనే మనుష్యాః పార్ధ సర్వశః ॥ - భగవద్గీత
భగవద్గీత జ్ఞానయోగంలో కృష్ణపరమాత్మ "అర్జునా! ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారో, వారిని ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తున్నాను. వాస్తవానికి ఎవరు ఎట్లు ఆరాధించినా (ఏ రూప-నామములు ఆశ్రయించినా) వారు వస్తున్నది నా వైపుకే” . అని చెప్పియున్నారు కదా!
Page:324
ఆ ఇద్దరు రాజులు ఒకరి అస్త్రప్రయోగములను మరొకరు వ్యర్థపరచుచున్నారు. సింధురాజు “మోహనాస్త్రం” ప్రయోగిస్తే అందుకు ప్రతిగా విదూరథుడు “ప్రబోధాస్త్రం” ప్రయోగించి నిర్వీర్యం
చేసివేశాడు.
సింధురాజు “నాగాస్త్రం” ప్రయోగించాడు. పదార్థములన్నీ విషపూరితమైనాయి. అందుకు గాను “గరుడాస్త్రం” ప్రయోగించబడింది. సింధురాజు “తమోస్త్రం” ప్రయోగించాడు. అక్కడంతా భయంకరమైన చీకటి క్షణంలో అలుముకున్నది. అందుకు ప్రతిగా “సూర్యాస్త్రం” ప్రయోగించబడింది. అనంతరం సింధురాజుచే ప్రయోగించబడిన “రాక్షసాస్త్రం” “నారాయణాస్త్రం” చేత, ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం చేత, శోషణాస్త్రం మేఘాస్త్రం చేత ఉపశాంతింపజేయబడ్డాయి. అప్పుడు
సింధురాజు కోపావేశంతో వాయువ్యాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రముచే జనించిన వాయువీచికలచే విదూరథుని రథం గిఱ్ఱున తిరుగసాగింది. ప్రతిగా 'పర్వతాస్త్రం' ప్రయోగించబడింది. వాయువు యథాతథంగా ప్రశాంతత పొందినది. సింధూరరాజు 'వజ్రాస్త్రం' ప్రయోగిస్తే, అది 'బ్రహ్మాస్త్రం'చే నిరోధించబడింది. వెంటనే సింధురాజు 'పిశాచాస్త్రం ప్రయోగించాడు. అప్పుడు పుట్టిన పిశాచాలు విదూరథుని మ్రింగటానికి నాలుకలు సాచి సమీపించసాగాయి. వెంటనే విదూరథుడు “పిశాచవశ (వినష్టు) అస్త్రంచే వాటిని నియంత్రించాడు. పిశాచాలన్నీ ధూళిగా మారి నేలరాలాయి. అప్పుడు సింధురాజు ప్రయోగించిన ‘రూపికాస్త్రము’ నుండి పుట్టిన భూత ప్రేత గణం తన సైన్యంపై ఉరకటం గమనించిన లీలాపతి బేతాళాస్త్రం ప్రయోగించాడు. బేతాళుడు జన్మించి ప్రేతగణాస్త్రాన్ని మ్రింగివేశాడు.
లీలాపతి ఉగ్రుడై ఒక గడ్డిపరకను చేత్తో పట్టుకొని 'మహారాక్షసాస్త్రం' సంకల్పించి ప్రయోగించాడు. దానిని నిరోధించడానికి ఉన్న ఉపాయం ఒక్కటేనని గ్రహించిన సింధురాజు 'వైష్ణవాస్త్రం’ ప్రయోగించాడు. అది గమనించిన విదూరథుడు తాత్సారం చేయకుండా తానుకూడా, వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఆ రెండు అస్త్రముల నుండి ఇతర అస్త్రములు, ఆయుధములు జలప్రవాహంలా వెలువడసాగాయి.
సింధురాజు అంతా గమనించాడు. “ఆహా! ఈ విదూరథుడు ఇంతవరకు అస్త్రములను నిరోధిస్తూనే కాలం గడిపివేస్తున్నాడే? ఇతనికి ఉన్న అబలం ఎంతటిదో కదా! ఇట్లా కాకుండా ఇతనిని ఖడ్గయుద్ధంలో నిర్జించివేస్తాను” అని అనుకున్నాడు. ఖడ్గమును చేబూనినవాడై రథం మీద నుంచి క్రిందకు దుమికాడు. విదూరథుడు యుద్ధ మర్యాదను అనుసరించి తానుకూడా ఖడ్గధారియై రథం దిగాడు. వారిద్దరి మధ్య చాలాసేపు భీకరమైన పోరాటం జరిగింది. చివరకు సింధురాజు విదూరథుని విగతజీవుని చేసివేశాడు. విజయోత్సాహంతో సింహానాదం చేశాడు. తమ రాజు నేలకూలడం చూచిన విదూరథుని సైనికులు పరాజయం అంగీకరిస్తూ లొంగిపోయారు.
విదూరథరాజు నేలకూలినాడన్న వార్త దావానలంలా వ్యాపించింది. శత్రు సైనికులు నగర ప్రవేశం చేశారు. “ఏకఛత్రమండలాధిపుడైన సింధురాజుకు జయమగుగాక” అను నినాదములు
Page:325
నగరంలోని నలువైపుల వినవచ్చాయి. అతని అభిషేకమునకు రంగం సిద్ధం చేయ బడసాగింది. యుద్ధ పరిసమాప్తిచే దిక్కులు ప్రశాంతములయ్యాయి. నూతన రాజు సింహాసనం అధిరోహించాడు.
33. “ద్రష్టత్వము" నకు ముందే ఉన్న 'ద్రష్ట'
పూర్వలీల మూర్ఛితుడై ఉచ్ఛ్వాస నిశ్వాసములను మాత్రం ప్రకటిస్తూనే నేలపై పడియున్న .... తన ప్రియుడగు విదూరథుని చూచింది. ఆమె హృదయం చెప్పరానంత బాధతో నిండిపోయింది. పూర్వలీల : అంబా! నేను ఈ దుఃఖము భరించలేకుండా ఉన్నాను. నా భర్త అక్కడ రక్తపుమడుగులో కొట్టుకుంటున్నాడు. అతడు ప్రాణాలు త్యజించబోవుచున్నాడు. ఆయన అంతటి దుఃఖమును పొందే బదులు నేను ఖండఖండములుగా చీల్చబడవచ్చును కదా! అమ్మా! నీ శిక్షలతో అతనిని బాధించవద్దు. నన్నే శిక్షించు. నీవు చల్లటి తల్లివి కదా! నీ భక్తులమగు మాకు ఇన్ని కష్టాలా చెప్పు?
శ్రీ సరస్వతీదేవి : ఏవమ్మా? లీలాదేవీ? మరల నీవు చమత్కారంగా మాయలో పడుచున్నావుసుమా! ఇప్పుడు నీవిక్కడ ఒక అద్భుతమైన విప్లవం - సంగ్రామం చూచావు కదా! అయితే, స్థిరదృష్టి మరియు వాస్తవ దృష్టులతో చూస్తే ... ఇదంతా స్వప్నతుల్యము మాత్రమే సుమా! ఈ స్వప్నమాత్ర జగత్తులో స్థిరమైనదంటూ ఏమి ఉన్నది చెప్పు? విదూరథుని యొక్క ఈ విస్తారరాజ్యము పద్ముని గృహాకాశంలోనే ఉన్నదని, ఆ పద్ముని సామ్రాజ్యమంతా వసిష్ఠుని గృహాకాశంలోనే ఉన్నాయని మరచావా? అనగా వసిష్ఠబ్రాహ్మణ గృహాకాశంలోనే ఇదంతా విదూరథుని సంకల్పజగత్తుగా ఉండియున్నది.
“నీవు-నేను-ఈ మూర్ఛితురాలైన ద్వితీయలీల-విధూరథుడు-సింధురాజు - వీరి శస్త్రాస్త్ర ప్రయోగాలు - చతుస్సాగర పర్యంతమగు ఈ బ్రహ్మాండము” .... ఇవన్నీ గిరిగ్రామ గృహాకాశంలోనే వెలయుచున్నాయి. ఇట్టి స్వప్నసదృశము, అసత్యము అయిన సంఘటనలకు నీవు దుఃఖించవలసిన పని ఏమున్నదో నాకర్థమగుటలేదు.
కనుక పుత్రికా! నీవు మోహము చెందకుండా ఈ సంబంధ బాంధవ్యములు ఎట్టివో, ఎవరిచేత కల్పించబడి దుఃఖములను ప్రసాదిస్తున్నాయో గ్రహించు. ఇదంతా స్వయం కల్పితమేకాని వేరేమీ
కాదు.
శుద్ధ స్వరూపమగు ఆత్మే ఒకానొకప్పుడు వ్యర్థంగా దృశ్యమును, ప్రేమ మొదలైన భావములను కల్పించుకొని, అందు తాదాత్మ్యము చెందుచు, తన 'స్వస్వరూప స్వస్థితి'ని ఏమరచి అనేక ఉపాధులలో తన్మయమై ప్రవర్తిస్తోంది. మరొకప్పుడు ఉపాధితో ఏకత్వము చెందక, తన 'చిన్మయత్వము’ నందే ప్రశాంతబుద్ధిని కలిగియుంటున్నది. సర్వమునకు అధిష్ఠానమగు (ఈ సర్వము ఎందులో ఉండిఉన్నదో అట్టిదగు) ఆత్మకు వాస్తవానికి ఉత్పత్తి వినాశనములు లేవు. ఈ శరీరాదుల ఉత్పత్తి - స్థితి - లయములు ఆత్మ - యొక్క 'శుద్ధత్వము- నిత్యత్వము- అఖండత్వము - అప్రమేయత్వము” ”
Page:326
మొదలైన లక్షణములు గల స్వభావమునకు ఏమాత్రం హాని కలిగించలేదు. ఇక నీకు దుఃఖ మెందుకు? అందుచేత ఓ లీలా! "ఇతడిట్లున్నాడేమి? ఈ ఈ సంఘటనలు ఇట్లు ఎందుకు జరగాలి?” అనునట్టి సంసారమునకు సంబంధించిన స్వల్ప ప్రశ్నాసరళిని ప్రక్కకునెట్టి, ఆత్మత్వమునే అనుభవిస్తూ మనస్సులో ఆత్మయొక్క స్వభావమునే ప్రతిక్షేపించుకోవాలి సుమా!
అప్రమేయము : దేనిచేతను ఎట్టి మార్పు చేర్పులు పొందదు. అందుచేత ఆత్మకు దేనితోను ప్రమేయం లేదు.
సర్వదా, సర్వత్రా, సర్వమునందు వెల్లివిరిసియున్న ఈ ఆత్మయే ద్రష్టత్వముతో కూడుకొని దృశ్యమునందు ప్రకటితమగుచున్నది. అట్లు ప్రకటితమైన తరువాత, ఆ ద్రష్టత్వమును, దృశ్యమును తనకు బాహ్యమైన దానివలె గాంచుచున్నది. ఇక ఈ ఈ బ్రహ్మాండ మండపముల రెండిటి మధ్య ఉన్న ఆకాశమే ఈ బ్రహ్మాండముల యొక్క ఉనికికి స్థానము, కారణభూతము కూడా! కాని అట్టి చిదాకాశము వాస్తవానికి పదార్థశూన్యమైనదే సుమా! అందుచేత ఈ 'జగత్తు' అనబడునది వాస్తవానికి లేదు. “మరి కనబడుతోందే?" అంటావేమో? అట్లు కనబడునది స్వయం కల్పితమగు భ్రమాభ్యాసము మాత్రమే!
భ్రమను గాంచువాని (ద్రష్టయొక్క) వాస్తవ స్వరూపము శుద్ధచైతన్యమే కదా! అనగా, ‘ద్రష్టత్వము’ కన్నా ముందే ఈ జీవుడు శుద్ధచైతన్య స్వరూపుడై ఉండియే ఉన్నాడు.
శుద్ధ ద్రష్ట అవగాహన అనుభవ
శ్య → పరిణా
చైతన్యము ద్రష్టత్వము అవగాహన
ము మములు
సూర్యుని నుండి కిరణములవలె, సముద్రము నుండి తరంగములవలె 'శుద్ధచైతన్యము' నందు ఈ ద్రష్టత్వము బహిర్గతమౌతోంది.
34. దృశ్యం తొలగేదెట్లా?
ఇట్లు భ్రమను గాంచువాడే (ద్రష్టత్వము-ద్రష్ట) అసత్యమై, లేకయే ఉండగా, ఇక భ్రమాత్మకమగు విషయమెక్కడ? అట్టి భ్రమలు కలుగుచున్నది ఎవరికి? అందుచేత “భ్రమ” అనబడుదానికి ‘సత్త'యే లేదు. ఉత్పత్తి-వినాశరహితమగు పరమపదము లేక ఆత్మ ఒక్కటే ఉండి ఉన్నది.
ప్రథమ (పూర్వ) లీల : మరి ఈ దృశ్యమంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇది తొలగే ఉపాయమేమిటి? శ్రీ సరస్వతీదేవి : ఇదంతా "నేను ద్రష్టను అగుదునుగాక” అనునట్టి స్వకీయకల్పిత భావన నుండి ఏర్పడినట్టి ద్రష్ట వ్యాపారము యొక్క - ఫలితము మాత్రమే. ద్రష్ట యొక్క చైతన్యతత్త్వమే
Page:327
కార్యమునకు, కారణమునకు స్థానభూతమై యున్నది. అందుచేత ఈ దృశ్యము ఉంటే ఉండనీ, దానివలన మనకు వచ్చే లాభముగాని, నష్టముగాని లేదు. ఈ కనబడేదంతా జ్ఞానదృష్టితో చూడబడితే చాలు. అప్పుడు ద్రష్ట-దర్శనముల అభావం సహజంగానే సిద్ధించగలదు. ప్రథమ లీల : అమ్మా! “పరమ పదము” అంటే ఏమిటి?
శ్రీ సరస్వతీదేవి : నిన్ను నీవు జనన-మరణ రహితముగాను, స్వయం-ప్రకాశకముగాను, శాంతముగాను, ఆద్యముగాను, అనామయము (It only exists in it, nothing else exists in it)గాను గ్రహించు. “అట్లే తదితరులు వాస్తవ స్వరూపము కూడా” అనునట్టి 'ఎరుక' కలిగియుండుము. నీవు "నిన్ను - - తదితరులను” అట్లు దర్శించుచుండుటయే “పరమపదము” అని చెప్పబడుతోంది. (పరమ=ఆవలనున్న ; పదము= స్వస్వరూపస్థానము)
35. ఈ కనబడేవారంతా ఎవరు?
ప్రథమ లీల : జగజ్జననీ! ఈ విదూరథుడున్న చిదాకాశ బ్రహ్మాండములోను, అట్లే గిరిగ్రామ జగత్తునందు... అనేకమంది జనులు కనిపిస్తున్నారు కదా! వారంతా ఎవరు? 'స్వప్న కల్పిత రూపాలు’ వంటివేనా? వారందరికీ స్వకీయమైన 'అస్థిత్వము’, ‘అనుభవము' ఉండి ఉన్నాయా? లేదా? శ్రీ సరస్వతీదేవి : ఆ జనులందరి ఆత్మ వారివారి స్వభావమును అనుసరించే అట్లట్లు స్ఫురించుచున్నది. ప్రతివారు వారివారికి అనుకూలమగు స్థితియందే సంచరించు చున్నారు. అయితే తత్త్వజ్ఞులగువారు మాత్రం ఈ జగత్తును గాని, సృష్టినిగాని తమ అంతరంగమున పొందకుండానే ఉంటున్నారు. వారు ఈ దృశ్యమధ్యమునందు తదితరులతోపాటు ఆయా సాంసారిక వ్యవహారములందు ఇంద్రియాదులచే పాల్గొనుచున్నప్పటికీ, ఇందలి సత్యాసత్యముల విభాగము గ్రహించియుండుటచే, ఈ దృశ్యమునందలి స్వప్నత్వము- అసత్యత్వములను అవగాహన చేసుకొనిన తరువాతనే అట్లు పాల్గొనుచున్నారు. కనుక ఓ లీలా! ఈ జగత్తు, ఇందలి నేను నీవు – మొదలైన సర్వ పదార్థములతో సహా, జన్మరహితమైనది. ఇదంతా ఆకాశ స్వరూపమగు 'బ్రహ్మము' కంటే వేరు ఏమాత్రం కాదు. దృశ్యభాగమై చెన్నొందుచున్న ... ఈ భూమి, పర్వతములు, వస్తుజాలములు మొదలైనదంతా అజ్ఞానముచేతనే హృదయము నందు విజృంభిస్తోంది. దృష్టాంతానికి, 'స్వప్నద్రష్ట' చూచే మహానగరం యందలి కోటలు శూన్యాత్మకములే కదా! ఈ జాగ్రత్ దృశ్యము కూడా అట్టిదే. హృదయాంతరాళమై యున్న ఆకాశమునందు ఆత్మచైతన్యము పర్వత భూమయమైయున్న ఈ జగత్తును గాంచుచున్నది.
‘జగత్తు' అనునది 'ఆత్మ' లేక 'చిత్' యొక్క కల్పన మాత్రమే! అందుచేత ఒక అణు మాత్రమైన చోటునందు కూడా నానా ఆకారములతో కూడిన జగత్తులు అరటిపట్టలవలె ఇమిడివున్నాయి. స్వప్నపురము ఎంతటి విస్తారమైనదైనప్పటికీ, అదంతా ఉన్నది ఒకానొక 'చిత్అణువు' నందే కదా! ఈ విస్తారమైన జగత్తు కూడా ఒకానొక చిత్-అణువు'లో ఇమిడివున్నది. ఇట్టి ఈ జగత్తులో
Page:328
అనంతసంఖ్యలో చిదణువులు ఉన్నాయి. అందలి ప్రతి చిదణువులో మరల ఇట్టివేయగు అనేక జగత్తులు ఉన్నాయి. ఆ జగత్తులలోని ప్రతి అణువులో మరల అనేకానేక జగత్తులు అట్టి జగత్తులలో ఒకానొకదాని యందు గల ఒక ప్రదేశంలోని అంతఃపురంలో పద్ముని భౌతిక శరీరం ఉండియున్నది.
ఈ విధంగా గిరిగ్రామజగత్తు - - పద్మరాజ్య జగత్తు - విధూరథ రాజ్యజగత్తులలో తారసపడే వరకూ నీవు-నేను వంటి స్వస్వరూపాత్మ ప్రదర్శనారూపులే సుమా!
36. మరణానంతరం
నీ సహ-పత్నియగు ద్వితీయలీల తన భర్తయగు విదూరథుడు నేలకొరగటం చూడగానే తాను మూర్ఛిల్లటం చూచావు కదా! విదూరథుని జీవచైతన్యము పద్ముని దేహం ఉన్నచోటికి పయనించుచున్నది. ఈ ద్వితీయలీల జీవచైతన్యము కూడా పద్ముని చేరుటకే ఆరాటపడుచున్నది. ప్రథమలీల : ఈ ద్వితీయలీల మా అంతఃపురం ఎలా జేరనున్నదో? అక్కడ ఎట్లు ధరిస్తుందో? నీవు "నీ సహపత్నియగు ద్వితీయలీల" అని వర్ణించావు కదా! నేను ఆమెకు సహపత్నిని ఎట్లా అవుతాను? అక్కడ పద్ముని రాజభవనంలోని పరిచారికలు ఈమెను ఎట్లా చూడబోవుచున్నారు? ఇదంతా బహుచమత్కారంగా ఉన్నది కదా!
శ్రీ సరస్వతీదేవి : అవును. ఇదంతా బహుచమత్కారమే. ఇందులోని కొన్ని విశేషాలు చెప్పుచున్నాను. విను. ఇది వింటే నీవు నీ స్వప్న వృత్తాంతమును, మరణానంతర దశలను కూడా గ్రహించగలవు. విదూరథుని రూపములో ఉన్న నీ భర్త పద్ముడు ఆ 'పద్ముని భౌతిక శరీరము' ఉండివున్న గృహంలోనే ఈ జగద్ర్భాంతినంతా దర్శించు చున్నాడని అనుకొన్నాము కదా! ఇక ఈ యుద్ధము, ఇందలి జనన, మరణము మొదలైన సంఘటనలన్నీ స్వప్న సంఘటలనలవలె భ్రాంతి మాత్రములేనని మరల ఒకసారి గుర్తు చేస్తున్నాను. అనగా అర్థం ఏమిటి? ఇందులో కనబడే జనులంతా జన్మాది వికారములు ఏమాత్రం లేనట్టి ఆత్మస్వరూపులే అయివున్నారు సుమా! భ్రాంతి చేతనే లీల ఇక్కడ ఆ విదూరథుని భార్య అయినట్లు కనబడినది. వాస్తవానికి ఆమే కాదు. నీవు కూడా స్వప్నదృశ్యము వలెనే ప్రాప్తించుచున్నావు. ఈ 'జగత్తు' అనబడుదానిని పొందుచున్న ప్రతిప్రాణి (జీవుడు) ఇట్లే ఇదంతా స్వప్నసదృశంగా గాంచుచున్నాడు.
“నీవు నన్ను చూడటం - - నాతో సంభాషించటం” అనబడు మనిద్దరి మధ్య ఇప్పుడు ఏర్పడుచున్న ఇదంతా కూడా స్వప్నమువంటిదే సుమా! ఈ జగత్తు ఇట్లు ప్రతిభాసించటం వలననే, ఇది “దృశ్యము” అని చెప్పబడుతోంది. తత్త్వము గ్రహించినప్పుడు మాత్రమే ఈ దృశ్యత్వము తొలగి పోతోంది. ఆత్మ ఒక్కటే సర్వకాలము లందు సంపూర్ణసత్యమై ఉండివున్నది. దానిని ఆశ్రయించే
నీవు - - నేను - - మహారాజు మొదలైనవన్నీ విజృంభిస్తున్నాయి. అదేవిధంగా, ద్వితీయ-లీల విషయం
Page:329
కూడా. ఈమె పద్ముని మనోవృత్తి వలన ఉద్భవించింది. నీ భర్త పద్ముడుగా మరణించిన మరుక్షణం అతని చిత్తము లీలయొక్క ఆకృతి దాల్చగా, అట్టి మనోవికారరూపమగు ఆకృతి నుండే ఈ ద్వితీయ లీల వెలువడింది. అతని సంకల్పానుసారమే నిన్ను బోలిన లీలను బాహ్యమున గాంచగలిగినాడు. ఈ చిత్తము అతిచిత్రమైనది. అది “ఆధిభౌతిక భావము," అనగా, భౌతిక రూపములను భావించటం అను సంకుచితత్వము పొందుచున్న సమయంలో “ఈ నామ రూపములే సత్యము” అని తలచుచు ఉంటుంది. మరల “ఈ ఆధిభౌతిక వ్యవహారమంతా పంచభూత -
సంగమమై, స్వప్న-సదృశమై, అసత్యమై ఉన్నది కదా” అనునట్టి బుద్ధి సుస్థిరపడినప్పుడు ‘ఆతివాహకభావన’యే సత్యమని తలచుచుండటం జరుగుతోంది.
నీ భర్త 'మరణము' అనబడు మూర్ఛను పొందిన తరువాత, 'పునర్జన్మ' అనబడు మరొక భ్రమను పొందటం ప్రారంభించాడు. ఇదంతా ఒకడు ఒక స్వప్నములో నుండి మరొక స్వప్నములోనికి ప్రయాణించటం వంటిది మాత్రమే. అట్టి ఈ పునర్జన్మానుభవంలో తన వాసనలనే ఈ 'లీల' రూపంగా అతడు ఇక్కడ పొందినాడు. పునర్జన్మ అనునది ఒక స్వప్నము నుండి మరొక స్వప్నములో ప్రవేశించటం వంటిదని, ఆ రెండిటిని దర్శించు ద్రష్టయొక్క వాస్తవ స్వస్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపమని చెప్పాను కదా! చూచావా! నీ గురించి ఏర్పడిన సంకల్పమే ఆ లీల అయి వుండటంచే, నీవే ఆ లీలవై ఉన్నావు సుమా! "చిదాత్మ” సర్వగతమైయున్నది కదా! అందుచేత, వాసనా మయమగు మరొక శరీరమును (నీవే, నిన్ను, బోలిన రూపమును) గాంచితివి. ఆ చిదాత్మ యొక్క ఇచ్ఛా ప్రభావం చేత ద్వితీయ లీల కూడా నిన్ను గాంచగలిగినది.
సర్వగతమైనట్టి బ్రహ్మవస్తువునకు ఒకానొక చమత్కారయుతమైన స్వభావ విశేషము కానవచ్చుచున్నది. అది ఎక్కడ నీ రూపమున ఎట్టి వాసనలు కలిగివుంటుందో, అచ్చట ఆ తీరుగానే ఆయా దృశ్యవ్యవహారమంతా "బాహ్యమునందువలె” గాంచుచుండును. ఇందుకు స్వప్నమే మనకు దృష్టాంతము. "నేను స్వప్నములో ఒక ఊరు వెళ్ళినాను. అక్కడ గల కాలిబాటలో కొందరు జనులతో సంభాషించాను” .... అనునట్టి స్వప్నాను భవమంతా అంతరంగముననే ఏర్పడుతోంది. కాని, బాహ్యమందువలె ప్రాప్తిస్తోంది. ఆత్మ సర్వదా సర్వవ్యాపి, సర్వశక్తియుతము కదా! అందుచేత, అది తనయొక్క వాసనాను సారం కనబడటం, ప్రకాశించటం, అనుభవాదులు పొందటం మొదలైనవి లీలామాత్రంగా జరుగుతోంది. దృష్టాంతమునకు, “వసిష్ఠుడు-అరుంధతి” .... బ్రాహ్మణ దంపతులు ఇద్దరు తమతమ “మరణమూర్చ”లను పొందిన తరువాత, మరల “మరొకచోటు” అను భ్రమను పొందుచుండిరి. ఆ మరొకచోటు అని భావించబడుచున్న చోట, “.... వీరు మా తల్లిదండ్రులు ... ఇది మా దేశము ఇది మా ధనము ఇది మా కర్మము మేము ఇట్లు వివాహం
....
చేసుకొన్నాం ఏకమయ్యాం వీరు మా పరిజనులు ఈ నా భార్య నాకు అత్యంత ప్రియమైనది ... ఈ నా భర్త నాకుగల ఒక మధురానుబంధం .... ఇతడు నన్ను ఏ సమయమందును విడచి ఉండకూడదు .....” అనునట్టి బుద్ధి-బలమును సమకూర్చుకొని ఉన్నారు. అవన్నీ ఇరువురిపట్ల
Page:330
అట్లే ప్రవర్తిస్తున్నాయి. ఈ సృష్టిలోని జీవులందరు ఆయా వస్తువుల పట్ల, వ్యక్తులపట్ల, విషయముల పట్ల ఇట్లే తమయొక్క బుద్ధిబలంచే, భ్రమాత్మకమైన అనేక విధములైన సంబంధములు తమకుతామే, కల్పించుకొనుచున్నారు. ఇందుకు మనం నిత్యానుభవమైన స్వప్నమునే దృష్టాంతముగా తీసుకోవచ్చు. స్వప్నంలో చూచిన ఇంటిని, “ఇది నా ఇల్లు” అని, స్వప్నంలో చూచిన జనులను, “వీరు నా శత్రుమిత్రులు" .... అని ఆ స్వప్న సమయంలో స్వప్నద్రష్ట వాస్తవానుభూతినే పొందుచున్నాడు కదా! కాని ఆ ఇల్లు, ఆ జనులు, ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? లేకుంటే అనుభవాలన్నీ ఎక్కడి నుండి వచ్చిపడ్డాయి? ఆ స్వప్నద్రష్ట “భయము, ఉద్వేగము, ఆవేశములు.....” వంటివి ఎందుకు పొందుచున్నాడు? స్వప్నంలోని ఆయా సంఘటనలు అతనికి అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రాప్తిస్తూ ... అతనిని సంతోషింపజేయటం, దుఃఖింపజేయటం మొదలైన వ్యవహారసరళి
గలిగి ఉంటున్నాయి కదా! ఈ జాగ్రత్ృశ్యము, ఇందలి జనులు, పదార్థజాలము కూడా అట్టిదే. అయితే తగినంత పరిశీలనాత్మకమైన బుద్ధి లేకపోవుటచే “ఇది వాస్తవము” .... అను బుద్ధి ఏర్పడుతోంది. ఇందలి క్షణక్షణ ..... “మార్పుచేర్పులు” గమనించిన వారికి ఇక్కడ కూడా ప్రవాహములోని జలమువంటి అస్థిరత కనబడుచూనే ఉంటున్నది.
ఈ ద్వితీయలీల తన భర్త మరణించటానికి కొద్ది క్షణాల ముందే జీవము-ప్రాణములతో సహా ఈ దేహము నుండి బయల్వెడలినది. “మరణమూర్ఛ”ను పొందిన తరువాత ఆమె స్వసంకల్పానుసారంగా చిత్తాకాశమునందు 'ఉనికి' యొక్క అనుభవమును పొంద సాగినది. క్రమంగా ఆమె పూర్వవాసనలు (ద్వితీయలీలగా కలిగియున్న సంస్కారములు) అనుసరించి వికాసము పొందసాగింది. పూర్వస్మృతిని అనుసరించి తన భర్త సాన్నిధ్యము పొందుటకు పద్ముని భౌతిక శరీరం ఉన్న గృహమండపమునకు వెళ్ళుచున్నది. అక్కడ ఆమె పద్ముని కలుసుకోవటం జరుగగలదు.
37. ద్వితీయలీల
శ్రీ వసిష్ఠమహర్షి : వింటున్నావా, రామచంద్రా! ద్వితీయలీల సరస్వతీదేవిని తన పూజాదులచే ప్రసన్నం చేసుకొన్నది. అయితే, స్వస్వరూపము యొక్క అవగాహన విషయంలో మాత్రం కొంత అసంపూర్ణత్వము కలిగియున్నది. బుద్ధి మరికొంత వికసించ వలసియున్నది. తన ఆ వాసనామయ దేహముతోనే భర్తయొక్క సమక్షమును పొందాలనుకొన్నది. తన శరీరముతో సహా ఆకాశమునందు కోమలాకారమగు పక్షివలె పయనించసాగింది. “నా భర్తను పొందబోవుచున్నాను కదా” .... అను ఏకైక భావన ఆమెను పులకింపజేస్తోంది. అట్లు వెళ్ళుచూ ఒకచోట ఎదురుగా ఒక స్త్రీని చూచింది. అనగా, ద్వితీయ లీలాదేవి యొక్క 'సంకల్పము' అనే అద్దంలో సరస్వతీదేవి సంకల్ప ప్రభావంచేత 'కుమారి' అను స్త్రీరూపం ప్రతిబింబించింది.
x
Page:331
కుమారి : ఓ జ్ఞప్తిదేవత యొక్క భక్తులారా! సుందరీ! నీకు స్వాగతం! నేను నీ కొరకే సరస్వతీదేవి ఆజ్ఞపై ఈ ఆకాశపథంలో వేచియున్నాను.
ద్వితీయలీల : ఓహో! నీవు నాకంటే ముందే వచ్చి ఇక్కడ వేచియున్నందుకు కృతజ్ఞతలు. దైవాంశసంభూతురాలవైన నీవు కనిపించకపోతే ఈ సువిశాల ఆకాశంలో ఇక నా గతి అగమ్యగోచరమే
అయ్యేది.
“మహతాందర్శనం యన్మాంన్నకదాచన నిష్ఫలమ్”
నీవంటి ఉత్తముల దర్శనం ఊరకే పోగూడదు కదా! నా భర్త ఎక్కడున్నాడు? నన్నక్కడికి
వెంటనే తీసుకొనిపో.
కుమారి : అట్లే అగుగాక! "నేను స్థూలముకంటే అతిసూక్ష్మము, స్వభావసిద్ధము అయినట్టి ఆతివాహిక దేహమును. లేక, సూక్ష్మశరీరమును" అను భావనను దృఢంగా ఆశ్రయించు. అట్టి సూక్ష్మశరీర ధారిణివై నన్ను అనుసరించు. అప్పుడు నిన్ను నీ భర్త ఉన్నచోటికి కొనిపోగలను.
ద్వితీయలీల అట్లే ఆతివాహిక దేహధారియై కుమారిని అనుసరించసాగింది.
జ్ఞప్తిదేవతయగు సరస్వతీదేవిచే పంపబడిన ఆ కుమారి ముందుదారి చూపుతూ ఉండగా, ద్వితీయలీల బ్రహ్మాండ ఛిద్రమగు ఆకాశమున ప్రవేశించింది.
క్రమంగా వారిద్దరు 'మేఘమండలం' దాటివేసి, 'వాయుమండలం’ ప్రవేశించారు. సూర్య మార్గమును దాటారు. నక్షత్రమండలమును అధిగమించారు. ఇంద్రుడు, దేవతలు, సిద్ధలోకమును, త్రిమూర్తులను కూడా అనాయాసంగా దాటివేశారు. 'బ్రహ్మాండ కర్పరము' చేరుకొన్నారు. మంచు ముక్కలు కుండలో పెట్టినప్పుడు ఆ కుండకు, చిల్లి లేకున్నప్పటికీ, బాహ్యమునకు మంచు ఖండములు నీటిబిందువుల రూపమున చేరుతూ ఉంటాయి కదా! అట్లే 'సంకల్పసిద్ధ'యగు ద్వితీయలీల బ్రహ్మాండము నుండి వెలువడింది. చిత్తమాత్ర శరీరియగు ఆమె సంకల్పమాత్ర జనితములైన ‘బ్రహ్మాండములు’ అనే విభ్రమములన్నీ తన అంతరముననే అనుభవించుచున్నదని గ్రహించు. అన్ని అనుభవములకు మూలకారణం సంస్కారములే.
ఈ విధంగా ఆమె బ్రహ్మాదిలోకములన్నీ దాటింది. కుమారి దేవతతో కూడుకొన్నదై, బ్రహ్మాండ కర్పరము (సర్వలోకముల కావలనున్న space) దాటివేసింది. జలము మొదలైన ఆవరణములన్నీ అధిగమించింది. అంతము అంటూ లేనట్టి చిదాకాశంలో ప్రవేశించింది. ఆ చిదాకాశమునందు అసంఖ్యాకములగు బ్రహ్మాండములు ఒకదాని కింకొకటి కనబడకుండా ఉండి ఉన్నాయి. ఒక పురుగు ఒక రేగుపండులో ప్రవేశిస్తుంది చూచావా? అట్లే, అక్కడ ఉన్న అసంఖ్యాకములగు బ్రహ్మాండములలోని ఒకానొక దానిలో మన ద్వితీయలీల, మరియు, కుమారి ప్రవేశించారు. ఆ బ్రహ్మాండమండలము క్రింద ఉన్న పద్ముని రాజ్యమును సమీపించారు. క్రమంగా అంతఃపురంలో, పద్ముని భౌతిక దేహము ఉన్న గదిలో ప్రవేశించారు.
Page:332
ద్వితీయలీల ఎదురుగా భర్తయొక్క భౌతికదేహము చూచి భర్తతో పునఃసమాగమం పొందుచున్నందుకు పరమానందభరితురాలైనది. అప్పటికప్పుడు తాను భౌతికదేహము కలిగియున్న అనుభవమును పొందినది. తన మృదువైన చేతివ్రేళ్ళను విదుల్చుచు, కించిత్ పరిశీలనగా అరచేతులను చూచుకొన్నది. నుదురుపై పడేజుట్టును సరిచేసుకొనుచు, కుమారితో సంభాషించటానికి ప్రక్కకు చూచినది. కాని, ఆ ప్రక్కన ఎంతగా ఆమె కనులు వెతికినా, కుమారి కనబడలేదు. “ఈ కుమారి ఎటు వెళ్ళిపోయినదో కదా! అవునులే! మాయ ఎరుగబడిన తరువాత భ్రమ కారణంగా ఏర్పడిన దృశ్యానుభవం, అట్టి దృశ్యదర్శనంచేత ఏర్పడిన వికారాలు ఎక్కడికి పోతున్నాయో ఏమి చెప్పగలం?” అని అనుకొన్నది. ఆమె తన దృష్టిని శవరూపి అయి పరుండియున్న తన భర్త ముఖమువైపు మరల్చినది. తన "స్వయంప్రతిభ”చే విషయమంతా గ్రహించ నారంభించింది. "ఆహాఁ! ఇతడే నా భర్త. విదూరథుని రూపమున యుద్ధంలో సింధురాజుచే చంపబడి, వీరలోకములను పొంది ఇచట సుఖంగా నిదురిస్తున్నారు కాబోలు! దేవీప్రసాదంచేత నేను ఈ భౌతిక శరీరంతో ఇచటికి రాగలిగాను. నావంటి అదృష్టవంతులు ఇంక ఎక్కడైనా, ఎవరైనా, ఉంటారా? ఇదంతా సరస్వతీమాత కృపయే కదా!” అని అనుకొంటూ ఆ గది అంతా కలియజూచింది. అక్కడ గల ఒక నెమలిపింఛపు చామరము (విసనికఱ్ఱవంటిది) చేతికి తీసుకొన్నది. తన భర్తయొక్క ఆహ్లాదము కొరకు వీచసాగింది.
38. సూక్ష్మదేహ భావనా ప్రభావం
పూర్వలీల సరస్వతీదేవి ప్రక్కనే ఉన్నది కదా. ఆమె తాను ఉన్న స్థానంలోంచే - ద్వితీయలీల పద్ముని భౌతికదేహం ఉండియున్నట్టి తమయొక్క అంతఃపుర గృహంలో ప్రవేశించటం గమనించింది. ప్రథమలీల : అమ్మా! సరస్వతీదేవీ! నీ వరప్రసాదంచేత ఆ ద్వితీయలీల పద్ముని దేహం ఉండి ఉన్నట్టి మాయొక్క అంతఃపుర గృహంలో ప్రవేశించటం గమనించాను. ఈ మాయాతతంగమంతా గమనిస్తున్న నాకు అంతా అవగతమగుచుండటంచే నాకు ఏ సంఘటన కూడా ఆశ్చర్యంగాని, సుఖంగాని, దుఃఖంగాని, మరింకే భావావేశంగాని కలిగించటంలేదు. కాని ఆ గృహంలోని దాసీగణం, భృత్యులు ద్వితీయలీలను చూచినప్పుడు ఏమి అనుకొంటారో కదా? వారు ఏమి చేయనున్నారో? శ్రీ సరస్వతీదేవి : పరమాత్మ సర్వవ్యాపకము కదా! 'నియతి’ యొక్క ప్రేరణవలన, చిత్-ప్రతిభాస వలన, మనఃసంకల్పము యొక్క ప్రభావము వలన అక్కడి భృత్యులు, లీలకూడా తమ్ము తాము చిరపరిచితులుగానే భావించుకొనుచున్నారు. దాసీగణం మొదలైన వారిని చూచి ద్వితీయలీల. “వీరందరు నా భర్తకు సంబంధించినవారే కదా! కనుక, నాకుకూడా సంబంధించినవారే. ఇందులో నూతనమైన విశేషం అంటూ ఏదీ లేదు" అనే భావించుచున్నది.
పైగా, నీకు - నాకు - ఆ ద్వితీయలీలకు, ఆశ్చర్యకరమైన “జన్మ జన్మాంతరము- ”ల వృత్తాంతము తెలుసు. అక్కడి పరిచారికలకు తెలియదుకదా! వారు ఎప్పటిలాగానే నిదురలేచి తమ యజమానుల సేవలో నిమగ్నమగుచున్నట్లే భావించటం జరుగుతోంది.
Page:333
ప్రథమలీల : ఈ చమత్కారమంతా బాగానే ఉన్నది. కాని, నాదొక సందేహం. “ఈ స్థూలదేహము తోడనే నేను నా భర్తయొక్క సామీప్యత పొందాలి” అనే వరం నీ వద్ద నుండి ఆ ద్వితీయలీల పొందియున్నది కదా! మరి ఆమె తన భౌతిక దేహమును ఆకాశంలో త్యజించింది. బ్రహ్మాండములను సూక్ష్మదేహం తోడనే దాటివేసింది. ఆ పద్ముడు ఉన్న గృహంలో, అనగా నా అంతఃపురంలో, ప్రవేశించగానే ఎక్కడి నుండో ఆమెకు స్థూలదేహం ప్రాప్తించింది. అట్లా ఎందుకు జరగాలి? ఆమె భౌతిక దేహంతోనే బ్రహ్మాండకర్పరము దాటివుండవచ్చును కదా!
శ్రీ సరస్వతీదేవి : 'ఎండ’లో నీడ ఉండగలదా? ఎండవున్నచోట నీడగాని, నీడ ఉన్నచోట ఎండగాని ఉండజాలవు కదా!
అప్రబుద్ధులగువారు పుణ్యవశంచేత సిద్ధలోకములు పొందినప్పటికీ, వారు స్థూల దేహంతో ఆయా సిద్ధలోకములలో ప్రవేశించలేరు. హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు) మొదలైన సృష్టి నియామకులు సృష్టియొక్క ప్రారంభమునందే .... ఒక ఆటలో కొన్ని నియమములు రచించబడినట్లు, సృష్టి వ్యవహారమునందు కొన్ని నియమములను కల్పించియున్నారు. “సత్యము అసత్యముతో కలువకుండుగాక” అను నియమమును నిర్ణయించి ఉన్నారు. ఒకనియందు అసత్యదృష్టి పూర్తిగా తొలగనంత వరకు అతడు భౌతికదేహముతో బ్రహ్మాండాంతర్గతంగా పయనించలేడు.
కానీ, బిడ్డా! ఉత్తమోత్తమమైన ఆత్మజ్ఞానం కలవారు సంకల్పపూర్వకమైన భావన -ఆశయము కలిగివుంటే, వారు తమ భౌతిక దేహములతో సహా సిద్ధలోకములలో ప్రవేశించగలరు. సర్వేసర్వత్రా ఆత్మనే దర్శించు అట్టివారు తమను ఆశ్రయించు శిష్యులకు బోధించుట కొరకో, లేక, దుష్ట శిక్షణ కొరకో, తమ స్థూలదేహముతోనో, లేక వేరైన స్థూలదేహముతోనో, వేరువేరు లోకములు ప్రవేశించ గలుగుచున్నారు. ఒక దృష్టాంతం విను. ఒక బాలుడు, అత్యంత అజ్ఞానం అంతరంగమున పేరుకొని వుండగా, చీకటివైపు చూచినప్పుడు, అతనికి ఆ చీకటిలో బేతాళుడు లేక భూతములు కనిపిస్తాయి. కాని అట్టి బేతాళభ్రాంతి లేని పెద్దవారికి ఆ చీకట్లో దయ్యాలు కనిపిస్తాయా? లేదు కదా! “అవివేకము” అను జ్వరం ఉన్నంతవరకు 'వివేకము' అను శీతలత్వము ఉదయించదు.
అసలు “అవివేకము” అని మనం దేనిని పిలుస్తున్నాం? "నేను పృథివి మొదలైన పంచభూత నిర్మితమైన ఈ దేహమును కలిగియున్నాను. ఈ దేహముచే, ఇట్లు ఇంతవరకు నియమించబడ్డాను. నా ఈ పరిధి దేహసంచలనమునకు పరిమితమై యున్నది. అనురూపముగల దేహాత్మభావనయే ‘అవివేకము’ అని అనిపించుకొంటోంది. "స్థూలదేహధారి అయిన నాకు ఆకాశమున పయనించగల శక్తి ఎక్కడ ఉంటుంది?” అనునట్టి కృతనిశ్చయము గలవారు ఆకాశ సంచారం ఎట్లా చేయగలరు? చెప్పు? అందుచేత, “జ్ఞానము-వివేకము-వరము-పుణ్యదేహము” ల శక్తి వలననే జనులు ఈ భౌతిక దేహముతో అనేక లోకములందు సంచరించగలుగు చున్నారు. అయితే, ఎండుటాకులపై నిప్పురవ్వపడితే అవి దగ్ధం అగునట్లు, జీవునకు 'ఆతివాహిక దేహభావము' ప్రస్ఫుటమై ప్రాప్తించి నప్పుడు ఈ స్థూలదేహము అధిగమించబడినది - తిరస్కరించబడినది అగుచున్నది.
Page:334
ప్రథమ లీల : ఆకాశ గమనములు, పరలోక సంచారములు, వర-శాపములచే ప్రాప్తించ గలవని నీవు అంటున్నట్లునావు. అంటే అట్టి సామర్థ్యములు స్వప్రయత్నముచే ప్రాప్తిస్తున్నాయా? లేక, జగన్మాతవగు నీచే ఆయాదేవతల రూపమున వరశాపములు ప్రసాదించుటచే లభిస్తున్నాయా? శ్రీ సరస్వతీదేవి : వర-శాపములు కూడా ప్రాక్తనకర్మలను (ఇతఃపూర్వము నిర్వర్తించ బడిన శారీరక-మానసిక క్రియలను), అనుసరించే ఉంటున్నాయి. కాబట్టి, “జీవునకు ప్రయత్నములను అనుసరించే ప్రయోజనములు సిద్ధిస్తున్నాయి” అను అప్రతిహత సిద్ధాంతమునకు వరశాపాదుల వ్యవహారంచేత వచ్చే లోటు ఏమీ ఉండదు. ఓ ప్రియ భక్తులారా! లీలా! ఈ సంసార వ్యవహారమంతా కొంత సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే ఈ విషయం అవగతమౌతోంది.
నిత్యసత్యమగు సద్వస్తువు సర్వదా అవ్యయమై, శుద్ధమై, శాస్త్రమై ... తన స్వరూప - స్వభావములు త్యజించకుండానే ... సర్వదా ఉండి ఉంటోంది. త్రాడునందు ఒకనికి సర్పభ్రాంతి కలిగితే కలుగవచ్చు. కాని, ఆ త్రాడు సర్పమువలె పనిచేయలేదు కదా! స్వస్వరూపము లేనట్టిదేదీ ఎట్టి కార్యము ఒనర్చలేదు. కాబట్టి కార్యనిమగ్నులగుచున్న ప్రతి ఒక్కరు స్వస్వరూపము కలిగియే ఉన్నారు. అట్టి స్వస్వరూపము సద్వస్తువే అయివున్నది. అట్టి సద్వస్తువే బ్రహ్మమని, ఆత్మభగవానుడని, పరమేశ్వరుడని యిట్లు అనేక నామరూపములతో కీర్తించబడుతోంది.
అందుచేత, ఓ లీలా! మనందరిలో ఏ ఒక్కరు పుట్టుటలేదు. చచ్చుటలేదు. ఈ చావు - -
పుట్టుకలనబడునవన్నీ దేహాత్మదృష్టిలో మాత్రమే ఉండి ఉంటున్నాయి. కాని "ఇది మృతిచెందినది. నేను పుట్టాను. చచ్చుచున్నాను” అనునట్టి మిథ్యానుభవమంతా పూర్వాభ్యాసము (Previous Experience) వలననే విజృంభిస్తోంది. జీవునకు అత్యంత అనాయాసంగా ఈ స్వానుభూతములగు సంస్కృతభ్రమ కలుగుచున్నది. "జన్మించుట, ఇంద్రియములు, ఇంద్రియానుభవములు - సర్వ అనుభవముల రహితస్థితి అయిన నిర్విశేషానుభవం” ... ఇవన్నీ కల్పన చేతనే భావించబడుచున్నాయి. “కల్పన” కల్పనయే అవుతుందికాని సత్యమెట్లా అవుతుంది? ఈ 'సంసారస్మృతి' అంతా అజ్ఞానుల ‘అంతరము’ననే ఉదయిస్తోంది కాని, ఎక్కడో బాహ్యమున మాత్రం కాదని గ్రహించు. నీటిలో ప్రతిబింబించే చంద్రుని చూచి "అవును. ఇదియే వాస్తవమగు చంద్రుడు" అని బాలుడు భ్రమిస్తాడు చూచావా? ఈ సంసారము అనే భ్రమ కూడా, "ఇది బాహ్యముననే వాస్తవత్వము కలిగియున్నది” అను రూపమున అజ్ఞానము చేతనే వికసిస్తోంది.
ఓ లీలాదేవీ! తత్త్వజ్ఞులు, ధర్మపరులు అగువారు మాత్రమే ఆతివాహిక లోకములకు వెళ్ళగలుగుతారు. భౌతికదృష్టి ఉన్నవారు వెళ్ళలేరు. ఎందుచేతనంటావా? మిథ్య - భ్రమమయము అయినట్టి ఈ ‘ఆధిభౌతిక దేహము' సత్యమును ఆక్రమించుకొనగలదా? లేదు.
మన ద్వితీయలీల పూర్ణత్వము గాంచి ఉండలేకపోయినప్పటికీ తత్త్వజ్ఞురాలే! నన్ను నిరంతరం ఆరాధించి ఉండటంచే ఉత్తమభావము ('నేను ఆత్మను' అనునట్టి ఆత్మ భావము) పొందియే ఉన్నది, అందుచేతనే పద్ముడు ఉన్న నగరం వెళ్ళగలిగింది.
Page:335
జ్ఞాన దృష్టిలో ఈ జగత్తు లేనిదానిగను, అవాస్తవముగాను తెలియవచ్చుచున్నది. ఇందు కనిపిస్తున్న కష్టసుఖములవంటివన్నీ భావనచేతనే ఏర్పడుచున్నాయి. కాని, స్వతహాగా ఏర్పడుచున్నవి కావు. అట్లే సకల సంబంధములు కూడా సుమా!
39. కష్ట - సుఖములు
ప్రబుద్ధలీల : అమ్మా! జగన్మాతా! ఈ జగత్తులోని కష్టసుఖముల రూపమున ఏర్పడుచున్నవన్నీ అవాస్తవమని, స్వకల్పితమని అనటం వినటానికి బాగానే ఉన్నది. అటుచూడు నేలపై ఒరిగియున్న నా భర్త ఇప్పుడు ప్రాణములు త్యజించనున్నాడు కదా! ఇది నాకు సంభవిస్తున్న కష్టమే కదా! ఇట్లు మాకు ప్రాప్తిస్తున్న అనేక దుర్భర సంఘటనల వలన "దృశ్యము అసత్యము” అను వాదన ఎట్లా సమర్థించగలదగును చెప్పు? “సుఖము - దుఃఖము” అను రూపములు కలిగినట్టి “అదృష్ట దురదృష్టములు” ఈ జీవుని సమీపించటం, దూరం కావటం ఎప్పుడూ దైనందికంగా జరుగుచున్న విషయాలే కదా! ఈ అదృష్ట - దురదృష్టముల స్వభావం ఎట్లా సిద్ధిస్తోంది? అసలు ఈ పదార్థముల ‘సత్త' అంతా ఎట్లా ఏర్పడుతోంది?
పోనీ! ఈ అదృష్ట-దురదృష్టములు కేవలం కల్పనామాత్రములేనని కొద్దిసేపు అనుకొందాం. కాని అగ్నికి ఉష్ణత్వము, పృథివి మొదలైన ఘనపదార్థములకు స్థిరత్వము, 'మంచు'కు చల్లదనము, ఈ ఆకాశము, ఈ కాలము ... ఈ పదార్థముల ఉనికి ఇవన్నీ ఎట్లా ఏర్పడుచున్నాయి? ఈ ఇంద్రియములు, వాటి అనుభవములు, దృశ్యములు, వాటి బంధమోక్షములు .... ఇవన్నీ ఎట్లా ప్రాప్తిస్తున్నాయి? ఇవన్నీ ఇట్లు ఉండగా "జగత్తు లేదు” అని మనం ఎట్లా సమీక్షించగలం? ఇవన్నీ ఎవరు కల్పిస్తున్నారు? ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? తృణములు, కొండలు, సముద్రములు వంటి ఆయా ఆకారములన్నీ కనబడుచున్నాయి కదా! ఇవన్నీ ఎట్లా రూపం పొందుచున్నాయి? ఈ జన్మమృత్యువులు ఎట్లు ఎవరికి ఎందుకు సంభవిస్తున్నాయి? ఈ విషయాలు సందర్భోచితంగా నేను ఎంతవరకు తగివుంటే అంతవరకు వివరించు.”
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! చాలా పెద్ద ప్రశ్న వేశావు. సరే, నీవు అడిగిన విషయమై కొన్ని విషయాలు వివరిస్తాను. విను.
❖
“మహా ప్రళయము” అని పిలువబడుచున్న ఈ జీవునికి సంబంధించిన ఒకానొక స్థితియందు సర్వపదార్థములు వినష్టమై పోతున్నాయి. అనగా జీవుని దృష్టియందు సర్వ పదార్థములకు అతీతమైన మౌనస్థితి శేషించుచున్నది. అప్పుడు బ్రహ్మవస్తువు ఒక్కటే సద్రూపమై వెలయుచున్నది. మహాప్రళయము : అనగా ఈ జీవునియొక్క (లేక ద్రష్ట యొక్క) “దృశ్యమును అవగాహన చేసుకొను ఒకానొక స్థితి”గా గ్రహించాలి. అంతేగాని ఈ పదార్థ జాలమునకు సంబంధించినది కాదు.
Page:336
బ్రహ్మము ఒక్కటే సద్రూపమై శేషించటం - అనగా ఈ జగత్తులోని పదార్థములు కరిగిపోవుటయో, లేక, ఇవి సముద్రంలో మునిగిపోవుటో కాదు. “ఇదంతా ద్రష్టయగు నాతోసహా ఏకైక అద్వితీయ బ్రహ్మమే. ద్వితీయమైనదేదీ ఎక్కడా లేదు. నేను - - నీవు - అతడు - అది - ఇది - అక్కడ - ఇక్కడ - - నాది నాది - నీది ... అనునదంతా బ్రహ్మమే" అను దృఢభావన ఏర్పడుటయే. అప్పుడు చూడబడునదంతా బ్రహ్మముగానే శేషిస్తోంది.
ఒకడు తన స్వప్నంలో పదార్థములు, నీవు - నేను నీది నాది వంటివి, ఆకాశ
గమనాదులు పొందుచున్నాడు కదా! అతడే స్వప్నద్రష్ట అయివుండి, ఆ స్వప్నమంతా రచించబడుచున్నది తనయందే అయివుండికూడా ...ఆ స్వప్నమునందు పదార్థ జాలము మొదలైన వాటిని తనకు వేరైనవాటివలె దర్శించి “సుఖము - దుఃఖము - మానము - అవమానము” మొదలైన అనుభవములు పొందుచున్నాడు. అదేవిధంగా బ్రహ్మము - బ్రహ్మప్రకాశ స్వరూపములు మాత్రమే అయినట్టి సూక్ష్మభూతములను, పంచభూతములను - (ద్రవ-ఘన-వాయు-తేజ-ప్రదేశములను) తనయందు అనుభవించుచున్నాడు. సూక్ష్మభూతరూపమును దాల్చిన అబ్రహ్మవస్తువు ఈ జలము మొదలైన ఆవరణముల రూపములుగా అనుభవమగుచున్న స్థూలత్వమును తన కల్పనా బలముచే పొందుచున్నాడు. అట్టి సమయంలో ఆ బ్రహ్మము తనకు తానే ఈ బ్రహ్మాండ స్వరూపముగా గోచరించుచున్నది. బాహ్యమున ఉన్నట్లు తోచుచున్న ఈ వ్యవహారమంతా వాస్తవానికి అసత్యమే అయినప్పటికీ “దృఢమైన సత్యము"వలె అభ్యాసవశంచేత గోచరిస్తోంది. చూచావా? ఇట్లు బ్రహ్మవస్తువు “నేను సమష్టి జీవుడను” అని చింతన చేసి తన మనోరాజ్యమును ఈ 'బ్రహ్మాండము' రూపమున విస్తరింపజేస్తోంది. అట్టి మనోరాజ్యమునే 'జగత్తు' అనే పేరుతో మనం చెప్పుకొంటున్నాం.
ఓ ప్రియలీలా! సంకల్పమాత్రమే అయినప్పటికీ ఇదంతా ఒకానొక “సంకల్ప వృత్తి -నియమము”ను అనుసరించే ప్రవర్తిస్తోంది. అట్టి నియమము సృష్ట్యాదియందు ఎట్లున్నదో, ఇప్పుడు అట్లే ఉండి ఉన్నది. చిత్తవృత్తులు ఏ రీతిగా ఉంటాయో ఆత్మచైతన్యం ఆరీతిగానే స్ఫురిస్తూ ఉంటుంది.
ఈ జగత్తునందు 'అనియతి' యగు కార్యము ఒక్కటి కూడా జరగటంలేదు.
బంగారము తన ఆకారమును ఎప్పుడైనా వదలి ఉంటుందా? లేదుకదా! అట్లే ఈ జగత్తు కూడా. ఇది మాయతో కూడుకొనిన బ్రహ్మమునందే ఉండివున్నది. బ్రహ్మము నందే వెలసియున్న ఈ ‘జగత్తు' ప్రళయసమయంలో కూడా శూన్యం కాజాలదు. సృష్టి ప్రారంభంలో ఎట్లు ఏ వస్తువు ఆవిర్భవించియున్నదో అట్లే ఇప్పుడు కూడా ఉన్నది. నీటికి తరంగత్వమువలె బ్రహ్మమునకు జగదత్వము ఉండియే ఉంటోంది. జగత్తు ప్రకటితం కావచ్చు. లేక కాకపోవచ్చు. సర్వ సందర్భములోను బ్రహ్మము తన స్వసత్తను ఏమాత్రం వదలుటయే లేదు.
బ్రహ్మము తన “స్వసత్త - అఖండత్వము - శాశ్వతత్వము” మొదలైన లక్షణములు ఏక్షణమందు పరిత్యజించటం లేదు.
Page:337
‘మంచు-చల్లదనము’ ‘నిప్పు-ఉష్ణము'వలె 'చైతన్యము-నియతి' కలిసియే ఉంటాయి. చైతన్యము ఉన్నచోట సృష్టికూడా ఉండి ఉంటోంది. ఆకాశరూపములే అయిన ఈ పృథివి . జలము- వాయువు మొదలైనవి ఒకానొక నియతిని అనుసరించి సృష్ట్యాది యందు ఎట్లా ఉన్నాయో ఇప్పుడూ అట్లాగే ఉన్నాయి. వాటి స్వభావము నందు కొంచెము కూడా మార్పు ఉండటంలేదు. ఆకాశము - (Space) →శూన్యస్వరూపము
జలము (ద్రవము - Liquid) → ప్రసరించు స్వభావము
ఇట్లు ఆయా నియమములు అట్లే ప్రవర్తిస్తున్నాయి. చావు-పుట్టుక-బ్రతుకుల నియమము కూడా అట్లే మారకుండానే ప్రవర్తించుచున్నది. జీవులందరు ఆ నియమమును అనుసరించే ప్రవర్తిస్తున్నారు. కాని, ఈ జీవుని వాస్తవ స్వరూపము సర్వ సంఘటనలకు అతీతమైనట్టి "నిత్యోదిత చైతన్యమే”. ఇందు సందేహించవలసినదంటూ ఏమీ లేదు.
40. ఈ అనుభవమంతా ఏమిటి?
అయితే ఈ “నియతి-పదార్థములు-స్వభావములు- శరీరములు-ఉత్పత్తి- వినాశనములు” మొదలైన దృశ్యజగత్తు వ్యవహారమంతా మాయయొక్క, లేక భ్రమయొక్క ప్రభావమును దృష్టిలో పెట్టుకొని చెప్పాను. కాని, ప్రియమైన లీలాదేవి! వాస్తవానికి ఈ 'జగత్తు' అనబడునది ఉత్పన్నమే అయివుండలేదు.
లీల : అదేమిటమ్మా? మరి ఈ అనుభవించబడుచున్నదంతా ఏమిటి?
శ్రీ సరస్వతీదేవి : స్వప్నములోని స్త్రీ సంగమమువలె దృశ్యమునకు సంబంధించిన అనుభవమంతా మిథ్యయే. అయితే, ఈ జీవునకు తన స్వస్వరూపము గురించిన అజ్ఞానము చేత, అజ్ఞాన జనితమైన అభిలాషచేత, అభిలాష జనితమైన దృఢాభ్యాసం చేత ఈ బాహ్యానుభవములపై ఒకానొక భ్రమాత్మకమైన విశ్వాసం ఏర్పడుతోంది. తత్ఫలితంగా అతడు అనేక సుఖదుఃఖానుభవములకు లోనగుచున్నాడు. చిదాకాశము యొక్క లీలయే ఇదంతా. ఇప్పుడు మనం చెప్పుకొన్న నియతి స్వభావములైనట్టి జీవన-మరణాది అనుభవములు అసత్యములే అయివుండి కూడా జీవునకు అభ్యాసవశం చేత సత్యమువలెనే తోచుచున్నాయి. ఇదంతా సత్త (Absolute self) + సంస్కారములు - రెండిటి యొక్క సమన్వయ ప్రభావమని గ్రహించు. * అయితే ఓ లీలా! జ్ఞానార్తితో నేను చెప్పుచున్నదంతా వింటున్న నీకు, ఒక హెచ్చరిక చేస్తున్నాను. మనం సద్వస్తువు గురించి గ్రహించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, “జ్ఞాని అనుభవము”నే అధికంగా ప్రమాణంగా అంగీకరించాలి సుమా! అంతేగాని, అజ్ఞాని అనుభవములు క్రోడీకరించి ఎంతగా తర్జన భర్జనలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం?
శివ తత్త్వజ్ఞానము ప్రవచించు శివపురాణం 'సత్త'యే శివుడుగా, సంస్కారములు లేక ప్రకృతియే పార్వతిగా, జలతరంగములవలె ఆ ఇద్దరి అభేదమే ఉత్తమ జ్ఞానయోగముగా చాటుచున్నది.
Page:338
‘నేను-నీవు’ మొదలైన వాటితో కూడుకొని కనిపిస్తున్న ఈ సర్వము చిదాకాశమే అయివున్నదని అనుకున్నాము కదా! ఆ చిదాకాశమే సృష్ట్యాదియందు
“ఆకాశ సంవిత్తు”ను గ్రహించుటచే 'ఆకాశము' గాను, “కాలసంవిత్తు”ను స్వీకరించుటచే 'కాలము' గాను, “జలసంవిత్తు”ను అవధరించుటచే 'జలము’ గాను
గాంచుచున్నది. ఒకడు తన అంతరంగమునందలి స్వప్నంలో తనయందే ఆయా వస్తుజాలమంతా గాంచుచున్నాడు కదా! అట్లే చిద్వస్తువు తనయందు ఆయా ఆకాశాది భావములను పొందుచున్నది. మరి 'మాయ' యొక్క మహిమ అట్టిది. అది లేచి వస్తువులను కల్పించగలదు. అంతేనా .... అట్లు కల్పించబడి, సత్యమువలె అనుభవించబడుచున్న వస్తువులను, ... కల్పనయొక్క అంతమును ఆశ్రయించుట ద్వారా, “ఇదంతా అవాస్తవమే" అను భావనను పొందగలదు. అందుచేత లీలాదేవీ! ఈ ఆకాశతత్త్వము, జలతత్త్వము పృథ్వీతత్త్వము, వాయుతత్త్వము ఇవన్నీ అసత్తులే సుమా! ఈ శరీరమే 'అసత్తు' అయివుండగా అట్టి “శరీరములోని ఇంద్రియముల అనుభవమాత్రములు” అయినట్టి ఈ 'దృశ్యము' సత్యము ఎట్లా అవుతుంది? చితశక్తియే పంచభూతములతో కూడిన ఈ సృష్టిని, ఇంద్రియాదులకు సంబంధించిన ప్రియా ప్రియములను, ఆ ప్రియాప్రియముల అనుభవమునకు అనుకూలమైన ఉపాధులను (శరీరములను) తనయందు స్వప్నములోని వస్తువులవలె కల్పించుకొంటోంది. అనుభవమును పొందుతోంది. ఈ నేను చెప్పుదానికి దృష్టాంతముగా;
1. స్వప్నం : ఒకడు ఒక 'కల' కంటూ, ఆ కలలో పొందుతున్న ఆయా సంఘటనలు, సుఖ దుఃఖాలు, ప్రియ-అప్రియములు, భయ-ఆందోళనలు అదంతా 'స్వకల్పితమాయ' అనక తప్పదు. 2. సంకల్పము : మరొకడు సంకల్పములో ఆయా ఊహకు సంబంధించిన పదార్థజాలము, వాటి అనుభవం పొందుతాడు. ఒకానొక పిచ్చివాడు తన ప్రక్కనే తాను ప్రేమించే, లేక ద్వేషించే ఆకారమును సంకల్పించుకొని, అట్టి సామీప్యతకు స్పందిస్తూ ఉంటాడు. అదంతా స్వయంకల్పితమైన భ్రమయే కదా!
3. ధ్యానము : ఒక మాంత్రికుడు తన ధ్యానశక్తిచే ఒకానొక దృశ్యమును కల్పించి ప్రేక్షకులకు ఎదురుగా చూపించగలడు. అది అతనిచే కల్పించబడినదే అయినప్పటికీ, ప్రేక్షకులు అది వాస్తవమని తలచి చూస్తూ ఉంటారు.
కాబట్టి ఇక్కడ ఎవడు ఎట్లు దర్శిస్తున్నాడో అతడు 'అట్లు దర్శించటం' అనేది స్వయంకల్పితమైన మాయ, లేక భ్రమయే సుమా!
సరే! ఇప్పుడు నీకు ... “మరణానంతరం జీవుడు కర్మఫలములను ఎట్లా అనుభవిస్తాడు?” అనే విషయం విశదీకరిస్తాను. అప్పుడు ఈ విషయంలో నీకు ఉన్నట్టి అనేక సందేహాలు తొలగిపోతాయి. నీకు శ్రేయస్సు చేకూరగలదు.
Page:339
ముందుగా ఈ "మానవుని ఆయుష్షు" అనబడుదాని నియతి గురించి విను. సృష్ట్యాదియందే ఒకానొక నియమము ప్రకారం ఈ మానవుని ఆయుష్షు ఈ విధంగా నిర్ణయించబడినది.
కృతయుగం = 400 సం||లు త్రేతాయుగం 300 సం||లు |
ద్వాపరయుగం = 200 సం||లు కలియుగం = 100 సం||లు
అయితే ఈ ‘ఆయుర్దాయం' విషయంలో హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. దేశ, కాల, క్రియ, ద్రవ్యముల యొక్క “పవిత్రత-అపవిత్రతలు" అనుసరించి ఆయా మనుష్యుల జీవితములు నడుస్తు న్నాయి. వారు నిర్వర్తించు కర్మ - అకర్మల ఫలములు జీవితమును ప్రభావితం చేస్తున్నాయి. అందుచేత ఆయుర్దాయంలో కూడా మార్పు చేర్పులు కలుగుతూ ఉంటాయి. నిర్దుష్టములైన 'కర్మ'ల యొక్క - ఆ కర్మల యొక్క ఫలితము అయినట్టి 'ధర్మము' యొక్క హెచ్చు-తగ్గులను అనుసరించే ఆయువు యొక్క హెచ్చుతగ్గులుంటాయని అధర్వణవేదము మొదలైన శాస్త్రములు వచిస్తున్నాయి. నిర్దుష్టములైన స్వధర్మమునకు సంబంధించిన శ్రద్ధతో కూడిన ఆచరణము పెరుగుచున్నప్పుడు జనుల ఆయువు కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రజలు స్వధర్మములను మరచి చరిస్తూ ఉన్నప్పుడూ వారి సరాసరి ఆయుష్షు తగ్గుతోంది. నిర్దుష్టకర్మల ఆచరణము ఏ విధంగా ఉంటే జనుల సరాసరి ఆయుర్దాయం ఆ విధంగానే ఉంటోంది. ఈ విధంగా వ్యష్టి-సమష్టి జనుల ఆయుర్దాయం ఆయా మార్పులు-చేర్పులు పొందటం జరుగుతోంది.
ముఖ్యంగా ఆయా నిర్వర్తించబడు కర్మలను అనుసరించే ఈ ఆయుర్దాయము మొదలైనవి ఉంటున్నాయి. ఉదాహరణకు, ఒకడు బాల-మృత్యుకారకమగు కర్మలు ఆచరించాడనుకో. అప్పుడు అతనికి తదనంతర జన్మలందు బాల్యమునందే మృత్యువు ప్రాప్తిస్తోంది. అదేవిధంగా నిషిద్ధ కర్మలు ఆచరించినప్పుడు, తదనుసారంగా అకాల మృత్యువు యౌవన-కౌమారాలలో వచ్చిపడుతోంది. శాస్త్రములచే విధించబడిన ఆయా సుకర్మలను ఆచరించుచు ప్రశాంత చిత్తమును అలవరచుకొనుచున్న వాడు నిర్దుష్టమైన దీర్ఘాయుర్దాయమునకు తగిఉంటున్నాడు.
ఆయుష్షు క్షీణించి అంతిమకాలము ప్రాప్తించగానే అప్పుడు కర్మానుసారం మర్మ ఛేదకమగు ‘వేదనం’ ప్రారంభమౌతుంది. క్రమంగా మృత్యువు లేక మరణము జీవుని ఆక్రమించివేస్తుంది.
41. మరణానుభవం : అందుకు విచికిత్స
ప్రబుద్ధలీల : హే సర్వజ్ఞానవిధాతా! జగన్మాతా! 'మరణము' అంటే ఏమిటో చెప్పు. మరణం విషయంలో నన్ను అనేక సందేహాలు వేధిస్తున్నాయి. మరణదుఃఖం ఎట్లా ఉంటుంది? అప్పుడేమైనా సుఖం ప్రాప్తించగలదా? ఏదైనా తెలుసుకొనటం చేతగాని, ఆచరించటం చేతగాని అనివార్యమగు మరణము ఒక సునాయాసమైన అనుభవంగా ఉండుటకు వీలున్నదా? మరణానంతరం ఏమి జరుగుతోంది? యోగుల మృతికి సాధారణ జనుల మృతికి భేదమేమైనా ఉన్నదా?
Page:340
శ్రీ సరస్వతీదేవి : మనం మరణము గురించి చర్చించటానికి వీలుగా ఈ చనిపోవుచున్న జీవులందరిని మూడు రకాలుగా విభజించవచ్చు.
1. మూర్ఖులు: కొందరు దృశ్యములోని విషయములపట్ల, ఇంద్రియానుభవముల పట్ల అత్యంత తాదాత్మ్యము, విశ్వాసము, మమకారము, భ్రమ కలిగివుంటున్నారు. అట్టి వారిని ‘మూర్ఖులు’ అని పిలుస్తున్నాం. వారు వివేచనారహిత స్థితిలోనే మరణమును పొందుచున్నారు. 2. ధారణాభ్యాసులు : “ధారణ”ను అభ్యసించేవారు. అనగా, ప్రాణములను స్వసంకల్పవశం చేసుకొని అభ్యాసంచే నాడీ మండలములోని ప్రాణసంచారము నిరోధించగలిగినవారు. ప్రాణములను + మనస్సును నాభివద్దగాని, హృదయ ప్రదేశమున గాని, కంఠమున గాని, భ్రూమధ్య ప్రదేశమునగాని, బ్రహ్మరంధ్రము వద్దగాని అభ్యాసవశం చేత నిలుప గలిగినవారు. 3. యుక్తిమంతులు:“మేము శుద్ధ - చైతన్య - స్వరూపములమైయున్నాము. ఈ దృశ్యములోని ఒక వస్తువు కాము. ఈ దృశ్యము మాకు సంబంధించినది కాదు. ఈ దృశ్యమునకు మేము సంబంధించినవారము కాము.
“శుద్ధ సంవిత్ స్వరూపులమగు మేము జన్మించటం లేదు. మరణించటం లేదు. తరంగములు పొందుచున్నప్పుడు, పొందనప్పుడు కూడా జలము జలమే కదా! ఈ శరీరాదుల రూపములను మేము స్వీకరించవచ్చు. లేక త్యజించవచ్చు. మాకు ఏ భేదములేదు. మా స్వస్వరూపమునకు వేరుగా ఎప్పుడూ ఎక్కడా ఏదీ లేదు. ఇక్కడ తారసబడేదంతా పరమాత్మ యొక్క సంప్రదర్శనావిన్యాసమే!”
ఇట్టి మోక్ష భావములను గురువులతో సంభాషించుటచేత, శాస్త్రములను విచారించటం చేత, స్వబుద్ధిచేత (స్వవిచారణచేత) కొందరు మృత్యువు ప్రాప్తించుటకు మునుముందుగానే పెంపొందించు కొంటున్నారు. అట్టివారిని “యుక్తిమంతులు” అంటున్నాం.
వీరిలో ధారణాభ్యాసులు, యుక్తిమంతులు అగువారు ఈ దేహమును పరిత్యజించే టప్పుడుగాని, ఆ తరువాత గాని ఏమాత్రం దుఃఖం పొందరు. సుఖమునే పొందుచున్నారు. అట్లు కానట్టి మూర్ఖులు మరణసమయంలో దుఃఖమునే పొందుచున్నారు. ఎందుకంటావా? విను.
సూక్ష్మ భౌతిక
శరీరము 'శరీరము
చిత్తము
ధారణాభ్యాసముగాని, వివేక విచారణలుగాని ఆశ్రయించనట్టివారి చిత్తము జీవించి యున్నంతకాలం అనేక వాసనలచే ఎల్లప్పుడు చలిస్తూనే ఉంటుంది. వాటి గురించి ఆలోచిస్తూనే ఉండటం చేత అట్టివారు మరణసమయంలో అత్యంత దీనత్వమును పొందుచున్నారు. చిత్తమే వాసనలకు ఉనికి స్థానం కదా!
Page:341
ఈ జీవులలో అనేకులు శాస్త్రసంస్కారం, ఉత్తమ అభ్యాసం పొందకుండానే “మానవులై జీవించటం" అను ఒకానొక అవకాశమును చేజార్చుకొంటున్నారు. దుస్సాంగత్య పరులగుటచే నిప్పులో పడినవా-నివలె మరణసమయంలో ఎడతెగని దుఃఖములను పొందుచున్నారు.
మృత్యువు సమీపించినప్పుడు కంఠము బొంగురుపోతోంది. చూపు తగ్గిపోతోంది. రంగు వాడిపోతోంది. వారి దృష్టికి దిక్కులన్నీ వెలుగు తగ్గి, అంధకారమయం అగుచున్నాయి. దిక్ మండలములన్నీ కారుమేఘములు క్రమ్ముకొన్నట్లు అయిపోతున్నాయి. పగటిపూటనే నక్షత్రములు ఏర్పడుచున్నాయి. ఆ జీవుడు అపరిమితమైన బాధతో.... భూమిని ఆకాశంగాను, ఆకాశమును భూమిగాను ... చూస్తూ ఉంటాడు. కళ్ళు తిరిగిపోతున్నట్లు ఉంటుంది. దిక్ చక్రములు తేలిపోతున్నట్లు, ఆకాశంలోనికి కొనిపోబడుచున్నట్లు, గాఢమగు నిద్రచే ఆవరించబడుచున్నట్లు వారికి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చీకటి నూతిలో పడిపోవుచున్నట్లు, రాతి మధ్యభాగంలో ఒక కప్పవలె చిక్కిపోయినట్లు అనుభవం పొందుచున్నారు. ఏదో చెప్పాలని ఉంటుంది. కాని నోరు పెగలదు. హృదయం ఛిన్నమై పోయినట్లు ఉంటుంది. ఈ అనుభవములన్నీ జన్మ-జన్మార్జితమైన అజ్ఞానం చేతనే ప్రాప్తిస్తున్నాయి సుమా!
అందుచేతనే, ఈ జీవుడు శరీరధారి అయి, జీవించి ఉన్నంతకాలం "నేను ఎవరు? ఈ దృశ్యము యొక్క వాస్తవ స్వరూప స్వభావములు ఏమై ఉన్నాయి?" అనునది గ్రహించుటకు ప్రయత్నించాలి. అట్లు ప్రయత్నించటమే ఉచితమని మా అభిప్రాయం. స్వవిచారణచేత, శాస్త్రపరిశీలనచేత, గురువాక్యమననము చేత, దైవోపాసనచేత, సర్వులయందు వెలసియున్నట్టి ఆత్మదేవుని సంతోషింపజేయుటచేత మనస్సు నిష్కల్మషమౌతోంది. అట్టి ప్రయత్నముల ప్రయోజనంగా ఆసక్తులు, వాసనలు, మనో వ్యసనములు సన్నగిల్లుచున్నాయి. సర్వాత్మకుడగు ఆత్మదేవుని సర్వమునందు దర్శించటం అభ్యసిస్తూ రాగా, అప్పుడు ఆత్మజ్ఞానం ఆరూఢమగుచున్నది. అనగా "స్వసత్త సామాన్యము (Absolute Self - - Existence) ..... అనబడు మోక్షస్థితి సుస్థిరమౌతోంది. అట్టివానికి శరీరముయొక్క రాకపోకలు ఉన్నప్పటికీ అతడు “నేను పుట్టుచున్నాను. చచ్చుచున్నాను” వంటి భావనా
సంపర్కములు పొందటంలేదు. అట్టి ఉత్తమ స్థితి కొరకే మానవ జన్మ వచ్చినందుకు ప్రయత్నించాలి. అంతేకాని, మహత్తరమైన అవకాశమైయున్నట్టి మానవజన్మను శుష్కవాదనలతోను, అజ్ఞానక్రియాకలాపములతోను, స్వల్ప లక్ష్యముల తోను వృథా చేసుకోకూడదని సద్గురువుల స్థానములో ఉన్న మేము ప్రియులగు సర్వజనులకు గుర్తు చేస్తున్నాం.
అజ్ఞానిని మృత్యువు సమీపించినప్పటి మనోగతమైన స్థితి విషయమై మరికొన్ని విశేషాలు చెప్పుచున్నాను. విను.
Page:342
మూర్ఖత్వమును ఆశ్రయించి, దృశ్య సంపర్కముతో కూడి మునిగితేలుతున్న జీవుడు, మరణం ఆసన్నమైనప్పుడు చిత్ర-విచిత్రములైన స్థితిగతులు అంతరంగమునందే అనుభవిస్తున్నాడు. సుడిగాలిచే లేవనెత్తబడిన గడ్డిపరక క్రింద పడినట్లు తాను కూడా ఎగిరి క్రిందపడుచున్న అనుభవం పొందు చున్నాడు. వేగంగా ప్రయాణిస్తున్న రథం ఎక్కినట్లు, మంచులాగా కరిగిపోతున్నట్లు తాను తనకే కనిపిస్తాడు. అట్టి స్థితిలో అతడు తను పొందుతున్న సంసారదుఃఖములన్నీ తన బంధువులకు తెలియచెప్పు కోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు. కాని మాట పెగలదు. తను అరుస్తూ ఉండటం అనుభవిస్తాడు. కాని, తన కేకలు తనకే వినబడవు. ఒక పెద్ద క్షేపణ యంత్రమునో (Giant wheel) లేక వాయు యంత్రమునో, లేదా ఒకానొక భ్రమయంత్రమునో అధిరోహించినట్టి భావన పొందుతాడు. నాలుకను ఎవరో పట్టి లాగినట్లు ఉంటుంది. సుడి-గుండమున పడినవానివలె ఉంటాడు. సముద్రము, భూమి తలక్రిందు లగుచున్నట్లు, తాను ఏదో అగాధంలో పడిపోవుచున్నట్లు, మరల ఇంతలోనే పైకి లేచుచున్నట్లు ఉంటుంది. ఇదంతా అతడు భ్రమవంశంచేత, లేక, అజ్ఞాన ప్రభావం చేత అట్లు అనుభవమును పొందుచున్నారు. తనయొక్క 'ఉచ్ఛ్వాస నిశ్వాస' ధ్వనులను విని తుఫాను - శబ్దములను వింటున్నట్లు భయమును పొందుతూ ఉంటాడు. ఇంద్రియములకు సంబంధించిన ప్రణబాధలు అనుభవిస్తూ ఉంటాడు.
లీలాదేవి : అసలు ఈ దౌర్భాగ్యమంతా ఈ జీవునికి ఎందుకు ప్రాప్తిస్తోంది?
సరస్వతీదేవి : ఈ జీవుడు జీవించి ఉన్నంతకాలం సరైన జ్ఞానసముపార్జనకు ప్రయత్నించక, అవసానదశలో, శరీరము నేలకూలునట్టి దశలో "నేను ఈ భౌతిక శరీరమును. నేనీ శరీరమునందు మాత్రమే శరీరపరిమితుడనై ఉన్నాను. ఈ శరీరముతో ఏర్పడుచున్న సంబంధ బాంధవ్యములు అత్యంత వాస్తవములు. ఈ ధన-గృహాదులు నావి. ఈ బంధుజనులు నా వారు" అను భ్రమ కలిగియే ఉంటున్నాడు. అట్టి శరీర తాదాత్మ్యము చేతనే జీవునకు ఈ బాధలన్నీ వాటిల్లుతున్నాయి. “నేను చైతన్యస్వరూపుడను. సర్వాత్మకమగు ఆత్మస్వరూపమే నాయొక్క స్వరూపము” అనునట్టి ఎరుకను ఈ దృశ్య తాదాత్మ్యము కప్పివేస్తోంది. ఫలితంగా ఆత్మ వ్యతిరిక్తమగు అనుభవములన్నీ వచ్చి పడుచున్నాయి. మేఘములు ఆకాశమును కప్పివేస్తున్నప్పుడు, ఆ ఆకాశము యొక్క నీలత్వాదులు కనబడకుండానే ఉంటాయి. అయితే ఆకాశము యొక్క సహజ నిర్మలత్వము, అఖండత్వము, అనంతత్వము ఎక్కడికి పోతున్నాయి? అట్లే ఉంటున్నాయి కదా! జీవుని వాస్తవస్వరూపమునకు ఈ మృత్యువు యొక్క దుర్భర - అనుభవం వలన వచ్చే లోటుగాని, మార్పుగాని ఉండదు.
సూర్యుడు అస్తమిస్తూ ఉండగా, వెలుగులు తగ్గిపోవుచుండగా, దిక్కులన్నీ క్రమంగా మలినమై పోతూ ఉంటాయి కదా! అట్లే, మృత్యువు సమీపిస్తున్న కొలదీ, ఆ జీవుని ఇంద్రియములన్నీ చావ తగ్గి మాలిన్యమును పొందుతాయి. క్రమంగా 'స్మృతిశక్తి' (జ్ఞాపకశక్తి) తగ్గిపోతుంది. పూర్వాపరా జ్ఞానం (Knowledge of Past and inquisitiveness for Future) క్రమంగా సన్నగిల్లిపోతుంది. చూపు
Page:343
కనబడకుండా పోతుంది. మనస్సు తన కల్పనా సామర్థ్యమును కోల్పోయి, వివేకరహితంగా ఉండిపోతుంది. అది ఒకానొక మహామోహమును పొందుచున్నది. ఆ మోహమునకు ఇక అంతు కనబడదు. ప్రాణవాయువులు అతని అంగములలో ప్రవేశించవు. అందుచేత, అవయవములన్నీ క్రమంగా నిస్తేజమైపోతాయి. అతడు అట్లే మోహమున పడిఉంటాడు. మోహము, పూర్వ సంస్కారములు, భ్రాంతులు .... ఈ మూడు ఒకదానిని మరొకటి బలపరచుకొంటూ ఉంటాయి. అతడు పాషాణమువలె జడుడై ఉంటాడు. ఓ లీలా! మూర్ఖజీవుని తిప్పలు ఇట్లు ఉంటాయి. సృష్టి మొదలుగా అజ్ఞానజీవుని విషయంలో ఇట్లే జరుగుతూనే ఉంటుంది. జ్ఞానము ప్రాప్తించువరకు ఈ
తతంగమునకు అంతు ఉండదు.
ప్రథమలీల : అమ్మా! సరస్వతీదేవీ! ఇక్కడ నాకొక సందేహం. ఈ శరీరమును చూడు. ఇది .... శిరస్సు, రెండు పాదములు, రెండు చేతులు, గుహ్యము, గుదము ... అనబడు అష్టాంగములతో కూడుకొని మనకు ఎదురుగా కనబడుతూనే ఉన్నది. ఇట్టి ఈ శరీరమునందు “బాధ- మోహముమూర్ఛ-భ్రాంతి-వ్యాధి-జడత్వము” .... అనునవన్నీ ఎట్లా ఏర్పడుచున్నాయి? ఈ దౌర్భాగ్యములను పొందుచున్న జీవాత్మ అట్లు దుఃఖములు ఎందుకు పొందుతోంది? ఇవి తప్పించగల ఉపాయమేమిటి? ఈ ప్రశ్నలు నన్ను వేధిస్తూ ఉన్నాయి.
శ్రీ సరస్వతీదేవి : శుద్ధచైతన్యమే వాస్తవ స్వరూపంగా కలిగియున్నట్టి ఈ జీవుడు “సంకల్పించటం” చేతనే సర్వము ప్రాప్తించటం జరుగుతోంది. కనుక అదంతా సంకల్పనా వైచిత్రమే అయివున్నది.
“క్రియాశక్తి” అను బాహ్యత్వమును స్వీకరించిన ఈశ్వరుడు “నా కంటే అభిన్నుడగు జీవుడు బాల్య-యౌవన వార్ధక్యములందు ఆయా కర్మఫలముల అనుభవమును పొందుగాక” అని, ఏదో కారణంచేత సంకల్పించుచున్నాడు. అప్పుడాతడు, తన చిత్తము నందే కల్పించబడిన దృశ్యమునకు పోల్చదగిన ఈ స్వసంకల్పజనితములైన అనుభవములన్నీ పొందుచున్నాడు. ఈశ్వరుడే “జీవుడు-గుణములు” అను వ్యాపకమును స్వయముగా కల్పించుకొని జగన్నాటకంలో క్రీడిస్తున్నాడు. ‘కారణము అనిర్వచనీయము' అని కూడా శాస్త్రములచే ప్రతిపాదించబడింది.
జీవుని దేహమునందున్న నాడులు పిత్తము, మొదలైనవి ధాతుప్రకోపంచేత రసపూరిత మగుచున్నాయి కదా! అయితే, ఆ నాడులు మృత్యుసమయము ఆసన్నమగుచుండగా క్రమంగా తమ స్పందత్వాన్ని కోల్పోతున్నాయి. ధాతువులు బలహీనపడుటచే నాడులు రసరహితమై నిస్తేజమై పోతున్నాయి.
ఆరోగ్యవంతుని శరీరంలో “సమానవాయువు" సంచరిస్తూ ఉంటుంది. ప్రాణవాయువు శరీరమంతా ప్రసరించు ప్రవర్తన (లేక క్రియ) కలిగియున్నప్పుడు ఈ అవయవములు క్రియాపూర్వక మౌతున్నాయి. అయితే, సమానవాయువు తన సమత్వపూరితమైన (Balanced) సంచారం త్యజించినప్పుడు, జీవుని శరీరం అనారోగ్యవంతమగుచున్నది. నాడులందు ప్రవేశించిన వాయువు
Page:344
బయటకు వెలువడకపోవుటచేతనో, లేక బయటకొచ్చిన వాయువు మరల నాడులందు ప్రవేశించకపోవుటచేతనో ... నాడుల వ్యాపారము కుంటువడిపోవుచున్నది. అప్పుడు కళ్ళు మొదలైన ఇంద్రియములు తమతమ శక్తిసామర్థ్యములను కోల్పోవుచున్నాయి. అనగా, ఈ జీవుడు ఇంద్రియజ్ఞానమును, క్రమక్రమంగా, సమాన వాయువుయొక్క ప్రసరణము సన్నగిల్లుచున్న కొలదీ, కోల్పోవుచున్నాడు. నాడుల వ్యాపారము ఆగిపోయి వాయువుయొక్క గతి పూర్తిగా నిరోధమైనప్పుడు “ఇతడు మృతుడైనాడు” అని అంటున్నాం. ప్రాణవాయు ప్రసరణమే జీవనము, దాని ప్రసరణము ఆగిపోవుటయే మరణము.
“నేను జన్మించెదను. మరల ఒకానొకప్పుడు మరణించెదను" అనునట్టి ఇతఃపూర్వపు చిత్ సంకల్పనియతియే మృతికి కారణమగుచున్నది. అట్టి నియతిని ఈశ్వరస్వరూపుడగు ఈ జీవుడే తనకు తాను కల్పించుకొనుచున్నాడు. “నేను ఈ స్థానమున ఇట్లు అగుదును అనునట్టి “సంకల్ప మాయాశక్తి” సృష్ట్యాదియందే ఉదయించింది. * అది ఎన్నటికీ నాశం పొందదు. ఈ బాహ్యత్వమును ప్రాప్తింపజేస్తున్న మాయాశక్తి అవినాశి. దానికి నాశనము అంటూలేదు. అట్టి ఈ స్వభావజ్ఞానమే జనన-మరణముల రూపమున ప్రకటితమౌతోంది. అయితే, ఆత్మకు, ఈ వచ్చి-పోవుచున్న ఉపాధులతో గాని, భావాభావములతోగాని సంబంధము లేదు. సర్వులందు వెలుగొందు ఆత్మ ఎప్పుడూ శుద్ధముగానే ఉండి ఉంటోంది.
42. ద్వంద్వ వ్యవహారం
ప్రథమ (ప్రబుద్ధ)లీల : అమ్మా! " 'ఆత్మ’ అనునది సర్వుల వాస్తవస్వరూపమై సర్వదా నిర్మలంగానే ఉండి ఉన్నది” అని నీవు అంటున్నావు కదా! మరి, ఈ 'జ్ఞానులు అజ్ఞానులు', 'పుణ్యులు-పాపులు', ‘సుఖి-దుఃఖి’ మొదలైనవారు లేరా? ఉన్నారా? ఈ తత్వము తెలుసుకొనుచున్నవాడు-తెలియనివాడు
మొదలైన అనేక తీరులుగా జనులు మాకు తారసపడుచున్నారు కదా! వీరి మాట ఏమిటి? శ్రీ సరస్వతీదేవి : నదీజలం చూచావు కదా! అది ఒకచోట అనేక తరంగములతో కూడి కలుషితమై ఉంటుంది. ఇంకొకచోట 'తరంగములు' అనునవి లేకుండానే నిర్మలంగా, ప్రశాంతముగా ఉంటుంది. ఈ చైతన్యము కూడా జీవధర్మము తనయందు ఆరోపించుకొనుటచేత రాగ ద్వేష రూపములతో కూడిన అజ్ఞానముచే కలుషితమై ఉంటోంది. మరొకప్పుడు 'సాధన' యొక్క ప్రయోజనంగా కర్మల వలన అత్యంత నిర్మలత్వము సంతరించుకొని ఉంటోంది. ఏది ఏమైనప్పటికీ .... జ్ఞానియందలి, అజ్ఞానియందలి ‘చైతన్యతత్వము' మాత్రం ఒక్కటే అయివున్నది కాని, వేరువేరు కాదు. అది వేరువేరు
సృష్ట్యాది = అఖండ-శుద్ధ-సంవిత్ (Existence - knowledge) - స్వరూపుడగు ఈశ్వరుడు ఒకానొకప్పుడు తన వాస్తవస్వభావం మరచి బాహ్యదృష్టిని ఆశ్రయించుటయే “సృష్ట్యాది” లేక “సర్గాది” అని ఈ శాస్త్రంలో చెప్పబడింది. అంతేగాని, “సృష్ట్యాది” అంటే “ఈ కనబడే వస్తుజాలం యొక్క ప్రారంభం” అని అర్థం చేసుకోకూడదు.
Page:345
అగుటలేదు. అజ్ఞానదృష్టికి వేరువేరువలె కనబడుతోంది. ఋషులందు, మునులందు, దేవతలందు, మానవులందు, రాక్షసులందు, జంతువులందు, నీ యందు, నా యందు .... నిత్యసత్యమై ఒప్పుచున్న ఆత్మ సర్వదా ఒక్కటే. అది వేరువేరుగా లేదు. ఉండబోదు. ఓ ప్రియపుత్రికా! లీలాదేవీ! భేదమును దర్శించుటయే “సంసారము”. అభేద దర్శనమే “ముక్తి". పొడవైన లతలందు మధ్యమధ్య కణుపులు ఉంటాయికదా! అదేవిధంగా ఈ “అచేతనసత్త" యందు జనన-మరణరూపములైన గ్రంథులు, అనుభవములు ఉంటున్నాయి.
శరీరదృష్టితో చూచేవారికి, అట్లు చూచేంతకాలం ఈ “చావు-పుట్టుకలు కనిపిస్తూనే ఉంటాయి. చైతన్యదృష్టి వేరొకవిధంగా ఉంటోంది. వాస్తవానికి చైతన్యపురుషుడు జన్మించటంలేదు. మరణించటం లేదు.
దృష్టి
పాంచభౌతిక దృష్టి మనోదృష్టి చిదాకాశ దృష్టి
శరీరములు, తదితర తదితరుల మనస్సులు, సర్వులయందు ‘దేహి'
వస్తుజాలములు మాత్రమే భావనలు, గుణములు రూపమున
అగుపిస్తాయి. దర్శించబడతాయి. ప్రకటితమౌతున్న చిత్రృష్టి
ప్రథమ (ప్రబుద్ధ)లీల : అమ్మా! మరి ఈ కనబడుచున్నదంతా ఏమిటి? సత్యమును అనేక కోణముల నుండి అనేకమార్లు వింటేగాని, మాయందు సత్యభావన దృఢంకాదు. అందుకే మరల మరల అడుగుచున్నాను.
శ్రీ సరస్వతీదేవి : లీల! నీవు సందేహనివృత్తి అయ్యేవరకు నన్ను ప్రశ్నించవలసినదే. సరే! ఇదంతా ఏమిటో చెపుతాను విను.
శుద్ధ స్వరూపమగు ‘చైతన్య పురుషుడు’ కేవలము స్వప్నభ్రాంతివలె ఈ జనన- మరణములు, ప్రియ-అప్రియములు, స్థూల సూక్ష్మములు మొదలైనవన్నీ స్వకీయ మాయచే గాంచుచున్నాడు. ఈ జీవుడు చైతన్య స్వరూపుడేగాని, మరింకేదీ కాదు. చైతన్య స్వరూపుడగు పురుషునకు నాశనము లేదు. ఇక చేతన రహితమైనదానికి పురుషకారం గాని, కర్తృత్వముగాని లేవు. ఇంతవరకు ఎక్కడా ఏ కాలమందు చేతన వస్తువు నశించటంలేదు. కేవలం అచేతనములు, * స్వయంప్రతిపత్తి లేనట్టి ఈ శరీరములు మాత్రమే నశిస్తున్నాయి. అది చూచి జనులు 'అయ్యో! నేను చచ్చుచున్నాను కదా! ఆహా! నేను పుట్టుచున్నానే!" అని భ్రమించుచున్నారు. చేతనము సర్వదా అక్షయమై, సుస్థిరమై ఉంటోంది. అది అన్నివేళల ఏకమేగాని, అనేకము కానేకాదు.
* చేతనము = కదిలించేది; : అచేతనము = కదిలించబడేది.
Page:346
ప్రబుద్ధలీల : ఈ "శరీరములు పొందటం, చిత్తములు కలిగి ఉండటం” ... ఆత్మయొక్క స్వభావమై యున్నదంటావా?
శ్రీ సరస్వతీదేవి : శరీరములుగాని, చిత్తములుగాని ఆత్మయొక్క స్వభావము అయివుంటే, ఒకడు మరణించిన మరుక్షణం అందరు మరణించేవారే. అట్లు జరుగుట లేదు కదా! కనుక ఈ శరీరములు, చిత్తములు ఆత్మయందు లేవని గ్రహించు.
అసలు జీవునకు ఈ జననమరణాలు ఉన్నాయా? మా దృష్టిలో లేవు. ఇవన్నీ శరీరదృష్టి కలవారిచేతనే పరికల్పించబడింది గాని, ఇవి ఏమాత్రం వాస్తవం కాదుసుమా! అట్లు చూడబడుచున్న దంతా వాసనావైచిత్రమే. ఈ సుఖ-దుఃఖములు, ఈ దృశ్యతాదాత్మ్యము, ఈ జీవభావము, ఈ -నీవు - నేను మొదలైనవి .... ఇవన్నీ వాసనాప్రభావములే కాని మరింకేమీ కాదు. వాసనావైచిత్రమే జనన-మరణముల అనుభవమని గ్రహించేవారు భ్రమచెందరు.
కనుక, జీవునికి జనన-మరణములు లేవు. అతడు జన్మించడు. మరణించడు. కాని, నిష్కారణంగా "వాసనాప్రవాహం" అనబడు సుడియందు కొట్టుకొనుచున్నాడు. ఎందుచేత? దృఢ విచారణ లేకపోవుట చేతనే. దృఢ విచారణ ఆశ్రయించటంచేత దృశ్య వస్తువుల యొక్క 'అత్యంత అభావము’ ఏర్పడుచున్నది. అప్పుడు వాసనలన్నీ వినాశనమొందుచున్నాయి. 'ఈ దృశ్యముపై గల దృఢమైన నమ్మకం’ కాకుండా వాసనలకు వేరు రూపం ఎక్కడ చెప్పు? వాసనలు క్షయించగా దృశ్య సత్త కూడా క్షీణించి పోవుచున్నది. కాబట్టి లీలా! వైరాగ్యముతో కూడిన సాధన సంపత్తి గల వాడు వికారములను జయించి వేస్తున్నాడు. అప్పుడాతడు తత్త్వదృష్టిచే, "ఈ దృశ్య జగత్తు మిథ్యయే” అని గ్రహించుచున్నాడు. అట్టివాడు ద్వైత వాసనల నుండి తొలగినవాడై భవ భయముల నుండి ముక్తుడగుచున్నాడు.
ఓ బిడ్డా! ఒకానొక ఉత్తమ సత్యమును సర్వజనులను దృష్టిలో పెట్టుకొని మరల మరల ప్రకటిస్తున్నాను. “శుద్ధాత్మ స్వరూపము ఒక్కటే సత్యము. తదితరములన్నీ మిథ్య మాత్రమే.”
43. పునర్జన్మ
ప్రబుద్ధలీల : హే జగజ్జననీ! దేవేశీ! మనుజుడు మరణించిన తరువాత మరల ఎట్లు జన్మిస్తాడో నాకు వినాలని ఉన్నది. అట్టి విషయములు వినటంచే నా జ్ఞానము వృద్ధి చెందుతుందని నీవు అనుకుంటే ఆ విషయం చెప్పు.
శ్రీ సరస్వతీదేవి : సరే చెపుతాను. విను.
ఈ శరీరముయొక్క నాడీస్పందము శాంతించినప్పుడు ప్రాణవాయు చలనము కూడా ఆగిపోతుందని అనుకున్నాము కదా! అప్పుడు మనుజుని చైతన్యము ఉడిగినట్లు అనిపిస్తుంది. అయితే, స్వాభావికంగా చూస్తే ఈ చైతన్యము శుద్ధము, నిత్యము. దీనికి క్షయము గాని, ఉత్పత్తిగాని
Page:347
ఉండదు. శుద్ధ చిన్మాత్రమే స్థావర జంగమము లందు, ఆకాశమునందు, శిలలయందు, వాయువునందు, సర్వపదార్థములందు వెలయుచున్నదని సూక్ష్మగ్రాహ్యులగు జ్ఞానులు సర్వదా ఎరుగుచునే ఉన్నారు.
ప్రాణవాయువు నిరోధమైనప్పుడు నాడీస్పందము ఆగిపోతోంది. అప్పుడు "ఈ జడదేహము మృతి చెందినది” అని చెప్పబడుతోంది. అయితే, మృతి అనునది శరీరము యొక్క ధర్మమేగాని, ఆత్మధర్మము ఏమాత్రమూ కాదు. ప్రాణవాయువులు మహా వాయువులలో కలసిపోవుటచే శరీరము శవముగా మారిపోవుచున్నది. కాని చైతన్యము తన వాసనలతో కూడినదై ఆత్మతత్త్వముననే వెలయుచున్నది. సూక్ష్మమగు ఈ చైతన్యము పునర్జన్మకు కారణములగు వాసనలతో కూడుకొని ఉంటోంది. అందుచేత శాస్త్రములు, శాస్త్రవేత్తలు, అద్దానిని “జీవుడు" అను పేరుతో పిలుస్తారు. అయితే ‘వాసనలు’ అనునవి చైతన్యముకంటే వేరైన బాహ్యపదార్థములు కావు సుమా! జలము కంటే తరంగములు వేరు కావు కదా! చైతన్యము యొక్క “దృశ్యాసక్తినే 'వాసనలు' అను పేరుతో పిలుస్తున్నాం.
ఈ చైతన్యము ఎక్కడికో వెళ్ళటంలేదు. ఎక్కడి నుండి రావడంలేదు. ఎందుచేతనంటావా? ఈ “ఇక్కడ - అక్కడ, దూరము - దగ్గర” అనునవి పంచభూత దృష్టికి మాత్రమే ఉంటున్నాయి. సర్వము చైతన్యమయమే అయివుండగా, జీవుని చైతన్యము వెళ్ళుటకు వేరుగా చోటు ఎక్కడ ఉన్నది? కాబట్టి లీలా! ఈ సూక్ష్మమగు చైతన్యము వాసనా బలంచేత శరీరము ఉన్నప్పుడు ఏ స్వస్థానంలో ఉన్నదో, శరీరం తొలగినప్పుడు కూడా అదే 'స్వస్థానం'లో ఉంటోంది. అనగా అది శరీరము వచ్చినప్పుడు ఒక చోటికి, ఈ శరీరము నేలకూలినపుడు మరొకచోటికి వెళ్ళటంలేదు సుమా! “పరలోకమునకు వెళ్ళటం ఇహలోకమునకు రావడం” ... ఈ వ్యవహారమంతా స్వప్నతుల్య వ్యవహారమే. అంతేకాని, ఈ జీవుని జీవచైతన్యము స్థానభ్రంశము పొందటం లేదు.
సంస్కార సహితము ఉపాధిరాహిత్యము అయినప్పుడు, వ్యవహారజ్ఞులు (లేక) శాస్త్ర రచయితలు ఈ జీవుని "ప్రేతము” అను పేరుతో పిలుస్తున్నారు. చైతన్యము జీవవాసనలు కలిగి యున్నప్పుడు అట్టి వాసనాసహిత చైతన్యమే అది. వాయువునందు సుగంధం వేరైన రూపం అంటూ లేకుండానే ఉన్నట్లు చైతన్యమునందు సంస్కారము లేక వాసనల రూపమున జీవత్వము ఉండి ఉంటోంది.
ఆ జీవుడు “మృత్యువు" అను ప్రక్రియ ద్వారా “వర్తమాన శరీరమును గాంచటం” అను దానిని త్యజించుచున్నాడు. ఇంతలోనే మరొక శరీరమును గాంచుచున్నాడు. స్వ-వాసనా వశంచే (Indulgence of one's own tendencies) అట్టి వాసనలను అనుకూలమగు వ్యవహారముగా గాంచు చున్నాడు. భోగానుభవములు పొందుచున్నాడు. అదియే అతనిపట్ల పరలోకమగుచున్నది. అచట మరల మునుపటివలెనే భావములను, ఆవేశములను, స్మృతిసంస్కారములను ప్రకటించుచున్నాడు
Page:348
“నా 'మరణమూర్ఛ' అనే అనుభవం గతించినది” అని భావించుచు క్రమంగా మరణ స్థితి (శరీర రహిత ప్రేతస్థితి)ని స్వప్నతుల్యంగా త్యజించి వేస్తున్నాడు. ఒకడు నిదురలేవగానే మనస్సు నుండి స్వప్నానుభవమంతా తుడిచివేసి జగత్లో ప్రవేశించి ప్రవర్తిస్తున్నట్లు, అతడు ఇప్పుడు "ఈ నూతన శరీరమే వాస్తవము, దీనికి ముందుగా ఏదీలేదు. ఆవలా ఏదీ లేదు. నేను ఈ శరీరమునకు సంబంధించిన వాడిని మాత్రమే. ఇప్పుడు ఇక్కడ గాంచుచున్న దృశ్యములు, వ్యక్తుల సంబంధములే వాస్తవం” అనునట్టి ఒకానొక భ్రమాత్మకమైన బుద్ధిచాంచల్య స్థితిని పొందుచున్నాడు. తనకుతానే అట్టి బుద్ధి వ్యవహారమునందు తన అఖండ స్వస్వరూపమును - బంధింప బడినదానివలె గాంచుచున్నాడు.
ఓ లీలా! ఇదంతా ఇట్లు అనేక జన్మల దురభ్యాసముచేతనే ప్రాప్తించుచున్నది. ‘భావన’ నుండే జీవునకు బంధ-మోక్షములు ప్రాప్తిస్తున్నాయి. ఆకాశంలో మేఘ సమూహములు ఏర్పడుచున్నట్లు, ఈ జీవుని చిత్తాకాశములోకూడా పృథివి మొదలైన పదార్థములతో కూడిన విశ్వమంతా ప్రాప్తిస్తోంది. అతడట్లు చూచునదంతా అతని ఆత్మయందే సుమా! అదే విధంగా మనం ఇప్పుడు ఇక్కడ చూచునదంతా వాస్తవానికి మన ఆత్మయందేగాని వేరుగా ఎక్కడా లేదు. అట్లే ప్రతి ఒక్క శరీరధారుడగు జీవుని విషయం కూడా.
ఇట్లు శరీర పతనానంతరం ప్రాప్తించే తదనంతర దృశ్యము, ఉపాధి, అనుభవములు, సంబంధములు మొదలైనవి ఈ క్రింది లక్షణములు కలిగి ఉంటాయి.
1. సంస్కారములు - వాసనలు - - అభిలాషలు :
ఆ జీవుని సంస్కారములు పూర్వవాసనలను అనుసరించే ఉంటాయి. అనగా జీవుడు ఇతః పూర్వము దేనిదేనిపట్ల ఎట్లెట్లు అధికమైన ఆసక్తి - అభిలాషలు కలిగివుంటాడో - వాటిని -
అనుసరించి అవన్నీ అట్లే గాంచుచు ఉంటాడు.
2. తన అంతరంగమునందే తాను దర్శించుట :
ఒకడు తన స్వప్నంలో జగత్తులు గాంచుచున్నట్లు, ఆ జీవుడు తన సంస్కారములను అనుసరించి, తనయందే సర్వమును (పూర్వం చూచినది, ఇప్పుడు చూస్తున్నది. ఇక ముందు చూడబోవునది) గాంచుచున్నాడు.
3. సృష్టి - పరిమితమైన దర్శనం:
అతడు అట్లు గాంచుచున్న జగత్తును ఇతరులు గాంచలేరు. ఇతరులకు ఆ స్థానం గృహాకాశంగానే కనబడటం మనం నీ విషయంలోను, పద్ముని విషయంలోను చూచాము కదా! ఒకడు తన స్వప్నంలో గాంచు విషయములను, దృశ్యములను, వ్యక్తులను ఆ ప్రక్కనే ఉన్నవాడు గాంచలేడు
కదా!
Page:349
44. ప్రేతస్థితి
శరీరము త్యజించినప్పుడు, అప్పుడు శేషించు ఈ జీవునిస్థితి 'ప్రేతము' అని అంటారు. అట్టి ప్రేతస్థితులు ఆరు విధములుగా విభజించి వివరిస్తాను. విను.
1. స్థూలపాపి : గొప్ప దుష్టకార్యములను నిర్వర్తించినవాడు, మనస్సునందు క్రూరత్వము వహించినవాడు శరీరము త్యజించినప్పుడు 'స్థూలపాపి' కోవకు చెందుతాడు. అతడు పాషాణమువలె జడుడు అయి దీర్ఘకాలం 'మరణమూర్ఛ' అను ఘనీభూతస్థితిని అనుభవి స్తున్నాడు. మరల యథాసమయంలో ప్రబుద్ధుడై వాసనల మధ్య చిక్కుకుని ఉండిపోయి
చాలాకాలం నరకయాతనలు పొందుచున్నాడు. క్రమంగా నూర్లకొలది జన్మలు ఎత్తి అసంఖ్యాకములగు ఉపాధులలో అనేక దుఃఖములను అనుభవించుచున్నాడు. మరల ఈశ్వరప్రసాదముచే ఒకానొకప్పుడు వాని సంసార స్వప్నము శాంతిస్తోంది.
ఇట్టివారిలో కొందరు తమ 'మరణమోహము' గడచిపోయిన తరువాత, అత్యంత దుఃఖ పూర్ణమై యుండే “నేను వృక్షమును" మొదలైన భావనలను తమ హృదయము నందే అనుభవిస్తున్నారు. తరువాత భూతలంపై నానావిధములైన యోనులలో పరిభ్రమించటం జరుగుతోంది.
2. మధ్యపాపులు : మధ్యరకములైన ద్రోహచింతనలు, ఇతరులను బాధించటం వంటి పాపములను చేసిన వారు 'మరణమూర్ఛ'ను పొందిన తరువాత కొంత కాలం పాషాణము వలె జడత్వం పొందుచున్నారు. ఆ తరువాత యథా సమయంలో ప్రబుద్ధులై ‘పశువులు’ మొదలైన యోనులందు తిరుగాడటం జరుగుతోంది.
3. సామాన్యపాపులు: వీరు స్వల్ప పాపములు చేసియున్నవారు. అందుచేత వాసనానుసారంగా ఉత్పన్నమైనట్టి ఆతివాహిక దేహమును పొంది, స్వప్న - సంకల్పములందువలె జనన - మరణములు పొందుతూ ఉంటున్నారు. వారియందలి భ్రమతో కూడిన ‘ఆశయే వారిని అనేక దుఃఖ స్థితులను ప్రాప్తింపజేస్తోంది. అనగా "అది పొందుతాను. అప్పుడు సుఖ వంతుడనౌతాను” అని తలచుచు మూఢమృగములు ఎండమావుల కొరకై పరుగులు తీస్తున్నట్లు అనేక ఉపాధులందు ద్రష్టత్వము వహిస్తూ ఉంటున్నారు. కాని శాంతి పొందటం లేదు. 4. సామాన్య ధర్మి : ఇతడు స్వల్పముగా మాత్రమే ధర్మము నిర్వర్తించినవాడు. ధర్మము నిర్వర్తించుటయే పుణ్యస్వభావము అగుచున్నది. అయితే, ఇతడు కూడా సామాన్య పాపివలె అనేక జన్మ-మృత్యువులు పొందుతూనే ఉంటున్నాడు. కాని 'సామాన్యపాపి' కంటే కొంత ధర్మాధిక్యత పొందియున్నాడు కదా! అందుచేత ఇతనికి ధనాదుల ప్రాప్తి జరుగుతూ ఉంటుంది. కొంత సమృద్ధిని అనుభవిస్తూ ఉంటాడు. స్వధర్మనిరతి, లోకోపకారములు, శాస్త్రవిహితమైన కర్మల నిర్వహణ శ్రద్ధాసక్తులతో నిర్వర్తించువాడే 'ధర్మి' అని చెప్పబడుచున్నాడు.
Page:350
5. మధ్యధర్మి : ఇతడు మరణానంతరము ఆకాశవాయువులచే కొనిపోబడి ఉత్తమ స్థానము లందు ఉంచబడుచున్నాడు. తన ధర్మమును కొంత చక్కగా నిర్వర్తించి ఉండటంచే కిన్నర - కింపురుష - యక్ష - మొదలైన సుఖవంతములగు శరీరములను పొందుచున్నాడు. అచ్చట పుణ్యము యొక్క ఫలము (సుఖము) అనుభవించి, మరల ఆ పుణ్యము క్షయించగా, అక్కడి నుండి చ్యుతుడు (displaced) అగుచున్నాడు. వీర్యరస సమన్వితమగు భోజన ద్రవ్యములందు రసరూపమున ప్రవేశిస్తున్నాడు. ఆ తరువాత తనకు యథోచితమైన జాతి (సామాన్యధర్మిమధ్యధర్మి వగైరా)కి చెందినవాని హృదయంలోను, రేతస్సులోను ప్రవేశిస్తున్నాడు. స్త్రీ గర్భంలో కొంతకాలం వసించి, అటు తరువాత జన్మను గ్రహిస్తున్నాడు.
6. ఉత్తమధర్మి : ఉత్తములు, మహాపుణ్యశీలురు అయినట్టి కొందరు మరణానంతరం తమ పూర్వస్మృతిని అనుసరించి ... స్వర్గము, విద్యాధరపురము మొదలైనవి అనుభవించుచున్నారు. ఇలావత (దేవత) కింపురుషాది రూపానుభవములను, ఇతర కర్మల ఫలములను అనుభవించు చున్నారు. ఇక ఆ తరువాత సంపద యుక్తము, సజ్జనులతో నిండియున్నట్టి ప్రదేశములో మానవులై జన్మించుచున్నారు. ఇట్లు మనుష్య లోకంలో ప్రవేశించి పూర్వసంస్కారములు కారణంగా మరల తపస్సు, ధ్యానము, త్యాగము మొదలైన ఉత్తమ క్రియలయందు ప్రేరితులగు చున్నారు.
x
ఎట్టి వ్యక్తి అయినాసరే, పైన చెప్పినట్టి నియమములకు లోను అవుతూనే ఉన్నాడు. అయితే క్రమము నేను చెప్పినట్లే ఉండవచ్చు. కొంతవేరుగా ఉండవచ్చు. "మోకాలి బొటనవేలు బండరాయిని వేగంగా తాకినప్పుడు గాయము అగును” అనునది నిర్దుష్టమైన సత్యము కదా! అట్లే ఈ లోకంలో ధర్మ-పాపముల నియతి కూడా ప్రవర్తిస్తోంది. “పాపము వలన దుఃఖము, పుణ్యము వలన సుఖము, జ్ఞానము వలన మోక్షము" అనునట్టి ఒకానొక అప్రతిహతమైన సిద్ధాంతము ఈ అంతర్ బహిర్ సృష్టి - - వ్యవహారమునందు ప్రవర్తిస్తోంది. వాస్తవానికి ఆత్మ వ్యతిరిక్తమైనదంతా స్వప్న తుల్యమే అయినప్పటికీ, ఈ సిద్ధాంతము యొక్క నియమమునకు లోటు ఉండటం లేదు. బ్రహ్మ రుద్రాదులైనా సరే, ఈ సిద్ధాంతము యొక్క ఫలితము నుండి తప్పించుకో లేకపోతున్నారు.
మృతుడు శరీరము నేలకూలినప్పుడు (లేక శరీరము త్యజించబడినప్పుడు) ఒకానొక “మరణ మూర్ఛ”లో ప్రవేశిస్తున్నాడని అనుకొన్నాం కదా! అట్టి మరణమూర్ఛ నుండి నిద్ర లేచినవాని వలె తేరుకొనిన తరువాత "ఓహో! నేను మరణించితిని” అని భావించు కొనుచున్నాడు. “మరల పిండప్రదానానంతరం శరీరము వచ్చినది కాబట్టి నేను ఇప్పుడు పుట్టాను" అను వేరొక భావపరంపరను పొందుచున్నాడు. పిండప్రదానమునకు ముందు చిత్రమైన అనుభవములు పొందుచున్నాడు. “నేను ఇట్లిట్లు ఈ ఈ విధముగా వీరిని బాధించియున్నాను. అందుకు ఫలితం లేకుండా పోతుందా?
Page:351
అందుచేతనే కాలపాశమును ధరించి యమభటులు నన్ను గొనిపోవుచున్నారు” అను భావమును అనుభవమును పొందుచున్నాడు. ఆ మృతులలో పుణ్యవంతులు దివ్యములగు విమానములను, ఉద్యానవనములను అనుభవించుచున్నారు. ఓ లీలా! ఈ భావనలు, అనుభవములు ఆ మృతుని శారీరక-మానసిక కర్మలు అనుసరించే ఉంటున్నాయి. అందుచేతనే ప్రతిజీవుడు ప్రతిక్షణం, తనను తాను ఇట్లు ప్రశ్నించుకొంటూ ఉండాలి.
1. ఉత్తమ కర్మలను ఆశ్రయించటం - దుష్ట కర్మలను త్యజించటం.
నేను ఉత్తమ కర్మలనే ఆచరిస్తున్నానా? (లేక “ఇతరులను బాధించటం - వేధించటం” వంటి -
పాపకర్మలను నిర్వర్తిస్తున్నానా?)
2. రాగము - - ద్వేషములను జయించి వేయటం.
రాగ - ద్వేష పూరితుడనై వ్యవహరిస్తున్నానా? అట్లు ప్రవర్తించుటచే ప్రాప్తించు ప్రయోజనం దుఃఖమే కదా!
3. జన్మను, కాలమును సద్వినియోగపరచుకోవటం.
నేను సోమరివలె కాలం వృథా చేయటం లేదుకదా?
ఇట్లు ఆత్మవిమర్శ చేసుకొంటూ సర్వదా ఉత్తమ కర్మలనే ఆశ్రయించాలి. అంతేగాని, కర్మలకు సుస్థానమైన ఈ మానవజన్మను వృథా చేసుకోకూడదు.
పాపకర్మలను ఆచరించియున్నవాడు, "అయ్యో! నాకర్మలకు తగినట్లే మంచు ముళ్ళు పెద్ద గుంటలతో కూడిన “అసివ్రతము” మొదలైన నరకములే నాకు ప్రాప్తిస్తున్నాయి” అని తలపోయుట జరుగుతోంది. దీనినే జనులు “నరకమునకు వెళ్ళుట" అను పదములచే చెప్పుకొంటున్నారు.
మధ్యరకమగు పుణ్యము ఆచరించినవాడు, “ఆహా! నేను ఇప్పుడు ఉన్నది. ప్రయాణించునది.... చల్లటి పచ్చికతో కప్పబడిన సుందర మార్గమునందు కదా! చల్లటి నీడగల ఈ మార్గమున నేను ‘యమపురము’నకు వచ్చాను. కృతపతియగు యముడు ఈ నా పుణ్య-పాప కార్యములను విచారించుచున్నాడు” అనునదంతా తన హృదయంలోనే పొందుచున్నాడు.
చూచావా లీలా! ఈ విధంగా అందరు కూడా మరణానంతరం భిన్నభిన్నములైన పారలౌకిక అనుభవములను తాము శరీరం త్యజించినచోటే అనుభవిస్తున్నారు. అయితే, ఇందలి చమత్కారమేమిటో గమనించావా! అనేక అర్థ క్రియలతో కూడిన ఈ విస్తారమైన సంసారమంతా “సత్యమే అయివున్నది” అని అనేకమంది జీవులు భావించుకొనటం జరుగుతోంది. మరి, మాయ యొక్క ప్రభావం అట్టిది. ఒకవైపు ఈ సంసార వ్యవహారమంతా ఇట్లు ఉంటూ, జరిగిపోతూ ఉండగానే మరి కొందరు జీవులయందు మరొకవైపు సుస్థిరమైన 'ఆత్మదృష్టి' లేక 'స్వస్వరూపదృష్టి' ఉంటోంది. అట్టి స్వస్వరూప దృష్టి శాస్త్రముల యొక్క అర్థమును గ్రహించటం చేత, గురువులు చెప్పు వాక్యములను మననము
Page:352
చేయుటచేత, స్వప్రయత్నరూపమగు సునిశితబుద్ధి చేత కలుగుచున్నది. అట్టి దృష్టి కలవారు, "ఆకాశ సదృశ్యము ఆకార రహితము అద్వయము - స్వస్వరూపమునకు అభిన్నము - సర్వుల సత్యస్వరూపము ..... అయినట్టి “ఆత్మ” ఒక్కటే ఉన్నది. అది మాత్రమే జాగరిల్లియున్నది. ఈ దేశ కాల - క్రియలు, హ్రస్వ - దీర్ఘములైన ఈ ఆకృతులు, ఈ దృశ్యములు .... ఇవన్నీ సత్యము కాదు సుమా” .... అని గ్రహించే ... ఉంటున్నారు.
అది అట్లా ఉంచి, యముని పురమునకు పోయినట్టి జీవుల గురించి విచారిద్దాం. వారు ఇట్లు అనుభవమును పొందుతూ ఉండటం జరుగుతోంది.
"ఆహాఁ! యముడు మా కర్మలను మాచే అనుభవింపచేస్తున్నాడు. ఇక ఆ అనుభవం పూర్తి అయినది ఇప్పుడు త్వరగా స్వర్గలోకం వెళ్ళుచున్నాం.... స్వర్గానుభవం కూడా, చేసిన పుణ్యం ఖర్చు అయిపోవుటచే గతించింది... అయ్యో! ఇప్పుడు పశువు జన్మలు ఎత్తుచున్నామే! ధాన్యములోని అంకురమునయ్యాను ఇప్పుడొక 'ఫలము' అయ్యాను....”
ఇట్లు వారివారి అనుభవములు కొనసాగుతూ పోతున్నాయి. "శరీరము - అంతఃకరణములు - క్రియలు” .... ఈ మూడు లేనట్టి ఆ ధ్యానాంకురము మనుష్యునిచే తినబడినప్పుడు 'రేతస్సు’గా మారుచున్నది. ఆ తరువాత అది యోని ద్వారం గుండా మాతృగర్భంలో ప్రవేశిస్తోంది. గర్భవాసి యగు ఆ జీవుడు పూర్వకర్మానుసారంగా అదృష్టవంతుడుగానో, దురదృష్టవంతుడుగానో, చక్కటి బాలుడుగానో, లేక అవయవముల లోపముగల అనారోగ్య బాలుడుగానో జన్మించుచున్నాడు. ఇక ఆతరువాత చంచలముతో కూడుకొనియున్న బాల్య-యౌవనములను అనుభవించుచున్నాడు. ఇంతలో అతనికి ఎక్కడినుండో వృద్ధాప్యం వచ్చిపడుతోంది. మరల వ్యాధి - మరణము - మరణమూర్ఛ ...
మామూలే. ఇదంతా ఒక మహాచక్రమువలె ప్రవర్తిల్లుతోంది. మరల ఇంకొక దేహము గ్రహించటం ఒక 'కల' వలె జరిగిపోతోంది. ఎంత విచిత్రమో చూచావా? ఆకాశమే రూపముగా గల ఆత్మ చిత్తాకాశమునందు “జీవభ్రాంతిని పొందటం” అనబడు స్థితి మొదలుకొని, "స్వస్వరూపమేమిటో గ్రహించి మోక్షమును పొందటం" అనబడు ప్రశాంత - మౌన - చిదానంద స్థితివరకు ఆయా భ్రాంతిపరంపరలన్నీ ఒకదానివెనుక ఒకటి పొందుతూనే ఉన్నది. పక్షి తన గూడు విడచి ఎక్కడెక్కడో సంచరించి మరల తన గూటికి సాయంకాలం చేరుతుంది చూచావా? ఈ జీవుడు కూడా తన వాస్తవమగు ఆత్మ స్వభావమును మరచి బాహ్యడంబరములను ఆశ్రయిస్తూ అనేక సుఖ-దుఃఖ, జీవన - మరణ అనుభవములను పొందుతూ ఒకానొకప్పుడు కాకతాళీయంగా సర్వదా - స్వభావ సిద్ధమైయున్న ఆత్మత్వమును పొందుచున్నాడు.
Page:353
45. సృష్ట్యాది - జీవభ్రాంతి
ప్రబుద్ధలీల : హే జగజ్జననీ! సరస్వతీదేవీ! నాయొక్క జ్ఞానాభివృద్ధి కొరకు మరొక ప్రశ్న అడుగుచున్నాను. అసలు “సృష్ట్యాది” యందు అఖండ స్వభావమగు ఆత్మకు ఈ “జీవభ్రాంతి” (లేక పరిమితుడను” అను భ్రాంతి) ఎట్లా కలుగుతోంది? నాపై అనుగ్రహంతో ఈ విషయం చెప్పు. శ్రీ సరస్వతీదేవి : నీకు కనబడుచున్నట్టి, లేక నీవు చూస్తున్నట్టి, ఈ "పర్వతములు వృక్షములు - పృథివి - ఆకాశము” మొదలైనవన్నీ విశుద్ధ - చైతన్య స్వరూపములే సుమా! అందుచేత వీటిని ఆత్మవేత్తలు “పరమార్థ ఘనములు” అని పిలుస్తున్నారు. అనగా, అద్వితీయ విశుద్ధ చైతన్యమే ఇన్ని రూపములతో మాయా ప్రభావంచేత ఉదయించుచున్నట్లు అగుపిస్తోంది.
చేతనామయమగు ఈశ్వరుడు సర్వాత్మకుడై, సర్వవ్యాపి అయి వెలయుచున్నాడు. అతడు ఏ రూపమున ప్రతిభాసించుచున్నాడో, అచ్చట ఆ రూపముననే వెలయుచున్నాడు. అట్లే పేర్కొనబడుచున్నాడు. అతడే ఒక కలగంటున్న పురుషునిగా జీవసమష్టి రూపమున ‘ప్రజాపతి’ అగుచున్నాడు. అతడే అట్లు ప్రజాపతి రూపమున సప్త లోకములుగా వివర్తము పొందుచున్నాడు. సృష్టి ప్రారంభమున ఉన్న ఆ సంకల్పమే నేటికీ నిలచియున్నది. ఆ సంకల్పమే పదార్థములు అనుభవంగా ప్రాప్తిస్తోంది.
“నేను పరిమితుడను, అసంపూర్ణుడను, ఏదో పొందవలసినవాడను" అను భావన ఏర్పడటం యొక్క ప్రారంభముచే సృష్టి ప్రారంభముగా చెప్పబడింది.
ఈ దేహమును చూచావా? వాయువు రోమకూపములగుండా ఈ దేహమును ప్రవేశిస్తోంది. ప్రాణవాయువు శరీరంలో ప్రవేశించి అన్ని అవయవములు కదలాడేటట్లు చేస్తోంది. ఇట్టి ఈ 'మానవ - జంతు' దేహములను "జీవిత దేహములు” లేక “జంగమములు” అని అంటున్నాం. ఇక వృక్షాల విషయానికి వస్తే వాటికి కూడా దేహములు కనబడుచున్నాయి కదా! అయితే అవి చేతనములు అయివుండి కూడా చలనము లేక ఉంటున్నాయి. అందుచేత, వాటిని “స్థావరములు” అని అంటున్నాం. అయితే, ఈ స్థావర - జంగమ జీవారణ్యంలో విహారం చేస్తున్నదెవరు? ఈశ్వరుడే సుమా! ఈశ్వరుడే ఈ స్థావర జంగమములలో ఏకస్థుడై, హృదయస్థుడై ఉండి ఉన్నాడు. ఉపాధి భేదములచేత “ఇది జడము - ఇది జంగమము” అనునదంతా ఏర్పడుతోంది.
చిదాకాశమే తన స్వరూపము కంటే అన్యము కానట్టి 'బుద్ధి' అను దానిలో తనకు తానే ప్రవేశించుచున్నది. అట్టి బుద్దితో కూడి ఈ ఉపాధి అను నగరం ప్రవేశిస్తోంది. ఈ శరీరములో “చక్షువులు - - చెవులు - ముక్కు - చర్మము” . .... మొదలగు ఇంద్రియ స్థానములను ఆ చిదాకాశ చైతన్యమే దర్శిస్తోంది. అటు తరువాత అయ్యది బుద్ధివృత్తులు ద్వారా 'బాహ్యము' అనుదానిని కల్పించుకుని ఆ బాహ్యమునందు ఆయా పదార్థ జాలమంతా ప్రకాశింపజేస్తోంది. ఓ లీలా! ఈ
అద్వితీయము = దేనికైతే రెండవది అనుదే ఉండదో, అద్దానిని 'అద్వితీయము' అని అంటాం.
Page:354
కళ్ళు మొదలైనవి స్వయంగా చేతనములు కావు. అవి తమంతట తామే ఎట్టి అనుభవమును పొందలేవు. కనుక జడములే అయివున్నాయి. కాబట్టి సర్వనియామకములకు కారణము, కారణ కారణము చిత్సంకల్పమే సుమా! కొంత సూక్ష్మదృష్టి గలవారే .... “సర్వేంద్రియములలో ఏకరీతిగా వెలుగుచున్నట్టి – సర్వేంద్రియములకు సంబంధించనట్టి” . చిత్సకంల్పమును గుర్తించుచున్నారు. విభాగించుచున్నారు.
శూన్యాకారమగు చిత్సంకల్పమే ఆకాశము.
భూమ్యాకారమైన చిత్సంకల్పమే .... ఈ విశాల నదీ నద గ్రామ పట్టణాలతో ఉన్న భూమి. జలశక్తి సంప్నమగు చిత్సంకల్పమే "జలము",
ఆ చిత్సంకల్పమే జంగమ సంకల్పము వలన జంగమ పదార్థములుగాను, స్థావర సంకల్పము వలన స్థావర - పదార్థములుగాను వివర్తము పొందుచున్నది.
- “చిత్ సంకల్పమే అన్నివైపులా ప్రసరిస్తూ ఉండి ఉంటోంది. చిత్ సంకల్పము తప్ప వేరుగా ‘జగత్తు’ అనబడునది లేదు. ఆ చిత్ శక్తియే మనుష్యులు - - జంతువులు - వృక్షములు - శిలల రూపమును గ్రహించుచున్నది” అని జ్ఞానులు నిస్సంకోచంగా గ్రహించుచున్నారు. ఇక అజ్ఞానుల దృష్టి అంటావా? అది అట్లు లేదని వేరుగా చెప్పనక్కర్లేదు. అజ్ఞానులు ఎట్లా భావిస్తున్నా, అది మనకు ప్రమాణం కాదు కదా!
చూచావా లీలా? ఆ చిత్సంకల్పము “సృష్ట్యాది” యందు .... అనగా అది తన అఖండత్వము అప్రమేయత్వములతో, కూడిన చిత్స్వభావము నుండి 'చ్యుతి' పొందినప్పుడు ... ఏయే రూపములుగా ఉండగోరినదో, ఇప్పుడు కూడా ఆయా రూపములుగానే ఉన్నది. అప్పుడు ఏ విధంగా అయితే 'వృక్షములు' మొదలైన పదార్థములు భావించబడ్డాయో ఇప్పుడు కూడా అవన్నీ అట్లే ఉంటున్నాయి. అయితే బిడ్డా! “జడము” అని “చేతనము” అని వేరువేరు పదార్థములు లేవు సుమా! ఈ జడ-చేతముల “సత్త”గా బ్రహ్మపదార్థము ఒక్కటే ఉండి ఉన్నది. సద్వస్తువగు ఆత్మ ఒక జడవస్తువునుగాని, లేక, ఆత్మను జడవస్తువుగాని ఆశ్రయించుకొని ఉండజాలవు. అందుచేత “'జడము' అనబడు విభాగమే మిథ్య అయివున్నది” అని సత్య ద్రష్టలగు మేము సిద్ధాంతీకరించు చున్నాము. వృక్ష - పర్వతాదులు కూడా చిదేకరసముతోడనే నిండియున్నాయి. ఇక, “ఇవి జడములు” అనునట్టి కల్పనచే ఏర్పడుచున్న అనుభవం - ‘బుద్ధి’ యొక్క ‘ఆరోపణ’ మాత్రమే అయివున్నది.
ఆయా వస్తువులయందున్న “ప్రత్యక బుద్ధి” తమ్ము ఆయా వృక్ష శిలాదులుగా భావించుకొనుచు, ఆరూపముననే అభివ్యక్తమౌతున్నాయి. అట్లే వ్యవహరించబడు చున్నాయి. అట్లే-క్రిమి-కీటక-పక్షిజంతువులు మొదలైన జంగమ పదార్థముల భావన కూడా. ఆయా జంగమ - - జాతులపట్ల గల బుద్ధి వికారభేదములే ఆయా నామ రూప భేదములతో ప్రాప్తిస్తున్నాయి. ఒకే జలంలో తరంగములు, ఆవర్తములు, బుడగలు, నురుగు, సుడిగుండములు కలుగుచున్నట్లు, ఒకే చిత్స్వభావము
Page:355
నందు ఏర్పడు బుద్దివృత్తులే ఈ స్థావర - జంగమ వ్యవహారమంతా కల్పిస్తున్నాయి. అయితే, 'కల్పన'తో కూడిన బుద్ధియందే నామ - రూపభేదములు ఉండి ఉన్నాయని గ్రహించు. ఒక సముద్రము యొక్క ఉత్తరమున ఉన్నవారు దక్షిణమున ఉన్నవారి గురించి తెలియకనే ఉండటం జరుగవచ్చుకదా! అదేవిధంగా, ఈ స్థావర - జంగమ పదార్థములు కూడా తమ ‘స్వస్వరూపము’ను గ్రహించలేకపోతున్నాయి. ఇవి తమతమ "ప్రత్యక్ చైతన్య జ్ఞానవలయము” నందే పడివుంటున్నాయి. అనగా, “నేను వేరు. ఈ కనిపించేదంతా వేరు. నీవు వేరు, ఇవి నాకు చెందినవి. ఇవి నాకు సంబంధించినవి కావు. వీరు మాత్రమే నా వారు” అనునట్టి భావావేశమునే ఇక్కడ మనం “ప్రత్యక్ జ్ఞానవలయము” (Compartmentalised individual sphere of consciousness)గా చెప్పుకొంటున్నాం. అట్టి వలయమున బంధింపబడటం చేతనే ఒక ఉపాధిలోని బుద్ధి మరొక బుద్ధిలోని కల్పనలను ఎరుగజాలకున్నది. ఇదంతా కూడా బుద్ధికల్పనను అనుసరించే జరుగుతోంది.
“పరబ్రహ్మము” సత్ + చిత్రూపము కదా! అది వాస్తవానికి నామరూపరహితమై ఉన్నది. అట్టి పరబ్రహ్మమునందు సత్యదృష్టికి వాయువు, భూమి, ఆకాశము, మొదలగు పదార్థముల
సత్త లేనేలేదు. అయినప్పటికి వాటికి కల్పనా మాత్రమైన సత్త ప్రాప్తిస్తోంది. రాతిలో ఉన్న కప్ప బైట కప్పను, బైట ఉన్న కప్ప రాతిలోని కప్పను కనుగొనలేవు కదా! ఈ ఈ నీవు-నేను మొదలైన వ్యవహారములు, వాటితో ముడి వేసుకొని ఉంటున్న ఈ పదార్థజాలం .... ఇవన్నీ ఆక్రమించి ఉన్న సమయంలో “సర్వసమత్వము” మరుగునపడి ఉంటోంది.
అయితే ఆత్మకొరకై అన్వేషిస్తున్న విజ్ఞులు ఈ జగత్తు యొక్క “సూక్ష్మావస్థవైపు దృష్టిని సారిస్తున్నారు. “మహాప్రళయ సమయంలో ఈ సమష్టి చిత్తము మాయయందు లీనమై ఉంటోంది. అట్టి సృష్టి చిత్తమే ఈ బాహ్యానికి కనబడే ‘జగత్తు’ యొక్క “సూక్ష్మావస్థ”గా వారు దర్శిస్తున్నారు. మహాప్రళయస్థితి తరువాత మరల ఆ ప్రత్యక్ చైతన్యము చిదాకాశమునందు భావనావ్యవహారమును గావించుచున్నది. అట్టి భావనను ప్రారంభించటంచే సృష్టి ప్రారంభము అని అంటున్నాం. సృష్ట్యాదియందు ఇదంతా ఎట్లు ప్రారంభించబడినదో, నేటికీ అట్లే నిలిచియున్నది. ఉదాహరణకు, సృష్ట్యాది యందు వాయువు స్పందన ధర్మముగా చింతించబడినది. అది ఇప్పటికీ అట్లే నిలచియున్నది. ఉపాధులు వచ్చి పోవుచున్నంత మాత్రంచేత ఈ కల్పన తొలగదు. సర్వకల్పనలు త్యజించబడునట్టి ‘మహా ప్రళయము’ వరకు ప్రత్యక్ చైతన్యము పట్ల ఈ కల్పన ఇట్లాగే ఉంటోందని గ్రహించాలి.
అట్లు ఛిద్రరూపమున చింతింపబడినదే ఇక్కడ ఎదురుగా ఆకాశము రూపమున ప్రాప్తిస్తోంది. అట్టి ఆకాశమునందు 'స్పందము' అను ధర్మము గల వాయువు వెలయుచున్నది. వాయువు సర్వవ్యాపి కదా! అయినప్పటికీ శుష్క గడ్డిపరకలను కదల్చగలుగుతోంది కాని, భారమైన పదార్థములు కదల్చకలుగుతోందా? లేదు. దాని ధర్మము అట్లు సంకల్పించబడింది. ఈ కల్పనలను చేయుచున్న ‘చిత్తము’ యొక్క వ్యవహారం కూడా చమత్కారంగా ఉంటోంది. ఇది సర్వత్రా వ్యాపించియుండి,
Page:356
సర్వత్ర ప్రసరించగలిగిన శక్తి కలిగియే ఉన్నది. కాని ఇది తనను తానే స్వయముగా పరిమితము చేసుకొనుచున్నది. వాయువునకు 'స్పందము’ అనునది ధర్మము అగుచున్నట్లు, అగ్నికి ‘ఉష్ణత్వము’ సహజమగుచున్నట్లు, ఈ చిత్తమునకు "పరిమితత్వము” సహజధర్మమగుచున్నది. ఈ చిత్తమే స్పందాస్పందములను రెండు ధర్మములను స్వీకరిస్తోంది. అట్టి స్పందము - - అస్పందము (Responsive - Non-responsive) అను ధర్మముల ననుసరించి 'స్థావరములు - జంగమములు' అను రెండు ఆకారములను దాల్చుచున్నది.
ఈ విధంగా “బుద్ధి-చైతన్యము” నందు భ్రమమయములైనట్టి జగత్ పదార్థములు కిరణముల వలె సృష్ట్యాది నుండి నేటివరకు ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఇదంతా ప్రత్యక్ చైతన్యము తనయందు కల్పించుకొని ఇట్లు దర్శించుటయేనని నీవు గ్రహించు. ఈ జగత్ పదార్థముల విజృంభణమంతా అసత్యమే అయినప్పటికీ సత్యమువలె ప్రతిభాసిస్తోంది. కాబట్టి లీలా! నీవు నీ అత్యంత సుతీక్షణమైన సూక్ష్మదృష్టిని అలవరచుకో. అట్టి నిర్మల సూక్ష్మ దృష్టిచే, “ఈ దృశ్యజగత్తు ఏమైయున్నది? జగత్తులోని విషయములేమిటి? నేను నీవు.... మొదలైనవాటి వాస్తవమైన స్వరూప - స్వభావములు ఏమిటి?" అనే విషయాలు స్వవిచారణాపూర్వకంగా గ్రహిస్తావు.
ఓ ప్రియలీలా! అటు చూడు. అక్కడ యుద్ధభూమిలో ఏమి జరుగుతోందో గమనించు. చైతన్యము యొక్క 'పరిమిత దృష్టిచే, ఒకప్పటి పద్ముడు అయిన విదూరథుడు ఇప్పుడు నేలపై మృతప్రాయుడై పడియున్నాడు కదా! ఈతడిప్పుడు మరణించి, పుష్పములచే కప్పబడియున్న పద్ముని మృతదేహముయొక్క హృదయ కమలంలో ప్రవేశించ బోవుచున్నాడు.
ప్రబుద్ధలీల : అమ్మా! ఈతడిప్పుడు ఏ మార్గం అనుసరించి ప్రయాణం చేయబోవు చున్నాడు? ఆ పద్మని మృతదేహము ఉన్నచోటికి ఎట్లా చేరబోవుచున్నాడు? మనం కూడా అట్లే ఆతనిని అనుసరించి ప్రయాణం చేద్దామా?
46. వాసనలు - పరలోక ప్రయాణం
శ్రీ సరస్వతీదేవి : చిన్మయస్వరూపుడగు జీవుడు “దూరముగా ఉన్నట్టి పరలోకమునకు వెళ్ళుచున్నాను” అని భావిస్తూ ఉంటాడు. అట్లే విదూరథుని విషయం కూడా. అతడు అట్లే భావించుచు, తన హృదయంలో గల వాసనాపథమును అనుసరించే పయనించుచున్నాడు. మనం కూడా ఆ మార్గమునందే పోదాము, పద! నీవు అతని సాన్నిధ్యం కోరుకొంటున్నావు కదా! నీ అభీష్టం కూడా తీరగలదు. నీ వాంఛ సిద్ధించినప్పుడే మన స్నేహం దృఢం అవుతుంది. అందుచేత, నీవు సర్వము దర్శించటానికి వీలుగా దివ్యదృష్టి ప్రసాదిస్తున్నాను.
సరస్వతీదేవి యొక్క ఈ పలుకులు వినుటచే లీలాదేవి హృదయంలో ఎక్కడో దాగివున్న శోకమంతా ఉడిగిపోయింది. ఆమెయందు జ్ఞానసూర్యుడు ఉదయించాడు.
Page:357
అక్కడ యుద్ధభూమిలో విదూరథుని దేహం క్రమంగా చైతన్యం కోల్పోసాగింది. మూర్ఛితులై పడివున్న అతని కనుపాపలు తిరుగసాగాయి. పెదవులు ఎండిపోసాగాయి. ప్రాణము ఒక్కటే మిగిలియున్నది. శరీరమంతా ఎండిన ఆకువలె తయారయింది. ముఖములో కాంతి క్షీణించుటచే పాలిపోయింది. ప్రాణవాయువులు తుమ్మెదలవలె ధ్వనిస్తూ ముక్కు వద్ద సంచరించసాగాయి. ఇంద్రియముల చేతలన్నీ కట్టుబడిపోయాయి. అవయవముల కదలిక ఆగిపోయింది. ఒక పక్షి వృక్షపు కొమ్మలను త్యజించి ఆకాశంలోకి ఎగిరిపోతుంది చూచావా? ప్రాణవాయువులు అట్లే క్రమంగా అతని భౌతిక శరీరాన్ని విడచాయి. ఆ పడతులిద్దరూ దివ్యదృష్టిచే ఆకాశంలోకి ఎగిరిన ఆ జీవుని గాంచసాగారు. అతని జీవచైతన్యము వాయువుతో కలసినదై, తనయందలి వాసనలను అనుసరించి, ఆకాశపథంలో దూరంగా పయనించసాగింది. సరస్వతీ-లీలలు ఆ జీవచైతన్యమును
అనుసరించారు.
శరీరము త్యజించినప్పుడు “మరణమూర్ఛ" అను జడత్వము పొందిన ఆ జీవచైతన్యము ఆ మరణమూర్ఛ నుండి చేరుకొని అనుభవజ్ఞానం పొందసాగింది. వాయువులో ఉండే సువాసన యొక్క కణమువలె, ఆ జీవచైతన్యము ఆకాశప్రదేశంలోనే ఉండి ఈ విధమైన అనుభవం పొందసాగినది
“బంధువులు నన్ను ఉద్దేశించి" ఊర్థ్వదైహిక (Trace-body) కార్యములను ఒనర్చటం జరిగింది. అట్టి సంకల్పపూర్వకమైన, మంత్రముగ్ధమైన కార్యముల ప్రభావంచేత నేను ఇప్పుడు ఒకానొక సూక్ష్మతత్వపూర్వకమైన ఏదో దేహమును పొందాను. అట్టి నా ఈ నూతన సూక్ష్మదేహమును యమభటులు వచ్చి గొనిపోవుచున్నారు. ఇప్పుడు కర్మఫలములను అనుభవించునట్టి యముని పట్టణము చేరాను. నేనిప్పుడు యముని సమక్షమునకు కొనిరాబడ్డాను. ఇప్పుడు యముడు నావైపు చూచాడు. తన దూతలవైపు తిరిగి "ఓ దూతలారా! ఇతడు ఎన్నడూ ఈ పాపములు ఒనర్చలేదే? పైగా, ఎల్లప్పుడూ ఏదైనా పవిత్ర కార్యములనే నిర్వహించాలనే ప్రయత్నంలో ఉండేవాడు. జగజ్జననియగు సరస్వతిని ఎల్లప్పుడూ భక్తితో పూజించుచుండటంచే ఆమె దయకు పాత్రుడయ్యాడు. ఆమె వరప్రసాదంచేతనే ఇతడు వర్ధిల్లినాడు. ఇతని ఇతః పూర్వపు 'పద్ముని’ ఉపాధి ఇప్పుడు పుష్పములతో కప్పబడి, చెక్కుచెదరకుండా ఉన్నది. ఇతనిని విడచిపెట్టండి. ఇతడు ఆ శరీరములో ప్రవేశించును గాక!” మరుక్షణం యమభటులు నన్ను బంధవిముక్తుని చేశారు. యంత్రము నుండి విడివడిన రాయివలె నాయొక్క జీవచైతన్యము ఆకాశదేశంలో పడింది. నేను జగద్గృహము నుండి వెలువడి ద్వితీయ బ్రహ్మాండములో ప్రవేశిస్తున్నాను. ఇక్కడ నాకు చెందిన భౌతిక దేహము ఉన్నది.....” ఇట్లు ఆ విదూరథ జీవచైతన్యము అనుభవము పొందుతోంది. అతని దృష్టిలో పడకుండానే సరస్వతీ-లీలలు కూడా అతనిని అనుసరిస్తూ రాజగృహంలో ప్రవేశించారు.
#
Page:358
శ్రీరాముడు : హే బ్రహ్మాజ్ఞా! వసిష్ఠమహర్షీ! విదూరథుని జీవచైతన్యము పద్ముని భౌతికదేహము ఉన్నట్టి రాజగృహమునకు మార్గము ఎట్లా గ్రహించింది? ఆ గృహంలో ఎట్లా ప్రవేశించింది? శ్రీ వసిష్ఠమహర్షి : విదూరథుని జీవచైతన్యము యొక్క హృదయంలో పూర్వ వాసనాబలం చేత, “నేను పద్ముని శరీరమును” అనునట్టి అహంకారము ఇమిడియున్నది. అందుచేతనే పద్ముని దేహము ఉన్నట్టి రాజమందిరమునకు అనాయాసంగా ప్రయాణించింది. ఒక మఱివిత్తు తనయందు సూక్ష్మరూపంలో ఒక “ఊడలతో కూడిన మహావృక్షము” కలిగియుండి, ఆయా తగినట్టి దేశకాలాదులు ప్రాప్తించినప్పుడు విస్తారమైన మహావృక్షంగా ప్రకటితమౌతోంది కదా! అదేవిధంగా జీవచైతన్యము కూడా తన హృదయమందు ఉన్నట్టి వాసనల "ఉద్బోధకము” లభించినప్పుడు, అవి “పరిపుష్టం” అవటం (లేక దృఢంగా ప్రకటితం కావటం) గాంచుచున్నది. బీజంలో అంకురం ఉంటున్నట్టు, హృదయంలోనే స్వప్నం ఉంటున్నట్లు ... చిత్స్వరూపుడగు ఈ జీవుడు తనయందే ఈ ముల్లోకములను అనుభవించు చున్నాడు. ఒకడు ఒకచోట ఉండి స్వీయ కల్పనాజగత్తులో ఎక్కడో ఉన్న స్త్రీ, పురుషులు, సమస్త వస్తుజాలమును గాంచుచున్నాడు కదా! జగత్తుగా, ముల్లోకములుగా కనిపించేదంతా ఆ జీవుని యొక్క సంస్కారములే సుమా! ఈ జీవుడు వందలకొలది జన్మలను, స్వీయ వాసనలను అనుసరించి అభీష్టములను, అందుకు ప్రయోజనంగా సుఖదుఃఖ ములను, ఆ సుఖదుఃఖములకు సముచితములై కర్మలను, ఆ కర్మల నుండి వాసనలను ... ఇట్లు చెట్టు-విత్తుల వలె పొందుతూ పోతూనే ఉన్నాడు. ఇదంతా భ్రాంతియే సుమా! వాస్తవానికి జీవుడు జన్మించడు. మరణించడు. అయినను ఈ జననము - జీవనము - మరణము - - అంతా సత్యమువలెనే అతనికి కనిపించుచున్నది.
47. పిండప్రదానం
శ్రీరాముడు : హే భగవానుడా! వసిష్ఠమహర్షీ! సర్వము సంస్కారబలంచేతనే ప్రాప్తిస్తున్నదని అంటున్నారు కదా! మరి “పిండప్రదానము బంధువులచే ఒనర్చబడినప్పుడు, ఆ పిండప్రదాన ప్రభావం చేత ఒకానొక నూతన శరీరం ప్రాప్తిస్తోంది" అని మీరు ఎందుకు చెప్పారు? బంధువులు చేసే పిండ ప్రదానము వలన మృతుడికి ఏమైనా లభిస్తుందా? లభిస్తే ఎట్లా లభిస్తుంది? శ్రీ వసిష్ఠమహర్షి : పిండము వేయబడవచ్చు. వేయబడకపోవచ్చు. కాని, “వేయబడినది” అని మృతుడు భావించినంతమాత్రంచేతనే అతనికి పిండప్రదాన ఫలము లభిస్తుంది.
“చిత్తము ఏ రూపంలో ఉంటే, జీవుడు కూడా ఆ రూపమునే దాల్చును” అని విద్వాంసులు గ్రహిస్తున్నారు. ఈ నియమము మృతులపట్లనే కాదు. జీవితులపట్ల కూడా వర్తిస్తోంది. పిండము పొందినవాడు, “పిండమును పొందితిని” అని భావించటంచే అతనికి పిండ ఫలము దక్కుచున్నదని అనుకొన్నాం కదా! అదే విధంగా పిండము ప్రదానము చేయబడినవాడు, “నేను పిండము పొందలేదు” అని భావిస్తే అతనికి ఆ ఫలము లభించటంలేదు.
Page:359
నేను చెప్పేది చమత్కారంగా ఉన్నమాట నిజమే. కాని, నేను చెప్పేదానికి దృష్టాంతము ఈ జగత్తులోని పదార్థములే. భావనాబలము చేతనే ఈ ఎదురుగాగల దృశ్యములోని పదార్థములు సత్యమైన విషయములవలె అనుభవించబడుచున్నాయి. చూపునుండే సౌందర్యము అనుభవించబడు చున్నది కదా! భావన నుండే పదార్థముల ఉనికికి సంబంధించిన అనుభవం ప్రాప్తిస్తోంది. భావనాబలంచే విషము అమృతంకాగలదు. "గరుడోపాసకుల” విషయంలో ఇది మనకు కనిపిస్తోంది కదా!
అసత్యపదార్థములు, విషయములు కూడా భావనాబలముచే ఆ భావనను అనుసరించి సత్యములే అగుచున్నాయి. ఈ అసత్య - పదార్థములన్నీ సత్యమైయున్నట్టి బ్రహ్మము నందే అధ్యారోపితములై ఉన్నాయి. అందుచేత రామా!
“కారణము లేకుండా ఎవరికీ ఎట్టి భావన ఉదయించదు. సర్వమునకు మూలకారణము సద్వస్తువే. ఆత్మకు సంబంధించని విషయముగాని, ఆత్మయందు బీజత్వము లేనట్టి వ్యక్తిగాని, ఆత్మకు బాహ్యమైయున్నట్టి (వేరుగా ఉన్నట్టి) ప్రవర్తనగాని, వ్యవహారములు గాని లేవు.....”
అనునట్టి సమాధానము అంతరంగమున పొందియుండుము. సర్వసమత్వ సాధనచే మాత్రమే ఆత్మ అనుభవమునకు రాగలదు. అట్టి బ్రహ్మమునకు వేరు కారణమంటూ లేదు. అనగా అది కారణరహితము. అదియే సర్వమునకు కారణము, స్థానము, ప్రేరణము కూడా. ఈ జగత్తు విషయానికి వస్తే, ఇక్కడ 'మహాప్రళయము' అను స్థితివరకు ఏ ఒక్క కార్యమునకైనా కారణము ఉండియే తీరుతుంది. కారణం లేనట్టి కార్యము ఎవ్వరూ గాంచటం లేదు. వినటంలేదు.
విశుద్ధమగు చైతన్యమే వాసనారూపమున 'కార్య కారణములు' అను ఉభయ భావములను పొందుచున్నది. చైతన్యమే జగత్తుగా ప్రతిభాసిస్తోంది. అందుచేతనే జీవించియున్నవారి శుభ సంకల్పములు ప్రేతమును స్పర్శించగలుగుచున్నాయి.
శ్రీరాముడు : ఒకానొక జీవుడు ఈ విధంగా తలచాడనుకోండి : “నాకు పిండప్రదానాదులను చేసేవారు లేరు”
ఇప్పుడు ఇట్టి అభిప్రాయంగల ఆ జీవుడు మృతిచెందాడని అనుకొందాం. అట్లు మృతిచెందన వ్యక్తిని ఉద్దేశించి అతని బంధువులు గోదాన, భూదానాది అనేక ధర్మ కార్యములు కూడా నిర్వర్తించారనే అనుకొందాం. అప్పుడా ధర్మకార్యములన్నీ ఆ జీవునిపట్ల ఫలప్రదం అవుతాయా? కావా? బంధువులు చేస్తున్న దాన ధర్మాది కార్యములు క్రియాపూర్వకమైన సత్-సంకల్పము. కాని, అతడు చింతించునది అసత్యము కదా! మరి, వీటిలో ఎద్దానిబలం ఎక్కువగా ఉంటుంది? "నాకు వీటి నుండి ప్రాప్తించగల ధర్మమంటూ ఏదీ లేదు” అని తలచినప్పుడు అట్టి మృతుని పట్ల జరుగుచున్నదేమిటి?
(గరుడోపాసకులు “నేను ఈ పేరుగల వ్యక్తియొక్క శరీరమునందు పాముకాటుచే ప్రవేశించిన విషమును బయటకు తోలివేయుచున్నాను” అని దూరముగా ఉన్న ఒకని శరీరము గురించి సంకల్పించినప్పుడు, అది అట్లే సిద్ధిస్తూ ఉంటుంది. ఇది సంకల్పము యొక్క బలమునకు నిదర్శనం)
Page:360
శ్రీ వసిష్ఠమహర్షి : మరణించినవాని బంధువులు ధర్మవాసనతో కూడుకొన్నవారై, శాస్త్రములచే విధించబడిన ద్రవ్య-క్రియ-మంత్ర-స్థల-కాలముల నియమమును అనుసరించి చేస్తున్నారు కదా! కాబట్టి శాస్త్రములచే చెప్పబడిన విధంగా శ్రాద్ధాదులు, దాన - ధర్మాదులు ఆ ప్రేతమునకు శుభమే కలుగజేస్తాయి. ప్రేతము యొక్క వాసనల కంటే 'ధర్మము' యొక్క వాసనయే సాధారణంగా బలవత్తరమై ఉంటుంది. ప్రేతవాసన స్వకల్పితము. అంతేగాని శాస్త్రప్రమాణితము కాదు కదా! కనుక ప్రేతమును (మరణించినవానిని) ఉద్దేశించి చేసిన సశాస్త్రీయములైన దాన ధర్మాదులు ఆ ప్రేతమునకు సుఖ-శాంతులనే కలుగజేస్తాయి. ఆ కర్మను నిర్వర్తిస్తున్న బంధువుయొక్క శుభసంకల్పమే అందుకు కారణమగుచున్నది.
అయితే ఇక్కడ ఒక విషయం నీవు గమనించాలి. ప్రేతము (మరణించిన జీవుడు) శాస్త్రకర్మలను ద్వేషించువాడు, వేదములను మొదలంట తిరస్కరించువాడు, నాస్తికుడు అయితే, ఆ ప్రేతము యొక్క సంకల్పమే అధికబలము కలిగియుంటుంది. అట్లు కాకపోతే అతని నికృష్టవాసన తప్పకుండా ధర్మవాసనచే (బంధువులచే నిర్వర్తించబడిన దానాదుల సంకల్పబలంచే) జయించబడగలదు. ఈ విధంగా, “బంధువుల శాస్త్రీయమైన సంకల్పబలం - మృతుని అభిప్రాయబలం” .... ఈ రెండిటిలో ఏది అధికబలము కలిగినదైతే అయ్యదియే రెండవదానిని జయించి వేస్తోంది. అందుచేత, మిక్కిలి ప్రయత్నముచే శుభకర్మలను (దాన ధర్మములను) నిర్వర్తించటం, “ఈ ప్రేతమునకు శుభమగుగాక! శాంతమగుగాక” అని సంకల్పించటం ఉచితమే అని మా అభిప్రాయం. ప్రేతమును దృష్టిలో పెట్టుకొని, శుభకర్మలు శుభసంకల్పములచే నిర్వర్తించబడుగాక!
48. వాసనయొక్క ఆరంభం
శ్రీరాముడు : హే మహర్షీ! ఇక్కడ నాకు ఒక ముఖ్యమైన సందేహం ఉదయిస్తోంది.
అంతరంగమున ఉన్న "వాసన” దేశ కాలాదుల సానుకూల్యతను అనుసరించి వికసించినప్పుడు విత్తు మహావృక్షం అగుచున్నట్లుగా, ఈ శరీరాదులు, బాహ్య జగత్తు ప్రాప్తిస్తున్నాయని మీరు అన్నారు కదా! మరి మొట్టమొదటగా ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది? కల్పాది లో దేశ కాలాదులు లేవంటారా? అట్లా అయితే, ప్రథమ సృష్టికి కావలసిన వాసన ఎక్కడి నుండి వచ్చింది? ఈ దృశ్యసమూహములు ఇట్లు ప్రాప్తించుచుండుటకు అంతరంగమునందలి వాసనలే కారణమని పెద్దలు అంటున్నారు కదా! ఎవరి యొక్క వాసనలచే మొదలు ఏది? అవి జీవచైతన్యము నందు... దేశము - కాలము అనబడే సహకారికారణాలు (supportive cause) లేక పోయినప్పుడు కూడా... ఎట్లా దాగి ఉంటున్నాయి?
కల్పాది = శుద్ధచిత్ స్వరూపమగు ఆత్మ, “అభిలాష ఆకాంక్షలతో కూడిన బాహ్యకల్పన నాశ్రయించినప్పుడు, అదియే సృష్టి అనబడుదానికి ప్రారంభంగా చెప్పబడింది. శాస్త్రములు దానిని “సృష్ట్యాది” అని పిలుస్తున్నాయి. అదియే ‘కల్పాది’ కూడా.
Page:361
శ్రీ వసిష్ఠమహర్షి : మంచి ప్రశ్నే వేశావు. సరే సమాధానం చెబుతాను. సూక్ష్మబుద్ధితో విను. "సృష్ట్యాదియందు దేశకాలాదులు లేవు" అని నీవు నీ మాటలననుసరించి గ్రహించియే ఉన్నావు కదా! అవును. అది అక్షరాలా నిజం. ఎందుచేతనంటావా? సృష్టికి ముందు బ్రహ్మము మాత్రమే కలదు. అట్టి బ్రహ్మమందు దృశ్యపదార్ధములు ఉత్పన్నము అగుటకు కారణము లేదు. ఎందుకంటే, “కారణము” అనేది ఎంత పరిశీలించినా లభించకయే ఉన్నది. ఒకవేళ "ఈ దృశ్యము బ్రహ్మమునందు ఉండి ఉండుటకు ఒకానొక కారణము ఉన్నది" అని ఎవరైనా నిర్ణయిస్తే, అకారణమునకు మరల కారణ-కారణం (cause for that cause)గా మరొకటి ఉండి ఉండాలి. ఈ విధంగా దీనికి అంతువుండదు. ‘కారణము' అనునది లభించక పోవుటచే ఈ “దృశ్య పదార్ధములు” అనబడు కార్యము కూడా లేనిదే అగుచున్నది. అనగా ఈ దృశ్యపదార్థములు స్వతహాగా ఉత్పన్నమే అయి
ఉండలేదు.
సృష్ట్యాది యందే ఉత్పన్నము అయివుండనట్టి ఈ 'జగత్తు' అనబడు దానికి ఇక వినాశనమెక్కడ ఉంటుంది? ఏదైనా ఉత్పన్నమైతేకదా, దానికి వినాశనం ఉండటం!
అందుచేత, ఈ కనబడేదంతా ఇందలి దేశకాలాదులతో సహా సర్వదా చిదాకారమగు బ్రహ్మమే అయివున్నది. మరింకేమీ అయి ఉండలేదు. ఈ విషయం నిరూపించటానికి నేను మన ఈ విచారణయందు అనేక యుక్తుల సహాయంతో ప్రయత్నించబోవుచున్నాను. "ఈ దృశ్యము ఏ సమయమందు కూడా ఉద్భవించియుండలేదు. ఇదంతా బ్రహ్మముకాక మరింకేమీ కాదు” అని తెలియచెప్పుటయే ఆ మన ఇరువురి సంవాదము యొక్క ప్రయోజనమైయున్నది. ఈ ఉత్పత్తి ప్రకరణము యొక్క సారము అదే. అయితే ఇదంతా జీవుడు తన వాసనానుసారంగా మాత్రమే గాంచుచున్నాడు" అనుశబ్దములచే "సృష్టి-సంసారము" అనుశబ్దములచే ఉద్దేశించబడుతోంది. మరల మనం కథలో ప్రవేశిద్దాం.
❖
జ్ఞప్తి దేవతయగు సరస్వతీదేవి, లీలాదేవి పద్ముని అంతఃపురంలో ప్రవేశించారు. పద్ముని భౌతిక దేహం ఇతఃపూర్వంవలెనే ఒక విశాల గృహం మధ్యలో సువాసనలు వెదజల్లు పూలతో కప్పబడి ఉన్నది. తలవైపు మంగళ ద్రవ్యములు ఉండే పూర్ణకుంభములు ఉంచబడి ఉన్నాయి. గది తలుపులు, కిటికీ తలుపులు మూయబడి ఉన్నాయి. అవతలి గదులలో దాస దాసీజనం గుఱ్ఱుపెట్టి నిద్ర పోతున్నారు. పద్ముని భౌతికదేహము ప్రక్కనే ద్వితీయలీల కూర్చుని ఉన్నది. ఆమె కళ్ళలో ప్రేమ, ఆవేదన గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. చేతిలో వింజామరులు ఉన్నాయి. ఆమె వేషము, నడవడి, శరీరము, వాసనలు, ఆకారము, రూపము, అవయవములు, స్పందము, కట్టుబట్టలు, నగలు .... మొదలైనవన్నీ మునుపటివలెనే ఉన్నట్లు ప్రబుద్ధలీల గమనించింది. భేదమల్లా .... ఆమె విదూరథుని ఇల్లు విడచి ఇక్కడ ఉండటం మాత్రమే. ఎడమచేతిమునివేళ్ళతో ముఖమును స్పృశించుకొనుచు ఆ ఉత్తమ ఇల్లాలు మౌనము వహించియున్నది. మధ్యమధ్యలో అభిలాషతో భర్త మోము చూస్తోంది.
Page:362
ప్రబుద్ధలీల సరస్వతులు, ఆమెను చూచుచున్నారు. కాని ఆమె మాత్రం “సత్య-సంకల్పి” కాకపోవుటచే వారిని చూడలేకపోవుచున్నది.
49. ఆధిభౌతిక భ్రాంతి
శ్రీరాముడు : ప్రభూ! ప్రబుద్దలీల అదే గృహంలో తన శరీరమును ఉంచి ధ్యానబలం చేత విదూరథుని భవనమునకు వెళ్ళియున్నదని మీరు చెప్పియున్నారు కదా! మరల ఆమె భౌతిక-దేహము విషయమై మీరు ఏమి ప్రస్థావించలేదే? ఆ దేహం ఏమైనది? ఎచ్చటికి అరిగినది? వసిష్ఠమహర్షి : ఓహో! ఆ దేహము గురించా, నీప్రశ్న? బాగానే ఉన్నది. ముందుగా జీవుని “దేహభ్రాంతి” విషయమై ఈ విశేషాలు విను. లీల యొక్క ఆ దేహము సత్యము అయినప్పుడు కదా, ఆ ప్రశ్న? ఆ శరీరము ఎడారిలోని ఎండమావులందలి జలం వలె భ్రాంతి మాత్రమే. ఓ రాఘవా! మహత్తరమైన ఆశయముతో కూడిన బుద్ధి కలవాడవై ఈ విషయంలో నేను చెప్పబోవునది గ్రహించు.
ఈ జగత్తు అంతా ఆత్మయే. ఇందులో దేహాదుల కల్పనకు తావు ఎక్కడ ఉన్నది చెప్పు? ఇక ఎదురుగా కనిపిస్తున్న నామరూపములతో కూడిన, ఈ శరీరముల మాటేమిటంటావా? ఇదంతా ఆనందరూపమగు చిన్మయబ్రహ్మమే సుమా!
+
పూర్వలీల యొక్క జ్ఞానము వృద్ధి అగుచున్నకొలది, ఆమె శరీరము మంచులాగా కరిగిపోయింది. అయితే ఇప్పటి ఆమెయొక్క ఆతివాహిక దేహముతోటి ద్రష్టత్వము కూడా మునుపటి భౌతిక + ఆతివాహిక దేహములతో కూడిన ద్రష్టత్వమును పోలియే ఉన్నది. కాని, ఆమెయందు మునుపటి ‘ఆధిభౌతిక భ్రాంతి' మాత్రం లేదు.
ఓ రామచంద్రా! వాస్తవానికి “ఆధి భౌతికము” అనునదే లేదు సుమా! దాని శబ్దము -
అర్థములు కూడా సత్యములు కావు. “కుందేటి కొమ్ములు” అను పదప్రయోగం ఎంతటి అర్థరహితమో, ఈ కనబడే నామ-రూపాత్మక సృష్టి అట్టిది. ఇదంతా మొదలంట అసత్యమై ఉన్నప్పటికీ, ఈ జీవుడు ఆ విషయం ఎందుకో గ్రహించటంలేదు. అతడు ఈ శరీరము గురించే అనేక రీతులుగా భ్రమాత్మక భావములు కలిగి ఉంటున్నారు. అంతేకాని, “ఈ శరీరము ఏమిటి? ఇందు ఉన్నట్లు తోచుచున్న నేనెవ్వడను? నా వాస్తవ స్వరూప స్వభావములు ఎట్టివి?” అని విచారణ చేయకుండానే ఉంటున్నాడు. స్వప్నంలో అనేక అనుభవములు, దృశ్యములు పొందుచున్న స్వప్నద్రష్ట.” “ఇదంతా నా కల్పనయే కదా!” అని గ్రహించకుండానే, అప్పుడు ప్రస్తావించబడు, ప్రాప్తించు విషయములతో తాదాత్మ్యము చెందుచూ అనేక సుఖదుఃఖము పొందుచున్నాడు. ఆయా వ్యక్తులు, వస్తువులు, నగరములు వాస్తవమేనని దృఢమైన భ్రమపొందుచున్నాడు. స్వప్నములోని అనేక సంఘటనలతో
Page:363
కూడిన కథనమంతా మెళుకువ వచ్చే వరకు అట్లే ఉంటుంది కదా! ఈ జాగ్రత్కు సంబంధించిన, భౌతికశరీరమునకు సంబంధించిన అనుభవములు కూడా .... జ్ఞానము వికసించేవరకు వాస్తవమై ఉంటూనే ఉన్నాయి. త్రాడుపట్ల ఉన్న సర్పభ్రాంతి తొలగిపోతే సర్వవికారాలు తొలగిపోతాయి. భ్రాంతి, భ్రమ తొలగిపోతే సత్యదృష్టే శేషించుచున్నది.
ఈ ఆధిభౌతిక ప్రపంచమంతా అప్రబుద్ధమగు మనస్సు చేతనే కల్పించబడుతోంది. ఈ మిథ్యాభావము క్రమంగా మనస్సునందు సత్యమువలె ఆరూఢమై ఉంటోంది. జనులు ఏ చక్ర యంత్రమునో ఎక్కినపుడు భూమి, భవనములు, ఎదురుగాగల జనులు చక్రము వలె తిరుగుచున్నట్లు కనిపిస్తారు చూచావా? అట్లే అజ్ఞానులు మాత్రమే స్వప్నమును బోలినట్టి ఈ సృష్టులను, అట్టి ఈ సృష్టులలోని ఈ బాంధవ్యములను వాస్తవమైనట్లు అనుభవించుచున్నారు. ఇది ఇట్లుండగా, స్వప్నంలో భౌతికదేహం లేకుండానే అనుభూతులు అనుభవాలు కొనసాగుచున్నాయి కదా!
శ్రీరాముడు : ఒక 'యోగి' పూర్తిగా 'ఆత్మప్రాప్తి' పొందాడని అనుకొందాం. ఆ యోగి దేహమునకు సంబంధించిన “ఆధిభౌతిక భావము” పూర్తిగా త్యజించి, "ఆతివాహిక భావము”నే సర్వదా ఆశ్రయించుకొని ఉంటాడు కదా! మీరు, "ఆతివాహికదేహము కన్నులకు కనబడనిది. నాశ రహితమైనది కూడా” అని చెప్పియున్నారు.
ఇప్పుడు నా సందేహము ఏమిటంటే, “ముక్తి” సమయంలో కూడా ఆధిభౌతికదేహం ఉంటుందా? ఉండకుండా, పోతుందా? ఆధిభౌతిక దేహం ఉన్నంతవరకు 'ముక్తి' సాధ్యమా? అసాధ్యమా?
శ్రీ వసిష్ఠమహర్షి : జాగ్రత్లో ఘనీభూతమై కనిపిస్తున్న ఈ భౌతికదేహము త్యజించ బడకుండానే, స్వప్నంలో స్వప్నద్రష్టకు మరొక దేహం లభిస్తోంది కదా! ఈ జాగ్రత్ దేహం ఇట్లు పాన్పుపై జడత్వముచే పడి ఉండగానే, స్వప్నద్రష్ట నూతన దేహంతో శబ్దాలు వింటున్నాడు, నడుస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు, నవ్వుచున్నాడు. ఆ స్వప్నంలో తారసపడే బంధుమిత్రులతో సంభాషిస్తున్నాడు
కూడా.
యోగులు “కాయవ్యూహము” అను ప్రక్రియ ద్వారా, ఈ భౌతిక దేహము ఇట్లు ఉండగానే, తమ ఆతివాహిక దేహప్రభావంచేత వేరైన దేహములు పొంది అనుభవములు పొందుచున్నారు. అంతేకాదు, కొందరు యోగుల శరీరములు అదృశ్యవస్తువులవలె ఆతివాహిక దేహమాత్రమై ఉంటున్నాయి. వారు “నేను భౌతిక శరీరధారినై ఈ భక్తునికో, శిష్యునికో కనిపించెదను గాక” అని సంకల్పించినపుడు, అట్లే భౌతిక శరీరధారులై ఇతరులకు కనిపించటం జరుగుతోంది. “ఈ నా
శ్రీకాయవ్యూహం : యోగశాస్త్రంలో ఈ కాయవ్యూహం గురించి చెప్పబడింది. యోగి ధ్యాననిష్ఠలో ఉంటూనే తన ప్రారబ్ధకర్మలను నశింపచేసుకోవటానికి, స్వకల్పన యొక్క సామర్ధ్యముచే తదనుకూలములైన దేహములను ఆతివాహికము నందు నిర్మించుకొను చున్నాడు. అట్టి కల్పిత దేహములచే అట్టి యోగులు ఆయా కర్మలను నిర్వర్తించటం, సుకృత - -
దుష్కృత కర్మలను అనుభవించుచు, తద్ద్వారా ప్రారబ్ధకర్మలను తొలగించుకొని 'కైవల్యం’ పొందటం చేస్తూ ఉంటారు.
Page:364
భౌతిక శరీరము ఇతరుల దృష్టికి అదృశ్యమై ఉండుగాక” అనునట్టి సంకల్పబలంచేత వారు అదృశ్య రూపులు అగుచున్నారు. అప్పుడు వారి శరీరములను తదితర యోగులు కూడా గాంచలేకపోతున్నారు. ఇక ఇతరులు గాంచలేరని వేరుగా చెప్పాలా?
“ఒకడు బ్రతికియున్నాడు. మరణించుటచే గతించినాడు....” అను రూపమున దర్శించటం స్వవాసనా ప్రభావముచేత మాత్రమే సుమా! త్రాడునందు పామును చూచువాడు, సర్పజ్ఞానము తొలగిపోయినప్పుడు “ఇది త్రాడు మాత్రమే” అని గ్రహించునట్లు, జ్ఞానోదయము అయిన తరువాత శరీరభ్రాంతులు నశిస్తున్నాయి. “నేను పూర్వదేహమును చూచెదను గాక! పొందెదను గాక” అనునట్టి భ్రమాత్మకమైన ఆవేశం ఇక ఉండదు. అట్టి జ్ఞాని ఇట్లు “భావన” కలిగి ఉంటాడు.
“ఈ ‘శరీరము’ అనగా ఏమి? దీని ఉనికి ఎక్కడ? ఇది నశించుట ఏమి? ఇవన్నీ 'ప్రతిబింబము' వలె అవస్తువులే కదా! ఈ శరీరమును ధరించు 'శరీరి’ - స్వరూపుడనగు నేను సత్యమై, నిత్యమైవున్నాను. ఉండవలసినదేదో సర్వదా, సదా ఉండనే ఉంటోంది. అసత్తుకు ఉనికి ఎక్కడ? ఉనికి లేనిదాని వలన సుఖ దుఃఖాదులు ఎక్కడివి? అజ్ఞానమున్నంతవరకే అవి ఉంటున్నాయి. అజ్ఞానము తొలగిపోయిన తరువాత, ఇక ఈ దేహాదులు ఉండాలనిగాని, తొలగాలనిగాని అభినివేశం ఉండవలసినపని లేదు. ఏది ఎక్కడ ఎట్లు ఎందుకు ఉన్నా, ఉండకున్నా... నేను ఆత్మయే 'స్వరూప స్వభావము’ లుగా కలవాడిని కదా!"
జ్ఞాని యొక్క సంకల్పములు, అభిప్రాయములు, భావనలు పై విధమైన పునాదిని కలిగి
ఉంటాయి.
50. ఆధిభౌతికం - - ఆతివాహికం
శ్రీరాముడు : హే సద్గురూ! యోగుల యొక్క ఆధిభౌతిక దేహమే యోగబలంచేత “ఆతివాహికం” అగుచున్నదంటారా? లేక, ఆధిభౌతికం తిరస్కరించబడి (త్యజించబడి) 'ఆతివాహికం' కలుగుచున్న దంటారా? ముందుగా ఈ విషయం చెప్పండి.
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామా! నీకీవిషయం ఇదివరలో చాలా మార్లు చెప్పాను. కొంత వివరణతో ముక్కుకు సూటిగా కూడా చెప్పాను. అయినా నీవు ఇంకా గ్రహించటం లేదేమిటి? సరే. మరల ప్రకటిస్తున్నాను. విను. ఈమారు మరింత నిర్దుష్టంగా సత్యమైయున్నదానిని చెప్పుచున్నాను.
“ఆతివాహికదేహము” (లేక సూక్ష్మదేహము) ఒక్కటే ఉన్నది. 'ఆధిభౌతికదేహము’ అనునది లేనే లేదు. ఇక శరీరభ్రాంతి అంటావా .... అది స్థూలమునకు సంబంధించిన “అధ్యాస” (superimposition) వలననే కలుగుచున్నది. ఆ అధ్యాస తొలగితే, ఆధిభౌతిక బుద్ధి పోయి, “ఆతివాహిక బుద్ది” ఉదయించగలదు. ఒకడు ఒక 'కల'లోంచి తేరుకున్న తరువాత, ఆ కలలోని “భవనము-ఆ భవనముయొక్క కాఠిన్యము” మొదలైనవి ఏమైనా కనబడుచున్నాయా? లేదు
Page:365
కదా! అట్లే, ఆతివాహిక జ్ఞానము ఉదయించిన తరువాత ఇక ఈ భౌతిక దేహము యొక్క గురుత్వ కాఠిన్యాదులు తోచవు ఆధిభౌతికమైన పరిమితభావన స్పురించక లయించిపోతోంది.
స్వప్నమునందు ఏర్పడుచున్న దట్టమైన స్వప్నభ్రాంతి తొలగాలంటే ఉపాయం ఏమిటి? "ఇది స్వప్నము మాత్రమే” .... అను జ్ఞానము కలుగుటయే కదా! ఆతివాహిక బుద్ధి, లేక, “నేను అంతః తత్త్వమును. ఎట్టి వస్తుజాలము చేతను బంధింపబడనంతటి సూక్ష్మ - అంతఃకరణ స్వరూపుడను” అను బుద్ధి లేక “బోధ” ఉదయించిన మరుక్షణం ఆధిభౌతిక శరీరబుద్ధి ఎటో పోతుంది.
అట్టి ఆతివాహిక జ్ఞానము ఉదయించిన యోగుల శరీరము దూదివలె అతితేలిక, లాఘవము అగుచుండ వచ్చుకూడా! దృష్టాంతము స్వప్నమే. స్వప్నసమయంలో, “ఇది స్వయం కల్పితమైన స్వప్నము. నిజానికి స్వప్నము అవాస్తవమే కదా!" అను జ్ఞానము కలగటం జరిగితే, అప్పుడు ఆ స్వప్నద్రష్ట యొక్క శరీరం తేలికయి, 'భారం' అనిపించకుండా ఉంటుంది. అట్లే జ్ఞానోదయమైన తరువాత, కొందరు యోగులు తమ ఇచ్ఛను అనుసరించి ఆకాశమున ఎగురగలగటం మనం చూస్తూ ఉంటాం.
సంకల్పమే ఆతివాహికము యొక్క స్వరూపము కదా! చాలాకాలం సంకల్పదేహమునే ఆశ్రయించువారు, అనగా, - "నేను సూక్ష్మస్వరూపుడనే గాని, భౌతిక దేహమును ... - గాను” అను భావనయందు దీర్ఘకాలం ఉండేవారు ..... వారి పూర్వదేహము దగ్ధమైనను, శవంగా మారినను సూక్ష్మదేహము అట్లే ఉంటున్నది. ఇక యోగులైతే వేరుగా చెప్పేదేమున్నది? వారికి జ్ఞానాతిశయంచేత సూక్ష్మదేహత్వము ఈ జీవదశ యందు లభించుచున్నది. వారిలో కొందరు, “నేను సంకల్పమయుడను” అనునట్టి స్మృతిని పొందినప్పుడు, అట్టి జ్ఞానమహిమచే ఆకాశవిహారం, అదృశ్యమగుట మొదలైన స్థితులు వారు కోరుకొనటం, పొందటం జరుగుతోంది. స్వప్నంలో, "నేను సంకల్పమయుడను" అని అనుకోగానే, స్వప్నంలోని ఆకాశంలో విహరిస్తున్న అనుభవం ప్రాప్తిస్తోంది కదా! ఇది కూడా అట్టిదే.
ఓ రామచంద్రా! "ఈ స్థూలదేహమే నేను” అనునట్టి అనుభవం కేవలం భ్రాంతి వలన, అజ్ఞానము వలన, అవిచారణ వలన ఏర్పడుచున్నది మాత్రమే సుమా! అట్టి భ్రాంతి తొలగిపోతే ఆధిభౌతికభావం తొలగిపోతుంది. దానితో ఈ సంసారాడంబరం కూడా తొలగిపోతుంది. దుః ఖములన్నీ కూడా తొలగిపోతాయి. భ్రాంతి ఉన్నచోటికి మాత్రమే దుఃఖములన్నీ వచ్చి చేరుచున్నాయి.
శ్రీరాముడు : ప్రభూ! మరొక ప్రశ్న. ఆతివాహిక దేహముతో కూడినదై, ఇప్పుడు ప్రబుద్ధలీల పద్ముని మందిరంలో ప్రవేశించియున్నది కదా! ఆమె కనుక, “నేను ఈ అంతఃపురములో ఉన్నవారికి కన్పించెదనుగాక” అని సంకల్పేచ్ఛ కలిగి ఉంటే, అక్కడివారు ఆమెను చూడగలుగుతారా? ఒకవేళ
గురుత్వము Experience of physical body as weight and mass.
Page:366
చూడగలిగితే వారు ఏమనుకొంటారు? గిరిగ్రామంలోని జ్యేష్ఠశర్మలాగా "ఈమె దేవత” అని అనుకొంటారా? లేక, “ఈమె మా మహారాణియే కదా” అని గుర్తిస్తారా?
శ్రీ వసిష్ఠమహర్షి : ఆ గృహములోనివారు ఆమెను “ఈమె దుఃఖముచే ఆక్రమించ బడియున్న మా మహారాణియే కదా” అని భావిస్తారు. పరమేశ్వరుడు తమకు రాణిని తిరిగి ప్రసాదించినట్లు భావిస్తారు. ద్వితీయ లీలవైపు చూచినప్పుడు మాత్రం, “ఈమె ఎక్కడి నుండో వచ్చిన చెలికత్తె” అని అనుకొంటారు. ఎందుచేతనంటే, అక్కడివారు ద్వితీయ లీలను ఎప్పుడూ చూచి ఉండలేదు కదా! అయితే ఇప్పటికి మాత్రం “ఈమె ఎవరు?” అనే అనుమానం ద్వితీయలీల విషయంలో వారికి వచ్చుట లేదు. రాజు మరణించాడనే దుఃఖం వారి మనస్సులను కలచివేయుచున్నది. అందుచేత అక్కడివారు సూక్ష్మమైన విషయములను గ్రహించుటకు ఆ సమయంలో సిద్ధంగాలేరు.
మరొక విషయం. అవివేకులైనవారు తాము చూచిన పదార్థములను అనుసరించే వ్యవహరిస్తూ ఉంటారు. వారికి తీవ్రమైన విచారణశక్తి ఎక్కడినుండి వస్తుంది చెప్పు? తమ చుట్టుగల పరిస్థితులందు రాగద్వేషములు ఏర్పరచుకొని, వాటియందు ఆవేశ పూరితంగా నిమగ్నమైనవారికి పరీక్షాత్మకమైన సూక్ష్మదృష్టి ఏర్పడుతుందా? లేదు. మట్టిగడ్డతో వృక్షము యొక్క కాండమును కొట్టినప్పుడు ఆ మట్టి నేలరాలుతుందేకాని, కాండములోనికి ప్రవేశించదు కదా! పశుతుల్యులగు అజ్ఞానులు కూడా పదార్థములను సూక్ష్మదృష్టితో గాంచలేరు. అందుచేతనే వారు తత్త్వనిర్ణయం చేయలేకపోతున్నారు. వారు - ఈ శరీరాదులు వాస్తవమై ఉన్నట్లు, వీటితో ఏర్పడుచున్న సంబంధాలు, బంధాలు నిజమే అయినట్లు భావిస్తున్నారు. భావనను అనుసరించే వారికి ఆయా అనుభవములు సత్యమై ప్రాప్తిస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఆధిభౌతికశరీరము 'మిథ్య' మాత్రమే సుమా! ఆతివాహిక దృష్టి (లేక సూక్ష్మదేహదృష్టి) కలవారు ఈ భౌతిక శరీరములను గాంచకయే ఉన్నారు. అనగా, ఈ కనబడే శరీరాదులన్నీ వారి దృష్టిలో స్వప్నములోని పదార్థములవలె భ్రమాత్మకములు మాత్రమే. ఈ ఆధిభౌతిక దేహములు ఏమగుచున్నవో, ఎటువైపు పోవుచున్నవో ఎవరమూ చెప్పలేం. స్వప్నంలో గాంచబడిన శరీరములు, పదార్థములు మెళుకువ వచ్చినప్పుడు ఏమౌతున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? భ్రమ, భ్రమగానే తేలిపోతోంది కదా! వర్తమానంలో కనిపించే ఈ దృశ్యవ్యవహారం కూడా అంతే.
శ్రీరాముడు : ఓ సర్వజ్ఞా! వసిష్ఠమహర్షీ! స్వప్నంలో చూచిన పర్వతములు, జనులు ... మొదలైనవి నిద్రమేల్కాంచినప్పుడు ఎక్కడికి పోతున్నాయి? ఏమౌతున్నాయి? ఈ సందేహం కూడా తొలగించండి.
Page:367
51. స్వప్నంలోని వస్తుజాలం ఏమౌతున్నాయి?
శ్రీ వసిష్ఠమహర్షి : గాలిలో కదలిక ఉన్నది. అట్లు కదలుచున్న గాలి కదలని గాలిలో ప్రవేశిస్తోంది. కదలని గాలి కదలుచున్నది. లేక కదలుచున్న గాలి కదలిక త్యజిస్తోంది. కాని, గాలి సర్వదా గాలియే కదా! కలలో గాంచబడుచున్న కొండలు మొదలైనవి నిదురలేవగానే స్వప్న-చైతన్యము నందు విలీనమగుచున్నాయి. స్వప్న పదార్థముల వాస్తవ స్వరూపమేమిటి? శూన్యమే కదా! అవి ‘చైతన్యము’ను కప్పిపుచ్చునవై ఉంటున్నాయి. ఇంతలోనే చైతన్యములో విలీనమైపోతున్నాయి. ఆత్మ యొక్క చైతన్యమే స్వప్నమున కనబడే ఆయా పదార్థముల రూపమున స్ఫురిస్తోంది. అంతయు ద్రష్ట యొక్క ‘స్ఫురణ', 'కల్పన', 'భ్రమ' కాకుండా మరింకేమీ కాదు. ఆ స్ఫురణ లేక కల్పన లేక భ్రమ తొలగినప్పుడు సర్వము అద్వయమగు ఆత్మతత్త్వముగానే శేషించుచున్నది. జాగ్రత్తు కూడా అట్టిదే సుమా!
ఒకడు ఒకానొక 'ఊహ' యందు ఒక దృశ్యమును సంకల్పించుకొని అంతరంగము నందు దర్శిస్తున్నాడనుకో .... అతడు ఆ ఊహను త్యజించినప్పుడు, అంతరంగ దృశ్యములోని వస్తుజాలం, జనులు మొదలైనవి ఏమౌతున్నాయి? శూన్యము నుంచి జనించినవి శూన్యమే అయిపోతున్నాయి కదా! స్వప్నములోని పదార్థజాలం విషయం కూడా అంతే! ఈ జాగ్రత్తు కూడా అందుకు వేరైనదికాదు. ఈ జాగ్రత్లో ప్రాప్తిస్తున్న "నేను - నాది - నీవు - ప్రియములు - అప్రియములు - కాలము
- స్థానము - శరీరములు - సంబంధములు - మిత్రులు - శత్రువులు” ..... ఇవన్నీ కూడా జ్ఞాన ప్రాప్తి పొందిన తరువాత స్వప్నతుల్యముగా తెలియబడుచున్నాయి. అంతయు అద్వయమగు ఆత్మగానే ఎరుగబడుచున్నాయి.
నీటికి - ద్రవత్వమునకు భేదమేమిటో చెప్పు? గాలి - స్పందత్వములు వేరువేరు కాదుకదా! వీటికి భేదము తెలియబడనట్లే ఆత్మచైతన్యము - స్వప్న పదార్థములకు భేదము తెలియబడదు. “ఆత్మ చైతన్యము వేరు - స్వప్న పదార్థములు వేరు - ఈ జగత్తు వేరు. ఇవన్నీ ఆత్మకు ఎక్కడి నుండో దాపురించాయి” అనునట్టి భేదజ్ఞానమే మహాదట్టమైన అజ్ఞానం. అట్టి భేదదృష్టియే మిధ్యాజ్ఞానాత్మకమైనట్టి “సంసారము”, అని “సంస్కృతి” అని, “అళీకము” అని శాస్త్రములచే ఆయా శబ్దములచే చెప్పబడుతోంది. “స్వప్నములో తోచు పదార్థములు స్వప్నద్రష్ట (లేక చైతన్యము) కంటే వేరు” ... అని చెప్పటానికి మనకేమైనా - - నిమిత్త కారణములు (purpose & cause) లభిస్తున్నాయా? లేదు. అందుచేత “స్వప్న పదార్థములు నిరర్థకములే. అర్థరహితములే” .... అని అనక తప్పదు.
ఇప్పుడు స్వప్న పదార్థములను, జాగ్రత్ పదార్థములను పోల్చి చూద్దాం. “ఈ రెండు ఒకే తరగతికి చెందినవి” అని చెప్పటానికి మాకు కించిత్ సందేహం కూడా లేదు. స్వప్నంలో కనబడే గ్రామ - నగరాలు ఏ విధంగా అసత్యమో 'సృష్ట్యాది' యందు ప్రతిభాసితమగుచున్న ఈ జాగృత్జగత్తు కూడా అసత్యమే. మేము తపోధ్యానాదులచే మా దృష్టిని శుద్ధిపరచుకొనియున్నాము. అందుచేత సత్యద్రష్టలమగు మాయొక్క అనుభవ పూర్వకమైన వాక్యముల పట్ల మీరంతా కొంత
Page:368
విశ్వాసము ఉంచక తప్పదు. ఎందుకంటే, దృశ్య - సంబంధమైన “అజ్ఞానదృష్టి” పేరుకొని ఉన్నంతసేపు, ఈ దృశ్యములోని స్వప్నత్వము దర్శించగల ప్రజ్ఞ ప్రాప్తించటం లేదు.
స్వప్న పదార్థములు సత్యములని ఎవరైనా అనగలరా? అవి అసత్యములే కదా! ఓ రాఘవా! ఒక్క “ఆత్మచైతన్యము” మాత్రమే ఇటు జాగ్రత్ నందు, అటు స్వప్నము నందు, అట్లే సుషుప్తియందు అన్ని దశలందు కూడా సత్యమై, నిత్యమై, సాక్షియై వెలయుచున్నది. ఇది మాయొక్క అనుభవసారం. వేదాంగములైన ఉపనిషత్తులు, తదితర ఆత్మ ప్రతిపాదక శాస్త్రములు అనేక దృష్టాంతముల సహాయంచేత ఈ విషయం నిరూపిస్తున్నాయి. మనం కూడా ఈ గ్రంథంలో అదే విషయం నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాం. స్వప్నంలో గాంచబడిన పర్వతం మేల్కొనగానే ఏమౌతోంది? ఆ ఆధిభౌతిక శరీరభావన, ... ఆ దృశ్యప్రాప్తి, ఆధిభౌతిక తాదాత్మ్యము, ఆ దృశ్యతాదాత్మ్యము శూన్య మాత్రములే అగుచున్నాయి. ఆతివాహిక భావము, ... పొందిన ఉత్తమ పురుషుల విషయంలో, “ఇతడు శరీరము పొందుచున్నాడు జన్మిస్తున్నాడు. మరణిస్తున్నాడు, జీవిస్తున్నాడు" అని లోకులు గాంచటం వారివారి అజ్ఞానము వలన మాత్రమే సుమా! యోగపురుషులకు తమపట్లగల అవగాహన అందుకు వేరుగా ఉంటోంది. వారు, "మేము ఈ ఉపాధులను నియమించువారము. సర్వము నిర్ణయము చేస్తున్న సత్త స్వరూపులము” ..... అని భావన చేస్తున్నారు.
స్వప్నద్రష్ట చూస్తున్న స్వప్న పదార్థమువలెనే ఈ 'సృష్టి' అనబడునది కూడా శూన్య స్వరూపము, మిథ్య, మోహకల్పితము, భ్రాంతి మాత్రమే!
ఓ జనులారా! మీరు మీ స్వస్వరూపమగు 'ఆత్మ' ను ఏమరచి భ్రమాత్మకమైన వస్తువులందు, భ్రమయుతమైన వ్యవహారములందు సత్యత్వమును నిష్కారణంగా ఆపాదిస్తున్నారు. అట్లు ఆపాదించటం చేతనే అనేక దుఃఖపరంపరలను అనుభవించు చున్నారు. ఈ భ్రమ అను నిద్రను వదలండి. మహావాక్యములను శ్రద్ధగా వినండి. ఆత్మ స్వరూపమందు నిదురలేవండి. మరుక్షణం సర్వవికారాలు
తొలగిపోతాయి.
ఓ రామా! ‘అనాది’ అయినట్టి భ్రమప్రవాహమున పడిన ఈ జీవుడు 'మరణమూర్ఛ'కు ముందు “ఆతివాహికశరీరము”ను పొందుచున్నాడు. అయితే, భ్రాంతి వలన భవిష్యత్ సృష్టికి అనుకూలమైనట్టి “సృష్టి-ప్రతిభాస"ను అనుభవిస్తున్నాడు. అవియే అతని యందు మనకు కనబడుచున్న ఈ దేహములు. ఇవన్నీ అతని మనస్సునందే వెలయుచున్నాయి. అంతేగాని, బయట ఎక్కడో, ఏదీ లేదు. కాని చమత్కారం చూచావా? అతడు భ్రాంతి ప్రభావం చేత “సృష్టి ప్రతిభాస” అంతా బాహ్యము నందే ఉన్నదని తలచుచున్నాడు.
Page:369
52. భౌతికదేహము - యోగిదృష్టి
ఆ మందిరంలో ఇప్పుడు జ్ఞప్తి దేవతయగు సరస్వతీదేవి, ప్రబుద్ధలీల ప్రవేశించియున్నారు. కదా! ఇంతలో పద్ముని జీవచైతన్యము కూడా (అనగా యుద్ధభూమిలో విదూరథ - ఉపాధి త్యజించిన జీవచైతన్యము) ఆ గృహంలో ప్రవేశించింది. పద్ముని భౌతిక దేహం పొందటానికి ప్రయత్నించ నారంభించింది. ఈలోపు జ్ఞప్తిదేవతయగు సరస్వతీదేవి విదూరథుని జీవచైతన్యము ఆ దేహములో ప్రవేశించనీయకుండా నిరోధించింది. ఒకడు తన సంకల్పబలంచేత చిత్తవృత్తిని నిరోధిస్తాడు చూచావా? ఇది కూడా అట్టిదే.
ప్రబుద్ధలీల : హే లోకపావనీ! జగజ్జననీ! జ్ఞప్తిదేవీ! ఈ మందిరంలో నేను ఎంతకాలంగా సమాధిలో ఉండటం జరిగింది? నా శరీరము కనబడటం లేదేమి? అది ఇక్కడ, నేను త్యజించిన తరువాత ఎంతకాలమున్నది. ఎప్పుడు, ఎట్లు తొలగినది? ఈ పద్మరాజు ఇట్లా ఎంతకాలంగా శవమై పడియున్నాడు?
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! నీవు నీ శరీరమును ఇచటనే త్యజించి విదూరథుడు ఉండియున్న బ్రహ్మాండములోనికి వెళ్ళియున్నావు కదా! అది జరిగి ఇక్కడికాలమానం ప్రకారం ఒక నెల గడిచినది.
నీ శవమును రక్షించుచు ఇద్దరు దాసీలు రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండేవారు. ఇక శవము ఏమైనదంటావా? పదిహేను రోజుల తరువాత నీ భౌతిక దేహము శుష్కించసాగింది. బాష్పభావము పొందసాగింది. జీవరహితమై ఎండిపోయిన ఆకులాగా నేలపై పడియున్నది. మరొక రోజుకు ‘కొయ్య'వలె బిగదీసుకుపోయింది. మంచువలె చల్లనైపోయింది. ఆ తరువాత మీ మంత్రులు ఇక్కడికి వచ్చి నీ భౌతికకాయమును పరిశీలించారు. "ఈమె మరణించినది” అని స్థిరపరచుకొన్నారు. ఇంకేమున్నది? నీ శరీరమును బైటకు కొనిపోయారు. దానిని చితిపై ఉంచి గంధపు చెక్కలతోను, నేతితోను కాల్చి భస్మం చేశారు. ఇక నీ పరిజనులు "అయ్యో! ఎంతకష్టం? మా రాణి మరణించినది కదా!" అని ఎంతగానో ఆందోళన చెందుతూ రోదించారు. నీ కొరకు పారలౌకిక “శ్రాద్ధము” మొదలైన కర్మలు నిర్వర్తించబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు నిన్ను చూడటం జరిగితే “పరలోకం నుండి మరల దిగి వచ్చింది కాబోలు” అని భావించి ఆశ్చర్యపడతారు కూడా! ఇప్పుడు నీవు ఆతివాహిక దేహముతో ఉన్నావు కదా! అందుచేతనే నీవు వారికి కనిపించటం లేదు. సత్యసంకల్ప ప్రభావంతో ఇతఃపూర్వపు దేహంతో కనబడితే శారీరక దృష్టి మాత్రమే కలిగినట్టివారు ఆశ్చర్యపడక ఏం చేస్తారు?
బాలా! నీకు నీ పూర్వ శరీరము నందు ఉన్న 'అనురాగము'ను అనుసరించే ఇప్పటి నీ దృష్టియందు అవే రూపలావణ్యములు కలిగియున్నావు. అందరు తమతమ వాసనలను అనుసరించే అందుకు అనుకూలములైన వస్తువులను గాంచుచున్నారు. “బాలుడు చీకట్లో కల్పిత బేతాళుని దర్శించటం” అనునదే ఇందుకు మనకు సుస్పష్టమైన దృష్టాంతము. నీ వర్తమాన విషయానికి వస్తే, నీవు పూర్తిగా “ఆతివాహిక దేహభావము”ను పొందావు. అందుచేత, “ఇతఃపూర్వపు వాసనలతో
Page:370
కూడిన దేహమును విస్మరించి వేశావు. “ఆతివాహిక దృష్టి దృఢమైనప్పుడు “ఆధి-భౌతిక దేహభావన” ఉపశమించగలదని చెప్పానుకదా.
ఒకవేళ, ఈ భౌతిక శరీరములు, బాహ్యజగత్తులు అజ్ఞానులకు అగుపడుచున్నప్పటికీ, 'జ్ఞానులు’ మాత్రం ఇదంతా క్షణం ఉండి పోయేదానిగా మాత్రమే దర్శించుచున్నారు. ఒకనిలో “ఆతివాహిక భావము” దృఢమైనప్పుడు, అట్టివానికి ఈ సర్వశరీరములు నీరులేని మేఘంలాగా, వాసనలేని పుష్పంలాగా నామమాత్రమే అవుతాయి. అనగా అతని దృష్టిలో వీటిలో శాశ్వతము, ప్రత్యేకము, స్పష్టము, ఆశ్చర్యము అయినదేదీ ఉండకుండానే పోతోంది. అట్టివారిలో కొందరు తమ ఆధిభౌతిక దేహమును విస్మరిస్తారు. మరి కొందరు దానిని జ్ఞప్తి పథంలో కలిగి ఉన్నప్పటికీ, దానిని ఒక బాహ్యమైన వస్తువు వలెనే దర్శిస్తున్నారు. గృహము, వస్త్రము, పొలమువలెనే ఈ దేహము కూడా వారికి తోచుచున్నది. తదితరుల దేహములు కూడా వారికి అట్లే స్వప్న వస్తు జాలంలాగా కనిపిస్తున్నాయి. “నేను ఈ శరీరమునకు సంబంధించినవాడను కాను. ఈ శరీరము నాకు సంబంధించినది కాదు" అను రూపముగల ఒకానొక ఉత్తమ ప్రజ్ఞ వారు కలిగి ఉంటున్నారు. ఓ ప్రియ లీలా! దృఢమైన సద్వాసనలు కలవారికి, “నేను బాలుడను. నేను యువకుడను" అను భావమే ఉండదు సుమా! ఎవరి దృష్టిలో ఈ దేహము స్వప్నతుల్యమో, అట్టివారు “ఈ దేహము లేనట్టి వారే” అని చెప్పబడుచున్నారు. ఇక ఇతరులకు వారిపట్ల గల దృష్టి విషయమేమిటంటావా? అది ఆ ఇతరుల జ్ఞానాజ్ఞానముల బట్టి ఉంటోంది కాని, అది ఆ యోగికి సంబంధించినది కాదని గ్రహించు.
ఈ విధంగా నీవు నీ శరీరము ఇక్కడ వదలి ముప్పది రోజులు అవుతోంది. మనము ఈ ఉదయమే ఈ ఆకాశంలో ప్రవేశించాం. నేను నీ ఇరువురి పరిచారికలను నిద్రమోహితులను చేశాను కూడా. ఓ లీలాదేవీ! ఇక, రమ్ము. మనం మన సంకల్ప ప్రభావం చేత ఈ ద్వితీయలీలకు ‘దర్శనం' ఇద్దాం. అప్పుడు నీవు యథోచితంగా ప్రవర్తించెదవు గాక!
53. పద్ముని పునరుజ్జీవనం
అప్పుడు జ్ఞప్తిదేవి, “ఈ ద్వితీయలీల మా ఇద్దరిని గాంచుగాక” అని సంకల్పించినది. అప్పుడు ఆ ద్వితీయలీలకు వారిద్దరు ప్రకాశపూర్వకంగా కనిపించసాగారు. వారి తేజము ఆ గృహమున ప్రవేశించగానే, ఆమె ఉలిక్కిపడి, తలెత్తి ఆ ఇంటి నాలుగువైపులా కలియచూచింది. ప్రబుద్ధలీల - సరస్వతులను చూచి ఎంతో సంతోషమును, ఉత్తేజమును పొందింది. వారి పాదములపై వ్రాలింది. ద్వితీయలీల : ఓ దేవతలారా! నా సాష్టాంగ నమస్కారం స్వీకరించండి. మీ రాక నాకు ఎంతో సంతోషమును కలుగజేస్తోంది. మీరు నాకు ప్రాణదాతలు. వరప్రదాతలు కూడా. మీ పరిచారికనైయున్న నేను మీకంటే ఒకింత ముందుగా ఇక్కడికి వచ్చియున్నాను. మీకు సుస్వాగతం. ఇదిగో, ఈ సింహాసనములను అధిరోహించి సుఖాసీనులు కండి.
Page:371
శ్రీ జ్ఞప్తిదేవి : పుత్రీ! నీవు ఇచటికి మాకన్నా ముందే ఎట్లా వచ్చావు? దారిలో ఎచట ఏమి చూచావు? ఆ వృత్తాంతమంతా మాకు చెప్పు.
ద్వితీయలీల : నేను మీరు చూచియున్నచోట 'కాలాగ్నివలె దహించబడ్డాను. ఒకానొక మూర్ఛను పొందియున్న నేను అప్పుడు “ఇది - అది” అను జ్ఞానమే లేక ఉంటిని. కళ్ళు మూసుకొనియున్న నేను మరణమూర్ఛ గతించిన తరువాత తేరుకొని చూడగా, ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్నట్లు స్థితిపొందియున్నాను. అట్లు కొంతసేపు ఎగురుట జరిగిన తరువాత, ప్రాణములు అనే రథమును అధిరోహించాను. సువాసన కణము (the particles of sweet smell) వలె పయనించి ఇచ్చటికి వచ్చాను. ఇక్కడ ఈ అంతఃపురం అనేక దీపకాంతులతో ప్రకాశిస్తోంది. కొందరు దాస-దాసీ జనం అక్కడక్కడ గాఢనిద్రాపరవశులై నిద్రిస్తున్నారు. ఇక్కడి వాతావరణమంతా మౌనంగా, ప్రశాంతముగా ఉన్నది. ఉత్తమమైన పాన్పులు కూడా నాకు కనిపించాయి. ఈ గృహంలో ఉత్సుకతచే సంచరిస్తూ ఉండగా, ఇక్కడ ఈ మూల నాభర్త విదూరథుడు శయనించి ఉండి కన్పించాడు. అతడు పూలచే కప్పబడియున్నాడు. ఇతడు ఇంతక్రితమే మహాశ్రమయుతమైన యుద్ధం చేసియున్నాడు కదా! పాపం, ఎంతో డస్సి ఉంటాడు. అందుకే, నిదుర లేవలేదు. ఇతడు తన అలసట మరువటానికి వింజామరం వీస్తూ ఉన్నాను. ఇంతలో మహాతేజస్వరూపులగు మీరిద్దరు ప్రత్యక్షమయ్యారు. మీ కరుణ అపారమైనది కదా! నన్ను కరుణించ వేడుకొనుచున్నాను.
జ్ఞప్తిదేవి : ఓ ఉభయ లీలలారా! ఇప్పుడు “శవశయ్యపై పరుండియున్న ఈ రాజును నేను నిదుర లేపుచున్నాను.
ఇట్లు పల్కి రుద్రాక్షమాలచే అలంకితురాలగు ఆ జగజ్జనని సరస్వతీదేవి, సంకల్ప బలంచేత శరీరంలో ప్రవేశించకుండా బైటయే నిరోధించియున్న విదూరథుని ప్రాణములను సంకల్పమాత్రముగా విడచివైచింది. అప్పుడు ఆ జీవుడు ప్రాణ వాయు స్వరూపంతో ముక్కురంధ్రముల ద్వారా శరీరంలో ప్రవేశించాడు. సముద్రగర్భంలో మణులు ఉంటాయి చూచావా? అట్లాగే, ఆ జీవునియందు 'వాసనలు ఉన్నాయి. జీవుడు ఆ శరీరంలో ప్రవేశించగానే అతని ముఖం కాంతివంతమైంది. క్రమంగా అవయవములు చైతన్యవంతం కాసాగాయి. జీవరసము శరీరమంతా ప్రసరించింది. నెమ్మదిగా కనులు విప్పాడు. అప్పుడు ఇరువురు - లీలలు అతని ముందు వినమ్రతతో, ప్రేమభావముతో "స్వామీ! మీకు శుభమగుగాక! మమ్ములను ఆజ్ఞాపించవేడుకొంటున్నాం” అని ఒక్కసారిగా పలికారు.
లేచికూర్చున్న పద్ముడు ఇరువురు లీలను చూచాడు. ఎంత ఆశ్చర్యం! అతనికి ఇద్దరు లీలలు... ఆచార-వ్యవహార-రూప-మర్యాద-వాక్య-ప్రయత్న-వినమ్రతలో-సమానులైయుండటం కనిపించింది. పద్ముడు : ఓ వనితలారా! మీరిద్దరు ఎవరు? ఇది అత్యంత చిత్రంగా ఉన్నది సుమా! మీరిద్దరు అచ్చు ఒకే తీరుగా ఉన్నారే? ఎందుచేత?
Page:372
ప్రబుద్ధలీల : ఓ దేవా! ఉద్వేగరహితులై మీరు మేం చెప్పేది వినండి. నేను మీ అర్ధాంగిని. “వాక్కు
ఆవాక్కు యొక్క అర్థము” ఏ విధంగా అవినాభావసంబంధం కలిగియుంటాయో, నేను కూడా మీతో కలసి అట్లే ఉండేదానను. బహుదీర్ఘకాలం మనమిద్దరం భార్యా - - భర్తలమై సంచరించాం. ఇక ఈ ద్వితీయలీలను చూచారా? ఈమె కూడా మీ భార్యయే. మీ కొరకే నా ప్రతిబింబము అయినట్టి ఈమెను మీరు కల్పించుకున్నారు. అదిగో అటు, మీ తలవైపు చూడండి. ఆ బంగారు సింహాసనముపై కూర్చున్న వనితవైపు చూడండి. ఆమెయే త్రిలోక జననియగు సరస్వతీదేవి. ఆమె మనయొక్క పూర్వపుణ్యవశంచేత మనపైగల అవ్యాజమైన ప్రేమచే మనకు సాక్షాత్కరించింది. ఆమెయే మనలను తన భక్తవత్సలత కారణంగా స్వమహిమచే పరలోకము నుండి ఇక్కడికి చేర్చింది. ఆమెకు భక్తి - పూర్వకంగా నమస్కరించండి!
ఆ మాటలు విన్న రాజు తటాలున కొంత తొట్రుపాటుతో లేచి నిలబడ్డాడు. మాలలు, వస్త్రములు నేలతాకుచుండగా, లోకమాతయగు జ్ఞప్తిదేవత పాదాలుపై పడ్డాడు. భక్తి పూర్వకంగా మరలమరల కళ్ళకు హత్తుకొన్నాడు.
పద్ముడు : సర్వహితప్రదమగు ఓ తల్లీ! సరస్వతీమాతా! నా ఈ నమస్కారం కొంత ఆలస్యమైనందుకు క్షమించమ్మా! నీ దర్శనము ఊరకే పోతుందా? లేదుకదా! మాకు గొప్ప మేధను, దీర్ఘాయువును, ధనమును ప్రసాదించెదవు గాక!
శ్రీ సరస్వతీదేవి : ఓ ప్రియపుత్రా! శుభమస్తు - వాంఛితార్ధములన్నీ పొంది ఈ గృహంలో వసించుము. నీ విషయంలో అన్ని ఆపదలు, పాప-బుద్ధులు తొలగుగాక! నీ ప్రజలు నిత్యసంతోషమును పొందెదరు గాక! నీ రాష్ట్రమునందు లక్ష్మి స్థిరమై వెలయును గాక! ఇట్లు పలికి జగదోద్ధారిణియగు సరస్వతీదేవి అంతర్ధానమైనది.
అప్పుడే తెల-తెల్లవారుతోంది. లీల పునర్జీవితుడైన తన భర్తను చూచి పులకిత శరీరురాలైనది. క్రమంగా అక్కడ అంతఃపురంలోని జనులు నిదురలేచి అటు-ఇటు సంచరించ ప్రారంభించారు.
రాజభవనం ఆనందపరవశులగు జనుల సంచారంతోను, గీతములతోను, జయ-జయ ధ్వానాలతోను, మంగళప్రదమగు పుణ్యాహవచన మంత్రధ్వనులతోను ఒక్కసారి ఉత్తేజం పొందినది. రాజు పునర్జీవితుడయ్యాడనే వర్తమానం మంత్రులకు, సామంతులకు, పురజనులకు అందింది. అప్పటికప్పుడు “రాజు, రాణి పరలోకము నుండి మనకొరకు మరల తిరిగి వచ్చారు” అనే అర్థం వచ్చే పాటలు రచించబడి, గానం చేయబడ్డాయి.
లీల జరిగినదంతా వివరించగా, పద్మభూపతి శ్రద్ధగా ఆలకించాడు. అప్పటికప్పుడు నాలుగు సముద్రాల నుండి జలం తేబడ్డాయి. అతడు మంగళస్నానాలు చేశాడు. మరల అతనికి మంగళాభిషేకం చేయబడింది. ఆ రాజు, ఇరువురు లీలలు తమ పూర్వవృత్తాంతము గురించి చిత్రంగా గుర్తు చేసుకొంటూ, ప్రసంగం చేసుకొంటూ, ఉద్యానవనాలలో విహరించారు.
Page:373
చూచావా, రామా! ఆ పద్ముడు నిజప్రయత్నబలంచేత, సరస్వతీదేవి కటాక్షంచేత పరమ శ్రేయోదాయకమగు జ్ఞానమును పొందాడు. అట్లే పునర్జన్మను, రాజ్యమును కూడా పొందాడు. ప్రబుద్ధలీల సరస్వతీదేవిచే ప్రసాదించబడిన జ్ఞాన విషయములన్నీ ఆ ఇద్దరితో కూడి విచారించేది. ఆ ముగ్గురు జీవన్ముక్తులై రాజ్యమును పాలిస్తూ చాలా సంవత్సరాలు గడిపారు. ఆ రాజు ప్రజాహితంగా, పండితులకు సంతోషం కలుగజేసేట్లుగా, దోషరహితంగా రాజధర్మాన్ని నిర్వర్తించాడు. యశస్సు, ధర్మము, సౌభాగ్యము స్వయముగానే అతనియందు ఉత్తమత్వము పొందాయి.
ఆ తరువాత కొంతకాలానికి సాధన-విచారణలు ప్రయోజనంగా పద్ముడు - ద్వితీయలీల కూడా ఉత్తమజ్ఞానము పొందారు. విదేహముక్తి పొందారు. ప్రథమలీల ఇతఃపూర్వమే ముక్తస్వరూపిణి కదా!
Page:374
IV. లీలోపాఖ్యానం - సమీక్ష
1. కాలము - భావన - పురుషకారము - - దైవము - అఖండ బ్రహ్మము శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవుని యందు "దృశ్యముతో ఏర్పరచుకొనిన బంధము” అనబడు ఒకానొక దోషము రూపుదిద్దుకొని ఉంటోంది. అట్టి దోష నివృత్తి కొరకే నీకు ఈ ‘లీలోపాఖ్యానం’ చెప్పాను. "ఈ దృశ్యజగత్తు సత్యము" అను రూపము గల భ్రమావేశము నీవు కలిగియుండకూడదు సుమా! ఈ దృశ్యము నీపై చూపుచున్న ప్రతాపమును నిరోధించతలచుకొంటే, అదొక్కటే ఉపాయం. ఈ ఎదురుగా ఉండి, ప్రాప్తించుచున్నట్టి దృశ్యమునందు, “ఇది వాస్తవమే” అను “సత్యత్వబుద్ధి” ఉన్నంత వరకు దీనిని నిర్మూలించటం బహుకష్టతరమగుచున్నది. ఉత్తమ భావనచే ఆ భ్రమబుద్ధి తొలగిపోయిందా .... ఇక సంసారాన్ని జయించటంలో, ముక్తిని పొంద గలగటంలో, కష్టమైనదేదీ ఉండదు.
జ్ఞానులగు వారు ఈ దృశ్య పదార్థములను చూస్తున్నప్పుడు “ఇవన్నీ ఆకాశము వలె 'శూన్యము, మిథ్య” మాత్రమే” అని స్వవిచారణా సామర్థ్యంచే ఎరుగుచున్నారు. ఈ ప్రపంచమంతా ఆకాశతుల్యుడగు పరమపురుషుని యందే వెలయుచున్నది. అతడే అన్నిటికి కారణము - కార్యముకూడా. అతడొక్కడే స్వయంప్రభువు. తన ఉనికికి తానే కారకుడాతడు. అట్టి ఆ పరమాత్మ ఈ పృథివి మొదలైన పంచభూతములకు సంబంధించినవాడు కాదు సుమా! అతడు చిన్మాత్రమే (that which knows, sees, experiences all else) శరీరముగా కలవాడు. అతడు మాయాపూర్వకముగా తనయందు ఈ వివర్తమంతా కల్పించుకొని, అందు వెలయుచున్నాడు. అంతే గాని, ఎక్కడా ఏదీ బాహ్యమునందు లేదు. అనగా, ద్రష్టగా, దృశ్యముగా భాసించుచున్నది అతడే. అతడు ద్రష్టత్వముకన్నా ముందే ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆ చైతన్యరూపుడగు స్వయంభువు ఎప్పుడు ఎట్లు యత్నించునో, లేక భావించునో, లేక సంకల్పించునో, .... అప్పుడు అట్లే వివర్తము పొందుచున్నాడు. అతడు 'సృష్టి' కొరకు యత్నించి నపుడు లేక సంకల్పించినపుడు సృష్టియే జరుగుతోంది. 'స్థితి' కొరకు భావించుచుండగా స్థితియే ప్రాప్తిస్తోంది. లయము కొరకు ప్రయత్నించుచుండగా 'ప్రళయము' ప్రాప్తించుచున్నది. (He Creates, sustains and destroys of his own volition)
ఓ ప్రియ రఘురామా! ఈ జగత్తంతా "బ్రహ్మాత్మకము అగు (బ్రహ్మమే స్వరూపముగా కలిగి నట్టి) నిర్మల చిదాకాశమునందే ప్రతిభాసించుచున్నది. అయితే పరమార్థదృష్టితో పరికించి చూచి నప్పుడు మాత్రం బ్రహ్మమున “జగత్తు” అనబడు పదార్థమునకు తావే లేదు. పరిమితాశయముల దృష్ట్యా చూచినపుడు “వ్యవహారదృష్టి" అని, మహోన్నతమగు సత్యమే ఆశయముగా కలిగియున్నప్పుడు 'పరమార్థదృష్టి' అని చెప్పబడుతోంది. ఈ జగత్తు బుద్ధి వికారముచే ప్రాప్తిస్తున్నది మాత్రమే!
Page:375
అందుచేత ఇదంతా బుద్ధిపరిచ్ఛిన్నుడగు జీవుని యందు మాత్రమే వెలయుచున్నదని గ్రహించు. మరి అట్టి వ్యర్థమగు భ్రాంతికి 'సత్త' ఏమి? వాసనఏమి? స్థిరత్వమెక్కడ? నియతి ఏమి ఉంటుంది? దేనికొరకు ఏది ఆవశ్యకత కలిగి ఉంటుంది? మాయవలన మాత్రమే ఇదంతా ఇట్లు స్వప్నములోవలె దీర్ఘమైన దృశ్యముగా ప్రాప్తిస్తోంది. ఘనీభూతమైనదానివలె, ఈ జీవులను తోలుబొమ్మల వలె ఆడించుచు, వ్యవహర్తవలె ప్రవర్తిస్తోంది. పరమార్ధదృష్టిచే ఇదంతా శూన్యమే! ‘మాయ’ అను శబ్దమునకు గల అర్థమేమిటి? “ఏదైతే లేదో” ... అని కదా! అవాస్తవకతతో కూడినదై, భ్రమ మాత్రమే అయినదానినే 'మాయ' అంటున్నాం. అంతేకాని ఇక్కడ 'మాయ' అనబడు ఒకానొకదానికి కర్తృత్వం ఆపాదించటం మన ఉద్దేశం కాదు సుమా!
శ్రీరాముడు : హే భగవన్! మీరు ఈ 'లీలోపాఖ్యానం'లో యథోచితమైన దృష్టాంతము లచే, జీవులకు శాంతిని ప్రసాదించకలిగినట్టి పరమార్థ దృష్టిని ప్రదర్శించారు. ఆహా! ఆశ్చర్యం! ఎంతో కాలం తరువాత ఇప్పుడు మేము తెలుసుకోవలసినది తెలుసుకొంటున్నామని మాకు అనిపిస్తోంది. స్వామీ! మీరు చెప్పిన ఉపాఖ్యానం, అందలి శాస్త్రవ్యాఖ్యానం అత్యంత అద్భుతంగా ఉన్నాయి. అది విని, స్వయముగా విచారణ చేయుచుండుటచే, తత్త్వమును గ్రహించి శాంతిని, నిర్వాణమును తప్పకుండా మేమంతా పొందగలం. మీ వాక్యామృతం ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. ఇప్పుడు నాకు కలుగుతున్న కొన్ని సందేహములు ప్రస్తావిస్తున్నాను. అనుగ్రహించండి. ఒకే కాలము యొక్క వివిధ గతులు - రీతులు
ఒకానొక జీవుడు “వసిష్ఠ పద్మ-విదూరథుల” సృష్టులందు జీవించియుండటం మనం చెప్పుకున్న కథనంలో జరిగినది కదా! అట్లు మూడు తీరులుగా గడచినట్టి కాలము యొక్క స్వరూపము ఎట్టిది? ఆ కాలము కూడా మన ఈ కాలంలాగానే రాత్రింబవళ్ళు కలిగియున్నదేనా? అది మాసములు - సంవత్సరములు - - క్షణములుదీర్ఘకాలం మొదలైనవి కలిగియున్నదా? ఒకేసారి వేరువేరు ప్రమాణములతో వేరువేరు రీతులుగా కాలగమనం ఉంటుందా? ఆ జీవుని వేరువేరు జన్మస్థానము లందు కాలగమన ప్రక్రియ వేరువేరు సాపేక్షలు ఎట్లు కలిగియున్నది? ఒకచోట ఎనిమిది రోజులు జరుగగా మరొకచోట డెబ్బది సంవత్సరములు గడచినాయే? నా సందేహం ఇది. ఈ విషయమై మీరు చూచాయగా కొన్ని విషయాలు చెప్పియున్నారు. కాని నాయందు ఇంకా సందేహనివృత్తి కాలేదని నాకు అనిపిస్తోంది. అజ్ఞానులమగు మేము ఒక్కసారి విన్నంత మాత్రంచేత గ్రహించవలసినదంతా గ్రహించగలమా? ఎండిన మట్టి ఒకటి రెండు జలబిందువులు పొందినంత మాత్రంచేత తడుస్తుందా? లేదు. హే సద్గురూ! నా బుద్ధి తగినంతగా వికసించియుండక పోవచ్చును. నన్ను క్షమించండి. ఈ 'కాలము’ విషయమై మరికొంత వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : 1) సంకల్పము 2) జ్ఞానము 3) అనుభవము .... ఈ మూడింటికి ఒకానొక చమత్కారమైన అవినాభావసంబంధం ఉన్నది. ఎవడు ఎక్కడ ఎట్టి జ్ఞానమును పొందుతాడో,
Page:376
అతడు దానిపట్ల అట్టి అనుభవమునే పొందుచున్నాడు. జ్ఞానము- సంకల్పములు ఒకటికి మరొకటి తోడు, ఆధారము, మూలము అగుచున్నాయి.
ఈ విషయం కొన్ని దృష్టాంతములను తీసుకొని మరికొంత స్పష్టంగా చెపుతాను. విను. "ఇతడు నాకు ప్రియమైనవాడు” అని నిరంతరం భావించుటచే ఒకడు అట్లే ప్రియమైనవాడు అగుచున్నాడు. "ఇతడు నాకు మిత్రుడు" అని భావించుటచే శత్రువు కూడా మిత్రుడైపోతాడు. ఒకానొకడు విషమును “ఇది నాకు అమృతముతో సమానం” అని భావించుటచే కొంత కాలమునకు అది అతనికి అమృతప్రాయమే అగుచున్నది. పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు ఇవన్నీ ఏ భావంతో భావించబడితే, అట్టి భావనా ప్రభావంచేత ఆయా పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు అట్లే ప్రతిభాసిస్తున్నాయి. కార్యకారకములు కూడా అగుచున్నాయి.
“ఒక నిమిషము”ను అనేక కల్పములుగా భావించి, అట్టి బుద్ధిని బడయకలిగితే, అట్టివానికి ఆ ఒక్క నిమిషమే కల్పములుగా తోచగలదు. అదేవిధంగా కల్పముల యందు "ఇది ఒక్క నిమిషముతో సమానం” అనునట్టి బుద్ధి ఉంచినప్పుడు అవన్నీ మరుక్షణం నిమిషమాత్రములే అగుచున్నాయి. చిత్తముయొక్క స్వరూపమే అట్టిది. మనం దృష్టాంతంగా లౌకిక జీవిత విశేషములే తీసుకొందాం. దుఃఖములతో, భయముతో బాధితుడగుచున్నవానికి 'ఒక రాత్రి’ అత్యంత భారంగా, అనేక సంవత్సరము లంత పొడవైనదిగా తోచుచున్నది. సుఖసంపదలు పొందియున్నవానికో అదే రాత్రి - బంధు సమాగమంతో, ఆనంద-ఆహ్లాదములతో - ఒక క్షణమువలె గడచిపోతోంది. అది అట్లా ఉండగా, ఒకడు స్వప్నానుభవం పొందుచున్నప్పుడు, అతనికి స్వల్పకాలం అతిదీర్ఘంగా, దీర్ఘకాలం అతిస్వల్పంగా అనుభవమగుచున్నది. స్వప్నంలో, "అయ్యో! మరణించాను. మరల పుట్టాను బాల్య-యౌవనాలు గడచిపోయి, ముసలివాడినయ్యాను. వందలాది యోజనముల విస్తీర్ణం ప్రయాణం చేశాను. ఎక్కడో, ఎప్పుడో ఉండియున్న వారితో కలసి సంభాషించాను” —అనునట్టి భావనోద్వేగం కలుగుతోంది కదా! ఇట్లు దీర్ఘకాలం స్వల్పంగా ఉండటం, కొద్దికాలం దీర్ఘంగా అనుభవమవటం ప్రతివారికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకరూపంగా అనుభవం అవుతూనే ఉన్నది సుమా! 'హరిశ్చంద్రుడు' అనే రాజు ఒక్కరాత్రి యందు 12 సంవత్సరముల కాలక్రమము యొక్క అనుభవం పొందినట్లు వినియున్నావు కదా! 'లవణుడు' అనే మరొక రాజు ఒక్కరాత్రి యందు డెబ్బది సంవత్సరముల ఆయువును అనుభవించియున్నాడు. అంతేకాదు. "మహర్షి మనువు’ యొక్క ఒక్క జీవితకాలం .... ప్రజాపతి బ్రహ్మదేవునికి ఒక ముహూర్తకాలం అగుచున్నది. బ్రహ్మయొక్క ఒక జీవితకాలం విష్ణువునకు ఒక రోజు అగుచున్నది. విష్ణువుయొక్క జీవిత కాలం శివునకు ఒక్కరోజు. నిర్వికల్ప సమాధియందు దివారాత్ర భేదమే ఉండదు. ఎందుచేత నంటావా? నిర్వికల్ప సమాధిని ఆశ్రయించినవానికి ఇక 'కాలము' అనునది మొదలంటా అసత్యముగును, ఆత్మపదార్థమొక్కటే సత్యముగాను అనుభవమగుచున్నది.
లవణుని కథ ఈ ప్రకరణంలో “ఇంద్రజాలోపాఖ్యానం” లో చెప్పబడింది.
Page:377
ఒకప్పుడు ఈ ధన-దార-పుత్ర రాజ్యాది భోగఫలములు అత్యంత మధురంగా, గొప్పవైన వాటివలె ఉంటున్నాయి కదా! ఇవన్నీ వైరాగ్యభావముతో దర్శించినప్పుడో? వాటి యొక్క చింతనయే అప్రియం అవుతోంది. ఎంతమంది చక్రవర్తులు త్రుటిలో సర్వ భోగములు త్యజించి వానప్రస్థం స్వీకరించలేదు చెప్పు? మధుర భావముతో చింతించుట చేతనే కదా. “ఉపవాసములు, తీర్థయాత్రలు, సుదీర్ఘమైన పాదయాత్రలు” మొదలైనవి ఆహ్లాదకరంగా తోచుచున్నాయి. మధురభావము యొక్క ప్రభావము చేతనే అతి కష్టతరమైనట్టి “మనోనిరోధము” కూడా ఆత్మ సుఖమును ప్రసాదిస్తూ, మధురముగా ప్రాప్తించుచున్నది. మహాపురుషులగు కొందరు తమపట్ల శత్రుత్వము వహించువారు తారసపడినప్పుడు కూడా, "వీరు నాకు మిత్రులతో సమానమే. తమ తమ ఈ పరుష వాక్యములచే నాకు మేలే చేస్తున్నారు” అని సౌమ్యభావంతో చింతించుచూ ఉంటారు. అట్టి చింతనా ప్రభావంచేత లోకరీతిగా అప్రియులు కావలసినవారు కూడా ఆప్త పురుషులగు మిత్రులుగానే పరిణమించుచున్నారు. అట్లే విషయభోగాదులు పొందుటకు గాను, కొందరు బంధువులు సాయపడువారు కావచ్చు. కాని, "వీరు నా ఉత్తమ పురుషార్థమునకు విఘాతమునే కలుగజేస్తున్నారే!” అని భావించినప్పుడు ఆ బంధువులు అతనికి అప్రియులే అగుచున్నారు కదా!
ఓ మహాభాగా! రామచంద్రా! “అసలు ఈ జగత్తు అంతా ఏమిటి? ఏమైయున్నది" అని పరిశీలించినప్పుడు “ఇదంతా కేవలం భావనామయం మాత్రమే” అని మనకు తెలియవచ్చుచున్నది. "శాస్త్రాలు పఠించటం, జపములు, తపములు” మొదలైనవి .... ఉత్తమమైన “భావన, అభ్యాసం” ఈ రెండూ లేకపోవటం చేత ... కొందరికి ఎంతో దుస్సాధ్యమైన వాటివలె అనిపిస్తున్నాయి. మరికొందరికి “చక్కగా గ్రహించి ఉండటం 'ఇవి శుభప్రదములు' అని భావన కలిగియుండటం .... అభ్యాసం” ... వీటి వలన జపతపాది వ్యవహారములు ఎంతో తేలికైనవిగా, ఆహ్లాదకరమైనవిగా, సుఖకరమైనవిగా అనుభవ మగుచున్నాయి. పరిశీలనాత్మకమైన బుద్ధి లేనట్టివాడు, నౌకలో పయనించుచున్నప్పుడు, ఒకవైపుకు చూచి “ఆహా! ఈ వృక్షములు గుండ్రముగా కదులుచున్నాయి” అని అనుకొంటున్నాడు. అట్లా కాకుండా, “ఈ విధంగా చెట్లు కదులుచున్నట్లు కనబడుచున్నప్పటికీ, అట్లు జరుగుట అసాధ్యం. వాస్తవానికి ఈ నౌకయే కదులు చున్నదిగాని, చెట్లు కాదు” అను భావనను దృఢం చేసుకొన్నవాడో, భ్రమకు లోనుకాడు.
ఓ రామా! బాగుగా పరిశీలించకపోవటం, విచారణ చేయకపోవటం చేతనే .... శూన్యము కూడా అనేక వస్తుజాలముతో కూడుకొని పూర్ణమువలె అనుభవం అవుతోంది. స్వప్నంలో గోడలు, భవనములు, తదితర వస్తుజాలం, బంధుజనులు కనబడటం జరుగుతోంది. వారు వాస్తవమా? కాదు. కాని అనుభవం మాత్రం ఉంటోంది. అంతరంగమందు 'భావన' గావించబడటం చేతనే ఆ స్వప్నవస్తువులన్నీ కనబడటం జరుగుతోంది. అవన్నీ 'జాగ్రత్తు'కు లభించకపోయినా, స్వప్న సమయంలో స్వప్నద్రష్టకు వాస్తవమనే అనిపిస్తున్నాయి. "గ్రహించటంలో గల దోషం” చేత పసుపు-పచ్చటి పదార్థములు కూడా నీలంగానో, తెలుపుగానో కనిపిస్తూ ఉంటాయి. రంగుటద్దం