వసిష్ఠ రామ సంవాదం
(యోగ వాసిష్ఠమ్)
మూడవ సంపుటం నిర్వాణ ప్రకరణము
i
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
(శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము)
మూడవ సంపుటం,
నిర్వాణ ప్రకరణము
అనుసృజన:
వై.హెచ్.రామకృష్ణ
రామ तज्ञोसः प्रचोदयात Bha
మఠం
రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాదు - 500 029
ii
Published by Adhyaksha Ramakrishna Math
Domalguda, Hyderabad - 29
O Ramakrishna Math, Hyderabad All rights reserved
I- 1M-08-2010 12026
12028 (Set)
Printed at: RP Printers, Hyderabad.
Bound at Pridhvi Binders, Hyderabad.
iii
ప్రవేశిక
అఖండ రామాయణంలోని చివరి ప్రకరణం అయిన నిర్వాణ ప్రకరణంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఆరు ప్రకరణాల్లోకీ శ్లోక సంఖ్యాపరంగా ఇది పెద్దదవటమేకాదు; ఇందులో చర్చించిన అంశం కూడా గంభీరమైనది. మొదటి ప్రకరణాల్లో చర్చించిన అంశాలు సూక్ష్మమైనవైతే, ఇందులో చర్చించిన విషయం సూక్ష్మతరం, సూక్ష్మాతి సూక్ష్మం అని పేర్కొనవలసి ఉంటుంది. నిజానికి అన్నింటిలో చర్చించిన విషయం ఒక్కటే ఐనప్పటికీ ఏ స్థాయినుంచి, ఏ భూమికనుంచి, ఏ కోణం నుంచి విషయాన్ని విశ్లేషిస్తున్నాం అన్న దాన్ని బట్టి చర్చించిన అంశం విభిన్నంగా వ్యక్తమవుతుంది.
ఈ ప్రపంచ మంతా ఉదయాస్తమ రహితమై, అఖండప్రకాశ రూపమై, నిర్మలమై, శిలవలె మౌనరూపమై, నిర్వికారమైనట్టి శాంతమగు బ్రహ్మయే అయిఉన్నది అంటుంది ఈ ప్రకరణం. ఇది కేవలం భావన కాదు. పరమ సత్యం. మనకు అనుభవమౌతున్న జగత్తు అవిద్యారూపం. అజ్ఞాన జనితం. బ్రహ్మానికి వేరైన సత్తాలేనిది. కావున ఈ ప్రకరణం నుంచి మనకు, ద్రష్ట దర్శన దృశ్య త్రిపుటిని భేదించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించి, ఏకత్వరూపంగా మిగిలిపోవలసిందని శాస్త్రమాత ఉద్భోధము.
వాయువు, వాయు స్పందన ఏవిధంగా వేరుకావో అదేరీతిన చైతన్యం లేదా చిత్తు మరియు విషయ జగత్తు వేరు కావు. చిత్ స్పందనే జగత్తు.
చైతన్యానికి వేరుగా ఏమీ లేదని, ఇంద్రియాలు, వాటికి అధిష్ఠానమైన మనస్సు, మనోకల్పితమైన విషయ ప్రపంచంతో సహా సర్వం బ్రహ్మమయమని ఈ ప్రకరణం నుంచి జ్ఞాని గ్రహిస్తాడు. దేహం అందులోని చిత్ రెండూ వేరు కావన్న భావం కలిగిన సాధకుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. నిర్వాణ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. సర్వం చిన్మయమని గ్రహించిన వ్యక్తి శోక మోహరహితుడై, భేదదృష్టి వీడినవాడై ఏకత్వానుభవం పొంది కేవాలానంద స్వరూపుడిగా నిలుస్తాడు.
నిర్వాణ ప్రకరణం లో చెప్పిన విషయాన్ని సులభంగా గ్రహించాలంటే ముందు ప్రకరణాల్లో పేర్కొన్న విషయాన్ని అవగతం చేసుకుని ఉండాలి. ఉత్పత్తి, స్థితి ప్రకరణాలు దృశ్యావిర్భావానికి మరియు దృశ్యానుభూతికి కారణాలు బోధించాయి అని అనుకున్నట్లైతే; నిర్వాణ ప్రకరణం సముద్రం నుండి ఉద్భవించే తరంగాలు ఏవిధంగా సముద్రానికి భిన్నం కావో అదేవిధంగా దృశ్యజగత్తు కూడా చిదభేదం కాదని ఉద్ఘాటిస్తుంది. మనోనిర్మితమైన వస్తు ప్రపంచం మనస్సుతో సహా చిత్ శక్తియే. చిద్విలాసమే. చిదాంతర్గతమే. చిద్రూపమే. చిన్మయమే. చిత్స్ఫురణయే అని తెలుపుతుంది. ఐతే జగత్తు చిదభిన్నం ఐనప్పుడు పురుష ప్రయత్నం చేయటం, మోక్షాన్ని పొందటం అన్నీ అసంగతాలు కావా అంటే మనకు ఇంద్రియగోచర జగత్తుకు సంబంధించిన ఎరుక ఉన్నంత సేపు ఆ ఎరుక తొలగే వరకూ ప్రయత్నం చేయాల్సిందే. అంటే మొదటి ప్రకరణాల్లో చెప్పిన విచారణ అనే పురుష ప్రయత్నాన్ని అనుష్ఠించి మనస్సును పరిశుద్ధ మొనర్చుకున్న జిజ్ఞాసువు మాత్రమే ఈ ప్రకరణం లో పేర్కొన్న కేవలాద్వైతాన్ని అనుభవ మొనర్చుకోగలడు. అలా కాకుండా ఇందులోని ఉత్కృష్ట భావనలను అపరిశుద్ధ మనస్కుడికి బోధిస్తే విరుద్ధంగా, విపరీతంగా అర్థంచేసుకునే ప్రమాదముంది. అందువలన శాస్త్రంలో పేర్కొన్న విషయాన్ని అందులో పేర్కొన్న క్రమంలోనే చదవాలి.
— - ప్రకాశకులు
iv
విషయ సూచిక
VI. నిర్వాణ ప్రకరణం (పూర్వార్ధం) : 1
I. ప్రకరణ పరిచయం 3
పదిహేనవ రోజు 1.అవ్యక్త ఆత్మ స్వరూపం...3; 2. లేనిది లేనిదానిగా చూడాలి...7; 3.మేలుకొలుపు...9; 4.అయోమయం నుండి స్వస్థానానికి...10; 5. మోహం ఎట్లా తొలగు తుంది?...11; 6. అజ్ఞానాంధకార విభూతులు... 15; 7. అవిద్యా సంభ్రమం...18; 8. కార్య అవిద్య-కారణ అవిద్య... 20; 9. అవిచారణమాంద్యము-చికిత్స...24; 10. కర్తవ్య ములు జ్ఞానమునకు అడ్డు కావు... 28; 11. వివేక భేరీ నినాదం...30; 12. ఆత్మజ్ఞాని యొక్క సింహనాదం... 34; 13. ఆత్మానుభూతిపరులు... 39
II. ప్రాణ నిరోధ యోగోపదేశము భుశుండో పాఖ్యానం 41
1.యోగసాధన - జ్ఞానము... 41; 2. వసిష్ఠ - భుశుండ సమాగమం...43; 3.భుశుండుని జన్మవృత్తాంతం... 45; 4. నిర్లిప్తుడను-అప్రమేయుడను...47; 5. ధారణచే మహాప్రళయ సాక్షిత్వం...50; 6. సుదీర్ఘ సృష్టి చమత్కారం...52; 7.చిత్ర విచిత్ర సంఘటనలు...54; 8. చాంచల్యరాహిత్యం - అమృతత్వం... 56; 9. ప్రాణవాయుగతుల ఉపాసన...59; 10. రేచక -పూరక-కుంభకములు : ప్రాణాపానముల ఉత్పత్తి - లయస్థానములు...64; 11.ప్రాణాపాన ముల సమాధానం...71; 12. వీడ్కోలు... 74; 13. దేహభావం భ్రమ మాత్రమే...75; 14. సంకల్పము-మాంసమయ దేహం...82; 15. అహంకారమును ఎదుర్కొనేది ఎట్లా?... 84
III. దేవతార్చన (శ్రీ సాంబశివ - వసిష్ఠ సంవాదము) 89
1.అర్చన-నిర్వచనం...89; 2. సర్వమయ మహాచిత్... 95; 3. చిత్తు: జడ-చైతన్య విభాగములు ...99; 4. చిత్తుయొక్క విన్యాసం-వివశత్వం...100; 5. చైతన్యం సర్వదా సర్వత్రా యథాతథం ...102; 6. అజ్ఞానము యొక్క చమత్కారం!... 107; 7. అపరిమితంలో పరిమితమా?... 112; 8. సంకల్ప రాహిత్యం...115; 9. చైతన్యము - విశ్వము... 117; 10. నిజాత్మ భగవానుడు... 121; 11.తస్మై సర్వాత్మనే నమః... 124; 12. చిదాత్మ యొక్క దర్శన ప్రదర్శనములు...126; 13. బాహ్యపూజ - అంతర్పూజ...128; 14.ఆత్మాభిషేకం... 132; 15. అనంత స్వస్వరూప మునకు అల్పత్వం ఆపాదించటమా?... 137; 16. అవిద్యనుండి... విద్యకు !...139; 17.గురువులు...143; 18.జగత్తుకు మూలం భావనయే!... 144; 19.దృష్టియే సృష్టి...148; 20. అనుక్షణిక పూజాభావం... 151; 21. కల్పనాజగత్తు - జీవబాటసారులు... 154
IV. బిల్వఫలం - శిల - - మృగతృష్ణ ఉపమానాలు 158
పదహారవ రోజు 1.బిల్వఫల ఉపమానం... 158; 2.శిల- శిల్పి - శిల్పము... 161; 3. ఇక భేదమెక్కడిది?...166; 4. స్వస్వరూపానంద సుస్థిరత్వం...170; 5. ఆత్మ సర్వదా నిర్మలమే!...
V
173; 6. శరీరముయొక్క రాకపోకలు... 176; 7.భ్రమలు తొలగాలంటే జ్ఞానోదయం కావాలి...180; 8. అవిద్యయొక్క ఆనుపానులు...182; 9. జన్మ - జన్మాంతరములు... 184; 10. మోక్ష తత్త్వము... 186
V. శ్రీకృష్ణార్జున సంవాదం 190
1.అనాసక్తి యోగం... 190; 2. ఆత్మకు జననమరణాలు లేవు... 191; 3. కర్మ రహస్యం... 193; 4.పరాపరములు... 197; 5. నేను సర్వదా అకర్తను... 199; 6. ఆత్మార్పణం...200; 7. అకామకామి... 203; 8. దేహి దేహము వాసనలు...205; 9. వాసనాక్షయం
ఆత్మానుభవం...207; 10. స్వధర్మ నిరతి...210; 11. మనోకల్పన...211; 12. అసాధ్యం కాదు సుసాధ్యమే...213; 13. నేర్పుతో కూడిన ప్రయత్నము... 215; 14. ఆత్మయొక్క కృతనిశ్చయం...216; 15. జీవన్ముక్తుని పరమ లక్షణములు... 219; 16.స్వకంఠాభరణం... 221
VI. జీవుడు - - స్వప్నపరంపరలు 225
1.స్వప్నసదృశ సిద్ధాంతం... 225; 2. స్వప్నంలో ఇంకొక స్వప్నం...230; 3. రాజహంస - రుద్రుడు...235; 4.వివిధ ఉపాధుల సమావేశం... 239; 5. దృశ్య వృత్తి - దృశ్య నిర్వృత్తి... 242; 6.గణపతిత్వం...244; 7. సంకల్పిత దేహములు...245; 8. మోహవశాత్తుగా సుదీర్ఘ పయనం...249; పదిహేడవ రోజు 9. సూక్ష్మ దేహంతో అన్వేషణ... 251; 10. బ్రహ్మైక్య ప్రతిపాదన...254; 11. పరమ నిశ్శంక స్థితి...257; 12. మౌన ధారణ...259; 13.ప్రాణ - మనోసంయోగం...263; 14. విదేహముక్తి - మౌనము... 266
VII. బేతాళ ప్రశ్నలు 272
1. ఆరు ప్రశ్నలు...272; 2. సర్వసమత్వము... 280
VIII. భగీరథ యత్నం 281
1. శ్రీత్రితల-భగీరథ సంవాదం... 281; 2. సర్వ పరిత్యాగం... 286; 3. పునః పట్టాభిషేకం
- గంగావతరణం... 289
IX. చూడాలోపాఖ్యానం (మోక్ష నిర్వచనం) 292
1.శిఖిధ్వజ రాజ్యపాలన... 292; 2. ఆధ్యాత్మ శాస్త్రముల యొక్క ఆవశ్యకత... 294; 3. ఆత్మ ప్రబోధం కలిగించేవే అనుసరణీయాలు!... 296; 4. తనయందు తానై ఉన్న ఆత్మసత్త...298; 5.నిర్మలశాంత స్వరూపం...299; 6. చూడాల స్వకీయ విచారణ... 301; 7. సుషుమ్నానాడి ...306; 8. వాసనలు - ఉపాధులు...310; 9.ఆధి- వ్యాధులు... 314; 10.ఆధి వ్యాధుల ఉపశమనోపాయాలు...318; 11. యోగశక్తులు... 320; 12. చైతన్య జడముల పరస్పర హేతుత్వం...322; 13. అగ్నిలో శీతలం! విజ్ఞానం (లేక) ప్రజ్ఞ నుండి జడ వ్యవహారం!...324; 14.చిత్ - జడపరిణామ చమత్కారం... 327; 15.సాధన ఉపాసన...332; 16. కుండలిని అష్టసిద్ధులు - జ్ఞానసాధన క్రమం... 333; 17. వెతికేది చిల్లిగవ్వ కోసం - దొరికేది
vi
చింతామణి...338; 18. శిఖిధ్వజ వనవాసం...342; 19. చూడాల శిఖిధ్వజ పునః దర్శనం...346; 20.సుఖ దుఃఖాదులన్నీ - స్వయంకల్పిత మాత్రములే!...349; 21. స్ఫటిక ఘటంలో జననం...357; పద్దెనిమిదవవ రోజు 22.క్రియ - జ్ఞానములు...359; 23. మణి సాధకుడు - గాజుమణి... 364; 24. తప్పించుకుని కూడా మరల చిక్కిన ఏనుగు... 367; 25. ఒక బంధం నుండి మరొక బంధంలోకి...370; 26. జ్ఞానము కొరకు త్యాగం...373; 27.సర్వత్యాగమంటే వస్తు త్యాగమా?...375; 28. మనస్సును అధిగమించటమే “సర్వత్యాగం”... 381; 29. బ్రహ్మముకాక మరింకెక్కడా ఏ ఇతరమైనదీ లేదు... 386; 30.‘అహంకారం' అనేది ఒక భ్రమ మాత్రమే... 395; 31. బ్రహ్మము యథాతథంగా ఉండి ఇక్కడ వినోదిస్తోంది!... 400; 32. భావనయొక్క అభావన... 405; 33. చిత్తమనేది లేదు!...409; 34.ఈ జగత్తే బ్రహ్మము...415; 35. దృశ్యము ద్రష్టను పరిమితం చేయలేదు ...418; 36. తరంగాలన్నీ జలమే! చిత్తములన్నీ చిత్తే.... 422; 37. ఋషి వాక్య మననం ...429; 38. కుంభ పునరాగమనం...431; 39.లోక సంచారం... 435; 40. నియతిని పాలించటమే ఉచితం!... 436; 41. దుర్వాస మహర్షి శాపం...440; 42. గాంధర్వ వివాహం .444; 43. ఇంద్రుని ఆహ్వానం... 446; 44. తుది పరీక్ష... 449; 45. చూడాల - శిఖిధ్వజ సమాగమం...453; 46. పునః రాజ్య ప్రవేశం...460
X. బృహస్పతి - - కచ సంవాదం 461
1.సర్వ త్యాగం అంటే ఏమిటి?...461
XI. మిథ్యా పురుషుడు 467
1. ఆకాశాన్ని భద్రపరచుకోవటమెట్లా?...467; 2. అహంకారమే ఆ మిథ్యా పురుషుడు!... 469; 3.అహంకారము ఆత్మకు అన్యమైనది కాదు...472
XII. శ్రీ శివ = - భృంగీశ్వర సంవాదం (మహాకర్త - మహాభోక్త - మహాత్యాగి) 476
1. జీవన్ముక్త లక్షణములు... 476; 2. మహాకర్త... 477; 3. మహాభోక్త...479; 4. మహాత్యాగి... 481; 5. చిత్త శామ్య స్థితి...483
XIII. మను - ఇక్ష్వాకు సంవాదము (నే నెవరు!) 485
1.ఈ కనిపించేదంతా ఏమిటి!... 485; 2. కొంగు క్రింద బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికొచ్చి నట్లు!...487; 3.జగత్తు చిత్ దర్పణంలోని ప్రతిబింబము మాత్రమే... 490; 4.'అహమ్’ నుండి ‘అనహమ్’...492; 5. సచ్చిదానందమును సంతరించుకో... 496; 6. జీవన్ముక్త మాహాత్మ్యం...498; 7.జీవన్ముక్తుడు - సామ్యస్థితి...500; 8. మూడు అవస్థలు - తురీయం ...502; 9.తురీయమునకు ఉపాయం...506; 10. భూమికా ప్రవేశం...508; 11.జన్మ - జన్మాంతర ప్రయత్నం...513; 12.ఉత్తరోత్తర భూమికా సంప్రయాణం...514; 13. ఇచ్ఛను
అధిగమించాలి...517
XIV. శ్రీ వాల్మీకి మహర్షి ప్రవచనం 521
vii
1.ఆత్మావలోకనం... 521; 2. ఆత్మానంద సాగరం...532; 3. రామానంద సాగరం... 540;
4.ఫలశ్రుతి...545
నిర్వాణ ప్రకరణం (ఉత్తరార్ధం) 549
1. ప్రకరణ పరిచయము 551
1.సంకల్పరాహిత్యము... 551; 2.'యోగం' అంటే ఏమిటి?... 555; 3. కర్మ అంటే ఏమిటి...556; 4.కర్మ త్యాగము...562; 5. అహంత్వమే సంసారం... 568; 6. తితిక్ష... 572
II. శ్రీ భుశుండ - విద్యాధర సంవాదము 576
1. బరువైన 18 వస్తువులు... 576; 2. ఇంద్రియముల దురాక్రమణం... 578; 3. దృశ్యమును వదలాలి - దృక్ను పట్టుకోవాలి... 583; 4.నేను - నీవు మొదలైనవి ఉండజాలవు!...587; 5.బాహ్యాభ్యంతర చిద్రూపుడు... 589; 6. నీవే ఆ బ్రహ్మమువు (తత్త్వమసి)...591; 7. తటస్థ భావముతో జగద్దర్శనం...594; 8. అహంభావము కల్పిత మాత్రమే!... 596; 9. చంచల మనస్సే జగత్తు యొక్క రూపం... 599; 10.ద్రష్టయే దృశ్య జగత్తుకు రచయిత... 602; 11.ఇంద్ర - త్రసరేణు న్యాయం...604; 12. ఆత్మసాక్షాత్కార పర్యంతం దృశ్యం ఉంటోంది ...606; 13.ఇంద్రత్రసరేణు న్యాయ సారాంశం...610; 14.అంతఃకరణ శుద్ధి...613; 15.బ్రహ్మజ్ఞానాగ్ని జ్వాల...615; 16. గాలిలో ఎగిరే జగత్ దూదిపుంజాలు ...617; 17.సమష్టి రూప విరాట్ పురుషుడు - వ్యష్టి...623; 18. వ్యష్టి - విరాట్టు ఒక్కటే!...627; 19. జ్ఞాని - జ్ఞానబంధువు... 631; 20. జ్ఞానియొక్క నిర్వచనం... 632; 21.జీవాత్మయే పరమాత్మ!...634; 22. అహంకారాత్మ - దేహాత్మ... 638; 23. జ్ఞాని అజ్ఞాని - వారి వ్యవహార విశేషాలు... 641
III. శ్రీ వసిష్ఠ - - మంకి సంవాదము 644
1.ప్రక్కదోవ పట్టుచున్న బహుదూరపు బాటసారి... 644; 2. సంసార పంజరం...650; 3.ఏదైతే తెలుసు కొంటోందో - అదియే తెలియబడవలసినది!...653; 4. బ్రహ్మమయమ్ జగత్...660; 5. మనస్సును అధిగమించటం ఎట్లా?...665; 8. వాసనాక్షయం యొక్క ఆవశ్యకత...673; 9.ప్రవాహపతితం కర్మ - అసంగపూర్వక నిర్వహణ... 677; 10. ఆత్మ అవాఙ్మానసగోచరం...680; 11. మనమందరమూ అద్వితీయాత్మస్వరూపులమే!... 682; 12.“అనహమ్” ఏవ ముక్తిః... 686; 13. అనంత స్వస్వరూపంలో అల్ప దృశ్య విభాగం...670; 14.తత్త్వజ్ఞులతో సాంగత్యం - స్వవిచారణ...696; 15. పరలోకవ్యాధి - ఇహైవ చికిత్స ...700; 16. దృష్టియే సృష్టి...705; 17.ప్రపంచసహిత ప్రపంచరహిత అఖండైక్య దృష్టి ...712; 18. ఇచ్ఛా జాడ్యం... 716; 19. ఇచ్ఛయొక్క ఉపశాంతి... 722; 20.ప్రబుద్ధుడు అప్రబుద్ధుడు...726; 21. జగత్తే పరమాత్మ స్వరూపం... 733; 22. సర్వరూపియగు చిదాత్మ ...739; 23.జగద్ర్భాంతి... 744; 24. వివేకముచే స్వాత్మభూతుడగు పరమాత్మారాధన...747; 25.‘అశాంతి' నుండి విశ్రాంతికి... 754; 26. మనస్సు - పదార్దములు... 760
viii
VII. మనోమృగ విశ్రాంతి 765
1.సమాధి వృక్షము - చల్లటి నీడ... 765; 2. మనో మృగము... 767; 3. ధ్యానము..... ఉత్తరోత్తర స్థితులు...769; 4. బ్రహ్మమునందు విశ్రాంతి - ఉపాయాలు...774; 5.అనురక్తి నుండి సమాధికి... 777; 6. ముముక్షువు - మొట్టమొదటి మెట్లు... 780; 7. ఈశ్వరుడు ఎక్కడున్నాడు?...785; 8. వివేకి యొక్క దర్శనం-మననం-అనుభవం...790; 9.అనన్యం...793; 10.వాసనలు తరగతులు...798; 11.ఈ జగత్తు ఉత్పత్తి రహితము
మిథ్య - నిరాకారము... 801; 12.సృష్టి ప్రళయములు...807; 13.మహా కల్పాంతము...811; 14. బ్రహ్మ సత్యమ్ - జగత్ మిథ్యా... 815; 15.జలమందు ద్రవత్వం - బ్రహ్మమునందు జగదత్వం...818; 16. జగత్ సర్వం అనుత్పన్నం... 821
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
VI. నిర్వాణ ప్రకరణం
(పూర్వార్ధం)
Page:3
పదిహేనవ రోజు
I. ప్రకరణ పరిచయం
1. అవ్యక్తి ఆత్మ స్వరూపం
సూర్య భగవానుడు తన సహస్ర కిరణ జాలములను లోకములపై ప్రసరింపజేయటంతో ఉదయారంభమైనది. రామలక్ష్మణాదులు మహర్షి వసిష్ఠులవారి ఆశ్రమం ప్రవేశించి మహర్షిని సుస్వాగతపూర్వకంగా ఆశ్రమంనుండి సభాప్రాంగణమునకు రథముపై తోడ్కొని వచ్చారు. సభ యథారీతిగా ప్రారంభమైంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మానంద స్వరూపులగు ప్రియశ్రోతలారా! లోకకళ్యాణ, చిరుదరహాసాలంకారుడ వగు ఓ రామచంద్రా! ఈ రోజు నుండి మనం నిర్వాణము గురించిన సంవాదంలో ప్రవేశిస్తున్నాం.
ఓ రామచంద్రా! ముముక్షు వ్యవహారం మొదలుగా మనం అనేక విషయాలు చెప్పుకోవటం జరిగింది. క్రమంగా నీవు నీ చిత్త విహంగాన్ని హృదయమనే పంజరంలో ఉంచి వశపరచుకుంటు న్నావు కదా? నాయనా! హంస పాలు స్వీకరించేటప్పుడు, అందులోని జలభాగాన్ని వదలి పాలసారమే గ్రహిస్తుంది కదా! అట్లాగే మన ఈ సుదీర్ఘ సంవాదములోని అసంగతమైనది, దుర్బోధ్యమైనది ఏదైనా ఉంటే.. అది విడిచి, సారాన్ని జాగ్రత్తగా గ్రహిస్తున్నావని నేననుకుంటున్నాను.
1. వాసనాక్షయం, 2.మనో నాశనం, 3. ప్రాణ నిరోధం, 4. జ్ఞానాభ్యాసం...
ఈ నాలిగిటి గురించి అనేక విశేషాలు మనం ఉపశమన విభాగంలో చెప్పుకున్నాం. వాటినన్నిటినీ నీవు చక్కగా స్వబుద్ధితో పరిశీలించి, అనుగమించాలి. ఈ పథం అనుసరిస్తే నీవు బద్ధుడవు కావు. అట్లా గాకుండా, శ్రద్ధ, పట్టుదల, ప్రయత్నము ఆశ్రయించక, కేవలం దిగులుపడుతూనో ...లేక ఇంద్రియ విషయ సేవనతోనో రోజులు గడిపేస్తూ ఉంటే ... వింధ్యపర్వత శిఖరం నుండి అమాయక ఏనుగు పతనమైనట్లు ఈ జీవుని అధఃపతనం అనివార్యం. మన ఈ సంవాదములోని అంతర్లీనసారాన్ని గ్రహిస్తూ, తమ తమ సాధనలను కొనసాగించుకుంటూ ఉండమని సర్వజనులకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. శ్రద్ధ, అవగాహన పెంపొందించుకోకపోయాడా, బాటసారి చీకటి పడుటచే ఒక అడవిలో చిక్కుకున్నట్లు, ఈ జీవుడు ఈ సంసారారణ్యంలో చిక్కుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను.
ఓ రామా! సంగరహితుడవై యథాప్రాప్తములైన లోకవ్యవహారములను ఆచరించుటయే శాస్త్ర సిద్ధాంతం. దీనిని నీవు గ్రహించి ఉదారచిత్తుడవగుము.
Page:4
ఇంతవరకూ ఉపశమనము గురించిన విభాగంలో చిట్ట చివరివరకూ మనం చెప్పుకొన్న విషయాలలోని గంభీరార్థం జ్ఞాపకం ఉంచుకుంటున్నావు కదా!
ఇప్పుడిక శాశ్వత సిద్ధి ప్రసాదించగల మరికొన్ని విశేషాలు చెప్పుకోబోతున్నాం. అయితే, అభ్యాస-వైరాగ్యాలను నిరంతరం అలవర్చుకుంటూ ఉండవలసిందే. తద్వారా తత్త్వచింతన సుస్థిరరూపం పొందుతుంది. తత్త్వం చక్కగా గ్రహించటంచేత దుర్బేధ్యమైన వాసనావేశం బలహీనపడుతుంది. అప్పుడు శోకరహితమైన 'తత్పదం' తప్పక లభిస్తుంది. మన ఈ వర్తమాన సంవాదం అందుకు తప్పక సహకరించగలదు. అందుచేత మీమీ శాస్త్రప్రవచితమైన, ఆశ్రమోచితమైన అభ్యాసాలు చక్కగా నిర్వర్తిస్తూ ఉండండి.
దేశ-కాల-కారణములచే పరిచ్ఛేదమొందజాలని బ్రహ్మమే ఈ జగత్తు రూపంగా వెలయు చున్నది. అయితే, చమత్కారంగా ద్వైత భ్రాంతిని మాత్రం కలుగజేస్తోంది. నిర్విషయమై, సమమై, శాంతమయమైనట్టి బ్రహ్మమొక్కటే ఉన్నది. ఇక్కడ అన్యత్వానికి తావేలేదు. ఈ విషయం పదే పదే నిరూపించుకున్నాం. నిరూపించుకోబోతున్నాం కూడా!
ఇక అహంకారమంటావా... అద్దానిని లేని దానిగానే చూడు. ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతరం (పురుగు నుండి, బ్రహ్మదేవుని వరకూ) ప్రశాంతంగా సర్వశరీరములలోనూ ప్రసరించి ఉన్న ఆత్మను దర్శించగలగటమే “అపరోక్షానుభవం.” నిజానికి చిత్తము గాని, అవిద్య గాని మనస్సు గాని, జీవుడు గాని లేనేలేవు. ఇవన్నీ ఆ బ్రహ్మమునందు ఏర్పరచబడుచున్న కల్పనలు మాత్రమే. భోగములు, అద్దాని పట్ల ఏర్పడే వృత్తులు, ఆసక్తి, అనుభవం - ఇవన్నీ కూడా సముద్రంలోని తరంగాలులాగా బ్రహ్మములోనే ఉద్భవిస్తున్నాయి. స్వర్గ-భూ-పాతాళ లోకములలోను, భూతవర్తమాన-భవిష్యత్తులలోను, బ్రహ్మదేవునిలోనూ, స్తంభములో కూడా... ఆ పరబ్రహ్మమొక్కటే జ్వాజ్వల్యమానంగా ప్రకాశించుచున్నది. దానికి భిన్నమైనదంటూ ఏదీ లేదు. గ్రాహ్య - త్యాజ్యము లలోనూ, బంధుమిత్ర వ్యవహారములందు, తదితర సర్వ ఉపాధులలోనూ ఆద్యంతరహితమై విజృంభి స్తోంది ఆత్మయే.
అజ్ఞాన భ్రమ ఉన్నంతవరకు జలంలో తరంగభావనలాగా 'జగత్ కల్పన' అనే చిత్తము యొక్క ద్వితీయ ఆవృత్తి ఉండనే ఉంటోంది.
“నేను దేహమును, ఈ దృశ్యమంతా నిజమే అయి ఉన్నది, ఇది నేను, అవి నావి” ...ఇటువంటి కల్పనలు, భావతమకములు ఉన్నాయంటే మనోచాంచల్యము ఏర్పడుచున్నట్లే! జీవుడు సజ్జన. సద్విషయ - సద్వివేక సాంగత్యం ద్వారా పూర్ణత్వం సంతరించుకోనంత వరకు చిత్తం నీచత్వం పొందుతూనే ఉంటుంది. సర్వసమదర్శనం ద్వారా విశ్వభ్రాంతిని బలహీనపరచుకుంటే గాని తన స్వరూపమేమిటో ఈ జీవునకు అర్థం కాదు, తోచదు కూడా! అజ్ఞానం అనే గుడ్డితనం వలన మోహం, మోహం వలన మూర్ఖత్వం, మూర్ఖత్వం ద్వారా విషయ ఆశలు, విషయవాసనలు వచ్చి పడుతున్నప్పుడు మరి జీవుడు ఉపాయాలను ఆశ్రయించాలి కదా? హృదయవనంలో ఆశల దుర్గంధం నిరంతరం ఉబుకుతుంటే 'ఆత్మవిచారణ' అనే చకోరం ఎట్లా ప్రవేశిస్తుంది? భోగములను ఆశించటం
Page:5
కాస్త ఆపి, సమచిత్తం పెంపొందించుకోకపోతే ఈ జీవుని పీడించే పాశాలు తెగేదెట్లా? తృష్ణను జయించి శీతల మనస్కుడు కాకపోతే ఈ జీవునికి స్వస్వరూప ప్రబోధం వినబడేదెట్లా? అవునా, కాదా? శ్రీ రాముడు: ఔను మహర్షీ! అయితే, ‘చిత్తం' అనబడేది అనే పిశాచి అసలు ఉత్పన్నం కాకుండేదెట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ ఎదురుగా కంటికి కనబడే వస్తువులను “లేనివి”గా, అతి దగ్గరగా అనుభవ మయ్యే ఈ దేహమును "బాహ్యమగు ఉపకరణ మాత్రం”గా చూడగలిగిన నాడు జీవునికి చిత్తం ఉత్పన్నమే కాకుండగలదు. 'నేను పుట్టుక - చావుల మధ్య ఇరుక్కున్న ఒక అల్ప జీవుడను' అనే ప్రారంభ భ్రమతో బాటు తదితర అసంఖ్యాక భ్రమలకు కారణమగుచున్న 'జగత్తు' అనబడేది అంతరంగంలో శాంతించటమే అన్నిటి కన్నా అతి ముఖ్యమైన ఉపాయం. అందుకు శ్రవణ-మనననిధి-ధ్యాసనల ద్వారా హృదయంలో ఆత్మ సాక్షాత్కరించటమొక్కటే మార్గం. మిథ్యాభ్రమలు కలిగించే అజ్ఞానం శాంతించి 'పరమార్థదర్శనం' అనే సూర్యుడు ఉదయిస్తే చిత్తం దానంతట అదే ఎండుటాకు వలె నేల రాలుతుంది. నిప్పులో పడ్డ నేయి వలె లేకుండాపోతుంది.
శ్రీరాముడు : మహాత్మా! మహాత్ములలో కూడా 'చిత్తం' ఉంటుందా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఉంటుంది. అయితే సముద్రం ఒడ్డున నీరు ఎండిన చోట నీటి జాడలు కనిపి స్తాయి చూచావా! అట్లా పేరుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల చిత్తం పరాపరదర్శనంతో కూడుకొని ఉంటుంది. జీవన్ముక్తమై ఉంటుంది. శుద్ధసత్వమయమగుటచే నామకః మాత్రమే అయి ఉంటుంది. వారిలో వాసనలు సత్వమయమై ఉండటం చేత వారిది చిత్తము అని అనిపించుకోదు. 'సమరసము’ అను రుచితో కూడిన ఆ తత్త్వజ్ఞులు అమనస్కులే! వారు లోకహితైషులై ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారు. శుద్ధులై, శాంతులై, మహోన్నతులై, సంయతీంద్రియులై తమ లోపల, బైట అద్వైతజ్యోతి సమన్వితులై ఉంటారు. ద్వైత వాసనలు వారిని సమీపించలేవు. ఈ దృశ్యము అనే తృణములు (గడ్డిపరకలు) వారి జ్ఞానము అనే అగ్నికి ఆహుతై అవిషయములగుచున్నాయి. వారి సంచారములు, మనోధర్మములు లోకకళ్యాణోద్దేశ్యం మాత్రమే కలిగి ఉంటాయి. అట్టి చిత్తంలో ఇక భ్రమలేవీ ఉండవు.
దగ్ధమైన బీజం మరల అంకురిస్తుందా? ఆ మహా మహితాత్ముల హృదయాకాశంలో మోహం ఉద్భవించదు.
దేనినైతే మనం ‘చిత్తము’ అని పిలుస్తున్నామో అది మూఢులకు పదే పదే జన్మజరామరణములు కలిగించటానికి కారణమౌతోంది. జ్ఞానుల చిత్తం ఒక మహాశిల్పి చేతిలోని ఉలిలాగా గొప్ప ఉపయుక్త మగు ఉపకరణమగుచున్నది. అనగా, అదే చిత్తము “జ్ఞానానందమయ దృష్టి”ని సంపాదించుకోవటానికి పరికరమగుచున్నది. అట్టి చిత్తము అజ్ఞాని యొక్క చిత్తంలాగా పదే పదే పునరుత్పత్తి పొందటం లేదు. శ్రీరాముడు : ఏకత్వం తాండవిస్తోందని చెప్పబడే ఈ జగత్తు మాకు పరిపరి విధాలుగా కనబడటానికి కారణమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వస్వరూపము, సర్వ స్వరూపము అగు బ్రహ్మమును ఏమరచుట చేతనే!
Page:6
బ్రహ్మబృంహైవ హి జగజ్జగచ్చి బ్రహ్మబృంహణమ్ | విద్యతే నానయోర్భేదశ్చిÓన బ్రహ్మగోరివ॥ (శ్లో. 51 సర్గ 95)
అయితే ఈ జగత్తు, బ్రహ్మము, శుద్ధ చిత్తము - ఈ మూడు వేర్వేరు కాదని గ్రహించు. అవి అభేదమైనవే! మిరియములో కారం ఉన్నట్లు... మూడు జగత్తులూ చిత్లోనే ఉన్నాయి. శ్రీరాముడు : స్వామీ! ఈ జగత్తు ఉత్పత్తి, ప్రళయముల మాటేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : జగత్ యొక్క ఉత్పత్తి, ప్రళయములు కేవలం కల్పిత మాత్రములే. ఇక అది ఉండటం ఉండకపోవటం (సత్ - అసత్) అనునదంతా ఖండజ్ఞానముచే ఏర్పడుచున్నదే! భ్రాంతి చేత చైతన్యమునందు జడత్వము ఆపాదించబడి, గాంచబడుతోంది. ఫలితంగా అట్లు జడ భావనచే చూస్తున్న ద్రష్టయగు ఈ జీవుని ఇక సర్వ అప్రతిష్ఠలు, సర్వ అల్పావగాహనలు చుట్టుముట్టుచున్నాయి. అతను దుఃఖితుడౌతున్నాడు. మరి ఆ దుఃఖాలు తొలగక్కర్లేదా?
శ్రీరాముడు : ఈ జీవుని అంతరాంతరాలలో దుఃఖం పేరుకుని ఉన్న మాట మాత్రం నిజం. అది తొలగవలసిన అగత్యమున్నదనునది అత్యావస్యకం కూడా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అందుకు విచారణ చేయాలి. కాస్త విచారణ చేస్తే, “ఈ జడ జగత్తు వాస్తవమే కాదు” అని తేలుతోంది. కల్పనలన్నీ కల్పనలను ఆశ్రయించే స్వభావం గల ఈ జీవునియందే ఉన్నాయి గాని... జగత్తునందు కాదు.
ఈ దృశ్యమును చిన్మయముగా భావించగలిగిన చిత్తము శుద్ధమైనట్లే. అద్దానిలో బైట, లోపల ఇక కల్పనలు ఉండవు.
ఆత్మయే స్వరూపముగా గల ఈ జీవుడు స్వస్వరూపమును ఏమరచినప్పుడల్లా అల్పత్వము పొందుతున్నాడు. అందుచేత సర్వ జనులారా! మీ యొక్క సత్యస్వరూపం ఈ నామ రూపాత్మక దేహం కాదు. జగత్తులోని ఒక పదార్థం కాదు. అది ఆద్యంత రహితమై, నిరంశమై, చిదాత్మకమై అఖండమై ఈ కనబడే దాని కంతటికీ అతీతమైయున్నదని గుర్తు చేస్తున్నాను. మరల మరల ఆ పరిపూర్ణత్వమును స్మరించి, అద్దానిచే శాంతులై అప్పుడు ఈ సర్వమును పరికించండి. అప్పుడు, “జగత్తు - చిత్తము – బ్రహ్మము ఒక్కటే వేర్వేరు కాదు” అను గూడార్థం మీకు తప్పక గోచరించగలదు. స్ఫటికము వలె శుభ్ర స్వరూపుడగు ఈ జీవుడు తనకు తానే కల్పనచే ఈ సంసారరూపంగా క్రీడయందు వలె తాండవమాడుచున్నాడు.
ఓ రామచంద్రా! ఈ కనబడే పదార్దములేవీ నీవు అయి ఉండలేదు. అవి నీ యందు లేవు. నీవు వాటియందు లేవు. ఓ అవ్యక్తరూపా! చిదనాత్మా! చిదానంద స్వరూపుడా! ఆద్యంతవివర్జితుడా! సర్వవ్యాపీ! శుద్ధ చిత్త సమన్వితుడా! స్వాంత స్థితుడా! లీలామాత్రజగద్ధారీ! మావంటి మునులందరికీ ధ్యేయమైనవాడా! నీ వాస్తవ స్వస్వరూపమునకు వేనవేల నమస్కారాలయ్యా! ప్రతి ఒక్క జీవుడు నీ స్వరూపమే! నీవే ప్రతి ఒక్క జీవుని స్వరూపం కూడా! మేమంతా నీస్వరూపమే! ఆత్మారాములమే!
Page:7
2. లేనిది లేనిదానిగా చూడాలి
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! సముద్రంలో అనంత సంఖ్యలో తరంగాలు లేవటం లయించటం జరుగుచున్నట్లు, ఈ జగత్తులు అనంత సంఖ్యలో ఆత్మయందు ఉత్పన్నమై లయిస్తున్నాయి. ఎవ్వడైతే అద్వైత భావనచే భావాభావ వివర్జితుడై ఉంటాడో, ముక్త స్థితిలో ఉంటాడో అతనియందు ఈ జగద్వాసనలే కానరావు. స్వప్నానికి రూపం లేనట్లే, ఈ జగత్తులకు వాస్తవమైన రూపమేదీ లేదు!
అసలు ఈ ‘జగత్తు - జీవుడు' అనునవి చిత్తము యొక్క కల్పనలే సుమా! ఇక మిగతావాటి గురించి వేరుగా చెప్పేదేమున్నది?... అందుచేత జగద్వాసనలు (Worldly tendencies) క్షయించాలి. వాసనలు క్షీణమొందగానే నీవు చిత్సముద్రుడవౌతావు. మహా గంభీరుడవు, సౌమ్యుడవు, ఆత్మారాముడవు కాగలవు.
అగ్ని నుండి వేడి, పుష్పము నుండి సుగంధం, కాటుక నుండి నలుపు, చెఱుకు నుండి తీపి, తేజము నుండి వెలుతురు, జలము నుండి తరంగం వేరుకానట్లు... 'చిత్తము' అనే స్వకీయ సంకల్ప వ్యవహారము కంటే జగత్తు అనబడేది వేరు కాదు.
చితో న భిన్నో 'అనుభవో', భిన్నో న అనుభవాత్ 'అహం' । న మత్తో భిద్యతే 'జీవో', న జీవాత్ భిధ్యతే ‘మనః' ||
మనసో న ఇంద్రియం భిన్నం, పృధక్ దేహశ్చ న ఇంద్రియాత్ న శరీరాత్ జగత్ భిన్నం, జగతో నా న్యదస్థి హి ||
చిత్ కంటే అనుభవం వేరు కాదు. అనుభవం 'అహం' (నేను)కు వేరు కాదు. 'అహం' జీవుని కంటే వేరు కాదు. అట్టి జీవుడు మనస్సు కంటే అన్యమైనవాడు కాదు. మనస్సు ఇంద్రియార్థములకు వేరుగా లేదు. ఇంద్రియార్థములు ఇంద్రియాల కంటే వేరు కాదు. ఇంద్రియాలే శరీరం. అట్టి ఇంద్రియ విషయాలే ఈ జగత్తు ఇంక వేరే ఏమున్నది? ... ఈ విధంగా చూస్తే ఈ జగత్తు చిదాకాశమే
అయి ఉంది.
జ్ఞానదృష్టికి ఇదంతా స్వకీయ కల్పనామాత్రమే! జ్ఞాని యొక్క భావనలో ఇదంతా తొందరగా గాని, నెమ్మదిగా గాని, అసలుగా గాని ప్రవర్తించుటయే లేదు.
అఖండమైన ఆత్మజ్ఞానం లభించిన వారికి ఆకాశ స్వరూపమగు పరబ్రహ్మమొక్కటే తనలో - తనతో తానై దృశ్యజగత్తుగా వెలయుట స్ఫురిస్తోంది. తదితరమైనదేదీ వారికి అగుపించుటయే లేదు. అట్టి మహనీయులకు శూన్యం శూన్యంలోను, సత్యం సత్యంలోను, పూర్ణం పూర్ణంలోను తెలియవస్తున్నాయి.
జ్ఞాని అందరి వలే లోక వ్యవహారాలు నిర్వర్తిస్తున్నప్పటికీ... అతనిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అతనికి దేనిపట్లా కూడా ఆసక్తి అనేది ఉండదు. అందుచేత అతనికి కర్తృత్వ భోక్తృత్వాలు కూడా ఉండవు. కనుక ఏది ఎట్లు చేస్తున్నా, ఏదీ చేయనివాడే అవుతాడు. ఆసక్తితో కూడి ఉన్నప్పుడు
Page:8
మాత్రమే క్రియలు సుఖ దుఃఖములుగా పరిణమించటం జరుగుతోంది. ఆసక్తి లేకపోతే కర్తృత్వం ఉండదు. సుఖ దుఃఖాలూ ఉండవు.
అనంతమగు ఆకాశమే తూర్పు - - పడమర - పైన - క్రింద... మొదలైన వాక్య వ్యవహారాలుగా ఏర్పడుచున్నది కదా! బ్రహ్మమే కర్తృత్వాభిమానం చేత జగత్తుగా సంకల్పించబడుతోంది.
ఎవని చిత్తము ఆకాశము వలె శుద్ధమైనదో, ఎవడు సదాచారపరాయణుడో, ఎవడైతే మట్టి
- చెక్క లాగా సంతోష దుఃఖములకు అచలితుడో, ఎవడు తనను చంపవచ్చిన శత్రువును కూడా అకృత్రిమ స్నేహంతో పరబ్రహ్మంగా దర్శించగలుగుతాడో... అట్టివాడే పరమసత్యాన్ని దర్శించటానికి అర్హత సంపాదించుకో గలుగుతాడు.
శ్రీరాముడు: మహాత్మా! ఈ జీవుడు ఎప్పుడు సుఖ దుఃఖములకు అతీతుడవగలుగుతాడు?
శ్రీ వసిష్ఠ మహర్షి : నదిలోని నీరు గట్టుమీద ఉన్న వృక్షమును మొదలంట సమూలంగా పెకలించు నట్లు హృదయంలోంచి మదము, మాత్సర్యము మొదలైన వాసనలు మొదలంటా నిర్మూలించ బడినప్పుడు మాత్రమే ఈ జీవుడు సుఖదుఃఖాతీతుడు కాగలుగుతాడు. రాగ ద్వేషాలకు అసలు కారణములేమిటో విచారించి, హృదయగుహలోంచి ఈ సర్వ వికారములను వెడల గొట్టకపోతే, కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించిన అసాధువులాగా ఎంత విన్నా, ఎంత చదివినా ఏం లాభం?... అట్టివాడు తెలుసుకుంటూ కూడా తెలియనివాడే అవుతాడు.
అంతేకాదు. ఎవని యందైతే కర్తృత్వ భోక్తృత్వాభిమానములు సమూలంగా తొలగి ఉంటాయో, బుద్ధి నిర్లిప్తమై ఉంటుందో... అతడు ఈ లోకంలో ఉన్నవారందరినీ చంపినా కూడా చంపనివాడు గానే ఉంటాడు.
శ్రీరాముడు: అట్టి నిరంహంకారం ఎట్లా సాధ్యం?
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వతహాగా లేని దానికి 'ఉన్నది ఉన్నది' అని సద్భావనను కల్పించటమే మాయ. ఇంక అహంకారమో... స్వతఃసిద్ధంగా లేనే లేదు.
జ్ఞానాన్ని అవలంబించటం చేత ఈ విషయం సుస్పష్టమౌతోంది. లేనిది లేనట్లుగా గ్రహించటమే జ్ఞానం. జ్ఞాని హృదయంలో దృశ్య ప్రపంచవాసనలకు చోటు లభించదు. అట్టివాడు సామంతులను లోబర్చుకుంటున్నట్లు ఈ సంసార వ్యవహారములను నిర్ద్వంద్వంగా జయించగలుగు చున్నాడు.
ఈ ప్రపంచంలోని పదార్ధములు కనిపిస్తున్నప్పుడు, కనిపించనపుడు, వైభవ-దారిద్ర్యములు వచ్చి పోవునపుడు, ఆరోప - - అపవాద దశలందు, తదితరజనులతో ఏర్పడే సంయోగవియోగ సందర్భములందు ఎవనికి సంతోషము గాని విషాదముగాని కలుగవో అట్టి మహనీయుని శాస్త్రములు 'జీవన్ముక్తుడు’ అని పిలుస్తున్నాయి. ఓ సర్వసభికులారా! మీరు జీవన్ముక్తులయ్యేందుకు సాధనలు కొనసాగించెదరు గాక!
Page:9
3. మేలుకొలుపు
శ్రీరాముడు: స్వామీ! నిర్మలమగు చిదాత్మ “మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, తదితర జీవులు" అనువాటిలోకి వెళ్ళి వెళ్ళి చిక్కుకున్నదే? ఎందుచేత? అట్టి బంధం విడివడేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి: నీవు చెప్పే మనస్సు, బుద్ధి మొదలైనవి చిన్మయసత్తను అతిక్రమించి ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావా? బృహత్ స్వరూపమైన ఆత్మయే నానాత్వమంతా భ్రమింపజేస్తోంది. మెల్లకన్నువానికి ఒకే వస్తువు అనేక వస్తువులుగా కనిపిస్తుందే! వరుసలో నిలబెట్టిన దర్పణములలో ఒకే వ్యక్తి యొక్క అనేక ప్రతిబింబములు అనేక కోణములలో అగుపిస్తాయి చూచావా! ఇదీ అంతే!
అంధకారం తొలగితే ఆ చీకటిచే కల్పించబడిన క్రీనీడలు కూడా తొలగుతాయి కదా! మూర్ఖ సమన్వితమగు భోగవాసనలు ఉపశమిస్తే అజ్ఞానం కూడా వినష్టమైపోతుంది. 'తృష్ణ' అనే విశూచివ్యాధి ఉపశమిస్తుంది. చిత్తవాసనలు తమ బంధువులగు అనేక ఆవేశ కావేషాలతో సహా తొలగుతాయి. దారం తెగిపోగానే దానికి గుచ్చబడిన ముత్యములు జారిపోవునట్లు సర్వ సంసార సంస్కారాలు సన్నగిల్లుతాయి.
అమనస్కం - ఆ ఓ రామా! సంకల్పములు త్యజించుటచే అనాసక్తిపూర్వకమగు అమనస్కం లభిస్తుంది. శాస్త్రములు చేయిఎత్తి చూపుడువేలుతో చూపుచున్నది 'ఆత్మ' అనుపేరుతో గల ఆ అమనస్కమే! ఈ మర్మాన్ని గ్రహించక ఆత్మ అనగా మరేదో బాహ్య విషయంగా గ్రహించేవారు శాస్త్రహంతకులేనని నా అభిప్రాయం. అట్టివారు శాస్త్రములలోని పైపై మధ్యేమార్గ విషయములను మాత్రమే గ్రహించేవారు సుమా!
అజ్ఞానమే సర్వ జాడ్యములకూ కారణం. గాలి వేగం తగ్గితే పద్మం కదలికలు మాని నిశ్చలత్వం పొందుతుంది. అట్లాగే అజ్ఞానం క్షీణిస్తే ఇక ఈ దృశ్య వ్యవహారాలేవీ మనస్సును వ్యాకులపరచలేవు. నాయనా! రామా! నీవు ఈ వాక్యములను విని ఆసక్తి-అనాసక్తులను విడుస్తూ మనోస్థిరత్వం పొందుచున్నావనే అనుకుంటున్నాను.
ప్రియ శ్రోతలారా! అంతఃపురంలో నిదురిస్తున్న రాజు భేరీనినాదం విని నిదురలేస్తాడు చూచారా? మీరు కూడా నా ఈ ఉపదేశ వాక్యాలు విని అజ్ఞాన నిద్ర నుండి జాగృతమవ్వండి. ఓ రామచంద్రా! సామాన్యుల హృదయాలలో కూడా ఈ మన సంవాద వాక్యాలు హత్తుకుపోతాయి. ఇక అతి ఉదారహృదయుడవైన నీ పట్ల వ్యర్థమెందుకవుతాయి? ఎండచే ఎండి ఉన్న నేల నీరు పడగానే వేగంగా పీల్చున్నట్లు, “అత్యంత ప్రయత్నశీలము, జిజ్ఞాస సమన్వితం" అగు నీ హృదయంలో ఈ ప్రవచనాలు స్థిరత్వం తప్పకపొందుతాయి. మహనీయుల అనుభవాలు నీకు శిరోధార్యమౌతాయని, ఆయా విశేషాలన్నీ హృదయంలో పదిలపరచుకుంటున్నావని నాకు తెలుసు.
Page:10
4. అయోమయం నుండి స్వస్థానానికి... !
శ్రీరాముడు : హే మహర్షీ! పరమ పవిత్రమగు తమ ముఖ కమలం నుండి వెలువడుచున్న గురువాక్యములు నాకు అత్యంత విశ్రాంతిని, ప్రశాంతతను కలుగజేస్తున్నాయి. మీ ప్రవచనం వింటున్నప్పుడు నా యొక్క స్వానుభవమేమిటో చెపుతాను వినండి.
హే ప్రభూ! అమృతతుల్యములగు మీ వాక్యములలోని అంతర్లీన గానామృతం గ్రోలుచున్నాను. బాహ్యాంతరాలలో సంచరించే నా చిత్తం క్రమంగా శాంతమును సంతరించుకుని నా స్వరూపంతో ఐక్యం పొందుతోంది. చాలా సంవత్సరాలు అనావృష్టిచే శుష్కమైన పొలం ఒక రోజు కుండపోత వర్షంచే తడిసి ఆనందం పొందునట్లు... నా మనస్సు మీ వాక్యధారలచే అభిషిక్తమై పరమానందం పొందుతోంది. ఏనుగు మొదలైన జంతువులు ప్రవేశించని సరస్సు నిశ్చలమగునట్లు నేను నిశ్చల ప్రశాంతతను అనుభవిస్తున్నాను. పొగమంచు తొలగితే రహదారిలో దూరం నుండి వస్తున్న వాహనాలు సుస్పష్టంగా కనబడునట్లు... ఈ కనబడే దృశ్యంలో యథాతథమగు బ్రహ్మము సుస్పష్టమౌతోంది. దిక్ మండలమంతా ప్రసన్నంగా దృశ్యమానమౌతోంది. ఆశలు అనే మృగతృష్ణ యొక్క ఆనుపాను లేమిటో తెలిసిపోతున్నాయి. ఆసక్తి అనే వృథా శ్రమ దరిజేరటం లేదు. వసంతకాలంలో చెట్లు చిగురిస్తుంటే కోయిల ఆనందంగా కుహూనాదాలు చేస్తున్నట్లు నేను విషాదములన్నిటి నుండీ తొలగినవాడనై ఆనందభరితుడనగుచున్నాను. ఎచ్చటైతే అమృతాస్వాదన కూడా స్వల్పాతిస్వల్ప విషయమై ఉంటుందో, అట్టి ఆత్మానందం నాకు తారసపడుతోంది.
ఆత్మయే స్వరూపముగా గల నాకు ఇదే నా నమస్కారం. అట్టి ఆనందం ప్రసాదిస్తున్న మీకు నమస్కారం!
సూర్యుడు ఉదయించగానే పిశాచమునకు సంబంధించిన భ్రమలు ఇంకా మిగులుతాయా? జ్ఞానోదయమగుచుండగా కల్పనలన్నీ నశిస్తున్నాయి. సంశయములన్నీ తొలగుతున్నాయి. శరత్కాలం లోని ఆకాశంలాగా నా హృదయం నిర్మలము, శాంతము, అనంతము - అయిన ఆనందమును పొందుతోంది. 'ఆత్మయందు కళంకం ఎట్లా, ఎప్పుడు, ఎక్కడి నుండి ఎందుకొచ్చింది?’ ...ఇటువంటి సంశయాలన్నీ చీకటి రాత్రిలో ఉదయించిన పూర్ణచంద్రుని కిరణాలచే ఏర్పడిన దృశ్యమాన జగత్తులాగా విశదమగుచున్నాయి. సర్వము సర్వదా సర్వత్రా ఆత్మయే ఏర్పడి ఉండగా... ఇక ‘ఇది వేరు, అది వేరు’ అనే మిథ్యాకల్పనలకు తావెక్కడిది?
హే సద్గురూ! ఏదో తెలియని ఆవేదనకు, అగమ్యమునకు ఆలవాలమైన నా 15 రోజుల క్రితం స్థితినీ, ఇప్పటి నా స్థితినీ పోల్చి చూచినప్పుడు, అప్పటి నా మనోవేదనలను తలచుకోగానే నవ్వు వస్తోంది. 'ఆశలు-అవి తీరుట' మొదలైన దృష్టుల నుండి వైదొలగి తృష్ణారహితమగు స్థానం చేరుకున్నాను. మీ ‘వాక్' అను అమృతధారలతో స్నానం చేసిన నేను ఇప్పుడు సర్వాత్మభావనను, సంపూర్ణ స్వభావమును సంతరించుకుంటున్నాను. తమ దయచేత బ్రహ్మభూమికను అధిరోహిస్తున్నాను.
Page:11
ఇప్పటి నా దృష్టికి సూర్యమండలము కూడా పాతాళము వలె అధోవిషయమగుచున్నది. 'ఆసక్తి - అనాసక్తి' అనే సముద్ర తరంగముల నుండి లేచినవాడనై స్వస్వరూపమునందు సుప్రతిష్ఠితుడ నగుచున్నాను. స్వమహిమ యందు సర్వోత్కృష్ట రూపముతో వెలుగొందుచున్నాను.
ఆత్మయే స్వరూపముగా గల నేను నమస్కరింపతగినవాడనగుచున్నాను. అట్టి నాకు పదేపదే ఇవే నా నమస్కారములు.
ప్రభూ! ఇన్ని మాటలెందుకు? మీ వచనాలు నా హృదయ పద్మకోశంలో ప్రవేశించి అనుభవ జ్ఞానమును ప్రసాదిస్తున్నాయి. తద్వారా నిత్యానంద స్వరూపమగు జీవన్ముక్త స్థితి పొందుచున్నాను.
5. మోహం ఎట్లా తొలగుతుంది?
శ్రీవసిష్ఠ మహర్షి: శ్రీరామా! చాలా సంతోషం. నీ వాక్యములచే నేను ప్రసన్నుడనై నా ప్రవచనాన్ని కొనసాగించటానికి ఉద్యుక్తుడను, సముత్సాహుడను అగుచున్నాను.
ఇప్పుడు నీకు 'మోహం ఎట్లా తొలగుతుంది?' అనే విషయమై కొన్ని విషయాలు చెపుతాను. నీకు భేద బుద్ధి తొలగిందని నాకు తెలుసు. అయినా కూడా ఎల్లవేళలా జ్ఞానాభివృద్ధి అవసరమే. అందుచేత యథావిధిగా శ్రద్ధతో విను. మనం చెప్పుకోబోయే విశేషాలు ప్రీతికి, మనోసౌమ్యతకు తోడ్పడతాయి. ఈ తత్త్వము గ్రహించినవారి దుఃఖములు వాటంతట అవే తొలగిపోగలవు.
ఏ జీవుడైతే పంచభూతాత్మకమైన ఈ దేహమునందు ఆత్మ భావన సలుపుచున్నాడో, (ఎవడైతే 'నేను ఈ దేహమును మాత్రమే' అని తలచుచున్నాడో)... అతనిని అతని ఇంద్రియములే మరల మరల పరాభవిస్తున్నాయి. 'అనాత్మ భావన' అను దోషము యొక్క ప్రభావం అట్టిది మరి! అట్లా కాకుండా ఏ జీవుడైతే ఆత్మ జ్ఞాన పరాయణుడై, ఆత్మ తృప్తుడై ఉంటాడో... అతని ఇంద్రియములు అతనిని తమ మిత్రునిగా భావించి సేవిస్తాయి. ఆసక్తి-అనాసక్తులు త్యజించిన జీవునకు ఈ దేహము గాని, మరొక దేహం గాని పొందవలసిన అగత్యం గాని, అభినివేశం గాని ఉండదు. వాటి రాక పోకలకు ఆతడు అప్రమేయుడై మౌనంగా, లీలగా, క్రీడగా ఈ సర్వమును ఆస్వాదిస్తున్నాడు.
ఆత్మకు, శరీరమునకు సంబంధమే లేదు. చీకటి వెలుగుల వలె ఆ రెండూ పరస్పర విరుద్ధాలై ఉన్నాయి. అందుచేత జడము, తుచ్ఛము, వినాశనశీలము, కృతఘ్నము అగు శరీరము అనబడే ఒక జడ వస్తువుకు ఏమి కావలసివున్నదో అదే అగుగాక! సర్వ శక్తిమంతము, ఉదయాస్తమయ రహితము, నిర్లిప్తము, అప్రమేయము, వికార రహితము అగు ఆత్మకు ఈ శరీరము ఉండటం చేత గాని, (లేక) లేకపోవుట చేత గాని కలిగే హాని లేదు. మేలు లేదు. ఆత్మయొక్క 'నిత్యోదయము (Ever Wakeful) అనే లక్షణం ఈ భౌతిక శరీరానికి ఎట్లా వర్తిస్తుంది? చిన్మయమగు నీ స్వస్వరూపాన్ని నీవు భావన చేస్తూ ఉంటే 'నేను మృణ్మయమగు ఈ శరీరమును' అనే జడభావన చీకటిలో
మటుమాయమౌతుంది.
Page:12
శ్రీరాముడు : అయితే మహర్షీ! ఈ లోక వ్యవహారములు శరీర సహాయంతోనే నిర్వర్తించబడుచున్నాయి
కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ లోక వ్యవహారములు ఆత్మ-శరీరముల కలయికచే జరుగుచున్నట్లు అనిపించ వచ్చు గాక! అయినా కూడా వాస్తవానికి అవి రెండూ విరుద్ధ ధర్మాలు గల వస్తువులు. అత్యంత సూక్ష్మ మగు ఆత్మకు, అత్యంత స్థూలమగు శరీరానికి సంయోగమే అసంభవం. ఇక ఒకదానిలో మరొకటి ఐక్యమవటం ఎట్లా సిద్ధిస్తుంది? కనుక శరీర భావన, ఆత్మభావన ఒకచోట ఏర్పడి ఉండజాలవు.
ఆత్మభావన లేనప్పుడు శరీరభావన ఉన్నట్లే!... శరీరభావన లేనప్పుడు ఆత్మభావన ఉంటున్నట్లే! సద్వస్తువగు బ్రహ్మం జడం కాజాలదు. ఆరోపిత దృష్టిచే బ్రహ్మం దేహంగా అగుచున్నట్లు భ్రమ గొలుపుచుండవచ్చుగాక! అయినప్పటికీ సర్వ వ్యాపియగు ఆత్మకు శరీరముతో సంబంధం లేదు. శరీరము యొక్క ధర్మములు ఆత్మ యొక్క ధర్మములు వేరు వేరు.
దేహేన దేహగస్యాపి కమలస్యేవ వారిణా |
మనాగపి న సంశ్లేషో బ్రహ్మణో దేహసత్తయా ॥ (శ్లో॥ 14, సర్గ 60)
నీటిలో తామర పువ్వు ఉన్నంత మాత్రంచేత నీరు, తామరపువ్వు ఒక్కటి అవనట్లు... దేహికి దేహమునకు సంబంధం లేదు. ఏదైనా సంబంధం కనిపిస్తుంటే, అది ఆరోపితం మాత్రమే. దేహము ఉన్నంత మాత్రంచేత బ్రహ్మమునకు ఎట్టి దోషమూ అంటదు.
బ్రహ్మము సర్వదా నిర్దోషము, సమము. ఒక ఇంట్లో ఒక మనిషి ఉన్నాడనుకో. అంతమాత్రం చేత ఆ ఇంటియొక్క లక్షణములు మనిషివౌతాయా? ...లేక, మనిషి యొక్క లక్షణాలు ఇంటివి అవుతాయా? ఇదీ అంతే.
ఒకచోట గాలి వేగంగా వీస్తోందనుకో. ఆ గాలి యొక్క వీచికలు ఆకాశమును అంటుతాయా? శరీరము యొక్క లక్షణములైనట్టి జన్మ-జరా-మరణములు, ఆత్మకు అంటవు. అట్లాగే ఇక్కడి సుఖ-దుఃఖాలు, ఆసక్తి - అనాసక్తులు కూడా ఆత్మకు అంటవు. అందుచేత 'వీటివేటికీ సంబంధించనట్టి ఆత్మ'ను గ్రహించి పరమానందమును నిరభ్యంతరంగా పొందవచ్చు. ఇక ఈ శరీరములు, మనస్సు వగైరా బ్రహ్మా మహాసముద్రజలంలోని తరంగముల వంటివిగా చూడు. నిజానికి జలానికి తరంగాల లాగా, ఆత్మ చైతన్యమునకు అవన్నీ పరికల్పితములు మాత్రమే!
నీళ్ల కదలికచే కనబడే నీళ్లలోని సూర్యప్రతిబింబము యొక్క కదలికలను సూర్యబింబానికి ఆపాదించలేం కదా! శరీరంలో మనకు కనిపించే మార్పుచేర్పులను శరీరికి ఆపాదించటానికి వీలు లేదు. ఆత్మ ఏ క్షణంలోనూ ఎట్టి క్షోభా పొందటానికి ఆస్కారమే లేదు. అందుచేత ఈ జగత్తు ఏమిటో అవగాహన చేసుకోవటానికి ముందుగా కాస్త 'సమదృష్టి' స్థిరపడేటట్లు అభ్యాసం చేయి. అప్పుడు 'సత్యవస్తు జ్ఞానం' ఏర్పడి వాస్తవమేమిటో నీకే గోచరించగలదు. దేహమునకు సంబంధించిన అజ్ఞాన దృష్టులు తొలగాలంటే దేహి గురించిన వాస్తవ జ్ఞానమొక్కటే అసలైన ఔషధం.
Page:13
‘చీకటి’ అంటే ఏమిటి? వెలుగు లేకపోవటమే కదా! జ్ఞానం కలిగి ఉండకపోవటమే (అనగా) దేహి యొక్క స్వరూపం ఎరిగి ఉండకపోవటమే 'అజ్ఞానం'. ఈ దేహము యొక్క పరికల్పనకు అట్టి అజ్ఞానమే కారణం. ఆత్మయొక్క స్వభావం గ్రహించని కారణంగా 'మోహము' అనే ఒక విషవృక్షం మొలచి నలువైపులా శాఖలు విస్తరించుకుంటోంది. 'జ్ఞానముయొక్క రీతి ఏమిటి? ఆత్మ యొక్క స్వభావమేమిటి?'... అనే ప్రశ్నలకు వివరణాత్మకమైన సమాధానం గ్రహించకపోవటం చేతనే విపత్తులన్నీ వచ్చిపడుచున్నాయి. బ్రహ్మము యొక్క స్వరూపమేమిటో తెలియకుండా ఊరకే ఇక్కడా అక్కడా సంచరించటం ఏమాత్రం సముచిత విషయం కాదు. గాలి వీస్తున్నప్పుడు తోటలోని మొక్కలు అటూ ఇటూ కదలుచున్నట్లు ఇంద్రియ ద్వారములనుండి ప్రాణవాయువులు ప్రసరిస్తూఉంటే వారు ఆ లోకములలోనూ, ఈ లోకములలోనూ ప్రవేశించి ఊరికే గ్రహించటం, విసర్జించటం, ఆలాపించటం మొదలైన పనులు ఈ జీవులలో అనేకులు చేస్తున్నారు. ఒక్కొక్క ఉపాధి స్వీకరించటం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ప్రవాహంలో అవయవాలు క్షీణింపజేసుకోవటం, ఉన్మత్తులై ఏవేవో ఆశ - నిరాశలు మూటగట్టుకోవటం... ఇవీ సంసార జీవులు ఇక్కడ చేస్తున్న సుదీర్ఘకార్యక్రమాలు!
నీళ్లలో పడి నానిన చెక్కముక్కలాగా రాగద్వేషములకు వశులై మునిగి తేలుచూ అనేక జన్మలు వారు గడిపివేస్తున్నారే గాని 'ఇంతకీ నేనెవ్వరు?' అనే ప్రశ్నను శోధించటం లేదు. వచ్చి పోతూ ఉండే భావాలలో మాత్రమే కొట్టుమిట్టాడుచున్నారే?
జీవులందరూ జ్ఞాన విషయంలో అత్యంత జాగరూకులై ఉండాలి సుమా! అజ్ఞానం అత్యంత నీచదశలను పొందింపజేయగలదు. కమ్మరి ఉపయోగించే తిత్తిలో గాలి వెలువడునట్లు జ్ఞానరహితు లగు జీవులలో ప్రాణ వాయువులు ప్రయోజనమేమీ లేకుండానే సంచరిస్తున్నాయి. వారు ప్రాణములు కలిగి ఉండి ఉపయోగం లేనివారే అగుచున్నారు. వారి చలనములన్నీ ప్రయోజనం లేనివే. వ్యర్థమైనవే. వింటి యొక్క నారి శబ్దం చేస్తున్నట్లు అజ్ఞానులగు జీవులు ఏవేవో గర్విత-నీరస-జాతి-ప్రాంత కల్పనలతో కూడిన శబ్దాలు పలుకుతూ ఈ భూమిపై సంచరిస్తున్నారు. అడవిలోని దుష్టఫలములు తిని పిట్టలు పిచ్చి ఎక్కి కేకలు వేసివేసి చివరికి చస్తున్నట్లుగా ఆత్మజ్ఞానము లేని ఫలాభిలాషలను ఆశ్రయించి సంసార జీవులు చివరికి ఉన్మతస్థితులను, మృత్యువు యొక్క రుచులను తెచ్చి పెట్టుకుంటు న్నారు. అజ్ఞాన కార్యక్రమములతో తృప్తి పొంది లోకవ్యవహారములు సలుపుతూ కాలం గడపటం నా ఉద్దేశంలో కాలుచున్న శిలపై చల్లటి చోటు వెతకటం వంటిది. అజ్ఞానులతో కూడి రోజులు దొర్లించటం మోడువారిన చెట్టుక్రిందకి విశ్రాంతికై పరుగులు తీయటం వంటిది. అజ్ఞాన విషయ సమాచార వినోదములతో కాలం వెళ్లబుచ్చటం ఆకాశమును అట్టలతో మోదటం వంటిది. రుచికరమైన పదార్థములను బురదలో ముంచటం వంటిది. అజ్ఞానవిషయాలు సంభాషించటం ఆకాశములోని మేఘములను చూచి కుక్కలవలె మొరగటం వంటిది.
‘అజ్ఞానమాపదాం నిష్ణా’ - అజ్ఞానమే అన్ని ఆపదలకూ పుట్టినిల్లు. దాని వలన కలిగే అనర్థాలకు అంతులేదు.
Page:14
'సంసారము' అనబడేది అజ్ఞానము చేతనే కదా... ఉత్పన్నమౌతోంది! సుఖ-దుఃఖాలు, నిష్టురత్వం. వేదన-రోదనలు, ఆవేశకావేశాలు, ఈ శరీరము, దీనిచే ఏర్పడే సంబంధాలు... ఇవన్నీ అజ్ఞాన వృక్షము యొక్క ఫలములే!
అనాత్మ అయినట్టి ఈ శరీరమే తానుగా తలచు మూర్ఖునికి దుఃఖమెన్నటికీ తొలగదు. సత్యమును వదలి అసత్యం వెంట పరుగులుదీస్తూ 'ఈ మాయ నాపట్ల తొలగదేమి?’ - అని కేకలు వేసి ఏం లాభం? అసత్యదర్శనంచే పదే పదే కాలు జారిపడి లేచుచుండటమే సుఖమనుకొనే వారికి నేను సత్యం ఎట్లా తెలియపర్చగలను? తమ చర్మమును చాకుతో కోసుకుంటూ, “మేము కాయనే కోస్తున్నాం... అంతా మాకు తెలుసు" అని పలికే వానికి ఎవ్వరేం బోధించగలరు?
శ్రీరాముడు: నిజమే స్వామీ! అయితే, ఆనందమయమగు ఆత్మయే స్వరూపముగా గల ఈ జీవునకు దుఃఖం ఎక్కడి నుండి వచ్చిపడుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : చక్కటి నేలపై కొంత కాలానికి పిచ్చిచెట్లు లేచునట్లుగా, సుఖ స్పర్శల నుండి దుఃఖాలు పుట్టుకొస్తున్నాయి. దేహమనే బూరుగు నుండి ‘వాసనలు’ అనే పాములు పడగలెత్తుచున్నాయి. అవి మనస్సను మదగజమును కట్టిపడేస్తున్నాయి. చేనులో కలుపు మొక్కలలాగా అజ్ఞాని (ఆత్మ సమాచారం పరికించనట్టి వాని) హృదయంలో ఆశలు లేస్తున్నాయి. దుష్కృత్యములు నీచ బాటలలో నడిపిస్తూ ఈ జీవుని 'నరక యాతనలు' వేచి ఉన్న చోటికి తీసుకుపోతున్నాయి.
అనేక కల్పితానందములు, కాలక్షేపములు మూర్ఖుని సంతోషింపజేయటానికే కాబోలు, ఈ జగత్తుచే విరచించబడుచున్నాయి. అతని ఆసక్తికి అనుగుణంగా సృష్టి కర్త ఇక్కడి వ్యవహారములను మలచుచున్నాడు. ఈ జీవుడిక పరనింద, ఈర్ష్య, రాగము మొదలైన వ్యతిరిక్త, దుర్వాసనల వైపుగానే ఆకర్షితుడగుచున్నాడు. ఇక సరి అయిన సమయం చూచుకొని చింతలన్నీ అతని హృదయంలో ప్రవేశిస్తున్నాయి. జన్మనుండి ఆశ నిరాశలు, వాటి నుండి భావి ఉపాదులు, ఆ ఉపాధుల నుంచి మరల ఆశ నిరాశలు, జీవుని పట్ల కొనసాగుతూనే పోతున్నాయి. అతడు మరలమరల బాల్య - యౌవన వార్ధక్య - మృత్యువులను చర్వితచర్వణంగా పొందుచున్నాడు.
జ్ఞానులు - ఇక జ్ఞానుల వ్యవహారమంతా వేరొక విధంగా ఉంటోంది. అజ్ఞానులకు సుదీర్ఘం గానూ, దాటనలవికానిదిగానూ ఉంటే, జ్ఞానులు తమ స్వరూపమును సాక్షీభూతమగు చైతన్యమాత్రంగా గాంచుచున్నారు. అందుచేత ఈ సంసారతతంగమంతా గోష్పాదప్రాయం (ఆవు డెక్క ఏర్పరిచే గుంటంత) అగుచున్నది. ఇక్కడ కనబడే అన్నపానాది విశేషములలో అతడు తగుల్కొనుట లేదు.
#
అజ్ఞానికి ఈ జగత్తు యొక్క విన్యాసాలేమిటో, వీటి అంతు ఎక్కడో తెలియటం లేదు. పంజరంలో చిక్కుకున్న చిలుకలాగా అతడు వాసనాపరంపరలో చిక్కుకుని ఉంటున్నాడు. అతని చిత్తవృత్తులు బాహ్య వస్తు జాలముల వైపుకే ప్రసరిస్తున్నాయి గాని, అంతర్ముఖం కావటం లేదు. బోయవాడు పక్షులను పట్టుకోవటానికి బియ్యపు గింజలు చల్లునట్లు ఈ ప్రపంచం నిండా ఇంద్రియములకు ప్రియాప్రియములు కలిగించగలిగే అనేక వస్తువులు, విషయాలు, విశేషాలు
Page:15
కల్పించబడ్డాయి. అతడు ఇంద్రియ భోగమత్తుడై 'ఇళ్లు, వాకిళ్లు, ప్రతిష్ఠలు, బంధువులు, ఆనందములు, అనుభవములు, చెట్లు, పూలు, ఆకాశం, నేల' మొదలైన వాటికి తాను సంబంధితుడై పోతున్నాడు. అనేక భేదకల్పనలకు లోను అగుచున్నాడు. కల్పనామాత్రమైన కల్పవృక్షం వివిధ చిత్ర విచిత్ర పదార్థాలను కల్పించి అభీష్ట సిద్ధిని భ్రమింపజేస్తుంది చూచావా! ఎన్ని అభీష్టములు ఈడేరితే ఏం ప్రయోజనం? ...కొత్త కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి కదా! ఈ ప్రపంచంలో కూడా పూర్ణానంద కరమగు వస్తువేదీ లభించుటయే లేదు.
ఆహాఁ! ఏమి ఈ మోహము యొక్క మాహాత్మ్యం! కల్పనామాత్రమైన అజ్ఞానవనంలో ‘భోగాభిలాషలు’ అనే పక్షులు నివసిస్తున్నాయి. 'ఉత్పత్తి' అనే ఆకులతో, 'పుణ్యపాపములు' అనే ఫలాలతో 'భోగములు' అనే పూలగుత్తులతో 'కామ క్రోధములు' అనే లతలతో ఈ అజ్ఞానవనం విరాజిల్లుతోంది. సూర్యుడు అస్తమించగానే చీకట్లు కమ్ముకుంటున్నట్లు జ్ఞానదృష్టి మరుగున పడగానే సర్వ దోషములు ప్రవేశిస్తున్నాయి. ఓ రామా! అజ్ఞాన వృక్షశాఖలు 'నానావిధ జగత్తులు' అనే ఫలములను ప్రసాదిస్తున్నాయి. అవి పైకి మాత్రమే మధురంగా ఉండి లోన మిథ్యాత్వం, భంగురత్వం, ఆద్యంతత్వము కలిగి ఉంటున్నాయి. అట్టి అజ్ఞానవనమును సమూలంగా నశింప జేస్తే గాని ఈ జీవునకు శాంతి లభించదు సుమా!
6. అజ్ఞానాంధకార విభూతులు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! అజ్ఞానాంధకారం యొక్క విభూతులు ఏమని వర్ణించాలి! హృదయంలో మదం ఉద్భవించగా దృష్టి అధోగతిపాలగుచున్నది. స్త్రీల చిలిపి చూపులచే ఆకర్షితుడై ఈ సంసార జీవుడు క్షణంలో తన దృక్పథములన్నీ అధోగతి పాలు చేసుకొని ఆ చిలిపి చూపులకు ఆహారమగుచున్నాడు. అతడు మన్మథునకు ఆంతరంగికదాసుడై ఉన్మత్త వేషధారుడగుచున్నాడే!
అహో! ప్రజలు కొంచెం దూరంగా ఆలోచించటం లేదే! ఏ దేహములైతే అజ్ఞానమోహాన్ని కలిగించి స్వస్వరూపం పట్ల ఏమరుపు కలిగిస్తున్నవో అట్టి స్త్రీ పురుష శరీరములు కొద్ది సంవత్సరముల తరువాత ఏమి కానున్నాయి? కుక్కలకు, గ్రద్దలకు ఆహారం అగుచున్నాయి. కవులు మాత్రం ఈ స్త్రీ-పురుష శరీరములను చంద్రునితోను, మంచి గంధముతోను, పూలలోని సున్నితమగు పుప్పొడితోను పోలికలు కల్పించి జనులకు భ్రమ కల్పిస్తున్నారు. రక్తమాంస భరితమగు ఈ శరీరభాగములను సువర్ణ కలశములతోనూ, పద్మమాలికలతోను, దొండపండ్లతోనూ ఉత్ప్రేక్షలు కల్పించి కవులు భ్రమను ఇనుమడింపజేస్తున్నారయ్యా! అల్పములగు కణపులతోను, ఎముకలతోను కూర్చబడిన ఈ స్త్రీపురుష శరీరములు ఆయా అలంకారములు, పట్టు వస్త్రములు ధరించి చూపులకు విందొనర్చుచుండగా ఈ అజ్ఞాన జీవులు ‘ఆహా!ఓహో!' అనుకుంటూ కేరింతలు కొట్టడమా! ఇదంతా భ్రమ, పిచ్చి కాక మరేమిటో చెప్పు?
Page:16
ప్రారంభంలో కొంచెం ఆనందం చూపి, క్రమంగా దుఃఖముల పాలు జేయగల అతిస్వల్ప, తుచ్ఛమైన మత్తు పదార్థములు ఈ జీవునిచే ఊడిగం చేయించుకుంటున్నాయే! ధనము, నారీజనము, తదితర సంపదలు ఇవన్నీ జీవునికి దుఃఖం తొలగించగలుగుతున్నాయా? ఏమి చిత్రమో గాని, ఎన్నెన్ని పొందినా కూడా, ఎప్పటికప్పుడు దుఃఖములు శతాధికమే అగుచున్నాయే! ఒక సుఖానికి ఒక దుఃఖం ఎదురుచూస్తూనే ఉంటోంది. ఈ సుఖదుఃఖాలు ఒకదానికొకటి కారణమగుచూ వస్తూ, పోతున్నాయి... ఈ జీవుడు ఇది గమనించడం? ఇక్కడి ప్రయాసలన్నిటికీ అసలు కారణమేమిటో
వెతకడేం?
కామ్యకర్మలతో అర్థవాద వాక్యములతో మాయారణ్యం పరిఢవిల్లుతోంది. మోహం అవిశ్రాంతంగా నిరంతరంగా అనేక ప్రవృత్తులను ఉత్పత్తి చేసుకుంటూ పోతోంది.
ప్రతి విషయం మొదట సుఖంగా ఉన్నట్లే ఉంటోంది. ఇంతలోనే అది అనేక రాగద్వేషములను కల్పిస్తోంది. చివరికి విషలత యొక్క రసంలాగా శారీరక మానసిక రుగ్మతలకు కారణమగుచున్నది. ఇక అది హృదయమును దుఃఖింపజేస్తోంది. ఎండింపజేస్తోంది. స్వకీయ కల్పిత కార్యక్రమములే ధూళి వలె లేచి వివేక సూర్యుణ్ణి కప్పివేస్తున్నాయి.
ఈ జీవుడు మొండితనంతో ఇంద్రియ విషయములను నమ్ముకొని కూర్చుంటున్నాడు. ఇక కాలయముడు తన నిష్ఠుర కార్యక్రమములతో శ్రమించి ప్రోగుచేసుకున్న సర్వవస్తు జాలములను కడుపారా మ్రింగి త్రేన్చుచున్నాడు. ఈ జీవుడు అందుకు ఎర అగుచూ, ఒక ఉపాధిని వదిలి మరొక ఉపాధిని ఆశ్రయిస్తూ వక్ర గమనములు చేస్తున్నాడే గాని, వివేక దృష్టిని పెంపొందించుకోవటం లేదు. 'ఆత్మ సమాచార శ్రవణం' అనే చంద్రోదయం కాకుండానే అనేక యౌవన రాత్రులు వ్యర్థంగా గతిస్తున్నాయి. ప్రాపంచిక విషయాలను మరలమరల ఉచ్చరిస్తున్న ఈ నాలుక అలసి అలసి చివరికి ఒకనాటికి శిథిలమైపోతోంది. దుఃఖము, శోకము, దారిద్ర్యములతో కూడిన అనేక పరిస్థితులు ఉవ్వెత్తున ఎగురుచున్నాయి. కట్టుదిట్టము లేని జీవిత ప్రాంగణంలో 'లోభము' అనే గుడ్లగూబ ప్రవేశించి యథేచ్ఛగా సంచరిస్తోంది. 'ముసలితనం' అనే పిల్లి వచ్చి 'యౌవనం' అనే ఎలుకను పట్టుకొని, చెవులు సాగదీసి మరీ చంపుతోంది. పైకి మెరుస్తూ లోన నిస్సారంగా ఉండే అనేక కల్పిత వ్యవహారాలు ఈ జీవుని చుట్టుముట్టి ఉన్నాయి. అనేక ప్రవృత్తములతో కూడిన ఈ జగత్ప్రృహం ఆకాశాన్ని ఆక్రమించుకుని ఉంటోంది.
ఈ విశాల సంసార సముద్రం నిత్యం అనేక శరీరములను చప్పరించి మ్రింగుచున్నది. కృత్రిమమైనట్టి ఈ వినీలాకాశం అనేక సూర్యులను, గ్రహములను ధరించి ఉంటోంది.
ఈ జగత్తు ‘ఆశలు’ అనే త్రాడుచే కట్టబడి 'వాసనలు' అనే కమ్ములు గల ఇంద్రియ పంజరంలో నియమించబడి ఉన్నది. జీవులు ఈ జగత్ పంజరంలోకి ప్రవేశించి ఇక్కడ చిక్కుకొని కొన్నాళ్ళకు నశిస్తున్నారు. ఇక్కడి జనులు ఏవేవో ఆరోపిత దృష్టులను ఆశ్రయించి స్వస్వరూపమగు ఆత్మను విస్మరించి ఇక్కడ సంచరిస్తున్నారు. 'మేము అంతటివాళ్లం. మా జాతి ఇంతటిది' అని చెప్పుకొని
Page:17
మురుస్తూ ఈ రక్తమాంస నిర్మితమైన దేహ నరక భూములలో చిక్కుకుంటున్నారు. అయ్యో! దేవతా జన్మలు పొందిన జీవులు కూడా స్వర్గమార్గంలో ఎగిరే పక్షులలాగా సంచరిస్తున్నారే గాని, ఆత్మజ్ఞానం విషయమై వివేకులవటం లేదే? ప్రవృత్తిచే కామ్యకర్మలవైపు ఆకర్షితులై ఈ జీవులలో అనేకులు ఊర్ధ్వ, అధోలోకాలలో పచార్లు చేస్తున్నారే గాని, ఆత్మజ్ఞానులుగా తమను తాము తీర్చిదిద్దుకోవటం లేదు.
ఈ భవసాగరంలో 'సృష్టి' అనే క్షుద్ర చేప 'కాలము' అనే ముసలి కొంగకు ఆహారం అవుతోంది. కామం అనే కుమ్మరి క్షణభంగురమైన అసంఖ్యాక 'శరీరాలు' అనే కుండలను తయారు చేసి, ఈ సృష్టి చక్రమును త్రిప్పుచున్నాడు. కల్ప ప్రారంభం నుండి అనేక యుగములు గడచి పోయాయి. అనేక జగత్తులు పుట్టాయి. నశించాయి. వర్తమాన జగత్తులో ఒక మూల ఒదిగి ఉన్న ఈ జీవుడు అనేక ఆశనిరాశల మధ్య ఆసక్తి, అనాసక్తుల మధ్య చిక్కుకుని సుఖ దుఃఖాలు నిర్వచించు కుంటూ, కొట్టుమిట్టాడుతున్నాడు. ఎడతెరిపి లేకుండా ఏవేవో విపరిణామములన్నీ పొందుతున్నాడు. యుగములు, మన్వంతరములు గడచిపోతున్నాయి. ఇంత జరుగుచున్నా మూర్ఖులబుద్ధి ఏదీ గుర్తించటం లేదు. ఏం ఆశ్చర్యం!
ఆహా! ఈ కనబడే శరీరాలన్నీ 'వాసన' చే ప్రేరితమై సంచరిస్తున్నాయి కదా! శత్రువులను చీల్చిచండాడి, ముల్లోకములూ ఏలుతున్న ఇంద్రుడంతటి వాడు కూడా వాసనల చేతనే ప్రేరేపించబడి, చరిస్తున్నాడే! వాసనల మూలం ఆసక్తియే!
ఆసక్తియే సృష్టికి మూలం - ఏదో నియతి ఈ 'సృష్టులు' అనే ధూళి కణములను లేవదీసి కాల సర్పం ముంగిట పడవేయుచున్నది. ఈ కనబడే వస్తుజాలమంతా 'వినాశనము' అనే బడబాగ్నిలో ప్రవేశించి నశించటానికే ఉద్యుక్తమౌతోంది. ఆకస్మికములు, విచిత్రములు, స్వభావసిద్ధములు అగు ఈ వస్తుజాలములను చూచి జీవుడు నమ్మిక కలిగి ఉండటమేమిటి? వీటిలో ఏ ఒక్కదానికైనా నిశ్చలమైన ఉనికి ఉన్నదా? లేదే! సముద్ర తరంగాలు ఎంత నిశ్చలమో.... ఈ ద్రవ్య శక్తులు అంతే నిశ్చలం. ‘కాలం’ అనే ఉన్మత్తసింహం 'జగత్తులు'అనే గున్న ఏనుగులను వేటాడి హింసించి, భక్షించటం మనం స్పష్టంగా చూస్తున్నాం కదా!
ఈ జగత్తులన్నీ వాసనాఫలములను అన్వేషిస్తూ జన్మించి, కొద్దిసేపు కనిపించి మరల ఎటకో మటుమాయమౌతున్నాయి.
'విధి' అనే ఒకానొక చిత్రకారుడు 'చిత్తము' అనే పటము మీద 'పంచేంద్రియములను రంగులతో' సంసార చిత్రములను సృష్టిస్తున్నాడు.
కాలము యొక్క ప్రవాహం ఎంతటి చిత్రమైనది! క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు - - రూపంలో ఎంతవేగంగా ముందుకు సాగిపోతోంది! అది అసత్తు నుండే తన ప్రవాహం ప్రారంభించింది. భావాభావసమన్వితులై, రాగద్వేషభరితులై ఈ జీవులు కాలం వెంట దొర్లించబడుచున్నారు. బ్రహ్మదేవుని నుండి క్రిమికీటకముల వరకు గల
Page:18
జీవులన్నీ తమ యొక్క సుకృత, దుష్కృతములకు సంబంధించిన చింతలచే పీడింపబడుచున్నారు. అదృశ్యంగా ఎక్కడో ఉండి కాల స్వరూపుడు స్థావరజంగమము లన్నిటినీ క్షణభంగురంగా చేసి వేస్తున్నాడు. స్థావరములు ఆ కాలుని కన్ను కాస్త కప్పి తమ శరీరములను నేలలో దాచి శీత వాత తాపములను సహిస్తూ జగత్తుకు స్థావర ఫలములను ఇస్తున్నాయి. ఇక ఈ జంగమ జీవులు ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్లే ఈ భూమిపై అటూ ఇటూ సంచరిస్తున్నారు. త్రిలోకముల దృశ్యపరంపరలు సృష్టించే అజ్ఞానాంధకారంలో ప్రవేశించి ఘంఘమధ్వనులు చేస్తున్నారు. ‘కాలుడు’ అనే భిక్షుకుడు బ్రహ్మాండము అనే భిక్షపాత్రలో అనేక జీవులను పొంది భక్షించి ఆకలితీరక మరల భిక్షకై కేకలు వేస్తూనే ఉన్నాడు. ఈ త్రిలోకములు, ఈ సూర్య చంద్రులు, త్రిమూర్తులు, ఈ భూ పర్వత ప్రాంతాలు, ఈ స్థూలసూక్ష్మకారణ దేహములు, ఆ కాలుని శరీర విభాగములే కాబోలు. బ్రహ్మలు, బ్రహ్మాండములు క్షణికములై కాలుని ముందు ప్రభవించి చటుక్కున మటుమాయ మవుతున్నాయి.
కల్పములు నిమిష కాలంలో గడచిపోతున్నాయి. ఒక్క నిమిషంలో అనేక కల్పములు ఏర్పడు తున్నాయి. త్రిమూర్తులంతటి వారు ఒక్క నిమిషంలో అంతర్హితులగుచున్నారు. విషయరహితం, వస్తురహితం అయిన బ్రహ్మపదమున సంభవం కానిదేమున్నది.
ఓ రామచంద్రా! జగత్ సంబంధములగు నానావిధ కల్పనలన్నీ అజ్ఞానము వలననే కలుగు చున్నాయి. ఈ బాల్య యౌవన వార్ధక్యాలు, ఈ సంపద, లేక ఆపద, ఉపతాపములు - - ఇవన్నీ అజ్ఞానాంధకారము యొక్క విభూతులు మాత్రమే.
7. అవిద్యా సంభ్రమం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామా! 'చిత్' అనే పర్వతసమీపాన ఏర్పడి ఉన్న 'సంసారము' అనే అరణ్యంలో 'అవిద్య' అనే లత ఎట్లా పెంపొందుచున్నదో చెబుతాను విను.
'బ్రహ్మాండం, త్రిలోకాలు, జీవులు, జననమరణాలు, సుఖదుఃఖాలు, జ్ఞానాజ్ఞానాలు’ అనే విశేషములతో ఈ అవిద్య ఏర్పడి ఉంటోంది. ధ్యాసచే ఇంద్రియ ద్వారాలతో కూడిన ఈ ఉపాధులు ఏర్పడుచున్నాయి. ఉపాధిని ఉపయోగించుటచే సుఖబుద్ధి కలుగుతోంది. అట్టి సుఖబుద్ధి ఆసక్తికి కారణమగుచూ అవిద్యను ఉదయింపజేస్తోంది. యజ్ఞము, దానము మొదలైన సత్రియలు సుఖమును ఫలింపజేసి, మధురఫలాలను ఇస్తున్నాయి. దొంగతనం, హింస మొదలైన దుష్క్రియలు దుఃఖాలు అనే చేదుఫలాల నిస్తున్నాయి. దారిద్ర్యము, అవమానము, మొదలైన అనేక దుఃఖకర విషయాలచే ఈ జీవులు అనేక బాధలకు లోను అగుచున్నారు.
శ్రీరాముడు : హే మహర్షీ! అవిద్య ఎట్లా ఉదయిస్తోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఏదైతే లేనేలేదో.... అద్దానిని 'ఉన్నది'....అని సంకల్పించుటచేతనే అవిద్య ఉదయిస్తోంది. ఆ అవిద్య సృష్టిని కల్పిస్తోంది. భావనల యొక్క దృఢత్వం చేత పదార్థములకు
Page:19
సంబంధించిన సుఖదుఃఖములు రూపం పొందుతున్నాయి. అజ్ఞానం చేత అవిద్య వృద్ధిచెందుతోంది. అజ్ఞానఫలములను ప్రసాదిస్తోంది. అయితే 'ప్రత్యక్ తత్త్వవిమర్శ'కు సంబంధించిన జ్ఞానం వలన ఉన్నతమగు భూమికలను అధిరోహింపజేయగల బుద్ధి ఉదయిస్తోంది. ఆ బుద్ధి, బుద్ధికే సాక్షియగు సప్తమ భూమికను అధిరోహించటానికి దోహదపడుతోంది. ఏది తెలుసుకోవటానికి బుద్ధి ప్రయత్నిస్తోందో ఆ తెలియబడేదే తనగుచున్నది. (బ్రహ్మైవ, స బ్రహ్మవిత్, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి - అను వేదవాక్యార్థం ఫలిస్తోంది).
కల్పనలతోనూ, వాసనలతోనూ, తీవ్రమగు దృశ్య సంబంధములతోనూ, రాగములతోనూ అవిద్య ప్రవృద్ధమౌతోంది. అవిద్య కొన్ని కార్యములకు, ఆ కార్యములు మరింత అవిద్యకు కారణమగు చున్నాయి. హృదయంలో విద్యను అవిద్య కప్పివేస్తోంది. విషయవాసనలే దాని ఆలంబనం. ఈ జీవుడు అవిద్యచే ఆవరించబడినవాడై పశువులు, ఇళ్లు, పుత్రులు, పౌత్రులు మొదలైనవాటి సమాగమం చేత కాలం గడుపుతున్నాడు. ఋతువులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈలోగా ముసలితనం వచ్చి మీద పడుతోంది. ఏమీ తెలియకుండానే ముసలితనం వచ్చిపడిన తరువాత ఇక్కడ ఇళ్లు, వాకిళ్లు, పుత్రులు, పౌత్రులు అతనిని రక్షిస్తాయా? ఎందుకు ఇంతకాలం జీవించినట్లు? ఏమి పొందినట్లు? అజ్ఞానంలో మునిగి తేలుతూ జీవితమంతా వెచ్చించినందుకు ఫలితంగా అతని ఉత్తర గతులు నికృష్టంగానే ఉండబోతున్నాయి. విచారణ లేకపోవటం చేత ముసలితనం దుర్భరమే అగుచున్నది. చేతిలోని పండు నేలజారినట్లు ఒకనాడు ఈ దేహం నేలకూలుతోంది. ఇంద్రియములు ఉన్నన్నాళ్లు అజ్ఞాన దిశలకే పరుగులు తీసిన ఆ జీవుడు కళ్ళెదురుగా ఇంద్రియములు బలహీనపడటం అనుభవిస్తున్నాడు. అవి జీవించిన కాలమునకు సంబంధించిన, విషయాస్వాదన సామర్థ్యము కోల్పోగానే ఎంతటి నిస్సారస్థితి అనుభవిస్తున్నాడో... చెప్పనలవికాదు.
ఈ జగత్తంతా అవిద్య చేతనే ప్రవర్తిస్తోంది. సూర్యచంద్రనక్షత్ర గ్రహమండలాలు అవిద్య చేతనే నిర్విరామంగా, ఆకాశంలో శ్రమించి సంచరిస్తున్నాయి. అవిద్య చేతనే మహత్తరమగు ఆత్మ స్వరూపుడగు ఈ జీవుని అల్ప వస్తువులు కూడా ఆకర్షించి విచలితుణ్ణి చేస్తున్నాయి. ఇంద్రియములు, తృష్ణ, సంకల్పములు - ఇవన్నీ అవిద్య చేతనే తైతక్కలాడుచున్నాయి. అవిద్య యొక్క ఊడలు సప్త సముద్రములలోనికి, అఖాతములలోనికి, పాతాళ, దేవలోకాలకు విస్తరించి ఉన్నాయి. రాగ ప్రవృత్తిచే కామ్యకర్మలకు ఉపక్రమిస్తున్న జనులు తమ చుట్టుప్రక్కల గల జనులను కూడా తమవలె అవిద్య కర్మలవైపుగా ప్రోత్సాహపరచుచూ తద్వారా అవిద్యను పెంచి పోషిస్తున్నారు. కుకర్మలతో కృత్రిమ ఉపాయములతో, స్వర్గసుఖ నిర్వచనములతో మూర్ఖజనులచే అవిద్య పరిపోషించబడుతోంది.
అయితే ఇదే జగత్తు వివేకులకు అవిద్యా నిర్మూలనమునకు ఉపయోగిస్తోంది. ఆయా శాస్త్రోచిత విధి విధానాలన్నీ నివృత్తి సంపద పెంపొందించుటకు ఉపకరిస్తున్నాయి. వారికిక్కడ మోక్ష సంపద, బ్రహ్మానందవర్షము లభిస్తున్నాయి.
Page:20
అందుచేత తప్పు జగత్తులో లేదు. జీవుడు జగత్తును ఉపయోగించే, సమన్వయించుకునే విధానంలోనే జ్ఞాన అజ్ఞాన ప్రవృద్ధములు దాగి ఉన్నాయి.
ఈ జగత్తు అనేక సాంసారిక విషయములకు ఆలవాలమై ఉండవచ్చుగాక! అనేక అల్ప కార్యక్రమములు, ద్వైతవ్యవహారములు తారసపడుగాక! ఇట్టి అవివేక జగత్తులో ఉంటూ వివేకులు ఇక్కడ భిన్నత్వం నుండి సమరసము, అచ్యుతము అగు ఏకత్వానుభూతి సాధిస్తున్నారు. విషంలోంచి అమృతం సాధిస్తున్నారు. ఇదంతా క్షణికం, మార్పు చేర్పుల మయం కావచ్చు గాక. ఇది జ్ఞానవిచారణకు ఉపయోగించగలదు. అయితే వివేకివై జీవించటం నీవు నేర్చుకోవాలి. జ్ఞాన సముపార్జన, నిర్మల హృదయసముపార్జనకై నీ దృష్టిని సారించాలి. వివేచనాపూర్వకంగా ప్రయత్నించే వారికి ఈ జగత్తు ఉద్ధారణోపాయములు ప్రసాదించగల సామర్థ్యం కలిగియున్నదని నీవు గ్రహించు.
ప్రపంచం నిండా అవిద్య ఉండుగాక. నీ యందు అద్దానిని ప్రవేశించనీయకు. పడవ నీళ్లలో ఉన్నా ఆ నీరు పడవలోకి ప్రవేశించగలుగుతుందా? సమగ్ర సూక్ష్మ అవగాహన పెంపొందించుకునే వివేకులను చూసి ఇక్కడి అవిద్య దాసో హమనగలదు. అవివేకులకు అనేకత్వముతో కూడిన అనుభవం ప్రసాదిస్తూనే వివేకులకు అభేదమగు అనుభవం ఈ జగత్తు ప్రసాదించగలదు.
వత్సా! రామా! ఒక గడ్డి పరక నుండి హరిహరాదుల వరకు స్ఫురిస్తున్న ఈ దృశ్య ప్రపంచ మంతా అవిద్యా మాత్రమే సుమా! అట్టి ఈ అవిద్యను నశింపజేయవలసి ఉన్నది. దీనిని సమూలంగా దాటివేస్తే ఆత్మానుభవం అనే లాభం కలుగుతుంది. అట్లు దాటివేయటానికి నీవు అనుక్షణం సిద్ధంగా ఉండు.
8. కార్య అవిద్య - - కారణ అవిద్య
అప్పుడు వసిష్ఠుని వాక్యములు వింటున్న శ్రీరామచంద్రుని అందమైన రెండు కళ్లూ ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.
శ్రీరాముడు: హే మహానుభావా! అవిద్య గురించి, వివేకము గురించి, జ్ఞానసముపార్జన గురించి, ఈ జగత్తు జ్ఞానసముపార్జన నిమిత్తం వివేకులకు సాధనంగా అవటం గురించి మీరు చెప్పే విషయాలన్నీ శిరోధార్యాలే. ఒప్పుకోవలసిందే. అవన్నీ ప్రత్యక్ష సత్యాలుగా నాకు అవగతమౌతున్నాయి.
అయితే మీరు చివరిగా చెప్పిన విషయం నాకు కొంచెం తికమకగా ఉంది. 'శుద్ధ సత్త్వ స్వరూపులగు హరిహరాదులు కూడా అవిద్యలోని విభాగమే' అనే వాక్యం యాదృచ్ఛికంగా చెప్పారా? లేక, అదే మీ ఉద్దేశమా? ఎందుకంటే ఆ వాక్యం నాకు విభ్రాంతిని కలిగిస్తోంది. ఈ విషయం నాకు చక్కగా వివరించ ప్రార్థన.
అప్పుడు వసిష్ఠ మహర్షి రాముని ఉద్వేగం చూచి పకపకా నవ్వారు.
Page:21
శ్రీవసిష్ఠ మహర్షి : రామా! నీ ప్రశ్న నాకు సంతోషం కలుగజేసిందయ్యా! చెబుతాను, శ్రద్ధగా విను.
మనందరి స్వస్వరూపమైనట్టి ఆ సచ్చిదానంద వస్తువు నిజానికి సంవిత్ (knower), సంవేద్యము (That being known), సంవేదము (The act of knowing)- అనే మూడింటిచే స్పర్శించబడేది కాదు. అది శాంతం, సర్వాత్మకం, అనుభవైకవేద్యం. అది చెప్పటానికి గాని, చూడటానికి గాని అలవి కానిది.
సృష్టికి పూర్వం అది అట్లే ఉన్నది. అయితే ఆకారరహితమగు జలంలో ఆకార సహితమగు తరంగాలు ఏర్పడుచున్నాయి కదా! అట్లాగే సృష్టికాలంలో అది నామరూప సహితమై ఒప్పారుచున్నది. ‘బ్రహ్మము’ అనే సంజ్ఞతో పిలువబడుచున్న అట్టి వస్తువు నుండి 'జగత్తులు' అనబడే కళలు లేచి వేరు వేరు స్వరూప-స్వభావాలు ప్రదర్శిస్తున్నాయి. అట్టి ప్రదర్శన చేతనే గుణములు అనే భేదములకు ఆపాదయోగ్యమగుచున్నది. సూర్యుని తేజము ఒకచోట ముదురు ఎండగా, మరొక చోట లేత ఎండగా, ఇంకొక చోట నీడగా ఏర్పడుచున్నట్లు ఈ స్థూల - సూక్ష్మ- మధ్యమాలుగా ఆ సచ్చిదానంద వస్తువే కల్పన స్వీకరిస్తోంది. ప్రథమంగా మనస్సు, మధ్య స్థితిలో హిరణ్యగర్భుడు, స్థూల స్థితిలో ఈ విరాట్గా అగుచున్నది ఆ బ్రహ్మమే.
అవిద్యాం ప్రకృతిం విద్ధి గుణత్రితయధర్మిణీమ్ |
ఏషైవ సంస్కృతిర్జన్తోరస్యాః పారం పరం పదమ్ ॥ || (శ్లో॥ 6, సర్గ 9)
ఇట్టి గుణత్రయములతో కూడుకునియున్న ప్రకృతియే అవిద్య. అదియే సంసారం. అట్టి త్రిగుణములకు ఆవల పరమపదము వెలయుచున్నది. కార్య కారణ విద్యల అసాధారణత్వమును అనుసరించి త్రిగుణములు త్రైవిధ్యమై (3x3=9) రకములుగా వెలయుచున్నది.
1) తమోతమము >స్థావరము (రాయి-రప్ప వగైరా)
2) తమోరజము
3) తమోసత్వము
4) రజోతమము
5) రజోరజము
6) రజోసత్వము
7) సత్వతమము
8) సత్వరజము
9) సత్వసత్వము > (త్రిమూర్తులు)
అవిద్యను అనుసరించి ఈ దృశ్యప్రపంచమంతా పై తొమ్మిది మిశ్రమములను ఆశ్రయించి కనబడుతోంది. దైవీసత్వములో పుట్టిన వారి అవిద్య ప్రాకృత గుణరహితం (Sans worldly qualities) అయి ఉంటుంది. అట్టి దైవీసాత్వికులై హరిహరాదులు నిర్మలపదమున వెలయుచున్నారు. సాత్వికమైన ప్రకృతి యొక్క అంశను ఆశ్రయించి ఎవరైతే సాత్విక స్వరూపులగు హరిహరాదులను ఆశ్రయిస్తున్నారో, వారు క్రమేపీ వారి యొక్క శ్రద్ధ, ప్రయత్నముల బలిమిచే శుద్ధ సాత్వికులు అవుతారు.
Page:22
సత్యాంశమునకు చెందిన శివాది దేవతలు ముక్త పురుషులు. ఈ ప్రపంచమున్నంత వరకూ వారు వెలయుచూ ఉంటారు. నీ దృష్టిలో ఈ ప్రపంచమే లేనప్పుడు వారలు కూడా ఉండరు.
ఈ విధంగా శివకేశవాది దేవతలు అవిద్యలోని విభాగమే అయినప్పటికీ వారిని ఆరాధించటం చేత కార్య-అవిద్య నశించగలదు. కారణ అవిద్య శేషిస్తుంది. స్వస్వరూప జ్ఞానముచే ఆ కారణ అవిద్య కూడా తొలగి అది విద్యకు ఆధారమగుచున్నది. శివకేశవాది దేవతలను ఆరాధ్యంగా గ్రహించి చేసే ఆరాధన ఆ జీవునకు దేహభావాతీతుడగుటకు, శుద్ధ బ్రహ్మస్వభావుడగుటకు ఉపకరిస్తోంది. శ్రీరాముడు : ఈ ప్రపంచం ఎక్కడి నుండి వస్తోంది? ఎప్పుడు లేకుండా పోతోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : విత్తులోంచి చెట్టు, మరల చెట్టులోంచి విత్తు, విత్తులోంచి చెట్టు, మరల చెట్టు లోంచి విత్తు ఉత్పన్నమగుచున్నట్లు... కార్యం నుండి కారణం, కారణంలోంచి కార్యం ఉత్పత్తి అవుతున్నాయి. కార్య-కారణ సంబంధమే 'ప్రపంచం' అని వ్యవహరించ బడుతోంది. అట్టి కార్యకారణముల సంబంధమే అవిద్య. కార్య కారణములకు అంతర్గతంగా శుద్ధ సత్వస్వభావమైన విద్య పరివేష్ఠితమై ఉన్నది. కనుకనే విద్యలోంచి అవిద్య ప్రకటితమౌతోంది. అనగా ఈ ప్రపంచం అనే అవిద్య శుద్ధమగు విద్యలోంచి ఉత్పన్నమై మరల ఒకప్పటికి విద్య యందు విలీనమైపోతోంది. శ్రీరాముడు : సాత్వికము, పూర్ణము అగు విద్య నుండి తద్విరుద్ధ స్వభావము, స్పర్ధయుక్తము, అపూర్ణము అగు అవిద్య ఎట్లా ప్రభవిస్తోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఈ విద్య-అవిద్యల భేదం జలము-తరంగములకు ఉన్న భేదంలాగా కల్పిత మాత్రమేనని గ్రహించు. సత్యము, నిత్యము అయిన దానిని ఆశ్రయించి ప్రశాంత మానసుడవై ఉండటమే విద్య. అనిత్యములైన వాటిని అనాలోచితంగా ఆశ్రయిస్తూ ఉంటే అవిద్య అంతకంతకు వృద్ధి అవుతోంది. నిత్యసాత్వికములకు ప్రతీకగా శివకేశవాది నామరూపములను సాధన ద్రవ్యంగా గ్రహించుటచే ఈ జీవుడు విద్య వైపుగా పయనిస్తున్నాడు.
శ్రీరాముడు : విద్య-అవిద్యలు ఒకదానికొకటి వ్యతిరిక్తమైనవి కావా?
శ్రీవసిష్ఠ మహర్షి : ద్విత్వభావనయే అవిద్య కదా! పరమార్థమగు అద్వైత భావనచే భేదభావన తొలగుతుంది. జల-తరంగములకు భేదం లేనట్లే విద్య-అవిద్యలకు భేదం లేదు. భేదమే లేదు కాబట్టే అవిద్యలోని ఒకానొక విభాగము విద్యను ప్రసాదించగలుగుతోంది.
శ్రీ రామచంద్రా! ఈ విద్య-అవిద్యలను అతిక్రమించినప్పుడు ఏది మిగిలి ఉంటోందో... అది అన్ని సమయాలలోను ఏర్పడియే ఉన్నది. అయ్యది జ్ఞానాజ్ఞానాలకు అతీతం. అది అనుభవైకవేద్యము మాత్రమే. అక్కడ అన్ని శబ్దములూ నిశ్శబ్దమౌతాయి. అది వాద ప్రతివాదముల చేతనూ, నామరూపాల చేతనూ, శబ్ధార్థాల చేతనూ అందించబడగలిగేది కాదు. అయితే వాద ప్రతివాదాలు, నామరూపాలు, శబ్దార్థాలు సాధన రూపంలో ఉపకరిస్తున్నాయి. అవన్నీ అనుభవజ్ఞానం యొక్క సమక్షంలో సాధ్యం యొక్క సంప్రాప్తి కాగానే లౌకికవ్యవహార సాధనాలలాగానే ప్రక్కకు తొలగుతాయి. సాధ్యం (లేక) జ్ఞేయమునకు ప్రతిరూపమగు చిహ్నం గాని, సంకేతం గాని, శబ్దం గాని లేదని అనుకున్నాం కదా!
Page:23
అదియే నా యొక్క నీ యొక్క సత్యస్వరూపం.
నాయనా! ఈ జ్ఞానజ్ఞేయములు, విద్యావిద్యలు 'లేవు' అనియే గ్రహించు. వివేకముతో సద్వినియోగపరచుకో. చివరికి సర్వ కల్పనలు దాటివేయి. అప్పుడు శేషించే దానిలో ఈ క్షణమందే ఎప్పటికీ సుస్థిరుడవై ఉండు. వాస్తవానికి ఇక్కడ ఏదీ లేదు. ఉన్నట్లు కనబడుచున్నదంతా చిద్వస్తువును ఆశ్రయించే ఉన్నది. ఆ చిద్వస్తువు సర్వ ఉపాధులలోనూ సమంగా ఏర్పడి ఉన్నది.
అయ్యది సామాన్య వస్తువువలె తెలియబడేది కాదు. అయితే, దాని అభాస(Reflection) వల్లే వస్తువులన్నీ తెలియబడుచున్నాయి. అందుచేత అవిద్య కూడా సత్ అనియే పిలువబడుతోంది. సత్ వాచకమైన అవిద్య విద్య వలన తొలగిపోతోంది. కాబట్టి, అట్లా తొలగుచున్న దానిని మిథ్య అంటున్నాం.
అందుచేత రామా! నీయందు విద్య - అవిద్యలలో అవిద్య విభాగకల్పన తొలగాలి. అందుకు ఉపకరించే అవిద్యాంశ నాశ్రయించటమే ఉపాయం. అవిద్యా సంక్షయం చేత విద్యావిభాగం కూడా తొలుగుతుంది. అప్పుడు విద్యా ఫలాభియుక్తమగు ఉపాధిశూన్య, అవ్యాప్త పూర్ణానందత్వం శోభిల్లు తుంది. అట్లు శేషించే విషయరహిత స్థితిచే పరమార్థం దర్శనమౌతుంది. సర్వాత్మక సంబంధితమైన తత్త్వదర్శనానంతరం ఇక మిగిలినదీ, పొందవలసినదీ ఏమీ ఉండదు.
ఆ జ్ఞానాజ్ఞాన అతీత స్థితి ఆకాశము కంటే ఉన్నతము, శూన్యము అయి ఉన్నది. అయితే, అది చిదాత్మకమే గాని శూన్యం కాదు. అది ఉపాధిపరిమితమని అనుకోకూడదు. చిదానందము ఉపాధి వ్యవహారములన్నిటినీ అతిక్రమించినదై ఉన్నది.
పాలలోంచి నేయిలాగా, సూర్యకాంత మరియందు అగ్నిలాగా, అగ్ని నుండి విస్ఫులింగముల లాగా, ఆ ఆత్మచైతన్యము నుండి ఈ దేశ కాల నిమిత్తములు వెలువడుతున్నాయి. “సముద్రం నుండి అలలు వేరా? మణినుండి శుభ్రకాంతులు వేరుకాదు కదా? అట్టి సాక్షీమాత్ర చైతన్యం నుండి ఈ చరాచరజగత్తు కూడా ఏదో వేరైనది కాదు”.... అని ప్రవచించబడుతోంది.
లోపలా, వెలుపలా బ్రహ్మము కాక వేరొక వస్తువే లేదు. వస్తువుల కదలిక ఆకాశమునకు ఆపాదించబడునట్లు, గుణరహితమగు ఆ చిద్వస్తువునకు గుణములు కల్పించబడుచున్నాయి. శివ కేశవాది తత్త్వములకు గుణకల్పన చేసి ఆరాధన కొరకై ఉపయోగించబడుచున్నాయి. బ్రహ్మము యొక్క సామీప్యతచే ఈ దేహములు స్పందిస్తున్నాయి. నీటిలోని నురుగు మొదలైనవి నీటి కంటే వేరు కానట్లు ఈ దృశ్యమంతా బ్రహ్మము యొక్క వికల్పమే కాబట్టి, బ్రహ్మము కంటే వేరు కాదు. సర్వేశ్వరుడు సాధకుల భక్తి సౌలభ్యము కొరకై ప్రతీకలుగా ప్రసాదిస్తున్నట్లు గ్రహించబడుగాక!
ఆకాశము కంటే సూక్ష్మము, అమూర్తము, రూపశూన్యము అగు ఆ చిద్వస్తువునందు వాస్తవానికి దానికన్యమైనదేదీ ఏనాడూ ఉండియుండ లేదు. ఇక శివకేశవు లంటావా? ఇదంతా కూడా ఉండబోదు.
Page:24
9. అవిచారణమాంద్యము - చికిత్స
శ్రీవసిష్ఠ మహర్షి : అందుచేత రామా! నీకు కనిపిస్తున్న ఈ స్థావరజంగమ జగత్తు, ఇందు సంచరిస్తున్న ఈ శరీరధారులు, ఈ సర్వమూ వాస్తవానికి బ్రహ్మము కంటే వేరు కాదని గ్రహించు. అట్టి బ్రహ్మమునకు వాస్తవానికి పుట్టటం, పోవటం అనే జాడ్యమే లేదు. దానికి జీవకల్పన లేదు. కనుక 'నేను జీవుడను' అను భావమే వ్యర్థము. ఇట్టి భావము వలన ఈ జీవుడు పొందగలిగేదేమిటో చెప్పు?... 'నేను బ్రహ్మమునే' అని ఎందుకు తలచరాదు?
ఈ జీవుడు మొట్టమొదట దేహముతో సంబంధం కల్పించుకుంటున్నాడు. క్రమంగా బాహ్య భోగాభిలాష అభివృద్ధి చేసుకుంటున్నాడు. 'నేనెవరు? ఈ దృశ్యమేమిటి? దేనితో నాకు ఏ సంబంధం ఉన్నది? నేను దేనికి కర్తను? దేనికి భోక్తను?' అని సద్విమర్శకు ఉపక్రమించకుండానే దేహమున్నంత వరకు కాలం గడిపివేస్తున్నాడు. త్రాడు నందు పాము యొక్క భావనను కల్పించుకొని చూస్తున్నట్లు ఈ వింత వస్తుజాలముల మధ్య, సంఘటనల మధ్య రాత్రింబవళ్లు వెళ్లబుచ్చుచున్నాడు.
వివేక దృష్టితో పరిశీలించినప్పుడే భ్రాంతి తొలగుతుంది. తెలియబడినప్పుడు సర్వమూ ఆత్మయే అగుచున్నది. జ్ఞానము యొక్క పరాకాష్ఠ అదే!
స్వస్వరూప చైతన్యమే స్వసత్తారోపితమైన మలినబీజమును ఆశ్రయించి అవిద్యగా రూపం పొందుతోంది. అవిద్యను దాటి పోయినప్పుడు సర్వ ఉపాధులకూ అతీతమైన ఆత్మతత్త్వం యొక్క ఉనికి ఎరుగబడుతోంది. చిత్తము యొక్క తాదాత్మ్యమే జగత్తు యొక్క రూపం. ఒకచోట ఇల్లు ఉన్నదనుకో. ఆ స్థలాకాశమును ఇల్లు ఆరోపించి చూస్తాం కదా! చిత్తమున్న చోటనే భ్రాంతిమయ జగత్తు ఉంటోంది. చిత్తము నశిస్తే భ్రాంతి తొలగుతుంది. రథంలో ప్రయాణించేవాడు పరిసరాలు పరుగులు తీస్తున్నట్లు భ్రమించుచున్నట్లు, చిత్తం తాను కదలుచూ ఆత్మకు కల్పనలు కల్పించి వ్యాకుల పడుతోంది. పట్టుపురుగు లాగా చిత్తము తనలోంచి స్రవించే వస్తుసంబంధ అభ్యాసమును వస్తువులలోంచి లభిస్తున్నట్లుగా భ్రమించి బంధమును అనుభవిస్తోంది. వాసనాతంతువులచే పరిమితమును ఆచ్ఛాదించుకొని తన అపరిమితత్వమును ఏమరుచుచున్నది. అంతర్చాలకత్వంను (Inner Childishness) అభవించుచూ ఆ విషయం తానే ఎరుగజాలకున్నది.
శ్రీరాముడు: స్వామీ! ఇక్కడ గల స్థావరములు "ఘనీభవించిన మూర్ఖత్వమా...?” అన్నట్లుగా పడి ఉన్నాయి. అవివేకము యొక్క పరమావధిని ధరించి వాటియందు చైతన్యము మూగగా ఉన్నది. కదా! ఆత్మ చైతన్యం దృష్ట్యా వాటిని ఎట్లా అన్వయించుకోవాలి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ స్థావరములలోని చైతన్యమును - మత్తుగా త్రాగి రహదారి ప్రక్కన గాఢ నిద్ర అనుభవిస్తూ పడి ఉన్న బాటసారిలోని జీవత్వపు 'ఎరుక స్థితితో' - పోల్చవచ్చు. అవి నిద్రా పరవశుని వలె సుఖదుఃఖములను గ్రహించు యోగ్యతను కోల్పోయి ఉన్నాయి. 'ముందు వెనుకల గురించి చింతించుట' అనే మననశక్తి కూడా వాటియందు లేదు. ముగ్ధ నిర్విషయ రూపము
Page:25
ఆశ్రయించి వందల వేల సంవత్సరాలు గడుపుతున్నాయి. అయితే దేహియగు ఈ జీవుడు కూడా జీవించి ఉన్న కాలంలో మూడవవంతు అట్టి ముగ్ధ - మౌన - జడ నిష్ప్రపంచక - నిర్విషయ రూపమును అనుభవిస్తూనే ఉన్నాడు కదా!
అట్టి స్థావర జన్మలు ఆత్మజ్ఞానముచే లభించే సాత్వికోన్నత స్థితికి బహుదూరంగా ఉన్నాయని చెప్పబడుతోంది. అంతర్భావములు నిద్రాణమై ఉండి, ఆ భావములకు ప్రతిస్పందనము నిర్వహించ లేని స్థితిలో ఉండుటచే ఆ స్థావర స్థితి అత్యంత దుఃఖకరమగు స్థితి. కర్మేంద్రియిలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు కూడా జడ - శూన్య స్థితిలో ఉండటం చేత అవి సత్తామాత్రములై మూగ - జడ స్థితిని అనుభవిస్తున్నాయి.
శ్రీరాముడు : వేదవేద్యులగు మహర్షీ! ఒక యోగి మనస్సును నశింపచేసి జ్ఞానకర్మేంద్రియాలను అధిగమించిన వాడై చైతన్యమాత్రుడై ఉండుటయే సర్వోత్కృష్టమగు మోక్షము యొక్క స్వరూపమని అంటారు కదా! మరి, స్థావరములలో నిర్విషయ - మనోరహిత సత్తకు, జ్ఞాని యొక్క మనోరహిత స్థితికి అత్యంత సుదూరమైన 'తేడా' ఉన్నదని అంటున్నారే? స్థావరాలలోని సత్త మనోరహితమైనదే కదా! శ్రీవసిష్ఠ మహర్షి: స్థావరాలలో బుద్ధి పూర్వకమైన విచారణ అంటూ ఏదీ ఉండదు. అట్టి స్థితి దుష్కృతముల - దుర్వాసనల - దురవగాహనల వలన లభిస్తోంది. దానికి శాస్త్రములు ప్రతిపాదించే ఆత్మజ్ఞానం పొందటానికి యోగ్యత, అర్హత ఉండవు. ఇక మోక్షస్థితి అంటావా? శాస్త్ర విహితమైన కర్మానుష్ఠానం చేత చిత్తము శుద్ధి సంపాదించగా ఏర్పడే అవగాహన కదా! శ్రవణ - మనన- నిధి ధ్యాసాది అనేక ప్రయత్నముల ప్రభావం చేత వాసనలు సమూలంగా నాశనం కాగా, ఏర్పడే నిత్యోదిత చైతన్య పరిపూర్ణ స్థితి అది.
1. దుర్వాసనల భారంచే
స్పందన కోల్పోయినట్టి స్థావరములు
మనో జడ స్థితి.
2. వాసనారాహిత్యంచే ఏర్పడే
పూర్ణ చైతన్య అమనస్కస్థితి > ఆత్మీస్థితి
వాసనారహిత అమనస్కస్థితికి, నిద్రాణమైన జడస్థితికి, అస్థిమశకాంతరం (ఏనుగుకు - - ఒక దోమకు ఉన్నంత) తేడా ఉన్నది. ఆత్మతత్త్వమును చక్కగా గ్రహించుట చేత ఏర్పడే వాసనాపరిత్యాగమే 'కైవల్యపదవి' అని పిలువబడుతోంది.
❖
విత్తనంలో అంకురలక్షణాలన్నీ మౌనంగా దాగి ఉన్నట్లు, గాఢనిద్ర పోయేవానిలో సంకల్పములు ఉండి కూడా ప్రస్ఫుటం కాకుండా ఉన్నాయి. అట్లాగే జడములలో వాసనలు సుషుప్తమై వెలయు చున్నాయి. ఆ వాసనలే మరల జాగ్రత్ స్థితికి, పునర్జన్మకు కారణములగుచున్నాయి. మరి స్థావరాలకు మరల జన్మ లేదనటం ఎట్లా సంభవం? సుషుప్తంలో అణిగి ఉన్న వాసనలతో కూడి, మనోధర్మరహితమై,
Page:26
జడత్వము ఆశ్రయించి ఉన్న స్థావర జన్మలు కూడా దుఃఖసహితములగు అనేక వందల జన్మలు పొందటానికి వేచియే ఉన్నాయి. అనగా, జడ ధర్మమును ఆశ్రయించిన స్థావరములు మరల సుషుప్త ధర్మము వహించి జన్మలు పొందవలసిన అగత్యం ఉన్నది.
ఒకవేళ, జడధర్మమే మోక్షమని అనుకుంటే, ఇక శాస్త్రోక్తమైన ప్రయత్నములను వదలి మత్తు పదార్థములను స్వీకరించి, మత్తుగా పడి ఉండటం మంచిది కదా! కనుక, జడత్వమనేది మోక్షమని
అనిపించుకోవటానికి వీలు లేదు.
విత్తనంలో పుష్పలక్షణములు, మట్టియందు కుండధర్మములు అంతఃస్థితమై ఉన్నట్లు స్థావరము లందు పునర్జన్మ సంస్కారవాసనలు దాగి ఉన్నాయి. వాసనాబీజములు నిర్భీజములై సమూలంగా నశించటమే ‘తురీయం’ అని అనిపించుకుంటుంది. అంతే కానీ, జీవజంతు జాలం సుషుప్తి పొందినంత మాత్రంచేత అది ‘సిద్ధి’ అని అనిపించుకోదు.
శ్రీరాముడు: వాసనలు వృద్ధి చెందటానికి కారణమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : అజ్ఞానముతో కూడిన దృశ్యతదాత్మ్య అభాసయే అందుకు కారణం. వాసన, అగ్ని, ఋణం, వ్యాధి, శత్రుత్వము, అనురాగము, వైరము - ఇవన్నీ కొంచెం మిగిలి ఉన్నా మరల ప్రవృద్ధమౌతూ ఉంటాయి. వాసనలు ఇచ్ఛ - ఆశలు సహాయంతో క్రమాభివృద్ధి పొంది మహానర్థాలకు కారణమగుచున్నాయి. వివేకి అయినవాడు వాటిని సమూలంగా నిశ్శేషంగా త్యజించాలి. తీవ్ర ప్రయత్నంలో ఉద్భూతమయ్యే జ్ఞానాగ్నిచే వాసనాబీజాలను దగ్ధం చేయాలి. సత్తా సామాన్య రూపస్థితి పొందినవాడు ఈ శరీరము ఉన్నప్పుడు లేనప్పుడూ కూడా అద్వైత-నిత్య శాంత స్థితి పొందుతాడు. అట్టివాడు ఇక జన్మించడు. దుఃఖములను పొందడు.
స్థావరములు తరగని వాసనా బీజములతో, ఉత్పత్తి పొందబోవు రసభావంతో, (అయితే) అంతర్గతంగా - చిచ్ఛక్తి సమన్వితములై నిద్రించుచున్నాయి.
ఆత్మశక్తియే జడములందు జడరూపంగానూ, రాయియందు కాఠిన్యంగాను, కాష్ఠంలో (చెక్కలో) ధ్వంస రూపంగానూ, కత్తియందు పదును రూపంగానూ, మట్టికుండ యందు జలధారణ సమర్థం గానూ, వస్త్రము నందు చలి నివారణ శక్తిగానూ, బంగారము నందు ఆభరణత్వంగానూ వెలయు చున్నదని సునిశిత బుద్దితో గ్రహించు. వాసనాబీజశక్తి విత్తనమునందు దాగి ఉండి తగిన వాతావరణం లభించగానే వికాసం పొందే మహావృక్షములాగా, జగదనుభవంగా బయల్వెడలుతోంది. అట్టి వికాసము నుండి అనేక రూపనామ పరంపరలను పొందుతూ మహాప్రయాణం చేస్తోంది.
నిజానికి ఆత్మ చైతన్యమునకు నామరూప ఉపాధిత్వంగాని, స్థావర జంగమత్వం గానీ లేదు. రూపరహితమగు ఆకాశమునందు మేఘముల ఆచ్చాదనచే రూపముగా స్ఫురిస్తున్నట్లు, ఆవృతచైతన్యం జడాది దృశ్య దశలను పొంది కనిపించటం జరుగుతోంది. కనుక, రామా! ఈ అజ్ఞానముచే ఆవరించబడిన చిచ్ఛక్తి యొక్క వాస్తవ స్వరూపమేమిటో గమనించు. అంతేగాని అవాస్తవమగు
Page:27
స్థావర జంగములను చూచి భ్రమించకు. భూతాకాశము రూపరహితమైనట్లే ఆత్మాకాశం సదా, సర్వదా విషయరహితం.
అసన్మయము అగు 'అజ్ఞానము' అనే నిస్సార వస్తువు నలువైపులా వ్యాపించి భ్రాంతిబుద్ధికి రకరకములుగా, స్థావర జంగమాత్మకంగా తోపింప జేయుచున్నదయ్యా! అయితే ఆత్మ దృష్టితో అల్ప దృష్టిని జయిస్తే ఈ సంసారము బ్రహ్మమే అవుతుంది గానీ, భ్రమను కలిగించజాలదు. దీని నంతటినీ ఆత్మదృష్టితో చూస్తున్నపుడు సర్వదుఃఖములు నశించుచున్నాయి. ఆత్మదృష్టికి విరుద్ధంగా ‘ఆవరణ’ కల్పించుకొనుటయే అవిద్య. అవిద్యలోంచి దృశ్యజగత్తుకు సంబంధించిన జడ-జీవాది స్ఫురణలు కలుగుచున్నాయి.
శ్రీరాముడు: ఈ నామరూపాత్మక ఆవరణ కల్పిస్తున్న అవిద్య యొక్క అసలైన రూపమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : అవిద్యకు రూపమంటూ ఏదీ లేదు.
అవిద్యారూపరహితా యావదేవావలోక్యతే ॥
తావదేవ గలత్యాశు తుహినాణుర్యథాతపే ॥ ॥ (శ్లో॥ 31, సర్గ 10.) సర్వరూపశూన్యమైన అవిద్య ఎంతవరకు విచారించబడితే అంతవరకూ ఎండకు మంచులాగా, కరిగి పోవుచున్నది. నిద్రలోంచి లేస్తున్న మనుజుడు ఎంతవరకు జాగ్రత్వృత్తులు వచ్చి జేరితే అంతవరకూ నిద్రమత్తు తొలగినట్లే కదా! "ఇది ఏమిటి?" - అని ఎంతవరకు పరిశీలిస్తామో అంత వరకు విషయ పరిజ్ఞానం లభిస్తుంది. ఎంతవరకు వెలుతురు విస్తరిస్తే అంతవరకూ చీకటి దూరమౌతూ ఉంటుంది. అట్లాగే, ప్రయత్నపూర్వకంగా ఎంతవరకూ అవలోకిస్తూఉంటే అంతవరకు అవిద్య క్షీణిస్తూ వస్తుంది.
ఒకడు ఒక చీకటి గదిలో నిలబడి ఉన్నాడనుకో! “ఈ చీకటి యొక్క అసలైన రూపమేమిటి?” అని తెలుసుకుందామని దీపం వెలిగించి వెతికితే, ఆ దీపపు వెలుతరులో చీకటి రూపమేమిటో కనబడుతుందా? దీపం వెలగగానే చీకటి మటుమాయమౌతుంది. ఎందుకంటే, వెలుతురు లేక పోవటమే చీకటి కదా! జ్ఞానం ప్రభవించిందా, అజ్ఞానము యొక్క నామ రూపములు కూడా లభించవు. నెయ్యి యొక్క ఘనస్వరూపం (పేరు నెయ్యి యొక్క ఘనాకారం) పరిశీలించటానికి వేడి చేశామనుకో, ఆ ఘనాకారం యొక్క పొడవు వెడల్పులు ఏమగుచున్నాయ్? మటుమాయమౌచున్నాయి కదా! అట్లాగే, అవిద్య విచారించబడినప్పుడు, ఆ విచారణ యొక్క తీవ్రత చేత, ఆ అవిద్య 'ఇది’ అని నిర్దేశింపబడక పారిపోవుచున్నది.
కొంచెం మాత్రమే విచారిస్తే కొంచెమే తొలగుతోంది. అసలు విచారణయే చేయకపోతే, అసద్రూపమగు భ్రమగా అనుభవమగుచు అది అవస్తువు అయి కూడా జీవుని ఈ నిబిడాంధకార రూపంలో చుట్టుముట్టుతోంది. కనుక రామా! అవిచారణామాంద్యమును వదలి, విచారణ చేసి చూడు అప్పుడు నీకు ‘అవిద్య లేనిదే' అని తెలియబడగలదు. విచారణ చేయకుండా, ధ్యాన-భక్తియోగాది ప్రయత్నాలు లేకుండా రోజులు గడపుతూ ఉంటే ఈ అవిద్య తనంతట తానే తొలగుతుందా? ... లేనే లేదు.
Page:28
శ్రీరాముడు: కార్యకారణములచే రూపాంతరం చెందుచూ, కనబడుచున్న ఈ అవిద్యాదృశ్యతరంగం విలీనమవటానికి ఉపాయమేమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి : "రక్త మాంస-బొమికలచే పంజర రూపంలో తయారై కనిపిస్తున్న ఈ శరీరంలో చిక్కుకుని ఉన్న నేనెవడను?” అని విచారణ చేయటమే అందుకు ఉపాయం. సర్వ అసద్రూపములను మొదలంటా త్యజించివేయటాన్నే 'అవిద్యా క్షయం' అని పిలుస్తున్నాం. అప్పుడు శేషించి ఉన్నదే ఆత్మ కదా! ఒకడు ఒక భుజకీర్తిని ధరించునప్పుడు మరల తొలగించినప్పుడు అతడు యథాతథంగానే ఉంటున్నాడు కదా! ఈ జగత్తులను ధరిస్తున్నప్పుడు, త్యజించునప్పుడు కూడా 'ఆత్మ' ఒకే తీరుగా ఉండి ఉంటోందని గ్రహించు. ఆత్మ ఎప్పుడూ ఏదీ పొందటం లేదు. కోల్పోవటం లేదు. “అది సదా యధాతథం" - అని వేదోపనిషత్తుల గానం కదా!
అవిద్య తొలగినప్పుడు శేషించి ఉండే వస్తువు శాశ్వతము-సద్రూపము అగు బ్రహ్మమే కదా! ఆత్మ సర్వమును ధరిస్తోంది. మరల పాము కుబుసమును విడుచునట్లు విడచివేస్తోంది. ఆత్మ యొక్క సమక్షమునందే అవిద్య ప్రవర్తించటం నివర్తించటం కూడా జరుగుతోంది.
-
అట్టి సారభూతమగు ఆత్మయే నీవు కదా! ఆత్మ అనుభవైకవేద్యము. నాలుక ఒక మధురమైన వస్తువును ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అనుభూతిని ఏ వర్ణనల చేతనూ మరొకరెవరికీ అందించగలిగేది కాదు. అట్లాగే, ఎవరికి వారే స్వస్వరూప సందర్శనంచే అది ఆస్వాదించవలసిందే! ఆత్మయే ప్రతిఒక్కని శాశ్వత స్వరూపం, వాస్తవ స్వస్వరూపం అయిఉన్నది.
రామా! మరల చెప్పుచున్నాను. 'అవిద్య' అనేది అసలు లేనేలేదు. ఈ కనబడేదంతా అఖండిత మగు బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మమే అవిద్యగా భ్రమచే అనిపిస్తోంది. సత్ - అసత్ కల్పనలన్నీ బ్రహ్మము నందే, బ్రహ్మము చేతనే, బ్రహ్మము గానే కలుగుచున్నాయి.
‘కుండ’ మట్టికాదని, 'వస్త్రము' దూది కాదని, 'శకటం' కొయ్య కాదని, అనిపించటం తెలివి తక్కువతనమే కదా! 'ఇది బ్రహ్మము కాదు' అని అనిపించటమే అవిద్య. 'ఇదంతా బ్రహ్మమే' అను నిశ్చయమే అవిద్యా క్షయం. ఇక్కడున్నదంతా శివం - శాంతం - అద్వైతం తప్పితే ఇక ఇక్కడా, ఎక్కడా, ఇప్పుడూ, మరెప్పుడూ, ఏదీ, మరేదీ లేదు. లేనే లేదు. ఉండజాలదు.
10. కర్తవ్యములు జ్ఞానమునకు అడ్డు కావు
శ్రీవసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! మరలమరల ఆత్మతత్త్వ విషయమై వినటం మననం చేయడం వంటి అభ్యాసముల వలన మాత్రమే ఈ దృశ్యం ఇక హృదయంలో చిగురించకుండా ఉండగలదు. అనాత్మభావనపోయి ఆత్మభావన సంతరించుకోవాలంటే విషయం ఆరూఢం కావాలి. అందుచేతనే ఒకే విషయం మరల మరల నేను చెప్పటం జరుగుతోంది. కనుక నేను చెప్పేది పరిశీలకుడవై విను.
Page:29
అజ్ఞానమేతద్బలవదవిద్యేతరనామకమ్ |
అభ్యాసేన వినా సాధో నాభ్యుదేత్యాత్మభావనా ॥ (శ్లో.2, సర్గ.11.)
ఈ ‘అవిద్య’ అనబడే అజ్ఞాన అనాత్మ భావనలు వందల వేల జన్మలలో మూటకట్టుకున్న ద్వైతవాసనలవలన బలం పుంజుకుని దట్టంగా పెనవేసుకుని ఉన్నది.
ఇది అనేకసార్లు జాగ్రత్లో కళ్లు మొదలైన ఇంద్రియములు ఉపయోగిస్తున్నప్పుడు, ‘స్వప్నం' అనే ఊహయందు పొందిన అనుభవపరంపరల చేతనూ, అనేకసార్లు చావు పుట్టుక లందలి భావోద్రేకముల చేతనూ ప్రాబల్యం పొంది ఉంటోంది. అందుచేత శ్రవణ మననాది తీవ్రయత్నములు ఎంతో అవశ్యకమై ఉన్నాయి.
ఇక ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అది పంచేంద్రియాలకు అగోచరమైనది. ఆరవ ఇంద్రియము, సంకల్ప స్వరూపము అయిన మనస్సు కూడా లయించగా, అప్పటికీ సత్తామాత్ర రూపమై వెలయు చున్నది, ఇంద్రియముల వలన కలుగుచున్న వృత్తులకు ఆవల ప్రత్యక్ష, వృత్తిరహిత స్వభావమై ఆత్మ ప్రకాశిస్తోంది. మరి అట్టిది భౌతికమైనదిగా ఎట్లా కనిపిస్తుంది చెప్పు?
కాబట్టి రామా! హృదయ వృక్షమును దట్టముగా పెనవేసుకుని ఉన్న అజ్ఞాన- లతను సంక్షయింప జేయాలి సుమా! "మరల మరల జ్ఞానమును అభ్యసించటం" అనే చురకత్తిని ఉపయోగించి ఆ అజ్ఞాన-లతను త్రెంచి స్వస్వరూపమును సిద్దింపజేసుకోవాలి.
శ్రీరాముడు : మహర్షీ! ఈ జీవుని జీవితము రాజ్యపాలన, అన్నపానాదుల సముపార్జన మొదలైన శరీరరక్షణ వ్యవహారములకే అధికభాగం సరిపోతోంది కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : నాయనా! రామా! ఈ అన్నపానాది లౌకిక వ్యవహారములు జ్ఞానసముపార్జనకు, అవిద్యా నాశనమునకు, అడ్డుగా ఉన్నాయని అమాయక జీవులు మాత్రమే భ్రమిస్తున్నారు. అది సరికాదు. నీవు అట్టి అల్ప అభిప్రాయములను దరిజేరనీయవద్దు. జనక మహారాజు రాజ్యపాలనాది వ్యవహారములను నిర్వర్తిస్తూనే జ్ఞానాభ్యాసపరుడై, జ్ఞానిఅయి విహరించటం అందరం చూస్తున్న విషయమే. అభ్యాసబలం చేతనే ఆతడు కర్మనిరతుడై కూడా 'నేను సర్వకర్మ వ్యవహారములకూ అతీతుడను’ అను నిశ్చయాత్మక బుద్ధిని అభ్యాసఫలంగా సంపాదించుకున్నాడు. పూర్ణజ్ఞాన నిశ్చయము గల విష్ణుమూర్తి అనేక అవతారములతో గర్భవాసం అనుభవించి, జన్మించి ధర్మరక్షణ, భక్తపాలన చేస్తూనే స్థిరచిత్తుడై నిశ్చలుడై, నిర్లిప్తుడై ఉన్నారు. సర్వదా అంబతో కూడుకొనియున్న శివభగవానుడు, సరస్వతీదేవితో కూడుకొనియున్న బ్రహ్మదేవుడు, రాగరహితులై, అఖండజ్ఞాన సమన్వితులై అవిద్యకు ఆవల నిశ్చలులై ఉన్నారు. సృష్టి-లయ కార్యములలో నిమగ్నమై ఉన్నారు. అయినా కూడా వారు భక్తులకు కరుణతో, వరములను, జ్ఞానమును ప్రసాదిస్తున్నారు. గుణ సహితులై వర్తిస్తున్నారు. అట్టి మహనీయుల నిశ్చయమే నీకు కూడా కలుగుగాక!
దేవతల గురువగు బృహస్పతికి, అసురుల గురువగు శుక్రాచార్యులకు, త్రిలోకసంచారియగు నారదమహర్షికి, పులస్త్య- అంగీరస - ప్రచేతస - - భృగు - క్రతు - అత్రి - - శుకాది ఋషిసత్తములకు,
Page:30
ఈ సభకు వేంచేసి ఉన్న అనేకమంది మహనీయులకు, జీవన్ముక్తులకు, రాజర్షులకు, బ్రహ్మర్షులకు, నాకు కర్మల వ్యవహారం పట్ల ఎట్టి నిశ్చయం ఉండి... కర్మలు నిర్వర్తించటం జరుగుతోందో, అట్టి నిశ్చల ఆత్మ్యైక్యస్థితి, అపరోక్ష, అద్వైతజ్ఞానానుభూతి పెంపొందించుకుంటూ, నీకు విధించిన కార్యములను నిర్వరిస్తూ ఉండు. కర్మల తదనంతరం జ్ఞానం కాదు. జ్ఞానివై కర్మలు నిర్వర్తించు. శ్రీరాముడు: భగవంతుడా! వసిష్ఠమహర్షీ! మీరు చెప్పిన మహనీయులందరూ ఏ నిశ్చయమును అనుసరించి, అవిద్యాశోకరాహిత్యమగు పదవిని అలంకరించి ఈ దృశ్యజగత్తులో సంచరిస్తున్నారో - అది - వివరించమని ప్రార్థిస్తున్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి : సునిశిత బుద్ధితో నేను చెప్పేది గ్రహిస్తున్నట్టి నీకు వారి సునిశ్చయమేమిటో వివరించి చెబుతాను విను. ఇప్పుడు నేను చెప్పే వివేక భేరీనినాదం సర్వ వేదాంత సిద్ధాంతసారమే అయి ఉన్నది.
11. వివేక భేరీ నినాదం
వివేకుల భేరీ నినాదం ఇట్లా ఉంటుంది. ఈ కనబడే జగత్తుల యొక్క స్థితిగతులన్నీ ఘనీభూతమై ఏర్పడి ఉన్నట్లుగా అనిపిస్తోంది కదా! అయితే వివేకులగు మహనీయుల దృష్టిలో ఇదంతా మాయకమై ఉండి కూడా పవిత్రబ్రహ్మ స్వరూపంగానే వ్యవస్థించియున్నది.
బ్రహ్మ చిద్ర్బహ్మ భువనం బ్రహ్మ భూతపరమ్పరాః | బ్రహ్మాహం బ్రహ్మ మచ్చత్రుర్బహ్మ సన్మిత్రబాన్ధవాః | || (శ్లో 17, సర్గ 11.)
బ్రహ్మమే జీవచైతన్యముగా ప్రకటితమౌతోంది. చైతన్యాభాసకమగు ఈ చతుర్దశభువనములు (14 లోకములు), వాటిలో ఉండే అసంఖ్యాక జీవులు కూడా బ్రహ్మమే! నేను, నా బంధువులు, నా శత్రువులు, నన్ను ఆక్షేపించేవారు అందరూ బ్రహ్మమే అయి ఉన్నారు.
భూత, భవిష్యద్వర్తమాన కాలములు సముద్రంలోని తరంగముల లాగా బ్రహ్మమునందే విజృంభిస్తున్నాయి. పదార్థ సంపదలు కూడా బ్రహ్మమే. బ్రహ్మము బ్రహ్మముచేతనే పరిలక్షించబడటం (Being aimed at), గ్రహించబడటం, ప్రేరేపించబడటం, అనుభవించబడటం... జరుగుతోంది. బ్రహ్మము తనయందు తానే తన మాయాశక్తిచేత వివర్తము చెందుతూ 'తదితరం” గా వర్ధిల్లుచున్నది. నన్ను అధిక్షేపించుచూ, ఉపేక్షించుచూ, ప్రశ్నించుచూ, వేధించుచూ కనబడేదేదైతే ఉన్నదో - 'అదంతా' బ్రహ్మమే కనుక బ్రహ్మమునకు నేను ప్రియమొనర్చెదను గాక!
ఆకాశంలో మేఘముల సమావేశం ఏదో వనముయొక్క ఆకారంలాగా ఉన్నట్లు భ్రమచే తోచుచున్నది చూచావా? అది పసిపిల్లవాడి అమాయకదృష్టి వంటిదే కదా! అట్లాగే రాగద్వేషాది వ్యవస్థలన్నీ కేవలం ద్రష్టయొక్క కల్పిత దృష్టుల ఫలితం మాత్రమే. బ్రహ్మనిష్ఠని అవేమీ స్పృశించలేవు. అఖండబ్రహ్మైక్యవేద్యులకు సర్వసంకల్పములు మొదలంట్లా నశించి ఉంటాయి. అందుచేత వారిపట్ల
Page:31
రాగమునకు సంబంధించిన సంకల్ప ప్రసంగం ఉండదు. వారి రాకపోకలు, కాళ్లుచేతుల కదలికలతో సహా సర్వ కార్యక్రమములూ పూర్ణస్వభావమై, బ్రహ్మరససమన్వితములై ఉంటాయి. వారు సర్వేసర్వత్రా స్వస్వరూపమునే దర్శించటం చేత ఇక ఎవరి మీద ద్వేషం? “ఈ జగత్తంతా నా హృదయాకాశ విన్యాసమే”... అని వారు ఆస్వాదిస్తున్నారు.
ఆనందైక రసమగు బ్రహ్మమే అంతటా, అన్నిటా, అన్నివేళలా ప్రకాశించుచుండగా... ఇక సుఖమేమిటి? దుఃఖమేమిటి? అన్ని వైపులా బ్రహ్మమే బ్రహ్మమునందు దీపిల్లుచున్నది. ఇక నేనో? బ్రహ్మము కంటే వేరుగా నేను మరెచ్చటా లేను.
కుండ - మట్టి - దూది అంతా బ్రహ్మమే. నాతో సహా అంతా బ్రహ్మమే అయి ఉండుట చేత, ఇష్టం అయిష్టం మొదలైన కల్పన అంతా మిథ్యయే. అట్టి కల్పనల యొక్క అవసరంగాని, అనవసరంగాని లేదు. ఈ దేహ బ్రహ్మము మరణ బ్రహ్మమునందు ప్రవేశిస్తోంది. ఉభయ స్థితులూ బ్రహ్మమే అయి ఉన్నాయి. కనుక మరణము గురించి భయపడటం గాని, కోరుకోవటం గాని చేయవలసిన పనేమున్నది?
ఎవరైనా సుఖదుఃఖాలు అనుభవించే వారు ఇక్కడున్నారని అనుకుంటే, అది అజ్ఞానాంధకారంలో త్రాడును చూసి పాము అని అనుకోవటం వంటిదే.
అంతయూ బ్రహ్మమే కాబట్టి 'ఇది నేను చేశాను' అని భావించవలసిన పని లేదు. తరంగముల కదలికలు నీరు నుండి వేరుగా ఉన్నవి కాదు కదా. నీటిలో కదలికలే లేకపోతే ఇక తరంగములకు ఉనికి-నామ-రూపములు ఎక్కడినుండి వస్తాయి? బ్రహ్మమే లేకపోతే సుఖదుఃఖములకు ఉనికియే ఉండేది కాదు.
కెరటములు జలమే కదా! ఇక కెరటములకు 'జలములో లయించుట' అనే వ్యవహారం ఎక్కడున్నది? అట్లాగే ఈ జీవుడు బ్రహ్మమును సంపాదించుటయో, తాను బ్రహ్మము నందు లయించుటయో ఏముంటుంది? ఈ జీవుడు బ్రహ్మమే కదా! ఇక్కడేదీ మరణించుట లేదు. తరగుట లేదు. పెరుగుట లేదు. అయితే, తరంగములు 'చలించుట' అను చలనస్వభావమును వీడకయే నిజస్వభావమున జలముగా వెలయునట్లు 'ఈ పాంచ భౌతిక దేహాన్ని నేను' అను జడస్వభావమును ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా స్వస్వభావమగు తత్త్వరూపమున వెలసి ఉండెదను గాక! తరంగములు నిశ్చలత్వం పొందితే జలంగానే ఉంటాయి కదా! అనిశ్చలంగా ఉన్నప్పుడు కూడా అవి జలమే! బంధము-మోక్షము అను ఉభయ స్థితులలో బ్రహ్మమే ఉన్నది. నేను అజ్ఞానినైనా, సుజ్ఞానినైనా కూడా బ్రహ్మమే అయి ఉన్నాను.
బంధ-మోక్షములు లేనే లేవు. ఒకవేళ ఉంటే... వాటి వాస్తవ స్వరూపం బ్రహ్మమే! శాస్త్రాలు (ఉపనిషత్ మొదలైన గ్రంథాలు) అతాత్త్వికమగు జడ రూపమును పరిత్యజించి... తద్వ్యతిరిక్తమగు 'తత్త్వభావన పొందటం' అనుదాని గురించి ప్రవచిస్తున్నాయి. అదంతా కూడా ఆభరణము నందు బంగారమును, తరంగము లందు జలమును గాంచుట వంటిది మాత్రమే. 'తత్త్వభావన' అనగా
Page:32
“నీవు’గా 'నేను’గా కనిపించేదంతా బ్రహ్మమే - - అను భావన. ఈ క్షణం తరువాత ఎప్పుడో ఎక్కడో పొందవలసిన మరొక స్థితి, స్థానములు కాదు. “ఇది బ్రహ్మం కంటే వేరొకటి”... అను బ్రహ్మవ్యతిరిక్త భావమే ప్రకృతి అని, మాయ అని పిలువబడుతోంది.
ఈ జీవజడాది రూపములన్నీ బ్రహ్మము నందే ఆరోపించబడుచున్నాయి. భేదభావన ఉన్న చోట మాత్రమే మోహం, దుఃఖం ఉంటాయి. వాస్తవము, నిత్యము, అప్రమేయము అగు బ్రహ్మమును ఎరుగుటచే ఇక అవి ఉండవు. తెలియని వారికి ఈ జగత్తు దుఃఖమయం. తెలిసిన వారికి ఇదంతా అఖండానందరసైక పూర్ణము. గ్రుడ్డివానికి ఈ జగత్తంతా అంధకారమయం. జ్ఞానచక్షువులు కలవారికి ఇదంతా ప్రకాశమయం. అజ్ఞానికి ఈ జగజ్జాలం బంధమయం. జగదేక ఆత్మజ్ఞానం చేత ఇదంతా దివ్యానందమయం.
ఓ బిడ్డలారా! సకల జీవులారా! మమాత్మ స్వరూపులారా! రాత్రిపూట శిశువు చీకటి వైపు చూచి భూతములను ఊహించి భయపడునట్లు, మీరు ఈ జగత్తులోకి వచ్చి వ్యామోహితులై ఇక్కడి అల్ప లాభాలాభములను చూచి ఉలిక్కిపడుచున్నారు. ప్రాప్తవయస్కుడు చీకటికి ఏమాత్రం భయపడ నట్లుగానే, జ్ఞానము ప్రాప్తించినవాడు 'బ్రహ్మము' అనే నిండుకుండ అయి తనను తాను దర్శించుకొను చున్నాడు. విశ్వమంతా తన రూపంగా ఆస్వాదిస్తున్నాడు. అందుచేత, అతనికి ఎట్టి భయ దుఃఖాలు అంతరమున కలగటమే లేదు. తరంగములు లేవటం, పడటం మిథ్యయే అయినట్లు ఇక్కడ జీవించటం, మరణించటం అనేవి మిథ్యయే. ఇదంతా భ్రాంతిచేతనే కల్పితంగా ఆత్మయందు దృశ్య సంబంధిత భ్రమగా కలుగుతోంది. బాల్యాజ్ఞానంలాగా 'ఇది ఉన్నది - అది లేదు' అనే పరికల్పన ఆత్మ యందు ఆత్మచే ఏర్పరుపబడుతోంది. ఇక్కడ ఉన్న విశేషం ఇంతకుమించి ఇంకేమీ కాదు.
ఒక దీపం యొక్క కిరణపుంజములు బయలుదేరి నిష్కారణంగానే తదితర పదార్థములను ప్రస్ఫుటింప జేయుచున్నట్లు బ్రహ్మము నుండి బయలుదేరిన చిత్పుంజములు జగత్తును ప్రస్ఫుటింప జేయుచున్నాయి. బ్రహ్మము 'జగతి నిర్వచనము' అనే ఆత్మశక్తిని ప్రకటించుచున్నప్పటికీ అది సర్వదా తనయందు తానే వెలయుచున్నది.
కెరటముల మధ్య గల జలకణములు కించిత్ ఘనీభవించటం చేత జలంలో నురుగు ఏర్పడుతోంది. ఆ జలకణములు తునిగినప్పుడు, తిరిగి జలముగానే రూపం దిద్దుకుంటోంది కదా! అట్లాగే ఏదో కారణం చేత ఆత్మ కల్పితరూపములను సంతరించుకుంటోంది. ఆ కారణం నిరోధించ బడినప్పుడు తిరిగి బ్రహ్మముగానే శేషిస్తోంది. సముద్రంలో జలం లేకపోతే కెరటములు గాని, బుడగలు గాని ఉండేవా? బ్రహ్మమే లేకుంటే మనోబుధ్యాది అంతఃకరణములుగాని, ఈ శరీరములు గాని ఏర్పడగలిగేవే కాదు. సముద్రం ప్రశాంతమయినప్పుడు కెరటాలు, నురుగు, వీచికలు, జలకణాలు శమించగా, ఇక ప్రశాంతజలత్వం స్వాభావికమే అయినట్లు కల్పనలు త్యజించినప్పుడు ఈ జీవుడు స్వాభావికంగానే స్వతఃసిద్ధము, నిర్మల-సర్వాత్మ స్వభావమగు బ్రహ్మముగానే ప్రకాశిస్తున్నాడు. ఈ శరీరములు, ఈ సంపద-ఆపదలు, ఈ హర్ష- విషాదములు, ఈ ధర్మార్థ కామ పురుషార్థములు
Page:33
- అన్నీ కూడా తిరిగి బ్రహ్మము నందే ప్రవేశిస్తున్నాయి. 'బ్రహ్మమున జగత్తులు ఉండటం' అనగా ‘బంగారమునకు ఆభరణమునకు సంబంధించిన ఆకారము ఉండటం' వంటి కల్పితం మాత్రమే. ఈ విచిత్రం ఇంతవరకే గాని మరింకేమీ కాదు. మూఢులు స్వస్వరూప అజ్ఞానావేశం చేత ద్విత్వం కల్పించుకొని బాధపడుచున్నారు.
ఈ మనస్సు బుద్ధి, శబ్ద స్పర్శ రూప రస గంధము లనబడే పంచతన్మాత్రలు, ఇంద్రియాలు - ఇవన్నీ 'ఏకైక బ్రహ్మమే' అయి ఉన్నాయి. అట్లే అనేక ఆత్మలు ఎక్కడా లేవు. కొండగుహలో చేయ బడిన ‘ఓహో’ అను ధ్వని ప్రతిధ్వనించి ఆ గుహలో అనేక వైపుల నుండి అనేకసార్లుగా 'ఓహో... ఓహో’ ధ్వని వినబడుతుంది. అవి మరొకరెవరో పలుకుతున్నట్లు అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ద్వితీయ భ్రాంతి కలుగుతోంది. 'వాచారంభం... మొదలే అసంభవం 'అనునట్లుగా 'నేను, నీవు, ఇది, అది, చిత్తము, అనుభవము’ - మొదలైనదంతా ఆత్మయందు ద్వైతభ్రాంతిని కల్పించుచూ, లేచుచున్నది.
కలలో ఒక జీవుడు తన కల్పితరూపములగు అనేక రూపములను దాల్చి తానే ఆ రూపములతో ప్రతిస్పందిస్తున్నాడు చూచావా? బాగా పరిశీలించిన తరువాత స్వస్వరూప బ్రహ్మమే ఈ జీవ జగత్ భావములను ప్రదర్శించుచున్నట్లు జ్ఞానులు గ్రహిస్తున్నారు. అందుచేత ఆత్మలో 'భ్రమింపజేయుట' అను ద్విత్వమునకు సంబంధించిన చమత్కారం అప్రసిద్ధమైనదేదీ కాదు. అయితే బురదలో పడి ఉన్న మణి బురదయొక్క తాపటం చేత 'అది మణి' అని గ్రహించకపోవటం, ఏదో గులకరాయి ముక్కలాగానే గ్రహించబడటం జరుగుచున్నట్లు, బ్రహ్మమని భావించకపోవటం చేత బ్రహ్మమే అజ్ఞానముగా పరిఢవిల్లుతోంది. ఇది ఎంత చిత్రం!
అయితే మనం చెప్పుకున్న తత్త్వజ్ఞులు సర్వము బ్రహ్మముగా దర్శిస్తున్నారు. తన ఆత్మయే అంతంతరమునందు స్వయం ప్రభువై స్వయం జ్యోతిస్వరూపమై, మహత్తుగా అంతటాఅన్నిటా ఆక్రమించి ఉన్నట్లు గ్రహిస్తున్నారు.
అజ్ఞానులకు మాత్రమే ఖండభావన కలుగుతోంది. అజ్ఞానులే ‘అజ్ఞానం... అజ్ఞానం’ అని వాపోవుచున్నారు. మణి అని తెలియగానే బురదచే కప్పబడిన రాయి మణిగా గుర్తించబడునట్లు, అంతా బ్రహ్మమే అని తెలియబడగానే నాలుగు దిక్కులందూ బ్రహ్మమే అనుభవమగుచున్నది. బ్రహ్మం సర్వశక్తిమంతము. అందుచేత అన్యకారణమేదీ లేకుండానే స్వశక్తి చేతనే అది ఎట్లు భావన చేస్తే అట్లే అనుభవమగుచున్నది. చివరికి పూర్ణముగా భావించినప్పుడు పూర్ణముగానే అగుచున్నది.
బ్రహ్మము కర్మ-కర్త-కరణ-కారణ రహితం. అది అనామయమైనది. అందుచేత, వేదజ్ఞులు దానిని స్వయంభువం (తనంతటతానే ప్రభవించునది) స్వయం ప్రభువు, స్వయం కారణం అని వర్ణిస్తున్నారు. బ్రహ్మమే అపరిజ్ఞాతమైనప్పుడు 'అజ్ఞానము' అని 'మాయ' అని పిలవబడుతోంది. అది తన అజ్ఞానాన్ని వినాశనమొనర్చుకుని పరిజ్ఞాతమైతేనో? అదే జ్ఞానంగా అగుచున్నది. గ్రహించక, శత్రువుగా భావిస్తాం చూచావా! గ్రహించిన తరువాతనో... శత్రుభ్రమ అనే అజ్ఞానం తొలగి అతడే మిత్రుడిగా తెలియవచ్చుచున్నాడు కదా! విచారణ-వైరాగ్యములు లోపించుట చేతనే జీవ-జగత్తులలోని
Page:34
బ్రహ్మము అస్పష్టంగా ఉండిపోతోంది. ఈ జీవ జగద్రూపము అయుక్తమని, విచారించినప్పుడు నిలబడజాలదని, అసద్రూపమని గ్రహించిన తరువాత బ్రహ్మభావము తనంతటతానే తక్షణమే సుస్పష్టమై ఉదయించగలదు. 'ముత్యపుచిప్పలో వెండి ఉండజాలదు' అని తెలిసిపోయిన తరువాత ఇంక అందులోంచి వెండిని పొందటానికి ప్రయత్నం ఉండదు కదా! బ్రహ్మమును ఎరిగిన తరువాత ఇక “ఈ జగత్తులో ఏదో పొందటల్లేదే?”... అనే దుఃఖభ్రమ ఉండదు.
ఈ జగత్తు బ్రహ్మమున ఉండటం అసంగతమని తెలిసి రాగానే భోగ్యవస్తువుల పట్ల విరాగం స్వయంసిద్ధమౌతుంది. ఎప్పుడైతే ద్వైతము అసత్యమని, అసంభవమని అసంగతమని గ్రహిస్తామో... మరుక్షణం 'బ్రహ్మభావన' అనే సూర్యుడు స్వయంగా ఉదయిస్తున్నాడు. అటు తరువాత 'ఇది సత్యం, ఇది మిథ్య’ అను భావనను కూడా త్యజించి మహనీయులు పరమవైరాగ్యాన్ని అవధరిస్తూ ధన్యులగు చున్నారు.
'నేను-నాది' అను గ్రహణాగ్రహణముల కారణంగా అహంకారము ఆత్మవస్తువును స్ఫురించ కుండా అడ్డుతగులుతోంది. అయితే వివేకులగు మహనీయులు ఆత్మవస్తువును అహంకారము తాక లేదని, హింసించలేదని ఎరిగియే ఉంటున్నారు. “కార్య కారణ సంఘాతమగు ఈ శరీరమే నేను కాదు. ఇక తదితరం గురించి వేరే చెప్పేదేమున్నది?" అని గ్రహించి జనకాది మహాత్ములు స్వతఃగానే బ్రహ్మభావాన్ని ఆశ్రయించి ఉంటున్నారు. 'నేను బ్రహ్మమును’ అనుజ్ఞానం సంపాదించుకొని, పదిల పరచుకొని ఉండటం చేత వారి సర్వభావనలు అనుక్షణం తమ స్వరూపంలోనే తక్షణమే విలీనమగు చున్నాయి. 'ఇదంతా కూడా బ్రహ్మమే' అనుభావనాపటిమచే వారు నీవు - నేను మొదలైన వాటిని నీళ్లలో పడిన ఉప్పుబొమ్మలాగా స్వాహా చేసివేస్తున్నారు. ‘ఆస్తి-భాతి-ప్రియము-నామము-రూపము’ అను ఐదు రీతులుగా చెప్పబడే ఈ జగత్తు, ఇందలి వస్తుజాలములు వారు బ్రహ్మమునందు, లయం చేసి గ్రహించటం చేత వారు మోహమును, దుఃఖమును, కర్మత్వమును తొలగించివేస్తున్నారు. సర్వదా పరమ శాంత-నిర్మల-నిర్లిప్త స్వరూపులై వెలయుచున్నారు. అట్టి బ్రహ్మోక్య స్వరూపులగు మహనీయులగానం ఏమిటో చెపుతాను విను.
12 ఆత్మజ్ఞాని యొక్క సింహనాదం
శ్రీవసిష్ఠ మహర్షి: ఆత్మ స్వరూపము యొక్క మహోన్నత్యం గ్రహించిన ఆత్మానుభవసమన్వితుల ‘సుప్రకటన’ ఏమిటో చెపుతాను విను.
ఆత్మజ్ఞాని యొక్క సింహనాదం - అహో! నేను స్వస్థుడనైనాను. సర్వసమరస స్వభావుడనైనాను. వాస్తవమునకు నేను బ్రహ్మమును. కనుక సర్వదా స్వభావ సిద్ధంగానే శోకరహితుడను. జ్ఞానమును సంపాదించకోవటంచేత 'కల్పనలు' అనే కలనుండి విముక్తుడనయ్యాను. నేను దేనినీ గ్రహించటం లేదు. త్యజించటం లేదు. ఈ శరీరమును నమ్మి ఉండవలసిన అవసరం లేదు. అట్లా అని త్యజించ
Page:35
వలసిన అగత్యమేమీ లేదు. ఇందలి రక్త - మాంస - - అస్థి - ధాతువులు, ఈ మొత్తం శరీరం నా యొక్క ఒకానొక చిత్కళమాత్రమే.
బ్రహ్మము అనబడే నిత్యసత్యమును నేనే. సూర్యునితోను, నక్షత్రములతోను నిండియున్న ఈ సర్వ ఆకాశము కూడా నా చేతనే ఆక్రమించబడియున్నది. చిత్చైతన్యము రూపముతో ఈ సృష్టిని, తదితర సృష్టులను పూర్ణం చేసి ఉంటున్నాను.
ఈ భూమి దీనిపైగల జీవరాసులు, మొక్కలు, పొదలు, అడవులు, కొండలు, సముద్రం, సముద్ర ప్రాణులు కూడా నేనే. బ్రహ్మోకత్వం పొందుటచే అవన్నీ నాకన్నా వేరుగా ఉండవు. ఇవ్వటం, పుచ్చుకోవటం, ముడుచుకోవటం, నింపటం, కదలటం, వదలటం, మొదలైన ప్రాణి ధర్మములన్నీ నేనే అయి ఉన్నాను. చిదాత్మరూపుడనై విభిన్న రూపములను ధరించి లతలందు, కాండలందు, విత్తనములందు, అంకురములందు తిష్ఠవేసుకొని ఉంటున్నాను. ఇదంతా చిదాంతర్గతమై నా స్వరూపమే అయి ఉన్నది. శాంతరసాత్మకమగు పరబ్రహ్మమునైన నేను అంతటా అన్నిటా అనవరతమూ జాజ్వల్య మానంగా వెలుగుచున్నాను. 'సర్వమేకాత్మ పరంబ్రహ్మ' అను నిశ్చయము కలిగి ఉండుటచే వేదములు ఉపయోగించే సశబ్దములగు 'చిదాత్మ, బ్రహ్మము, సత్యము, సత్, అమృతము, జ్ఞానము, శివము, శాంతము, అద్వైతము, సర్వము' మొదలైనవి నాపట్ల సముచితములౌచున్నాయి. వేదాలు - ఉపనిషత్తులు నా స్వరూపగానమే చేస్తున్నాయి.
సర్వమేకాత్మ పరంబ్రహ్మజ్ఞాన స్వరూపుడనగు నేను సర్వముగాను, కేవల చిన్మాత్రము గాను, బాహ్యానికి అభాసమాత్రం గాను, అమలం గానూ, సర్వభూతాత్మబోధకం గాను, సర్వత్రా వెలయు తత్త్వము గాను, శాంతము గాను, చైతన్యము గాను, చిద్రహ్మము గాను ఏర్పడి ఉన్నాను.
మనోబుద్ధ్యాది అన్ని ఇంద్రియవ్యాపారములందు అనుశ్రుతంగా స్వప్రకాశస్వరూపంగా, విభేద రహితంగా ప్రవేశించియున్నాను. శబ్ద స్పర్శాదులతో నిర్మించబడిన ఈ జగత్తుకు మూలకారణంగా, అక్షయ స్వరూపుడనై ఉంటూ ఇంద్రియ ద్వారముల నుండి సంకల్ప-వికల్ప రూపములుగా ప్రసరిస్తున్నాను. తెంపులేని తేజోపుంజములతో అనామయమగు చిద్రహ్మముగా లోపల, బయట ప్రసరించుచూ నేను నేనుగానే వెలుగొందుచున్నాను.
యోగిపుంగవులు మౌనవ్యాఖ్యల ద్వారా ప్రకటిస్తున్న పరబ్రహ్మతత్త్వాన్ని నేనే. నిత్యానుభవ స్వరూపుడనగుట చేత నా స్వరూపమును ఎవరూ ఎక్కడా తిరస్కరించజాలరు. సమస్త కర్మచక్రములు నా వలననే ప్రవర్తించుచున్నాయి. నిర్లిప్తము, సుషుప్తి సదృశము, చిద్ర్బహ్మము అగు నా రూపమే వనములలో ప్రశాంత స్వరూపంగా వెల్లివిరియుచున్నది. ఒక పురుగు అనుభవించే ఆనందము నుండి బ్రహ్మదేవుని ఆనందం వరకూ గల అన్ని ఆనందములూ నా అనంతానంద సముద్రంలోని కణలేశము మాత్రమే. నాయొక్క బ్రహ్మానంద సాగరములోని కొన్ని చిన్న కణములు ఈ భూత భవిష్యత్ -వర్తమాన బ్రహ్మాండములుగా, దేశకాల పరిచ్ఛన్నములగు ఖండ-సుఖములుగా ఒకింత ప్రతిబింబిస్తు న్నాయి. కాముకుడగు జీవుడు చంద్రుని చూచినప్పుడు, అందమైన స్త్రీ నాసాగ్రం చూచినప్పుడు
Page:36
ఏర్పడే ఆహ్లాదం నా అవిచ్ఛిన్నసత్తాత్మక నిర్విషయ చిద్రూపానందం యొక్క ఒక అల్పకణము మాత్రమే. రాత్రిపూట పూర్ణచంద్రుని చూస్తున్నప్పుడు ఆ చూచువాని చూడబడే చంద్రుని మధ్య ఏర్పడి ఉన్న నిర్విషయ చిదానందమును నేనే.
నా స్వరూపమునకు సుఖ దుఃఖ - కల వికలనములు లేవు. నిర్మల సత్యానుభవరూపాత్మకమైన చిత్ బ్రహ్మాత్మను కదా! దూరంగా ఉన్న వస్తువులను దర్శింపజేయుచున్న పంచభూతాల సమ్మేళనముల మేళవింపుకు కారణమగుచున్న తత్త్వశక్తిని నేనే. ఖర్జూరము మొదలైన మధుర ఫలాలలోని మాధుర్యం అను రసశక్తిని నేనే. ఏ చితశక్తి జీవుని రూపంలో అత్యంత సామాన్యములగు సుఖదుఃఖములను పొందుచున్నదో, అది చితశక్తిస్వరూపుడనగు నన్ను ఎరుగుటచే వినిర్ముక్తమగుచున్నది. జ్ఞాన-అజ్ఞాన ఉభయ స్థితులలోనూ, ఉభయ స్థితుల మధ్య నెలకొనియున్నది నేనే.
నేను లాభాలాభములకు, సుఖదుఃఖములకూ అందువాడను గాను. సమత్వముచే అప్రసంగ వ్యవహారం, నిరాకారం, భేదానందాతీతం - అగు చిద్రసబ్రహ్మమునే గాని, మరింకేమీ కాను. భూమి-సూర్యుల మధ్య ఏర్పడి ఉన్న ద్రష్ట యొక్క నిర్విషయ దృష్టిని, శాంతచిత్స్వరూపుడను నేను.
జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో అధ్యస్తము, అతీతము (Inside Placed - Placed beyond) అయినట్టి తురీయము అనబడు అనామయ చిత్ర బ్రహ్మాత్మక రూపం నాదే. నేను ఈ అసంఖ్యాక జీవరాశులనబడే క్షేత్రాలలో సమస్థితుడనై ఒప్పారుచున్నాను. జ్ఞాన ప్రకాశవంతమగు నా చిద్రూపము అత్యంతమనోహరము. సంభోగానందలవము, అమృతాస్వాదన మాధుర్యము ఎవరికీ మాటలలో చెప్పనలవి కానట్లు స్వాత్మానుభవేకవేద్యమగు నా బ్రాహ్మీస్వరూపమును ఎవరూ ఎన్ని వాక్యములు ఉపయోగించినా చెప్పజాలరు.
తామరతూడులలో దారం పైకి కనబడకుండా లోపల ఉండి ఆ తూడు నిలచుటకు కారణమగు చున్నది కదా! ఆధారము పరిశీలనాత్మకదృష్టికి మాత్రమే అగపడుచున్నది. అట్లాగే అన్ని శరీరములలో ప్రసరించి ఉండి, ఆ ఆ శరీరములు నిలచుటకు కారణమై, విచారించినవారికి మాత్రమే సుస్పష్టమగుచున్న చైతన్య స్రవంతిని నేనే. సమస్తభువనములూ పూర్ణంగా ఆక్రమించుకొని ఉన్నప్పటికీ ఈ భువనాలలోని వస్తుజాలములకు నేను దుర్లక్ష్యమే అయిఉంటున్నాను.
మేఘమాలను స్పందింపజేస్తున్న చిదానందరూపుణ్ణినేనే! ప్రేమాస్పదంగా కనిపించే అంతటి లోనూ, పాలలోని నేయివలె అంతర్లీనమై, అంతః స్నేహంగా ఉపలక్షితమై అనుభూతియోగ్యమగుచున్న చిచ్ఛక్తి నేనే. పాలలో నేయి అంతటా వ్యాపించి ఉన్నట్లు 'క్షయం' అంటూ లేనట్టి చిత్ ఈ సృష్టి అంతా నేను నిండి ఉన్నాను. పర్వత పదార్థముల లోపలా, వెలుపలా సర్వదా సర్వగతమై వెలయు సత్తా సామాన్యం నా స్వరూపమే. దర్పణంలాగా సర్వమును తనయందు ప్రతిబింబింప జేయగల సర్వగత బ్రహ్మము అనగా నేనే గాని, మరింకొకటేదో కాదు.
#
ఎట్టి మాలిన్యములకూ చోటు ఉండనట్టి శుద్ధచిత్ స్వరూపుడను కదా! నా స్వరూపము సర్వ తేజస్సులనూ ప్రకాశింపజేయునట్టిది. సర్వ సంకల్పములనూ ఫలింపజేయునట్టిది. ఈ సర్వము
Page:37
నాదే కనుక సర్వలోభములకూ నేను పరాకాష్ఠ కూడా. అట్టి నా యొక్క నిత్యస్వరూపమును నేను ఆరాధిస్తున్నాను. సాధన సమయంలో బాహ్యంలోని వస్తువును భగవానునిగా ఆరాధించాను. ఇప్పుడు నా ఆరాధ్యం నేనేనని గ్రహిస్తున్నాను. ఆరాధకుడు, ఆరాధన ఆరాధ్యం కూడా నేనే. నేను, తదితరులు కూడా ఉపాసిస్తున్నది నన్నే.
అట్లు నా ఆరాధ్యమగు స్వస్వరూపమే కుండ, వస్త్రము, తటాకము, గొయ్యిలందు కూడా సద్రూపముగా వెలుగొందుచున్నది. అండజ- స్వేదజ - - జరాయుజ - ఉద్బీజ జీవులలోని చైతన్యము అదే! నా సత్వబుద్ధనిత్య స్వరూపము జాగ్రత్ దశలోకూడా సర్వవిశేషాతీత్వకారణంగా నిర్వికారమై ఉండుటచే ‘నిత్యనిద్రితం’ అనటానికి కూడా అర్హమగుచున్నది. గాఢనిద్రలో ఏ క్షణంలోనైనా జాగ్రత్న స్వీకరించటానికి నిత్యసిద్ధమై ఉండుటచే 'నిత్యజాగ్రత్' అని కూడా చెప్పబడటానికి అర్హమగుచున్నది.
ఈ జగత్తులో అనేక జీవులచే అనేక నామరూపములతో మంత్ర - తంత్రములతో ఉపాసించ బడుచున్నది ఏదైతే ఉన్నదో, అది నా స్వరూపమే అయి ఉన్నది. అగ్నియందు ఉష్ణం గాను, మంచు నందు చల్లదనం గాను, అన్నము నందు మాధుర్యం గాను, కత్తియందు వాడి గాను, చీకటియందు నలుపు గాను- పైకి కనిపించక అనుభవరూపమున స్ఫురించుచున్నాను. అట్టి సర్వాంతర్యామియగు నన్ను నేనే ఉపాసించుకొనుచున్నాను. ఉపాసించబడుచున్నాను.
వెలుపలా, లోపలా వెలుగుచూ అత్యంత సామీప్యమున ఉండిన నా ఆత్మస్వరూపమును ఎరుగకపోవుటచే నేను ఇంతకాలం అజ్ఞానినై ఎక్కడెక్కడో వెతికాను. ఏవేవో మార్గాలలో ఉపాసించాను. సర్వసంకల్పములకు అతీతమై సర్వ సంరంభములకు ఆవల ఉండి, కామ క్రోధ-భోగ ంక్షలకు విరహితమై, కారణరహితమై, నిరహంకారమై... ఏ నా సత్యస్వరూపమైన చిదాత్మ కలదో, అద్దానికి మరల మరల నమస్కారం. నమస్కారం!
నా స్వరూపమే అన్నిటా వెలయుచూ నిర్లిప్తంగా ఆద్యంతరహితంగా ఏకరస స్వరూపంగా ఏర్పడి ప్రకాశిస్తోంది కదా! అద్దానిని సూక్తములచే భజిస్తున్నాను. మూడులోకములలోని ముక్త పురుషులచే గానము చేయబడుచు, అన్నిటా ప్రతిబింబించుచూ, జాగ్రత్లో ఇంద్రియములను ఉపయోగిస్తూ, స్వప్నంలో ఊహయందు సంచారం చేస్తూ, సుషుప్తిలో నిశ్శబ్దమగుచు, బహిరంగంలో జగత్తులనూ, అంతరంగంలో సంకల్పములనూ ఉంచుకొని ప్రచ్ఛన్నంగా ఉండి ఉండే ఆ చిదాత్మను నేను సర్వదా పొందియే ఉన్నాను. అది సృష్టికాలంలో సర్వసత్తలు కల్పించుకుంటోంది. ప్రళయ కాలంలో ఆ సర్వసత్తలు తన యొక్క అసత్ యందు లయం చేసుకుంటోంది. అట్లు సర్వసత్తలు తన యందు లయం చేసుకొనే ఆత్మసత్త ఇప్పటికే నేనైయున్నాను. నేను అదై ఉన్నాను. అది నేనై ఉన్నది. అదియే నేను. సో హమస్మి!
సర్వ రూపములందూ విహరించుచూ, సర్వమునకూ స్నేహధారియై, తన అధోభాగమున భావాభావములను రచించుకొనుచూ, అవి లేనప్పుడూ చలన రహిత నిశ్చల దీపంలాగా ఉంటూ, నిరుపాధిక ప్రేమకు స్థానము, ఆధారమూ అయి ఉంటూ, అవివేక దృష్టిచే జడదేహ ధర్మములు
Page:38
ఆపాదించబడుతూ, ముక్తులకు ముక్తస్వరూపమున గోచరిస్తూ, 'చిత్' దీపమై ఉన్న నన్నే అందరూ అన్నిటా ఉపాసిస్తున్నారు. అట్లు ఆరాధించేవారు, ఉపాసించేవారు నాకు వేరైనవారు కారు.
‘జీవము’ అనే తటాకంలో 'హృదయము' అనే పద్మమునందు రహస్యంగా దాగి “కాళ్లు-చేతుల కదలికలు” అనే బాహ్యప్రదర్శనా సదృశమైన 'చిదాత్మ' అనబడే నా పరరూపమునకు నా జీవరూపముచే భక్తితో సాష్టాంగ ప్రణామములు చేస్తున్నాను. ఆ చిదాత్మ ఎక్కడో పుట్టినది కాదు. దాని యందు ఏదీ జనించుటలేదు. ఎవరి చేతా హరింపబడేది గాదు. అది పూర్వమూ ఇప్పుడూ ఎప్పుడూ సత్యతత్త్వమై వెల్లివిరిసియున్నది. అది శబ్ద-స్పర్శ రూప-రస-గంధముల రూపమున ఒకచోట కించిత్ అభివ్యక్తమగుచూ... మరొకచోట ఆత్మజ్ఞానుల హృదయ స్థానంలో శాంతి వహించి ఉంటూ నదిలో గల వివిధ స్థానములలోని జలంలాగా అన్ని స్థితులలోనూ ఒక్కటే అయి ఉన్నది. ఆకాశకోశం వలె బట్టబయలే అయి ఉన్నది. సర్వలోకములకూ నామరూపములను ఒసగుచూ, తాను మాత్రం నామరూప రహితమై ఉన్నది. మహామహిమశాలి అయిఉండి కూడా తన యొక్క అజ్ఞాన విభాగముచే ఉపాధులలో ప్రవేశించి తన ముంగిటే తాను 'ఆశ' అను భిక్షం ఎత్తుచూ 'ఆదిభిక్షువు' అని అనిపించు కుంటోంది. సర్వమునకు కర్త అయి ఉండి వాస్తవానికి అకర్తగానే ఉంటోంది. అట్టి సర్వాత్మనే ఇంకా ఇంకా ఉపాసిస్తాను. ఆస్వాదిస్తున్నాను.
అదియే నేను. నేనే అది. నాఉపాసన నా కొరకే! ఉపాస్యము నేనే! సరే, ఉపాసకుడను నేనే నని చెప్పాలా...?
నేను సకల ప్రపంచరూపుడను. ఇదంతా నాదే. ఇన్ని ఉపాధులలోనూ అహంకారముగా ఒప్పుచున్నది నేనే. అయినా కూడా నేను మరేదీ అగుటలేదు. నా తత్త్వమేమిటో తెలిసిన నేను ఇక సర్వరుగ్మతలనుండి విముక్తుడను. ఈ జగత్తు కృత్రిమమగు మాయ అగుగాక. లేక, సత్యమే అగుగాక! రెండు అవగాహనలలోనూ 'అవగాహనాసాక్షినై' నేను ఉండనే ఉన్నాను.
ఇంతకుమించి నా గురించి నేను చెప్పుకోవటానికి మాటలు లేవు. చాలవు.
ఓ రామచంద్రా! చూచావా! శివకేశవులు, జనకాది తదితర మహనీయులు ఇట్టి అవగాహన సృష్టీకరించుకొని, అటుపై ఈ సృష్టిలో తమతమ విహితమగు కార్యములను నిర్వర్తిస్తున్నారయ్యా! మనం చెప్పుకున్నదంతా ప్రతి ఒక్కరి యొక్క స్వస్వరూపమునకు సంబంధించిన నిర్వివాద సత్యము. ఎవ్వరైనా ఈ స్వస్వరూపస్తోత్రం పఠించుటచే సత్యసంకల్పులగుచున్నారు. ప్రతిఒక్కరు స్వస్వరూప భావము పొందుటకు అర్హులే అయి ఉన్నారు సుమా!
స్వస్వరూపమునకు, తదితరంగా ఉంటున్న వికల్పములన్నీ స్వయంకల్పిత నిరోధములే గాని మరింకేమీ కాదు.
Page:39
13. ఆత్మానుభూతిపరులు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవన్ముక్తులగు జనకుడు మొదలైనవారి ఆత్మావగాహన ఏమిటో నీకిప్పుడు విశదీకరించి చెప్పాను. వాళ్లంతా ఎట్లా విగతజ్వరులై సత్యములలో కెల్లా సత్యం, శాంతం అయిన పదమున వెలయుచున్నారో గమనించావు కదా! ఆ విధంగా వారు పరిపూర్ణాత్మను పొంది, సమబుద్ధులై సర్వాసక్తులనూ త్యజించి, నిర్లిప్తులై నిరహంకారులై జీవన్మరణాలకు నిందాప్రశంసలకు పట్టుబడక ఈ జగత్తులో యథేచ్ఛగా సంచరిస్తున్నారయ్యా! స్వభావ సిద్ధంగానే వినమ్ర స్వభావులై, మేరువు వలె ధీరులై, సర్వ ఉత్ప్రేక్షలను (Sense of Comparisons) త్యజించి, సూక్ష్మలక్ష్యమును భేదించిన వారై ఈ ప్రపంచంలో విహరిస్తున్నారు. అంతరంగము నిండా 'సమ దృష్టి'ని నింపివేసి ద్వీపములందు, దేవతోద్యానములందు, తూగుటుయ్యలలందు, పర్వత స్థాణువు లందు, వీధులందు, గృహములందు నిశ్చింతగా చరిస్తున్నారు. అట్టి మహనీయులలో కొందరు ఛత్ర చామరములు కలిగియుండి ధర్మార్థకామములకు సంబంధించిన ఆయా కార్యక్రమములు నిర్వర్తిస్తూ రాజ్యములు ఏలుచున్నారు. మరికొందరు వేద స్మృతులచే నిర్దేశించబడిన శిష్టాచార క్రియలను తాము నిర్వర్తిస్తూ, తదితరుల చేత నిర్వర్తింపజేస్తూ చరిస్తున్నారు. ఇంకొందరు మౌనము వహించి తమ సమున్నత భావతరంగములచే ఈ జగత్తుపై అవ్యాజమైన ప్రేమ స్రవింపజేస్తున్నారు. ఇంకొందరు ఈ జగత్తులోని దుష్టస్వభావజీవులను శిక్షిస్తూ, సాత్వికులకు రక్షణ కల్పిస్తూ ‘యుద్ధము’ మొదలైన అనేక అవిశ్రాంత వ్యవహారములు నిర్వర్తిస్తున్నారు. వారంతా నిర్భయులై శత్రుభావరహితులై, ప్రశాంతచిత్తులై ఉంటున్నారని గ్రహించు. స్త్రీ, హాస్య, ఆహార, విహార, భోగ్య, అభోగ్యాలలో తదితర జీవులలాగానే కనబడుచున్నప్పటికీ వారు సమచిత్తులై, జ్ఞానమునుండి తొలగనివారై ఉంటున్నారు.
అట్టి ఆత్మోత్కృష్టలబ్ధులలో కొందరు ఉద్యానవనములలో విహరిస్తూ అప్సరస గీతములను వింటున్నారు. ఈ విశ్వామిత్రాది మరికొందరు సర్వజనుల క్షేమసుఖములను ఉద్దేశించి వేదనిర్దేశితమైన యజ్ఞ యాగాదులు నిర్వర్తిస్తున్నారు. ఇంకొందరు గృహస్థాశ్రమంలో ఉంటున్నారు. ఇంకా కొందరు భయంకర యుద్ధభూమిలో ఉంటున్నారు. ద్వంద్వయుద్ధంలో పాల్గొనుచున్నారు. వాళ్లు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా... తమ మనస్సునందు మాత్రం ఎట్టి ఆసక్తిలేక, ఉపాధి శూన్యులై స్థిర-శాంతి-సత్వ పదమును అధిరోహించి ఉంటున్నారు. కులశైలములు సముద్రంలో మునుగు గాక! ఆ ఆత్మైక్య స్వరూపులు ఈ ప్రపంచంలో తారసపడే సంఘటనలలోనూ, సంకటములలోనూ మునుగరు. ఈ మహదైశ్వర్యములు వారిని తాకవు. నిశ్చలులై సర్వదా చిరునవ్వుతో సంచరిస్తున్నారు. రమణీయము, విలాసపూర్ణము అగు ఆత్మసామ్రాజ్యం పొందిన తరువాత ఈ జగత్తులోని ఆటుపోట్లు ఎంతటివి? వనంలో గ్రీష్మకాలమందు బంతిమొక్కలు వాడినట్లుగా వారు మానము పొందరు. మంచుచే లతలు విస్తరించినట్లు వారు విషయ భోగసమూహములను చూచి ఆనందించరు. నిందించరు. శ్రీరాముడు : వారికి అట్టి పరమోత్కృష్టమగు అవగాహన అలవడుటకు ముఖ్యమైన కారణం ఏది?
Page:40
శ్రీవసిష్ఠ మహర్షి : కర్తృత్వాభిమానం జయించి ఉండటం చేతనే వారికదంతా సాధ్యమగుచున్నది. వారు అంతా గ్రహిస్తూనే ఏదీ పొందటం లేదు. కోల్పోవటం లేదు. కార్యములు ఆచరిస్తున్నప్పుడు శత్రువులను జయిస్తున్నప్పుడు పొంగటం లేదు. శత్రువులచే ఆక్రమించబడుచున్నప్పుడు క్రుంగటం లేదు. సుఖదుఃఖములు రావచ్చుగాక! పోవచ్చు గాక! అవి వారికి హర్షకోశములు కలిగించలేక పోతున్నాయి. ఆత్మైక్యానుభూతిపరులై ఉండటం చేత ఇక్కడి విపత్తులు చూసి మోహించటం లేదు.
అవి తొలగగానే కేరింతలు కొట్టటం లేదు. చిన్నపిల్లలు గంతులేస్తుంటే ఇంటి యజమాని చిరునవ్వుతో చూస్తూ పట్టించుకోకుండా ఉండునట్లు అతడు ఈ జగద్వ్యవహారములను చూస్తున్నాడు. తమ వర్ణాశ్రమధర్మాలను ఆచరిస్తూ నిష్క్రియమగు అపరమేరువువలె ధీరత్వం వహించి ఉంటున్నాడు.
ఓ రామా! నీవు కూడా ఈ క్షణమే సర్వదోష వినాశనమగు ఆత్మైక్యదృష్టిని అవలంబించు. ఈ దృశ్యమునకు సంబంధించిన అల్పాహంభావనమును వదలిపెట్టి 'ఆత్మా-హమ్' కార భావనను పూని ఎప్పటివలె విహరించు. ఈ సర్గ పరంపరలను యథాదృష్టితో అవలోకించుచు, మేరువు వలె స్థిరత్వమును, సముద్రము వలె గాంభీర్యమును వహించి భ్రమరహితుడవై వెలయుము. అంతే గానీ, అట్టి సర్గముల వెంటబడవలసిన అవసరం నీకేమున్నది? ఈ కనబడేదంతా ప్రకాశపూర్వకమగు చైతన్యము మాత్రమే కదా! ఇక్కడ సత్యాసత్యములు అయినవి గాని, కానివిగాని, మరింకొకటేదో గాని లేవు. సంసారద్వైతభావము క్షయింపచేయి. భ్రాంతిబుద్ధిని జయించు. అనాసక్త బుద్ధిని ఆశ్రయించిన వాడవై బ్రహ్మత్వమును అవలంబించు. అంతేగాని, ఈ సంసారమును చూచి ఉద్విగ్నుడవై శోకమోహాలు పొందకు. భ్రాంతిచే లేచుచున్న ‘చిత్తభ్రమలు' అనే గడ్డిపరకలచుట్టూ నీ మనస్సు
ఎందుకు తిరుగాడాలి?
శ్రీరాముడు: హే భగవాన్! వసిష్ఠమహర్షీ! సూర్యకిరణస్పర్శచే వికసించే పద్మంలాగా తమ అనుగ్రహం చేత ఇప్పుడు నేను ప్రబోధితుడనైనాను. ఆహా! ఏమి ఆశ్చర్యం! మీ వాక్య ప్రభావం చేత హృదయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న మోహం కూడా తొలగుతోంది. ఎండవేడికి మంచు కరుగునట్లు భ్రాంతి తన నామరూపాలతోసహా తొలగుతోంది. సందేహాలు కనపడటమే లేదు.
ఇక మీరు ఎట్లా సెలవిస్తే అట్లే చేయటానికి సిద్ధంగా ఉన్నాను.
హే సాధూ! ఇన్నాళ్లకు నా మోహ మాత్సర్యములు తొలగి, శోకరహితుడ నయ్యాను. ఇప్పుడే ఇక్కడే ఆత్మస్వరూపుడనై వెలయుచున్నాను. 'నేను బద్ధుడను, మోక్షమును సంపాదించాలి’ అను భ్రమవాక్యాలు తొలిగాయి. ఇప్పుడు ఏకాంతబుద్ధితో జ్ఞానసంపద ప్రవృద్ధం చేసుకోవటానికి, రాజ్యపాలన చేయటానికి కూడా సంసిద్ధుడనై ఉన్నాను. ఆత్మారాముడనై సర్వేసర్వత్రా ఆత్మరూపంగా ఆక్రమించి విరాజిల్లుచున్నాను.
Page:41
II. ప్రాణ నిరోధ యోగోపదేశము భుశుండోపాఖ్యానం
1. యోగసాధన - - జ్ఞానము
శ్రీరాముడు : హే సద్గురు బ్రహ్మన్! శ్రీవసిష్ఠ మహర్షీ! ఈ నిర్వాణ ప్రకరణ పరిచయ వాక్యాల రూపంలో మీరు చెప్పిన ప్రారంభ విశేషాలు వినిన తరువాత 'సమ్యక్ జ్ఞానఫలమగు జీవన్ముక్తిని ఎట్లా సంపాదించవచ్చు?' అనే విషయం తెలియుచున్నది.
ఇంతవరకూ 'జ్ఞానార్జన ద్వారా ముక్తి ఎట్లా సంపాదించవచ్చు?' అన్న విషయం మీరు ప్రవచించారు. అయితే 'ప్రాణస్పందనమును నిరోధించి వాసనావిలయమును, జీవన్ముక్తిని ఎట్లా సంపాదించవచ్చు?’ అనే విషయం వినాలని ఉన్నది. ప్రాణనిరోధం ఎట్లు చిత్తశాంతికి ఉపకరిస్తోందో చెప్పమని ప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : 'యోగము' అనేది సంసార విముక్తికి తరుణోపాయమని మనం ప్రతిపాదించు కుంటున్నాం కదా! చిత్తమును ఉపశమింపజేయగల అట్టి యోగము రెండు విధములు1. ఆత్మజ్ఞాన విచారణ (జ్ఞాన యోగం), 2.ప్రాణములను నిరోధించటం (ప్రాణాయామ యోగం) శ్రీరాముడు : మహాత్మా! ఈ రెండింటిలో ఏది సులభం? ఏది తక్కువ క్లేశంతో సుసాధ్యం? ఏది రమ్యమైనది? దేని వల్ల త్వరగా సర్వదుఃఖాలు నశిస్తాయి? 'యోగ' శబ్దానికి అసలైన అర్థమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : ‘యోగము' అను శబ్దాన్ని జ్ఞాన సముపార్జన, ప్రాణ నిరోధం - అను రెండింటికీ శాస్త్రములు ఉపయోగిస్తున్నాయి. చిత్తముయొక్క ఆ వృత్తిని ఏ మార్గంలో నిరోధించగలిగితే అదే 'యోగం' అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అయితే సాంఖ్యశాస్త్రానుసారం యోగము' అను శబ్దానికి ‘ప్రాణనిరోధం’ అను దానికే ముఖ్యంగా ఉపయోగించబడింది. ఈ జ్ఞాన - - ప్రాణనిరోధాలు రెండూ వేదజ్ఞులచే రెండు ఉపాయాలుగా ప్రతిపాదించబడుచున్నాయి. ఈ రెండూ చివరికి ఒకే అంతిమ ప్రయోజనానికి దారి తీస్తాయని సాంఖ్యశాస్త్రంతో సహా సకల శాస్త్రాలు ఒప్పుకుంటున్నాయి.
కొందరికి యోగం అసాధ్యంగానూ, కష్టతరంగానూ కన్పట్టుచున్నది. మరికొందరి అనుభవం మరొక రీతిగా ఉంటోంది. వారు జ్ఞాన విచారణ కష్టసాధ్యమని, ప్రాణ నిరోధం లేకపోతే నిశ్చలత్వం అసాధ్యమని అభిప్రాయం ప్రకటిస్తున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : 'జ్ఞానవిచారణ' అనేది సకల జనులకూ సుసాధ్యమేనని నేను తలచుచున్నాను.
Page:42
వివేకముతో కూడిన తీవ్ర విచారణచే అజ్ఞానము ఒకసారి దూరం చేయబడిందా... ఇక అది
కలలో కూడా మరల కనిపించదు.
జ్ఞానము సర్వదా ఈ జీవుని యందు వెలయుచునే ఉన్నది. విచారణచే అజ్ఞానము తొలగితే చాలు... ఇక జ్ఞానం స్వయంగా ప్రకాశించగలదు. దానికొరకై ప్రాణనిరోధం, హఠయోగం వంటి ఆర్భాటాలు తప్పక ఆచరించవలసినవి కాదని నా అభిప్రాయం. 'ప్రాణనిరోధం' అను కార్యక్రమంలో ఆసనము, అనుకూలమైన ప్రదేశం, నియమ- నిబంధనములకు సంబంధించిన క్రమక్రమం ఉంటాయి కదా! జ్ఞాన విచారణ ఎక్కడైనా, ఎప్పుడైనా చేయ తగ్గది.
మరొక్క విషయం. ప్రాణ నిరోధయోగ నియతి యొక్క పరాకాష్ఠ, పరిసమాప్తి జ్ఞాన సముపార్జన తోనే సుమా! ఇంకొక్క ముఖ్యవిషయం కూడా విను. తీవ్ర సంవేదన (A Strong wish to reach the sense of self) ఉన్నవారికి 'ఏది సుసాధ్యం? ఏది కష్టతరం'... అనే ప్రశ్న ఉదయించదు. ఎందుకంటే ఈ రెండిటి మేళవింపుచే పోనుపోను కేవలానుభవము శేషించగలదని అనేకమంది సాధకుల నిత్యానుభవం.
నీకు ఇంతవరకూ అంతఃస్థమగు 'నిర్మలజ్ఞానము’ యొక్క స్వరూప స్వభావాలేమిటో ఎక్కువగా చెప్పుతూవస్తున్నాను కదా! అయితే ప్రాణాపాననిరోధము జ్ఞానకాముకులకు 'ఆత్మ' సాక్షాత్కార హేతువు కాగలదు. అది ఆకాశగమనము వంటి కొన్ని భౌతికమైన విద్యలకు (అష్టసిద్ధులకు కూడా కారణం కాగలదు. దేహాన్ని ఆశ్రయించి నిర్వర్తించబడే అట్టి ప్రాణనిరోధయోగం గురించి చెప్పుచున్నాను విను.
అభ్యాసపూర్వకమైన ప్రయత్నం చేత ప్రాణాపానాలు వశం కాగలవు. అవి నిరోధించబడుచున్న కొలదీ చిత్తంలో సమత్వానుభవం అధికమౌతూ ఉంటుంది. ప్రాణచలనం స్థిరత్వం పొందుచుండగా వాసనలు క్షయిస్తున్నాయి. చిత్తవృత్తుల ప్రకోపం సన్నగిల్లుతూ ఉంటుంది. అట్టి అభ్యాసం చేత చిత్తం కొండలా స్థిరబడుతుంది. గాలి చెట్లను కదల్చవచ్చునేమోగాని కొండను కదల్చగలదా?... అట్లాగే దృశ్యములు ఆ సాధకుని చిత్తమును చలింపజేయలేవు. ఇట్టి నిశ్చల చిత్తస్థితిలో వాక్కుకు అగోచరమైన, సర్వనిర్వచనములకూ అతీతమైన పరమానందస్థితి లభిస్తుంది. అతడు అనంతాత్మైక్య స్థితిని అధిరోహించగలడు.
చిత్తవృత్తులే జగత్తు. చిత్తవృత్తిరాహిత్యమే సర్వవేదాంత సిద్ధాంతసారం.
అట్టి ఉత్కృష్ట స్థితి జ్ఞానవిచారణ-ప్రాణనిరోధములనబడే రెండింటివలనా సాధ్యమే. స్థిర సంకల్పము నిస్సంకల్పమునకు దారి తీస్తుంది. నిస్సంకల్పం లభించిన తరువాత ఇక ఏ ప్రయత్నముల అవసరమూ ఉండదు. సర్వత్యాజ్యం వలన నిత్యము - - అఖండము - అప్రమేయము అగు ఒకానొక ఉత్కృష్టానుభూతితో కూడిన అనుభవస్థితి లభించగలదు.
Page:43
2. వసిష్ఠ - భుశుండ సమాగమం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! యోగమార్గము గురించి, తద్వారా సంకల్పశమము గురించి, కాలముయొక్క అతి విచిత్రమైన 'గతి' గురించి, సృష్టిపరంపరల చమత్కారం గురించి విశదీకరించగల ఒక సంవాదమును నీకు వివరిస్తాను. ఈ సంవాదము నాకు 'భుశుండుడు' అను పేరుగల కాకి జాతివాడగు యోగితో జరిగింది. ఆ మహానుభావుని అనుభవములేమిటో చెబుతాను విను.
'పరబ్రహ్మము' అనబడే మహాసాగరంలోని జలకణము వంటి ఒక అల్పవిభాగంలో ఈ జగత్తులన్నీ వెలయుచున్నాయి. ఈ సృష్టికి కారణస్వరూపుడుగా కమల సంభవుడగు బ్రహ్మదేవుడు వెలయుచున్నారు. అట్టి బ్రహ్మదేవుని యొక్క సంకల్ప మానస పుత్రుడను నేను. తపోధ్యానముల బలం చేత సప్తర్షిమండలంలో స్థానం సంపాదించాను. వైవస్వత మన్వంతరం వరకు నేను ఇట్లే ఉండబోవుచున్నాను.
అట్టి నేను ఒకానొకనాడు ఏదో సందర్భంలో స్వర్గంలోని ఇంద్రసభకు వెళ్లాను. అక్కడి సభలో ఈ నారదుడు మొదలైన మహర్షులందరూ ఉన్నారు. అప్పుడు జరిగిన ప్రసంగంలో 'చిరంజీవత్వం' గురించి సంభాషించుకోవటం జరిగింది. అప్పుడు శతతాపుడు అనే పేరుగల ముని లేచి నిల్చున్నారు. ఆయన “మాననీయుడు, ప్రమాణకుశలుడు, అవసర మాత్ర ప్రసంగి" అని ప్రసిద్ధి. సభంతా నిశ్శబ్దమైనది. శతతాపముని ప్రసంగించటం ప్రారంభించారు.
శతతాపముని : ఓ సభికులారా! మీరంతా 'చిరంజీవత్వం' గురించి అనేక విశేషాలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో ప్రత్యక్షసాక్షియగు ఒక చిరంజీవుని గురించి చెబుతాను వినండి.
మేరు పర్వతం యొక్క పద్మరాగమయమైన ఒక శిఖరం ఉన్నది. ఆ శిఖరంపై కల్పతరువు ఉంది. దానిలో దక్షిణంగా ఒక ప్రాంతంలో బంగారు లతలతో నిర్మించబడిన ఒక పెద్ద పక్షులగూడు ఉన్నది. ఆ పక్షులగూడులో 'భుశుండుడు' అనే ఒక కాకి ఉన్నది. ఆ కాకి తన హృదయంలో ఎట్టి రాగం లేనిదై ఉన్నది. ఆ వాయసమును పోలిన చిరంజీవులు భూమి మీదగాని, తదితర లోకాలలోగాని మరొకరు ఉండరు... ఉండబోరు. అతడు మహామతి, ఆసక్తిరహితుడు, శ్రీమంతుడూ కూడా! అతడు శాంతుడై, మనస్సును జయించిన వాడై, త్రికాలవేత్త అయి పరమ విశ్రాంతి అనుభవిస్తూ దీర్ఘకాలం గడుపుతున్నాడు. అట్టి వికల్పరహితమగు జీవనము పొందటమే ధన్యం. అతని వంటి పరమ పురుషార్థమగు యోగజీవనము అత్యంత దుర్లభమని నా అభిప్రాయం.
ఆ శతతాపముని భుశుండిని దృష్టాంతంగా తీసుకుని చిరంజీవత్వమునకు సంబంధించిన అనేక విశేషాలు ముచ్చటించారు. అప్పుడు సభ్యులడిగిన అనేక ప్రశ్నలకు వివరణ కూడా ఇచ్చారు.
సభ ముగిసింది. సభలోని వారంతా తమతమ నివాస స్థానములకు జేరుటకు బయలుదేరారు. నాకు మాత్రం శతతాపముని చెప్పిన భుశుండుని దగ్గిరకు స్వయంగా వెళ్లి సంభాషించాలని,
Page:44
‘యోగము' గురించి వివరణాత్మకంగా ఆయన చెప్పే విశేషాలు తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. తిన్నగా మేరు పర్వత శిఖరాగ్రం వైపుగా బయలుదేరాను.
బ్రహ్మ - విష్ణులోకములకు ఆలవాలమైన ఆ మేరుశిఖరం యొక్క అగ్రభాగంలో గల ఒక ప్రదేశంలో కొన్ని కాకులు సభదీర్చి ఉన్నాయి. భుశుండ వాయసము సభా మధ్యంలో ఉంది. వారు తాత్త్విక విషయములు సంభాషించుకుంటున్నారు. నన్ను చూడగానే మహామహుడగు ఆ భుశుండ వాయసము దిగ్గున లేచి నన్ను సమీపించి, తన సంకల్ప జనిత హస్తములతో నాకు పుష్పాంజలి సమర్పించారు. ఆసనం అధిరోహింపజేసి అర్ఘ్యపాద్యములు సమర్పించి కుశల ప్రశ్నల తరువాత మధురాక్షరములతో స్నేహపూర్వకంగా ఇట్లు పలుక ప్రారంభించారు.
భుశుండుడు : హే భగవాన్! వసిష్ఠమహర్షీ! మీకు సుస్వాగతం. నా అనేక జన్మజన్మార్చిత పుణ్యఫలంగా ఈ రోజు మహామహిమాన్వితమగు మీ దర్శనం లభించింది. ధన్యుడనైనాను. మీ పవిత్ర హృదయంలో సర్వదా సర్వసమత్వ అఖండభావన వెలయుచూ, మీ పెదవులు ఎల్లప్పుడూ లోకకళ్యాణమునకు కారణమౌతూ ఉంటాయి. ఈ మాయామయజగత్తులో సంచరించే మావంటి అల్పజ్ఞాన జీవులకు మీ దర్శనం అమృతతుల్యం వంటిది. మీ చరణ దర్శనము చేతనే మీ శుభాగమనమునకు కారణ మేమిటో నాకు తెలియవచ్చింది. మీ పవిత్ర పాదస్పర్శ వలన నేను, ఇక్కడి తదితర వాయసములు గొప్ప పుణ్యం సంపాదించుకున్న వారమైనాము. దేవలోకము నందు ఇంద్రసభలో 'చిరంజీవి' ఐన మా ప్రసంగంరాగా... అది మా పట్ల మీ దర్శనభాగ్యంగా పూలజల్లు కురిసింది.
శ్రీవసిష్ఠ మహర్షి : హే ఉత్తమ విజ్ఞాన సమన్వితుడా! మిత్రమా! భుశుండా! మీ మధురమైన పలుకులు వింటుంటే నాకు ఎంతో సంతోషం కలుగుతోంది. మీరు తత్త్వము ఎరిగినవారు. ఆత్మ దర్శనముచే పునీతులు. భయంకరములగు భవసర్పములు మిమ్ము ఏమాత్రం సమీపించలేక పోతున్నాయి. మీ చిరంజీవత్వం గురించి శతతాపముని దేవసభలో ఎంతో ప్రశంసించి పరోక్షంగా మీ దర్శనం చేసుకోవటానికి అవకాశం కల్పించారు.
ఓ మహానుభావా! మీ చరిత్ర ఏమిటి? ఎచ్చట జన్మించారు? మీ ఆయువు ఎంత? ఎవరిచే నిర్దేశింపబడి ఇక్కడ నివసిస్తున్నారు? ఇంతటి ఆత్మైక్యజ్ఞానం, ప్రశాంత మనఃస్థితి ఎట్లా పొందగలిగారు? ఈ విషయములను నాకు వివరించి చెప్పవలసినదిగా మిమ్ము అర్థిస్తున్నాను. మహాత్ముల చరిత్రలు
వినటం మహదానందకరమగు విషయం కదా!
భుశుండుడు : త్రిలోక పూజ్యులు, సప్తర్షులలో అగ్రగణ్యులు అగు మీరు వినగోరినది తప్పక చెప్ప వలసిందే! మీ వంటి మహనీయులతో సంభాషిస్తేచాలు... మేఘములు వేంచేయగానే సూర్యతాపం తొలగునట్లు మా వంటివారి పట్ల అశుభాలన్నీ వినష్టమైపోతాయి. సావధానులై, ఉద్వేగరహితులై
వినండి.
❖
Page:45
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ తరువాత వర్షమేఘశ్యాముడు, సర్వాంగసుందరుడు, సరళ బుద్ధి సమన్వితుడు, హర్ష మాత్స ర్యరహితుడు, ఈ జగత్తులన్నిటినీ తన చేతిలోని ఫలం వలె చూడ గలుగువాడు, భోగములన్నీ గడ్డిపరకలలాగా పరిత్యజించినవాడు, పుట్టుక, దృశ్యముల రహస్యం ఎరిగిన వాడు, పరాపరదర్శి, ధీరుడు, స్థిరుడు, జ్ఞాన సముద్రంలో విశ్రమించినవాడు, పరిపూర్ణ మనస్కుడు, శుద్ధుడు, విశ్రాంతి పొందిన బుద్ధి కలవాడు, వేదోపనిషత్ పాఠముల అంతర్లీనగాన మేమిటో ఎరిగినవాడు, ఆత్మజ్ఞానం అవధరించినవాడు, ఎల్లప్పుడూ నవశరీరధారి అగు ఆ భుశుండుడు చిరునవ్వుతో గంభీరములు, శుద్ధములు, అమృతసమానములు అగు మాటలతో యోగ సాధనా విశేషం గురించి చెప్పసాగారు. భ్రమరమునకు తేనె ప్రసాదించే పుష్పంలాగా నాకు తన కథను ఇట్లా వినిపించసాగారు.
3. భుశుండుని జన్మవృత్తాంతం
భుశుండుడు : హే వసిష్ఠ మహర్షీ! మొట్టమొదట నా జన్మవృత్తాంతం చెబుతాను వినండి. దేవదేవుడైన ఆ హరుడు కైలాసంలో దేవాభివందితుడై వెలయుచున్నారు కదా! ఒక లత వృక్షమును ఆశ్రయించి ఉండునట్లు జగదంబ, పార్వతీదేవి ఆయన అర్థ శరీరమును ఆక్రమించుకొని ఉన్నది. ఆ సాంబశివుని జటాజూటంలో, గంగామాత అలంకారమై ప్రకాశిస్తూ ఉంటుంది. క్షీరసాగర మథనమున ఉద్భవించిన వాడు. అమృతమును ప్రవహింపజేయువాడు, దర్పణభూతుడు అగు చంద్రుడు ఆ సాంబశివునికి చూడామణిగా అలరారుచున్నాడు. కాలకూటవిషం ఆయన కంఠాన్ని అలంకరించియున్నది. ఆయన ప్రళయకాల సమయములో తన మూడవకంటి చూపుచే లేవదీయబడిన పరమాణుధూళి నుండి ‘మాయ’ అనే వీబూదిని నిర్మించి 'జ్ఞానము' అనే జలముతో తడిపి తన నుదుటన అలంకరించి ఉంటాడు. సర్వ శరీరములలోని అస్థులే ఆయన రత్నహారం. ఆకాశమే ఆయన వస్త్రం. సర్వజీవుల భౌతికదేహములు చేరవలసిన శ్మశానమే ఆయన నివాసం. ఎఱ్ఱటి వస్త్రం కపాలమాల ధరించి ఆయన సంచరిస్తూ ఉంటారు. జీవుల భుజములే ఆయన భుజకీర్తులు. దిక్పాలకులంతటి వారిని దహించుట, ఈ జగత్తునంతటినీ ఆహారపు ముద్దగా చేయుట, అసురులకు భయమును గొలుపు భీషణ నృత్యములు చేయుట మొదలైనవన్నీ ఆయన లీలలు. ఆ పరమేశ్వరుడు సత్య సంకల్పుడు కదా! తన కించిత్ యోచనచే ఈ జగత్తులన్నిటినీ శుభప్రదం చేస్తూ ఉంటాడు. ఆయన విలాసంగా చెయ్యి ఊపినంత మాత్రం చేత త్రిపురములను భస్మం చేయగలిగిన వాడు. ఆయన యొక్క ధ్యాన నిష్ఠ స్నేహ-రాగవర్జితమై, సర్వ భావములకు అతీతమై కొండవలె నిశ్చలంగా ఉంటుంది. ఆ శివుని నివాసంలోనే జయ, విజయ, జయంతి, అపరాజిత, సిద్ధ, రక్త, అంబుస, ఉత్పల - అను అష్టమాతృకలు వసిస్తూ ఉంటారు.
ఆ అష్ట మాతృకలలో ఒకరగు అంబుసకు 'చండుడు' అను కాకి వాహనంగా ఉన్నది.
Page:46
ఒకసారి ఆ అష్టమాతృదేవతలు ఏదో కారణంచేత ఆకాశంలో సమావేశమైనారు. అప్పుడొక గొప్ప ఉత్సవం కల్పించబడింది. ఆ ఉత్సవంలో వారు తుంబుర భైరవులను పూజించారు. తరువాత మధురపానమత్తులై తమలో తాము ఇట్లు సంభాషించుకున్నారు.
“మన అష్టమాతృ దేవతలను ఆ ఉమాపతి కొంత చులకన చేసి చూస్తున్నట్లు మాకు అనిపిస్తోంది. కనుక మనం మన శక్తులేమిటో పరాక్రమములేమిటో చూపించాలి. వారిని వినోదింపజేయాలి. అప్పుడిక ఆయన మనలను చులకన చేయరు. మన పట్ల ప్రేమాస్పదులౌతారు.”
ఇట్లా నిశ్చయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా వారు రుద్రశక్తియగు ఉమ యొక్క వదనమును ఇతర అంగములను తమ మంత్ర బలంతో వివర్ణం చేసివేశారు. ఆ తరువాత వారు శివుని అర్ధాంగమగు ఉమను అపహరించి తమ మండలానికి తీసుకుని వచ్చారు. వారు ఆమెను అవహేళనం చేయలేదు. ఆమెను తమ మంత్రశక్తిచే బలికి తేబడిన జీవిగా సంకల్పించారు. ఆమె ఒక్కొక్క అవయవమును చేబూని నృత్యగీతికలతో ఆనందధ్వనులు చేస్తూ, అరచుచూ ఉత్సవం చేసుకున్నారు. వారి చప్పట్ల-సింహగర్జనల శబ్దములు ఆకాశమును నింపివేశాయి. కొండగుహలు ప్రతిధ్వనించాయి. వాళ్లు సురాపానం గుటకలు వేస్తూ, హాస్యనృత్య పానములు చేయుచూ ఉన్మత్తవృత్తులై ఉత్సవం చేసుకోసాగారు. ఒకరి నోట్లో ఒకరు ఉపాహారాలు అందించుకుంటూ ఒకరినొకరు త్రోసుకుంటూ, పట్టుకొనుచూ విచ్చలవిడిగా సంచరిస్తూ శిష్టాచారములను తారుమారు చేయసాగారు.
ఇక వారివారి వాహనాలు కూడా రక్తపానం చేసి నృత్యం చేయసాగాయి. బ్రహ్మవాహనమగు హంస, అలంబుని వాహనమగు చండుడు కూడా ఆ వాహనముల సమూహంతో కలిశారు. వారు కూడా పానోన్మత్తులై నృత్యం చేస్తూ సురతేచ్ఛపొందారు. ఆ హంసలు అంబుస యొక్క వాహనమగు కాకితో అన్యయోని సంభోగం పొందాయి. ఆ చండుడు అను కాకి ఏడు హంసలకు భర్త అయి వారి ఇచ్ఛానుసారం క్రీడించగా ఆ హంసలు గర్భమును దాల్చాయి.
ఆ తరువాత నృత్యోత్సవం ముగిసింది. మాయారూపిణులగు ఆ అష్టమాతృకలు యజ్ఞ భోక్తములను శూలి(శివుడు)కి ఆహారంగా సమర్పించారు. అప్పుడు ఆ చంద్రశేఖరుడు తనకు తన ప్రియపత్నినే బలిగా ఇవ్వటం గమనించి కోపగించాడు. అప్పుడా మాతృగణములు తమ అంగముల నుండి తిరిగి ఉమను సృష్టించి ఆ శివునికి ఇచ్చి అదే ఉత్సవంలో శివకళ్యాణం చేశారు. అప్పుడది చూసి శివపార్వతులు సంతోషించారు. ఉత్సవం ముగిసింది. అందరూ తమ తమ నెలవులకు వెళ్లిపోయారు.
గర్భవతులైన హంసలు తమ యజమానియగు బ్రహ్మణిని (సరస్వతీ దేవిని) సమీపించి జరిగినదంతా వివరించి క్షమాభిక్ష వేడుకున్నారు. అప్పుడు హంసవాహినియగు సరస్వతీదేవి ఆ
హంసలకు విశ్రాంతి ప్రసాదించి తాను నిర్వికల్ప సమాధినిష్ఠురాలైనది.
ఆ హంసలు ఆ తరువాత విష్ణుభగవానుని నాభి ప్రదేశంలో ఉండే కమలంలో ప్రవేశించి అక్కడ విహరించసాగాయి. అవి కాలక్రమేణా 21 అండములను ప్రసవించాయి. ఆ అండములలోంచి
Page:47
21 కాకులం ఉద్భవించాం. అట్లు ఉద్భవించినట్టి నేను, నా సహోదరులగు 20 కాకులు సరస్వతీ దేవిని సమీపించాం. మా స్తోత్ర పాఠములచే ఆ మాతను నిర్వికల్ప సమాధి నుండి విరమింపజేశాం. ఆ తల్లి మాకు తత్త్వమును బోధించినది. ఆమె దయ వలన పవిత్రమగు ముక్తిని దర్శించాం.
ఆ తరువాత మేము 21 మందిమి పితృదేవులగు చండుని సమీపించి భక్తి ప్రవత్తులతో సాష్టాంగదండ ప్రణామం చేశాం. వారి పాదపద్మములను భక్తిప్రపత్తులతో పూజించాం అప్పుడాయన మాతో ఇట్లా సంభాషించారు.
పితృదేవులగు చండుడు : పుత్రులారా! పుత్రవాత్సల్య యగు ఆ సరస్వతీదేవి దయవలన కల్పిత తంతువులచే నిర్మించబడిన సంసారము నుండి బయటకు వెలువడితిరి కదా?
మేము : అవును తండ్రీ! జగజ్జననియగు బ్రాహ్మీమాత దయ వలన మేము తెలుసుకొనవలసినదంతా తెలుసుకున్నాం. ఇక మేము ఏకాంతంగా ఉండవలసిన స్థానమేదో సెలవివ్వలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాం.
చండుడు : కుమారులారా! నేను ఇతఃపూర్వం మేరు పర్వతములోని ఒక శిఖరం సమీపంలో ఒక గొప్ప గూడు నిర్మించి ఉన్నాను. మీరు అక్కడ నిశ్చింతగా నివసించండి. అక్కడ సద్విచారణసమన్వితులైన అనేక వాయసములు (కాకులు) నివసిస్తున్నారు. మీరు కూడా అక్కడే నివసిస్తూ భోగమోక్షములు
రెండు పొందండి.
ఇట్లు పలికి ఆయన మమ్ములను ఆశీర్వదించి ఆహార పానీయములతో ముద్దు చేసి పంపారు. మేము అక్కడి నుండి బయలుదేరాం. సూర్యమండలమును, స్వర్గలోకమును దాటి బ్రహ్మలోకమునకు వచ్చాం. లోకమాతాపితరులగు సరస్వతీ - బ్రహ్మదేవులకు కొంతకాలం శుశ్రూష చేసి వారి నుండి బ్రహ్మతత్త్వం విన్నాం. వారి బోధలను, ఆశీర్వచనములను పొంది మరల అక్కడి నుండి బయలుదేరాం. లోకపాలకుల పురములను దాటి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మౌనం అభ్యసిస్తూ అనేక సంవత్సరాలు
గడిపాం.
హే మహానుభావా! వసిష్ఠా! మేమెట్లా పుట్టామో, పెరిగామో, ఎట్లా జ్ఞానం పొందామో, ఎట్లా ఉపశాంతి మనస్కులమైనామో.... మీకంతా వివరించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఇక మిగిలినది చెప్పటానికి ఆజ్ఞాపించ ప్రార్థన...
4. నిర్లిప్తుడను - అప్రమేయుడను
శ్రీవసిష్ఠ మహర్షి : మిత్రమా! భుశుండా! మీ నిరహంకారత్వమును, వినమ్రతను చూచి నేను ఎంతో సంతోషిస్తున్నానయ్యా! ఏదీ! తరువాత విశేషాలు చెప్పండి. వందల-వేల-లక్షల సంవత్సరాల పూర్వం మీరు చూచిన జగత్తు ఎట్లా ఉన్నది? ఇప్పటి ఈ జగత్తు ఎట్లా ఉన్నది?
Page:48
భుశుండుడు : మునీంద్రా! ఈ జగత్తు పూర్వ తత్పూర్వకల్పములలో ఎట్లా ఉన్నదో, ఇప్పుడు కూడా అట్లే వెలయుచున్నది. నేను అనేక కల్పవృక్షముల మీద వ్రాలి ఉన్నాను. ఈ వర్తమానకల్పమును కూడా పూర్వ తత్పూర్వ కల్పములను చూచినట్లే దర్శిస్తున్నాను.
మిమ్ములను ఇప్పుడు నిర్విఘ్నంగా చూడగలగటం కూడా నా జన్మజన్మల పుణ్యఫలం అయి ఉన్నది. మరల మరల నాచే, నాతోటి కాకులచే అర్ఘ్యపాద్యములను, ఫలహారములను, చందన తాంబూలాదులను స్వీకరించండి... ఇప్పుడు నా నుండి ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆజ్ఞాపించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : పక్షిరాజా! ఇప్పుడు నాదొక చిన్నసందేహం. మిమ్ము పోలిన శక్తిశాలురు, బుద్ధిమంతులు అగు మీ మిగతా 20 మంది సోదరులు ఏరి? వారు కనబడరేం? మీరొక్కరే కనిపిస్తున్నారేమిటి? వారందరూ ఏమైనారు?
భుశుండుడు : మహర్షీ! చెపుతాను, వినండి. మేము ఇక్కడికి వచ్చి చేరిన తరువాత ఒకదాని వెనుక మరొకటిగా అనేక రోజుల సమూహములు గడచిపోయాయి. అనేక యుగములు గతించాయి.
ఒకప్పుడు మేం 21 మందిమీ కలిసియే ఉన్నాం. కొంతకాలం తరువాత అనుంగు సోదరులందరూ తమ భౌతిక దేహములను తృణప్రాయంగా త్యజించి శివసాన్నిధ్యం పొందారు.
దీర్ఘాయుషో మహాన్తో పి సన్తో పి బలినో2పి చ | సర్వ ఏవ నిగీర్యన్తో కాలేనాకలితాత్మనా || (శ్లో॥ 10, సర్గ 20)
అలక్షితస్వరూపమగు కాలము మహాబలవంతులనూ, దీర్ఘాయుష్కులనూ, మహాత్ములను కూడా మ్రింగివేస్తుంది కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : భుశుండా! మరి మీ విషయమేమిటి? ద్వాదశాదిత్యులను కూడా తన కంఠమున అలంకరించుకొని చెలరేగు మహాప్రళయ వాయువులు మిమ్మేమీ చేయలేదా? అవి స్పృశించకుండా మీరెట్లా దేహసమేతులై ఏర్పడి ఉన్నారు? ఉదయాస్తమయములను కలుగజేసే కాలము భూమిపై గల అన్ని వస్తువులనూ దహిస్తుంది కదా! మిమ్ములను సమీపించనే లేదా? తీవ్ర శీతోష్ణములను ఎట్లా సహించి ఉన్నారు? ప్రళయకాలమేఘములు మిమ్ము కష్టపెట్టనేలేదా? జగత్తంతా విషమయమగు క్షోభతో దద్దరిల్లుచుండగా నిత్యయౌవనులై మీరీ గూటిలో ఎట్లా మనగలిగారు?
భుశుండుడు : బ్రహ్మజ్ఞా! నా ఈ పక్షిజన్మ గురించి మీకు తెలియనిదేమున్నది? ఆకాశంలో సంచరిస్తూ సర్వజనులచే దూషించబడే ఈ పక్షిదేహం అన్ని ఉపాధులలోకి తుచ్ఛమైనది. ఇట్టి తుచ్ఛజీవముల కొరకే ఆ విధాత నిర్జనములైన వనములూ, శూన్యమయమగు ఆకాశమును నిర్మించారు. ఇట్టి పక్షి జాతి యందు ఆశాపాశములచే బద్ధుడైన జీవునికి కలుగు దుఃఖపరంపరలు వర్ణించసాధ్యమా?
అయితే... మేము నిత్యమూ ఆత్మతృప్తిని పొంది ఉన్నాం. స్వాభావికమగు స్వస్వరూపముచే సంతుష్టులమై ఉన్నాము. అనగా "మాస్వస్వరూపము సర్వదా యథాతథం కదా!" అను ఆత్మోపాసనచే సంతృప్తులమై కాలమునకు కేవల సాక్షిత్వం వహించి ఉంటున్నాం.
Page:49
నిర్విషయ, నిర్విశేష వస్తువునందు కలుగుచున్న ఈ 'జన్మలు పొందుట' అను భ్రమలకు లోను కాకుండా నిజగృహంలో కాలం వెళ్లబుచ్చుచున్నాం. ఏదీ కోరుకోవటం లేదు. ఏదీ త్యజించటం లేదు. అనగా మేము జీవించి ఐహిక, ఆ ముష్మికములను కోరం. మరణించి ఈ దేహమును త్యజించకోరం. నిత్యశుద్ధనిరతిశయానంద స్వరూపులమై ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నామో అట్లే స్వస్వరూపమున నివసించుచూ కాలము యొక్క గమనమునకు కూడా కేవల సాక్షీభూతులమై ఉంటున్నాం.
అందుచేతనే మేము కాలమునకు బద్ధులవటం లేదు. మేము లోకము యొక్క జనన మరణములు అనేకం చూచాం. కానీ 'ఈ జగత్తు మిథ్యయే!' అనే నిర్ణయం కలిగి ఉన్నాం. వేద వాక్యములు, గురువాక్యములు మా హృదయంలో ప్రవేశించి సుదృఢత్వం పొందాయి. మనస్సు తన చంచలత్వం వీడి సౌమ్యత్వం పొందింది. ఆత్మసింహాసనం అధిరోహించి, సూక్ష్మమగు కాలగతిని చిరునవ్వుతో చూస్తున్నాం. వాస్తవానికి మా పితృదేవులు చండునిచే నిర్మించబడిన అతిపొడవైన, బంగారు లతానిర్మితమైన ఈ పక్షులగూటిలో దివారాత్రములు తెలియవు. అయినా కూడా స్వబుద్ధితో కాలముయొక్క గతిని, త్రికాలములను గ్రహించగలుగుచున్నాం.
హే మహానుభావా! మా మనస్సు తత్త్వజ్ఞానబలం చేత సారాసారవిభేదమంతా వీడినదై అవాఙ్మనస గోచరమైన స్థానంలో పరమవిశ్రాంతి పొందుతోంది. సుస్థిరతను శాంతిని సర్వదా అనుభవిస్తోంది. సంసారవ్యవహారములచే పుట్టుచూ తుచ్ఛమైన అనేక ఆశాపాశములచే బంధింపబడి అటూ ఇటూ ఎగురుతూ గంతులేసే తదితర భూకాకముల వలె మేము దేనికీ భయమును గాని, ఉద్వేగాన్ని గాని, ఆశగాని, ఇష్టాద్వేషాలుగాని పొందటం లేదు. అందుచేత ఇక్కడ ఎట్టి దుఃఖాలూ పొందటానికి మాపట్ల కారణమేలేదు. అనిష్ట-వినష్టములకు ఏమాత్రం ధైర్యం కోల్పోవక పరమ శాంతితో కూడిన దృక్కులతో అప్రమేయత్వం వహించి ఉన్నాం. భయంకరమైన ఆపదలు ఒనగూడి నప్పుడు కూడా మేము పాషాణమువలె స్థిరత్వం వహించి ఉన్నాం. స్ఫటికమువలె కేవలం సాక్షీ భూతంగా వెలయుచున్నాం. ఆరంభంలో సుఖకరంగాను, క్రమంగా పేలవంగానూ ఉండే ఈ జగత్తు నందలి అనేక పదార్థ సమూహములు వస్తున్నాయి. పోతున్నాయి. అయితే వాటి రాక పోకలు మమ్ము ఏమాత్రమూ బాధించటం లేదు. అవి ఎటునుండి వస్తున్నాయో, ఏమి కానున్నాయో మేము మా వివేకబలం చేత మున్ముందుగానే ఎరిగి ఉంటున్నాం. హే భగవాన్! వసిష్ఠ మహర్షీ! ఈ భూతజాలములు, వాటి సమ్మేళనములు జనించినను, మరణించినను మరణించకున్ననూ మాకు ఏం సంబంధం? ‘భూతములు' అనే నదీ ప్రవాహములు మరల మరల ఎటునుండో వచ్చి, కాలం అనే మహాసముద్రంలో ప్రవేశిస్తున్నాయి. ఇక మేమో, ఒడ్డున ఉండే కొండలాగా ఇక్కడ తటస్థంగా ఉన్నాం. వాటివేటినీ లెక్కగొనుచున్నవారము కానేకాము.
మేము ఇక్కడేదీ గ్రహించటం లేదు. త్యజించటం లేదు. మా పాదములు సంసారము నందు జాగ్రత్తగా మసలుచుండటం చేత మృదువుగా ఉన్నాయి. ఈ సంసారము వలన జనించే అజ్ఞాన పరంపరల పట్ల నిర్మొహమాటముతో కూడిన అనాసక్తి కలిగి ఉండటంచేత జడమాత్రంగా,
Page:50
అర్థరహితంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఈ తీరుగా ఈ కల్పవృక్షముపై గల ఈ గూటిలో ఎట్టి చింతలూ లేకుండా చిరంజీవులమై ఉన్నాము. శోకభయరహితులగు మీ వంటి వుణ్యపురుషుల బోధలచే అనుగ్రహింపబడినవారమై తత్ఫలితంగా మాయారహితులమై ప్రకాశిస్తున్నాం.
ఎప్పుడైనా అనుకోకుండా ఈ మా మనస్సు ఏమైనా సంసార వ్యవహారములను సరిచూడటానికి కాస్త ఇటూ అటూ వెళ్లిందనుకోండి.... వెంటనే తత్త్వమును నెమరువేయుటచే వాటి రాగద్వేషాది లంపటం (బురద)లో మేం వశీభూతులం కావటంలేదు. మొట్టమొదలే మా మనస్సు నిర్వికారము, క్లేశరహితము అగు ఆత్మయందు ఉపశమించి ఉంటోంది. మా చిత్రంగములు సర్వదా సర్వత్రా బ్రహ్మాకారమును పొంది ఉన్నాయి. పున్నమినాటి చంద్రుని చూచిన సముద్ర తరంగముల వలె ఎప్పుడైనా భావతరంగములు లేచుచున్నప్పటికీ మేము సముద్ర స్వరూపులమై ఈ సముద్రతరంగముల వంటి భావములను వీక్షిస్తున్నామేగాని, భావముగా దిగజారటంలేదు. సర్వ భావముల కంటే కూడా ప్రత్యేకమైయున్న మా స్వరూపమును ఆస్వాదించుటే మా యొక్క యోగసాధనం.
హే మహాత్మా! పాల సముద్రం మధించగా అమృతం పుట్టగానే ఎంతటి ఆనందమునకు కారణమైనదో... మీ ఈ రాకచే మేము అంతటి ఆనందం పొందుతున్నాం. ఈషణాత్యాగులగు మీ వంటి మహాత్ముల దర్శనముతో సమానమై ఆత్మ కళ్యాణ విషయం ఇంకేమున్నది? మా భావాతీత యోగసాధనం మరింతగా ఇనుమడిస్తోంది.
ఆపాతమాత్రరమ్యేభ్యో భోగేభ్యః కిమవాప్యతే | సత్సఙ్గచిన్తామణితః సర్వసారమవాప్యతే ॥ (శ్లో 39, సర్గ 20.)
ఆపాతరమణీయములగు ఈ ప్రాపంచిక భోగముల వలన ఏం లాభం? తమరి 'దర్శనము' అనబడు 'సత్సంగచింతామణి' నుండి సర్వసారమగు జ్ఞానమే లభిస్తుంది.
హేమహర్షీ! మీ వాక్యములు ధీరగంభీరములు, స్నిగ్దకోమలములు. సరళమాధుర్యములు అయి ఉన్నాయని అనేకమంది శ్రోతల అభిప్రాయం. మీరు త్రైలోక్యతత్త్వ సారమును ఎరిగినవారు. హే సాధూ! సాధుసంగమం సకలభయములనూ తొలగిస్తుంది. మేము ఆత్మతత్త్వమును గ్రహించి ఉన్నప్పటికీ మీతోటి ఈ సంభాషణచే మరింత పవిత్రులం అయ్యాం. మా దుష్కృతములన్నీ నశించినట్లే. మా జన్మ సార్ధకమైనదని తలచుచున్నాం.
5. ధారణచే మహాప్రళయసాక్షిత్వం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ భుశుండ మహాశయా! కాలవాయువీచికలు ఈ స్థానమును స్పృశించనే లేదా? అయితే మీరు కాలముయొక్క అనేక చమత్కృతులు గాంచి ఉంటారే!
భుశుండుడు : ఘోరములగు కల్పాంతవిక్షోభములు అరుదెంచిననూ, విషమగాలులు వీచిననూ పితృ సంకల్ప నిర్మితమైన ఈ గూడు ఉన్నట్టి కల్పవృక్షం మాత్రం కంపించక స్థిరంగానే ఉన్నది.
Page:51
లోకాంతరములు విహరించే వారికి కూడా ఈ స్థానం అగమ్యమై ఉండటం వలన నేను నిశ్చింతగా ఎట్టి బాధలు లేకుండా ఇక్కడే ఉన్నాను. సప్తద్వీప సమన్వితమైన ధరావలయమును చాపచుట్టినట్టు చుట్టి హిరణ్యాక్షుడు అపహరిస్తూ ఉంటే శ్వేతవరాహమూర్తి ఆకాశం నుండి ఉద్భవించి ఆ హిరణ్యాక్షుని సంహరించి భూమిని యథాస్థానంలో ఉంచినప్పుడు గానీ... దేవరాక్షస గణం క్షీరసముద్రమును మధిస్తుండగా కూర్మమూర్తి మందర పర్వతమును తన భుజములపై ధరించినప్పుడు గానీ... దేవ రాక్షసుల మధ్య భయంకరమగు సంగ్రామం జరుగుచున్నప్పుడు గానీ... సూర్య - చంద్రమండలములు పడిపోగా ఈ జగత్తులు అత్యంత క్షోభ చెందినప్పుడు గానీ... కాలనేమి భుజస్కంధముల మధ్య చిక్కిన మేరు పర్వతం కొంచెం చలించినప్పుడు గాని... అమృతకలశమును గొనివచ్చుచున్న గరుడుని రెక్కలహోరుకు సిద్ధులు పడిపోవుచున్నప్పుడుగాని... గరుడుడు జన్మించి భూమండలమును జలమయం చేస్తున్న వేళ సంకర్షణ రుద్రుడు సహస్రశీర్షములతో భూమిని దాల్చినపుడు గాని... ఆదిశేషుడు తన వేయి తలలనుండి కల్పాగ్ని జ్వాలలను విరజిమ్ముచున్నప్పుడు గాని... ...ఈ కల్పవృక్షం చలించలేదు. మా స్వస్థానంలో యథాతథంగానే ఉన్నాము.
ఓ ఋషిసత్తమా! చెడుచోట్ల ఉండే వారికే ఆపదలు వస్తాయి గాని, అచల స్థానమున ఉండే
మాకు ఆపదలెందుకు కలుగుతాయి?
శ్రీవసిష్ఠమహర్షి : ఓ మహాబుద్ధీ! కల్పాంతవాయువులు వీచి, ఆ ప్రభావంచే సూర్యచంద్రులే గతితప్పుచుండగా....మీరు ఎట్లు చలించకుండా విజ్వరులై ఉన్నారు?
భుశుండుడు : మహర్షీ! ఒక కృతఘ్నుడు కష్టకాలం వచ్చిపడినప్పుడు మిత్రుని త్యజించి ఎచటకో వెళుచున్నాడు చూచారా! ఆ తీరుగా కల్పాంతమున వ్యవహారజగత్తు అదృశ్యమగుచున్నప్పుడు నేను ఈ నీడను త్యజించుచున్నాను. ఆ సమయంలో నేను సర్వకల్పనలూ వీడి, క్రియారహితుడనై ఆకాశంలో ప్రవేశిస్తాను. ద్వాదశాదిత్యులు తమ తాపవేగముచే భూమి యొక్క ఉదరమును ఖండ ఖండితంగా చేస్తున్నప్పుడు 'నేను వరుణడను' అను ధారణ చేసి ధీరుడనై, చలించకుండా ఉంటాను. కొండలను పిండి చేస్తూ ప్రళయవాయువులు వీస్తున్నప్పుడు 'నేను పార్వతీదేవిని' అను ధారణ చేత ఆకాశంలో చంచలరహితుడనై స్థిరత్వం వహించి ఉంటాను. మేరువు మొదలైన పర్వతములు కరిగి పోవుచూ సర్వ జగత్పదార్థములూ ఏకద్రవంగా మారిపోవుచుండగా నేను వాయువువలె ప్రవహిస్తూ ఉంటాను. స్థూల - సూక్ష్మాది తత్త్వములతో కూడిన బ్రహ్మాండమంతా విలీనమై పోవుచుండగా నేను ‘పరమపదము'న అచలుడనై సుషుప్తునివలె ధారణ అవలంబించి ఉంటున్నాను.
మరల బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేవరకూ అట్లాగే పరమపదమున ధారణను కొనసాగిస్తు న్నాను. తదనంతర సృష్టి ప్రారంభం కాగానే ఈ బ్రహ్మాండమున ఈ కల్పవృక్షంపై గూటిలో ప్రవేశిస్తున్నాను. ఈ విధంగా అనేక కల్పాంతములకు సాక్షినై ఉన్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి : అంటే.....మీ స్వకీయమైన ధారణశక్తి చేతనే కల్పాంతములకు కూడా పట్టుబడక, కల్పాంతములందు అఖండితంగా ఉన్నారన్న మాట! అత్యంతాశ్చర్యం!
Page:52
నాదొక చిన్న ప్రశ్న. మీ వంటి ఇతర యోగులు మీ వలెనే ధారణ చేయక, వారు వేరు వేరు అధికార శరీరములను పొందటమో, లేక ముక్తిని ప్రాప్తింపజేసుకోవటమో చేస్తున్నారేమిటి? భుశుండుడు : మీ ఈ ప్రశ్నకు నాకు తెలిసిన సమాధాన మొక్కటే - పరమేశ్వరుని నియతి అట్టిది! అది అనుల్లంఘనీయం. నేను ఈ తీరుగానూ, నావంటి ధారణసమర్థులగు తదితర యోగులు ఆయా తీరులుగానూ ఉండవలెననునది సర్వాత్మకుని సంకల్పమనుకోవాలి. బ్రహ్మజ్ఞాన ప్రతిపాదక మగు ఒక మహత్తర గ్రంథం కొందరికి మీమాంసా మాత్రంగా. మరికొందరికి స్వస్వరూపజ్ఞాన ప్రసాదితంగా ఎందుకుంటోందో ఎవరం ఏమి చెప్పగలం? ఇదంతా 'భగవత్ సంకల్పమాత్రమైన సృష్టి యొక్క నియతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. ఏది ఎట్లా జరుగవలెనో ఎవరికి నిర్ణయింప శక్యం? ఏది ఎట్లా ఉండవలెనో అది అట్లాగే వెలయుచున్నది. ఇదే 'స్వభావము' అని 'నియతి’ అని, ‘నిశ్చయం’ అని పిలువబడుతోంది. ఇంతకు మించి ఏ సమాధానమూ నాకు తెలియదు.
ఇక నా విషయం చెప్పమంటారా? ప్రతిసారి నా ప్రాణయోగసాధన కారణంగా ఒనగూడిన సంకల్పవశంచే కల్పాంతప్రళయ సమయంలో ఆకాశంలో ప్రవేశిస్తున్నాను. మరల తదనంతర సృష్టిలో ఇచ్చటికే వచ్చి ఉంటున్నాను.
6 సుదీర్ఘ సృష్టి చమత్కారం
శ్రీవసిష్ఠ మహర్షి : అత్యంత దీర్ఘాయువు కలిగి, మోక్షమును అధిరోహించినట్టి అనుభూతిని అనుభవిస్తూ, యోగికి యోగ్యమైన మనస్సును జ్ఞాన విజ్ఞానములను పొంది, అంతులేని ధీరత్వంతో మీరు ప్రకాశిస్తు న్నారు. సర్వమూ కాలయమునకు 'ఎర' అగుచుండగా మీరు మాత్రం మీ ధారణా శక్తిచే కాలముచే బంధింపబడకుండా ఉన్నారు. పురాతన విషయములన్నీ ప్రత్యక్షంగా చూచిన మీరు అనేక విషయములు చెప్పుటకు సమర్థులు. ఓ మంగళహృదయా! అనేక విధములగు సృష్టులను, ప్రతిసృష్టులను, సామాన్య ప్రళయములను, అవాంతర ప్రళయములను, మహాప్రళయములను చూచిఉన్నారు కదా! సృష్టులలో ఏఏ ప్రత్యేక విషయములు సందర్భోచితమో... అవి చెప్పమని నా విన్నపం. భుశుండుడు : మహాత్మా! వినండి - ఈ సుమేరుపర్వతం క్రిందగల భూమి అంతా వృక్షములు గాని, గడ్డిగాని, శైలము (Rock) గాని లేక, కేవలం శూన్యంగా ఉండటం చూచాను. భూమి 11000 సంవత్సరాల కాలం భస్మరాశితో నిండి ఉన్నది. అప్పుడు భూమిపై సూర్యుడు గాని, చంద్రుడు గాని లేకపోవటం చేత పగలు రాత్రి భేదమే ఉండేది కాదు. కాలమునకు కొలతబద్ద లేకపోయినా నేను నా విజ్ఞానదృష్టితో సూర్యచంద్రుల కంటే విశిష్టమైన కాలగమనాన్ని గమనించాను.
భూమి సగం పగలు, సగం రాత్రితో కొంతకాలం ఉండిపోయింది. దేవాసుర సంగ్రామ సమయంలో జనులు భూమిలోని అంతర్భాగంలో దాగి ఉండుటచే ఈ భూమి కొంతకాలం జన శూన్యమైపోయింది.
Page:53
ఒకప్పుడు భూమి అంతా నాలుగు యుగములవరకూ రాక్షసస్త్రీలకు అంతఃపురమైయున్నది. మరొకప్పుడు ఈ జగత్తంతా సముద్రజలంచే ఆక్రమించబడుటచే ఇక త్రిమూర్తులు, మేరు పర్వతం తప్ప మరింకేమీ లేదు. రెండు యుగముల కాలం భూమిపై ఇతర సృష్టి ఏదీలేక, కేవలం వన వృక్షములచే నిబిడీకృతమైయున్నది.
ఒకసారి నాలుగు యుగముల కాలం సృష్టంతా పర్వతములతోనూ, స్థాణువులతోనూ నిండి పోయింది. ఆ సమయంలో జనులకు సస్యవ్యవసాయాది వృత్తులు లేవు. పదివేల ఏండ్లు భూమి చనిపోయిన రాక్షసుల దేహములతో, భీకర మృగములతో నిండిపోయి ఉన్నది.
ఒకసారి అనంత సృష్టిలోని ఏమూల నుండో ఒక గొప్ప 'కారుచీకటి' బయలుదేరింది. ఆ గాఢాంధకారం ప్రసరించిన చోట నక్షత్రాలు కూడా అంతర్హితమైపోయాయి. నక్షత్రాలు మటుమాయ మవటం చూసిన విమానచారులగు ఆకాశచరులు భయంతో కేకలు వేస్తూ తమ ఉపాధులు కోల్పోవడం నేను చూచాను.
మరొకసారి వింధ్యపర్వతం గాలిలో లేచి దక్షిణదిక్కును రాళ్లమయంగా చేసివేయటం చూచాను. అప్పుడు 'వింధ్యపర్వతాన్ని నిరోధించటానికి అగస్త్యమహర్షి లేకపోయారే' అని నేను అనుకున్నాను.
హే బ్రహ్మాజ్ఞా! ఇట్టివేయగు అనేక విషయాలు నాకు గుర్తుకొస్తున్నాయి. అవన్నీ మీకు పెద్దగా చెప్పవలసిన విషయాలు కాదు. కొన్ని ముఖ్యవిషయాలు చెబుతాను. నేను వందకు మించిన మనువులను చూచాను. నానావిధ కార్యక్రమములతో నిండిన వందలాది చాతుర్యుగములు గాంచాను.
ఏది ఏమైతేనేం? 'స్వాత్మతత్త్వము' దృష్ట్యా చూచినప్పుడు విరాట్-బ్రహ్మాండమే కనిపిస్తుంది. సమాహితచిత్తానికి ఈ సర్వమూ 'నరులు- సురులు' అనే భేదం కనిపించదు. 'జీవులు' అనబడు ప్రకాశాత్మకమగు తేజోపుంజములతో కనిపించే విరాట్ పురుషుడు మాత్రమే గోచరిస్తాడు.
అనేక వైవిధ్యములతో కూడిన ఈ విచిత్ర సృష్టిలో మద్యపానాసక్తులు, నిందిత కర్మిష్ఠులు, దృశ్య ప్రసంగాలతో బ్రతుకులు గడిపే జీవులు ఉన్నారు. వారు ఒక దుఃఖం నుండి మరొక దుఃఖం నకు, ఒక భయం నుండి మరొక భయమునకు ప్రయాణించటం చూస్తూ ఉంటే నా హృదయం కించిత్ ద్రవిస్తుంది. మీవంటి బ్రహ్మజ్ఞానుల వాక్యములు వారు వినకపోవటం నాకు చమత్కారం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ప్రియవర్తనులగు జనులు లేకపోవటంచేత ఒక్కొక్క భూవిభాగం సారహీనమై ఉండటం చూస్తూ ఉంటాను. అయితే, "అంతా మాయయే కదా!”... అని తెలిసి ఉండటం చేత సర్వము పట్ల కృతకృత్య మౌనస్వభావంతో చూస్తూ ఉన్నాను.
ఒక్కొక్కప్పుడు స్త్రీ - పురుష సంయోగం లేకుండానే మానసిక సంకల్పంచే జనించిన భృగువు మొదలైన మహనీయుల జననం చూచాను. అవాంతర ప్రళయం తటస్థించినప్పుడు భూమిపై పర్వతములు, వృక్షములు జీవులు నిర్మూలనమయ్యేవి. అప్పుడు భూమియే నిరుపయోగమయ్యేది. అప్పుడు యోగసిద్ధి పొందిన మానవులు, దేవతలు నాలాగానే ఆకాశమును ఆశ్రయించటం గమనిస్తూ ఉండేవాడిని. ఈ సృష్టి ఒక్కొక్కప్పుడు ఇంద్రుడుగాని, రాజుగాని లేక, ఉత్తమ - మధ్యమ
Page:54
- అధమ తారతమ్యములుగాని కలిగిఉండటం లేదు. అంతా అజ్ఞానమయం అయిపోతోంది. అప్పుడు సర్వేశ్వరుని అంశలు జీవులుగా జన్మించి ధర్మసంస్థాపన చేయటం గమనించాను.
ఇక ఈ సృష్టికి మునుముందటి ఆయా ప్రయత్నములు, భువనత్రయవిభాగం ఏర్పడటం, పర్వతములు రూపు దిద్దుకోవటం, జంబూద్వీప ఆవిర్భావం, వర్ణాశ్రమ ధర్మముల రచన, భూమండల విభాగం, నక్షత్రచక్ర సంస్థాపన, ధ్రువనక్షత్రోదయం, ఈ సూర్యచంద్రుల ఉత్పత్తి.... ఇవన్నీ నిన్న మొన్నటి సంగతులు.
అట్లాగే ఇంద్ర - ఉపేంద్రుల వృత్తాంతం, దేవ దానవ-మనుష్య చక్రవర్తులు నియమించ బడటం, మత్స, కూర్మాది అవతారములు, సముద్ర మథనం, గరుడుని జన్మ, సముద్రాలు ఏర్పడటం ఇవన్నీ ఈ రోజు జరిగిన సంఘటనలవలె నా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నా కన్నా వయస్సులో చిన్నవారు, ఈ కల్పమువారు అగు మీరు చూచినవే కదా!
ఒక కల్పంలో గరుడవాహనుడగు విష్ణువు సృష్టికి యజమాని అయి ఉంటున్నారు. ఇంకొక కల్పంలో హంసవాహనుడగు బ్రహ్మదేవుడు యజమాని. మరొక కల్పంలో వృషభవాహనుడగు ఈశ్వరుడు అంతటికీ యజమాని. ఒక కల్పంలో బ్రహ్మదేవుడైన జీవుడు మరొక కల్పంలో శివుడ గుచున్నాడు. ఏమి ఈ సృష్టి చమత్కారం!
7. చిత్ర విచిత్ర సంఘటనలు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ భుశుండమహాశయా! చిత్రవిచిత్రములైన ఈ సృష్టికి సంబంధించిన మరికొన్ని ప్రత్యేక విశేషాలు, సంఘటనలు వినాలని అనుకుంటున్నాను.
భుశుండుడు : ఈ సృష్టిలోని అనేక వస్తుజాలములు కాలగర్భంలో కలిసిపోతున్నట్లే, అనేక చిత్ర విచిత్ర సంఘటనలకు నేను సాక్షినై ఉండటం జరిగింది. వాటిలో అనేక సామాన్య విషయాలు నా స్మృతి పథంలో కూడా లేవు. కొన్ని విశేషాలు గుర్తున్నవి చెపుతాను వినండి.
మహనీయులగు మీరు, భరద్వాజుడు, తదితర అనేక మహర్షులు, గణేశుడు, గౌరి, గాయత్రి మొదలైన వారి జన్మవృత్తాంతాలన్నీ నాకు నిన్న మొన్నటి సంఘటనలు. నేనిట్లా చూస్తుండగానే మీకు ఎనిమిది జన్మలు గతించాయి. ఈ ఎనిమిదవ జన్మలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఆ జన్మలన్నీ బ్రహ్మపుత్రుడుగా జరిగినవి కావు. ఒకసారి ఆకాశం నుండి, మరొకసారి జలం నుండి, వాయువు నుండి, అగ్నినుండి, పర్వతాల నుండి జన్మించటం జరిగింది. ఇప్పుడీ వర్తమాన 'సర్గ'ను బోలినవే ఇతఃపూర్వం మూడు చూచాను. అంతకుముందు సర్గలు ఇందుకు భిన్నంగా ఉండేవి.
భూమి నీటిలో మునిగిపోవుచుండగా కూర్మమూర్తిచే ఐదుసార్లు కాపాడబడటం చూచాను. కూర్మ - వరహామూర్తులచే కాకుండా, మరికొందరిచే ఈ భూమియొక్క విధ్వంసనా యత్నములు విఫలం చేయబడటం చూచాను. దేవతలు, రాక్షసులు అమృతం కొరకు సముద్రమథనం చేయటం ఐదుసార్లు నాకు గుర్తున్నది. కొన్ని సర్గలలో పరశురాముడు జన్మించి రాజవంశ నిర్మూలనం
Page:55
చేయగా, మరికొన్ని సర్గలలో అతడు జన్మించటం జరుగలేదు. హరి అనేక కలియుగాలలో బుద్ధుడుగా జన్మించటం నేనెరుగుదును. చంద్రమౌళియగు శివుని యొక్క త్రిపురాసురల సంహారాలు, దక్షయజ్ఞ విధ్వంసములు నా జ్ఞప్తిపథంలో ఉన్నాయి.
ఓ మునీంద్రా! వేరు వేరు యుగములలో వేదములకు సంబంధించిన పఠన - - నియమ నిష్ఠ - బ్రహ్మచర్య - గురుశుశ్రూషాది విధివిధానములు వేరు వేరు రీతులుగా ఉంటున్నాయి. ఒకే కథనం బోధిస్తూ కొన్ని పురాణాలు వివిధ యుగములలో విభిన్న పాఠములు, వ్యాఖ్యలు కలిగి ఉంటున్నాయి. వేదవేత్తలగు వ్యాస వాల్మీకాదులు మరల మరల భారతరామాయణాది ఇతిహాసాలు రచిస్తూ ఉండటం నాకు తెలుసు. ఇప్పుడెక్కడా ఎవ్వరికీ తెలియని 'అఖండ రామాయణము' అను లక్ష శ్లోకములలో రచించబడిన ఇతిహాసం గురించి నాకు తెలుసు. ఆ లక్ష శ్లోకములలో జ్ఞానము కరతలామలకం చేయబడింది. ఆ గ్రంథమే ఇప్పుడు వాల్మీకిచే 32000 శ్లోకములలో బోధించబడి కొద్దిమంది శిష్యుల పఠన విషయమై ఉంటోంది. దీనిని మీరు కాలక్రమేణా ఒక సందర్భంలో అవతారమూర్తియగు శ్రీరామచంద్రునికి బోధిస్తారు. ఇప్పటి రామాయణ కథ ఇతఃపూర్వం 11 సార్లు తిరిగి రాయబడింది. అవన్నీ వాల్మీకియో, మరొకరో తిరిగి రాశారు. పూర్వపు అనేకమంది వ్యాసులు రాసిన మహాభారతములు అనేక మార్లు విస్మరించబడి, మరల విరచించబడ్డాయి. 6 మార్లు వ్యాసులో, మరొకరో రాసిన భారతములు విస్మరించబడ్డాయి. ఇప్పుడు 7వ సారి భారతం వ్రాయబడుచున్నది.
పురాణములు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తీరుగా ఉంటున్నాయి. పదార్థ సమూహములు కూడా ఎప్పుడూ ఒక్కతీరుగా ఉండటం లేదు. విష్ణుమూర్తి శ్రీరాముడుగా 11 సార్లు అవతారం ఎత్తడం నాకు తెలుసు. శ్రీ నరసింహస్వామి 3 సార్లు అవతారం ఎత్తి మూడు వేర్వేరు యుగాలలో హిరణ్యకశ్యప వధ చేయడం నాకు గుర్తుంది.
హే మునీశ్వరా! ఇంతదాకా ఏదో మీరు ప్రశ్నించారు కాబట్టి నా జ్ఞాపకపేటికలోంచి కొన్ని విశేషాలు చెప్పాను. ఇంతకూ అసలు సత్యమేమిటో కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కదా!
భ్రాంతిమయమగు ఈ జగత్తు అస్సలు స్వతఃగా లేనేలేదు. జలముపై బుడగల వలె ఇదంతా క్షణికమే అయి ఉన్నది. సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్నవానికి సముద్రజలంలో కెరటాలు వచ్చి పోవుచున్నట్లు అంతరమున గల చైతన్యమునందు అనిత్యములగు ఈ ఈ సృష్టిపరంపరలు చేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఈ సర్వమూ సంకల్పమాత్ర భ్రాంతియే కదా. అనేక సృష్టులు ఒకే తీరుగా ఉండటం, అనేక తీరులుగా ఉండటం, సగం ఒకే తీరుగా ఉండటం, ఈ త్రిలోకములు ఏర్పడటం, అందులో జీవులు వచ్చిపోవటం, వివిధ జీవుల కర్మలు--ఇవన్నీ కూడా ఒకే జలంలోని అనేక తరంగములవంటివేనని మీకూ తెలుసుకదా!
ప్రతి మన్వంతరంలోనూ ఈ జగత్రమమంతా విపర్యయం పొందుతోంది. దీని పుట్టుక, ఉనికి, నాశనము తారుమారగుచున్నది. నా బంధువుల, భృత్యుల ఆశ్రమములు వేరు వేరగుచున్నాయి. నా నివాస స్థానం ఒక్కొక్కసారి ఒక్కొక్కచోటికి మారుతూ వస్తోంది. ఒకసారి వింధ్యశృంగముపైన,
Page:56
మరొకసారి సహ్యపర్వతంపైన ఇంకొకసారి మేరు పర్వతంపైనా గూడు మారుచున్నది. ఒకసారి ఎందరో బంధుజనులు నా వెంట ఉండి ఉంటున్నారు. మరొకసారి దీర్ఘకాలం ఒంటరిగా ఉంటున్నాను. ఇట్లు యుగయుగాలుగా, కల్పకల్పాంతాలుగా నేను మాత్రం ఈ తీరుగానే ఉండిపోతున్నాను. దిశలు, అందలి వస్తువులు తారుమారగుచున్నప్పటికీ నేనుమాత్రం 'ప్రత్యభిజ్ఞానబలం’ చేత ఎట్టి మార్పులూలేక, ఆ సర్వమునూ సాక్షీమాత్రుడనై గమనిస్తున్నాను. ఈ జగత్తు, జగత్తులూ అంతా కూడా
సత్-అసత్మయమని, ఆత్మయందు ఉద్భవించుచున్న భ్రమ మాత్రమేననీ నాకు తెలుసు. అందుచేత నా బుద్ధికి ఏ క్షణంలోనూ ఎటువంటి మోహం కలగటం లేదు. ఆత్మయొక్క మాయాశక్తిచేతనే ఈ పదార్ధములన్నీ ఈ విధంగా విజృంభిస్తున్నాయి. దిక్కుల భేదం వలన వ్యవస్థయే మారిపోయినట్లు అనుభవమౌతుంది కదా! అట్లాగే తల్లి-తండ్రి, భార్య-భర్త, అన్న-తమ్ముడు కాలగతి యొక్క మహిమచే మిత్రులు, శత్రువులు కూడా అగుచున్నారు. పురుషులు స్త్రీలుగా అగుచున్నారు. ఆచార వ్యవహారముల నియమ నిబంధనములు మారిపోతున్నాయి.
ఒకొక్కకాలంలో జనులు వేదాలను, వేద నిషేధాలను పూర్తిగా వదిలి చరిస్తున్నారు. ఒక చిన్న రచన, ఒకచిన్న క్రియా విశేషం మొత్తం ఆచార వ్యవహారాలను సమూలంగా మార్చివేసిన సంఘటనలు నా జ్ఞప్తిపథంలో ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై అనేక యుగములు గడుపగా ఈ బ్రహ్మాండమున దేవ రాక్షససమూహములు లేవు. అందుచేత ఇది క్రియారహితమై ఉన్నది.
ఈ నా దీర్ఘజీవితంలో 10కి పైగా మనోమాత్ర నిర్మిత సృష్టులు వేరువేరు నవలల వలె గాంచియున్నాను. ఆ మానసిక సృష్టులలో పంచభూతాత్మికమైన దేహములు లేవు. కేవలం ఊహలే పరస్పరం ప్రవర్తించి సకల అనుభవరూపంగా స్ఫురిస్తూ ఉంటాయి. అనేక దేశ, కాలములతో, ప్రదేశ, - వేషభాషలతో, విచిత్ర కార్యక్రమములతో, పరస్పర విరుద్ధములైన నిర్వచనములతో ఈ సృష్టి అంతా పరిఢవిల్లుతోంది.
8 చాంచల్యరాహిత్యం - అమృతత్వం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ విహంగరాజమా! ఈ బ్రహ్మాండమంతా ఇంత చమత్కారంగా మరల మరల విచలితమగుచున్నది కదా! ఇందలి జీవులు మృత్యువుచే అనేకమార్లు బాధింపబడుచున్నారు. మరి అట్టి మృత్యువు మిమ్ములను మాత్రం సమీపించనేలేదు. ఇది మీకు ఎలా సాధ్యపడింది? భుశుండుడు : సర్వజ్ఞా! మీకు అంతా తెలుసు. అయినా అడుగుచున్నారు. అయితే, ప్రభువు కోరి నట్లే భృత్యువు నిర్వర్తిస్తాడు కదా! బ్రహ్మవేత్తలగు మీరు ప్రశ్నించారు గనుక మరల విశదీకరించి చెబుతాను. మీ ఆజ్ఞను పాలించుటయే మిమ్ములను ఆరాధించటం కదా!
ఆభరణములేవీ లేనివానికి దొంగలు వచ్చి దొంగిలించగలిగేదేమి ఉంటుంది? అట్లాగే ఎవని హృదయంలో అయితే 'వాసనా తంతువులు' అనే దోషం ఉండదో అట్టి వానిని మృత్యువు హింసించ
Page:57
జాలదు. ఎవనికి ఆశాపాశజనితమైన మనోవ్యాధులు ఉండవో, అట్టివానియందు మృత్యువు వచ్చి కలిగించగల మార్పు చేర్పులేమీ ఉండవు. మనస్సు యొక్క చాంచల్యము జయించబడిందా - ఇక ‘నేను క్షయించుచున్నాను' అను భావన నిరర్థకమై, నిరోధించబడుతోంది.
ఆశయే అన్ని చింతలకూ కారణం. 'ఆశించుట' అను జీవునియొక్క అవిజ్ఞానజనిత స్వభావమే మృత్యువుకు విషాగ్నిజ్వాలలు వెడలగ్రక్కగల శక్తిని ప్రసాదిస్తోంది. మనస్సులో 'ఇది కష్టం- అది కాదు' అనే తరంగపరంపరలు మొట్టమొదట బయల్వెడలుచున్నాయి. అవి రాగద్వేషములను కల్పన చేస్తున్నాయి. రాగద్వేషములు, లోభగుణమునకు కారణమగుచున్నాయి. లోభం కోపాగ్నులను జనింపజేసి హృదయంలో జ్ఞానజలమును ఆవిరిగా చేసేస్తున్నది. ఎక్కడినుంచో కామము వచ్చి హృదయమును పిప్పి చేసేస్తున్నది.
తత్ఫలితంగా మృత్యువు విలయతాండవం చేయగలుగుతోంది. ఎవరైతే అద్వితీయమును నిర్మలమును, పవిత్రమునగు ఆ పరమపదమును ఆశ్రయిస్తారో... వారియొక్క విశ్రాంతి స్థానమును బాధించగల సమర్థత మృత్యువునకు లేదు. ఈ శరీరం అనే ఉద్యానవనంలో 'మనస్సు’ అనే చంచల స్వభావం గల కోతి సంచరించకపోతే 'మృత్యువు' అనే వననాశనం ఎందుకు జరుగుతుంది?
మహాత్మా! ఈ జీవుడు సమాహితచిత్తమును సంపాదిస్తేచాలు, అన్ని రుగ్మతలూ తొలగుతాయి. సంసారదోషమునకు కారణములైన దృశ్య దోషములు సమాహితచిత్తుని ఏమాత్రం బాధించలేవు. ఈ శారీరక మానసిక దోషములు అతని దగ్గరకు వెళ్లలేవు. సమత్వము అనుదానిని అనుభూతిగా చేసుకున్నవానికి ఇక్కడి స్మృతి-విస్మృతులు, జాగ్రత్-స్వప్న సుషుప్తులు ఉండియూ, లేనివే అగుచున్నాయి.
ఎవని హృదయంలో కామక్రోధవికారములు జనింపజేసి, అంధకారమయం చేయగల చింతలు ఉండవో- అట్టివానినే మనం 'సమాహితచిత్తుడు' అని పిలుస్తాం. ఎవని కర్మలైతే దానం, ప్రతిగ్రహణం, త్యాగం, యాచన - - మొదలైన దోషములు లేకుండా ఉంటాయో, అతని చిత్తము సమాహితత్వము అవధరిస్తున్నట్లు. ఈ ధనాది ఆర్జనలు, కృషి, నిర్మాణాది కార్యములు, రాగద్వేషాది గుణము, హృదయ భేదకములగు తదితరుల దూషణవాక్యములు, కఠినములగు ఆయా సామాజిక స్థితిగతులు సమాహితచిత్తునిలో ఏ మార్పుదుఃఖము, ఆవేశము, నీరసము మొదలైనవి కల్పించలేవు సరికదా... నదుల జలాలన్నీ సముద్రం కోరకుండానే సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్లు, మహత్తర గుణములను వెంటబెట్టుకుని లాభజనకములగు సుఖములన్నీ వాటంతట అవే ఆ సమాహిత చిత్తుని సమక్షమునకు చేరుకుంటాయి.
కనుక 'మృత్యువు అనునది నాపట్ల నిష్క్రియము, నిర్వీర్యము అయిపోవాలి' అని ఏ జీవుడైనా అనుకుంటే, అతడు తన మనస్సును ముందుగా భోగాభిలాషారహితంగా తీర్చిదిద్దుకోవాలి. భ్రమలన్నీ ఒక్కటొక్కటిగా బయటకు పంపివేయాలి. అప్పుడా మనస్సు తనయందు పారమార్థిక సుఖమునకు చోటు కలిగి ఉంటుంది. క్రమంగా సత్యసంకల్పత్వం సంతరించుకుంటుంది.
Page:58
‘అనేకత్వము’ అనేదే అపవిత్ర దృష్టిపిశాచం ఈ జీవుడు సత్యసంకల్పుడు కావాలంటే -
అనగా, తాను అనుకున్నది పొందాలంటే, ముందుగా 'ఇక్కడి అనేకత్వము ఉన్నది' అనే అపవిత్రదృష్టి దరిజేరకుండా చూచుకోవాలి. అప్పుడు మనస్సు పవిత్రమై, పరమపదమున స్వస్థి పొందుతుంది. ఇక మృత్యువు నిష్క్రియం అయిపోగలదు.
మృత్యువుకు అతీతుడు కావాలంటే1. ‘పరిపక్వదశ’ ప్రసాదించగల ధ్యాన - కర్మ - పఠనాది కార్యక్రమములను శ్రద్ధా-ఆసక్తులతో తీవ్రతరం చేసుకోవాలి.
2. క్రమక్రమంగా హితకరము, సర్వదుఃఖనివర్తకము, నిత్యము అగు జ్ఞానమును సంపాదించే టట్లుగా ఈ మనస్సును నియమించాలి.
భూతవర్తమానభవిష్యత్తులందు ఏదైతే నిత్యమై, అనంతమై సాధుజన సేవితమై సర్వహితకరమై యున్నదో, అట్టి పదము వైపుగా ఈ మనస్సును ప్రవర్తింపజేయాలి. బుద్ధికి కూడా పరమప్రకాశమై, అమృతసారమై, ఎనలేని, తెంపులేని సుఖప్రదమగు మహాస్థానమునందు మనస్సును సంలగ్నం చేయాలి. అట్టివారి మహత్తర దృష్టియందు మృత్యువుతో సహా ఈ ఎదురుగా కనిపించేదంతా లేనిదే అగుచున్నది.
హే మహర్షీ! దేవతాస్త్రీ సాంగత్యాదులలో కూడిన దివియందుగాని, పర్వత, రాజ్య, సముద్ర, వనములతో కూడిన భూలోకమునందు గాని, నాగ, అసుర కన్యలతో కూడిన పాతాళలోకము నందుగాని నిత్యము, స్థిరము, సుఖము అయినది ఒక్కటి కూడా ఏదీ లేదుకదా! ఈ బ్రహ్మాండ సాగరంలోని మూడు లోకములూ ఆధి వ్యాధులనే తరంగములతో కదులుచూ, దుఃఖములు అనే సుడిగుండములతో, తుచ్చములగు అనేక అల్పాశయక్రియావ్యవహారములతో నిండి ఉన్నాయి. ఇందులో ఎక్కడ నిజమైన సుఖము, శాంతి ఉన్నాయి చెప్పండి? కాస్త హృదయమును సరళం చేసి కొంచెం మనస్సును ఆనందపరచే చిత్తవృత్తులు కూడా ఏమాత్రం స్థిరత్వం కలిగి ఉండుటలేదు కదా! ఇక్కడి సంకల్పవికల్పములేమైనా జీవునకు శాశ్వత శుభమును కలుగజేస్తున్నాయా? లేదు. ఇక ఈ ఇంద్రియసుఖములంటారా? ప్రతిదీ కాస్త సుఖం, గంపెడంత దుఃఖం! అవి మూర్ఖజీవుని అల్పాయుష్షులను తమవైపు ఆకర్షించి అతనిని చివరికి దుఃఖిగాను, రిక్తహస్తునిగాను చేసివేస్తున్నాయే! అవి అందించే విషయసుఖములను సమాహితచిత్తుని విశ్రాంతి, ప్రశాంతతలతో సరిపోల్చగలమా? ఏమాత్రం కుదరదు.
న పరమేకమహీతలరాజతా నచ వరం విబుధామరరూపతా |
నచ వరం ధరణీతలనాగతా స్థితిముపైతి హి యత్ర సతాం మనః ॥ (శ్లో॥ 33, సర్గ 23.) విశ్రాంతి పొందిన సాధువుల మనస్సుతో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలుగా కనిపించే ఏకచ్ఛత్రాధిపత్యముగాని, దేవలోకత్వముగాని, పాతాళరాజ్యాధికారంగాని కించిత్ కూడా తులతూగలేవు.
Page:59
మనస్సు విశ్రాంతి పొందిందా... ఇక, శాస్త్ర పాండిత్యంతోను, వక్తృత్వాది గుణములతోను, కర్మకాండతోను పనేమున్నది? అనుభవైకవేద్యమైనది కరతలామలకమౌతుంది.
అసలు ఆత్మకుస్వభావసిద్ధమే అయి ఉన్న శాంతి దేనిచే బాధించబడుతోంది?...
ఈ దేహము యొక్క వ్యాధులచే నా పని అయిపోతోంది... నాకు స్వర్గ సుఖములు కావాలి... నాకు పతనం అనివార్యం... ఈ దేహమనోబుద్ధులే నా రూపం... ఇటువంటి అల్పభావ పరంపరలే స్వస్వభావమగు శాంతిని పాడుచేస్తున్నాయి.
మూఢునికి మాత్రమే ఈ జగద్విషయాలు మొట్టమొదట బహురమ్యంగా కనిపిస్తున్నాయి. క్రమేణ అవి అతనిని పట్టుకుని మృత్యువుకు ఉపాహారంగా అందజేస్తున్నాయి. మహాత్ములు మాత్రం ఈ ఎదురుగా కనిపించే సర్వమునూ అవలీలగా ఆవలకు నెట్టివేసి ఉంటున్నారు. 'ఆశ' అను దానిని దగ్గరకు రానీయకుండా, శాశ్వతసుఖ విశ్రాంతిని తమ సొంతం చేసుకుంటున్నారు. "మృత్యువు దైనందికమైన నిద్ర వంటిదే” అని గ్రహించి జన్మ, జీవన్-మృత్యువులను అధిగమించినట్టి "తేజోమయ ఆత్మా హందృష్టి" ని అలవరచుకొని ఉంటున్నారు.
9. ప్రాణవాయుగతుల ఉపాసన
భుశుండుడు : హే బ్రహ్మవేత్తా! బాగా వింటున్నారు కదా!
ఏకైవ కేవలా దృష్టిః నిరాపాయా గతభ్రమా విద్యతే సర్వవిత్త్వేషు సర్వశ్రేష్టా సమున్నతా॥
నిజానికి 'భ్రమరహితము-సర్వశ్రేష్ఠము-మహోన్నతము’ అగు “అద్వైతదృష్టి” ఒక్కటే సమస్త జ్ఞానమునకు సమున్నత సత్ఫలమైయున్నది.
ఆత్మచిన్తా సమస్తానాం దుఃఖానాం అన్తకారిణీ
చిర సంభృత దుఃస్వప్న సంసారభ్రమహారిణీ॥
ఈ జీవుడు అనాదికాలం నుండి తనవెంట అవిద్యాకామ్యకర్మలను తెచ్చిపెట్టుకుంటూ ప్రతిజన్మలోనూ పెంచి పోషించుకుంటున్నాడు. ఇప్పుడాతనికి దుఃస్వప్నసంసార భ్రమ నుండి, సర్వ దుఃఖానుభవముల నుండి విముక్తి అత్యంతావశ్యకం. అందుకు సరి అయిన ఔషధం సేవించాలి కదా! ఏమిటా ఔషధం? ఈ సర్వమును, సర్వులనూ 'ఏకాత్మ స్వరూపం'గా దర్శించటమే ఔషధం. అట్టి 'ఆత్మచింతన’ అనునది ప్రశస్తమగు పవిత్రమైన మనస్సునందే ఉదయిస్తోందిగాని, మరెక్కడో కాదు. అయితే స్వల్పత్వం ఆశ్రయించే వారికి దుశ్చింతలు, అనర్థాలు, దుఃఖాలు ఉండనే ఉంటున్నాయి. అవి మొదలంటా వినాశనమైనప్పుడు మాత్రమే స్వస్వరూపాత్మజ్ఞానం అబ్బుతోంది. వెన్నెల వస్తే కారుచీకటి మటుమాయం అవుతుంది కదా! సర్వసంకల్పములు వర్ణించినప్పటి ఆత్మచింతన మనస్సులోని మాయ, భ్రాంతి, మోహము అనే మకిలిని కడిగివేస్తోంది.
Page:60
అయితే ఒక్క విషయం! సర్వసంకల్పములకు సమాధానమై, అత్యంత శ్రేష్ఠమైన 'నిరంతరాత్మ చింతన’ అనేది మీవంటి జ్ఞానసమన్వితులగు మహాత్ములకు అత్యంత సులభమై ఉంటోంది. మాలాటి మందమతుల విషయానికి వస్తే అది సుదుర్లభమే అవుతోంది. మావంటి వారిని మా చేతనే కల్పించుకొనిన అజ్ఞానం ఆవరించి ఉంటోంది. మా సునిశ్చయాలు క్షణంలో స్వల్ప సంఘటనలచే చంచలమౌతున్నాయి.
అయితే 'నిరంతరాత్మచింతన' అనే రాణిని మీవలె మేము పొందలేకపోయినప్పటికీ, రాణిగారికి కొందరు ప్రియచెలికత్తెలున్నారు. వారు కూడా ఆమెవలెనే మహాఘనులే. వారు కూడా జ్ఞానచంద్రుని చల్లని కిరణములైయున్నారు. అట్టి ఇష్టసఖులలో ఒక చెలికత్తెను నేను పొందాను. దాని పేరు "ప్రాణచింతన”
ఈ ప్రాణచింతన కూడా సర్వదుఃఖక్షయకారకమే. సౌభాగ్యమును వర్ధిల్లింపజేయగలదు. ఒక జీవుడు జీవించుటకే హేతువగుచున్న ప్రాణచింతన-అనుయోగాభ్యాస మూలముననే నేను చిరంజీవుడనయ్యాను.
శ్రీవసిష్ఠ మహర్షి భుశుండమహాశయా! ముందుగా 'ప్రాణచింతన' అంటే ఏమిటో వివరించి చెప్పండి. తద్వారా మీ చిరంజీవత్వము యొక్క రహస్యమును కూడా విశదపరచ ప్రార్థన. భుశుండుడు :
సర్వ వేదాంత వేత్తాసి! సర్వసంశయనాశకః |
మామ్ ఏతత్ పరిహాసార్థం, మునే! పృచ్ఛసి వాయసమ్ ||
స్వామీ! వసిష్ఠమహర్షీ! మీకు వేదాంత శాస్త్రమంతా తెలుసు. ముముక్షువుల అందరి సంశయములనూ మీరు దూరం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏదో పరిహాసార్థం ఈ కాకి చేత పలికిస్తున్నారు. అయినప్పటికీ మీవంటి మహనీయులతో ఏర్పడే ఉత్తర ప్రత్యుత్తర సంవాదముచే ఆ విషయమై మరికొంత చక్కగా పునశ్చరణ చేసుకోవటానికో, ఆలోచించుకోవటానికో మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. వినండి చెపుతాను.
పశ్య ఇదం, భగవన్! సర్వం దేహగేహం, మనోరమమ్ |
త్రిప్రకారమహాస్థూణం, నవద్వార సమావృతమ్ || పుర్యష్టకకలత్రేణ, తన్మాత్ర స్వజనేన చ ॥ అహంకార గృహస్థేన సర్వతః పరిపాలితమ్ ||
ప్రకృతిచే ప్రసాదించబడిన అత్యంత రమణీయమైన ఈ దేహమును చూస్తున్నారు కదా! ఈ దేహమనే ఇంటికి ‘వాత-పిత్త- కఫములు' అనే మూడు స్థంభాలు ఉన్నాయి.
వాతము = వాయువు; పిత్తము = ధాతువులు (పైత్యరసాదులు); కఫము కఫము = = శ్లేష్మము
ఈ దేహమునకు 9 ద్వారాలున్నాయి2 కన్నులు, 2 ముక్కు రంధ్రములు, 2 చెవులు,
1 నోరు, 1 గుదస్థానము, 1 మర్మాయవము
Page:61
ఈ దేహమనే ఇంటికి యజమాని అహంకారం.
ఈ ఇంటికి గృహిణి 'పుర్యష్టకం'. పుర్యష్టకం అనగా
1. జ్ఞానేంద్రియ పంచకం : చెవులు, చర్మము, కళ్లు, నాలుక, ముక్కు,
2. కర్మేంద్రియ పంచకం : వాక్కు, కాళ్లు, చేతులు, పాయువు, ఉపస్థ
3. వాయు పంచకం : ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. (వాయువు యొక్క వేరు చలన దిశలను అనుసరించి చెప్పబడినవి)
4. భూతపంచకము : భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము.
5. అంతఃకరణ చతుష్టయం : మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 6. అవిద్య : ఆత్మదృష్టి నుండి చ్యుతి
7. కామము : లేనిదేదో ఆశించే స్వభావం. “ఏవో మార్పు చేర్పుల చేత గాని ఆనందం లేదు” అని తలచటం.
8. కర్మము : క్రియావ్యాసంగము.
పంచతన్మాత్రలే ఆ ఇల్లాలికి సహకరించే పనిమనుషులు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములే ఆ పంచతన్మాత్రలు. వాళ్లు ఈ శరీర గృహము యొక్క బాగోగులు చూస్తున్నారు. మన మనో నేత్రాలకు ఈ శరీర గృహం ఎదురుగా కనిపిస్తోంది కదా!
చెంప ప్రక్కగా ఉన్న చెవులే దీని మిద్దెలు (పై మెట్లు). 'వెంట్రుకలు' అనే రెల్లుతో ఈ గృహం కప్పబడి ఉన్నది. ముఖంలోని కళ్లు ద్వారముల వంటివి, రెండు భుజములు శరీర గృహంలోని ఉపమందిరముల వంటివి. బాహ్యమున ఉన్న ఆయావిషయ పరిజ్ఞానాలు, ఈ గృహానికి ద్వార పాలకుల వలె ఉండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల రూపమున వార్తలు లోనికి తేవటం జరుగుతోంది.
ఈ శరీర గృహంలో 'ఆత్మ' అనే ఒకానొక వెలుగు ప్రసరిస్తుండుటచేతనే ఇది వర్తిల్లగలుగు తోంది. ఈ గృహయజమానియగు జీవుడు జాగ్రత్తులో ఉన్నప్పుడు వరండాలో పచార్లు చేస్తున్నట్లుగా ఉన్నది. ఈ శరీరగృహం లోపల రక్త మాంసములనే పేడ నీళ్లచే అలుకబడినట్లుగా ఉంటోంది. బొమికలు అనే కొయ్య చేత, నరములు అనే త్రాళ్ల చేత ఈ శరీరగృహం పడిపోకుండా గట్టిగా నిలచి ఉన్నది.
ఓ మునినాయకా!
ఇడాచ పిఙ్గలాచ అస్య, దేహస్య ముని నాయక |
సుస్థితే కోమలే మధ్యే పార్శ్వకోష్టే నిమీలితే ॥
ఈ దేహము యొక్క మధ్యభాగంలో రెండు కోమలమైన సూక్ష్మనాడులు ఉన్నాయి. శాస్త్రకారులు
వీటికి - 1. ఇడ, 2. పింగళ - - అని పేర్లు పెట్టారు.
Page:62
పద్మయుగ్మత్రయం యస్త్రమ్ అస్థిమాంసమయం మృదు ఊర్ధ్వ-అధోనాలమ్ అన్యోన్యమ్ ఇలత్ కోమల సద్దలమ్ సేకేన వికసత్ పత్రం సకలాకాశచారిణా చలన్తి తస్య పత్రాణి మృదువ్యాప్తిని వాయునా చలత్సు తేషు పత్రేషు స మరుత్ పరివర్ధతే॥ వాతాహతే లతా పత్రజాలే బహిరివాభితః వృద్ధిం నీతః సనాడీషు కృత్వా స్థానమనేకథా ఊర్ధ్వ–అధో వర్తమానాసు దేహే అస్మిన్ ప్రసరత్యథ ప్రాణ-అపాన-సమానాదైః తతః సహృదయానిలః సంకేతైః ప్రోచ్యతే తబ్జెః విచిత్రాచార చేష్టితైః॥
ఈ రెండు నాడులూ అప్రకాశితభావంతో వెలయుచున్నాయి. ఈ రెండు నాడుల మధ్య ఒక స్థానంలో ‘అస్థిమాంస మయము, అతిసున్నితము' అగు హృదయం ఉన్నది. ఆ హృదయపద్మం యొక్క నాళములు పైకి క్రిందకు వ్యాపించి ఉన్నాయి. హృదయము యొక్క దళములు అత్యంత కోమలంగా, పరస్పర మిళితంగా ఉన్నాయి. అట్టి హృదయ స్థానం నుండి శక్తి బహిర్గతంగా, అంతర్గతంగా ప్రయాణిస్తూ ఉన్నది. అదియే ప్రాణశక్తి, ప్రాణతత్వం.
ఇది ఇట్లా ఉండగా, ప్రాణతత్త్వము ముక్కు చివర నుండి పాదముల వరకు దేహాకాశమున విస్తరించి ఉన్నది. ముక్కు నుండి వాయువు పీల్చబడుతోంది కదా! అలా స్వీకరించబడుచున్న వాయువును ‘అపానవాయువు' అని అంటారు. అపానవాయువు యొక్క సేచనము (Intake) వలన హృదయ కమలం వికసించటం జరుగుతోంది. (1) స్వీకరించబడుచున్న (2) విడచిపెట్టబడుచున్న వాయువు వలన హృదయ కమలం వికసించటం, ముకుళించటం జరుగుతోంది.
ఈ వాయువులు హృదయముచే ఆకులను కదలించుచుండగా, క్రమంగా వాటి వీచికలు నలుదిక్కులా వ్యాపించి నాడీఛిద్రములందు ప్రవేశించి వృద్ధిపొందుచున్నాయి. అట్లా అభివృద్ధి చెంది దేహమున భిన్నభిన్న స్థానములను కల్పించుకుంటున్నాయి.
ప్రాణవాయు వ్యాపారములు -
1. అపానవాయువు : అధోముఖముగా ప్రసరిస్తోంది.
2. వ్యానవాయువు : నాడులు సంకోచింపచేయటం విస్తరింపజేయటానికి పనిచేస్తోంది.
3. ఉదానవాయువు : ఊర్ధ్వముఖంగా చలిస్తూ ఉంటుంది.
4. సమానవాయువు : దేహమందలి వివిధ ప్రదేశాల సమానత్వాన్ని నెలకొలుపుతూంటుంది.
5. సప్రాణవాయువు : మొత్తం చలనమును సుస్థిరీకరిస్తూ ఉంటుంది.
ఈ ఐదు పేర్లు ఒకే ప్రాణవాయువు యొక్క (లేక, ప్రాణశక్తి యొక్క ఊర్ధ్వ, అధోనాడీ
మండలమున ప్రవేశించినప్పటి విభిన్న కృత్యముల పేర్లు సుమా!
Page:63
చంద్రబింబము నుండి కిరణములు వెలువడుచున్నాయి చూచారా? అట్లాగే ప్రాణశక్తి అంతా హృదయము నుండి వెలువడి దేహమధ్యమునకు, ఊర్ధ్వ-అధోభాగములకు వ్యాపిస్తోంది. అట్లు వ్యాపించుచూ నాడీసమూహములో ప్రకాశిస్తోంది. అట్లా ప్రవేశించి 'గమన (పోవటం), ఆగమన (రావటం), కర్షణ (కదల్చటం), హరణ (విభాగించటం), విహరణ (కలపటం), పతన (పడవేయటం), ఉత్థాన (లేపటం) - మొదలైన క్రియలను చేస్తూ ఉంటోంది.
హృదయపద్మము నందలి వాయువును విజ్ఞులు ప్రాణము అని పిలుస్తున్నారు. అట్టి ప్రాణ వాయువు ఈ శరీరమును ఉద్దీపించగల శక్తులన్నీ కలిగియున్నది. ప్రాణవాయువు యొక్క ఒకానొక శక్తి వల్ల కళ్లు కదలుచున్నాయి. మరొక శక్తి వల్ల స్పర్శ గ్రహించబడుతోంది. ఇంకొక శక్తి ముక్కులో ప్రవేశించి ఆఘ్రాణము (Smell) యొక్క అనుభవం కలిగిస్తోంది. వేరొక శక్తి వల్ల అన్నం జీర్ణమగు చున్నది. అట్టి ఒకానొక శక్తి వలన గొంతులోని నాళములు ప్రవర్తించి మాటలు వెలువడుచున్నాయి. ఇంతెందుకు? యంత్ర నిర్మాత ఇచ్ఛానుసారం యంత్రశక్తి యంత్రమును చలింపజేస్తూ వివిధ కార్యములను నిర్వర్తింపజేస్తోంది చూచారా? వాయుదేవుడు ఈ శరీరమునందు ప్రవేశించి వివిధ కార్యములను ఒనర్చుచున్నాడు.
తత్ర ఊర్ధ్వ-అధో ద్విసంకేతౌ ప్రసృతావనితా, మునే! I ప్రాణ-అపానావితిఖ్యాతా ప్రకటౌ ద్వావరానితౌ |
"తయోః అనుసరన్ నిత్యం, మునే! గతిమ్ అహం స్థితః"||
ఓ మునీంద్రా! నా హృదయమున ఊర్ధ్వగమనం నిర్వర్తించే ప్రాణవాయువు. అధోగమనం నిర్వర్తించే అపానవాయువు ప్రకాశ్యభావమున వెలయుచున్నాయి కదా! ఇక నేను, నిత్యముసర్వదా వీటియొక్క గతిని గమనిస్తూ, అనుసరిస్తూ ఉన్నాను.
ఈ ప్రాణాపానములు సదా శీతఉష్ణములై ఆకాశమున తిరుగుచూ ఈ శరీరము అనే యంత్రమును మోయుచుండగా, నేనుమాత్రం నిర్విషయుడనై ఎట్టి శ్రమ పొందక ప్రశాంత స్థితియందు ఏర్పడి ఉంటున్నాను.
ఈ ప్రాణాపానములు హృదయకాశమునకు సూర్యచంద్రుల వంటి అగ్నిసోమ (Hot & Cool) స్వభావయుతమై ఉంటున్నాయి. ఈ శరీరమనే పురమునకు మనస్సు అంగరక్షకుడు. మనస్సు అనే రథమునకు ఈ ప్రాణాపానములు రెండు చక్రములవంటివి. అహంకారమనే రాజుకు రెండు ప్రియమైన గుఱ్ఱములవంటివి.
ఓ బ్రహ్మజ్ఞా! ఇక నేను చేస్తున్నదేమిటో మరికొంత విశదీకరించి చెపుతాను వినండి.
ఈ ప్రాణద్వయం (ప్రాణ అపానములు) జాగ్రత్ - స్వప్న - సుషుప్తులందు సర్వదా సమభావమున ఈ దేహమునందు వెలయుచున్నాయి కదా! వాటి యొక్క 'గతి’ని అనుసరిస్తూ నేను సుషుప్తునివలె కాలమును గడుపుచున్నాను. వీణతంతువులోని వేయవవంతు ఎంతటి సూక్ష్మంగా ఉంటుందో... అంత సూక్ష్మప్రసరణతో వాటిని అనుసరిస్తూ ఉంటున్నాను.
Page:64
అవిరతగతయోః “గతిః” విదిత్వా హృదిమరుతోరను సృత్య చోదితాం తామ్ । న పు నరిహ హి జాయతే మహాత్మన్, ముదితమనాః పురుషః ప్రణష్టపాశః ॥
ఈ ప్రాణాపానద్వయం సర్వదా హృదయపద్మమున సంచరిస్తున్నాయి. ఇవి అనేక శాస్త్రములచే అనేక పేర్లతో వర్ణించిచెప్పబడినవి.
ఈ వాయుగతులను ఉపాసించే జీవుడు మృత్యుపాశమునుండి వెలువడగలుగుతాడు. పరమానంద లాభమును పొందుతాడు. అతడు మరల జన్మించుట లేదు. అట్టిప్రాణోపాసకు మనస్సు సర్వదా సంతోషముతో నిండినదై సర్వపాశముల నుండి విడివడుచున్నది.
10. రేచక - పూరక - కుంభకములు - : ప్రాణాపానముల ఉత్పత్తి - లయస్థానములు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ భుశుండ మహాశయా! మీరు ప్రాణ అపానముల గతిని అనుసరిస్తూ ఉంటున్నానని అన్నారు కదా! మీ సాధన, సాధ్యముల గురించి మరికొంత వివరించండి. భుశుండుడు : ఉపాధ్యాయుడు అన్నీ తెలిసియే విద్యార్థిని ప్రశ్నిస్తూ ఉంటారే! జగద్గురువులగు మీరు అన్నీ ఎఱిగి ఉండి కూడా కేవలం వినోదార్థమై ప్రశ్నిస్తున్నారు. అయినా మీ వాక్కు శిరోధార్యం
కదా! వినండి.
పాణో అయమ్ అనిశం, బ్రహ్మమ్! స్పందశక్తిః సదాగతిః | స బాహ్య - అభ్యన్తరే దేహే ప్రాణో అయమ్ ఉపరి స్థితః m
అపానో2పి అనిశం, బ్రహ్మన్! స్పందశక్తిః సదాగతిః | స బాహ్య - అభ్యన్తరే దేహే త్వపానో యమ్ వాక్ స్థితః జాగ్రతః స్వప్నతశ్చైవ ప్రాణాయమో అయమ్ ఉత్తమః ప్రవర్తతే! ||
ఓ బ్రహ్మజ్ఞా ! ఈ దేహమునకు లోపల వెలుపలా కూడా ప్రాణవాయువు తనయొక్క స్పందనశక్తిని ప్రదర్శిస్తూ సంచారం చేస్తోంది. అట్లాగే స్పందన శక్తియుతమైన అపానవాయువు కూడా! జంటగాయకులలో ఒకరు గానం చేస్తూ ఆపుచుండగా మరొకరు అందుకుంటూ ఉంటారు చూచారా? అట్లాగే ఈ ప్రాణ అపానములు జాగ్రత్ - స్వప్న సమయములలో దేహమునకు బాహ్యమున, అంతరమున కూడా ఒకటి నిస్పందనమగుచుండగా రెండవది స్పందన సంతరించు కోవటం జరుగుతోంది. అట్టి ప్రాణ-అపానముల యామమునకు (గతికి) సంబంధించిన జ్ఞానము సంపాదించుకొని ఉండటం జీవునికి పరమశుభప్రదమైయున్నది. ప్రాణాపానముల గతిని అనుసరించి రేచకము - పూరకము - కుంభకము అనే మూడు ప్రాణవాయు స్థితులు ఇటు దేహము యొక్క అంతరమున, అటు దేహమునకు బాహ్యమున నిరంతరం సహజసిద్ధంగా ఏర్పడుచున్నాయి.
Page:65
1. రేచకము - "హృదయంలో నుండి వెలుపలికి ప్రాణవాయువులు ప్రయాణం చేయు స్థితి.
బాహ్యోన్ముఖత్వం ప్రాణానాం యద్ధృదంబుజకోటరాత్ I స్వయసేనాస్తయత్నానాం తం ధీరా 'రేచకమ్' విదుః II
‘హృదయము’ అనే పద్మకోటరం నుండి అప్రయత్నంగానే (స్వాభావికంగా) ప్రాణశక్తి వెలికి వస్తూ ఉంటుంది. అట్టి ‘బాహ్యోన్ముఖత్వము' అనే అసంకల్పిత చర్యనే 'రేచకము' అని విజ్ఞులు పిలుస్తున్నారు.
2. (బాహ్య అభ్యంతర) పూరకము - "ముక్కు కొన నుండి 12 అంగుళాలు బాహ్యమునకు; 12 అంగుళాలు లోనికి - - హృదయము వరకు వాయువు పూరించబడి ఉండు స్థితి.”
ద్వాదశాంజుల పర్యంతం బాహ్యమ్ ఆక్రమతాం అధః | ప్రాణానాం అంగసంస్పర్మో యః స 'పూరక' ఉచ్యతే ॥ బాహ్యాత్ పరాపతత్య అన్తరపానే యత్నవర్జితః |
యో_యం ప్రపూరణః స్పర్శో విదుస్తమపి 'పూరకమ్' ॥
బాహ్యమున (నాసికాగ్రం ముక్కు కొన నుండి 12 అంగుళముల దూరము నుండి ప్రాణము తన స్పందన ప్రారంభించి దేహమును సంస్పర్శించుచూ... ఆ 12 అంగుళాల ప్రదేశమును అపానవాయు రూపంగా (బాహ్యం నుండి అంతరమునకు విడువబడినదిగా) నిండి ఉంటోంది. ఇది అప్రయత్న పూర్వకంగా జరుగుతోంది. ఇది బాహ్యపూరకం.
అట్లాగే నాసిక నుండి అపానవాయువు హృదయం వరకు ప్రాణములు అపాన రూపంగా ప్రవేశించి ఉంటోంది. ఇది అంతరపూరకం. అట్లు యత్నరహితంగా బాహ్య -అంతరములందు ప్రాణవాయువు పూరించి ఉండు స్థితియే “బాహ్య - అభ్యంతర పూరకములు” అని సూచింపబడింది.
3. కుంభకము - హృదయ మధ్యంలో ప్రాణవాయువు లేనట్టి - అపానవాయువు ఉపశమించి నప్పటి స్థితి :
అపానే 9 స్తంగతే ప్రాణో యావత్న అభ్యుదితో హృది | తావత్ సా 'కుంభకావస్థా’ యోగిభిర్యానుభూయతే ॥
అటు తరువాత హృదయంలో ప్రవేశించిన అపానవాయువు ఉపశమనం పొందుతోంది. అట్టి సమయంలో హృదయ మధ్యం (అపానవాయువు ఉపశమించి - - ప్రాణవాయువు ఇంకా ఉదయించక) ...ప్రాణవాయు రహితమై ఉంటోంది. అట్లు హృదయంలో ప్రాణవాయువు లేనంత వరకు 'కుంభకము’ అని చెప్పబడుతోంది. అట్టి కుంభ స్థితి యోగాభ్యాసము చేత మాత్రమే అనుభూతమౌతోంది.
రేచకః కుంభకశ్చైవ పూరకశ్చ త్రిధాస్థితః అపానస్య ఉదయస్థానే ద్వాదశాన్తాత్ అధోబహిః స్వభావాః సర్వకాలస్థాః సమ్యక్ యత్నవివర్జితాః యే ప్రోక్తా స్ఫారమతిభిఃతాన్ శృణు త్వం, మహామతే!
Page:66
ఈ విధంగా 'ప్రాణాయామము' అనునది రేచక పూరక కుంభకములనబడే మూడు విధాలుగా ఒప్పుచున్నది. బాహ్యమున అపాన ప్రారంభ స్థానము నుండి నాసాగ్రము (Nostrils) వరకు గల 12 అంగుళముల ప్రదేశంలో ప్రాణాయామ ప్రక్రియ సాధారణ సమయంలో అసంకల్పితంగా, అప్రయత్నపూర్వకంగా నిరంతరం జరుగుతోంది. అట్లాగే నాసాగ్రం నుండి హృదయప్రదేశం వరకు కూడా నిరంతరం త్రివిధమైన (పూరక కుంభక-రేచకములు) ప్రాణాయామం జరుగుతోంది.
ఓ మహామతీ! నిర్మల బుద్దులగు యోగులు తమ సాధనా సారమగు అనుభవం ఎలా ఉంటోందో వినండి.
కుంభకానుభవం -
ద్వాదశాబ్ధులపర్యన్తాత్ బాహ్యత్ అభ్యుదితః, ప్రభో |
యో వాతఃతస్య తత్రైవ స్వభావాత్ పూరకాదయః ॥
హే ప్రభో! నాసాగ్రం - బాహ్యమున 12 అంగుళముల దూరంలో గల స్థానం ...ఈ రెండిటి మధ్య గల 12 అంగుళముల ప్రదేశంలో వెలయు వాయువు నందు రేచక, పూరక, కుంభకము లనే త్రివిధ ప్రాణాయామ ప్రక్రియ నిరంతరం జరిగి పోతున్నదని అనుకున్నాం కదా! మృత్ అన్తరస్థ అనిష్పన్న ఘటవద్యా స్థితిః బహిః | ద్వాదశాబ్ధుల పర్యన్తో నాసాగ్రసమసంముఖీ |
వ్యోమ్ని నిత్యమ్ అపానస్య తం విదుః "కుంభకం” బుధాః ॥
అట్టి ప్రక్రియలో ఆ రెండిటి మధ్య అపానవాయువు ఆకాశము వలె వెలయుచున్నది. బాహ్యమున 12 అం.ల స్థానము వద్ద (At the point at a distance of 12" from Nose) ప్రాణములు అపానవాయువు (Inward Bound air)గా ఇంకనూ రూపుదిద్దుకొనని సమయమొక్కటి ఉన్నది. మట్టి యందు ఇంకను రూపుదిద్దుకొనని కుండయొక్క ఆకారము వలె ప్రాణవాయువునందు అపానత్వము దాగి ఉన్న స్థితి అది. అనగా వాయువు కదులుటకు సిద్ధమై ఇంకా నిశ్చలత్వమును వీడనప్పటి స్థితి. అపానవాయువు యొక్క అప్పటి నిస్పంద స్థితిని 'బాహ్యకుంభకం' అంటున్నారు.
అనగా...
బహిరస్తం గతే ప్రాణే యావన్నాపాన ఉద్గతః |
తావత్ పూర్ణం సమావస్థం బహిష్ఠం కుంభకం విదుః ||
.. బహిరస్థమైన ప్రాణము తన చలనమును త్యజించి కూడా ఇంకా అపానత్వము (Reverse motion) అవధరించక ‘సమావస్థ'లో ఉండి ఉన్నంత సమయం... ఆ స్థితి బాహ్యకుంభకం అనిపించు కుంటోంది.
పూరకానుభవం -
బాహ్యోన్ముఖస్య వాయోర్యా నాసికాగ్రావధిర్గతిః ।
తం బాహ్యపూరకం తు ఆద్యం విదుర్ యోగవిదో జనాః ॥
Page:67
నాసాగ్రాదపి నిర్గత్య ద్వాదశాస్త్ర అవధిర్గతిః | యోవా యోస్తం విదుర్దీరా అపరం బాహ్య పూరకమ్ || ద్వాదశాన్తాద్యదుత్థాయ రూపపీ వరతా పరా | అపానస్య బహిష్ఠం తమ్ అపరం పూరకం విదుః ॥
అపానవాయువు చలనము ప్రారంభించి నాసికాగ్రం (ముక్కుపుటలు) చేరుచుండగా ఆ 12 అంగుళముల ప్రదేశంలో బాహ్యపూరకం జరుగుతోంది. ముక్కు పుటల నుండి హృదయ స్థానము వరకు వాయువు ప్రవేశించియున్న సమయంలో అంతరపూరకం జరుగుతోంది.
రేచకానుభవం -
యత్త దన్తర్ముఖత్వంస్యాదపానస్యోదయం వినా |
తం బాహ్య రేచకం విద్యాచిన్యమానమ్ విముక్తిదమ్ ||
బాహ్యమున నిష్పందమగు ప్రాణవాయువు యొక్క స్పందనమునకు సంబంధించిన ప్రయత్నమే బాహ్య రేచకం. అట్లాగే హృదయమున గల ప్రాణవాయువు బయల్వెడలుటకు ఉపక్రమిస్తున్న ప్రయత్నమే అంతర్చకం.
బాహ్య-అభ్యంతర కుంభకాదులను-ప్రాణాపానములస్వభావమును గమనించటం :
బాహ్యానాం, అభ్యంతరాంశ్చ ఏతాన్ కుంభకాదీన్ అనారతమ్ | ప్రాణాపాన స్వభావాంస్తాన్ బుద్ధ్వా భూయో న జాయతే | అష్టావేతే మహాబుద్ధే రాత్రిందివమను స్మృతాః ॥
ఈ బాహ్య-అభ్యంతరీయమునగు ప్రాణ-అపానముల యొక్క కుంభక - రేచక - - పూరకముల అనావృత్త (Non-Moving, Non-Avocative) స్థానములను గ్రహిస్తూ ఉండగలిగిన మహనీయునకు ఇక పునర్జన్మకు కారణములుండవు. అనగా అట్టి జీవుడు పునర్జన్మరహితుడగుచున్నాడు.
నాచే ఈ చెప్పబడుచున్న 'బాహ్యపూరక కుంభక-రేచకములు, అంతర్పూరక-కుంభక -రేచకములు, బాహ్య-అంతరంగ అనావృత్త స్థితులు' అనబడే వాయులీయమైన 8 అవస్థలు రాత్రింబవళ్లు బుద్ధిపూర్వకంగా అభ్యసించుచు రాగా, అట్టి జీవునకు తప్పక సులభంగా ముక్తి లభిస్తుంది. అనగా అతడు మనోవృత్తులను క్రమంగా జయించి 'స్థిరత్వము’ను అనుభూతం చేసుకో
గలుగుతాడు.
ఈ దేహవాయువులు అతి చంచలములైనవి సుమా! అయితే, అభ్యాసబలంచేత వాటి చంచలత్వం జాగ్రత్తులోను, స్వప్నంలోను, సుషుప్తిలోను, కదులుచున్నప్పుడు, కదలకుండనప్పుడు అన్ని కాలము లందూ, అన్ని వేళలందూ నిరుద్ధం (control) కాగలవు. అనగా, అవి అభ్యాసవశంగా బుద్ధికి లోబడి ఉండగలవు. బుద్ధిపూర్వకంగా ఈ రేచక - పూరక - కుంభకములను అనుష్ఠించు జీవుని మనస్సు ఆయా భోజనాది కార్యములు ఆచరిస్తున్నప్పటికీ కర్తృత్వశూన్యమై వెలయగలదు.
Page:68
ప్రాణచింతనారతుడగు వాడు అల్పసమయంలోనే దృశ్యవస్తువులను పరిత్యజించి కైవల్యమును పొందుచున్నాడు. ఒక శాకాహారి బాటప్రక్కన పడి ఉన్న చచ్చిన ఎద్దు యొక్క చర్మమాంసములను ఏ విధంగా ఏవగించుకుంటాడో ఆ విధంగా ప్రాణాయామ సాధకుడు విషయాకర్షణలకు స్వభావ సిద్ధంగా దూరంగా ఉంటాడు.
నాచే ఇంతవరకూ వర్ణించబడిన ప్రాణచింతనను అభ్యసించిన అనేకులు కృతబుద్ధులై పొంద వలసిన దానిని పొందారు. సర్వావస్థలందునూ అట్టి ప్రాణదృష్టిని అవలంబించినవారు మరల బంధములను ఆశ్రయించటానికి కారణములుండవు. ప్రాణాపానములను నిరుద్ధం చేసి, తత్త్వజ్ఞానం పొందగలిగినాడు - ఇక అతడు సర్వదా సర్వకార్యములు ఒనర్చుచున్నప్పటికీ తనకు తాను సర్వదా నిర్మల స్వభావముననే వెలయుచున్నాడు. అతడు మోహమును పొందక, సుఖంగా ఉంటున్నాడు.
ప్రాణవాయువు హృత్పద్మదళము నుండి లేచి 12 అంగుళ భాగమువరకు ప్రసరించి నిశ్చలంగా ఉండటమే "ప్రాణము యొక్క అభ్యుదయం.”
అట్టి ద్వాదశాంగుళ స్థాన శేషప్రాంతం (Residual space) నుండి హృదయ పద్మమున ప్రవేశించి నిశ్చలంగా ఉండుటయే "అపాన వాయువు యొక్క అభ్యుదయం.”
ప్రాణవాయువు ద్వాదశాంగుళ పరిమిత శూన్యస్థానమునకు ప్రవహించుచున్నప్పుడు, అదే సమయంలో అపాన వాయువు అదే మార్గం అవలంబించి లోనికి జొచ్చుచూ ఉంటుంది.
ప్రాణవాయువు బహిరాకాశము వైపుకు ఉన్ముఖమై ఒక అగ్నిశిఖవలె, సూర్యకిరణ కాంతివలె ప్రవహించుచుండగా, అపానవాయువు హృదయాకాశము వైపు నీటి వలె క్రిందికి ప్రవహిస్తోంది. చంద్రరూపమున, చంద్రకాంతుల వలె, శీతల ప్రదేశ జలం వలె చల్లబరుస్తోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : మిత్రమా! ఈ ప్రాణా-పానముల గమన లక్షణముల గురించి, వీటికి దేహముతో గల అవినాభావ సంబంధం గురించి మరికొంత వివరించండి.
భుశుండుడు : అంతర్గతమైన ప్రాణవాయువు సూర్యుని లేక అగ్ని రూపమున ఈ శరీరమును పరిపక్వమొనర్చుచూ ఉంటుంది. ప్రాణవాయువు హృదయాకాశమును ముందుగా తప్తమొనర్చి, ఆ తరువాత ముఖాగ్రభాగమును (The outerspace of face) కూడా తప్తమొనర్చుచున్నది.
అపానవాయువో... నిమేష మధ్య కాలంలోనే ముందుగా ముఖాగ్రభాగమును తప్తమొనర్చి ఆ తరువాత హృదయాకాశము వైపుగా కూడా ప్రవహించి నైర్మల్యం చేస్తోంది.
ఎక్కడైతే ప్రాణము అపానమును దాని కళలతో సహా గ్రహిస్తోందో అట్టిది బ్రహ్మస్థానము. ఆ బ్రహ్మపదమును పొందువారు ఇక జగత్మలను పొందరు.
అట్లాగే, అపానము ఎక్కడైతే ప్రాణమును, దాని కళలను గ్రహిస్తుందో అచ్చోటి పరమ పదమును పొందినవారు జన్మరహితులగుచున్నారు.
Page:69
ఓ మునిసత్తమా! ప్రాణవాయువే బహిరంతరాకాశములందు సూర్యుని రూపమున ప్రకాశి స్తోంది. అట్లా ప్రకాశిస్తూ, ఇంతలోనే ఆహ్లాదకరమగు చంద్రరూపమును పొందుతోంది. తిరిగి, తాపయుక్తమును పొందుతోంది. ప్రాణవాయువులు సూర్యత్వమును త్యజించి, చంద్రత్వమును పొందుటకు ముందు 'ప్రాణాపానములు ఉత్పత్తికి పూర్వసమయం' అని యోగులు గ్రహిస్తున్నారు. అట్టి పూర్వసంధి సమయంలో ఒకానొక 'ప్రాణవాయువు లయత్వం పొందిన స్థితి' ఏర్పడి ఉంటోంది. ఆ స్థితిలో అశరీరత్వము, నిష్క్రియత్వము, నిర్మనస్కము, అప్రమేయత్వము మొదలైన ఆత్మ యొక్క వాస్తవస్వభావములు అనుభూతములౌతున్నాయి. అట్టి అతీతత్వ స్థితిలో ఆ యోగి, లేక సాధకుడు దేశకాలాది సర్వ పరిచ్ఛిన్నములకూ అతీతుడై, అనిర్వచనీయ తేజోరాశి అయి వెలుగొందుచున్నాడు. అనగా, అతడు ఈ మనస్సు-హృదయముల మధ్య 'ప్రాణాపానముల మధ్యస్తము' అను సాధన సహాయంతో స్వాధిష్ఠానమగు తన రూపమును గ్రహిస్తున్నాడు. అట్టి స్వస్వరూపమగు పరమాత్మ యొక్క అనుసంధానమును బడసి పునర్జన్మరహితుడగుచున్నాడు.
యోగి తన హృదయంలోనే మధ్యగా ఉదయాస్తమయములు (ప్రాణా-పానముల ఉత్పత్తి, లయం, ఉభయములూ రహితమైన స్థితి), గమనాగమనములు కలిగి తేజోవంతుడగుచున్నాడు. ఎవడు తన యందు మనఃసహితమగు ఆత్మభగవానుని (లేక, ప్రాణయోగ పరిభాషలో చంద్ర సహితుడగు సూర్యుని) గాంచుచున్నాడో... ఆతడే యథార్థ ద్రష్ట. ఈ బయట ఉన్న చీకటి ఉన్నా ఫరవాలేదు. లేకున్నా ఫర్వాలేదు. ఎవ్వడైతే తన హృదయమున ఉన్న అంధకారాన్ని నిర్మూలించు కుంటాడో, ఆతడే ప్రకృతిసిద్ధమగు సిద్ధిని బడసినవాడు. 'బయట చీకటి తొలగాలి' అని అనుకుంటే, అప్పుడు జగత్తును ఉద్దేశిస్తున్నట్లే కదా! కానీ ఈ ద్రష్ట దృశ్యము కంటే అత్యంత సూక్ష్ముడు. హృదయంలో అంధకారం క్షీణించిందా, ఇక మరుక్షణమే ఆత్మ అవలోకితమగుచున్నది. ఉదయ అస్తమయముల వంటి ఈ ప్రాణాపాన సమన్వితమగు ప్రాణశక్తి యొక్క ఆరాధన హృదయమున గల పెనుచీకటిని తొలగించుటకు సమర్థమగుచున్నది. ప్రాణతత్త్వమును చక్కగా, బుద్ధిపూర్వకంగా గ్రహించి... అనుకరించు వారికి ముక్తి కరతలామలకమగుచున్నది. అందుచేత శ్రద్ధగా ప్రాణ తత్త్వమును ఆశ్రయించి జ్ఞానసూర్యుని దర్శనం పొందవచ్చు.
అపానము ఎక్కడ అస్తమిస్తోందో, ఆ హృదయ విభాగ స్థానమునందు ప్రాణశక్తి ఉదయించి బహిర్ముఖమగుచున్నది.
ఈ ప్రాణ - అపానముల ఉదయాస్తమయములు 'నీడ తొలగిన చోట ఎండ రావటం, ఎండ వచ్చే చోట నీడ తొలగటం' వంటిది. ప్రాణ- అపానాలలో ఒకటి తొలగిన చోట రెండవది ఉత్పన్నమౌతూ ఉంటుంది. మొట్టమొదట ఈ యోగరహస్యాన్ని చక్కగా, సుస్పష్టంగా గ్రహించాలిప్రాణవాయువు అస్తమించగా అపానవాయువు అభ్యుదయస్థితి - బాహ్యకుంభకం అపానవాయువు అస్తమించి ప్రాణవాయువు ఉదయించు స్థితి - అంతఃకుంభకం ఈ బాహ్యకుంభకం గాని, అంతఃకుంభకం గాని, రెండూ గాని అవలంబిస్తూ వస్తే, ఇక అట్టి సాధకునకు శోకమునకు స్థానమే ఉండదు.
Page:70
‘ప్రసరించు ప్రాణమునంతటినీ రేచకం ఒనర్చి, ఇక స్వచ్ఛమగు కుంభకం అభ్యసించగలిగితే సకల మానసిక రుగ్మతలూ తొలగటం ఖాయం.
బాహ్యరేచక కారణమగు ప్రాణవాయువు లోపలికి ప్రవేశించుటను గాంచినవాడు జన్మరహితుడే అవుతాడు. ప్రాణ - అపానములు రెండు విలీనం పొందితే ఇక శాంతాత్మపదం లభ్యం అవుతుంది.
#
బాహ్య అంతర 'కుంభక'రూపమగు అపానము ప్రాణమును గ్రహించటానికి ఉద్యమిస్తు న్నప్పుడు, ఆ సమయంలో చేసే విచారణచే ఈ దేశకాలములు చిన్మాత్రరూపములుగా గ్రహించ బడతాయి. అనగా, ప్రాణము అపానమును హృదయమునందుగాని, వెలుపలగాని గ్రహించటానికి ఉద్యమిస్తున్నప్పుడు, ఆ సమయంలో చేసే విచారణ దేశకాలముల అపరిచ్ఛిన్నత యొక్క అనుభూతికి దారి తీస్తుంది. అప్పుడు దుఃఖరహితపదము సుస్థిరమౌతుంది.
కనుక మహర్షీ! ప్రాణాపానములు రెండు పరస్పరగ్రస్తములైనప్పుడు ఈ సాంసారిక దృష్టికి తారసపడే దేశకాలములు స్వతఃసిద్ధంగానే విలీనం చెందుతాయి.
ప్రతిజీవుడు....ప్రాణవాయువు అస్తమించిన తరువాత అపానవాయువు ఇంకా ఉదయించని స్థితిని రోజంతా పొందుచూనే ఉన్నాడు. దానిని యోగ పరిభాషలో 'అయత్న సిద్ధమగు బాహ్య
కుంభకం' అని అంటారు.
అయితే నిర్యత్న సిద్ధమగు అంతఃకుంభకమే పరమపదము. “అదియే ఆత్మయొక్క నిశ్చలస్థితిని ఉపాసించటం” అని యోగులు గమనిస్తున్నారు. అదియే విశుద్ధము-పరము అగు చైతన్యము.
ప్రాణాపానముల సూక్ష్మ లయస్థానం - మేము అసిధారగా నిరంతరం ఉపాసిస్తున్న ఆత్మ విషయమై
చెపుతాను... వినండి.
పుష్పంలో సుగంధం ఉన్నట్లు ప్రాణమునకు ఈవలఆవల చిదాత్మ వెలయుచున్నది. అది ప్రాణము కాదు. అపానము కాదు. జలమునందు దాహము యొక్క ఔషధత్వం అంతర్లీనమై ఉన్నట్లు చిదాత్మ ఈ దేహం నందు ఆక్రమించుకొని ఉన్నది. అది సజీవము కాదు. నిర్జీవం కాదు.
ఆ చిదాత్మ ప్రాణలయమునకు సన్నిహితం. ప్రాణచలనములకు దూరస్థం. ప్రాణాపానములకు మధ్యస్థము.
ఆ చిదాత్మ ప్రాణములకే ప్రాణం. జీవమునకు పరమ జీవనము. ఈ దేహం మొత్తం మీద అగ్రగణ్యుడు అతడే. మనస్సు యొక్క మననం... బుద్దియొక్క బోధకం... అహంకారమునకు అహంకారోత్పత్తి కారణం... - ఇదంతా కూడా ఆ చిదాత్మయందు వెలయుచున్నది. అతడే అంతా అయి వెలయుచున్నాడు. ప్రాణ-అపాన అంతర్గతుడై ఉన్నాడు.
అతడు ‘పరంజ్యోతి’ అని, 'శుద్ధబ్రహ్మపవిత్రమూర్తి' అని 'సర్వపాపపావనుడు' అని విద్వత్కవులు వర్ణించి చెప్పుచున్నారు. అతడే ఈ ‘మనస్సు, బుద్ధి, అహంకారము' అనే భావనలను పొందుచున్నాడు. అయితే తన యొక్క స్వస్వరూపము నుండి ఏమాత్రం చ్యుతుడు కాకయే వెలుగొందుచున్నాడు.
Page:71
అట్టి నిష్కళంకచిదాత్మమూర్తి, ‘అపానవాయువు అస్తమించక-ప్రాణవాయువు ఉదయించని’ అనిర్వచనీయమైన చోట అత్యంత సుస్పష్టంగా వెలుగొందుచున్నాడు.
అతడు సర్వవ్యాపకుడు అయి ఉండి కూడా ప్రాణాపానముల మధ్య నాసాగ్ర - ఆకాశప్రదేశంలో దృఢానుభూతిని ప్రసాదిస్తున్నాడు. ఎక్కడైతే ప్రాణాపానములు అస్తమించి, మరల ఉదయించక ఉంటున్నాయో ఆ తావు ఆ చిదాత్మయే.
బాహ్య అభ్యంతరీయములగు ప్రాణఅపానముల ఉత్పత్తి స్థానము, యోగము యొక్క ప్రారంభప్రదేశం, యోగి యొక్క అంతిమ లక్ష్యము అదే. జీవుడు ఈ 'ప్రాణ-అపానములు' అనే రథాన్ని అధిరోహించి ఉంటున్నాడు. ప్రాణాపానములకు అతడే శక్తి అయి ఉండి, అల్పమేధస్కులకు పరిఛిన్నుని వలె తోచుచున్నాడు. ప్రాణాపానములవలె తోచుశక్తి ఆతడే. 1. హృదయమున ‘ప్రాణవాయుకుంభకం' గాను, 2. బయట ‘అపానవాయుకుంభకం'గాను, 3. బయటనుండి లోపలికి 'పూరకం'గాను ఆయా భావములందు ఆతడే వివర్తమొందుచున్నాడు.
అంతేకాదు ఆతడు... ప్రాణాపాన పరిచారకుడై,... అద్దాని అస్థిత్వబోధకుడై, ...ప్రాణోపాసన అభ్యాసమునకు లభ్యుడై, ...రూపహీనుడై, ...జాజ్వల్యమానంగా వెలుగొందుచున్నాడు.
ప్రాణస్పంద హేతువు అతడే సుమా! ప్రాణములు శక్తిస్వరూపమైతే, ఇక, ఆత్మభగవానుడు... ‘ఆ శక్తి ఎవరిదో’...ఆతడు సుమా! ఇంద్రియ విషయ స్పర్శ కారణము, విషయానందములకు కల కారణము అతడే.
హే మహర్షీ! ఎవ్వనియందైతే ఈ విభేదనావిభాగ కళంకం ఏమాత్రం లేదో, నిజానికి ఈ కల్పనా సమూహములన్నీ ఎవని నాశ్రయించుకుని ఉన్నాయో, ఎవని వైభవము స్వానుభవమే అయి ఉన్నదో- ఆ సకల దేవతావందితుడు, సర్వశ్రేష్ఠుడు అగు పరమాత్మను మేము ప్రాణ సశాంతస్థాన సేవనం ద్వారా ఉపాసిస్తున్నాం. నిరంతరం శరణు వేడుతూ తరిస్తున్నాం. జగత్తులోని నా రూపం 'జీవాత్మ' ఈ 'జీవుడు’ అనుజగన్నాటకంలోని జగత్తులోని నా పాత్రకు ఆధారమైనదే నా “పరమాత్మ రూపం”. జీవాత్మచే ప్రాణోపాసన ద్వారా పరమాత్మను ఉపాసిస్తున్నాం. ఇదే మా 'చిరంజీవము’ యొక్క మర్మగర్భ రహస్యం.
11. ప్రాణాపానముల సమాధానం
భుశుండుడు :
ఏషాహి చిత్తవిశ్రాంతిః మయా ప్రాణసమాధినా ॥
క్రమేణానేన సంప్రాప్తా స్వయమాత్మని నిర్మలే ॥ ||
నేను ప్రాణములను దిగ్విజయంగా సమాధానపరచాను. చిత్తమున విశ్రాంతి పొంది క్రమముగా నిర్మలాత్మ స్వరూపుడనయ్యాను.
Page:72
శ్రీవసిష్ఠ మహర్షి : అనగా, మీరు ఉద్దేశపూర్వకంగా ప్రాణాపానములను అవలంబిస్తూ ఉన్నారా? భుశుండుడు : ప్రాణాపానములకు అంతర్గతమైనయున్న చిదాత్మను అవలంబిస్తున్నాను. అందుచేత... ఒక ప్రక్క ఆ మేరు పర్వతం చలిస్తున్న సమయంలో కూడా నేను కించితూడా, ఒక అరనిమిషం కూడా చలించటం లేదు. కూర్చున్నప్పుడు, నిలబడేటప్పుడు, నడుస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నిదురిస్తున్నప్పుడు ఈ నా 'ఆత్మసమాధి' చెదురుటయే లేదు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జగత్తులో నిత్య-అనిత్యాలైన ఇష్ట-అయిష్టాలైన, సుఖ దుఃఖ కారకాలైన ఆయా విషయాలు వచ్చిపోతూ ఉండటం సహజం కదా! ఆ సమయంలో మీ అభ్యాసమెలా ఉంటోంది? భుశుండుడు : ఆ సమయంలో అంతర్ముఖుడనై స్ఫటిక స్వచ్ఛ భావమగు ఆత్మయందు వెలసి ఉండటం చేత అవన్నీ స్పందింపజాలకున్నాయి.
వాయువు నిరోధింపబడిన నిరోధింపబడుగాక! ప్రబల నదీప్రవాహం అడ్డగించబడిన అడ్డగించ బడుగాక! నేను ఆత్మసమాధి విరుద్ధములగు ఏ విషయములనూ ఏమాత్రం స్మరించటమే లేదు. నాయొక్క దృశ్యవిషయ స్మరణరాహిత్యబలం చేత ఇక్కడ ఏవీ కూడా నా ఆత్మ సమాధికి విఘ్నం కలిగించ లేకున్నాయి.
హే మహర్షీ! ఈ ప్రాణ - అపానగతులను అనుసరిస్తూనే అంతరంగుడు, బహిర్నిలయుడు కూడా అయిన పరమాత్మను దర్శిస్తూ ఉండటంచేత అత్యంత స్వభావసిద్ధంగా సర్వశోకవిషయములకు అతీతుడనై ఉంటున్నాను. ఉత్తమోత్తమ పదమును అలంకరించి ఉన్నాను. ధీరస్వభావుడనై మహా ప్రళయం మొదలుకొని అసంఖ్యాకజీవులు కాలప్రవాహంలో మునగటం, తేలటం సాక్షీభావంగా దర్శిస్తూ వస్తున్నాను. ధీరోదాత్తుడనై, చిరంజీవుడనై ఇక్కడే వెలయుచున్నాను. సర్వఫలేచ్ఛలను జయించివేశాను. దేని పట్లా ఎట్టి అభిమానమూ లేకుండానే ఆయా ప్రాప్తములైన కర్మలు నిర్వర్తిస్తూ ప్రపంచం పట్ల సుషుప్తునిలాగానూ, అనుభవం విషయంలో 'కేవలీస్వభావం”తోనూ ఉండి ఉంటున్నాను. 'ఇది ఇష్టం, ఇది కాదు...ఇది గ్రహించాలి. ఇది త్యజించాలి' అనే చింతలన్నీ ఆత్మదర్శనదృష్టిచే అత్యంత స్వల్పమైనవిగా గాంచుచున్నాను. కేవలం పరమాత్మయందే వెలయుచుండుటచే రాగము లేదు. మనోరాగ (జాడ్య) రహితమగుటచే చిరంజీవినయ్యాను. ప్రాణాపానసమయోగసమయంలో నిర్వర్తించే ‘సమనుస్మరణ' యొక్క ప్రభావముచేతనే నాకు కేవలాత్మానుభవసంతుష్టియందు ప్రవేశం లభించింది. 'ఇది పొందాను; అది పొందలేదు; ఇక ఇది పొందుతానో, లేదో...?’ మొదలగు చింతలు దరిజేరనీయకపోవటమే నా చిరంజీవత్వము యొక్క రహస్యం.
నా విషయం గాని, పరుల విషయం గాని, దేనినీ... ఎన్నడూ స్తుతించటం లేదు, నిందించటం లేదు. అందుచేతనే ఇట్టి మహత్ శుభమును పొందగలిగాను. శుభములకు పొంగటం, అశుభములకు క్రుంగటం... ఇదంతా స్వల్పత్వాన్ని తెచ్చిపెట్టుకోవటమే కదా! ఆ రెండిటి విషయంలోనూ సంతోష దుఃఖములను అనుసరించకుండా యథాతథంగా నేను ప్రాణాపానములను ఆశ్రయించటం కొన సాగించటం చేతనే చిరంజీవత్వం నాకు స్వభావసిద్ధమవుతోంది. సర్వ ద్వైతబాధ లక్షణములను
Page:73
త్యజించిన వాడనై 'పరమ త్యాగము' అవలంబించి సర్వమునూ సర్వదా త్యజించి ఉన్నాను. అందుచేత ఏర్పడిన బుద్ధిబలంచేత జీవితాభినివేశమనతగు మరణమును కూడా త్యజించివేశాను.
ప్రాణానుకరణ బలం చేత నా మనస్సు చాపల్యరహితమై శోకహీనమై క్రమంగా స్వస్థతను, సమాహితస్థితిని పొందింది. ఆకాశమువలె కాష్టమును, స్త్రీని, కొండను, గడ్డిపరకను ఒకే స్పందనతో గాంచుచున్నాను.
“ఈ రోజు ఏంచేశాను? రేపు ఏంచేయాలి?" అనే చింతన నాకు లేదు. ఈ శరీరానికి సంబంధించిన హాని-వృద్ధులతో నేను సంబంధం పెట్టుకోవటం లేదు. “ఇతడు మిత్రుడు, అతను కాదు, ఇతను మాకంటే వేరు, వీళ్లు అయినవాళ్లు, వాళ్లు కాని వారు" - అనే క్రీనీడ దరి జేరకుండా ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానాగ్నిని ప్రజ్వరిల్లజేయుచున్నాను. “చైతన్యభగవానుడగు నేనే నానాత్వముగా కూడా ఏర్పడి, తద్వారా నాకు కనిపించేదంతా అయి ఉన్నాను. కనుక నాకు వేరైన నానాత్వం ఎక్కడా లేదు. ఉండదు” - అను అచ్యుత భావన సృష్టీకరించుకొని ఉంటున్నాను. ప్రాణ-అపానముల మధ్య నిత్యతృప్త స్వభావంచే వెలసి ఉండటం చేత 'ఈ దేహమే నేను' అనే అభిమానం నాకు కలగటమే లేదు.
గాఢ నిద్రపోయేవాని దృష్టిలో ఈ జగత్తు మొదలంటా 'లేనిది'గా అవుతుంది. చూచారా? అట్లాగే సర్వకర్మల ఆరంభదశనుండి 'ఈ జగత్తు లేదు' అని గ్రహించియే ఉంటున్నాను. ఆయా కాలములందు వచ్చి వెళ్లే అర్థానర్థములను ఈ కుడి-ఎడమ చేతులను చూస్తున్నట్లు సమానభావముతో గాంచుచున్నాను.
‘స్వరూపచ్యుతి’ లేనట్టి ‘స్థైర్యశక్తి'తో ఇతరుల పట్ల సర్వభూతాత్మభావన కలిగినవాడనై చూస్తున్నాను. స్నేహమయమైన మనోదృష్టులతో అంతటినీ ఋజువుగా (Straight forwardly), అకుటిలముగా (Non viciously) దర్శిస్తున్నాను. ఈ శరీరం మీద, తల నుండి క్రింద పాదములవరకు - ఎచ్చటా, దేని మీదా కొంచెం కూడా అభిమానం లేదు. 'అహంకారం' అనే బురదను 'ప్రాణాపానముల సంధి' అనే జలంతో పరిశుభ్రపరిచి స్వస్థుడనై ఉన్నాను. అభిమాన శూన్యుడనై ఉండటం చేత ఏది శారీరకంగా ఈ ఈ కార్యములు నిర్వర్తిస్తున్నప్పటికీ మనస్సు మాత్రం నిత్య నిర్మల నైష్కర్మ్య సిద్ధిని బడసింది. ఎప్పుడైనా ఏదైనా నూతన విషయం కొంచెం తారసపడినప్పుడు నా మనస్సు 'ప్రాణాతీత - అలౌకిక - - అనిర్వచనీయ చిదాత్మోపాసన' వలన గర్వదోష రహితమై ప్రవర్తిస్తోంది.
ఇతరులను పరాభవించే సందర్భము, సామర్థ్యము ఏర్పడినప్పుడు కూడా నేను ఇతరులను పరాభవించను. నా బుద్ధి స్థిరత్వం పొంది ఉండటం చేత ఒకవేళ ఇతరులు పరాభవిస్తున్నప్పటికీ నాకు దుఃఖలేశం కూడా కలగటం లేదు. సర్వభూతములందున్న చిదాత్మను సదా దర్శిస్తూ ఉండటం చేత సర్వసమదర్శినై సర్వత్రా ఏర్పడి ఉండగలుగుచున్నాను.
అందుచేతనే నేను చిరామయజీవిని. సర్వదా సమాహితుడనై ఉంటూ, ఇక ఆశాపాశజనితమగు చిత్తవృత్తులను హృదయంలోనికి జొరనివ్వటం లేదు.
Page:74
బహిర్విషయములందు మౌనం వహించి వాటినన్నిటినీ అసత్తుగా గాంచుచున్నాను. ఆత్మ విషయము నందు అనుక్షణం ప్రబుద్ధుడనై ఈ చేతులను చూస్తున్నట్లుగా దాని సత్తను గాంచుచున్నాను.
పరుల కష్టసుఖముల పట్ల అవి నాకే అబ్బినట్లు దుఃఖించుచు, సుఖించుచున్నాను. అందరికీ నేను ప్రియుడనే.
ఆపదల పట్ల నిర్లిప్తుడనై అచలుడనై, ధీరుడనై ఉన్నాను. 'అయ్యా! భుశుండా! నీవు జగన్మిత్రుడవయ్యా' అని నాకు నేను సర్వదా గుర్తు చేసుకుంటున్నాను. ఈ సంపదల హెచ్చుతగ్గులు నేను పొందటం లేదు. నేను నేను గాను. నాకు 'నా' అనువారు ఎవరూ లేరు. నేను ఎవరికీ చెందను. నాకు ఎవరూ చెందరు. ...అయినా కూడా ఈ దృశ్యమాన జగత్తంతా నేనే!
“నేనే దేశ కాలములను విభజిస్తున్న ఆకాశమును” - అనే సమాధానము సంపాదించుకున్నాను. ‘అంతయూ నిండియున్న అద్వితీయుడను' అను ఆత్మాహంకారబుద్ధి నాయందు అణువణువునా ఏర్పడి ఉన్నది. ప్రాణాపానముల లయస్థానంలో నన్ను నేను ప్రతిక్షేపించుకొని ఈ తదితరమంతా దర్శిస్తున్నప్పుడు 'ఇక్కడ కనబడే మట్టి - మట్టికుండ, కొయ్య - శకటము' ఇవన్నీ 'చిత్'గా అత్యంత స్పష్టమై నాకు గోచరిస్తున్నాయి.
అట్టి దృష్టిబలం చేత నేను అనామయ చిరంజీవత్వం పొందాను. ఈ పాంచభౌతిక దేహంతో ‘భుశుండవాయసము' అని ఒక ప్రక్క పిలువబడుతూనే, ఇక్కడ ఉండి 'బ్రహ్మసాగరంలో తరంగములు' అనతగ్గ ఈ త్రిలోకముల జన్మ-స్థితి-లయములకు మూలస్థానంగా నన్ను నేను గాంచుచున్నాను.
ఈ జగత్తులన్నీ ఉత్పత్తి అగుచున్నదెక్కడ? ఇవన్నీ భావనయొక్క ఘాత - ప్రతిఘాతములే అని నేను గ్రహించాను. "సర్వసాక్షియగు ఆత్మయందే మనోబుద్ధులను ఆశ్రయించి ఈ జగత్తులు ఉత్పత్తి - పతనములను పొందుచున్నాయి' అని గమనిస్తున్నాను.
12 వీడ్కోలు
భుశుండుడు : హే మహర్షీ! ప్రాణాపానముల మధ్యస్థమగు అనుభవయోగముచే నేను ఎట్లా చిరంజీవుడనైనానో చెప్పాను. మీ యొక్క దర్శనముచే ఆత్మజ్ఞానానుభవం పొంగిపొరలుతోంది. అందుకే జ్ఞానసాగరస్వరూపులుగు మీముందు స్వతంత్రించి నా ఆత్మానుభవమును వర్ణించాను. శ్రీవసిష్ఠ మహర్షి : హే భగవంతుడా! భుశుండా! మీరు చెప్పిన వాక్యముల వెనుక దాగిన మహత్తర తత్త్వాన్ని చూచి నేను ఆశ్చర్యపడుచున్నాను. మీరు మహాత్ములు. చిరంజీవులు. ద్వితీయ బ్రహ్మ వలె వెలుగొందే మిమ్ములను దర్శించే మహద్భాగ్యం ఈ రోజు నా కబ్బింది. ధన్యుడను. హే ప్రభూ! పావనమొనర్చ గల అఖండితమగు ఆత్మైక్యవాక్యాలు మీరిప్పుడు పలికారు.
Page:75
నేను దేవతల ఐశ్వర్యములను, విద్వాంసుల జ్ఞానసంపదను చూచాను. మిమ్ములతో పోల్చగల తత్త్వజ్ఞాన సంపన్నులు చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. మీవంటి పూర్ణతప్తస్వరూపులు తారసబడటం అత్యంత దుర్లభమని నేను ఘంటాపథంగా చెప్పగలను.
అనేక ముత్యపు చిప్పలు వెతికిన తరువాత ఎక్కడో ఒకచోట అత్యంత విలువైన ముత్యం గల ముత్యపుచిప్ప కనుగొనినట్లు మీ దర్శనం ఈ రోజు లభించింది. ముక్తపురుషులు, పుణ్యాత్ములు అగు మీతో సంభాషించటం ఒక మహత్తర యోగసాధనా ఫలంగా నేను భావిస్తున్నాను.
ఇక నాకు సెలవు ఇప్పించ ప్రార్థన. మధ్యాహ్న కృత్యములు ఆచరించటానికై స్వగృహమైన సప్తఋషి మండలం జేరవలసియున్నది.
అప్పుడు భుశుండుడు తాను ఆసీనుడై ఉన్న వృక్షం నుండి నా ముందుకు వచ్చి నిలిచారు. సంకల్ప కల్పితమైన రెండుచేతులతో పువ్వులు కోసి నాకు అర్ఘ్య పాద్యములు సమర్పించారు. ఆకాశ మున పయనమై వెళ్లుచున్న నన్ను సాగనంపుతూ ఆమడదూరం ఎగురుతూ వచ్చి అనుజ్ఞను పొంది వెనుతిరిగారు. సాగరంలో తరంగం అదృశ్యమైనట్లు నేను అక్కడ నుండి అదృశ్యుడనై నిజాశ్రమం జేరాను. సాధుజన సంగమం ఎంతటి మధురమైనదో, ఆనందప్రదమైనదో చెప్పటానికి నాకు మాటలు చాలవు.
ఓ రాఘవా! ఈ సంఘటన కృతయుగారంభంలో 200 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగింది. ఇప్పుడు త్రేతాయుగం వచ్చింది 4000 ఏళ్లు గడచిన తరువాత నీవు జన్మించావు. భుశుండుడు ఆ కొండపైనే అజరారూపంలో ఉండి ఉన్నాడు.
విన్నావు కదా రామా! భుశుండుని కథలోని అంతరంగ కథనాన్ని గ్రహించి నీవు నీ ఉచిత అనుచితములను నిర్ణయించుకో. ఈ కథనం పఠించినవాడు జరామరణముల పట్ల భ్రాంతి తొలగి అసత్యమగు మాయను సత్వరం దాటివేయ గలడు.
13. దేహభావం భ్రమ మాత్రమే
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భుశుండుని వృత్తాంతం విన్నావు కదా! ఆతడు ప్రాణాభ్యాస పూర్వకంగా ప్రాణనియామకదృష్టిని అవలంబించి 'జ్ఞానయోగం’ నిరంతరం ఆశ్రయించి ఉంటున్నాడు. తత్ఫలితంగా బ్రహ్మపదమును పొంది ఉన్నాడు. నీవు కూడా అభ్యాస - వైరాగ్యములను ఆశ్రయిస్తే ఆతడు పొందిన స్థితి తప్పకుండా పొందగలవు. నిర్లిప్తబుద్ధితో ప్రాణాపానములను అభ్యసించే వారికి చిదాత్మైక్యభావం చాలా సులువుగా లభిస్తోంది.
ఇప్పుడు నీకు రెండు విజ్ఞాన దృష్టుల గురించి చెప్పటం జరిగింది - 1. ప్రాణ నిరోధము, 2.జ్ఞాన విచారణ... ఈ రెండిటిలో నీకు ఏది నచ్చితే ఆ మార్గంలో ప్రయత్నించు. లేదా, రెండింటినీ మేళవిస్తూ నీ సాధన కొనసాగించు. అతి త్వరలో ఆత్మైక్యానుభవం నీ ముంగిట వచ్చి వాలగలదు.
Page:76
శ్రీరాముడు : ఓ భగవంతుడా! వసిష్ఠమహర్షీ! మీరు భూలోకసూర్యులై జ్ఞాన కిరణములను ప్రసరింపజేసి మా ఆత్మ స్వరూపమును కప్పిపెట్టి ఉంచే హృదయాంధకారమును పటాపంచలు చేస్తున్నారు... ఇక మేము ప్రబుద్ధులమై, ప్రవిష్టులమై స్వస్వరూపమున ప్రవేశిస్తున్నాం. అపర వసిష్ఠులవలె వెలయుచున్నాం.
మీరు ఇప్పుడు అలౌకిక ఆనందప్రాప్తికి కారణముగల భుశుండుని విశేషాలు చెప్పారు. ప్రాణాపానముల ‘గతి’ని వివరిస్తూ ఈ అస్థి - చర్మ నిర్మితమగు ఈ శరీరం గురించి కొన్ని సూక్ష్మతరమైన విషయాలు చెప్పారు.
అయితే స్వామీ!... అసలు ఈ శరీరం ఎట్లా నిర్మించబడింది? ఇది ఎటు నుండి ఇక్కడకు వస్తోంది? ఇది ఎట్లా స్థితి కలిగి ఉంటోంది? ఇందులో నివసించేవాడు మరెక్కడి నుండి వచ్చి ఇక్కడికి చేరాడు? ఈ శరీరానికి - శరీరికి సంబంధం కలగటానికి కారకులగుచున్నదెవరు?... ఈ విషయాలు విశదీకరించమని నా ప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : నీ ప్రశ్నలకు ఏదైతే సమాధానమైయున్నదో... అయ్యది పరమార్థతత్త్వాన్ని చక్కగా గ్రహించటానికి, దోషములన్నీ దూరీకరించటానికి మనకు ఉపకరించగలదు. నీ ప్రశ్నలకు సమాధానం విను.
అస్థి-చర్మయుతమై, రక్త మాంస విలేపితమగు ఈ శరీర గృహం ఎవరూ నిర్మించి ఉండలేదు. జీవుని శ్వాస వలె, వాయువు యొక్క చలనములాగా, నది యొక్క ప్రవాహం వంటిదై కన్పట్టు ఈ శరీరం "ప్రవాహపతితంగా, కాకతాళీయంగా” ఏర్పడుతోంది. జలంలో ప్రతిబింబించే చంద్రుని లాగా ఈ దేహచమత్కారం ఒక 'అలీకము (Illusion) లేక “అభాస” మాత్రమే. చంద్రుడు జలంలో ప్రతిబింబించటానికో, లేక దృశ్యము దర్పణంతో ప్రతిబింబించటానికో ఒక కర్త కావాలా? అక్కర్లేదు కదా! మిథ్యామయమగు ఈ శరీరం కూడా ప్రతిబింబిత చంద్రుని లాగా 'సత్-అసత్'రూపమై వెలయుచున్నది. దీని కర్తృత్వం ఎవ్వరికీ ఆపాదించలేం!
వస్తుతః ఆకాశంలో ఒక్క చంద్రుడు మాత్రమే ఉన్నప్పటికీ మెల్లకన్ను గలవానికి భ్రాంతి చేత రెండు-మూడు చంద్రులు ఉన్నట్లు అగుపడుతుంది. చూచావా? ఈ శరీరం కూడా అట్లే అగబడుచున్నది. ఇది స్వతఃగా లేదు. కాని దేహభ్రాంతి ఉన్నవానికి ఇది ఉన్నట్లే అగపడుతోంది. అందుచేతనే 'ఇది సదసదాత్మకం' అని విజ్ఞులు వర్ణించి చెప్పుచున్నారు. ఒక విధంగా ఉన్నది, మరొక విధంగా లేదు.
స్వప్నము వాస్తవానికి మిథ్యయే కదా! నీటి కంటే వేరుగా నీటిబుడగ ఉన్నదా?... అయినప్పటికీ అవి వేరు వేరుగా కనిపిస్తున్నాయి. నీటి బుడగ అనేది ఆకారం దృష్ట్యా మాత్రమే అయినప్పటికీ నీటి దృష్ట్యా అసత్యమే కదా!
అట్లాగే ఆకారాదుల దృష్ట్యా ఈ దేహము సత్యమువలె అనిపిస్తున్నప్పటికీ, ఆత్మదృష్ట్యా ఈ దేహము మిథ్యయే అని గ్రహించు.
Page:77
ప్రతిభాస కారణంగా ఎడారిలో ఎండమావులు కనిపించి అమాయక జీవులకు జలభ్రాంతిని కల్పిస్తున్నాయి. అదే, అనుభవముగలవానికి, లేదా, దగ్గరకు పోయి చూచినవానికో 'ఇక్కడ జలము ఉండదు. తరంగాలూ ఉండవు' అని తెలిసిపోతోంది. అట్లాగే అల్పజ్ఞానానుభవం ఆవరించి ఉన్నప్పుడు శరీరము యొక్క ఉనికి ఘనీభూతమై ఉంటోంది. ఆత్మబోధచే, “ఈ శరీరము-దీనిచే ఏర్పడే అనుభవజ్ఞానం అసత్ మాత్రమే' అని తెలియవస్తోంది. 'అభాసమాత్రమే’ అగు ఈ శరీరము ప్రముఖమైనట్లు, దీని అనుభవమును గాంచుచున్న ఆత్మవస్తువు శరీరముకంటే ప్రత్యేకము, ఉత్కృష్టము, అసంబంధితము అయికూడా అముఖ్యమైనట్లు భ్రమ ఏర్పడి ఉంటోంది.
శ్రీరాముడు : ఈ శరీరము ఆత్మకు ఏర్పడటానికి అసలు కారణం?
శ్రీవసిష్ఠ మహర్షి : 'నేను ఈ శరీరమును' అను రూపంలో గల ఆత్మయొక్క చమత్కారమైన స్వయంకృత సుదృఢభావనావేగమే శరీరము యొక్క అనివార్య భ్రమకు కారణం. అయితే జ్ఞానదృష్టికి ‘ఈ శరీరభావన కేవలం భ్రమ' అని తెలియవస్తోంది.
ఓ రామా! ఈ శరీరభ్రాంతి జీవునకు ఉండవలసిన అవసరమే లేదు. ఈ క్షణమే నిశ్శంకగా నిశ్చింతగా దీనిని విడచివేయవచ్చు... ఎందుకంటావా?... కేవలం సంకల్పమాత్రంచే ఇట్టి వేలాది స్వప్న సదృశంగా శరీరాలు కలుగగలవు. లయించగలవు. ఇట్టి సంకల్ప నిర్మిత శరీరాలలో దేనిని గ్రహిస్తావు?... దేనిని త్యజిస్తావు?
శ్రీరాముడు : శరీరం పోయినప్పుడు కూడా ఈ జీవుడు ఉంటాడు కదా! అప్పుడు జీవుడు ఉంటున్నది ఎందులో? శరీరాలు ఏ మూలనుండి వచ్చి పడుతున్నాయి?
శ్రీవసిష్ఠమహర్షి : హాయిగా మృదువైన తల్పంపై నిదురిస్తున్న ఒకవ్యక్తి స్వప్నంలో ఏర్పడే దేహములతో దిక్కులన్నీ తిరిగివస్తున్నాడు. ఆ స్వప్న సంబంధిత స్వ-పర దేహాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ దేహంతో ఈ జీవుడు స్వప్నానుభవం చవిచూస్తున్నాడు?
జాగ్రత్లో కూడా మనస్సు అనేక చోట్ల తిరిగి వస్తోంది. ఏ శరీరంతో అంతా ఊహ చేతనే కల్పించబడుతోంది కదా! ఈ జాగ్రత్లో ఏర్పడే 'రాజ్యం ఏలటం, పరస్పర ప్రేమాభివేశాలు, సంబంధ బాంధవ్యాలు, క్రీడా వినోదాలు'- అన్నీ కూడా 'ఊహ'యే తమయొక్క మూలముగా కలిగి ఉన్నాయి. స్వప్నంలోని దేహాలన్నీ ఊహచే నిర్మించబడుచున్నట్లే, ఈ జాగ్రత్లోని వ్యవహారాలకు కూడా ఊహయే మూలం. అందుకే ఇది 'జాగ్రత్స్వప్నం' అని, స్వప్న వ్యవహారమును 'స్వప్నజాగ్రత్' అని పిలుస్తూ ఉంటారు.
స్వప్నంలోని బంధువుల వలెనే ఈ జాగ్రత్ దృశ్యానుభవమంతా మనోకల్పితమే. అట్లాగే ఈ మాంస-అస్థిమయ పృథ్వీ-జల-ఉష్ణ-వాయు ఇత్యాది సమావేశరూపమైన పార్థివ శరీరం కూడా మనోకల్పితమే నని గ్రహించు. సంపదలు, శరీరము, దేశము మొదలైనవన్నీ చిత్తము నందలి సంకల్పములచే కల్పించబడే విలాసములు మాత్రమే.
Page:78
దీర్ఘస్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్తవిభ్రమమ్ | దీర్ఘం వాపి మనోరాజ్యం సంసారం రఘునన్దన ॥ (శ్లో. 28, సర్గ 28)
రఘునందనా! నీవీ సంసారమును దీర్ఘస్వప్నం గానో, దీర్ఘచిత్తభ్రాంతి గానో, దీర్ఘ మనోరాజ్యం గానో గ్రహించు. నా ఈ వాక్యములలోని వాస్తవత్వం 'జ్ఞానసూర్యుడు' నీలో ఉదయించిన మరుక్షణం సుస్పష్టంగా అవగతమౌతుంది. జాగ్రత్ సమయంలో స్వప్నం 'లేనిదే’ అయినట్లు జ్ఞానలాభసమయంలో ఈ జగత్ మిథ్యయే అయి కనబడుచున్నది.
ఇతఃపూర్వం కమలజన్ముడగు బ్రహ్మదేవుని ఉత్పత్తి గురించి చెప్పేటప్పుడు 'సంకల్పకల్పనామయ మగు మనస్సే ఆడంబరమగు ఈ విచిత్రజగద్రచనకు ఉపక్రమిస్తోంది' అని అనుకున్నాం కదా! అట్లాగే నీకు కనబడుచున్న ఈ శరీరం కూడా మనస్సు యొక్క ప్రతిభాస మాత్రమే. మనస్సు దేనిని ఎట్లా భావిస్తే అది అట్లే అవుతోంది. మనస్సు యొక్క కల్పిత అభాసయే జీవునిచే జగత్తుగా చూడబడుతోంది.
పూర్వదేహం తరువాత ఈ దేహం కల్పించబడినట్లు ఈ దేహం తరువాత కల్పించబడబోయే దేహాలు కూడా కల్పితమాత్రములే. వాసనాధిక్యతను అనుసరించి ఈ శరీరము సంఘటితమౌతోంది. భవిష్యత్ కూడా అట్లాగే సంఘటితమవబోతోంది. అయితే స్వతఃగా పూర్ణుడవైన నీవు ఈ శరీర-జగత్ సంకల్పములన్నిటికీ అతీతమైనవాడవు సుమా! నీ యొక్క పురుషకారమును ఉపయోగించి మనస్సును అంతర్ముఖం చేస్తే వాస్తవ స్వరూపమేమిటో గోచరమౌతుంది. అప్పుడు 'ఇదంతాచిన్మాత్రమే' అని గ్రహించగలుగుతావు.
ఓ రామా! ఈ ఎదురుగా పంచేంద్రియములకు తారసపడుచున్న దృశ్యజగత్తును 'అన్యధా’గా భావించావా, అన్యమే అవుతుంది.' 'ఇది, అది, నేను, నాది, మేము, మాది, వారు, వీరు' - మున్నగు భావనలు ఇతఃపూర్వం అనేకసార్లు మననం చేయటం చేత ఆ భావనాదార్ద్యం చేత ఇదంతా ఆత్మ స్వరూపుడగు ఈ జీవునకు నీకు వేరై ఉన్న దానివలె భ్రమింపజేస్తోంది. భావన యొక్క గొప్పతనం ఎంతటిదంటే, ఏ భావన దృఢంగా చేయబడుతుందో అదియే సత్యమై అనుభవమౌతుంది. కాముకునకు తన ప్రియురాలే అన్ని వైపులా కనబడుతుంది. అది భావన యొక్క ప్రభావమే కదా! రాత్రి కల కనే టప్పుడు అప్పటికి అది పరమసత్యంలాగానే అనుభవమౌతోంది. ఎందుచేత? మరి అప్పటి భావన అట్టిది.
భావనాబలం చేతనే ఈ సంసారం సత్యంగా తోచటం జరుగుతోంది. స్వప్నంలో కొద్ది నిమిషాల కాలం అనేక రోజులుగా తోస్తోంది చూచావా! అట్లాగే, సంకల్పమాత్రం, క్షణికం అగు ఈ సంసారం దీర్ఘాతిదీర్ఘంగా తోచుచున్నది. ఎండమావులు తటాకరూపంలో స్ఫురిస్తున్నట్లు అసత్యమైన, భౌతిక పరమైన ప్రియాప్రియ సంబంధ బాంధవ్యాలు సంకల్ప పరంపరల బలం చేతనే నిలచి ఉంటున్నాయి.
ఒక చిత్రమైన కంటిజబ్బు వలన ఆకాశంలో మయూరపింఛాలు కనిపిస్తాయి. దోష రహితమైన చూపు గలవానికి ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. సమదృష్టి గలవాడు సంకల్పమాత్రజనితమగు ఈ సంసార సంరంభమును చూచి దూరంగా ఉండి నవ్వుకుంటున్నాడు. సంసార దోషముచే
Page:79
పరితప్తుడైన జీవుడు ఇక్కడ దుఃఖము, భయము, వేదన, అవమానము, మమకారము, నిరుత్సాహము కలిగించ గల అనేక విషయపరంపరలు గాంచుచున్నాడు. బాలుడు స్వసంకల్పిత మనోరాజ్యంలో పులిని, నక్కను, దయ్యమును ఊహించి ఉలిక్కిపడి బిగ్గరగా ఏడ్చునట్లు సంసారాసక్తుడు అడుగడుగుకు అనేక ఆందోళనలు తెచ్చిపెట్టుకుని మరీ అనుభవిస్తున్నాడు.
శ్రీరాముడు: ఆ భయం తొలగేది ఎట్లా, మహర్షీ?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆత్మ ఒక్కటే ఇదంతా ప్రసరించి భాసిస్తూ ఉండగా ఇక భయాదులు ఎవరికి, ఎవరి వలన కలగాలి? భయము పొందుచున్న జీవుడు తన అజ్ఞానం తొలగించుకున్నాడా... ఇక ఆతడు నిర్మలుడు, శుద్ధుడు అయి ఈ జగత్ మోహమునకు లోనవడు. కనుక 'సమ్యక్ దర్శనం' అను అభ్యాసమే ఉత్తమమైన ఉపాయం. జ్ఞానం సుస్థిరమైన చోట ఇక సంసారం ఉండదు. సమ్యక్ దర్శనంచే మనోబుద్ధులను విశుద్ధపరుస్తూ తద్వారా జ్ఞానం సుస్థిరపరచాలి.
శ్రీరాముడు : సమ్యక్ దర్శనం అంటే ఏమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జగత్తంతా అభాసమాత్రమేనని, ఇది సత్తుగాని, అసత్తుగాని కాదని గ్రహించటం. జీవితం, మరణం, స్వర్గము, జ్ఞానం, అజ్ఞానం, నీవు, నేను, సమస్త సంసారం, దిక్కులు - ఇవన్నీ చిదాభాస అని తెలియటమే సమ్యక్ దృష్టి ప్రయత్నబలం చేత తప్పకుండా యథార్థదర్శనం ఈ జీవునకు సాధ్యపడుతుంది.
యథార్థదర్శనం లభించిన తరువాత ఇక మనసు సత్యము, నిత్యము అయిన 'సర్వగత స్వస్వరూపం’ నుండి చ్యుతి పొందదు. ఈ ప్రపంచం యొక్క సత్ - అసత్ లక్షణాన్ని గ్రహించి క్రమంగా నిష్కామంతో కూడిన పరమశాంతిని పొందుతుంది. మనస్సు దేనినీ నిందించదు. స్తుతించదు. దుఃఖించదు, సంతోషించదు. ఆ జీవుడు తాపత్రయరహితమగు పూర్ణత్వమును ఆశ్రయించి ఉండటం చేత సమాధాన పూర్వకమైన ప్రశాంతానందమును పొందుతాడు.
అందరికీ మరణం అనివార్యమే అయినప్పుడు నా మరణం గురించి గాని, నా బంధువుల మరణం గురించి గాని దుఃఖించవలసిన పనేమున్నది?
జన్మించిన ప్రతివాడు అంతో ఇంతో సంపదలు, ఆపదలు అనుభవించక తప్పేది కాదు. ఇక ఇందులో సంతోషించవలసినదీ, వేదన చెందవలసినదీ ఏమున్నది?
బృంహత్యుదేతి స్ఫురతి బుద్బుదౌఘ ఇవార్ణవే |
ఇదం హి జగతాం జాలం కిమత్ర పరిదేవనా ॥ (శో 57, సర్గ 28)
సముద్రంలో అసంఖ్యాకంగా తరంగాలు లేచి పడుచున్నట్లు ఈ సంసార సముద్రంలో జగత్తులు లేచి, పెరిగి, విప్పారి, చివరకు లయించిపోతున్నాయి. ఇందుకు గాభరా ఎందుకు?
ఇట్లా ఉంటుంది... అతని అవగాహన సద్వస్తువు ఎప్పటికీ సద్వస్తువే. అసత్తు అసత్తే. అసత్ ఎన్నటికీ 'సత్' అవజాలదు. మాయ ఆత్మ సమక్షం యొక్క వైచిత్ర్యం మాత్రమే. ఇక ఈ
Page:80
శరీరమంటావా... ఇది అవిద్యా కామ్యకర్మ యొక్క విచిత్ర దోషముచే ఉదయిస్తోంది. భూత -
భవిష్యత్ - వర్తమానకాలాలలో 'నేను' అనబడేది ఆత్మకు వేరై లేనేలేదు. ఇక ఇక్కడ దుఃఖమునకు తావెక్కడిది?
తత్త్వదర్శియందు "ఈ శరీరము కంటే నేను భిన్నుడను. చిదాత్మయే అయి ఉన్నాను. ఇక క్రొత్తగా సంపాదించే సద్భావమేమిటి? ఇప్పుడు అసద్భావం ఉండటమేమిటి? నేను దేని కొరకై క్రొత్తగా ఎందుకు దుఃఖించాలి?” అను రూపంలో ఉండే దృఢనిశ్చయం తొలగదు. అందుచేత, అతని మనస్సు ఈ సంసారంలో ఉదయించనే ఉదయించదు. సకల బాహ్య వస్తువులందు ఉద్వేగము తొలగి కేవలీ బ్రహ్మభావన అఖండశాంతపూర్వకంగా సంతరించుకుంటుంది. తిత్తిరపక్షి తన గూటిని నిర్మించుకోవటానికి కోమలమైన తృణకణములను ఎంచుకుంటున్నట్లు ఆ బ్రహ్మవేత్త సంసారములోని అసారము నంతా వదిలి, దాని విశేషాల పట్ల ఏమాత్రం ఆసక్తి, నమ్మకం లేక, కేవలం బ్రహ్మజ్ఞాన సంబంధిత విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉంటాడు.
గట్టిత్రాటి చేత ఎద్దు కట్టబడినట్లు, ఇష్ట-అయిష్ట-రాగ-ద్వేషాది రూపమైన 'సంసారాసక్తి' చేతనే మనిషి బంధించబడి నీచత్వమునకు, స్వల్పత్వమునకు ఈడ్వబడుచున్నాడు.
అందుచేత రాఘవా! నీవు ఈ సంసారం ఏర్పడుచున్న వైనమంతా జాగ్రత్తగా గమనించు. ‘ఆసక్తి, అనాసక్తి' అను రెండిటినీ త్యజించి నిరామయుడవై సంచరించు. కేవలం కర్తవ్యమైనదానిని మాత్రమే ఆచరించు. అకర్తవ్యమును ఎన్నడూ ఆచరించవద్దు. 'ఈ జగత్తు అభాస మాత్రమే' అని గుర్తు పెట్టుకుంటూ ఉంటే, క్రమంగా అట్టివాని హృదయం శీతలమౌతుంది. ఈ సర్వపదార్థముల మీదా భ్రాంతి త్యజించి సర్వమూ బ్రహ్మచైతన్యముయొక్క అభాసమాత్రంగా గ్రహించు. ఆ తరువాత చిత్త కల్పనాకళంకమగు ఆ అభాసభావన కూడా త్యజించి భావాభావరహితుడవై వెలుగొందుము. చిదాకాశమయుడవు కమ్ము. నీ రూపమును సర్వగామి, సర్వవర్ణనలకు అతీతము, సర్వసమము అగు నిత్యనిర్మలాకాశముగా గాంచుము. ఆపై అనుభవమాత్రమే గాని, మనం మాటలు ఉపయోగించి ఏమి చెప్పుకోలేం.
1.నేను ‘అహమ్’ అను ప్రత్యయ పరిమితుడను గాను, 2. ఈ భోగజాలమంతా సత్యం కాదు. ...ఈ రెండు భావాలు అంతరంగంలో సుస్థిరమైన మరుక్షణం ఈ ఆడంబర దృశ్యజగత్తు వ్యర్థమగు 'మోహము' అనే అనర్థాన్ని కలిగించజాలదు. (లేదా)
1. నేను సర్వసముడను, సర్వమయుడను, 2. 'ఎరుక' అను చిత్స్వరూపుడను. తెలుసుకొంటున్న నేను తెలియబడేదానిచే బంధించబడటం ఎట్లా సంభవం?... అని అయినా భావించవచ్చు.
పై దృష్టులలో నీకు ఏది రమ్యమని అనిపిస్తే, అది ఆశ్రయించు. లేదా... రెండింటినీ మేళవించి సమాశ్రయిస్తూ, క్రమంగా, అంతరంగంలో ఉండే రాగద్వేషాలను క్షయింపజేసి, అటుపై ఈ జగత్తులో హాయిగా విహరించు. ఓ రామా! స్వర్గ - మర్త్య - పాతాళ లోకములలోని దేని పట్లా రాగద్వేషములు లేనివాడు నిబద్ధింపబడడు. ఇది సత్యం.
L H
Page:81
మూఢులగు జనులు రాగద్వేషసహితులై అనేక కార్యక్రమములలో నిమగ్నమై ఉపాధియున్న దినములన్నీ అల్ప ఆశయములతో గడిపివేస్తున్నారు. చివరికి ఆ కార్యక్రమములన్నీ వ్యర్థ విపరీత ప్రయోజనములకే దారి తీస్తున్నాయి. తగలబడుతున్న వనంలోంచి సాత్వికజీవులగు జింకలు పరుగులు లంకించుకుంటున్నట్లు, రాగద్వేష దూషితమైన చిత్తములోంచి సాత్వికగుణాలు బయటకు వెళ్ళిపోవుచున్నాయి.
రాగద్వేషములు ప్రవేశించని హృదయం కల్పతరువు. అతని వద్ద లభించనిదేమీ ఉండదు. చమత్కారం చూచావా, రామా? కొందరు శాస్త్రప్రవచనపాటవాలు కలిగిఉండికూడా తమలోని రాగద్వేషములు గుర్తించి, త్యజించలేకపోతున్నారు.
“నేను సంపదలకు అర్హుడను. అనర్హులంతా సంపదలు సంపాదిస్తున్నారు. నేను పొందవలసినవి పొందలేకపోతున్నాను”... ఇట్టి అనేక తుచ్ఛదనేచ్ఛలను, సంసారప్రమత్తతలను ఆశ్రయించి శాశ్వతవస్తువును కోల్పోవుచున్నారు ఈ జనులు...!
ధనము, బంధువులు, మిత్రులు, ప్రతిష్ఠలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఆ పరమేశ్వరమాయ ప్రియాప్రియములగు భావాభావములు కల్పించి ఈ జగద్వ్యవహారాన్ని తనదైన శైలిలో నడుపుతోంది.
ఈ క్షణిక జగత్తునందు అనురాగమేమిటి? విరాగమేమిటి? దీనిపట్ల ఉపేక్షయే మేలు. భోగ లోలుడగు వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని 'మాయ' అనే మాంత్రికుడు ఈ జగత్తులోని వస్తువులను, వ్యవహారములను, సంఘటనలను రచించుకొని పోతున్నాడు. ఇక్కడ కనిపించే ధన, జన, దేహము లన్నీ మిథ్యయే గాని వాస్తవం కాదు. మధ్యలో ఏర్పడి, మధ్యలోనే లేకుండా పోయేవి వాస్తవమెట్లా అవుతాయి? ఆది - మధ్య - అంతములలో ఉండేది కేవలం ఆత్మ ఒక్కటి మాత్రమే. ఆద్యంతములలో సత్యము గానిది మధ్యలో మాత్రం సత్యమెట్లా అవుతుంది?
శ్రీరాముడు: మీ ప్రతిపాదన తిరస్కరించటానికి వీలు లేనిదని నేను ఒప్పుకుంటున్నాను. అయితే, జీవులంతా మనోవ్యధచే బాధింపబడుచున్నారు కదా! రంగుటద్దాలవంటి మాయపొరలు తొలగేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి: త్రికాలముల చేత బాధించబడేది ఏదైనా సరే అట్టి దానిపై ఆసక్తిగొన్నామా, ఇక అట్టి ఆసక్తి యొక్క పరిణామం మనోవ్యధయే అగుచున్నది. 'ఒకడు అభూతకల్పన కల్పిస్తే మరొకడు అందులో ప్రవేశించి పచార్లు చేస్తున్నాడు' అనే వాక్యం ఎట్టిదో ఈ సంసారభ్రమ కూడా ఒక మాయా జీవుడు కల్పిస్తే అనేక మంది మాయాజీవులు ఇందులో ప్రవేశించి గొప్ప ఆసక్తితో గంతులు వేస్తున్నారు.
ఓ రామా! నీవీ సంసారభ్రమయందు పడవద్దు సుమా! ప్రాణివర్గముతో కూడిన ఈ సంసారమును తత్త్వజ్ఞులు ఒక గారడీని చూచినట్లు చూస్తున్నారు. మూఢులను మాత్రం ఇది ఎంతో కలవరపెడుతోంది. ఇదంతా సుదీర్ఘమైన స్వప్నంలో కనిపించే ఒక నగరం వంటిది. 'అజ్ఞానము'
Page:82
అనే నిద్రకు ఉపపక్రమించేవానికి మాత్రమే ఈ సంసారస్వప్నం వాస్తవానుభవమై ప్రాప్తిస్తోంది. సర్వత్రా అనుశ్రుతమగు ఈ సుదీర్ఘ స్వప్నసదృశ సంసారమును ఖాతరే చేయవద్దు. శ్రీరాముడు: ఈ జీవునికి సంసారమనేది ఎక్కడ నుండి వచ్చిపడుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి: చెప్పాను కదా! ఇదంతా గాఢమగు అజ్ఞాన నిద్రనుండే వచ్చిపడుతోంది. నిధిని పొందినవాడు దరిద్రమును త్యజించునట్లు, నీవీ సంసారమును త్యజించు, ఓ రామా! ఉత్తిష్ఠ! సూర్యుని చూడగానే పద్మము వికసించునట్లు నీవు అఖండము, అప్రమేయము, నిత్యము, సత్యము స్వస్వరూపము అగు ఆత్మ యందు మెళుకువ తెచ్చుకో. ప్రబుద్ధుడవై లేచి సర్వత్రా నిండియున్న నీ అనామయ ఆత్మ స్వరూపమును గాంచుము. సుశీతలమగు జ్ఞాన వాక్యములను నేను నీపై వర్షింప జేయటం నీవు ప్రబుద్ధుడవై, పరమజ్ఞానమును పొందటానికే కదా! ఈ నా మేలుకొలుపు వాక్యం (ఉత్తిష్ఠవాక్యం) ప్రతిఒక్క శ్రోతకు, ప్రతిఒక్క పాఠకునికి ఉద్దేశ్యించినదే సుమా!
ఓ సర్వసభికులారా! మీరంతా మీ యొక్క సత్యస్వరూపమును దర్శించెదరు గాక! వాస్తవానికి మనలో ఎవ్వరికీ జన్మదుఃఖ దోషభ్రాంతులు తమంతట తాముగా లేవు. అందుచేత భ్రాంతిపూర్వకమగు జగద్విషయములను ప్రక్కన ఉంచి, ఆత్మయందు సుస్థిరులై వెలయుదురు గాక! ఓ రామచంద్రా! నీ యందు వికల్పదోషములకు తావే లేదయ్యా! సారవంతము, విక్షేపరహితము అగు దృష్టిని పొందినవాడవై పరమశుద్ధమగు పరబ్రహ్మమున వెలసియే ఉన్నావయ్యా!
14. సంకల్పము - మాంసమయ దేహం
స్వస్థచిత్తుడైన రాఘవుడు వసిష్ఠమహర్షి వాక్యాలు వింటూనే ఆత్మయందు విశ్రమించి పరమానందం పొందాడు. ఆ సభలోని అనేక మంది సభికులు కూడా ప్రబోధులైనవారై తమ స్వస్వరూపమునందు తాము ఉపశమనం పొందారు. పొలం నీరుతో నిండగానే రైతు ఆ జల ప్రవాహాన్ని కొద్దిసేపు ఆపుతాడు చూచావా! అట్లా వసిష్ఠమహర్షి శ్రీరాముని అంతరంగ ప్రశాంతానుభవమును గమనించి తన వచనామృతాన్ని కొద్ది సేపు ఆపారు.
కొద్ది క్షణాలైన తరువాత శ్రీరాముడు చురుకైన, సుకుమారమైన తన కళ్ళు తెరచి చిరునవ్వుతో తన సంతృప్తిని ప్రకటిస్తూ తిరిగి వినటం కొనసాగిస్తున్నట్లు కళ్ళలో ఉత్సాహం ప్రకటించాడు. అది చూచి మహర్షి ప్రియశిష్యుని హృదయంలో బోధను సుస్థిరం చేసే ఉద్దేశంతో తన వాక్యములను
కొనసాగించారు.
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! నీవు చక్కగా బోధింపబడి ఆత్మతత్త్వమును పొందావు. చాలా సంతోషం. అయితే అద్దాని నుండి చలించి, మరల సంసారంలో ప్రవేశించనేవద్దు సుమా! శ్రీరాముడు: మహర్షీ! ఈ సంసారచక్రం యొక్క పరిభ్రమణానికి అసలైన నాభిస్థానం ఏది?
Page:83
శ్రీవసిష్ఠ మహర్షి : 'సంకల్పించుట' అనునదే సంసారముయొక్క నాభిస్థానం. హృదయం రాగ ద్వేషములతో సంక్షుభితమై ఉన్నంతకాలం ఈ సంసారము యొక్క నాభి ఎంత ఆపటానికి ప్రయత్నించినా ఆగక తీవ్రవేగంగా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సంసారచక్ర పరిభ్రమణం నిరోధించా లనుకుంటే ప్రజ్ఞ-సౌజన్య-శాస్త్రయుక్తమైన పురుషప్రయత్నం కావాలి. చిత్తమును మూర్ఖ కార్యక్రమముల నుండి విరమింపజేయాలి. అసదాత్మకమగు ఈ జగత్తు 'అంతానిజమే' అను రీతిగా అనుభవమవటానికి కారణం అజ్ఞానరూపమగు సంకల్ప పరిభ్రమణమేనయ్యా! 'సంకల్పించుట' అను స్వభావం చేత ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు శరీరమును ఆశ్రయించి, విషయవాసనలను కల్పించుకొని జన్మజన్మాంతర పరంపరలను పొందుచున్నాడు.
శ్రీరాముడు : చిత్ర పటంలోని రంగుల రేఖనమువలె ఈ దేహం కారణంగా జీవుడు అనేక సుఖదుః ఖములను నిరంతరం పొందుచూనే ఉన్నాడు.
శ్రీవసిష్ఠ మహర్షి: అవును. అయితే, ఈ దేహము గురించి వగచవలసిన పనేమిటి? చిత్రంలోని శరీరంకంటే కూడా ఈ పాంచభౌతికశరీరం తుచ్ఛమైనది.
ఈ మాంసమయదేహం మనం ఎంతగా రక్షించాలని ప్రయత్నించినా కాలక్రమేణా శిథిలం కాక తప్పదు. అందుకనే, ఈ మాంసమయదేహం కంటే చిత్రపటంలోని మానవుడే నయమని చమత్కారంగా అంటూ ఉంటారు. ఇట్టి మాంసమయ దీర్ఘసంకల్ప శరీరములపట్ల విశ్వాసముగాని, అనురాగంగాని, నమ్మకంగాని ఏర్పరుచుకోవలసిన పనేమున్నది?
ఈ మాంసమయదేహం కంటే స్వప్నమయదేహమే కొంతనయం. ఎందుకంటే స్వప్నదేహం చాలా స్వల్పకాలికం కనుక, అది మాంసమయదేహము పొందేంతగా పెద్ద సంఖ్యలో సుఖదుః ఖములు పొందదేమో!
ఈ మాంసమయ శరీరమును జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే ఇది ఆత్మయొక్క సంకల్పబలం చేతనే నిలచి ఉంటోంది. ఇది వాస్తవానికి మిథ్యయే. మూఢులు మాత్రమే దీని గురించి వ్యర్థంగా దుఃఖం పొందుచున్నారు. నిద్ర పోయేవాని కల కరిగిపోతే నష్టం ఏముంటుంది? మెల్లకన్ను వానికి కనిపించే రెండవ చంద్రుడు కనిపించకుండాపోతే అతడు కోల్పేయేదేమున్నది? ఎండమావులలో నీరు తొలగితే అది విచారించవలసిన విషయమా? అట్లాగే రామా! "సంకల్ప మాత్రము, స్వభావ నశ్వరము అగు ఈ మాంసమయదేహం వృద్ధి చెందినా నశించినా దేహి లేక శరీరికి వచ్చే నష్టమేమీ లేదు'.. అనే దృఢభావం నీవు ఎల్లప్పుడూ కలిగి ఉండు.
కల చెదిరి మెళుకువ వస్తే, “కలలో మరణించాను. మెళకువలో జన్మించాను”... అని అనము కదా! వాస్తవానికి ఈ దేహసంబంధమైన జన్మ-జీవన్-మృత్యు-పునర్జన్మలు ఇంతమాత్రమే!
భూషితే దూషితే దేహే న హి కించిచ్చితః క్షతమ్ |
న చిదన్తముపాయాతి నాత్మా చలతి రాఘవ ॥ (శ్లో 27, సర్గ 29)
Page:84
నిజానికి ఈ శరీరం దూషించబడినా, భూషించబడినా చైతన్యమునకు అవి సంబంధించవు. ఆత్మ దేనికీ విచలితం కాదు.
స్వస్వరూపమగు బ్రహ్మమునకు వికృతి పొందే అవస్థయే ఉండదు. మరి ఈ దేహము క్షీణిస్తున్నప్పుడు ఆ 'క్షతి'దేనికి? గుండ్రంగా తిరిగే చక్రయంత్రాన్ని అధిరోహించినవానికి నాలుగు దిక్కులలోని వస్తువులన్నీ గిఱ్ఱున తిరుగుచున్నట్లు అగుపిస్తాయి చూచావా? ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు ‘మనస్సు’ అనే చంచల స్వభావాన్ని అధిరోహించి “ఈ దేహంతో బాటే పుడుతున్నాను. దీని తోనే జీవిస్తున్నాను. ఇది వినష్టమైతే ఇక నా పని ఆఖరు" - అని భ్రమిస్తున్నాడు. నీవు మాత్రం ధీర బుద్ధి కలవాడవై, ఈ భ్రమలయందు కూలవద్దు.
సంకల్పమే ఈ దేహము యొక్క నిర్మాత. ఒకడు చీకట్లో త్రాడును చూసి 'పాము' అని అనుకుని అనేక భావవికారాలకు లోనయినట్లు, ఈ దేహము జీవునికి సద్వస్తువువలె భ్రమింపజేస్తోంది. ఇక ఈ శరీరంతో గాంచబడేవన్నీ భ్రమకాక మరేమౌతాయి? వీటి కర్తృత్వమే అసత్యమైనప్పుడు ఇక కార్యములుమాత్రం సత్యమెట్లా అవుతాయి? భ్రాంతి సమయంలో ఈ జగత్రియలందు పాల్గొనే ఈ దేహము సత్యమైనదానివలె గోచరిస్తోంది. ఏది ఏమైనా దీనికి స్వకీయమైన కర్తృత్వం లేదు. కర్తృత్వమునకు కారణం ఇచ్ఛ కదా! జడమగు ఈ దేహమునకు ఇచ్ఛ-అనిచ్ఛలు ఎక్కడుంటాయి?
అందుచేత 'ఈ జగత్తుకు కర్త అనువారెవ్వరూ లేరు' అని సిద్ధాంతీకరించబడింది. ప్రకంపన రహితమగు దీపము గదిలో జరిగే కార్యములకు సాక్షిమాత్రమే వెలయుచున్నది చూచావా? ఆత్మ సర్వదా “కేవలద్రష్ట” అయి వెలయుచున్నది. ఆకాశమున సూర్యభగవానుడు ఉండి నిర్లిప్తుడై, నిమిత్తమాత్రుడై దినకృత్యములకు కారణభూతుడగుచున్నట్లు నీవు కూడా ఆత్మత్వం సంతరించుకుని ఈ రాజ్యకార్యాదులకు నిమిత్తమాత్ర కారణుడవై ఉండుము. ఓ సర్వజనులారా! మీరంతా మీ కుంటుంబాది సర్వ కర్తవ్యములందు నిమిత్తమాత్రులై ఉండటం అలవర్చుకోండి.
15. అహంకారమును ఎదుర్కొనేది ఎట్లా?
శ్రీరాముడు : తండ్రీ! ఈ అహంకారం ఎప్పటి నుండి ఎందుకు ఎక్కడినుండి వచ్చిపడుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : అసత్యము, శూన్యము అగు ఈ దేహగృహంలోకి ఎప్పుడో వచ్చి అహంకారం ప్రవేశించింది. బాలుడు తన అజ్ఞానంచే కల్పించుకొనిన 'బూచోడు'తో పోల్చతగిన ఈ అహంకార దేహాత్మస్వభావము ఎప్పుడు వచ్చి చేరిందో చెప్పలేం.
అయితే సాధుజనులగు జ్ఞానులు ఈ అహంకారభూతమును దగ్గరకు రాకుండా చూచుకుంటూ
ఉంటారు.
అస్య మా భృత్యతాం గచ్ఛ త్వమహంకారదుర్మతేః |
అస్య భృత్యతయా రామ నిరయః ప్రాప్యతే ఫలమ్ || (శ్లో 40, సర్గ 29)
Page:85
ఓ రామా! నీవు ఈ అహంకార భూతమునకు దాసుడవు కావద్దు. దానిని సేవించే వారికి అది మరల మరల నరకలోక దర్శనం చేయించగలదు సుమా!
మహాపురుషులగు జ్ఞానులు ఈ అహంకార మమకారములు అల్లంత దూరంగా ఉండగానే తమను సమీపిస్తున్నట్లు గుర్తిస్తున్నారు. గుర్తించగానే సమాధి - జ్ఞానయోగము మొదలైనవి ఆశ్రయించి తగు జాగ్రత్త పడతారు. ఆ రెండిటినీ పారత్రోలి, ఇక ఆపై ఈ సంసారశూన్యనగరమును చూచి ఏమాత్రం భీతి చెందరు. ఇక తదితర జీవులనేకులు ఈ శరీరగృహములలో నివసిస్తూ అనంతకోటి శరీరములను వినాశన మొనర్చుకొనుచున్నారు. ఎప్పటికప్పుడు 'ఈ శరీరమే నేను' అను బుద్ధిని పదిలపరుచుకుంటున్నారేగాని, అట్టి దోషబుద్ధిని విడవటానికి యత్నించరేం? ఇది ఎంత ఆశ్చర్యం! దీనికి కారణమేమిటో నేను చెప్పలేను. అట్టి మూర్ఖత్వం కొనసాగించుటే అన్ని అనర్థములకు మూల కారణమనుటలో ఏమాత్రం సందేహం లేదు.
గ్రస్తే చిత్తపిశాచేన దేహసద్మని యే మృతాః |
పిశాచస్యేవ యా బుద్ధిర్నాపిశాచస్య రాఘవ ॥(శ్లో 45, సర్గ 29)
ఎవరైతే తమ చిత్తమును విడువకయే ఈ శరీరమును కోల్పోతారో వారి పిశాచబుద్ధి యథాతథంగా కొనసాగుతూనే ఉన్నది. ఓ సాధూ! అహంకార పిశాచ నివాసస్థానమగు ఈ దేహం పై విశ్వాసం కలిగి రోజులు గడిపేవాడు పిశాచంతో సమానుడే!
ఈ దేహగృహం శాశ్వతమైనది కాదు. ఈ విషయం ఎవరికి తెలియదు? తెలుసు. అయినా కూడా తగినంతగా పట్టించుకోవటం లేదే! ఏమి ఆశ్చర్యం!
కనుక, ఇంద్రియాల యొక్క, ఇంద్రియ విషయాల యొక్క నశ్వరత్వమును జ్ఞప్తియందు ఉంచుకుని నీవు అహంకారమును సంపూర్ణంగా విడచివేయి. ఆత్మవస్తువును ఆశ్రయించి ఉండు. అహంకారగ్రస్థులై నరకములకు పోదలచుకున్నవారిని కాపాడ గల బంధువు లెవరూ ఉండరు. అహంకారంతో కూడి ఏపని చేసినాసరే, అది విషాన్నంలాగా దుష్ఫలితాలనే ఇస్తుందని సర్వజనులకూ గుర్తు చేస్తున్నాను. ఏ జీవుడైతే వివేకవైరాగ్యములను త్యజించి అహంకారానికే పట్టం కడతాడో, అట్టివాడు అనేక విధముల నష్టం పొందటమే అవగలదని సర్వజీవుల శ్రేయోభిలాషులమగు మేం మునులం హెచ్చరిస్తున్నాం. వారు ఆయా చర్యలచే కాలాగ్నికి ఇంధనమగుచున్నారని వాత్సల్య భావంతో హెచ్చరిక చేస్తున్నాం. వారికి ఇహపరములలో సుఖం లేనేలేదు.
1. దేహతాదాత్మ్యము, 2. మనోచంచలత్వము... ఈ రెండే ఈ దేహ గృహంలో సంచరించే భూత పిశాచాలు సుమా! ఏ దేహకోటరంలో అహంకార సర్పం బుసలుకొడుతూ ఉంటుందో, అయ్యది శీఘ్రంగా దుఃఖమేఘములను ఆహ్వానిస్తోంది. తగు జాగ్రత్త వహించకుంటే వర్తమాన భవిష్యత్తులు ఈ జీవునకు దుర్భరం కానున్నాయని మా హెచ్చరిక.
శ్రీరాముడు : మరి మేము ఈ అహంకారమును ఎదుర్కొనేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ అహంకారం ఉంటే ఉండనీ! ఊడితే ఊడనీ. నీవుమాత్రం మనస్సుతో అహంకారం వైపుగా చూడనేవద్దు. అది లేనిదానిగా, నిష్ప్రయోజన మైనదానిగా భావించి
Page:86
ఉదాసీనుడవగుము. దానిని లోలోన తిరస్కరించి, దానిని అసలు పట్టించుకోకపోతే, ఇక అది నిన్నేమి చేయలేదు.
శ్రీరాముడు : మహర్షీ! ఈ శరీరంలో 'చిత్తము' అనే పిశాచం ఉండి ఆత్మను కలుషితం చేస్తోంది కదా? ఎంతవిన్నా మేము ఈ చిత్తమును రహితం చేయలేకపోతున్నాం. ఏం చేయాలి? శ్రీవసిష్ఠ మహర్షి : శరీరగృహంలో 'చిత్తము' అనే పిశాచం ఉన్నప్పటికీ అనంతవిలాసుడగు ఆత్మకు కలుగగల దోషమేమీ లేదు. ఆకాశము సర్వే సర్వత్రా వ్యాపించి ఉండి భూ-అగ్ని-జల-వాయువులను తనయందు కలిగి ఉండి కూడా, వాటితో ఏమాత్రం సంబంధం లేకయే ఉంటోంది కదా! అట్లాగే ఆత్మయందు ఈ మనోచిత్త అహంకారాలు ఉన్నప్పటికీ ఆత్మకు వాటితో సంబంధం లేదు. చిత్తము యొక్క రూపం ఇష్టమే కదా! ఎవడైతే 'ఈ శరీరమే నేను ఈ ఇంద్రియ విషయములు నాకు ముఖ్యము’ అను చిత్తాహంకారములకు హృదయంలో పెత్తనం ఇచ్చి ఉంటాడో అట్టివాడు పడేపాట్లు నేను మాటలతో చెప్పలేను. 'హాఁ! నేను చచ్చాను. అయ్యా! నేను శరీరం తప్పించి గతిలేని వాడను. శరీరం ద్వారా ఏర్పడే సంబంధాలే వాస్తవం. నేను దుఃఖిని. ఒక జీవుడను. అల్పుడను' అని తలచటమే అహంకార – చిత్తముల విన్యాసం. అది గమనించి హృదయగృహంలో పెత్తనం ఆత్మభగవానునికి ఇవ్వాలి. 'నేను అసంగుడను, అప్రమేయుడను. నిత్యుడను. సర్వాత్మకుడను. శుద్ధుడను' అను ఆత్మస్వభావాన్ని ఆశ్రయించి ఉండాలి. ఆత్మకు మనోచిత్తాహంకారాది మరి దేనితోనూ సంబంధం లేదు. అనగా, 'నా స్వస్వరూపము మనోచిత్తహంకారాలు కావు' అను ధ్యానం కలిగి ఉంటే క్రమంగా ఈ చిత్త పిశాచం ఆటకట్టినట్లే.
శ్రీరామచంద్రా! ఈ జడము, అనివార్య వినాశన సమన్వితము, సర్పరజ్జువు వలె భ్రాంతి భూయిష్ఠము అగు శరీరమును గ్రహించేపని చేస్తున్నది అహంకారమేగాని, ఆత్మకాదు. ఎందుకంటే ఆత్మ సర్వదా నిష్క్రియమైనది. అది పుట్టదు, పెరగదు, ముదుసలి అవదు, చావదు. ఒక పెద్ద వృక్షం పుట్టి, పెరిగి నశించేది ఆకాశంలో అయినప్పటికీ, ఆ జన్మ - వృద్ధి - హాని లతో ఆకాశమునకు సంబంధం లేదుకదా! 'నేను సర్వదా దేనికీ సంబంధం లేని ఆత్మస్వరూపుడను' అని అనునిత్యం అభ్యసించాలి. అంతేగాని 'ఈ చిత్తం, ఈ అహంకారం ఉన్నాయే? ఏం చేయాలి? ఎట్లా తొలగించు కోవాలి?’... అని ఎంతగా పరితపించినా ఎన్ని జన్మలు ఆ విధంగా గడపినా లాభం లేదు. సంబంధం ఉండవలసిన అగత్యం లేనివాటితో సంబంధం పెట్టుకోవటమే చిత్తము యొక్క రూపం. అదే అహంకారం. అదే సంసారం.
దీపము తన యందు ఎట్టి ఇచ్చ లేకుండానే గదిలోని ఆయా వస్తువులను కనబడేట్లు ప్రకాశింపజేస్తోంది. అట్లే ఆత్మప్రకాశం చేతనే ఈ 'చిత్తము' అనేది రూపుదిద్దుకుని ప్రకాశమాన మవుతోంది. గదిలోని ప్రకాశమానమయ్యే వస్తువులకు - దీపమునకు సంబంధం లేదు కదా! జడ స్వరూపమగు ఈ చిత్తాహంకారాలకు - ఆత్మకు సంబంధం లేదు. భూమికి - ఆకాశమునకు ఏం సంబంధమయ్యా?
Page:87
ఓ రఘునందనా! వాస్తవానికి నీవు సర్వజ్ఞమగు ఆత్మయే గాని మరింకేమీ కాదు. మరి నీవు ఈ చిత్తాహంకారాలను చూచి ఎందుకు మోహం చెందాలి? అట్టి మోహమును దగ్గరకు రానీయకు. శూన్య స్వరూపమగు మనః పిశాచము ఆత్మను తాకనైనా లేదు. అయితే అది 'నేను ఆత్మను స్పృశిస్తున్నాను. సంతోషింపజేస్తున్నాను. దుఃఖింపజేస్తున్నాను'... అని మాత్రం అనుకుంటూ ఉంటుంది.
అది 'రాజుగారికి నేను ఎంత చెపితే అంతే' అని సేవకుడు అనుకోవటం వంటిది.
సంసారకారి, ధైర్యమును నాశనం చేసేది, అమంగళకరము అగు ఈ చిత్తవిభాగాన్ని విడచిపెట్టి అప్పుడు శేషించేదేమిటో - అద్దానినే ఆశ్రయించి ఉండు.
ఓ సర్వసభికులారా! మరల మరొక్కసారి మీకందరికి గుర్తుచేస్తున్నాను. చిత్తపిశాచముచే ఆక్రమించబడిన అంతరంగం కలవారిని శాస్త్రములు గాని, గురూపదేశములు గాని, బంధుజనులు గాని, మరెవ్వరైనా గాని రక్షించలేరు.
ఇంద్రియ వ్యాపారముల పట్ల ఏర్పడే సత్యత్వబుద్ధి - ఆకర్షణలే చిత్తము యొక్క రూపం. కొంచెం బురదలో ఉన్న దున్నపోతునైతే బయట పడవేయవచ్చు గాని, లోతైన బురదలో ఇరుక్కుని ఉన్న దున్నపోతును లేవదీయటం తేలికైన పని కాదు కదా! ఇంద్రియ వ్యాపారాలలో లోతుగా మునిగి ఉన్న ధ్యాసగల వానిని సంబోధనల చేత ఎట్లా కాపాడటం? అదే కొంచెం ధ్యాసగల వానికో?... అట్టి ధ్యాస తగ్గుముఖం పట్టుచున్న వానికో?... శాస్త్రార్ధములు సులభంగా చిత్తశమనం ప్రసాదించ గలుగుతాయి. అందుచేతనే శాస్త్రములు అనేక అభ్యాసములను ప్రతిపాదిస్తున్నాయి.
చిత్తం జగత్తును కలచివేస్తోంది. ఈ దేహపురమును అజ్ఞానమయం చేసివేస్తోంది. అంతరంగం నందు చిత్తము బీభత్సపూర్వకమైన తాండవం చేస్తుంటే భయపడనివారెవ్వరు?
ఆహా! రామా! ఈ జగన్నగరంలో కొద్ది దేహగృహాలలో మాత్రమే చిత్తపిశాచం యజమానియగు ఆత్మకు అంకితమై ఉంటోంది. అందుచేత ఆ కొద్ది దేహగృహాలు సాధుత్వమునకు నివాస వసతులకు యోగ్యమై ఉంటున్నాయి. మిగతా జగత్తు చిత్త పిశాచమునకు మాత్రమే నివాసయోగ్యమౌతోంది. ఈ జగదరణ్యం అధికభాగం 'మోహము' అనే చెత్త కుప్పలచే నిండి ఉంటోంది.
కేవలం ధృతి పూర్వకమైన పురుష ప్రయత్నంచేతమాత్రమే మమకార - అహంకార భూతపిశాచములను పారత్రోలటం సాధ్యం.
నీవు మాత్రం అజ్ఞాన ఏనుగును సంహరించే సుజ్ఞాన సింహంలా ఈ సంసారారణ్యంలో విహరించు. అంతేగాని గడ్డిపోచలను తింటూ క్షణక్షణం భయముతో రోజులు గడిపే లేళ్ళలాగా విషయములను భక్షిస్తూ ఆయుష్షు వృథా చేసుకోకు. బంధుజనుల పట్ల ఏర్పడే మమకారాదుల వలన, విషయేచ్ఛల వలన ఏర్పడే ఆనందం అత్యంత క్షణికమాత్రమని గ్రహించు. ఇక దాని పరిణామమో, మహాభయ - - దుఃఖ - భ్రాంతి. ఇది గమనించి, సాధుజనులమార్గమును అనుసరించు. మహార్థము (The final essence)ను విచారించు. ఆత్మను ఒక్కదానినే ఆశ్రయించు. అంతేగాని,
Page:88
అపవిత్రము - తుచ్ఛము - దుర్బరము - - క్షణభంగురము - దురాకృతిసమన్వితము అగు ఈ శరీరము కొరకై విషయసుఖములందు మునుగవద్దు. ఎందుకంటే అట్టి మార్గంలో 'చింత' అనే క్రూరమగు రాక్షసి పొంచి ఉండి, నీ జ్ఞానధనం మ్రింగి వేయటానికి ఎత్తులు వేస్తూ సిద్ధంగా ఉన్నది.
ఈ శరీరమును 'సంకల్పము' అను పేరుగల ఒకడు నిర్మించాడు... 'అహంకారము' అను మరొకడు వచ్చి దీనిని ఆశ్రయించాడు... 'మనస్సు' అను ఇంకొకడు ఇక్కడి సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు... ఈ మూర్ఖ సంసారచక్రం విచిత్రంగా పరిభ్రమిస్తోంది.
జీవులంతా ఇది ఎంతగానో గమనించవలసిన విషయం సుమా!
Page:89
III. దేవతార్చన
(శ్రీ సాంబశివ - వసిష్ఠ సంవాదము)
1 అర్చన-నిర్వచనం
శ్రీవసిష్ఠ మహర్షి: శిలకు ఘనత్వమే రూపమై ఉన్నది. మరింకేదీ (గుండ్రం, చదరం మొదలైనవి) అసలైన రూపం కాదు కదా! అట్లాగే ఆత్మకు చిత్, సత్తా సామాన్యము అనునవే రూపములై ఉంటున్నాయి. దేహములు, సుఖదుఃఖాది భోగములు, జగత్తు మొదలైనవి ఆత్మయొక్క రూపం కాదు.
పాషాణం నుండి పాషాణత్వం వేరు కాదు. ఘటం (కుండ) కంటే ఘటత్వం వేరు కాదు. అట్లాగే మనస్సు ఆత్మకంటే వేరు కాదు.
ఓ రామచంద్రా! ఒకప్పుడు కైలాసనాథుడు, భక్తవత్సలుడు అగు సాంబశివుడు ఈ విషయం గురించి, తత్త్వదర్శనము యొక్క ఉపాయం గురించి నాయొక్క సంసారదోష నివారణార్థం నాకు బోధించటం జరిగింది. 'మనస్సనేది ఆత్మ కంటే వేరుకాదు' అనేది సుస్పష్టపరుస్తూ మనోమార్గమైన దేవతార్చన అనే ఒక మహత్తరవిషయం సుబోధపరచారు. ఆ విషయములు ఇప్పుడు ప్రస్తావిస్తాను.
స్వర్గలోకమునకు ఆవల 'కైలాసం' అనే పేరుగల ఒక పర్వతం ఉన్నది. అక్కడ అర్ధేందుశేఖరుడగు శివుడు జగన్మాత పార్వతితో కూడి ప్రమథగణసమేతుడై ఉంటూ ఉంటారు. నేనొకసారి శిష్యగణంతో ఆయనను పూజించటానికి కైలాసశిఖరం సమీపించాను. అక్కడ గంగానది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని శివలింగం ప్రతిక్షేపించి ఇక రోజూ పూజించటం ప్రారంభించాను. తపోనియమములను అవలంబించి కొంతకాలం గడిపాను. ఆ సమయంలో సిద్ధ పురుషులు అక్కడకు వచ్చి నాకు తాత్త్విక విషయాలు విశదపరుస్తూ ఉండేవారు. శివతత్త్వం గురించిన సంభాషణతో ప్రశాంతంగాను, ఆనందంగాను, సువిజ్ఞానసమృద్ధంగాను రోజులు గడచిపోతూ ఉండేవి.
ఒకరోజు నా పూర్వకృతమైన పుణ్యం ఫలించింది. ఆ రోజు శ్రావణమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి. సాయంకాలం ప్రదోషకాలం గడిచింది. నేను ఒకచోట ఆసీనుడై హృదయపూర్వకంగా శివభగవానుని స్మరిస్తూ ఉన్నాను.
అది సాయం సమయం దిక్కులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. చీకటి క్రమంగా పరిసరాలన్నీ ఆక్రమించ వేయసాగింది. క్రమక్రమంగా జంతువులు తమతమ నివాసాలను జేరటం చేత ఏమాత్రం వాటి అలికిడి వినబడటం లేదు. ఆ పరిసర వాతావరణమంతా కాష్టంలాగా స్పందరహితంగా ఉంది.
Page:90
నిమిషాలు మౌనంగా గడచిపోతున్నాయి. కళ్ళు మూసుకుని ఉన్న నన్ను, ఏదో తెల్లటి కిరణం తాకినట్లు అనిపించి కనులు తెరచాను. దూరంనుండి ఏదో తెల్లటి వెలుగు ఆ ప్రదేశాన్ని సమీపిస్తున్నట్లు గమనించాను. క్రమంగా దిక్కులు తేజఃపుంజములతో నిండి ప్రకాశించసాగాయి. కొంచెం చకితుడనై నిలబడి జ్ఞాన దృష్టితో నలువైపులా పరికించి చూచాను. ఆహా! పరమాశ్చర్యం!
భగవంతుడు, చంద్రకళాధరుడు, దేవాదిదేవుడు అగు మహాదేవుడు అమ్మ పార్వతీదేవి చేయి పట్టుకుని, నందీశ్వరుడు త్రోవ చూపుచుండగా, మేమున్న పర్వతసానువు వైపుగా వస్తున్నారు. నేను శిష్యులను ఉత్సాహపరచి అర్ఘ్యపాద్యములు, పుష్పాంజలులు తీసుకొని ఎదురేగాను. పాదపద్మాలకు సాష్టాంగ దండప్రణామాలు సమర్పించి కళ్ళకు హత్తుకుని జగత్మాతాపితరులను ఆశ్రమానికి భక్తిపూర్వకంగా గొనివచ్చాము. పుష్పాసనం సమర్పించాము. మందార పుష్పములతో అభిషేకించాము. బహువిధ స్తోత్ర పాఠములతో శాస్త్ర-భక్తియుక్తంగా పూజించాం. అట్టి స్తోత్రపూజలచే మా అందరి అంతఃకరణం సుశీతలమైంది.
అటు పై సుఖాసీనులై లోకరక్షకుడగు చంద్రశేఖరుడు అమృత వచనాలతో ఇట్లా ప్రశ్నించారు. శ్రీశివ భగవానుడు : పుత్రా! వసిష్ఠా! నీవు, నీ శిష్యులు కుశలమే గదా!
శ్రీవసిష్ఠ మహర్షి : దేవేశ్వరా! సర్వలోకాధీశ్వరా! మహేశ్వరా! భవానీపతీ! త్రిలోచనా! మీ 'నామ స్మరణ' అనే మంగళప్రదమగు శుభకార్యమున నిమగ్నమైన వారికి ఇక దుష్ప్రప్యమనేది ఏముంటుంది? నీ యెడ భక్తి గలవారికి ఇక భయం ఉండదు. సర్వ విధములా, సర్వదిక్కులా అభయమే! నీ అనుస్మరణానందమును గ్రోలు చిత్తము గలవారు అందరికీ పూజ్యాతిపూజ్యులౌతారు.
ఎచ్చట శివస్మరణ జరుగుతుందో - అదియే దేశము, అదియే జనపదము, అదియే పర్వతము. హే ప్రభో! నీ స్మరణయే పూర్వపుణ్యఫలము. వర్తమాన పుణ్యకర్మల అభివర్ధకము. భవిష్యత్ సుఖవృక్ష బీజకము. హే భూతపతీ! మిమ్ములను స్మరించటమంటే ధైర్యము - జ్ఞానము - - మోక్షముల ప్రాకారం సమీపించటమే అవుతుంది. మిమ్ములను పూజించటమనే చింతామణి దొరకటానికి నేను ఎంతటి పుణ్యం చేసి ఉంటానో!
శ్రీశివ భగవానుడు : చాలా సంతోషం నాయనా! మరి... నీ చిత్తము శాంతిని పొంది పరమపదమున సుస్థిరం మంగళప్రదం అయి ఉంటోంది కదా?
శ్రీవసిష్ఠ మహర్షి : హే భగవాన్! మీ దయ వల్ల దిక్కులన్నీ పూర్ణమై శాంతమై శివమై కన్పట్టుచున్నాయి. శ్రీశివ భగవానుడు : మంచిది. ఇప్పుడు నీకేమైనా సంశయాలుగాని, ఏమైనా తెలుసుకోవాలని గాని ఉన్నదా?
శ్రీవసిష్ఠ మహర్షి : హే పరంధామా! నాకు ఒక్క విషయంలో మీ ప్రవచనం వినాలని ఉన్నది. ఆ విషయం మీ ముందు ప్రస్తావిస్తాను. నాపై దయతో నాకు వివరించమని ప్రార్థిస్తున్నాను"ఉద్విగ్నరహితము, పాపక్షయకరము, సర్వకళ్యాణవర్ధకము అనునిత్యాచరణకు సులభాతి సులభం అగు ఒకానొక ‘దేవతార్చనావిధానం' గురించి శ్రీశివ భగవానుడే విశదీకరించగల సమర్థులు’
Page:91
అని మునిలోకంలో ఒకానొక ప్రతీతి ఉన్నది. ఈ సందర్భంలో నా మనస్సులో ఆ విషయం తళుక్కు మని మెరిసింది. ఆ దేవతార్చన (లేక) పూజా విధానం గురించి మీ నుండి తెలుసుకోవాలని ఉన్నది. నాకు, మీ బిడ్డలగు ఈ నా శిష్యులకు ఆ దేవతార్చన గురించి ప్రవచించమని విన్నపం చేస్తున్నాను. శ్రీశివ భగవానుడు: బిడ్డా! చాలా ఉచితమైన విషయమే అడిగావు. జీవునకు ముక్తి ప్రసాదించగల ఒకానొక ఉత్తమమైన అర్చన గురించి చెపుతాను. బుద్ధి కుశలత, భక్తి ప్రపత్తులు గల నీవు, నీ శిష్యులు అందుకు తప్పక అర్హులు.
‘దేవతార్చన అంటే ఏమిటి? 'దేవుని అర్చించుట' అని కదా! దేవతార్చనకు ఉపక్రమించే ముందు “దేవుడు అనగా ఎవ్వరు? ఎక్కడున్నాడు?” అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అర్చన యొక్క ఉత్తమప్రయోజనం లభించదు.
'దేవుడు' అనగా ఎవరు? పుండరీకాక్షుడగు విష్ణువా? త్రిలోచనుడగు శివుడా? కమల సంభవుడగు బ్రహ్మయా? వాయువా? సూర్యచంద్రులా? అగ్నియా? నీరా? బ్రాహ్మణ క్షత్రియులా?... అద్వితీయమగు దేవత వీరెవ్వరూ కారు. మనం ఇద్దరం కూడా కాదు. లక్ష్మి - సరస్వతి - పార్వతి నామ రూపములు కాదు. దేహ-చిత్త రూపము ఒప్పువారెవ్వరూ కాదు.
ఇక సత్యమగు దేవత ఎవరంటావా?... విను.
అకృత్రిమమై, ఆద్యంతరహితమై, నామ-రూప-దేశ-కాలములచే పరిమితము కానిదై, స్వస్వరూపమునకు వేరుగా లేక, కేవల సం-విత్ స్వరూపమైనదేదో ... అదియే ‘దేవతార్చన' యందు 'దేవత' అని గ్రహించు.
వత్సా! వసిష్ఠా! ఆకారాదులతో కూడి, పరిచ్ఛిన్నమగు, పరిమితమైన దానియందు అత్యుత్తమమగు దేవతాభావం ఎట్లా కుదురుతుంది? సర్వులయందు, సర్వమునందూ సర్వదా ఏర్పడి ఉన్న చైతన్యమే ‘దేవత’ అను శబ్దముచే ఉద్దేశించబడి, పూజార్హమవుతోంది. సర్వరూపములు తానై ఉన్న ఆ చైతన్యము మాత్రమే వాస్తవమగు సత్తచే ఒప్పారుచున్నది. ఇక తదితరములన్నీ ఆత్మస్వరూపమునందు విరాజిల్లు చున్నాయి. ఆ మంగళమయ తత్త్వమును గ్రహించలేని బాలుర వంటివారి కొరకై కల్పిత దేవత యొక్క అర్చన విధించబడింది. పదిమైళ్ళు వెళ్ళవలసిన వానికి ఒక మైలు వరకూ నడవటానికి పనికి వచ్చే ఉపాయాలు విభజించి బోధిస్తున్నట్లు... మధ్యే మార్గంగా రుద్రుడు మొదలైన దేవతల ఉపాసన దైవజ్ఞులచే, పురాణములచే అందించబడుచున్నాయి.
ఇయత్తాది పరిచ్ఛిన్నం రుద్రాదేః ప్రాప్యతే ఫలమ్ । అకృత్రిమమ్-అనాద్యన్తం ఫలమ్ ఆనంద ఆత్మనః ||
రుద్రుడు మొదలైన నామరూపములతో కూడిన దేవతల ఉపాసన వలన లభించే ఫలితం పరిచ్ఛిన్నమైనది. అది కొంతదృష్టివరకే పరిగణకు యోగ్యం. అయితే, అది, “సర్వాంతర్యామి - సర్వతత్వ స్వరూపుడు” అగు పరమాత్మ యొక్క ఉపాసనకు దారితీసినప్పుడే ఉపాసన యొక్క