Page:292

దేవుడు కూడా అట్టి విశ్రాంతినే ఆశ్రయించుచున్నాడు. 'ఆత్మ' యొక్క ఆకారముగానే ప్రకాశించుచున్న 'బ్రహ్మపదము' నందు విలీనచిత్తుడు అగుచున్నాడు. అహంకార మమకారాలు త్యజించి పరబ్రహ్మమున శాంతిని పొందుచున్నాడు. అలలు లేని సముద్రంలాగా ఆత్మయందు సుస్థితుడగుచున్నాడు. “మౌనము అవధరించినవాడు, భావాతీతుడు... అగుచున్నాడు.

అట్టి ఉపసంహరణ సమయంలోని తతంగం ఏమిటో వర్ణించి చెపుతాను, వినుసముద్రము అలలు నుండి విడివడునట్లు, బ్రహ్మదేవుడు జగత్ నిర్మాణానికి మూల కారకమగు విషయముల ధ్యానము (సృష్టి పట్ల అధ్యాస) నుండి విడివడుచున్నాడు. ఇట్లు తలచుచున్నాడువిచారయతిసంసారం సుఖదుఃఖసమన్వితమ్

ఆశాపాశశతైర్బద్ధం రాగద్వేషభయాతురమ్ (శ్లో 41, సర్గ 59)

"ఆహాఁ! ఈ సంసారమంతా దుఃఖసమన్వితమే కదా! ఇదంతా జీవునికి ఆశాపాశ రూపములు గానే ప్రాప్తిస్తోంది. ఇది రాగ ద్వేష భయములతో నిండి ఉంటోంది. నా పుత్రులగు ఈ జీవులు అజ్ఞానముచే దృశ్యమునకు బద్ధులైపోతున్నారు. పదే పదే జనన-మరణ దుఃఖాలను పొందుచున్నారు. వీరంతా ఉద్దరించబడేది ఎట్లా?"

క్రమంగా దయార్ధ చిత్తుడగుచున్నాడు. జీవరాశుల సుఖం కొరకు మోక్షాన్ని ప్రసాదించ గల ఆధ్యాత్మశాస్త్రము ను రచించుచున్నాడు. వేద వేదాంత సంగ్రహములను, పురాణములను రచింపజేయుచున్నాడు. అట్టి 'ప్రక్రియ' యందు నేను, వ్యాసుడు, వాల్మీకి మొదలైనవారమంతా నియమించబడ్డవారమే సుమా!

అట్లు ఆ బ్రహ్మదేవుడు 'సృష్టి' అను ఈ పరిశ్రమ నుండి వెలువడి తన పూర్వపదమును (past glory) పొందుచున్నాడు. బ్రహ్మముతో ఐక్యము, అభేదములే అతని పూర్వపదము. అట్టి పూర్వపదాన్ని అవలంబించి, గాలులు వీచనట్టి సమయంలో సముద్రుని వలె... పరమ ప్రశాంతు డగుచున్నాడు. ఈ రీతిగా స్వస్వరూపమున వెలయుచున్నాడు. అనగా, అతడు ఈ జగత్తును కల్పిస్తున్నాడు. వీక్షిస్తున్నాడువీక్షిస్తున్నాడు. . శాస్త్ర రచనలచే నియమాదులు కల్పించుకొని మరల ఆత్మస్థుడగుచున్నాడు.

శ్రీరాముడు: ఇట్లు 'సృష్టి' లేక 'దృశ్యము' యొక్క కల్పన ఉనికి ఉపశమనములకు కారణమగుచున్న మనోరూపుడగు బ్రహ్మయొక్క ఉనికి ఎచ్చట?

శ్రీ వసిష్ఠ మహర్షి వాస్తవానికి బ్రహ్మదేవుడు చిత్స్వరూపుడే. అతడు సంకల్పరహితుడే. సంకల్పించుటకు మునుముందే ఉండి ఉన్నాడు. అయినప్పటికీ తనయొక్క 'ఇచ్ఛ' చే లోకములను అనుగ్రహించుట కొరకు లోకవ్యవహార పారాయణుడగుచున్నాడు.

వాస్తవానికి అతనికి ఆర్జన లేదు. అనాదరణ కూడా లేదు. శరీరగ్రహణము లేదు... నానాత్వము లేదు. అతనికి చేతనము-స్థితి-వినాశనములు కూడా లేవు.

Page:293

అతనికి అన్ని భావములు, చిత్తవృత్తులు కూడా సమానమే. సర్వదా పరిపూర్ణస్వరూపుడై మహాసముద్రము' వలె వెలయుచున్నాడు. కాని, ఒక్కొక్కప్పుడు తన అప్రమేయత్వము పట్ల నిదురించి, జగత్తుపట్ల జాగరిల్లుచున్నాడు. ఆ సమష్టి సంకల్పస్వరూపుడు అగు బ్రహ్మదేవుడు బ్రహ్మము కంటే వేరైనవాడు కాదు.

ఇదంతా ఇట్లా ఉండగా 'బ్రహ్మముతో ఏకము' అను అత్యంత సాత్విక స్థితి ఒకటి ఉన్నది. అది నిష్కల్మష హృదయులు, పదార్థరాహిత్యం పొందినవారు మాత్రమే దర్శిస్తున్నారు. వారు మనస్సే బ్రహ్మము అను అనుభవమునకు అర్హులగుచున్నారు.

5. సృష్టి-జీవుడు" - పరిణామ చమత్కారం

సృష్టి ఏర్పడి ఉన్నట్టి చైతన్యమునే 'జీవుడు' అంటున్నాం. అయితే, ఈ జీవత్వము ఏర్పడక ముందే ఆత్మయొక్క ఔన్నత్యము స్థితి కలిగియే ఉన్నది. ఈ సృష్టికి పరముగా చిదాకాశము ఉన్నది. మనస్సునందు రూపములు ఏర్పడి, గాంచబడతాయి చూచావా! ఆ విధంగానే చిదాకాశము నందు ఈ సృష్టి ఏర్పడుచున్నది. నిర్మల ప్రశాంతజలంలో ఆవృత్తములు ఏర్పడుచున్నప్పుడు, ఆవృత్తములు జలం కంటే వేరుకాదా కదా! అట్లాగే, జగత్తు - దృశ్యములకు సంబంధించిన చిత్తవృత్తులు చిదాకాశము కంటే వేరు అని అనటానికే వీలులేదు.

అట్టి సృష్టిలోని ప్రథమరూపములే 'ప్రజాపతులు' అని చెప్పబడుచున్నారు. ఆ ప్రజాపతుల సంకల్పములను అనుసరించే 'నియతి' మొదలైనవి ఏర్పడుచున్నాయి.

చిదాకాశము - →→ సృష్టి సంస్కారములు : ప్రజాపతులు - ఓషధులు- చంద్రకళ -కల్పన - సంకల్పములు: దేవతలు - కర్మలయందు ఆసక్తి-మానవులు : తదితర జీవోపాధులు.

ప్రజాపతులు - వీరు ప్రథమ సృష్టిలోని వారు. వీరియందు బ్రహ్మజ్ఞానము స్వతఃసిద్ధమై ఉంటోంది. అయితే "మేము తదితర జీవుల సమున్నతి కొరకు ఉపాసన మొదలైనవాటిని కల్పించాలి”... అనే సంస్కారం కలిగి ఉంటున్నారు.

దేవతలు - ప్రజాపతులు ఏర్పడిన తరువాత అదే కల్పన దేవతల రూపమున ఉదయిస్తోంది. వీరు సుసంస్కారము స్వభావముగా కలిగి ఉంటున్నారు. వీరు ఉపదేశ మాత్రం చేతనే బ్రహ్మజ్ఞానం పొందుచున్నారు.

మనుష్యులు - వీరికి పురుష ప్రయత్నం చేత మాత్రమే బ్రహ్మజ్ఞానం లభిస్తోంది. సాధు సంగము, శాస్త్రాభ్యాసము, ఇంద్రియ జయము మొదలైన ఉపాయములను అభ్యసిస్తేనే బంధమును త్యజించగలుగుచున్నారు. ఉత్తమఫలము' అయినట్టి 'బ్రహ్మజ్ఞానము' సుస్థిరమయ్యే వరకు వారు శ్రవణమననములను ఆశ్రయించవలసి వస్తోంది.

Page:294

ఈ విధంగా ఈ సృష్టి 'సృష్టము లేక సంకల్పితము అయినట్టి అనేక ఉపాసనలతోను, ‘యజ్ఞము’ మొదలైన ఉచితకర్మలతోను, "ద్వేషము, రాగము, ప్రేమ, పరిమితదృష్టి”... మొదలైన నిషిద్ధ మిశ్రమ కర్మలతోను ప్రకాశిస్తోంది. ఇందులో ప్రవేశించుచున్న జీవుల వాస్తవ స్వరూపము శుద్ధతత్త్వమగు ఆత్మయే అయినప్పటికీ, వారు 'పొందుట-కోల్పోవుట' మొదలైన క్రీడాకౌతుకం అవలంబించి ఉంటున్నారు. గర్విస్తున్నారు... హింసిస్తున్నారు... దుఃఖిస్తున్నారు.... ఒకరితో మరొకరు కీచులాడుకుంటున్నారు. వారిలో వారు వాదులాడుకుంటున్నారు. ఈ విధంగా ఉచిత, అనుచిత ప్రారబ్ధకర్మల వేగముతో సృష్టిలోని ఆయా వ్యవహారమంతా వర్ధిల్లుతోంది. అనేక జీవుల, జీవజాతుల క్రోధ-లోభ వ్యవహారములతో ప్రవర్తించు ఈ సృష్టులు "బ్రహ్మదేవుని సంకల్పము” యొక్క బలంచేతనే 'సత్తు' ను పొందుచున్నాయి.

ఈ త్రివిధ సృష్టులు ఇట్లు ఉండగానే ఈ జీవుడు సర్వదా బ్రహ్మమేనని గ్రహించి ఉండు.

6. సృష్టికి మూలం ఇచ్ఛయే!

శ్రీరాముడు: తండ్రీ వసిష్ఠ మహర్షీ! అనంతసంఖ్యలో దీపితమౌతున్న ఈ జీవగణమంతా ఎక్కడి నుండి, ఎందుకు ఎట్లా వచ్చి సృష్టిలో ప్రవేశిస్తున్నాయి?

శ్రీవసిష్ఠమహర్షి: భగవంతుడగు బ్రహ్మదేవుడు ఒక సమయంలో ఆత్మసమాధి (ఆత్మను మాత్రమే దర్శించుచుండుట) - మౌనము" అను రూపంలో ఉండే తన స్వస్వభావమును విడిచి, లేచి, ఈ సృష్టి పరంపరావ్యవస్థను ఏర్పరచుచున్నాడు. అతని ఇచ్ఛయే ఇదంతా. అందుచేత "సృష్టికి మూలం ఇచ్ఛ" అని చెప్పబడుతోంది.

అట్లు ఏర్పరచబడిన ఈ సృష్టి లేక జగత్తులో అనేకమంది మృతతుల్యులగు జీవులు లేచి పడుచున్నారు. వారు 'జీవనతృష్ణ' అనే గాలికి కొట్టుకువచ్చి ఇందు పాల్గొనుచున్నారు. దృష్టిభేదము ననుసరించే ఇదంతా ఏర్పడి ఉంటోంది.

ఈ భూతజాలమంతా (లేక, ఇక్కడి జీవులన్నీ) బ్రహ్మమునుండే లేచుచున్నాయి... జగదృశ్యమును అంగీకరించి సంసారపంజరములో ప్రవేశిస్తున్నాయి. 'ఏదో పొందాలి, చూడాలి, కావాలి' మొదలగు రూపంగల 'తృష్ణ' యే జగద్వ్యహారములంతటికీ మూలకారణమై ఉంటోంది.

ఈ పంచభూతమయ శరీరాదులన్నీ ఆకాశం నుండి ధూళికణాల వలె బయల్వెడలు చున్నాయి. ఇక్కడి పంచభౌతిక నిర్మితములన్నీ ఆకాశంలోంచి బయలుదేరి, మరల ఆకాశంలోనే లయమౌతున్నాయి. 'ఆకాశమే ఈశ్వరుని ప్రథమపుత్రుడు' అని అందుకే శాస్త్రకారులు చెప్పారు.

జలం నుండే తరంగాలు లేస్తున్నాయి కదా! ఈ జీవగణములన్నీ అనాది యగు ‘బ్రహ్మపదము’ నుండే ఉత్పన్నం అగుచున్నాయి. బ్రహ్మము చేతనే బ్రహ్మము నందు కల్పనాదృష్టిచే

Page:295

పొందబడుచున్నాయి. పొగ మేఘాలలో మేఘాలలో ప్రవేశించుచున్నట్లు ప్రవేశించుచున్నట్లు ఈ ఈ జీవగణం ఆకాశంలో

జేరుచున్నాయి.

అంతా సంకల్పమాత్రమే - జీవులు పరబ్రహ్మమునందే ఆకాశ వాయువులతో కూడి సంచారం కొనసాగిస్తున్నారు. ఈ జీవులు, ఈ ఆకాశ వాయువులు పరబ్రహ్మము నుండి సంకల్పప్రభావం చేతనే ఏర్పడుచున్నాయి.

తేజస్సు (అగ్ని) - జలము పృథివి ఇవన్నీ సృష్టించబడిన తరువాత జీవులు ప్రాణవాయువులచే ఆక్రమించబడుచున్నారు. అన్నిటికీ మూలం సంకల్పమే. మనో-బుద్ధిచిత్త-అహంకారముల సమన్వయమే లింగదేహము,

పరమాత్మ మహాసముద్రంలో లింగదేహ తరంగాలు అనంతంగా ఏర్పడుతున్నాయి. ప్రాణవాయువులు-భూతతన్మాత్రలు-అన్నము-జలము అవన్నీ కలసి పంచవిధ వాయువులుగా మారుచున్నాయి. ఆ పంచవిధ వాయువులు స్థూలదేహంలో ప్రవేశిస్తున్నాయి. అట్లు ప్రవేశించి తేజస్సు యొక్క భావం పొందుచున్నాయి. అట్లు తేజస్సు భావన పొందిన జీవులు ప్రాణ రూపమును దాల్చి ఈ జగత్తునందు ఉత్పన్నులగుచున్నారు. అయితే ఎందుకో వారి జ్ఞానం అపరిపక్వంగా, అస్ఫుటంగా ఉంటోంది.

7. జీవోత్పత్తి - జీవపతనము

శక్తి స్వరూపాలు, భావనామాత్రులు, సూక్ష్మశరీరరూపులు అగు జీవాభిమానులు సృష్టి యందు ఏర్పడి ఉంటున్నారు. వారు భావనోద్రేకానుసారం 'ధూమమార్గం లో ప్రవేశిస్తున్నారు. పూర్ణచంద్రోదయం అయ్యేవరకు క్షీరసముద్రమునకు కూడా ఆశ్రయమైనట్టి ఆకాశ కోటరంలో ఉంటున్నారు.

పూర్ణచంద్రుడు ఉదయించగానే 'ఆకాశకోటరం' లేక లింగశరీరయుతము సృష్టి స్వభావంలో ప్రవేశించుచున్నారు. తరువాత, వారు చంద్రకిరణములలో ప్రవేశిస్తున్నారు. అప్పుడు చంద్రకిరణముల సహాయంచే పుష్టిని సంపాదించుకొని, ఆ కిరణముల ద్వారా రస పూర్ణమైన ఫలములను ఆశ్రయిస్తున్నారు. అట్లు చంద్రకిరణముల నుండి వేరువడి, బిడ్డ తల్లి పాలిండ్లను ఆశ్రయించినట్లు ఫలములలో ప్రవేశించి మాతృగర్భంలో కొద్ది సమయం ఉండి ఉంటున్నారు.

ఆ ఫలములు సూర్యకిరణముల వలన పక్వం పొందుచున్నాయి. వాటిని ప్రజాపతులు, జనులు భుజించటం జరుగుతోంది. అప్పుడు ఆ ఫలాలలోని జీవులు 'వీర్యము' యొక్క రూపాన్ని గ్రహించుచున్నారు. వీర్యరూపము నందు మూర్ఛితులై ఉండి ఉంటున్నారు. ఆ తరువాత వారు యోనులందు ప్రవేశించి మాతృగర్భంలో ఉంటున్నారు.

శ్రీరాముడు: ఆ స్థితిలో వాసనలు ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయి?

Page:296

శ్రీ వసిష్ఠ మహర్షి: జీవులు ఆకాశంలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు, గాఢనిదురలో ఉన్నప్పుడు కూడా వారి వాసనలు అణిగి, లీనమై ఉంటున్నాయి. మట్టియందు కుండ, కొయ్య యందు అగ్ని మూగగా ఉన్నట్లు వాసనలు కూడా గర్భస్థశిశువునందు అణిగి ఉంటున్నాయి. ఆ తరువాత ఆయా ఉపాధులను పొంది యోగమార్గంలోనో, భోగమార్గంలోనో పయనిస్తున్నారు. ఈ యోగులందరినీ ముఖ్యంగా రెండు విధాలుగా విభజిస్తూ ఉంటారు. అవి1. జీవన్ముక్తుడు; 2. మిశ్రమగుణి

జీవన్ముక్తుడు - ఈతడు పూర్వజన్మలో పరమ వైరాగ్య జీవితము గడిపినట్టినాడు. అనగా భోగముల కొరకు కాకుండా, భక్తి-జ్ఞానముల కొరకు, నిర్మల హృదయం కొరకు కర్మలను ఒనర్చినవాడు. భోగాసక్తి రహితమవటం చేత, అట్టివాడు దైవాంశసంభూతుడై, సాత్వికవృత్తిని స్వీకరించి జీవన్ముక్తుడై వ్యవహరించుచున్నాడు.

మిశ్రమగుణి - ఈతడు దేవయోనిని పొంది కూడా, జన్మమరణ పరంపరలను త్రెంచుకొనుటలేదు. భోగాసక్తుడై ఉంటున్నాడు.

యోగుల మరొక విధమైన విభాగం వినుప్రథమ ప్రజాపతి - ఈతడు ఆత్మనుండి ప్రప్రథమముగా ఏర్పడియున్నాడు. ఈతని నుండే తదితర సృష్టి ఏర్పడి ఉంటోంది. ఈ ప్రప్రథమ ప్రజాపతితత్వమునకు సంబంధించినవానికి మరల జన్మించటం అనేదే ఉండదు.

రాజస సాత్వికులు - వీరు కేవల సాత్వికులయ్యేంతవరకూ పదే పదే జన్మిస్తూనే ఉన్నారు. కేవల సాత్వికులు - వీరు సర్వదా ఆత్మతత్త్వము విచారించి ఉంటున్నారు. అట్టివారు అతి స్వల్పసంఖ్యలో ఉంటారు. అందుచేత దుర్లభులు. వీరు జ్ఞానానందమయ స్వరూపులై ఉంటున్నారు.

ఈ జీవులలో మరికొందరు క్రమక్రమంగా సాత్వికత వదలి తామసులగుచున్నారు. వారు తామసులై, మూఢులై స్థావరస్థితుల వరకు రాలుచున్నారు. వారి గురించి మనం తరువాత తరువాత చెప్పుకుందాం. వారంతా "నేను ఎవరు? ఈ దృశ్యమేమిటి?" అనే ప్రశ్నకే రాకుండా కేవలం దృశ్యముతో సంబంధములను కల్పించుకొని అనేక స్థితిగతులందు దొర్లుచున్నారు. అనేక సుఖదుఃఖములను పొందుతూ ఈ జన్మ కర్మల చక్రములో పరిభ్రమిస్తున్నారు.

జన్మలు పొందుతూ కూడా 'సంసారభావము' ను ఈషన్మాత్రంగా కూడా పొందని జీవులు కూడా ఉన్నారు. వారు నరులలోను ఉన్నారు. సురులలో ఉన్నారు... జంతువులలోను ఉన్నారు. శ్రీరాముడు: హే మహర్షీ! తాము కేవలసాత్వికులా?

శ్రీ వసిష్ఠ మహర్షి: నేను ఉత్తమ ఆత్మ విచారణపరుడను మాత్రమే. కేవల సాత్వికుడను కాదు. ఎందుకంటే, కేవలసాత్వికునియందు సమాధినుండి విఘ్నము కలుగజేయ గలిగేదేదీ ఉండదు.

Page:297

అతనికి ప్రారబ్ధము అనేదే ఉండదు. కాని నా విషయమంలో ఈ "రాజస పౌరోహిత్యము అనే విఘ్నము, లేక ప్రారబ్ధము ఉండనే ఉన్నది. అందుచేత నేను ఇంకొంచెం రాజససాత్వికుడనే గాని పరిపూర్ణమగు కేవల సాత్వికుడను గాదు.

8. తత్పదము

శ్రీరాముడు: మరి నా విషయము స్వామీ?

శ్రీ వసిష్ఠ మహర్షి: నీవు నా వలే శమ దమాది గుణాలు పొందియున్నావు. కాని ఇంకా ఆత్మపదమునందు విశ్రాంతి లభించలేదు. సంసారభ్రాంతి ఇంకా స్వల్పంగా తొలగవలసి ఉంది. అందుచేత 'తత్ పదం గురించి మరికొంత తీవ్రంగా విచారణ, పరిశీలన అవసరం. అయితే, మన ఈ విచారణాసమయములోనే పూర్ణభావమును పొందగల విభవమును కలిగియే ఉన్నావు.

"బాగుగా విచారణచేయాలి" అను పురుషకారము ఆశ్రయించువారు లక్ష్యము ఎందుకు జేరరు? అట్టి ఆత్మతో ఏకత్వము, ఆత్మ లక్షణములన్నీ పొందటం... అను రూపము గల 'తత్' పదమే పరమోత్తమమైనది. అట్టి ఉత్తమోత్తమ పదము పొందటానికి ప్రతిజీవునకు హక్కు ఉన్నది.

అందుచే ఓ సర్వజనులారా! మీరంతా ఉత్తమవిచారణదాయకమగు గురువులను, శాస్త్రములను ఆశ్రయించండి. నిష్కామభావముతో సాత్వికకర్మలు ఆచరించండి. నిష్కామత్వమే మోక్షము అని చెప్పబడుతోంది. ఆత్మను మీరు సర్వదా కలిగియే ఉన్నారు. నేను సర్వదా మోక్షరూపుడనే... అను రూపముగల "బ్రహ్మా హమ్" భావనను పొందియే ఉండండి. అట్టి అవగాహన సముపార్జించుటకు ఈ మానవజన్మ ఉత్తమమైన అవకాశం. ఈ అవకాశమును వృథాపరచుకోకండి.

అట్టి పూర్ణానుభవం పొందిన, పొందుచున్న మహనీయులు మన మధ్యలోనే కొందరు తప్పక ఉన్నారు. వారి కొరకై వెతకండి. "మీరంతా 'పూర్ణత్వము' యొక్క అనుభవము వెతుక్కుంటూ ఈ ఈ యోనులందు ప్రవేశిస్తున్నారు... అని గుర్తుచేస్తున్నాను. అట్టి అనుభవం పదార్థములను, విషయములను పొందినంత మాత్రం చేత ప్రాప్తించగలదా? లేదు. అందుచేత పుల్లలను ప్రోగు చేయు పిట్టలవలె ధన-జన-యౌవనాలను మాత్రం చూస్తూ, ఉత్తమలక్ష్యమును ఏమఱువకండి. నిదురలేచి మీ ఆత్మయొక్క ఔన్నత్యమును గ్రహించండి.

Page:298

X. స్థితి ప్రకరణము - విషయ సమీక్ష

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! మనం ఈ ప్రకరణంలో చర్చించుకొన్నట్టి అన్ని విషయముల సారమును క్రోడీకరించి సంక్షిప్తంగా ఇప్పుడు కొన్ని విశేషాలు చెపుతాను. అటు తరువాత మనం ఈ పదవ రోజు చర్చను ముగించబోతున్నాం.



మహాగుణులగు కొందరు ఈ భూమిపై జన్మిస్తున్నారు. వారు తత్త్వవిచారణాసమర్థమగు రాజసిక సాత్త్విక వృత్తులతో ఆనందమయంగా సంచరిస్తూ ఈ భూమిని పావనం చేస్తున్నారు. ఆకాశంలో పూర్ణచంద్రునిలాగా నలువైపులా ఆహ్లాదమును ప్రసరింపజేస్తున్నారు. గాలి వేగానికి దుమారం లేచినంత మాత్రంచేత ఆకాశము కలుషితం అవుతుందా? వారి మనస్సులు కూడా దుః ఖములందు పడుటలేదు. బంగారముతో తయారుచేయబడిన పద్మము చీకటిపడినప్పటికీ వాడదు కదా! వారు గొప్ప ఆపదలలో కూడా మ్లానమనస్కులు అగుటలేదు. యాదృచ్ఛికంగా లభించిన నీటితో అడవిలోని వృక్షములు సంతోషించుచున్నట్లు, ఆ మహనీయులు లభించనిదేదీ కోరుకోరు. వృక్షములు ఇతరులకు నీడను, ఫలములను ఇవ్వటమే స్వభావంగా కలిగి ఉంటాయి గాని, "వీరు నాకు నీరు కూడా పోయలేదే? మరి నీడను ఎందుకివ్వాలి?" అని అనుకుంటున్నాయా? లేదే! వారు కూడా ఈ సంసార జనులకు ఆహ్లాదమును, ఆనందమును, జ్ఞానదృష్టిని ప్రసాదిస్తూంటారు. అది వారి స్వభావమే కాని, మరేదో ఉద్దేశించి వారు అట్లు చేయుటలేదు. నిర్మలమైనట్టి వారి బుద్ధి 'మోక్షము' అను ఒకే ఒక్క ఉపయోగము కొరకై 'శాంతి' మొదలైన అమృత గుణము లందు నిమగ్నమై పుష్టిని పొందుతూ ఉంటుంది.

చంద్రుడు ఎప్పుడైనా తన శీతలత్వమును వదలి ఉంటున్నాడా? లేదు. ఆ మహనీయుల సౌమ్యమైన బుద్ధి అపత్కాలంలో కూడా అంతరంగంలో సమగ్రమైన సమాధానం కలిగే ఉంటుంది. అంతే గాని, దైన్యం-క్రోధం-ద్వేషం-అసూయ మొదలైన దుర్వ్యసనాలకు లోను కాదు.

వారి ప్రకృతి 'మైత్రి' మొదలైన కళ్యాణగుణములతో గూడి ఒప్పుతూ ఉంటుంది. ఆత్మను ఎఱిగినట్టి సాధుపురుషులు సౌమ్యభావులై, సమరసులై సుందరగుణములతో సర్వదా ఒప్పుతూ ఉంటారు. అట్టి ఆపదలకు అతీతమగు ఆత్మస్థితిని పొందుటయే కర్తవ్యముగా భావించబడు గాక!

ఓ ప్రియజనులారా! దుఃఖములను వీడండి. ఈ జీవితముల పట్ల, జన్మల పట్ల, దృశ్యాల పట్ల... “ఇవి ఏమి అయున్నాయి? నేనెవరు? నాకు వీటికి ఉన్న సంబంధమెట్టిది? ఏది భావన? ఏది భావించునది?... మొదలైన విషయములలో ఉత్తమ విచారణ పెంపొందించుకోండి. ఆత్మతత్త్వము' యొక్క ఔన్నత్యం గ్రహించిన ఉత్తములు, దాన్ని సముపార్జించటానికే జ్ఞాన

Page:299

విజ్ఞానాలను అభ్యసిస్తున్నారు. తమ యొక్క సత్వగుణాధిక్యతచే రజోగుణమును క్షయింప జేసుకొంటూ, ఆత్మసాన్నిధ్యమును పొందుచున్నారు. ఆత్మానందము, ఆత్మసామీప్యము ఎట్టిదో గ్రహించి ఉంటున్నారు. సచ్ఛాస్త్రముల, పెద్దల ప్రవచనముల, స్వవిచారణల సమృద్ధిచే వారు “ఈ ప్రపంచంలో పొందబడుచున్నవి, గాంచబడుచున్నవి... ఇవన్నీ అనిత్యము అని గ్రహించి 'నేను చిత్తశుద్ధిని పొందేది ఎట్లా?' అను ఏకైక లక్ష్యముతో కర్మిష్టులగుచున్నారు. ఈ ఐహిక, ఆముష్మిక క్రియలన్నిటినీ ఆపదలుగా భావించి అల్లంతదూరంలోనే ఉంచుచున్నారు. అంతే గాని, వారు అజ్ఞాన ప్రవాహమున పడుట లేదు. వాటి పట్ల ఇచ్ఛ-ద్వేషములు గాని, గ్రాహ్య-త్యాజ్య బుద్ధి గాని వారికి ఉండుట లేదు.

విచారణ చేస్తూ ఉండాలి - నాయనలారా! మీరు అసమ్యక్ దర్శనం (perception of inequality) ను తగ్గించుకుంటూ రావాలి సుమా! నెనెవడను? ఈ సంసారాడంబరమంతా ఎట్లా ఉత్పన్నమగుచున్నది?... అను జ్ఞానబోధకమగు విచారణ చేస్తూ ఉండాలి. తెలివిగల వాడెవడైనా అత్యంత యత్నంతో సాధువులను సమీపిస్తూ, వారితో చేయు సంభాషణ సహాయంతో వివేకమును పెంచుకుని, అప్పుడు ఈ జన్మ కర్మాది సాంసారిక విషయాల పట్ల సదవగాహనను ఆశ్రయిస్తాడు. పైన చెప్పినట్లు విచారణ చేస్తూనే ఉంటాడు. అంతేగాని, తన జీవితమును వృథా చేసుకోడు.

మీరు కర్మసూత్రములచే బంధింపబడి చతికిలపడి ఉండకండి. అనర్థములైన వ్యవహారము లనే రోజురోజుకూ పునశ్చరణ చేస్తూ రోజులు వెళ్ళబుచ్చకండి. ఈసంసారంలో ఇక్కడ అక్కడ కొన్ని ప్రియమైన వస్తువులు కనబడుచున్నమాట నిజమే. అయితే అవన్నీ ఒకనాటికి నశించబోవు చున్నాయి కదా? వాటిచే ఎందుకు మోసగించబడాలి?

ఈ భూమిపైకి ఎంత మంది రాలేదు? ఎంతమంది పోలేదు? ఇక్కడ వినూత్నమైన వస్తువు అంటూ ఏమి ఉన్నది? కనుక సర్వ పటోటాపాలు వదలివేయండి. చాతక పక్షి మేఘ జలాల కొరకే ‘అన్వేషణ-నిరీక్షణ’లను పాటిస్తుంది గాని, మురికిగుంటలలోని నీరు కొరకు కాదు. మీరు కూడా ఉత్తమ జ్ఞానమును, అట్టి సంజ్ఞలను ప్రసాదించు సాధువులను ఆశ్రయించండి.

ఈ అంతర్గతమైన అహంకారం గురించి... బహిర్గతములైన 'శరీరములు' మొదలైనవాటి గురించి... ఈ బంధుమిత్ర సమాగమముల గురించి... కొంచెం సత్యదృష్టితో యోచన చేయండి. వీటిని పెంపొందించుటకు ప్రయత్నించుటచే, ఇవి మమ్ములను సంసార సాగరం నుండి తరింప జేయగలవా? అని ప్రశ్నించుకోండి. మరల మరల మీకు మీరే యోచించుకోండి.

గడచినదాని గురించి వగచటం అనవసరం. ఇక తాత్సారం చేయవద్దు. ఇప్పుడిక సంసార తారకమగు ఆత్మవిచారణ చేపట్టండి. విచారణచే సత్యము మీ మీ హృదయము లందే సుప్రకటితం కాగలదు. స్వశరీరములోని సాక్షిని దర్శించండి.

అస్థిరములైన ఈ శరీర-అహంకారముల పరిమితదృష్టిని పరిత్యజించండి. ముత్యాల హారంలో అంతర్లీనంగా ఉన్న తీగవలె ఉన్నట్టి సాక్షిస్వరూపమగు ఆత్మను వీక్షించండి. సర్వవ్యాప్తం,

Page:300

నిత్యము, సర్వమును భావించునది అయినట్టి ఆ పరమవస్తువునందే ఇదంతా ప్రకటితమగు చున్నట్లుగా గ్రహించండి. ఈ సువిశాలమైన భూప్రదేశమునందు, ఆ ఆకాశంలోనూ, సూర్యుని యందూ, భూరంధ్రములలోనూ, నివసించే ఒక చిన్నపురుగులోనూ, ఆ పురుగులోని ఒక అణువులోను... అన్నిటా చిత్స్వరూపమే వెలయుచున్నది.

ఒక ఉపమానం. ఒకచోట అనేక కుండలు ఉన్నాయనుకో... ఆ అన్ని కుండలలోని ఆకాశము ఒక్కటే కదా! వివిధ శరీరములలోని 'చిత్తు'కు భేదమేమీలేదు.

కారం-తీపి-చేదు మొదలైన రుచులు వేరువేరైనప్పటికీ, ఆ రుచిని గ్రహిస్తున్న తత్త్వము ఒక్కటే అయున్నది కదా! అంతేకాని కారము రుచికి ఒక తత్త్వము, తీపిరుచికి మరొకతత్త్వము ఏర్పడి ఉండుటలేదే! అనేక చోట్ల ప్రకాశించుచున్నప్పటికీ చిద్వస్తువు ఒక్కటే. అనేక గ్రామాలలో ప్రసరించు సూర్యరశ్మి ఒకే సూర్యతత్వం. అంతేగాని ఆయా కిరణములు వేరు వేరు వస్తువులపై ప్రసరించుచున్నాయి కాబట్టి అవన్నీ వేరు వేరు... అనటం ఉచితం కాదు కదా!

ఉన్నది సర్వదా ఒక్కటే! ఒకే వస్తువు సర్వదా వెలయుచుండగా "ఈతడు పుట్టినాడు... చచ్చినాడు...” అనునదంతా అసంగతమే అవుతుంది. ఉత్పన్నమైయ్యేది, నశించేది సత్యవస్తువు ఎట్లా అవుతుంది?

ఓ రాఘవా! దేనినైతే “ఇది జగత్తు అని నీవు గాంచుచున్నావో అదంతా కూడా చిత్ యొక్క ప్రతిబింబము మాత్రమే. ఈ జగత్తు సత్తు కాదు. అసత్తు కూడా కాదు. ఇది ఆ రెండింటికీ విలక్షణమైనది.

ఇతడి చిత్తం అశుద్ధమై(దోషపూరితమై), విషయాల పట్ల ప్రేలాపన కలిగి ఉన్నదైనప్పుడు - అట్టి సమయంలో ఈ జగత్తు సత్తుగానే అతనికి తోచుచున్నది.

ఏ మహాత్ముడు మోహనివృత్తుడై ఉంటున్నాడో అతనికి ఇది 'అసత్తే' అని తెలియవస్తోంది. అందుచేతనే 'ఈ దృశ్యం అనిర్వచనీయం. అధ్యాసరూపమునైతే మోహకారణమే అగుచున్నది... అని చెప్పబడుతోంది.

ఈ జగత్తే మిథ్య అయి ఉన్నది. ఇక మోహమేమిటి? ఆ మోహమునకు ఒక కారణం ఉండుట ఏమిటి? మిథ్య అయినదానికి కార్య కారణములు కూడా మిథ్యయే కదా!

కాబట్టి రామా! నీవు 'జన్మ-స్థితి మరణము'ల గురించి దుఃఖించవలసిన అవసరమే లేదు. ఆకాశం వలె సర్వత్రా సముడవై నిర్మలభావమునందు వెలసియుండుము. సత్యమై, నిత్యమై, ఆనందమయమైన నీ స్వస్వరూపమునే అవధరించి ఉండుము. నేను జీవుడను... స్వల్పుడను... పుట్టుచున్నాను... చచ్చుచున్నాను... మొదలైన బలహీనమైన భావములను త్యజించివేయి.

నేను అఖండము, నిర్వికారము అగు ఆత్మ వస్తువునే అయి ఉన్నాను...” అని భావించు చుండగానే ఇప్పుడే ఇక్కడే మోక్షస్వరూపుడవు కాగలవు. అంతేగాని, మోక్షం ఎప్పుడో ఎక్కడో పొందవలసినది అయి ఉండలేదు.

Page:301

ఉత్తమ గుణ సముపార్జన -

శ్రీ వసిష్ఠ మహర్షి: భవిష్యత్తును నిర్ణయించేది వర్తమాన ప్రయత్నములే!

నాయనా! రామా! నీవు లభించిన అవకాశములను వృథాపరచుకోకుండా ఉత్తమ గుణములను సముపార్జిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీచ ప్రవృత్తులను త్యజించుట యందు, ఉత్తమ కర్మలను ఆశ్రయించుటయందు జాగరూకుడవై ఉంటూ ఉండాలి.

బాహ్యాభ్యంతరము లందు సహించుట అను శక్తిని కలిగి ఉండాలి. ధీరుడవు, విచారణ పరుడవు అయి ఉండు. సూక్ష్మమైన బుద్ధిని సంపాదించుకో. సర్వవిఘ్నములకన్నా, సర్వ ప్రతిబంధకముల కన్నా కూడా బలవంతుడవగుచూ ఉండాలి.

సద్గురువులను ఆశ్రయించి, వారితో శాస్త్రవిచారణ చేయి. విషయములకు సంబంధించిన తృష్ణను నీ మనస్సు నుండి ఎప్పటికప్పుడు తొలగించివేస్తూ ఉండు. ఆత్మవేత్తలు కనబడినప్పుడు వారిని ఆశ్రయించు, శరణువేడు. వారు విజ్ఞానదాయకమగు ఉత్తమ విషయాలు బోధిస్తారు.

మనోనాశనము సాధించు. అప్పుడు సమాధి స్వయముగా లభించగలదు. శాస్త్రములచే చెప్పబడుచున్న అర్థములను వివేకముతో అభ్యసించుచు, ఎవడైతే 'సుసంగి అగుచున్నాడో... అట్టి శుద్ధపురుషుడు ఆత్మస్వరూపమును ఎఱుగుటకు అర్హుడగుచున్నాడు.

ఓ రాఘవా! నీవు ధీరుడవు. పవిత్ర ఆచరణము గలవాడవు. ఉత్తమ గుణములు నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాయి. సృష్టి అనబడే మనోమలం నీ నుండి దూరంగా తొలగుతోంది. అట్టి నిర్మల స్వరూపుడవగు నీవు దుఃఖ రహితమగు ఆత్మ యందు వెలయుచుండుటకు అడ్డేమి

ఉంటుంది?

శరత్కాలంలోని మేఘరహిత ఆకాశంలాగా 'జగత్తును తనయందు రహితం చేసుకొను ఆత్మజ్ఞుడు స్వచ్ఛత నిర్మలత-ప్రశాంతత్వము-అఖండత్వము స్వయంగా పొందుచున్నాడు. అట్టి వానికి ఇక సంసార భయమెక్కడ? ఓ ఉత్తమ జ్ఞానీ! (వైరాగ్య ప్రకరణంలో) నీవు ప్రకటించిన విశ్లేషణా చాతుర్యం మమ్ము ముగ్ధులను చేసింది. మనం ఈ పదిరోజులుగా చేస్తున్న సంభాషణ ప్రభావంచేత నీ మనస్సు బాహ్యవస్తుచింతన క్రమక్రమంగా త్యజిస్తున్నట్లు నేను గమనిస్తున్నాను. మహాశక్తివంతమగుచున్న నీ బుద్ధి పరమాత్మతో ఏకీభావం పొందుతోంది. అందుచేత మా ఉద్దేశములో నీవు ముక్తుడవే అయి ఉన్నావు. ఈ విషయంలో సందేహమే లేదు.

ఓ సభికులారా! రాగద్వేషములంటూ ఏ మాత్రం లేని వాడైన ఈ రాముడు తదితరులకు ఆదర్శప్రాయుడే అగుచున్నాడు.

బహిః లోకోచితాచారా విహరిష్యన్తి యే జనాః

భవార్ణవం తరిష్యన్తి ధీమన్తః పోతకాన్వితాః ॥

'జ్ఞానము' అనే నౌకను పొందినట్టి బుద్ధిమంతులు బాహ్యలోకము కొరకు ఉచితంగా

Page:302

వ్యవహరిస్తూ ఉంటూనే ఈ సంసార సాగరమును ఇట్టే దాటివేస్తున్నారు. నేను ప్రతిపాదిస్తున్న అనేక సత్యవాక్యాలు అవిచారణపరులకు ఉదాసీనంగానే కనిపిస్తున్నాయేమో గాని, బుద్ధిమంతులు, సుజనులు, సమదర్శులు, ఉత్తమదృష్టి సంపన్నులు తమ జ్ఞానదృష్టిని మరింత బలోపేతం, పరిపుష్టం చేసుకుంటున్నారు.

ఓ రామా! నీవు సర్వదా జ్ఞానివే అయి ఉండాలి. ఈ శరీరం ఉన్నంతవరకూ విషయముల పట్ల ఏమాత్రం ఆసక్తిలేనివాడవై, ద్వేషములను, వాసనలను వీడి, లౌకికమైన ఆచారములను ఆచరిస్తూ వ్యవహరిస్తూ ఉండు.

ఉత్తమజ్ఞానులు, సాత్వికగుణసంపన్నులు అగు జీవులు ఈ ప్రపంచములోకి వచ్చి పరిశుద్ధత్వం-పరమశాంతిత్వం సముపార్జిస్తున్నారు. లోకకళ్యాణ కారకులగుచున్నారు. ఉత్తమ కర్మల యందు ఆచరణపరులై పరమశాంతిని పొందుచున్నారు.

ఇక, మరికొందరు జీవుల విషయం చూస్తే... వారు ఎద్దులాగా, నక్కలాగా పరవంచకులై ఉంటున్నారు. శిశువుల వలె మూఢులే అయ్యి, వారు మానవజన్మ అను ఉత్తమ అవకాశాన్ని వృథా చేసుకుంటున్నారు. అట్టి వారిని చూస్తున్నప్పుడు లోకకళ్యాణమే ప్రవృత్తిగా కలిగిన మా వంటి మునులకు జాలియే వేస్తోంది. అట్టివారిని గురించి విచారిస్తే మాత్రం ఏం ప్రయోజనం?

కర్మసిద్ధాంతము - "నీవు మనస్సును ఎప్పటికప్పుడు పరిశుద్ధం చేసుకొనుట”... అను మహత్తరమైన ఆశయం కలిగి ఉండు. అట్టి మనోనిర్మలత కొరకు సర్వాత్మకుడగు ఆ పరమేశ్వరుని 'స్వధర్మము' అను పుష్పములతో పూజించుము. అట్టి అవగాహన కలిగియున్నప్పుడు నీవు లోక కళ్యాణ కారకుడవే అవుతావు. ఈ ప్రపంచమును కొంచెము పరిశీలినగా చూస్తూ ఉంటే నీకు ఇందులో సాత్త్వికులైన ఉత్తమ పురుషులు తప్పకుండా తారసపడతారు. వారియందలి ఉత్తమ గుణములను గమనించు. ఆ గుణములను నీవు కూడా అలవరచుకో. అట్లు, ఉత్తమ ఆదర్శాలను స్వీకరించేవాడు, శాంతి, శమము మొదలైన ఉత్తమ లక్ష్యములను కలిగి ఉండేవాడు, శాస్త్రము, స్వధర్మములకు అనుచితంగా నిష్కామబుద్ధితో కర్మలను నిర్వర్తించేవాడు... అట్టి వాడు క్రమంగా 'జ్ఞానోపయోగము' అయినట్టి శుద్ధశరీరమును పొందుచున్నాడు.

ఈ జన్మయందు నీవు అనుసరించు గుణములే ముందు ముందు ఆయా ఉత్తరోతర కర్మ జ్ఞాన స్థితులందు నిన్ను నియమిస్తున్నాయి... అనునదే కర్మ యొక్క సిద్ధాంతము. కాబట్టి, కర్మ బద్ధుడగు జీవుడు ఇతఃపూర్వపు కర్మలచే నియమించబడినవాడై ప్రవర్తించుచున్న మాట నిజమే. కాని వర్తమాన పురుషకారముచే పూర్వజన్మ సంస్కారములు తప్పక జయించివేయబడగలవు. (ఇతఃపూర్వపు కర్మ సంస్కారాలు + వర్తమాన ప్రయత్నాలు) = (ఈ జీవుని వర్తమాన భవిష్యత్తులు)

పురుషుడు అంటే పురుషకారము ప్రదర్శించువారు, ప్రయత్నశీలురు. అంతేగాని, మగవారు' అని అర్థం

చేసుకోరాదు.

Page:303

"అయ్యో! నేను ఈ ఈ తప్పులు చేసియున్నాను కదా? నా గతి ఏమగును? ఇంతే, ఇక నేను బాగుపడను... ఎవ్వరో మహానుభావులే సరికాగలరు.... నేను సరి అయ్యే ప్రసక్తి ఎప్పటి విషయమో గాని, ఇప్పటి విషయం కాదు... ఈ విధంగా స్వల్పమగు భావములకు తావిచ్చి వర్తమాన కర్తృగతిని బలహీనపరచుకోవద్దు.

ఇప్పుడు చేయవలసినట్టి శారీరక మానసిక ప్రయత్నములు నీ చేతిలోనే నీ నిర్ణయమును అనుసరించే ఉంటున్నాయి. మరిక తాత్సారం దేనికి చెప్పు?

కొందరు తమ భూత భవిష్యత్తులపై... అపరిపూర్ణమైన, బలహీనతలతో కూడిన... అభిప్రాయాలను కల్పించుకొని సాలెపురుగు వలె అందులోనే చిక్కుకొని ఉంటున్నారు. తమ నరకములను తామే నిర్మించుకొని పరితపించుచున్నారు. అయిన దాని గురించి వగచటం ఆపు. భూతకాలం అట్లుండనీ. “ఇప్పుడు నేను ఏది చేయాలి?.... ఏది చేయకూడదు... అను విషయమునకు రమ్ము. ఉత్తములగు సాధుపురుషులను, శాస్త్రములను ఆశ్రయించు. వర్తమాన కార్యక్రమమును పూర్ణమైన సదవగాహనతో నిర్ణయించుకో. ఆలోచన-శ్రద్ధ అవగాహనలను ఉత్తేజపరుచుకో. ప్రశాంతముగా, గంభీరంగా, సాలోచనగా 'ఆత్మప్రాప్తి కొరకు ప్రయత్నములను

చేయుచుండుము.

శత్రురాజులు తమ బలపరాక్రమములతో బాధించుచున్నప్పుడు, అప్పుడు వారు పౌరుష బలముచేతనే జయించబడుచున్నారు కదా! ఈ బుద్ధి అనే రాజ్యం 'తామస రాజస' గుణములు... అనే శత్రురాజులచే వేధింపబడుచున్నది. అట్టి ఈ 'బుద్ధి సామ్రాజ్యము' ను రక్షించుకోవాలి. లేదా, రాక్షస-పిశాచాది యోనులలో ఈ బుద్ధి ప్రవేశించే ప్రమాదం ముంచుకురాగలదు. బురదలో ఇరుకుకున్న దున్నపోతును బయటకు తెచ్చునట్లు ఈ బుద్ధిని ఉద్ధరించే ప్రయత్నాలు సర్వదా చేస్తూ ఉండాలి.

చిత్తము, పురుషకారము - సాధుపుంగవులు సాధుపుంగవులు తమ తమ 'వివేకము' యొక్క ఫలితంగానే సాత్వికగుణ సంపన్నులగుచున్నారు. స్వచ్ఛమైన మణిని ఏ ద్రావణంలో ముంచితే ఆ రంగునే కలిగి ఉంటుంది కదా! ఈ 'చిత్తము' అనే మణి కూడా అంతే. దీనిని ఎందులో నియమిస్తామో అది అద్దానియందే తన్మయమై ఉంటూ ఉంటుంది.

చిత్తమునుండే 'పురుషకారము' కూడా ఉత్పన్నమగుచున్నది. ముముక్షువులంతా తమ యొక్క పౌరుషబలముచేతనే అమూల్యమైన గుణములను ఆర్జిస్తున్నారు. అంతేగాని ఎవ్వరి గుణములను మరెవరూ ప్రసాదించుట ఇక్కడ ఉండదు. అట్టి పౌరుషబలము చేతనే వారు శుభజన్మలను పొందుచున్నారు. 'గుణి' అయినవాడు తన పురుషకారముచే పొందలేనిది... ఈ స్వర్గ, మర్త్య పాతాళములలో ఎక్కడా ఏదీ లేదు. బ్రహ్మచర్యము, వీర్యము, వైరాగ్యము, ఇవి

Page:304

ఉన్నప్పుడే ఒకడు ఉత్తమ వస్తువును సాధిస్తాడు. ఈ ఆధ్యాత్మక్షేత్రంలో కూడా అది అట్లే అగుచున్నది. “అఖండ, అద్వితీయ, స్వస్వరూపాత్మ సంస్థానము”... విషయం కూడా అట్టిదే.

గుణి (గుణములు కలిగియున్నవాడు) - ఓ రఘురామా! ఇప్పుడు నీకు ఉపదేశించిన, ఉపదేశించబోవుచున్న ఆత్మతత్త్వము అత్యంత దుఃఖనివృత్తికరము సుమా! ఇది జీవునికి నిరతిశయ మైన శాంతిని ప్రసాదించగలదు. సకల జనులకు హితం చేకూరుస్తుంది. అందుకని ఇది శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ బద్ధకములచే తిరస్కరించకూడదు. సకల జనులలో విశుద్ధములగు సత్వ గుణములు వృద్ధికావాలనునదే మా ఆశయం.

"బుద్ధి బలముచే ఆత్మభావనయందు ఈ జీవుడు సుస్థిరుడు అగుట" అనునదే ఈ ప్రయత్నము ఉద్దేశించుచున్న అంతిమ ప్రయోజనం. ఆత్మభావన సుస్థిరమగుచుండగా ఇక మనస్సు తన చంచలత్వమును వదలి శాంతిని పొందగలదు. అట్టి ఆత్మావలోకనము ఎవ్వరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధ్యమే.

కాబట్టి ఓ సభికులారా! మీరంతా ప్రయత్నశీలురై ఉండవలసినదిగా మీ శ్రేయోభిలాషుల మగు మేము మరల మరల హెచ్చరించుచున్నాము. మీలో ప్రతి ఒక్కరికీ 'ముక్తస్వరూపులు' కాగల అవకాశము, అధికారము తప్పక ఉన్నది.

ఓ రామచంద్రా! నీవు మహామహిమాన్వితుడవు. శాంత్యాది మహత్తర గుణాలు నీ యందు ప్రస్ఫుటమౌతున్నాయి. పరమసాత్వికుడవుగా నిన్ను మేము గుర్తిస్తున్నాము. తదుచితంగానే ప్రవాహపతితములగు కార్యములను నిర్వర్తించెదవు గాక. నిన్ను నిమిత్తం చేసుకొని ప్రతి మానవునకు నేను ఈ విషయం గుర్తు చేస్తున్నాను.

నాయనలారా! 'సంసారాసక్తి' అనే మోహమునకు మీ హృదయంలో చోటివ్వకండి. స్వతహా గానే మోక్షస్వరూపులగు మీరు మీ మీ ముక్తస్వరూపమును ఏమఱువకండి. స్వస్వరూపము గురించి ఎఱుకయే జన్మ ఎత్తినందుకు ఉత్తమ ప్రయోజనమైయున్నది.

సభలోని వాతావరణం అలౌకిక ప్రశాంత గంభీరతలతో నిండిపోయింది. సభికులంతా వసిష్ఠమహర్షి చెప్పు ఒక్కొక్క వాక్యములోని ఔన్నత్యమును గమనించుచు ఆహాఁ! ఈ ఋషులు మాపై ఎంతటి అవ్యాజమైన ప్రేమ కలిగియున్నారు! అను భావన పొందారు. రామచంద్రునితో సహా అనేకమంది వదనములలో వికాసము ప్రస్పుటమైనది. ఆ సభలోని రాజులు, పండితులు, తదితరులు దీర్ఘాలోచనామగ్నులై కనబడ్డారు.

సభలోని అనేకుల 'మనస్సు' అనే చపల వానరం భోగపదార్థములకు సంబంధించిన మననమును త్యజించి, మౌనభావంతో ఆత్మవస్తువు వైపు సాలోచన కొనసాగించసాగింది. దశరథుడు మొదలైన రాజులు ప్రశాంతచిత్తులై ఉన్నారు.

Page:305

ఆధ్యాత్మిక శిక్షణాబలంచే లక్ష్మణుడు మొదలైన వారి హృదయాలు 'బ్రహ్మస్వరూపం' అనే లక్ష్యమును సుస్థిరీకరించుకున్నాయి.

మునుల హృదయాలు వికసించి, 'ముఖములు' అనే పద్మములు 'ప్రశాంతత' అను సువాసన వెదజల్లాయి.

సూర్యభగవానుడు అస్తమాద్రిని సమీపిస్తున్నాడు. సభ ముగిసింది. సభికులు క్రమంగా తమ సాయం సంధ్యాది కార్యక్రమాల కొరకు గృహోన్ముఖులయ్యారు.

(పదవ రోజు విచారణ పూర్తి అయింది)

స్థితి ప్రకరణం సమాప్తం బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు

ఓం తత్సత్

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము V.ఉపశమన ప్రకరణం

ఉపశమన ప్రకరణము

I. ప్రకరణ పరిచయం

1. పదవ రోజు రాత్రి.. పునశ్చరణ

పదవ రోజు రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నది. అయోధ్యానగరమంతా సౌమ్యము, సుందరము, రమణీయము అగు ప్రకృతిచే అలంకారయుక్తమై ఉన్నది. ఒక్క రామచంద్రుడు తప్ప తక్కినవారంతా ఆ రాత్రి క్షణంలాగా నిదురలో గడిపివేశారు. రాముడు మాత్రం ఆ రాత్రంతా వసిష్ఠమునీంద్రులచే ఉపదేశించబడిన వాక్యములను చింతన చేయసాగాడు.

శ్రీరాముడు (తనలో) : ఆహా! ఏమి ఈ సంసార సంభ్రమణం! ఈ మనుజులంతా ఎవ్వరు? ఈ విచిత్ర ప్రాణిసమూహమంతా వస్తున్నది ఎక్కడినుండి? వీరంతా ఎటు పోతున్నారు? అసలీ మనస్సు యొక్క స్వరూపమేమిటి? ఇది శమించేది ఎట్లా? ఈ చమత్కారమైన మాయావ్యవహారమంతా ఎవరు, ఎవరి కొరకు, ఎక్కడ, ఎందుకు, కల్పిస్తున్నారు? ఈ మాయకు ఇంతటి నైపుణ్యము ఎక్కడి నుండి వస్తోంది? ఇది అసలు నివారించబడగలదా? జీవునికి ఈ గుణదోషములన్నీ ఎక్కడి నుండి వచ్చిపడుతున్నాయి?

.. ఆకాశం కంటే కూడా అతిసూక్ష్మము, అతి విశాలము... అయినట్టి ఆత్మ ఈ విధంగా, జీవుడుగా ఎందుకు పరిణమిస్తోంది...?

ఈ సంకుచితత్వము ఎంతగా ఘనీభవించి ఉన్నది! ఈ పది రోజులుగా వసిష్ఠ మునీంద్రులు ఆత్మ గురించి, మనోనాశనం గురించి, ఇంద్రియజయం గురించి అనేక విశేషాలు వివిధ కోణముల నుండి చెప్పియున్నారు. అయినాకూడా వెలుగునీడలవలె జ్ఞాన, అజ్ఞానములు ఏర్పడుచూనే ఉన్నాయే? నా వివేకము ఇంకనూ పూర్ణముగా వికసించదేమి?

అవును. ఆత్మయే స్వయముగా ఈ “జీవుడు - చిత్తము మనస్సు మొదలైన రూపములలో ఈ అసన్మయమైనట్టి సంసారమును విస్తరింపజేస్తోంది. ఈ అహంకారము మొదలైనవన్నీ మనస్సు’ అనే త్రాడుచే చుట్టబడి ఉంటున్నాయి. అట్టి మనస్సు సంక్షయించిందా.... అప్పుడు 'నేను జీవుడను’ అను స్వల్పాభిప్రాయం కూడా తొలగిపోతుంది. దుఃఖోపశమనం సిద్ధిస్తుంది. మరి అహంకారమును, మనస్సును, “నాది- మాది - నేను - మేము" అను మోహమును రూపుమాపాలంటే ఉపాయాలేమిటి? హంస నీటిని విడచి, పాలను పీల్చునట్లు, విషయ భోగములతో కూడిన అల్పధ్యాసల నుండి ఆత్మను వేరుచేయటం ఎట్లా?

309

Page:310

భోగములన్నీ త్యంజించివేద్దామా? నాకీ రాజ్యము వద్దు, పదార్థములతోటి తదితర సర్వజనులతోటి అసలు ఎట్టి సంబంధమూ వద్దు" అను నిర్ణయమునకు వద్దామా? మంచిదే.... కానీ, వాటిని నేను వదలినా, అవి నన్ను వదులుతాయా? వాటిని దూరంగా త్యజించితే ఈ శరీర ధారణం సాధ్యమేనా? కాదేమో? త్యజించకపోతే విపత్తులు వచ్చిపడుతూనే ఉంటాయే? అరెరే! భలే సంకటం వచ్చిందే!

ఆత్మ అనునది సర్వదా సిద్ధించియే ఉన్నది. స్వతహాగా అన్నివేళల సిద్ధించి ఉన్న దానిని పొందటమేమిటి? కోల్పోవటమేమిటి? ఇక ఆత్మకు ఏ అఖండత్వము, అప్రమేయత్వము, నిత్యత్వము మొదలైనవన్నీ వర్ణించబడ్డాయో అవి ఆత్మయే స్వరూపముగాగల నాకుకూడా వర్తిస్తాయి కదా! ఆత్మ తత్త్వప్రాప్తి’ అనునది మనోమాత్ర విషయమే అవుతుంది.... అంతే గాని అది ఈ ఇంద్రియములకు విషయమే అయి ఉండలేదు.

పైగా, బాహ్యవిషయములు తెలుసుకోవటానికి కూడా ఈ మనస్సే పరికరమగుచున్నది. ఈ ఇంద్రియములను వెలిగిస్తున్నది, ఉపయోగించుచున్నదికూడా మనస్సే. అట్టి మనస్సును కూడా నియమిస్తున్నది, అధిరోహిస్తున్నది ఎవరు? నిర్విషయుడనగు నేనే కదా!

ఆహా! బాలుడు తనయొక్క అజ్ఞాన కారణంగా చీకటిలో దయ్యమును చూస్తూ ఉంటాడే.... అట్లాగే మనస్సుకు కూడా గుదిబండలాగా ఈ దృశ్యముతో బంధము ఏర్పడుతోంది. మరి మనస్సును సన్మార్గంలో ఎట్లా నడిపించాలి? ఇక నాకు ఒక్కటే ఉపాయం కనబడుతోంది. తన ప్రియుడు లభించిన తరువాత స్త్రీ మరిక అన్యుని స్మరిస్తుందా? లేదు కదా...! నా ఈ బుద్ధి కూడా సంసార భ్రమలను ఆశ్రయించ కుండా పరమశాంతి పూర్వకమగు ఆత్మత్వమునే అవధరించు గాక! ఆపై ఇక అన్యపదార్థముల గురించి చింత ఏముంటుంది? నా మనస్సు క్రోధరహితమై, కామవర్జితమై, పవిత్రవంతమై పాపరహితమై ఉండు గాక! అప్పుడది స్వయముగానే ఆత్మ పదమునందు విశ్రాంతి పొందగలుగుతుంది. ఆహా! సద్గురువులగు వసిష్ఠులవారు బోధించియున్న ఏడవ భూమికయందు ఎప్పటికి సంస్థితుడనై సుస్థిరుడనై ఉంటానో! ఎప్పటికి 'జీవన్ముక్తి' సుఖమునందు దృఢపూర్వకంగా విశ్రాంతి పొంది, ఈ జగత్తునందు యథావిధిగా విహరిస్తూ ఉంటానో కదా!

ఈ నామనస్సు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కల్పనలను రచించుకుని అందులోనే మునిగి తేలుతోంది కాని, వాటిని త్యజించదేం? అది ఎప్పటికి తన వికల్పత్వము త్యజించుటచే నీటిలో ప్రవేశించిన ఉప్పుచే తయారు చేయబడ్డ బొమ్మ లాగా ఆత్మయందు లయించిపోతుందో కదా! అది తన తుచ్ఛరూపమును త్యజిస్తేగాని ఉద్వేగము, దుఃఖము నశించవు.

సంసారము’ అనే సముద్రము 'తృష్ణ' అనే తరంగాలతో వ్యాపించి ఉన్నది. ఆశ అనే మొసళ్ళు ఇందులో యథేచ్ఛగా సంచారం చేస్తున్నాయి. ఈ సంసారసముద్రం దాటేది ఎప్పుడు? దుఃఖము, దిగుళ్ళు మొదలైనవి లేకుండేవి ఎన్నటికి?

Page:311

ఈ ప్రపంచములో ప్రవేశించిన కొందరు శమదమాది ఉత్తమగుణములను ఆశ్రయించి తత్ఫలితంగా పరిశుద్ధులగుచున్నారు. ఉత్తమమగు ఆత్మపదమును పొందుటకు అర్హులగుచున్నారు. నేను కూడా అట్టి అర్హత పొందాలి? శోకరహితుణ్ణి కావాలి? అది ఎట్లా, ఎన్నటికి ఒనగూడుతుందో?

ఓ చిత్తమిత్రమా...! ఓ సంసారజ్వరమా! ఏమిటి నీవు చేస్తున్నది? ఈ స్త్రీ, పుత్రశరీరాది సంభ్రమములన్నీ కలుగజేస్తున్నావా? ఫలితమేమిటి? మేము సత్యవస్తువగు ఆత్మను పొందకయే పోవుచున్నాము కదా? కట్టుకొయ్యకు త్రాడుచే దున్నపోతు కట్టివేయబడినట్లు మేము నీయొక్క దుష్ట, అల్ప, అధమ దృష్టులచే బంధింపబడుచున్నామే? ఓ ప్రియచిత్తమా! అయినా, నిన్నని ఏం లాభం? ఇదంతా మా స్వయం కల్పితం మాత్రమే. ఏది ఏమై ఉన్నప్పటికీ మాయందు అజ్ఞానం మాత్రం తొలగుటలేదు. అందుకే నీవు దుష్టవై దశదిశలవైపు విజృంభిస్తున్నావు. ఇక చాలు. నీవు దూరదృష్టి, నిర్మలదృష్టి ఆశ్రయించదలుచుకోకపోతే నిన్ను నేను ఉపేక్షించను. నీవు నా సేవకుడివేగాని, యజమానివి కాదు సుమా! అందుచేత ఇక ఉపశమించు.

మనం ఉచితమైన విషయములను ఉచితమైన రీతిగా స్వస్వరూపజ్ఞాన లక్ష్యముతో విచారించాలి. ఎంతకాలం మమ్ములను అల్పప్రలోభములతో బాధిస్తావు చెప్పు? అయినా నీ రూపమేమిటి? ఎక్కడ ఉంటావు? నీవు ఏ పదార్థంతో తయారుచేయబడ్డావు?

మా అజ్ఞానమే నీయొక్క స్వరూపం. అంతకు మించి నీకు రూపురేఖలే లేవు. అయితే సర్వులలో ఏకస్థమైయున్న ఆత్మతత్త్వమొక్కటే నీకు విషయము, లక్ష్యము, మననము, దిక్కు అగుగాక!

ఓ బుద్ధీ! మనం తెచ్చిపెట్టుకున్న ఈ 'చిత్తము' అను జాడ్యమును చూచావా? ఇది మనిద్దరినీ కూడా రాగద్వేషముల వైపుగా త్రోసి వేయుచున్నదే! ఈ చిత్తము ఎప్పుడైతే గాలివీచికలు లేని స్థలంలో దీపం లాగా ప్రశాంతమై, ప్రకాశవంతమై, బాధారహితమై ఉంటుందో, అప్పుడు నీకు, నాకు కూడా ఇంతటి నీచత్వము, మూర్ఖత్వము, జాడ్యత్వము ఉండవుకదా!

మిత్రమా! బుద్ధీ! జీవుడు అను రూపము పొందియున్న నేను నీకు ఒక విన్నపం చేస్తున్నాను. నా మాట కాదనకపోతే నేను, నీవు కూడా మోక్షస్వరూపులం కాగలం. మనం ఈ పది రోజులుగా పసిష్ఠ మునీంద్రుని వచనాలు విన్నాం. మరి కొద్ది రోజులు వినబోతున్నాం. ఆ వాక్యముల సారాన్ని, అందు ప్రకటితమగుచున్న నాయొక్క, నీయొక్క వాస్తవమగు స్వరూప స్వభావములను గ్రహిద్దాం. ఓ మతీ! నీకు సాష్టాంగ దండప్రణామం చేసి మరీ వేడుకొంటున్నాను...... నా మాట విను. ఈ సంసారమును త్యజించివేయుటలో నాకు సహకరించు, అప్పుడు నీవు భవ్యమగు పూర్ణపదప్రాప్తిని

పొందగలవు.

ఓ ఇంద్రియములారా! విషయముల పట్ల గల అభిలాషచే మీరు పొందుచున్నదేమిటి? అతి త్వరగా శిథిలమే అగుచున్నారు. మీరు సహకరించాలే గాని, మనం ఆత్మపదమును ఎందుకు పొందలేము? అందుచేత మనం ఈ సంసారమును అనాదరిద్దాం. ఈ వస్తు సముదాయము నుండి ప్రాప్తించే ఇంద్రియసుఖము తుచ్ఛము, తృణప్రాయము, దుఃఖ పరిణామయుతము అయి

Page:312

ఉంటోంది. "నేను ఆత్మత్వము పొందేదెట్లా? అను మార్గములో పయనిస్తున్న నాకు ఉచితరీతిగా మీరు సహకారం అందించెదరుగాక! ఇప్పుడు నియమనిష్ఠాదులచే కొంచెం బాధింపబడుచున్నప్పటికీ, మీకు స్పర్థ’ తొలగి నిరవధికమగు సుఖమునే పొందగలరు సుమా!

ఓ మనస్సా! ఎన్నో ఉపాధులలో ప్రవేశించటం, నిష్క్రమించటం ఇప్పటికే మనం ఎంతగా నిర్వర్తించామో ఎవరు చెప్పగలరు? ఇప్పటికి ఈ వసిష్ఠ మునీంద్రుల ఆప్తవాక్యములు వినే భాగ్యం పొందాము. ఎంతోకాలంగా “ఈ శరీర -ధన -బంధు వియోగములచే ఏర్పడుచున్న దుఃఖాలు తొలగేది ఎట్లా?" అని మనం యోచిస్తూ ఉండేవారము కదా! ఇప్పుడు నిర్మల జ్ఞాన దృష్టితో ఈ బోధ విందాం. తద్వారా నీవు సంకుచితత్వం వదలి సువిశాలత్వం పొందగలవు.

మనస్సుతో ఏది పొందుతామో అదే పొందబడినదగుచున్నది. అయితే, మనస్సుచే ఒక విషయం అనేకసార్లు ఆలోచింపబడినప్పటికీ, అద్దానిని నిశ్చయ స్వరూపమగు బుద్ధి కూడా గ్రహించాలి. బుద్ధి గ్రహించకపోతే ఆ ప్రయత్నం నిష్ఫలం అవగలదు సుమా! నా మనస్సు శాశ్వతాత్మనే అన్నిటా అంతటా మననం చేస్తూ ఉండునుగాక! నా ఈ చిత్తము ఆత్మజ్ఞాన విషయముల కొరకై ఉరకలు వేస్తూ ఉండునుగాక!

అందుచేత ఈ నా బుద్ధి అర్థమును గ్రహించుటలో సర్వదా సమాయత్తమై అతితీక్షణము,

సునిశితము అయివుండు గాక!

శ్రీ వసిష్ఠ మహర్షి ఇప్పటి వరకు వైరాగ్యము, దైవము, ముముక్షుత్వము మొదలైన అనేక విషయాలు చెప్పారు. వైరాగ్య ప్రకరణం, ముముక్ష వ్యవహార ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం పూర్తి అయ్యాయి. అనేక దృష్టాంతాలతో ఈ జీవుని వాస్తవ స్వభావము, ఆరోపితమైన ప్రమేయత్వముల గురించి విశదపర్చారు. ఉత్పత్తి, స్థితి ప్రకరణాల అవగాహన అర్హుడగు జీవునికి వివేక దృష్టిని, పరమోత్తమమగు అవగాహనను ప్రసాదించగలవు.

శ్రవణం అవసరమే. శ్రవణమే లేకపోతే ఉత్తమ విచారణము యొక్క సమాచారం లభించదు. అయితే శ్రవణమొక్కటే సరిపోతుందా? ...లేదు.

ఆత్మతత్త్వము గురించిన మననం అత్యంతావశ్యకం. మననముచే నిశ్చయాత్మకమైన బుద్ధి, బుద్ధికి కూడా ఆవలనున్న స్వస్వరూపానుభవం ఈ రెండు ఒనగూడగలవు. అందుచేత నా మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు ఆత్మతోటి అద్వితీయమైన అనుభవంతో పరితప్తమగు గాక!

పరిభూషిత మగుగాక!

Page:313

పదకొండవ రోజు

2. ఎఱుగబడటమే ప్రాప్తించటం

ఆ విధమైన ఆలోచనలతో రామచంద్రుడు ఆ రాత్రంతా గడిపాడు. ఇంతలో భళ్ళున తెల్లవారింది. శ్రీరాముడు సోదర సమేతంగా వసిష్టాశ్రమములో ప్రవేశించాడు. మహర్షికి సోదరులు సాష్టాంగ నమస్కారములతో ప్రియవచనములతో సంతోషం కలిగించారు. ఆయనను రథమునందు కూర్చుండబెట్టి, సేవించుచూ సభకు కొనివచ్చారు. దశరథ మహారాజు సింహాసనం దిగి ఎదురేగి మహర్షికి సుస్వాగతం పలికాడు. ఇతర రాజులు, సామంతరాజులు, ఋషులు, మునులు, ప్రజలు మొదలైన వారంతా సభలో తమ తమ స్థానములు అలంకరించారు. ఆహాఁ! ఆ సభలోని వారందరూ పూర్వ పుణ్యవశాత్తు వసిష్ఠుని ముఖమండలమునుండి వెలువడే ఆప్త వాక్యాలు వినుట అను ఉత్కృష్టమగు అవకాశమును పొందివున్నారు. మొదటగా దశరథ మహారాజు ఇట్లు పలికాడు. దశరథ మహారాజు: సభలోని వారందరికి సుస్వాగతం. మనందరికి అనేక జన్మల సుకృతఫలంగా ఋషులు ఈ సభకు వేంచేయడం, మహత్తరమగు ఆత్మ గురించి ప్రవచనముచే మమ్ములను, మా ప్రజలందరినీ, మనందరినీ పునీతులను చేయడం జరుగుతోంది. శ్రీ వసిష్ఠ మహర్షి - రామచంద్రుల మధ్య జరుగుతున్న సంవాదము పది రోజులుగా వింటున్నాం. ఈ రోజు పదకొండవ రోజు "ఉపశమనం" అను విషయం గురించి విచారణ ప్రారంభమగుచున్నది.

హే వసిష్ఠ మహర్షీ! మా పాదాభివందనం స్వీకరించండి. నిన్నటి రోజు సుదీర్ఘంగా సంభాషించుట చేత ఏర్పడిన శ్రమ నివారణమయినదని భావిస్తున్నాను. ఆనందదాయకమగు మీ వచనములు’ అను అమృతవృష్టిచే మేమందరము పరితృప్తులమగుచున్నాము. మా అంతఃకరణములు శీతలమొనర్చ బడుచున్నాయి. అవివేక పూర్వకమైన, అజ్ఞానపూర్వకమైన, అవిచారణాపూర్వకమైన అనేక అల్ప దృష్టులు మీ ప్రవచన స్రవంతి ప్రసాదిస్తున్న 'ఆత్మదృష్టి'చే మ్రింగివేయబడుచున్నాయి.

మేము అపూర్వమగు ఆనందం పొందుచున్నాము. సర్వోత్తమమగు బ్రహ్మపదమే ఆశయముగా గలిగినట్టి మీ వాక్యాలు మాలోని రాగము, మోహము మొదలైన వికారములకు అమోఘమైన ఔషధంగా పరిణమిస్తున్నాయి. సజ్జన సాంగత్యమే ఆత్మావలోకమునకు సుఖమైన బాట అను వాక్యమును నిరూపిస్తున్నాయి.

మా స్వరూపము గురించి ప్రవచిస్తూ, మాకు మా యొక్క అఖండ, అప్రమేయత్వములను సుస్పష్టపరచుచున్నందుకు మీకు మరల మరల నమస్కరిస్తున్నాం.

చంద్రకిరణములు అంధకారమును తొలగించునట్లుగా, మీ బోధ మా శారీరక మానసిక దోషములను దూరీకరిస్తున్నాయి. మీ మాటలు వింటున్నంత మాత్రంచేతనే 'తృష్ణ - లోభము'

Page:314

మొదలైన తీవ్ర జాడ్యాలు సన్నగిల్లుచున్నాయి. పుట్టుగుడ్డి సిద్ధాంజనము (మంత్ర సిద్ధమైన కాటుక)ను కళ్ళకు పెట్టుకుంటే చీకట్లో కూడా వస్తువులను చూడగలుగుతారు కదా! అట్లే మీ వాక్యములు వింటూ ఉండగా స్వస్వరూపమగు శుద్ధాత్మను మేము ఇప్పుడు చూడగలుగుచున్నాము. మీరు అనేక యుక్తులచే, దృష్టాంతములచే మా హృదయములందలి సంసారవాసనలు క్షీణింపజేస్తున్నారు. ఉదారమైన చిత్తము గల మీవంటి మహాత్ముల వచనములవలె ఆనందం కలుగజేసేవి ఈ సృష్టిలో ఇంకేం ఉన్నాయి? ఏమీ లేవు.

కుమారా! రామచంద్రా! బ్రహ్మవేత్తలతో సంభాషించని దినములన్ని అంధకారయుక్తములేనని గ్రహిస్తున్నావు కదా! ఇప్పుడు ఈ మునీంద్రులు మనందరిపట్ల అతి ప్రసన్నంగా వున్నారు. ప్రస్తుత విషయం గురించి నీవు ఉచితమైన రీతిగా ప్రశ్నిస్తూ ఉండు. ఏమాత్రం సంశయించకు. నిన్ను నిమిత్తంగా చేసుకొని ఈ మహర్షి అనేక ఆధ్యాత్మ విశేషాలు ప్రపంచానికి ప్రతిపాదిస్తున్నారు. వారు చెప్పేదంతా నీకు, మాకు ఈ సభికులందరికి భవిష్యత్తులో అనేకమంది ముముక్షువులకు శుభప్రదం కాగలదు.

హే మహర్షీ! మీ తదుపరి వాక్యామృతం గ్రోలటానికి మేమంతా వేచి ఉన్నాం. మీ కరుణ రూపమగు ఆత్మతత్త్వజ్ఞానం కొనసాగించి లోకములను పావనం చేయ ప్రార్థన. శ్రీరాముడు: స్వామీ! మహర్షీ! ఎంతో ఉదారబుద్ధితో మీరు చెప్పుచున్న వచనామృతం నేను స్వీకరించగలగడం, గ్రహించగలగడం - మీ ప్రవచనాశక్తి విశేషం చేతనే. ఇదంతా మీరు మాపై ప్రసరించు కరుణామృతం. తమ ఆదేశమును అనుసరించి, మీరు చెప్పినది ఈ సంవాద సమయంలో విన్న తరువాత మరల ఆ విషయములను రాత్రి నిద్రించే ముందు పునశ్చరణ చేసుకుంటున్నాను. ముఖ్య విషయాలు నెమఱవేస్తున్నాను. అట్లు చింతన చేస్తున్నంతమాత్రంచేత నా హృదయంలో ఎప్పటినుంచో తిష్ట వేసియున్న నిద్ర, మౌఢ్యము, జడత్వము సన్నగిల్లుచున్నాయి. హృదయమును ఎంతగానో విస్తరింపజేస్తున్నాయి. మీరు చెప్పు బోధ మనోహరంగాను, పరమ పురుషార్థసాధకంగాను, బ్రహ్మానందప్రదంగాను, పరమ పవిత్రంగాను ఉన్నది. పది రోజులుగా మీరు చెప్పుచున్నదానిని ముందు వెనుకలు విచారణపూర్వకంగా గత రాత్రంతా పునఃపఠనం చేశాను.

మీ ఉత్తమోత్తమ ప్రవచనము సనక సనందనాదులకు కూడా శిరోధార్యమే. కరువు కాటకాల చేత మోడువారిన ప్రదేశంలో కారుమబ్బులు, చల్లటి గాలులు, కుండపోత వర్షం ఎంతటి ఆహ్లాద జనకంగా ఉంటాయో, మీ వాక్యాలు అంతటి ఆనందప్రదంగా ఉన్నాయి. వాటిని మననం చేసుకున్నప్పుడు బుద్ధి సౌభాగ్యప్రదమౌతోంది. స్వల్పజ్ఞులము, పుణ్య పాప భావములచే దొర్లింప బడుచున్నవారము, స్వయంకృత, అల్ప భావములకు బద్ధులము అగు మమ్ములను, వికాసవంతము, స్వచ్ఛము అగు మీ ప్రవచనాలు పరమశోభాయుక్తంగా ప్రభావితం చేస్తున్నాయి, తీర్చి దిద్దుచున్నాయి. ఆ సర్వాత్మస్వరూపుడగు పరమేశ్వరుడే మీ రూపంగా మాపై కరుణాప్రవాహం వర్షింపజేస్తున్నాడు. మమ్ము పరిశుద్దులుగా తీర్చిదిద్దడానికి మాపై కరుణతో మీరు, తమ ఉపదేశములను కొనసాగించ వలసిందిగా ప్రార్థన.

Page:315

శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రియ రామచంద్రా! ఇప్పుడు మనం ఉపశమన ప్రకరణములో ప్రవేశిస్తున్నాం. "ఇది హితకరము, ఉత్తమ సిద్ధాంతయుక్తము - అని విజ్ఞుల అభిప్రాయం. సావధానచిత్తుడవై

వినుఒక మండపము కొన్ని స్తంభములచే అవధరింపబడుచున్నట్లుగా ఈ సుదీర్ఘ సంసారము రాజస-తామస జీవులచే నిత్యము అవధరించబడుతోంది. ఇక సత్వగుణమునందు స్థితి కలిగియున్న ధీరులు ఈ సంసారమాయను నీలాగానే నిరాదరించివేస్తున్నారు. పాము కుబుసమును విడుచునట్లు వారు “నేను జీవుడను" అను భావమునే విడిచివేస్తున్నారు. సత్వ జాతిలోని బుద్ధిమంతులు, రాజససాత్వికులు కూడా "ఈ జగత్తుకు మూల కారణమేమిటి? అను ప్రశ్నను మథించి, విచారించడం జరిగినప్పుడు తప్పక బ్రహ్మమును ఎఱుగుచున్నారు.

శ్రీరాముడు : సారవస్తువగు బ్రహ్మమును ఎట్టివారు ఎఱుగుచున్నారు? ఎట్టివారు ఎఱుగలేక పోవుచున్నారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవరి బుద్ధి అయితే శాస్త్ర, సజ్జన సాంగత్యములచే, యజ్ఞ, దాన, తపాల వంటి సత్కార్యముల అభ్యాసములచే సర్వవిధములైన పాపభావములను త్యజించివేస్తుందో, ప్రజ్వలించు దీపము వలె ప్రకాశవంతంగాను, నిర్దోషంగాను ఉంటుందో, అట్టి వారికి మేము చెప్పు బ్రహ్మము’ అనబడునది తప్పక అనుభవమగుచున్నది. ఓ రామా! ఆత్మయే నిత్యము, స్థిరము, సత్యము, సర్వశేష్యము (సర్వదా మిగిలి ఉండేది కదా! ఇక దిగుళ్ళు అనుమానములు ఎందుకు? అది మనందరి నిజ స్వరూపమే! అయితే, ... ఆత్మచే ఆత్మ గురించి విచారించి ఎఱుగనంత వరకు అది ఎవరికీ ప్రాప్తించుటలేదు.

అది అనుభవపూర్వకంగా ఎఱుగబడుటయే, ప్రాప్తించుట సుమా! నాయనా! నీవు ప్రాజ్ఞులలో ప్రమాణశీలుడవు. ధీరుడవు ఉత్తమ సాత్విక రాజసిక భావములు కలవాడవు. నీవు మేము చెప్పునది తప్పక గ్రహించగలవు. మరొక విషయం. ఈ జీవులలో అనేకులు నివురుగప్పిన నిప్పువలె నిర్మల స్వభావులై, బ్రహ్మమును ఎఱుగగలుగుటకు అర్హులై, తగినవారై ఉన్నారు. అయితే వారిలో కొందరు అనేక అల్పజ్ఞాన వాక్యములు విని, అంతటితో వేదోపనిషత్ సారవస్తువగు ఆత్మ శాస్త్రము విషయమై కొన్ని దురభిప్రాయములు కలిగి ఉంటున్నారు. అట్టివారిని ఉద్దేశించి మేము నాయనలారా! మీరు స్వయముగా పరిశీలించి ఆత్మశాస్త్రముచే జీవులు - సంఘములు పొందు ప్రయోజనమేమిటో గ్రహించండి. కొన్ని అభిప్రాయాలకు కట్టుబడి పరిశీలనారాహిత్యం వహించి ఉండటంచేత జన్మ కర్మలు వృథా అగుచున్నాయి. అపవిత్రంగానే ఉండిపోతున్నాయి అని హెచ్చరిస్తున్నాం.

ఓ సర్వజనులారా! మీరంతా ఈ 'సంసారసంరంభము'ను అంతటినీ వివేచనా బుద్ధితో పరిశీలించి చూడండి. ‘ఇది నిత్యం, సత్యం. ఇది అనిత్యం, కనుక అసత్యం' అని విభాగం చేయండి. సత్యము నందే పరాయణులు కండి. అన్ని తరగతులలోని జనుల యోగ క్షేమములు దృష్టిలో పెట్టుకొని మేము ఈ అధ్యాత్మశాస్త్రమును ప్రతిపాదించుచున్నాము. లోక కళ్యాణమే మా ధ్యేయం.

Page:316

దయచేసి నికృష్టమగు భేద భావ ప్రవాహంలో కొట్టుకుపోకండి. మానవజన్మ ఎంతటి ఉత్తమ అవకాశమో గ్రహించండి. ఇక్కడ మిమ్ములను ఉద్ధరించడానికి శాస్త్రములు, గురువులు సర్వదా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సర్వసన్నిద్ధులు కండి.

శ్రీరాముడు : తండ్రీ! ఏది సత్యమో, ఏది కాదో నిర్ణయించడం ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : దీనికి శాస్త్రములు ప్రమాణము చెప్పుచున్నాయి.

1) ఏ వస్తువైతే ‘ఆది’లోను, 'అంతము'లోను లేదో, అది మధ్యలోకూడా 'లేనిదే అగుచున్నది. 2) ఏది ఆద్యంతములలో ఉండియే ఉన్నదో, అది మధ్యలో కూడా తప్పక ఉండియే ఉన్నది. 3) ఆద్యంతాలలో లేని పదార్థం గురించి “ఇది సత్యమే” అను బుద్ధిచే ఎవడు నిమగ్నుడౌతాడో... అట్టి మూర్ఖునకు వివేకము జనించేది ఎట్లా?



ఇక్కడ ముక్తి ఎవరికి? బంధమెవరికి? అను ప్రశ్నలను మేము తరచి తరచి చూచాం. పరిశీలించాం. పరీక్షించాం. గమనించాం.

జాయతేమనఏవేహ మనఏవవివర్ధతే |

సమ్యగ్దర్శనదృష్ట్యాతు మనఏవహిముచ్యతే || (సర్గ 5, శ్లో 11)

"ఈ ప్రపంచమున మనస్సే ఉత్పన్నమగుచున్నది. మనస్సే వృద్ధి చెందుతోంది. సమ్యక్ దృష్టి పొందినప్పుడు మనస్సే ముక్తిని పొందుతోంది.”

88

ఓ రామచంద్రా! ఈ పది రోజులుగా మనం చేసియున్న విచారణలోని విశేషములను ఎప్పటికప్పుడు 'పూర్వపర మననము చేస్తూ, మరల మరల మనోబుద్ధులచే పరిశీలించి, హృదయంలో పదిలపరచుకుంటున్నావు కదా! అది అత్యావస్యకం సుమా!

ఇతఃపూర్వం 'సత్వ −రజ -తమో గుణభేదం'చే తయారుకాబడిన ఈ జీవజాతులన్నిటి విచిత్ర - ఉత్పత్తుల గురించి కొంతవరకు మనం చెప్పుకున్నాం. పరబ్రహ్మము గురించి అనేక విషయాలు చర్చించుకున్నాం.

పరబ్రహ్మమే మాయాశక్తిచే జగత్తు' రూపముగా అజ్ఞాన దృష్టికి కనబడుచున్నది. అదియే పరమార్థమున పరిశీలిస్తే 'నిష్ప్రపంచకము' అయి ఉన్నది. ఈ స్థూల-సూక్ష్మ-సత్-అసత్ దృశ్యజగత్తుకంటే విలక్షణమైనది అది.

జగదీశుడు, సర్వశక్తిమంతుడు అగు పరమాత్మనుండి ఈ జగత్తు మనోకల్పిత చమత్కారంచేత ఎట్లు కల్పితమైనదిగా ఉత్పన్నమగుచున్నదో,... ఇప్పటిదాకా చూచాం.

మాయ - ఈ ‘మాయ’అనేది కాలవశంగా చూస్తే ఎప్పటికప్పుడు జలతరంగంలాగా అనుక్షణం మార్పులు చెందుతూ నాశనమయ్యేదిగానే ఉంటోంది. అనగా, దేశ కాలముల దృష్ట్యా అంతము

Page:317

కలిగియే ఉంటోంది. ప్రవాహరూపంగా చూస్తేనో..... ఇదంతా అనంతమైనది. చిత్తమే మనుజుడు. చిత్తమే మాయ.

అనేకమంది మహనీయుల అభిప్రాయములను పరిశీలించి, ఆ తరువాత ఈ అధ్యాత్మ, శాస్త్ర విషయములను నీముందు ఉంచుచున్నాను. ఈ విషయములను (ఈ సంవాదములోని విశేషాలను) మననపూర్వకంగా హృదయంలో పదిలపరుచుకోవాలి. వివేకముతో హృదయమును విస్తారపరచుకోవాలి. అప్పుడు మోక్ష స్వరూపడవు కాగలవు. మాయ స్వయముగా స్వస్థానమగు ఆత్మయందు లయించగలదు. దృశ్యము - దేహములు - సంబంధములు - అనుబంధములు - బాంధవ్యములు - జన్మ - జీవనము - మృత్యువు మొదలైనవి ఎవరి దృష్టిలో బంధములు కావో.... వారిని మోక్ష స్వరూపులు అని పిలుస్తున్నారు.

ఆత్మవేత్తలు అవ్యాజమైన ప్రేమతో అందిస్తున్న ఆత్మజ్ఞాన సమాచారం అనాదరించటం ఉచితము కాదు. శ్రేయము కాదు! అనేక సత్కర్మల ప్రయోజనంగానే ఆత్మ యొక్క స్వభావమై చెప్పబడు సమాచారము పరిశీలించాలి.... అనే ఉత్సుకత ఈ జీవునిలో బయలుదేరుచున్నది.

మమ్ము ఆశ్రయించుచున్న శిష్యులు, తదితర ప్రియజనులు 'శరీరాత్మభావమును త్యజించెదరు గాక! ఆత్మతో ఏకత్వము పొంది, 'అఖండము, అద్వితీయము, శుద్ధము, శాశ్వతము అగు ఆత్మయే నేను’ అను ఎఱుకను, భావనను సుస్థిర పరచుకొనెదరుగాక! ఇదియే మా ఉద్దేశము, లక్ష్యము

కూడా.

3. ఇప్పటికి లేనిది? ఇంకనూ పొందవలసియున్నది? శ్రీరాముడు : మహాత్మా! మనస్సే ఈ ముల్లోకములందు సంసారియగు జీవుడుగా అగుచున్నది. కదా! ...అది ఎట్లా ‘జీవుడు' రూపం పొందుతోంది? ఎట్లా జరామరణములకు పాత్రమగుచున్నది? ...అనే విషయమై మీరు అనేక విశేషాలు బోధించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు... ఈ సంసారము నుండి తరించుటకు నిశ్చలమైన, సులభమైన మార్గమేమిటో ...అది బోధించండి. శ్రీవసిష్ఠ మహర్షి : మొట్టమొదట మనుజుడు శాస్త్రాభ్యాసం చేత, తీవ్రవైరాగ్యం చేత సజ్జన సాంగత్యం చేత మనస్సును శుద్ధపరచుకోవాలి. ఈ మనస్సును జ్ఞానమునకు యోగ్యమైనదానిగా తయారుచేయాలి. ఆ విధంగా సౌజన్యయుక్తం అగుచున్న మనస్సుకు వైరాగ్యం ప్రాప్తిస్తుంది. అప్పుడు అతడు “నేనుఆత్మ-జన్మ-దృశ్యము మొదలైన వాటి వాస్తవతత్వం అభ్యసించటానికి ఉపక్రమించాలి. శాస్త్రజ్ఞులు, బ్రహ్మవిష్ణులు అయిన సద్గురువులను విధిపూర్వకంగా సమీపించాలి. వారు ఉపదేశించే మార్గంలో ధ్యాసను నిలపాలి, గ్రహించాలి. నిష్కామకర్మ, సాత్వికమైన భావాలు, సుతీక్షము, విస్తారము అగు అవగాహనల సహాయంతో క్రమంగా పరమపవిత్రమగు ఆత్మపదమును పొందగలడు. పరిశుద్ధమగు విచారణ చేతనే ఈ జీవుడు చివరికి ఆత్మను దర్శించగలుగుతాడు.

Page:318

తావద్భవమహాంభోధౌ జనస్తృణవదుహ్యతే | విచారతటవిశ్రాన్తిమేతి యావన్నచేతసా ॥ (సర్గ 5, శ్లో 18)

బుద్ధి సహాయంతో 'ఆత్మవిచారణ' అనే ఆవలి ఒడ్డు జేరుటయే ఈ జీవునికి విశ్రాంతి. అప్పటి వరకు ఈ జీవుడు కెరటాలపై తేలియాడే గడ్డిపరకలాగా ఈ సంసారసాగరంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు.

విచారణచే ఆత్మతత్త్వము ఎరిగినవాని బుద్ధి సమస్త మానసిక రుగ్మతలను తొలగించివేస్తోంది. ఒక స్వర్ణకారుడు ఇది బంగారము, ఇది భస్మము అని చిటికలో గ్రహిస్తాడు కదా! తత్త్వజ్ఞునకు స్వయముగా నిత్య-అనిత్య వివేకం కలుగుతోంది. అజ్ఞానముచే ఈ దృశ్యమును ఒక పరిచ్ఛిన్న వ్యవహారముగా గాంచుచున్న జీవులారా! మీరంతా నిరుత్సాహపడకండి! ఓపికతో తత్త్వవిచారణ చేయండి. అప్పుడు మీరు తప్పకుండా వివేకము పొందగలరు. తద్వారా మీ స్వస్వరూపమేమిటో, ఎంతటిదో మీరే గ్రహించగలరు. నేను దేశ కాలాలచే అపరిచ్చిన్నుడను, అక్షయుడను, శాశ్వతుడను అని తెలుసుకుంటారు. ఈ భయ, దుఃఖాదులు ప్రాప్తించటానికి మూలకారణమేమిటి?

సారవంతమగు ఆత్మను ఎఱుగనివానికే చిత్తసమ్మోహం అనబడేదంతా ఉంటుంది. ఆత్మను ఎఱుగటం జరిగిందా, అది సుఖదాయకం అవుతుంది. భ్రమలన్నీ తొలగుతాయి. అది ఎఱుగబడక పోతే దుఃఖమునకే హేతువగుచున్నది. అనంత సుఖమును, శాంతమును సముపార్జించాలంటే ఆత్మను ఎఱుగవలసిందే! అందుకు వేరే మార్గం లేదు. నాశనమే పర్యవసానముగాగల ఈ దేహముతో మిశ్రమమైయున్న ఆత్మను పంచకోశముల నుండి వేరుచేసి చూడాలి సుమా! అప్పుడే ఈ జీవునకు స్వస్థత లభిస్తుంది. అందుకు వివేకము అత్యంత ఆవశ్యకం.

శ్రీరాముడు : హే మహర్షీ! ఆత్మ ఈ శరీరమునందు (పంజరములో) పిట్ట వలె చిక్కుకున్నది కదా! ఈ శరీరము ఏర్పడి ఉన్నంతకాలం విశ్రాంతి ఎక్కడిది?

శ్రీవసిష్ఠ మహర్షి : బురదలో ఒక మణి పడిందనుకో... ఆ మణికి, బురదకు సంబంధం ఎక్కడన్నా ఉంటుందా? నిర్మలమగు ఆత్మకు ఈ దేహంతో ఏమాత్రం సంబంధం లేదు.

మరొక దృష్టాంతము విను. పద్మము జలంలో ఉంటుంది కదా......! అట్టి ఒక పద్మము యొక్క దళములపై కొన్ని జలబిందువులు ఉండవచ్చు. కానీ ఆ జలబిందువులు పద్మదళంలో ప్రవేశించవు కదా! అట్లాగే, పంచకోశములు ఆత్మను స్పృశించలేవు. ఆత్మలో ప్రవేశించలేవు.

ఈ బ్రహ్మం - జీవుడు ఉపాధిచే భిన్నం కావచ్చు. అధిష్ఠానం దృష్ట్యా వేరువేరు కానేకాదు.... ! ఈ జీవుడే సత్యదృష్టిచే ‘బ్రహ్మము’ అయి ఉన్నాడని గ్రహించవలసినదిగా చేతులెత్తి ప్రకటించుచున్నాను.

* పంచకోశములు : 1) శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము

2) అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.

Page:319

‘జడమే’ అయినట్టి ఈ మనస్సు 'మురికి గుంటలో తాబేలు లాగా పడి ఉన్నది. ఆత్మ విచారణను వదలి భోగద్వారములైనట్టి ఇంద్రియ విషయముల వెంట పరుగులు తీస్తూ బహు కలుషితమై ఉంటోంది. మనస్సు ఈ విధంగా ఎంతకాలం నిమగ్నమౌతుందో అంతకాలం ఈ సంసారాంధకారమును ద్వాదశాదిత్యులు వచ్చికూడా పటాపంచలు చేయలేరు. అటువంటి ఈ మనస్సు ప్రబుద్ధమైనదా, మరుక్షణం యథార్థవిషయం తప్పక ఆకళింపు చేసుకుంటోంది.

మనస్సు దేహముతో తాదాత్మ్యము చెందుతూ ఉంటే.... ప్రాజ్ఞుడైనవాడు అది పట్టించుకో కుండా వృథాకాలయాపన చేస్తాడా? లేనేలేదు. “నా హృదయము నుండి అజ్ఞానం తొలగిపోవాలి” అని నిర్ణయం చేసుకుంటాడు. గురువులను ఆశ్రయించి ఉపదేశం పొందుతాడు. ఆత్మజ్ఞులచే ప్రబోధించబడినవాడై తపోయజ్ఞ దానాదులతో మనస్సును పరిశుభ్రపరచుకుంటాడు. ఎందుకంటే, ఈ సంసారం అత్యంత దుఃఖప్రదమైనది కదా!

ధూళిచే ఆకాశము అపరిశుభ్రమౌతుందా? లిప్తమౌతుందా? అసలు ధూళికి, ఆకాశమునకు సంబంధమెక్కడిది? ఈ దేహాదులు ఉండనీ... లేకుండనీ! ... ఆత్మ ఈ దేహాదులచే, ఈ పంచకోశాలచే లిప్తమయ్యే ప్రసక్తే లేదు. బురదలో బంగారు ఉంగరం ఉంటే బురద బంగారమౌతుందా? బంగారము తన స్వతత్వమును కోల్పోయి బురదగా సంతరించుకుంటుందా! ఈ జడదేహంలో ఆత్మతో కలిసి ఉన్నప్పటికీ ఇది ఆత్మరూపం ఎలా చెందుతుంది? చెందదు. ఆత్మ జడదేహ విభాగి అవుతుందా?

అవదు.

శ్రీరాముడు : సుఖదుఃఖాదులు ఎక్కడి నుండి వచ్చి పడుచున్నాయి? ఇవి శరీరానివా? ఆత్మవా? శ్రీవసిష్ఠ మహర్షి : అదిగో ఆ ఆకాశమును చూడు! దానిలో మాలిన్యము గాని, బిందుత్వము గాని ఉన్నాయా? ఉండవు కదా! ఆత్మ యందు ప్రతీతమై అగుపిస్తున్న ఈ సుఖదుఃఖాదుల అనుభవం అసత్యమైనదే! ఆత్మకు సుఖదుఃఖాదులు లేవు.

పోనీ, “ఈ సుఖ దుఃఖాదులు శరీరమునకు సంబంధించినవే అని అందామా? ఈ శరీరము స్వతహాగా జడమే కదా! జడమైన వస్తువునకు అనుభవమనేదే ఉండదు. 'ఒక కలం అనుభూతిని పొంది కవిత్వం రాస్తోంది' అని అనం కదా! అనుభవమే ఉండనట్టి వస్తువుకు సుఖమేమిటి? దుఃఖం ఏమిటి? లేక 'ఇవి ఆత్మకు సంబంధించినవి' అందామా? ఆత్మ సర్వానికి అతీతమైనది కదా!

అందుచేత ఆత్మయే స్వయముగా సుఖదుఃఖముల భావన చేసి తద్వారా వివర్తము పొందుతోంది. తనయొక్క భావనాపరిధిలో బాలురక్రీడవలె, భావనావిన్యాసంగా సుఖదుఃఖాదులన్నీ పొందుతుంది అని అనక తప్పదు.

అందుచేత అంతాకూడా నిత్యము, ప్రశాంతము అయినట్టి ఆత్మయొక్క రూపమే....” అను భావనతో ఇక్కడి పదార్థములను, సంఘటనలను గాంచుచుండుము. ఆత్మయందు కనిపించే ఈ విశాల సృష్టి సమూహమంతా జలంలో కనిపించే తరంగముల వంటిదే. ఒక మణి అకారణంగానే సమీపవస్తువులపై ప్రకాశమును ప్రసరింపజేయుచున్నట్లు, ఆత్మ స్వసత్తామాత్రంచేత అకారణంగానే ఈ సృష్టిని విస్తరింపజేస్తూ ఉన్నది.

Page:320

అజ్ఞాన దృష్టి యందలి ‘జగత్తే'... జ్ఞానదృష్టిచే ఆత్మ!... ఈ జగత్తు, ఆత్మ ఒకే రూపములు కావు. అట్లాగే వేరువేరు రూపములైనవి కూడా కావు. జలమే తరంగరూపం కదా! తరంగము జలమే కదా!

ఈ జగత్తు మిథ్యయే. అయినప్పటికీ అజ్ఞానకారణంగా ఇట్లు భ్రాంతిరూపంగా విస్తరిస్తోంది. సమ స్తంఖల్విదంబ్రహ్మ సర్వమాత్మైవమాతతమ్

అహమన్యదిదంచాన్యదితి భ్రాన్తింత్యజానఘ. (సర్గ 5, శ్లో 39)

ఈ జగత్తంతా బ్రహ్మమే కనుక నేను వేరు.... బ్రహ్మము వేరు అను భ్రాంతిని త్యజించివేయుము. ఎందుకంటావా? బ్రహ్మము దేశ కాలములచే పరిచ్ఛేదమగునది కాదు.

అట్టి బ్రహ్మము నందు "నేను - నీవు - - జగత్తు" అనబడు విచ్ఛేదం ఎట్లా సంభవం చెప్పు? అగ్నిలో మంచుకణం ఉంటుందా? ఎలా ఉంటుంది? అగ్నిలోని ఒక అగ్నిశిఖకు సంబంధించినవి, సంబంధించనివి, ఆ అగ్నిలో ఏమి ఉంటాయి? ఏకము, సర్వరూపము అయిన పరమాత్మ యందు ఇక రెండవ కల్పనయే సంభవించదు.

'చిత్' రూపమగు ఆత్మయే 'స్వస్వరూప అభావం" అనబడు ఒకానొక సమయంలో ఇట్లు 'జగత్తు' అనబడు క్షణక్షణ పరిణామయుతమగు అనుభవప్రాప్తిని పొందటం జరుగుతోంది. ఈ పొందబడుచున్నదంతా స్వయంకల్పితమగు భావనను అనుసరించే ఉంటోంది. భావనయే సుఖము, భావనయే దుఃఖము. ఇక, ఆత్మయో? భావనలకు ఉత్పత్తి-స్థితి-లయస్థానం.

నశోకోస్తినమోహోస్తి న జన్మాస్తినజన్మవాన్ | యదస్తీహతదేవాస్తి విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 43, సర్గ 5)

నిర్ద్వంద్వోనిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్

అద్వితీయోవిశోకాత్మా విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 44, సర్గ 5)

సమఃస్వస్థఃస్థిరమతిః శాన్తకోకమనామునిః | మౌనీవరమణిస్వచ్ఛో విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 45, సర్గ 5)

వివిక్తఃశాస్త్రసంకల్పో ధీరధీర్విజితాశయః | యథాప్రాప్తానువర్తీచ విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 46, సర్గ 5)

వీతరాగోనిరాయసో విమలోవీతకల్మషః | నాదాతా నపరిత్యాగీ విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 47, సర్గ 5)

విశ్వాతీతపదంప్రాప్తః ప్రాప్తప్రాప్తవ్యపూరితః |

పూర్ణార్ణవవదక్షుభో విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 48, సర్గ 5)

వికల్పజాలనిర్ముక్తో మాయాంజనవివర్జితః | ఆత్మనాత్మ తృప్తాత్మా విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 49, సర్గ 5)

Page:321

అనన్తాపారపర్యన్త వపురాత్మవిదాంవర |

ధరాధరశిరోధీరో విజ్వరోభవరాఘవ ॥ (శ్లో 50, సర్గ 5)

వాస్తవానికి ఇక్కడ దుఃఖముగాని, మోహముగాని, జన్మగాని, జన్మను పొందునట్టిదిగాని లేదు. ఏదైతే కలదో అది సర్వదా ఉండియేవున్నది. దానినే 'ఆత్మ' అని అంటున్నాం. కనుక నీవిక దుఃఖరహితుడవు, నిశ్చింతుడవై ఉండుము. శీతోష్ణములు, మొదలైన ద్వంద్వములకు అతీతుడవై, నిత్యసత్యమగు స్వస్వరూపమునందు స్థితి కలిగియుండుము.

లేనిదేదో పొందవలెను... ఉన్నదేదో విడువవలెను... ఇది ప్రాప్తించాలి... అది ప్రాప్తించ కూడదు... వీరు మా వారు... వారు కాదు... - అనునట్టి యోగక్షేమభావములకు కట్టుపడవద్దు. ఆత్మవంతుడవై, అద్వితీయుడవై శోకరహితుడవై, సంతాపవర్జితుడవై ఉండుము. సముడవు, స్వస్థ చిత్తుడవు, స్థిరమైన బుద్ధి కలవాడవు అయి ఉండుము. మౌనివై, ఒక ఉత్తమమైన మణిలాగా స్వచ్ఛతతో ప్రకాశించెదవుగాక!

“అవిద్య” గాని, దానియొక్క కార్యక్రమవ్యవహారములుగాని స్వతఃసిద్ధమైనవి కావు. కల్పితమైనవి మాత్రమే. సంకల్పరహితుడవై, ధీరబుద్ధితో స్వాధీనచిత్తము కలిగియుండుము.

ప్రాప్తించిన వ్యవహారములను నిర్వర్తిస్తూనే, దుఃఖరహితుడవై ఉండుము. దుఃఖాదులను నీవు గ్రహించవద్దు. ‘గ్రహించటం' అనే స్వభావం చేతనే దుఃఖములు సంభవిస్తున్నాయి. వీతరాగుడవు, చింతారహితుడవు, నిర్మల చిత్తుడవు పాపవర్జితుడవు అగుము. ఏ పదార్థమునూ గ్రహించనూ వద్దు... త్యజించనూ వద్దు.

సర్వదా ప్రపంచమునకు అతీతమైయున్న (ఆవల ఉన్న) బ్రహ్మపదమును పొందియే ఉండుము. ఆత్మవస్తువు వాస్తవానికి సర్వదా ప్రాప్తించియే ఉన్నది. ఇప్పటికి లేనిది ఒకటి ఉన్నది..... అది నేను పొందాలి" అను యోచన సాంసారికమైనదేనని, జ్ఞానాగ్నిచే అది దగ్ధం కాగలదని గ్రహించు.

పూర్ణుడవై పూర్ణసముద్రంలాగా విక్షోపరహితుడవు కమ్ము. విజ్ఞానివై ఎట్టి శోకమును పొందనే వద్దు. వికల్ప జాలం నుండి విముక్తుడవు కమ్ము. వికల్పజాలమంతా నీ నుండే, నీ చేతనే కల్పితమై బహిర్గతమౌతోంది. నీయొక్క విజ్ఞానముతో కూడిన దృష్టి అవగాహనలు మాత్రమే అద్దానిని నిరోధించగలవు.

గురువులుగా మేము మీ స్వరూప విషయమై విశ్లేషణము చేసిచూపుతున్నాం. అయితే దర్శించవలసినది, గ్రహించవలసినది మీరే! 'మాయ' అనే పొర మీపట్ల తొలగిపోవు గాక!

ఓ రామా! ఆత్మయందు, ఆత్మచే పరితృప్తుడవై, సంతాపములు లేనివాడవై ఉండుము. నేను ఆత్మస్వరూపుడను అను ఎఱుకతో చైతన్యస్వరూపము సంతరించుకో. మేరుపర్వతం లాగా ధీరుడవై సహనశీలుడవై, పరితాపరహితుడవగుము.

ప్రాప్తించిన దానిని అనుభవించుచు, ఏ వాంఛలు లేక, గ్రహణ, త్యాగరహితుడై ఉన్నవాడు స్వల్ప ప్రయత్నాల చేతనే ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని స్వయంగా గాంచుచున్నాడు. మహాసముద్రము

Page:322

లాగా 'ఆత్మ'చే ఆత్మయందు పరిపూర్ణుడవై, పూర్ణకాముడవై శాంతి సుఖములను ఆశ్రయించుము. అమాయకులగు కొందరు జీవులు "ఈ ఎదురుగా కనబడు సంఘటనలు, పదార్థాలు, వస్తు జాలం అన్నీ వాస్తవమే అని భావన చేయుట చేతనే ఇక్కడ దుఃఖం, రాగం, కౌతుకం, ఆవేశం, హింసాప్రవృత్తి భయం, క్రోధం మొదలగునవి ఏర్పడుచున్నాయి. "ఈ ప్రపంచం మిథ్యా రూపం అని ఎరుగువాడు అసత్స్వరూపం అయినట్టి ఇద్దాని కొరకు పరుగులు తీస్తాడా? లేదు.

ఓ రామా! నీవు తత్త్వజ్ఞుడవు. కల్పనారహితుడవు. ఇక నీకు పెద్దగా చెప్పవలసింది ఏముంటుంది? చిలుక, పంజరము'లో చిక్కుకున్నట్లు ఆత్మ శరీరమునందు చిక్కుకున్నదని భావించ కూడదు. మౌనము - ప్రశాంతము - నిర్మలము - - అఖండము - సత్యము - నిత్యము అగు ఆత్మ ఎక్కడ? జడము, భ్రమాత్మక, స్వప్నతుల్యము అగు ఈ దేహమెక్కడ? అభాండమగు ఆకాశము ఘటాకాశరూపంగా (కుండలోని ఆకాశరూపంగా) ఘటంలో (కుండలో) చిక్కుకున్నదని అనటం

సమంజసం కాదుకదా!

కనుక, ఆధి వ్యాధి వర్జితుడవై నిరంతరం ఆత్మజ్ఞానం కలిగి సుఖవంతుడవు కమ్ము. నీ ఉత్తమ, ప్రశాంత గుణములయొక్క భావీకరణముచే సమస్త జనులను ప్రసన్నులుగా చేస్తూవుండు. సమదృష్టి కలిగివుండి, చిరకాలంగా రాజ్యమును చక్కగా పాలించు.

ప్రారబ్ధవశంచేత అనుభవించతగిన, నిర్వర్తించవలసిన కర్మలందు, వాటి ఫలములందు త్యాగముగాని, రాగముగాని యుక్తము కాదు అని గ్రహించి ఉండు.

4. కర్మబద్ధులు - విముక్తులు

ఓ రామా! “నాకు అద్వితీయమైనట్టి 'ఆత్మ' యొక్క సన్నిధానమాత్రం చేత ఈ జగద్వ్యవహారమంతా నేనే ఒనర్చుచున్నాను" - అను నిశ్చయమును జ్ఞానసిద్ధులగు యోగులు కలిగివుంటున్నారు. అట్టి నిశ్చయము కలిగియుండి, ఆపై కార్యములందు ప్రవృత్తుడగువాడు 'ముక్తుడే’ అని మా అభిప్రాయం. ముక్త స్థితికి కర్మానుష్ఠానం విరోధము కాదు. కావలసిన పనిలేదు!

కర్మబద్ధులు - ఈ జీవుడు అనేక ప్రయాసల తరువాత మనుష్యదేహం పొందుచున్నాడు. అట్లు మనుష్యదేహం పొందిన తరువాత కూడా 'నిష్కామ కర్మానుష్ఠానము నందు తత్పరులు కానివారు దుఃఖముల వైపుకే పయనించుచున్నారు. నిందిత కర్మలచే ఈ జీవుడు నరకమునకు వెళ్ళుచున్నాడు. మరల అక్కడి నుండి కామ్య - కర్మానుభవం కొరకు స్వర్గం వెళ్ళుచున్నాడు. కొందరు విహిత కర్మ లందు బద్ధకముచే అశ్రద్ధపరులై ఉంటున్నారే! అట్టివారు ఒక నరకమునుండి మరొక నరకమునకు, ఒక దుఃఖము నుండి మరొక దుఃఖమునకు, ఒక భయమునుండి మరొక భయమునకు అనుక్షణం ప్రయాణాలు చేస్తున్నారు. స్వవాసనలను దట్టంగా కల్పించుకొంటూ వాటికి తామే బద్ధులగుచున్నారు. దుష్కర్మ ఫలముల ఆధిక్యత చేత జంతు జన్మలు, అక్కడి నుండి స్థావర రూపములు పొందుచున్నారు.

Page:323

శుద్ధ సాత్వికులు - కొందరు ధన్యులగు జీవులు తమయొక్క మనస్సుచే ఈ మనస్సుకే సాక్షీభూతమైయున్న ‘ఆత్మ'ను గురించి విచారణ చేస్తున్నారు. తమయందలి తృష్ణను రహితం చేసి వేస్తున్నారు. కర్మయందు అకర్మ, జన్మయందు జన్మరాహిత్యం వారికి సుస్పష్టముగా సర్వదా సర్వత్రా అనుభవమగుచున్నాయి. అట్టి జీవులే శుద్ధ సాత్వికులు, వారు ఉత్తమ కైవల్యమును పొందుచున్నారు.

నిషిద్ధకర్మలు - హింసించుట, ద్వేషించుట, క్రోధము, పారుష్యము, లోభము మొదలైనవి ఆశ్రయించకూడదు” అని శాస్త్రములు గుర్తుచేస్తున్నాయి.

రాజస సాత్వికులు - ఈ జీవులు సాత్వికము, లోక కళ్యాణ కారకములగు కర్మలకు సంబంధించిన ప్రవృత్తి - సంస్కారములను కలిగియుంటున్నారు. "స్వధర్మభావనతో భగవదర్పిత భావనతో ఈ కర్మలు నేను చేయాలి. తద్వారా సర్వాత్మకుడగు ఆ భగవంతుని సంతోషింపజేయాలి” అను మననము కలిగి, ఆయాకర్మలందు ప్రవృత్తములగుచున్నారు. వీరు క్రమంగా ఒక శ్రేష్ఠమైన జన్మ నుండి మరికొంత శ్రేష్ఠమైన జన్మను అనుభవించుచూ, ఒకానొక పవిత్రసమయములో (ఒకానొక జన్మలో) ముక్తులగుచున్నారు. అట్టివారు తమయొక్క చివరిజన్మలో, పుట్టినవెంటనే పూర్ణచంద్రునివలె వృద్ధిని గాంచుచున్నారు. వారి ఆయా జన్మలలో సాధన చతుష్టయం బలపడుచూ వెంటనంటి వస్తూ ఉంటాయి. బ్రహ్మవిద్యకు ఉపాయభూతములైన సమస్త విద్యలు వచ్చి చేరుచున్నాయి. శ్రేష్ఠత్వము, మనోహరత్వము, మైత్రి, సౌజన్యము, కరుణ, జ్ఞానము మొదలైన గుణములన్నీ ఆతనిని వచ్చి ఆశ్రయిస్తున్నాయి.

ఓ రాఘవా! ఎవడైతే సమస్త కార్యములు చేస్తున్నప్పటికీ, ఫల, అఫలములందు సమరూపుడై వర్తిస్తాడో, హర్ష శోకములు పొందకయే ఉంటాడో, అతని పట్ల ఈ సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములన్నీ నిర్లిప్తం అయిపోతాయి. తెల్లతెల్లవారినప్పటి చీకటిలాగా నశించిపోతాయి. చిత్తము సమస్త సద్గుణములచే పరిశుద్ధమౌతూవుంటుంది. అట్టి సదాచారసంపన్నుణ్ణి జనులు "ఈతనిని మేము కలిగి ఉండాలి" అని తలుస్తారు. ఎందుకంటే, ఆతని యందు సద్గుణ సంపద స్వయముగా, అసంకల్పితముగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

సాధన చతుష్టయం - సాధు సాంగత్యం, శ్రవణం, మననం, నిధిధ్యాస మొదలైన ఉత్తమ గుణములచే పరిపూర్ణుడై ఉంటున్న ఆతనిని చూచి సంతోషించినవారై సద్గురువులగు జ్ఞానులు జ్ఞానసంపదను ప్రసాదిస్తున్నారు. ఇది ఆత్మ - ఇది అనాత్మ అను వివేకము వారియందు స్వయంగా ప్రకాశిస్తుంది. అట్టి విచారయోగము సహాయంచే ఆ జీవుడు ఆనందైకరసమగు ఆత్మస్వరూపమును వీక్షించగలుగుతాడు. అంతఃకరణమునందు ఆత్మకు లక్షణములైన అఖండత్వము, నిత్యత్వము, శుద్ధత్వము, ప్రకాశమయత్వము మొదలైనవి రూపము దిద్దుకుంటాయి. ఆత్మయే ఆతని మననము, స్వభావము అగుచున్నది. ఉత్తమ శాంతియే ఆతని ధారణ. మనస్సు సర్వదా నిర్గుణ (గుణములకు అతీతమైన) బ్రహ్మము రూపమందు ఐక్యమై ఉంటోంది. 'ఆత్మ' అనబడు అనుభవమునందు నిత్యము ప్రబోధితుడై అతడు ఉంటున్నాడు.

Page:324

చూచావా రామా! ఉత్తమ లక్ష్యంతో, దృష్టితో, భావనతో ఉపాధిని పొందిన జీవుడు జీవితం అను ఈ అవకాశమును వృథా పరుచుకోడు. మహాత్ములు, ఆత్మద్రష్టలు అగు సద్గురువులను సేవించి, వారు బోధించు యుక్తులచే నిర్మల బుద్ధిని సంపాదించుకుంటాడు. అట్టి బుద్ధిచే చిత్తమునందలి ఆత్మవస్తువును ప్రకాశింపజేసుకుంటాడు.

అంతఃకరణమున ప్రకాశించుచున్న బ్రహ్మమును అనునిత్యంగా ఆస్వాదిస్తున్నాడు. పరమ పురుషార్థ రూపమగు ఉత్తమగతిని తన యొక్క స్వస్థానమునందే పొందుచున్నాడు.

Page:325

II. జనకోపాఖ్యానము

1.సిద్ధగీతాగానం

మిధిల విదేహ' అనే పేరుగల రాజ్యమును జనకమహారాజు పాలిస్తున్నాడు. ఆయనకు దేనిపట్లా ఎట్టి వ్యధ ఉండేది కాదు. 'ఇది ఆపద, 'ఇది సంపద' అనబడు స్పర్ధ అంతరంగమున లేకుండానే మహావిష్ణువులాగా సౌజన్యపూర్వకంగా రాజ్యం పాలిస్తూఉన్నారు. అయితే ఆయనకు సందేహాలు ఎక్కడో అంతరంగంలో చూచాయగా మినుకుమినుకుమంటూ ఉండేవి. ఈ జీవుడెవడు? ఈ సంసారము ఏమై ఉన్నది? భ్రమలను కల్పిస్తున్నది ఎవరు? భ్రమలను కల్పించుచున్నవానికి, ఆ భ్రమలు అనుభవించుచున్నవానికి గల సంబంధమేమిటి?

నేనెవరు? ఈ రాజ్యాదులు నావేనా? కాదా! అహంకారము భ్రమయా? వాస్తవమా? అందరి యందు భగవానుడు ఉన్నాడని వేదములు ఘోషిస్తున్నాయి, అయితే నాయందు కూడా ఉండాలి కదా! ఉంటే ఏ రూపములో ఉన్నాడు?

జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అనగా ఎట్టిది? ఎవరిచే కల్పితం? ఈ మనస్సు పొందే అల్పత్వాన్ని, చంచలత్వాన్ని నిరోధించటం సాధ్యమేనా? ఇక్కడ ఏది త్యజించాలి? ఏది గ్రహించాలి?

ఇట్లు అనేక ఆలోచనలు పొందుతూ ఉండేవాడు. ఒక రోజు ఆయన వనవిహారం చేసే ఉద్దేశంతో సపరివారంగా ఒక పర్వతప్రాంతం చేరారు. పరివారము నంతటినీ వదలి పర్వతగుహలలో ఒంటరిగా సంచరించసాగాడు. ఒక చోట ఆయనకు కొన్ని శబ్దములేవో అలవోకగా వినిపించ సాగాయి. అనేక సాధనలచే సముపార్జించియున్న యోగబలంతో మనస్సును ఏకాగ్రం చేసి ఆ శబ్దములను వినసాగాడు.

ఆ శబ్దములు అదృశ్యరూపులగు సిద్ధుల పరస్పర సంభాషణ అయి ఉన్నట్లు యోగబలం చేత, తార్కిక బలంచేత గ్రహించాడు. ఆహాఁ! ఇక్కడ ఏదో సంభాషణ వినవస్తోంది. ఇవి సిద్ధులు మాట్లాడుకొనే మాటలు! అయితే సిద్ధులు ఏకాంతవాసులు కదా! మహానుభావులతో సమీప్యత అంత తేలికగా లభించదు. ఈ రోజు నా పుణ్యం ఫలప్రదమౌతోంది కాబోలు. వీరు పవిత్రాత్మ స్వభావులు. వీరి మాటలు వింటుంటే, ఉత్తమోత్తమమగు ఆత్మవస్తువు గురించే సంభాషించు కుంటున్నట్లు నాకు అనిపిస్తోంది. సరే, పూజ్యులగు వీరి వాక్యములను వినమ్రతతో శిష్యభావనా సమన్వితుడనై వినెదను గాక" - అని తనలో అనుకున్నాడు. మనస్సును తదితర విషయముల నుండి వెనుకకు మరల్చి ఏకాగ్రతతో ఆ శబ్దమును వినుటకు, అర్థమును గ్రహించుటకు ఉద్యుక్తుడయ్యాడు.

Page:326

ఒకానొక సిద్ధుడు : మిత్రులారా, ఇప్పుడు ఆత్మజ్ఞాన విషయమై కొన్ని విశేషాలు చెప్పుకుందాం. కొంత సమాచారం చర్చించుకొందాం. మనమన అవగాహనలకు సంబంధించిన అనుభవాలను విశ్లేషించుకుందాం.



ఒకటవ సిద్ధుడు :

ద్రష్ట దర్శనముల సంయోగ స్థానం ఒకటి చూస్తున్నది. మరొకటి చూడబడుచున్నది. అవియే - ద్రష్ట - దృశ్యములు కదా! పరిమిత, అపరిపక్వ దృష్టికి, ఈ ద్రష్ట - దృశ్యములు వేరు వేరైనవిగా అనిపించటం, ప్రాప్తించటం జరుగుతోంది. అయితే ఈ ద్రష్ట -దృష్టి -దర్శనం -దృశ్యం కూడా ఒకానొకచోట సంయోగము పొందుచున్నాయి. ఏకైక రూపమై ప్రదర్శనమగుచున్నాయి. అట్టి నిరుపమానందన స్వరూపం అయిన సంయోగ స్థానం ఏదై ఉన్నది?

ఒకానొక అనిర్వచనీయమగు తత్త్వము ఈ 'నేత్రములు' మొదలైన ఇంద్రియముల ద్వారా విషయములతో సంయోగమును ఆశ్రయిస్తోంది. ఆ తత్త్వమే 'ఇంద్రియ విషయములు అను ఆకారముగల బుద్ధివృత్తులను పొందినదగుచున్నది. సర్వమును 'ఇది సుఖము’, ‘ఇది దుఃఖము’ 'ఇది కావాలి’ ఇది వద్దు' అని నిర్ణయించేది, భావనచేసేది, అనుభవమును పొందేది అదే.

అట్టి నిరతిశయ భూమానంద స్వరూపమైన ఆత్మనే...... నేను ఆరాధిస్తున్నాను. భగవంతుడు’ అని చెప్పబడుచున్నది అదే. సవికల్ప - నిర్వికల్ప సమాధులచేత, బాహ్య - అభ్యంతర ఇంద్రియ నిగ్రహములచేత నాచే నిరంతరం ఉపాసించబడుచున్నది అదే.

ఎవరు ఎక్కడ ఉంటే, అది వారికి అక్కడే, అప్పుడే లభించియే ఉన్నది. ఇక దాని కొరకు మరొక స్థానం వెళ్ళాలా? మరి కొంత సమయం వేచి ఉండాలా? ఎందుకు?

అయ్యది నా యొక్క సర్వుల యొక్క, సర్వము యొక్క స్వస్వరూపమునకు వేరైయున్నది. కాదు. అట్టి అద్వితీయమైనది (వేరుకానట్టిది), అఖండమైనట్టిది (అనేక జీవులుగా మారు స్వభావము లేనట్టిది), స్వస్వరూపమైనట్టిదియగు ఆత్మ భగవంతునకు ఇదే నా నమస్కారం. దృశ్యరూపము, నా స్వరూపముకూడా సర్వదా అయి ఉన్న 'ఆత్మ'కు ప్రణామములు. సర్వజీవులు తానై, సర్వసాక్షిగా వేరై ప్రదర్శనమగుచున్న అస్మదాత్మదేవా! నీకు నమస్కారం!

రెండవ సిద్ధుడు :

భావనకు మునుముందే ఉన్న సాక్షిసత్త -నేత్రములు మొదలైన ఇంద్రియములందు అనుభవము’ స్వరూపముగా ప్రత్యక్షమై "జ్ఞానము ఉండి ఉన్నది. - ఆ జ్ఞానం ఈ ఇంద్రియములు రూపుదిద్దుకొనుటకు ముందే ఉండి ఉన్నది.

'నేను చూచుచున్నాను' అను రూపముగల అనుభవమునకు ముందే ఆ అనుభవమును ఆశ్రయించు 'నేను' ఉండియే ఉన్నది. అదే విధంగా 'నేను' అనబడునది భావించబడుటకు ముందే, ఆ ‘నేను’ను భావించుటకు సిద్ధమగుచున్న సత్త ఉండియే ఉండాలి కదా?

Page:327

భావించువాడు భావనకంటే మును ముందే ఉండి ఉన్నాడు. అట్టి 'సాక్షి రూపసత్త' విషయమై కొందరు అది ఉన్నది.... అదియే ఉన్నది" - అని అంటున్నారు. మరి కొందరు "అది కళ్ళకు కనబడటం లేదుగా!... కనుక లేదు" - అని వాదిస్తున్నారు.

“అసత్తన్నా సదుచ్యతే” - అది 'ఉన్నది', 'లేదు', అని కూడా చెప్పబడుతోంది. అట్లు 'ఉన్నది', 'లేదు' అను విషయమై ఆ రెండింటిని దర్శిస్తూ, అనుభవం పొందే ఒకానొక సాక్షిత్వము ఉండాలి కదా! ఈ అస్థిత్వ - నాస్థిత్వము (ఉన్నది - లేదు) పక్షముల రెండిటియందును మధ్యగతమై, సాక్షిస్వరూపమున వెలుగొందుచూ ఉన్నదేది?

ఔను.....! అది మనస్సుకు, వాక్కుకు అలభ్యముగానే ఉంటోంది. అనుభవమాత్రమే అగుచున్నది. అదియే 'ఆత్మ' అను సంజ్ఞతో మనం చెప్పుకుంటున్నాం.

ఆ ఆత్మ తాను ప్రకాశిస్తూ, తదితరములైన సర్వ వస్తువులను, సమస్త దృశ్యములను ప్రకాశింపజేస్తోంది. అది ‘అస్థిత్వము'ను ఆశ్రయించిందా....... 'జగత్తు' అనే కార్యము ఏర్పడుచున్నది. అది 'నాస్థిత్వము’ను ఆశ్రయించినప్పుడో.... 'జగత్తు' తిరోభావరూపము పొందుచున్నది. అట్టి ఆత్మవస్తువునే అనేకులు అనేక నామ - రూపములతో ఉపాసిస్తున్నారు. అందరి ఆరాధన, తపన అదియే. అట్టి 'ఆత్మతత్త్వము'ను నేను నిత్యము ఉపాసిస్తున్నాను.

మూడవ సిద్ధుడు :

ఆధారుడు, నియామకుడు - నేను, నీవు, అతడు, ఆమె, వారు, వీరు" అనునవన్నీ ఉన్నది ఎక్కడ? ఎందులో? ఈ సర్వమునకు ఆధారం ఎవరు? ఈ సమస్తము ఎవనికి చెందినది? వీటన్నింటిని నియమించుచూ ప్రభువై పాలించుచున్నవాడు ఎవరు?

ఎవనియొక్క సంకల్ప బలముచేత సర్వము ఉత్పన్నమై ఒకానొక నియమానుసారం ప్రవర్తిస్తోంది? ఈ సర్వమునకు 'కారణ భూతుడు' ఎవడు? ఎవడు ఉంటే మాత్రమే ఇవన్నీ ఉండ గలుగుచున్నాయి? అసలు ఈ సమస్తము ఎవడై యున్నాడు? మాయచే జగద్వ్యవహారములన్నింటినీ నిర్వహిస్తూ సర్వరూపములు తానే అయి ఉన్నాడు.... నామరూపములకు సంబంధించనివాడు ఎవడు? అట్టి సత్యము, నిత్యము, సమము, సర్వము అగు పరమాత్మనే నేను ఆరాధిస్తున్నాను.

నాలుగవ సిద్ధుడు :

సర్వనిర్వచనములకూ ఆలవాలము, సూచకము (Zone of/indicative of - all definitions)అహమ్..... (నేను) అను భావన సర్వులయందు సర్వదా సర్వమునకు కారణమై వెలుగొందుచున్నది కదా...! ఈ 'అ'కారము ఆదిగా, 'హ' కారము అంతముగా గల 'అహమ్’ అను శబ్దము సూచిస్తున్నది దేనిని?... అదియే 'ఆత్మ' అనబడు మరొక శబ్దముతో కూడా ప్రతిపాదించబడుతోంది. అదియే తదితర వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తోంది.

Page:328

అంతేకాదు! సర్వవేదాలలో, తదితరమైన శాస్త్రాలలో అనుగతమైనది అదే. బహు విధాలుగా నామ రూపాదులతో కూడినదై అనేక చమత్కారాలచే ప్రవచింపబడుచున్నది కూడా అదే!

అన్ని అక్షరముల సముదాయ రూపమగు శబ్దజాలమునందు అతడు అంతర్గతుడై ఉన్నాడు. ఇది సుందరమైనది.... ప్రియమైనది... స్వీకరింపతగినది..... ఆశ్చర్యకరమైనది... పవిత్రమైనది” మొదలైన నిర్వచనములన్నీ ఎవరివి? అహంభావనకే ఆది అయినట్టి 'శుద్ధచిత్' తత్వము యొక్క చమత్కారమే. ఆ ఆత్మభగవానుడే సర్వాకారుడు అయి ఉన్నాడు.

అనగా, అతడే సర్వులుగా ఆకారము గ్రహించుచున్నాడు కదా! కాబట్టి సర్వ నియామకుడు, సర్వవ్యాపకుడు అయి ఉన్నాడు. ఆ సర్వవ్యాపకుడు అనవధ్యుడు. ఆతనిని వధింపగలిగినది, నిరోధింప గలిగినది ఎక్కడా ఏదీ ఉండజాలదు. ఆతడు విభాగములుగా అగుటయే లేదు.

ఆతడు వాస్తవానికి ఏనాడూ మరొకటేదీ అగుట లేదు. కనుక 'జీవుడు, ‘మనస్సు’ మొదలైన వన్నీ ఆతనిపట్ల భ్రమచే ఆపాదించబడుచున్నవి మాత్రమే. ఆతడు సర్వదా నిర్గుణ బ్రహ్మము నందే స్థితి కలిగివుంటున్నాడు. జలం తరంగమగుచున్నప్పటికీ జలము జలముగానే ఉంటోంది కదా!

సోహమ్... సో హమ్... సో హమ్" - ఆతడే నేను .. నేను ఈ నామ రూపములు కాదు. మనోబుద్ధులు నేను కాదు. చిత్తహంకారములు నేను కాదు. ఆతడే నేను..... నేనే ఆతడు.

శ్వాసఉచ్ఛ్వాసలచే సోహమ్' మంత్రం అసంకల్పితంగానే నాచే నిరంతరం జపించబడుచున్నది కదా! అట్టి ఆత్మ పరమేశ్వరుని ఆరాధిస్తున్నాను... ఉపాసిస్తున్నాను. శరణు వేడుతున్నాను. ఆతడు నిరామయుడు (తీళిజీళీజిలిరీరీ) అని తెలిసికూడా, నామరూపములను ఉపకరణములుగా తీసికొని ఆ ఆత్మానంద తత్త్వమువైపుగా ప్రయాణిస్తున్నాను.

ఐదవ సిద్ధుడు :

న అన్యమ్, న బాహ్యమ్ - ప్రతి ఒక్క జీవుని 'హృదయ గుహ'లోను ఒకానొక 'సత్త' స్వరూపుడగు భగవానుడు కాపురము ఉండివున్నాడు. సాక్షి స్వరూపుడై వెలుగొందుచూ, సర్వమునూ అతడు వెలిగించుటకు మూలకారకుడు అగుచున్నాడు. అతడెవరు? అతి చమత్కారంగా, 'న అన్యమ్’, ‘న బాహ్యమ్' (Not different from one's own self. Not anything outside).

అంతరాత్మ స్వరూపుడగు ఆ భగవంతుని ఏమరచి, ప్రక్కకు పెట్టి .... ఈ జీవుడు ఎక్కడో ఉన్నట్లుగా భావించబడు అన్యదేవతలను ఆశ్రయిస్తున్నాడేమిటి? ఎంత ఆశ్చర్యం?

ఓయీ, జీవుడా! నీ హృదయంలో సర్వదా వేంచేసియుండి, సర్వ స్థితిగతులందు, నిశ్చలుడు, నిర్మలుడు అయివుంటున్న ఆ అంతరాత్మయే నీవు. మరేదీ నీవు అయి ఉండలేదు.... ఉండబోవు! చేతిలోని 'మణి'ని పూర్తిగా మరచి, ఎక్కడో దూరముగాగల ఒక్క గాజు ముక్కను చూచి "అహో! అది నన్ను సమీపించకూడదా...! ఏంచేస్తే అది పొందగలను? అని నీవు ఎందుకు కలవరిస్తున్నావు? గుప్పిట విప్పి మణిని చూచినట్లు స్వహృదయమునకు స్థానమైయున్న ఆ స్వస్వరూపాత్మను దర్శించవేం?

Page:329

ఆ భగవంతుడు అంగుష్ఠమాత్రుడై సర్వుల హృదయములందు సుఖాసీనుడై అంతరాత్మ స్వరూపుడైయుండియే ఉన్నాడు. అందుచేత, ప్రతి ఒక్కరికి మేము చెప్పుచున్నది ఒక్కటే... సర్వ జీవులారా! మీలో ఏ ఒక్కరూ పరితపించవలసిన పనేమీ లేదు. ఆ పరమాత్మ మీ హృదయమునందే సర్వదా వేంచేసియున్నారు. అది గ్రహించండి... ఆరాధించి తరించండి. పరమాత్మ స్వరూపులై సంతృప్తులు అవండి. నా ఆరాధన, ఆరాధ్యము సర్వాంతర్యామి అగు నా అంతరాత్మయే!

ఆరవ సిద్ధుడు :

ఆశ రహితంకాగా అప్పుడు శేషించి ఉండేది! - - ఈ జీవుని యందు క్షణక్షణం అసంఖ్యాకంగా, అంతులేకుండా ఏవేవో క్రొత్త క్రొత్త ఆశలు ఏర్పడుచున్నాయి. ఈ 'ఆశ' అనుదానికి అంతు ఉండటంలేదు. ఆశలు ఎందుకు ఏర్పడుచున్నాయి? 'ఆశించుట' అను ప్రకృతి సంబంధమైన స్వభావము చేతనే కదా! ఒకానొక జీవుడు సమస్త ఆశలు పరిత్యజించాడనుకో... అప్పటికీ ఆతనియందు శేషించి ఉండునదేమిటి?

ఆ శేషశయనుడు (అట్లు శేషించు దాని యందు శయనించువాడు) 'చిద్రూప పరబ్రహ్మము' అను సంజ్ఞతో చెప్పబడుచున్నాడు. అదియే బ్రహ్మము. అదియే మర్మము. అది సర్వదా ప్రాప్తించియే ఉన్నది. అట్టి బ్రహ్మముయొక్క జ్ఞానానుభవము ప్రాప్తించిన తరువాత ఇక 'ఆశ' అను విషలతకు స్థానమెక్కడిది? వెలుతురు ఉన్నచోట చీకటికి ఉనికి ఎక్కడ?

హృదయమును ఆశారహితము చేసి అప్పుడు శేషించి ఉండే ఆత్మయే నాచే ఆరాధించబడు పరమోత్కృష్టతత్త్వము. అదియే నా ఆరాధ్య దైవము. అదే సర్వస్వము. నా ప్రయత్నములన్నీ అటు వైపుకే!

ఏడవ సిద్ధుడు :

క్షుద్రాశయం, మహాశయం ఈ జగత్తులో 'భోగము' అను అనుభవమును పొందడానికి అనేక వస్తువులు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ వాస్తవానికి సారరహితం. ఇవి అనుక్షణం ఒక స్థితి నుండి మరొక స్థితికి పయనిస్తున్నాయి.

శాస్త్ర వాక్యములు, గురుబోధలు ఈ జగత్ పదార్థములు నిస్సారములే అని పదే పదే జీవులకు గుర్తు చేస్తున్నాయి. ఈ జీవులు అవన్నీ వింటూకూడా ఎందుకో 'దుర్బుద్ధి'నే ఆశ్రయిస్తున్నారు. ఈ వస్తుజాలం సుఖప్రదములు. ఇవి మమ్ములను తదితరుల కన్నా గొప్పగా చేస్తాయి.... కనుక కలిగి ఉంటాం గాక .. అను యోచనయే జీవన విధానమును శాసించటం జరుగుతోంది. వీరు స్వల్ప వస్తువులకొరకై ద్వేషించుకొనుచున్నారు... దుఃఖించుచున్నారు... శ్రమించు చున్నారు.... పరుగులు తీస్తున్నారు. ఫలితంగా, అజ్ఞానంచే ఆవరించబడిన మనస్సు గలవారై మరల మరల అనేక నీచ ఉపాధులు పొందుచున్నారు. దుర్బలమైన స్థితి గతులు తెచ్చి పెట్టు కుంటున్నారు.

Page:330

అట్టి భోగ్యవస్తువులను జీవిత లక్ష్యముగా అంగీకరించు మానవులు వారిని మానవులు అని అనకూడదు. మానవరూపంలో ఉన్న గాడిదల వంటి వారే! ఎందుకంటే వారు తమ మనస్సు లందు ఎన్నో 'నిష్ప్రయోజనకరము, త్యాజ్యార్హము' అగు వేదనలు, రోదనలు మోస్తున్నారు కదా!

‘ఆత్మ జ్ఞానము’, ‘ఆత్మానుభవము' - అనునవి లక్ష్యముగా కలిగి జీవించువారి జీవితములు మాత్రమే అర్థయుక్తము, శుభకరము, పవిత్రము కూడా! వారి కర్మలు, వారి శబ్దములు, భావములు క్రమంగా సుఖ శాంతులు సంతరించుకోగలవు.

కనుక ఆత్మతత్త్వజ్ఞానులు, ఆత్మస్వభావులు అగుటకు యత్నించుటచే మహాశయులు (మహత్తరమైన ఆశయములు కలవారు) అగుట ఎంత ఉత్తమం! అట్టి మహాశయమే నా మార్గం.

ఎనిమిదవ సిద్ధుడు :

ఇంద్రియ సద్వినియోగం - పర్వతాలు రెక్కలతో లేస్తూ ఊళ్ళమీద పడుతుంటే, ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతముల రెక్కలను ఖండిస్తున్నాడు కదా...! అట్లాగే 'ఇంద్రియములు' తమ ఇష్టం వచ్చినట్లు ఆయా విషయములపై వ్రాలుచుండగా ఈ మానవుడు చూస్తూ ఊరుకోవటం ఉచితం కాదు. 'వివేకము' అనే దండముతో వాటిని పదేపదే అణచివేయాలి.

ఇంద్రియసర్పాలు యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉండే సమయంలో ఆజీవుని హృదయంలో సుఖశాంతులు ఉండే అవకాశమెక్కడిది? ఈ ఇంద్రియాలను నియమించటం ఎఱుగనప్పుడు ఇవి అనంత దుఃఖములలోకి ఈ జీవుని త్రోసివేస్తున్నాయి. దుర్భర జన్మపరంపరలను ప్రాప్తింప జేస్తున్నాయి.

అరేఁ! ఎంతో శ్రమించిన తరువాత, ఆశ్రమకు ఫలితంగా 'మానవుడు' మొదలైన ఉత్తమమైన ఉపాధులు పొంది కూడా, ఈ జీవులలో అనేకులు వాటిని సద్వినియోగపరుచుకోవటం లేదే? శాస్త్రములు, “ఇంద్రియములను ఎట్లు నియమించటం ఉచితం? అనే విషయమై అనేక మార్గములు చూపుచున్నాయి.

ఇంద్రియాలు దుర్వినియోగబడకుండు గాక! ఎందుకంటే, అందుకు అంతిమ ప్రయోజనం దుఃఖం, అవివేకం, సంకుచితత్వమే అగుచున్నది. "ఇది సన్మార్గం, ఇది దుర్మార్గం అని విచక్షణ చేయబడి, అప్పుడు సరియగు మార్గములో, అనగా శాశ్వతము, అఖండము అగు ఆత్మావగాహన పెంపొందించు మార్గంలో ఈ ఇంద్రియములు వినియోగించబడుగాక! సర్వ అవకాశములు సద్వినియోగ పరచుకుని ఆత్మావగాహన పెంపొందించుకోవటమే సన్మార్గం. అదియే నా సాధన.

తొమ్మిదవ సిద్ధుడు :

ఇంద్రియాతీతత్వం - ఈ విషయములన్నీ కూడా దుఃఖప్రదములుగానే పరిణమిస్తున్నాయి. ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ ఇంద్రియ సంబంధితములే కదా!

మరిప్పుడు ఉపాయమేమిటి? విషయముల వెంటే పరుగులు తీయాలా? ...లేదు.

Page:331

మానవుడు ఈ బాహ్య, అభ్యంతర వ్యాపారములను నిరోధిస్తూ ఉండాలి. అప్పుడు క్రమంగా ఈ విషయములచే ఏర్పడుచున్న దుఃఖము రహితం అవుతుంది. అట్లు నిరోధించటంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే.

అయినాసరే! బాహ్య - అభ్యంతర వ్యాపారములు క్రమపరచాలి. అల్పసుఖమును త్యాగం చేసి ఉత్తమ సుఖమును సముపార్జించటం" - అనేది లోకంలో అందరికీ తెలిసిన విషయమేకదా! విషయ సుఖము అధిగమించబడిందా..... అప్పుడు ఆత్మసుఖమే లభించగలదు కదా! అట్టి ఉపశమనము’చే ఇంద్రియ వ్యాపారం నిరోధిస్తే, చిత్తము శమిస్తుంది.

చిత్తము ఇంద్రియములనుండి రక్షితమయిన చోట 'జడత్వము' లేనట్టి శుద్ధ పరబ్రహ్మానుభవం లభించగలదు. ఉత్తమ స్థితి లభించగలదు. అప్పుడు ప్రాప్తించుచున్న నిత్యోదిత 'ఆత్మ' లేక పరబ్రహ్మమునకు ఇవే నా నమస్కారములు. ఆనిత్యోదిత పరబ్రహ్మమే నా దృష్టి, నిష్ఠ కూడా!

ఒకానొక సిద్ధుడు : మంచిది... ఈ సమయంలో మనం చక్కటి విషయాలు గుర్తు చేసుకున్నాం. ఇక

ఈ విషయములు మనం మరికొంత యోచించుకుంటూ ఉండెదముగాక! ఇక మనం మన

స్వస్థానములకు వెళ్లుదాం!

2. విచిత్ర ప్రపంచం స్థితిగతులు - ముందువెనుకలు

-

ఆ విధంగా సిద్ధులు గానం చేసిన గీతములలో అర్థమును తరచి తరచి యోచిస్తూ జనకమహారాజు ఇక ఇంటిముఖం పట్టాడు. కొంతయోచన తరువాత ఆతనియందు ఒక భీరువు వలె విషాదం ఏర్పడింది. క్రమంగా అంతఃపురం జేరాడు. పరివారమునంతటినీ వారి వారి స్థానములకు పంపివేశాడు. కోట యొక్క ఒక ప్రసాదభాగం అధిరోహించాడు. ఒకచోట ఒంటరిగా అటూఇటూ పచార్లు చేస్తూ అతి చంచలముతో కూడినట్టి ఈ విచిత్రమైన ప్రాపంచిక గతుల గురించి తీవ్రమైన పరిశీలన చేయసాగాడు.

జనక మహారాజు (స్వగతంగా) : అంతులేకుండా ఆశలు...! అల్పమైన జీవితకాలం...! ఆహా! ఎంతటి భేదకరమైన విషయం! ఏమి విపత్తు వచ్చిపడింది! ఈ జన్మమృత్యుజరాభయాదులలో ఎప్పుడో ఎందుకో చిక్కుకున్నాను. ఇంకేమున్నది? మిక్కిలి కష్టప్రదమైన చంచల జీవిత దశలందు బలాత్కారంగా దొర్లించబడుచున్నానే!

ఈ స్వల్ప జీవితాన్ని, రాజ్యాదులను చూచి ఎందుకు అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నేను మురిసిపోతున్నాను? ఈ అనంత కాల వ్యవస్థలో నా జీవితం ఎంత స్వల్పమైనది?

Page:332

అట్టి స్వల్పకాలిక జీవితంలో ఎన్ని స్థితిగతులు!... ఎన్ని ఒడుదుడుకులు...! ఇంతలోనే ధనం, రాజ్యం, జాతి,అధికారం, ప్రతిష్ఠ... మొదలైన మాయా వస్తువుల పట్ల అంతులేనన్ని ఆశలు కల్పించుకొని, ఆ ఆశాపాశముల బంధంలో ఇరుక్కొని ఉన్నానే! విమర్శ- విశ్లేషణ - అవగాహన”లను ఆశ్రయించని నాకు కాలమును దుర్వినియోగ పరుచుకుంటున్నందుకు ధిక్కార మగుగాక!

ఈ రాజ్యము, రాజరికము మొదలైన పైపై పటాటోపాలు మహా అయితే కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఆపై ఇవన్నీ తొలగవలసినదేకదా! నాకున్న బుద్ధి, శక్తి, యుక్తి ఇవన్నీ కూడా వీటిని కొద్దికాలం కలిగి ఉండటానికి మాత్రమే వెచ్చిస్తే, అది ఎంతటి మూర్ఖత్వం! ఎంతమంది ఇతః పూర్వం ఈ రాజ్యం ఏలారు? కాలక్రమేణా ఎంతమంది వచ్చి ఈ మిథిలా నగరం ఏలబోవుచున్నారు. అయ్యో! ఈ తుచ్ఛమైన 'బుద్ధి' నన్ను దుర్గతులు, నీచ భావము, తుచ్ఛమైన ఉపాధులు వైపుగా నడిపిస్తోందేమిటి? ముందు ముందు ప్రాప్తించబోవు దుఃఖముల శమనము కొరకు ఇప్పుడు నేనేమైనా చేస్తున్నానా? అసలు ఈ విషయం గుర్తించి, చింతిస్తున్నానా? లేదు. ఇట్లా అయితే ఇక ఒక కంచరగాడిదకు నాకు తేడా ఏమి ఉంటుంది?

నేను వాస్తవానికి అనాది అయిన, అనంతమైన స్వరూపముగల ఆత్మ చైతన్యమునేకదా! మధ్యలో ఈ అల్పమైన 'జీవితము' అనబడునది నా స్వకీయమైన "శరీరముతో ఏర్పరుకొనిన సంబంధము చేతనే ప్రాప్తించుచున్నది. ఇదంతా అవివేకముయొక్క ప్రభావమే. ఒక చిత్రపటంలోని చంద్రుని చూచి అమాయకబాలుడు, ఈ చంద్రుని చల్లటి అమృతతుల్యమైన కిరణాలు నన్ను ఆహ్లాద పరుస్తున్నాయి” అని చెప్పుకొంటుంటే ఏమనాలి? ఈ దేహమే నేను అని భావించుచు, అనాత్మభూతమగు ఈ దేహాదులను ఆత్మరూపంగా తలచుచు వ్యర్థంగా కాలము గడపివేస్తున్నాను. ఇంతకు మించి నా విషయమై విశేషమేమీ లేనట్లు భ్రమతో కూడిన ధైర్యము కలిగి ఉంటున్నాను. ఏమి మూర్ఖత్వం!

ఎంత కష్టకాలం! -

ప్రపంచరహితేనాహ మింద్రజాలేనజాలినా |

హాకష్టమతిముహ్యామి కేనాస్మిపరిమోహితః (శ్లో 9, సర్గ 9)

ఏ ఐంద్రజాలకుని ఇంద్రజాలముచే పరమమోహితుడనై నేను ఈ 'రాజ్యము, రాజసింహాసనం, బంధువులు, స్వజనులు మొదలైనవాటిచే మోహం పొందుచున్నాను? ఈ ఎదురుగా కళ్ళకు కనబడేవి సత్యమని, నిత్యమని నేను ఎందుకు భావన చేస్తున్నట్లు?

జగత్పదార్థముల భావన - ఈ దృశ్య జగత్తును ఎంతగా పరిశీలించి చూస్తే ఏమి లాభం? ఇందులో సత్యమైన, అపరిచ్ఛిన్నమైన వస్తువంటూ ఏదైనా ఉన్నదా? ఈ ప్రపంచమంతా వెతికి చూచినప్పటికీ అట్టి వస్తువు లేదు కదా! ఈ నా శరీరమే కొంతకాలానికి నేలకూలిపోబోవుచుండగా ఇక ఎదురుగా నిలచియున్న జగత్పదార్థముల విషయం వేరే చెప్పేదేమున్నది? అసత్యము, అనిత్యము అయినవాటిచే నాకు చిత్త విశ్రాంతి ఎట్లా లభిస్తుంది?

Page:333

అజ్ఞానదృష్టికి స్వల్పమైన విషయములు, పదార్థములు మహత్తరమైనవాటివలె అగుపిస్తున్నాయి. తత్ఫలితంగా సత్య వస్తువుయొక్క అనుభవం అత్యంత దూరంగానే ఉండిపోతుంది. నేను ఏ సత్యవస్తువుకై అన్వేషిస్తున్నానో, అది నా మనస్సుకు కూడా సాక్షి అయి, ఈ సర్వమునకు నియామకమై వెలుగుచున్నది.

ఎక్కడికి వెళ్ళాలి? ఏమి చూడాలి? - - ఆ సత్యవస్తువు నాకు ఎంత సమీపంలో ఉన్నదో తరచి చూస్తే ‘ఆ సత్యమే నేను' అని తెలియ వస్తోంది. అట్టి 'నిత్య శుద్ధ అఖండ-అప్రమేయ’ పరమాత్మ యొక్క దర్శనం ఎక్కడికి వెళ్ళితే లభిస్తుంది? అతడు నా హృదయమునందే హృదయమునకు సాక్షీభూతుడై ఉన్నాడు కదా! కనుక ఆతని కొరకు హృదయమునందే వెతకాలిగాని, ఎక్కడో బయట వెతికితే ఏం లాభం? నా దివ్య చైతన్య - స్వభావం నాయందే వెతికి దర్శించాలికాని, మరెక్కడెక్కడో కాదే!

హృదయములోనే ఉంటూ కూడా ఆతడు ఎందుకు లభించుట లేదు? బాహ్య పదార్ధముల పట్ల నిరంతరం ఏర్పడుచున్న ప్రియాప్రియములతో కూడిన భావనయే అందుకు అడ్డగుచున్నది కదా! ...కనుక, సర్వ బాహ్యపదార్థములను త్యజించివేసెదనుగాక! అసలు అపేక్ష ఎందుకు ఉండాలి?

ఈ జీవులలో అనేకులు "మేము భోగములను పొందవలసియున్నది" అను లక్ష్యముతో అల్ప ఆశ్రయములగు ధనార్జన, పంచేద్రియములను సంబంధించిన రాగముతో కూడిన విషయములు - మొదలైన వాటియందు తీవ్రముగా ప్రవృత్తులగుచున్నారు. కాని ఏం లాభం? అవి లభించినా, అవన్నీ క్షణభంగురములే కదా!

నీటిలో ఆవృత్తములు ఎంత కాలం నిలిచి ఉంటాయి? ఇవన్నీ కూడా అంతమాత్రమే! చిటికెలో మాయం అయ్యేవే! ఈ ధనాదులు సంపాదించే కాలంలో, కలిగియుండే కాలంలో కూడా జీవునకు అనేక దుఃఖములను కలుగజేస్తున్నాయి కదా! ఇట్టి తుచ్ఛము, నిస్సారము అయినట్టి పదార్థముల కొరకు ప్రయత్నించుచూ, వర్తమానపు శక్తి యుక్తులనన్నిటినీ నేను ఎందుకు నేలపాలు చేసుకోవాలి?

పరబ్రహ్మం’ అను శబ్దంచే చెప్పబడుచున్న ఆత్మవస్తువు సర్వదా తాను వెలుగుచూ సర్వమునూ వెలిగించుచూ ఉండియే ఉన్నది. అది ఈ నా శరీర ధారణకు ముందే ఉంది. ఇప్పుడు కూడా ఉంది ఈ శరీరం త్యజించబడవచ్చు, అయినప్పటికీ అది అట్లే ఉండి ఉంటోంది. దాని యందు ఏ సమయం లోనూ ఎట్టి మార్పుచేర్పులు ఉండవు. ఆ పరబ్రహ్మము నా కంటే వేరైనది కాదు. బ్రహ్మానంద స్వరూపం, ఏకైక సత్యం అదియే. అట్టి ఆత్మ వస్తువును ఎఱుగుట కొరకు, అట్టి ఎఱుక 'అనుభవం'గా పరిణమించుటకు ఈ వర్తమానపు శక్తియుక్తులను నేను ఎందుకు వినియోగించ రాదు? ఏ విషయసుఖాలైతే, ఉపేక్షించినంత మాత్రం చేత నిత్య సత్యమగు 'ఆత్మ'యే లభిస్తుందో, అట్టి 'ఆత్మ స్వభావం’ను వదలి.... గడ్డిపరకల వంటి విషయ సుఖాల కొరకు, ఈ రాజ్యం, అధికారం మొదలైన తుచ్ఛ వ్యవహారాల కొరకు నేను ఎందుకు అఱ్ఱులు చాచాలి? ఎవరి కొరకు అపేక్షించాలి? అవి ఉంటే ఉండనీ, లేదా తొలగనీ! అందులో ఏం విశేషం ఉన్నది? ఈ రాజ్యాదులు ఎదురుగా ఏర్పడి ఉన్నంత మాత్రం చేత అవి నావి అవుతాయా? అవన్నీ బాహ్యమైనవే కదా! నాది విదేహరాజ్యం.

Page:334

‘నాది' అనతగినదిక్కడ ఏమి ఉన్నది - ప్రతిక్షణం, ప్రతిరోజు, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం వస్తోంది, పోతోంది. “అనేక సుఖాలు పొందవలెనను లక్ష్యంతో ఆయా ప్రయత్నాలన్నీ నిర్వర్తించటం” - అనునదంతా చివరకు దుఃఖరూపముగానే పరిణమిస్తోంది. అసలు ఈ ప్రపంచంలో వినాశనం కానిదంటూ ఎక్కడా ఏదీ లేనేలేదు. అతి త్వరలో కాలగర్భంలో కలిసిపోయే ఏ వస్తువునైనా 'ఉత్తమ వస్తువు' అని అనటం ఎట్లా?

కాబట్టి 'నేను కలిగియున్నాను' అని ఏదేది నాచే భావించబడుచున్నదో - అట్టి రాజ్యములు, తదితర జనులతోటి సంబంధ బాంధవ్యములు, ఈ శరీరాదులు ... ఇవన్నీ భ్రమ కారణంగానే అట్లు భావించబడుచున్నాయి.

అనంతమగు మహాకాల దృష్టిచే, లేక... తత్త్వదృష్టిచే చూచినప్పుడు 'ఇంద్రుడు - బ్రహ్మ' మొదలైన వారి పదములు కూడా అత్యంత స్వల్పమైనవిగాను, కాలముచే నశించిపోయేవి గాను, దుఃఖ ప్రయాసలతో కూడుకొన్నవి గాను తెలిసిపోవుచుండగా ఇక ఈ అత్యంత స్వల్పకాలికమగు ఈ మిథిలా రాజ్య సింహాసనం ఎంతటిది?

ఈ దృశ్య జగత్తును వివేచనాదృష్టితో పరిశీలిస్తూ ఉంటే నాకు ఒక్కటే అనిపిస్తోంది.... జీవులకు నిరంతర చిత్త విశ్రాంతి పొందింపజేయగల పదార్థమేదీ ఇక్కడ లేనేలేదు.

ఈ రోజు సుందర స్త్రీలు, మహారాణులు తమ జడలకు అలంకరించిన సుకుమార సుగంధ పుష్పాలు రేపటికి వాడి, శల్యమై ఒక మూలకు నెట్టివేయబడుచున్నాయి. నేడు ఈ శరీరం అనేక కిరీటాలను, భుజకీర్తులను ధరించి, అనేకులను శాసిస్తూ ఇటూ - అటూ తిరుగుచుండ వచ్చుగాక! ఇదే శరీరం కొద్ది రోజులకు మూల్గుతూ మట్టి యందు కూలబోవుచున్నదే....!

మరి మూర్ఖురాలగు నా చిత్తం ఇదంతా గమనించదేం? ఇది ఆయా తుచ్ఛ విభవము లందు, సంబంధము లందు, జాత్యహంకారము లందు ఎందుకు విశ్వాసం కలిగి ఉండి, రోజులు గడుపుచున్నదో నాకు అర్థం కాదు!

ఆకాశంలో పిల్లగాలులు ఆస్వాదిస్తున్న ఒక పక్షి ఆ ఆకాశాన్ని వదిలి “ఈ అడవిలో నేలపై బియ్యపు గింజలు ఎలా వచ్చిపడ్డాయి?" అనే ఆలోచనే చేయకుండా, నేల వ్రాలి వలలో చిక్కుకుని వేటగాని చేతులలో హింసించబడుచున్నది కదా! ...ఆ పిట్ట వేటగాని బుట్టలోకి త్రోసివేయబడు చున్నట్లు, నా ఈ చిత్తము తుచ్ఛము, నశ్వరము, ప్రమాదకరము అగు విషయ సుఖముల వైపుకే ఆకర్షించబడుతోంది!

ఆశాపాశములు -

అరజ్జురేవబద్ధోలి_హ మపంకో2_స్మికలంకితః | పతితోస్యుపరిస్థోపి హా మమాత్మఙ్ఞతాస్థితిః (శ్లో 16, సర్గ 9)

హాఁ ! హతవిధీ! ఇక్కడ త్రాడువంటిదేమి ఎదురుగా లేకున్నప్పటికీ నేను మాత్రం ఇక్కడి విషయములకు కట్టివేయబడి ఉన్నానే? ఆశాపాశములు వివేచనా శక్తిని కట్టివేసి ఉంచుతున్నాయి.

Page:335

బురద లేకుండానే నేను కళంకితుడనగుచున్నాను. జన్మ జన్మలుగా ఆర్జించిన దుర్వాసనలు, కుసంస్కారములు నన్ను దోషపూరితునిగా చేస్తున్నాయి.

“నీవు ఆత్మవే సుమా”- అని పెద్దలు పలుకుచున్నారు. ఆ వాక్యం విని కూడా ఏం లాభం? సర్వమునకు ఆవల ఉన్నట్టి నేను ఇప్పుడు ఇక్కడ జడత్వముచే కూలబడి ఉన్నాను. నా ఆత్మ యొక్క వాస్తవతత్త్వాన్ని ఇక్కడ అజ్ఞానం, దురాశలు, రాగద్వేషములు, జాతి మొదలైన అహంకారాలు" - కప్పివేస్తున్నాయి. కారుమేఘం సూర్య ప్రకాశాన్ని అచ్ఛాదించునట్లు, నేను స్వతఃగా మహాధీమంతుడును, శుద్ధుడను, అఖండుడను అయినప్పటికీ మోహం వచ్చిపడి నన్నెందుకో ఆవరించి వేస్తోంది.

ఏది నేను? ఏది నాది? -

క ఇ మే మహాభోగాః? క ఇమే మమబాంధవాః?

బాలో భూతమయేనేవ సంకేతేన అహమాకులః ॥

ఈ మహాభోగము లేమి? ఈ నా బంధువులంతా ఎవరు? ఆహా! ఒక బాలుని లాగా వ్యర్థంగా “నేను, నాది” అను కల్పనచే నిష్కారణంగా వ్యాకులపడుచున్నానే? ఈ 'భోగం, ‘దృశ్యం' లందు నేను ఎందుకు స్వయంగా విశ్వాసం కల్పించుకొనుచున్నాను? నా యొక్క తుచ్ఛ విశ్వాసమే నాకు జరా-మరణాల కల్పనను ఆపాదింపజేయుచు, అత్యంత భయదాయకం అగుచున్నదే? ఈ ధన, బాంధవాదులు ఉంటే ఉండనీ, ...లేదా పోతే పోనీ! వీటితో నాకేమిపని? నీటిలో ఏర్పడే ‘బుడగలు’ లాగా ఇవన్నీ మిథ్యా రూపంగానే సంప్రాప్తిస్తున్నాయి. వీటితో సంబంధాలు దర్పణంలోని ప్రతిబింబాల వంటివే కదా!

మనం అనేకమంది చక్రవర్తుల గురించి విన్నాం. వారు మహా భోగములు అనుభవించారు. ఉత్తమగుణ సంపన్నులగు బంధువులను కలిగియున్నారు. .... అవన్నీ ఏమైనాయి? కేవలం నామ మాత్రంగానే మిగిలాయే? ఇప్పటి నాకు సంబంధించిన వస్తువిశేషములన్నీ భవిష్యత్లో అంతే కాబోతున్నాయి. మరి ఈ వర్తమానము నందు నేనెందుకు విశ్వాసం వహించి ఉండాలి? గొప్ప రాజుల విభవాలకు ఏం గతి పట్టింది. అంతే కాదు... ఇతఃపూర్వపు బ్రహ్మదేవునిచే రచించబడిన అనేక బ్రహ్మాండాలన్నీ ఇప్పుడేమైయ్యాయి? మటుమాయమై పోయాయే! అనేక మంది బ్రహ్మలే గతించారు. ఈ బ్రహ్మాండం యొక్క గతి కూడా అంతే కాబోవుచున్నది. ఇక నాకు 'నాది' అనబడు భావం గాని, అపేక్ష కాని ఎందుకు ఉండాలి?

జలం బుద్భుదములను తన యందే లయం చేసుకుంటూ ఉంటుంది. కాలుడు అనబడువాడు లక్షల కొలది ఇంద్రులనే మ్రింగివేశాడు. మరి స్వల్ప విశేషముల యందు విశ్వాసము కలిగి ఉండే నా వంటి మూర్ఖులను చూచి విజ్ఞులు నవ్వుకొనుటలో తప్పేమున్నది?

అనంతకోటి బ్రహ్మదేవులు గతించారు. అనేక సృష్టిపరంపరలు గడిచిపోయాయి. ఎందరో రాజులు కోట్ల సంఖ్యలలో ధూళికణములవలె వినష్టమైపోయారు. ఇక నేనెంత? ఈ రాజ్యమెంత? ఈ నా బంధుజనమెంత? ఈ స్వల్ప ఇంద్రియ సుఖములు ఎంతటివి? ఈనా స్వల్ప జీవితమునందు

Page:336

ఏవేవో పొందాలని ఆశలు కలిగి వుండడం ఎంతటి మూర్ఖత్వం! ఎంతటి నీచమైన స్థితి! ఎంతటి అల్పాశ్రయం!

దేహాత్మ బుద్ధి - - ఈ ప్రపంచమంతా 'సంసారము' అనే రాత్రి యందు పొందబడుచున్న ఒకానొక దుష్టస్వప్నం వంటిది మాత్రమే. 'ఈ నా దేహం, తదితర దేహంలు, పదార్థజాలం' మొదలైన వాటి యందు ఇంతకాలంగా ఎంతో నమ్మికతో వ్యవహరిస్తున్న నాకు ధిక్కారమగు గాక! పుత్రులు, పేరు ప్రతిష్ఠలు మొదలైన కల్పనలన్నీ కూడా వ్యర్థములు, అసత్య స్వరూపాలు కూడా! ఈ ‘అహంకారం’ అనే పేరు గల పిశాచంతో కూడి ఉండాలని నాకు చెప్పినదెవరు? ఇట్లా అజ్ఞాని వలె నేను ఎందుకు ఉంటున్నాను? ఒకవైపు క్షణములు, నిమిషాలు, రోజులు, సంవత్సరాల రూపమున ఉన్న సూక్ష్మ కాలం చేత ఆయువు క్షణక్షణం విచ్చిన్నమైపోతోందే. మరొకవైపు ఏవేవో ఆశలు, ఆర్తులు, అసంతృప్తులు ఇంతకింతకు ప్రవృద్ధమగుచూ ఎదురుగా ఉన్న సమయమంతా ఆక్రమించి వేస్తున్నాయే!.

ఇదంతా చూస్తూ కూడా నేను ఎందుచేత విచారణ చేయుటలేదు?

ఓ ఆశా సమూహములారా! మీరంతా నా ముందు ఎందుకు విజృంభిస్తున్నారో చెప్పండి? కాలం యొక్క గతి ఎట్లున్నదో గమనిస్తున్నారా? ఏమి కాలమహిమ! బ్రహ్మ మొదలైన దిక్పాలకులే వారి వారి ఆసనములలో ప్రతిమలుగా కాలం చేత శాసించబడి ఆటాడింపబడుచున్నారే? మరి ఏమి ఆశించి ఏం లాభం? కాలం యొక్క క్రీడా వ్యసనము కారణముగా క్షీరసాగరంలో ప్రశాంతంగా నిదురించే విష్ణుదేవుడంతటి వాడు కూడా ఆకాశాన రాక్షసులతో యుద్ధంలో పాల్గొనవలసివస్తోంది.

ఈ కాలము మహా రుద్రులను ఎందరినో భక్షించివేసింది. ఓ నా ఆశలారా! అట్టి కాలము నందు మీరు, నేను ఒక లెక్కా? మరి ఇదంతా గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్లు పెత్తనం చెలాయిస్తున్నారేం?

అనురక్తి, విరక్తి - తెల్లవారుతోంది, ప్రొద్దుగ్రుంకుతోంది. ... రోజులు గడిచిపోతున్నాయి. కాని, దోషరహితం, ఆనంద స్వరూపం అయిన వస్తువు లభించిన రోజు ఒక్కటైనా ఉన్నదా? లేదు. చెరువు ఒడ్డున కాకులు, కొంగలు వచ్చి వ్రాలునట్లు ఈ ప్రాణుల యొక్క చిత్తము లందు భోగముల పట్ల ‘ఆశ’ స్ఫురిస్తోంది. వారు ఆ ఆశల వెంటనే పరుగులు తీస్తున్నారు. అంతేకాని ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నించుట లేదు... పొందుట లేదు. మరి ప్రయోజనమేమిటి? అనేక కష్ట సుఖములు వస్తున్నాయి.... పోతున్నాయి.

కష్టాత్కష్టతరంప్రాప్తో దుఃఖాద్దుఃఖతరంగతః |

అద్యాపినవిరక్తోస్మి హాధిఙ్మామధమాశయమ్ ॥ (శ్లో 31, సర్గ 9)

అల్పమైన కష్టం నుండి అధికమైన కష్టం, చిన్న దుఃఖం నుండి పెద్ద దుఃఖం, ఇట్లా దుర్భర అనుభవాలన్నీ వచ్చి పడుతున్నప్పటికీ నాకు ఈ సంసారం పట్ల విరక్తి ఏర్పడటం లేదు. నేను ఎంతటి అధమ చిత్తుడను! ఏ రమణీయ పదార్థాలపై నేను దృఢమైన ప్రతిష్ఠ కలిగి ఉన్నానో అవన్నీ నశించిపోయేవే కదా! ఈ ప్రపంచంలో 'చిరస్థాయి’గా వుండే వస్తువు ఏదైనా ఒక్కటన్నా ఉన్నదా?

Page:337

ఈ సంఘటన-దుర్ఘటనలు, ఈ సంబంధ బాంధవ్యములు, ఈ సుఖదుఃఖములు, ఈ ప్రియ, అప్రియములు, ఈ శరీరపు ఆకర్షణ-వికర్షణలు ... ఇవన్నీ కూడా కొంతకాలం క్రితం లేవు. మరి కొంతకాలం తరువాత ఉండవు. మధ్యలో ఉన్నట్లు తోచుచున్నాయి. ఇవి సత్యము ఎలా అవుతాయి?

వయస్సు’ అనబడేది మధ్య కాలంలో మాత్రమే రమణీయంగా ఉంటోంది. ఈ 'యాగం' మొదలైనవి తదనంతరంగా కొద్దికాలం మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. ఇంద్రియ అనుభవములు విచారణ చేయకపోవుటచేతనే ప్రియంగా ఉంటున్నాయి. ఏది ఏమైతేనేం? ఏవేవి రమణీయముగా ఉంటున్నాయో, అవన్నీ కూడా 'వినాశనము' అను ఒక అగమ్య ప్రదేశము వైపుకు ఎక్కుపెట్టబడి ఉన్నాయి. మరివన్నీ అపవిత్రము కాక ఇంకేమిటి?

మనుజుడు ఏయే పదార్థములయందు తనయొక్క విశ్వాసమును బంధించుకొని ఉంటున్నాడో, ఆయా పదార్థములన్నీ తరచూ దుఃఖమునే కలిగించడం మనం చూస్తూనేవున్నాం.

జీవులు ఎందరో ఈ ప్రపంచంలోకి వస్తున్నారు. ఇక్కడకు వచ్చి ఇక్కడ జడస్వభావమును ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ నాది, నీది అను లోభమును కలిగియుంటున్నారు. అట్టి లోభ స్వభావము యొక్క ఫలితమేమిటి? అధికమైన పాపపు క్రియలతో కూడినది, అధికమైన క్రూరత్వముతో కూడినది, అధికమైన దుఃఖములను జనింపజేసేది అయినట్టి భవిష్యత్ స్థితిని పొందటమే కదా!

మానవ జన్మ ప్రాప్తించింది ఇందుకా? అయ్యో! బాల్యమంతా అజ్ఞానముతో గడిచిపోతోంది. యౌవనమందామా... మన్మధుడు అను వానిచే పచ్చిగా మోసగించబడుతోంది. వార్ధక్యం కుటుంబ చింతలు, ఒడలుచున్న భౌతికదేహములచే బాధింపబడుచున్నది.

ఇక ఈ జీవులు తమను తాము ఎప్పటికి ఎట్లు ఉద్ధరించుకోగలరో? చర్విత చరణంగా జన్మలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ జీవుడు తన యొక్క శాశ్వతత్వమును మాత్రం గమనించ లేకపోతున్నాడు.

నిస్సార సంసారం -

ఆగమాపాయివిరసం దశావైషమ్యదూషితమ్

అసారసారంసంసారం కింతత్పశ్యతిదుర్మతి ॥ (శ్లో 37, సర్గ 9)

ఈ సంసారం అపారమైనది. నిస్సారమైనది. అయినప్పటికీ ఎంతో సారవంతమైనదిగా ఎంచ బడుతోంది. ఇది ఆద్యంతములలో అసద్రూపమైనది(Unreal from the beginning to the end). భోగకాలములో విరసమైనదై ప్రాప్తిస్తోంది (Distasteful at the time of experiencing). దారిద్య్రము, రోగము, వార్ధక్యము, భయము, ఉద్వేగము - మొదలైన వాటిచే పరమదూషితమైనది. అట్టి ఈ నిస్సార సంసారమును దుర్బుద్ధి చేతనే నేను ఆశ్రయిస్తున్నాను. అపరిపక్వమైన అవగాహన చేతనే ఇందు ఏదో పొందవలెనని దేవులాడుచున్నాను.

ఒకడు రాజసూయము, అశ్వమేధము మొదలైన అనేక యాగములను ఎంతో ప్రయాసతో నిర్వర్తించి, చివరకు బ్రహ్మ దేవత్వం పొందుతాడు. కాని మహాకాలము యొక్క సమక్షములో ఆ ఆ

Page:338

బ్రహ్మదేవత్వము కూడా క్షణికమే కదా! ఎక్కడ ఏ గొప్ప విశేషమున్నది? ఆపదలచే పీడించబడని ప్రదేశమంటూ ఈ ముల్లోకములలో ఎక్కడ ఉన్నది? "అనేక సుఖములకు ఆలవాలము, అనేక పుణ్య కార్యముల యొక్క అంతిమ ప్రయోజనము అని చెప్పబడే స్వర్గలోకమే అసురులు చేసే దండయాత్రలచే బాధింపబడుచున్నదే! ఇక భూ, పాతాళాల గురించి వేరే చెప్పేదేముంది?

బాహ్యమే ఈ విధంగా ఉన్నది. ఇక అంతఃకరణం అగు 'చిత్తం' గురించి ఏం చెప్పాలి? ఈ చిత్తము నిండా అనేక శారీరక మానసిక వ్యాధులు, వ్యధలు నిక్షిప్తమై ఉన్నాయి. చెదలు కొయ్యను బాధిస్తున్నట్లు ఎన్నో దురవగాహనలు చిత్తములో తాండవం చేస్తున్నాయి. ఇవన్నీ విచారించబడేది ఎట్లా? ఎప్పటికి?

ఏదో ఆర్తి...! - ఈ ఎదురుగా ఉన్న వర్తమాన జగత్తు విషయానికి వస్తే దీనినెత్తిపై ‘నాశనము’ అనునది అవశ్యం నెలకొనియున్నది. రమణీయమని అనుకొనబడే వస్తువులన్నిటిలో అరమణీయతే దాగి ఉంటోంది కదా! ఇవి సుఖప్రదములు” అని అనుకొనబడేవాటియందు అనేక దుఃఖపరంపరలు వ్యవస్థితములై ఉంటున్నాయి.

మరి నేను దేనిని చూచి 'ఇది నిర్దుఃఖము' అని నిర్ణయించి ఆశ్రయించాలో అర్థమవటం లేదు. ఈ జగత్తు, ఇందలి పదార్థాలు చివరికొచ్చే సరికి దుఃఖములే ప్రయోజనంగా కలిగి ఉండగా, మరి నా మనస్సునందు ఇది పొందాలి..... అది పొందాలి అనే ఆరాటం ఎందుకు?

ఎప్పటికప్పుడు దేనికి దానికే క్షణికం -

జాయన్తోచమ్రియనేచ ప్రాకృతాఃక్షుద్రజంతవః | ధరాతైరేవనీరధ్రా దుర్లభాఃసాధుసాధవః | (శ్లో 42, సర్గ )

ప్రాకృతస్వభావులగు క్షుద్రజీవులు అనేకులు జన్మిస్తున్నారు. చచ్చుచున్నారు. ఇట్టి అనేక జీవులచే ఈ జగత్తు పరిపూర్ణమైయున్నది. కాని, ఉత్తములగు మహాత్ములు అతి దుర్లభంగా ఎక్కడోగాని తారసపడుట లేదు. ఈ విలాసినుల అందమైన కళ్ళు వీరి ప్రేమాధిక్యత మొదలైనవన్నీ క్షణభంగురమే కాబట్టి, వీరిని ఆశ్రయించినవారు నవ్వులపాలు అగుచున్నారు. ఎవరికైతే 'కన్ను తెరిస్తే సృష్టి - కన్ను మూస్తే ప్రళయము' అయి ఉన్నదో, అట్టి జగత్పాలకులే కాలముచే మ్రింగబడుచున్నారు.

ఇక ఈ వర్తమానం, ఇందు ఏర్పడియున్న స్థితిగతులు క్షణికంగాక మరింకేమిటి? సంపదలకంటే ఆపదలే నయమే! ఈ ప్రపంచంలో 'దీర్ఘకాలంగా ఉండేవి, రమణీయము లైనవి' అయిన కొన్ని పదార్థములు ఉన్నాయనే అందాం!...కాని, వాటన్నిటి యొక్క పర్యవసాన మేమిటి? వాటిని ఆర్జించటం, రక్షించుకోవటం, వినియోగించటం - ఇవన్నీ శ్రమతో కూడుకున్నవే కదా! ఓ నా చిత్తమా! అట్టివాటిని ఆశించటంలో ఏం ప్రయోజనం పొందగోరుచున్నావు చెప్పు? ఈ విచిత్రమైన సంపదలన్నీ 'నశించుట' అను స్వభావం తప్పక కలిగియే ఉన్నాయి. కనుక అవి నా దృష్టిలో గొప్ప ఆపదలే అగుచున్నాయి. ఏది ప్రియమో, అది కోల్పోవుచున్నప్పుడు బాధగానే ఉంటుంది కదా! 'కోల్పోవుట' అనేది ఏనాటికైనా తప్పేది కాదు మరి!

Page:339

అందుచేత, ఓ సంపదలారా! మీకన్నా ఆపదలే నయం. ఎందుకంటారా? దారిద్ర్యము, బంధు వినాశనము" మొదలైన ఆపదలు సాధువులను దర్శించుట, తీర్థ యాత్రలను సేవించుట, వ్రతాలు, పూజలు ఆచరించుట మొదలైన వాటియందు నన్ను నియోగిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు వివేక, వైరాగ్యాల వైపుగా నన్ను నడిపిస్తున్నాయి. అందుచేత, నేను సంపదల కంటే ఆపదలే ఉత్తమ మైనవిగా అభిప్రాయబడుచున్నాను.

వ్యర్థ కల్పనలు - సముద్రజలంలో ప్రతిబింబించే చంద్రుడు నిజచంద్రుడు కాకపోయినప్పటికీ ఉపరితలపు నీటియొక్క కదలిక చంద్రుని కదలిక అని అనిపిస్తూ భ్రమింపజేస్తుంది కదా! ఈ ‘జగత్తు' అనునది మనస్సు యొక్క వివర్తము మాత్రమే. పైగా, ఇది క్షణభంగురం. అట్టి ఈ జగత్తు లోనికి 'నేను' 'నాది' అనబడునవి ఎక్కడినుండో వచ్చిపడుచున్నాయి. అట్టి వ్యవహారసరళి అంతా నిరర్థకమే అయి ఉన్నది. భోగములు పొందవలెను' - అను ఆశతో కూడిన ఈ మనస్సు కాకతాళీయ న్యాయముచే జగత్ స్థితిని పొందుచున్నది. ముందుగా మనస్సు, ఫలితంగా ఈ జగత్తు. ఇది కావాలి, ఇది తొలగాలి" - - అను కల్పనలను వ్యర్థంగా చేస్తోంది. ఫలితంగా, ఈ 'జగత్తు' అనబడేదంతా నా చుట్టూ అలుముకోనారంభిస్తోంది.

ఈ సాంసారిక దశలన్నీ దేశ కాల వస్తువులచే పరిమితము, సంకుచితము, నిరోధము పొంది ఉంటున్నాయి. ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక తాపములచే సంతప్తమై ఉంటున్నాయి. అగ్ని శిఖ వంటి ఈ సాంసారిక దశలందు ఒక దోమవలె నేను ఎందుకు అనురక్తుడనై ఉంటున్నానో.... ఎంత తరచినా కూడా అర్థమగుటలేదు.

ఇక్కడ ఆవేశపూరితమైన అనురక్తి కలిగిఉండటం ఎంతటి ప్రమాదం. ఇంతకన్నా అగ్ని యందు భస్మం అవటం మేలు. లేక, రౌరవాది నరకములలో దొర్లటం మంచిది. అంతే గాని, సుఖదుఃఖ రూపములగు ఈ సాంసారిక దశలను ఏవేవో కల్పనలు చేసుకుంటూ ప్రవర్తించటం మాత్రం ఉచితం కాదు. ఈ సంసారమే సర్వ దుఃఖములకు మూలస్థానం. దీని యందు పడిన జీవులకు ఇక సుఖమెక్కడిది? అల్పమైన దుఃఖమును అధికమైన దుఃఖ సంఘటనతో పోల్చుకొనుచూ, ‘ఇది సుఖరూపము’ అను భావన మాత్రమే ఇక్కడ సుఖముగా చెప్పబడుచున్నది. ముందు ముందు దుఃఖముగా పరిణమించగలదు" అని తెలిసి కూడా ఈ జీవుడు కొన్నిటిని సుఖప్రదములుగా గాంచుచున్నాడు. ఇంకేమని చెప్పాలి?

మనస్సును రహితం చేసేది ఎట్లా - ఆహా! నేను కూడా అధముడనై, కట్టె, రాయి వలె మూగ వాడినై, అజ్ఞానినై ఇంతకాలం విచారణాహీనుడుగానే ఉండిపోయానే? ఈ విశాల సంసార వృక్షానికి మూలం మనస్సే కదా! 'సంసారము' అనబడే వ్యవహారం అసంఖ్యాకములగు సంకల్పములతో బ్రహ్మాండములతో, విరాట్ పురుషులతో, సుఖదుఃఖ ఫలములతో, రాగ, లోభాలతో కూడియున్నది. ఇంతటి వ్యవహారములు రుచిచూస్తూవున్న చిత్రకారుడు ఎవరు? మనస్సే కదా!

Page:340

ఈ మనస్సు యొక్క రూపమేమిటి? - - మననముచేయు స్వభావమే మనస్సు. మననమే సంకల్పము కూడా! అట్టి సంకల్పము ఉపశమించిందా.... సంసారమే ఉపశమించగలదు. సంకల్పించ కుండుట అనునది అభ్యసించామా ... అప్పుడు ఈ సంసార వృక్షము నీరు లేని చెట్టు లాగే శోషించిపోతోంది.

అవిచారణ’ అను అశ్రద్ధచే ఏర్పడిన ఆశించుట, ప్రియముగా భావించుట, లాభము, అసూయ, ఇంద్రియ విషయ లోలత్వము" మొదలైనవి ఈ సంసార వృక్షమును మరల చిగురింప చేస్తున్నాయి. వివేకముతో కూడిన అవగాహన, అమనస్కముతో కూడిన అభ్యాసము ఈ ఇద్దరూ అంగరక్షకులై, ఈ జీవుని 'సంసారము' అను ప్రమాదము నుండి కాపాడగలరు.

ఈ సంసార వృత్తులు పైకి మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. 'మనస్సు' అనే వానరం యొక్క ఉనికిచేతనే చపలత్వము పొందుచున్నాయి. ఇందలి పదార్థజాలమంతా నాశవంతమైనదే.

ఇట్టి సంసారవృత్తులలో నేనెందుకు పడి కొట్టుకోవాలి? అనేక ఆశాపాశములతో కూడి, ఉచ్ఛ, నీచ స్థితులతో కూడినదై మహా దుఃఖప్రదములైన ఈ సంసార వృత్తులలో నేను ఎంతకాలంగా, ఎంతగా రమించానో! ...అదంతా గతం మాత్రమే. హా! చచ్చాను! చంపుతున్నాయి! ఇక గతేమిటి! నేను పాపిని! దుఃఖితుడను! బలహీనుడను!” అనుకొనే రోజులు గతించిపోయాయి.

గతం గతః! ఇప్పుడు నేను 'పరితాపము' అను స్వభావమును తొలగించుకొంటున్నాను. ఇక విశ్రాంతి పొందెదను గాక! ఇప్పుడిక ఎటువంటి సాంసారిక వస్తువుల గురించిగాని, వ్యక్తుల గురించి గాని, సంబంధముల గురించి గాని, సంఘటనల గురించిగాని నేను దుఃఖించవలసిన పనియే లేదు.

నేను ఎందుకు దేని గురించి వేసట చెందాలి? చాలు... నేను ఇప్పుడు ప్రబుద్ధుడనైనాను, ప్రసన్నుడనైనాను. నా పారమార్థిక ధనము'ను దొంగిలించుచున్న దొంగను కనిపెట్టాను. ఆ దొంగ ఎవ్వరో కాదు... నా మనస్సే! అతను దొంగయే కాదు, ప్రమాదకరమైన శత్రువు కూడా. అతనిచేత నేను చాలా కాలంగా మోసగించబడుచున్నాను. పీడించబడుచున్నాను.

సరే... ఇక నేనే ఆ మనస్సును పీడించటం ప్రారంభిస్తాను. ఇంతకాలం ఈ మనస్సును పరిశీలించ లేదు, సరియైన చికిత్సను ఆశ్రయించ లేదు. ఇప్పుడు "ఉత్తమ కార్యాచరణము, శాస్త్రోక్తమైన అభ్యాసము, గురువులు చూపు లక్ష్యమువైపు దృష్టి సారించటం" మొదలగు శుభ ప్రయత్నములు ఈ మనస్సును ఉద్ధరించవలసిందే!

ఈ మనస్సు వివేక ప్రభావముచే అనాది యగు 'బ్రహ్మతత్వము'నందు ప్రతిష్ఠింపబడుగాక! అట్టి బ్రహ్మజ్ఞానానుభవమునందు ఇది ప్రశమనము పొందుగాక.

వివేకోదయం - ఆ సిద్ధుల వాక్యములు వినుచుండగా నాయందు 'అజ్ఞానము'ను పరిశీలించ గల సత్యదృష్టి బలపడుచున్నది. వారి ఉపదేశములు నన్ను మహా బలవంతునిగా తీర్చిదిద్దుచున్నాయి.

Page:341

ఇక నేను నిరతి శయానందమునకు సాధనము అని చెప్పబడుచున్న 'పరబ్రహ్మము’ను శరణు వేడుటకు ఉపక్రమిస్తున్నాను.

ఇప్పటి నుండి ఆత్మస్థితుడనై వుంటాను. తదితర వ్యసనములన్నీ త్యజించి వేస్తాను. ఏకాంతముగా, సుఖముగా ఉంటాను. "ఈ దేహమే నేను, ఈ రాజ్యాదులు నావి" మొదలైన అసత్య స్ఫురణలను పారద్రోలివేస్తాను. ఇక్కడి సుఖము నాది కాదు. దుఃఖము నాదికాదు. ఈ రెండింటినీ చూపిస్తూ భ్రమింపజేసే మనస్సు కూడా నాదికాదు. ఈ విధంగా ఈ 'మనస్సు’ అనే శత్రువును వధించి వివేకము ద్వారా సప్తమ భూమికారూపమైనట్టి 'పరమ శాంత స్థితి'ని పొందుతాను.

అట్టి త్రోవను చూపించగల ఓ వివేకమా! నీకు నమస్కారం! రమ్ము. మనం ఈ జన్మకర్మల మనోజాడ్యమును తొలగించివేద్దాం. నీవు నాకు సేనానాయకుడివై తోడుగా ఉంటేనే నేనీ సంసార జాడ్యముపై యుద్ధం ప్రకటించి, జయించగలుగుతాను.

3. సునిశ్చయం

ఆ విధంగా జనక మహారాజు కోటలో ఒక ఏకాంత ప్రదేశంలో చింతన చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆంతరంగికుడైన ఒక ద్వారపాలకుడు రాజును సమీపించి ఇలా విన్నవించసాగాడుఆంతరంగికుడు : హే మహారాజా! తమకు సదా సర్వదా దిగ్విజయమగు గాక! ఇప్పటికే కాలాతీత మైనది. అదిగో బ్రాహ్మీముహూర్తం ప్రారంభం కానున్నది. నేటి ఉదయానికి మీ కొరకై ఎన్నో ముఖ్య రాచకార్యములు వేచి ఉన్నాయి. లేచి, మంగళస్నానం కొరకు సిద్ధంకండి. వేదపారాయణులగు బ్రాహ్మణులు కొద్దిసేపటి క్రితమే వచ్చి 'అఘమర్షణం జపిస్తున్నారు. వారంతా తమ వేదోచ్ఛరణలతోను, వేదార్థ ప్రసంగములతోను మిమ్ములను మెప్పించి, మీ వద్ద దక్షిణతాంబూలములు స్వీకరించ వేడుక కలిగియున్నారు. మీ సంధ్యావందనాది కార్యక్రమముల కొరకు అంతా సిద్ధం చేయబడి ఉంది. మీ వంటి మహనీయులు తమ కార్యక్రమముల విషయంలో నియమమును అతిక్రమించి వర్తించరు కదా! నా ఈ అధికప్రసంగమునకు క్షమార్హుడను. తమ ఆజ్ఞావాక్యములకై వేచియున్నాను.

ద్వారపాలకుడు చెప్పుచున్న విషయములను గంభీరంగా వింటూనే, ప్రశాంత, మౌన చిత్తుడగు ఆ మహారాజు విచిత్ర జగతితి గురించి ఇట్లు పర్యాలోచించసాగాడు......! జనకమహారాజు (తన అంతరంగమున) : ఈ రాజ్యమేమిటి? ఈ సుఖమేమిటి? క్షణభంగురమైన రాజ్యసుఖములతో నాకిప్పుడు కొంచెమైనా ప్రయోజనం లేదుకదా! 'మృగతృష్ణ' అంటే ఏమిటో తెలిసిన తరువాత అట్టి మృగతృష్ణలో నీరు త్రాగి దాహం తీర్చుకోవటానికి మూర్ఖుడు మాత్రమే పరుగులు తీస్తాడు. కనుక నేను 'మిథ్య' యగు ఈ సంసారమంతా పరిత్యజించివేస్తాను. 'శాంత సముద్రం’లాగా ఏకాంతమును ఆశ్రయించి ఉంటాను. అసద్రూపములైన ఈ భోగములతో నా కేమిటి పని?

Page:342

సర్వ కర్మలను త్యజించి కేవలం బ్రహ్మమును శరణువేడి సుఖశాంతి సమన్వితుడనౌతాను. ఓ చిత్తమా! కొంచెం నా మాట విను. ఈ "జన్మ, జరా, మరణ, జడత్వ" రూపమగు సాంసారిక అల్ప అనుభవము అనే బంధం మనం తొలగించుకోవాలి సుమా! మనకు సంబంధించినది అసంబంధితమైన దాని నుండి వేరు చేసి అవగాహనతో దర్శించాలి. ఉపశమనం కొరకు ప్రయత్నిద్దాం. విషయ సుఖ లేశములను ఆస్వాదించుటలో అత్యంత చాతుర్యంగల నీ అభ్యాసమును త్యజించు. భ్రాంతి చేత మాత్రమే నీవు ఈ ప్రాపంచిక స్థితులందు సుఖమును అవలోకిస్తున్నావు. కాని, అవన్నీ అత్యంత స్వల్ప సుఖములు మాత్రమే. వాటి వలన ఏర్పడే దుఃఖము మాత్రం అపారం.

ఓ ప్రియాచిత్తమా! శక్తియుక్తులు ఉన్న కాలమంతా భోగాశక్తియందు నిమగ్నమగుచున్నావు. భోగించు శక్తి క్షీణించినప్పుడు అశక్తురాలవై అల్పత్వమును అనుభవించుచున్నావు. నిజం చెప్పు... ఇంతవరకూ నీకు నిజమైన తృప్తి అంటూ ఎప్పుడైనా లభించిందా? ప్రయోజనము లేని శ్రమ ఎందుకో చెప్పు?

బ్రహ్మమును విచారించుటచేతమాత్రమే అకృత్రిమమగు తృప్తి లభిస్తోంది. అందుచేత నీవు సద్వస్తువు వైపు మరలుటయే ఉచితం.”

ఆ మహారాజు ఇట్లు విచారణ చేస్తూ ఉండగా ఆతని చపలచిత్తము శమించింది. ఆయన ఒక చిత్రములోని పురుషుని వలె మౌనస్థుడయ్యారు. ఆంతరంగిక ద్వారపాలకుడు రాజు యొక్క స్వభావౌన్నత్యమేమిటో కొంతవరకు ఎరిగినవాడే. అందుచేత భయ, గౌరవాదులతో ఏమీ మాట్లాడ కుండా, నిలుచునియున్నాడు. ఆ తరువాత జనకమహారాజు ఒక్క క్షణంలో సర్వమును తూష్ఠీభావంతో త్యజించినవాడయ్యారు. శాంతచిత్తుడై ప్రాణికోట్ల జీవన విధానమును తలచుకొంటూ ఇట్లు మరల చింతనచేయసాగాడు.

నేను ఆత్మను కాని దెప్పుడు? - ఈ ప్రపంచంలో గ్రహించదగ్గ వస్తువేది? దేనిని నేను ప్రయత్నించి సాధించాలి? ఇక్కడ నాశరహితము, ఉత్తమము, ఆనందకరము, దోషరహితము' అయిన ఏదైనా పదార్థము ఉంటేకదా, అందుకు విశ్వాసముతో ప్రయత్నించగలిగేది? అట్టి పదార్థము లేనప్పుడు నేను ఈ ఎదురుగా కనబడే వస్తువులచే ఎందుకు బంధించబడాలి? ఆకర్షించబడాలి? వికర్షించ

బడాలి?

ఆయా క్రియాదులందు తత్పరుడనై ఉండుటచేతగాని, లేక నిష్క్రియత్వముచే గాని నాకు ఏం ప్రయోజనం? ఎందుకంటే ఉత్పన్నమైన ప్రతి వస్తువు నశించిపోవుచున్నది. ఈ శరీరమే తీసుకుందాం. ఇది అసద్రూపంగానే ఆవిర్భవించింది. ఇక ఇది ఉండుట చేత గాని, లేక, లేకుండకపోవుట చేత గాని నేను పొందే మార్పు - చేర్పులు ఏమి ఉంటాయి?

నేను క్రియలందు ఆసక్తుడనై ఉండవచ్చు, లేదా క్రియారహితుడనై ఉండవచ్చు. అట్టి ఉభయ అవస్థలలోకూడా సమరూపముగా స్థితి పొందియున్నట్టి పరిశుద్ధ చైతన్య స్వరూపుడనే నేను. ఈ వర్తమాన క్షణంలో కనబడుచున్న శరీరము వంటి అనేక శరీరములు రావచ్చుగాక! పోవచ్చుగాక!

Page:343

అవేవీ కూడా నేను కాదు. నాకు సంబంధించినవి కూడా కాదు. నేను వాటికి సంబంధించినవాడను కూడా కాదు. వాటికి అతీతమై, కాని, వాటి ఉనికికి కారణమగుచున్న శాశ్వతతత్వము, అనిర్దేశము, అప్రమేయమునై ఉన్నాను. ఎందుకంటే చైతన్యం చైతన్యంగానే ఉంటుందికాని అది జడం' అవుతుందా? లేదు. 'శుద్ధ చైతన్యమే’ అయి ఉన్న నాకు ఈ శరీరాదులచే కలిగే హాని ఏమి? వృద్ధి ఏమి? నాభివాంఛామ్యసంప్రాప్తం సంప్రాప్తంనత్యజామ్యహమ్ | స్వస్థఆత్మనితిష్ఠామి యన్మమాస్తితదస్తుమే ॥ (శ్లో 24, సర్గ 10)

కాబట్టి నేను ప్రాప్తించని దానిగురించి కోరవలసిన పనిలేదు. ప్రాప్తించిన దానిని వదలవలసిన పనికూడా లేదు. అందుకని, సర్వదా స్వస్థరూపమున ఆత్మయందే నెలకొని ఉంటాను.

అసలు ఆత్మ నన్ను విడచి వెళ్ళినది ఎప్పుడు? అది సర్వదా నాయందే నిరతిశయానంద రూపంలో సాక్షిస్వభావంతో, నా కన్నా వేరు కానట్టిదై వేంచేసియే ఉన్న -అదే నేను. నేను అఖండం, అప్రమేయం, అద్వితీయం, నిత్యోదితం, నిత్యనిర్మలం, జగదతీతం, జగదాత్మకం అగు ఆత్మస్వరూపుడనే!

ఏ ఆత్మ స్వరూపము నాదై ఉన్నదో, అది నేను సర్వదశలందు సర్వదా కలిగియే ఉన్నాను. ఇక భ్రమ ఎందుకు? క్రొత్తగా పొందవలసినది ఏమి ఉంటుంది?

నా యొక్క అజ్ఞానకాలంలో కూడా నేను అఖండం, శుద్ధం, నిత్యం, నిర్మలం, సర్వం అయిన ఆత్మనే అయి ఉన్నాను. 'ఆత్మ' అనబడునది నా కంటే వేరుగా లేనేలేదు. నేను దానికి వేరుగా లేను. కార్యాకార్యములు -

నమమేహకృతేనాల్డో నాకృతేనేహకశ్చన |

క్రియయా2_ క్రియయావాపి యత్ప్రప్తంతదసన్మయమ్ (శ్లో 25, సర్గ 10)

ఆయా కార్యాలు చేయుట చేత గాని, లేక చేయకుండుట చేత గాని నాకిక ఎట్టి ప్రయోజనమూ లేనేలేదు. క్రియాక్రియలచే ప్రాప్తించినదంతా 'మిథ్యా రూపములే' అయి ఉన్నాయి. నేను అది పొందలేకపోయానే? ఎలా పొందాలి?"... అనే ఉద్వేగం గాని, చంచలం గాని నే నెందుకు, ఎవరి నిర్ణయం ప్రకారం పొందాలి? శాస్త్రములచే చెప్పబడినవి, లౌకికంగా నిర్ణయించ బడుచున్నవి అనేక కార్యక్రమములు నా సమ్ముఖమునకు వచ్చుచున్నాయి. మంచిదే. వాస్తవానికి వాటి నుండి నేను కర్తగా పొందవలసినది గాని, పొందదగినవి గాని లేవు. అయినప్పటికీ క్రమానుసారం ప్రాప్తించే ఆయా క్రియలు నా ఈ చేతులు, కాళ్ళచే నిర్వర్తించబడు గాక! ఎందుకంటే చేష్టారహితుడనైతే ఈ శరీరం శుష్కిస్తుంది కదా! దీనిని నేనుగా ఎందుకు శుష్కింపజేయాలి?

ఆసక్తిరాహిత్యం - ఆసక్తి రహితుడనై సమరూపమున నెలకొని ఉంటాను. ఇకప్పుడు అట్టి సమరసభావనను భావించు భావనారాయణుడగుచుండగా... ఈ దేహము యొక్క ఉత్పన్నమునకు కారణమగుచున్న క్రియ, అక్రియలు, ఆ క్రియాక్రియల ఫలితములగు పుణ్య పాపములు, పుణ్య పాపములకు స్థానభూతమైన ప్రారబ్ధములు... ఇవన్నీ 'లేనివే అవుతాయి. సర్వప్రయోజనములు

Page:344

నన్ను తాకకుండా నాకు వేరై ఉంటాయి. నేను ఆయా స్థితులందు జ్ఞాన మహిమచే నిర్లిప్తుడనై ఉంటాను. అదియే నా నిర్వికల్పసమాధి!

చైతన్యమే అయినట్టి నాకు 'సశరీరము, అశరీరము' అనబడు వ్యక్తావ్యక్తములచే ప్రయోజనము గాని, హాని గాని ఏముంటుంది? నేను ఆసక్తిరహితుడనవటమే నా సర్వ ప్రయత్నముల ప్రయోజనం. ఆపై ఏది ఎట్లా ఉంటే ఏం? ఏది ఎట్లా ఉండకపోతే ఏం?

"కర్మ" అనుదాని యందు రెండు తత్త్వాలు ఇమిడి ఉన్నాయి1. కర్తృత్వము (I am the doer); 2. భోక్తృత్వము (I am the enjoyer of fruits of action).

ఈ రెండూకూడా మనస్సుచే కల్పించబడినవి మాత్రమే. ఈ రెండు ఉపశమించటం జరిగిందా, ఇక సర్వకార్యములు కూడా “నాచే చేయబడనివే” అవుతాయి. ఈ కర్తృత్వము, భోక్తృత్వము విషయములలో మనుజుడు తన అంతఃకరణంలో ఎటువంటి నిశ్చయం రూఢిగా కలిగి ఉంటాడో ఆతడు ఈ దేహము, భావము మొదలైనవన్నీ ఆ తీరుగానే పొందుతూ ఉంటాడు.

ఆత్మనిశ్చయము- నేను ఈ శరీరముతో పుట్టలేదు. దీనితో నశించువాడను కాను. నేను దేనికీ కర్తను కాను. భోక్తను కాను. ఎందుకంటే ఇవన్నీ స్వతఃసిద్ధమగు నిర్ణయము కలిగిలేవు. కనుక జడమై ఉన్నాయి.

నేను 'జ్ఞానము యొక్క ముందు, వెనుకల కూడా ఉన్నట్టి జ్ఞేయమే స్వరూపముగా కలవాడను. శుద్ధ చైతన్యమే అయి ఉన్న నాకు కర్తృత్వము లేదు. భోక్తృత్వము కూడా లేదు. ఈ కర్తృత్వ, భోక్తృత్వములు దృశ్యమునకు సంబంధించినవి మాత్రమే. ఇక నేనో... అనుభవమే స్వరూపముగా గల జ్ఞాన (knower) తత్త్వమును.



అమ్మయ్య! ఇప్పుడు నా బుద్ధి "కర్తృత్వము, భోక్తృత్వము అనే జాడ్యమును దూరీకరించినదై శుభ్రము చేయబడిన దర్పణము వలె ప్రకాశిస్తోంది. ఒక గొప్ప వ్యాధి నుండి నివారణ పొందినదై ఆత్మ పదము' అనబడు దానియందు దృఢనిశ్చయము సంతరించుకుంటోంది.

ఇప్పటివరకు నాకు ఏర్పడి ఉండిన ఇష్ట అనిష్టముల ప్రాప్తికి కారణం ఎవరు? మరెవ్వరూ కాదు... నా అవిచారణయే! నా అధీరత్వమే! నా అల్పమైన ఎరుకయే! అట్టి అధీరత్వమును నేను ఈ క్షణమే త్యజించివేస్తున్నాను.

4. చిత్తమును శాసించటం

ఆ జనకమహారాజు తన అంతరంగంలో ఈ విధమైన చింతన చేస్తూ మౌనం వహించి ఉన్నాడు. “ఆ సూర్య భగవానుడు కాంతిని ప్రసాదించుట, (కిరణజన్య సంయోగముచే) వృక్షములు, పశువులు, మనుష్యులు మొదలైన వాటిని జీవింపజేయుట, తటాక జలమును ఎండింప జేయుట

Page:345

మొదలైన క్రియలను మౌనముగా నిర్లిప్తముగా, అసంగముగా నిర్వర్తిస్తున్నాడు కదా! నేను కూడా ఆయా ప్రాప్తించిన క్రియలను నిర్వర్తించెదను గాక అను స్వకీయమైన సునిశ్చయమును పొందాడు. గాంభీర్యము, ప్రశాంతత, ఆనందము ఆయన ముఖము నందు తొనికిసలాడాయి. అప్పుడు ప్రక్కనే నిలచియున్న ద్వారపాలకుని వైపు దృష్టి సారించారు.

జనకుడు : ఓయీ! ద్వారపాలకా! నీ "విద్యుక్త ధర్మ నిర్వహణ నాకు సంతోషం కలుగజేస్తోంది. నేడు నిర్ణీతమైన రాజకార్యములకు అంతా సిద్ధం చేయించండి. దేవ, బ్రాహ్మణులు యథారీతిగా పూజించెదము గాక!

ఆ రోజు పగలంతా సభాకార్యక్రమములు, న్యాయనిర్ణయ కార్యక్రమములు, విద్యావినోదములు యథారీతిగా జరిగాయి. ఆ రాత్రి చాలాసేపు రాజు ఏకాంతంలో ధ్యానమగ్నుడై గడిపాడు. కాని, చిత్తము పరిపరివిధాలుగా పోతూనే ఉండటం గమనించాడు. అరె! ఈ మనస్సు ఈ విధముగా అనేకత్వమును, దుష్టత్వమును, విషాదత్వమును, బలహీనత్వమును మాత్రమే ఆశ్రయిస్తోందేమిటి? ఇంత విన్నాను... ఇంత విచారణ చేశాను... కాని ఏం లాభం?" అని ఆశ్చర్యపోయాడు.

జనక మహారాజు :చిత్తము' అను పేరుగల మిత్రమా! నీతో ఈ సమయంలో కొన్ని విషయాలు ముచ్చటించాలని ఉన్నది. ఇటు వచ్చి నాకు ఎదురుగా కూర్చో...!

ఓ ప్రియ చిత్తమా! ఈ చపల సంసారము ఆత్మకు నిజమైన సుఖము ప్రసాదించగలుగుచున్నదా చెప్పు? కనుక నీవు శాంతమును పొందుము. శాంతముచే మాత్రమే ఉత్తమ ఆత్మసుఖము లభించగలదు.

చిత్తము : ఔనూ... ఈ సంసారము అనబడేది ఎక్కడి నుండి వచ్చిపడింది?

జనకుడు : చెపుతాను, విను! నీవు ఏ విధంగా సంకల్పములు చేస్తూన్నావో, ఆ విధంగానే... ఆయా రూపముననే ఈ సంసారము విశాలత్వము చెందుతోంది. ఒకడు ఒక విత్తును తెచ్చి, దానిని మహావృక్షముగా పెంచి పోషించిన తరువాత "అయ్యో! ఈ విశాల శాఖలుగల మహావృక్షము ఎక్కడి నుండి దాపురించింది. దీని వలన ఇంటిగోడలు పగులుచున్నాయి; పురుగులు, ముళ్ళు, చెత్తచెదను ఆవరిస్తున్నాయి” అని వగచునట్లు నీవు కూడా ఈ సంసారము గురించి వగచుచున్నావు. చిత్తము : నేను పొందుచున్న ఈ వ్యధలకు కారణమేమిటి?

జనకుడు : ఓ దుష్టచిత్తమా! నీయందు భోగముల పట్ల ఇచ్ఛ ఉన్నది. అదియే సకల దుస్థితులకు కారణమగుచున్నది. ఫలితంగా శారీరక మానసిక వ్యాధులు నిన్ను వదలి పెట్టకున్నాయి.

విషయ చింతన, విషయములు - ఈ ఇంద్రియములకు సంబంధించిన శబ్ద-స్పర్శ-రూపరస-గంధానుభవములు చేతనే జనన మరణ రూపమగు ఈ సంసారమంతా ఆవిర్భవిస్తోంది. కనుక ఈ ఇంద్రియ విషయముల పట్ల, దృశ్యవస్తువుల తోటి సంబంధ బాంధవ్యముల పట్ల ఏర్పడు 'చింతన' లేక 'మననము'ను త్యజించు. అప్పుడు శాంతి లభించకపోతే నన్నడుగు.

Page:346

ఇక్కడ కొంచెం పరిశీలనగా చూడటం జరిగితే, సారవంతమైనది, దీర్ఘ సుఖమును, లేదా, దుఃఖ మిళితం కాని సుఖమును ఇవ్వగలిగేది ఏమున్నది? మన వద్ద 'బుద్ధి' అను పేరుతో చెప్పబడే విశ్లేషణ శక్తి ఉన్నది. అట్టి బుద్ధితో పరిశీలించి ఏది శ్రేష్ఠమో దానినే స్వీకరించాలి గాని, ఏది అలవాటో దానిని మాత్రమే గ్రహించటం ఉచితం కాదు కదా! కనుక నీవు గ్రుడ్డి'గా ముందుకు అడుగులు వేయవద్దని నా మనవి.

ఓ సాధూ! ప్రియచిత్తమా! ఈ సంసారము అపారమైనది. ఒకదానికి ప్రయోజనంగా మరొకటి ప్రాప్తిస్తూనే ఉంటుంది. "ఇది పొందిన తరువాత నాకింక ఆశించవలసినది ఏదీ ఉండదు అని జీవుడు అనుకుంటూనే, ఏవేవో ఆశిస్తూ ఉంటాడు. సరే... పొందుతాడు, లేక, పొందడు... ఏది ఏమైనా ఆశించటం మాత్రం ఆగదు. అది ఆతడు గమనించుట లేదు. ఆశించినంతకాలం దుఃఖం, శ్రమ, ఉద్వేగం తప్పవు.

కాబట్టి ఉపాయమేమిటి? 'ఆశ' అనుదానిని లేక, 'ఆశించుట' అను స్వభావమును త్యజించటయే ఉపాయం. ఈ దృశ్యమును ఆసక్తిచే గ్రహించనూ వద్దు... ద్వేషముచే త్యజించనూ వద్దు... 'ఆశించకపోవటం' అనుదానిని అభ్యసిస్తూనే ఆత్మకాముడవగుము. సాక్షి రూపమున స్థితి కలిగియుండుము. అటు తరువాత ఏది ఎట్లు ఉచితమో అట్లే ఆచరించుము.

ఏవీ కూడా నిన్ను స్వయముగా స్పృశించుటలేదు. నీవు ఆసక్తితో ఆశించినప్పుడు, ఆశ్రయించి నప్పుడు మాత్రమే అవి నిన్ను లోబరుచుకుంటున్నాయి. తత్ఫలితంగా సుఖదుఃఖములు నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. కనుక ఓ చిత్తమా! నీ దోషములన్నీ నీయొక్క స్వయంకృతములే!

అయినా, ఈ దృశ్యము సత్యమైతే మనకెందుకు? లేక 'మిథ్య' అయితే ఏమున్నది? దీని యొక్క గుణ అగుణములచే మనం ఎందుకు హర్ష విషాదములు పొందాలి?

ప్రియమైన మనస్సు గారూ! ఈ దృశ్యముతో మనకేమీ సంబంధం లేదు. అది నీ యొక్క భావనను అనుసరించి మాత్రమే ఉంటోంది. ఏదైతే స్వయముగా లేదో... అట్టి వస్తువుతో నీకు సంబంధం ఎట్లా పొసుగుతోంది? అని ప్రశ్నిస్తే నాకొక సమాధానం లభిస్తోంది. ఈ మనస్సు కూడా లేని వస్తువే కదా! అసలు నీవే లేవు. మరొక లేని వస్తువగు దృశ్యముతో నీకు సంబంధం... ఆ సంబంధము యొక్క ప్రభావంచే నేను సుఖదుఃఖములు, మానావమానములు, ప్రియా ప్రియములు పొందటమా? ఇదంతా ఎంతటి చమత్కారమైన విషయం!

ఒక గొడ్రాలు ఉన్నది. ఆమె యొక్క రెండవ కుమారుడు ఆకాశంలోని ఒక చదునైన ప్రాంతంలో కొన్ని విత్తులు నాటాడు. అదొక పెద్ద పూదోటగా పరిణమించింది. ఆ పూదోటలో అనేక రకాల పూల తీగలు, మొక్కలు వేరువేరు వరుసలలో కనబడుచున్నాయి. అందులోని రెండవ వరుసలోని మూడవ మొక్కకు పూచే ఆ పెద్ద పువ్వు చూచారా! అది ఎంత అందంగా ఉన్నది?”

ఈ దృశ్య పదార్థములతో ఏర్పడు సంబంధము ఆ పూవుపట్ల ఏర్పడు ప్రియత్వము వంటిది. ఈ పదార్థములు అసద్రూపములే (అసద్రూపము = ఒక వస్తువు కొద్ది క్షణముల క్రితం ఒక

Page:347

రూపంగాను మరికొన్ని క్షణముల తరువాత మరొక రూపంగాను ఉంటోందనుకోండి... అప్పుడు అది వర్తమానంలో 'అసద్రూపం' అని చెప్పబడుతోంది. అయి ఉన్నాయి.

పోనీ ఓ మనసా! “నా న్యత్ కించిదస్తి" (ఆత్మతప్పితే మరింకేదీ లేదు) అను సిద్ధాంతము ప్రకారం నీవు స్వతఃగా ఆత్మవే కదా! 'జగత్తు' అనబడునది అసత్తే అయి ఉన్నది కదా! ఆత్మ యొక్క మననమే మనస్సు. కనుక స్వతఃగా చైతన్యమే అయి ఉన్న మనస్సుకు క్షణకాలికము, భావనామాత్రము, అసత్తు అగు ఈ జగత్తుతో సంబంధం ఉండటమేమిటి? ఎక్కడన్నా చచ్చిన వానికి బ్రతికియున్నవానికి స్పర్శ' మొదలైన సంబంధాలు పొసగుతాయా?

లేదా, “మననము” అను నా స్వభావము (మనస్సు), మననము చేయబడుటచే ఏర్పడియున్న దృశ్యము - ఈ రెండూ - సత్తే అని అనుకుందాం. రెండూ స్థితికలిగియే ఉన్నప్పుడు 'సత్తా' దృష్ట్యా రెండిటిలోను సత్తా అనబడు ఏకత్వము ఉన్నట్లే కదా! ద్రష్ట ఉన్న చోటే దృశ్యముంటుంది. భావకుడు ఉన్న చోటే భావన ఉంటుంది. కనుక ఉభయములు ఒకే తత్త్వం యొక్క రెండు వైపులు.

ఈ అభిప్రాయం మనం ఒప్పుకుంటే 'మనస్సు - దృశ్యము' సర్వదా కలిసియే ఉంటున్నాయి కదా! ఇక సంయోగ వియోగ భావములచే హర్ష విషాదములు ఎక్కడి నుండి వచ్చి పడుచున్నాయి?... కారణం, నీ దగ్గర ఆత్మ విషయమై తగినంత సమాచారం లేకపోవటమే సుమా! మరి సమాచారం కొరకు ప్రయత్నించాలి కదా! అందుకేం చేయాలి? శాస్త్రములను, గురువులను సమీపించి సమాచారం సేకరించాలి. స్వయముగా విచారణ చేయాలి. అంతేగాని "నేను దుఃఖితుడను.... అల్పుడను" అని అనుకుంటూ కూర్చుంటే ఏమిటిలాభం?

కనుక ఓ మనస్సా! ఈ 'సంసారము' అనేది మానసిక వ్యాధి యొక్క రూపమే. ఇది కలుషితమైనది. క్షణక్షణం విక్షేపముతో కూడినట్టిది.

అట్టి ఈ సంసారమును దయచేసి త్యజించు. సమాధిని అభ్యసించు. శాంతరూపమగు ఆత్మ యందు నిలకడ పొందటానికే ఉత్సాహం కలిగియుండు. అంతేగాని స్వయంగా భ్రమను స్వీకరించటం, మోహము మందత్వము కలిగియుండటం నీకు ఉచితమా? ఎందుకు? ఎంతకాలంగా ఈ పదార్థములను ఆశ్రయించుటచే ఏమి ప్రయోజనం చెప్పు?

నతదిహాస్తి సమున్నతముత్తమం వ్రజసియేనపరాం పరిపూర్ణతామ్

తదవలంబ్య బలాదతిధీరతాం జహిహిచంచలతాం శఠరేమనః. (శ్లో 18, సర్గ 12)

ఈ దృశ్యంలో పూర్ణత్వము లేదు. ఇందులో ఏమైనా అనుమానమున్నదా? అందుచేత అభ్యాస, వైరాగ్యములచే ధీరత్వము నవలంబించి చంచలత్వమును విడచివేయవలసినదిగా నిన్ను శాసిస్తున్నాను!

Page:348

5. భూత భవిష్యత్లను జయించడం - - వర్తమానంలో ఏర్పడి ఉండడం శ్రీ వసిష్ఠ మహర్షి : శ్రీరామచంద్రా ! ఆ జనకుడు ఆ విధముగా విచారణ చేస్తూనే యథాప్రాప్తంగా రాచకార్యములు నెరవేరుస్తూ ఉండేవాడు. ధీరత్వముతో కూడిన తన సునిశిత బుద్ధిని ఉపయోగిస్తూ “నేను “నాది అనబడు అహంకార మమకారములను అధిగమించాడు. ఆయనకు విషయముల పట్ల ఏమాత్రం ఉత్సుకత, ఉద్వేగములు ఏర్పడుట లేదు. ఈ ఎదురుగా ఉన్న దృశ్యములు అతడు త్యజించుట లేదు. గ్రహించుట కూడా లేదు. దేని పట్లా ప్రియత్వము గాని, ద్వేష బుద్ధిగాని ఏర్పడ కుండానే వర్తమాన కాలములో ప్రాప్తించుచున్నదానిని శోకరహితుడై నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. అన్ని సమయముల యందు వివేకమును విడుచుట లేదు. అందుచేత 'సమ్యక్ జ్ఞానం' ఏ మాత్రం కళంకితం అగుటలేదు. మేఘాలు లేనట్టి నిర్మలమైన ఆకాశములో సూర్యుడు నిర్విరామంగా ప్రకాశి స్తున్నట్లు అతని హృదయములో నిష్కళంకమగు చిదాత్మత్వము సర్వదా ప్రకాశించసాగింది. ఔను! నేను బ్రహ్మమయుడను. సర్వభూతజాలములందు సదృశ్యమైయున్న ఆత్మ భగవానుడను. అందుచేత నేను సర్వభూతాత్మ కోవిదుడను అగుచున్నాను. సర్వులూ, సర్వమూ నాయందే, నా సర్వ రూపం గానే నిత్యము ఉండి ఉండటం జరుగుతోంది," - అను ఎఱుక, భావన, అనుభవం అతని యందు సుదృఢత్వం పొందాయి.

శ్రీరాముడు : హే మహర్షీ! అట్టి ఆత్మానుభవం పొంది యుండి కూడా క్లిష్టత, స్పర్ధలతో కూడిన లౌకికమగు రాజ్యపాలన నిర్వర్తించగలిగారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ లోక వ్యవహారములన్నీ మాయ చేతనే సంభవిస్తున్నాయి. అయితే అసంగము అయినట్టి ఆత్మ ఏ ఒక్క వ్యవహారముచేతనూ ఏ ఒక్క క్షణములో కూడా స్పృశించబడుటలేదు. ఈ విషయము జనకుడు సుస్పష్టంగా గ్రహించాడు. సమచిత్తుడగు అతడు ఈ రాజ్యాదుల విషయములో ప్రసన్నత్వము పొందుటలేదు. దుఃఖము పొందుట లేదు. సర్వదా 'విముక్తుడు' అగుటచే ఆతడు పూజ్యుడు, జ్ఞానవృద్ధుడు, ఇహపరముల పట్ల నిశ్చలానుభవుడుగా మనఃస్థితి పొందాడు. అందుచేత రాజ్యాన్ని పాలించుట' అను ప్రవాహపతితత్వమగు ధర్మమును ప్రశాంత చిత్తముతో నిర్వర్తించు చున్నాడు. యథావిధిగా రాజ్యం ఏలుచూకూడా శోకము, పరితాపము, వివశత్వము మొదలైనవి ఆతడు పొందుటలేదు.

మానసిక దోషములచే స్వస్వరూపము నుండి తిరోభావం పొందటం .... మరలా ఆవిర్భావం పొందటం ఈ రెండూ ఆతని పట్ల ఏర్పడుట లేదు. దైనందికంగా వచ్చిపోయే హర్షవిషాదములు, అర్థ అనర్థములు ఇవన్నీ అకర్తృత్వాభిమానం యొక్క ప్రభావం చేత, ఆత్మ చైతన్యమునందు, తరంగములు సముద్రములోలాగా, లయించి ఉంటున్నాయి.

సుషుప్తియందు ఉన్నవానివలె ఆతడు మెలగుచూ ఉన్నాడు. రాగద్వేషములు, భూతభవిష్యత్తుల గురించిన చింతలు ఆత్మ సామీప్యతచే తడిపివేయబడ్డాయి. వాసనాభావంబున మనస్సు భూత

Page:349

భవిష్యత్తులను జయించి, వర్తమానంలో ఏర్పడి మాత్రమే ఉంటోంది. అనగా దానిలో భూత -

భవిష్యత్తుల చింతలు తొలగిపోయాయి. కేవలం వర్తమానంలో మిక్కిలి 'సంతుష్టి'తో అనువర్తిస్తోంది. చూచావా రామా! ఒకడు తన మెడలో ధరించిన గొలుసు కనిపించక, ఇల్లంతా వెతకి చిందులు వేసి చివరికి మెడలోనే ఉన్నట్లు గమనించి ప్రశాంతపడునట్లు, ఈ జీవుడు సర్వదా ప్రాప్తించియే ఉన్నట్టి ఆత్మ యొక్క సమాచారము, లేక, జ్ఞానముచే మాత్రమే ప్రశాంతత పొందగలడు. అట్టి ఆత్మజ్ఞానం లభించేంతవరకూ ఈ చిత్తముచే తత్త్వ విచారణ చేయిస్తూనే ఉండాలి. 'ఆత్మతత్త్వ విచారణ' అనేది సజ్జన సాంగత్యముచే అభ్యుదయం పొందుతూ ఉంటుంది. సర్వ సమత్వ దృష్టి” అలవడుతూ ఉంటే ఈ మనస్సు విశాలత్వం పొందుతుంది.

1 స్వవిచారణ, 2 సజ్జన సాంగత్యము ... ఈ రెండింటితో సమానమైనవి ఇంకెక్కడుంటాయి? అందుచేత రామా! నీ యొక్క ఊహ, అపోహ”లను సచ్ఛాస్త్రము, వివేకములచే శోధన చేయి. లక్ష్యశుద్ధితో శాస్త్రానుసారం ప్రయత్నిస్తూవుండగా, క్రమముగా నీ బుద్ధి నిర్మలమవుతుంది. అప్పుడు అఖండమగు ఆత్మను, లేక ఆత్మతత్త్వమును నీకు మరింకెవ్వరూ గుర్తు చేయనక్కర్లేదు. అప్పుడు నీవు అజ్ఞానాంధకారముచే బాధించబడవు సుమా!

ప్రజ్ఞ - ఓ మహామతీ! రామచంద్రా! ఈ సంసారము అనేక దుఃఖ కల్లోలములతో అనేక విపత్తులతో నిండివుంటోంది. అధిగమించడానికి సాధ్యమా? - అను రీతిలో అనేక విషయ పరంపరలు ప్రాప్తిస్తున్నాయి. అయితే, ఈ సంసార నదీ జలమును "ప్రజ్ఞ" అనే నావ సహాయముతో దాటివేయవచ్చు. కోమలమైన పూతీగను అల్పమైన గాలి కూడా అటు ఇటూ కదిలిస్తూ బాధిస్తుంది. ప్రజ్ఞా విహీనుడైన ఒక మూఢుని అతి స్వల్పమైన విషయములు కూడా బాధించగలుగుతాయి.

ఒకానొకడు నిస్సహాయుడుకావచ్చు. శాస్త్రములలోని ఆయా వివరణాదులు అతనికి తెలియకపోవచ్చు. కాని అతడు కనుక శ్రద్ధ, ప్రజ్ఞలతో కూడిన పరిశీలకుడై, క్రమంగా విజ్ఞానశీలుడు అయినాడా.... ఇక ఆతడు ఈ సంసార సముద్రమును అవలీలగా దాటివేస్తున్నాడు, కార్యసిద్ధిని పొందుచున్నాడు. అజ్ఞుడో.... అతడు ఎంతో బలవంతుడైతే మాత్రం ఏమి లాభం? చివరకు అధో గతే శరణ్యమగుచున్నది. అందుకే మానవుడైనవాడు తన ప్రజ్ఞను 'శాస్త్రము''సత్సాంగత్యము’ అను రెండింటి సహాయముతో కాపాడుకోవాలి. తోటమాలి అందమైన పూల మొక్కలను అతి జాగ్రత్తగా రక్షించుకొనుచున్నట్లు, ఈ జీవుడు కూడా ప్రజ్ఞను, అవగాహనను దృఢపరచగల ఆయా కార్యక్రమాలను కాపాడుకోవాలి. అనేక సత్కర్మల రూపమున ప్రజ్ఞ (Wisdom) తప్పకుండా, ఉత్తమమైన, అమృత తుల్యమైన ఫలములను ప్రసాదించగలదు.

ఈ జనులందరూ ధన - వస్తు - - అధికారాలను సంపాదించడానికి అనేక ప్రయత్నములను చేస్తున్నారు కదా! అదే విధముగా ఈ ప్రజ్ఞను వృద్ధి చేసుకోవడానికి కూడా సర్వ ప్రయత్నములు

చేయాలి కదా!

"అసలు ఈ సంసారము అనబడేది ఎక్కడినుండి, ఎట్లా విజృంభిస్తోంది?

Page:350

సీమాన్తంసర్వదుఃఖానా మాపదాంకోశముత్తమమ్ |

బీజంసంసారవృక్షాణాం ప్రజ్ఞామాన్యంవినాశయేత్ || (శ్లో 27, సర్గ 12)

ప్రజ్ఞామాంద్యముచేతనే సర్వ దుఃఖములకు, ఆపదలకు అలవాలమైన ఈ సంసారము స్వీయ హృదయము నుండి ఉద్భవిస్తోంది సుమా! అందుచేత మీరంతా ఏమాత్రం బద్ధకించకండి. ప్రయత్న శీలురై ప్రజ్ఞామాంద్యమును తొలగించుకొండి? స్వర్గ, పాతాళ, బ్రహ్మ లోకములలో ఏయే సుఖములు ప్రాప్తించగలవని జనులు అనుకుంటూ ఉంటారో, అవన్నీ కూడా ఇప్పుడే, ఇక్కడే ఉత్తమ ప్రజ్ఞచే, ఇదంతా అర్థం చేసుకున్నవాడు పొందుచున్నాడు. నాయనలారా! మహానుభావులంతా ఉత్తమోత్తమమైన తమ యొక్క ప్రజ్ఞ’ చేతనే ఈ ఎదురుగా తారసపడుచున్న భయంకర సంసారాన్ని దాటి వేస్తున్నారు. అంతేగాని వారు ఎచ్చటకో వెళ్ళుట చేతనో, ఏదో చూచుట చేతనో కాదు సుమా! దానము, తీర్ధము, తపస్సు - - వీటంన్నిట యొక్క అంతిమ లక్ష్యము ఉత్తమ ప్రజ్ఞ సముపార్జించుటయే!

పారమార్థిక జీవితం విషయం అటుంచి ఈ లౌకిక జీవితం విషయం కూడా అంతేకదా! ఈ భూమిపై చరించుచున్న ఈ జీవులు ఏవేవైతే సంపత్తులు పొందుచున్నారో.... అవన్నీ 'ప్రజ్ఞ' అనే పండ్ల చెట్టు నుండి రసభరితమై పడిరాలిన ఫలములే కదా! అంతే కాదు. భయంకరమైన పంజా గల ఒక సింహమును రెండు మూడు నక్కలు తమ తెలివితేటలతో, 'ప్రజ్ఞ'తో జయించి వేస్తున్నాయి. ప్రజ్ఞ కారణంగానే సామాన్యుడై పుట్టిన ఒకానొకడు మహానాయకుడు కావడం, రాజు కావడం చూస్తున్నాం. అట్లాగే స్వర్గ - మోక్షములు మొదలైనవి కూడా ప్రజ్ఞావంతులకే లభిస్తున్నాయి.

ప్రజ్ఞ = తెలివి + ప్రయత్నము + సాహసము.

గొప్ప విషయాలు కూడా ప్రజ్ఞానవంతుడు స్వల్పకాలంలో గ్రహించి అనేక మందిని అధిగమించి వేయటం ప్రపంచంలో మనం చూస్తున్న విషయమే.

వివేకుల హృదయంలో ఉండేది ఈ 'ప్రజ్ఞ' అనే మణియే. అది వారికి కల్ప వృక్షములాగా కోరుకొన్న ఫలములు సిద్ధింపజేస్తూ ఉంటుంది. నావను నడపటం చేతనైనవాడు తుపానును ఎదుర్కోగలుగుతాడు. ఈత నేర్చినవాడే మునిగిపోకుండా గట్టుజేరుతాడు. అశిక్షితుడు, అప్రజ్ఞావంతుడు సంసార సాగరాన్ని దాటగలడా? లేదు. ప్రజ్ఞను సునిశితం చేయని వాని బుద్ధి స్వల్ప విషయములచే ఆకర్షణ వికర్షణలకు లోను అవుతోంది. వివేక వైరాగ్యములతో కూడిన బుద్ధి సన్మార్గములో నియమించ బడినప్పుడు ఆ బుద్దే నావలాగా సంసారమును దాటింపజేస్తోంది. అసన్మార్గమును ఎన్నుకొన్నందుకు పర్యవాసనం ఆపదలు, దుఃఖాలు వచ్చిపడటంలో ఆశ్చర్యం ఏమున్నది? కవచం ధరించిన వానిని బాణాలు తాకినా ఏమీ చేయలేవు కదా! ప్రజ్ఞ లేక తెలివి మరుగున పడిన క్షణాలలో తృష్ణ’ వచ్చి చేరుతుంది. కామ, క్రోధ, లోభ, మోహాదులు ఆ తృష్ణ యొక్క సైనికులై వాటి నుండి రాగము, ద్వేషము, చింత మొదలైనవన్నీ వచ్చి పడుచున్నాయి. ప్రజ్ఞావంతుని అవన్నీ ఏమాత్రం సమీపించలేవని గ్రహించు.

Page:351

ఓ రామచంద్రా! నీవు సమ్యక్ దృష్టిని సంపాదించి, అట్టి దృష్టిచే ఈ ప్రపంచమును గాంచుచూ మోక్ష స్వరూపుడవు కావాలని అనుకుంటున్నావా! అయితే వెంటనే ప్రజ్ఞను ఆశ్రయించు. గుణదోషతత్త్వ వివేకము ద్వారా 'సమదర్శి'వి అగుము. ఇక సంపదలు గాని, ఆపదలు గాని నిన్నేమీ చేయలేవు.

పిధానంపరమార్కస్య జడాత్మావితతోసితః | అహంకారాంబుదోమత్తః ప్రజ్ఞావాతేనబాధ్యతే ॥ || (శ్లో 39, సర్గ 13)

ప్రజ్ఞ కొరవడిన తరుణంలో ఏర్పడిన 'అహంకారము' అనబడే దట్టమైన మేఘము 'పరమాత్మ' అనే సూర్య భగవానుని కనబడకుండా కప్పివేస్తుంది. ఆ మేఘము "ప్రజ్ఞ అనబడే వాయువీచికచే త్రోసివేయబడుతుంది!

మొక్కలు నాటే ముందు రైతు భూమిని దున్ని సిద్ధము చేయునట్లు నీవు హృదయమును స్వవిచారణ, గురువాక్య విశ్లేషణ, ఉత్తమ కార్యక్రమములు అను భాగాలు గల నాగలితో హృదయ క్షేత్రమును సిద్ధము చేసి 'వివేకము - ప్రజ్ఞ' అను పంటను సంపాదించు. అప్పుడు ఈ విచారించ బడుచున్నదంతా నీకు స్వయముగా సుస్పష్టం కాగలదు.

6. మనోవిచారణ

ఓ రామచంద్రా ! "ఆత్మానుభవ ప్రాప్తి అనే మార్గములో ముఖ్యముగా మూడు ప్రతిబంధకాలు తారసపడుచున్నాయి -

1. అసత్భావన - అసత్ లేక “అసత్యము అయిన విషయములను పదే పదే సత్యమైనట్లు భావన చేయుట.

2. అహంకార మమకారములు - నేను మరియు నాది అను భావనను ఆశ్రయించడం. తనను తాను తదితరులకు వేరైనట్లుగా దర్శించటం.

3. దేహాత్మభావన - ఈ దేహమే నేను. దేహ పరిమితుడనైన నేను దీనితో వృద్ధి క్షయములు పొందువాడనై ఉంటున్నాను అను రూపముగల సంకుచితత్వమును భావన చేయడం. ఆ జనకమహారాజులాగా నీవు కూడా పరిశుద్ధ చిత్తముచే ఆత్మ విచారణ చేయి. పై విఘ్నములను ప్రయత్నపూర్వకముగా తొలగించుకో. అప్పుడు జ్ఞానులు పొందినట్టి బ్రహ్మపదమును నీవు కూడా పొందగలవు. ప్రాజ్ఞులైనట్టి కొందరు సాత్వికులు, మరియు రాజస సాత్వికజాతీయులు ప్రాప్తములన్నింటిలోకి అత్యంత ఔన్నత్యము అయినట్టి ఆత్మతత్త్వమును స్వయముగా తమయొక్క వివేక బలముచేత గ్రహిస్తున్నారు.

ఆత్మశాంతి పొందనంతవరకూ ఈ 'ఇంద్రియములు' అనే శత్రువులను సరియైన రీతిలో నియమించి, ఆత్మానుసంధానం చేస్తూనే ఉండాలి.

Page:352

శ్రీరాముడు : మహాత్మా! ఈ ఇంద్రియములను అనేక దుఃఖములతో కూడిన సంఘటనలు ఆశ్రయించి ఉంటున్నాయి. ఇక మేము ఈ దుఃఖములను ఎట్లా జయించడం?

ప్రసన్నేసర్వగేదేవే దేవేశేపరమాత్మని | స్వయమాలోకితేసర్వాః క్షీయన్తెదుఃఖదృష్టయః || (శ్లో 4, సర్గ 13)

శ్రీ వసిష్ఠ మహర్షి : సర్వమునందు వ్యాపించియున్నవాడు, సర్వ ఇంద్రియ నియామకుడు ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపమే తానైయున్న, ఆ పరమాత్మ ప్రసన్నుడై సాక్షాత్కరించగానే సమస్త దుఃఖాలు వాటంతట అవే క్షయిస్తాయి. ఈ మనుష్యానందం మొదలుకొని బ్రహ్మానందం (సృష్టికర్తకు లభించే ఆనందం) వరకు ఆ పరమాత్మ యొక్క అనుభవము అనే ఆనందము ముందు 'సూర్యుని ముందు దివిటీ’ లాగా అత్యంత స్వల్పమైనవే. 'పర అపర' స్వరూపుడైన ఆ పరమాత్మ సాక్షాత్కరించిన తరువాత ఇక మోహములు, వాటికి బీజము వంటివైన దుర్వాసనలు, అహంకారము, సర్వ విధమైన ఆపదలకు సంబంధించిన భయోద్వేగములు స్వయముగా శమించిపోతాయి.

ఓ రామా! వివేకముతో కూడిన బుద్ధితో "ఈ సమస్తము బ్రహ్మమే కదా....! అన్న దృష్టిని కలిగియుండుటే పరమ పురుషార్థమగు ఐశ్వర్యమని మా అభిప్రాయం. ఎవ్వడైతే నిరంతర ఆత్మవిచారణ గావించుచు, “ఈ జగత్తు అనిత్యమే కదా! అను నిర్ణయముచే సర్వాతీతత్వము అలవరచుకుంటాడో అట్టివాడు కాలక్రమేణా జనకమహారాజులాగా ఉత్తమ శాంతిని తప్పక పొందుతాడు.

శ్రీరాముడు : ప్రారబ్ధము చేతనే వివేకము ప్రాప్తిస్తుందా? లేక అది స్వయముగా తనంతట తానే ఏదో ఒక ఆకస్మికమైన సమయములో ఉదయిస్తుందా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఏ జీవుడైతే ఈ సంసారం పట్ల భయభీతుడై ఉత్తమమైన అవగాహనయే ఇందుకు మార్గము అని గ్రహించి ఆత్మ జ్ఞానము కొరకు స్వప్రయత్నమును ఆశ్రయిస్తాడో, అట్టివానికి మాత్రమే వివేకంతో కూడిన దృష్టి రూపుదిద్దుకుంటుంది. 'ఆత్మజ్ఞానము' అనబడేది ధనము వలన గాని, బంధువుల వలన గాని, 'దైవం' అనుదాని చేతగాని అనేక కర్మల చేత గాని ప్రాప్తించేది కాదు. అందుకొరకై చేసే పురుష ప్రయత్నము చేతనే అది సాధించబడుతోంది. వివేకము, వైరాగ్యము - ఈ రెండింటి విషయంలో "ప్రారబ్దం ఉంటేనే అవి లభిస్తాయి... లేదా స్వయంగా, కాకతాళీయంగా లభిస్తాయి అని తలచి, తెలియని ఏదో శక్తిపై ఆధారపడేవారు, మా దృష్టిలో, మూర్ఖులు మాత్రమే.

ఆఁ! ప్రారబ్ధం ప్రతికూలంగా ఉంటే మేమేమి చేస్తాం? అందుకే వివేకం మాకు లభించడం లేదు” అని తలచే వారు జ్ఞానుల దృష్టిలో, ఆయా వికల్పాలకు దాసో2 హమ్ అంటున్న మందభాగ్యులు మాత్రమే! కనుక, ఓ సభికులారా! మీ అందరికీ నేను విన్నపం చేస్తున్నాను. మీరంతా అట్టి మాటలు కట్టిపెట్టండి. చక్కగా వివేకముతో కూడిన దృష్టిని అలవర్చుకోండి. ఆత్మ చేతనే ఆత్మను దర్శించండి. ఉత్తమ బుద్ధి ద్వారా సంసారసాగరమును దాటివేయండి. మనమిప్పుడు చెప్పుకున్న ఈ జనకుని వృత్తాంతము అజ్ఞాన వృక్షమును ఛేదించగలదని, జ్ఞాన సుఖమును కలిగించగలదని పెద్దలు అంటూ ఉంటారు. సుబుద్ది ఒక్కడే తన యందు పరమాత్మ సాక్షాత్కారమును గాంచగలడని చెప్పుటే దీని ఉద్దేశము.

Page:353

ఎండ వేడిమి చేత మంచు కరిగిపోతుంది. అట్లాగే ఆత్మతత్త్వ విచారణచే ఈ సంసార పటాటోపము, లేక, వికల్పము క్షణాలలో నశించిపోతోంది. ఈ దేహమే నేను అనునదే అజ్ఞానము యొక్క పరాకాష్ఠ. అట్టి సంకుచిత స్వభావం నశించిందా, ఇకప్పుడు మహత్తరమైన, సర్వ వ్యాప్తమైన నిజాత్మప్రకాశము స్వయముగానే ఆవిర్భవిస్తోంది. అనగా, ఆత్మ యొక్క విస్తారము ఉదయించగలదు.

7. స్వయం విచారణ

శ్రీరాముడు : మహర్షీ! జనక చక్రవర్తి మహారాజుగా ఉంటూనే పాము కుబుసమును విడుచునట్లు... అహంకారాన్ని త్యజించివేశారు కదా! అది అట్లు ఎలా సాధ్యపడింది? ఏ పరికరాలు, కార్యక్రమాలు ఆయన ఉపయోగించారు? లేక, సిద్ధులు చెప్పిన అభిప్రాయములు విన్నంతమాత్రం చేతనే ఆయన సంసారమును జయించి వేశారా? లేక, అందుకు మరేమైనా కారణాలు ఉన్నాయా?

శ్రీ వసిష్ఠ మహర్షి : సిద్ధుల వాక్యములను మననం చేస్తూ స్వయంగా విచారణ చేయుట చేత ‘అహంకారము’ అనబడే మూలవాసనను ఆయన జయించారు (లేక) త్యజించారు (లేక) అతీతత్వము వహించారు. అయితే, ఏదైనా ఎవ్వరికైనా లభించాలంటే సుదీర్ఘమైన అభ్యాసం, విచారణ అవసరం కదా! అట్లాగే, చిరకాలమిత్రుడైన 'స్వవిచారణ'యే ఆతనికి అందుకు తోడైనది. అహంకారము క్షయించగా విశాలచిదాకాశము నిర్మలం అవుతుంది. 'అజ్ఞానాంధకారము' అనగా, “ఈ దేహము మొదలైనవే నేను” అని తలచుటయే కదా! అట్టి అజ్ఞానం నశిస్తే ఇక ఎట్టి బాహ్యమైన పరికరములు అవసరం లేకుండానే ఆత్మ ప్రకాశము స్వయంగా ఆవిర్భవిస్తోంది. అందుచేతనే, ఉత్తముల దృష్టిలో: 1. ఈ జగత్తు స్వయంగా లేదు ... భావనను, అనుసరించి ఏర్పడి ఉంటోంది.

2. ‘అహం’ అను పదవాచ్యము కూడా లేదు. 3. నేను పూర్ణ స్వరూపుడనేగాని శూన్యముకాను.

- అను మూడు అవగాహనలు ఏకసమయంలో ఏర్పడి ఉంటున్నాయి. అట్లాగే నీ మనస్సు కూడా సర్వదా ప్రశమనం పొందిఉండుగాక! ఎదురుగా ఉండే వస్తువులందు నిమగ్నము కాకయే ఉండుగాక! అసలు ‘బంధము' అంటే ఏమిటి? -

ఉపాదేయానుపతనం హేయైకాన్తవివర్జనమ్ |

యదేతన్మనసోరామ తద్బద్ధంవిద్ధినేతరత్ (శ్లో 20, సర్గ 13)

ఆయాప్రాప్తించియున్న వస్తువులందు, స్థితి గతులందు కొన్నిటిపట్ల వీటిని ఎల్లప్పుడూ నేను కలిగి యుండాలి అని, మరికొన్నిటిపట్ల "ఇవి తొలగాలి" అని బుద్ధిని కలిగియుండుటే రాగ ద్వేషముల యొక్క రూపము. రాగద్వేషములు కలిగియుండుటే బంధము. అవి లేకుండుటే బంధరాహిత్యము లేక 'ముక్తి' లేక 'మోక్షము'.

తొలగాలి = హేయదృష్టి లేక త్యాజ్య బుద్ధి; పొందాలి = ఉపాదేయ దృష్టి లేక గ్రాహ్య బుద్ధి.

Page:354

ఈ రెండు దృష్టులను త్యజించి ఇక ఇప్పుడు శేషించే సాక్షి రూపం' నందు నిలకడ’ కలవాడవై స్వచ్ఛతను పొంది ఉండు. గ్రాహ్య - త్యాజ్య బుద్ధిని నశింపజేసుకొన్నవారు ఇక దేనినీ ఇచ్ఛగించరు. దేనినీ ద్వేషించరు. వారి హృదయమునందు "బ్రహ్మాత్మత్వము అనబడే సమరసభావన అకృత్రిమంగా వెల్లివిరిసి ఉంటుంది. ఆకాశం మేఘములచే ఆవరించబడి ఉన్నప్పుడు చంద్రుడు కనబడతాడా? "ఏదో పొందాలి... ఏదో తొలగాలి" అను రూపముగల తృష్ణ హృదయములో ఏర్పడి ఉన్నంత వరకు అట్టి వికల్పము యొక్క ప్రభావం చేత ఈ జీవుని పట్ల సంసారము ఉండియే తీరుతోంది. సంసారం ఉన్నంతవరకు భేద భావం, జీవ భావం అనే జాడ్యం వదలదు.

అనుకూలమైన పదార్థములందు ఇచ్ఛ ప్రతికూలమైన పదార్థముల పట్ల అయిష్టత, లాభాలాభముల పట్ల రాగద్వేషములు - ఇవి ఏర్పడుచున్నచోట బుద్ధి మందగిస్తూనే ఉంటుంది. ఆతనిలో వైరాగ్యం ప్రదీప్తం కాదు. అట్టి తరుణంలో బ్రహ్మాత్మ రూపమైన సమత్వము, నిర్మలత్వము ఎట్లు ఉండగలుగుతాయి?

వాస్తవానికి నిరామయము, ఏకము అగు పరబ్రహ్మమే సదా వెలుగుచుండగా ఇక ఈ భేద కల్పనలన్నీ భ్రమ కాక ఏమిటి చెప్పు? ఇష్టము-అయిష్టము, పొందబడినవి-పొందవలసినవి మొదలైనవన్నీ చపల వానరం వంటి ఈ చిత్తము యొక్క నృత్య భంగిమలే. చిత్తము గంతులు వేస్తుంటే 'సౌమ్యత్వము, నిష్కామత్వము' లకు చోటులేకుండా పోతోంది. కొందరు మహనీయులు తమ యొక్క ఉత్తమ ప్రయత్నముచే త్యాజ్యగ్రాహ్య దృష్టిని జయించి వాసనారహితులై ఉంటున్నారు. అట్టి జ్ఞానులందు ఆశా రాహిత్యం, నిర్భయం, నిత్యత్వం, సమత్వం, జ్ఞానం, నిరపేక్ష, నిష్క్రియత్వం (నేను అకర్తను అను ఎఱుక) నిర్వికల్పత్వం, ధైర్యం, మైత్రి, సమబుద్ధి, తుష్టి, శాంతి, మృదుభాషణ మొదలైనవి స్వయంగా రూపము పొందుచున్నాయి.

శ్రీరాముడు : తండ్రీ! ఈ చిత్తము అల్పత్వమును ఆశ్రయిస్తూ ఆత్మత్వమునకు దూరమగుచున్నది కదా! ఏమిటి ఉపాయం? మేమేం చేయాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి : నీరు పల్లపు ప్రాంతాలకు పోతుంటే ఏం చేస్తున్నాం? వంతెనకట్టి ఆ ప్రవాహాన్ని నిరోధించి ఎత్తు ప్రాంతాలకు తరలిస్తున్నాము కదా! అట్లాగే, ఈ చిత్తము అధోగతికి వెళుచున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా? లేదు. 'ధ్యానము' 'భగవన్నామ స్మరణ' మొదలైన ప్రత్యాహారముల చేత చిత్తమును ఆయా విషయముల నుండి వెనుకకు మరల్చాలి

బాహ్య అనర్థాన్ ఇమాం త్యక్త్వా ; తిష్ఠన్, గచ్ఛన్, స్వపన్, శ్వసన్ | సర్వథా సర్వదా సర్వాన్ అన్తరాంశ్చ విచారయ II

ఒక చోటకూర్చుని ఉన్నప్పుడు లేక నడుచుచున్నప్పుడు, నిదురిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు

- సర్వావస్థలలోనూ, సర్వ విధములా, సర్వ సమయములందు... అంతరంగంలో ఆత్మ విషయమే విచారణ చేస్తూ ఉండాలి.

Page:355

ఈ మనస్సు బుద్ధి, ఆత్మ ఏమై ఉన్నాయి? నేను ఎవడను? ఎంతటి వాడను? నేను వేటికి ‘సంబంధించని’వాడను? దేనికి 'సంబంధించిన' వాడను? దేని కొరకు ఏ రూపంగా ప్రయత్నించాలి? వేటి పట్ల ఉదాసీనంగా ఉండాలి?

...ఈ విషయాలు విశ్లేషణపూర్వకంగా గ్రహించి ఉండు. అందుకు శాస్త్రములు, జ్ఞానుల ప్రవచనములు నీకు సహకరించ గలవు. అట్టి "విచారణ, అవగాహన ఆశ్రయించబడని సమయంలో 'మోహం' అనే దారపుప్రోగులతో 'చింతా సమూహాలు' అనే ముళ్ళుతో కూడిన (వాసనలు) అనే వల నేయబడుతోంది. “తృష్ణ, కోరికలు తీర్చుకొనుట అను ప్రయోజనమే రూపంగా గల చేపలు పట్టటానికి 'సంసారం' అనే తటాకంలోకి ఆ వల పదే పదే విసరబడుతోంది... ఫలితం? అనేక జన్మ పరంపరలు! ఈ వాసనలు అనే వలను 'బుద్ధి' అనే పదునైన కత్తితో త్రెంచుకుంటూపోవాలి. మహా వాయువు మేఘాలను ఖండఖండం చేయునట్లు బుద్ధిచే వాసనలను మొదలంట పెరికివేయాలి.

ఓ రామచంద్రా! అందుచేత చిరకాలాభ్యాసం ఆశ్రయించుట ద్వారా నీ బుద్ధిని దృఢతరం చేయి. 'ఆత్మను భావించుట' అను ప్రయత్నముచే అది స్థైర్యము పొందేటట్లు చేయి. చిత్తము ధీరత్వముతో కూడుకొని ఉండాలి సుమా! మనస్సు ఈ సంసారము, లేక, అవిద్య యందు అనాదిగా తగుల్కొని యున్నది. అట్టి మనస్సును సముద్ధరించటానికి అత్యంత నిర్మలమైన, సునిశితమైన బుద్ధిని సముపార్జించాలి.

నీ మనస్సు అఖండమగు బ్రహ్మాకార వృత్తిచే ప్రకాశించు గాక! ఈ సంసార వృక్షమును అట్టి బ్రహ్మాకార వృత్తి అనే గొడ్డలిచే నరకటం అత్యంత సులభం. మనస్సు వృత్తుల యొక్క సముదాయమే కదా! బ్రహ్మాకార వృత్తిచే తదితర వృత్తులన్నీ మ్రింగివేయబడు గాక! అప్పుడు ఇక్కడే, ఇప్పుడే బ్రహ్మపద ప్రాప్తి పొందుటచే సుస్థిరుడవు, సౌమ్యరూపుడవు, అనంత, అఖండానంద స్వరూపుడవు పరమేశ్వరుడవు అవుతావు. ఆత్మదృష్టిని స్థిరం చేసుకొన్నావా, నీవు పరమేశ్వరుడవై మా అందరిచే నమస్కరించతగినవాడవే అవుతావు.

ఎవడైతే అంతటా ఆత్మరూపమునే చూస్తూ, ఈ దృశ్యము పట్ల "సన్మాత్ర భావన చేస్తూ అన్య పదార్థ భావనను త్యజించి వేసి ఉంటాడో, అట్టి వానిని ఈ హర్షశోకవిషాదములు' అనే దోషాలు అంటజాలవు. తాక జాలవు.

రాగద్వేషవినిర్ముక్తః సమలోష్టాశ్మకాంచనః |

యుక్తఇత్యుచ్యతేయోగీ త్యక్తసంసారవాసనః (శ్లో 43, సర్గ 13)

ఎవడైతే రాగ ద్వేషముల పరిధి నుండి తనను తాను తొలగించివేసుకొని మట్టిని, రాయిని, బంగారాన్ని సమబుద్ధితో చూస్తాడో, అట్టివాడు ముక్తుడే.

అట్టివాడు ఏది చేస్తున్నా, ఏది భుజిస్తున్నా, ఏది దానం చేస్తున్నా, ఏది వధిస్తున్నా - దేని పట్లా కూడా ఏమాత్రం ఆసక్తి అనేది కలిగి ఉండడు. ఆసక్తి లేదు కాబట్టి వాటిచే కలుగుచుండే

Page:356

సుఖదుఃఖములందు సమభావము కలిగియుండగలుగుతాడు. ఇది ఇప్పుడు ఇట్లు చేయుట మాత్రమే నా వంతు- అని భావించుచూ, ఇష్ట అయిష్టములను పరిత్యజించేవానిని బంధించగలిగే కర్మలు ఎక్కడా ఏమీ ఉండవు.”

8. మనస్సు - - ప్రశాంతత

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ మహామతీ! రామా! ఈ జగత్తు అంతా చైతన్యమయమే కదా! ఇక, భోగాశ కలిగి ఉండాల్సిన పనేముంది? భోగాశను వీడినట్టి మనస్సు అకృత్రిమమైన ప్రశాంతతను పొందుతోంది. శ్రీరాముడు : హే మహర్షీ! ఈ మనస్సు జడమైనదా? చేతనమైనదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఈ మనస్సు జడమైనదే. అందుచేత, అది స్వయంగా దేనిని సాధించలేదు. తనను తాను ఉద్దరించుకోలేదు.

ఒక వనంలో ఒక సింహం ఉన్నది. అది జంతువులను వేటాడటానికి బయలుదేరుతోంది. ఆ ప్రక్కనే ఉన్న ఒక పిల్లి మాంసం మీద గల అపేక్ష వల్ల ఆ సింహమును అనుసరించి వెళ్ళుచున్నది. అట్లాగే, ఈ మనస్సు అనే పిల్లి స్వయంగా దేనినీ సాధించలేదు గాని, తనకు సాక్షిగా తనను ప్రకాశింపజేయుచున్న ఆత్మ నుండి చైతన్యము పొందినదై ఆత్మయొక్క ఇచ్ఛాదులను ఆశ్రయించి ప్రవర్తించుచున్నది. చిత్త శక్తి యొక్క ప్రభావం చేత ప్రాప్తించుచున్నది. దృశ్యము నందు ప్రవేశించి ఆయా అనుభవములకు 'భోక్త' అగుచున్నది. అసద్రూపము అయినట్టి ఈ మనస్సు అద్వితీయమైనట్టి ఆత్మను ఏమరచి, కేవలం జగదాకారమును భావించటం జరుగుతోంది. కాని, చైతన్యము యొక్క ప్రభావం చేతనే అది జీవించటం జరుగుతోంది. అదే మనస్సు మరొక సమయంలో ఆత్మను సంస్మరించుటచే తన మనోరూపమును - జడత్వమును వదలినదై మరల చైతన్యముగా అగుచున్నది. స్వయముగా జడము, చైతన్యముచే ప్రకాశింపబడునది అగు ఈ మనస్సు మృతప్రాయమే అవుతుంది గాని, కార్య సమర్థము కాగలదా? లేదు.

చిత్తము' అంటే ఏమిటి? -"చిత్స్వభావం' నుండి స్వయంగా అభివ్యక్తమైన కల్పన అసత్ మయమైన విషయములను ఆశ్రయించియుండటం. లేక, నిత్య అనిత్యములను విశ్లేషించక పోవటం.”

కలన (illution) చిత్తము 'చిత్' నుండే బయల్వెడలుచున్నది. ఈ చిత్తము ద్రష్ట, దర్శనము, దృశ్యము అను రూపమున క్రియారూపంగా ఆవిష్కరించ బడుచున్నప్పుడు, అట్టి 'చిత్' యొక్క త్రిపుటీ చమత్కారమే కలన”, “కల్పన అను శబ్దములచే చెప్పబడుతోంది.

కల్పనయే మరొకప్పుడు “నేను చిద్రూపాన్నే గాని ఈ ద్రష్ట, దృశ్యం మొదలైన సంకుచితుడను, లేక, పరిమితుడను కాదు అని ఎఱుగుచున్నది. సముద్రం నుండి బయలుదేరిన ఉప్పు బొమ్మ ఏ కారణంగానో మరల సముద్రంలో పడితే ఏమౌతుంది? నామరూపాలు పోగొట్టుకొంటుంది. అట్లే ఈ చిత్తము స్వస్వరూపమును ఎఱిగినప్పుడు తిరిగి చిద్రూపమే అగుచున్నది.

Page:357

విషయరహితమైన చైతన్యమే సనాతన బ్రహ్మము అని అంటున్నాం. ఆ చైతన్యం విషయ సహితమైనప్పుడు 'జీవుడు - కలన - కల్పన' మొదలైన శబ్దములుగా చెప్పుకొంటున్నాం. అనగా బ్రహ్మమే కించిత్ 'విషయాసక్తి' పొందినప్పుడు కల్పనారూపమై హృదయంలో సద్వస్తువును బోలి ఉంటోంది. ఆ ఆసక్తి'యే సంకల్ప వికల్ప రూపములతోకూడి 'మనస్సు అగుచున్నది.

ఈ మనస్సు నిత్యానుభవ రూపమైనట్టి తన ఆత్మను విస్మరించి 'స్మృతి' రూపమును చెందుచున్నప్పుడు, జడరూపమును బోలి, చిత్తము అని అనిపించుకుంటోంది.

చిత్తము యొక్క ధర్మములు -

1. జరిగిపోయిన విషయముల గురించి 'మననం' చేయటం లేక 'విషయాకార కల్పన'

కలిగి ఉండటం.

2. భవిష్యత్తు విషయము గురించి సంకల్పములు ఆశ్రయించటం.

3."ఇది పొందాలి ఇది తొలగాలి" అను రూపమునగల హేయ - ఉపా దేయములతోగూడిన పరిచ్ఛిన్నత్వము.

ఈ చిత్తమే బ్రహ్మాండాకారమును (macrocosm) స్వమాయావశంచేత పొందుచున్నది. మరొకప్పుడు తనను తాను మరచి నేను ఒక జీవుడను (microcosm)... నేను ఈ శరీరమును... ఇవి నావి..... ఇవి కావు.... ఇవి నాకే ఉండాలి...... మొదలుగా గల అనేక జీవ భ్రాంతులకు లోను అగుచున్నది. మరల అర్హత పొంది, గురువుల చేత, శాస్త్రములచేత బోధింపబడేంతవరకు తనయొక్క అద్వితీయ పూర్ణానంద స్వరూపమును గుర్తెరుగుట లేదు.

9. ప్రమత్తత - పరిభ్రమణం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఉత్తమమైన బుద్ధి పొందటమనేది అనేక జన్మలలోని పరిశ్రమకు ప్రయోజనంగా సిద్ధించుచున్నది. ఈ మానవ జన్మ బుద్ధిని సునిశిత పరుచుకొనుటకు ఒక మహత్తరమైన అవకాశము. శాస్త్రములను విచారణ చేయుటచేత, ఉత్తమమైన వైరాగ్యమును ఆశ్రయించుటచేత, ఇంద్రియ నిగ్రహమును అవలంబించుట చేత తనను తాను ఉద్ధరించుకోవాలి. జాగ్రత్ - స్వప్న సుషుప్తుల నుండి అతడు తన చిద్రూపమును వేరుపరుచుకోవాలి.

చైతన్యమే స్వరూపముగా గల ఈ జీవుడు సంసార మోహము అనే కల్లు త్రాగి ప్రమత్తతో వుంటున్నాడు. "విషయములు అనే మృగములు సంచరించే అరణ్యంలో పచార్లు చేస్తూ అనేక ఒడుదుడుకులు అనుభవిస్తున్నాడు. “అజ్ఞానము అనే మత్తుతో అల్ప దృష్టులచే వేసట పొందుచున్నాడు. దీనికి కారణమేమిటి?

శ్రీరాముడు : “జ్ఞానము యొక్క అభావనయే. అజ్ఞానముయొక్క ఆశ్రయమే కదా!

Page:358

శ్రీ వసిష్ఠ మహర్షి : "శాస్త్రం - శ్రవణం - ప్రభోదం" అనువాటి సహాయంతో బ్రహ్మ రూపత్వం పొందబడాలి. లేకపోతే ఈ దృశ్యజగత్తు నందు అవిశ్రాంతమైన పరిభ్రమణం తప్పించుకోలేనిది. చిత్తం ప్రబుద్ధం కానంత వరకూ ఆత్మ అనుభూతము కాదు.

ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ, ఈ జగత్తు యొక్క స్థితి ఊహలోని రూపములు లాగా మిధ్యాభూతమే అయి వున్నది. చిత్తము యొక్క వృత్తి రూపమే ఈ జగత్తు" అనబడే కల్పన. శ్రీరాముడు : 'కల్పితమాత్రం' అగు ఈ జగత్తును కల్పిస్తున్నది ఎవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి : అంతఃకరణము నందున్న సర్వసాక్షి" రూపమగు పరమ చైతన్యమే ఈ 'కలన' లేక కల్పన’ లేక చిత్తము'ను ప్రకాశింపచేస్తోంది. ఎంతటి చమత్కారమో చూచావా!

చైతన్యము వాస్తవానికి జ్ఞానమే ధర్మముగా కలిగియున్నది. 'నిత్యబోధ' స్వరూపమైయున్నది. 'సర్వసాక్షి' అయి వున్నది. కాని, చిత్రంగా అంతఃకరణ వృత్తిచే అల్పత్వము చెందుతోంది. అయితే, ఆ అంతఃకరణ వృత్తి సాక్షి చైతన్యము' యొక్క 'నిరంతర ప్రబోధ' చేతనే ప్రవర్తించగలుగుతోంది.

ఒకచోట శిలచే మలచబడిన ఒక నర్తకి శిల్పమున్నదనుకో.... ఆ శిలాకన్య స్వయముగా నృత్యము చేయగలదా? లేదు కదా! అట్లే, సాక్షి చైతన్యము లేకపోతే ఈ మనస్సు గాని, 'కలన’గాని ఎక్కడా దేనిని ఎరుగజాలవు. చిత్రంలోని రాజు శంఖం పూరించు శబ్దం వినిపించలేనట్లు, మృగతృష్ణా సదృశమైన ఈ మనస్సు కూడా చైతన్యము యొక్క సహకారం లేకపోతే క్రియావంతం కాలేదు. ఆత్మ యొక్క శక్తి చేతనే మనస్సు ఉంటోంది. వాస్తవానికి ఆత్మకు వేరుగా మనస్సు' అనేదే లేదని మనం ఇతఃపూర్వమే కొన్నిసార్లు చెప్పుకున్నాం.

రాముని కంటే వేరుగా రాముని గుణములు వుంటాయా? జలమునకు వేరుగా తరంగాలు వుంటాయా? ...మనస్సు గాని, సంకల్పము గాని ఆత్మకు వేరుగా లేవు. అవి శుద్ధ చైతన్యము కంటే వేరు కాదు.

అయితే అజ్ఞానుల స్ఫురణశక్తి యొక్క బాహ్య ప్రసరణచే మనస్సు' అనే పేరుతో అధ్యాత్మశాస్త్ర బోధ కొరకు చెప్పుకుంటున్నాం. సంకల్పము గాని, విషయ వృత్తులు గాని ఏర్పడనప్పటి 'జీవసంవిత్తు' పరమాత్మయే అగుచున్నది.

జీవుడు - ఈ 'జీవుడు' అనబడువాడు... స్పందాత్మకమగు ప్రాణం మరియు చిదాత్మకమగు ఆత్మతత్వం ఈ రెండింటి యొక్క అజ్ఞానపూరితమైన అధ్యాస చేతనే ఉత్పన్నమగుచున్నాడు. చిద్రూపము చమత్కారములైన కల్పనలు చేయుచున్నవి.

ఈ దేహమే నేను, ఇది నా స్వభావము... “ఈ పుత్రుడు - భార్య - ధనము - ఇవన్నీ నావి”... ఇవి సుఖకరములు ఇవి దుఃఖకరములు”... “ఇవి ప్రియములు - గ్రాహ్యములు -

ఇవి త్యాజ్యములు”... “ఇవి మాజాతి - అది కాదు... ఇత్యాది జడభావములను ఆశ్రయిస్తోంది. అట్లు ఆశ్రయిస్తున్న సందర్భములో మనం ఆ చిద్రూపమును జీవుడు' అని అంటున్నాం.

Page:359

శ్రీరాముడు : అట్టి జీవునికి బుద్ధి చిత్తము మొదలైనవన్నీ ఎక్కడినుండి వచ్చి చేరుతున్నాయి? ఈ జగత్తు ఎక్కడినుండి ఏర్పడుచున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : సంకల్పం నుంచి ఏర్పడుతోంది. సంకల్పమే జగత్తు. ...కాని సంకల్పమునకు స్వకీయమైన ఉనికి ఎక్కడ? అట్టి అసత్తు అయినట్టి సంకల్పమునకే బుద్ధి - చిత్తము జీవుడు.” మొదలైన పేర్లను శాస్త్రవేత్తలు కల్పించడం జరిగింది. కాని, పరమార్థానికి అవేవీ లేవు.

కేవలం ఆత్మయే ఏకరసమై సర్వదా అన్నివైపులా, అన్ని వేళలా వెలుగొందుచున్నది. అందుచేత, ఈ జగత్తు అంతా ఆత్మయే. ఈ కాలము యొక్క క్రమము కూడా ఆత్మయే. ఆత్మ ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమై, స్వచ్ఛమై వెలుగుచూ వున్నది. అది అత్యంత నిర్మలమైనది. అది అల్ప బుద్ధికి లేదేమో!" అని అనిపిస్తోంది. కాని సర్వదా సర్వము నందు శుద్ధ చిద్రూపమై వెలయుచునే ఉంది. ఈ కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాలకు లభించదు కాబట్టి "అది అసత్తు”గా కొందరు అవగాహన చేసుకుంటున్నారు. ఇంద్రియములకు అవిషయమైనది, కేవలము అనుభవమునకు మాత్రం ప్రాప్తించేది అయినట్టి ఆత్మ సర్వదా సద్వస్తువేనయ్యా!

శ్రీరాముడు : అట్టి ఆత్మ సాక్షాత్కారం దూరస్థమగుటకు కారణం ఈ మనస్సే కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను. విషయములు అనే వాసనలను కలిగియున్నంత వరకు ఈ మనస్సు ప్రతిబంధకమే అయి ఉంటోంది. అయితే, ఎక్కడైతే చిత్స్వరూప సాక్షాత్కారం కలిగి ఉంటుందో అక్కడ అజ్ఞాన కారణమైన ఈ మనస్సు తనంతట తానే శమిస్తోంది. వెలుతురు వుండే చోట చీకటి ఎట్లావుంటుంది?

1. “ఆత్మ దృష్టి ఉన్న చోట ఈ దృశ్యము అదృశ్యమై వుంటోంది.

2. "దృశ్య దృష్టి అవలింబించే చోట 'ఆత్మ' అనుభవమునకు లభించడం లేదు. అనగా, చిత్తముచే కల్పించబడిన మిధ్యావస్తువు, మిధ్యా సంబంధములు మననము చేస్తూ వుంటే, ఆత్మ విస్మరించబడుతోంది.

దృష్టియే సృష్టి. దృష్టియే జగత్తు. ఏది ఏ దృష్టితో చూస్తే ఇది ఆ విధముగానే ప్రాప్తిస్తోంది. మరొకరకముగా చెప్పాలంటే అతి స్వచ్ఛమైన ఆత్మ సంవిత్తు యొక్క సంకల్ప పరంపరల చేతనే ఈ దృశ్యములన్నీ ఆవిర్భూతములగుచున్నాయి. అందుచేత రామా! నీవు ఈ 'దృశ్యదృష్టి’ని త్యజించు. ఆత్మదృష్టి’నే ఆశ్రయించు. నాకు ఇష్టమైన వారు, నాకు ఇష్టము లేని వారు కూడా ఆత్మస్వరూపులే కాని, మరింకేమి కారు అనే అవగాహన కలిగి ఉండి, ఇక ఆపై విధివిధానముల ప్రకారం నీ కార్యక్రమములను నిర్వర్తించు.

శ్రీరాముడు : ఆత్మ యొక్క దర్శనం అవడం ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : సంకల్పమే చిత్తము. పరమాత్ముని సంకల్పమే 'జగత్తు' అనబడు దృశ్యము. సంకల్పము యొక్క అభావమే.... చిత్తము యొక్క నాశనము కూడా. చిత్తము అభావించబడితే.... ఇక ఆపై మోక్షము స్వతహాగానే ఎదురు వచ్చి నిలబడగలదు.

Page:360

సంకల్పము ఉంటే మనస్సు ఉంటుంది. మనస్సు అడ్డుగా ఉన్నంతవరకూ ఆత్మ దర్శనము కాదు. సర్వ సంకల్పములు త్యజించబడ్డాయనుకో... ఇకప్పుడు శేషించేది సత్తా సామన్యమే.

ఆత్మసందర్శనం - కాబట్టి నీవు ఈ “నేను - నాది అను మూలవృత్తులతో సహా సర్వ -

సంకల్పములకు ఆవలకు చేరుకో. అప్పుడిక మిగిలి ఉండే 'సత్తాస్థితి యందు స్వస్థుడవై ఉండు. శ్రీరాముడు : ఈ 'నేను - నాది' అనబడే మూలవృత్తులు ఎందు నిమిత్తం, ఎందులో నుంచి, ఎప్పుడు, ఎట్లా బయల్వెడలుచున్నాయి?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవి బయల్వెడుచున్నది చిత్తము నుండే. చిత్తమో.... ఆత్మ సత్తా నుండే.

ఆత్మ ఒకానొకప్పుడు అనిర్వచనీయముగా 'సంకల్పము' అనబడు క్రియా విశేషము వైపుగా ఉన్ముఖమగుచున్నది. అప్పుడది తన యొక్క “చిత్స్వరూపము”నందు కించిత్ 'అన్యధా' భావము పొందుచున్నది. ఆ 'అన్యధా యొక్క రూపమే - "అహము... త్వమ్... సః" (నేను-నీవు-అతడు) అనునవి. అట్టి అన్యధా భావమే ఈ సంసారోత్పత్తికి హేతువు. ఆ సమయంలో ఏర్పడుచున్న ధ్యాస' కు 'చిత్తము' అను పేరు పెట్టబడింది. "కనుక 'అన్యధా' అను ధ్యాస యొక్క ప్రసరణయే చిత్తమునకు బీజము” - అని శాస్త్రములు ప్రవచిస్తున్నాయి.

కలన (Illusion): కలన లేక కల్పన అను మరొక పేరు కూడా ఉపయోగించబడింది. ఆత్మ తన యొక్క నిత్య నూతనమగు "నిర్వికల్ప చిత్స్వభావము నుండి ఒకానొకప్పుడు 'చ్యుతి' పొందినదగుచున్నది. అట్లు 'సంకల్ప వ్యవహారము' కళంకితమైన సత్తయే 'కలన’అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అట్టి 'కలన' యొక్క ప్రతిభ చేత ఈ జగత్తు యొక్క ఉత్పత్తి నిమిత్తం మనస్సు’ ఆవిర్భవిస్తోంది. సంకల్పములే మనస్సు యొక్క రూపం.

కలనయే ప్రాణశక్తి కూడా. ప్రాణశక్తి నిరోధించబడినప్పుడు మనస్సు కూడా విలయమగు చున్నది. ఒక అద్దం పగిలిపోతే, ఆ అద్దంతో పాటే అందలి ప్రతిబింబం కూడా నశించడం జరుగుతుంది కదా! ప్రతిబింబము దర్పణము యొక్క కల్పిత రూపమే అయినట్లుగా, ఈ మనస్సు కూడా ప్రాణము యొక్క రూపమే అయి వున్నది.

స్పందనము + అనుభవము = మనస్సు, ప్రాణము.

ఒక్కడు ఎక్కడో దూరముగా ఉన్న ఒకానొక పదార్థముయొక్క మానసికానుభవం తన యందు పొందుచున్నాడనుకో... అట్టి మనోకల్పిత పదార్ధముతో ఏర్పడిన అట్టి సంబంధము ఒకా నొక 'గతిశక్తి' చేతనే సంభవిస్తోంది కదా! ఆ గతి శక్తినే 'స్పందనము' అని కూడా అంటున్నాం. అట్టి గతి శక్తి చిత్తముతో కూడుకొని ఉన్నప్పుడు 'అనుభవము' అనునది సిద్ధిస్తోంది. చిత్తము మరెక్కడో వుంటే... ఆ సమయములో 'చూపు ఒక వస్తువుపై ప్రసరించినప్పటికి ఆ అనుభవము' అనునది ఏర్పడదు. కనుక చిత్తమే ఒక వస్తువుతోనో లేక విషయముతోనో ఏర్పడే 'సంబంధము'ను నిర్వచించడం, శాసించడం జరుగుతోంది. అందుచేత చిత్తమే జగత్తు. చిత్తమే సంసారము.

Page:361

“స్పందము - అనుభవము" ఈ ఉభయ శక్తుల సమ్మేళనమే భావాభావములకు కారణం. -

వాటి సమ్మేళనమే 'ప్రాణము'. ఆ ప్రాణమే మనస్సు. 'ప్రాణవాయుశక్తి'ని చలింపచేసేది చైతన్యమే!

ప్రాణవాయువు సర్వ రాగములు త్యజించుట చేతను, (వైరాగ్యము చేతను), ప్రాణాయామ అభ్యాసము చేతను, సమాధిని ఆశ్రయించుట చేతను అసద్వ్యసనములు క్షయించుట చేతను, పరమార్థమైనట్టి బ్రహ్మజ్ఞానము' చేతను నిరోధింపబడగలదు. ఈ ప్రాణవాయు శక్తి చలనరూపమే అయి ఉన్నది కదా! అది తన యందు చలన శక్తి కలిగియున్నప్పటికీ అది స్వయముగా తనకు తాను చలించలేదు. అనగా అది స్వతహాగా జడమైనదే. దానిని చలింపచేయునది ఎవరు?... ఆత్మ చైతన్యమే సుమా! ...అట్లాగే మనస్సు కూడా. మనస్సు స్వతహాగా జడమే అయివుండి, ఆత్మ చైతన్యము చేత ప్రవర్తింపచేయబడుచున్నది. ఆ ఆత్మయే స్వయం ప్రతిభచే 'చితశక్తి' లేక జ్ఞానశక్తి స్వరూపమై, అతి స్వచ్ఛమైన, స్వయంవ్యాపకమై ఉన్నది.

సంకల్పించకపోవడమే మనో నాశనం - సంసారోపశమనం.

ఈ వర్తమానపు ఉపశమన ప్రకరణము యొక్క సారాంశము సంక్షిప్తముగా రెండు మూడు వాక్యాలలో చెప్పుకోవాలంటే...

చిత్+స్పందశక్తి ఈ రెండింటి యొక్క సంబంధమే మనస్సు. అట్టి సంబంధము మిధ్యారూపమున ఉత్పన్నమగుచున్నది. కనుక మనస్సు మిధ్యయే అయి ఉన్నది. అందుకే ఈ మనస్సును 'అవిద్య - మాయ' అని కూడా అంటున్నాం. అదియే ఈ 'సంసారము' అను దానిని కలుగజేస్తున్న అజ్ఞానం. చిత్ - స్పందములకు 'సంకల్పించుట' అను ప్రక్రియ చేత సంబంధము ఏర్పడుచున్నది. కనుక సంకల్పించుటయే మనస్సు యొక్క రూపము.

అందుచేత - 'సంకల్పించకుండుట' అను విశ్రాంతిచే ఈ 'సంసారము' అనబడేది తృటిలో జయించివేయబడగలదు. ఈ జగత్తు యొక్క ఉపశమనము సంకల్ప రాహిత్యము చేతనే జరుగగలదు.

10. ‘జలము' ఉపమానం - చైతన్యము

శ్రీ వసిష్ఠ మహర్షి : జలమును - - తరంగములను ఉపమానంగా తీసుకొని చైతన్య తత్త్వమును విశదీకరిస్తాను. వినుజలమును భేదదృష్టితో దర్శిస్తున్నప్పుడు ...జలము యొక్క కదలిక, తరంగ దృష్టి, తరంగాలు” ...అనే వివర్తము ఏర్పడుతోంది. అదే విధంగా చైతన్యమే ... స్పందనశక్తి, అంతఃకరణము యొక్క సంకల్పము, చిత్తము" ... అయి ఉంది.

వాయువు నందలి చలనముతో పోల్చతగు స్పందనశక్తి (Vibration) ఒకప్పుడు చైతన్యము చేత ప్రబోధితం అవుతోంది. విషయములతో కూడిన చైతన్యమే సంకల్ప పరంపరల ఫలితంగా చిత్తముగా పరిణమిస్తోంది.

Page:362

ఈ చిత్తము (మనస్సు) అనబడేది ఒక బాలునికి కనిపించే దయ్యం లాగా మిధ్యారూపంగా కల్పించబడుచున్నది. తరంగము వాస్తవానికి జలమే కదా! ఈ చిత్తము యొక్క వాస్తవ స్వరూపం కూడా అఖండ మండలాకారమగు ఆ చిద్వస్తువే సుమా!

ఎక్కడైనా తరంగములు ఏ ప్రయత్నమైనా చేసి జలాన్ని ఖండించగలవా? జలాన్ని తరంగం ఖండించటం ఏమిటి? అది మొదలే హాస్యాస్పదం. అట్లాగే, ఆ "చిత్స్వభావము (చిత్ యొక్క నిర్మలత్వము - పూర్ణత్వము - అఖండత్వములను) ఏ అన్యమైన దాని చేతను ఖండింపబడజాలదు. జలము .. ఒకానొక ద్రవపదార్ధము. తరంగమో... ఆ జలము యొక్క కదలికచే ఏర్పడే ఒకానొక ఆకారము. ఈ రెండూ అభేదమే కనుక అవి ఒకదానిని మరొకటి ఎదుర్కొనటమనేది ఉండదు. అట్లాగే 'చిత్'కు 'అచిత్'క్కు అసలు అభేదమే ఘటిల్లదు. మరి అచిత్ (దృశ్య పదార్ధము - నీవు - నేను మొదలైనవి) బయలుదేరి చిన్ను మరొకటిగా ఎట్లా చేస్తుంది? చిత్ను ఖండించటమేమిటి? తరంగముల భేదం చేత జలం వేరువేరు కానట్లే 'జీవులు - జగములు మొదలైన వాటి చేత చిత్ ఖండం కాదు కాబట్టి అది అఖండము”.

మనస్సు అనునది ఎక్కడ? జలములో 'తరంగము' అని చెప్పబడే వేతైన పదార్థమున్నదా? కనుక, చిత్ మనస్సు అను స్పందన కలిగి ఉన్నది! ఆ మనస్సు ఆత్మను ఆవరించి ఉంటోంది” అనునవన్నీ అల్పమైన ప్రవచనములు మాత్రమే.

అభేదము దర్శిస్తున్నప్పుడో...! ఒక వేళ ఈ 'చిత్' స్పందరహితమై అమనస్కంగా ప్రకాశిస్తోంది అనుకో.. అట్టి స్థితిలో కేవలము చిద్రూపమే శేషించి ఉంటుంది కదా! ఇకప్పుడు మనస్సుకు చోటు గాని, రూపము గాని ఉండదు. 'నేను కేవల స్వరూపుడను' అను అచింత్యమైన ఎఱుక మాత్రం ప్రవర్తిస్తూ ఉంటుంది.

ఈ విధంగా భేద - అభేదములు అనబడే రెండు పక్షము లందు "చిత్తము అనబడే పదార్దమే లేదు. అని విశ్లేషించబడుతోంది. అయితే మరి మాకు మనస్సు అనుభవమౌతోంది కదా...! అని ఎవరైనా అంటారేమో!

నాయనలారా! ఆ మనస్సుగాని, చిత్తముగాని మీ స్వస్వరూపము కంటే వేరైనవి కావు, కానేరవు. వేరుగా తోచుట భ్రమ మాత్రమే. ఇక మీరో? ... చిత్ యే స్వరూపముగా కలిగి ఉన్నవారు. భ్రమ చేత మాత్రమే అనుభవమగుచున్న ఈ చిత్తము అనబడు దానిని సమ్యక్ యొక్క అభ్యాసముచే జయించి వేయండి. అట్టి అభ్యాసము యొక్క ప్రయోజనమే బ్రహ్మజ్ఞానము”.

అందుచేత ఓ రామచంద్రా! నీవు “మనస్సు అనబడేది ఒకటి ఉన్నది. ఏదేదో చేసి దానిని తొలగిస్తాను ... అనే దుర్బల మనఃసంకల్పములను దరికి రానీయకు. అట్లు మొండిగా భావించుటచే కొందరు శ్రమ - క్లేశములకు లోనగుచున్నారు. ఉన్న వస్తువునైతే మనం తొలగించుటకు ప్రయత్నించ వచ్చు. లేని వస్తువును ఎట్లా తొలగిస్తాం? 'సంకల్పించుట' అను క్రియను మాని వేసి చూడు. ఇక ‘మనస్సు’ అనేది ఎక్కడున్నది? అభ్యాసమే సంకల్పరాహిత్య స్థితిని ధ్రువీకరించటానికి ఉపాయం.

Page:363

శ్రీరాముడు : తండ్రీ! సంకల్పాత్మకమైన మనస్సు అనబడేది అసలు ఉందా? లేక లేదా? ...“మనస్సుచే ఈ జీవుడు బద్ధుడగుచున్నాడు అని కొన్ని శాస్త్రములు చెప్పుచున్నాయి కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : “సంకల్పాత్మకమగు మనస్సు" అనునది ఎక్కడా లేదు. సంకల్పము చేయుటయే మనస్సుగా చెప్పబడుతోంది. అది మిధ్యా జ్ఞానముచే ఉత్పన్నమగుచున్నది. కల్పనయే దాని రూపము. హృదయమందు ఉన్నట్టి సాక్షి చైతన్యమునకు జ్ఞానోదయమైన మరుక్షణం అది శమించిపోవుచున్నది.

ఈ మనస్సు జడమైనది మాత్రమే. దానిని తొలగిస్తున్నది సాక్షి చైతన్య స్వరూపుడవగు నీవే. నేను ఆత్మస్వరూపుడనే” అను భావనను ఆశ్రయించావా... ఇక అది మృతప్రాయమే అగుచున్నది. ఎఱిగినంత మాత్రం చేత మృతప్రాయంగా మిగిలిపోయే ఈ మనస్సుచే ఈ ప్రపంచము సృష్టించబడట మేమిటి? పొందబడుట ఏమిటి? రూపము గాని, ఆధారము గాని లేని మనస్సుచే సాక్షి చైతన్యుడవగు నీవు బాధింపబడటం ఏమిటి?... ఇవన్నీ మూర్ఖ వాక్యములు కావా చెప్పు?... నెమలి ఈకచే కొండ పిండి చేయబడటమంటే ఎట్లాంటిదో.... చంద్ర కిరణము తాకుటచే బుగ్గలు కందటమంటే ఎటువంటిదో... స్వతః సిద్ధమగు ఉనికియే లేని మనస్సుచే ఆత్మ స్వరూపుడగు జీవుడు హింసించబడటం కూడా అట్టిదే!

“ఒకడు మనస్సుచే అనేకచోట్లకు ఈడ్వబడుచున్నాడు”... మరొకడు ఈ మనస్సును జయించడానికి తీర్థయాత్రల నిమిత్తమై దట్టమైన అడవులలోకి ప్రయాణములు చేస్తున్నాడు... ఇటువంటి కథనమంతా మా దృష్టిలో చిన్నపిల్లల చేష్టలే. పరమార్థ దృష్టిచే మనస్సు మొదలైనవి లేవు. “ఏకమ్ సత్ అని శాస్త్రాలు అనటంలో ఉద్దేశ్యం అదే! ఎందుకంటే మనస్సు ఒక మిధ్యా రచనయే కదా! ఎంత అన్వేషించినా ఇదిగో, మనస్సు అనబడునది ఇక్కడ ఈ రూపంలో ఉంది” .....అన్నట్లుగా మనకేమన్నా లభించుచున్నదా?...లేనే లేదు. ఒక మిధ్యా వస్తువు చైతన్య మూర్తిని జయించుటయా? స్వప్నంలో కనిపించిన ఒక చెఱువులో ఆ స్వప్న ద్రష్ట మునిగి మరణించుటయా?

ఆహా! మహామాయావి అగు ఆ మయునిచే సృష్టించబడిన ఇక్కడి 'దృశ్యము' అను మాయ ఎంతటి చమత్కారమైనదో చూస్తున్నావా రామా? తనకు స్వరూపమే లేదు.... ఊరుకున్నంత మాత్రం చేతనే, అది లేకయే పోగలదు... అటువంటి 'మనస్సు" అనబడు మిధ్యా వస్తువుచే ఈ జనులందరు ఆడించబడుచున్నారు. కనుక మనస్సు స్వయంకల్పితం మాత్రమే కాని, ఎవరో కల్పించి మనకు అంటకట్టింది కాదు.

11. అజ్ఞానవశం చేత....

శ్రీవసిష్ఠ మహర్షి: ఎప్పుడైతే అజ్ఞానం కలిగిందో, అప్పుడు ఈ జీవుడు సర్వ ఆపదలకు అర్హుడగు చున్నాడు. ఆతడు పొందని క్లేశం ఏమున్నది...? అసలు ఈ 'సృష్టి' అంతా కూడా అజ్ఞాన కారణంగానే ఉత్పన్నమగుచున్నది. అయ్యో! ఎంతటి విషాదకరమైన విషయం! ఈ జీవుడు అజ్ఞాన వశం చేతనే ‘మనస్సు’ దేహం మొదలైనవిగా గల జడవస్తువులచే బాధింపబడుచున్నాడు. పోనీ ఆతడు సరిగ్గా

Page:364

పరిశీలన చేస్తున్నాడా? లేదు. మరల మరల అసన్మార్గము'నే అవలంబిస్తున్నాడు. తన దుఃఖము కొరకే ఈ సృష్టిని సమాశ్రయించి ఉంటున్నాడు.

శ్రీ రాముడు : మరి ఈ జాడ్యమునకు ఉపాయం?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు, ఈ సృష్టి - ఇవన్నీ ఎట్లా ఉత్పన్నమైనాయి? అవిచారణ’ చేతనే కదా! అందుచేత అజ్ఞానమయమైన ఈ సృష్టి 'సువిచారణ' మాత్రం చేత పేలవమైపోతోంది. ఇక దీనిని గురించి దుఃఖించటం ఎందుకు?

ఈ సృష్టి మనుజుని స్వయం కల్పితమైనట్టి 'భ్రాంతి' యొక్క రూపమే అయి ఉన్నది. “సాయంకాలం ఆకాశంలో పక్షులు అటూ ఇటూ ఎగురుతుంటే అది నాకు నా ప్రియురాలి విరహం గుర్తు చేస్తోంది" అనే వ్యాఖ్యానం ఎంతగా భ్రమ స్వయం కల్పితమో, ఈ సృష్టిని కూడా ఈ జీవుడు అట్టి స్వయంకల్పిత కథనముల చేతనే పొందుచున్నాడు. అట్టి కథనములను మొదలంటా త్యజించాడా... ఇక ఇదంతా ఆ జీవుడు తన స్వస్వరూపంగానే ఆస్వాదించగలడు.

ఏది ఏమైతేనేం? "మిధ్యారూపము, కల్పితము, ఎచ్చటా కూడా ఉనికి లేనిది, అల్పము” అయినట్టి ఈ మనస్సు చేత లోకమంతా హతం కావటం మనం చూస్తున్నాం. అయితే, మానవుడన్న వాడు కల్పితమయమగు ఈ సృష్టిని, 'అసద్రూపము అయి ఉన్న ఈ మనస్సును తన వశం చేసుకో వటానికి సిద్ధపడాలి. అట్లా సిద్ధపడని వాడు అద్యాత్మ జ్ఞానప్రవేశమునకు ఏ విధంగా అర్హుడు కాగలడు చెప్పు? అల్పదృష్టి, స్వల్పములనైన వాటి కొరకు ఆశ, బలహీనమైన అవగాహనలు గల జీవుల యొక్క దుష్టబుద్ధి బాహ్యపదార్ధము లందే స్థిరపడిపోయి ఉంటుంది. వీటిని పొందితే నేను పూర్ణత్వమును పొందుతాను" అని భ్రమను చెందుతోంది. అట్టి బుద్ధి తన అంతరంగము యొక్క స్వరూపమును గ్రహించలేకపోతోంది. సూక్ష్మమైన విశేషములను గుర్తించలేకపోతోంది. సూక్ష్మ బుద్ధి లేని సమయములో ఈ సంసారము యొక్క అల్ప శబ్దములకు కూడా ఈ మనస్సు భీతిల్లుచున్నదే! అల్పమైన విషయముల పట్ల అహంకార - మమకారములు ఏర్పడుచున్నవే!

జ్ఞాన శూన్యుడైనవాడు తన యొక్క మనస్సు చేతనే అతి క్రూరముగా దీర్ఘకాలము నుండి హింసించబడుచున్నాడు. స్వల్ప సుఖములచే పరిపరి విధములుగా మోసగించబడుచున్నాడు.

అనేకమైన అపనమ్మకములతో, స్వల్పములయిన విషయముల మధ్య ఉన్మత్తుడై వ్యవహరించే అట్టి వాని ముందు ఉత్కృష్టమైన సత్య విషయములను ప్రతిపాదించుట ఎట్లాగో మేము గ్రహించ లేకపోతున్నాము.

Page:365

12. ఉపదేశములకు అర్హులు - - అనర్హులు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇప్పుడు శాస్త్రములచే చెప్పబడు ఉపదేశముల సారమును గ్రహించనట్టి వారి విషయమై కొన్ని విషయములు సర్వజనులకు మనవి చేస్తున్నాను.

కొందరు జనులు ఈ సంసార సాగరములో విషయ - సుఖాభిలాషలు అనే తరంగములచే కొట్టుకొని పోబడుచున్నారు. 'పరమార్థ విషయము'లో వారు అత్యంత చెవిటితనం, మూగతనం వహించి ఉంటున్నారు. ఆత్మ తత్వ విచారణ చేయడం, యుక్తి సహాయంతో ఉత్తమ సత్యమును పరిశీలించటం - ఇవన్నీ వారిని సమీపించుట లేదు. అట్టివారు అధ్యాత్మ విద్యను గ్రహించడానికి అనర్హులే అగుచున్నారు.

"కళ్లు మూసుకొనే నడుస్తాం! అది అంతే" అని చెప్పుకుంటూ కళ్లు తెరవని బాటసారికి బాట ప్రక్కన గల పూతోటను ఎవరు చూపించగలరు? వాసన చూడలేని వారికి సుగంధం వెదజల్లే అత్తరులు, రసాయనాలు అందిస్తే ఏం ప్రయోజనం? మత్తుగా త్రాగినవాడికి వాదము - చర్చ' ద్వారా నిజము నిరూపించడానికి ప్రయత్నించగలమా? ఆతడు న్యాయ నిర్ణయమును అర్థం చేసుకో గలడా? విచక్షణ - సద్విమర్శలను ఆకళింపు చేసుకోగలడా?

ఒకడు తన సందేహములను తీర్చుకోవడానికని శ్మశానానికి వెళ్ళి పెద్ద గొంతుకుతో శవ పేటికలతో అరిచి చెప్పితే ఏదైనా ప్రయోజనముంటుందా? మూర్ఖునికి నీతి వాక్యములు వినిపించ గలమా? మనస్సు మొండికేస్తూ ఉండగా దురభ్యాసములకు దాసోహమగుచున్న వానికి సన్మార్గము యొక్క ఔన్నత్యము గురించి చెప్పే సుందరమైన భాషాప్రయోగాలు ఎందుకు పనికి వస్తాయి? అనర్హుల ముందు ఆధ్యాత్మ విద్యను ప్రతిపాదించడం అట్టిదే అగుచున్నది.

ఓ సర్వజనులారా! నాదొక విన్నపము. ఏ మనస్సైతే 'యదార్థానికి లేదు' అని క్రిందటి సర్గలో మనం నిరూపించామో... అట్టి మనస్సు నా ఇచ్ఛ యొక్క రూపమే. ఇచ్ఛ, అభ్యాసములను బట్టి మనస్సు ఉంటోంది. కనుక ఇచ్ఛ, అభ్యాసములు సరి అయిన మార్గములో నియమిస్తూ ఉంటే ఇక మనస్సు జయించబడినట్లే” అని ఎందుకు సంభావించరాదు?

మరొక విషయం. ఒకానొక బాటలో ఆ దూరంగా ఎత్తుగా కన్పిస్తున్నది ఒక పెద్ద బండ రాయేమో?” అని సందేహము, భయము ఏర్పడి ఉన్నాయనుకో... అది దూరముగా చూచిన రథ సారధి అయ్యో! ఎట్లా ప్రయాణించడం ... అని భయపడుతున్నాడనుకుందాం. ఇంతలో అది బండరాయి కాదు, ఏదో క్రీనీడ మాత్రమే... అక్కడ బండరాయి లేదు అని ఎదురుగా వస్తున్న బాటసారులు చెప్పారు. ఇప్పుడు "ఆ బండరాయి తొలగించబడినట్లే అని ఎందుకు భావించరాదు. శ్రీరాముడు : అవును. రథసారధి నిరభ్యంతరంగా అట్లు భావించవచ్చు.

శ్రీ వసిష్ఠ మహర్షి : అదే రీతిగా “మనస్సు అనేదే లేదు అని శాస్త్రములు, మేము కూడా

Page:366

స్వానుభవ పూర్వకంగా ప్రకటిస్తున్నాం కదా! కాబట్టి "ఈ మనస్సు సర్వదా తొలగించబడినట్లే అని

ఎందుకు భావించరాదు.

యదార్థానికి లేనిదే’ అయినట్టి మనస్సుకు ఈ మనస్సును జయించడం మా వల్ల కాదు” అనుకుంటూ తిరుగాడే వారు ఎక్కడో దూరముగా కనిపించిన త్రాడును చూచి పామనుకుని ఇక్కడ నుఱుగులు కక్కేవారే అవుతారు.

జ్ఞానదృష్టి - జ్ఞాని ఎల్ల వేళల తన ఆత్మనే సర్వత్ర దర్శిస్తూ ఉంటాడు. ఆయా తదితర శరీరములను చూచుచున్నప్పుడు ఓహో! ఇక్కడ ప్రాణ శక్తులు ప్రకటనమగుచున్నాయి కదా!” అని మాత్రమే తలచుచున్నాడు. ఆ శరీరములలో ఆత్మయే చైతన్యమూర్తిగా వ్యవహరిస్తూ జడమగు ప్రాణాదులను చలింపజేయుచున్నదని గ్రహిస్తున్నాడు. రెండు పాత్రలలోని ఒకే ద్రవము వలే, రెండు గృహముల స్థానంలో ఒకే ఆకాశము వలే, ఈ నానా విధ దేహాలలో ఒకే ఆత్మ అధిష్టించి ఉంటోందని ఆతడు ఎరుగుచున్నాడు.

జ్ఞాని తన ఇంద్రియములను చూచి "ఓహో! మీరంతా మీ మీ ధర్మములను నియుక్తులగు చున్నారు కదా! మంచిది" అను విధముగా దర్శిస్తున్నాడు. ఇక అతనికి మనస్సు అనేదేదీ, ఎక్కడా

వేరే అగుపించదు.

ఆత్మ... జ్ఞానశక్తి కలిగి ఉంటుంది. ప్రాణములు స్పందనశక్తి కలిగి ఉంటున్నాయి. ఇంద్రియములు... రూపము, రసము మొదలైన వాటిని సాక్షాత్కరించుకొను శక్తి కలిగి ఉంటున్నాయి.

"ఈ ఆత్మ - ప్రాణ - ఇంద్రియములు వాటి ధర్మములను అనుసరించి ప్రవర్తన కలిగి ఉంటున్నాయి. మరిక బంధం ఎవరికి?... ఎక్కడ?... అని జ్ఞాని ప్రపంచమును ప్రశ్నిస్తున్నాడు.

ఈ కనబడే జీవులందరిలో ప్రస్ఫుటమగుచున్న వ్యవహార శక్తంతా సర్వ శక్తిమంతుడు, సర్వ నిర్మాత అగు ఆ పరమాత్మ యొక్క కిరణముల ప్రసరణయే అయి ఉన్నది. అదిగో! ఆకాశములో సూర్యుని చూడు. అనంత సంఖ్యలో సూర్య బింబము నుండి కిరణాలు బయలు దేరుచున్నాయి. ఆ కిరణములన్నీ సూర్యుని స్వభావమును వేరైనవి కావు. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క వస్తువును ప్రకాశింప జేస్తోంది. కాబట్టి "తటాకంపై ప్రసరించే కిరణం వేరు... ఇంటిపై ప్రసరిస్తున్న కిరణం వేరు”... అని అనగలమా? లేదు కదా! "ఈ వేరువేరు జీవరాసుల ద్వారా ప్రకటితమగుచున్న దంతా ఒకే ఆత్మ శక్తియే" అను అనుభవం ఉత్తమ జ్ఞానులు పొందుచున్నారు. ఏ జీవి దేనిని అవగాహన చేసుకుంటున్నప్పటికీ “ఎఱుగుట అను స్వభావము ఒకే తీరై ఉన్నది కదా!

జగత్తు లేదు... ఆత్మయే ఉన్నది - ఈ జగత్తును విజ్ఞాన దృష్టితోను, భ్రాంతి రహితమైన దృష్టితోను చూస్తున్నప్పుడు ఇది అంధప్రాయమే, లేక, లేనిదే" అని తెలియవస్తోంది. అట్టి ఉత్తమ దృష్టిచే ఈ జీవుడు అనబడువానికి ఆత్మ కంటే వేరైన సత్తా లేనేలేదు. ఈ శృతి వాక్యములు చూడు: నాన్యోస్తి దృష్టమ్” = ఈ కనబడుచున్నదేదీ బ్రహ్మము కన్నా వేరుగా ఉండుట లేదు. నాన్యోస్తి విజ్ఞాతమ్ = బ్రహ్మము కంటే వేరుగా ఏదీ తెలియబడుట లేదు. జీవో బ్రహ్మేతి నాపరః = ఈ జీవుడు బ్రహ్మమే గాని, వేరే ఏమీ కాదు.

Page:367

...ఈ వాక్యములన్నీ జగత్తు యొక్క మిధ్యత్వమునకు, ఆత్మ యొక్క సత్యత్వ - నిత్యత్వములకు ప్రమాణములగుచున్నాయి.

శ్రీరాముడు : : అయితే స్వామి! "బ్రహ్మము చేతనము - ఈ జీవుడు అచేతనము - అని అనవచ్చా? శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లా అయితే ఈ జీవుని యందు శక్తి ఉండేది కాదు. స్వకీయమైన ప్రయత్నము - అవగాహన - బంధము - మోక్షము" మొదలగునవి కూడా ఉండేవి కావు. అందుచేత జ్ఞానులు సిద్ధాంతీకరించునది విను‘ఆత్మ కంటే వేరుగా ఈ చిత్త జీవులు లేరు. ఉన్నట్లు తోచటమంతా స్వకీయమైన భ్రమచేతనే. అందుచేత నీకు పైపై కనిపిస్తున్న ఈ 'జీవుడు చిత్తము' అనునవి ప్రతిబింబ మాత్రములు, అసద్రూపములు మాత్రమే. కనుక ఈ జీవుల వాస్తవస్వరూపము నిత్యము-నిర్మలము-అఖండము అయిన ఆత్మయే - అను దృష్టిని కలిగి ఉండు.

ఓ జనులారా! మీ చేత మీరే కల్పించుకుంటున్న “మనస్సు అనబడు దాని కారణంగా మీ యొక్క 'పరమార్థ దృష్టి'ని కోల్పోవుచున్నారే! అందుకు ఫలితంగా మీరు పొందుచున్న దుఃఖ పరంపరలను చూస్తుంటే - మానసిక రోగపీడితుడగు కుమారుని బాధలు చూస్తున్న తండ్రిలాగా - మాకు ఎంతో పరితాపం కలుగుతోంది.

మూర్ఖత్వము - పరిమిత దృష్టిని ఆశ్రయించి "సూక్ష్మము, మంద్రము అయిన ఆత్మ విశ్లేషణా సమాచారం మొదలంట్లా తిరస్కరిస్తున్న మూర్ఖులు అనేకులు ఈ భూమిపై సంచారం చేస్తున్నారు. ఈ ఇంద్రియ విషయములే మహత్తరమైనవని తలచే అట్టివారు తాము పయనిస్తున్న మార్గము ఎట్టిదో ఎరుగలేకున్నారు.

‘గాడిద, మూర్ఖుడు’ - ఈ ఇద్దరు అనేక దుఃఖభారములను అనుభవించుటకే జనించు చున్నారు. అల్పమైన అవగాహనయే కారణం అవటం చేత, మున్ముందుగా అసంతృప్తి పొంది, అటు తరువాత మాకు అవి లేవు, మేము ఇవి పొందలేదు" - ' అని ఇక ఈ మానవుడు అసంతృప్తికి కారణాలు వెతకడం జరుగుతోంది. నిందించటం, ద్వేషించటం, దూషించటం మొదలైన నరక మార్గ పతితులుగా పరిణమించటం జరుగుతోంది.

సముద్రంలో ఎన్నో బుద్భుదములు లేస్తున్నాయి. అయిస్తున్నాయి. అదేవిధంగా ఈ దేహం నందు ఆత్మాభిమానం, ఇంద్రియ విషయముల పట్ల ఆకర్షణ, పాప కర్మల పట్ల బుద్ధి కలిగినట్టి అనేక మంది జీవులు జనిస్తున్నారు. మరణిస్తున్నారు. ఎన్నో కోళ్ళు, పశువులు ప్రతిరోజు కసాయివారి చేతులలో విగత జీవులగుచున్నాయి. ఈ భూమిపై జనించే ప్రాణులలో ఎన్నో కోట్ల ఈగలు, దోమలు ప్రతి రోజూ వాయువు చేత నసింపజేయబడుచున్నాయి. జాలరి వల వేసి వేలాది చేపలను పట్టి కాల్వగట్టు ప్రక్కన పరచి అమ్ముచున్నాడు. విచారణ, పరిశీలన లేనట్టి మూర్ఖ మానవుల జన్మలు కూడా అట్టివే అగుచున్నాయి.

Page:368

అట్టి మూర్ఖుల గురించి దుఃఖించి ఏం ప్రయోజనం? నీటిలో ఒక పెద్ద చేప అనేక చిన్న చేపలను, కీటకములను మ్రింగుచున్నది. ఆ పెద్ద చేప ఒకనాడు ఒక జాలరి చేతికి చిక్కి శల్యమగు చున్నది. పేను వంటి స్వల్పమగు పురుగులను పెద్ద జాతి పురుగులు మ్రింగుతున్నాయి. ఆ పెద్ద జాతి పురుగులు సాలె పురుగు నిర్మించిన గూటిలో చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. ఆ సాలెపురుగును పెద్ద జాతి బొద్దింక వచ్చి భోంచేస్తోంది. ఆ బొద్దింకను కప్ప భుజిస్తోంది. కప్పను పాము ఆరగిస్తోంది. పామును ముంగిస ముంగిసను పిల్లి - పిల్లిని కుక్క - కుక్కను ఎలుగుబంటి

ఎలుగుబంటిని చిరుత పులి - చిరుత పులిని సింహం - సింహమును శరభం - ఈ విధంగా ఒక

దానిని ఒకటి చంపుకుంటున్నాయి. శరభం పెద్ద కొండను ఎక్కి మేఘమును ఢీకొనబోయి చచ్చుచున్నది.

ఆ మేఘము వాయువుచే తొలగించివేయబడుతోంది. వాయువు పెద్ద పెద్ద పర్వతములచే తన దిశను కోల్పోతోంది. ఆ పర్వతములను వజ్రాయుధం క్షణంలో చూర్ణంగా చేసివేయగలుగుతోంది. వజ్రాయుధం ఇంద్రునిచేతికి దాస్కో హం అవుతోంది. ఆ ఇంద్రుడు విష్ణుదేవునిచే ఒక్కక్షణ కాలంలో నియమించబడుచున్నాడు. మరొక క్షణంలో తొలగించబడుచున్నాడు. అంతటి విష్ణువు వంటివాడు కూడా కాలమహిమ చేత అనేక దుఃఖములతో కూడుకున్న చేప, తాబేలు, పంది వంటి ఉపాధులలో ప్రవేశించవలసి వస్తోంది.

అనేక విషయములు తెలిసిన మహా పండితులు, శరీర సౌష్టవము కలవారు కూడా తమ దేహములలో ప్రవేశించిన సూక్ష్మజీవులచే భక్షించబడుచున్నారు.

చూచావా రామా! ఈ విధంగా ఈ కనబడే ప్రాణి కోట్లన్నీ ఆయా తదితర ఆదిభౌతిక జీవుల పాలబడి విచ్ఛిన్న మగుచున్నాయి. అవి ఈ భూమిపై సంచరిస్తున్న కొద్దికాలం అజ్ఞాన విషయములను ఆశ్రయించి, వాటినే అంటి పెట్టుకొని వుంటున్నాయి. అజ్ఞానం చేతనే ఈ జీవులు పరస్పరం హింసించుకోవడం - భక్షించుకోవడం చేస్తున్నాయి. .... అయితే జ్ఞానికి ఇక్కడ కోరుకొనవలసిన విషయం గాని, ద్వేషించ వలసిన విషయం గాని ఉండుట లేదు.

ఒక పురుగు దగ్గర నుండి అనేక జీవజాతులు ఈ భూమిపై నిరంతరం ఉత్పత్తి, వినాశనములు పొందుచున్నాయి. జలాశయాలలో పెద్ద ఆకారములు గల మొసళ్ళు తిమింగలములు ఉత్పన్నమగు చున్నాయి. భూమి లోపల తేళ్ళు - - పాములు - రకరకాల ఆకారములుగల పురుగులు - ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఒక ప్రాణి దేహము నందే అనేక సూక్ష్మ ప్రాణులు, విచిత్ర క్రిమిజాలం ఉత్పత్తి పొంది, నివసించి ఇంతలోనే నశిస్తున్నాయి. స్థావరములగు వృక్షములలోను, పొదలలోను, రంగు రంగుల క్రిమి కీటకములు పుట్టుచున్నాయి. మంచుకొండలలో కూడా కొన్ని ప్రాణులు నివాసం కలిగిఉన్నాయి. ఇంకా మలములందు కొన్ని కీటకములు జనించి, చరిస్తున్నాయి. ఇట్టి అసంఖ్యాకములైన రకరకములగు ప్రాణులన్నీ జ్ఞానముతో కూడిన ఆశ్రయము, అవగాహనలు లోపించిన కారణంగానే ఏర్పడుచున్నాయి. అయితే ఇట్టి ఈ సృష్టి వ్యవహారముల పట్ల అపేక్ష -

Page:369

దుఃఖము - రాగము - ద్వేషము" మొదలైనవి ఉండవలసిన అగత్యమే లేదు. నిరంతర ఉత్పత్తి - వినాశనములతో కూడిన సంసార భ్రమలను ‘సుఖ దుఃఖ భావములు రెండూ ఉచితములు కావు. శ్రీరాముడు : ఈ విధంగా మహా వృక్షము యొక్క ఆకుల వలె పలువిధములైన జీవకోట్లు ఉత్పత్తి అగుచున్నాయి. మరల వినాశనం పొందుచున్నాయి. వీరి దుఃఖములన్నీ తొలగేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : తన బుద్ధిని 'సునిశితము - నిర్మలము చేసుకొన్న వారికే సత్య దృష్టిచే శాంతి ప్రాప్తించుచున్నది. అల్ప విషయములపై ధ్యాస కలిగి వ్యవహరిస్తున్న కుబుద్ధులను దుఃఖ రహితులను చేయటం ఎలాగో మాకు కూడా తెలియడం లేదు. మా విచారణ వినకుండానే తిరస్కరించే వారి దౌర్బల్యము మేమెట్లా తొలగించగలం చెప్పు? అందుకే శ్రీరామావతారం ఈ జగత్తుకు అత్యావస్యకమై... నీవు అవతరించావు.

ఈ మనుజులలో కూడా కీటక-ఈగ-తేనెటీగ-జంతువు-వృక్ష ధర్మాలు ఆశ్రయించే వారు ఉన్నారు. అట్టివారు ఉపదేశములకు అర్హులు కాలేక పోవుచున్నారు. దృశ్య విషయము లందు సంలగ్నమైన మనస్సు గల మనుజునకు, పశువులకు భేదమేమీ ఉండదు. పశువులు త్రాటితో ఈడ్వబడుతూ ఉంటే, మూఢచిత్తులగు మనుజులు తమ మనస్సుల చేతనే ఈడ్వబడుచున్నారు. స్వచిత్తము’ అనే బురదలో ఇరుక్కొని సర్వనాశనము అను పర్యవసానము కొరకై అనేక కార్యారంభములను రచించుకొంటున్న వారిని చూచినప్పుడు - - గోడలు, శిలలు కూడా - "అయ్యో! పాపం అని రోదిస్తున్నాయి.

శ్రీరాముడు : జీవునికి ఇన్ని దుఃఖములు ప్రాప్తించటానికి కారణమేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవరైతే తమ చిత్తములను జయించరో ... వారికి అంతటా దుఃఖములే సంప్రాప్తమౌతూ ఉంటాయి. అప్రయత్నశీలురను, పిడివాదములు చేసే వారిని, ఇంద్రియ విషయములే ఉత్తమ ప్రాప్తములుగా భావించే వారిని, దుఃఖ పర్యవసానము గల కార్యక్రమములను పరమ ఉత్సాహహముతో ప్రారంభించే వారిని, వాటిపై గొప్ప నమ్మకము గలవారిని ఆయా పర్యవసానములే ఆలోచింపచేయగలగాలి. లేదా, అవతార మూర్తివగు నీ వర్తనమే మార్గం చూపాలి. వారు వర్తమానములో మాత్రం ఈ బోధకు తగినంతగా అర్హులు అగుటలేదు. ఎవరైతే తమ చిత్తములను జయించి ఉంటారో అట్టివారి పట్ల మా బోధ తెల్లటి వస్త్రముపై రంగు వలె సుస్థిరము, మహా ప్రభావ సమన్వితము అగుచున్నది. అర్హులగువారి కొరకై గురువులు వెతుకుతూ ఉంటారు.

13. మనోనాశనం

శ్రీరాముడు : ‘మనస్సు’ అనబడేది లేదని మీరు చెబుతున్నది అంగీకార యోగ్యమే అయినప్పటికీ,

మమ్ములను ఈ ఈ ఇష్టాయిష్టాలు, సుఖదుఃఖములు, భయగర్వములు, విడచిపెట్టనంత వరకు ప్రయోజన మేముంటుంది చెప్పండి! అందుచేత మనస్సును అతీత స్థితిలో సుస్థిరపరుచుకోవడం ఎట్లా?

Page:370

శ్రీ వసిష్ఠమహర్షి : నాయనా! పదే పదే చెప్పినదే మరలా చెప్పుచున్నాను. 'మిధ్యయే' అయి ఉన్న మనస్సు అనబడేదాని గురించి వ్యర్థమైన కల్పనలు చేయవద్దు. అమ్మచే వర్ణించబడే “ఆ బారెడు జడలతో పిల్లికళ్ళు గల దయ్యం గురించి విని బాలుడు నిజంగానే దయ్యము అనే దానిని చూస్తున్నట్లు భ్రమించి కెవ్వున అరుస్తాడు చూచావా? ఆ విధముగా మనస్సుచే జనులు క్షణంలో బద్ధులు, దుఃఖితులు అగుచున్నారు. ఆత్మ తత్త్వమును ఏ మరిచి మూఢునిలా అనంతకాలం ఈ మనస్సు నలువైపులా విజృంభిస్తూనే ఉంటోంది. అయినా రామా! నీవిప్పుడు ఈ మన సంవాదముచే పరమార్థ సత్యమగు 'ఆత్మ'ను చక్కగా ఎఱుగుచున్నావు కదా! 'చిత్తము' అనేది సంకల్ప పరంపరలు కారణంగానే వృద్ధి చెందుతోంది. అందుచేత నీవు ఈ దృశ్య సంకల్పములను వెనువెంటనే త్యజించి వేయి. ఈ దృశ్యమును గనుక నీవు ఆశ్రయించావా... ఇక అంతే .. నీవు చిత్తసహితుడవు, బద్ధుడవు అవుతావు. ఈ దృశ్యము అసత్యము, అసంభవము కూడా" - అని ఎఱిగిన వాడవై దీనిని త్యజించావా - ఇక నీవు చిత్త రహితుడవు ముక్తుడవు అగుచున్నావు.

ఈ దృశ్యము త్రిగుణముల స్వైరవిహారము కారణముగా మాయతో కూడినదై వుంటోంది. దీనిని ఆశ్రయించావా ... బంధము. పూర్తిగా త్యజించావా ...మోక్షము.

ఈ సత్యమును గ్రహించి అట్టి ఎఱుకను అంతరంగమున పదిలపరుచుకొని, ఇక ఆపై ఏది ఎట్లు ఉచితమో, అది అట్లే నిర్వర్తించు. "ఆ బాహ్య - - అభ్యంతర దృశ్యములు రెండూ నేను కాను అని భావించుచూ ఒక పర్వతములాగా స్థిరముగా వుండు.

1. హృదయేశ్వరుడగు ఆ పరమాత్మ యొక్క ఉనికి ఆకాశంలా అతి విశాలమైనదని ఎఱిగి ఉండు. ఆయనే నీకు కనబడే ఆయా నామరూపాలు అగుచున్నాడని సమాధానము పొంది ఉండు.

2. “ఇది జగత్తు - ఇది ఆత్మ" అను భ్రాంతి రూపమై ద్వైతకల్పనను పూర్ణముగా వదిలివేయి. అప్పుడు శేషించి ఉండే సాక్షి చైతన్యమునందు సిద్ధుడవై ఉండు. లేదా అట్టి అభ్యాసాన్నైనా ఆశ్రయించు.

3. దృశ్యము - దృష్టి”ల మధ్య దర్శనము' అనే గల అనుభవం ఉంటోది కదా!... అట్టి అనుభవమునకు కర్తయగు ఆత్మయే దృష్టి - దర్శన - దృశ్యము లందు అనున్యూతమై ఉంటోంది. అట్టి విషయరహిత సాక్షితత్వమును సర్వదా భావన చేస్తూ ఉండు. అట్టి భావనలో జగత్తు ఉండదు కనుక అది ‘భావరహిత స్థితి యే అవుతుంది.

4. ఆస్వాదించునది - ఆస్వాదించబడునది అను రెండిటికీ మధ్య ఉండే విషయరాహిత్యాన్ని ఆరాధించు, ఉపాసించు.

5. అనుభవి - - అనుభవనీయము (The Experiencer - Experiences) అను రెండిటి మధ్య నిరాలంబమై, ఆ రెండిటి కన్నా వేరుగా ఉనట్టి శుద్ధతత్త్వమును సమాశ్రయించి ఉండు.

6. జాగ్రత్ - స్వప్న సుషుప్తిల మూడిటి కంటే విలక్షణమైన స్వరూపము నందు మనోబుద్ధులను ప్రతిక్షేపించి ఉండు.

అట్టి శుద్ధ చిన్మాత్ర స్వభావనము అని పిలువబడే ఆత్మసత్తను ఏమరచి, విషయములను

Page:371

భావించటం, దృశ్యముచే ఆకర్షించబడటం దౌర్భాగ్యం అనిపించుకోదా? అట్లు దృశ్యమును ఆశ్రయిం చుటే “చిత్త దశను పొందటం" అని గ్రహించు.

ఓ మహాబాహో! రామా! "ఆత్మ జ్ఞాన స్వరూపము” అనే యుక్తి చేత చిత్తము అనే సంకెళ్ళను త్రెంచివేయి. చిత్తము అనే పంజరము నుండి ఆత్మ అనే సింహమును విడిపించు.

శుద్ధమగు స్వాత్మస్థితిని వదలి విషయోన్ముఖుడవు నీవు ఎందుకు కావాలి? విషయములు పట్ల ధ్యాసచే విషయాకారుడవై బంధమును పొందుతున్నావు. ఇతఃపూర్వపు అనుభవము, దృశ్య సంస్కారముల కారణం గానే ఆత్మకు అన్యమైన 'చిత్తము - స్థూలము' అను రూపములు ప్రాప్తించటం జరుగుతోంది. మరల అభ్యసిస్తూ రాగా, నిరంతరము మననము" మొదలగువాటిచే ఈ చిత్తము ఆత్మత్వము దృఢనిశ్చయంతో స్వీకరించటం జరిగితే, అప్పుడా చిత్తము 'శుద్ధాత్మ’తో స్వయముగా ఏకమగుచున్నది. అప్పుడు “ఇది ఆత్మ - ఇది చిత్తము అని చెప్పటానికి కూడా ద్వైతము” అనేది మిగలదు. "జగత్తంతా ఆత్మయే అనే జ్ఞానం అంతఃకరణంలో వికసించిన తరువాత ఇక విషయ సహితమగు చేతనమెక్కడ? ఉపాధి సహితమగు చిత్త మెక్కడ? చేతనమగు మృతులెక్కడ? .... కేవల పరమార్థ స్థితి యందు వీటన్నిటికీ చోటే వుండదు.

చిత్తము అంటే అసలు ఏమిటి? - ఈ దేహము - - ఈ ఇంద్రియములు - - వీటి వ్యవహారములు ఇవే నా రూపము అను పరిమిత దృష్టి - అనుభవస్థితియే - 'చిత్తము' అను శబ్దముచే చెప్పబడుతోంది. అట్టి చిత్తమే, ఆద్యంతాలు లేనట్టి దుఃఖాలను విస్తరింపజేస్తోంది. నేను ఈ భౌతిక శరీర పరిమితుడను” అన్న కీలక స్థితిని పరిశీలించి పరమార్థంగా చూచినప్పుడు "బ్రహ్మమునకు అన్యంగా 'జీవసత్త’ అనబడేదే లేదు అని తెలియవస్తోంది. కనుక నేను బ్రహ్మమునే! అనునట్టి అనుభవమును, అనుభూతిని పొందుటయే చిత్తము యొక్క ఉపశమనము సుమా! అదే పరమ సుఖము.

"ఈ చిత్తము కూడా జగత్తులోని భాగమే కదా! ఈ జగత్తంతా ఆత్మయే అను నిశ్చయం చేత ‘చిత్తము లేకపోవటం’ అనేది సిద్ధించగలదు. దానినే చిత్తము యొక్క నాశనం, ఉపశమనం అని కూడా పిలుస్తున్నాం.

ఇట్టి సత్యజ్ఞానోదయమైనప్పుడు స్వాత్మయే - అంటే నేనే ఈ జగత్తు" అను అనుభవస్థితి కలుగుతోంది. ఇకప్పుడు సూర్యోదయముచే చీకటి పటాపంచలైనట్లు, మనస్సు స్వయంగానే నశించి పోతోంది. మనస్సు అనే సర్పం శరీరంలో ఉండి యధేచ్ఛగా సంచరిస్తున్నంత వరకు భయము - ఉత్కర్షలు ఉండేతీరుతాయి. అట్టి సర్పమును "బ్రహ్మాత్మైక్య విజ్ఞానము చేత, 'సమాధి' చేత పట్టి, ఆశ, తృష్ణ అనే కోరలు పీకి “సర్వసమత్వము” అనే బుట్టలో వేయాలి. ఇక దాని వల్ల భయముండదు.

చిత్తమే ఇష్టము. మనస్సే మననము. చిత్తములో నుండి పుట్టుకొస్తున్న భ్రాంతి అనే దయ్యమున సమైక్యజ్ఞానము అన్న మంత్రముచే బలాక్రమంగా వినాశనం చేయాలి. ఎందుకంటే, ఎంతో బలము గలది, మొండిది అయిన ఈ చిత్తపిశాచము అనేక జన్మలుగా శరీరంలో ప్రవేశించి

Page:372

ఆక్రమించుకొని ఉంటోంది. నేను - నీవు - తదితరులు - సర్వము... పరిశుద్ధమగు - ఆత్మయే అను ఉత్తమ భావనచే ఇక చిత్తపిశాచము ఈ దేహంలో నిలవలేదు. అప్పుడు ఉద్వేగము - - వ్యధ తొలగుతాయి. భయములు వేసటలు - భ్రమలు ఉండవు.

ఆత్మ సర్వదా లభించియే ఉన్నది కదా! ఇక నాకు రాగమెందుకు? ద్వేషమెందుకు? కోర్కెలతో పనేమున్నది? ఇక నాకు బాహ్యమున గాని, అంతరంగమున గాని అపేక్షించవలసినదేదీ ఉండ జాలదు. ఏదీ నాకు సుఖముగాని, దుఃఖముగాని కాజాలదు" - అనే నిశ్చయముతో ఆత్మజ్ఞులు ఈ జగత్తులో వ్యవహరిస్తున్నారు. అందుచేత వారు చిత్తరహితులే అగుచున్నారు. అంతఃకరణములో ఎట్టి కోర్కెలు జేరకుండా, దుఃఖరహితమైన ఉత్తమపదమును సొంతం చేసుకుంటున్నారు.

14. తృష్టి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఈ జీవుడు ఒకానొక అతిగట్టిదైన త్రాడుచే చేతులు కట్టబడి ఈ సృష్టిలోకి మరల మరల ఈడ్చుకురాబడుచున్నాడయ్యా! ఆ త్రాడు పేరే తృష్ణ. ఇప్పుడు ఈ తృష్ణ గురించి కొన్ని విశేషాలు చెపుతాను. వినుఆత్మ ఒకానొకప్పుడు తన బ్రహ్మస్వభావమును ఏమరచి, చిత్తము అను దానిని ఆశ్రయిస్తోంది. అట్టి చిత్తము అపవిత్రమగు ఈ సంసారము అనబడు దానికి బీజమగుచున్నది. అట్టి చిత్తము జీవుని బంధించు జాలము వంటిది సుమా! అంటే ఏమిటి? ఆత్మ ఇంద్రియ వృత్తులకు సంబంధించిన అనుభవములను ఆశ్రయించినదై, చిత్తముచే కల్పించబడిన ఈ దేహాదులే నేను అను నిశ్చయమును పొందుతోంది. ఆ చిత్తము రాగ ద్వేషములు, వాసనలు ఏర్పడటానికి దోహదమగుచున్నది.

అంతకంతకు పెరిగిపోతున్న ఈ తృష్ణ మహామోహప్రదమగుచున్నది. మహాభయ దాయకమగు చున్నది. అది ఆత్మనే మూర్ఛిల్ల జేస్తోందే? అది ఉదయించినప్పుడల్లా అనంతాత్మ యందు జగత్తులు అను వికారములు ఏర్పడుచూనే ఉన్నాయి.

ఓ రఘురామా! ‘ప్రళయాగ్ని' వేడిమినైనా సహించవచ్చునేమో గాని ఈ తృష్ణ యొక్క దాహకత్వం సహించటం బ్రహ్మ రుద్రాదులకు కూడా అంత తేలిక కాదు. ఆహా! అతి తీక్షమై కృష్ణవర్ణము (నలుపు)తో కూడినదై, అతి దీర్ఘమై, అనేక దుఃఖములే ప్రయోజనముగా కలిగినదై, శీతలము -

భయంకరము కూడా అయినట్టి ఈ తృష్ణ అనే ఖడ్గము ఉపాధిపరంపరలను అత్యంత క్రూరంగా పరపర నఱకివేయుచున్నదే! వారించుటకు అలవి కాదేమో అని అనిపించే న్యూనత, అవమానము, స్వల్పత్వము, అసూయ, దుఃఖము, జాడ్యము" ఇవన్నీ ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి? ఈ విషయం మేము బాగా పరిశోధించాం. ఇవన్నీ ఈ జీవుని యొక్క 'ఇది-అది కావాలి' అను రూపం గల తృష్ణ నుండే బయలుదేరుచున్నాయి అని మేము కనుగొన్నాం.

ఈ తృష్ణ అనే పెద్దపులి మనస్సు అనే బిలంలో ప్రవేశించి 'ఇంద్రియములు' అనే రక్తమాంసాలను

Page:373

ఆకలిగా పీక్కుతింటున్నది. ఈ ప్రాణులను కొండరాళ్ళ మీదికి, ముళ్ళ పొదలలోకి ఈడ్చుకుపోయి ముక్కలు ముక్కలుగా చేసి నములుచున్నది.

తృష్ణాపీడుతుడైన జీవుడు - అది ఎప్పుడు, ఎట్లా పుడుతోందో, ఏ రూపంగా మనస్సును ఆక్ర మిస్తోందో, ఈ జీవుడు గమనించలేకపోవుచున్నాడు. దాని చేత పీడించబడుచున్న ఈతడు అతి దీనమైన అంతః కరణం కలిగి ఉంటున్నాడు. శక్తిహీనుడై, విమోహితుడై ఆక్రందనములు చేస్తున్నాడు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున అనేక విషయములు, వ్యవహారములచే పదే పదే ప్రతిహతుడగు చున్నాడు.

తృష్ణ అనే త్రాచుపాము ఎక్కడ ఉండదో, అక్కడ మాత్రమే ప్రాణవాయువులు స్వస్థత పొందు తాయి. అక్కడ అసంకల్పితంగా పుణ్యం వర్ధిల్లుతూ ఉంటుంది. కందిరీగల చేతను, తదితర కీటకముల చేతను స్పృశించబడని పూతీగ మరింత అందమైన పుష్పాలను ప్రసాదించగలదు కదా!

తృష్ణారహితుడు ప్రారంభించే ప్రతి కార్యక్రమము అద్భుతమైన ప్రయోజనం కలిగి ఉంటుంది. లోకమునకు అనిర్వచనీయమైన శుభమును, ఆహ్లాదమును చేకూర్చగలుగుతుంది. అతని ప్రతిపలుకు సుఖ శాంతిప్రదములు అవుతాయి.

అసలు తృష్ణ నివసించే చోటెక్కడండీ?" అని ప్రశ్నిస్తే... అది గూడు కట్టుకుని ఉండేది వివేక రహితుని హృదయంలోనే! అది అక్కడ అత్యంత వ్యాకులత్వంచే భ్రమరూపంగా ఉరకలు వేస్తోంది అనునదే మా సమాధానం. అయ్యో! కాలికి కట్టిన యంత్రపు త్రాడుచే అంత పెద్ద పక్షి కూడా ఈడ్వబడుచున్నట్లు ఈ జీవులు అనేక బంధనములు, సంకుచిత స్వభావముల వైపు నెట్టుకుపో బడుచున్నారే! తృష్ణను ఆశ్రయించినందుకు ఫలితంగా చివరికి మిగిలేది క్షయము, చింత, శోకములు, కూలబడటములే అగుచున్నది. తృష్ణచే ఉద్భవించిన చింతలచే గొప్ప ప్రజ్ఞాపాటవములు కలవారు, అనేక విషయములు తెలిసివారు కూడా చివరికి విచ్ఛిన్నులై హతమొనర్పబడుచున్నారు కదా! దయాశూన్యము, కర్కశము అయిన వేట కత్తి యొక్క పదునైన అంచుచే సాధు జంతువులు ఖండిచ బడుచున్నట్లు దయ, వివేకము, ఉత్తమ ఆశయము, భగవధ్యానము మొదలైన సాధు గుణాలు తృష్టచే తెగకొట్టబడుచున్నాయి. నూతిపై మొలచిన పచ్చటి తృణములను (గడ్డిపరకలను) భక్షించడానికి వెళ్ళి, లేడి నూతిలో పడిపోయినట్లు, ఈ తృష్ణను వెన్నంటి వెళ్తే మూఢుడు 'నరకం' అనే అంధకూపంలో పడిపోతున్నాడు. లోకంలో ముసలితనం చాలా దుర్భరం. చివరకు కళ్ళు కూడా కనబడవు కదా! అంటూ ఉంటారు. కాని అతి సూక్ష్మమైన ఈ తృష్ణా పిశాచం వార్ధక్యం కంటే కూడా అధికంగా ఈ జీవుని గ్రుడ్డివానిగా, దీనునిగా చేసివస్తోంది.

అమంగళకరమగు 'తృష్ణ' అనే పిశాచం హృదయంలో కిచిత్ ప్రవేశించుట చేతనే అంతటి తృష్ణచే బంధితుడైన ఆ సూర్యభగవానుడు కూడా ఒక గుంజకు త్రాటిచే కట్టబడినట్లు ఆకాశంలో అటూ ఇటూ త్రిప్పబడుచున్నాడు. అందుచేత ఓ రామా! ఈ ప్రాణి కోట్ల ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తూ దుఃఖమే ప్రయోజనంగా కలిగిన ఈ 'తృష్ణ' అనబడే భూతము నీచే అల్లంత దూరంలోనే త్యజించివేయబడు గాక!

Page:374

తృష్ణచేతనే వాయువు వీచుచున్నది, పర్వతములు నిలబడుచున్నాయి, ఈ భూమి జీవరాసులను ధరిస్తోంది. ఈ మూడు లోకములు కూడా తృష్ణచేతనే ధరింపబడుచున్నాయి. ఒకడు ఒకచోట ఒక త్రాడు చేత కట్టబడితే, ఆ బంధం నుండి విడిపించుకోవటం తేలికే నేమో గాని, 'తృష్ణ' అనే బంధం నుండి మాత్రం ఈ జీవుడు అంత తేలికగా విడివడలేడు. అందుకు "మహా ప్రయత్నం కావాలి. అందుచేత, రామా! నీవు "సంకల్పములను విడుచుట" అను ఉపాయంతో తృష్ణను పరిత్యజించు.

సంకల్పములే మనస్సు. మనస్సే తృష్ణకు ఉనికి స్థానం. అజ్ఞానముతో కూడి బలవత్తరమగు సంకల్పముల పరంపరయే తృష్ణ అయి ఉన్నది. మరొక రహస్యం. ఈ దేహమే నేను" అనబడు దేహాభిమానమును ఈ జీవుడు ఎందుకో ఆశ్రయించుచున్నాడు. అజ్ఞానమయము, సర్వ దురాశలకు నిమిత్తము అయినట్టి అట్టి అభిమానమే తృష్ణకు నివాస స్థానం కల్పించుచున్నది. అనాత్మభూతములైన ఈ దేహము మొదలైనవాటి యందు ఆత్మాభిమానం త్యజించిన మరుక్షణం దుఃఖములన్నీ తమంతట తామే సమసిపోతాయి. అప్పుడు నీవు జ్ఞానిగా పరిగణింపదగిన వాడవౌతావు.

అందుచేత “నేను సర్వపదార్ధములకు అతీతముగా నిత్యమై, సత్యమై, భవ్యుడనై ఉన్నాను” అను రూపము గల “అనహమ్" భావనచే ఈ తృష్ణ అనబడు దానిని కత్తిరించివేయి. ఈ జగత్తులో కనిపించే విభూతులన్ని తిరస్కరించి వేయి. ప్రపంచాతీతమగు 'పరబ్రహ్మము' నందే సుస్థిర చిత్తుడవు, స్వస్థుడవు కమ్ము.

15. చికిత్స

శ్రీరాముడు : హే మహాత్మా! సద్గురూ! "ఈ తృష్ణ, అహంకారములను త్యజించండి అని మీరు చెప్పిన వాక్యాలు అత్యంత ఆప్తవాక్యాలు గానూ, గంభీరంగానూ ఉన్నాయి. కాని, నాదొక సందేహం. 'అహంకారం'ను త్యజించ వలసివస్తే ఈ దేహమును కూడా పరిత్యజించ వలసివస్తుందేమో కదా! ఎందుకంటే, అహంకారమునకు ప్రాణమునకు ఒకానొక ఐక్యత ఉన్నది. మరి ఒక వైపు ప్రాణములను రక్షించుకుంటూ కూడా మరొక వైపు అహంకారమును వినాశనం చేయటం సంభవమేనంటారా? పెద్ద పాకను ఒక తాటి స్తంభము ధరించి ఉంటున్నట్లు అహంకారమే ఈ దేహమును ధరించుచున్నది. అట్టి అహంకారమే నశిస్తే, ఇక ఈ దేహమును ధరించే దెవరు? ఇది నేలకూలక తప్పదు. కాబట్టి హే మహావక్తా! నేను ఈ అహంకారమును ఎట్లా పరిత్యజించాలి చెప్పండి? ఈ "అహంకారము

- - ప్రాణము - శరీరము”ల సంబంధం విషయంలో నన్నేం చేయమంటారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ లోకంలో జనులు మూడు రీతులైన అహంకారమును కలిగి ఉంటున్నారు1. ధ్యేయ-జ్ఞేయ" వాసనతో కూడిన అహంకారము (దేహాహంకారము) -

ధ్యేయము = ఇంద్రియములచే పొందబడవలసినవిగా భావించబడుచున్నవి.

జ్ఞేయము= ఇంద్రియములచే తెలుసుకొనవలసినవిగా భావించబడుచున్నవి.

Page:375

ఇట్టి అహంకారము కలిగి ఉన్న జీవుల భావన లేక, అంతఃకరణము నందలి నిశ్చయము విను! దేహేంద్రియములు, అన్న పానాలు, తదితర బాహ్య పదార్ధముల సంఘాతమే నేను. ఈ దేహం, ఈ అన్నపానాదులు నా జీవితము నిమిత్తమే ఉన్నాయి. ఇవి ఉన్నచోటే నేను ఉన్నాను. ఇవి లేనప్పుడు నేను కూడా లేను.... - ఇది 'పరిమితావగాహన', మరియు, 'ప్రధమాహాంకారము' అని కూడా శాస్త్రములు పిలుస్తున్నాయి.

2. 'ధ్యేయ వాసనాత్యాగము'తో కూడిన అహంకారము (చిద్రూపాహంకారము) - ఇట్టి త్యాగ మార్గమును అవలంబించిన జీవులు తత్త్వవిచారణను ఆశ్రయించుటచే ఈ దేహ - ఇంద్రియ సంఘాతమును, మనస్సును వేరు చేసి పరిశీలిస్తున్నారు. క్రమంగా, ఈ మనస్సు, దేహం, ఇంద్రియాలు అసత్తే అయి ఉన్నాయి అను నిశ్చయము దృఢపరుచుకొనుచున్నారు. అట్టి విచారణ-నిశ్చయముల యొక్క బలముచే “నేను 'సద్వస్తువు' అగు చిద్రూపాహంకారమును అను రెండవ అహంకారమును హృదయములో ప్రవేశపెట్టుచున్నారు. "ఈ దృశ్యములో కనిపిస్తున్న, వినిపిస్తున్న ఏ ఒక్క వస్తువుతో కూడా నాకు సంబంధమే లేదు. అవి నా యందు లేవు. నేను వాటి యందు కూడా లేను అను ఎఱుకను, బుద్ధిని, పరిపక్వపరుచుకొనుచున్నారు. ఆ అవగాహనను అంతర్లీనంగా కలిగి ఉంటూనే లీలామాత్రంగా ఆయా నియమితమైన క్రియలను నిర్వర్తించుచున్నారు. అట్టి ప్రశాంత బుద్ధితో కూడిన నిశ్చయము యొక్క ప్రభావంచే సర్వ బాహ్య విషయములపై ప్రియ - అప్రియములను తొలగించుకొనుచున్నారు. ఉపసంహరింప జేసుకొనుచున్నారు. లోకానుకూలంగా లోకోపకార దృష్టితో నిర్వికారంగా వర్తమానము నందు చేయవలసనవి మాత్రం నిర్వర్తిస్తున్నారు.

అతడు "ధ్యేయ త్యాగాహంకారి అగుచున్నాడు. అట్టివాడు అట్టి ఉత్కృష్టతచే ముక్తుడే సుమా!

3. జ్ఞేయ వాసనాత్యాగముతో కూడిన అహంకారము - ఇట్టి అహంకారము ఆశ్రయించే -

మహనీయుడు నాతో సహా ఈ జగత్తు అంతా బ్రహ్మమే కదా! ఇక వాసన లెవరికి? ఎందుకు? ఎక్కడ?" అను రూపము గల సాక్షాత్కారం పొందుచున్నాడు. వాసనలన్నింటిని క్షయింప జేసి, నిర్మాల్యుడగుచున్నాడు. అహంకారమునకు ఆవల సాక్షిస్వరూపమును అభ్యసించుచున్నాడు. సర్వ మానసిక వికల్పములను త్యజించివేస్తున్నాడు. "తను, తదితరులతో సహా సర్వము దివ్యము అగు ఆత్మ ప్రదర్శనా చమత్కారమే! అను దృష్టిని, అవగాహనను పెంపొందించుకుంటున్నాడు.

అట్టివాడు సదా నిర్వికల్పుడగుచున్నాడు. సర్వదా దేహరాహిత్యాభిమాని అగుచున్నాడు. ఈ విధమైన వాసనాత్యాగముచే దృశ్య కల్పనంతా సమసిపోగా, ప్రశాంత స్థితిని పొంది 'ఎరుగుట' అను దానిని ఉపసంహరించి 'నిర్వికల్ప సమాధి'యందు ప్రవేశించుచున్నాడు. అతడు 'జ్ఞేయత్యాగి' అనుపేరుతో చెప్పబడుచున్నాడు.



ధ్యేయ వాసనాత్యాగం అవలంబించి, లోకమునకు ఉచితమైన కార్యములను ఒనర్చు జీవన్ముక్తు లైన వారిలో జనకమహారాజు వృత్తాంతం ఒక దృష్టాంతం. జ్ఞేయ వాసనాత్యాగం చేసి శాంతిని

Page:376

పొందినట్టి విదేహముక్తులగు మహాత్ములు ఉన్నారు. అట్టివారు సర్వోత్తమమగు బ్రహ్మము నందే స్థితి కలిగియున్నారు. శుకమహర్షి అట్టివారే. ఓ రామచంద్రా! ఈ ధ్యేయ - జ్ఞేయ వాసనా త్యాగులిద్దరూ సమానులే సుమా! రెండు మార్గములు ముక్తిదాయకములే అవుతాయి. ఈ జీవునకు సంతాపము లేకుండా చేసి, క్రమముగా ఆత్మతత్వమును ప్రాప్తింపజేస్తాయి. జ్ఞేయ వాసనాత్యాగి = సమాధి యందు అర్హుడైనవాడు విదేహముక్తుడు = దేహరహితుడు.

ధ్యేయవాసనాత్యాగి = సమాధి నుంచి లేచి వ్యుత్థానకాలంలో వ్యవహరించే వాడు; జీవిస్తూ ఉంటూనే ముక్తత్వము కలిగి ఉన్నవాడు. దేహవాసహితుడు, దేహము ఉండి కూడా దేహవాసనలు లేనివాడు.

వీరిద్దరూ కూడా ‘అవిద్య’ను అధిగమించుటచే కేవల బ్రహ్మ పదంలో సుస్థితులై ఉంటున్నారు. ఈ దేహ-విదేహముక్తుల గురించి (ధ్యేయ - జ్ఞేయవాసనా త్యాగుల గురించి పదకొండు రోజులుగా కొన్ని విషయాలు చర్చించాం. ఇక ముందు కూడా మరికొన్ని విషయాలు చెప్పుకో బోతున్నాం.

16. జీవన్ముక్తుడు

శ్రీరాముడు : హే మహర్షీ! మీరు తృష్ణ నుండి విడివడినట్టి జీవన్ముక్తుల గురించి, విదేహముక్తుల గురించి విశదీకరించటం జరిగింది. "ధ్యేయ వాసనాత్యాగి - జ్ఞేయ వాసనాత్యాగి అనబడుచున్న వారిద్దరి గురించి మరి కొన్ని విశేషాలతో నిర్వచించి ముందుగా చెప్పమని నా ప్రార్ధన. అటు తరువాత యదావిధిగా తదితర విషయాలు ప్రస్తావన కొనసాగించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! నీవు కోరిన విధంగానే జీవన్ముక్త - విదేహముక్తులను నిర్వచిస్తాను విను. వారు ఏ ఉపాయములచే తృష్ణ నుండి విడివడుచున్నారో నీవే గ్రహిస్తావు.

ఎవడైతే కాలానుగతంగా నిరంతరం ఏర్పడుచుండుటే, స్వభావంగా కలిగి ఉండే ఆయా సుఖ దుఃఖాలను, హర్ష శోకాలను తన అంతరంగంలో పొందకుండానే ఉంటాడో అట్టివాడే 'జీవన్ముక్తుడు' అని పిలవబడుచున్నాడు. అతనికి ఇష్ట- అయిష్టములు గాని రాగ-ద్వేషములు గాని ఉండవు. ఇక, ఆయా ప్రాప్తించే వ్యవహారములను మాత్రం, సుషుప్తుని వలే మమకార - కర్తృత్వములు లేకుండానే నిర్వర్తిస్తూ వుంటాడు.

అతనికి “ఈ దేహమే నేను, దేహ సంబంధములైన ఈ ధన-గృహ-బంధుజనుల వ్యవహారం నాది అనే అహం - మమత్వములు ఉండవు. హర్ష శోకములు గాని, కామ క్రోధములు గాని, దర్పము దీనత్వములు గాని అతని అంతరంగ ప్రజ్ఞను ఏమాత్రం స్పృశించవు. ఇక ఇక్కడ తారసబడే ఇంద్రియ విషయములను దూర ప్రదేశములోని ఎవరికో సంబంధించినవిగా చూస్తాడు. తన

Page:377

అంతరంగంలో (నిదుర లేచి స్వప్నములను చూస్తున్నట్లు) ఆతడు 'ఆత్మజ్ఞానము' అను స్థానంలో నిదుర లేచి ఉంటాడు. ఈ సర్వమును 'ఆట, ఆటవిడుపు’ల వలె చూస్తూ ఉంటాడు. సర్వకళా పరిపూర్ణుడైన పూర్ణచంద్రుడు ఏ తీరుగా, తన ఉనికిచే తాను ఆహ్లాద భరితుడై, తదితరులను ఆహ్లాద పరుస్తూ ఉంటాడో, మన ఈ జీవన్ముక్తుడు కూడా స్వాభావికంగానే సంతోషము, ఉల్లాసములచే పరిసేవితుడై వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక 'విదేహముక్తులు' విషయానికి వస్తే వారు ఇంద్రియ గోచరమైన ఈ దృశ్య ప్రపంచానికి సంబంధించినవారు కారు. వారి గురించి వచనముల చేత చెప్పటమంటే చిన్న పాత్రతో పెద్దధాన్యపు గుట్టను కొలవటం వంటిది. ఇప్పటికి మాత్రం ముక్తుని స్థితి గతులు ఏ తీరుగా ఉంటాయో మరి కొన్ని విశేషాలు చెపుతాను. వినువిషయ రహితము (సర్వ ఆశలు అధిగమించినట్టిది) - ఒక్క వాక్యంలో చెప్పాలంటే 'ముక్తి' అనగా ఈ ఇంద్రియ విషయముల పట్ల సర్వ ఆశలు వర్జితమైనప్పటి 'ఇచ్ఛ’చే, ప్రవాహపతితంగా ప్రాప్తించిన కర్మలను ఆచరించుచుండటమే. ఎప్పుడైతే, ఈ జీవుని యొక్క బుద్ధి - దృశ్య విషయములో “ఇది సత్యమే అను భావన, భోగముల పట్ల ఆశ కలిగియున్నదై; బాహ్య పదార్ధము లందు స్థితి కలిగి ఉంటుందో - అదియే దృఢమగు సంసారబంధము!

జీవన్ముక్తులు తమ హృదయమును సంకల్పరహితం చేసుకుంటున్నారు. బాహ్యపదార్ధము లందు లీలామాత్రంగా పాల్గొనుచున్నారు. వారు విషయ ఆశావర్జితమైన ఇచ్ఛచే ఆయా పరిస్థితులకు అనుకూలంగా ప్రశాంతమైన అంతరంగముతో వ్యవహరిస్తున్నారు.

బాహ్య పదార్ధముల పట్ల గల ఆసక్తి చేత తృష్ణ వృద్ధి పొందినప్పుడు ఈ జీవుడు ‘బద్ధుడు’ అగుచున్నాడు. విషయములన్నిటి యందు వాసనారహితమైన చిత్తము కలిగి ఉన్నప్పుడు, ఈ జీవుడే ముక్తుడు’ - ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఇంత మాత్రమే.

క్షోభరహితం - ముక్తుని యందు మనకు కనిపించే ఒక విశేషమేమంటే - విషయములు ప్రాప్తించటానికి ముందు గాని, ఆ విషయములు తొలగుచున్నప్పుడు గాని ఆతని యందు ఆ రాగ విరహాదులచే కలిగే దుఃఖం ఉండదు. ఎల్లప్పుడు అతడు వర్తమానకాలము నందు స్థిరమైన బుద్ధి కలిగి ఉండి, ఉచితానుచితములను అనుసరించి "ఇది నాకర్తవ్యమై ఉన్నది, అందుచేత చేస్తున్నాను” ...అని నిర్ణయించుకుని ఉంటాడు.

ఈ వస్తువో, విషయమో నాకు ప్రాప్తించాలి" - అను ఇచ్ఛయే బంధం. అనగా, ఇంద్రియాలను స్వీకరించిన జీవుడు, ఇంద్రియ విషయాలకు దాసుడవటం జరుగుతోంది. ఈ పదార్ధముల గతి, పరిణామములు ఎఱిగావా... ఇక వాటి పట్ల తృష్ణ ఏర్పడదు. ఈ 'సత్-అసత్' రూపములైన పదార్దములచే ఆకర్షణ-వికర్షణలను చెందకుండా ఉండే పరమోదార చిత్తము గల మహాత్ముడు జీవన్ముక్తిని పొందినట్లే. అందుచేత ప్రియరాఘఘవా! నీవు బంధ-మోక్షములను, సుఖ-దుఃఖాలను, ఆశ-నిరాశలను, సత్ అసత్లను మొదలంట్ల త్యజించి ఉండు. ప్రశాంతమగు ఆకాశము వలె క్షోభరహితుడవై ఉండు. మహా సముద్రము వలె ప్రాప్తాప్రాప్తము లందు గాంభీర్యం వహించి

Page:378

ఉండు. జన్మ-మృత్యు రహితమగు ఆత్మ స్వరూపుడను" అని ఎఱిగి ఉండు. ఇక ఈ జనన-మరణ చింతలచే మనస్సును మరెన్నటికీ కళంకితం చేసుకోకు.

గొప్ప నిశ్చయం కలిగి ఉండటం- ఓ రామచంద్రా! వాస్తవానికి ఈ దృశ్యపదార్ధము లేవీ నీవు కావు. నావి కావు. ఇవేవీ నీ యందు ఏక్షణమందు కూడా లేవు. నీవు కూడా వాటి యందు లేవు. ఈ దృశ్య పదార్ధములన్నీ 'వాస్తవ పదార్ధము' కంటే అన్యంగానే ఉంటున్నాయి. అతి తుచ్ఛమైన పర్యవసానము కలిగినవి అగుచున్నాయి. అయితే, నీవు మాత్రం వీటన్నిటికీ అన్యమైనట్టి నీ శుద్ధ స్వస్వరూపమును ఆశ్రయించి ఉండు.

ఈ ప్రపంచమంతా 'అసత్తే' అయినట్టి అజ్ఞానముచే ఆవిర్భవించి 'సత్-అసత్' రూపమున స్థితి కలిగి ఉంటోంది. ఇక నీవో... దీనికంతటికీ పరమై వెలయుచున్నావు. అట్టి సర్వమునకు అతీతమగు చైతన్యమూర్తివగు నీవు పదార్ధముల పట్ల 'తృష్ణ’ కలిగి ఉండటమేమిటి? ఎంత అసమంజస మైన విషయమది! అదిఎట్లా సంభవమో చెప్పు?

ఒక్కసారి ఈ దేహము - దృశ్యము'లను కాస్త పరిశీలించి చూచినప్పుడు నాలుగు విధములైన నిశ్చయములు కలుగుచున్నాయి1.దేహాత్మ భావన - తల్లి తండ్రులచే నిర్మించబడినట్టి "కాళ్ళు, చేతులు, పొట్ట, తల”గల ఈ దేహమే నేను అనే భావన. ఇది అజ్ఞాన దృష్టి చేతనే కలుగుచున్నది. నిశ్చయంగా ఇది మహాబంధముగా పరిణమించబోవుచున్నది.

2 శుద్ధ చైతన్యభావన - ఈ దేహేంద్రియము లకన్నిటి కంటే వేడైనట్టి, అత్యంత సూక్ష్మమైనట్టి శుద్ధ చైతన్యమునే 'నేను - అను నిశ్చయం. ఇది మోక్షమునకు దారి తీస్తోంది.

3. “సర్వాత్మాహమ్ భావన - - ఈ జగత్తునందలి సర్వజీవుల యొక్క ఆత్మస్వరూపమును నేను! నేను అక్షయడను - అను నిశ్చయము. ఇది కూడా మోక్షదాయకం అగుచున్నది.

4. “జగదహమ్ భావన - ఆకాశము వలె శూన్యమే అయినట్టి ఈ ఆధ్యాత్మిక, ఆధి దైవిక, ఆధి భౌతికాత్మకమైన ఈ జగత్తంతా 'నేను' - అను అవగాహన. ఇది కూడా మోక్షమునకు దారి తీస్తోంది.

ఈ నాలుగింటిలో మొట్టమొదటిది మలిన వాసనలచే ఏర్పడుతోంది. బంధమగుచున్నది. తక్కిన మూడు శుద్ధ సాత్విక వాసనల ప్రయోజనంగా లభిస్తోంది. కనుక, సత్వరం అనుసరణీయమగు చున్నాయి. “ఈ జగత్తంతా ఆత్మస్వరూపుడనగు నేను అయి ఉన్నాను - అను నిశ్చయం అవలంబించి ఉన్న తరువాత, ఇక అట్టివాని చిత్తము భేదము ఎట్లా పొందుతుంది? వాస్తవానికి అంతా కూడా ఆత్మ యొక్క మహిమచే వ్యాపించి ఉంటోంది. అందుచేత 'సర్వము ఆత్మయే' అనే నిర్ణయం చేసుకొన్న జీవుడు ఇక బంధంలో తగుల్కోడు.

అవగాహన - సర్వమునకు అధిష్ఠానమైఉన్నట్టి ఆత్మ వివిధమైన వాదములచే వివిధమైన పేర్లతో పిలువబడుతోంది. "శూన్యం, బ్రహ్మం, పురుషుడు, ప్రకృతి, విజ్ఞానము, ఈశానుడు, మాయ, శివము" అను పేర్లన్నీ ఆత్మకు చెందినవే.

Page:379

వాస్తవానికి ఈ జగత్తంతా సదా సన్మాత్ర స్వరూపం అయి ఉన్నది. ఇందులో ద్వైతము గాని, భిన్నత్వం గాని ఎచ్చటా ఏ మాత్రం లేవు. పరమార్థ సత్య జ్ఞానం చేత ఈ ప్రపంచమంతా వ్యాపించ బడి ఉన్నది. అయితే భ్రాంతి గల బుద్దికి అసత్యమైనదంతా సత్యము వలె గోచరించటం జరుగుతోంది. అనంతమైన ఆకృతి గల సముద్రమంతా జలము చేతనే పూర్ణమై ఉన్నది కదా! బ్రహ్మ నుండి ఒక స్థంభం వరకు ఈ జగత్తంతా ఆత్మ చేతనే పరిపూర్ణమై ఉన్నది. అందుచేత ప్రమాణములచే అసలు విషయం గ్రహించబడినప్పుడు "బ్రహ్మమొక్కటే సత్యము అను వాక్యముచే సమీక్షించ బడుతోంది. సముద్ర జలము కంటే తరంగాలు వేరా? మట్టి కంటే మట్టిబొమ్మ వేరా? శిల కంటే శిల్పం వేరా? కాదు. బ్రహ్మము కంటే భిన్నంగా 'జగత్తు' అనబడునది ఏ నాడూ, ఏ క్షణం నందు వేరు కాదు.

ద్వైతాద్వైత తత్పరం - ‘జీవుడు' అని మనం పిలుస్తున్నది 'స్వసత్త'నే. ఆ బ్రహ్మసత్తయే “అద్వైత పరమాత్మమయ శక్తి అని కూడా గ్రహించు. అట్టి బ్రహ్మసత్త 'జగత్ రచన' అనే లీలచే ఈ జగత్తుగా విజృంభిస్తోంది. ద్వైతరూపం గాను, అద్వైతరూపం గాను, ఇంకా ఏవేవో భేదములచే కనబడే ఈ జగత్తంతా బ్రహ్మమే. ఆ ఆ బ్రహ్మమే “నా వారు, నీ వారు, భార్య, భర్త, సోదరులు" - మొదలైన అనేకానైకమైన భావానుగతములైన రూపములతో కూడి కనిపిస్తోంది. అజ్ఞానము చేత రచించబడుచున్న ఇట్టి జగత్తు వృద్ధి చెందితే ఏమున్నది? నశిస్తే ఏమున్నది? నీ స్వరూపము జ్ఞానమే అయి ఉండగా నీవు ఈ అనేక నామరూపముల పట్ల సుఖ దుఃఖములు పొందవలసిన పనేముంటుంది? అందుచేత, నీవు ఆయా క్రియలందు వ్యవహరిస్తున్నప్పుడు కూడా, అద్వైతమును ఆశ్రయించియే ఉండు. అద్వైత సత్తామయుడవై ఉండు. ఆయా కర్మలను ఆచరిస్తున్న క్షణాలలో మాత్రం ద్వైతమును ఆశ్రయించిన వాని వలె వ్యవహరించు. ఈ విధంగా ద్వైతాద్వైతముల రెండిటి యందు తత్పరుడవై ఉండు. అంతేగాని అనేక అశుభనిమిత్తములచే నిండి ఉన్న ఈ భయంకర సంసారభూములందు అజ్ఞానముచే ద్వైత వ్యవహారములను నమ్ముకొని, అందు తన్మయుడవై వెట్టిగా, మొండిగా కూలిపోవద్దు. నీ అద్వైత-నిత్యానంద-అఖండత్వమును ఏమరువవద్దు.

ఈ జగత్తు బ్రహ్మమే” అను ఎఱుక మరియు జ్ఞప్తి పరమార్థంగా పరిశీలిస్తే ఈ ‘ద్వైతము’ అనునది సంభవమే కాదు. ఈ దృశ్య వ్యవహారమంతా కల్పన చేస్తున్నది చిత్తమే కదా! అట్టి కల్పన వాస్తవ మెట్లా అవుతుంది?

శ్రీరాముడు : అయితే ఈ జగత్తు ద్వైతమా? అద్వైతమా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచమున ద్వైతమూ లేదు. ఏకమూ లేదు. సంఖ్యా సహితమైన దానిలో మాత్రమే "ద్వైతము, అద్వైతము - అనబడేవి సంభవించవచ్చునేమో! మహాత్ములు ఈ జగత్తును సంఖ్యా రహితమైనదానికిగా గాంచుచున్నారు. సత్ నుండి భావనా రూపంగా ఉదయించటం చేత, ఇది 'సన్మాత్రమే' లేక 'బ్రహ్మమే' అయి ఉన్నది.

యదార్ధానికి దేహముల సంఘాతరూపములై కనిపించున్ను ఈ "నేను - నీవు" అనునవి గాని, ఈ జగత్తు అనబడునదిగాని లేనేలేవు.

Page:380

'నేను' అనునది బ్రహ్మమే. బ్రహ్మము జన్మరహితమైనది. కనుక 'నేను' అనబడేది కూడా జన్మరహితమైనదే!

'నేను నీవు - ఈ జగత్తు' అనునవన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయని అనుకున్నాం కదా! బ్రహ్మము సర్వోత్తమమైయున్నది. అది అనాది. ప్రకాశములన్నిటికీ ప్రకాశము. దానిని విశద పరచటానికే వేరు వేరు శాస్త్రములు అనేక ప్రమాణాలను ఉపయోగిస్తున్నాయి. ఆ బ్రహ్మమునకు ‘జన్మించుట’ మొదలైన వికారములు లేవు. అది సర్వ చింతనల కంటే అతీతమైనది. నిర్వికారమైనది. దాని యందు ఇంద్రియ సమూహమంతా లేదు.

ప్రాణశక్తి అంతటికీ ఆధారం కూడా బ్రహ్మమే. అది సర్వ కల్పనా రహితమై సర్వకారణములకు కారణమై, నిత్యోదితమైన స్వరూపమై, సర్వవ్యాపకమై యున్నది. ఈ కళ్ళు మొదలైన సర్వ ఇంద్రియము లలో చిత్రకాశమై ఉన్నది అదే! మనం ఎన్ని వాక్యాలు ఉపయోగించినప్పటికీ దానిని విశదీకరించ లేమనే చెప్పక తప్పదు. ఎందుకంటే, అది అనుభవమాత్రమే కదా! ఈ చర్చలన్నీ చేసిన తరువాత చివరికి అది లభిస్తున్నది స్వస్వరూపము నందే. స్వస్వరూపముగానే !

ఓ రామచంద్రా! మరల ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. విను ఈ జగత్తు, ఇందులో తారసపడుచున్న నేను - నీవు - వాడు - వీడు మొదలైనవన్నీ... ఆ ఆనందైక బ్రహ్మమే అయి ఉన్నాయి. ఉన్న నిజం అదే. అందుచేత 'ఇదంతా బ్రహ్మమే' అనే నిశ్చయం నీవు నిరభ్యంతరంగా కలిగియుండు. శాంతి ప్రవచనములతో ఆ నాటి సభ చాలించబడింది.

(పదకొండవ రోజు విచారణ పూర్తి అయింది)

Page:381

పన్నెండవ రోజు

III. పుణ్యుడు - పావనుడు సంవాదం

1. మహాత్ముల అవగాహన-సంచారం-స్వభావం

శ్రీరాముడు : హే మహాత్మా! తమరు నిన్నటి రోజున 'ముక్తులు - - వారి లక్షణములు' విషయమై అనేక విశేషాలు చెప్పారు. జీవన్ముక్తులైన మహాత్ములు ఈ జగత్తులో తదితర జీవులు లాగానే ఆయా ‘ఉపాధి, స్థితిగతి, జీవన వ్యాపారము' మొదలైనవి కలిగి చరిస్తున్నారని అన్నారు కదా! అట్టివారి అవగాహన, సంచారం, స్వభావం ఏ రీతిగా ఉంటాయో మరికొంత వినాలని ఉన్నది. శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! జీవన్ముక్తులైన మహానుభావులు అనేకులు సమాహితమైన చిత్తంతో, కామము, లోభము, మోహము మొదలైన దుర్గుణములను అధిగమించినవారై ఈ ప్రపంచంలో లీలామాత్రంగా పాల్గొనుచున్నారు. వారి గురించి సవివరమైన వ్యాఖ్యానం మరల మరల చేయటం అవసరమే. కనుక చెపుతాను విను.

జీవన్ముక్తుడు ఈ ప్రపంచమునందు సంచరిస్తున్నప్పటికీ, ఆతడు మొదట్లో, మధ్యలో, చివర కూడా రసహీనమే అయినట్టి ఈ సంసారము యొక్క గతులను చూస్తున్నప్పుడు దుఃఖించడు. హసించడు. ప్రాప్తించిన కార్యములను మాత్రం ప్రియాప్రియాతీతుడై చేస్తూ ఉంటాడు. శత్రుమిత్రులందు సమదృష్టి కలిగి ఉంటాడు. ధ్యేయవాసనలను (Outgoing tendency of the senses) త్యజించివేసి ఉంటాడు. అతని దృష్టిలో “అది పొందలేదు ... కనుక పొందాలి; ఇది ఇట్లు కాదు... వీరు హితులు... వారు అహితులు అనునవన్నీ సారహీనమైన పిల్లల ప్రేలాపనలు మాత్రమే. ఆతడు ఉద్వేగరహితుడై, సజ్జనులకు హితకరుడై ఉంటాడు. ఆతని అంతఃకరణము సర్వదా 'వివేకము' అనే వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటుంది. 'జ్ఞానము' అనే ఉపవనంలో ప్రవేశించి, ఎప్పుడూ వాహ్యాళి సలుపుతూ ఉంటాడు. సర్వమునకు అతీతమైయున్న 'బ్రహ్మపదము'ను ఆశ్రయించినవాడై, పూర్ణ చంద్రుని లాగా శీతలాంతఃకరణానుభవం పొందుతూ ఉంటాడు. ఆ మహాత్మునికి ఇక్కడ మిక్కిలి అప్రసన్నత్వమునూ - మిగుల సంతుష్టుడుగనూ చేయగల్గునదేదీ ఉండదు..

ఇక, ఈ ఇంద్రియములను ఆకర్షిస్తున్న విషయములు తటస్థపడినప్పుడు వాటితో శత్రువుల మధ్య ఉన్నట్లే ఉంటాడు. అయితే తన దయ, దాక్షిణ్య భావములను మాత్రం వీడడు. గురుసేవ, సంఘసేవ వంటి సమయోచితములైన కార్యములను లోకానుకూలంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. అట్టి పుణ్యాత్మునకు ఇక దుఃఖముల ఊసెక్కడ?

Page:382

ఆతడు “దీనిని నేను కోరుకొన్నాను... పొందాను అనే ఇష్టము దరిజేయనీయడు. అయ్యో! ఇది ఇప్పుడు ఎందుకు పొందాను? అనే అయిష్టము కలిగి యుండడు. సర్వమును మొదలంట సన్న్యసించియే ఉంటాడు.

నాభినన్దతినద్వేష్టి న శోచతినాకాజ్ఞతి |

మౌనస్థః ప్రకృతారంభీ సంసారేనావసీదతి || (శ్లో 7, సర్గ 18)

దేనినీ వాఛించడు, ద్వేషించడు. కనుక ఆతనికి అసంతృప్తి ఉండదు. దుఃఖించవలసిన పని ఉండదు. 'మితభాషి అయి, ప్రాప్తించిన కార్యక్రమాలందు ఆసక్తిరహితంగా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అడిగితే ఉపయోగకరమైన వాక్యములనే పలుకుతాడు. అడగకపోతే, ఒక రాయిలాగా మెదలకుండా ఉంటాడు. సర్వుల పట్ల ప్రియమును వహించి ఉంటాడు. అయినా కూడా, ఎవ్వరి పట్ల ఉద్రేక పూరితములైన ప్రేమద్వేషములు కలిగి ఉండడు. మృదుభాషి అయి, ప్రాణికోట్ల హృదయమును ఎఱిగినవాడై ఉంటాడు. తదితరులనందరిని తనకంటే వేఱుకానివారిగా దర్శిస్తూ ఉంటాడు. అనేక యుక్తాయుక్తమైన విషయములతోను, దృష్టులతోను ఆశలతోను, క్రియలతోను కూడియున్న ఈ లోక వృత్తాంతమంతా అరచేతిలో ఉసిరిగపండు వలె సుస్పష్టం గాను, పక్షపాతరహితం గాను చూస్తూ ఉంటాడు.

ముక్తిపదమును అలంకరించిన మహాత్ములు తమ అంతరమున శీతల బుద్ధికలిగి ఉన్నవారై నాశవంతమగు ఈ జగత్తు యొక్క గతినంతటినీ చూచి, నవ్వుకుంటూ ఉంటారు.

చూచావా రామా! ఎవ్వరైతే తమ చిత్తమును జయించి వేస్తారో, ఈ ఇహ పరములు రెండిటినీ ఎఱిగి ఉంటారో అట్టి మహాత్ముల స్వభావమేమిటో నీకు తెలియజేశాను.

మూర్ఖత్వము - ఇక మరి కొందరు తమ చిత్తమును జయించకుండా, విషయ భోగములు అనే బురదలో ఇరుకుకొని ఉంటున్నారు. మూర్ఖత్వము వహించి ఉంటున్నారు. అట్టివారి గురించి కూడా, ఒకటి రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. వినుఅట్టివారికి అగ్నిజ్వాలల వంటి నారీసమూహమే గొప్ప విషయంగా తోచుచున్నది. ధనము, గృహము మొదలైన వాటి పట్ల గల అభిలాషచే కలహము, క్లేశము, దుఃఖము, దురవగాహన మొదలైన ఆపదలనన్నిటినీ తెచ్చిపెట్టు కుంటున్నారు. అట్టి వారు యజ్ఞము, యాగము వంటి ఆయా కర్మలను ఫలాపేక్షతో చేస్తున్నారు... ఫలితమేమిటి? నిరంతరంగా అనేక సుఖదుఃఖ దశలకు లోను కావటమే అగుచున్నది.

ఇప్పుడు చేయవలసిన దేమిటి? - ఓ ప్రియరామచంద్రా! నీవు 'ధ్యేయవాసన' తొలగించబడగా, అప్పటి పూర్ణదృష్టినే అవలంబించాలి సుమా! 'జీవన్ముక్తత'ను ఆశ్రయించు. స్వస్థచిత్తుడవై ఈ

లోకమునందు హాయిగా విహరించు.

అంతరంగమున సమస్త ఆశలు త్యజించివేయి. రాగములు, వాసనలు లేనివాడవై ఉండు. బాహ్యమునమాత్రం వర్ణాశ్రమ ధర్మములను నెరవేర్చుచు, ఈ లోకమున వ్యవహరిస్తూ ఉండు.

Page:383

చక్కగా, ఉత్తమ ఆచారసంపన్నుడవై ఉంటూనే, అంతరమున క్రియారహితుడవై ఉండు. ఈ సాంసారికమైన, పారమార్థికమైన దశల నన్నిటినీ చక్కగా విచారణ చేయి. మహత్తరమగు ‘బ్రహ్మపదము’ను భావన చేస్తూ యథాతథంగా ఉండు.

అంతరంగమున ఆశావర్జితుడవై, బాహ్యానికి శుభాశుభయుక్తుడవై క్రియలను ఆచరిస్తూ ఉండు. ఈ ధన బంధు జనాదులన్నీ తొలగుచున్నప్పుడు లోకమర్యాద కొరకు ప్రతిస్పందిస్తున్నప్పటికీ, అంతరమున మాత్రం ప్రశాంత స్థితిని విడువవద్దు,.. విడువవలసిన పనిలేదు. గాలికి కొండపైగల చెట్లు కదలుతాయేమోగాని, కొండ కదలుచున్నదా?

బయటకు అవసరమైన చోట కోపం చూపిస్తూన్నప్పటికీ, అంతరమున మాత్రం కోపమనునదేదీ లేనివాడవై ఉండు. బాహ్యానికి సర్వకార్యములు నిర్వర్తిస్తూ, అంతఃకరణమునందు మాత్రం సర్వమునకు అకర్తవై, క్రియారహితుడవై ఈ లోకమున మెలగుచూ ఉండు.

ఓ రఘరామా! ఈ కనబడే సర్వపదార్థముల సారాసారమేమిటో నీకు తెలుసు. ఈ మన సంవాద ప్రారంభంలో నీవు సుస్పష్టంగా ప్రకటించావు. కాబట్టి, ఏది ఎట్లు 'ధర్మనిరతి’చే ఉచితమో, అది అట్లే నిర్వర్తించు. అయితే ఈ క్రింది విషయం గుర్తుంచుకో.

కృత్రిమోల్లాస హర్షస్థ, కృత్రిమోద్వేగ గర్షణః | కృత్రిమారంభ సంరంభో, లోకే విహర, రాఘవ ॥

ఓ రాఘవా! కృత్రిమమైన ఉత్సాహం, కృత్రిమమైన హర్షం, కృత్రిమమైన ఉద్వేగం, కృత్రిమ నింద, కృత్రిమమైన కార్యారంభం, కృత్రిమ క్రోధం కలిగి ఈ లోకంలో విహరించు. అయితే, అహంకారాన్ని పారత్రోలివేసి స్వస్థ చిత్తుడవై సర్వదా ఆకాశం వలె శోభిస్తూ ఉండు. కళంకరహితుడవై, మేఘరహిత వినీలాకాశంలాగా విస్తరించియుండు. ఇక్కడ రూపం పొందే రకరకాల ఆశాపాశముల నుండి విముక్తుడవై, సర్వవృత్తులందు అతీతత్వము, మహామహిమత్వము వహించి యుండు. పైకి మాత్రం ఈ రీతిగానే ఈ వర్ణాశ్రమ స్వభావ యోగ్యములైన, లేక, ప్రజాహితములైన కార్యములను చేస్తూ ఆనందమయంగా ఈ లోకమున విహరించు.

నబంధోస్తినమోక్షోస్తి దేహినఃపరమార్థతః |

మిథ్యేయమింద్రజాలశ్రీః సంసారపరివర్తినీ ॥ (శ్లో 27, సర్గ 18)

ఓ రామచంద్రా! యథార్థానికి బంధం గాని, మోక్షం గాని లేనే లేవు. ఈ కనబడేదంతా 'మిథ్యయే' అయినట్టి ఇంద్రజాల వైభవం మాత్రమే. ఇంద్రజాలమే ఈ సంసార చక్రము నంతటినీ త్రిప్పుతోంది. ఈ ప్రపంచమంతా భ్రాంతిమాత్రమే. ఇది అజ్ఞానం చేతనే ఏర్పడటం, కనబడటం జరుగుతోంది. బాగా దాహంతో ఉన్నవాడికి మృగతృష్ణలో తియ్యటి నీళ్ళు కనిపిస్తాయి చూచావా? అజ్ఞానంతో కూడిన ఆర్తి కలవాడు జగత్తు పట్ల ఇదంతా నిజమే అను బుద్ధిని కల్పించుకొనుచున్నాడు.

Page:384

నాయనా! నీవు ఆత్మస్వరూపుడవేకదా! అసంగము, ఏకరూపము, సర్వవ్యాపకము అయినట్టి ఆత్మకు అస్సలు బంధమెట్లా కలుగుతుందో చెప్పు? బంధమే లేకపోతే, ఇక మోక్షమెక్కడిది? ఎవరికి? ఈ బంధ, మోక్ష, ఆర్తులు సాక్షాత్నము లేనంత వరకే ఏర్పడుచున్నాయి.

తత్త్వ జ్ఞానం యొక్క అభావం చేతనే ఈ విశాల సంసార భ్రాంతి ఉత్పన్నమవుతోంది. ఒకడు త్రాడును చూచి, 'పాము' అని భయపడ్డాడనుకో, ఆ భయం పోయేది ఎట్లా? 'అది త్రాడు మాత్రమే’ అని ఎరుగుట చేతనే కదా! తత్త్వ జ్ఞానం చేత మాత్రమే ఈ సంసారభ్రాంతి ఉపశమనం పొందుతోంది.

రాఘవా! నీవు ఇప్పటికే నీ సూక్ష్మబుద్ధిచేత ఆత్మతత్త్వమును గ్రహించావు. అహంకారరహితుడ వయ్యావు. ఇక, ఆకాశము వలె నిర్మలుడవై చెన్నొందుము. సర్వదా సర్వమునకు కేవల సాక్షిరూపుడవై ఉండుము. బంధుమిత్రుల గురించిన సర్వవాసనలనూ నిశ్చింతగా త్యజించివేయి. ఎందుకంటావా? అసత్ స్వభావులైన బంధుమిత్రాదుల గురించి చింత వ్యర్థమే అవుతుంది 'సత్' స్వభావుడవు అగు నీవు అసత్తుకంటే, అవిద్యకంటే, వాటి సర్వ కార్యముల కంటే విలక్షణమైనవాడవు సుమా!

అవిద్యాకారణం చేత నిన్ను సమీపిస్తున్న "నేను బంధము కలవాడను .. బద్ధుడను అనునట్టి వాసనలను క్రమక్రమంగా త్యజించివేయి. ఈ భోగములతోను, భోగసాధకులైనట్టి బంధుమిత్రాదుల తోను, ఈ కనబడే జగత్ పదార్థములతోను, శుభాశుభకర్మలతోను ఆత్మకు ఏమాత్రం సంబంధం లేదు. నీవు ఆత్మవే అయి ఉన్నావు. ఇక దేనికోసం ఎందుకు పరితపించాలి?

ఆత్మతత్త్వమొక్కటే సారమైనది. 'అట్టిసార వస్తువునే నేను అను దృఢ బుద్ధి కలిగిన తరువాత నీకిక భయమెందుకుంటుంది? జగమలచే నీవు భీతి ఎందుకు చెందాలో చెప్పు? చైతన్యదృష్టితో పరిశీలించి చూస్తే ఈ బంధు జనులు అసలు ఉత్పన్నమే అయి ఉండలేదు. ఇక సుఖ దుఃఖము లేమిటి? పరితాపమెందుకు?

ఒకవేళ - “ఆత్మ నిత్యమే అయి ఉండవచ్చు గాక! కాని, సంగము పొందుతోంది. తద్వారా దుఃఖం పొందుచున్నది కదా! అని అంటావేమో? ఇక్కడ ఒక్క విషయం నీవు ముఖ్యంగా గమనించు.

నీవు ఇతఃపూర్వం ఉండియే ఉన్నావు. భావికాలంలో కూడా ఉండబోవుచున్నావు. ... సరే, ఇప్పుడు ఉండనే ఉన్నావు. నీ బంధువులు కూడా అంతే కదా!... అట్టి నిత్య స్వభావముగల ఆత్మను ఎఱిగిన తరువాత ఇక సుఖదుఃఖ, న్యూన - అధిక భావములకు చోటెక్కడిది?

మరొక విషయం - ఇప్పుడు ఈ వర్తమానకాలంలో నీకు సమీపంగా కనిపించే బంధువులను ప్రాణసమానంగా భావించి, వారి కొరకు దుఃఖిస్తున్నావు, బాగానే ఉన్నది! మరి, నీ గడచిపోయిన జన్మల మాటేమిటి? ఆయా జన్మలకు సంబంధించిన బంధువుల గురించి కూడా దుఃఖిస్తూ కూర్చుంటున్నావా? ఇప్పటి ఈ బంధువులు కూడా భవిష్యత్తులో అట్టివారేకదా! కాబట్టి అట్టివారి కొరకు పరితాపం పొందటం ఉచితమెట్లా అవుతుంది?

Page:385

ఇక మనం ఈ జీవుల యొక్క ఒకరితో మరొకరికి ఏర్పడుచున్న మనస్సు యొక్క సంబంధములను చూస్తామనుకో... మనోదృష్టితో చూస్తే నీవు, నీ బంధువులు పూర్వం వేఱువేఱుగా ఉన్నారు. ఇప్పుడో? ఇప్పుడు కూడా వేఱువేఱుగానే ఉన్నారు. ఇకపై కూడా ఆ విధంగానే ఉంటారు. ఈ మార్గంగా అంతా పరిశీలిస్తే ఈ 'బంధుత్వం' అనబడేది స్వల్పకాలికమని, మొదలే భ్రమ అని తెలియ వచ్చుచున్నది. అట్టి వీరల గురించి సత్యమని నమ్మి ఎందుకు శోకించాలి?

పోనీ, ఈ భౌతిక శరీరం దృష్ట్యా చూద్దామా? పూర్వం ఉన్నవారు ఇప్పుడు లేరు. ఇప్పుడున్నవారు ముందు ముందు ఉండబోరు. అసలు, సంసారమే నీపట్ల క్షీణించుచుండగా, మధ్యలో ఈ బాంధవ్యాల గురించి దుఃఖించటమేమిటి? ఈ విధంగా "ఆత్మ సంగము ఏర్పరుచుకుంటోంది" - - అని అనుకు న్నప్పుడు కూడా నీవు ఎవరి గురించీ శోకించవలసిన పనిలేదు. ఇక అసంగమగు 'కూటస్థ ఆత్మ గురించి గ్రహించావా... ఇక నీకు దుఃఖించవలసిన పనిలేదు” - అని వేరే చెప్పనే అక్కర్లేదు.

కాబట్టి ఈ మాయామయ జగత్తు విషయంలో అసలు శోకించటం ఏమాత్రమూ యుక్తం కాదు. 'సహజ సంతోష వృత్తి'ని అవలంబించటమే ఉచితం. ఏది చేయవలసి వచ్చుచున్నప్పటికీ, అవన్నీ నిర్లిప్తంగా నిర్వర్తించు. కాని, సహజంగానే ఆనంద స్వరూపుడవగు నీవు ఎల్లప్పుడూ సహజ సంతోషవృత్తిని అలవాటు చేసుకో.

మాగచ్ఛదుఃఖితాయుక్తా ప్రాకృతేజాగతేక్రమే |

తథైవముదితాయుక్తా యుక్తంకార్యానువర్తనమ్ || (శ్లో 42, సర్గ 18)

ఈ ప్రాపంచక పదార్థములచే నీవు సుఖదుఃఖములకు లోను కావలసిన పనేమీ లేదు. సర్వత్రా సమరూపము అభ్యసించుటచే మహనీయులు ఈ సుఖదుఃఖాలను అధిగమించివేస్తున్నారు. పరమాత్మ సర్వవ్యాపి, సమరూపుడు కదా! నీయందు కూడా ఆతడే సమరూపుడై వ్యాపించి ఉన్నాడని గ్రహించు.

ఓ రామచంద్రా! నీవు అనంతుడవు. 'సత్' స్వరూపుడవు. ఆకాశము వలె సర్వ వ్యాపకుడవు. సర్వత్రా ప్రకాశమయమైన జ్యోతిస్వరూపుడవై వెలుగుచుండగా ఇక, అంధకారమునకు చోటెక్కడిది? శుద్ధ స్వరూపుడవగు నీయందు సుఖదుఃఖాదులు బంధుత్వ, అబంధుత్వాదులు ఉండటమేమిటి? నీవే సర్వహృదయము లందు ఉన్నవాడవై ఒక పూలదండలోని ధారంలాగా సూక్ష్మరూపమున అంతటా వ్యాపించి ఉన్నావు. అయితే, అతిసూక్ష్మమగు నీ రూపము ఈ సర్వ జగత్పదార్థము లందు వ్యాపించి ఉన్నప్పటికీ, అది స్థూలదృష్టికి మాత్రం గోచరించుటలేదు.

అజ్ఞానియే మరల మరల జన్మలను పొందుచున్నాడు. జ్ఞాని, వీటిని వేటినీ పొందుటయే లేదు. జ్ఞాని ఈ శరీరాదులచే జన్మించడు. ఇవి నశించినప్పుడు తాను నశించడు. ఆతడు ఈ ప్రపంచ స్థితిని చూచి మోహించడు. జ్ఞానబలముచే సర్వదా సుఖరూపుడుగానే ఉంటాడు. ఆహా!

Page:386

ఈ సంసారమంతా నిరంతరం దుఃఖపూర్ణమై అజ్ఞానముచేతనే విస్తారమగుచున్నది కదా! కాని రామా! నీవు మాత్రం 'జ్ఞాని'గానే అయి ఉండాలి సుమా! "నాకు జన్మాదులు ఉండవు" అని గ్రహించటమే జన్మరాహిత్యం.

ఈ కనబడేదంతా భ్రమ మాత్రమే... భ్రమకు భ్రమ కాక మరొక రూపమెక్కడున్నది?... స్వప్నంలో కనిపించే వాటికి స్వప్నత్వమే స్వరూపం గాని, ఇక మరే పదార్థంతో అవి తయారవుతాయి చెప్పు?... మిక్కిలి ప్రకాశవంతమై స్ఫుటరూపం కలిగి భాసిస్తూ, భ్రమ మాత్రమే అయిన ఈ జగత్తు సర్వశక్తిమంతుడగు ఆ పరమాత్మ యొక్క శక్తియే అయి ఉన్నది.

వాస్తవానికి ఈ ప్రపంచంలో ఒకనికి మరొకడు బంధువుగాని, శత్రువుగాని కానేరడు. ఈ శత్రు, మిత్ర ఉదాసీనులంతా కాలానుగతంగా 'ఈశ్వరేచ్ఛ' చేతనే సంభవించుచున్నారు. ఈ జగత్తులో తారసపడే వ్యవహారమంతా జలములోని తరంగాలలాగా ఒకదానికి మరొకటి కారణమగు అనేక సంఘటనలతో ఎప్పటికప్పుడు ఛిన్నాభిన్నమగుచున్నది. ఇట్టి ఈ జగత్తును మననం చేస్తూ, దుఃఖిం చేవారు మా దృష్టిలో అమాయక బాలురవంటివారు మాత్రమే.

చలనశీలమగు సంసార చక్రం నిరంతరం పై నుండి క్రిందకు, క్రింద నుండి పైకి తిరుగాడుతూనే ఉన్నది. స్వర్గంలోని జీవులు ఒకానొకప్పటికి నరకం చేరుచున్నారు. నరకంలోని జీవులు స్వర్గానికి వెళ్ళుచున్నారు. ఒకడు ఒక ద్వీపం వదలి మరొక ద్వీపం ప్రవేశించునట్లే ఈ జీవులంతా ఒక ఉపాధిని వదలి మరొక ఉపాధిని ఆశ్రయించుచున్నారు. ఇట్టి స్వప్నకల్పితమైన అవాస్తవ జగత్ వ్యవహారముల కొరకు కొందరు మాయాబద్ధులగు జీవులు తెంపులేని శోకం అనుభవిస్తున్నారు. మరి వారికి నేనేమి, ఎట్లా చెప్పాలి?

ఒకప్పుడు మహాధీరులై అటూ ఇటూ సంచరిస్తున్న వారు మరొకప్పుడు అతి దీనత్వం పొందు చున్నారు. దీనులు మహాధీరులగుచున్నారు. పతనము ఉత్పత్తిలచే ఈ జీవులు తమకు తామే విభ్రమములను కల్పించుకొనుచు, సంచలనము పొందుచున్నారు. దీపశిఖకు స్థిరాకారం ఉంటుందా? ఈ సంసారచక్రము నందు కూడా ఏదీ ఎన్నటికీ 'ఒక రూపము కలిగి ఉండుటలేదు. ఈ సంసార దృష్టి ఏర్పడి ఉన్నంతవరకు స్వచ్ఛత్వము గాని, దుఃఖరాహిత్యము గాని ఏ జీవునకు కూడా సాధ్యపడేది కాదు. అనుక్షణం 'మార్పు' చెందుచుండే స్వభావంగల ఈ విషయముల పట్ల ఇది మాకు ఇట్లు ఉండాలి... అని అనుకొని ఎవడు సుఖం పొందగలడు చెప్పు? అందుచేత, రామా! ఈ ప్రపంచంలో తారసపడే “నాది, నాకు చెందినది, నీది, నీకు చెందినది, వారిది, వారికి చెందినది మొదలైనవన్నీ -

మెల్లకన్నువాడు రెండవ చంద్రుని చూచునట్లు, కేవలం భ్రమ చేత మాత్రమే అట్లు అనిపిస్తున్నాయి. ఇందులో ఏమాత్రమూ సందేహంలేదు. అందుచేత ఈ “నేను”, “నీవు", ఈతడు నా వాడు, ఆతడు శత్రువు - అనునట్టి మిథ్యాదృష్టులన్నీ నీ పట్ల నశించు గాక. అయితే ఆయా అనుకూలములైన వ్యవహార సరళి లోకమునకు అవసరమైయున్నది కనుక, ఇక్కడి వ్యవహారతత్పరతను లీలామాత్రంగా బాహ్యమునకు మాత్రమే అవలంబించు. నీకు బంధువులుగా ఉన్నవారి పట్ల ....

Page:387

ఆత్మదృష్టిచే చైతన్యమాత్ర స్వరూపులుగాను, లౌకిక దృష్టిచే నీ ఆయా కర్తవ్యములు గాను భావించు... అంతేగాని, ఒక గాడిదలాగా లేనిపోని భారములన్నీ కల్పించుకొని భ్రమాత్మికమైన నమ్మికతో, ఈ సంసార లంపటములయందు కాలయాపన తాత్సారములతో కూడిన బుద్ధిని పొందవద్దు. నిష్కారణముగా దుఃఖములను, వాసనాభారములను తెచ్చిపెట్టుకోవద్దు. వాసనలను క్షీయింపజేయ గల క్రియలను విచారణలను శ్రద్ధగా ఆశ్రయిస్తూరాగా, ఈ సంసారభారం స్వయంగా రహితమైపోగలదు.

అయం బంధుః అయంనేతి గణనా లఘుచేతసాన్ | ఉదారచరితానాంతు విగతావరణైవధీః ॥

"ఈతడు బంధువు, ఈతడు శత్రువు" అనే భేదదృష్టంతా అల్పబుద్ధి కలవారికే ఉంటుంది. ఉదారచరితులకు అట్టి పరిచ్ఛిన్నదృష్టిగాని, ఆవరణయుక్తమైన బుద్ధిగాని ఉండదు. వారు, “ఈ సర్వము నందు నేను ఉండనే ఉన్నాను.. ఈ సర్వము సర్వదా నా యందే ఉన్నది అను నిశ్చయము గల ధీరబుద్ధి కలిగి ఉంటారు. కనుకనే వారిపట్ల సర్వ ఆవరణలు (All Limited perceptions) తొలగిపోతున్నాయి.

నాస్తమేతినచోదేతి యశ్చిదాకాశవన్మహాన్ |

సర్వంసంపశ్యతిస్వస్థః స్వస్థోభూమితలంయథా ॥ (శ్లో 63, సర్గ 18)

అట్టి ప్రాజ్ఞునకు ఇక ఉత్పత్తి వినాశనములు ఉండవు. ఆతడు 'ఆకాశము' వలె మహత్తరమైన రూపము కలిగి, సర్వ విక్షేపములు నశించినవాడై స్వస్థచిత్తుడై ఉంటాడు. ఆకాశమున ఎక్కడో ఉండి ఈ భూతలమును వీక్షించుచున్నట్లు ఆతడు ఈ జగత్పదార్థములను, జనులను, సంఘటనలను చిద్విలాసంగా, భావాభావములకు అతీతంగా చూస్తూ ఉంటాడు.

ఓ రామచంద్రా! ఈ ప్రపంచమునగల జీవ జాతులన్నీ ఈ జీవునకు బంధువులే. ఎందు కంటావా? ఆతడు అనేక వేలాది జన్మలు ఎత్తియే ఉంటాడు. ప్రతి జీవజాతిలోను అతడు అనేక మార్లు జన్మించియే ఉంటాడు. ఇక ఆతని జాతి ఏది? ఆతని జాతి కానిదేది? కనుక 'నేను ఈ జాతికి చెందిన జీవుడను' అని తలచుట భ్రమ కాదా చెప్పు? పలువిధములైన విచిత్ర జన్మభ్రమలతో గూడిన ఈ జగత్తునందు, ఈతడు నా బంధువు - - ఈతడు నా శత్రువు" అనునదంతా మిథ్యా దృష్టి రూపముననే భ్రాంతిగా విజృంభిస్తోంది. వాస్తవానికి చూస్తే ఈ ముల్లోకములందలి జీవులు జీవభావదృష్టిచే నీ బంధువులే అయి ఉన్నారు. వారూ జీవులే.... నీవు జీవివేకదా! అంతేకాదు. ప్రతిజీవుడు అనేక జీవజాతులలో జన్మలు పొందుచూనే ఉన్నాడు. ఇక బ్రహ్మభావ దృష్టితో చూచావా.... నీవే వారందరి స్వరూపముగా అగుచున్నావు. కాబట్టి నీ వారు కాని వారెవ్వరు?

ఈ విషయంలో ప్రాచీనమైన కథ ఒకటున్నది. ఇద్దరు అన్నదమ్ముల సంవాదముచే బంధుత్వము అనబడునది స్వయం కల్పితమైన చమత్కారమే అని నిర్ణయింపబడింది.

Page:388

2. నదుఃఖార్హం

జంబూద్వీపంలో గల ఒక పర్వతంపై 'దీర్ఘతపుడు' అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆతడు ఉదార మనస్కుడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, మహాతపశ్శాలి కూడా. ఆతనికి ఇద్దరు కుమారులు ఉండేవారు. వారి పేర్లు పుణ్యుడు, పావనుడు. గంగానది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని, ఆతడు తన ఇద్దరు కొడుకులతోను, భార్యతోను ప్రశాంతంగా రోజులు గడుపుతూ ఉండేవాడు.

కొంతకాలం గడచిన తరువాత ఆతని ఇద్దరు కుమారులలో పెద్దవాడైన పుణ్యుడు అభ్యాసవశం చేత ‘బ్రహ్మజ్ఞాని’ అయ్యాడు. కాని, రెండవవాడగు పావనుడు మాత్రం కొంత గ్రహించి, మరికొంత గ్రహించక మిగిలి ఉన్నాడు. ఆతడు 'పూర్ణ బ్రహ్మపదము' పొందకపోవటం చేత మార్గమధ్యంలోనే వ్రేలాడుతూ ఉండేవాడు.

ఆ విధంగా అనేక సంవత్సరాలు దొర్లాయి. అదృశ్యమైన రూపంతో జీవుల ఆయువును క్షణ క్షణం మ్రింగివేసే స్వభావం గల కాలం గడచిపోసాగింది. దీర్ఘతపునకు వందేళ్ళు నిండాయి. ఒక నాటికి ఆతనికి ఈ సంసారముపై తిరస్కారపూర్వకమైన బుద్ధి పుట్టింది. నశ్వరమైన జీవుల చేతను పుట్టుక, రోగము, అకస్మాత్ సంఘటనలు, వార్ధక్యము, మృత్యువు, మొదలుగాగల వివిధ దుస్సవహమైన, నిస్సారమైన వృత్తాంతముల చేతను నిండి ఉండి, భయంకర ఆకారము కలిగిన ఈ సంసారముపై ప్రీతిని త్యజించాడు. యోగబలంతో వార్ధక్యముచే జర్జితమైన తన భౌతికదేహం త్యజించాడు. కల్పనా రహితము, విషయములు లేనట్టిది, నిత్యోదిత చేతనా స్వరూపము, రాగద్వేష రహితము అయినట్టి ‘బ్రహ్మపదము' నందు ప్రవేశించాడు. ఎంతో కాలం, భర్తను సేవిస్తూ వస్తున్న ఆతని భార్య కూడా బ్రహ్మభావము పొందినదై తన భర్తను అనుసరించింది. సామాన్యమైన భౌతిక దృష్టికి వారిద్దరు అలభ్యులు, అగోచరులు అయ్యారు.

చనిపోయిన తల్లితండ్రుల భౌతికదేహాలకు పుణ్యుడు దహనము మొదలైన అంత్యక్రియలు పూర్తి చేశాడు. ప్రజ్ఞచే నిత్యానిత్యములు ఎఱిగియుండుటచే ఆతడు యథాతథంగా తన సాధన పఠనాదులను కొనసాగించసాగాడు. కాని పావనుడు మాత్రం తల్లితండ్రులను పోగొట్టుకొన్న దుఃఖం నుండి బహుకాలం విడివడలేక పోయాడు. అత్యంత దుఃఖాక్రాంతమైన మనస్సుతో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల గల అరణ్యంలో పిచ్చిపిచ్చిగా సంచరిస్తూ విలపించసాగాడు. ఇది గమనించిన పుణ్యుడు ఒకరోజు పావనుని తన ప్రక్కన కూర్చోబెట్టుకొని ఈ విధంగా సంభాషించసాగాడు. పుణ్యుడు : తమ్ముడూ! అజ్ఞానిపై ఈ విధంగా ఎందుకు పరితాపం పొందుచున్నావు? నీవు, నేను, నాన్నగారు, అమ్మ ఒకచోట కూర్చుని అనేకసార్లు చర్చించిన ఆత్మ విశేషాలన్నీ మరచిపోయావా? నీవు గొప్ప తెలివిగలవాడివే కదా! మన అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు చెప్పు? వాళ్ళు బ్రహ్మపదము'ను పొందారు. ఆ బ్రహ్మమే సర్వ జీవులకు నిలయం కదా! బ్రహ్మవేత్తల స్వరూపం కూడా అదే. స్వస్వరూపం పొందిన వాళ్ళ గురించి ఎందుకు రోదిస్తున్నావో చెప్పు?

Page:389

పావనుడు : అన్నా! మనలను కని, పెంచి, పెద్దచేసిన అమ్మ నాన్నలు మన కళ్ళముందు నుంచి మాయమై, ఎటో వెళ్ళిపోయారే? ఆ భగవంతుడికి మనం ఏం అన్యాయం చేశామని ఈ పిచ్చిపని

చేశాడు చెప్పు?

పుణ్యుడు :ఈతడు నా తండ్రి, ఈమె నా తల్లి అను రూపము గల భావనలన్నీ ఉత్తమ సత్యము పట్ల ఉదాసీనత, విచారణ కొరవడటం, అజ్ఞానం... కారణంగానే ఉదయిస్తున్నాయి. శోకించతగని వాటి గురించి నీవు శోకిస్తున్నావు. గతించిపోయిన, గతించిబోయే విషయాల గురించి శోకించి లాభమేమున్నది చెప్పు?

తమ్ముడూ! "దీర్ఘతపుడు నా తండ్రి, ఆతని భార్య నా తల్లి" అని భావిస్తున్నావు... బాగానే ఉంది. కాని, వాస్తవానికి వారు మాత్రమే నీకు తల్లితండ్రులా? కాదు. ఎందుకంటే నీవు ఇంతకు ముందు వేలాది జన్మలలో అనేక మంది తల్లితండ్రులను పొందియున్నావు. అదేవిధంగా వారు కూడా తమ ఇతఃపూర్వపు జన్మలలో వేలాదిమందిని తమకు బిడ్డలుగా పొందియున్నారు. కనుక, నీవు, నేను మాత్రమే వారికి పుత్రులం" అనటం మూర్ఖమే అవుతుంది. ఇట్టిదే ప్రతిఒక్క జీవుని యొక్క ప్రతిఒక్క సంబంధం కూడా !

మిత్రబాంధవవృన్దాని జన్తోర్జన్మనిజన్మని |

ఋతావృతావతీతాని ఫలానివమహాతరోః (శ్లో 34, సర్గ 19)

ప్రతిజన్మలోను ఈ జీవునకు ఎందరో బంధువులు, మిత్రులు, పరిచయస్తులు కలుగుచున్నారు. "ప్రేమవశం చేతనే నేను నా తల్లితండ్రుల గురించి శోకిస్తున్నాను అని నీవు అనదలచుకొంటే, మరి, నీవు నీ గతించిపోయిన జన్మలలోని తల్లి తండ్రుల గురించి, బంధువుల గురించి ఎందుకు శోకించుటలేదో నేను తెలుసుకోవచ్చా?

పావనుడు : నిజమే, నీవు చెప్పేదానిలో వాస్తవముంది. అయితే ఈ దృశ్యం మరల మరల వస్తోంది, పోతోంది. ఇదంతా ఎక్కడి నుండి వచ్చి పడుతోంది?

పుణ్యుడు : ముక్కుకు సూటిగా నీ ప్రశ్నకు బదులివ్వాలంటే - 'జగత్ కల్పన'కు అజ్ఞానమే కారణం. ‘అజ్ఞానము’ చేతనే ఈ దృశ్యమంతా ప్రకటితమవటం, ఎదురుగా నిలిచి ఉండటం, భ్రమింపచేయటం జరుగుతోంది.

యథార్థానికి నీకు మిత్రులుగాని, సోదరులు గాని, తదితర బంధువులు గాని లేరు. ఎఱ్ఱటి ఎండకు కాలిపోతున్న ఎడారిలోని ఇసుక దిబ్బపై నీళ్ళు ఉంటాయా? బ్రహ్మస్వభావమగు ఆత్మయందు జన్మము లేదు. మరణము లేదు. ఇక, నీకు కనిపిస్తున ధన ధాన్య రాజ్య విభవములు, ఐనవాళ్ళు, కానివాళ్ళు, అనుబంధములు... ఇవన్నీ భ్రమతో కూడిన సాంసారిక దృష్టికి మాత్రమే తారస పడుచున్నాయి. పైగా, ఇవన్నీకూడా, మూడు నాళ్ళముచ్చట్లే కదా! "ఇవి నాకు కలవు అని విఱ్ఱవీగేంత సేపు పట్టదు... వీటి రాకపోకలు! అందుచేత, సోదరా! కాస్త పరమార్థదృష్టిచే సత్యాన్ని విచారించు. ఈ "నేను - నాది - నీది" అను వ్యవహారమంతా కేవలం కల్పనయే అయి ఉన్నది.

Page:390

అంతేకాని, వాస్తవం మాత్రం కాదు. ఇప్పుడు మన ఇరువురి మధ్య ఏర్పడివున్న అనుబంధమును విజ్ఞాన దృష్టిచే పరిశోధించామనుకో, నీకు నేను గాని, నాకు నీవు గాని ఏ ఒక్కక్షణమందు కూడా లేము - అనియే తెలియవస్తోంది. అందుచేత, స్వప్నంలోని వస్తుజాలం వంటిది, భ్రమ చేత మాత్రమే అనుభవమగునది" - అయినట్టి ఈ “నీవు, నేను మొదలైన భ్రమలన్నీ నీ హృదయంలోంచి ముందుగా పారత్రోలివేయి.

పావనుడు : మరి ఈ జీవుల జన్మ మృత్యువుల సంగతేమిటి?

పుణ్యుడు : “ఇది నశించుచున్నది, ఇది జన్మించుచున్నది- ఇటువంటి దృష్టులన్నీ స్వసంకల్పములతో రూపం పొందిన భ్రమచేత మాత్రమే నీముందుకు వస్తున్నాయి. మరల మరల విజృంభిస్తున్నాయి. అంతేకాని అదంతా వాస్తవమైనది కాదు.

‘ద్రష్టత్వము’ అను క్రియావిశేషమునకు కూడా కర్తయగు ఆత్మ ఒకానొక తరుణంలో అజ్ఞాన తాపముచే ఆఛ్చాదితమై ఉంటోంది. ఎడారిలో మృగతృష్ణాజలం కనబడుతోందిచూడు. అట్లాగే శుభ, అశుభ కర్మలు” అనే చంచల, స్వవాసనపూర్వకమైన తరంగాలు ఈ అనంత సంసార సాగరంగా స్ఫురిస్తున్నాయి. మేఘాలు ఆకాశాన్ని కప్పి వేస్తున్నట్లు, సాంసారిక భావనలు ఆత్మాకాశాన్ని కప్పివేస్తున్నాయి. అయితే మేఘములు కమ్మినంత మాత్రం చేత ఆకాశం లేకుండా పోతుందా?... లేదు. ఈ భ్రమలన్నీ ఏర్పడవచ్చు, లేక మరొకప్పుడు తొలగిపోవచ్చు. నిర్మలమైన చిదాకాశము ఎప్పటియట్లే అప్రమేయముగా, అఖండముగా సర్వదా ఉండి ఉంటోంది.

చిదాకాశమే నీయొక్క, నాయొక్క, మన అమ్మా, నాన్నల యొక్క వాస్తవ ్వరూపం.

3. సంబంధబాంధవ్యముల అతీతత్వము కఃపితాకించవామిత్రం కామాతాకేచబాన్ధవాః స్వబుద్యైవావధూయనే వాత్యయా జనపాంసవః ॥ (శ్లో 1, సర్గ 20)

పుణ్యుడు : తమ్ముడూ! పావనుడా! తల్లి ఎవరు? తండ్రి ఎవరు? మిత్రులెవరు? బంధువులు ఎవరు? గొప్ప గాలి వీస్తుంటే ధూళి లేస్తుంది చూచావా! ఈ అనేక జీవుల సంబంధములు ఆ ధూళి లోని వేరు వేరు రేణువుల యొక్క సామీప్య సంబంధములవంటివి మాత్రమే.

ప్రతి జీవునకు తదితర జీవులంతా ఆ జీవుని యొక్క స్వబుద్ధి, భ్రాంతి’లచే కల్పించబడినవారై ఉన్నారు. ఆత్మయే రాగ, ద్వేష, మోహములను ఆశ్రయించుచున్నప్పుడు - “వీరు బంధువులు, వీరు మిత్రులు, వీరు హితులు - అనువాటితో కూడిన ఈ ప్రపంచం విస్తరింప జేయుచున్నది.

ఒకనిని చూచి నేను “ఇతడు నాకు సంబంధించినవాడు - అని సంకల్పించినప్పుడు మాత్రమే అతడు నాకు బంధువు అగుచున్నాడు. అట్లా కాకుండా, ఆతడు అప్రియమైనవాడు, వ్యతిరేకి, ద్వేషింపదగినవాడు అను రూపం గల వ్యతిరేకభావనచే శత్రువు అగుచున్నాడు. భావనామాత్రం

Page:391

చేతనే విషము అమృతము గాను, అమృతము విషము గాను అగుచున్నది. ఈ సంసారము యొక్క ప్రాప్తి, స్థితి, గతి కూడా కేవలం ‘భావించుట' అను క్రియావిశేషము చేతనే సంభవిస్తోంది.

సర్వదేహములందు ఏకరూపమున వెలుగుచున్నట్టి 'సర్వవ్యాపి'యగు ఆత్మకు ఇతడు నా బంధువు, ఇతడు నా మిత్రుడు" అను కల్పన ఎట్లా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? నీవైనా, నేనైనా ఈ రక్త మాంస బొమికలతో కూడిన అస్తిపంజర శరీరములమా? కాదు. ఈ దేహగృహం మనం ఆశ్రయించాం గాని మనం ఈ దేహములం కాము సుమా! అందుచేత కొంచెం ఏకాంతంలో కూర్చుని “చేతనా స్వభావుడైన నాయొక్క యదార్థ స్వరూపము ఏమై ఉన్నది...? అని నీ చిత్తములోనే విచారణ చేయడం ప్రారంభించు.

పరమార్థమగు శుద్ధ చైతన్య దృష్టితో ఈ దృశ్యమును ఆమూలాగ్రం పరిశీలన చేయడం జరిగితే, అప్పుడు, పావనుడు' అనబడే నీవు గాని, 'పుణ్యుడు అని పిలువబడుచున్న నేను గాని ఈ దేహపరంగా లేనే లేము" అని తెలిసి వస్తుంది. దేహము పట్ల 'ఇది నేను' అను రూపము గల అభిమానం, మిథ్యా జ్ఞానం ఏర్పడియుండుట చేతనే ఈ మన రూపాలన్నీ ఈ విధంగా విజృంభించి, లయిస్తున్నాయి. ఈ కనబడే వేలాది వేర్వేరు శరీరములన్నీ 'కల్పన' చేతనే కన్పిస్తున్నాయి కాని, ఇవన్నీ స్వతహాగా ఉన్నవి కావు.

మనం భౌతిక దృష్టిచే, లేక, దేహ దృష్టి చే పరిశీలిస్తే - ఇక్కడ నశ్వరమైనది కానిదేమున్నది? ఇక్కడ తల్లి ఎవరు? అయినవాడెవ్వడు? కానివాడెవ్వడు? మిత్రుడెవ్వడు? శత్రువెవడు? ఈ ఎదురుగా కనబడుచున్న దేహములు' అను ఉపాధులకు అతీతమై, సాక్షిమాత్రమై ఉన్నట్టి 'చైతన్య దృష్టి' అలవరుచుకున్నావనుకో... అప్పుడు అనంతరూపమగు 'చిదాత్మ' మాత్రమే ఉనికి కలిగి అగుపిస్తుంది. అట్టి చిదాత్మ యందు ఇది నాది, అది నీది అనే భేదం ఉంటుందా? ఉండదు. ఒక సముద్ర తరంగానికి ఏ తరంగం ఏ తరంగానికి శత్రువు? ఏ తరంగం ఏ తరంగానికి మిత్రుడు? ఉన్నదంతా జలమే కదా!

పావనుడు : అయితే అన్నా!. ఈ ప్రశ్నకు బదులు ఇవ్వు. మనోబుద్ధి అహంకారములు అనబడే సూక్ష్మ తత్వమే నేను కదా! అట్టి మనోబుద్ధులకు ఈతడు నా అన్న" - అని నీవు లభించుచున్నావే? మరి శత్రు మిత్రులు, బంధువులు కానివారు లేరని నీవు ఎట్లా అనగలవు? జన్మ పొందినప్పటి నుండీ ఏర్పడియున్న బంధువులను "వీరు నా వారు" అని అనుకోవటం లోకధర్మమే కదా! వారిని యథారీతిగా బంధుత్వపూర్వకంగా కలిగియుండటం ఎందుకు సముచితం కాదు?

పుణ్యుడు : నీవు చెప్పేది బాగానే ఉన్నది. అయితే, నాది మరొక ప్రశ్న. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే జన్మచే ఏర్పడుచున్న ఈ సంబంధబాంధవ్యములు శిరోధార్యమేనని అనుకుందాం.... మరి, ఇతఃపూర్వం గడచిన అనేక జన్మలలో బంధు మిత్ర ధనాదుల మాటేమిటి? అవన్నీ అక్కడక్కడ వదలి వచ్చినందుకు ఇప్పుడు దుఃఖిస్తూ కూర్చుంటున్నావా? ఈ వర్తమాన జన్మలో కూడా ఎన్నెన్నో అనుబంధాలు ఏర్పడటం, మరల కాలముచే మ్రింగివేయబడటం జరుగుతోంది కదా!