Page:392

వాస్తవానికి చిన్మాత్ర సంబంధమే కాబట్టి చిన్మాత్ర స్వరూపములే అయివుండగా, ఇక 'వినాశనం' అనునదెక్కడిది? నీవు - ఈ జగత్తు చిన్మాత్రములే అయివుండగా, ఇక బంధింపబడునదేది? ముక్తి చెందునదేది? “నాకు బంధమున్నది ... అనేది నీవు పరిశీలించి ఇప్పటికిప్పుడే అట్టి అనుభవమును త్యజించివేయాలి సుమా!

"ఆహా! మాకు బంధం అనిపిస్తోందే?" అని అంటావా? కొందరికి కంటి జబ్బు కారణంగా కంటి గ్రుడ్లు క్షణక్షణం కించిత్ చంచలం పొందుతూ ఉండటం చేత వారివారి కళ్ళకు ఆకాశంలో కేశాలు, మెరమెర మెరిసే మణులు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజానికి ఉన్నాయా? లేవు. అవన్నీ వైద్యసేవచే చంచలం త్యజిస్తే ఇక కనిపించవుకదా! అట్లాగే అధిష్ఠానమగు ఆత్మను గూర్చిన అజ్ఞానం చేత ఈ జగత్తు నిరంతరం పరిణామయుతంగా కనిపిస్తోంది. వికారవంతంగా అనిపిస్తోంది. కానీ ఆత్మజ్ఞానులకు ఇదంతా నిశ్చల చిద్రూపంగా భాసిస్తోంది. నది ఒడ్డున కూర్చుని చూస్తూ ఉంటే, జలతరంగం అత్యంత చంచలంగా కనిపించవచ్చు గాక! తరంగం ఒక రూపం కోల్పోయి మరొక రూపం అతివేగంగా పొందవచ్చునుగాక! జలం సర్వదా జలంగానే ఉంటోంది కదా!

ఏ కాలంలో ఈ భూ-జల-ఆకాశ-పర్వతాది జగత్తు క్షణంలో స్ఫురిస్తోందో, ఆ కాలమునే విద్వాంసులు బుద్ధితో లెక్కించే క్షణ-యుగ - కల్పాది కాలమాన కల్పన కూడా ప్రారంభమౌతోంది. ఎప్పుడైతే, “ఈ జగత్తు స్వప్నంలాగా అసద్రూపమే అయినప్పటికీ అనుభూతమౌతోంది" - అని గ్రహించబడుచున్నదో... ఈ జగత్తు అన్నది వాస్తవానికి (ఆత్మజ్ఞాన దృష్టికి) లేకయే ఉన్నదో... అప్పుడే ఈ సమస్తం ఆ ఆత్మజ్ఞానికి సర్వము సర్వదా సద్రూప చైతన్యంగానే స్ఫురించగలదు.

ఓ వ్యాధుడా! మనకు ఈ ప్రసిద్ధమగు జగత్తు ఎట్లా ఉన్నట్లుగా కనిపిస్తోందో... అదే రీతిగా ఇతర అసంఖ్యాక జీవులకు వారి వారి అసంఖ్యా జగత్తులు ఆకాశంలో ఏర్పడి ఉండి కనిపిస్తున్నాయి. ఒకరి జగత్తు మరొకరికి స్ఫురించటంలేదు. ఎవరి జగత్తు వారిదే అగుచున్నది.

వ్యాధుడు : అదేమిటి? ప్రతి జీవునికి తన ప్రత్యేక జగత్తు ఉండటమేమిటి?

మహాముని : అవును. నూతిలో కప్పకు ఆ నూతిలోని అంతర్భాగమే పరిపూర్ణమగు జగత్తుగా స్ఫురిస్తోంది. తటాకంలోని కప్పకు ఆ తటాకమే మొత్తం జగత్తుగా అనిపిస్తోంది. సముద్రంలోని కప్పకు సువిశాల సముద్రం జగత్తుగా తెలియవస్తోంది. ఒకదాని జగత్తు ఏమిటో రెండవది ఒప్పుకోవటంలేదు.

యథా జనశత స్వప్ననగరాణి ఏకమందిరే

తథా జగన్తి ఖే భాన్తి నో సన్యసన్తి నో ॥

ఒకే ఇంట్లో పదిమంది సుష్టుగా భోజనం చేసి నిద్రపోతున్నారనుకో! అందులో ఒకనికి తన స్వప్నంలో ఏఏ నగరాలు కనిపిస్తున్నాయో, అవి ప్రక్కనే నిదురలో వేరువేరు కలలుగంటున్న మరొకరికి కనిపించటంలేదు కదా! అట్లాగే ఆకాశంలోని అనేక అసంఖ్యాక జగత్తులు భాసిస్తున్నప్పటికీ ఒక జగత్తులోని వారికి రెండవ జగత్తు కనిపించటం లేదు. ఎవరికి ఏ జగత్తు జాగ్రత్ సత్యంవలె

Page:393

కనిపిస్తోందో, అది మరొకరికి స్వప్నతుల్యంగాను కూడా అనిపిస్తోంది. ఎందుచేతనంటావా? నీ స్వప్న సమయంలో నీకు కనబడే స్వప్నం నీకు వాస్తవమే అయినప్పటికీ నాకు స్వప్నతుల్యమేకదా! ఇదీ అట్టిదే! చూచావా? ఒకే గదిలో నిదురిస్తున్న అనేకమంది మనుజులు వారి వారికి దర్శనమగుచున్న స్వప్నమును “సత్యమే అయివుంటున్నట్లు, ఆ ప్రక్కవారికి అది భ్రమయే అయివున్నట్లుగా... ఆకాశంలోగల అనేక బ్రహ్మాండాలన్నీ కూడా సత్-అసత్ రూపంగా స్ఫురిస్తున్నాయి. అందుచేత నీకు కనబడే జగత్తును నీవు ఎట్లా దర్శించాలో చెప్పుతాను... విను.

నీకు స్పురించే జగత్తు నీకు ద్వితీయం కాదు. అద్వితీయమైనది. అది స్వాత్మ యొక్క అవయవరూపము వంటిది. నిజ చైతన్యము యొక్క చమత్కార మాత్రమైనది.

కనుకనే ఈ కనబడే జగత్తు ఒకనికి సాకారంగాను, మరొకరికి (జ్ఞానికి) నిరాకారంగాను, ఒకనికి కారణరహితంగాను, మరొకరికి కారణసహితంగాను కనిపిస్తోంది. తత్త్వదృష్టిచే ఈ జగత్తంతా కూడా నిరాకారమై, కారణరహితమై వెలయుచున్నది.

వ్యాధుడు : అయితే నాకు కనబడే జగత్తు నా జగత్ సంస్కార సంబంధమైనదేనని సిద్ధాంతీకరిస్తున్నారా?

మహాముని : అవును! నిర్వివాదంగా, శాస్త్ర స్వానుభవ నిర్ణయంగా - - అంతే!

వ్యాధుడు : అయితే నా మరొక సందేహం. ఈ జీవుల యొక్క జగత్ సంస్కారములు దేహ సంబంధమైనవా? చైతన్య సంబంధమైనవా?

మహాముని : ఈ జీవుల జగత్ సంస్కారములు... కేవలము చైతన్యమునందూ లేవు! కేవలము దేహమునందూ లేవు!

వ్యాధుడు : మరి?

మహాముని : "వానికి అటువంటి బుద్ధి పుట్టింది" అంటూ ఉంటామే! బుద్ధియే దృశ్యాకార పరిణామాన్ని ధరిస్తోంది. అది చిదాభ్యాస వ్యాప్తమై ఉంటోంది. వాస్తవానికి బుద్ధి చిత్స్వభావ యుతమే అయివున్నది. అట్టి బుద్ధియే "జగత, సంస్కారములు, స్వభావము, ప్రకృతి ...మొదలైన ఆయా పేర్లతో చెప్పబడుతోంది.

విజ్ఞులు స్వప్నం గురించి బోధించేటప్పుడు "ఇతఃపూర్వం గాంచబడిన పదార్థములను పోలినట్టి సంకల్పిత పదార్థముల అనుభవ స్మృతియే ఆయా అనుభవాల అపూర్వత్వ కారణంగా (ఇప్పుడు జ్ఞాపకానికి రావటం చేత) స్వప్న రూపంలో ప్రదర్శనమౌతోంది... అని నిర్వచిస్తున్నారు. ఈ జాగ్రత్ స్వప్నం కూడా అట్టిదే! ఈ జాగ్రత్లో మరణం" అనేది ఈ జన్మలోని అనుభవం కాకపోయినప్పటికీ క్రితం జన్మలలో అనుభవమైన విషయమే అయివున్నది. కాబట్టి జీవన్ -

మరణాదుల సంస్కారముతో కూడిన స్మృతి రూపబుద్ధియే ఈ స్వప్న మాత్ర జగత్ రూపమును ధరిస్తోందనునది సునిశ్చితమైన విషయమేగాని, ఇప్పుడు నేను క్రొత్తగా చెప్పుచున్నది కాదు. కాబట్టి ప్రతి జీవుని స్వానుభవ జగత్తు కూడా ఆతని స్వకీయ బుద్ధి రూప సందర్శనమే సుమా!

Page:394

ఈ జాగ్రత్ స్వప్నం సృష్ట్యాదియందు స్వప్నమువలె విజృంభిస్తోంది. చైతన్యములోనుంచే అది బయల్వెడలుతోంది. కాబట్టి జగత్తు చైతన్యము యొక్క నిర్మల ప్రకాశమాత్ర స్వరూపమే! అంతేగాని, ఈ జగత్తు మరింకొకటేదీ కానేకాదు.

16. బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తోంది

మహాముని :

బ్రహ్మైవ భాతి జగత్ ఇత్యుక్తం ఉక్త్యానయా భవేత్ |

న చ భాతం నవమ్ తచ్చ బ్రహ్మైవేదమతః స్థితమ్ ||

ఈ జగత్తు రూపంగా బ్రహ్మమే భాసిస్తోంది. ఇంకొక విషయం. ఇది పూర్వం భాసించక ఇప్పుడు క్రొత్తగా భాసించటం లేదు. ఇది అనాది ప్రకాశరూపమైనది. ఇది సర్వదా బ్రహ్మముతోటి ఐక్యము పొందియే ఉన్నది. "జగత్తు అనాదియగు బ్రహ్మమే అనే దృష్టిని నీవు పెంపొందించుకొని శాస్త్ర వాక్యానుగుణంగా పరిపుష్టం చేసుకో!

ఆ పరమాత్మయే ఈ జగత్తుకు కారణము, కార్యము కూడా! ఎట్లా అంటావా? సామాన్య రూపమగు కారణమే. విశేష రూపమగు కార్యం అగుచున్నది. కార్య సంస్కారాల యొక్క ఆధారభూత మగు బీజరూపమైన కారణమే కార్యరూప సంస్కారములకు అధినేత అయివుంటోంది.

కనుక ఆత్మయే సంస్కార రూపములుగా వెలయుచున్నది. ఈ 'జగత్తు' అనే కార్యమునకు ఆత్మయొక్క సంస్కారములే కారణం. సంస్కారములు ఆత్మకు భిన్నం కాదు. జగత్తు ఆత్మయే! భిన్నం కాదు. కార్యానుకూలమగు యత్నమును 'కృతి' అంటున్నాం. అట్టి కృతి రూపమగు సంస్కారం కూడా (పై పరిశీలనను అనుసరించి) ఆత్మయే అయి ఉన్నది.

స్వప్నంలో ఏఏ జాగ్రత్లో చూచినట్టి పదార్థాల, వ్యక్తుల, సంఘటనలకు కొంత సంబంధించినవై కనిపిస్తున్నాయో... (జాగ్రత్ దృష్టాంతంగా కలిగిన వ్యవహారాదులు కనిపిస్తున్నాయో) అవన్నీ ద్రష్ట యొక్క సూక్ష్మరూప సంస్కార వాసనాదులే గాని స్వప్నాంతర్గతమైన విశేషాలన్నీ మరింకెక్కడినుంచో వచ్చి అక్కడ చేరటంలేదు. మరింకెవరో ఈ జీవుని కొరకై కల్పించినవేవీ కావు సుమా!

స్వప్న సమయంలో స్వప్న సంస్కారాలు జాగ్రత్తులో లేకుండా పోయాయని అనుకోకూడదు. ఎందుకంటే చిత్తాకాశంలో అనేక సూక్ష్మ సంస్కారాలు సదా విద్యమానమై ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే జాగ్రత్తులోను - స్వప్నంలోనూ కూడా అప్పటికి సందర్భానుచితంగా, సాధ్యాసాధ్యానుచితంగా ఒక్కొక్క రోజు ప్రదర్శితమౌతూ ఉన్నాయి. ఆత్మ కేవల సాక్షీరూపంగా అటు స్వప్న సమయంలోనూ ఇటు జాగ్రత్ సమయంలోనూ కూడా ప్రత్యక్షమై ఏర్పడియే ఉన్నది. అద్దాని సమక్షంలో, అద్దానికి అప్రమేయంగా చిత్తాకాశ స్వభావంగా స్వప్న - జాగ్రత్తులు పరిఢవిల్లుచున్నాయి.

Page:395

వేద - వేదాంత ప్రవచనాలు - ప్రమాణాలు అద్వితీయ సాక్షీరూప బ్రహ్మమును నిరూపిస్తూ

వస్తున్నాయి. మనయొక్క కేవల బ్రాహ్మీ స్వరూపము శ్రవణ - మనన - ధారణ - నిధిధ్యాసాది సాధన చతుష్టయం చేత సునిశ్చితమై అనుభవమౌతోంది.

ఆత్మ అనుభవమగుచుండగా ద్వైత సృష్టి / ద్వైత దృష్టి స్వయంగా - వెలుతురు రాగానే చీకటి తొలగిపోయినట్లుగా - తొలగిపోతున్నాయి. అట్టి ఆత్మస్వభావమును నిశ్చయించి అనుభవజ్ఞులగు గురువులు తమ అర్హులైన శిష్యులకు శాస్త్ర ప్రమాణపూర్వకంగా, స్వానుభావపూర్వకంగా సుబోధకం చేస్తూనే వస్తున్నారు. అట్టి ఆత్మజ్ఞులు ఇది సంసారం - దీని కావల ఆత్మ అని

ప్రారంభిస్తూ "సమ్యక్ విచారణచే జగత్తుగా కనిపించేదంతా ఆత్మయే. నీ స్వరూపం ఆత్మయే అయి ఉన్నది. (తత్ త్వమ్ అసి)” అని పాఠ్యాంశం యొక్క పరాకాష్ఠగా సుబోధిస్తున్నారు. వారి ప్రబోధములను అర్థం చేసుకొనియే స్వప్న - - జాగ్రత్తుల సాదృశత్వం నీకు బోధిస్తున్నాను సుమా!

వ్యాధుడు : స్వామీ! మునీశ్వరా! స్వప్నంలో కనిపించే దృశ్యసంస్కారమంతా జాగ్రత్ వలననే, జాగ్రత్ ఆధారంగా కలిగి ఏర్పడుతోందని కొందరి అభిప్రాయం. స్వప్నం జాగ్రత్తుకంటే భిన్నంగా ఉన్నప్పటికీ అది జాగ్రత్ యొక్క అభాసమాత్రమేనని, జాగ్రత్ యొక్క అనుభవమే స్వప్నానుభవా లన్నిటికీ ఆధారమని, కనుక జాగ్రత్ స్వప్నముకంటే విశిష్టమైనదనీ, జాగ్రత్తు సత్యం - స్వప్నం మిథ్య" అని వారు అభిప్రాయం కలిగియుండి వాదిస్తున్నారు. అది సరైన అభిప్రాయమేనంటారా? మహాముని : అది సరి కాదని మా స్వానుభవపూర్వక అనుభవం. వాయువులో చలనం అంతర్గతమై ఉన్నట్లు చిత్తములో సూక్ష్మ సంస్కారాలు అంతర్లీనమై ఉండి జాగ్రత్ - స్వప్నాలలో ఆయా అనుభవ

- - అనుభూతులుగా ప్రదర్శితమౌతున్నాయి. అంతకుమించి జాగ్రత్ సంస్కారాలకు వేరే కర్తృత్వం ఏముంది చెప్పు? ఒకే చిన్మాత్రము స్వప్నంలో లక్షలాది రూపములను దాల్చుచున్నది. ఆ లక్షల రూపధారి యగు స్వప్నమే సుషుప్తిగా శేషిస్తోంది. జాగ్రత్ స్వప్నంగా, స్వప్నమే సుషుప్తిగా, సుషుప్తియే జాగ్రత్ రూపంగా పరిణమిస్తున్నాయి. చిదాకాశమున ఏర్పడివున్న స్వప్నమే జగత్తుగా చెప్పబడు తోంది. సుషుప్తి జగత్తు యొక్క ప్రళయదశగా చెప్పబడుతోంది. అందుచేత ఆ మూడింటిలో సమానత్వమే (సమాన న్యాయమే) సత్యమైయున్నది.

ఏకమేవ చిదాకాశం సాకారత్వమనేకకమ్ స్వరూపమజహద్ధత్తే యత్స్వప్న ఇవ తజ్జగత్ II

చిదాకాశంలోని స్వప్నసంవిత్తు జగత్తు అని, సుషుప్తి అని, ప్రళయము అని అనేక రూపములు ధరించటమే 'జగత్తు’గా ప్రసిద్ధమై ఉన్నది. చైతన్య పరమాణువులో వర్తిస్తున్న ఈ విశాల రూప జగత్తు... దర్పణంలో ప్రతిబింబాలు దర్పణరూపమే అయినట్లు... ఆత్మయే అయివున్నది. పరమ సూక్ష్మం, వ్యాప్తం, కాలతః మొదలు చివర లేని చిదాకాశం యొక్క స్ఫురణయే ఈ జగత్తు.

తస్మాత్ యత్ర చిదాకాశమ్ అనన్తం సతతమ్ స్థితమ్ | తత్ర అస్తీతి జగద్భానం తదంగానన్యరూపి యత్ II

Page:396

నీ అరచేయి దేహములోని విభాగమే అయి నీవెక్కడుంటే అక్కడ అది ఉండటం కొనసాగుతోంది కదా! అట్లాగే ఎక్కడ అనంతం, సద్రూపం, వ్యాప్తం అయినట్టి చిదాకాశం ఉందో, అచట అద్దాని దేహాంగం వలె అద్దాని కంటే వేరుకానట్టి దానికి అనన్యమైనట్టి) జగత్తు యొక్క స్ఫురణ ఉంటోంది.

జగత్తు చిన్మాత్రమే! నీవు - నేను సమస్తము చిన్మయమే" అను శాస్త్రోక్తిని అభ్యసిస్తూ ఉండగా ఈ జగత్తు చిన్మాత్రం యొక్క ఉదరమున ప్రవేశిస్తోంది.

ఓ వ్యాధుడా! "ఈ జగత్తు నా చిన్మయదేహం యొక్క ఉదరముననే ఉన్నది. కాబట్టి నాకు అనన్యం...అనే భావాభ్యాసం చేత నీ మనస్సు స్థూలత్వం త్యజించి జనన మరణ రహితమగు చిద్రూపం సంతరించుకోగలదు.

ఓ సాధూ! నా స్వరూపం పరమసూక్ష్మమైనట్టి ఆత్మయే అయివున్నది. ఆత్మ స్వరూపుడనైన నేనే సమస్త జగదాకారంగా కూడా వెలయుచున్నాను. ఆత్మగా సర్వత్రా స్థితి కలిగియున్నాను. పరమాణువునందు కూడా చైతన్యరూపంగా వెల్లివిరిసి ఉన్నాను. చిదాకాశ రూపంగా పరమాణువు నందు ఎంతగా ఇమిడి ఉన్నానో... అంతగానూ ఈ విశాల జగదాకారంగా కూడా స్థితి కలిగియున్నాను. నేనెక్కడుంటే నా దేహ విభాగంగా ఈ ముల్లోకాలూ అక్కడే ఉంటాయి. జలం జలంలో కలిసిపోతున్నట్లు చైతన్య రూపుడనగు నేను చైతన్య రూపమగు బ్రహ్మముతో ఐక్యము పొందియే ఉన్నాను. ఇదియే మా యొక్క ఆత్మయోగాభ్యాసమైయున్నది.

ఓ వ్యాధుడా! ఏ ప్రాణి యొక్క హృదయకోశంలో మరల ప్రవేశించే కార్యక్రమంలో ఉన్నానో ...తిరిగి ఆ సంఘటనను వర్ణించటం కొనసాగిస్తున్నాను. విను.

అభ్యంతరమున ముల్లోకాలు ధరించి ఉన్నట్టి నేను అప్పుడు ఆ ప్రాణి యొక్క తేజంలో ప్రవేశించి, ఆతని వాసనామయమగు జగత్తు యొక్క అనుభవరూపం వలె ఆతని తేజస్సులో ఏర్పడి ఉండటం జరిగింది. అచ్చట నా ఆత్మయందే సర్వుల యొక్క స్వర్గ, మర్త్య, పాతాళాలు భాసించాయి.

ఓ మిత్రమా! ‘జగత్తు’ అనబడేది బాహ్యమున కొంచెం కూడా లేదు. ఆత్మకు బాహ్యమేమిటి? అంతరమేమిటి? స్వప్నంలోగాని, జగత్తులోకాని అభ్యంతరమున గాని ఏఏ దృశ్య జగత్తు కనిపిస్తోందో ... అదంతా కూడా నిజచైతన్య స్ఫురణ మాత్రమే కదా!

ఈ జీవునకు స్వప్నావస్థలో ఏ స్వప్నమయ జగత్తు భాసిస్తోందో... అది చిద్రూపము యొక్క విన్యాసమే! చిద్రూపాను స్వరూపుడగు ఆతని స్వప్న చైతన్య చమత్కారమే!

వ్యాధుడు : స్వామీ! మునీంద్రా! ఈ సృష్టి అకారణమా? సకారణమా? ఎందుకంటే ఇదంతా కూడా కొంతవరకు సకారణంగాను, మరికొంతవరకు ఎవరూ కారణం కానట్లు అనిపిస్తోంది.

ఇది కారణ రహితమైతే దీని ప్రసిద్ది ఎట్లా ఎర్పడి ఉంటోంది? కారణసహితమైతే... దీనికంతటికీ

కారణం ఎవరు?

Page:397

ఇది సకారణమందామా... వస్తువుకు వస్తుధర్మాలు ఏర్పడటానికి కారణమేమిటి? ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. (ఉదా : కారం నాలుకపై మంట కలిగిస్తుంది. నాలుక మండటానికి కారణం కారం కావచ్చు. కానీ, కారానికి (ఘాటు ధర్మానికి) ఏదని, ఎవరని కారణం చెపుతాం?) స్వప్నంలో కుమ్మరి, మట్టి, కుండలు తయారుచేసే ప్రక్రియ ...ఈ మూడు లేకుండానే కుండకు సంబంధించిన అనుభవం కలుగుతోంది. ఆ విధంగా అనుభవం సిద్ధిస్తోంది. జాగ్రత్తులో వస్తువులు భౌతికంగా ఉండి అనుభవాలన్నింటికీ కారణమౌతున్నాయి. కనుక ఈ సృష్టి అకారణమా? సకారణమా? అనే ప్రశ్నకు సందేహ నివృత్తి కలగటం లేదు.

మహాముని : ఓ వ్యాధుడా! బ్రహ్మము నిత్య నిర్మలం. విషయ శూన్యం. అద్దానియందు మొట్టమొదట అకారణంగానే సృష్టి అనబడే భావన ప్రవర్తిల్లుతోంది. ఇక ఆపై సమస్త కారణములు “భావము” నుండియే బయల్వెడలుచున్నాయి. అభావము నందు కూడా చిదాకాశము సర్వదా అప్రకటిత సృష్టిశక్తి సమన్వితమై స్వభావ సిద్ధంగా ఉంటోంది. ఇక జగత్తులో కనిపించే పదార్థములన్నీ కూడా పంచభూత నిర్మితం మాత్రమే కదా! పంచభూతముల శక్తి యొక్క ప్రదర్శనమే! శక్తి బ్రహ్మము యొక్క స్వభావసిద్ధ విలాసమే! ఈ విధంగా అనేక పదార్థ - - రూపాదులుగా కనిపించే ఈ జగత్ సృష్టి భావానుగతంగా మాత్రమే ఉన్నది. అభావదృష్టికి ఇవన్నీ లేవు. జగత్తులోని స్థూల పదార్థములు (శక్తి యొక్క వివిధ ప్రదర్శనములే కాబట్టి) లేవని మనం అనుకొన్న తరువాత, ఇక ప్రాతిభాసిక సృష్టియొక్క అనుభవం మిథ్యా భూతమే! అనటానికి వెనుకాడవలసినదేమున్నది? అద్దానికి సకారణమైన నియమమంటూ ఏదీ లేదు.

కనుక ఓ సాధూ! వ్యాధుడా! లుబ్ధకా! బోయవాడా! బ్రహ్మము సర్వదా ఆద్యంతరహితము. సృష్ట్యాది అనే పదానికి అర్థము అదే! నిత్య ప్రకాశము - నిత్య ప్రకాశకము కూడా! అదియే ... తన యొక్క చిత్ స్వభావముచే ఇట్లు జగద్రూపంగా భాసిస్తోంది.

కనుక ఈ విధంగా 'సృష్టి' అనబడేది బ్రహ్మమునకు వేరుగా అసంభవం. బ్రహ్మ రూపమగు జగత్' అనబడే ప్రతిబింబ చైతన్యమున ... నిత్యము, నాశరహితము అగు ఆత్మ ఔపాధికంగా అవయవరూపంచే... ఏకమైనప్పటికీ అనేకంగానూ, బ్రహ్మమే అయినప్పటికీ అబ్రహ్మరూపంగానూ, నిరాకారమైనప్పటికీ సాకారంగానూ, కాలనియతికి లోబడినట్లు స్ఫురిస్తోంది. నిరాకారమగు బ్రహ్మమే చిద్రూపత్వం వల్ల ప్రకాశమానమైన శరీరం కలిగి సాకారమువలె అయి - భాసమానరూపముతో వెలయుచు, దేవర్షి, ముని, మానవ, జంతు దేహాదులతో చెన్నొందుచున్నది.

ఈ స్థావర జంగమ జగత్తును, క్రమంగా అద్దాని 'నియతి'ని శాస్త్రీయ విధి-నిషేధాలను, దేశ-కాల-క్రియాదులను తనకు తానే తనకు అనన్యంగా నిర్మించుకుంటోందని... తేలుతోంది.

ఇక్కడ కనిపించే భావ, అభావ, గ్రహణ, త్యాగ, స్థూల, సూక్ష్మ, చర, అచరాది - సమస్త పదార్థములు ఏదో కారణము కలిగి ఉండి కార్యరూపంగా తయారై ఉన్నాయి. అందుచేత వాటిలో

Page:398

మార్పు చేర్పులు కనబడుచున్నాయి. వాటి 'నియతి' యొక్క వ్యభిచారము మాత్రము ఎన్నటికీ సంభవించకయే ఉంటోంది. ఆ 'నియతి' యొక్క కల్పనకు తదనంతరం మాత్రం ఇక ఏ 'కారణం’ లేకుండా ఏ పదార్థము యొక్క ఉత్పత్తి కూడా సంభవించదు.

1. అద్దాని ‘భోక్త’యగు జీవుడు, 2. నియతి... ఈ రెండూ కూడా బ్రహ్మము యొక్క రెండు స్వయంకృతమైన అంగములవలె ప్రవృత్తములౌతూ ఉంటున్నాయి. "బ్రహ్మము తన అంగముచే మరొక అంగమనతగు నియతిని కొనసాగిస్తోంది. అద్దానిని అనుసరించే జాగ్రత్ - స్వప్నరూపదృష్టి, బుద్ధి మొదలైనవి (జలంలో తరంగాలు కాకతాళీయంగా ఉంటున్నట్లు) ఏర్పడి ప్రవర్తిస్తున్నాయి. వ్యాధుడు : 'నియతి’ అనగా ఏమిటి? అది ఎట్లా ప్రవర్తిల్లుతోంది?

మహాముని : ఒకదానికి మరొకటి కారణంగా ఉండటమే నియతి. కారణకృతంగా ఏర్పడిన కార్యం యొక్క ఆకార - రచన - లక్షణ విశేషమే నియతి. మట్టి కారణం, కుండ కార్యం. మట్టి కుండ రూపంలోనో, (లేక) ముద్ద ఆకారంగానో (లేక) చూర్ణం ఆకారంగానో, ఏదో ఒక ఆకారం కలిగియే ఉంటుంది కదా! వాస్తవానికి మట్టికి ఇది’ అనబడే ఆకారం ఏదీ లేదు. అట్లాగే బ్రహ్మం అట్టి సంవిశేష నియతి లేకుండా ఉండజాలదు. "మట్టికి ఏదో ఒక ఆకారం కనబడుచున్నప్పటికీ వాస్తవానికి నిరాకారం. అట్లాగే బ్రహ్మము నియతిని అవధరిస్తున్నప్పటికీ వాస్తవానికి అనియతము, అప్రమేయము” అను అవగాహన మోక్ష స్థితి పొందిన ద్రష్టకు అత్యంత సులభంగా కరతలామలకమౌతోంది.

ఈ విధంగా ‘నియతి’కి ముందు ఆత్మ (చిత్ చైతన్యం) సర్వదా తేజోమానమై వెలుగొందుచున్నది. అయితే నియతి యొక్క కల్పనానంతరం మాత్రం... ఏ జీవునికి ఏ సమయము నుండి ఏ సృష్టిని గూర్చిన నియతి ప్రవృత్తమగునో... ఆ జీవునకు ఆ సమయము నుండియే ఆ దృశ్య మండలమంతా సదా కారణ సహితమై ఉన్నదగుచున్నది. ఆ నియతి మరొకరికి సంబంధించినది కాదు. కాలాంతర మైనది కాదు. భావికాల పదార్థములకు సంబంధించినది కాదు. ద్రష్ట యొక్క పదార్థ దృష్టియే ఆతనికి నియతి రూపంగా ప్రాప్తిస్తోంది.

బ్రహ్మము కారణరహితం. కారణ రహితమగు బ్రహ్మము అజ్ఞానికి సృష్టిరూపంగా భాసిస్తోంది. ఎవరికి బ్రహ్మము సృష్టిరూపంగా భాసిస్తోందో... వారికి మాత్రమే కార్య కారణాలకు సంబంధించిన భ్రమ భాసిస్తోంది.

ఈ సృష్టి కాకతాళీయం - వివేకి యొక్క దృష్టిలో ఈ సృష్టి కాకతాళీయం. అనగా, ఒక కాకి తాటిచెట్టుపై వ్రాలగా, నేలజారిన తాటిపండు ఒకానొక నక్కను గాయపరచటానికి కారణం?... 1.కాకి 2.మండుటెండ 3. తాలవృక్షం 4. తాటిపండు 5. నక్క 6. మండుటెండకు అలసిపోయి నక్క తాటిచెట్టు క్రింద జేరటం 7. తాటిపండు నేలవ్రాలటం... ఈ విధంగా వేరువేరు కారణాలు పరస్పర అసంబంధమైనవి ఉన్నాయని చెప్పవచ్చు. ఏ ఒక్కటైనా కారణమని చెప్పనూవచ్చు. నక్కకు తాటిపండు వల్ల గాయం కావటమనేది అకారణం అని చెప్పవచ్చు. అట్లాగే ఈ సృష్టికి కారణమేదీలేదు.

Page:399

ద్రష్ట యొక్క నియతిని స్వీకరించిన దృష్టి యొక్క ప్రదర్శనా చమత్కారమే సృష్టి. కుండ తయారవటానికి మట్టే కారణం అనీ అనవచ్చు. మట్టి దేనికీ కారణం కాదు. కనుక కుండ అకారణం... అనీ అనవచ్చు. కుమ్మరి మట్టి యొక్క ధర్మమును ఉపయోగించి కుండను చేశాడు. కాబట్టి కుండకు కారణం 'కుమ్మరి' అనవచ్చు. మట్టిలో 'కుండ' అనే ధర్మం ఉండబట్టే కుండ తయారు కాగలిగింది. అయితే కుండ అనబడేది ఆకార వికారమే! కనుక కుండ అనబడేదేలేదు. మట్టియే సర్వదా ఉన్నది... అని అనవచ్చు.

అట్లాగే ఈ సృష్టి కాకతాళీయం! ఇక సృష్టిలో కనిపించే నియతి ఏమిటి? అని ప్రశ్నిస్తే "అజ్ఞాన చిత్ చైతన్యము యొక్క దర్శనాచమత్కారమే నియతి అనికూడా చెప్పబడుతోంది. వ్యాధుడు : స్వామీ! ఈ సృష్టిలో కనిపించే నియతి 'దృష్టి' యొక్క సారూప్యమేనని మీరు చెప్పుచున్నట్లు నా కనిపిస్తోంది. అయితే ఒక మామిడి వృక్షం నుండి మామిడి పండే ఉద్భవిస్తోందిగాని, సపోటా పండు ఉత్పన్నమవటం లేదే! మానవునకు మానవుడే జనిస్తున్నాడుగాని, మానవునకు పెద్దపులి జనించటం లేదు కదా! ఉత్పన్నము లగుచున్న సర్వపదార్థములకు పూర్వ-పరా క్రమమును పరిశీలిస్తే సకారణత్వమే కనిపిస్తోంది గాని, అకారణం కాదే! మరి మీరు "సృష్టి కాకతాళీయం, అకారణం” ... అని ఎలా చెప్పుచున్నారు?

మహాముని : సృష్టిలో కనబడే పదార్థాలు పూర్వాపర విమర్శచే కారణములే కదా అని అంటావా? అయితే జాగ్రత్ స్వప్నములు సకారణమే అయి ఉండాలి కదా! ఇప్పుడు నా ప్రశ్నకు కొంచెం యోచించి సమాధానం చెప్పు.

స్వప్నంలో కనబడే పదార్థాలకు కారణమేమిటి? స్వప్నం తరువాత సుషుప్తి ఏ కారణంచేత ఏర్పడుతోంది? స్వప్న సుషుప్తుల తరువాత జాగ్రత్ ప్రపంచపు యావృత్తి ఏర్పడటానికి గల కారణమేమిటి? జాగ్రత్ - సుషుప్తుల - అనంతరం స్వప్న ప్రపంచపు యావృత్తి ఎందుకు ఏర్పడుతోంది?

ఇంకా... నేను ఆ ప్రాణియొక్క హృదయ తేజములో ప్రవేశించి ఆ స్వప్న భూతలంలో జల సంక్షోభంతో గూడిన ప్రళయం నాకు కనబడటానికి నీకేదైనా కారణం కనబడుతోందా?

లేక శ్రుతులు ఎక్కడన్నా "జాగ్రత్, స్వప్న, సుషుప్తులలో కనబడే జగత్తులకు కారణం ఇది” అని ఎక్కడైనా ప్రమాణంగా చెప్పుచున్నాయా? - లేక ఈ జగత్తుకు నీకేమైనా కారణం కనిపిస్తోందా? లేదు. కనుక స్వప్నంలో కనిపించే జగత్తుకు ద్రష్టయొక్క వ్యావృత్తియే కారణమగుచున్నట్లు, జాగ్రత్ ద్రష్టకు జాగ్రత్ జగత్ వ్యావృత్తియే జాగ్రత్ జగత్తుకు కారణం కావచ్చునుగాని, మరింకే కారణం నిర్ధారించలేము.

వేదోపనిషత్తులు ఏకమ్ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మమునకు వేరైనదేదీలేదు అని పునః పునః ఉద్ఘాటిస్తున్నాయి. బుద్ధిమంతులు బ్రహ్మంతోటి ప్రపంచం యొక్క ఐక్యత ప్రతిపాదించే యుక్తులు ఆశ్రయించి వివేక దృష్టిని సముపార్జించుకుంటున్నారు. స్ఫటికంలో దృశ్యం ఉన్నట్లు ఆత్మయందే జగత్తు ప్రతిభాసిస్తోందని సిద్ధాంత సోదాహరణ పూర్వకంగా విజ్ఞులు గమనించి ప్రవచిస్తూనే ఉన్నారు.

Page:400

కాబట్టి ఓ వ్యాధుడా! నీవు శాస్త్రానుసారమగు యుక్తియొక్క ఆశ్రయముచే ఈ జగత్తును ఆత్మ స్వరూపంగా ఎరుగుము.

శాస్త్రానుసారంగా యుక్తిచే “ఈ జగత్తు నా భావనా మాత్రమేగాని భౌతిక మాత్రం కాదు” ...అనేదే సర్వతత్త్వ నిర్ణయముల అంతిమసారం. సర్వవేద - వేదాంత సిద్ధాంతముల ఉత్కృష్టమగు అంతిమ నిర్ణయం. ఇక మధ్యే నిర్ణయమంటావా? సమష్టి కర్తయగు హిరణ్యగర్భుని మానసిక నిర్ణయ చమత్కారమే ఇక్కడ 'విధి' అని, నియతి అని ఆయా రూపాలుగా పరిఢవిల్లుతోంది.

ఈ జగత్తు పదార్థమయం కాదు. కార్యకారణమయం కాదు. అకారణమగు బ్రహ్మమే దృష్టియొక్క “అవిజ్ఞత” చేత 'ప్రపంచం'గా అగుపిస్తోంది. ఇదియే సర్వోత్కృష్టమైన శాస్త్ర ప్రమాణపూర్వక అంతిమ నిర్ణయం. ఇందులో సందేహానికి తావేలేదు. ఇక తదితరమైన 'నియతి యొక్క పరిశోధనంతా “అనిర్వచనీయం” ...అనే స్థానానికే చేరటం జరుగుతోంది.

ఇక అజ్ఞులు పొందుచున్నట్టి భౌతిక ప్రపంచమునకు సంబంధించిన పుంఖానుపుంఖములైన అనుభవ పరంపరలంటావా? మనకు విజ్ఞుల - పారదర్శకుల - వేదవేదాంతముల ప్రవచనం ప్రమాణంగాని, ఇంద్రియ దృష్టికి పరిమితమైన అనుభవాలు ప్రమాణం కావని నా మనవి.

17. జాగ్రత్ - -స్వప్న - సుషుప్తి అనుభవములు

-

వ్యాధుడు (లుబ్ధకుడు) : మహాత్మా! ఈ జీవుడు జాగ్రత్తులో ఈ జాగ్రత్ జగత్తును గాంచుచున్నాడు. నిదురించుచూ స్వప్నలోకాలలో అనేక విధములైన భీతి-ఉత్సాహ-ప్రియ-అప్రియ-సుఖ-దుఃఖ సంబంధములైన స్వప్న దృశ్య పరంపరలు వివిధ రీతులుగా పొందుచున్నాడు. 'సుషుప్తి' యందు (జాగ్రత్-స్వప్నానుభవముల దృష్ట్యా) అనుభవరహితుడై తనను తానే ఎరుగని స్థితి పొంది ఉంటున్నాడు. ఇవన్నీ ఈ శరీరానికి ఎట్లా ఏర్పడుచున్నాయి? వీటిని ఎవరు కల్పిస్తున్నారు? జాగ్రత్ -స్వప్న-సుషుప్తులలో మొదలేది? చివర ఏది? ఏది సత్యం? ఏది భ్రమ? చిత్ర విచిత్ర మధురభీకర దృశ్యాలు స్వప్నంలో ఎట్లా ఏర్పడుచున్నాయి? ఇవన్నీ చూస్తున్న జీవునికి - జాగ్రత్ స్వప్న సుషుప్త దృశ్యాలకు గల సంబంధమేమిటి? ఈ జీవుడు ఎవడు? ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఇదంతా పొందుచున్నాడు? ఈ విషయాలు విశదపరచండి.

మహాముని : ఈ జీవుడు ఇంద్రియములు తనకు అనన్యమైన విభాగంగా ధరించి ఉంటున్నాడు. ఇంద్రియాలు రెండు విభాగాలుగా ఉన్నాయి- 1. బాహ్యేంద్రియాలు, 2. అంతరింద్రియాలు

బాహ్యేంద్రియములచే బాహ్య స్వప్నమును, అంతరింద్రియములచే అంతఃస్వప్నమును ఎరుగుచున్నాడు. అనగా, ఆతని 'ఎరుక' అనే ధారణ యొక్క అవయవములు - ఇంద్రియములు బాహ్య - అభ్యంతరములలో బాహ్య - అభ్యంతర జగత్తులను ఆతనికి అనుభూతం చేస్తున్నాయి.

Page:401

స్వప్నం - ఎప్పుడు ఇంద్రియములు అంతర్ముఖమౌతాయో అప్పుడు అతి సూక్ష్మమైన జగత్తును కూడా స్థూలంగా తన దేహమునందే సుస్పష్టంగా దర్శిస్తున్నాడు.

ఓ వ్యాధుడా! వాస్తవానికి బాహ్యజగత్తుగాని, అంతర్ జగత్తుగాని కొంచెం కూడా స్థూలం కాదు. మరి?... ఈ జీవుని యొక్క స్వచిత్ దేహంలో ఒకానొక సూక్ష్మ దృష్టి మహాంగం వలె ఏర్పడి ఉన్నది. అట్టి సూక్ష్మ దృష్టియొక్క కరణాలే ఈ ఇంద్రియాలు. అట్టి సూక్ష్మేంద్రియాల స్థూలకల్పనయే ఈ స్థూల జగత్తు. స్వప్నం చూచే స్వప్నేంద్రియ విభాగములకు స్వప్నం స్థూలంగానే అగుపిస్తోంది.

జీవుని సూక్ష్మ శరీరం - పంచ జ్ఞానేంద్రియాలు (త్వక్, చక్షు, శోత్ర, జిహ్వ, ఘ్రాణములు); పంచ కర్మేంద్రియాలు (హస్తపాదాలు, నోరు, ముక్కు, ఉపస్థ, గుదము); ఇచ్ఛాప్రధానమైన అంతః కరణ చతుష్టయం (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం); పంచప్రాణాలు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు)... వీటన్నిటి సంఘాతరూపమగు సూక్ష్మ శరీరమే ... చిద్రూపుడగు ఈ జీవుడు. ఇది ఇట్లా ఉండగా నాశరహితము, కూటస్థము అగు చిదాకాశమే ఈతని రూపం. భావనాశరీరంచే ఈతడు 'చిదాభాసుడు' అని చెప్పబడుచున్నాడు. అయితే, చిదాకాశ రూపుడే అయివుండటం చేత ఈతడు సమస్త ఆకాశ రూపమును పొంది సర్వత్రా సర్వేంద్రియమయమై ఒప్పుచున్నాడు. ఈతడు చూచే జగత్తు నిజవాసనామయ చమత్కారమేగాని, మరింకొకటిదేదీ కాదు. మరొకరు ఆతని కొరకై కల్పించింది కూడా కాదు.

స్వప్నానుభవం - ఇప్పుడు స్వప్నానుభవ చమత్కారం ఎట్లా అనుభూతమౌతోందో వివరించి చెప్పుతాను, విను.

అనేక విషయముల సంఘాతమే (చిదాభాసమే) స్వరూపముగా గల ఈ జీవుడు దైనందినంగా ఒక సమయంలో బాహ్యేంద్రియ వ్యాపార రహితుడగుచున్నాడు. అప్పుడు బాహ్యేంద్రియములైన కళ్ళు, చెవులు, చర్మము మొదలైన వాటి నుండి ఉపశమించినట్టి ధ్యాస బాహ్యేంద్రియ వ్యాపార రాహిత్యం చేత సూక్ష్మములగు నాడులలో ప్రవేశిస్తున్నది.

అన్నరస పరిపూర్ణత్వం - అప్పుడాతడు శ్లేష్మరూపమగు అన్నరసముచే పరిపూర్ణుడై సూక్ష్మములగు నాడులలో ప్రవేశం పొందుచున్నాడు. అట్టి సూక్ష్మనాడులలో ఆతని అనుభవం ఎట్లా ఉంటుందంటే... క్షీర సాగరంలో ఎగురుచున్నట్లు, చంద్ర సహితమగు ఆకాశం చూస్తున్నట్లు, ఉద్యానవనాలలో సంచరిస్తున్నట్లు, ఉత్సవాలలో క్రీడిస్తున్నట్లు, స్త్రీ, పురుష సందోహం చూస్తున్నట్లు, అనేక పుష్పభరిత వనాలలో సువాసనలు అనుభవిస్తున్నట్లు, నదీ ప్రవాహాలలో గంతులేస్తూ సాగుతున్నట్లు, మంచుకొండలలో విహరిస్తున్నట్లు, అనేక బాటసారులతో కూడి పయనిస్తున్నట్లు, నగరాలు - ఉద్యానవనాలలో సంచరిస్తున్నట్లు, రాజసభలలో, బంధువుల గృహాలలో తానున్నట్లు,

Page:402

మేఘావృతమైన ప్రదేశాలలోను, కొండలపైన చిక్కిపోయినట్లు... ఈ విధంగా తన దేహము యొక్క సూక్ష్మనాడులలో సంచరిస్తూ తనయందు తానే అవన్నీ గాంచుచున్నాడు.

పిత్తరస పరిపూర్ణం - నాడులు పిత్తరసంలో పరిపూర్ణమౌతూ ఉంటాయి. ఈ జీవుడు బాహ్య ఇంద్రియ వ్యాపార రహితుడైనప్పుడు హృదయస్థ తేజమున సూక్ష్మరూపం దాల్చి ఉన్నవాడై తానే పిత్తరసం యొక్క దేహాంతర్గత ధర్మములను దర్శిస్తూ మరికొన్ని స్వప్న భ్రమలు గాంచుచున్నాడు ... వాయువుచే తాను కదల్చబడి గాలిలో సంచరిస్తున్నట్లు, జ్వాలా సమూహాలను దర్శిస్తున్నట్లు, వృక్ష –లతల మధ్య విహరిస్తున్నట్లు, ఇది వరకు తాను చూడని - ఇది వరకు చూచిన ఏవేవో ప్రదేశాలలో సంచరిస్తున్నట్లు, మేఘాలు అగ్నిని వర్షిస్తున్నట్లు, సంతప్తములైన సరస్సులను ... ఇట్లా తనయందు తానే అనేక చిత్ర విచిత్ర సన్నివేశాలను దర్శిస్తున్నాడు.

వాత (వాయు) పరిపూర్ణం - నాడులు వాయువుతో పరిపూర్ణమైనప్పుడు సూక్ష్మరూపుడగు జీవుడు తాను వాతము (వాయువు)చే పరిపూర్ణమైన తన హృదయ తేజమునందు మరికొంత విశేషంగా దర్శిస్తున్నాడు. ఆతని బుద్ధి వాయువుచే సంక్షుబ్ధం అవటంచేత, ఇతఃపూర్వమునకు విలక్షణమైనట్టి గ్రామ-పట్టణ ప్రదేశాదులను తన తేజమునందే గాంచుచున్నాడు.

శిలలు ఎగురుచున్నట్లు, తాను గరుడ - - మేఘ - హంసాది వాహనములను ఎక్కుచున్నట్లు, భయముచే జనులు పరుగులు తీస్తున్నట్లు, ఏదో అంధకారమయమైన గుంటలో పడి చిక్కుకున్నట్లు, పర్వతాలు అధిరోహించి లోకాలు చూస్తున్నట్లు... ఈ విధంగా అనేక భ్రమలను పొందుచూ స్వప్నదర్శనం చేస్తున్నాడు.

ఒక్కొక్కప్పుడు వాత-పిత్త-శ్లేష్మములు మూడింటిచే పరిపూర్ణమైన సూక్ష్మనాడులలో ప్రవేశిస్తు న్నప్పుడు... పర్వతములు వర్షంలా ఆకాశమునుండి నేలకూలుచున్నట్లు, 'శిలా వర్షం' అనే సంకటం వచ్చి పడుచున్నట్లు, వృక్ష సమూహాలు అగ్నికి ఆహుతి అగుచున్నట్లు, గుహమధ్యంలో అకస్మాత్తుగా ఘంఘమ భోంకార మహాఘర్ఘర శబ్దాలు భయానకంగా ఉద్భవిస్తున్నట్లు, మహావృక్షాలు సంఘట్టమగుచు అగ్నిజ్వాలలు ఉదయింపజేస్తున్నట్లు, భీకరాకారంగల క్రౌంచ పక్షులు క్రేంకార కర్కశ శబ్దములు చేస్తున్నట్లు వినిపిస్తోంది. కొండలు కటకటా శబ్దాలతో భిన్నమగుచున్నట్లనిపిస్తుంది. యుగాంతంలో యుద్ధవీరులు ఒకరినొకరు సంహరించుకోవటానికి సిద్ధమౌతున్న పాదఘట్ట ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి.

చూచావా వ్యాధుడా! ఈ ప్రకారంగా వాత, పిత్త, శ్లేష్మ, ములచే సూక్ష్మనాడులు నిండి ఉండగా జీవుడు అంతరింద్రియములతో ప్రయాణించి వాయువులచే ఆవృతుడై జడునివలె పరిపీడితుడై ఉంటున్నాడు. మట్టిలో పురుగులాగా, రాతిలో కప్పవలె, గర్భంలో ఉన్న అపరిపక్వ శిశువులాగా, ఫలములోని బీజంలాగా, బీజంలో అంకురంలాగా, పదార్థమున అణువులాగా, కొయ్య స్తంభమున బొమ్మలాగా తన శరీరములోనే తాను ఉన్నవాడై నాడులలోని శబ్ద - రూప - జలాకారాదులను చూస్తూ తన ఊహను జోడించి అనేక స్వప్నానుభవములు పొందటం జరుగుతోంది.

Page:403

సుషుప్తి - ఈ జీవుడు బాహ్యేంద్రియ వ్యాపారం విరమించి అంతరింద్రియ వ్యాపార రూపంగా సూక్ష్మనాడులలో సంచరిస్తూ వాత - - పిత్త - కఫములను దేహముగా ఆశ్రయించి అనేక రకములైన స్వప్న దృశ్యములను తన భావనాదేహంలో పొంది అనుభవిస్తున్నాడని అనుకున్నాం కదా!

ఆతడు సూక్ష్మనాడులలో సంచరిస్తూ నాడీ పంజరమున సూర్యభాగమునందలి అస్తుల అగ్రభాగంచే ఘటితమై ఉండే హృదయమునకు సంబంధించిన అస్థి (బొమిక విభాగము)ని సమీపిస్తున్నాడు. అక్కడ సూక్ష్మనాడుల మార్గం ముగుస్తోంది. అక్కడి నుండి బొమికలలోనికి సంచరించటానికి రంధ్రమార్గమే ఉండదు. అక్కడ ప్రాణవాయు చలనము లేనివాడై ఉంటాడు. ఆతని చిత్తము ప్రయాణ నిరోధక కారణంగా వ్యాపార సమర్థమై ఉండదు. హృదయ తేజానికి శిలా మధ్యభాగమువంటి గాఢమైన అజ్ఞాన అంధకూపంలో (చీకటి నూతిలో) ప్రవేశిస్తాడు. ఆతడు అప్పుడు పొందుచున్న స్థితియే సుషుప్తి. ఆ హృదయకోశ స్థానం బొమికలచే కప్పబడిన గూడువలె ఏర్పడివున్న ప్రదేశము 'పురీతతి' అనే పేరుచే పిలువబడుతోంది.

ఆ జీవుడు ఆ 'పురీతతి’ని సమీపించి అక్కడే జడస్థితిలో తనలో తానే నిర్విషయ, నిర్భేద స్థితిలో ఉంటున్నాడు. భుజించిన ఆహారం పరిపాకంచే పరిణామం పొందగా అన్నరసజనితమగు మార్గనిరోధం తొలగటంచే ఆ జీవుడు మరొకప్పుడు సుషుప్త స్థితినుండి బయల్వెడలుచున్నాడు. అన్నరసజనితమగు మార్గనిరోధం తొలగుటచే అవకాశయుక్తమైన మార్గం తెరువబడుతోంది.

అప్పుడా జీవుడు నిర్విషయ-జడరూపమగు అజ్ఞాన స్థితి నుండి తన జ్ఞాన సంవిత్తును ఉత్తేజ పరచుకొంటూ మరల సూక్ష్మనాడుల నుండి బయల్వెడలుచున్నాడు. తన అంతరింద్రియ-బహిరింద్రి యాలను ఉత్తేజపరుస్తూ ‘అనుభవము' అనే కవాటమును తెరచుకుంటూ స్వప్న - జాగ్రత్తు'లలో ఇంద్రియానుభవ ప్రవేశం పొందుచున్నాడు. ప్రాణ సంచారముచే మనోచలనము గూర్చిన యత్నమును పొందినవాడై మరల ప్రాణములచే ప్రబోధితుడై, స్వప్నదశను గాంచుచున్నాడు.

ఆయా స్వప్నగతమైన అనుభూతులు ఏ విధాలుగా ఉంటాయనేది "సూక్ష్మనాడులలో అన్నరసం ఏ సాంద్రతతో ఏర్పడి ఉంటోంది? అనుదానిని అనుసరించి ఉంటోంది. జీవుని తేజస్సు అనుసరిస్తూ వస్తున్న ఆ అన్నరసం కొన్ని నాడీ మండలాల నుండి మరికొన్ని నాడీ మండలాలకు ప్రవహిస్తున్నప్పుడు .ఆ జీవుడు గొప్ప రాళ్ళ వర్షం - జడివాన మొదలైనవి స్వప్న దృశ్యంగా పొందుతూ ఉంటున్నాడు.

జఠరాగ్ని అధికంగా వ్యాప్తమై వాత - పిత్తాదులు అధికంగా సంయోగం చెందితే ...అధిక స్వప్న సంభ్రమం కలుగుతూ ఉంటోంది. వాటి సంయోగం అల్పంగా ఉంటే ... అల్ప స్వప్న సంభ్రమం ఉంటూ ఉంటోంది.

కనుక వాత-పిత్త-కఫాదులు సూక్ష్మనాడులలో అధికంగా సంక్షుబ్ధం అవుతూ ఉంటే ఆ జీవుడు అధిక దృశ్యమును పొందటం జరుగుతోంది. ఆ జీవుడు అధికంగా పృథ్వి, పర్వత, ఆకాశాదుల యొక్క చలనంగాని, గొప్ప అగ్నిజ్వాలల సంరంభంగాని పొందుతూ ఉంటాడు. ఆతనికి విపరీతమైన వస్తు - విషయ –చలన సమూహ పరంపరలు అనుభమౌతున్నాయి. వాత -

Page:404

పిత్తాది ధాతువుల విషమత్వంచేత అభ్యంతరంగా అనేక ఇంద్రియవృత్తులు ఇంద్రజాలంలోని భ్రమలాగా అనుభవించుచున్నాడు. అట్టివారు జాగ్రత్తునందు కూడా అనేక విధములైన భ్రమలను చూస్తూ అనుభవిస్తున్నారు.

విషమ ధాతువులతో కూడిన దేహము గల జీవులు బాహ్య అభ్యంతరములందు అనేక విపరీత - మహా సంభ్రమ కార్యములను చూస్తున్నారు. అట్లా కాకుండా వాత - పిత్తాది ధాతువులు శరీరంలో సమరూపంగా ఉంటేనో, ... అప్పుడీ జీవుడు తన హృదయ తేజమున సమత్వముతో కూడిన లౌకిక - శాస్త్రీయ వ్యవహార స్థితిని స్వయంగా అనుభవించుచున్నాడు. అనగా అట్టి ధాతు సమత్వం చేత ఆతని స్వప్న దృశ్యము ప్రశాంతంగా శోభాయమానంగా ప్రశాంత వాతావరణంలో ప్రయాణించే పథికుని ప్రయాణంలా ఉంటోంది. ఆతని స్వప్నానుభవం పూర్ణచంద్ర - సూర్య - నక్షత్ర - దివారాత్రులచే శోభితమై... అదంతా అసద్రూపమే అయినప్పటికీ, సద్రూపంగా భాసిస్తోంది.

వింటున్నావు కదా ఓ మిత్రమా! వాయువునందు వాయుస్పందము వాయువుకు అభిన్నమే కదా! అట్లాగే చైతన్యమునందు ఈ దృశ్య ప్రాప్తి (జాగ్రత్ + స్వప్నములు) చైతన్యమునకు అభిన్నమే అయినప్పటికీ భిన్నముగాను, వాస్తవానికి అసత్తే అయినప్పటికీ సత్తుగాను స్థితిపొంది ఉంటోంది.

శాన్తాత్ ఉదేతి సకలం జగదంబరాత్మ శాంతం న కించన న నామ 'సత్' ఇత్యుదేతి | | తత్ వ్యోమనీ దృశమ్ అనన్త చితేః శరీరే భామాత్రమ్ ఆతతమ్ అనంతవపుర్ విభాతి ॥ ప్రపంచరహితమగు బ్రహ్మము నుండియే "బ్రహ్మము రూపము, చిదాకాశరూపము... అగు ఈ సమస్త జగత్తు ఎదురుగా కనిపిస్తోంది. కనుక, జగత్తుగా కనిపించేదంతా చిదాకాశమే అయి ఉన్నది. అయినా కూడా శాంతము, నిష్ప్రపంచము అయినట్టి బ్రహ్మం ఒకింత కూడా మరొకరూపం (జగత్ూపం) అగుటలేదు. కాజాలదు. ఎందుకంటే ఏది సత్తో అది సర్వదా సత్తుగానే ఉంటుంది గాని, అసత్రూపం పొందజాలదు. అది ఈ దృశ్యమానమగు జన్యరూపమున (జ = జనించినది) ఉత్పన్నమవటమనే మాటయే లేదు.

ఆకాశమువలె అనంతమైనట్టి చైతన్యము యొక్క శరీరమున... అద్దాని ప్రతిభాస మాత్రమే అయి ఉన్న ... అనంత శరీరధారి అయిన ఈ వ్యాప్తమగు జగత్తు భాసిస్తోంది. చిత్ బ్రహ్మమునకు వేరుగా ‘జగత్తు’ అనబడునదేదీ లేదు. జగత్తుగా కనిపించేది మనిద్దరి స్వస్వరూపమగు చిదాకాశమే!

18. సుషుప్తి గురించిన విచారణ

వ్యాధుడు : మునివర్యా! మనం తిరిగి మీ అనుభవం విషయానికి వద్దాం. మీరు ఆ ఒకానొక ప్రాణియొక్క హృదయమునందలి తేజస్సులోకి సూక్ష్మరూపులై ప్రవేశించారు కదా! అక్కడ ఆ జీవుని స్వప్నంలో సమభాగులై సంచరిస్తూ ఉన్నట్లుగా వర్ణించారు. ఆ సమయంలో భ్రాంతి

Page:405

రూపులు, నామమాత్రులు అగు తమయొక్క ఆ తరువాతి స్వప్న దర్శన వృత్తాంతంలో ఏమేమి సంభవించాయో వివరించండి.

మహాముని : ప్రియ వ్యాధుడా! వినండి. నేను ఆ ప్రాణి యొక్క తేజోమయ ధాతువులో ప్రవేశిం చాను. ఆ జీవుని లింగ శరీరంలో నా లింగ శరీరం ఏకమైంది.

ఆతని స్వప్నాంతర్గత లోకంలో భయంకరమైన ప్రళయ సంభ్రమం ఏర్పడింది. అప్పుడు ప్రసరించనారంభించిన ప్రళయవాయువు యొక్క వేగానికి పర్వతాలు గడ్డి పరకలుగా గాలిలోకి విసరబడ్డాయి. అలా ఆకాశంలోకి ఎగిరిన పర్వత సమూహాలు వర్షంలా నేలకూల నారంభించాయి.

విచిత్రమేమంటే... ఆ ప్రాణి యొక్క నాడులందు ప్రవేశించిన నాకు అక్కడి అన్నరస కదలికలే పర్వత వర్షాలుగా నాకు అనుభూతం కాసాగాయి సుమా! ఆ ప్రాణి యొక్క నాడులందలి 'అన్నరస లేశము' అనే గొప్ప పర్వత ప్రవాహంచే నేను ముద్దగా చేయబడ్డాను. ముద్దగా ఆకారం కలవాడనై, నిశ్చేష్టితుడనై ఉండగా, క్రమంగా అజ్ఞానం' అనే అంధ తమస్సు (దట్టమైన చీకటి)తో కూడిన సుషుప్తి నాకు సంభవించింది. అక్కడ కొంత కాలం సుషుప్తిలోనే ఉండిపోయాను.

ఆ తరువాత కొంతసేపటికి నన్ను నేనే ఏమఱచి, ఏమీ తెలియని నిశ్చేష్ట- అజ్ఞాన-నిరనుభవ - నిర్వ్యాపార స్థితిలోకి ఈడ్వబడి... అట్లే ఉండిపోయాను. కాలజ్ఞానము కూడా లేకుండా, సూక్ష్మ నాడులలో ప్రాణ వాయువులు ప్రసరించటానికి ఖాళీ కనిపించింది. ఆ ప్రాణవాయువులు నన్ను స్పృశించాయి. అప్పుడు ప్రాణవాయువుల స్పర్శచే మెల్లగా ‘ప్రబోధం’ వైపు ఉన్ముఖుడను అయ్యాను. క్రమంగా నా యొక్క సుషుప్తి స్వప్నరూపం దాల్చ నారంభించింది. స్వప్నంలో ప్రవేశించిన నేను ఆ ప్రాణి తేజస్సులో అనేక విక్షేపాలు దర్శించాను. స్పందరహితమైన వాయువు కొంతసేపటికి తనకు అభిన్నమైన స్పందరూపం (చలనరూపం) పొందుతుంది చూచావా? అట్లాగే చిదాకాశ రూపుడనగు నేను నాకంటే భిన్నం కానట్టి దృశ్యమును పొందసాగాను.

అగ్నిలో ఉష్ణత్వమున్నట్లు, జలములో ద్రవత్వం ఉన్నట్లు, మిరియములో 'కారం' ఉన్నట్లు, స్వస్వరూప చిదాకాశమునందు ఈ జగత్తు ఉన్నది. నా చిదాకాశ రూపంలోనే స్వప్న జగత్తు గాంచసాగాను. తల్లి గర్భంలోంచి బాలుడు జనిస్తాడు చూచావా? అట్లాగే సుషుప్తి రూపదృశ్యం నుండి స్వప్న జగత్తు ఆవిర్భవించింది. అదంతా చిదాకాశ స్వరూపమే సుమా!

వ్యాధుడు : ఓ మహావక్తా! సుషుప్తి రూప దృశ్యము నుండి"... అని మీరిప్పుడు పదప్రయోగం చేశారు కదా! అనగా సుషుప్తిలో కూడా కొంచెం దృశ్యం కలదని మీరు చెప్పుచున్నట్లు అవుతుంది. కదా! సుషుప్తిలో ఏ దృశ్యం మీరు దర్శించటం జరిగిందో అది వివరించండి. అంతేకాదు. తాము ఆ ప్రాణి హృదయంలో ప్రవేశించి ఆతని సుషుప్తితో మీ సుషుప్తిని ఏకం చేశారు కదా! సుషుప్తి రూప దృశ్యం నుండి మరొక జగద్రూపదృశ్యం ఎట్లా జనిస్తోంది? లేదా, మరొక సుషుప్తి రూపమేదైనా జనిస్తుందా?

Page:406

సుషుప్తిలో దృశ్యం అనేది నాకు చమత్కారంగా కనిపిస్తోంది. ఎందుకంటే సుషుప్తిలో ఏ దృశ్యమూ ఉండదు. దృశ్య రాహిత్య రూపమే సుషుప్తి" అనేది ఈ మన జాగ్రత్కు అనుభూతి కదా? మహాముని : మిత్రమా! (పకపక నవ్వుచూ) "దృశ్యము ... అది జనించటం? అనే ప్రశ్న... పరమార్థమున అడుగుచున్నవా? లేక, వ్యవహారరీత్యా ప్రశ్నిస్తున్నావా?

పరమార్థమున గమనిస్తే... దృశ్యము అవస్తువే కాబట్టి అది ఇక ఉత్పన్నం అవటం ఏమున్నది? అసలు దృశ్యమే ఉత్పన్నం కాలేదు ...అనునది నా సూటి అయిన సమాధానం.

“మట్టిలో కుండ ఎప్పుడు పుట్టింది? అంటే మట్టి దృష్ట్యా మట్టి మట్టిగానే ఉంది. ఇక అందులో కుండ పుట్టడమెక్కడున్నది? అయితే నీకు సుషుప్తి దృశ్యం అని చెప్పేటప్పుడు వ్యవహార దృష్టిని అనుసరించి చెప్పాను. అంతయూ, చిదాకాశమే అయివుండగా... అందులో 'నేను' అనేది జనించటం (మట్టిలో కుండలాగా), భాసించటం, ప్రకాశించటం జరుగుతోంది. వాస్తవానికి చిదాకాశంలో చిదాకాశానికి అన్యంగా 'నేను' అనేది జనించటానికి కారణమే లేదు. వాయువులో వాయు తరంగం లాగా... 1.'నేను' అనేది, 2. ఆ 'నేను' చే దర్శించబడే 'దృశ్యం' అనబడేది వ్యవహార రీత్యా బయల్వెడలుచున్నట్లు అనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఆ ఉభయమూ కూడా చిదాకాశం కంటే భిన్నం కాదు. చిదాకాశానికి భిన్నమైనదేదీ ఉండజాలదు. జలతరంగం యొక్క ఆకారం జలం కంటే వేరుగా ఎక్కడుంటుందో చెప్పు? అయితే సుషుప్తి దృశ్యం నుండి అని నేను చెప్పేటప్పుడు మూర్ఖుల దృశ్య దృష్టి ఘనంగా కలిగియున్న కల్పనామయమగు ప్రలాపమును నీకు వచించాను.

పండితుల అభిప్రాయం

జాత శబ్దా హి సన్మాత్ర పర్యాయః శ్రూయతామ్ కథమ్ | పాదుర్భావే జనిసూక్తః ప్రాదుర్భావస్య భూర్వపుః ॥

పండితుల అభిప్రాయం 'జాత' (జనించినది ఉదా॥ సుషుప్తి నుండి స్వప్న దృశ్యం పుట్టినది అనే) శబ్దము 'సన్మాత్రము' అనే శబ్దమునకు పర్యాయ పదమే అయివున్నది.

జాత సన్మాత్రము ఎట్లా అంటే ... (పాణిని మొదలైన సంస్కృత మహాకవులచే) ‘జని’ అనే ధాతువు యొక్క అర్థం ప్రాదుర్భవే అని వ్యాకరణ సూత్ర భావంగా చెప్పబడింది. •

కాబట్టి బ్రహ్మము (లేక) చిదాకాశము (లేక) సన్మాత్రములో ఏదీ ఉత్పన్నమవటం లేదు. నశించటమూ లేదు. అంతా కూడా శాంతము - అజము అయినట్టి "సన్మాత్ర బ్రహ్మమే!

ఓ వ్యాధుడా! బ్రహ్మము సర్వసత్తా స్వరూపమైయున్నది. అందులో స్ఫురించే జగత్తు కూడా సర్వసత్తా స్వరూపమే!

ప్రాదుర్ = ప్రకటించబడినది. భవసత్త = ఉండివున్నది. భూ = (పాదుక్ + భు) = ఇప్పటికే ఉన్నది. భూ’ ధాతువు = సత్త. ప్రాదుర్ (ఉపసర్గ) + భావ = ‘సంజాత’ = ఉన్నదానిలో నుంచే ఉన్నది. సర్గ = సృష్టి / దృశ్యము =

సన్మాత్రమే ‘సర్గము’

Page:407

మరిక ఆ బ్రహ్మమునందు “జగత్తు కలదు, జగత్తు లేదు... అని విధి-నిషేధాలకు తావెక్కడిది? ఇక బ్రహ్మంలో స్వప్న దృశ్య ఆవిర్భావం - జాగ్రత్ దృశ్య ఆవిర్భావం... అను ఉభయాలు, “ఉన్నవే అగుపించ నారంభించాయి అనే అర్థాన్నే సూచిస్తున్నాయి. అవి రెండు వాస్తవానికి గొడ్రాలి కవల పిల్లల" అనే పదప్రయోగం వంటివే!

ఆ బ్రహ్మమునందు ఏ మాయాశక్తి ఉందో, దాని యందే 'కలదు, లేదు' మొదలైన వ్యవహారాలు ఉంటున్నాయి. ఏ కారణంచేత నిర్మల బ్రహ్మము మాయాశబలితమై ఉన్నదో... ఆ కారణం చేతనే అది అజ్ఞానులకు మాయారూపమై కనబడుతోంది. మాయాశక్తి ఎట్లెట్లు ఏఏ విధంగా విజృంభిస్తోందో, ఆయా రూపంగా సర్వశక్తిరూపమై ఆత్మరూపమైన బ్రహ్మమే స్ఫురిస్తోంది. తరంగంగా స్ఫురించటానికి జలానికి కారణం లేకపోయినా అది దాని ధర్మంగా, జలమునకు అనన్యంగా తరంగం స్ఫురిస్తున్నది. అట్లాగే, పరమాత్మయే జగద్రూపంగా అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది. (దృష్టిమ్ జ్ఞానమయిమ్ కృత్వాత్ పస్యేత్ బ్రహ్మమయమ్ జగత్).

జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది పరమార్ధవిదాం విదామ్ న విద్యతే కించిదపి యథాస్థితమ్ అవస్థితమ్

పరమార్ధమును ఎరిగిన తత్త్వవేత్తలకు - జాగ్రత్, స్వప్న, సుషుప్త్యాదులేవీ లేవు. యథారీతి స్థితి కలిగి ఉన్న బ్రహ్మమే సర్వత్రా ఉన్నది. ఈ జీవుల అనుభవంలో స్వప్నం, సంకల్పపురం అనే రెండింటికీ రూపమే ఏ విధంగా అయితే లేదో... అట్లాగే సృష్ట్యాదిలో జగత్తుకు రూపమేదీ లేదు.

ఈ స్వప్న సంకల్ప పురాలు జీవోపాధి యొక్క సృష్టికి అనంతరం కదా ఏర్పడుచున్నది? వాటి యొక్క ద్రష్ట ప్రాణము, మనస్సు కలిగి ఉండటం చేత ఆ స్వప్న-సంకల్ప నగరాలు అనుభూత మౌతున్నాయి. కానీ ఈ ప్రాణము మొదలైనవి ఉత్పత్తి కావటానికి పూర్వమో? సృష్ట్యాదిలో “సృష్ట్యాది యొక్క ద్రష్ట ఎవరు? నిర్విషయమై ఆకాశం కంటే నిర్మలమైనట్టి చైతన్యమే సృష్ట్యాదికి ద్రష్టగా భాసిస్తోంది.

అసలీ ‘ద్రష్ట’ను గురించిన కథనమంతా కూడా 'సృష్టి'ని బట్టియే చెప్పబడుతోంది. వాస్తవానికి ఇక్కడ “ద్రష్ట - భోక్త - తత్సంబంధమైన త్రిపుటి" - ఇవేవీ లేవు. అంతా చిదేక రసమే!

-

ఏది ఏదియు కాకపోయినా సమస్తము అయివున్నదో, ఏది మహావాక్ రూపమైనప్పటికీ మౌనాత్మకమై ఉన్నదో, ఆ చిన్మాత్రమే కనబడే సమస్తము అయివున్నది.

స్వప్నములకు అంతేమున్నది? సంకల్ప పురములకు సంఖ్యానియమం ఎక్కడ? కథా రచనలు అయిపోవటమంటూ ఏమున్నది? సృష్ట్యాదిలో కారణమే లేదు కనుక చైతన్యమున ఏ వస్తువు ఎట్లు స్ఫురిస్తోందో అది ప్రళయము వరకు అట్లే ఉంటోంది.

ఒక పిల్లవాని చేతిపై పెద్దపులిని చిత్రీకరించినప్పుడు ఆ పిల్లవాడు ఆ పెద్దపులిని చూచి భీతిల్లవచ్చునేమో గాని, ప్రౌఢుడైనవాడు భయం పొందడు కదా! ఆత్మరూపమే అగు ద్వైతమును చూచి జ్ఞాని భ్రమపడటం లేదు. అజ్ఞాని భ్రమపడుచున్నాడు.

Page:408

పరమార్థమున బ్రహ్మము ఆదిమధ్యాంత రహితమైయున్నది. అనంతము - ఏకము - అతి నిర్మలము అయివున్నది. భ్రాంతిచేత మహావికారంగాను, నానా రూపములుగాను తన నిజ స్వరూపం త్యజించకయే భాసిస్తోంది. కనుక ఈ జగత్తు అజ్ఞానముచే అశాంతముగా కనబడవచ్చునుగాక! బోధచే మహాశాంతమై, ప్రశాంతరూపమై చెన్నొందుచున్నది.

19. సుషుప్తి నుండి స్పష్టంలోకి...!

మహాముని : ఓ వ్యాధుడా! సుషుప్తి నుండి వెలువడిన తరువాత ఏది ఎట్లు జరిగిందో... ఆ కథనం కొనసాగిస్తున్నాను. క్రమంగా అన్నీ నీకే విశదమవుతాయి.

సుషుప్తి నుండి వెలువడిన నాకు అప్పుడు స్వప్నమునందు జగదృశ్యం సంప్రాప్తం అయింది. ఆకాశంలోనుంచి ఊడిపడినట్లో, భూమి నుండి ఏదో బయల్వెడలినట్లో, చిత్తము నుండి ఊహామాత్రంగా పెల్లుబికినట్లో, కళ్ళు తెరువగానే దృశ్యం కనిపించినట్లో నాకు స్వప్న జగత్తు కనిపించనారంభించింది. ఆకాశంలో దిక్కులు కనిపించునట్లు, నిరాకారమైన మట్టి నుండి మట్టి బొమ్మలు తయారగునట్లు, మనస్సు నుండి 'ఆలోచన' వచ్చునట్లు, రంగుల సమ్మేళనంచే ఒక గొప్ప స్త్రీ చిత్రం విరచితమగునట్లుగా నా సుషుప్తి నుండి స్వప్నదృశ్యం వెలువడింది.

ఇక ఆ స్వప్నదృశ్యం... అనేక మహాప్రయత్నముతో కూడివున్నది. దృశ్యరూపంగా ఉన్నప్పటికీ అందులో 'ఇది దేశము, అది కాలము' అనునవి ఉన్నట్లే లేదు. వివిధ పదార్థములతో కూడి కూడా అద్వైతమై ఉన్నది. శాస్త్రాలలో చెప్పబడే రజ్జు-సర్ప, మృగతృష్ణా భ్రాంతులవంటి ఒకానొక భ్రాంతి రూపమే అది. ఎక్కడ ఆరంభమైనదో చెప్పలేముగాని అనేక ఆరంభ సంరంభాలు, దేశ-కాలక్రియా-ద్రవ్యాదులు, సుర అసుర మనుష్యాదులతో కూడిన స్వర్గ-పాతాళ - మర్త్య లోకాలు, వేర్వేరు గదులలో వేరు వేరు బీజములుండే దానిమ్మ పండులాగానూ ఆ స్వప్న జగత్తు కనిపించింది.

అప్పుడు నేను ఆ స్వప్న దృశ్యమండలమును చూచుటకై ప్రవృత్తుడను కాసాగాను. ఇంతలో నేను ఇతఃపూర్వం స్వప్న ప్రవేశమునకు సంబంధించిన భార్య - బంధు - పుత్రాదులతో ఒకప్పుడు నివసించియున్న ఇల్లు ఇప్పుడు కనపించింది. బంధువులు, పుత్రులు, భార్య మొదలైనవారు ఆయా ఆకార - వయస్సులతో కూడి ఉన్నారు. వారిని చూడటానికై గదా, నేను రెండవసారి బయల్వెడలాను! అప్పుడు నేను ఆ గృహంలో ప్రవేశించాను. ప్రవేశించిన మరుక్షణం అక్కడి గృహ - క్షేత్ర - - బంధు - మిత్రాదులందలి అభిమాన రూపమగు 'వాసన'చే నా చిత్తము బలాత్కారంగా ఆకర్షించబడింది. ఇకప్పుడు స్వప్నము గురించి పరిశోధించటానికి బయలుదేరిన శిష్యసమేతుడనగు ఆశ్రమవాసిని” ...అనే విషయం మరల ఇంతలోనే క్రమక్రమంగా పూర్తిగా మరచి ఆ బంధుమిత్రుల ఆలింగనాదులతో తన్మయుడనై కాలం వెళ్ళబుచ్చసాగాను. చూచావా? అద్దం ఎదురుగా ఏ దృశ్యముంటే అద్దానినే తనయందు ప్రతిబింబిస్తుంది కదా! అట్లాగే...

Page:409

బింబం తత్తత్ ఉపాదత్తే యద్యత్ అగ్రే అవతిష్ఠతి |

యథా దర్శః చిదాదర్శః తథైవాయం స్వభావతః ॥

‘చైతన్యము’ అనే అద్దం కూడా తనయందు వాసనచే తన ఎదుట ఏఏ వస్తువు స్థాపించబడితే అద్దాని ఆకారాన్ని స్వయంగా గ్రహిస్తోంది. ఎవడైతే “ఈ సమస్తం చిదాకాశ మాత్రమే" అను బోధ కలవాడై ఉంటాడో... ఆతడు ద్వైతముచే ఉక్కిరిబిక్కిరి కాడు. నిర్మలము, ఆత్మబోధ స్వరూపము అగు ‘స్మృతి’ ఎవనియందు ఘనీభూతమై తొలగకయే ఉంటుందో.... అట్టి వానిని ద్వైత పిశాచము ఆవహించదు, సరికదా సమీపించనుకూడా లేదు. ఏ మహాత్ముడైతే 'శ్రవణము, మననము' మొదలైన సాధనాక్రమము చేతను, సాధు జనులతో సహవాసము చేతను, సచ్ఛాస్త్రములతో సంసర్గము చేతనూ ఆత్మబోధను గురించిన బుద్ధిని ప్రవృద్ధ పరచుకుంటాడో... ఆతడు జగత్తును జగత్తుగా కాక, బ్రహ్మముగా చూడటం ఏమరువడు. ఆతడు సర్వదా - - సదా - సర్వత్రా బ్రహ్మము అనుసంధానం చేతనే పరిపూర్ణుడై ఉంటాడు. అట్లా కాకుండా ఆత్మజ్ఞానము ఏమరువబడిందా... దృశ్య పిశాచం వచ్చి ఆవహించటానికి చిన్న చిన్న అవకాశాలు, కొద్ది సమయం చాలు కూడా!

నేను ఆ ఇతఃపూర్వపు ‘నాది' అనుకున్న గ్రామంలోని స్వగృహంలో ప్రవేశించి భార్య, పుత్రులు, బంధువులను చూడగానే నేను అప్పటివరకు సమకూర్చుకొనియున్న ఆత్మ జ్ఞానమును ఏమరచాను. కనుకనే బంధువుల గురించిన వాసనచే అదికాస్తా జ్ఞాపకం రానంతగా కప్పబడిపోయింది.

ఇప్పుడో... నా ఈ అనుక్షణికమైన ఆత్మసాక్షాత్కార భావనాభ్యాస దృఢత్వం చేత ఏ ప్రాపంచిక విషయ - విశేషమూ “అంతయు ఆత్మయే! చిదాకాశమే... అనే అవగాహనను తొలగించజాలదు. అందుకే దృఢమైన అభ్యాసమే శరణ్యం.

ఓ వ్యాధుడా! నీ బుద్ధి అతిదీర్ఘకాలం సత్సంగాదులు ఆశ్రయించకుండానే ఈ దృశ్య సమూహా లతో సంబంధం కలిగి ఉండి, ఆ ఈ దృశ్య సంబంధమైన అభ్యాసం యొక్క ప్రభావం కలిగియున్నది. అందుకే పూర్ణంగా శాంతిని పొందజాలకున్నది. సాధనాభ్యాసం కొనసాగిస్తూ మన ఈ ఆత్మ సంబంధమైన ఆప్త వాక్యాలు గ్రహిస్తూ ఉండగా నీ బుద్ధి కూడా తగిన సమయంలో సశాంతించగలదు. వ్యాధుడు : ఓ మహామునీ! మీరు చెప్పినది సత్యం. ఎందుకంటే తమయొక్క ఇటువంటి స్వానుభవపూర్వకమైన పవిత్ర బోధలచేకూడా నా బుద్ధి సద్రూపమగు బ్రహ్మమున విశ్రాంతి పొందటంలేదు. ఏం ఆశ్చర్యం! మీరు సెలవిచ్చినట్లు నా బుద్ధి "జగత్తుపై నమ్మకము అనే దోషముచే ఇట్లే కొనసాగుతుందేమోనని నాకు భయము - బాధ కూడా కలుగుతున్నాయి. ఆహా! అనేక జన్మలందలి అభ్యాసముచే దృఢపడి ఉన్న ఈ 'అవిద్య' ఎంతటి బలవత్తరమైనది! వాస్తవానికి లేనిదే’ అయినప్పటికీ అనేక రూపాలుగా ప్రకటనమగుచు కొనసాగుచున్నదే గాని, ఇద్దానికి ముగింపు కనబడటమే లేదాయె!

సత్సంగతైః పద పదార్థ విబుద్ధ బుద్ధిః సచ్ఛాస్త్ర సత్రమవిచార మనోహరాంగైః | అభ్యాసతః ప్రశమమేతి జగద్భమో యం నా న్యేన కేనచిదపీతి వినిశ్చితిర్మే

I

Page:410

ఓ మహామునీ! 1. సచ్ఛాస్త్ర పఠనం, 2. సద్గురు సంప్రదాయం, 3.తత్త్వ విచారణ... మొదలైన మనోహరములై అంగములతో కూడిన సత్సాంగత్యం పెంపొందాలి.

అట్టి సత్సాంగత్య ప్రభావంచేత పదపదార్థ వివేక బుద్ధి జనించాలి. అట్టి ఉత్తమమైన 'బుద్ధి' యొక్క సమాశ్రయముచే ఆత్మజ్ఞానం జనించాలి. అట్టి ఆత్మజ్ఞానం పరిఢవిల్లుతూ ఉండగా భూమికాక్రమంచేత మాత్రమే జగత్య్రాంతి నశించగలదు. ఇతరములగు మరే ఉపాయం చేతనూ ఈ జగద్భమ తొలగదని నాకు అనిపిస్తోంది.

20. స్వప్నంలోగల సత్యాసత్యములు

వ్యాధుడు : ఓ మునీంద్రా! నాకొక సంశయం ఉన్నది. మీరు ఇప్పుడు రెండు విషయాలు చెప్పుతూ వస్తున్నారు. 1. స్వప్నం స్వప్నద్రష్ట యొక్క వాసనని అనుసరించే ఉన్నది. 2. జాగ్రత్తు స్వప్నతుల్యమే! ... అయితే లోకంలో స్వప్నం గురించి అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి.

కొన్ని సమయాలలో వచ్చే స్వప్నాలు (తెల్లవారుజామున వచ్చేవి) సత్యమౌతాయని. కొన్ని స్వప్నాలు భవిష్యత్తును తెలిపే సూచనలని, కొన్ని వస్తువులు-సంఘటనలు స్వప్నంలో కనిపించటం శుభసూచకమని, మరికొన్ని వస్తువులు - సంఘటనలు స్వప్నంలో కనిపిస్తే అశుభ సూచకమని, కొన్ని స్వప్నాలు అవాస్తవం మాత్రమేనని, అర్థరహితమని, ఇట్లా లోకంలో ప్రతీతి ఉన్నది. మరి స్వప్నం స్వకీయ మనోచమత్కారమే అయినప్పుడు వాటిలో కొన్ని సత్యములని, మరికొన్ని అసత్యములని లోకప్రతీతి ఎందుకు ఉన్నది?

ఇంకొక సందేహం "బ్రహ్మదేవుని సంకల్పజనిత సృష్టి (ఈ జగత్ సృష్టి) అర్ధక్రియా సమర్థం అవటం చేత సత్యం. మనయొక్క సంకల్పజనిత సృష్టియగు స్వప్నం అసత్యం అని కొందరి అభిప్రాయం. ఈ విధంగా సృష్టులలో సత్యాసత్యము లెందుకున్నాయ్? ఇట్లా చూస్తే స్వప్న - జాగ్రత్తులు వేరువేరే కదా!

"అధిష్ఠాన చైతన్యము సత్యమే కాబట్టి అద్దానిలో గల జగత్తు సత్యమే! కాని స్వతఃగా చూస్తే అసత్యం ... అని సత్యాసత్యపూర్వకంగా ఈ జాగ్రత్ స్వప్నాల గురించి కూడా చెప్పుతూ ఉంటారు అసలీ 1.జాగ్రత్, 2.స్వప్నములలో సమానత్వమేది? ఆ రెండింటిలో అసమానత్వమైనదేది?

అవి రెండూ కొందరికి సత్యమనిపించటం, కొందరికి అసత్యమనిపించటం ... అనే వైషమ్యానికి కారణమేమిటి? ఈ గొప్ప సందేహం నన్ను ఇంకా వదలకున్నది.

మహాముని :

దేశ కాల క్రియా ద్రవ్యైః యా సంవిత్ నిశ్చితోదితా |

కాకతాలీయవత్ భాతి సా సత్య స్వప్ననామికా ॥

Page:411

అవును! స్వప్న శాస్త్ర ప్రావీణ్యులు కొందరు పురాణాదులలోని ఆయా సంఘటనలన్నీ తీసుకొని "ఇట్టి స్వప్నమునకు ఈ ఈ ఫలితం కలుగుతుంది ... అని చెప్పటం లోకంలో ఒక రీతిగా ఉన్నదే!

అయితే... ఆ విధంగా స్వప్నంలో కనిపించే సూచనలు, శకునాలు, ఇట్టి స్వప్నానికి ఇదీ ఫలితం" అని చెప్పటం - ఇవన్నీ కాకతాళీయం. "వీరు ఎదురువస్తే ఈ ఈ శుభ-అశుభాలు జరుగుతాయి” అని చెప్పే శకునాల కథనాలు ఎట్లా కాకతాళీయమో, స్వప్న ఫలాలు కూడా అట్లే కేవలం కాకతాళీయం. అనగా అవి అట్లా జరిగితే ఎవరికి “ఇది ఈ అర్థం కలిగివున్నది"... అని నమ్ముతారో, వారికి అది అట్లే ఫలము కలుగజేయుచున్నది. అవి నమ్మకమునకు సంబంధించియే ఉంటాయి గాని, సశాస్త్రీయం కాదు. తెలుసు! ఆ దుశ్శకునమే ఆ దుస్వప్నమే ఇట్లు ఈ ఈ అశుభములుగా పరిణిమించింది అని అలవాటుగా (సశాస్త్రీయమా? అశాస్త్రీయమా? అని పరిశీలించకుండానే) అనుకోవటం జరుగుతోంది. అందుచేత అట్టి స్వప్న - స్వప్నఫలములు సత్యమే’ ...అని కొందరి దృష్టిలో ప్రసిద్ధమై ఉంటున్నాయి.

వ్యాధుడు : అదేమిటి స్వామీ! నమ్మిన వారికి ఫలప్రదాత అవటం, నమ్మకుంటే ఫలము ఉండకుండటం ...అని అంటున్నారు? ఫలితములు నమ్మకమును అనుసరించి ఉంటాయా?

మహాముని : అవును. ఉదాహరణకు మణి - మంత్ర ఔషధాది ద్రవ్యములు ఒకానొకచోట యోగ్య పురుషుని యందు సత్యములౌతున్నాయి. గురువుల స్పర్శ మాత్రం చేత ఒకడు పునీత భావము సంతరించుకుంటున్నాడు. గురువు యొక్క పవిత్రతపై అంతగా ఆరూఢత ఏర్పడని మరొకడు పునీతత్వం పొందజాలకపోతున్నాడు. ఈ జీవుడు ఏది ఎట్లు సత్యమనుకొంటే అది అట్లే సత్యమై ప్రాప్తిస్తోంది”

అనేది శాస్త్ర విదితమైనదేకదా! అదియే స్వప్న సందర్శన విశేషముల యొక్క ఫలాఫలముల ప్రభావ రూపమునకు వెనుకగల మూలసూత్రమగుచున్నది.

అయితే... స్వప్నంలోగాని, జాగ్రత్తులోగాని ఏదైనా సరే కాకతాళీయ న్యాయం చేతనే 'సత్యం' అయి ఉంటున్నదిగాని మరొక రీతిగా కాదు. ఏదైనా సత్యం అవటానికి మూలకారణం సంవిత్తు యొక్క దృఢనిశ్చయ స్వభావమే అయివున్నది. హిరణ్యగర్భుని (సమష్టి సృష్టి సంకల్పుని) సంవిత్తు పూర్వకాలపు ఉపాసనాదుల పరిపాకం చేత జనించినదే కదా! ఆతని సంకల్పం సత్య సంకల్పరూపమగు దృఢనిశ్చయం కలిగి ఉంటోంది. అందుచేత అది యేయే నిశ్చయాలు కలిగి ఉంటోందో... ఆయా విశేషములే ఆ రీతిగా ఈ సృష్టిలో పరిఢవిస్తున్నాయి. ఎందుకంటే ఫలయుక్తం కావటమనేది దృఢ సంవిత్తు యొక్క సంకల్ప స్వభావమే అయివున్నది.

వ్యాధుడు : హిరణ్యగర్భుని సంవిత్తు యొక్క దృఢనిశ్చయము అందుకు విరోధంగా ఉండే మరొక ప్రబల నిశ్చయముచే మార్పు చేయబడటమో, నశింపచేయబడటమో జరుగగలదంటారా? మహాముని : హిరణ్యగర్భుడు, నేను జగత్తు యొక్క సృష్టికర్తను ...అనే సంకల్పమును ఉపాసనాకాలంలో కొనసాగించటం చేత గదా, ఆతని దృఢ నిశ్చయం ఈ సృష్టి యొక్క ఫలభాగి అయింది! అట్టి శ్రుతి ప్రసిద్ధమగు దృఢనిశ్చయము ననుసరించే ఇతర సిద్ధుల సంకల్పములు

Page:412

పరిఢవిల్లుచున్నాయి. అనగా బ్రహ్మదేవుని నిశ్చయమునకు అవిరోధంగానే ఆయా సిద్ధుల సంకల్పములు ఉంటున్నాయిగాని విరోధంగా కాదు.

వాస్తవానికి బాహ్యమునగాని - అంతరమునగాని 'జగత్తు' మొదలైన పదార్థము లేవీ ఎచ్చట కూడా లేవు. సంవిత్తు ఒక్కటే ఉన్నది. అట్టి స్వతంత్రమైన సంవిత్తు ఎచ్చట ఎట్లు ఇచ్చగిస్తుందో... అచట 'జగత్తు ఆదిగాగల రూపాలుగా స్థితినొంది ఉంటోంది.

కాబట్టి... 'ఈ స్వప్నం సత్యమే' అనే దృఢనిశ్చయాన్ని సంవిత్తు ఎచట అంతరంగమున కలిగి ఉంటుందో ...అది అద్దానిపట్ల అట్లే సత్యమగుచున్నది. అట్లే ఈ జాగ్రత్ యొక్క విషయం కూడా! సంశయం కలిగి ఉన్న చోట, అద్దాని ప్రయోజనం కూడా సంశయముగానే ప్రాప్తిస్తోంది. అన్యతో పి ఫలం ప్రాప్తం స్వప్న సత్యత్వకల్పనాత్ |

స్వప్నేన సూచితమిదం ఫలమిత్యేవ వేత్త్యయమ్ ॥

ఒకడు ఏవేవో తదితర కారణాల చేత ఒకానొక ఫలాన్ని పొందటం జరిగినప్పటికీ స్వప్నంలోని విశేషం సత్యమే” అనే కల్పన చేత స్వప్నంలో సూచించబడిన ఫలమే నాకు ప్రాప్తించింది ...అని అంతరంగంలో అనుభవించటం, భావించటం కూడా జరుగుతూ ఉంటుంది.

ఓ సాధూ! ఈ ముల్లోకాలలోను జాగ్రత్తు యొక్క సమస్త పదార్థములు ఆయా మనుజుల నిజసంవిత్తుచే చిరకాలము ఆయారీతిగా అనుభవించబడటం చేత దృఢీకృత స్వభావం కలిగినవై ఉంటున్నాయి. అయినా కూడా అవి దేశ కాల యత్నాదుల వలన శీఘ్రంగానో, లేక, విలంబనంగానో అన్యథాభావము పొందుచున్నాయి. ఈ జగత్తులో ప్రతిదీ ఒక స్థితి నుండి అన్యధాభావ ప్రభావంచేత అన్యత్వము పొందుచూ ఉంటోంది.

కాని చైతన్యము మాత్రం అన్యధాత్వం పొందదు. అట్టి మార్పు - చేర్పులకు విషయమే కాని ఆ చిన్మాత్ర సంవిత్తు ...తక్కిన సమస్త జగత్తును... సత్యముగానో, అసత్యముగానో; నియతముగానో, అనియతముగానో; బంధరూపంగానో, మోక్షరూపంగానో... స్థితినొంది ఉన్నట్లు ఎరుగుచున్నది. అది (చిన్మాత్ర బ్రహ్మం) ఈ జగత్తును ఎట్లా ఎరిగితే ఇది అట్లే అనుభూతమౌతోంది. ఓ వ్యాధుడా! 'చిన్మాత్రం యొక్క భావనయే ఈ జగత్తు' అని గమనించెదవుగాక! భావన భావికుని కంటే వేరుకాదు కదా! ఎప్పుడైతే ఈ సమస్తము కూడా సద్రూపము, ఏకము అగు బ్రహ్మమే అయి ఉన్నదో... మరి ఒకటేదీ అయి ఉండనేలేదో... అద్దానికి భిన్నంగా ఏది సత్యము? ఏది అసత్యము? సత్యమని తలచుటచే సత్యము గాను, అసత్యమని తలచుటచే అసత్యముగా అనుభవమవటమే ఇచ్చటి చమత్కారం. అట్లాగే స్వప్నాంతర్గత విషయముల యొక్క జాగ్రత్ సంబంధిత సత్యాసత్యాలు కూడా!

స్వప్నం కూడా (జాగ్రత్తు లాగానే) అజ్ఞానుల దృష్టియందు... ఒకచోట సంవిత్తు యొక్క దృఢత్వ భావనచే సత్యముగా అనిపిస్తోంది. మరొకచోట తత్వ్యతిరేక భావనచే అసత్యంగా తెలియ వస్తోంది. జ్ఞానుల దృష్టిలో స్వప్న- జాగ్రత్తులు, వాటికి గల పరస్పర సారూప్య - అసారూప్యాలు, వాటిలోకి ఒకదాని సూచనలు రెండవ దానిలో అగుపించటం... ఇదంతా సద్రూపం గాక,

Page:413

అసద్రూపం గాక అనిర్వచనీయమై ఒప్పుచున్నది. కనుక స్వప్న-జాగ్రత్తుల ద్రష్టయే సత్యమని, ఇక తదితరమంతా భావనానుసారమేనని గ్రహించి ఉండు.

వ్యాధుడు : మునీంద్రా! ఈ ఆకారవంతమగు జగత్తుగా భాసిస్తున్నదేది?

మహాముని : సంవిత్తు యొక్క భ్రమయే ఈ ఆకారవంతమగు జగత్తుగా భాసించుచున్నది. ఎప్పుడైతే “నా చిత్తమే స్వయంగా భ్రాంతి రూపమైయున్నది ... అని గమనించినప్పుడు, ఇక ఆ చిత్తమునకు విషయంగా చెన్నొందే ఈ జగత్తు భ్రాంతిగాక మరింకేమిటి? ఇందులో యథార్థమేమున్నది?

జగత్తు - చైతన్యము యొక్క చింతనయే చిత్తముగా అగుచున్నది. ఆ చిత్తము తనయందు తానే కించిత్ భ్రమచే పరిభ్రమిస్తోంది. అట్టి చిత్తము యొక్క భ్రమతో కూడిన పరిభ్రమణమే ఈ ‘జగత్తు అయివున్నది. ఏదైతే “ఇది జనిస్తోంది - అది గతిస్తోంది" ...అని అనుభూతి పొందుతోందో... -

అద్దాని చమత్కారమే 'జగత్తు'. ఇక నీవో, కేవలం సంవిత్స్వరూపుడవేనని గ్రహించు.

ఓ వ్యాధుడా! స్వప్నం గాంచుచుండగా సుషుప్తి ఎట్లు అనుభూతమౌతోందో... అట్లాగే, జాగ్రత్తు అనుభవించబడిన తరువాత స్వప్నం అనుభూతమౌతోంది. కాబట్టి ఓ మహామతీ! నేయి ఘనీభూతంగా ఉన్నా, ద్రవీభూతంగా ఉన్నా పాదార్థికంగా ఒక్కటే కదా! అట్లాగే నీవు... జాగ్రత్తు స్వప్నము వంటిదేనని గమనించు.

స్వప్నము జాగ్రత్తు వంటిదేనని గ్రహించు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఏకము, అజము, అగు బ్రహ్మరూపములే అయివున్నాయి. చిదాకాశము విషయ శూన్యము, ఏకము, చిన్మాత్రము, జాగ్రత్, స్వప్న, సుషుప్తుల - రూపము అయివున్నది.

వాస్తవానికి ఇక్కడ నియతి లేదు. అనియతి లేదు. మిథ్యాభూతమగు స్వప్న జగత్తులో నియతి ఏమిటి? అనియతి ఏమిటి? ఈ జాగ్రత్ అనబడే స్వప్నం విషయంలో కూడా అంతే! ఓ వ్యాధుడా! మరల ససిద్ధాంతపూర్వకంగా ప్రకటిస్తున్నాను. విను.

1.స్వస్వరూప చైతన్యమే జాగ్రత్ - - స్వప్న - సుషుప్తులను తన సమక్షంలో కల్పించుకుంటూ, అవే తానై వర్తిస్తోంది.

2. అట్లు జాగ్రత్, స్వప్న, సుషుప్తులలో వర్తిస్తూ ఒకానొకప్పుడు తన యొక్క దివ్యం, సర్వాతీతం, స్వస్వరూపం, కేవలసాక్షి, నిర్మలం, అసంగం, సర్వగతం - - అగు అప్రమేయ ఆత్మ స్వరూపాన్ని ఏమరు స్తోంది. “నేను ఈ జాగ్రత్లోని ఒక స్వల్ప విభాగాన్ని. స్వప్నంలోని విభాగాన్ని, దేహపరిమితుడను. విషయ బద్ధుడను... అని మననం చేస్తూ అకించత్వాన్ని ఏమరచి కించత్వాన్ని ఆపాదించుకుంటోంది. 3. అదియే ఎప్పుడో మరొకప్పుడు శ్రవణ-మనన-నిధిధ్యాసలనబడే ప్రయత్నమునకు సమాయత్తమౌతోంది.

4. అట్టి ప్రయత్నముచే సమాధి రూపమున వెలయుచున్నది కూడా చైతన్యమే!

5. అయ్యది అజ్ఞానమును త్యజించినప్పుడు ముక్తిరూపమున స్వయముగా ప్రకాశిస్తోంది. వాస్తవానికి అది నిత్యముక్తము.

Page:414

అనగా...

1. ఆ నిర్మల తనయొక్క జాగ్రదత్వమును ఇంకొకప్పుడు సంవిత్తు జాగ్రత్ సంవిత్తుగా, స్వప్న సంవిత్తుగా, సుషుప్త సంవిత్ గా కూడా వెలయుచున్నది.

2. జాగ్రత్ సంవిత్తు తన యొక్క జాగ్రదత్వమును నిరోధించిన సమయంలో మనోవ్యాపార మాత్ర రూపమగు స్వప్న సంవిత్తుగా అవతరించి స్వప్న స్ఫురణముగా అగుచున్నది.

3. ఇంకొకప్పుడు జాగ్రత్ స్వప్న సంవిత్తుల ఉభయముల స్వకీయమైన నిరోధముచే ఆ మూలసంవిత్తు సుషుప్త సంవిత్ స్పురణ"ను ఆశ్రయిస్తోంది. సుషుప్త సంవిత్తుగా అవతరిస్తోంది. 4. జాగ్రత్- స్వప్న సుషుప్తులను నేను నియమిస్తున్నాను కదా!" అను ప్రజ్ఞచే నియమముచే సర్వశోక రహితమగు సమాధి స్ఫురిస్తోంది.

పై (9) విషయములు నిర్దిష్టంగా గ్రహించి, సమాధిసుఖవిశ్రాంతిని కోరిన ముని ఇతర సమస్త వృత్తులను అంతరమున నియమం చేసి వేస్తున్నాడు. కనుక సాధూ! సమస్త వృత్తులను సంనియమం చేసి 'ఆత్మాకార వృత్తి'ని సముపార్జించుకోవటమే 'సమాధి'.

వాయువులో తరంగాలుండటానికి కారణమేమున్నది? అది అకారణం. సముద్రంలో ఒక తరంగం ఒకానొక ఆకారమే చెందటానికి కారణమేమిటి? అదికూడా అకారణమే. లేక యాదృచ్ఛికం. అట్లాగే సంవిదాత్మ అకారణంగా జాగ్రత్ స్వప్న సుషుప్తులతో కూడినదై స్ఫురిస్తోంది. అట్టి సంవిత్తుకు స్వప్నము మొదలైన విషయాకార స్ఫురణరూపమగు నియతి కూడా స్వభావం కాదు. సుషుప్తిలో జాగ్రత్ స్వప్నాలు స్ఫురించకపోయినా సంవిత్తు ప్రకాశిస్తూనే ఉన్నది సుమా! స్వతంత్రము, కారణ రహితము అగు చిద్రూపమునకు (ఆత్మకు) ఏ నియతి ఎట్లుండగలదు? నియతిచే సంవిత్తు పరిమితమైనది కానే కాదు. ఈ సృష్టి అనబడేది ఈ విధంగా కారణరహితమైయున్నది. చైతన్యమునకు వేఱుకానట్టి ఈ జగత్ సంబంధిత ఆకాశాదులు చైతన్యమునకు కారణం కాదు. చైతన్యమే తన భావనాపటిమచే జగదనుభవానికి కారణం!

చైతన్యం ఏ ఉపాధియందు ఎంతకాలం ఏ రూపంతో స్ఫురిస్తుందో అచట అట్లే అనుభూత మౌతోంది. అయ్యది పారమార్థికంగానో (లేక) వ్యావహారికంగానో (లేక) ప్రాతిభాసికంగానో అట్లు వ్యవహరించటమే నియతి. ఇంతకు మించి మరొక నియతి అనునదేదీ లేదు.

వాస్తవానికి నియతి కూడా సత్యం కాదు. అసత్యం కాదు. అది కూడా అనిర్వచనీయమే! (ఉన్నదనుకుంటే ఉంటుంది. లేదనుకుంటే లేదు. అందుకే అనిర్వచనీయమని చెప్పబడుతోంది). నియతి’ అనునది కూడా లేకయే ఉన్నది కాబట్టే స్వప్నంలో ఒకప్పుడు సత్యత్వము, మరొకప్పుడు అసత్యత్వము వర్తిస్తున్నాయి.

కదాచిత్ సత్యథా స్వప్నే కదాచిత్ చ అపి అసత్యతా, అభావాన్నియతేరేవ కాకతాలీయమేవ తత్

స్వప్న సూచనలు - శకునాలు సత్యమవటం, అసత్యం కావటం - ఇదంతా కాకతాళీయమేగాని,

Page:415

దానికి నియతి’ అంటూ ఏదీ లేదు. అట్లాగే, మణి-తంత్ర-ఔషధాల సత్యత్వ నియతి జాగ్రత్తులో దేశ-కాల-భావనానుసారమే ఏర్పడుచున్నాయి. ఇక జాగ్రత్-స్వప్నముల మధ్యగల భేదమేమంటావా?

జాగ్రత్ - స్వప్నాలు రెండూ చిత్ ప్రకాశ మాత్రములే అయివున్నాయి. తెలివి, తెలుసుకోవటం అనే రెండింటి సంయోగమే చిత్ ప్రకాశ మాత్రంగా వ్యవహరిస్తోంది. ఆ సంయోగమే తెలియబడు దానిని కల్పన చేసుకొని ఆస్వాదిస్తోంది.

జాగ్రత్లో కనబడే నగరం - స్వప్నంలో కనబడే నగరం ...ఈ రెండూ కూడా వేద్య -

వేదనముల స్వరూపానుభవం దృష్ట్యా... సమానమైనవే అయివున్నాయి ఎట్లా అంటావా?

జాగ్రత్ వాస్తవానికి లేదు. ఏది 'జాగ్రత్' అని చెప్పబడుతోందో ... అది జగద్రూప స్వప్నమే అయివున్నది. సుమా! ఏది 'స్వప్నము' అని చెప్పబడుతోందో... అది స్వప్న సమయంలో 'సత్యమే' అను అభిప్రాయంతోనే పొందబడుతోంది. కనుక స్వప్నము స్వప్న సమయంలో జాగ్రత్తే !

వాస్తవానికి ఆత్మ నిత్య ప్రకాశకము. నిత్య జాగరూకము. నిద్రారహితమగు ఆత్మయందు జాగ్రత్ - స్వప్నాలు రెండూ లేవు. స్వప్నము కూడా వాస్తవానికి లేనిదే అగుచున్నది. స్వప్నము -

అని ఏది చెప్పబడుతోందో అది. బ్రహ్మము యొక్క సుషుప్త - అసుషుప్త రూపమగు బోధరూపమే! వ్యాధుడు : స్వామీ! ఈ జగత్ - స్వప్న - సుషుప్తులు ఆత్మయందు ఏర్పడి ఉన్నాయా! మరణము' అంటే ఏమిటి?

మహాముని :

జాగ్రత్ స్వప్నాదయోవైతే న కేచన కదాచన I

దృశ్యం పశ్యతి సత్తాశు మృతి భ్రాంతేరనంతరం ||

ఓ వ్యాధుడా! వాస్తవానికి ఆత్మ సర్వదా నిర్విషయము - నిర్విశేషము. అందుచేత అద్దానిలో జాగ్రత్ స్వప్న సుషుప్తులు లేవు. ఉన్నట్లుగా కనిపించేదంతా కూడా... ఆత్మయే అజ్ఞాన దృష్టికి ఆయా రీతులుగా అనిపిస్తోంది. ఇక మరణమంటావా? జీవన్ మరణముల అంతరమున బాహ్యమున కూడా చిత్సత్తయే ఆయా రీతులుగా ప్రకాశిస్తోంది. అలుప్త రూపమగు చిత్ సత్తయే జీవించి ఉన్నంతవరకు ఆయా దృశ్యములను చూస్తూ తన స్మృత్యనుసారం (చిత్తానుసారం) ఆయా అనుభవములను అనుభూతులను పొందుతోంది. అటు తరువాత 'మరణము' అనే భ్రాంతి అనంతరం కూడా మరియొక దృశ్యమును శీఘ్రంగా అనుభవించుచున్నది.

అనంత సముద్రంలో తరంగాలన్నీ ఒకే జలమయమై ఉన్నప్పటికీ, వేరు వేరు కానప్పటికీ వేరు వేరుగా స్పష్టంగా అగుపిస్తున్నాయి కదా! ఆకాశమంతా ఒక్కటే అయినప్పటికీ దిగ్రమచే తూర్పు-ఈశాన్యం-పడమర-దక్షిణం-వాయవ్యం-ఉత్తరం మొదలైన దిక్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా! (అటు సూర్యబింబమును - ఇటు భూగోళమును రహితం చేసి దర్శిస్తే దిక్కులు ఎక్కడున్నాయి?) అట్లాగే జాగ్రత్-స్వప్న-సుషుప్తాదులు, వాటి అంతర్గతంగా కనిపించే విషయాలు-దృశ్యాలు సంఘటనలు... ఇవన్నీ బ్రహ్మం కంటే వేరుకానప్పటికీ వేరు వేరుగా ఉన్నట్లు స్పష్టంగా అనిపించవచ్చు

Page:416

గాక! అయితే, జీవన్-మరణ-పునః జీవనములు కూడా అట్టివే! ఆయా సందర్భములలోని స్వకీయ భావనానుసారంగా స్ఫురించుచున్నాయి.

ఒక శిలాకోశంలోనో, గాజుకాయలోనో గీతలున్నట్లుగా 'పరమాత్మ' అనే శిలాకోశంలో (గాజు కాయలో) ఈ సృష్టులన్నీ భిన్నభిన్న రూపాలుగా స్ఫురిస్తున్నాయి. మరింక పరమాత్మ యందు జాగ్రత్ స్వప్న - సుషుప్తులు ఉండటమనే ప్రసక్తి ఎక్కడిది? ఆత్మయే జాగ్రత్ - స్వప్న - -

సుషుప్త వ్యవస్థారూపమును, తత్ విరుద్ధమైనట్టి తురీయావస్థా రూపమును వహిస్తోంది. ఆకార రహితమైనప్పటికీ సర్వాకారయుక్తమై ఉంటోంది. కాలకల్పనారహితమైనప్పటికీ సృష్ట్యాత్మకమగు కాలముచే పరిచ్ఛిన్నమగుచున్నట్టి శరీరము ధరించినదగుచున్నది. దృశ్య రహితమైన చిచ్ఛరీరం ధరించినప్పటికీ దృశ్యరూపమున వ్యాపించి ఉన్నదగుచున్నది. అది దృశ్యమునందు ప్రవేశించి ఉండవచ్చుగాక! దృశ్యదర్శన తాదాత్మ్యముచే తన అప్రమేయ చిత్ర భావనను ఏమరచి ఉండవచ్చునుగాక! జాగ్రత్-స్వప్న-సుషుప్తాది దేహవస్త్రములను ధరించ వచ్చునుగాక! ఏది ఏమైనప్పటికీ అది నిజ శుద్ధ చిదాకాశమాత్రము కంటే ఒకింత కూడా భిన్నంగా లేదు. ఉండదు.

ఓ మిత్రమా! వ్యాధుడా! ఇక్కడ నీకు కనిపించే ఆకాశ వాయు-అగ్ని-జల-పృథ్వి-లోకలోకాంతర-మేఘ సహిత-వస్తు సహిత-సంఘటనాసహిత దృశ్యజగత్తు అంతాకూడా సృష్ట్యాది యందు కారణరహితమైయున్నది.

అందుచేత ఈ దృశ్య జగత్తంతా హిరణ్యగర్భుని చిత్తరూపమే అయివున్నది. చిత్తమయమగు మనోరాజ్యంలో కనిపించేదంతా నామరూపరహితమే కదా! ఈ దృశ్యమంతా కూడా అట్లాగే నామరూపరహితం. ఇదంతా 'జ్ఞాన శరీరం' అనదగు మనోసాక్షితో కూడుకుని ఉన్నది. మనస్సే ఈ దృశ్యమునకు పుట్టినిల్లు. మనోలయముచే ఇదంతా కూడా శుద్ధ జ్ఞాన స్వరూపమే! వస్తుతః ఇదంతా మరింకేదీ అయి ఉండలేదు.

21. ఈ దృశ్యంలో కారణత్వమనేది ఉన్నదా? లేదా?

(అగ్నిదేవుడు : భక్తుడగు నాలుగవ విపశ్చిత్తో మహాశవ పూర్వవృత్తాంతాన్ని విశదీకరిస్తూ...) లుబ్ధకుడు అనే వ్యాధుడు : ఓ మునీంద్రా! మీరు ఆ ఒకానొక ప్రాణి హృదయంలో ప్రవేశించి, ఆతని స్వప్నలోకంలో అనేక విశేషాలు చూస్తూ ఒక గ్రామంలో, ఒక ఇంట్లో భార్య, పిల్లలు, బంధువులతో రోజులు గడుపుచున్నంత వరకు కథా క్రమమంతా చెప్పారు. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పేదంతా చాలా చమత్కారంతో కూడి ఉన్నది సుమా! మహాముని : ఓ వృత్తాంతాభిలాషీ! సాధూ! వ్యాధుడా! లుబ్ధకుడా! ఆ ప్రాణి హృదయతేజము నందు ఏ అపూర్వ వృత్తాంతం సంభవించినదో... అది చెప్పుతాను విను.

p

Page:417

అప్పుడు క్రమంగా ఆత్మయొక్క చమత్కారమంతా ఏమరచాను. నా పూర్వ వృత్తాంతం కూడా మరచాను. ఆ ఇంట్లో నా భార్య పిల్లలతోను, తదితర బంధువులతోను, గృహ వ్యవహారములతోను, ధనాదులను సంపాదించే వ్యాపార వ్యవహారాలతోను నిమగ్నమై నెలలు, సంవత్సరాలు గడిచిపో సాగాయి. భార్యపట్ల అనురక్తితో, పిల్లలను పెంచుతూ, ధన సముపార్జనాది ఆయా వ్యవహారాలతో 14 సంవత్సరాలు గడచిపోయాయి. ఒక రోజు ఒక అనుకోని సంఘటన జరిగింది.

ఒకానొక రోజు ఉదయమే నేను ఏదో పని మీద బయటకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఒక బాటసారి మా ఇంటికి వచ్చాడు. వస్త్ర వేషధారణను బట్టి ఆయనను ఒక గొప్ప తపస్విగా, పూజనీ యుడుగా, మహాజ్ఞానిగా, బోధజ్ఞుడుగా గుర్తించాను. ఆయన ఫాలభాగం మహత్తరమైన తేజస్సుతో వెలుగొందుతోంది. కళ్ళలో ఒకానొక అనిర్వచనీయమైన ప్రశాంతత కనిపిస్తోంది. అనేక గృహ కార్యక్రమాలలో అవిశ్రాంతంగా సంచరిస్తూ అలసివున్నాను కదా! అందుచేత ఆయన పుణ్యవశం చేత మా ఇంటిని పావనం చేయటానికే వచ్చి తలుపులు తట్టినట్లు నా కనిపించింది. ఆయనను సాదరంగా మా ఇంట్లోకి ఆహ్వానించి ఉచితాసనం సమర్పించాను. నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసి ఆయనకు అతిథి సత్కారాలు సమర్పించి పూజించాము. ఆయన మా ఆతిథ్యం చిరునవ్వుతో స్వీకరించారు. మధ్యాహ్న భోజనం తరువాత విశ్రాంతి తీసుకోసాగారు. అప్పుడు ఆయనను సమీపించి వినమ్రుడనై నమస్కరించాను. మహనీయులగు జ్ఞానులతో సంభాషించి సంశయ నివృత్తి చేసుకోవాలని, జ్ఞాన విషయాలు తెలుసుకోవాలనే అక్కడి పెద్దలు చెప్పే వాక్యాలను మననం చేస్తూ ఆయనకు సమీపంగా ఆసీనుడనైనాను.

ద్వితీయ ముని : చాలా సంతోషం నాయనా! మీ అతిథి మర్యాదలకు చాలా సంతోషించాను. మీ బంధు మిత్రులందరూ సకుశలమే కదా!

నేను (మహాముని) : స్వామీ! మీరు క్రోధరహితులు. విషయ సుఖములందు ఏమాత్రం ఆసక్తి లేనివారు. మహాజ్ఞానంతో ప్రకాశిస్తున్నారు. మీ రాకతో మా ఇల్లు పావనం అయింది. మీరు ఈ జగతి స్థితిని ఎరిగినవారు కదా!......

ద్వితీయ ముని : బిడ్డా! మీ గృహమునకు శుభమగుగాక! ఏమిటి? ఏదో అడగాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తున్నావు? నీకేవైనా సందేహాలుంటే అడుగు. మీరు ప్రశ్నిస్తేనే కదా, మీకు మేము చెప్పగలిగేది!

నేను (మహాముని) : హే మహాత్మా! ఈ లోకం సంగతి మీకు తెలిసినదే కదా! ఫలాభిలాషులై ప్రయత్నశీలురగు రైతులకు శరత్కాలంలో ధాన్యాదులు లభించునట్లుగా, కర్మయుక్తులగు జీవులకు వారి వారి శుభాశుభ కర్మలచే శుభాశుభములు ప్రాప్తిస్తూ ఉంటాయి కదా!

కొంతకాలంగా ఇక్కడి నుండి కొంత దూరంగా నా భార్య పుట్టింటివారి గ్రామం ఉన్నది. మా మామగారు గొప్ప ఆస్థిపరుడు. వాళ్ళ జీవితాలు కొంతకాలం వరకు సుఖంగా జరుగుతున్నాయి.

Page:418

కాని రెండు సంవత్సరాల క్రితం సమయానికి వర్షాలు లేక, వారికి పంట చేతికి రాక భూములన్నీ వట్టిపోయాయి. పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఆ ప్రాంతంలోని రైతులంతా అల్లల్లాడిపోయారు.

ఇక ఈ సంవత్సరం! చక్కగా వర్షాలు వచ్చాయి. పంట చేతికందే తరుణం వచ్చింది. అమ్మయ్యా! ఇక కష్టాలు గట్టెక్కినట్లే ... అని ఆ ప్రాంతపు ప్రజలంతా సంబరాలు చేసుకోసాగారు. సరిగ్గా కోతలు ప్రారంభమయ్యే తరుణంలో అకస్మాత్తుగా కుండపోత జడివానలు ప్రారంభమైనాయి. నాలుగు రోజులలో అక్కడి పంట భూములన్నీ జలమయమై పోయాయి. ఇళ్ళకు రావలసిన పంటలన్నీ జలదేవత తరలించుకుపోయింది. మరల మా మామగారి కుటుంబం వీథిన పడింది. పూర్తిగా చితికిపోయిందనే చెప్పాలి. అక్కడి రైతులంతా దేశాల వెంబడి భిక్షాటనం చేసి బ్రతకవలసిన కాలం వచ్చింది. అనేకమంది జనులకు చెప్పరాని ఇక్కట్లు తెచ్చిపెట్టిన అనావృష్టి - - అతివృష్టి చూచి నాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి.

రెండవ ముని చెప్పు నాయనా! ఏమిటి నీ సందేహాలు?

నేను (మహాముని) : ఏ ప్రాంతంలో అయితే అతివృష్టి - అనావృష్టి వచ్చి పడిందో ... అక్కడ అనేక మంది ప్రజలకు ఇక్కట్లు వచ్చిపడ్డాయి కదా! ఎందుచేత? అక్కడి ప్రజలంతా సామూహికంగా ఏమైనా అశుభకార్యాలు నిర్వర్తించటం చేతనా? (లేక) తదితర గ్రామాలు సుభిక్షంగా ఉండటానికి కారణం? వారేమన్నా సామూహికంగా శుభకర్మలు నిర్వర్తించటం చేతనా?

ఏ సామూహిక దుష్కర్మల చేత దుర్భిక్షాలు కరుపు కాటకాలు వచ్చి సామూహిక వేసటలు కలుగుతాయి? ఏ సామూహిక సత్కర్మల కారణంగా అతివృష్టి - అనావృష్టి - దుర్భిక్షాలు రాకుండా ఉంటాయి? ఆ దుర్భిక్షం అనుభవించే ప్రజలంతా ఏం పాపం చేశారు?

ఈ దుర్భిక్షం ఉంది చూచారూ! అది అనేకమంది జనులచే భక్ష-అభక్ష్యాలను కూడా భుజింప జేస్తోంది. ఆ జనులలో కొందరు ఏదైనా తప్పుచేస్తే అందరికీ చుట్టుకున్నదా? అట్లా అయితే, అనేక మంది (పాపం చేయని) జనులను కొద్దిమంది చేసిన పాపం ఎందుకు బాధిస్తోంది? ఆ జను లందరికీ ఏకకాలంలో ఇంతటి సమాన దుఃఖం ఎందుకు కలుగుచున్నది? కర్మలకు, సామూహిక కర్మలకు, వ్యక్తిగత సుఖదుఃఖాలకు, సామూహిక సుఖదుఃఖాలకు లంకె ఎట్లా ఏర్పడుతోంది? ఇదీ, నా సందేహం!

ఓ వ్యాధుడా! ఆ మునీశ్వరుడు నా సందేహాలన్నీ ఓపికగా, మౌనంగా విన్నారు. అంతా విని ప్రశాంతముతో కూడిన చిరునవ్వుతో అమృత ప్రవాహము - అతి సుందరము - దోషరహితము అయిన వాక్యాలు ఈ విధంగా చెప్పసాగారు.

అన్యముని : ఓ గృహయజమానీ! ఈ నీ - నా అంతఃకరణం చిత్తు యొక్క చిత్తము యొక్క వివేకంతో కూడియున్నది కదా! అట్టి నీ వివేక - స్వానుభవాలన్నీ క్రోడీకరించి ముందుగా నీవే నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుచున్నాను.

Page:419

ఈ దృశ్యం కనబడుతోంది కదా! ఏ కారణం చేత ఈ దృశ్యం ఇట్లా ఏర్పడి ఉంటుంది? ఈ దృశ్యం యొక్క కారణము సత్తా? అసత్తా?

ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరకక నేను వారి వైపు మౌనంగా చూస్తూ ఊరుకుండి పోయాను. అన్యముని : ఏమయ్యా మౌనం వహించావు? ఒక్కసారి నీవు నీ సమస్త పూర్వ వృత్తాంతాలకు సాక్షి’గా ఉన్న ఆత్మ'ను స్మరించు.

నీవు ఎవరవు? ఎక్కడున్నావు? ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకొచ్చావు? ఉన్నచోటే ఉన్నావా? లేనిచోటికి వచ్చావా? ఈ దృశ్యమేమిటి? ఈ దేహం నీదా? ఇది నీవా? ఇందులో సారమేమిటి? అసారమేమిటి? నీకు కలుగుచున్న దుఃఖం సంఘటనల వలన కలుగుతోందా? నీ నిర్వచనముల వలన కలుగుతోందా?

నేను (మహాముని) : (శ్రద్ధతో కూడిన మౌనం!)

అన్యముని : ఒకానొక విషయం నీకిప్పుడు గుర్తు చేస్తున్నాను, విను. ఈ దృశ్యమంతా స్వప్నమాత్రమే అయి భాసిస్తోంది. ఆశ్రమంలో శిష్యులతో వ్యవహరించే నీవు ఒకానొక సమయంలో బాటన వెళ్ళే ఒక వ్యక్తి స్వప్నలోకంలో ప్రవేశించి, ఇప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నావు. అవునా? కాదా? ఈ విషయం నీవు ఎందుకు ఎరుగటంలేదు? ఓ మిత్రమా! మహామునీ! ఈ దృశ్యమంతా ఏమిటి? నీవు నీ స్వప్నంలో నన్ను చూస్తున్నావు... నేను నా స్వప్నంలో నిన్ను చూస్తున్నాను. ఈ నీ జగత్తు, నా జగత్తు, ఆ ఒకానొక ప్రాణి స్వప్న జగత్తు... ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ... యోచించు. జగత్తు : వాస్తవానికి జగత్తు నిరాకారం. అనిర్వచనీయం. సర్వకల్పనా వర్జితం. ఎందుకంటే... స్వప్నమునకు ఆకారమేమిటి? నిర్వచనమేమిటి?

చిన్మాత్రము : "నిరాకారం, అనిర్వచనీయం, సర్వకల్పనా వర్జితం, నీ - - నా స్వరూపం" అగు చిన్మాత్రము (చిదాత్మ) అనే రత్నముయొక్క కాంతివిశేషమే ఈ జగత్తు. కాబట్టి!

అట్టి చిన్మాత్రము (ఆత్మ)నకు ఒకానొక విశేష లక్షణం ఉన్నది. అది స్వతఃగా సర్వవ్యాపకమైనప్పటికీ కూడా... అది తాను ఎచట ఎట్లు భావన చేస్తుందో, తలచుకుంటోందో అచట ఆ రూపమే అయివుంటుంది. అది అద్దాని స్వాభావిక లక్షణం.

సకారణత్వ కలనాత్ సర్వమ్ అస్య సకారణమ్ |

అకారణత్వ కలనాత్ అస్య సర్వమ్ అకారణమ్ ॥

అద్దాని రచితమగు సమస్తము కూడా అద్దాని సంకల్పానుసారమే ఏర్పడి ఉంటోంది. అని చెప్పబడుచున్నది. అద్దాని కల్పన అంతా - అద్దాని సకారణత్వ కల్పనచే సకారణమగుచున్నది. నీ యొక్క - నీ బంధువు యొక్క - నా యొక్క సకారణ - అకారణ కల్పనలే మనకు జగత్తులుగానో, మరింకేదోగానో భాసిస్తోంది కదా!

“అకారణత్వ కల్పన”చే అకారణమగుచున్నది. సకారణత్వ కల్పన చే సకారణమే అగుచున్నది.

Page:420

ఏ ప్రాణి యొక్క హృదయతేజం నందు నీవు, నేను, నీ భార్య, నీ భార్య వైపు బంధువులు అందరమూ ఉన్నామో... ఆతడు మనందరికినీ విరాడ్రూపుడు అయి వ్యాపించివున్నాడు.

ఆతడు సామాన్య వ్యష్టిరూపుడే అయినప్పటికీ, మనయొక్క చైతన్యకల్పనావశం చేత ఆతడు 'విరాడ్రూపం' పొందినవాడగుచున్నాడు.

ఈ ప్రాణిలాగానే... మరొక ప్రాణి, మరికొందరు మనుజులకు (జీవులకు) విరాడ్రూపుడై ఉండటం సర్వవ్యాపకమగు చిదాత్మయందు చమత్కారంగా జరుగుతోంది. ఆ ప్రాణియే ఆ జీవుల సుఖ దుఃఖములకు, సంపత్ - - విపత్తులకు, సుకృత, దుష్కృతాలకు భోక్తృత్వ రూపముచే ‘కారణము’ అగుచున్నాడు. ఆ విరాడ్రూపుని యొక్క కఫము - పిత్తము మొదలైన ధాతువులు విషమగతిని పొందినప్పుడు కలిగే వికారము వలన కలిగే దుర్భిక్షము మొదలైన సాధారణ దుఃఖములు ఆ విరాడాత్మ యొక్క అవయవ రూపమగు జన సమూహానికి సమానంగా ఉంటూ ఉంటాయి. దుర్భిక్షం, వర్షాభావం, ప్రళయం రావటం - పోవటం ఇవన్నీ జనసమూహానికి ఒకేసారిగా ఒక్కొక్కసారి సంభవిస్తూ ఉంటున్నాయి.

విరాట్రూపుని సత్తాయే ఈ సృష్టియొక్క సృష్టి రూప సత్తా! ఒకే కొమ్మపై నిలబడ్డ అనేకమంది మనుజులు కొమ్మ విరగగా అందరూ నేల కూలుతారు కదా! ఒక వృక్షంపై పిడుగు పడితే అందు నివసించే అనేక జీవులు భస్మీభూతులవుతారు. అట్లాగే కాకతాళీయ న్యాయంచేత ఒకే కాలంలో పరిపక్వమైన దుష్టకర్మలు కలిగినట్టి ప్రాణులందు దుఃఖాదులు వచ్చిపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడొక విశేషం ఉన్నదని నీవు గమనించు.

కర్మ కల్పనయా సంవిత్ స్వకర్మ ఫలభాగినీ

కర్మ కల్పనయోః ముక్తా న కర్మఫలభాగినీ॥

ఈ జీవుడు సంవిత్ స్వరూపుడు కదా! అట్టి సంవిత్ నాకు కర్మలు - - కర్మఫలాలు ఉన్నాయి కదా! ...అను రూపంలో ఉండే ఒకానొక స్వకీయమైన కల్పనను ఆశ్రయించినప్పుడు మాత్రమే 'కర్మలు - కర్మఫలాలు' అనేవి ఉంటాయి. కర్మ ఫలాల కల్పనచే తదనుకూలమైన - ప్రతికూలమైన ‘అనుభవం’ అనేది కూడా ఉంటుంది. వాస్తవానికి సంవిత్తు కర్మలకు - కర్మఫలాలకు (తదనురూపమైన కల్పనలకు) ముందే ఉన్న శుద్ధ స్వరూపంకదా! ఎప్పుడైతే సంవిత్తు "కర్మలు - కర్మఫలాలు నాకు లేవు. నాకు సంబంధించినవి కావు అనే నిర్ణయం పుణికి పుచ్చుకొని స్వస్వరూపాను సంధానంచే అభేద్యమై ఉంటుందో... అప్పుడు ఆ సంవిత్తు కర్మఫలగి అయ్యే అవకాశమే ఉండదు.

ఈ శరీరాలు, కర్మఫలాలు జాగ్రత్-స్వప్న-సుషుప్తులు రావచ్చు. రాకపోవచ్చు. సంవిత్ సర్వదా యథాతథం! కల్పనచే అనుభూతిపూర్వకమైన అనుభవం దాని వస్త్రంలాగా, ఉపకరణంలాగా రూపుదిద్దు కుంటోంది. కల్పన - అద్దానిని అనుసరించి ఉండే అనుభవం ఇవన్నీ సహేతుకమా? అహేతుకమా? యా యా యత్ర యథో ఉదేతి, కల్పనా అల్ప అధవా అధికా

సా సా తత్ర తథైవ అస్తే, సహేతుకమ్ - - అహేతుకమ్ ||

Page:421

ఏఏ కల్పన ఏఏ రీతిగా ఉదయిస్తుందో... అది ఆ కల్పన రూపంలోనే ఉంటుంది. - అది సహేతుకమా? అహేతుకమా? అధికమా? అల్పమా?... అని అడిగితే, సహేతుకంగా కల్పన చేస్తే సహేతుకం. అహేతుకంగా కల్పన చేస్తే అహేతుకం. అధికమనుకొంటే అధికం. అల్పమనుకొంటే అల్పం. కల్పనను అనుసరించే దేహ మనో-జాగ్రత్-స్వప్న సుషుప్తి అనుభవాలు, అవగాహనలు, అభిప్రాయాలు, సుఖాలు, దుఃఖాలు ఉంటున్నాయి.

వాస్తవానికి స్వప్నానుభవానికి కారణంగాని, సహకారి కారణాలుగాని లేవు కదా! కాబట్టి స్వప్నరూపంగా కనిపించేదంతా - అనాది, శివరూపము, అజము అయినట్టి చిద్రూపమగు పరబ్రహ్మమే అయివున్నది. స్వప్నంలో తెలివియే తెలియబడేరూపంగా కనిపిస్తోంది. జాగ్రత్ కూడా అట్టిదే! జాగ్రత్ కూడా స్వతఃగా అకారణం. కనుక చిద్రూపమగు పరబ్రహ్మమే అయివున్నది. నేను (మహాముని) : స్వామీ! ఇంతకీ నా ఎదురుగా ఉన్న ఈ గృహ - - బంధు స్వ

పరదేహాదులతో కూడిన ఈ దృశ్య జగత్తు సదాత్మకమా? లేక, అసదాత్మకమా? రెండవముని : నీ ప్రశ్నకు సమాధానం చెప్పియే ఉన్నాను. అయినా మరల చెప్పుచున్నాను. విను. నీవు సదాత్మకంగా భావన చేస్తే ఇదంతా సదాత్మకమే. అసదాత్మకంగా భావన చేస్తే ఇదంతా అసదాత్మకం, ఊహామాత్రం!, భావనామాత్రం (యద్భావం ... తద్భవతి)!

ఇదంతా అందుకే సదసదాత్మకం అని చెప్పబడుతోంది. అందుకే స్వప్న భ్రమలో కొన్ని సదాత్మకంగాను, మరికొన్ని అసదాత్మకంగాను, కొన్ని సకారణంగాను, మరికొన్ని అకారణంగాను భాసిస్తున్నాయి.

స్వప్నంలో సకల వృత్తులు కాకతాళీయ న్యాయంతో భాసిస్తున్నాయి. జాగ్రత్తు కూడా స్వప్నం వంటిదే! జాగ్రత్తులో అనుభవం కూడా స్వప్నంలోని అనుభవం వంటిదే! వీటికి కూడా మూలం యావృత్తియే! ఈ వ్యాప్తమై కంటికి కనిపిస్తున్న జగత్తు స్వప్నం కంటే భిన్నం కాదు. ఏ కార్య-కారణ క్రమము స్వప్నంలో ఉదయిస్తోందో... అదంతా కూడా 'ఆది చైతన్యము' యొక్క ప్రకాశ మాత్రమే అయివున్నది. నీవో... చైతన్యమే స్వరూపముగా కలిగియున్నవాడవై ఉన్నావు. చైతన్యము యొక్క నిర్ణయమే ‘జాగ్రత్’ అనబడు ప్రపంచమున స్థూల దృశ్యమునకు తదర్థపూర్వకంగా కారణమౌతోంది.

ఈ కారణం చేత “ఈ సమస్తము కూడా శాంతము - నిర్మలము అయినట్టి పరబ్రహ్మమే” ... అని బ్రహ్మజ్ఞులు ఎలుగెత్తి పలుకుచున్నారు.

మహాముని : ఓ మహామతీ! మీరు చెప్పే దానిని అనుసరించి సమస్త పదార్థములకు సత్యమగు బ్రహ్మమే కారణమనికదా చెప్పబడుచున్నది?

రెండవ ముని : అవును.

మహాముని : అయితే ఆ పదార్థములన్నీ బ్రహ్మమువలెనే “సత్యమే అయివుండాలి కదా!

రెండవ ముని : అవును.

మహాముని : అయితే ఈ ఈ పదార్థములన్నీ బ్రహ్మము వలెనే సత్యమేనంటావా?

Page:422

రెండవ ముని : అయితే... ఇక్కడ కొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాం. 1. బ్రహ్మము సత్యపదార్థముల యొక్క కారణమా? 2. లేక అది మిథ్యాపదార్థముల యొక్క కారణమా? 3. లేక అది సజాతి పదార్థముల యొక్క కారణమా? 4. లేక అది విజాతి పదార్థముల యొక్క కారణమా?

... పై నాలుగు పక్షములలోను

1. (ఒకటి) మరియు (మూడు) పక్షములను అనుసరించి... సత్య పదార్థముల యొక్క . సజాతి పదార్థముల యొక్క కారణం - బ్రహ్మము. అప్పుడు బ్రహ్మము నుండి బ్రహ్మమే ఉత్పత్తి అవుతుంది గాని, జగత్తు అనబడు మరొకటేదో కాదు.

2. (రెండు) మరియు (నాలుగు) పక్షములను అనుసరించి... మిథ్యా పదార్థములకు విజాతి పదార్థములకు కారణం - బ్రహ్మము! సత్యమగు బ్రహ్మము నుండి అసత్యమగునట్టిది ఉత్పన్న మవటమేమిటి?”

...ఈ విధంగా ఈ జగత్తు' అనబడే దానికి కారణమే లేదు. ఇది అకారణం (ఇక్కడ జగత్తు అంటే సజాతి - విజాతి పదార్థముల సమ్మేళనం) లేకుంటే ఇక్కడ గల ఆకాశమునకు కారణమేమిటి చెప్పు? అట్లాగే పృథివి మొదలైన సృష్టికి, అవిద్యకు, బ్రహ్మదేవునికి కూడా బ్రహ్మము నుండి వేరై ఉత్పన్నమవటానికి కారణమేమిటో చెప్పు? 'సృష్ట్యాది'లో ప్రకటిత, అప్రకటిత, ప్రదర్శిత, అప్రదర్శిత అనుభవమాత్ర రూపములే అయినట్టి వాయువు, తేజము, జలములకు కారణమేమిటి చెప్పు?

ఈ విధంగా ఈ జగత్తులోని పదార్థములన్నిటికీ కారణం సిద్ధించటంలేదు. కనుక ఇదంతా శూన్యమే అయివున్నది. అట్లాగే ఒకడు మరణించిన తరువాత మరొక దేహం సిద్ధించటానికి కారణమేమున్నది?... లేదు... కాబట్టి... ఆరంభం నుండి సృష్టులన్నీ కూడా ఇట్లాగే ప్రవర్తిస్తున్నాయి... అకారణంగా! ఇట్లా... నిష్కారణంగా 'జగత్తు' అనునది పొందబడుచున్నది... స్వప్నంలోలాగానే!

ఒకానొకడు ఒకచోట కూర్చుని ఆకాశంలోకి చూడసాగాడు. చూడగా చూడగా ఆతనికి చక్రాకారములు ఉత్పన్నమై, నశించుచున్నట్లు కనిపించసాగింది. అట్టి చక్రాకార ఉత్పన్న . నాశనములు ఆతనికి ఎందుకు కనిపించాయి? వాస్తవానికి ఆకాశంలో అవన్నీ ఉండవు కదా? ఆతనికి ఆతని దృష్టి భ్రమ చేతనే ఆకాశంలో చక్రాకారాలు కనిపిస్తున్నట్లుగానే, మిథ్యాభూతమైన ఈ జగత్తులన్నీ భ్రాంతిచే ఉత్పన్నములై, భ్రాంతిచే విలీనమైపోతున్నాయి.

నిష్కారణంగా ప్రవృత్తమై దృశ్య సంస్కార రూపమగు దృష్టియే 'సృష్టి' రూపంగా అనుభవమయ్యే హిరణ్యరూపమగు ఈ జగత్తు. అట్టి ప్రవృత్తిచే కనిపించే ఆయా వస్తుజాలంలో ఇది పృథివి, ఇది ఇల్లు, ఇది గ్రామం, ఇది పట్టణం, ఇది నాది, ఇది నీది ... మొదలైనవన్నీ నిష్కారణంగా చెన్నొందుచున్నాయి. బ్రహ్మమే అనేక రూపాలుగా అనుభవమౌతోంది.

మొట్టమొదట ఈ సృష్టులు చిదాకాశమున వాయువునందు చలనం" లాగా మనోరాజ్య సదృశ్యమై (భావనారూపమై) అతి సూక్ష్మంగా భావింపబడుచున్నాయి. ఆ తరువాత చిరకాలాభ్యాసంచేత

Page:423

ఆ భావనయే స్థూలభావన"గా రూపుదిద్దుకుని స్వయముగా ఈ దేహ - కర్మ - సకర్మ - దుష్కర్మ మొదలైన కారణములను కల్పిస్తోంది.

నియతి - మొట్టమొదట చైతన్యము ఎచ్చట - ఎట్లు ఏ కల్పన గావించుచున్నదో ... అచట ఆ రీతిగానే ‘నియతి’ స్వరూపమును స్వయంగా ధరించుచున్నది. స్వకల్పిత పదార్థాలలో స్వానుభవంచే సిద్దించే అనుభూతి ... అనేది ప్రతి జీవునికీ ప్రతిరోజూ అనుభవమగుచున్నదే సుమా! అనగా ఈ నీ - నా భౌతికదేహాలు కూడా చైతన్యము యొక్క కల్పిత రూపమే అయివున్నాయి.

సృష్టి వైపుగా అభిముఖమైనట్టి హిరణ్యగర్భ చైతన్యము... నేను నా నిజచిద్రూపముచే స్వయంగా ఈ ప్రకారంగా రూపములను ధరించెదనుగాక" -అనే సూక్ష్మ మనోభావనను ఆశ్రయించి, ఏఏ ప్రకాశాత్మకమగు రూపములను ధరించుచున్నదో, అవన్నీ నేటికీ అట్లే స్థితి కలిగియున్నాయి. అదియే నియతి’ అనే శాస్త్రార్థ శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అయితే, ఏ హిరణ్యగర్భ చైతన్యము ఇట్లు భావనారూప ప్రవాహ జగత్తుగా ప్రకాశమానమగుచున్నదో, ఆ చైతన్యమే అతిమహత్తరమైన ఉత్కృష్ట ప్రయత్నంచేత (తపశ్చర్య - ఆత్మజ్ఞానము మొదలైన ప్రయత్నముల చేత) ఇదంతా మరొక విధంగా గావించటానికి కూడా సమర్థమే అయివున్నది.

ఎక్కడ చైతన్యము కారణమును కల్పించుచున్నదో, .... అక్కడ ఆ కారణము యొక్క సఫలత్వం సంభవిస్తోంది. ఎక్కడ కారణత్వం కల్పించదో... అక్కడ ఆ కారణము కూడా అకారణమే అగుచున్నది.

మొట్టమొదట వాయువునందు చలనం ఎట్లా అకారణమో... ఆ వాయువు యొక్క వ్యాప్తం వలె భాసించే ఈ భావనా వ్యాప్త జగత్తు కూడా అసద్రూపమే అయి అప్పటికప్పుడు ఈ రీతిగా భాసిస్తోంది. ఇప్పుడు కూడా అట్లాగే భాసిస్తోంది. ఓ మిత్రమా! నీ భావనామాత్రమే నీచే పొందబడే జగత్తు. నీ యొక్క ‘నియతి' అనే పొట్లపాదుకు నారువేసి, నీరు పోసి పెంచి - త్రుంచుచున్నది నీవే!

నీవు 'సత్తు’ అనుకుంటే ఇదంతా సత్తే! 'అసత్తు' అనుకుంటే దేహ - జన్మ - మృత్యువులతో సహా అంతా అసత్తే. ఇక సమష్టిగా వచ్చే కష్ట - సుఖాల విషయానికి వస్తే... కొందరు జీవులు కలిసియే శుభాశుభ కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు. అట్టివారు ఆ కర్మల ఫలములను కలిసియే అనుభవిస్తూ ఉంటారు. వారిలో ఎవరైతే కర్తృత్వాభిమాన రాహిత్యముచే అకర్తలైయుండి, ఆయా సర్వ సంఘటనలకు తన్మయం కాకుండా, తమ అప్రమేయ స్వస్వరూపానుభూతి యందే ఉంటూ ఉంటారో, అట్టివారు దేహ - దృశ్యాదులు నిష్కారణమైనట్లు గ్రహించినవారై సంఘటనలను 'కారణ రహితం అని గ్రహించి ఉంటారు. అట్టివారికి ఈ ప్రపంచమంతా కల్పితమైన ఆటలో కల్పితమై నియమాదులు లాగా కనిపిస్తాయి.

నిష్కారణంగా దేహాదులు సంభవిస్తున్నట్లే, నిష్కారణంగానే సుఖ దుఃఖాదులు, తత్సంబంధమైన ప్రారబ్ధాదులు, భావనా ప్రవాహాలు సంభవిస్తున్నాయి ... అనేదే విజ్ఞుల అభిప్రాయం. అట్టి వాటిచే స్పృశించబడని సంవిత్స్వరూపమే ప్రతిజీవుని వాస్తవరూపం .. అనే దానిలో మాకు సందేహమే లేదు. గురువులు-శాస్త్రములు ఇది (తత్త్వమసి వంటి మహావాక్యాల ద్వారా గుర్తు చేస్తూనే ఉన్నారు!

Page:424

22. ఈ జగత్తు సంకల్ప నిర్మితం

మహాముని : ఓ వ్యాధుడా! ఆ విధంగా ఆ రెండవ ముని అనేక యుక్తుల ద్వారా సుదీర్ఘకాలం నాకు ఆత్మతత్త్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించారు. ఆయన బోధనచే నేను సర్వమునకు అప్రమేయపరిశుద్ధ స్వరూపమగు ఆత్మజ్ఞానమును పొందినవాడనయ్యాను.

ఆ తరువాత కూడా నేను ఆ రెండవ మునిని వదిలియుండనే లేదు. నా ప్రార్థనలతోను, సేవలతోను, అనునయ విన్నపాలతోను మా ఇంట్లోనే కొంతకాలం ఉండేటట్లుగా చేసుకొన్నాను. ఆయన దర్శనం కాకముందు నేను అనేక సాంసారిక భావావేశములతోను, అయ్యో! అది అట్లా ఉన్నదే! వీరు ఇట్లా మాట్లాడారే! మరి వీరికేమౌతుందో ఏమో! ఈ ఈ వస్తువులు వ్యక్తులు మొదలైనవి ఇట్లాగే ఉంటాయో? మరెట్లా ఉంటాయో?... ఇత్యాది అనేక సంశయ-ఆసక్తాదుల మధ్య మృత ప్రాయుడనైయున్న నేను వారి ఆత్మజ్ఞాన బోధనా ప్రభావంచేత అతి పవిత్రుడనైనాను. అంతా ఆత్మయే అనే అనిర్వచనీయమైన స్వానందానుభూతిచే ప్రశాంతుడను కాసాగాను. అయితే ఓ వ్యాధుడా! నీకు చమత్కారమని అనిపించవచ్చు. అటువంటి ఒకానొక విశేషం చెప్పమంటావా? వ్యాధుడు : స్వామీ! చెప్పండి!

మహాముని : ఏ నూతన వ్యక్తి స్వప్నలోకంలో ప్రవేశించి నేను తన్మయుడనై స్వగ్రామం, గృహము, భార్య, బంధువులు మొదలైన అనేక విషయాలలో నిమగ్నమై నా ఇతఃపూర్వపు ఆత్మజ్ఞానాన్ని ఏమరచానో, అట్టి ఆత్మజ్ఞానమును నాకు గుర్తు చేసి సుబోధను నిర్వర్తించిన మహనీయులగు ఆ సద్గురువు... అదిగో, ఆ ఆసనంపై కూర్చుని మన ఈ సంభాషణను మౌనంగా వింటున్నారే, ఆయనే!

ఆయన - - పూర్వాపరాలు ఎరిగినవారు. తనయందు 'మోహం' అనే క్రీనీడ కించిత్ కూడా లేనివారు. మోహ వినాశకులు. చంద్రోదయం వంటి శీతల శుభవచనాలు నాతో పలికి ఉన్నట్టి వారు. శరీరాన్ని ధరించి వచ్చి నా అనేక జన్మ సుకృతరూపుడై ఒప్పుచున్న వారు. ఈ దయాళువైన మునీశ్వరుడే నా కప్పుడు ఉపదేశం చేసిన మహాత్ముడు. వారిని దర్శించు. నమస్కరించు.

అగ్నిదేవుడు (విపశ్చిత్తుతో) (మహాశవము యొక్క పూర్వ వృత్తాంతం వివరిస్తూ....) అగ్నిదేవుడు : : అప్పుడు ఆ వ్యాధుడు, “ఈ మహాముని ఎవరో అపరిచితవ్యక్తి స్వప్నంలో ప్రవేశించట మేమిటి? ఆ స్వప్నలోకంలో కనిపించిన ఆ రెండవముని మన మహాముని యొక్క జాగ్రతగత్తులో ఉండటమేమిటి? ...అని ఆశ్చర్యచకితుడు కాసాగాడు. ఖిన్నుడు అవసాగాడు. ఉద్వేగం ఆపుకోలేక, ఆ మహామునిని ఇట్లా ప్రశ్నించాడు.



వ్యాధుడు : ఓ మహామునీ! సంసార తాపమును తొలగించటంలో అతి ప్రావీణ్యులైన ఓ మహాత్మా! ఇప్పుడు మీరు చెప్పుచున్న విషయం అత్యాశ్చర్యకరమైనది, మనసు అవిశ్వసనీయమైనది కూడా!

Page:425

స్వప్నంలోని మీ ఉపదేశకుడు ఇక్కడ జాగ్రత్తులో ప్రత్యక్షమై ఉన్నారనే విషయం మీరు చెప్పటం, వారు నాకు ఇక్కడ ఎదురుగా ఈ జాగ్రత్తులో కనిపించటం ... నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. బాలుని బుద్దిలో (లేక ఊహలోగల) బేతాళుడు (బూచివాడు) నిజంగానే ఎదురుగా కనిపించాడనటం ఎట్లాగో ...మీరు చెప్పినది అట్లే ఉన్నది. స్వప్నంలో కనిపించిన ఆ రెండవ ముని ఈ జాగ్రత్తులోకి ఎట్లా రాగలిగారు? ఏ కారణంచేత వచ్చారు? వీరు నాకు కూడా ఎట్లా కనబడుచున్నారు. అసలింతకీ ఇది నాకు స్వప్నమా? జాగ్రత్తా? ఇదంతా నాకు పరమాశ్చర్యకరంగా ఉన్నది! (అని అంటూనే లేచి ఆ ద్వితీయ మునికి పుష్పాంజలి సమర్పించి, తిరిగివచ్చి మహామునికి ఎదురుగా ఆశీనుడైనాడు). మహాముని : ఓ సౌభాగ్యశీలుడా! వ్యాధుడా! ఆ ఆశ్చర్యకరమైన వృత్తాంతమంతా సంక్షిప్తంగా వివరిస్తాను. విను.

ఇందులో ఏమీ సందేహం లేదు. మన ఎదురుగా ఉన్నతాసనంపై ఆసీనులై మన ఈ సంవాదమును మౌనంగా వింటున్న ఈ మహాత్ముడే అప్పుడు నాకు తన వాక్రవాహం చేత ఆత్మజ్ఞానం ప్రసాదించియున్నారు. ఈయన ఉపదేశములు వినటం చేతనే నా యొక్క అనాది సిద్ధమగు సన్మాత్ర స్వభావమును స్మరించటం జరిగింది. ఈయన గుర్తు చేసిన తరువాతయే ఓహో! నేను శుద్ధాఃతఃకరుణుడనగు మునిని అయివుంటిని కదా ... అని గుర్తు చేసుకున్నాను. శుద్ధ హృదయముచే స్నానం చేసినవాడనైనాను. మనం చెప్పుకొన్న సంఘటనను కొనసాగిస్తున్నాను విను.

ఈ మహాముని అనేక ప్రవచనాలు విన్న తరువాత నేను నా గదిలో ఆసీనుడనై ఇట్లా ఆలోచించసాగాను.

ఒకడు ఎంతో దాహంతో సుదూర మృగతృష్ణవైపు జలం కోసం పరుగులు తీస్తే ఏమౌతుంది? దాహం తీరదు. జలం లభించే ప్రసక్తే లేదు. (అది మృగతృష్ణ కదా! జలం యొక్క భ్రమయే గాని, వాస్తవ జలం కాదు)! పైగా అనవసరమైన శ్రమ! దాహం మరింతగా బాధించటం! ఇదీ పర్యవసానం.

నేను ఆ ఒకానొక అపరిచిత వ్యక్తి స్వప్న ప్రాంగణంలో ప్రవేశించి, ఆతని స్వప్నలోకంలో గల ఒక గ్రామంలో సాంసారికమైన వ్యవహారాలలో నిమగ్నమై ఆనందం కోసం వెతకటం అటువంటిది. ఆహా! ఎంత కష్టమైన విషయం! ఒక మునిగా, అనేకులకు ఆత్మజ్ఞానం బోధించే గురువుగా ఆ ఆశ్రమంలో నివసించే నేను స్వప్నం యొక్క తత్త్వమేమిటో గ్రహించాలని ఎవరో ఆశ్రమానికి ఎదురుగా గల బాటలో వివాహ భోజనానంతరం ఇంటికి వెళ్ళుచున్న ఒక అపరిచితుని స్వప్నంలో ప్రవేశించి అజ్ఞానినై ఆయా సంబంధ బాంధవ్యములతో కూడిన గృహంలో మూఢునివలె ఉండి పోవటమేమిటి? బాలుడు భూతమునకు సంబంధించిన కథనంచే మోసగించబడినట్లు, ప్రాజ్ఞుడనై ఉండికూడా భ్రమ మాత్రము - అసత్తు అయినట్టి దృశ్యము యొక్క ప్రాప్తిచే మోసగించబడ్డానే? సర్వ ప్రయోజన శూన్యమై విజృంభిస్తూ ఉండే ఈ మిథ్యాభూతమగు దృశ్యము నందు నేను ఇట్టి శోచనీయ పరిస్థితులలో పడి ఉన్నానే! ఇంతే కాదు.

Page:426

నేను ఇది కాదు” నా హమితి; “నేను అదియే - సో హమ్; ఇది వదలాలి, అది చేరాలి" - త్యాగే నైవతు కైవల్యం... ఇవి కూడా భ్రాంతిమాత్రములే గాని, సన్మయములు కావు.

అసలీ భ్రాంతులన్నీ దేనికి సంబంధించినవో, ఎవరికి సంబంధించినవో చెప్పలేకపోతున్నానే! ఆహా! కేవల సాక్షి రూపమగు సాక్షి చైతన్యమే నేను గాని, తదితరమేదీ అవటానికి వీలులేదే! అట్టి సాక్షి చైతన్యము ఏఏ అసద్రూపము యొక్క ఆడంబరము (నటన) గావించుచున్నదో... అందు ఎన్నెన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నాయి!

ఈ శరీరం నేను కాదు. మాయగాని, దృశ్యముగాని లేదు. లేనిది ఉన్నట్లుగా అనిపించటమే నా భ్రమ. భ్రమ నుండి నేను తొలగాలి.భ్రమలో చిక్కుక్కున్నాను అనునది కూడా భ్రమయే అయివున్నది.

ఆహా! ఏమి ఈ దృశ్యం! సమస్తం మిథ్యయే అయివున్నప్పటికీ సత్తువలె స్థితి పొంది ఉన్నది కదా! ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? క్రొత్తగా రావలసినదేమిటి? పోవలసినదేమిటి? నాకు బంధం ఉన్నది... అనేది భ్రమయే కదా! ఈ కనబడే బంధుత్వాలు, బాధ్యతలు... ఇవన్నీ ఇక్కడి కల్పితమైనవేగాని... నావి కావు. ఈ మహనీయునితో సంభాషించకముందు, నాకు బంధ ఛేదన సంబంధితమైన జ్ఞానాభ్యాస రూపమగు ఒకానొక ప్రయత్నం (లేక), వృత్తి బయలుదేరుతూ ఉండేది. ఇప్పుడు ఈ మహానుభావుని వాక్యాలు విన్న తరువాత ఆ బంధం తొలగాలి" అనే బంధఛేదనా వృత్తి కూడా త్యజించివేయవలసినవేనని నా కనిపించింది. ఎందుకంటే సమస్త వృత్తి రహితమై, సమస్తమునకు జ్ఞేయమై, కేవలం జ్ఞానరూపమగు ఆత్మయందే కదా నేను సర్వదా రమించవలసినది! రమించవలసిన ఆత్మయందు సర్వదా ఉండియే ఉన్నాను కదా! తెలియబడే సర్వమును దాటివేసి కేవలము తెలియుటయే తన రూపంగా గల ఆత్మయందే రమించెదనుగాక!

ఆస్తామేతత్ అవిద్యైషా వ్యర్థరూపా కిమేతయా

భ్రాన్త్యా భ్రాంతిః అసద్రూపా త్యక్యైవ ఏషా మయాధునా ॥

ఈ జగత్తు అవిద్యా భ్రాంతి రూపమేకదా! మిథ్యయేకదా! విద్యావృత్తి లోంచి చూస్తే ఈ జగత్ యొక్క భ్రమరూపమైన అవిద్యా వృత్తి సర్వదా కల్పితమే అయివున్నది. ఇప్పుడు క్రొత్తగా అద్దానిని త్యజించవలసినది మాత్రం ఏమున్నది? అది ఉంటే ఉండనీ! నాకొచ్చే నష్టమేమున్నది? ప్రతిరోజు రాత్రి కలలో ఏవేవో దృశ్యాలు కనిపిస్తాయి. మెళకువ వచ్చేసరికి, “అవన్నీ భ్రాంతియే” అని తెలిసియే ఉంటోంది కదా! ఇక నాకు కలలు రాకపోతే బాగుండును ...అని అనుకుంటు న్నామా? లేదే! అట్లాగే “ఈ జగత్తులో భ్రాంతికి సంబంధించిన భ్రమలు తొలగిపోవాలి ...అని మాత్రం ఎందుకు శ్రమ! నేను ఆత్మయందు రమిస్తూ ఉంటే చాలు! అవి ఉన్నప్పుడు ఉంటాయి, పోయినప్పుడు ఎటుతిరిగీ పోతాయి...! ఆహా! ఈ ముని నా యొక్క ఉపదేశకుడు. నేను ఈతని శిష్యుడను. ఈ మాట నిజమే! అయితే ...

ఉపదేష్టామునిః అయమేషో అత్ర భ్రాంతి మాత్రకమ్ | బ్రహ్మైవాహమ్ ఇవా భాతి రూపమేతత్ ఇవా భ్రవత్

Page:427

“ఈ ముని నా ఉపదేశకుడు. నేను ఈతని శిష్యుడను ... అనేది కూడా భ్రాంతియే! ఆకాశంలో మేఘాలు కనబడుచున్నాయి. ఆ మేఘాలు పురుష పర్వత వనాది అనేక ఆకారాలుగా కనబడవచ్చు గాక! అవన్నీ మేఘాలే కదా! అంతకుమించి ఆకాశంలో ఏమున్నాయి? అట్లాగే బ్రహ్మమే నాయొక్క ఈ ముని యొక్క రూపములు దాల్చుచున్నది. బాగున్నది. అయితే ఎవని వలన అయితే నాకు జ్ఞానం ఉదయించిందో... ఆ మునికే నా అభిప్రాయం తెలుపుతాను. వర్తమానానుభవ విషయాలను జ్ఞానదృష్టితో ఆయనతోనే చర్చిస్తాను.

మహాముని : ఓ లుబ్దకుడా! నేను పై రీతిగా యోచన చేస్తూ, మరల ఈ రెండవ మునిని సమీపించాను.

నేను (మహాముని) : ఓ మునీశ్వరా! మీరు నా జ్ఞాన చక్షువులు తెరిపించారు. స్వామీ! నేను ఒకప్పుడు నా నిజాశ్రమం నుండి ఈ బాటసారి స్వప్న జగత్తులో ప్రవేశించెదను గాక ...అని ప్రవృత్తుడనై బయలుదేరాను కదా! ఏ ప్రాణియొక్క శరీరంలోకి నా ప్రాణ సహిత సూక్ష్మదేహంతో ప్రయాణించానో... ఆ ప్రాణి యొక్క భౌతిక దేహం ఒకసారి సందర్శించాలనుకుంటున్నాను. బయలుదేరి వెళ్లి చూడాలని నాకు కుతూహలంగా ఉన్నది.

రెండవ ముని : (పక పకా నవ్వు)

నేను (మహాముని) : అదేమిటి మహాత్మా! నా వాక్యాలు విని పగలబడి నవ్వారు?

రెండవ ముని : ఏమీ లేదయ్యా! ఆ ప్రాణి యొక్క - నీ యొక్క (ముని దేహం) దేహాలు ఇప్పు డెక్కడున్నాయి? అవి రెండూ ఎప్పుడో భస్మీభూతమై గాలిలో కలిసిపోయాయి.

సరే! అయినా ఎందుకు? నీవు వృత్తాంతములను ఎరుగుటలో అతిచతురుడవైన భాగ్యశాలివి కదా! నీవే స్వయంగా వెళ్ళి చూడు. ఆ వృత్తాంతమంతా స్వయంగా ఎరుగగలవేమో!

అది విని నేను నా యొక్క ఆ బాటసారి ప్రాణి యొక్క దేహముల స్థితిగతులు ఏమిటో తెలుసుకోవటానికి అక్కడి నుండి బయలుదేర నారంభించాను. నేనిప్పుడు స్వప్న దేహుడనే కదా! స్వప్నమే నా ఈ దేహరూపం కదా! అనే బుద్ధి యొక్క విచారణచే ఆ కల్పితమగు స్వప్నరూపం త్యజించాను. నా యొక్క ప్రాణోపహిత చిదాత్మ రూపమైన జీవుని-ప్రాణముల ద్వారా వాయు సమూహంలో నియోజించాను. అట్లా ప్రయాణం ప్రారంభించేముందే ఆ మునీశ్వరునితో "ఓ మునీ! నేను నా పూర్వ దేహం చూచి వచ్చేవరకు మీరు ఈ గృహంలోనే ఉండండి. మీకు ఈ కుటుంబ సభ్యులు సర్వసేవలు నిర్వర్తించగలరు... అని చెప్పి ఇక బయలుదేరాను. క్రమంగా 'వాయువు' అనే రథాన్ని ఎక్కి అనంతాకాశంలో పుష్పము యొక్క సుగంధంవలె పరిభ్రమించాను.

ఎంతగా అట్లా వాయువునందు పరిభ్రమించినా కూడా నేను ప్రవేశించియున్న ప్రాణి యొక్క కంఠబిలం కనిపెట్టలేకపోయాను. మరే బాహ్యమార్గం నాకు కనిపించనే లేదు. అప్పుడు ఆకాశంలో

Page:428

సంచరించే నేను బాహ్యమార్గమేదీ దొరకక చాలా దుఃఖం పొందాను. “ఇక లాభం లేదు”... అని అనుకొని మరల స్వప్నంలోని ఆ గ్రామంలోగల స్వగృహం చేరాను. తిరిగి భౌతిక శరీరధారినై మహాత్ముడగు ఈ మునీశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేసి ఏకాగ్ర చిత్తంతో ఇట్లా ప్రశ్నించాను.



నేను (మహాముని) :

కిమేతత్ భగవన్! బ్రూహి! పూర్వాపరవిదాంపర!

త్వం పశ్యసి యథావృత్తమ్ ఉత్తమ జ్ఞాన చక్షుషా!

హే భగవాన్! పూర్వాపరములను ఎరుగటలో అతి ప్రావీణ్యులగు ఓ మహాత్మా! నేను సూక్ష్మ శరీరధారినై జీవాత్మను వాహనంగా చేసుకొని వాయువులో ప్రవేశించి ఆ ప్రాణియొక్క కంఠబిలం ద్వారా తిరిగి బాహ్యానికి వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించాను. కాని నాకు త్రోవ దొరకలేదు. మరి మీరు నా దేహము గురించి, ఆ ప్రాణి యొక్క దేహం గురించి “అవి నశించాయి” ...అని ఎట్లా చూచారు? ఎట్లా చెప్పగలిగారు? నేను ఎవని యందు ప్రవేశించానో... ఆతని దేహం ఎక్కడికి పోయింది? ఏ దేహం నుండి ఉత్సుకతతో బయల్వెడలానో... ఆ నా దేహం ఏమయింది? నేను వాయు తరంగాలలో ప్రవేశించి ఈ ప్రపంచంలోని స్థావరాలు మొదలుకొని మూలమూలలా గాలించాను. ప్రపంచమంతా పరీక్షించి వచ్చాను మరి ఆ ప్రాణి యొక్క కంఠ బిలంగాని, బహిర్గతమైన ఏ మార్గంగాని నాకు ఎందుకు లభించలేదు?

రెండవ ముని : ఓ మిత్రమా! నేను చూచివస్తాను... అని బయలుదేరావేగాని అందుకు ఉపాయమేమిటి? ...అని నన్ను అడగనేలేదు కదా! నేను ఉపాయం చెప్పకుండా నీ స్వబుద్ధితో ఆ

వృత్తాంతం గమనించలేకపోయావు.

సరే! అయినా... ఆ వృత్తాంతమంతా దర్శించటానికి నీవు ఎక్కడికో వెళ్ళనక్కర్లేదే! ఒకవేళ ఆ చోటికి వెళ్ళితే మాత్రం అక్కడ ఇప్పుడేం కనబడుతుంది చెప్పు? (నీ భౌతిక నేత్రాలకు ఒకచోట ఎప్పుడో జరిగిపోయిన సంఘటన ఇప్పుడు కనిపించదు కదా!). ఆ సంఘటన (ఆ వృత్తాంతం) చూడాలనుకొంటే... యోగముచే ఏకాగ్రమైన చిత్తముతో చూడు. అప్పుడు జ్ఞాననేత్రముచే దీనినంతా సంపూర్ణంగా చేతిలోని కమలపుష్పంగా చూడగలుగుతావు.

నేను (మహాముని) : హే మహానుభావా! ఆ వృత్తాంతమంతా (ఆ నా యొక్క - ఆ ప్రాణి యొక్క దేహముల స్థితి - గతులను గురించి) మీరే చెప్పండి- . మీరు చెప్పుచుండగా వినటంచేత నా అజ్ఞాన భ్రాంతులకు అది ఔషధమై, అవన్నీ మొదలంటా తొలగుతాయి.

రెండవ ముని : అయితే విను, చెపుతాను.

నీ పూర్వదేహ వృత్తాంతం వినటానికి ముందుగా... మొట్టమొదట నీ నీ జీవతత్త్వం గురించి చెపుతాను. నీకు నీ ఈ వ్యష్టి రూపం ఇప్పుడు అనుభూతమౌతోంది కదా!

Page:429

అయితే... ఒకానొకప్పుడు నీవు వ్యష్టి జీవరూపుడవు కాదు సుమా! విష్ణు భగవానుడు సర్వప్రాణుల యొక్క 'పుణ్యము' అను కమలములను 'ఫలప్రదానము' ద్వారా వికసింపజేస్తూ ఉంటాడు. ఆయనయే సమస్త సుఖములకు నిలయుడు. జ్ఞానమే స్వరూపముగా కలవాడు. అట్టి కేవల సత్త్వస్వరూపుడగు విష్ణు భగవానుని నాభి కమలమునందు రజోగుణ స్వరూపంలో ఆసీనుడవు, సర్వజీవ సృష్ట్యాత్మయగు హిరణ్యగర్భుడవే నీవు.

సమష్టి రూప సృష్టి కర్తవై చరాచర సృష్టిలోని విశేషములకు రచయితవై, విదిత వేద్యుడవై, సర్వ జీవులకు - వారి మనోభావాలకు - వారి అనుభూతులకు మూలాధారం అయి చెన్నొందుతూ ఉండేవాడివి. అట్టి హిరణ్యగర్భుడవగు నీకు ఒకానొకనాడు ఒక ఆలోచన వచ్చింది.

ఈ సమష్టిరూప సృష్టికర్తనై సుదీర్ఘకాలం గడిపాను కదా! బాగానే ఉన్నది. అయితే... వ్యష్టిరూప స్వప్నం ఎట్లా ఉంటుందో మరి!" అట్టి నీ అభినివేశము ఒక రూపుదాల్చింది. అట్టి మనోరాజ్యరూపమగు ఆలోచన' యందు ఒకానొక ఆశ్రమంలో తాపసుడవు అయ్యావు! అక్కడ నీ వ్యష్టిభావం క్రమంగా పరిపుష్టం కాగా... అట్టి వ్యష్టిభావ జ్ఞానంచే స్వప్నం యొక్క రూపం ఏమిటి? ...అనే కౌతుకంచేత ఒకానొక ప్రాణియొక్క హృదయంలో ప్రవేశించావు. ఆ ప్రాణి హృదయంలో ప్రవేశించగానే... అచ్చట విస్తీర్ణమైన, అతి విశాలమైన, పృథ్వి / ఆకాశం మొదలైన వాటితో గూడిన ఈ త్రైలోక్యమును గాంచుచున్నావు. ఈ విధంగా నీవు ఆ ప్రాణి శరీరంలో చిరకాల స్వప్న దర్శనంలో నిమగ్నుడవై - వ్యగ్రుడవై ఉన్నావు.

ఇక నిద్రించుచున్నట్టి నీ యొక్క యొక్క - ఆ ప్రాణి యొక్క శరీరములు ఉన్న ఆ గ్రామం చుట్టుపట్ల గల అరణ్యం దావాగ్నిచే భగ్నమయింది. ఆ దావాగ్ని క్రమంగా నీవు నివసించిన ఆశ్రమమును, ఆ ప్రాణి నిద్రించిన గృహమును దగ్ధం చేసివేశాయి.

వ్యాధుడు : మునీంద్రా! అక్కడ దావాగ్ని ఆశ్రమం - గ్రామం దహించవేయటానికి అనేకమంది జీవులను భస్మం చేసివేయటానికి కారణమేమైనా ఉన్నదా? తాము ప్రవేశించిన ఆ గ్రామస్థుని భౌతిక దేహం, తదితర అనేకమంది దేహాలు ఒకే సమయంలో భస్మమవటానికి 'ఇదీ కారణం’ అనతగినది ఏమై ఉన్నది?

మహాముని : ఓ వ్యాధుడా! ఈ భౌతికంగా కనిపించే జగత్తు సంకల్ప నిర్మితం. ఏది సంకల్పం చేత నిర్మించబడినదో అది సంకల్పములచే ఉదయించటం, సంకల్పములచే క్షయించటం అనేది సహజమే కదా! ఒక వ్యష్టి యొక్క సంకల్పముల ఉత్పత్తికి - సంకల్పముల క్షయానికి ఆతని మనస్సే కారణం కదా! అట్లాగే... ముల్లోకముల యొక్క సంకల్పకుడగు బ్రహ్మదేవుని మనః స్పందమే ఈ త్రైలోక్య జగత్తు. కనుక ఈ ముల్లోకముల క్షయ-ఉదయములకు ఆతని మనఃస్పందమే హేతువై ఉన్నది. హృదయంలో కలిగే క్షోభ-అక్షోభాలందు, శాంతి-అశాంతులందు అద్దాని కారణం మనోసంచలనమే అయివున్నట్లే,... ప్రపంచంలోని అవాంతర క్షోభ అక్షోభాలకు బ్రహ్మదేవుని మనస్సు యొక్క శ్రీఘ్ర సంచలనమే కారణమైయున్నదని వేదజ్ఞులమగు మేము గమనిస్తున్నాం.

Page:430

బ్రహ్మదేవుని సంకల్ప నగరమే ఈ జగత్తు. ఆతని మనఃస్పందమే ప్రజలయొక్క ఉత్పత్తిక్షయములకు, క్షోభ-అక్షోభలకు వర్ష-అవర్షాదులకు కారణమైయున్నది. ఇదంతా చిదాకాశం యొక్క మాయా విభాగమయి అన్యత్ర”వలె కల్పితమైయున్నది. చిదాకాశము యొక్క కల్పనాపరంపరయందే ఈ దృశ్యము అవస్థితమైయున్నది.

చిదాకాశమున చిదాకాశమే అజ్ఞానదృష్టికి జగద్రూపంగా స్ఫురిస్తోంది. అట్లా కాకుండా, "ఈ జగత్తు ఏ రూపంగా భౌతికంగా కనిపిస్తోందో అదే ఇద్దాని సత్యమగురూపం అనేది మూర్ఖుల దృష్టి (అజ్ఞానుల దృష్టి) అని విజ్ఞుల ఉద్దేశం. అట్టి దృష్టి పరమార్థమున సత్యం కాదు. అది మిథ్యయే అయివున్నది.

23. భావములకావల అభావ సంవిత్

అన్యముని : ఓ మిత్రమా! నీ పూర్వాశ్రమ ప్రదేశంలోగల ఆశ్రమమే కాకుండా,... అక్కడ గల నగర-గృహ-వృక్షాదులన్నీ కూడా అగ్నికి ఆహుతి అయినాయి. ఆ వేడికి ఆ ఆశ్రమం ఆ గ్రామానికి రెండు వైపులా ఏర్పడి ఉన్నట్టి రెండు మహాశిలలు ఫెటేల్న పేలిపోయాయి. నిద్రిస్తున్నట్టి నీ యొక్క (మరియు), - ఆ ప్రాణి యొక్క శరీరాలు దగ్ధమైపోయాయి. ఆ అగ్ని శమించిన తరువాత బూడిద మిగిలింది. అది కూడా గాలిచే చెదరగొట్టబడింది. కనుక ఇప్పుడా శరీరాలు ఎక్కడున్నాయంటే ఏమి చెప్పను? స్వప్నంలో కనిపించిన నగరం మెళుకువ తరువాత ఏమైపోయిందో తెలియనట్లే... ఇప్పుడా గృహాలు, ఆ దేహాలు ఆ తరువాత ఏమిటనేది ఏమీ చెప్పలేం!

ఒక ప్రక్క మీ ఇరువురి శరీరాలు భస్మీభూతమౌతూ ఉంటే... నీవు మాత్రం ఇక్కడ ఈ స్వప్న భ్రమలో వర్తిస్తున్నావు. అయితే, ఇక్కడ ఒక్క విషయం సర్వదా గమనించు. నీ సంవిత్తే ఇక్కడ ఈ స్వప్నమయ దేహంతో ప్రవర్తిస్తోందయ్యా!

ఇక ఆ ప్రాణి దేహం భస్మమైపోవటంచేత ఆతని కంఠబిలం నీకెక్కడ లభిస్తుంది చెప్పు? ఈ స్వప్నలోకమునకు విరాడ్రూపుడైయున్న ఆ ప్రాణి ఎచట? హృదయ తేజో యుక్తుడగు ఆ ప్రాణి యొక్క శరీరం దగ్ధమైపోయింది కదా! అందుచేత ఆ రెండు శరీరాలు నీకు లభించక ఇప్పటి ఈ అనంతమైనట్టి స్వప్నమయ ప్రపంచ రూపమగు ఈ జాగ్రత్తులో వర్తిస్తున్నావు.

ఇదంతా క్రమంగా నీ స్వప్నమే అగుచున్నది. నీ స్వప్నమే ఇచట జగత్ భావం పొంది ఉన్నది. ఇక్కడ మేమందరం నీ యొక్క స్వప్న పురుషులం! నీవేమో మా యొక్క స్వప్న పురుషుడవు.

అయితే.... చిదాకాశము తన అద్వయ స్వరూపమును ఏమాత్రం త్యజించకయే ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే మూడు అవస్థలలో స్థితి కలిగి ఉంటోంది. మొట్టమొదట నీవు స్వప్న పురుషుడవయ్యావు. ఆ తరువాత జాగ్రత్ పురుషుడవై ఇక్కడ గృహస్థ ధర్మాలలో నెలకొని ఉన్నావు.

Page:431

ఈ విధంగా నీకు అనుభూతమౌతున్న దృశ్యరూప వృత్తాంతమంతా యథారీతిగా వర్ణించి చెప్పాను. నీకు ఇంకా ఏమైనా సందేహమున్నదా? ఒకవేళ ఉంటే... నీవు కూడా ధ్యానంచే నేను చెప్పినదంతా స్వయంగా గాంచవచ్చు కూడా!

ఈ ప్రకారంగా... పరమాత్మ ఆది మధ్యాంతరహితమై, అనంతరూపమై, సంవిత్ ఘన రూపమై ఉన్నది. ఆకాశంలో సువర్ణకాంతిలాగా అట్టి పరమాత్మ నిజ విశాల స్ఫురణశక్తి'... అనే ఆభరణం దర్శించి ఉంటున్నారు. అట్టి నిజస్ఫురణ శక్తిచే ఈ చంచల దేహధారణం చేస్తున్నారు. ఈ ఈ శరీరము ధరిస్తూ ఇచ్చట సత్-అసత్ కర్మలయొక్క ఆ ఆ సత్-అసత్ కర్మ ఫలముల యొక్క వికసిత పుష్పరూపములగు స్థితి గతులను ఆస్వాదిస్తున్నాడు. వాస్తవానికి తన ఆత్మస్వరూపం సర్వదా యథాతథం. ఈ దృశ్య వ్యవహారమంతా స్వయంకృతమైన లీలా విశేషం. ఈ భావములన్నిటికీ ఆవలగల అభావ స్వరూపమే నీవు. అదియే నేను. అదియే సర్వజనులు కూడా!

24. ముందు జరుగబోయేది...!

మహాముని : వింటున్నావా వ్యాధుడా! ఆ విధంగా ఈ అన్యముని నాతో పలికి మౌనం వహించారు. నేను ఆశ్చర్యచకితుడనయ్యాను.

నేను సమష్టిగత రూప హిరణ్యగర్భత్వమును ఏమరచి... కుతూహలంచేత వ్యష్టిగతమైన స్వప్న దర్శనం కొరకై పరుగులెత్తనా? 'మునిదేహం' అనే స్వప్నసదృశ వ్యవహారమును ఆశ్రయించటమా? ముని దేహం తదితరమైన అక్కడి దేహాలన్నీ భస్మీభూతం కావటమా? ఇప్పుడేమో స్వప్న జగత్తులో ప్రవేశించినట్టి ఈ స్వప్న జాగ్రత్ రూపమగు కుటుంబ వ్యవహారాదులలో చిక్కుకొని ఇచ్చట సుదీర్ఘకాలం గడుపుచుండటమా? ఇక్కడి ఈ గ్రామం, నా భార్య, పిల్లలు, ఈ బంధువులు, ఈ జీవితం ఇవన్నీ స్వప్న సదృశమేనా?... ఇవన్నీ నాకు యోచించగా యోచించగా నమ్మశక్యంగా అనిపించలేదు.

చాలాసేపు యోచించిన తరువాత, మరల విశ్రమించియున్న ఈ మునీశ్వరుని సమీపించి ఇట్లాఅన్నాను.

నేను (మహాముని) : స్వామీ! భగవన్! గురుదేవా! మీరు చెప్పినదంతా నాకు చాలా ఆశ్చర్యకంగా ఉన్నది. ఇక్కడ నాకు యథార్థంగా నా ఈ కుటుంబ సభ్యులు, ప్రక్క ఇంటివారు, ఈ గ్రామం, సమీప గ్రామంలోని మా బంధువులు... చాలా కాలంగా పరిచితులైన స్నేహితులు... ఇవన్నీ ఈ విధంగా ఉండగా... ఇదంతా స్వప్నసదృశం కాదని, ఇది యథార్థమేనని నా కనిపిస్తోందే! అన్యముని : మిత్రమా! నీవు కొంతకాలం క్రితం జరిగిపోయిన ఒక సంఘటనను జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నావనుకో. అప్పటి 'జ్ఞాపకం'లో చూచిన అప్పటి జాగ్రత్ సత్యమా? (లేక) అప్పటి నీ సంకల్పములను అనుసరించి మాత్రమే అది అట్లు ఉండి ఉన్నదా?

నేను : అప్పటి ఆ యొక్క జాగ్రత్తు సంకల్ప నిర్మితమే (ఊహానిర్మితమే) అని ఇప్పుడు అనిపిస్తోంది.

Page:432

అన్యముని : భావన - - ఊహయే కదా! కాబట్టి, ఊహచే దర్శించబడే ఈ జాగ్రత్తు ఊహకాక మరింకేమిటి? ఎప్పుడైతే జాగ్రత్తుయే ఊహామాత్రమేనని, సత్యం కాదని నిరూపించబడుతుందో, ఇక స్వప్నం గురించి వేరుగా చెప్పేదేమున్నది చెప్పు? ఈ జాగ్రత్తుయే మిథ్యాభూతమై ఉండగా ఒక 'స్వప్నం సత్యం' అనటానికి ప్రమాణమేమున్నట్లు?

ఏ విధంగా స్వప్నం భాసిస్తోందో... అట్లా సృష్ట్యాదిలో ఈ జాగ్రత్ జగత్తు భాసిస్తోంది. వాస్తవానికి ఈ జగత్తు పృథివీ (భూమి ఇత్యాది) రహితమైనప్పటికీ, (భావనామాత్రమే అయినప్పటికీ) ఇది పృథివి మొదలైనవాటితో సహా ఒప్పుచున్నది.

ఓ మునీ! ఓ వ్యాధ మహాగురూ! ఈ వర్తమాన స్వప్నసృష్టి పరమార్థమున నిర్మల చైతన్యమే అయివున్నది. స్వతహాగా నీకు కనబడే జగత్తు జగత్తు కాదు. నీ భావనా పరంపరా వ్యవహారమే నీకు కనబడే జగత్తు.

ఇక ఇద్దానికి కారణమంటావా? ఈ జాగ్రత్తుకు స్వప్న మాత్ర సత్తా కూడా లేదని చెప్పవచ్చు. ఎట్లాగంటే ఒకడు పగలంతా జాగ్రత్లో సంచరించి రాత్రికి స్వప్నంలో ప్రవేశిస్తున్నాడు. జాగ్రత్ నందు చూడబడిన శబ్ద - తదర్థములచే బుద్ధియందు కొన్ని సంస్కారములు ఏర్పడుచుండగా... ఆ స్వసంస్కారములు రాత్రియందు స్వప్నంలో శబ్ద - అర్థములుగా అనుభవమగుచున్నాయి. అంటే స్వప్నం సంస్కార సామాగ్రిచేత కొంతవరకు సత్యత్వంగా కనబడుతోంది. ఇక జాగ్రత్కు వస్తే...

ఈ జాగ్రత్ సృష్ట్యాదిలో స్వప్నరూపంగా ప్రసిద్ధమై ఉంటోంది. అయితే అది కూడా పూర్వ అనుభూతాలగు శబ్దార్థములే అయి ఉంటున్నాయి. కాని చిరకాల ప్రళయవ్యవధి చేత పూర్వ సంస్కారాలు అప్పటికే నశించి ఉంటాయి. కాబట్టే "స్వప్నం కంటే సృష్ట్యాదిగా ప్రారంభమైన జాగృత్ మరికొంత తుచ్ఛమైనది"... అని జాగ్రత్కు స్వప్న మాత్ర సత్తా కూడా లేదని చమత్కారంగా చెప్పబడుతోంది.

ఈ విధంగా జాగ్రతే మరికొంత మిథ్యాత్వము వహించినట్లుగా ఇక, స్వప్నమంతా యథార్థమేనని నా కనిపిస్తోంది ...అని నీవు అంటున్నావేమిటి? ఈ గృహము, బంధువులు... ఇటువంటి అనేక విషయాలు నీకు అనుభవానికి వస్తూ ఉండవచ్చు గాక! అయినా కూడా నా ఉపదేశాలను గ్రహించయినా, ఇదంతా స్వప్నమే”... అనే స్వప్నధ్యానమునందు నీలో ప్రయత్న శీలత్వము ఇంకా జనించటంలేదేం?

ఇక - ఇది నీకు సత్యమనియే అనిపిస్తోందని అంటావా?... ఒకడు స్వప్నం చూచేటప్పుడు ఇదంతా సత్యమే” అని అనుకొనియే అనుభవిస్తున్నాడు. కానీ, నిద్రలేచిన తర్వాత మాత్రం అదంతా నా భయమేకదా! ఊహా జనితమే కదా! దానిని గురించి పట్టించుకోవలసిన దేమున్నది?" అని అనుకుంటూ వదలి వేస్తున్నాడు. అట్లాగే ఆత్మజ్ఞానం వికసించనంతవరకు "ఈ జాగ్రత్తు ఈ ఈ విశేషములతో కూడుకొని నాకు సత్యమనియే అనిపిస్తోంది అని అనుకోవటంలో మాకేమి ఆశ్చర్యం అనిపించటంలేదు. ఆత్మజ్ఞానం సముపార్జించి సుస్పష్టం చేసుకొన్న తరువాత మాత్రం “ఈ దేహాలు,

Page:433

వ్యవహారాలు, విషయాలు .... ఇవన్నీ స్వప్నసదృశమే” - అని గ్రహిస్తున్నాడని మేం సశాస్త్రీయంగా గమనిస్తున్నాం.

ఓ వ్యాధ మహాగురూ! ఈ జగత్తు అనేక విషయ పరంపరల దృష్ట్యా స్వసంస్కార రూపమే కాబట్టి అసత్యం. ఇదంతా ఆత్మరూపమే కాబట్టి ఇది నిత్య సత్యమే! కనుక, ఇక ఈ జగత్తు విషయంలో "ఇది స్వప్న తుల్యమే...అని గ్రహించటానికి ఇంకా సందేహమెందుకు చెప్పు? నేను (మహాముని) : మహాత్మా! మీ మాటలకు అడ్డువస్తున్నానని అనుకోకండేం! ఇప్పుడు మీరు నన్ను “వ్యాధ మహాగురూ! అని రెండుసార్లు సంబోధించారేమిటి? ఈ వ్యాధమహా గురుత్వమేమిటి? రెండవ ముని : అవును. అది సంక్షిప్తంగా వివరిస్తాను. ఎందుకంటే ఇటువంటివి, నీకు సంబంధించిన అనేక సంఘటనలకు.... అంతులేదు కాబట్టి!

ఇప్పుడు చెప్పుచున్నది ముందు ముందు ఒకానొక జరుగబోయే విశేషం అయివున్నది. నీవు కొంతకాలానికి లుబ్ధకుడు అనే పేరుగల వ్యాధునికి సద్గురువు కాబోతున్నావు. అప్పటి వరకు దీర్ఘ తపస్వినగు నేను కూడా ఇక్కడే ఉండబోతున్నాను.

నాకు పూజాది సత్కారాలు నిర్వర్తిస్తూ నీవు కూడా ఇక్కడే ఉండబోవుచున్నావు. నేను కూడా అప్పటివరకూ నిన్ను త్యజించబోవటంలేదు.

కొంతకాలం గడచిన తరువాత ఇక్కడ ఒక దుర్భిక్షం రాబోవుచున్నది. ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు, మీ తదితర బంధువులు అనేకులు నశించటం జరుగుతుంది. ఆ తరువాత మదోన్మత్తులగు సరిహద్దు రాజుల యుద్ధ విన్యాసాలచే హింసించబడి ఈ గ్రామ ప్రజలంతా గ్రామం విడచి వలస వెళ్ళనున్నారు. ఇక ఇక్కడ మనిద్దరం మాత్రమే మిగిలిపోతాం. నీకు నేను, నాకు నీవు ధైర్యం చెప్పుకుంటూ ఇక్కడే రోజులు గడుపుతూ ఉంటాం. వేద్య వస్తువగు ఆత్మను ఎరిగిన వారం అవటం చేత శాంతులమై సమరూపులమై, ఏ పదార్థమునందూ కోరికలేనివారమై, ఉత్తమ ఆచరణాపరులమై ఒక వృక్ష సమూహం మధ్యగా నివసించటం ప్రారంభించబోతున్నాం. ఆత్మానుభూతి బలంచేత మనం మరణము, జీవనముల పట్ల ఆశ - భయములు లేనివారమై ప్రశాంతంగా ఆత్మానుభూతంగా కాలం గడుపుతూ ఉండబోతున్నాం. మనం నివసించబోయే వృక్షజాలమధ్య ప్రదేశం చుట్టూ అనేక తాళ వృక్షములు, లతా విశేషములు పరివేష్టించి ఉంటాయి. అప్పుడు మనం ఉండబోయే ఈ వనప్రదేశం మన తపో అభ్యాస ప్రభావంచేత స్వర్గం నుంచి భూలోకం వచ్చిన నందనవనంలాగా విరాజిల్లగలదు.

ఇట్లా చాలాకాలం జరిగిన తరువాత ఒక రోజు లుబ్ధకుడు' అనే పేరుగల ఒక వ్యాధుడు ఒక మృగమును వేటాడుతూ మనం తపస్సు చేసుకొనే వన ప్రదేశానికి రావటం జరుగుతుంది. ఆతడు మనం ఉండే ఆశ్రమస్థానంలో ప్రవేశించగానే తన హింసకవృత్తిని త్యజించి పూర్వజన్మార్చిత పుణ్య ప్రభావంచేత నీకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తాడు. అంతమాత్రానికే నీవు సంతోషించి

Page:434

ఆతనికి అహింస - ఆయుః సద్వినియోగం గురించి గుర్తు చేస్తావు. నీవు చెప్పే పుణ్య వచనాలకు, ఇక్కడి శోభాయమానమైన ప్రశాంత వాతావరణానికి ఆకర్షితుడై ఆతడు పూర్వజన్మల సంస్కార బలంచేత ఇక్కడే తపస్సు నిర్వర్తించటం ప్రారంభిస్తాడు. నీకు ప్రియశిష్యుడై, నీకు సేవచేస్తూ ఆత్మజ్ఞాన విశేషాలు వినటానికి అర్హుడగుచూ ఉంటాడు. తపశ్చర్యా ప్రభావం చేత తన జీవహింసాస్వభావం విడనాడి శమ-దమ-తితిక్ష-ఉపరతి వంటి సాధన ద్రవ్యములను చేకూర్చు కొంటాడు. ఆ క్రమంలో ఒకానొకనాడు నిన్ను "స్వప్నం ఎట్లా ఏర్పడుతోంది? ఎక్కడి నుండి వస్తోంది? అద్దానికి రచయిత ఎవరు? ఎవరు స్వపాంతర్గతమైన విశేషాలకు కారణమగుచున్నారు? స్వప్నగతమైన ఆయా విశేషాలు ఎందుకు ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో, ఎవరు, ఎట్లా కల్పిస్తున్నారు?... మొదలైన స్వప్న వృత్తాంత విశేషాల గురించి ప్రశ్నించబోతున్నాడు. అప్పుడు నీవు స్వప్న ప్రసంగం ద్వారా పూర్ణరీతిగా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తావు. దానిని విని ఆతడు ఆత్మజ్ఞానానికి యోగ్యుడు అవుతాడు.

ఓ మునీ! ఈ ప్రకారంగా నీవు వ్యాధగురువువు కానున్నావు. అందుకే యోచనావశంగా నిన్ను "వ్యాధ మహాగురువా! అని సంబోధించాను. ఇది వినోదంగా మాటవరసకు, అన్నమాట మాత్రమే!

మిత్రమా! విన్నావు కదా! ఈ సంసార భ్రమ ఎట్టిదో నేనెటువంటివాడనో, నీవు ఎట్టివాడవో, ఇతఃపూర్వం ఏమి జరిగిందో ఇక ముందు ఏమేమి కానున్నదో ... అవన్నీ చెప్పాను. దీనితో నీ జ్ఞాన సంబంధమైన సందేహాలు తొలగివుండవచ్చునని అనుకుంటున్నాను.

ఇట్లా పలికి ఆయన మరల మౌనం వహించారు. ఓ లుబ్ధక నామధేయుడగు వ్యాధుడా! ఆ అన్యముని చెప్పేదంతా విని నేను ఆశ్చర్యం చెందాను. నా శయన ప్రదేశానికి వెళ్ళాను. నాకు నిద్ర పట్టలేదు. వ్యాకులమైన బుద్ధితో ఆ మునివర్యుని గురించి, ఆయన చెప్పిన పూర్వాపర విశేషాల గురించి, ఈ దృశ్య సమూహ ప్రాప్తుల గురించి విచారించి మహావిస్మయం పొందాను.

ఆ రాత్రి అంతా ఆలోచన-మనన-విచారణలతో గడచిపోయింది. తెల్లవారగానే ఆ మునీంద్రుని పూజించి “స్వామీ! మీరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండి మా సేవలు స్వీకరిస్తూ ఉండండి" ...అని దంపతి సమేతంగా అభ్యర్థించాం.

ఆ విధంగా మేమిద్దరం ఆ ఇంట్లోనే పరస్పరం స్నేహబద్ధులమై, స్థిర చిత్తులమై రోజులు గడపసాగాము. ఆయన మా ఇంట్లో ఒక సభ్యులైనారు. ఇక నాకు అప్పటిలో సంప్రాప్తిస్తూ ఉండే ఇష్టానిష్ట విశేషాలను నేను అనుభవిస్తూ ఉండగా, ఆయన మాత్రం ఏకాంత తపో-ధ్యానములు కొనసాగిస్తూ ఉండేవారు. ఆ ఈ అన్యముని సాంగత్యంలో రోజులు గడచిపోసాగాయి.

నాభి వాంఛామి మరణం, నాభి వాంఛామి జీవితమ్ |

యథాస్థితోస్మి తిష్టామి తథైవ విగత జ్వరమ్ ||

ఆ రోజులలో నేను మరణము కోరుకునేవాడిని కాదు. అట్లాగే జీవితమూ కోరుకొనే వాడిని కాదు. ఏ స్థితిలో ఏది ఎట్లా ఉండవలసివస్తే ఆ స్థితిలో అది అట్లే అంగీకరిస్తూ సంతాపరహితుడనై

Page:435

వర్తించేవాడిని. ఇప్పటికీ అట్లే ఉంటున్నాను. అటు తరువాత నేను ఈ దృశ్య మండలము గురించి అనేక కోణాల నుండి ఆ రెండవ మునితో గూడి విచారణ చేస్తూ ఉండేవాడిని.

తతో విచారితం తత్ర తన్మయా దృశ్యమండలమ్ కిం కారణమిదముస్యాత్కిమయమ్ వేత్తి చేతసా? కోయం పదార్థ సంఘాతః కిం నామైతస్య కారణం అస్త్యస్మిన్ స్వప్న సందర్శే చిత్వ్యోమైక స్వరూపిణి ॥

ఈ దృశ్యమంతా ఏమిటి? దీనంతటికీ కారణమేమిటి? ఆత్మ చిత్తంతో కూడి ఏదేది ఎట్లెట్లు ఎరుగుచున్నది? ఈ పదార్థ సమూహాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? రావటానికి కారణమేమిటి? చిదాకాశ స్వరూప 'స్వప్న వ్యవహారం' ఇప్పుడు ఈ పదార్థ రూపంగా ఎట్లా కనబడుతోంది? చిన్మాత్రాకాశమే నిజ చిదన స్వభావంతో ఈ రీతిగా పర్వత-ఆకాశ-భూ-వాయు-అగ్ని-నదీ-దిక్ స్వరూపంగా ఎందుకు కనిపిస్తూ ఉంది..?

చైతన్యము’ అనే చంద్రబింబం నలువైపులా తన స్వరూప ప్రకాశమును విస్మరిస్తూ ఉండగా అట్టి చిత్ ప్రకాశమే చిదాకాశమున ఈ జగద్రూపంగా భాసిస్తోంది కదా? ఈ పర్వత-భూ-ఆకాశ -శరీర-ఇంద్రియాదులన్నీ నా మనోరూపములేనా? వాస్తవానికి అవన్నీగాని, 'నేను' అనునది గాని లేవుకదా? ఇదంతా కూడా కేవలము చిన్మాత్రాకాశపు స్ఫురణ మాత్రమే అయి ప్రకాశిస్తోందా?

నేను చిన్మాత్రాకాశ స్వరూపుడనేనా? ఇదంతా చిన్మాత్రాకాశమే అయివుండగా ఇక ఇద్దాని కారణమేమి ఉంటుంది? జలంలో తరంగాలన్నీ జలమే అయివుండగా, ఆ తరంగం అంత - ఈ తరంగం ఇంత" - అనురూపంగా అవటానికి కారణమేమున్నది? ఏదీ లేదు.

లోకం రీతి వేరుగా ఉన్నది. పిండ గ్రహణము - అద్దానికి కారణము లేక ఏదీ సంభవించదు. కాని చైతన్యం సర్వదా నిర్విషయమై ఉన్నది కదా! కనుక ఈ జగత్తు అకారణం! వాస్తవానికి లేనిదే! భావనచే మాత్రమే ఉన్నట్లున్నది! - అనగా, భావనారూపమే అయున్నదా?

ఒకవేళ ఇదంతా భ్రాంతి మయమనుకుంటే, అట్టి భ్రాంతికి కారణం ఏమిటి? ఆ భ్రాంతి యొక్క ద్రష్ట (లేక) మననము చేసే కర్త ఎవరై ఉన్నారు? ఆతని ఉదయానికి కారణమేమిటి? ఆ కారణం ఎచ్చట ఉన్నది? అట్టి ద్రష్టకు ఉదయాస్తమయాలు ఉన్నాయా?

నేను ఆ ప్రాణియొక్క హృదయ తేజంలో ప్రవేశించి ఈ దృశ్య వ్యవహారమంతా పొందుచున్నానో, ఆతని దేహం ఎప్పుడో నశించింది. అప్పటి నా దేహం కూడా నశించింది. అనగా, అప్పటి బయల్వెడలినట్టి నా దేహము లేదు. ఆ ప్రాణి యొక్క దేహమూ లేదు. అనగా, ఈ దృశ్యమంతా కూడా కర్తృ - - కర్మ - కరణవర్జితమై, క్రమశూన్యమె, ఆద్యంతరహితమై, చిదనమైనట్టి చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమగు ఆకాశము అయివున్నది.

ఇక్కడ కనిపించే ఘట-పట-పటాదులన్నీ (కుండ-వస్త్రము-వృక్షము మొదలైనవన్నీ కూడా) చిదాకాశము యొక్క స్ఫురణ రూపములే! కాబట్టే అవన్నీ స్పష్టరూపములు ధరించినవై అగుపిస్తున్నాయి.

Page:436

అయితే... "చిన్మాత్రము యొక్క స్ఫురణ అనే శబ్దం "రాహువు యొక్క శిరస్సు అను శబ్దము వలె వికల్పమాత్రమై ఉన్నది. (సూర్యునికి భూమికి మధ్య వచ్చే గ్రహం వలన సూర్యగ్రహణం ఏర్పడుచుండగా అక్కడ 'రాహువు యొక్క తల' అనేది వికల్ప మాత్రమే కదా!)

కాబట్టి సర్వము చిదాకాశమే! అయితే 'యొక్క' అను షష్ఠీ తత్పురుష సమాస ప్రయోగం ఇక్కడ అసంభవమై ఉన్నది. అంతా చిదాకాశమే అయివుండగా... అందులో 'చిదాకాశము యొక్క స్ఫురణ' అనేది ఎక్కడున్నది?

జలతరంగం - - సముద్ర జలంలో అలల తాకిడికి తెల్లటి నురుగు ఏర్పడుతోంది. ఆ అలలు,

వాటి తాకిడికి ఏర్పడే నురుగు రంగు - ఆకారంచే భేదముండవచ్చుగాక! వాస్తవానికి ఆ అలలు, వాటి ఆకారాలు, నురుగు, అద్దాని తెల్లటి రంగు... ఇవన్నీ నిరాకార జలరూపమే కదా! జలము యొక్క తరంగం అనునది పూర్ణార్థం కాదు. తరంగం జలమే అనునదే పూర్ణార్థం. అట్లాగే, వ్యష్టి - సమష్టి జీవుడనగు నాయొక్క పూర్ణార్థం అఖండము - అప్రమేయము- " అగు పరమాత్మయే! (లేక) పరబ్రహ్మమే!

ఈ జగత్తు “చిద్రూపము అనే సముద్రం యొక్క నురుగు అయివున్నది. ఇక చిద్రూపము కానిదేమి? అనంతమగు చిదనమగు పరబ్రహ్మమే... ప్రకాశ స్వభావముగా స్థితినొంది ఉన్నది.

బ్రహ్మము యొక్క స్ఫురణయే జగత్తు రూపంగా భాసిస్తోంది. కనుక ఇక్కడ ద్రష్టత్వం లేదు. దృశ్యము లేదు. పరబ్రహ్మము... దేశకాల, వస్తు పరిచ్ఛేద శూన్యం. అప్రమేయం. ఆదిమధ్యాంత రహితం. సర్వదా ఏకం. సర్వవ్యాపకం. కార్య కారణ వర్జితం.

అట్టి పరబ్రహ్మము నిజసత్త చేతనే ఈ భువన - పర్వత ఆకా దిక్ మొదలైనవి నిర్వర్తించుచూ, ఏకమై అయినప్పటికీ, అనేక రూపములుగా స్ఫురిస్తోంది.

కాబట్టి... ఈ కనబడే సర్వము, సమస్తము వాక్-మనస్సులకు విషయము కానట్టి చిన్మాత్రమే! కేవల-నిర్మల-నిజసత్తామాత్ర చిదాకాశమే ద్రష్ట - దృశ్య రూపములను అవధరించి ఈ 'జగన్నాటకం' ప్రదర్శిస్తోంది! ఇంతకుమించి - ఇంతకు వేరై మరింకెక్కడా ఏదీ లేనేలేదు. ఉండబోవుట లేదు.

-

25. అభ్యాసవశంగా....!

మహాముని : ఓ లుబ్ధకుడా! విన్నావు కదా! నేను ఇంతవరకు వర్ణించి చెప్పిన ప్రశ్నలకు సమాధానం ఆశ్రయిస్తూ, ఆత్మ నిర్ణయాన్ని ఆశ్రయించినవాడనై సంతాపరహితుడవై ఈ దృశ్యంలో ఉంటూన్నాను.

ఇంకా... రాగవర్జితుడనై, శంకాశూన్యుడనై, అహంకార రహితుడనై, నిర్వాణ శాంతరూపుడనై, ఆధార ఆధేయరహితుడనై, అభిమాన వర్జితుడనై, ఆశ్రమ శూన్యుడనై, నిజ చిత్స్వభావమున ఉన్న వాడనై, స్వయం శాంత స్వభావుడనై సర్వదా ఉదయిస్తున్న సృష్ట్యాత్మ స్వభావుడనై వెలయుచున్నాను. యథా ప్రాప్తములైన కార్యములకు కర్తనై ఉంటూనే సర్వదా అన్నిటికీ అకర్తనై చెన్నొందుచున్నాను.

Page:437

ఎందుకంటే ఏదైతే స్వయంగా నిష్క్రియమగు చిదాకాశమే అయివున్నదో... అద్దానికి కర్తృత్వమెచట? ఈ దృశ్యము నేను కూడా సర్వదా చిదాకాశమే అయి ఉన్నాను కదా! ఈ ఆకాశం - భూమి వాయువు - అంతరిక్షం - పర్వతాలు - నదులు - ఈ సమస్త ప్రాణి సమూహాలు - - ఇవన్నీ కూడా సర్వదా “ఏకమే” అయినట్టి ఆత్మరూపమగు చిదాకాశమే అయివున్నది కదా! ఇది గ్రహించి నేనిక శాంతుడనై, సర్వవిధములా సంతృప్తుడనై విధి, నిషేధ రహితుడనై, బాహ్య - అభ్యంతరములు లేనివాడనై నిత్య ప్రకాశితుడనై ఉంటున్నాను.

అట్టి నా ముందు నీవు కొద్దికాలం క్రితం ఒక మృగమును వేటాడుతూ వచ్చి నీ ప్రింసక్ వృత్తిని పరిత్యజించి వినమ్రుడవై నిలచి ఉండటం కాకతాళీయంగా జరిగింది.

ఓ వ్యాధుడా! లుబ్ధక నామధేయుడా!

ఈ ప్రకారంగా స్వప్నం ఎట్టిదో... మనం ఎటువంటి వారమో... ఈ జగత్తు ఎట్టిదో... నీవు ఎట్టివాడవో... ఈ దృశ్యం ఎట్టిదో... అవన్నీ కూడా నా సద్గురువగు (ఈ మన ఎదురుగా శాంత స్వరూపంగా ఆసీనులై ఉన్న) అన్యముని సమక్షంలో విశదీకరించి చెప్పాను. కనుక మిత్రమా!

ద్రష్టయగు నీవు ఎట్టివాడవు? ఈ దేహ - ఇంద్రియములతో కూడిన ఆధ్యాత్మిక చమత్కారం

ఎట్టిది? ఎదురుగా కనిపించే ఈ ఆదిభౌతిక దృశ్యం ఎటువంటిది? ఈ దృశ్యంలో కనిపించే రాగ

- ద్వేషాలు, గ్రహణ-త్యాగాలు, వాటికి సంబంధించిన భావపరంపరలు ఎటువంటివి? ఈ సృష్టికే

కర్తయగు బ్రహ్మదేవుడు ఎక్కడివాడు? మనకు ఎదురుగా ఉన్న ఈ జన సమూహం ఎక్కడిది?

ఇవన్నీ సమగ్రంగా సుస్పష్టంగా మన ఈ సంవాదమును ఆసరాగా తీసుకుని తెలుసుకో! ఈ సమస్త దృశ్యము మిథ్యగా గ్రహించి శాంతుడవై ఉండు.

ఎందుకంటే... ఈ ద్రష్ట మొదలైనవాటి సత్త చిన్మాత్రాకాశ రూపమే అయి ఉన్నది. ఇదంతా స్వయంగా పరమశాంత రూపమై భాసిస్తోంది. ఇక్కడ పూర్వాపరముల దృష్ట్యా అశాంతమైనదేదీలేదు.

చిత్ సత్త సర్వదా శాంతరూపంగానే స్వయంగా భాసిస్తోంది. అది 'దృశ్యము' అనబడే అశాంతిగా ఎప్పుడూ అగుచుండటం లేదు. సంచలన తరంగాలుగా కనిపించేదంతా నిశ్చలజలమే కదా! దృశ్యము దృశ్యముగా కాకుండా సత్యమగు పరబ్రహ్మముగా అనిపించటమే పరమ శాంతిస్థితి. అద్దానిని నీకు నీవే సంపాదించుకో!

88

వ్యాధుడు : (లుబ్ధకుడు) : ఓ మునీంద్రా! మీరు చెప్పేదంతా కంటికి కనిపించేదానికంతా వ్యతిరిక్తంగా ఉన్నది. అందుకే అంతా యుక్తియుక్తమే అయినప్పటికీ, కొంచెం నమ్మకం మాత్రం కలగటంలేదు. మీరు ప్రవచించే దానిని అనుసరించి... మీరు, నేను, సమస్త దేవతలు, మనుష్యులు - మనమందరం కూడా పరస్పరం స్వప్నంలోని ఆయావ్యక్తుల సంగమంలాగా స్వప్న పురుషులమేనంటారా? మనమంతా ఉన్నట్లే కనబడుచూ లేనివారమేనని మీ ఉద్దేశమా? సదసద్రూపులమా?

Page:438

మహాముని : అవును. ఇదంతా కూడా పరస్పరం స్వప్నమువలె స్థితినొంది ఉన్నది. సర్వులకు పరస్పరం ఆత్మగా చూస్తే అంతా సత్తే! అన్యంగా చూస్తే అంతా అసత్తే!

లుబ్ధకుడు (వ్యాధుడు) : మరి ఇదంతా నీవు, నేను, ఆ ఊరివారు, ఆ దేశంవారు, నా దేశంవారు, ఆ జాతివారు, ఈ మతంవారు ...ఇవన్నీ ఉన్నట్లే నాకు అనిపిస్తోంది కదా!

నేను అజ్ఞానియగు వ్యాధుడను. మీరో ఆత్మజ్ఞానం ఎరిగిన మహామునివర్యులు. ఆయనేమో... మీకు ఆత్మజ్ఞానం గుర్తుచేసిన మీ సద్గురువర్యులు. ఆ ప్రక్కన ఉన్న జనులు మీ మీ ఆశ్రమ దర్శనమునకు వచ్చి ఇక్కడ సేద తీర్చుకొనే బాటసారులు.

ఇవన్నీ ఇట్లా వేరు వేరుగా ఉండగా ఇవన్నీ లేవు. ఇదంతా పరస్పరం స్వప్న సదృశం...అని మీరు సిద్ధాంతీకరిస్తున్నారే! వరప్రసాదులగు దేవతలు కూడా పరస్పర స్వప్న విభాగులేనని చెప్పుచున్నారే? ఇదంతా నాకిట్లా అనిపిస్తూ ఉండగా, “ఇదంతా పరస్పర స్వప్న సదృశం. అసత్యం మాత్రమే!...అని మీరు ఎట్లా చెప్పగలుగుచున్నారు?

మహాముని : ఓ ప్రియాత్మస్వరూపా! లుబ్ధకా! ఈ నీ ప్రశ్నకు ఇతఃపూర్వమే సమాధానం చెప్పాను. అయినా కూడా... నీవు అడుగుచున్నావు. కనుక మరల చెప్పుచున్నాను. విను.

ఈ దృశ్యం ఎవనిచే ఏ ప్రకారంగా ఎరుగబడుచున్నదో... ఆ ప్రకారం గానే ఆతనిచే అనుభ వించబడుతోంది. ఈ జగత్తు అనేకమూ కాదు. ఏకమూ కాదు. ఏకానేకమూ కాదు. ఇదంతా కూడా -ఒకే మట్టి - - అనేక కుండలు అనే వ్యవహారంలో అనేక కుండలుగా దృష్టి గలవాడికి అక్కడ అనేక ఆకారాలుగా గల అనేక కుండలు కనిపిస్తాయి. ఇవన్నీ బంక మట్టితోనే కదా తయారయింది! అనే దృష్టి గలవానికి అంతా బంకమట్టిగానే కనిపిస్తుంది. జీవులందరూ ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నారు అనునది ఆత్మసాక్షాత్కారం పొందినవారి నిస్సందేహానుభవమై ఉంటోంది. ఇక్కడ నానా రూపములు చూచేవానికి “ఏకత్వము” - అసంగతంగా, అర్థంలేని మాటగా, అసందర్భంగా కనిపిస్తుంది. ఏకత్వము దర్శించేవానికి అనేకత్వమనేది - - అసంగతంగా, అర్థంలేని మాటగా అసందర్భంగా కనిపిస్తోంది.

తత్త్వవేత్తలకు ఇదంతా స్వప్న సదృశంగా, ఊహాజనిత వ్యవహారంగా అనిపిస్తోంది. వారికి దృశ్యమునకు ఆవలగల నిత్య నిర్మల ఆత్మ స్వరూపమే 'ద్రష్ట' అనే వేషం వేసి నటించుచున్నట్లుగా కనిపిస్తోంది. వారికి ఇదంతా "ఎప్పుడో ఏదో సందర్భంలో చూచిన నగరం" లా (జ్ఞాపకానికి సంబంధించిన ఒకానొక ఊహాఫలకంలోని దృశ్యంలా అనిపిస్తోంది. ఆత్మ గురించి శ్రవణ, పఠణాదుల ద్వారా నిర్మల హృదయంతో ఎరిగిన వారికి ఇది జగత్తుగా కనిపించినా, ఆత్మగా అనిపిస్తోంది.

ఈ విధంగా నా అనుభవపూర్వకమైన సత్యమేమిటో నీకు వివరించి చెప్పాను. నిరంతరంగా నీకు అనేక ఆత్మజ్ఞాన విశేషాలన్నీ అనేక రోజులుగా బోధించాను. నీవు కూడా ఇంతసేపూ నేను చెప్పినదంతా ప్రజ్ఞతో ఎంతో శ్రద్ధ - ఆసక్తులతో విన్నావు. నీవు వాస్తవానికి ప్రజ్ఞావంతుడవే! నేను చెప్పిన విశేషాలన్నీ గ్రహించగలిగే సుతీక్షణమైన బుద్ధి కలవాడివే! ఇక ఆపై నీకు ఎట్లా అభిరుచియో .. అట్లే ఆచరణ కొనసాగించవచ్చు.

Page:439

వ్యాధుడు (లుబ్ధకుడు) : మహనీయులగు తమరు అనృతము (అబద్ధము) మాట్లాడరనునది నాకు సువిదితమే! మీ అనుభవమే చెప్పుచున్నారని, నన్ను ఉద్ధరించటానికే పలుకుచున్నారని నేను గ్రహించియే ఉన్నాను. అయినా కూడా "ఈ జీవులు, ఈ దేహాలు, దేవతలు, ప్రకృతి, పర్వతాలు, నదులు, కాలము, మనో బుద్ధులు ... ఇవన్నీ కూడా స్వప్నంలోని మనుజులవలె అసత్ మాత్రమే అనే మాట నేను నమ్మలేకపోతున్నాను. ఎందుచేతనో మరి?

మహాముని : ఓ వ్యాధుడా! నేను ఉన్నది ఉన్నట్లుగా బోధించాను. అయినా కూడా నీ యొక్క బుద్ధి స్వాభిమతమగు దృశ్యమునందే విశ్రాంతిని వెతుకుతోందిగాని... (జగదృశ్య భ్రమయందే తగుల్కొని ఉంటోందిగాని)... పరమ పదమగు ఆత్మయందు క్షణకాలం కూడా విశ్రాంతిని పొందలేకపోవు చున్నది. ఎందుకంటావా? కొయ్యను చెంబు ఆకారంగా మరల్చినపుడే అందులో నీరు నిలుస్తుంది కదా! అట్లాగే 'అభ్యాసం అనే గొప్ప ప్రయత్నము లేనంతకాలం 'ఆత్మబోధ' మనస్సులో ప్రవేశింప జాలదు. ఒకవేళ ప్రవేశించినా బుద్ధికి, అవగతమై అనుభూతిగా రూపుదిద్దుకోదు.

గురు-శాస్త్రాదుల సేవా ప్రభావంచేత, అభ్యాసము యొక్క దార్ద్యము చేత 'బోధ' అనేది చిత్తమునందు స్థిరపడుచున్నది. అప్పుడు ద్వైత - అద్వైత దృష్టులు శమిస్తున్నాయి. అట్టి నిర్మలత్వము పొందినప్పటి చిత్తమునే 'మోక్షము' అనే పేరుతో మహనీయులగు విజ్ఞులు పిలుస్తున్నారు.

నిర్మామ - మోహా, జిత సంగదోషా, అధ్యాత్మనిత్యా, వి నివృత్త కామాః

ద్వంద్వైః విముక్తాః సుఖ-దుఃఖ గుంజ్ఞః గచ్చన్త్య మూఢాః పదమవ్యయం తత్

ఓ మిత్రమా! అభిమాన, మోహములను జయించినవారు, విషయ సంపర్క దోషాలను తొల గించుకొన్నవారు, నిరంతరం ఆత్మను మాత్రమే సర్వంలో దర్శించే అభ్యాసము గలవారు, దృశ్యం పట్ల సర్వకోర్కెలను త్యజించి ఉన్నవారు, సుఖ-దుఃఖాది ద్వంద్వాలకు అతీతత్వం సముపార్జించుకున్నవారు, శాస్త్రములు ప్రతిపాదించే తత్త్వజ్ఞానాన్ని నిరంతరం అభ్యసించువారు... అట్టివారే 'నిర్వాణం' అనే ఉత్తమ పదాన్ని అధిరోహించినవారై ఉంటున్నారు. వేలాది తరంగాలలో ఒకే జలం, “వేలాది మట్టి బొమ్మలలో ఒకే మట్టి, “వేలాది ఆభరణాలలో ఒకే బంగారం" లాగా ... వారికి ఈ అనంత సంఖ్యలో గల దేహాలుగా ఒకే ఆత్మ వ్యక్తీకరణమౌతోందని సుస్పష్టంగా గమనిస్తున్నారు.

26. భవిష్యత్ వృత్తాంతం

అగ్నిదేవుడు : ఓ ప్రియ విపశ్చిత్ రాజా! నీకు ఈ శవోపాఖ్యాన వృత్తాంతమంతా చెప్పుచున్నాను కదా! ఆ తరువాత ఏమైనదో ... చెప్పుచున్నాను విను.



ముని వాక్యములు విని ఆ (లుబ్ధకుడు అనే) వ్యాథుడు పరమాశ్చర్యచకితుడైనాడు. ఆశ్చర్యము యొక్క అతిశయము చేత ఆతడు నిశ్చేష్టితుడైనాడు. ఒక ప్రతిమలాగా కదలకుండా ఉండిపోయాడు.

Page:440

జగత్తు స్వప్న దృశ్యం... దేహాలు - - భ్రమయా?... జీవునికి - జీవునికి మధ్య... కనిపించే భేదాలు స్వయంకృత మనోకల్పితాలా!... అయితే పుణ్య-పాపాలు, దేవత-ముని-మహర్షి-త్రిమూర్తులు మొదలైనవి ఇవన్నీ స్వప్న సదృశమని, తానే మరొకరి స్వప్నంలోని స్వప్న పురుషుడనని ఆత్మ సర్వము సత్యమేనని ఇటువంటి వాక్యాలు తనకు ఆత్మయందు విశ్రాంతిని ప్రసాదించటానికి బదులుగా ఏదో వ్యాకులపరచసాగాయి. అభ్యాసము లేనందువలన ఆతనికి ఆత్మానందం అందించకపోగా సముద్ర తరంగాలలో కొట్టుకుపోయే బంతిలాగా ఆతని చిత్తము మహాచంచలం కాసాగింది. చక్ర యంత్రముపై ఆరూఢుడైనవానివలె, ఎవరో మాయా హస్తములతో తనను ఎటో పరుగులు తీయిస్తూ తోసుకుపోతున్నట్లు, జలాశయంలో మొసలి తన కాళ్ళు రెండూ పట్టుకొని జలాశయ మధ్యభాగానికి ఈడ్చుకొనిపోతున్నట్లు, కాళ్ళు - చేతులు కదిలించలేని స్థితిలో శత్రువు ఆయుధధారి అయి దగ్గరకు వేగంగా వస్తున్న సమయంలాగానూ వేసట చెందసాగాడు.

ఈ ముని చెప్పుచున్నదే నిర్వాణమా? లేక 'నిర్వాణము అంటే మరొకటా? ఈతనికి ‘నిర్వాణము’ అంటే తెలుసా? తెలియదా? అందరిలోని ఆత్మను నేనేనా? ఈ జగత్తు దేవ, మనుష్య, భూ, ఆకాశ, జంతు, పర్వతాది అనేక విశేషాలతోను, ప్రదేశాలతోను, రకరకాల జీవ జాతులతోను, మంచి -

చెడులతోను కనబడుతూ ఉంటే...

ఇదంతా స్వప్నతుల్యం, నీవు నా స్వప్న పురుషుడవు - నేను నీ స్వప్నంలోని పురుషుడను, ఇదంతా మరొకరి స్వప్నలోకం, అంతా మిథ్య, ఆత్మయే సత్యం, నేనే ఆత్మ ... ఇట్లా బోధిస్తున్నా

రేమిటి ఈయన?

ఈ విధంగా అనేక సంశయములు ఆతని హృదయంలో కొనసాగాయే కాని, ఆతనికి ఆత్మయందు విశ్రాంతి లభించనేలేదు.

88

విపశ్చిత్తు : హే భగవాన్! అగ్నిదేవా! అంత చాతుర్యంగా ఆ మునివర్యునిచే ప్రవచించబడిన ఆత్మ జ్ఞాన శాస్త్రం ఆతనికి ఆత్మశాంతిని ప్రసాదించనేలేదా? ఎందుచేత?

అగ్నిదేవుడు : ఇందులో ఆశ్చర్యమేమున్నదయ్యా! "ఈ జగత్తుగా నాచే చూడబడేదంతా నా యొక్క అవిద్యయే అనే శాస్త్ర వాక్యానుభవం శిష్యునిలో అంకురించనంతవరకు గురువాక్యాలు శిష్యునికి అనుభవమును ప్రసాదించజాలవు.

ఆ లుబ్ధకుడు, “ఈ జగత్తు పరమాత్మ నుంచే వచ్చింది కదా! కనుక ఇది సత్యం కాకుండా ఎట్లా పోతుంది? ...అనియే అనుకుంటున్నాడు. జీవునియొక్క "ఈ దృశ్యము సత్యమే”...అను దృశ్య సత్యత్వ భావనయే సంసారము యొక్క రూపం. ఇంతకు మించి 'సంసార బంధము’ అని చెప్పబడేదేదీ వాస్తవానికి లేదు. ఆ దృశ్య సత్యత్వ భావన నుండే తదితర సాంసారిక దృష్టులన్నీ బయల్వెడలి పరిఢవిల్లుచున్నాయి. ఆత్మోపాసకులగు విజ్ఞులకు ఇదంతా జగత్తుగా అనేక భేద విశేషాలతో కనిపిస్తున్నప్పటికీ అందరూ ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నారు ... అనే అభ్యాస

Page:441

బలంచేత ... “ఇదంతా ఆత్మయే” అని, “ఇదంతా నా స్వరూపమే ...అని తప్పక అనిపిస్తోంది. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మనకు జ్ఞానుల దృష్టి ప్రమాణంగాని, అజ్ఞానుల దృష్టి కాదు కదా! సరే... ఇప్పుడు మనం ఆ లుబ్ధకుని (వ్యాధుని) వృత్తాంతం కొనసాగిద్దాం. విను.

అగ్నిదేవుడు : ఓ విపశ్చిత్ రాజా! ఆ వ్యాధుడు మరల కనులు తెరచాడు. ఆకాశం, భూమి, జీవులు, అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, సద్గురువగు మహాముని, ఆయనకు గురువైన అన్యముని, ఆశ్రమం, గ్రామాలు, పట్టణాలు, నగరాలు మొదలైనవన్నీ ఎదురుగా ఉన్నట్లే కనిపించాయి. అప్పుడు ఆ వ్యాధుడు ఇట్లా యోచించాడు.

“ఇప్పుడు నేను ఎవరి స్వప్నంలోనో చిక్కుకున్నానన్న మాట! నేను ఇప్పుడు తపస్సు చేస్తాను. ఆ తపోఫలంగా అతిదీర్ఘమైన దేహం సంపాదించి ఆ అంతరిక్షం కూడా దాటిపోతాను. అట్టి అతి దీర్ఘ శరీరంలో ఈ పృథివి, ఆకాశం, అంతరిక్షం దాటి వాటికి ఆవల ఏమున్నదో...ఎక్కడ ఈ దృశ్యమంతా ముగిసిపోతుందో చూస్తాను. చూచి ఈ జగత్తుకు ఆవల విశ్రాంతి తీసుకుంటాను”... అని ఈ ప్రకారమైన నిర్ణయమును అప్పటికప్పుడే తీసుకున్నాడు.

ఆతడు ఇప్పటికీ మూర్ఖుడుగానే ఉన్నాడని వేరుగా నీకు చెప్పక్కర్లేదు కదా! ఎందుకంటే ఆ మహాముని దృష్టాంత సహితంగా మహత్తర బోధను ప్రవచించినప్పటికీ అభ్యాసం లేకపోతే లాభముండదు కదా! అందుచేతనే అతనిలో 'జ్ఞానం' తగినంతగా ఉదయించలేదు. ఆ ముని యొక్క మహత్తర వాక్యాలన్నీ ఆతనిపట్ల బూడిదలో పోసిన పన్నీరు వలె ...వ్యర్థమై పోయాయి. "ఈ దృశ్యము నీ భావనయే! భావనకు ముందే ఉన్న నిత్యనిర్మలమగు ఆత్మయే నీ స్వరూపం. ఈ కనబడేదంతా నీ యోచనయే కాబట్టి నీకు అన్యమైనదిలేదు ...అనే వాక్యం ఆతడు అందుకోలేక పోయాడు. అయితే అక్కడికక్కడే తదితర మునులతో కూడి తపస్సు చేయటం ప్రారంభించాడు. తన ఇతఃపూర్వపు మృగములను వేటాడే స్వభావం అప్పటికప్పుడు సంస్కారపూర్వకంగా పూర్తిగా త్యజించి, ఇక తపస్సు చేయటంలో నిమగ్నం కాసాగాడు. అట్లా అనేక సంవత్సరాలు తపస్సు చేసి చేసి ఒక రోజు మరల మహామునిని సమీపించాడు.

లుబ్ధకుడు (వ్యాధుడు) : మహాత్మా! మహామునీ! నేను అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా తపస్సు చేశాను. అయినా కూడా నాకు మీ వలె ఆత్మయందు విశ్రాంతి లభించటమే లేదు. ఎందువల్ల? మహాముని : ఓ లుబ్ధకుడా! నీకు నేను ఏ ఆత్మజ్ఞానం ఉపదేశించానో అది నీ అజ్ఞానమును పూర్తిగా తొలగించివేయగలిగినదే కానీ... నీవు దృశ్య జగత్తుకు సంబంధించిన అజ్ఞానం వదలటానికి తగినంతగా అభ్యాసపూర్వకంగా సంసిద్ధం కాలేదు. చిన్న అగ్నికణం బండ ఇనుప కడ్డీలను కాల్చలేదు కదా! అట్లాగే, నా జ్ఞాన వాక్యాలు నీ జన్మ జన్మాంత దృశ్యభావానుభవాలను దహించలేకపోతున్నాయి. అభ్యాసం లేకపోవటంచేతనే శివరూపమగు ఆత్మయందు నీకు విశ్రాంతి లభించటంలేదు. అయితే

Page:442

‘తపస్సు’ అనే సాధనకు ఉపక్రమించావు కదా! అట్టి ఈ తపస్సు అనే అగ్ని నీలోని జ్ఞానాగ్నిని తప్పక ప్రజ్వలింపజేస్తుంది. క్రమంగా నీ అజ్ఞానం తప్పక తొలగుతుంది. నిరుత్సాహ పడకు. త్వరలో నీకు ఆత్మానందం లభించగలదు.

లుబ్ధకుడు (వ్యాధుడు) : స్వామీ! మీరు ఆజ్ఞాపించినట్లే తపస్సు కొనసాగిస్తాను. అయితే ముందు ముందు నాకేమి కానున్నదో, ఎట్లా పూర్ణానందమగు ఆత్మయందు విశ్రాంతి లభించనున్నదో, అది ఇప్పుడే తెలుసుకోవాలని ఉన్నది. మహా తపస్యులగు మీరు భూత-భవిష్యత్-వర్తమానాలను ఒక్కసారే ఎదురుగా కనిపించే దృశ్యంలాగా చూడగలరు కదా! అందుచేత ముందు ముందు జరగబోయే విశేషాలు ఇప్పుడే నాకు చెప్పండి. ఎందుకంటే, నాకు ఆ విషయాలపట్ల ఎంతో కుతూహలంగా ఉన్నది. ఎంతగా భవిష్యత్ గురించి తెలుసుకోవాలని కుతూహలపడుచున్నానంటే... ఆయా భవిష్యత్ సంబంధమైన ఆలోచనలచే నాకు వర్తమానంతో తపస్సునందు ఏకాగ్రత కుదరదనంతగా...! మహాముని (పకపకా నవ్వి)... ఇదంతా కూడా దృశ్యంపైగల కించిత్ మూర్ఖత్వంతో కూడిన సత్యమే కదా!” అనే నమ్మకం తొలగకపోవటం, నీ ఆత్మస్వరూపము నందు నమ్మకం కలగకపోవటం చేతనే సుమా! అయినా, భవిష్యత్తు గురించి నీవెందుకు వేదన చెందటం? కానున్నది కాక మానదు కదా? వర్తమానంలో నీ తపస్సును కొనసాగించు.

లుబ్ధకుడు : అదంతా ఏమో తెలియదు. గురువర్యా! నాకు నా భవిష్యత్ గురించి దర్శించి చెప్ప వలసినదిగా మరొక్కసారి మిమ్ములను వేడుకుంటున్నాను.

మహాముని : (చిరునవ్వుతో) అయినా, ప్రియశిష్యుడవై నన్ను ఆశ్రయించావు కాబట్టి నీవు కోరినట్లుగా "అత్యద్భుతము వినుటకు ఇంపైనది ... అయినట్టి నీ భవిష్యత్ వృత్తాంతం చెపుతాను విను.

జ్ఞానులందు అత్యంత ప్రసిద్ధమైనది, ఉత్తమ సారభూతమైనది, తత్త్వజ్ఞులకు నిత్యానుభవమైనది అగు ఆత్మను నీవు ఎరుగలేకపోతున్నావు. కాబట్టే ఇంకా సందిగ్ధ చిత్తుడవై ఉన్నావు. నీవు ఇప్పుడు కేవలం మూర్ఖుడవు కాదు. కేవలం పండితుడవు కాదు. నీవు గొప్ప తపస్సు ప్రారంభించావు. మంచిదే. అయితే... “అవిద్యారూపమైనట్టి ఈ విశాల జగత్తు పరిణామం ఎంత? అనే నిజ మనోరథ కల్పనను ఆశ్రయిస్తూనే, ఇక మరల తపస్సు ప్రారంభిస్తావు.

ఈ ప్రకారంగా వందలకొలది యుగాలు జగత్తు యొక్క పరిణామం తెలుసుకోవటానికి, తద్వారా ఈ జగత్తును అధిగమించటానికై తపస్సు కొనసాగిస్తావు. అనేక జన్మలుగా అట్టి ఆశయంతో నీ తపస్సు కొనసాగుతుంది. తపస్సులకు ఫల ప్రదాతయగు బ్రహ్మదేవుడు దేవతా సమేతుడై నీ ముందు ప్రత్యక్షమై “నాయనా లుబ్ధకుడా! ఏమి కోరి ఈ సుదీర్ఘ తపస్సు ఆచరిస్తున్నావో... అది నెరవేర్చటానికే నీ ముందుకు వచ్చాను. ఏమి కావాలో... కోరుకో? అని అడుగుతారు.

నీవు (లుబ్ధకుడు) (వ్యాధుడు) : దేవా! నమోనమః! ఈ దృశ్యము అవిద్యామయమేనని నా గురువు మహాముని నాకు తెలిపియున్నారు. ఇదంతా బ్రహ్మమునందలి ప్రతిబింబం మాత్రమే కదా! కనుక

Page:443

నేను ఎక్కడ ఎట్టి దృశ్యం ఉండదో... అట్టి స్థానం చేరి విక్షేపరహితుడనై విశ్రాంతి తీసుకోవాలనుకుంటు న్నాను. కాని అట్టి దృశ్య విక్షేపరహితమైన ప్రదేశమేదీ నాకు ఇప్పటివరకూ కనిపించలేదు. ఎందుకంటే అద్దం ఎక్కడుంటే అక్కడ దృశ్యము ఆ అద్దంలో ప్రతిబింబిస్తూనే ఉంటుంది కదా! అట్లాగే చిదాకాశం ఎక్కడుంటే అక్కడ ఒక పరమాణువులో కూడా దృశ్య వ్యవహారం ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ఈ విధంగా చూస్తే చిదాకాశం లేని చోటే లేదు కాబట్టి... (అద్దానిలో జగత్తు ప్రతిబింబిస్తూనే ఉంటుంది కనుక) జగత్తులేని ప్రదేశమే ఎక్కడా కనిపించటం లేదు. అవిద్య ఎక్కడ దాకా విస్తరించి ఉంటే అక్కడి దాకా విద్యా జనితమైన దృశ్య వ్యవహారం ఉంటూనే ఉంటుంది కదా! అయితే ఓ మహాత్మా! ఇప్పుడు నా సందేహం తీర్చవలసినదిగా మిమ్ములను వేడుకుంటున్నాను.

ఈ దృశ్యము ఎంతదూరం విస్తరించి ఉన్నది? ఈ దృశ్యమునకు ఆవల బ్రహ్మము ఉన్నది కదా! అట్టి బ్రహ్మకోశం ఎంత దూరం వరకు విస్తరించి ఉన్నది?

స్వామీ! ఆకాశం కంటే అతిసూక్ష్మమైనది, జగద్రహితమైనది అగు 'బ్రహ్మము'ను నేను ప్రత్యక్షంగా అవశ్యం చూడాలని అనుకుంటున్నాను. అందుకే మీ కొరకై ఈ తపస్సు చేయనారంభిం చాను. నా తపోఫల ప్రభావంగా తమ దర్శనం అయింది. దృశ్యమును దాటి బ్రహ్మమును చూచేందుకు తగిన శరీరం నాకు కావాలి కదా!... అందుచేత నా ఈ దేహమును, స్వేచ్ఛా మరణం కలదిగాను, రోగరహితంగాను, గరుత్మంతుని వంటి వేగం కలదిగాను, ఆకాశంలో సంచరించ గలిగేదిగాను, ఇది పెరుగుతూ ఉంటే ఎవరూ నిరోధించలేనిదిగాను...వరాన్ని ప్రసాదించండి. ఈ నా దేహం ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క యోజనం చొప్పున విస్తరించాలి. అట్లా వృద్ధి చెందిన నా దేహం కొద్ది కాలానికి ఈ మూడు లోకాలను అతిక్రమించి ఇంకా ఇంకా విస్తరించుగాక! అప్పుడు నేను మహా విశాలత్వం పొందిన ఆ నా దేహంతో ఈ దృశ్యమును దాటిపోతాను. ఆవలకు విస్తరించి చూడగలిగేంతగా ఈ శరీరం ఎదగాలి. తద్వారా ఈ దృశ్యం యొక్క అంతు ఎక్కడో, బ్రహ్మం ఎక్కడ ప్రారంభమౌతోందో - అది నేను చూస్తాను... కనుక, హే బ్రహ్మదేవా! నాకు క్షణం క్షణం ఒక్కొక్క యోజనం విస్తరించగల దేహమును ప్రసాదించండి.

అప్పుడు “వత్సా! అట్లే అగుగాక! అయితే, క్షణక్షణ యోజన ప్రవృద్ధ దేహం కోరుకుంటున్నావో, అట్టిది అట్టి దేహం వలన లభిస్తుందా? యోచించుకో! నీ అభీష్టం నెరవేరుగాక, నీకు శుభమగుగాక!” ...అని నీకు వరం ప్రసాదించి బ్రహ్మదేవుడు అంతర్ధానమౌతారు.

అప్పుడు 'తపస్సు' అనే శ్రమచే అత్యంతగా కృశించిన నీ దేహం చంద్రకాంతివలె ప్రకాశిస్తుంది. అప్పటికప్పుడు నీవు ఈ ఆశ్రమం నుండి బయల్వెడలుతావు. అప్పుడు ఆకాశంలో ఎదగనారంభించిన నీ శరీరం కారణంగా నీ ముఖం, "ఆకాశంలో రెండవ చంద్రుడా! అన్నట్లుగా కనబడుతుంది. క్రమంగా ఇంకా ఇంకా నీ శరీరం విస్తారం కావటం ప్రారంభిస్తుంది. క్రమంగా సర్వమునకు ఆధారం, ప్రతిబంధరహితం, అనంతం అగు ఆకాశం నందు ఈ నీ శరీరం అట్లా అనుక్షణం సువిస్తారం అగుచుండగా మధ్య మధ్యలో... ఆ మహాకాశంలో... అనేక సృష్టులను చూస్తూ

Page:444

చూస్తూ ఉంటావు. అవన్నీ మహాసముద్రంలోని తరంగాలవలె చైతన్య మహాకాశము అనే శూన్యత్వం నుండి జనించిన వాయుచక్రముల వంటివే కదా!

వ్యాధుడు : శూన్యం నుండి సృష్టి రావటమేమిటి?

మహాముని : స్వప్నంలో చిదనమగు ఆత్మయందు నగరాలు కనిపిస్తున్నాయి కదా! అవన్నీ చిదనమే రూపంగా కలిగివున్నాయి కదా! అట్లాగే ఈ జాగ్రత్తు కూడా! అట్లాగే నీ శరీరం పెరుగు చుండగా ప్రతిబంధ రహితములు, - చిదన రూపములు అగు అనేక సృష్టి సమూహములు నీ దృష్టికి కనిపించటంం, నీవు నీ శరీర పరిణామం చేత వాటిని అధిగమించటం జరుగుతూ ఉంటుంది. అనేక సృష్టులను దృఢనిశ్చయయుక్తుడవై గాంచుతూ ఉంటావు. మరొకవైపేమో నీ శరీరం అనేక భూ - నభోంతరాలు దాటివేస్తూ ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యోజనం వృద్ధి అవుతూ ఉంటుంది. వ్యాధుడు : మహాత్మా! మీరు చెప్పే ఆ నా శరీరం వృద్ధి చెందుచుండగా కనబడబోయే జగత్ సమూహాలు ఇప్పటి నుంచే ఉన్నాయా? లేక అవి అప్పటికప్పుడు ఉత్పత్తి అవుతాయా? అవన్నీ ఇప్పుడెక్కడున్నాయి? అన్ని జగత్ సమూహాలకు కర్తలు ఎవరు? భోక్తలు ఎవరు? అవన్నీ అసలున్నాయా? లేవా? వస్తు రూపాలా? శూన్యరూపాలా? జ్ఞానులు వాటిని చూస్తున్నప్పుడు ఏ అవగాహనతో దృష్టితో చూస్తూ ఉంటారు.

మహాముని : ఓయీ! లుబ్ధకా! ఈ 'జగత్తు' అనబడేది ఎల్లప్పుడూ ద్రష్ట యొక్క అభిలాషానుసారమే అనుభూతమౌతోందయ్యా! మహనీయులగు విజ్ఞులకు ఇదంతా సాగర జలంలో ఏర్పడే తరంగాకారాల వలె (నిరాకారమగు జలమే అనేక సాకార తరంగాలుగా కనిపిస్తున్నట్లు) నామరూప రహితము, నిరంజనము, నిత్యనిర్మలము - అగు పరమాత్మయే ఈ కనబడే చిత్ర విచిత్ర నామ, రూప, ఆకారాదులుగా కనిపిస్తున్నట్లు గమనిస్తున్నారు. ఇక అజ్ఞానదృష్టి అంటావా? ...నీకు ఒక సంఘటన ద్వారా వివరించి చెపుతాను.

ఒక రోజు ఒక రాజసౌధం నుండి కొందరు రాణివాసపు స్త్రీలు కిటికీలోంచి రాజసభలో జరిగే ఏదో సంగీత నృత్యాన్ని చూస్తున్నారు. అట్లా చూస్తూ ఉంటే సభలో నర్తకులు చేసే నృత్య భంగిమలు కనిపిస్తున్నాయి గాని వారు ఏ కిటికీలోంచి చూస్తున్నారో ఆ కిటికీ యొక్క లోహపు చువ్వలు వారి దృష్టిపథంలోనే లేవు. ఆ సభానాటకం చూచిన తరువాత, కిటికీ యొక్క లోహపు చువ్వలు ఎన్ని ఉన్నాయి? వాటిపై ఈగలు వ్రాలాయా? ... అనే విషయాలు ప్రశ్నిస్తే వారు చెప్ప గలరా? లేదు. ఎందుచేత? వారి దృష్టంతా సభా మధ్యంలో జరిగే నాటకంలోని సంఘటనలపైనే ఉన్నది కాని, కిటికీ చువ్వలను వారు చూడటమే లేదు.

అట్లాగే చిదాకాశ దృష్టిగల తత్త్వవేత్తలకు ఈ జగద్రూప వ్యవహారమంతా చిదాకాశ మాత్రంగానే కనిపిస్తోంది. అంతా నిర్మలాత్మస్వరూపంగానే కనిపిస్తోంది. అజ్ఞానులకో ... ఆయా వివిధ జగత్తుల రూపంగా కనిపిస్తోంది. జగత్తుల అభిలాష కలవారికి ఆత్మస్వరూపం కనిపించదు. ఆత్మను అంతటా దర్శించేవారికి జగత్తులు కనిపించటంలేదు.

Page:445

నీకు కనిపించే ఆ జగత్తులనబడేవన్నీ నీ అజ్ఞాన దృష్టి యొక్క ప్రదర్శనమేనని ఇప్పటికైనా గ్రహించవయ్యా! భూమిపై అనేకమంది మనుష్యులు, గ్రామాలు, కొండలు, గుహలు, దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు అగుపించవచ్చుగాక! చంద్రమండలం నుంచి భూమిని చూస్తున్నా వనుకో! ఆయా విశేషాలన్నీ వేరు వేరుగా కనిపిస్తున్నాయా? లేదు కదా! ఆతని దృష్టిలో ఈ గ్రామ పట్టణ - దేశాది భేదాలన్నీ అసత్తు. ఇదంతా ఆతనికి భూగోళమే!

అట్లాగే... ఆత్మతో అభేదరూపస్థితి సంపాదించుకొన్న మహనీయులకు ఈ వ్యక్తిగత భేదాలన్నీ అసత్తుగా కనిపిస్తున్నాయి. ఇక అజ్ఞానికో... వీటిలో 'ఏకత్వం' అనేది ఊహకు అందటమే లేదు.

ఆ విధంగా నీవు సృష్టుల రూపంలో ఉండే - చెట్టుకు అనేక ఆకులవంటి - అనేక జగత్ సమూహాలలో నీ దృష్టి అప్పుడు పచార్లు చేస్తూ ఉంటుంది.

కొన్ని సృష్టులు. ఇంతలోనే శూన్యాకాశం. మరల మరికొన్ని సృష్టులు. మరల ఆకాశం...

ఈ విధంగా సృష్టి - ఆకాశములను మార్చి మార్చి చూస్తూ ఉంటావు. ఆ విధంగా సుదీర్ఘకాలం చూస్తూ చూస్తూ ఉండగా ఒకానొకప్పుడు నీలో వైరాగ్యం ఉదయిస్తుంది. నీవు నిర్వర్తించిన, నిర్వర్తించబోయే తపోఫలంగా నీవు వైరాగ్య దృష్టితో నీ అతిదీర్ఘ శరీరాన్ని నీవే చూస్తూ ఇట్లా పలుకుతావు - ఓ శరీరమా! ఆహా! అనేక లక్షల మేరు పర్వతములను వెంట్రుకల వలె ధరించే నీ మహాపరిణామముచే ఇప్పుడు నాకు భారముగా తోచుచున్నావు కదా! బ్రహ్మదేవుని నా తపస్సుచే మెప్పించి, చివరికి నిన్ను వరంగా పొందానా?

అరె! ఇప్పటికే ఈ శరీరం అపరిచితమైన ఆకాశమునంతా ఆక్రమించి వేసింది. ఇంకా పెరుగుతూనే పోతోంది. అనేక వేల బ్రహ్మాండములను ఈ శరీరము ఇప్పటికే తన పరిమాణంచే అధిగమించివేసిందే! ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉన్నది. ఇక భవిష్యత్తులో ఇంకా ఏమి కానున్నదో కదా! ఇంతకీ ఇంతటి భారీ శరీరాన్ని ఎందుకు కోరుకున్నాను? ఈ దృశ్యాన్ని అధిగమించి ఆవల దృశ్యరహిత ఆత్మను సందర్శించాలని కదా!

కానీ ఈ భయంకరమైన అవిద్యారూప దృశ్యము అనంతమైనది. దీనిని అధిగమించి చూడాలంటే లక్షల కోట్లాది మైళ్ళు విస్తరించియున్న శరీరం కావాలనుకోవటం నా తెలివితక్కువ తనమే! సర్వభూత సమాభావపూర్వకమైన బ్రహ్మజ్ఞానం లేకపోతే ఈ దృశ్యము యొక్క అంతమును చూడగలగటం అనేది ఎప్పటికీ ఉండదని ఇప్పుడు తెలిసింది. మహాముని బోధించిన బ్రహ్మజ్ఞాన వాక్యాలు గ్రహించక ఇట్లా ఈ వక్రమార్గంలో దీర్ఘశరీరం తపస్సు చేసి మరీ తెచ్చిపెట్టుకున్నాను.

కాబట్టి ఇప్పుడు నేను ఆకాశాన్నంతా కప్పివేసి అనేక బ్రహ్మాండాలను పొట్టలో ధరించి ఉన్న ఈ అనంతదీర్ఘ శరీరాన్ని ఇప్పుడు త్యజించివేస్తాను. ఎందుకంటే... ఇంతటి భారీ శరీరంతో నాకు బ్రహ్మజ్ఞానం కొరకై సాధన ఏమి కుదురుతుంది? సచ్ఛాస్త్రాలను అధ్యయనం ఎట్లా చేయగలను? సాధు సంగం ఎట్లా ఆశ్రయిస్తాను? మోక్ష సాధనలు లేకుండా దృశ్యం ఎట్లా అధిగమిస్తాను?

Page:446

ఓ శరీరమా! నీవు అనంతమై, అపారంగా వ్యాపించిన దానివై, ఆకాశంలో నిరాధారంగా వ్రేలాడుతూ ఇంకా ఇంకా విస్తరిస్తున్నావు. తత్త్వవేత్తలతో సాంగత్యం కుదరని నీతో నాకు ప్రయోజనం ఏమున్నది?... కనుక ఇప్పటికిప్పుడే నిన్ను నేను త్యజిస్తున్నాను.

ఇట్లా పలికి నీవు ప్రాణరేచక ధారణకు ఉపక్రమిస్తావు. పక్షి గుజ్జును తిని గింజను వదులుతోంది చూచావా? అట్లా నీవు ఆ అతిదీర్ఘ శరీరాన్ని త్యజించి ఇందులోని ప్రాణతత్వాన్ని మాత్రం రేచక ప్రక్రియతో బయల్వెడలతీస్తావు. వాయువుకంటే కూడా అతిసూక్ష్ముడగు నీ యొక్క జీవుడు ప్రాణ సమేతంగా అతిభారీ శరీరాన్ని త్యజించి ఆకాశంలో ప్రవేశిస్తాడు. ఆకాశంలో వాయువు ఉన్నట్లు నీ జీవాత్మ ఉండటం జరుగుతుంది. అప్పుడు ఆ దేహంకాస్తా రెక్కలు తెగిన పక్షిలాగా నేలకూలుతుంది. ఆ భారీ శరీర పతనం చేత భూమిపై పర్వతాలు పిండిపిండి అయిపోతాయి. అప్పుడు శుష్కించిన శరీరియగు భగవతి తన మాతృగణంతో సహా వేంచేసి ఆ దేహశకలాలను భక్షించివేస్తుంది. దాంతో భూమి దోషరహితమై పోతుంది. ఆ మేధస్సే ఇక్కడ మృత్తికార రూపం పొంది, ఈ భూమి 'మేదిని' అని సార్థకనామం పొందగలదు.

ఓ లుబ్ధకుడా! ఈ విధంగా ముందు ముందు జరుగబోయే నీకు సంబంధించిన సంఘటనలను మును-ముందుగానే దివ్యదృష్టితో దర్శించి నీకు చెప్పాను. ఇక ఇప్పుడు ప్రక్కనే గల తాళవనానికి వెళ్ళి నీ తపస్సు కొనసాగించు. ఆపై నీకేది ఇష్టమో అట్లాగే ఆచరించు!

వ్యాధుడు : అయ్యబాబోయ్! హే మహాత్మా! నేను ఆ విధంగా అనేక క్లేశాలు అనుభవించి తపస్సు చేసి చివరికి ఆ సుదీర్ఘ దేహం పొంది అనేక దుఃఖాలకు లోనుకావలసిందేనా? భారీశరీరం అను అనర్థం కొరకై తపస్సు అనే పురుషార్థం నిర్వర్తించి నిజసంకల్ప దోషంచే ఆ భారీ శరీరాన్ని, బ్రహ్మాండాలను పొంది అనేక వ్యాకులతలను నెత్తిన పెట్టుకుని మోయవలసిందేనా? స్వామీ! మీరు ఇప్పుడు వర్ణించి చెప్పుచున్న నా భావికాల స్థితిని ఏ ఉపాయం చేత మరొక తీరుగా మార్చుకొన గలుగుతానో... ఆ మార్గం నాకు చెప్పండి. నేను అవశ్యం అట్లాగే చేస్తాను. ఓ మునీంద్రా! భవి ష్యత్తులో “సుదీర్ఘ దేహం పొంది, అనేక బ్రహ్మాండాలు అనుభవించి, చివరికి రేచక ప్రాణయోగంతో శరీరం త్యజించటం ఇటువంటి విపత్కరమైన దౌర్భాగ్యమైన పరిణామాలు నిరోధించటానికి మార్గం చెప్పండి స్వామీ!

మహాముని :

అవశ్యం భవితవ్యో 9ర్థో న కదాచన కేనచిత్ |

విథాతుమ్ అన్యథా శక్యస్తన్ న క్షరతి యత్నతః ॥

నాయనా! అవశ్యం సంభవించబోయే భవిష్యత్తును మరొక విధంగా మార్చబడటమనేది కుదిరేది కాదు. ఎంతగా ప్రయత్నం చేసినా కూడా అది మరొక విధంగా ఉండబోదు. కుడిచేయి ఎడమచేయి నీ శరీరంలో భాగమే. అయినప్పటికీ వాటిని కుడి నుండి ఎడమకు - ఎడమనుండి

Page:447

కుడికి మార్చగలమా? శిరస్సును పాదాల స్థానంలోను, పాదాలను ఈ శిరస్సు స్థానానికి తెచ్చిపెట్టగలమా? అందుకు మనకు శక్తి లేదు కదా!

వామా వామ శిరః పాదః విపర్యయ విధౌ యథా | పుంసో న విద్యతే శక్తిః, తథాభావా అన్యథా స్థితౌ ॥

ఎవరికీ కూడా తన భవిష్యత్తును మరొక విధంగా చేయటానికి ఏ ఉపాయమూ లేదు. జ్యోతిశ్శాస్త్ర విజ్ఞానం చేత భవిష్యత్తు గురించి తెలియవచ్చునేమో గాని...

జ్యోతిః శాస్త్రార్థ విజ్ఞానైః ఇహ భావ్యర్థ వేదనమ్ |

భవతి అన్యదపూర్వం తు న కించన కదాచన ॥

భవిష్యత్తు తెలిసినప్పటికీ అద్దానిని మరొక తీరుగా మార్పుచేయటమనేది కొంచెం కూడా కుదిరేది కాదు. జరగవలసింది అవశ్యం జరుగుతూనే ఉంటుంది. జరుగవలసిన దాని గురించి దిగులు ఎందుకు? అది జరుగవలసియే ఉన్నది. ఏది ఎట్లా జరగాలో అది అట్లాగే జరుగుతూపోతూ ఉండటం సృష్టి చమత్కారం. అందుచేత, విజ్ఞులు ఆయా విషయాల గురించి ఏమాత్రం చింతించరు. శ్రేష్ఠులైన మనుజులు వర్తమానంతో స్వాభావికమైన కర్మలు నిర్వర్తిస్తూనే వాటిని విధ్యుక్త ధర్మానుకూలంగా

మలచుకుంటూ ఉంటారు.

శమము (మనోనిగ్రహం) - దమము (ఇంద్రియ నిగ్రహం) అలవరచుకుంటూ ఉంటారు. బ్రహ్మజ్ఞానం ప్రసాదించగల శ్రవణము - మననము మొదలైన ఉపాయాలు అవలంబిస్తూ ఉంటారు.

క్రమంగా “ఇది నేను కాదు (నా హమితి) - నేను అది (సో హమ్)" అను తత్త్వజ్ఞానం పెంపొందించుకుంటూ ఉంటారు. బ్రహ్మమే తమ రూపమని గ్రహిస్తూ ఈ జగత్తుపట్ల “ఇది ఎట్లా ఉన్నా ఒక్కటే కదా! ...అనే నిదురను అవధరిస్తారు. ఈ శరీరాదులు దహించబడుచున్నప్పుడు కూడా నిర్వికారులై ఉంటారు. క్రమంగా మహాదుఃఖదాయకములగు, సుఖదాయకములగు సమస్త కర్మలను “ఇవి నావి కావు, నేను వీటికి చెందినవాడనుగాను" ... అను దృష్టితో చూస్తూ అప్రమేయత్వ మును అలవరచుకుంటూ ఉంటారు. మహావీరత్వముచే సర్వోత్కృష్టులై వెలయుచూ ఉంటారు. సర్వ దుఃస్సంకల్పాదులను త్యజించివైచి కేవల ఆత్మదర్శనంలో నిమగ్నులై ఉంటారు.

మిత్రమా! ఆత్మజ్ఞానం సంపాదించుకొన్నవారు మాత్రమే భావికాలపు కర్మలను, వాటి నుంచి సంప్రాప్తమయ్యే సుఖ-దుఃఖములను మునుముందుగానే జయించివేసి ఉండగలరు. ఆత్మజ్ఞానం సంపాదించుకోకపోతే ఈ సంసారం క్షణక్షణం భ్రమింపజేయగలదు.

అందుచేత ముందుముందు జరుగబోయే అనివార్య సంఘటనల గురించి విచారించవలసిన పనేమీలేదు. ఏది ఎట్లో అట్లే అగుగాక! ఆత్మజ్ఞానం సంపాదించుకొనే ప్రయత్నంలో నిన్ను నీవు నిరంతరం నియమించుకో. ఇక మిగతాదంతా జగత్ కథా విశేషంగా గమనించి ఉండు.

Page:448

27. చిత్తమును అనుసరించి ఇఛ్ఛ - ఇచ్ఛను అనుసరించి దైవానుగ్రహం వ్యాధుడు : మహాత్మా! అతిదీర్ఘ పరిమాణంగల నా శరీరం క్రింద పడిన తరువాత, ఇక విశాల ఆకాశంలో ఉన్న నా జీవాత్మకు ఏమి కానున్నది? ఏఏ దశలను పొందనున్నది?

మహాముని : శరీరం ఆ విధంగా నేలకూలగా అవ్యక్తాకాశముగా ఉన్నట్టి నీ జీవుడు ఏ దశ పొందనున్నదో భవిష్యత్తును చూస్తున్న నేను నీకు సవివరంగా చెపుతాను. శ్రద్ధగా విను.

శరీరం నేల కూలిన తరువాత ప్రాణవాయు సమేతమగు నీ జీవాత్మ విశాలమైన అవ్యక్త ఆకాశంలో సూక్ష్మమగు వాయుకణం వలె ఉంటుంది. ఆ సూక్ష్మ వాయుకణం వంటి జీవాత్మలో నీ చిత్తం ప్రవృత్తిని పొందినదై తనయందు వాసనామయమగు విశాల భూపీఠమును, జగత్తును స్వప్నంలోలాగా దర్శించటం ప్రారంభిస్తుంది.

నీ చిత్తవృత్తియే వాసనానుసారంగా జగదాకారంగా మహదత్త్వమును పొందటం జరుగు చుండటం చేత ...జగత్ రూపంగా తన సంకల్పిత పదార్థములను పొందటం జరుగుతుంది. ఈ భూమండలానికి నేను రాజును... అనే విషయం గాంచనారంభిస్తుంది.

"ఇదే సింధు దేశం. నేను ఈ దేశానికి రాజును. నా సామ్రాజ్యంలో ఎందరో సామంతరాజులున్నారు. ఈ శ్రీమాన్ సింధురాజును అనేకమంది సామంతులు సర్వదా సేవిస్తున్నారు. నా తండ్రి నా ఎనిమిదో ఏట ఈ చతుస్సాగరపర్యంతం తాము విస్తరింపజేసియున్న రాజ్యాన్ని నాకు అందించి తాను వానప్రస్థం వెళ్ళిపోయారు. అయితే సరిహద్దు ప్రాంతంలో 'విదూరథుడు' అనే గొప్ప ఖ్యాతి గలిగిన శత్రురాజు ఉన్నాడు. ఆతడే నా శత్రువు. ఆతనిని జయించాలంటే తేలికైన విషయం కాదు. చాలా పెద్ద ప్రయత్నం కావాలి. నేను చాలా సంవత్సరాలు ఈ రాజ్యభోగాలు అనుభవించాను. కానీ... ఈ శత్రురాజును జయించలేకపోవటం ఒక్కటే నాకు తీరనిలోటు. ఆ విదూరథుడు ఎప్పటికప్పుడు చాలా వృద్ధి చెందుచున్నాడు.

...ఈ విధంగా వాసనామయ జగత్తులో దేహ సమేతంగా ఆయా అనుభవాలన్నీ పొందటం కొనసాగిస్తూ ఉంటావు.

కొన్నాళ్ళు గడచిన తరువాత నీకు ఆ శత్రురాజు విదూరథునితో గొప్ప సంగ్రామం సంభవిస్తుంది. ఆ గొప్ప యుద్ధంలో నీవు రథం మొదలైనవి కోల్పోతావు. అయినా కూడా నీవు నీ కత్తి విన్యాసంతో ఆ విదూరథుని యుద్ధము యొక్క చివరి క్షణాల్లో సంహరించి ఆ భూమండలానికి చక్రవర్తివై విరాజిల్లుతావు. ఆ విధంగా మహా సామ్రాజ్యం ఏలుతూ ఉండగా ఒక రోజు తత్త్వజ్ఞులగు నీ మంత్రులతో ఇట్లా సంభాషించటం జరుగుతుంది.

మంత్రి : ఓ సింధురాజా! మీరు మీ పరాక్రమంచేత అంతటి మహాబలోపేతుడైన విదూరథుణ్ణి తుదిక్షణాలలో కత్తి యుద్ధంలో జయించారు. మాకు ఇదంతా చాలా ఆశ్చర్యంగా తోస్తోంది.

Page:449

నీవు : ఔను మంత్రీ! ఆ విదూరథుని యుద్ధంలో జయించానంటే... మీకే కాదు... మాకూ ఆశ్చర్యంగానే ఉన్నది. అది సరే! మీరు మహాజ్ఞాని, భూతభవిష్యత్తులను ఎరిగిన వారు, వస్తు తత్త్వము - సృష్టి తత్త్వము తెలుసుకున్న వారని లోక ప్రతీతి కదా! ఆ విదూరథుడు మహదైశ్వర్యము, అపారమైన సేనావాహిని, బలము, ధనములతో కూడుకొనియున్నాడు. వాస్తవానికి ఆతడు మమ్ములను రథం నుండి నేల కూల్చివేశాడు. కానీ, చివరి క్షణంలో అకస్మాత్తుగా మేము మా ఖడ్గంతో ఆతనిని త్రుటిలో సంహరించి ఇప్పుడు ఈ సింహాసనంపై కొనసాగుచున్నాము. మేము ఆతనిని ఎట్లా గెలువగలిగామో మాకే అర్థం కావటంలేదు. మహావిజ్ఞులగు మీరు ఆతనిని మేము ఎట్లా జయించ గలిగామో మీ విజ్ఞాన దృష్టిచే పరిశీలించి ఇప్పుడు చెప్పగలరా?

మంత్రి : ఓ మహారాజా! ఆ విదూరథునికి 'లీల అనే భార్య ఉన్నది. ఆమె తన తపోశక్తిచేత, శ్రద్ధా భక్తులతో కూడిన ఉపాసనాబలం చేత జగతారిణి - నిష్కళంకరూపిణి అగు సరస్వతీదేవి యొక్క వాత్సల్యాన్ని తన సొంతం చేసుకున్నది. (లీలోపాఖ్యానం). ఆ ఉపాసనకు సంతోషించిన జగదీశ్వరి, పరదేవత అగు శ్రీసరస్వతీదేవి "ఈ నా ఆశ్రితురాలికి మోక్ష పర్యంతం సర్వ విధాలా తోడై ఉండెదను గాక!" ...అని వరం ప్రసాదించింది.

నీవు (సింధురాజు) : అంతటి మహాశబ్ద తత్త్వస్వరూపిణియగు భగవతి శ్రీ సరస్వతీ దేవికి మమ్ము నశింపజేయటం ఒక లెక్క కాదుకదా! మీరు చెప్పినదానిని అనుసరించి, భార్య యొక్క ఉపాసనాబలం చేత ఆ విధూరధుడు జయించటానికి మాకు అశక్తుడై వుండాలికదా! మరి మేము యుద్ధంలో ఓటమి యొక్క అంచులో వుండి కూడా కేవలం ఖడ్గ ప్రహరణంతో అతనిని ఎట్లా సంహరించాం? శ్రీసరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఉండి కూడా ఆతడు ఎందుకు యుద్ధంలో జయంపొందలేదు? ఆతడు ఏదైనా కారణంచేత దేవి యొక్క ఆగ్రహానికి గురి అయినాడా?

మంత్రి : లేదు. వాస్తవానికి ఆతడు సరస్వతీదేవిని ఉపాసించటంలో మిమ్ములను అధిగమించి ఉన్నవాడు.

నీవు (సింధురాజు / వ్యాధుడు) : అట్లాగా! మీరు చెప్పేదానిని అనుసరించి ఆ విదూరథుడే మాపై గెలిచి ఉండాలి కదా! భగవతి యొక్క అనుగ్రహం పొంది కూడా ఆతడు ఎందుకు యుద్ధంలో జయించలేదు?

మంత్రి : (కొంచెం యోచనగా మౌనం వహించి) మహారాజా! ఆ విదూరథుడు ప్రపంచంలోని దేదీ కోరుకోలేదు. దేనిపట్లా ఆతనికి ఎటువంటి అభిలాష కూడా లేదు. “నాకు ఈ సంసారం నుండి విముక్తి కలుగుగాక ... అనియే సర్వదా ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ కారణంచేత సత్య సంకల్ప స్వరూపిణి అయిన ఆ సరస్వతీదేవి అతనికి 'మోక్షము' రూపంగా కార్యసిద్ధిని ప్రసాదించింది. తదనుకూలంగా ఆతడు యుద్ధంలో స్వయంగా పరాజయం ఆశ్రయించాడు.

నీవు : ఓ మహామంత్రీ! నేను కూడా ఆ పరదేవతను ప్రతిరోజు శ్రద్ధగా పూజిస్తున్నాను కదా! ఆ పరమేశ్వరి నాకు మోక్షం ఎందుకు ప్రసాదించలేదు?

Page:450

మంత్రి : మహారాజా! ఎవరి శ్రద్ధ ఏ రూపంగా ఎటువైపుగా ఉంటుందో ...వారి వారి ఆయా సాధనా పర్యవసానం అట్లే ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ చిద్రూపిణియగు భగవతి మనందరి హృదయాలలో 'జ్ఞప్తి' రూపంలో వసించుచూ సరస్వతి అనే పేరుతో పిలువబడుతూ ఉంటోంది. స్వాత్మహితకారిణియగు ఆ చైతన్యమూర్తి ఎవరెవరిచే ఎట్లెట్లు స్వయంగా ప్రార్థింపబడుచున్నదో, ...వారికి ఆ విధంగానే వరాలు ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె సత్య సంకల్ప చైతన్యమే వరప్రదానంచే సత్వర ఫలరూపంగా అనుభవించబడుచున్నది.

ఓ శత్రుమర్దనా! రాజా! మీరు ఆ భగవతిని పూజిస్తూ వస్తున్నమాట నిజమేకాని... ఆమెను మీరు మోక్షం కొరకై ప్రార్థించలేదు. మీ అంతరంగంలో నా శత్రువులు నశించటమే నాకు ఇప్పుడు అవసరం ...అని కోరుకున్నారే గాని, ఈ దృశ్య ప్రపంచమును అధిగమించి కేవలం సాక్షీ స్వరూపుడగు పరమాత్మ స్వభావం సంపాదించి మోక్షమును పొందెదను గాక!”...అనే ఆశయం మీ అంతరంగంలో రూపుదిద్దుకొని ఉండలేదు. ఇక "బాహ్యానికి ఏది ఆరాధనా సమయంలో కోరుకుంటాము?...అనేది పెద్ద లెక్కలోనిది కాదు కదా! "అమ్మవారి దయవల్ల ఇది ఇట్లా జరగాలి. అది అట్లా జరిగితే అంతే చాలు... అను రూపంగా ప్రాపంచికమైన ఆశయాలు సాధకునిలో ప్రకటనమగుచూనే ఉంటాయి కదా!

నీవు (సింధురాజు) : తత్త్వజ్ఞానివగు ఓ మహామంత్రీ! ఆ విదూరథుడు నావలెనే... నేను ఆయన లాగానే శుద్ధ చిద్రూపిణియగు సరస్వతీ జగన్మాతను ఉపాసించాం. అయితే... విదూరథుడు నా వలెనే సరస్వతీదేవిని రాజ్య విస్తారణ కొరకు, శత్రునాశనం కొరకు ఎందుకు ప్రార్థించలేదు? నేను ఆ విదూరథునివలె 'మోక్షము' అనే ఉద్దేశంతో ఎందుకు ప్రార్థించలేదు?

ఆ సరస్వతీదేవి నాయందు నా చిత్తమునకు సాక్షిగా నా ఆత్మ స్వరూపిణి అయి సర్వదా వెలయుచున్నది కదా! మరి, నాకు 'మోక్షం' అనే ఇచ్ఛా రూపమగు జ్ఞప్తిని ప్రసాదించి సాధన సంపత్తి ద్వారా నా మోక్షం కొరకై కనికరించి ఉండవచ్చును కదా! నాకు ఆ జగజ్జనని మోక్షం అట్లా ఎందుకు ప్రసాదించలేదు? ఆ విదూరథునికి 'మోక్షము' అనే ఇచ్చారూపమగు జ్ఞప్తిని ప్రసాదించింది ఆ తల్లియే కదా! ఆయనకే ఎందుకు ఆ ఇచ్చారూప జ్ఞప్తిని ప్రసాదించింది?

మంత్రి : ఓ సింధు చక్రవర్తీ! జీవుని సంస్కారములను అనుసరించే 'ఇచ్ఛ' అనేది రూపుదిద్దుకుంటోంది. ఇచ్ఛను బట్టే ప్రయత్నములు ఉంటున్నాయి. ప్రయత్నాలను అనుసరించే ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి.

మీరు అనేక జన్మలుగా “నేను శత్రువులను జయించి సమున్నతుడనై ఉండాలి. అనేకులకంటే శ్రేష్ఠుడనై కీర్తించబడాలి. అనేకులు నన్ను గొప్పవాడుగా కీర్తించాలి" ... అనే రూపంలో అశుభమైన అభ్యాసం కలిగి ఉన్నారు. ఆ అభ్యాసమును అనుసరించి మీయందు సంస్కారాలు పేరుకొని ఉన్నాయి. మీ సంస్కారానుసారమే మీ 'ఇచ్ఛ’గా ఘనీభూతమై అంతరంగమును ఆక్రమించుకొని ఉన్నది. "నేను పరమాత్మ పాదాలు చేరాలి. మోక్షం సంపాదించాలి"... అని పైకి మీరు అనుకొన్నప్పటికీ, "ఈ జగత్తును అధిగమించాలి ... అనే ఇచ్ఛకన్నా " ఈ జగత్తులో ఏవేవో సంపాదించాలి అనే 'జగత్ సత్యమ్' సంభావన అధికాధికంగా ఉన్నది.

Page:451

ఉపాసకులు రెండు రకాలు :

1. 'జగత్ సత్యమ్' అనే సంభావన కలిగి ఉండి ఉపాసన కొనసాగించేవారు.

2. "బ్రహ్మసత్యమ్-జగన్మిథ్యా అనే సంభావన పెంపొందించుకుంటూ ఉపాసనను ప్రవృద్ధ

పరచుకొనేవారు.

“జగత్తు సత్యమే” అనుకోవటమనేదానికి “ఈ జగత్తులో ఏదో సంపాదించాలి. ఈ జగత్తు ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు ... అను రూపంలోగల ఇచ్ఛయే కారణం. అనేక జన్మలలో ఏదో జగత్ విషయాలు సంపాదించాలి అనే అభ్యాసం కొనసాగించటంచేత మీరు ఆ దేవిని ప్రార్థించేటప్పుడు ముక్తి కొరకై కాకుండా, శత్రురాజును జయించాలి. నా రాజ్యం విస్తరించాలి ...అనే ఇచ్ఛ బలవత్తరంగా కలిగి ఉండి ఉపాసించారు. అది మీపట్ల అట్లే సిద్ధించింది కూడా! సృష్ట్యారంభం నుండి కూడా ఈ చిత్తము ఎట్టి వాసనలతో కూడి ఉంటుందో... ఆ విధంగానే ఈ జీవుడు తన్మయుడై ఉంటున్నాడు. అంతేకాకుండా... భక్తుని చిత్తమును అనుసరించే దేవతలు భక్తునిపై అనుగ్రహం చూపిస్తున్నారు. అంతేకాని దేవతలు స్వతంత్రంగా ఏదీ ప్రసాదించటం లేదు.

భక్తుని చిత్తవృత్తికి అన్యంగా ఎవడూ ఏమీ చేయజాలడు. ఈ విషయం ఆబాలగోపాలానికి ప్రసిద్ధమైయున్న విషయమే! ఎవడైనా సరే, నిర్మల చిత్తంతో ఇటు ఈ రాజ్యమునో, లేక అటు మోక్షమునో కాక ఇంకేదైనా విషయమునో ఆశించి దృఢాభ్యాసం నిర్వర్తిస్తాడో... అది ఇతర వాసనలను ప్రక్కకునెట్టి ఫలీభూతం అవుతుంది.

అందుచేత... ఆశయమును శుద్ధము - - సమున్నతముగా తీర్చిదిద్దుకొని, అప్పుడు ఉపాసనకు ఉపక్రమించటమే సాధకులకు ఉచితమని మా ఉద్దేశం.

28. బ్రహ్మాండదేహుడు - వ్యష్టి దేహుడు

-

సింధురాజు : ఓ మహాజ్ఞానీ! మహామంత్రీ! తత్త్వదర్శీ! ఎద్దానికి వశమై నా పూర్వకాల సంస్కారాలు జన్మాదిగా ఉన్నాయి? ఎట్టి అనార్య శరీరములు - - బుద్ధి ఇతఃపూర్వం కలిగి ఉన్నాను? నాయందు పునర్జన్మ కారణములైన ప్రాపంచిక సంస్కారములు తొలగి నా ఉపాసన సరస్వతీదేవి కరుణచే మోక్షరూపంగా ఫలధీకరణ పొందగలదా? అట్లా పొందటానికి నేనేమి చేయాలి?... ఈ విషయాలు నాకు తెలియజేయండి.

మంత్రి : ఓ సింధురాజా! మీ జన్మ కర్మల రహస్యాన్ని విశదీకరిస్తాను. సావధాన చిత్తులై నేను చెప్పుచున్నదంతా ప్రశాంతంగా భావోద్వేగ రహితంగా వినండి. నా వాక్యములచే ప్రేరేపించబడుచున్న మీరు అజ్ఞాన వినాశకరమగు నా ఈ వాక్య ప్రభావం చేత విజ్ఞాన స్వరూపులు కాగలరు.

ఆద్యంత రహితం, నిర్వికారము అగు 'బ్రహ్మం' అని చెప్పబడే ఒకానొక వస్తువే ఇక్కడ 'నీవు - నేను’ మొదలైన రూపాలుగా ప్రవర్తిస్తోంది. ఈ విషయం శాస్త్ర విదితమే. స్వానుభవం కూడా!

Page:452

ఆ బ్రహ్మమే ఒకానొకచోట ఒకానొకప్పుడు నేను చిద్రూపమును కదా! అట్టి నేను విషయములను ప్రకాశింపజేస్తాను ...అనే సంకల్ప సంవిత్తును స్వయంగా ధరిస్తోంది.

అది... సమష్టి రూప చిత్తముతోను, వ్యష్టిరూప చిత్తముతోను వ్యవహరిస్తోంది. అట్టి చిత్తమే ఉపాధియందు జీవదశను పొందినదై, అట్టి ఉపాధిత్వము త్యజించకుండా వర్తిస్తోంది.

చిత్తము నిరాకారమైనదే! అయితే... అట్టి నిరాకార చిత్తము ఇహ పర లోకములుగాను, జాగ్రత్-స్వప్న-సుషుప్తులుగాను జన్మ-జీవన్ మరణములుగాను... సాకార జగత్తువలెనూ స్థితిపొంది ఉంటోంది. ఓ మహారాజా! ఒకానొక పరమసత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను.

ఇక్కడ నిరాకారచిత్తమే ఉన్నది. సాకారంగా కనిపించే 'జగత్తు' అనబడేది (చిత్తమునకు వేఱుగా) లేదు. ఏది వాయువో అదియే స్పందము కదా! ఏది అగ్నియో అదియే ఉష్ణము కదా! ఏది చిత్తమో, అదియే జగత్తు. ఈ చిత్తము వాస్తవానికి ఆకాశమువలె నిర్మలమైనట్టి 'ఆతివాహిక శరీరము’ అయి ఉన్నది. ఇక్కడ ఆతివాహిక దేహమే ఉన్నది. ఆధి భౌతిక శరీరము మొదలైనవేవీ లేవు. ఆకాశము-శూన్యత్వము ... ఈ రెండూ ఒక్కటే కదా! చిత్తము - జగత్తు - ఒక్కటే అయివున్నాయి. ఈ చిత్తము 'జగదాకార కల్పన' అనబడే నిరంకుశమైన సామర్థ్యము కలిగి ఉంటోంది.

చిత్తమే జగత్తు. జగత్తుగా కనిపించేదే చిత్తము. అంతేగాని, చిత్తములో జగత్తు, జగత్తులో చిత్తము... ఇటువంటి 'లోన్' అనే ప్రత్యయం ప్రాథమిక పాఠ్యాంశములేమోగాని... పరమసత్యము కాదు. హృదయంలోగల 'వాసన'యే - అది స్వతహాగా అవస్తురూపం అయినప్పటికీ - బాహ్యమున వస్తురూపంగా ‘జగజ్జాలము వలె వర్తిస్తోంది. కనుక,

ఈ జగత్తు వాస్తవానికి నిరాకారమగు చిత్తమే! అని గ్రహించండి. చిత్తమునకు ఆకారం లేదు. అట్లాగే 'జగత్తు' అనబడేదానికి 'ఇది' అనతగ్గ ఏ ఆకారమూ లేదు.

ఎందుకంటే... వాసనయే 'జగత్తు'గా పొందబడుతోంది. కాబట్టి! పరమార్థ దృష్టిచే చిత్తము కూడా సత్యము కాదు. ఇప్పుడు మీ జన్మవృత్తాంతం చెప్పుచున్నాను, వినండి. మొట్టమొదట ప్రథమ సృష్టియందు మీరు బ్రహ్మపదము నుండి సమష్టి శరీరులుగా ఉదయించారు. 'సమష్టి’యే దేహముగాగల హిరణ్యగర్భులుగా మొదట జనించిన మీరు క్రమంగా ఇప్పటికి వ్యష్టిభావము' పొందినవారై ఉంటున్నారు. తామస విషయసంగముచే తామసరూపులై వర్తిస్తున్నారు.

ఎందుకంటే, ఎక్కడ మీ “ఈ సర్వము... ఈ సర్వసృష్టి నా దేహమే... అనే భావన? ఎక్కడ ఈ వ్యష్టి దేహమును ఆశ్రయించటం చెప్పండి! “ఈ చక్రవర్తి శరీరుణ్ణి. చక్రవర్తిగానే కొనసాగుతూ, ఈ బంధువులతో సింహాసనంపై కొనసాగాలి. నా శత్రువులు నాకు తలవంచాలి.... అనే భావన ఎక్కడ? ...ఎంత అల్పస్థితి! ఎక్కడ “ఈ 14 లోకాలు నా భావనాస్వరూప చమత్కారమే! ...అను అనుభూతి? ఎక్కడ ..."ఈ కాళ్ళు చేతులుగల ఆకారమే నా దేహం. వీరు నాకు సంబంధించిన వారు. వారంతా తదితరులు. మేమంతా మానవులం. ఇదీ మా జాతి. ఇది మా కులము. ఇవి జంతువులు. వారు దేవతలు. అనంతకోటి దేహాలలో ఈ నా దేహం ఒకటి. దీనితో పుట్టాను.

Page:453

దీనితోనే చస్తున్నాను ...అన్న భ్రమ? బ్రహ్మాండదేహుడైన మీరు ఇప్పుడు ఒకానొక క్రమం చేత వ్యష్టి దేహులై ప్రవర్తిస్తున్నారు. కారణం? తామసతామస" గుణమును, రూపమును ఆశ్రయించటమే!

29. ఆతివాహిక దేహం - త్రయోదశ గుణ సంజ్ఞలు సింధురాజు (నీవు) : మహామంత్రీ! శుద్ధ సాత్వికుడనైన నేను ఈనాడు తామస తామస స్వభావుడనై ఈ పాంచభౌతిక దేహధారిగా సంచరిస్తున్నానని చెప్పుచున్నారు.

తామసతామసం' అంటే ఏమిటి? సృష్ట్యాదిలో శుద్ధసత్త్వమే ఉన్నది కదా! మధ్యలో ఈ “తామసతామసం” అనే సంజ్ఞలు వ్యవహారాలు కల్పించినవారు ఎవరు? ఎందుకు కల్పించారు? ఎవరికోసం? తద్వారా వారు పొందుచున్నదేమిటి?

మహామంత్రి : సరే చెపుతాను, వినండి. ఈ ప్రపంచంలో జీవులంతా అవయవ సహితులై కనిపిస్తున్నారు కదా! ఈ జీవునికి ఏ విధంగా కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ అమర్చబడిన ఈ దేహం ఉన్నదో... అట్లాగే అవయవ రహితమైన ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఉన్నది. అద్దానిని శాస్త్రములు ఆతివాహిక దేహం” అని పిలుస్తున్నాయి. 'అపరిచ్ఛిన్నదశ' నుండి పరిచ్ఛిన్నదశయగు బ్రహ్మాండత్వము పొందిన తత్త్వమే "హిరణ్యగర్భుడు అనే పేరు కలిగియున్నారు. ఆయన "సృష్ట్యాత్మ" అయి ఉన్నారు.

ఆయన ఆతివాహిక రూపమగు తన సమష్టిదేహమున పంచీకరణ ద్వారా ఆధి భౌతికత్వము కల్పించుచున్నారు. ఆ తరువాత అద్దాని అవయవరూపములగు తన వ్యష్టిదేహము నందు పృథివి మొదలైన సంజ్ఞలు అవధరిస్తున్నారు. ఈ విధంగా నామ రూపములు కల్పించి సమష్టి రూపాత్మ స్వప్నము వంటి ఈ జగత్తును కథారచయితవలె రచిస్తున్నారు. నిజసంకల్ప పరంపరచే స్వయంగా వ్యష్టిరూపంతో ఇద్దానియందు వ్యవహరిస్తున్నారు. (అట్టి హిరణ్యగర్భ స్వరూపులగు మీరు, మిమ్ములను ఉద్దేశించి సృష్టిసంకల్ప ప్రభావంచేత వ్యష్టిరూపంతో కూడా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా మీరు ఒకే వైపు శుద్ధ సత్వస్వరూపులై, మరొకవైపు “మహాతామసరూపం అనబడే ఈ వ్యష్టిత్వం అవధరిస్తున్నారు. అట్టి ఆ హిరణ్యగర్భ కల్పిత ఆతివాహిక శరీరజాతికి తామసతామసీ అని గుణత్రయవిభాగ పండితులు పేరుపెట్టారు.

ఓ మహారాజా! నిర్వికారమగు బ్రహ్మము యొక్క వికారరూపమగు జీవభావ ప్రాప్తియందు ఆయా గుణములను అనుసరించి... శాస్త్రములు 13 సంజ్ఞలుగా విభజించాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చెప్పుతాను... వినండి.

1.సాత్విక సాత్వికీ - ఏదైతే బ్రహ్మము నందు ప్రప్రథమంగా కల్పాదియందు జీవ రూపమును పొందినదానివలె అగుచున్నదో... అద్దానిని (ఆ జీవుని) 'సాత్విక సాత్వికీ" అని పిలుస్తారు. ఆ జీవుడు ఆ జన్మయందు ఉత్పత్తి చేతనే జ్ఞానైశ్వర్యమగు బుద్దితో కూడి ఉంటాడు. ఆయా విషయములను అనుభవించి, తిరిగి ఆ జన్మయందే ముక్తిని పొందటం జరుగుతుంది.

Page:454

2.సాత్వికీ - ఈ జీవుడు కొంతకాలం సంసార హేతువగు అజ్ఞానంతో ఉన్నవాడై ఉంటాడు. అయితే వర్తమాన జన్మయందే జ్ఞానైశ్వర్యముతో కూడిన ఉత్తమ గుణములను పెంపొందించుకొని ముక్తిని పొందుతూ ఉంటాడు. జీవజాతుల తత్త్వమును ఎరిగిన వారిచే ఈతనికి 'సాత్వికీ' అనే పేరు పెట్టబడింది.

3.రాజస రాజసీ - ఏదైతే కల్పాదియందు నూతన రూపంతో వ్యక్తమై, అనేక జన్మలుగా భోగసాధనలను కొనసాగిస్తూ, క్రమంగా మరల మోక్షభాగిని అగుచున్నదో,... అట్టిది (అట్టి బుద్ధి తత్త్వముగల జీవుడు) “రాజస రాజసీ అని చెప్పటం జరుగుతోంది.

4.కేవల రాజసీ - ఈ గుణ సంబంధులగు జీవులు ఉత్తమ గుణములను సముపార్జించుకుంటూ, దోష దృష్టులను పరిశుద్ధ పరచుకుంటూ భవ్యగుణముల ప్రభావంచేత మోక్షమును పొందబోవు మార్గంలో ప్రయాణిస్తూ అతి త్వరలో మోక్షార్హులగుచూ ఉంటారు. అనేక జన్మలైన తరువాత మోక్ష స్వరూపులుగా అగు జీవజాతులను "కేవల రాజసీ" అని పిలుస్తారు.

5.తామస తామసీ -- వీరు కల్పాది మొదలుకొని అనేక స్థావర, కీటక, పశు, కిరాతాది జన్మ లలో అనేక భోగాలు మొదలైనవి అనుభవిస్తూ చివరికి ఎప్పటికో మోక్ష భాగినులు అవుతూంటారు. 6.కేవల తామసీ - ఈ జీవులు అల్పవిశేషాలతో కూడిన పిశాచము మొదలైన జన్మలను అనుభవించి ఎప్పటికో మోక్షం పొందుతూ ఉంటారు.

ఇట్లాగే రాజస రాజసీ, రాజసతామసీ, శుద్ధ రాజసీ, తామస రాజసీ, కేవల రాజసీ, అర్ధ రాజసీ, అర్ధ తామసీ జాతి జీవులు, ఆయా అనేక జన్మ పరంపరలు పొందుచూ, పొందుచూ ఎప్పటికో మోక్ష భాగినులు అగుచున్నారు.

ఓ మహారాజా! ఈ విధంగా జాతులయొక్క అనేక భేదములు కల్పించబడ్డాయి. వాటిల్లో మీరు తామసతామసీ జాతియందు ఉత్పన్నములైనారు. మీకు అనేక చిత్ర - విచిత్రములైన జన్మలు గడచిపోయాయి. వాటినన్నిటినీ నేను ఎరుగుదును. కానీ, అవి మీ జ్ఞప్తి పథంలో లేవు. ముఖ్యంగా మహాశవ శరీరధారి అయి ఆకాశంలో సంచరిస్తూ చాలాకాలం వ్యర్థంగా గడపటం జరిగింది. ఈ విధంగా సంసార కుహరంలో (గోతిలో పడి మీరు మోక్షార్థులు కాలేకపోతున్నారు.

సింధురాజు (నీవు) : మహాత్మా! మహామంత్రీ! మీరు చెప్పేదంతా అతి విచిత్రంగా ఉన్నప్పటికీ నిజమేనేమో” అని నాకు స్ఫురిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ “తామస తామసీ అనే స్థితి నుండి నేను ఉద్దరించబడేది ఎట్లా? అందుకు ఉపాయములేమిటో మీరు ప్రవచించండి. మీరు చెప్పబోయే మార్గంలో శేషించిన జీవితమంతా కూడా సర్వ విధములా ప్రయత్నశీలుడనై ఉండటానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను. అసలు నాకు ఆ విదూరథునివలె మోక్షము అనబడేది ఎప్పటికైనా సాధ్యమేనా? అందుకు ఏమైనా ఉపాయాలు ఉన్నాయా?

మహామంత్రి : ఉపాయాలు ఎందుకు లేవు? తప్పకుండా ఉన్నాయి. దేనికైనా పురుష ప్రయత్నమే ఉపాయం. శ్రద్ధతో ఉద్వేగరహితంగా పురుష ప్రయత్నం ఆశ్రయించే వానికి ఈ మూడు లోకములలో

Page:455

సాధ్యమవనిదంటూ ఏదీ ఉండదు. నిన్నటి ఏదైనా దుష్క్రియ ఈ రోజు సత్రియచే తొలుగుతుంది కదా! నిన్న ఎవరినైనా బాధించి ఉంటే ఈ రోజు వారిని ప్రేమతో అనునయించటంతో ఆ దోషం పోగలదు కదా! అట్లాగే ఇతఃపూర్వం మీరు 'తామస తామసీ' అనే అంధజాతిలో ఉనికిని పొంది ఉన్నప్పటికీ ఇప్పటి నుండి ఉత్తమ ఆశయముతో ప్రయత్నశీలురై సత్కార్యములకు ఉపక్రమించండి.

ఆశయం నిర్ణయించుకోవటం' అనేది అతిముఖ్యమైన విషయం. ఎందుకంటే, ఎవడు ఏ పదార్ధమును కోరుకుంటాడో ... అద్దాని కొరకై అట్లే ప్రయత్నమును కొనసాగిస్తూ ఉంటాడు. మధ్యలో ఆ ప్రయత్నము నుండి అలసత్వముచే విరమించకపోతే, తప్పక అద్దానిని పొంది తీరుతాడు. ఏ జీవుడు ఎట్టి భావమునందు తన్మయుడై ఉంటాడో... ఎట్టి దానికొరకై ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటాడో... ఆతనిపట్ల అట్లే పరిణమించబోవుచున్నది.

మహాముని : : ఓ మిత్రమా! లుబ్ధకుడా! వింటున్నావు కదా! అప్పుడు నీవు ... ఆ సింధురాజుగా, నీ మంత్రి ప్రవచించినదంతా చక్కగా సమాలోచన చేస్తావు. ఉత్తమమైన బుద్ధితో రాజ్యాన్ని తృణ ప్రాయంగా పరిత్యజించి వేస్తావు. ఏకాంతంగా మనస్సును శుద్ధ పరచుకొనెదనుగాక ... అనే ప్రయత్నంతో తపో ధ్యానాదులకు ఉపక్రమిస్తావు. మంత్రులు నీవు ఉన్న చోటును తెలుసుకొని వచ్చి మరల రాజ్యాధికారం చేపట్టమని ఎంతగానో బ్రతిమిలాడినప్పటికీ నీవు వినిపించుకోవు.

అట్లా మహామంత్రి బోధించిన మార్గంలో నీవు అతిప్రయత్న శీలుడవై ఉండగా కొంత కాలానికి నీవు కొందరు సాధువులతో నివసిస్తూ వారి సుజ్ఞానపూర్వకమైన ప్రసంగాలు వినే అవకాశం లభిస్తుంది. ఆ వివేక ప్రసంగముల ప్రభావంచేత నీలో వివేకము ఉత్పన్నం అవుతుంది.

ఈ జన్మ ఎక్కడి నుండి వచ్చింది? జన్మ- కర్మల కంటే ముందే ఉన్నట్టి నేనెవరు? నాకు దృశ్యమునకు ఉన్న సంబంధం ఎట్టిది? ఈ జగత్తు ఎట్లా జనించింది?... ఇట్లా అనేక విశేషాలను సత్సంగపూర్వకంగా విచారణ చేస్తూ క్రమంగా జీవన్ముక్తుడవు అవుతావు. చివరికి ఎక్కడైతే బ్రహ్మదేవుని బ్రహ్మాండ మహాదైశ్వర్యం కూడా తృణప్రాయం అగుచున్నదో ... అట్టి పవిత్రమగు మోక్షపదమును పొందుతావు.

ఓ వ్యాధుడా! ఈ విధంగా నీ భవిష్యత్ వృత్తాంతమంతా జరిగిపోయిన కథ చెప్పినట్లు దివ్యదృష్టితో చూచి చెప్పాను. ఇక ఇప్పుడు బయలుదేరి నీకు ఏది ఎట్లా ఉచితమని అనిపిస్తే అది - అట్లే నిర్వర్తించు.

అగ్నిదేవుడు : ఓ విపశ్చిత్తు మహారాజా! అంతా విన్నావు కదా! ఇదియే " మహాశవోపాఖ్యానం” అని వేదాంత వాఙ్మయంలో ప్రసిద్ధమై ఉండగలదు. ఆ మునీశ్వరుడు వ్యాధునకు ఆతని పట్ల ముందు ముందు జరుగబోయే కథనమంతా ముందుగానే దర్శించి పూసగుచ్చినట్లు తెలిపాడు. ఈ సంసారము నిస్సారమని ఎవరికి తెలియదు? ప్రతి జీవునికి తెలుసు. అయితే ఏం? ఈ విధంగా (ఈ సంసారము నిస్సారమని ప్రతి జీవునికి తెలిసి కూడా), స్వయంరచితమైన సంస్కారముల

Page:456

వశంచేత అవశ్యం పొందవలసినది పొందుచూనేవున్నాడు. అయితే ఆత్మ గురించి తెలుసుకొని “నేనే నిర్మల అఖండ - అప్రమేయ - అద్వితీయ -నిత్యోదిత - నిర్మలాత్మ ...అని గ్రహించటం తక్షణ కర్తవ్యంగా నీకు గుర్తు చేస్తున్నాను.

30. మహాశవ ప్రస్థానం

విపశ్చిత్ రాజు : ఓ ప్రియ భగవాన్! సద్గురూ! అగ్నిదేవా! నా ఉపాసనా దైవమా! మహా శవోపాఖాన్యంలో మీరు నాకు అనేక సూక్ష్మగత విశేషాలు అందించారు. అందుకు కృతజ్ఞుణ్ణి. వ్యాధుడు మహామునిచే భవిష్యత్తులో జరుగబోయే విశేషాలు బోధించబడి కూడా సంసారమును అప్పటికప్పుడే త్యజించి మోక్ష స్వరూపమును సంపాదించుకోవచ్చు కదా! అట్లా ఎందుకు జరగలేదో, ఆశ్చర్యంగా ఉన్నది. సరే! మరి ఆ తరువాత ఏమైనది? అంతా విని ఆ వ్యాధుడు ఏం చేశాడు? ఆ తరువాత జరిగిన కథనం తెలియజేయండి.

అగ్నిదేవుడు : సరే! ఆ తరువాత ఏమి జరిగిందో చెపుతాను... విను.

ఆ మహాముని ఆ వ్యాధునికి నీవు బ్రహ్మ వరం చేత అత్యంత సుదీర్ఘదేహుడవై, తదనంతరం అద్దానిని త్యజించి, సింధురాజువై, మంత్రిచే బోధించబడినవాడిపై నిర్వికల్పమగు ఆత్మయందు లయం పొందగలవు"... అని బోధించారు కదా! ఆ తరువాత అదంతా విన్న వ్యాధుడు చాలా ఆశ్చర్యం పొందాడు. పరిపూర్ణమైన చిత్తంతో కొద్ది క్షణాలు మహాముని తనకు బోధించినదంతా చక్కగా విమర్శించుకున్నాడు. "ఆహా! ఈ సంసారంలో పడి ఎంతకాలంగా కొట్టుకుంటున్నాను! సరే! దీనిని దాటవలసిందే! జగత్ పరిధులను అధిగమించటమే ఉపాయం కదా!" ...అని తలచ సాగాడు. అవశ్యం అనుభోక్తవ్యం... అని అనుకోసాగాడు. ఇంతలో సాయంకాలం అయింది. గురుశిష్యులిద్దరూ సాయం సంధ్యకు ఉపక్రమించటానికై అక్కడి నుండి లేచారు.

మునీశ్వరుడు, ఆ వ్యాధుడు అక్కడే శాస్త్ర విచారణపూర్వకంగా తపస్సు కొనసాగించసాగారు. కొంతకాలం గడచింది. కొలదికాలానికే ఆ మునీశ్వరుడు భౌతిక దేహమును వీడినవాడై నిర్వాణమును పొంది పరమశాంతమగు బ్రహ్మ పదమునందు విలీనుడయ్యాడు.

ఆ వ్యాధుడు ప్రియ గురువుతో కలిగిన వియోగంచే ఎంతో విషాదం పొందాడు. ఏది ఏమైతే నేం! ఎవరు ఏమనుకున్నా కూడా... ఈ కాలప్రవాహం జీవులకు సంయోగ-వియోగాలు కల్పిస్తూ ఉంటుంది కదా! అప్పుడు ఆ వ్యాధుడు తపస్సు కొనసాగించసాగాడు. ఆ విధంగా అనేక సంవత్సర సమూహములు గడచిపోయాయి. ఒకానొకనాడు ... ఆతని తపోవ్రతమునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "బిడ్డా! ఏమి కోరి తపస్సు చేస్తున్నావో... అది అడుగు. ప్రసాదించటానికి సిద్ధంగా ఉన్నాను" ... అని పలికారు. మన వ్యాధుడు ముక్తినే కోరుకోవచ్చు కదా! కానీ తనయందలి వాసనా వేగమును నిరోధించటానికి సమర్థుడు కాలేకపోయాడు. అందుచేత, "స్వామీ! నాకు ఈ సంసారమును

Page:457

దాటివేయగల అతిదీర్ఘకాయం ప్రసాదించండి. నా దేహం ప్రతిక్షణం ఒక యోజన దూరం విస్తరించును గాక! నేను ఈ ఆకాశాదులు అధిగమించి ఆవల ఏమున్నదో చూడగలిగినంత మహాదేహం పొందగలిగే వరం ఇవ్వండి. ఆ దేహంతో ఈ ఆకాశాదులు దాటి ఆవల ఏమున్నదో దర్శిస్తాను... అని ప్రార్థించాడు. శరీరవృద్ధి - ఆకాశగమనము కొరకై ప్రార్థించాడే గాని, సర్వమును ఆత్మకు అనన్యంగా దర్శించగలిగే ఉత్తమబుద్ధిని గురించి కోరుకోలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు. "వత్సా! అట్లే అగుగాక! నీవు కోరుకొన్నంత విస్తారమైన దేహం నీకు లభించునుగాక! అని వరం ప్రసాదించి అంతర్ధానమైనారు. అప్పుడు ఆ వ్యాధుడు తన తపస్సు యొక్క ఫలమును అనుభవించటానికై ఆకాశంలోకి పక్షివలె ఎగిరాడు. తన దేహమును వృద్ధినొందింపజేస్తూ మూడు లోకములకు ఈవల పూరింపజేసి చాలాకాలం గడిపాడు. మహావేగంతో పైన క్రింద - ప్రక్కలగల ఆకాశమును తన మహాదేహంతో పూరిస్తూ ఉండగా, ఆ ప్రయత్నంతో అతి దీర్ఘకాలం గడిచిపోయింది. అయినా కూడా ఆతనికి భ్రమయొక్క అంతము లభించక విసిగి, వేసారి చివరికి వైరాగ్యం పొందసాగాడు. చివరికి విరాగియై ఆ సుదీర్ఘ దేహమును త్యజించివేయాలనే ఉద్దేశం పొందాడు. ఒకానొక రోజు రేచక ప్రాణాయామముతో ప్రాణములను దేహము నుండి ఉపశమింపజేసి దేహాన్ని త్యజించివేశాడు. ఆ మహాదేహం ప్రాణములను కోల్పోయినదై క్రిందకు పడిపోయింది. ఇక ఆ వ్యాధుని ప్రాణసహితమగు చిత్తము తానున్న చోటే నేను సింధు దేశపు మహారాజును" అని దర్శించినదై, విదూరథునితో శత్రుత్వం వహించటం, రాజ్యపాలన, విస్తరణ మొదలైన కార్యక్రమాలలో నిమగ్నమైనది. ఆ తరువాత విదూరథుని యుద్ధంలో జయించటం, మంత్రిచేత బోధింపబడటం, మోక్ష సాధనకు ఉపక్రమించి పరిశాంతమగు ఆత్మయందు లయించటం మొదలైనవన్నీ మునీశ్వరుని కథనానుగుణంగా విన్నావు కదా! అట్లే జరిగింది.

ఇక ఆ వ్యాధునిచే తపోఫలంగా పొందబడి, మూర్ఖబుద్ధిచే పెంపొందింపబడిన మహాదేహం వందలకొలది మేరు పర్వతముల ఆకారాన్ని బోలినట్టిదై ఆ వ్యాధునిచే రేచక ప్రాణాయామ ప్రక్రియచే త్యజించబడి కూలిపోయిది కదా! రెండవ పృథివి వలె అది కూలిపోగా, బ్రహ్మదేవుని యొక్క ఒకానొక జగత్ప్రమాకిరణం ఆ దీర్ఘదేహం వైపు ప్రసరించింది. ఆ మహాశవం పృథివి యొక్క ఆచ్ఛాదం వలె కన్పట్టుచూ భూమండలాన్ని పరిపూర్ణం చేసివేసింది. ఏ 'ప్రపంచం' అనే భూమండలంపై ఆ శవము పడిందో అక్కడ అది అన్ని దిక్కులా పరిపూర్ణం చేస్తూ ఉండింది. అప్పుడు శుష్కశరీరియగు చండికాదేవి ఆ శవమును భక్షించి రక్తముతోను ప్రేవులతోనూ పరిపూర్ణ అయి రక్తవర్ణా! మాంసనిష్టా! ప్రియాన్న ప్రీతిమానసా!" ...అని ఉపాసకులచే అర్చించబడింది. ఆ శవం యొక్క క్రొవ్వుచే పూరించబడినదై ఈ పృథివి “మేధినీ అనే పేరు కలిగినదైనది. ఆ శవం యొక్క మేధస్సే (క్రొవ్వు) క్రమంగా ఇక్కడ మేధిని అయి (భూమిగా అయి) కాలక్రమంగా మృత్తికా రూపం అయింది.

ఓ విపశ్చిత్! ఆ మహాశవం యొక్క పతనముచే నశించిన వనములు కాలక్రమంగా మరల ఎప్పుడో ఉద్భవించాయి. మరల భూమిపై నగర - - గ్రామాదులు నిర్మించబడ్డాయి. ఇతఃపూర్వం

Page:458

శవం యొక్క తాకిడికి చూర్ణమైన పర్వతాలు తిరిగి పాతాళం నుండి పూర్వమువలె లేచాయి. మరల జనులు, వారి వారి వ్యవహారములతో మేధిని (భూమండలం) కళకళలాడసాగింది.

అగ్నిదేవుడు : ఓ విపశ్చిత్ రాజా! మహాశవోపాఖ్యాన కథనమంతా విన్నావు కదా! సరే! ఇప్పుడు ఈ భూమండలం ప్రస్తుత వ్యవహారాదులకు యోగ్యమై స్థిరత్వం పొందియున్నది. నీవు ఈ భూమండలమునకు వెళ్ళి నీకు అభిమతమైన దిక్కులలో సంచరించు. మరి ఇప్పుడు నాకు మంత్రోచ్చారణతో ఒక ముఖ్యమైన ఆహ్వానం వినబడుతోంది. ప్రజా సమూహమునకు ప్రభువైన ఇంద్రుడు ఇప్పుడు స్వర్గంలో 100వ యజ్ఞం చేయటానికి ప్రవృత్తుడై మంత్రపూర్వకంగా నాకు 'సుస్వాగతం' పలుకుచున్నారు. నేను అవశ్యం వెళ్ళవలసి ఉన్నది. ఓ గతి కోవిదా! మనం చెప్పుకొన్న విషయాలు దృష్టిలో పెంపొందించుకొంటూ నీకు ఏది ఇష్టమో అట్లే ఆచరించు. సెలవు.

భాసుడు : ఓ సభికులారా! వసిష్ఠాది మహనీయులచే పవిత్రమైన ఈ సభకు మహారాజుగా ఆకాశంలో చంద్రుని వలె విరాజిల్లుచున్న ఓ దశరథ మహారాజా! తదితర పెద్దలారా! ఈ విధంగా అగ్నిదేవునిచే బోధింపబడిన ఈ మహాశవోపాఖ్యానం మీ ముందు వర్ణించి చెప్పాను.

31. విపశ్చిత్ సంసారభ్రమ వర్ణనం

భాసుడు : ఓ దశరథ మహారాజా! సర్వసభికులారా! ఇంకా వినండి.

ఆ విధంగా భగవంతుడగు అగ్నిదేవుడు నాతో పలికి మానవాకారమును ఉపశమింపజేసి ఇంద్రుని యజ్ఞ కార్య సంబంధమైన ఆహ్వానం నిర్వర్తించటానికై అంతర్ధానం అయినాడు కదా! ఇక నేను “ఈ అవిద్య యొక్క అంతు ఎక్కడో చూడాలి" అనే ఇతఃపూర్వపు జన్మజన్మల సంస్కారమును చిత్తమునందు స్వయంగా ధరించినవాడనై ఆయా కర్మల సిద్ధి కొరకై 'ఆ దిక్కు, ఈ దిక్కు' సంచరించటం కొనసాగించసాగాను. ఆ పరిభ్రమలో అనేక రకములైన ఆచార విచార రచనాదులతో కూడిన అసంఖ్యాక జగత్తులను ఆకాశంలో నేను చూడటం జరిగింది.

ఓ ప్రియ సభికులారా! ఆ జగత్తులలో... కొన్నిచోట్ల గొడుగువంటి ఆకారం గల జీవులు ఒకరితో ఒకరు వ్యవహరిస్తూ మెల్లమెల్లగా అటూ ఇటూ సంచరిస్తూ నావంటి చూపరుల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. మరికొన్నిచోట్ల ప్రాణులంతా మృణ్మయశరీరులై (మట్టిచే తయారైన దేహాలు కలవారై) పర్వతమంత దేహాలతో నెమ్మదిగా అటూ ఇటూ కదలుచున్నారు. ఇంకా కొన్నిచోట్ల ప్రాణుల దేహాలు కొయ్యతో నిర్మించబడినవై ఉన్నాయి. వేరొకచోట దేహాలన్నీ రాతితో నిర్మితమైయున్నాయి. కొన్ని కొన్ని ప్రదేశాలలో ఆ జగత్తులలో జీవులు శిలాప్రతిమలలాగా ఒకే చోట కదలక ఉండి వాక్కుతో ఒకరితో మరొకరు వ్యవహరిస్తూ ఉంటున్నారు.

Page:459

ఈ ప్రకారంగా స్వచిత్తాకాశంలోనే అనేక జగత్తులు సందర్శించాను. స్వప్నంలోలాగా నా మనోమాత్ర దేహంతో చిరకాలం అనేక జగత్తులు పుట్టడం, వ్యవహరించటం, నశించటం వీక్షించాను. అయినా కూడా నాకు ఎంత కాలం గడిచిపోయినప్పటికీ అవిద్య యొక్క అంతు కనిపించనేలేదు. ఇక అట్టి దృశ్య - దర్శన విషయమై ఎంతగానో అలసిపోయాను. నా మనస్సు అలసిపోయి అనేక దర్శనముల పరిశ్రమచే మరింత దుఃఖమును కూడగట్టుకోవడం జరిగింది. అప్పుడు నేను ఒక ఏకాంత స్థానంలో ప్రవేశించి మోక్ష సిద్ధి కొరకై తపస్సు చేయటం ప్రారంభించాను. అప్పుడు ఒకానొక రోజు ఇంద్రుడు యాదృచ్ఛికంగా నా ముందు ప్రత్యక్షమైనారు.

ఇంద్రుడు : ఓ విపశ్చిత్లాజా! ఇప్పుడు మన ఇద్దరికీ మన మన చిత్తాకాశములో మృగజన్మ పొంద వలసిన సమయం ఆసన్నమైనది సుమా!

నేను (విపశ్చిత్ / భాసుడు) : ఇంద్రదేవా! ఏమి ఆశ్చర్యం! మీవంటి లోకోత్తరులగు మహనీయులకు కూడా చిత్తాకాశంలో మృగజన్మ పొందవలసిరావటమా? ఇది ఎట్లా సాధ్యం?

ఇంద్రుడు : అవును నాయనా! అయితే నీ తపస్సుకు ప్రతిఫలంగా నీకు ఏదైనా వరం ఇవ్వటానికి ప్రేరితుడనై ఇంద్రలోకం నుండి ఇటు వచ్చి ఉన్నాను. వచ్చి నీ - నా నా భవిష్యత్తును ఎరిగి ఉండి ఇట్లా చెప్పాను. అందుచేత మునుముందుగా నీకు వరప్రసాదం చేయవలసి ఉన్నది. ఏదైనా వరం కోరుకో. ఇక ఆ తరువాత జరుగవలసినదంటావా? అది నీకు గాని, నాకుగాని అనివార్యం కదా! నేను (విపశ్చిత్/భాసుడు) : అది సరే స్వామి! మీరు మీ చిత్తాకాశంలో మృగజన్మ పొందవలసి రావటం ఎట్లా జరుగబోతోంది? మూడు లోకములు ఏలే మహనీయులే మీరు!

ఇంద్రుడు : నాయనా! ఎవరికైనా చేసిన సుకృత దుష్కృత కర్మఫలాలు పొందటం అనివార్యం. అయినా ఆత్మజ్ఞాన తత్పరత సముపార్జించుకున్నప్పుడు, ఇక ఈ ఉపాధి ఇంద్ర పదవి పొందేదైతే ఏమున్నది... లేక, అడవిలో ఒంటరిగా సంచరించే మృగం రూపంలో ఉంటే ఏమున్నది? ఇక... నాకు చిత్తాకాశంలో మృగజన్మ పొందవలసిన పరిస్థితి ఎందుకొచ్చిందంటావా? విను, చెపుతాను. స్వర్గభోగములను అనుభవిస్తూ నేను మహామోహం పెంపొందించుకుంటూ అనేక దేవతా సంవత్సరాలు గడిపివేశాను. కొంతకాలం క్రితం 100వ యజ్ఞం విజయవంతంగా పూర్తిచేసి యజ్ఞ యజమానత్వ గర్వంతో వ్యవహరిస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒకానొక మహాశవం ఆకాశం నుండి కూలిపోతోందని వార్త వచ్చింది. వెంటనే ఇంద్రలోకం నుండి బయలుదేరాను. త్రోవలో ఏదో దేహం నిశ్చలంగా కనిపించింది. ఆ! ఇదేదో మృతుని దేహం ఇక్కడ మార్గమధ్యంగా పడి ఉన్నది” అని తలచి అద్దానిని పాదాలతో ప్రక్కవైపుగా తన్నాను. ఆ నిశ్చల దేహం శవంగా పొరబడ్డాను. కానీ అది దుర్వాసముని దేహమని నాకు తెలియలేదు. పాద స్పర్శచేత జాగృతుడైన ఆ దుర్వాస ముని... "ఓయీ! ఇంద్రుడా! నన్ను నీ పాదములతో శవంగా తలచి తన్నినావు కదా! ఏ భూతలము వైపుగా మహాశవము యొక్క నేలకూలే వ్యవహారం దర్శించటానికి వెళ్లుచున్నావో ఆ శవం క్రిందపడి భూతలం పైగల వస్తువులన్నింటినీ చూర్ణం చేసి వేస్తుంది. ఏ భూతలం చూచే ఉత్సాహంతో

Page:460

నీవిప్పుడు వెళ్ళుచున్నావో ఆ భూతలంపై అతిత్వరలో నీ వరప్రసాదియగు విపశ్చిత్ అనే రాజుతో సహా మృగత్వం పొంది సంచరించగలవు. మీ ఇద్దరి మృగత్వమనేది మీ మనోసంకల్ప ఫలములే అయినప్పటికీ మీరిద్దరూ మృగరూపంలో తదితరులకు కనిపిస్తారు. ఇదే నా శాపం ... అని శపించి, ఆయన తన వస్త్రములు సరిచేసుకొని ఎటో వెళ్ళిపోయారు.

కాబట్టి నీవు నేను కూడా మన మన చిత్తాకాశంలో మృగత్వం పొంది మృగములుగా సంచరించటం ఇక తప్పే వ్యవహారం కాదు. అయితే, ఇంద్రపీఠం అలంకరించిన నేను స్వధర్మాను సారంగా నీకు నీ తపోఫలమైన ఏదైనా వరం ప్రసాదించటం ఇప్పటి నా కర్తవ్యం. కనుక నీ అభిలషితమైన ఏదైనా వరం కోరుకో.

నేను (విపశ్చిత్ / భాసుడు) : దేవా! నేను ఈ సంసారంలో దీర్ఘకాలంగా సంచరిస్తూ అతిఖిన్నుడనై ఉన్నాను. అందుచేత అతి శీఘ్రంగా ముక్తిని పొందేట్లు వరం ప్రసాదించండి.

ఇంద్రదేవుడు : నాయనా! విపశ్చిత్! నీకు శీఘ్రముక్తి లభించాలంటే ఇప్పటికప్పుడే రూపరహితం - శుద్ధ చిత్ స్వరూపం అయినట్టి ఆత్మనే నేను అనే జ్ఞానమును సుస్పష్టం చేసుకో. అందుకు నీవు అర్హుడవే అయి ఉన్నావు. ముక్తి ఆత్మజ్ఞానోపాసన చేత మాత్రమే లభించగలదు. ఈ విషయం నీవు అగ్నిదేవుని ముఖతః “మహాశవోపాఖ్యానం అనే సంఘటనా వర్ణనం సందర్భంలో వినియే ఉన్నావు కదా! "నేను సర్వదా ముక్తుడనే! ఈ మానవ - ఇంద్ర - మృగ ఉపాధులచే పరిమితుడను కాను. ఉపాధి ఎట్లా ఉండవలసి వచ్చినా కూడా నేను సర్వదా ఆత్మస్వరూపుడను అని నీకు నీవే గ్రహించాలి. అంతేగాని ముక్తి అనబడేది మరొకరిచేత నీకు ప్రసాదించబడేది కాదు. కనుక ఇంకే దైనా వరం కోరుకో!

నేను (విపశ్చిత్ / భాసుడు) : అయితే స్వామీ! నేను ఒక మృగం (లేడి) రూపం చిత్తాకాశంలో అనుభవించబోవుచున్నానని చెప్పారు కదా! సరే! అట్టి మృగరూపం ధరించిన తరువాత నాకేమి సంభవించనున్నది? అసలు మీకు గాని నాకు గాని మృగరూపం చిత్తాకాశంలో ధరించవలసిన అవసరం ఎందుకు వచ్చిపడుతోంది? నేను ఎప్పటికైనా ముక్తుడను కాగలనా? ఈ ఈ విశేషాలు వరదాన పూర్వకంగా తెలియజేయండి.

ఇంద్రుడు : ఓ రాజా! మృగం (లేడి) యొక్క సంస్కారాలు నీ అంతఃకరణంలో దాగియే ఉన్నాయి. "ఈ సంసార వ్యసనంలో పడేకంటే లేడిగా ఉండి గడ్డి పరకలతో తృప్తిపడుచూ కాలం గడపటం ఉచితం కాదా ...అని అనేకసార్లు నీవు ఇక్కడి లేళ్ళను చూచి అనుకుంటూ ఉండేవాడివి. ఇక్కడి లేళ్ళ శృంగార చర్యలకు కించత్ ఉద్వేగంగా ఆకర్షితుడవు అయ్యేవాడవు. భావించావు. అట్టి భావనా సంస్కారాలే ముందు ముందు నీ చిత్తాకాశంలో లేడి రూపంగా సంచరించటానికి కారణం కానున్నాయి. అట్టిదే మరొక రీతిగా నా విషయం కూడా! నేను అత్యంత తీవ్రంగా ప్రేమించే దేవతా స్త్రీలు - వారితో స్నేహం కొనసాగించాలనే సంస్కారం నా యందు ప్రబలంగా ఉండటం చేతనే తదనుకూలమైన ఉపాధి పొందబోవుచున్నాను. ఇక వర - శాపాదులంటావా ... అవన్నీ

Page:461

నిమిత్తకారణం మాత్రమే! ఇక ముందు ముందు జరుగబోయే విషయాలు వినాలనే కుతూహలంతో వరరూపంగా అడిగావు కదా! ఆ ప్రశ్నకు సమాధానం విను.

మృగజన్మ యొక్క సంస్కారం నీ అంతఃకరణంలో చిరకాలంగా ఉండి ఉన్నది. అది అవశ్యం సంభవించబోవుచున్నదని మాత్రమే నీకు గుర్తుచేశాను. ఆ విధంగా సంసార తప్తుడవైన నీవు లేడి’గా ఈ భూమిపై జన్మించి ఒకానొక రోజు శ్రీరామచంద్రునికి ప్రియమైన మృగంగా ఆయన వనంలో ప్రవేశిస్తావు. కొద్ది రోజుల తరువాత విశ్వామిత్ర మహర్షి ఆగమన సందర్భంలో శ్రీ వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని వైరాగ్యమును ఆత్మజ్ఞాన మార్గంగా సశాస్త్రీయంగా తీర్చిదిద్దే యత్నంలో ఒక రోజు నీ కథా క్రమమంతా సోదాహరణార్థం ప్రవచిస్తారు. ఆ సమయంలో ప్రత్యక్ష నిరూపణకై నీవు అయోధ్యాసభకు తేబడినవాడవై మంత్రజల సంప్రోక్ష్య ప్రభావం చేత విపశ్చిత్ దేహధారుడవౌతావు. అప్పుడు శ్రీ వసిష్ఠ రామసంవాదము కొనసాగుతూ ఉండగా నీవిప్పుడు అడిగియున్న ముక్తి రూపమైయున్న నిరాకారమగు విశుద్ధ చిన్మాత్రమే నేను ...అనునట్టి అక్షయజ్ఞానం నీలో ఉదయిస్తుంది. వసిష్ఠులవారి అనుగ్రహంచేత నిష్ప్రయోజన పూర్వకమైన సంసారజిజ్ఞాస - సంచారము మొదలైన స్వవృత్తాంతం సంస్మరించి, "సంసార జిజ్ఞాసయే నా యొక్క సంసార దోషము అనే విషయం గమనిస్తావు. అప్పుడు నీ పూర్వ వృత్తాంతమంతా స్వప్న భ్రమలవలె, సంకల్ప నిర్మిత పదార్థమువలె, ఎక్కడో పరలోకంలో అనుభూతమైన విశేష పరంపరలవలె, ఎవరో రచించిన కథలోని కల్పిత సంఘటనలవలె సుస్పష్టం కాగలదు. ఎప్పుడైతే నీవు నీ మృగరూప భౌతిక దేహం నుండి విముక్తుడవై పురుష రూపము ధరించి విశ్వామిత్ర - వసిష్ఠాదులు వేంచేసి దశరథ మహారాజుచే అలంకారితమైన అయోధ్యా సభలో నిలబడతావో... అప్పుడు అక్కడి మహర్షి ప్రణీత జ్ఞానాగ్నిచే నీ అజ్ఞానమంతా భస్మీభూతం అవగలదు. మరుక్షణం నీ హృదయస్థమే అయివున్న ఆత్మ స్వరూపం నీకు స్ఫురించగలదు. అట్టి ఆత్మరూపము యొక్క స్ఫురణచే నీవప్పుడు నీ యందలి చిరకాలపు అవిద్యా భ్రాంతిని త్యజించి నిశ్చలవాయువువలె నిర్వాణ - - సశాంత రూపుడవు కాగలవు. అప్పుడిక ముక్తి నీకు స్వభాసిద్ధమే అవుతుంది.

ఆ విధంగా ఇంద్రుడు చెప్పటం జరిగింది. అప్పుడు నాకు ఆహా! నేను లేడిని. ఆ పచ్చగడ్డి పరకలు లేతగా నాకు మృష్టాన్నంలాగా అగుపిస్తున్నాయే!... అనే ఆపూర్వ బుద్ధి వ్యవహారమంతా అప్పటికప్పుడు వచ్చి పడింది. అప్పటి నుండి నేను ఆ మందర పర్వతంపై గల మందార వనంలో గరికలను భక్షిస్తూ లేడిని అయి సంచరించసాగాను. ఒకసారి మీ సామంతరాజు వేటకై నేనుండే వనంలో ప్రవేశించటం జరిగింది. నేను ఆతనిని చూచి భీతిల్లి పరుగులు పెట్టసాగాను. ఆతడు నన్ను పట్టుకొని బలవంతంగా తన ఉద్యానవనానికి తీసుకుని వచ్చాడు. మూడు రోజులు తరువాత ఆతడు నన్ను అయోధ్యా నగరానికి తీసుకొచ్చాడు. ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! ఆ సామంతరాజు లేడి జాతులలో ఉత్తమజాతి సౌందర్యాన్ని సంతరించుకున్నట్టి నన్ను మీకు క్రీడార్థం బహుమతిగా సమర్పించాడు.

Page:462

చూచారా! రామచంద్రమూర్తీ! ఈ ప్రకారంగా నా వృత్తాంతమంతా జగత్తులో ప్రసిద్దమే అయివున్న ఇంద్రజాలపు మాయవలె ఆశ్చర్యకరంగా ఉన్నది.

అనేక శాఖలయొక్క విస్తారముతో కూడినట్టి ఈ అవిద్య అనంతమైనది. అద్దానిని ఎంతగా పరిశీలించుకుంటూ పోయినప్పటికీ అది శమించదు. అది శమించాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే అందుకు ఉపాయం. ఆత్మజ్ఞానముచే, ఈ దృశ్యమంతా వేరుగా లేదు. ఇదంతా స్వస్వరూపాత్మ యొక్క క్రీడావినోదమే! లీలావినోదమే! అని గ్రహించి పరమశాంతిని పొందుచున్నాను.

శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఆ విధంగా పలికి విపశ్చిత్తు మహారాజు ప్రశాంత చిత్తముతో కొద్ది క్షణాలు మౌనం వహించారు. అప్పుడు రామచంద్రుడు విపశ్చిత్తును ఈ విధంగా ప్రశ్నించాడు.

శ్రీరాముడు : ప్రభూ! విపశ్చిత్ మహారాజా! ఆ 'లేడి' అనేది మీ చిత్తాకాశంలోని భావనారూపమే కదా! మీ సంకల్ప మాత్రమగు ఆ లేడి అటువంటి లేడికి సంబంధించిన సంకల్పం ఏమాత్రం లేనట్టి మా ప్రియ సామంతరాజుకు ఒక భౌతికమైన లేడిగా కనిపించటమేమిటి? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదే! ఇది ఎట్లా సిద్ధించింది?

విపశ్చిత్ మహారాజు : ఇంద్రభగవానుడు నాకు వరప్రసాదార్థం ప్రత్యక్షమైనప్పుడు ఈ విషయం చెప్పారు. దుర్వాసముని శాపం ఇస్తున్నప్పుడు నీవు - నీ వరప్రసాది అగు ఆ విపశ్చిత్తు కూడా మీ చిత్తాకాశంలో మృగదేహత్వం పొందుచూ ఉండగా మీరిద్దరు మృగదేహధారులై తదితర జీవులకు కూడా అగుపించగలరు" ... అని తెలియజేసినట్లు ఆ ఇంద్రభగవానుడు నాకు చెప్పటం జరిగింది. మా యొక్క మృగత్వం తదితరులకు కూడా అట్లే మృగరూపంగా కనిపించటం జరిగింది. ఓ రామచంద్రా! శ్రీవసిష్ఠ మహర్షి ఈ విషయం మీకు విశ్లేషణ పూర్వకంగా ఇన్ని రోజులుగా చెప్పియే ఉంటారు. అయినా మీరు అడిగారు కాబట్టి వారి అనుజ్ఞతో మీకు వివరిస్తున్నాను. వినండి.

మనకు ఎదురుగా ఈ వ్యావహారిక జగత్తు సత్తు కాదు. సాంకల్పిక జగత్తే జగత్తు. పాంచభౌతిక జగత్తు అసలైన జగత్తు కాదు. అటు సంకల్పరూప జగత్తుగాని, ఇటు పాంచభౌతిక జగత్తుగాని... ఈ రెండు రూపములుగా చిత్ప్రకాశమే ఉదయించటం జరుగుతోంది. కాబట్టి ఇక ఏది సత్తు? ఏది అసత్తు?

ఓ రామచంద్రా! ఈ సభలో చెప్పుకొనే యుక్తుల సందర్భంలో స్పష్టమైన బోధకొరకై మరొక యుక్తిని చెప్పుతాను వినండి.

యస్మిన్ సర్వమ్, యతః సర్వం, యత్సర్వం, సర్వతశ్చ యత్,

బ్రహ్మ తస్మిన్ మహాభాగ! కిం న సంభవతీహ హి?

దేనియందైతే సమస్తము కలదో, దేనినుండైతే సమస్తము ఉత్పన్నమౌతుందో, ఏదైతే సర్వరూపము

Page:463

అయి వెలయుచున్నదో అట్టిదాని యందు ఏది సర్వదా సంభవించదు? ఓ మహాభాగా! ఏది ఎట్లాగైనా సిద్ధించగలదు కదా! అసలు 'ఊహ'లో జనించిన పదార్థములు (సంకల్పిత పదార్థములు) కలుస్తూ ఉంటాయి. అవే [విషయములను, పదార్థములను సంకల్ప నగరంలో (ఊహానగరంలో) దర్శిస్తున్నప్పుడు అందులోని ఒక పదార్థం మరొక పదార్థంతో] కలువకుండాను ఉంటాయి. స్వప్నంలోని ఒక పదార్థం - - మరొక పదార్థం కలుస్తూ ఉంటాయి. కలవకుండాను ఉంటాయి. అట్లాగే సద్రూపము

సర్వస్వరూపము అగు పరమాత్మయందు సత్యము కానిదిగాని, మిథ్యకానిదిగానీ ఏ పదార్థమూ లేదు. సర్వత్రా - సర్వదా - సర్వవిధములా - సర్వస్వరూపము అయినట్టి పరబ్రహ్మమునందలి అసంఘటిత - సంఘటిత సమర్థమైనట్టి మాయ అతిభయంకరమైనది. (అఘటనా - - ఘటనా పటీయసీ మాయా). అట్టి మాయ మహామోహము కలుగజేయునదై ఉన్నది.

విధి నిషేధ పదములు రెండూ ఒకే చోటనే స్థితిపొంది ఉంటున్నాయి. మరి బ్రహ్మసత్త యొక్క మాహాత్మ్యము’ ఇట్టిదైయున్నది. ఎందుకంటే అయ్యది... తనను ... తనచే అనేక రూపములుగా సృజించుకొనుచున్నది. బ్రహ్మసత్త చేతనే పరిఢవించుచున్న మాయ

బ్రహ్మ సత్త

అనాది సఆది

అనాది : బంగారమునకు ఇది' అనబడే ఆకారం లేదు. కానీ ఏదో ఆకారం సర్వదా కలిగియే ఉంటుంది. అట్లాగే బ్రహ్మసత్త మాయను కలిగి ఉంటూనే ఉంటుంది. అయితే అది మాయకు స్వాధీనమై ఉండేది కాదు. అందుచేత బ్రహ్మసత్త ఎట్లా అనాదియో, మాయకూడా అట్లాగే అనాది.

సఆది : ఏఏ పాంచభౌతిక సమ్మేళనం జగత్తుగా కనిపిస్తోందో... అందలి పదార్థాలన్నీ కూడా ఒకప్పుడు సమ్మిళితమై మరొకప్పుడు విడిపోతూ ఆది - అంతములు కలిగియే ఉంటున్నాయి కదా!

ఈ విధంగా అవిద్య జ్ఞానముచే నశించునది కాబట్టి సా దిగాను, సాపేక్షికంగా చూస్తే సత్యమైనదిగాను అనుభూతమౌతోంది. ఈ త్రిలోకములు కూడా చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే కాకపోయి ఉంటే మహాకల్పాంతంలో అంతా నశించగా, మరల ఈ దృశ్యాంతర విశేషాలన్నీ ఎక్కడి నుండి ఉత్పన్నం కాగలవు చెప్పు? ఈ అగ్నియొక్క - వాయువు యొక్క - భూమియొక్క పునరుత్పత్తి ఎక్కడి నుండి జరుగగలదు చెప్పు?

కాబట్టి, చిత్స్వభావం యొక్క స్ఫురణ " కంటే ఈ జగత్తు ఏమాత్రం వేరైనది కాదు.

ఈ కనబడే జగత్తు ఉహామాత్రమే అనుదానికి శాస్త్రముల అంతిమసారమగు ఉపనిషత్తులు

- విజ్ఞుల అనుభవమే మనకు ప్రమాణం. ఒకవేళ ఎవరైనా లోకప్రసిద్ధమైన విజ్ఞుల సిద్ధాంతమును

అంగీకరించక “ఇదంతా పదార్థమయం. అంతేగాని భావనామయం కాదు. వస్తువునుబట్టే భావన ఉంటుంది. అంతేకాని... భావనను అనుసరించి వస్తువులు ఉండవు" ... అని నమ్మదలచుకొన్నారా... అట్టి అభిప్రాయం మూర్ఖభిప్రాయమేనని నా అభిప్రాయం! నా అనుభవం కూడా!

Page:464

భావనను అనుసరించే జగత్తు ఉంటోంది. భావనను అనుసరించనివానికి జగత్తు ఉండదు. ఇదే నా అనుభవసారం. అందుచేత భావనచే ప్రాప్తిస్తున్న జగత్తును బ్రహ్మభావన యందు లయింప జేయటమే ఆత్మజ్ఞుల సంవిధానం. చైతన్య దృష్టిచే సర్వభేదములు రహితమైపోతున్నాయి. తదితరమైన దృష్టి నిస్సారమైనది. విజ్ఞులు శాస్త్రములు ఇది అనునిత్యంగా బోధిస్తున్నప్పటికీ మూర్ఖులు గ్రహించలేకపోతున్నారు. విజ్ఞులు గ్రహించగలుగుచున్నారు.

నిశ్చలవాయువే తన చంచల స్వభావముచే అనేక వాయుతరంగాలుగా అగుపిస్తోంది. ఒక వాయుతరంగానికి ఇంకొక వాయుతరంగానికి కనబడే భేదం (ఆకారాదుల దృష్ట్యా భేదం సత్యమే అయినప్పటికీ) వాయువు దృష్ట్యా భ్రమయే కదా! అట్లాగే శుద్ధజ్ఞానరూపమగు బ్రహ్మసత్తయే నేను అవిద్యను అను భావనచే ఈ జగద్రూపంగా స్ఫురిస్తోంది.

శ్రీరాముడు : ఓ విపశ్చిత్ మహారాజా! ఈ జగత్తులో జీవులందరికీ జననము - జీవనము - మరణము సంభవిస్తూ ఉండటం చూస్తూ ఉంటాము కదా! అనుభవజ్ఞులగు మీరు వీటిపై ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు?

విపశ్చిత్ మహారాజు :

న కశ్చిత్ నే హ మ్రియతే! జాయతే న చ కశ్చన! మృతో2_హమ్' ఇదమస్తీతి ప్రతిభైవ చిదాత్మికా ॥

వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎవడూ మరణించటమూ లేదు. జన్మించటమూ లేదు. చిద్రూపం యొక్క చిత్రకాశమే నేను మరణించాను అని ఈ విధంగా (భావనానుసరణంగా) క్రీడవలె ఏదో ఉత్తుత్తిగా ఉదయిస్తోంది.

శ్రీరాముడు : మరణించినవాడు దృశ్యమును కోల్పోవుచున్నాడు కదా! కనుక దృశ్యము యొక్క అత్యంత నాశనమే మరణమని చెప్పవచ్చా?

విపశ్చిత్ రాజు :

మృతిః అత్యంత నాశశ్చేత్, తత్ సా నిద్రా సుఖోపమా పునః దృశ్యోపలంబశ్యేత్ నను జీవతమేవ తత్

దృశ్యము యొక్క అత్యంత నాశనమే మరణమని మనం అనుకుంటే, అప్పుడు అట్టిది రోజూ ప్రతిజీవుడు అనుభవిస్తున్న సుషుప్తి సుఖము వంటిదే అవుతుంది కదా! లేదూ... మరణానంతరం మరల దృశ్యము ప్రాప్తిస్తోందని అనుకుంటే... అది గాఢనిద్ర నుండి మేల్కొని జాగ్రత్ను పొందటం వంటిదే అవుతుంది కదా! మరి... గాఢనిద్ర వచ్చినప్పుడు “ఈ జీవుడు మృత్యువును పొందాడు” అని గాని, మెళకువ వచ్చినప్పుడు జన్మ పొందాడు" అని అనం కదా! దుఃఖించం కదా!

తస్మాత్నేహాస్తి మరణం! తన్నైవాస్తి జీవితమ్! కస్మింశ్చిన్మాత్ర కచనే ద్వయం వాప్యస్తి నైన వా చేతితం ద్వయమప్యస్తి నాస్తి ద్వయమచేతితమ్ |

Page:465

కాబట్టి రామచంద్రా! వాస్తవానికి ఈ జగత్తులో మరణమూ లేదు. జీవితమూ లేదు. ఒకవేళ అవి ఉంటే... ఆ రెండూ కూడా ఒకే “చిన్మాత్రంలోనే ఉండి ఉన్నాయి... లేవు కూడా అని గ్రహిం చండి. దృశ్య రూపంగా చూస్తే అవి ఉన్నాయి. ద్రష్టరూపంగా చూస్తే అవి లేవు. ఎద్దాని యందైతే ‘ద్వైతము-అద్వైతము’ అనబడే రెండూ కూడా స్ఫురణమగుచున్నాయో... అట్టి చైతన్యము సర్వదా ఏకమే అయివున్నది.

చైతన్యము (Experiencer), జగత్తు(Experiences)... సర్వసాక్షియగు ఆ చైతన్యము సదా అనంతమై, సర్వదా క్షేమ స్వరూపమై వెలయుచున్నది. అట్టి చిన్మాత్రమునకు అన్యంగా జీవితం ఏమున్నది? మరణం ఏమున్నది?

అట్టి చైతన్యం సర్వదా దుఃఖరహితమై, అక్షయ రూపమై ఒప్పుచున్నది. కాబట్టి ఇక ఎవనికి ఎచట దుఃఖము ఉన్నదో చెప్పండి? ఎందుకంటే తత్త్వదృష్టిచే వాచకము, వాచ్యం (రూపం)... ఈ రెండూ కూడా చిదాకాశమాత్రమే అయివున్నవి. ఉన్నదంతా చైతన్యమునందే ఉన్నది. ఇక అట్టి చైతన్యమునకు అన్యమైనది కాని, అనన్యమైనదిగాని (అన్యముకానిదిగాని) ఏదీ లేనే లేదు. ఇక ద్వైతమెక్కడ? ఏకత్వమెక్కడ? జలంలో ఎన్ని తరంగాలు ఉన్నప్పటికీ ... తరంగాలు వేరు వేరు - కాని తరంగాలన్నీ జలమే - రెండూ సత్యమే కదా! అట్లాగే పరబ్రహ్మమున దేహాలు ఉన్నాయి. పరబ్రహ్మము వాస్తవానికి సర్వదా యథాతథము.

ఈ జగత్తుకు కారణం 'చిత్సత్తా'యే కదా! కనుక ఈ జగత్తు చిత్ సత్తా కంటే వేరుకాదు. ఈ జగత్తు చైతన్యము యొక్క ప్రకాశమాత్రమై శాంతరూపమై నాశరహితమై వెలయుచున్నదని నేను గ్రహించాను. వాస్తవానికి ఈ జగత్తు సాకారంగా కనిపిస్తున్నప్పటికీ ఇదంతా నిరాకారం. ఇదంతా పరమశాంత రూపమైనప్పటికీ అశాంతముగా నాశనవంతముగా కనిపించటమే ఆశ్చర్యం! అదంతా కూడా చిత్తము యొక్క భ్రమ విన్యాసమే అయి ఉన్నది. వాస్తవానికి ఈ జగత్తు ఇతఃపూర్వం (జన్మాదిలో) విషయము కాకయే ఉన్నది.

ఓ రామచంద్రా! స్వతహాగా వస్తురహితము - - శూన్యము అగు చిదాకాశమే ఈ వర్తమానపు అనుభవమునందు దృశ్య పిశాచరూపంగా భాసిస్తోందని నేను గ్రహించాను. ఈ భూతాకాశం ఉన్నట్లే... చిదాకాశము కూడా ఉన్నది. చిదాకాశమే భూతాకాశరూపంగా తన శూన్యత్వమును కొనసాగిస్తూ స్థితినొందియున్నది.

చిదాకాశమే... ఊర్ధ్వమున ఆకాశరూపంగాను, అధోభాగంలో పృథివీరూపంగాను, తదితర ప్రదేశములందు వాయు, అగ్ని, జలరూపంగాను, దిక్కులుగాను, వృక్షాది రూపములుగాను, ఇట్లే అనేక రూపములుగా ఉండి ఉన్నది.

ఏది చిత్ప్రకాశమో... అదియే జగత్తు అయివున్నది. అంతకుమించి ఇక్కడ జగత్తులో ఏకత్వము గాని, ద్విత్వముగాని లేవు. తత్త్వవేత్తల దృష్టిలో ఇక్కడ సాకారముగాని, నిరాకారముగాని ఏమీ లేవు. ఈ దృశ్యమంతా కూడా నాశరహితమగు చిదాకాశమే అయివున్నదని గ్రహిస్తున్నాను.

Page:466

పూర్వ దృష్టి యందు ఇచట జ్ఞాన - - అజ్ఞాన - సత్ అసత్తుల భేదమేమీలేదు. నిత్య సత్యస్వరూపమగు చిద్రూపాత్మయందు సత్-అసత్తులు రెండూ సమానమే అయివున్నాయి. కాబట్టి ఇదంతా కూడా కాష్ఠరూపమువంటి చిద్రూప పరబ్రహ్మమే అయివున్నది. ఈ దృశ్యము అనంతమగు బ్రహ్మమే అయివున్నది. అట్టి అవగాహనయే 'పరమపదము' అని శాస్త్రములచే వర్ణించి చెప్పబడుతోంది. బ్రహ్మమే ఈ సమస్త దృశ్యరూపంగా స్థితి నొంది ఉన్నది.

చూచారా రామచంద్రా! ఈ ప్రకారంగా చైతన్యమే జగద్రూపంగా స్ఫురించటం జరుగుతోంది. అధిష్ఠాన దృష్టిచే చూస్తే, చిదాకాశము యొక్క స్ఫురణయే నాశరహితమగు జగత్తు అయివున్నది. నా సుదీర్ఘమగు అనుభవమంతా రంగరించిన నా నిశ్చయం ఇది.

శ్రీరాముడు : ఓ విపశ్చిత్ మహారాజా! అసంఖ్యాకులగు మృతజీవుల తదనంతర స్థితి ఏ రూపంగా ఉంటోంది? ఏ రూపంగా కొనసాగుతోంది?

విపశ్చిత్తు : అసంఖ్యాకులగు మృతజీవులు కూడా సర్వత్రా అణువణువునా అసంఖ్యాకములగు సృష్టులు కలిగియే ఉంటున్నారు. అట్టివారిచే పొందబడే అనేక జగత్తులు పరస్పరం అప్రతిబంధకములై, అదృశ్యములై (ఒకదానికి మరొకటి సంబంధించనిదై), నాశరహితములై ఉంటున్నాయి. కొన్ని జగత్తులేమో ఒకదానికి మరొకటి ప్రతిబంధకములై, పరస్పరం దృశ్యములై ఉంటున్నాయి. జీవించి ఉన్న వారి విషయం కూడా అట్టిదే కదా!

(ఉదాహరణకు : మనతో సంబంధం కలిగియున్న ఒక మిత్రుని జగత్తు మన జగత్తుతో ప్రతిబంధక - దృశ్యమాన సంబంధం కలిగి ఉంటోంది. ఆ ప్రక్కనే నడచి వెళ్ళుచున్న ఒకానొక పిచ్చివాడు పొందుతున్న ఆస్వాదిస్తున్న జగత్తు మనకు అప్రతిబంధకమై, అదృశ్యమై ఉండటం జరుగుతోంది కదా!)

ఈ జగత్తులో అనేక లోకాలున్నాయి. పరస్పరం ఉత్తరోత్తర సూక్ష్మతరములైనట్టి సిద్ధలోకములు కూడా ఉన్నాయి. అవన్నీ ప్రక్క ప్రక్కనే ఉంటూ ఒకదానిచే మరొకటి దర్శించబడటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ దృశ్యాలన్నీ కూడా ఆత్మరూపమగు చిదాకాశమే అయి ఉన్నది. స్వప్నంలో కనిపించేదంతా స్వప్న ద్రష్టకంటే వేరుకాక పోయినప్పటికీ స్వప్న ద్రష్టకు తనకంటే వేరైన దానివలె అనుభూతమగుచున్నది కదా! అట్లాగే, స్వాత్మకంటే వేరైన ద్రష్టత్వము గాని దృశ్యముగాని ఇక్కడగాని, మర్కెడాగాని లేనే లేదు.

మరొక్క ముఖ్యమైన విషయం కూడా నేను గమనించాను. ఈ దృశ్యము ఎవరు ఎట్టి సంకల్పముచే దర్శిస్తే ఇది అట్లే అనుభూతమౌతూ ఉంటుంది. ఇది చిదాకాశముగా ఎరుగబడినప్పుడు అట్లాగే యథారీతిగా చిదాకాశముగానే వెలయుచుండటం జరుగుతోంది. పరమార్ధమున ఈ దృశ్యమంతా కూడా ప్రకాశమాత్ర స్వరూపమై, నిర్వాణ రూపమై ఉన్నది. మేలుకొని ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని ఉండటం చేత అంధకారమే కనిపిస్తుంది చూచావా? అట్లాగే అజ్ఞానముచేత మాత్రమే ఈ జగత్తు దృశ్యరూపముగా కనిపిస్తోంది.

Page:467

వాస్తవానికి ఇది ద్రష్టరూపమే! ద్రష్ట ఆత్మరూపమే! కనుక ఇదంతా ఆత్మరూపమే! ఎప్పుడైతే జ్ఞానముచే ఈ దృశ్యమంతా అధిష్ఠాన చిద్రూపంగా తెలియబడుతుందో... ఇక ఆపై ఇది సత్తు అయినా, (లేక) అసత్తు అయినా అట్టి బ్రాహ్మీదృష్టిని పెంపొందించుకొన్నవానికి వచ్చే నష్టమేమీలేదు. దృశ్యం అప్పుడు ఉన్నా... ఉండకున్నా ఒక్కటే! ఎందుకంటే ఆత్మజ్ఞానముచే ఈ నామరూపాత్మక జగత్తు పూర్తిగా శమించినదై ఆత్మరూపంగా అనుభూతమగుచున్నది కదా!

సముద్రంలో అనేక జలబిందువులు ఒకదానితో మరొకటి ఒక క్షణంలో కలుస్తూ, మరల మరుక్షణం విడిపోతూ ఉంటాయి చూచావా? చిద్రూప పరబ్రహ్మము అనే మహా సముద్రంలో స్ఫురించే జీవులంతా అజ్ఞానమున్నంత వరకు పరస్పరం సంయోగ-వియోగాలు పొందుతూ ఉంటారు.

చిదాకాశమయమగు ఈ సృష్టి సృష్ట్యాదియందు ఒక స్వప్నంవలె భాసిస్తోంది. అందుచేత అంతాకూడా శాంతమగు పరబ్రహ్మమే అని నిరూపణకు నేను వచ్చియున్నాను.

ఓ రామచంద్రా! "అవిద్య యొక్క అంతు ఎక్కడ?" అనే నా సుదీర్ఘమైన కుతూహలంతో కూడిన ప్రయాణం అనంత వైభవములతో కూడినదైనది. అనగా అనేక జగత్తులను నా సుదీర్ఘ అవిద్యయొక్క అంతు ఎక్కడ?”... అనే కుతూహల ప్రయాణంలో నేను చూచాను. నిజకర్మల యొక్క పరిణామమై విజృంభించిన అనేక సుఖ-దుఃఖాలు అనుభవించాను. అనేక దిక్కులలో అనేక

యుగయుగాలుగా సంచరించాను.

అంతటికీ కారణం నాయొక్క దృశ్య సంస్కారమేగాని మరింకేమి కాదు'... అని నేను గమనించాను. ఆత్మజ్ఞానం చేత తప్ప ఈ దృశ్యదోషము మరింకే ఉపాయము చేతకూడా ఉపశమించేది కాదు”... అని సిద్ధాంతీకరించి ఈ సభలో ప్రకటిస్తున్నాను.

శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! ఈ ప్రకారంగా లేడి ఉపాధిని త్యజించి భాసుడుగా మానవ ఉపాధిని పొందిన ఆ విపశ్చిత్ మహారాజు ప్రసంగించాడు. ఇంతలో సూర్య భగవానుడు అస్తమించడం సూచిస్తూ దుందుభులు మ్రోగాయి. దశరథుడు విపశ్చిత్తును అతిథి దేవతా రూపంగా పూజించి గృహ - ధన స్త్రీ జనాది ఐశ్వర్యములను సమర్పించాడు.

సభ ముగిసింది. 20వ రోజు ప్రవచనం పూర్తి అగుటచే అందరూ గృహోన్ముఖులైనారు.

(ఇరవైయ్యవ రోజు విచారణ పూర్తి అయింది)

Page:468

ఇరవై ఒకటవ రోజు

32. పుణ్య - పాప - ఫలాలు అనివార్యం

శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! 21వ రోజు సభికులంతా సభలో సమావేశమైనారు. అప్పుడు ప్రస్తుత విషయమును అనుసరించి శ్రీ వసిష్ఠ మహర్షి ఈ విధంగా ప్రసంగం కొనసాగించారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ సభికులారా! నిన్నటి విపశ్చిత్ మహారాజు ప్రసంగం విన్నారు కదా! అనేక యుగముల కాలం అనేక ఉపాధులతో సుదీర్ఘ ప్రయాణం కుతూహలంగా కొనసాగించినప్పటికీ అవిద్య యొక్క అంతము ఆయన కనుగొనలేకపోయారు. దీని అర్థమేమిటి?

అవిద్య చమత్కారం - అవిద్య ఎరుగబడకపోయిందా... దేశకాలములచే అనంతమైనదై భాసిస్తుంది. అవిద్య ఎరుగబడిందా... మృగతృష్ణాజలంలాగా మొదలే లేనిదై ఉండగలదు.

ఈ భాసుని (విపశ్చిత్) అవిద్యా అన్వేషణ కథనమంతా విన్నాం. ఇక నుండి ఈతడు అవిద్య మొదలేలేదు అని గ్రహించి జీవన్ముక్తుడై చెన్నొందుచున్నాడు.

బ్రహ్మమే తనయందు ఈ 'అవిద్య' అనే సంవిత్తును ధరించినదగుచున్నది. ఈ కారణంచేతనే భ్రమచే అసత్తే అయి వున్న అవిద్య యొక్క రూపం సత్తువలె గోచరిస్తోంది.

అవిద్య అనంతమైనది. అనేక శాఖలుగా విస్తరించి ఉంటోంది. జడమైనది. మనోహరమైనది. ఆసక్తి' అనే రసముచే పరిపోషించబడుచున్నది. 'మోహము' అనే సమయంలో వికసిస్తోంది. అద్దాని అభ్యంతరము మాత్రం శూన్యమైనది. అనేక రూపములుగా గ్రంథయుక్తమైనది. ఆసక్తుల పరంపరచే నిర్మించబడినదై సుదీర్ఘంగా విస్తరించియున్నది. అత్యంత నిష్ఫలమైనది. అయినప్పటికీ వ్యర్థంగా అనేక ఫలముల గురించి అనేక ఆశ-సందేహములను జనింపచేసేది. అది చిత్తమును మరిపించటంలో ఎంతో ప్రావీణ్యత కలిగియున్నది. అయితే తత్త్వజ్ఞులు మాత్రం, మొదలే లేదు. ఇక ప్రశసార్థం చెప్పుకోతగినది ఎట్లా అవుతుంది?... అని ప్రశ్నిస్తున్నారు. ఈ అవిద్య వాస్తవానికి రూపరహితం అయినప్పటికీ అత్యంత స్థూలంగా కనబడుతూ బ్రహ్మాండమునంతా పూరించి ఉంటోంది. అనేక ప్రాణులచే వ్యాప్తమైయున్నది. అజ్ఞానంచేత ఉనికి పొంది ఉంటోంది. అతి దీర్ఘమైనది. అద్దానిని అంధకారమయమగు రాత్రితో పోల్చవచ్చు. ఇది చిత్ర - విచిత్ర - వర్ణయుక్తమై ఉంటోంది. గుణరహితం అని చెప్పవచ్చు. శూన్యంలో విశాలాకాశం ధరించియున్నట్టిది. జడత్వముచే అనేక కీడులు కల్పించగలిగినట్టిది. అది ఆకాశంలో ఇంద్రధనుస్సు' వలె అత్యంత భ్రమయుక్తం, అవాస్తవం కూడా! ఈ అవిద్య జడ తరంగములతో పూర్ణమై ఉన్నది. మలిన విలాసము అనే నురుగుచే కప్పబడింది. 'ఉత్పత్తి -క్షయము' అనే చక్రవర్తనములతో వర్షాకాలపు నదివలె ప్రవర్తిస్తోంది.

Page:469

కర్కశమై శ్మశాన భూమివలె అశుభప్రదమై వెలయుచున్నది. ఈ అవిద్య నిరంతరం అనేక ప్రవహించే జగత్తులను తనయందు కలిగి ఉంటోంది. 'రజోగుణము' అనే ధూళితో ఈ అవిద్యా నదీజలం బహు కల్మషమై ఉన్నది.

ఒకడు స్వప్నపురంలో ఎంతకాలం సంచరించినా కూడా అందులో నుంచి తాను పొందేదే ముంది? పోగొట్టుకునేదేమున్నది? అట్లాగే ఈ జాగ్రత్ స్వప్నపురంలో చిరకాలం సంచరించినా కూడా ఇక్కడి నుండి తాను తన వెంట తీసుకువెళ్ళగలిగేది ఏదీ లేదు. ఇక్కడికి తెస్తున్నదీ లేదు. యాని సంకల్ప జాలాని ప్రతిష్టామాగతాన్యలమ్ |

త్యక్తేత దృశ్యజాలస్థ దేహానాం దృఢచేతసామ్ ॥

మరణకాలంలో ప్రతి జీవుడు దేహమును ఇక్కడే త్యజించి ఎటకో వెళ్ళుచున్నాడు కదా! అట్టి మరణ సమయంలో ఏ దృశ్య జగదాకార దృఢచిత్తం కలిగి ఉంటాడో... ఏఏ దృఢసంకల్పం పెంపొందించుకొని (చిత్తంలో) ఘనీభూతంగా అవధరించి ఉంటాడో... అవియే ఆతని పట్ల ఆ తదనంతరం కూడా జగత్ - దేహాది రూపాలుగా ప్రతిష్ఠ పొంది ఉంటున్నాయి. 'జగత్' అంటే ఈ పాంచభౌతిక రూపం కాదు. మనస్సు యొక్క జగత్ భావనా వైచిత్రమే అసలైన ఈ జీవునికి సంబంధించిన జగత్తు. అట్టి జగత్ మనో వైకల్యమును అనుసరించి మృత్యు తదనంతరం కూడా సంసారము ఆ జీవునిపట్ల కొనసాగుచూనే ఉన్నది.

మనస్సు యొక్క సంకల్పములే చిదాకాశమునందు ఈ నగర - భూమి - ఆకాశ - - తదితర జీవుల గుణముల వ్యవహారముల - రూపంగా జీవునికి అనుభూతమౌతున్నాయి. అవి అసంఖ్యాకములై ఉండి ఈ సర్వ భౌతికజగద్రూపంగా అనిపిస్తున్నాయి. అట్లాగే మనోసంకల్ప పరంపరా భ్రాంతి చేతనే సిద్ధలోకములు ఆకాశంలో పరస్పరం భాసించటం, భాసించకపోవటం కూడా జరుగుతూ ఉంటోంది. ఆయా లోకాలు, వాటిలో ప్రాణిసమూహాలు, ఆయా ప్రాణుల సంబంధ బాంధవ్యములు - అంతా సంకల్ప సమూహ ప్రభావములేనని సభికులంతా గ్రహించెదరు గాక! శుభాశుభకారకములగు శాస్త్రోక్తలోకములు - అన్నీ కూడా భోగ్యకారకమైన స్థిరమైన మనస్సు యొక్క పరిణామము మాత్రమే! ఈ గోడలో ఇట్టి స్థూలత్వం దర్శించటం నుండి సిద్ధ లోకములలో భోగముల వరకు అంతా మనో పరిణామమే! స్వప్న - మనోరథాదులలో సమస్త పదార్థములు మనస్సు యొక్క పరిణామములే కదా! అట్లే జాగ్రత్ విషయం కూడా!

ఇప్పుడీ సృష్టి, ఈ ఈ దృశ్యము కంటికి పంచభూతమయంగా భాసించవచ్చు గాక! అయినప్పటికీ సృష్ట్యాదియందు ఏకైకమగు బ్రహ్మము మాత్రమే కలదు. ఇప్పుడు కూడా వాస్తవానికి బ్రహ్మమే బహువిధములుగా మనోసంకల్ప ప్రభావం చేత అనిపిస్తోంది. (సదేవ సోమ్యే ఇదమగ్ర ఆసీత్ఏకవమేవా_ద్వితీయమ్ బ్రహ్మ" అని) వేద వాక్కులు అట్లే పలుకుచున్నాయి. బ్రహ్మమునకు వేరుగా ఏదీ ఎక్కడా ఏ సమయమందునూ లేనేలేదు. ఇక జగత్తు బ్రహ్మమునకు వేరుగా ఉండి ఉండటానికి కారణమే లేదు.

Page:470

ఈ అనంత జగత్తులన్నీ కూడా అసద్రూపములే! ఏఏ ప్రకారంగా ఏవేని మనస్సుచే కల్పించ బడుచున్నాయో... అవన్నీ ఆయా రీతులుగా చైతన్యమునందు (ఆ రీతిగానే) భాసిస్తున్నాయి.

ఓ సభికులారా! ఈ జగత్తు మీ ఊహకందునది కాదు. ఎందుకంటే... ఊహయే ఈ మీ జగత్తు యొక్క వాస్తవ రూపం కనుక! ఇంక ఇక్కడ విచిత్రమేమున్నది? స్వప్నంలో చిత్ర విచిత్రాలు కనబడినాయికదా అని, మనం ఆశ్చర్యపడుచున్నామా? లేదే! అట్లాగే ఈ జగత్తు కూడా!

ఐందవులు మనస్సు యొక్క మననం చేత గొప్ప గొప్ప బ్రహ్మాండాలను నిర్మించి వేశారు. అట్లాగే ఈ సభికులలో ఏ ఒక్కరైనాసరే... తీవ్ర సంవేగయుక్తమగు సంకల్పం చేత, ఏక రసాభ్యాసం చేత ఐందవన్యాయమును అనుసరించి తమతమ ఇచ్ఛానుసారంగా శూన్యాకాశంలో నగరాలు సృష్టించగలిగే మనోశక్తిని కలిగియే ఉన్నారు. అంతేకాదు. ఎవరైతే శూన్యాకాశంలో నగరాలు సృష్టిస్తారో... వారు దేహము త్యజించిన తరువాత కూడా ఆయా సంకల్ప నగరాలు (వారు ఆ విధంగా సంకల్పిస్తే) అదే రీతిగా కొనసాగగలవు.

అట్లాగే “నాకు అనుబంధాలు ఉన్నాయి అని సంకల్పించటం చేత జగత్తులో ఆ ద్రష్టకు తదితర జనులతోటి అనేక అనుబంధాలు కొనసాగటం... ఈ దేహం ఉన్నప్పుడు - దేహానంతరం కూడా... జరుగుతోంది.

ఎవడైతే... “1.పూర్వకాలపు ఉపాసనా సిద్ధమై ఈ ప్రపంచమూ ఉన్నది. 2.ప్రపంచం భావనను అనుసరించే అనుభవమౌతోంది. కాబట్టి - స్వసంకల్పిత ప్రపంచమే అయి ప్రాప్తిస్తోంది. అనగా, నా ఊహచేతనే ఇది పొందబడుతోంది.” అని ఈ రెండూ ఒకే సమయంలో సత్యమే” అనుకుంటూ ఉంటాడో, ఆతడు అట్లే (ఆతని భావనానుసారంగా) పొందటం జరుగుతుంది.

పై రెండింటిలో ఒకటే సత్యమని మరొకరెవరైనా అనుకుంటూ ఉంటే అది అట్లే ఘనీభూతమై ఆతనిపట్ల సత్య - నిత్యానుభవమై తీరుతుంది. అనేక ఉత్కృష్ట పదార్థములకు - మనోశక్తులకు ఆలవాలమైన సిద్ధలోకములు కూడా అట్టివే! మనస్సు యొక్క దృఢ సంకల్పముచేతనే ఆయా లోకాలు, వాటిలో స్థానాలు సిద్ధిస్తున్నాయి.

అట్లాగే 'నరకము’ మొదలైన లోకములు కూడా అనేక దుఃఖములతో కూడి కల్పన చేతనే భాసిస్తున్నాయి. ఆయా సర్వలోకాలు కూడా ఉపాసనా ఫలము... ఆయా లోకముల పట్ల సత్యత్వబుద్ధి, దృఢాభ్యాసము వలననే జనులకు సత్యముగా భాసిస్తున్నాయి.

శ్రీరాముడు : స్వామీ! "నేను నరక లోకం చేరాలి" అని పాపకార్యములు చేసినవాడు అనుకోడు కదా! అయినా కూడా పుణ్యములు నిర్వర్తించేవానికి పుణ్య (సుఖ) లోకములు, పాపకార్యములు ఆచరించేవానికి దుఃఖకరములగు పాపపు లోకములు సంప్రాప్తిస్తున్నాయి కదా! మరి ఆయా లోకముల పట్ల సత్యత్వ బుద్ధి - దృఢాభ్యాసం వలననే ఆయా లోకాలు లభిస్తున్నాయని అంటున్నారేం? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. పుణ్యలోకాలు పుణ్యలోకాల అస్తిత్వ బుద్ధి పుణ్యకార్యముల అనుష్ఠానం చేత (పుణ్యలోకాలు కావాలని కోరుకోకపోయినా) లభిస్తున్నాయి.

Page:471

పాపాచరణం చేత పాపలోకముల పట్ల "అవి ఉన్నాయి అనే అస్తిత్వబుద్ధి లేకపోయినప్పటికీ అవి సృష్టి యొక్క స్వభావముచే సిద్ధిస్తున్నాయి.

1. పుణ్యము వలన సుఖప్రదమగు లోకములు సిద్ధించటం.

2. పాపకార్యముల ప్రభావంచేత దుఃఖకరములగు పాపలోకములు ప్రాప్తించటం. 3. జ్ఞానముయొక్క అభ్యాసంచేత సర్వమునకు కేవల సాక్షిత్వము, సర్వరాహిత్యము, సర్వాతీతత్వము అనే మోక్ష చిహ్నం రూపంగా గల మోక్ష స్థితి పొందటం ఈ '3' కూడా అప్రతిహతమైన, ప్రాకృతమైన బ్రహ్మదేవ సంకల్ప సిద్దాంతములై అలరారుచున్నాయి.

కాబట్టి ఏదేది సిద్ధించాలనుకున్నా - సిద్ధిస్తున్నా 1. సంకల్పము 2. అందుకు సంబంధించిన ప్రయత్నము ... ఈ రెండే ఆయా ఫలములకు కారణములగుచున్నాయి. సంకల్పమును అనుసరించే సర్వము సిద్ధిస్తున్నాయి.

శ్రీరాముడు : హే మహర్షీ! ఒకానొకడు ఒకటి సిద్ధించాలని సంకల్పించాడనుకోండి, కాని ఇంతలోనే ఈ లోకంలో ఆధి - వ్యాధులు వచ్చిపడుచున్నాయి. ఇక అన్నిటినీ మ్రింగి వేయగలిగే మృత్యువు” అనబడే అతివిచిత్రమైన జగత్ సంఘటన ఈ జీవుని సర్వదా వెంటనంటియే ఉన్నది. ఈ విధంగా ఆతని సంకల్ప, ప్రయత్నములు మృత్యువుచే ముగింపు చేసివేయబడుచున్నాయి కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవునికి మృత్యువు వెంటనంటి ఉన్నమాట నిజమే! అయితే మృత్యువుతో ఏదీ ముగియటం లేదు. ఎట్లా అంటే, ఒకడు గాఢనిద్రకు ఉపక్రమించి కొంత సేపైన తరువాత నిద్రలేచినంత మాత్రంచేత ఆతని ఆశయములు, గుణములు - స్వభావం మొదలైనవి మారిపోతున్నాయా? లేదే! ఈ జీవుడు ఏ సంకల్పము కలిగి ఉంటున్నాడో, ఏ ప్రయత్నశీలుడై ఉంటున్నాడో... ఆతడు అద్దానినే పొందుచున్నాడు.

యద్యత్ సంవేద్యతే కించిత్ తత్ తథాపి అనుభూయతే |

సతివా అసతివా దేహే అస్మిన్ దేహ ఏవ మనోమయః ||

ఈ మనుజుడు దేనిని ఎంతెంత వరకు సంవేద్యత్వం నిర్వర్తిస్తూ ఉంటాడో (సంకల్పిస్తూ ఉంటాడో) అద్దానిని అనునిత్య సంకల్పనా పరంపర యొక్క ప్రభావం చేత - ఈ దేహం ఉన్నప్పటికీ, లేనప్పటికీ తప్పక అనుభవిస్తున్నాడు. ఏదైనా సరే, సత్ అనిగాని - అసత్ అనిగాని స్వసంకల్పానుసారమే అనుభూతమౌతోంది. ఇంకొక విషయం - ఈ దేహమంతా కూడా మనోమయమే అయివున్నది. భౌతికదేహానికి మరణమున్నది గాని మనోదేహానికి మరణం లేదు కదా!

శ్రీరాముడు : మహాత్మా! ఈ జీవునికి ఈ వర్తమాన దేహం, తదనంతర దేహం... ఇవన్నీ ఎద్దానిని అనుసరించి ఏర్పడుచున్నాయి?

శ్రీ వసిష్ఠ మహర్షి :

జీవః త్యజతి యద్భావే ఏకాం దేహమయీం ధియమ్ | తద్భావైకమయీమ్ అన్యామాశు తతైవ పశ్యతి ||

Page:472

ఈ జీవుడు ఏఏ భావాలతోటి ఒక దేహాన్ని త్యజిస్తున్నాడో... ఆ భావాల తోటియే మరొక దేహాన్ని చిదాకాశమునందు వీక్షిస్తున్నాడు. పుణ్యకార్యములు నిర్వర్తిస్తున్న చిదాకాశమయమగు జీవసంవిత్తు చిదాకాశమయములే అయివున్న శుభలోకములను అక్కడికక్కడే గాంచుచున్నది. అట్లాగే పాపకార్యములు అనుసరించినట్టి జీవ సంవిత్తు చిదాకాశములే అయివున్న అశుభ లోకములను అప్పటి కప్పుడే అక్కడే గాంచుచున్నది. వాటిని సుదీర్ఘకాలం అనుభవించుచున్నది కూడా! అనగా, సత్ కర్మ - ఉపాసన మొదలైన వాటితో శుద్ధమైనట్టి జీవచైతన్యము సూక్ష్మ రూపములగు సిద్ధలోకములు చూస్తున్నది. అదే రీతిగా పాప సంబంధమైన ఆచరణము గల జీవసంవిత్తు అక్కడికక్కడే 'నరకము' అని చెప్పబడే అనేక దుఃఖ పరంపరలను గాంచుచు వాటిని అనుభవించుచుండటం జరుగుతోంది. పాపముతో కూడిన ఆచరణముచే దుఃఖం అనివార్యమగుచున్నది.

కాబట్టి ఓ జనులారా! మీరు పాపకార్యములను సర్వదా విరమించియే ఉండాలని ఈ సందర్భంలో గుర్తుచేస్తున్నాను. ఎందుకంటే పాపంతో కూడి ఆచరణముచే అశుద్ధత్వము సంతరించుకొనే జీవచైతన్యము పొందుచున్న అనేక దుస్థితులకు అంతులేదని మేము గమనిస్తున్నాము. పాపాచరణంగల జీవులు... అనేక దురవస్థలతో కూడిన అనుభవములను పొందటం జరుగుతోంది.

రెండు తిరుగలి రాళ్ళమధ్యవలె రెండు పర్వతాకార చక్రముల మధ్య నలుగుతూ ఉండటం, అంధకారమయమగు నూతులలో ప్రవేశించి, ఇరుక్కొని ఎంత గీపెట్టినా బయల్వెడలు లేకపోవటం. జలరహిత విస్తార ప్రదేశంలో అమితమైన దాహంతో చిక్కుకొనిపోవటం. భయంకరమైన బాహు సమూహములచే ప్రహారాలు (దెబ్బలు) తినటం, మేఘాలు గర్జిస్తూ ఉండగా అగ్నివర్షం కురిపిస్తూ ఉంటే దాహంతో అతిదారుణంగా తపిస్తూ ఉండటం, సలసలా కాగే ఇనుప (లోహ) స్తంభాలను కౌగిలించుకోవలసి రావటం, పాశములచే బంధించబడి నిస్సహాయులై నేలపై పడిపోవటం, అతి వేడిచే కాగే ఇనుప మూటలను నెత్తిపై పెట్టుకొని మోయటం, కాకులు పొడిచిపొడిచి బాధిస్తూ ఉంటే కదిలే సత్తువలేక పొలికేకలు వేయవలసి రావటం, ఆకలిగొన్న క్రూరప్రేత సమూహములు మీదపడి రక్తం పీల్చి పిప్పిచేయటం, అవయవములు ఛేదించబడగా కణకణలాడే కొండశిలలపై పడి ఉండటం, రక్తము - చీముల మధ్య బురదతో ఇరుక్కున్నట్లు ఇరుక్కుని కొట్టుకోవటం, ఏనుగు మొదలైన జంతువుల కాళ్ళ క్రింద పడవలసి రావటం, పక్షులు మీద పడి పీక్కుతినటం...

...మొదలైన అనుభవాలన్ని అట్టి పాపాచరణం గల జీవులు దుష్ట కర్మల ఫలితంగా పొందుచున్నారు. ఈ దుష్ట కర్మకు ఈ దుష్ప్రయోజనం ఉంటుంది" అనునట్టి శాస్త్ర నిర్ణయంచేతనూ, పూర్వజన్మలలో చేసిన పాపకర్మల స్ఫురణ చేతనూ నిజాత్మయే నరక రూపంగా విస్తరించగా ఈ జీవుడు ఆయా వేదన రోదనలను దుష్కర్మల ఫలితంగా అనుభవిస్తున్నాడు.

ఓ రామచంద్రా! పూర్వకాలంలో ఏఏ దేహాలు భాసించాయో, భావికాలంలో ఏఏ దేహాదులు భాసించనున్నాయో, ఏవేని స్వర్గ నరక లోకాలుగా భాసించుచున్నాయో అవన్నీ కూడా భ్రాంతి రూపమమగు కల్పనచేతనే సంభవించుచున్నాయి. అంతే కాదు. ఆయా స్వర్గ - నరకాది లోకాలు మొదలైనవన్నీ కూడా మనోమయమే అయి ఉన్నాయి.

Page:473

అందుచేత... “చిరకాలంగా అనుభూతమగుచున్న స్వయంకల్పిత భావన చేతనే ఈ జీవుడు వివశత్వంతో అతిదీర్ఘకాలంగా ఈ సంసారంలో తిరుగాడుచున్నాడు ... అని సునిశ్చయం అగుచున్నది కదా! పాప కార్యముల నుండి విరమించమని, లేదా వాటి దుష్ప్రయోజనములు అనివార్యమని జీవులను శాస్త్రములు అందుకే సర్వదా హెచ్చరిస్తున్నాయి.

33. ఏతత్ దృశ్యమ్ స్వయం బ్రహ్మమ్

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ భాసుడు (విపశ్చిత్ మహారాజు) నిన్నటి రోజు మనకు మహాముని - వ్యాధుల వృత్తాంతం, శవోపాఖ్యానం, సింధురాజు - - మంత్రుల సంభాషణ... ఇవన్నీ చెప్పారు కదా! ఇపుడు నాదొక చిన్న సందేహం

1. ఈ శవోపాఖ్యాన కథనం మనకు రోజూ కనిపించి జాగ్రత్ - స్వప్నాదులవలె చైతన్యమునకు అభిన్నమై కారణరహితమైనదా?

2. లేక అదంతా కారణ సహితమైనదా? అనగా... లవణుడు, గాధి మొదలైనవారి కథనం లాగా ఐంద్రజాలికుడు, దైవీమాయ - ఇటువంటి ఏమైనా కారణములు కలిగి ఉన్నదా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ఓ రామచంద్రా! ఆతనికి అనుభవమైనదంతా - మనం ఈ దృశ్యం చూస్తున్నట్లే - ఆతడు పొందాడు. ఇక, కారణాలు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. ఏది ఏమైతే ఏమి? ఈ జీవుడు ముక్తిని పొందనంతవరకు “స్వాత్మ అనే మహా సముద్రంలో "దృశ్య సమూహములు అనే తరంగములు అనునిత్యంగా ప్రవర్తిస్తూనే ఉంటాయి. విసనకర్రతో విసరినా విసరకపోయినా గాలి మందమైన చలనములు నిరంతరం కలిగియే ఉంటుంది కదా! అట్లాగే సత్చిత్ పరమాత్మ రూపమగు చిదాకాశమున అద్దాని ప్రతిబింబ రూపములగు పదార్థాకారములు, జగత్ అనుభవములు సదా సకారణంగాను, అకారణంగాను కూడా ఉదయిస్తూనే ఉంటాయి. ఆ పరమాత్మ నుండి అద్దాని అవయవమే అనతగ్గ ప్రతిబింబరూప దృశ్య పదార్థం ఏ రీతిగా ఉదయిస్తోందో... అది మరొకదృశ్య రూప పదార్థంచే నశించబడనంత వరకు ఆ రీతిగానే ఉండి ఉంటోంది. అయితే,... పూతీగదేహ జీవుడే పుష్పాలలోను - ఆకులలోను ఉన్నట్లు, ఒకే జీవచైతన్యం దేహ - జగత్ పర్యంతము ఏర్పడి ఉంటోంది. దేహంలో కాళ్ళు - చేతులు - కళ్ళు దీర్ఘకాలస్థములుగా, కనురెప్పలు మూయటం - తెరవటం మొదలైన చర్యలు అల్ప కాలస్థములుగా ఉంటాయి కదా! అట్లాగే బ్రహ్మంలో భూ - ఆకాశాలు సుదీర్ఘ కాలస్థములు గాను, ఈ జీవుల దేహాలు అల్పకాలస్థములుగాను ఉండి ఉంటున్నాయి.

స్వాత్మయందు ఈ జగత్తు స్వప్నంలోని నగరంలాగా అత్యంత చమత్కారమై ఒప్పుచున్నది. ఇక ఇందులో సారమేమి? అసారమేమి? సత్తు ఏమి? అసత్తు ఏమి?

ఓ రాఘవా! జ్ఞానియొక్క ఉత్తమ దృష్టిచే ఈ దృశ్యమంతా ఆత్మరూపంగా ఎరుగబడుచున్నది. ఏది ఒక అజ్ఞాని 'జగత్తు’గా ఎరుగుచున్నాడో, అదియే ఆత్మజ్ఞాని ఆత్మసత్తా స్వరూపంగా

Page:474

ఎరుగుచున్నాడు. ఇక ఈ జగత్తు సత్తు అని చెప్పాలా? అసత్తు అని చెప్పాలా? మంగళమయమగు బ్రహ్మరూపమే ఈ ప్రపంచమంతా కూడా! ఇదంతా అద్దానియొక్క స్ఫురణ మాత్రమే! ఇక ఇద్దాని యందు ఆసక్తిగాని, అనాసక్తిగాని అవసరమేమున్నది? కనుక ఏ బ్రహ్మమైతే ఈ ఈ రూపములుగా స్ఫురణ కలిగియున్నదో... అట్టి బ్రహ్మస్వరూపమునే ఆశ్రయించి ఉండండి. ఇక ఈ జగత్తు గురించి ఆసక్తి అనవసరం.

స్వాత్మ రూపుడగు పరమాత్మ భగవానుని నుండి స్వాత్మరూపమే అయివున్న ఈ దేహ

జగదాది ఆకారములు పరిఢవిల్లుచున్నాయి. సముద్ర జలం యథాతథమై ఉండగా అద్దానిలో తరంగములు ప్రదర్శితమవటం లేదా? ఇది కూడా అట్టిదే!

ప్రతిభాస : చిదాకాశరూపుడగు పరమాత్మ సంకల్ప సదృశమైన "నిజ స్వప్న దృష్టియే ఈ విశాల ప్రతిభాసారూపమైన సృష్టి. అనగా, పరమాత్మ తన ప్రతిభాస'ను స్వప్నరూపంగా ఎరుగుచున్నారు. కనుకనే ఇక్కడ పృథివి మొదలైన పదార్థములు లేవు. తత్సంబంధమైన భావనయే ఉన్నది. చైతన్యము యొక్క ఆభాసయే జగత్తుగా భాసిస్తోంది. వాస్తవానికి పరమాత్మ యందు ఆభాసయే లేదు. కాబట్టి జగత్తుగా ప్రసిద్ధమై ఉన్నది బ్రహ్మమే అయివున్నది. ఈ ప్రపంచంలో ఏ ఘనత్వం (భూమి మొదలైనవి) కనిపిస్తున్నాయో అది చిదనమగు పరమాత్మ చేతనే అట్లు దర్శించబడుతోంది. అంతేగాని ఇక్కడి భూమి మొదలైన వస్తుజాలం చేత కాదు.

జగత్తంతా చిదాకాశమే అయి ఉన్నది... అనునదే జ్ఞానం. అట్టి బోధ కలగటమే పరమజ్ఞానం. అట్టి బోధ దృఢపడటమే ముక్తి.

శ్రీరాముడు : జాగ్రత్ బాహ్యమున అనుభవమౌతోంది. స్వప్నము - అంతరమున అనుభవమౌతోంది. ఈ రెండు వేరు వేరు కదా? ఈ రెండింటిలో ఏది శ్రేష్ఠము? ఏది అప్రాముఖ్యం?

వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "జాగ్రత్ బాహ్యప్రదేశమున అనుభూతమౌతోంది. స్వప్నం అంతరంగంలో అనుభూతమౌతోంది ... అనే తేడా ఏమాత్రం లేనే లేదు. ఎందుకంటావా? ఈ చెప్పబోయే కారణాలవల్ల జాగ్రత్-స్వప్నము ఒక్క తీరైనవే...అని నిరూపించబడుతోంది.

1. జాగ్రత్ లాగానే స్వప్నంలో కూడా స్వప్న నగరాదులు బాహ్యముననే ఉన్నట్లు స్వప్న ద్రష్టకు స్వప్న సమయంలో అనుభూతమౌతున్నాయి.

2. జాగ్రత్ దశలో జ్ఞానముచే ప్రబుద్ధుడైనవానికి బాహ్యమైనదంతా అంతరంగ రూపమగు ఆత్మయందే ఉన్నట్లు అనుభూతమౌతోంది.

3. స్వప్నం నుండి మేల్కొనగానే ఆ స్వప్నాంతర్గత పదార్థాలన్నీ రహితమై పోతున్నాయి కదా! అట్లాగే జాగ్రత్ దశలో ప్రవేశించినవాడు తిరిగి స్వప్న దశ చేరగానే జాగ్రత్ వ్యవహారాలన్నీ రహితమైపోతున్నాయి. స్వప్నము సుజ్ఞాన స్థితి కాకపోయినప్పటికీ (జడ స్థితియే అయినప్పటికీ) స్వప్న సమయంలో జాగ్రత్ అసత్యబుద్దిత్వము పొందుతోంది కదా!

Page:475

4. ఇక జాగ్రత్ దశలో ఉన్నవారికి ఈ పాంచభౌతిక దృశ్యత్వము, ఈ దృశ్యమును మననం చేసే ద్రష్టత్వము అత్యంత ఘనీభూతమైన విషయాలుగా కన్పట్టవచ్చు గాక! కానీ.... జ్ఞానముచే ప్రబుద్ధులైన మహనీయులకు ఈ విశ్వమంతా ఘనీభూతమైన స్వస్వరూపంగా (ఆత్మదృష్టిచే) అనిపిస్తోంది. అజ్ఞులకు కనిపించే పాదార్థిక దృష్టిని చూచి వారు చిరునవ్వు నవ్వుకుంటున్నారు.

5. “ప్రతిరోజు ఒక్కొక్క స్వప్నం వస్తోంది. అది అప్పటికి అంతమౌతోంది. జాగ్రత్ సుదీర్ఘంగా అనేక సంవత్సరాలు ఒకే తీరు కొనసాగుతోంది. కాబట్టి జాగ్రత్ - స్వప్నములు ఒక్కతీరైనవి కావు” ...అని అంటావా? జీవిత పర్యంతము సంభవిస్తున్న అనేక స్వప్నములకు అంతు ఉండటం లేదు కదా! ఎట్లా అనేక స్వప్నములు వచ్చి-పోతూ ఉన్నాయో... మహా అజ్ఞానమునందు అనేక జాగ్రత్తలు వచ్చిపోతూ ఉన్నాయి.

స్వప్నం చిన్న కథ అని అనుకుంటే... జాగ్రత్ సుదీర్ఘ కథ అయి ఉండవచ్చుగాక! అనేక స్వప్నములకు... అనేక సుదీర్ఘ కథలకు (ఉపాధి పరంపరల విశేషములకు) తేడా ఏమున్నది? రెండింటిలోనూ కల్పనయే ఉన్నట్లు, జాగ్రత్ - స్వప్నములలో ఒకే తీరైన స్వయంకృత కల్పనా వ్యవహారమే కొనసాగుతోందని విజ్ఞులు గమనిస్తున్నారు.

6. జనులు ఉత్పత్తి - - వినాశనములతో కూడిన అనేక స్వప్నములు స్మరించటం జరుగుతోంది కదా! అట్లాగే ‘జాత స్మరణవిద్య' (అనేక పూర్వ, తత్పూర్వ-గడచిపోయిన దేహములను కల్పించుకొని ఆయా భూతకాలపు సంఘటనా స్థలాలలోకి వెళ్ళి, అక్కడివారిని పరామర్శించి తిరిగిరాగల విద్య) సిద్ధింపజేసుకొన్న యోగసిద్ధులు ఉత్పత్తి - వినాశనములు గల అనేక జన్మలను సంస్మరించుకొను చున్నారు. అట్లాగే ఒక సిద్దయోగి తన అనేకమంది శిష్యులకు ఒకేసారి అనేక ప్రదేశములలో ప్రత్యక్షమై వారికి జ్ఞానమును ప్రసాదించటం, కష్టాలు తొలగించటం చేస్తున్నారు. అనగా అనేక స్వప్నములు ఉన్నట్లే అనేక జాగ్రత్లు కూడా ఒక్కసారిగాను, వేరువేరుగాను కూడా సంభవిస్తోంది. ఈ రీతిగా కూడా జాగ్రత్ - స్వప్నములు ఒక్కతీరైనవే అని నిరూపించబడుతోంది.

ఓ రామచంద్రా! ఈ జీవుడు వాస్తవానికి సమస్త అనుభవరూపమగు "కేవల సాక్షి' అయివున్నాడు. ఆతని స్వస్వరూప రససాగరం నుండి బయలుదేరే భావనా తరంగముల చమత్కారమే ఈ జాగ్రత్ - స్వప్నములు. సాగరజలంలో అనేక ఆకారములతో కూడిన తరంగాలు పరిఢవిల్లవచ్చు గాక! అయితే, అవన్నీ తిరిగి జలములోనే లయం అవుతున్నాయి కదా! అట్లాగే స్వస్వరూపం సత్యం. అందులో బయల్వెడలే జాగ్రత్ - స్వప్నాలు స్వస్వరూపమునకు అభిన్నం - సాగరజల తరంగాలు సాగర జలానికి అభిన్నమైనట్లుగా..! అవన్నీ స్వస్వరూపంలోనే ఒకప్పుడు ఉద్యమించి మరొకప్పుడు నశిస్తున్నాయి. దృశ్యము”... జగత్తు - అనే రెండు శబ్దాలు వేరువేరుగా ఉన్నప్పటికీ నిత్యమూ ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. అట్లాగే జాగ్రత్స్వప్నము అనబడేవి రెండు శబ్దాలుగా వేరుగా ఉన్నప్పటికీ కూడా... ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయని సభికులంతా గ్రహించెదరుగాక!

Page:476

విశాల స్వప్ననగరం చిన్మయాకాశమే అయి స్ఫురిస్తోంది. అట్లాగే ఈ విశాల జగత్తు కూడా చిన్మయాకాశమే అయి స్ఫురిస్తోంది. ఇక అవిద్య ఎక్కడున్నదో చెప్పు?

ఈ జగత్తు స్వప్నసదృశమే! స్వప్నం స్వప్నసమయంలో జాగ్రత్ సదృశమే! ఈ రెండింటికీ ఆధారం చిదాకాశమే! ఈ జీవుడు చిదాకాశ స్వరూపుడే!

ఆత్మ జ్ఞానమునకు పూర్వము జీవుని నిజకల్పనా రూపమగు దృశ్య నిర్వచనమే “సంసారము - దృశ్యము - బంధము మొదలైన శబ్దములతో చెప్పబడుతోంది. ఈ జీవునికి బంధం ఉండవచ్చుగాక! ఆతని నిత్యోదిత చిదాకాశ స్వరూపమునకు లోటు ఏమిటి? తరంగత్వం ఉంటే మాత్రం జలానికి వచ్చే లోటు ఏమున్నది? ఈ జీవునికి నిజ చిదాకాశ స్వరూపము దృశ్యముచేతగాని, దృశ్యమునకు గాని బంధింపబడేది కానేకాదు. "తరంగము జలమును బంధిస్తోంది" అనేది యుక్తియుక్తమైన వాక్యం కాదు కదా!



కాబట్టి ఓ జనులారా! బంధరహితము - నిత్యయుక్తము అయినట్టి చిదాత్మకు బంధము ఉన్నది అని బంధమును కల్పించకండి. ఎందుకంటే చిదాత్మ నిర్మలమగు ఆకాశము వంటిది. అది నిత్యనిర్మమై ఉండగా, నిరాకారము - - నిశ్లేపము - సూక్ష్మతరము అయివుండగా.... అద్దానికి బంధమెక్కడిది? ఆకాశంలో అనేకం ఉండచ్చు. అంత మాత్రానికి ఆకాశం ఎద్దానిచే బంధించబడుతుంది? ఇక ఏ అవిద్య అనే పేరుగల దృశ్యము చిన్మయాకాశము యొక్క స్ఫురణమాత్రమే అయివున్నదో... అట్టి నిరాకారమగు చిదాత్మకు బంధమెక్కడిది? నీ ఆలోచనలచే నీవు బంధించబడటమేమిటి? బంధమే లేనిచోట మోక్షమెక్కడిది?

చినా విద్యా విద్యతే నామ బంధో బంధో న కస్యచిత్ | I మోక్షో న కస్యచిత్ మోక్షశ్చ అస్తి నాస్తితి నాస్త్యలమ్ ||

చిదాకాశరూపుడగు జీవుని స్ఫురణయే (లేక) ఊహయే జగత్త్ - (లేక) దృశ్యము కదా! అనగా, అవిద్య అనునది వేరే లేనట్లే కదా! అవిద్యయే లేనప్పుడు ఒక జీవుని బంధము బంధమూ కాదు. మరొక జీవుని మోక్షము మోక్షమూ కాదు. ఎందుకంటే బ్రహ్మము కంటే వేరుగా ఏది కలదు? అసలు కలదు-లేదు అనేది కూడా సిద్ధించదు కదా! వాస్తవానికి విద్యగాని, అవిద్యగాని (చిదాకాశము దృష్ట్యా) లేనేలేవు.

చిదాకాశ రూపమగు నిజచైతన్యమే చిదాకాశమున 'సృష్టి' అనే ఆకారంగా దేహమును ధరించి స్వప్నము నందువలె వెలయుచున్నది.

శ్రీరాముడు : ఇక చిదాకాశ సంవిత్తు యొక్క రూపమేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : "బుద్ధి వృత్తి నేత్రేంద్రియం ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుచున్నప్పుడు ఆ రెండింటి మధ్యలో ఏ నిర్విషయ సంవిత్తు యొక్క స్వరూపము ఉందో... అదియే జాగ్రత్ స్వప్నరూపమగు దృశ్యము యొక్క వాస్తవ స్వరూపం"... అనే నిర్ణయం సర్వదా

Page:477

కలిగి ఉండు. ఆ స్వయంజ్యోతి స్వరూపమే ప్రతి ఒక్క దేహి వాస్తవరూపం. నిత్యజాగరూపమగు, సర్వదా ఏకమే అగు ఆ స్వయంజ్యోతిరాత్మ బాహ్య - అభ్యంతర దృశ్యములందు సర్వదా ప్రకాశిస్తోంది. నిద్రయొక్క అభావ దశయందు, నిద్రాస్థితి యందు ఇంద్రియ మనస్సులను - వాటి వికారములను - విషయములను - విషయ భావనలను స్పందింపచేస్తున్నదై ఉన్నది. ఈ మనస్సు జాగ్రత్లో ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు, అభావదశ అనతగు గాఢ నిద్రలో ఉన్నప్పుడు... ఆ స్వయంజ్యోతి స్వరూపము సర్వదా మేలుకొనియే ఉన్నది. అది దేహాదులకు, ఆలోచనలకు, భావాదులకు పట్టుబడేది కాదు. కానీ దేహాదులుగా ఆలోచనలుగా - భావాదులుగా ప్రకటితమగుచున్నదంతా ఆ స్వయం జ్యోతిరాత్మయేనయ్యా! కాబట్టి ఆ స్వయంజ్యోతి బ్రహ్మమే జాగ్రత్ - స్వప్నముల యొక్క పారమార్థికరూపమై ఉన్నది.

కనుక ఓ రామచంద్రా! జాగ్రత్-స్వప్నముల భేదజ్ఞానం ఏదైతే ఉన్నదో అది కూడా ఆ రెండింటి యొక్క సాక్షి అయినట్టి చైతన్యరూపమే అయివున్నది. ఎందుకంటావా? జాగ్రత్ - స్వప్న

సుషుప్తులలో ఏ భేదమున్నదో అది దర్శిస్తున్న ఆ నాలుగవవాడు ఎవడు? బయటవాడెవడో కాదు కదా? ఆ మూడింటికి సాక్షి అయి పరిజ్ఞాతమయి ఉంటున్న సాక్షి చైతన్యమే ఆ మూడింటి రూపంగాను, వాటిలో ఒకదానితో మరొకటి దానికి గల భేదరూపంగాను ఉండి ఉంటున్నాడనేది సోదాహరణపూర్వకంగా సుస్పష్టమే కదా! అట్లాగే ద్వైత - అద్వైతములు కూడా అట్టి ఏకమగు చిన్మయాకాశమై ఒప్పుచున్నాయి. ఓ రామచంద్రా! అంతాకూడా శాంతము - అఖండితము అగు చిద్రూప పరబ్రహ్మముగానే మాకు అగుపిస్తోంది.

సత్

బ్రహ్మము అంశలు చిత్

ఆనందము

బ్రహ్మము యొక్క 3 అంశలలో 'సత్' అంశము బోధమయమై (జ్ఞానమయమై) ఉన్నది. బోధ (జ్ఞానము, తెలుసుకొనునది)గ్రాహ్యమయమై (దృశ్యమయమై, తెలియబడునది)ఉన్నది.

ఈ విధంగా... 1. జ్ఞాత (తెలుసుకొనునది), 2. జ్ఞేయము (తెలియబడునది)... ఈ రెండింటిలో సత్ అంశము” అభిన్న రూపమైయున్నది. ద్రష్టయే తనకుతానే తనచే సందర్శించబడుచున్న దృశ్యముగా తనకు సాక్షాత్కారమగుచున్నాడు.

దృష్టాంతానికి - ద్రష్ట ఏ కారణం చేతనో (తనకు ఇష్టమైనవారు తీవ్ర అనారోగ్యం నుండి త్వరత్వరగా కోలుకోవటం మొదలైన ఆయా కారణాల వలన) సంతోషభరితంగా ఉంటే = దృశ్యము ఆతనికి సంతోషకరంగా ఉండటం.

ద్రష్ట అన్యకారణంగా విషాదభరితంగా ఉంటే (తెలివిగలవాడైన కుమారుడు పరీక్ష తప్పటం మొదలైనవి) దృశ్యము విషాదంగా, నిస్తేజంగా ఉండటం

Page:478

ఈ రెండూ లోకవిదితమైన విషయాలే కదా! విషయి కంటే విషయము వేరు... అని నిరూపించటం ఎవరి శక్యమూ అయ్యేది కాదు. కాబట్టి ద్వైతము - - అద్దాని జ్ఞానము ఒక్కటే అయి ఉన్నాయి. ఆ రెండింటిలో చిదంశము అభిన్నమైనది. ఎప్పుడైతే ఏకము - సద్వస్తువు అగు బ్రహ్మమే సమస్త ద్వైతముగా కూడా భాసించుచున్నదని నిరూపించబడుతోందో... అప్పుడిక ద్వైత - అద్వైతముల భేదమెక్కడిది? ఆ రెండూ చిదాకాశ రూప బ్రహ్మమే అయి ఉంటున్నాయి కదా!

నేతి నేతి వినిర్ణీత సర్వతో2 భి భవత్యపి |

పశ్చాత్ త్యక్త్వా చిదాకాశే శిలాం కృత్వాస్యతామిహ ॥

ఓ రామచంద్రా! ఓ తదితర సర్వసభికులారా! వినండి...

1. నేతి - నేతి (ఇది కాదు. ఇది కాదు) అను వేదవాక్యముల ద్వారా సమస్త నామరూపాత్మకమైన ద్వైతమూ మిథ్యయే అని గ్రహిస్తూ రండి.

2. అటు తరువాత క్రమక్రమంగా మిథ్య అయినదంతా త్యజిస్తూ రండి.

3. అటుపై ఉత్తరోత్తర భూమికల అభ్యాసం ద్వారా సర్వవ్యాపకము - ప్రత్యగాత్మ రూపము అగు చిదాకాశమునందు సుస్థిరులు అవండి. అప్రమేయ - - నిర్మల - చైతన్యము కంటే వేరుగా “నేను - నాది - నీవు - అది - ఇది - ఆతడు - ఈతడు మొదలైనవేవీ ఉండజాలవనే గమనికను సుస్థిరీకరించుకోండి.

4. మహాచిన్మయమగు బ్రహ్మమునందు 'పరమాత్మ పదము' అనే నిశ్చల శిలారూపం సముపార్జించుకోండి.

5. మనో సంచలనమునకు కూడా కేవల సాక్షులై అభిమానాదులన్నీ త్యజించినవారై

ఉండండి.

6. ఇక ఆపై లోకమర్యాదను అనుసరించి స్వవిభవానుసారంగా మీకు అభీష్టమైన ప్రదేశంలో విహరించండి. ఇష్టమైన దానిని తినండి, త్రాగండి. స్నేహితులతో హాస్యంగా ఉండండి. ఆపై మీ ఇష్టం. ఈ దేహ - మనో బుద్ధి అహంకార జగదత్వములను మీ చిత్ శరీరము యొక్క అయిదు వ్రేళ్ళవలె దర్శించండి. ఈ 14 లోకాలు - సర్వభూత - వర్తమాన - భవిష్యత్ జగత్తులన్నీ నా శరీరమై ఉండగా... నేను ఇద్దాని కందటికీ వేరైన నిత్య చిత్శ్శరీరధారి"నై, సర్వాధారుడనై, అనునిత్య ప్రకాశశీలుడనై ఉన్నాను"... అని గ్రహించి ఉండండి.

ఇదే మహాశిలోపాఖ్యానం యొక్క అంతిమసారం.

Page:479

X. విద్య - అవిద్యోపాఖ్యానం

1. అవిద్యను త్యజించే ప్రయత్నం అత్యావశ్యకం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవుల ఉపభోగము కొరకై ఉద్దేశించబడే తినుబండారాలు ఆ జీవులచే భక్షించబడి (తమ రూపము కోల్పోయి) జీవుల రూపంగానే పరిణమిస్తున్నాయి కదా! అట్లాగే ఈ దృశ్యజగత్తంతా బాహ్యమందలి రూప ప్రకాశంతోను, అభ్యంతరమున సంకల్పాదుల తోను కూడి ఉండి, యథాస్థితమై ఉన్న ఈ దృశ్య జగత్తంతా కూడా చిదాకాశం యొక్క ఉపభోగం కొరకే అయివున్నది, అందుచేత ఇదంతా కేవలం చిదాకాశముగానే శేషించుచున్నది. ఒకనికి స్వప్నంలో నగరాలు కనిపిస్తున్నాయి. అవన్నీ సాక్షియగు స్వప్న ద్రష్ట యొక్క ఉపభోగము కొరకే కదా! కనుక, అవి స్వప్న సాక్షిచైతన్య చిద్రూపము కంటే వేరైనవి కావు. అట్లాగే ఈ జాగ్రత్ కూడా శాంతమగు చిదాకాశమే అయివున్నది.

"జగత్ తస్మాత్ నభః శాంతమ్! నే హ నానా స్తి కించన!

అట్టి పరమశాంతరూపమగు (చిదాకాశరూపమగు) ఈ జగత్తునందు నానాత్వము కించిత్తు కూడా లేనేలేదు. చైతన్యము సర్వదా ఏకరూపమే అయివున్నది. కానీ నానారూపాలుగా స్పురిస్తోంది. అట్లా నానా రూపములుగా ఏదైతే కన్పట్టుచున్నదో అట్టి నానాత్వము వాస్తవిక చిత్స్వరూపం కాదు సుమా! అది అనాత్మయే అయివున్నది. జలములో తరంగములు - బుద్బుదములు - ఆవర్తములు మొదలైనవి కనబడుచున్నప్పటికీ అవన్నీ జలం యొక్క రూపాలని, జలానికి రూప - ఆకారాదులు కలవని ఎవరమూ అనం కదా! అట్లాగే చైతన్యం తన నామరూపరహిత చిత్స్వరూపాన్ని త్యజించకయే ఈ ఈ నామరూపాదులతోటి ప్రదర్శితమగుచున్నది. ఎట్లా అంటావా? స్వప్న - సంకల్ప గంధర్వ నగరాదుల సందర్భంలో వాటికి సాక్షియగు నిజాత్మ తన చిత్స్వరూపమునందే అసత్యములగు ఆయా నానారూపాల తోటి దర్శింపజేస్తూ, ఇంతలోనే, మరొక సమయంలో ఆ స్వప్నాది విశేషాలన్నీ ఉపసంహరించి అద్వైతరూపముగా వెలయుచున్నది కదా! జాగ్రత్ ద్రష్టయగు చిదాత్మకూడా తన యందు తాను దర్శించే జాగ్రత్ దర్శన వ్యవహారం ఒకప్పుడు ఉపసంహరించుకుని అద్వైత రూపము చెందుతోంది. అయితే... జాగ్రత్ యథాతథంగా ఉండగాకూడా, అద్దాని ద్రష్టయగు చిత్ చైతన్యము అద్వైత రూపంగానే ఉంటోందిగాని ద్వైతముగా అగుటలేదని గ్రహించు. ద్వైతంగా కనిపిస్తూ కూడా ఇదంతా అద్వైతంగా అనిపించటమే 'అద్వైతానుభవం'.

ఓ రామచంద్రా! ఈ జగత్తు ప్రళయకాలంలో లేదు. ఇప్పుడు కూడా లేదు. ఇదంతా స్వప్నాకాశంలో మహానగరంలాగా మొదలే వాస్తవానికి లేకపోయినప్పటికీ, అభ్యాస మాత్రంచే

Page:480

ప్రాప్తిస్తున్నది. అయినప్పటికీ సత్యమైనదానివలె వెలయుచున్నది. ఈ సభలో మన ఈ సంవాదమును ఆలకిస్తూ ఇందలి ఆయా సర్వవిషయములను ఎప్పుడో సుస్పష్టంగా అనుభూతం చేసుకొనియున్న మహనీయులెందరో ఉన్నారు. అట్టి మహనీయులగు జ్ఞానులకు సత్య - అసత్య మయమగు ఈ సృష్టి యొక్క శబ్దార్థము తెలుసు. అజ్ఞానులకు అది తెలియదు. ఏది అజ్ఞానులకు ఘనీభూత సత్యముగా అగుపిస్తోందో... అది జ్ఞానులకు అట్లా అనిపించటం లేదు. శ్రీరాముడు : స్వామీ! ఎందుచేత?

శ్రీ వసిష్ఠ మహర్షి :

తజ్ఞా జ్ఞయోః తయోరన్తః ప్రతిపత్తా తు యత్ స్థితమ్ | న బోద్ధుం న చ వక్తుం తే జానీ తన్తి పరస్పరమ్ ॥

ఎందుచేతనంటే... జ్ఞానులు కేవలం అంతర్దృష్టి కలవారై ఉంటున్నారు. అనగా, వారు తమ యొక్క తదితర సహజీవుల యొక్క - కేవల సాక్షీరూపమును ఆస్వాదిస్తూ చెక్కుచెదరని ఆనందమును అనుభూతపరచుకొని ఉంటున్నారు.

అజ్ఞానులు కేవలం బాహ్యదృష్టి నాశ్రయించి ఉంటున్నారు. అనగా, దేహ-మనో-బుద్ధిచిత్త అహంకార పరిమితమైన దృష్టికి పరిమితులగుచున్నారు.

ఇక ఈ జగత్తో ... ఆ రెండింటి మధ్యగల బుద్ధి వృత్తియందు స్ఫురించటం జరుగుతోంది. అందుచేత ఆ జ్ఞాన-అజ్ఞాను లిరువురు ఒకరి దృష్టిని మరొకరు ఎరుగటానికి గాని, ఒకరితో మరొకరు చెప్పుకోవటానికిగాని సమర్థులు కాలేకపోతున్నారు.

ఈ జగత్తుయొక్క శబ్ద-అర్థములు ఆ ఇద్దరి యొక్క వారి వారి బుద్ధియందు స్థితి నొందియున్నది. అందులో ఒకరు (జ్ఞానులు) భ్రాంతిరహితులు. రెండవారేమో (అజ్ఞానులు) భ్రాంతిసహితులు. జ్ఞాని యొక్క బుద్ధి సదా స్థిరమై.... ఆత్మ విషయంలో సదా మేల్కొనినదై ఉంటోంది. కాబట్టి అంతటా ఆత్మతత్త్వమును వీక్షిస్తోంది. "ఇన్నీగా పరమాత్మయే ప్రదర్శితమగుచున్నారు. నా మనో బుద్ధి - చిత్తాది రూపంగాను, 'నేను' గాను వారే వెలయుచున్నారు అని గమనించి బుద్ధి సుస్థిరత కలిగి ఉంటున్నారు. అజ్ఞాని యొక్క బుద్ధి సర్వదా అస్థిరమై ఉంటోంది. అందుచేత అది అస్థిరమగు ఈ జగత్తు యొక్క బాహ్యరూపమునే గాంచుచున్నది.

ఇక ఈ రెండింటి మధ్యయందలి బుద్ధియందున్న ప్రపంచం యొక్క స్వరూపం కేవలం అభ్యంతరగానూ లేదు, కేవలం బాహ్యంగానూ లేదు. కాబట్టి ఆ జ్ఞాని-అజ్ఞానులకు జగత్తు గురించి ఏమీ తెలియటం లేదు. (జ్ఞాని జగతా రాహిత్యం చూస్తుంటే, అజ్ఞాని అనుక్షణం చంచల బుద్ధి కలిగి ఉంటున్నాడు. అందుకే ఇద్దరూ జగత్తు ఎరుగుటలేదని చమత్కారంగా వ్యాఖ్యానించబడుతోంది.)



ఓ రామచంద్రా! జలంలో ద్రవత్వ కారణంగా ఆకారాదులతో కూడిన తరంగాలు స్థితి పొందుచున్నాయి కదా! అట్లాగే చైతన్యం (స్వతహాగా సృష్టి మొదలైనవి తనయొక్క స్వరూపం

Page:481

కానప్పటికీ) సృష్టిరూప తరంగాదులుగా స్థితినొంది ఉంటోంది. ఎట్లాగంటే స్వప్నచిత్ (లేక స్వప్నప్రజ్ఞ) తనయందు జీవులు-గృహములు మొదలైన ఆయా వస్తుజాలం కలిగి ఉండకపోయినప్పటికీ... స్వప్నంలో అవన్నీ దర్శిస్తోంది కదా! స్వప్నం అద్దాని రూపమే కదా! అట్లాగే జాగ్రత్ కూడా ద్రష్ట యొక్క [జాగ్రత్ చిత్ (లేక) జాగ్రత్ ప్రజ్ఞ యొక్క ] స్వయం ప్రకటనా చమత్కారమే అయివున్నది. అద్దంలో అద్దమునకు మార్పు చేర్పులు కలిగించకుండానే దృశ్యం - - ఆ దృశ్యంలో వస్తు కదలికలు ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా! అట్లాగే నిర్వికారము, నిరాకారము అగు బ్రహ్మం తన యొక్క మాయావిభాగంలో ఈ నిరాకార జగదాకారమును స్ఫురింపజేసుకుంటోంది. పిశాచమునకు సంబంధించిన సంభ్రమమంతా బాలుని స్వీయమనోవిరచితమైన భ్రమయే కదా! దేహికి దేహము పట్ల “ఈ దేహమే నేను అను రూపముగల దేహాత్మ భావన భ్రమయే! భ్రాంతి మాత్రమే! అట్టి దేహాత్మ భ్రాంతియే సమస్త క్లేశములకు మూలమైయున్నది. ఇది మనో రాజ్యమువలె అసత్యమైనది. చంచల జలబిందువువలె క్షణికమైనది. అట్టి దేహము పట్ల ఈ దేహమే నేను - నాది... అనే అభిమానం ఎందుకు?

ఓ రామచంద్రా! ఈ జాగ్రత్ స్వప్నములు ఆత్మనుండే బయల్వెడలుచున్నట్లు అనిపించ వచ్చుగాక! అయినప్పటికీ ఆత్మయందు అవేవీ లేనేలేవు.

చీల్చబడుచున్న వెదుళ్ళనుండి ఝస్ - ఝస్" శబ్దం వస్తుంది. జలములోని తరంగముల నుండి “గుల్-గుల్” శబ్దం వినబడుతుంది. అగ్ని యొక్క జ్వాలలనుండి ఛట్ ఛట్ శబ్దం బయల్వెడలు తోంది. వాయువు యొక్క తరంగాల నుండి 'హోర్' శబ్దం చెవులకు తాకుతుంది. కంఠం నుండి అనేక శబ్దపరంపరలు ఉచ్చరించబడుచున్నాయి.

అయితే... వాస్తవానికి వెదుళ్ళ పొట్టలోగాని, జలతరంగాలలో గాని, అగ్నిజ్వాలలలో గాని, వాయు తరంగాలలోగాని, కంఠం యొక్క లోలోపలగాని శబ్దాలు ఉన్నాయా? లేవు. అట్లాగే ఆత్మ యందు జాగ్రత్ - స్వప్న వికారాలు లేకపోయినప్పటికీ బయల్వెడలుచున్నాయి. శ్రీరాముడు : సృష్ట్యాదిలో జాగ్రత్ - స్వప్న జగత్తులుగా బయల్వెడలుచున్నదేది?

శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్న ద్రష్టయే స్వప్నాంతర్గత వ్యవహారరూపంగా సాధిక్యం పొందుచున్నాడు కదా! అట్లాగే స్వాత్మ చైతన్యమే సృష్ట్యాది నుండి ఈ జగద్రూపంగా స్ఫురిస్తోంది. అయితే స్వాత్మ చైతన్యమునకు వేరుగా చూస్తే జగత్తు యొక్క శబ్దముగాని, అర్థముగాని, దృశ్యముగాని లేవు. "ఈ జగత్తును అసాధారణ సరళిగా పొందుచున్న ఓ సహజీవుడా! నీ యొక్క సాధిక్యతయే నీవు పొందే జగత్తు! కనుక నీ జగత్తు నీ స్వరూపమే అయివుండగా, నీవు జగద్రహితమగు కేవల సాక్షివి... అని మహనీయులు సర్వ సంసారజీవులకు గుర్తు చేస్తున్నారు. కనుక ఈ ఉన్నట్లుగా కనిపించే సర్వ దృశ్యము కూడా 'పరమార్ధసత్త' యగు చైతన్యమే అయివున్నది. 'సత్త' కంటే వేరుగా సృష్ట్యాది యందుగాని, ఇప్పుడుగాని ఏదీ భాసించుటయే లేదు.

ఓ రామచంద్రా! “నేను శుద్ధ చిదాకాశ స్వరూపుడను. అట్టి నా స్వరూపమగు శుద్ధ చిదాకాశము సమస్త పదార్థభేదరహితమై ఉన్నది. అదియే అధిష్టాన దృష్టిచే చూస్తే సమస్త పదార్థసహితమై

Page:482

ఉన్నది కూడా! అట్టి నేను సర్వవిధముల శాంతుడను. సుఖ స్వరూపుడను" - అని గ్రహించి ఉండు. ఈ జీవుడు తనయందే అసద్రూపంగా ఆవిర్భవించినట్టి తమస్సును, విక్షేపమును “శుద్ధబోధైక స్వరూపమగు ఆత్మ" యందలి విశ్రాంతిచే త్యజించివేయాలి. ఎందుకంటే ప్రతిజీవుడు అనునిత్యంగా పరమశాంతమగు శుద్ధాత్మయే అయివున్నాడు కదా!

ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః ఆత్మాత్మనా నచేత్ త్రాతః తదుపాయోస్తి నే తరః

ఆత్మజ్ఞానము కొరకు నిరంతరమైన, దృఢమైన ప్రయత్నం చేస్తూ ఉంటే... ఈ జీవుడు తనకు తానే బంధువు అవుతాడు. అట్లా ప్రయత్నంలో ఉండకపోతే తనకు తానే శత్రువు. తనను తాను ఆత్మజ్ఞానముచే రక్షించుకొనే ఉపాయం ఆశ్రయించక అనుక్షణం మార్పు - చేర్పులతో కూడుకొని ఉండే ఈ దృశ్యమును సమాశ్రయించి ఉండాలనుకొంటే... ఇక ఆతనిని స్వకల్పిత మనోవేదనల నుండి రక్షించటానికి (ఆత్మజ్ఞానం కాకుండా) మరింకే ఉపాయమూ కనబడటం లేదు.

అందుచేత ఓ సర్వసభికులారా! బాల్యం అజ్ఞానంలోను, అసమర్థత గాను; వార్ధక్యం నిస్సహాయత గాను గడచిపోతున్నాయి. ఇక ఈ మన రామచంద్రునిలాగా యౌవన దశ ప్రారంభమగుచుండగానే శుద్ధబుద్ధి అనే నౌక ద్వారా సంసారం” అనే సముద్రాన్ని దాటివేయాలి. ఇప్పటికిప్పుడే “ఆత్మజ్ఞానం” అనే శ్రేయమును సంపాదించుకోవాలి.

అద్యైవ కురు యత్శ్రేయో! వృద్ధః సన్కిం కరిష్యసి?

స్వగాత్రాణ్యపి భారాయ భవంతి హి విపర్యయే!

ఇప్పుడు తాత్సారం ఏమాత్రం పనికిరాదు "ఆ! తరువాత ముసలివాళ్ళం అయిన తరువాత చూసుకుందాములే!”... అని ఇప్పుడు యౌవన దశలో ఏదో రోజులు గడిపివేస్తూ ఉంటే, ఇక ముదుసలి అయిన తరువాత చేసేదేమిటి? అప్పుడు ఈ కాళ్ళు - చేతులు - తదితర ఇంద్రియాలు దేహానికీ భారభూతమౌతూ ఉంటే, ఆత్మజ్ఞానానికి ఎవడైనా ఎట్లా ప్రయత్నించగలడు? బాల్య - వార్ధక్యములు జ్ఞాన సాధకములు కావు. అందుచేత ఆ రెండు దశలు పశు - పక్షిత్వ సదృశాలని, మరణతుల్యములని విజ్ఞులు గుర్తు చేస్తున్నారు. యౌవనం ఒక్కటే సరి అయిన సమయం. యౌవనంలో కూడా వివేక సముపార్జనకు సంసిద్ధం కాకపోతే ఆ బ్రతుకు కుక్కబ్రతుకే కదా! అయితే ఈ యౌవనం శాశ్వతమా? కాదు. అందుకని దొరికిన కొద్ది సమయం అత్యుత్సాహంతో శ్రద్ధగా సద్వినియోగం చేసుకోవాలి సుమా! ఈ జీవితము మెరుపు యొక్క పతనమువలె అతి చంచలమైనది. ఇక సంసారము ఒక అతిదీర్ఘరోగము వంటిది. ఇట్టి సంసారం అనే మానసిక వ్యాధి కలిగి ఉన్నామని తెలుసుకొని కూడా ఈ జీవుడు సచ్ఛాస్త్రము, సాధు సాంగత్యం అనే ఔషధం సేవించకపోతే ఇక అజ్ఞానమనే పంకము (బురద) తొలగేది ఎట్లా? 'అజ్ఞానం' అనే బురదలో ఆత్మ మునిగి ఉండగా అద్దానిని "శాస్త్రప్రవచనం - సాధనలు" అనే ఉపాయములతో తమను తాము ఉద్దరించుకునే ప్రయత్నం చేయనివారు తమ పట్ల తామే ఎంతటి మహాక్రూరులు! ఎంతటి అధములు! వారి ఉత్తరోత్తర గతులను తలచుకుంటేనే మాకు అయ్యో!" అనిపిస్తోందే!

Page:483

మట్టితో తయారు చేసిన ఖీళితాళ సభను చూచి "ఇదంతా మట్టియే అని తెలుసుకోకపోవటం చేత ఒక గ్రామవాసి ఎంతో దుఃఖం, భయం పొందుతాడు చూచావా? ఆత్మజ్ఞానం సముపార్జించుకోని జీవుడు బ్రహ్మమయమే అయిన ఈ దృశ్యమును బ్రహ్మమే అని గ్రహించక బహుదుఃఖితుడు అగుచున్నాడు. యథార్థజ్ఞానం కలిగినప్పుడు ఇదంతా ఆనందమయమగు బ్రహ్మమే" అని గ్రహించి పరమానంద స్వరూపుడు కాగలడు. తత్త్వజ్ఞాన బలం చేత ఈ దృశ్యం అశాంతమయినప్పటికీ తత్త్వ జ్ఞాని యొక్క బుద్ధి సశాంతిని పొంది ఉంటోంది. అంతాకూడా ఆత్మయందు లయమై (ఆత్మరూపంగా అనుభూతమై) దృశ్యము అదృశ్యమైపోతోంది. స్వప్నాంతర్గతమైన అనేక పదార్థములు, గృహాదులు, శత్రుమిత్రులు, సంఘటనా పరంపరలు ... ఇవన్నీ కూడా ఇది స్వప్నమే అని తెలిసిన తరువాత మొదలంటా అసత్యములే అయి ఏ మాత్రమూ వేదనను కలిగించకుండా ఉంటాయి కదా! అట్లాగే ఈ సృష్టి కూడా కళ్ళకు సుస్పష్టంగా అనుభూతమగుచున్నప్పటికీ, మనస్సుకు సత్యముగా తోచుచున్నప్పటికీ తత్త్వజ్ఞానముచే చిన్మయాకాశమున శూన్యరూపంగా శేషించుచున్నది.

ఓ ప్రియజనులారా! ఈ 'జీవితము' అనే అరణ్యం జన్మ-జరా-కామ క్రోధ-లోభ-మోహాది దావాగ్నులచే ప్రదీప్తం అవుతుంటే అజ్ఞానులు ఇందులో చిక్కుకున్న లేడిసమూహంలాగా కాసేపు ఇష్ట వస్తువుల ప్రాప్తిచేతను, మరికొంతసేపు అయిష్ట వస్తువుల సంయోగము చేతనూ అటు ఇల్లు పరుగిడుతూ రోజులు గడుపుచున్నారే? ఈ ఇంద్రియములేమో మదించిన మనస్సుచే అదలించబడుచూ ప్రాణవాయువుల ద్వారా బాహ్య వస్తువులవైపు పరుగులిడుచున్నాయే! ఇక తాత్సారం ఉచితమేనా? ఒకవైపు ఇట్లా తగలబడుతూ ఉంటే "ఈ గదిలో వెచ్చగా ఉన్నది కదా అని దుప్పటి కప్పుకుని పడుకుందా మనుకోవటం క్షేమమా? కాదు కదా! మీరు ఈ ఇంద్రియాలను జయించి జ్ఞానం ద్వారా అవిద్యను జయించ వలసిన సమయమిది. ముక్తులై జనన మరణ చక్రమును నిరోధించ వలసిన సందర్భం ఈ జీవితమే! ఈ మహత్తరమైన 'జీవితము'ను అనేక అనవసరమైన వ్యవహారాలతోను, దిగుళ్ళతోను నేలపాలు చేసుకోకండి. కనుక ఆత్మజ్ఞానం కొరకై నడుము బిగించండి.

2. ఇంద్రియాలను జయించటం ఎట్లా?

శ్రీరాముడు : స్వామీ! సద్గురూ! వసిష్ఠ మహర్షీ!

వినా ఇంద్రియజయేనేదం నా జ్ఞత్వమ్ ఉపశామ్యతి

తదింద్రియాని జీయన్తో కథం కథయే మే మునే II

ఈ ఇంద్రియాలను జయించకపోతే అజ్ఞానం శమించదు కదా! మరి ఇంద్రియాలను జయించటం ఎట్లాగో ఈ సందర్భంలో మాకు బోధించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును ఇప్పుడు నీ ప్రశ్న అత్యంత సమయోచితమైనదే! ఎందుకంటే దీపం వెలుగుచున్నప్పటికీ చూపు సన్నగిల్లినవానికి గదిలోని చిన్న చిన్న వస్తువులు (సూక్ష్మ వస్తువులు)

Page:484

కనిపించవు కదా! అట్లాగే... అనేక విషయములందు ఆసక్తుడైనవాడు, ఈ ప్రపంచంలో తన యొక్క ఏదో గొప్పతనమును సంపాదించుకోవాలనే 'వేడుక' కలవాడు, ధనార్జనయందు “అత్యాసక్తి” కలవాడు, ఇంద్రియములను జయించే ప్రయత్నం లేనివాడు... అగు మనుజుడు శాస్త్రములు వింటున్నప్పటికీ, శాస్త్ర ప్రవచితమైన ఆయా సాధనలకు అప్పుడప్పుడూ ఉపక్రమిస్తున్నప్పటికీ కూడా అవన్నీ బ్రహ్మదర్శనమునకు ఉపయుక్తమవటం లేదు. కాబట్టి ఇంద్రియ జయమునకు యుక్తి అత్యావశ్యకం. ఇంద్రియములు జయించబడ్డాయా... ఇక ఆపై స్వల్ప ప్రయత్నం చేతనే సులభంగా మోక్ష ఫలసిద్ధి కలుగగలదు. అందుచేత ఇంద్రియ జయమునకై కొన్ని యుక్తులను ఇక్కడ ప్రతిపాదిస్తు న్నాను. సభికులంతా శ్రద్ధగా వినెదరుగాక!

ఓ రామచంద్రా! ఈ జీవుడు స్వతహాగా చిన్మాత్ర స్వరూపుడే! అయితే చిత్తమునకు ప్రాప్తించే విషయాలకు ఆతని చిత్తము (ఆయా విషయములకు) అధీనం అగుచుండబట్టి ఈతనిని 'చిత్స్వరూపుడు' అని అనకుండా,.... ‘జీవుడు' అని పిలుస్తున్నాం. ఈతడు తనయందు చిత్తవృత్తిచే వ్యాపించినవాడై ఆయా జగద్విషయములను అనునిత్యంగా సంకల్పిస్తున్నాడు. అతడు దేనిని ఈ చిత్తముతో తనయందు సంకల్పిస్తున్నాడో, అద్దానియందు (తన చిన్మాత్ర స్వరూపమును ఏమరచి) తన్మయుడగుచున్నాడు. వాటి వాటి యందు ఆసక్తి కలిగినవాడై ఉంటున్నాడు.

ఇప్పుడు ఈ చిత్తమునందు ఏర్పడి ఉన్న బాహ్యాకారత్వమును తొలగించి ఈ చిత్తమును బ్రహ్మాకారముగా మలచాలి. ఎట్లా? చిత్తమును ప్రత్యాహారము అనే ప్రయత్నం చేత అభ్యంతరమునకు ఆకర్షించాలి. "బ్రహ్మాకారత్వ ప్రబోధము అనే అభ్యాస రూపమై సుతీక్షణమైన అంకుశము యొక్క పోట్ల చేత ‘చిత్తము’ అనే మదపుటేనుగును వశం చేసుకోవాలి. చిత్తమును నిరోధిస్తేగాని ఇంద్రియములు జయించబడవు.

ఇంద్రియములు' అనే సేనకు సేనానాయకుడు చిత్తమే. పాదరక్షలు ధరించి బాటలో నడిచే వారికి నడిచే చోటంతా చర్మముచే కప్పబడినట్లే అవుతుంది కదా! ఈ 'చిత్తము' అనబడు ఒక్కదానిని జయించితే చాలు... సర్వ ఇంద్రియములపై అతి సులభంగా విజయం వరిస్తుంది.

ఎవడైతే తన జీవ సంవిత్తును (లేక చిత్తవృత్తిని) బ్రహ్మముతోటి ఏకంచేసి ఆత్మయందు స్థితి కలిగి ఉంటాడో... ఆతని మనస్సు పరమశాంతము పొందుతోంది?

చిత్తవృత్తిని బ్రహ్మముతోటి ఏకం చేయడం అంటే... "చిత్తముచే ఏఏ వృత్తి ద్వారా ఏఏ అనుభవము సిద్ధిస్తుందో... అట్టి వ్యవహారములు వ్యక్తులు - సందర్భములు - వస్తువులు సంఘటనలు అన్నీకూడా ఆ పరమాత్మయే ఆయా రూపములుగా ఉన్నారు అనే భావన సర్వదా సర్వవేళలా అభ్యాసం చేస్తూ ఉండటమే సుమా! ఆ పరమాత్మయే సర్వరూపములుగా ఉన్నారు, ...ఒకే జలం తరంగములుగా, బుద్బుదములుగా, ఆవర్తనలుగా, సుడి రూపములుగా ఉండి ఉన్నట్లు"... అను ప్రత్యాహార రూప చిత్తవృత్తియే అద్దానియొక్క బ్రహ్మము తోటి ఏకత్వము క్రమంగా అప్పుడు "ఈ

Page:485

సర్వము నాతో సహా ఆతనిదే! ఆతడే! ఆతని వ్యక్తీకరణ చమత్కారమే... అని అంతిమ సాక్షాత్కారం క్రమంగా స్వయంగా ‘ఆ బ్రహ్మాకార చిత్తవృత్తి యొక్క ప్రాభవం చేత పరిఢవిల్లగలదు. అంతటా బ్రహ్మమే ...అనే దృష్టిని పెంపొందించుకున్నవాడు బ్రహ్మమునే దర్శిస్తూ బ్రహ్మమే అగుచున్నాడు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి!) తన జీవసంవిత్తును, తన చిత్తవృత్తిని బ్రహ్మమునందు ఐక్యపరచటం” ...అనగా “నావి అని అనిపించే దృశ్య - - దేహ - మనో - బుద్ధులను... “పరమాత్మవే”... అని అనుకోవటం. అట్టి ప్రయత్నం చేత ఈ చిత్తవృత్తి ఏ ప్రకారంగా శమిస్తుందో... ఆ ప్రకారంగా (అంతంతగా) తీర్థములు సేవించటం చేతగాని, అనేక శాస్త్రములు పఠించటం చేతగాని, ఆయా యోగ శక్తులను సముపార్జించటం చేతగాని, గొప్ప తపస్సులు చేయటం వలనగాని, యజ్ఞ యాగాది క్రియా సమూహములచేతగాని శమించదు సుమా!

ఓ రాఘవా! ఏయే విషయాల యొక్క స్మరణం చిత్తవృత్తిలో బలాత్కారంగా సంభవిస్తోందో... ఆయా విషయములను అధిష్ఠాన బ్రహ్మ సంవిత్తునందు లయం చేయాలి. అనగా "ఈ ఈ రూప -నామ-గుణాలు గల ఈ జీవుడు పరబ్రహ్మమే సర్వదా స్వస్వరూపంగా కలిగి ఉన్నాడు" ... అను అంతరములోని నిశ్చయమే ఆ దృశ్య విషయమును అధిష్ఠాన బ్రహ్మ సంవిత్తునందు లయంచేయటం అగుచున్నదని నీవు గ్రహించు. అప్పుడు క్రమంగా ఆయా విషయ సంస్కారములు నశించి, ప్రాపంచిక సంబంధమైన విషయములు గురించిన స్మృతి కలుగుచున్నది. అట్టి ప్రయత్న రూపమైన ఉపాయముచే భోగహేతువులగు విషయముల యొక్క విజయము క్రమక్రమంగా సముపార్జించబడగలదు.

ఓ ప్రియ సభికులారా! అభ్యాసముచే సర్వము సుసాధ్యమే! "ప్రియ పరమాత్మయే ఇన్నిన్ని రూపాలుగా అగుచున్నారు. నా బుద్ధికి కనిపించేదంతా వాస్తవానికి పరమాత్మ ప్రదర్శనమే!. అను నిజాభ్యాసం” అనే యత్నం చేత చిత్తవృత్తి "ప్రాపంచిక విషయాలు అనే దుర్వ్యసనం నుండి కొంచెం - కొంచెం నిరోధించబడినా కూడా, ఇక అట్టి అభ్యాసమును కొనసాగిస్తూ ఉండగా తత్త్వవేత్తల అనుభవసిద్ధమైయున్న “స్వారాజ్యం పొందబడినదే అగుచున్నది.

శ్రీరాముడు : మహాత్మా! వర్ణాశ్రమాది అనేక ధర్మములు మేము ప్రవాహ ఫలితంగా ఆజన్మాంతరం నిర్వర్తించవలసి వస్తుంది కదా! ఇక ఈ ఇంద్రియాలను జయించగలిగే, అధిగమించగలిగే అవకాశం మా కెక్కడిది? జితేంద్రియత్వం మీ వంటి సర్వమును త్యజించిన మహనీయులకు మాత్రమే సాధ్యం. కుటుంబ వ్యవస్థలోను, లౌకిక వ్యవహారములలోను ఉన్నట్టి మాకెట్లా సాధ్యం?

శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వు నవ్వి) ఓ రామచంద్రా! స్వధర్మనిరతి అనేది వాస్తవానికి విజ్ఞులు పరమాత్మను చేరు మార్గంగా అభివర్ణిస్తున్నారు. స్వకీయ వర్ణాశ్రమ ధర్మం యొక్క నిష్కామ పూర్వకమైన నిర్వహణ పరమాత్మ సాన్నిధ్యం సులభతరం చేస్తుంది అనునది శాస్త్రప్రబోధయే అయివున్నది కదా! నిష్కామపూర్వకమైన స్వధర్మనిరతి చేతను, విషయాల పట్ల తృష్ణారాహిత్యం చేతనే ఈ ఇంద్రియాలను జయించి ఆత్మ పదమున వెలయుచు ఎందరో మహానుభావులు ఉన్నారు. స్వధర్మ వ్యవహారాలు పరమాత్మను చేరే సోపానాలై ఉండగా, “నిరోధకాలు అని బద్ధకస్థులు మాత్రమే

Page:486

భావన చేస్తున్నారు. సర్వధర్మ విరుద్ధములైన పదార్థములందు కోర్కెను త్యజిస్తూ, స్వధర్మమును దైవసమానంగా దర్శిస్తూ, శమ - సంతోషములను సముపార్జించుచూ ఎవడుంటాడో... ఆతడు జితేంద్రియుడు' అని అనటానికి సందేహమే లేదు.

మనోశమనం - ఎవడైతే సహజీవులను చూస్తున్నప్పుడు

అభ్యంతర సంవిత్తు అగు ఆ బాహ్య సంవిత్తు అగు చిత్త దేహాదులపట్ల ఇవి ఈతని సహజీవుని కేవల వాస్తవ రూపం కాదు కదా! జలము యొక్క తరంగము వలె చిత్స్వరూపము పట్ల ప్రియము భ్రమయుతము-క్షణికము కదా!" అనే ఒకానొక అభిరుచి, | ప్రీతి అప్రీతి, గాంభీర్యముతో కూడిన అతీతత్వము

కలిగి ఉంటాడో... అట్టి అభ్యాస వశంచేత ఈ మనస్సు క్రమంగా అతి త్వరలో జయించబడుతుంది. అట్టివారికి సకల సహజీవుల పట్ల వీరు ఆత్మ స్వరూపులే" అను దృష్టి పెంపొందుచూ, క్రమక్రమంగా మమాత్మ స్వరూపులే”, “మమస్వరూపులే అనే బుద్ధి నిశ్చలమౌతోంది. అప్పుడిక "నేనే సర్వాంతర్యామి అగు ఆత్మను అను నిశ్చలమైన బుద్ధి ఘనీభూతంకాగలదు. అదియే "ఆత్మదృష్టి సుమా! సంవిత్ ప్రయత్న సంరోధాత్ మనః స్వాయన ముజ్జతి

చేతః చపలతోన్ముక్తం, వివేకమనుధావతి ॥

ఓ మిత్రులారా! ‘దేహ - - మనో - బుద్ధి - దృశ్య రూపములగు బాహ్య సంవిత్తు నేను కాదు. అఖండము, అప్రమేయము, నిత్యము, నిర్మలము, యథాతథము, సర్వజగత్ వాస్తవ స్వరూపము అగు అంతః సంవిత్తును నేను...అనే అభ్యాసమునకు తాత్సారమెందుకో, వెనుకాట ఎందుకో, మొహమాటమెందుకో నాకు చెప్పండి? అట్టి "అంతర్ సంవిత్తేవా హమ్ (ఆ నిశ్చల అంతర్ సంవిత్తునే నేను. అదే ప్రతిఒక్క జీవుడు) అనబడే మనో-బుద్ధుల యొక్క కొంచెం కొంచెం ప్రయత్నంచే ఈ చిత్తవృత్తి నిరోధించబడగలదు. క్రమంగా మనస్సు దుర్వ్యసనములవైపుగా పరుగిడటం అనే దురభ్యాసమును "అంతా పరమాత్మకు చెందినదే! పరమాత్మ స్వరూపమే ... అనే ప్రయత్నంచే జయించబడుతుంది. ఈ మనస్సు ఎప్పుడూ ఎటో ఒకవైపుగా పరుగులు తీయటమే స్వభావంగా కలిగివున్నది. అట్టి మనస్సు యొక్క నిత్య చలనత్వమును సద్వినియోగపరచుకోవాలి. ఎట్లా అంటే... మనస్సు విషయాల వైపుగా పరుగులు తీయకుండా చూచుకోండి. వారు అట్టివారు, వీరు ఇట్టివారు” ... అనే దృష్టిని "పరమాత్మ ఇట్లు ప్రదర్శిస్తున్నారు ...అని మనస్సును కొంచెం సంస్కరించి, సంయోగ - వియోగాతీతంగా నియమిస్తే అప్పుడది తనకు తానే వివేకము వైపుగా పరుగులు తీయసాగుతుంది.

అట్టి వివేకమును సముపార్జించుకొన్న బుద్ధి కలవాడే 'జితేంద్రియుడు' అని పిలువబడు చున్నాడు. ఆ విధంగా “అంతరంగ సాక్షి దృష్టిని పెంపొందించుకొనే బుద్ధిమంతుడు ఏ పరిస్థితులలో కూడా సంసార సముద్ర వాసనల తరంగములలో కొట్టుకుపోడు.

Page:487

ఓ ప్రియసభికులారా! అతి దీర్ఘకాలం వేచి ఉన్న తరువాత, అనేక ప్రయత్నములు నిర్వర్తించి ఈ మానవజన్మ’ అనే అవకాశము పొందియున్నారని గుర్తు చేస్తున్నాను. అందుచేత ఇది సద్వినియోగ పరచుకోవాలి గాని దుర్వినియోగ పరచుకోకూడదు.

దుర్వినియోగం - వాసనలు అనే తరంగాల వెంటబడి ప్రాపంచిక వ్యక్తిగత సంఘటనా గతమైన అభ్యాసముచే బుద్ధిని మరింత కలుషిత పరచుకోవటం.

సద్వినియోగం - - ఇంద్రియ వ్యవహారములు పరమాత్మ పరంగా దర్శిస్తూ ఆత్మదృష్టి పెంపొందించుకోవటం.

ముందుగా అంతర్ సంవిత్ దృష్టిచే ఇంద్రియాలను, ఇంద్రియ ధ్యాసలను జయిస్తూ అట్టి ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలోని ముఖ్యమైన విభాగంగా 1.సాధుజన సంపర్కం, 2. సచ్ఛాస్త్రముల అవలోకనం అనే ఉత్తమ ప్రయత్నములలో నిమగ్నమగుచూ రావాలి. అప్పుడు ఇంద్రియ విషయధ్యాసలు వాటికవే సన్నగిల్లుతూ వస్తాయి. సాధుజనులతో సంభాషించటం - సచ్ఛాస్త్రములు ప్రసాదించే పాఠ్యాంశాలను హృదయగతం చేసుకోవటం అనే ఉభయ ప్రయత్నముల ద్వారా ఇక ఈ జగత్తును యథార్థ రూపముతోటి సత్య బ్రహ్మ మాత్రముగా జితేంద్రియుడు వీక్షిస్తున్నాడు. ఎట్లా అంటే, "అది మృగతృష్ణ. అందులో వాస్తవంగా జలం ఉండదు ... అని తెలిసిన తరువాత కూడా "అక్కడకు నడచి వెళ్ళి, ఆ కనబడే జలం తాగి దాహం తీర్చుకుంటాను” ...అని ఎవరైనా శ్రమకు ఉపక్రమిస్తారా? లేదు. అట్లాగే సత్యవస్తువగు ఆత్మయొక్క అవలోకనముచే ...ఈ జగత్తంతా మమాత్మయే... అని గ్రహించిన తరువాత సంసార భ్రమ స్వయముగా తొలగిపోతుంది. ఇది పొందాను (రాగం). కాని అది ఇంకా పొందలేదు (కామం). నేను అల్పుడను” ఇట్టి అల్ప ప్రలాపములు వాటంతట అవే సమసిపోతాయి.

ఈ జగత్తు విషయశూన్యము - దృశ్య రహితము అగు కేవల చిన్మాత్రమే అయి వెలయుచున్నది - అని గ్రహించి సత్యబోధ సంపాదించుకున్నవానికి ఇక బంధమెచ్చట? మోక్షమెచ్చట? తటాక జలంలో జలం అనేక చిత్రవిచిత్ర తరంగాదులు ప్రదర్శించవచ్చుగాక! ఈ నీరు ఎండిపోయినప్పుడు ఆ తరంగ సమూహాలు ఇక ఉండవు కదా! అట్లాగే ఆత్మదృష్టి రూప అభ్యాసము యొక్క వేడిమిచే ఇంద్రియ విషయరూపమగు ఈ దృశ్యం కారణరహితమై ఇక మరల ఆత్మగానే కనబడుతుంది గాని దృశ్యముగా ఉద్భవించదు. దృశ్యమును దృశ్యంగా కాకుండా క్రమక్రమంగా పరమాత్మగా దర్శించ టంలో సుఖమే ఉన్నదిగాని, కష్టం కాదు. పైగా, అది సర్వ సంసారభ్రమల యొక్క సశాంతి స్థానం.

నేను, నీవు మొదలైనవి - ఓ రామచంద్రా! చిదాకాశమాత్రము' అగు సంవిత్తే అవిద్యచే, “నీవు-నేను” మొదలైన రూపములతో ఈ జగత్తును ధరించుచున్నది. అట్టి ఈ జగత్తు అనబడేది ఈ విధంగా “స్వాత్మ యందే అధ్యస్తమైయున్నది. అట్టి ఈ జగత్ వ్యవహారము అనే తెరను జ్ఞానము అనే హస్తబలంతో ప్రక్కకునెట్టి ఈ అధ్యస్తమై ఉన్నదానికి భిన్నమైనట్టి అధిష్ఠాన చిన్మాత్రమే నేను అని గ్రహించి ఉండాలి.

Page:488

అధ్యస్తము అధిష్ఠానము

నేను - నీవులతో కూడిన నేను - నీవు - జగత్తులు

దృశ్య జగత్తు ఎందులో (జలంలో తరంగాలలాగా)

కనబడుచున్నాయో..... అట్టి స్వస్వరూపం

నేను - నీవు’ మొదలైన రూపములతో - కూడిన ఈ జగత్తు అవిద్య మాత్రమే అయివున్నది. ఇది (దృశ్యముగా) వాస్తవానికి మిథ్యయే! అందుచేత “ఇది ఎట్లా శమిస్తుంది ...అనే దిగులు ఎవరికీ ఉండవలసిన పనిలేదు. ఈ జగత్ భావం అనబడేది వాస్తవానికి సర్వదా శమించినదై, శూన్యమాత్ర స్వరూపము కలిగినదై చిదాకాశము నందే అథ్యస్తమై వెలయుచున్నది. ఈ జగత్తు అనబడేది చిదాకాశమునందే చిదాకాశ ప్రతిబింబమై జగద్రూపంగా (అథ్యస్తమై) భాసిస్తోంది ...అనునది వేదోపనిషత్తులు ప్రకటించే సిద్ధాంతము. స్వప్నం అసత్తే అయినప్పటికీ సత్తువలె అనుభూతం అగుచున్నది కదా! అసత్తే అయినప్పటికీ సత్తువలె అనుభూతం అవటమనే వ్యవహారానికి ఇక్కడ స్వప్న దృశ్యమే దృష్టాంతమగుచున్నది. స్వప్నంలో కనిపించిన రాజ్య భోగ వైభవం స్వప్న చైతన్యరూపం గాక, మరింకేదీ కాదు కదా! అట్లాగే జాగ్రత్లో ప్రకటితమై, ప్రదర్శనమయేదంతా కూడా జాగ్రత్ చైతన్య వైభవమే అయివున్నది. స్వప్నంలో రాజ్య విలాసానికి కర్త ఎవరు? అనుభవించేదెవరు? ఏ ఇంద్రియములకు అవి అనుభూతమగుచున్నాయి?.... అట్లాగే ఈ జాగ్రత్లో కనిపించే ఈ విశాల జగదనుభవానికి కర్త - - కర్మ - క్రియలు లేవు. ఇదంతా ద్రష్ట యొక్క దృశ్య సత్తా చైతన్య రూపమే అయివున్నది. స్వయంకృత విశేషమే అయి ఉన్నది.

నేనెవరు? - ఏదైతే కర్త-కర్మ-కరణములు మొదలైన సామాగ్రి లేకుండా కూడా భాసించుచూనే ఉన్నదో... అట్టి చిల్డ్రన స్వరూపమే 'నేను' అయివున్నది. స్వప్నంలో స్వమరణం లేకపోయినప్పటికీ -ఒకడు తాను మరణించినట్లు, బంధువులు శోకిస్తున్నట్లు కలలో - గాంచుచున్నాడు కదా! స్వప్నంలో కనిపించేదానికి ఎవరికి కర్తృత్వం ఆపాదించగలం?

ఈ జగత్తు సృష్ట్యాదియందే కర్తృత్వ రహితమైయున్నది. దీనికి 'కర్త' అనబడువాడెవడూ లేడు. కనుక ఇది నా స్వయంప్రకాశ రూపమే అయి వున్నది. అయితే, అవిద్యా రూపమగు ఈ జగత్తు ఇట్లా విద్యమానమై ఉన్నప్పటికీ కూడా... ఇది జ్ఞానబలంచే “లేనిదే (స్వప్న సదృశంగా) అగుచున్నది.

ఈ జగత్తు నా స్వస్వరూపమగు 'చైతన్యం' అనే మణి యొక్క ప్రకాశరూపమే! ఇదంతా చిదాత్మచే స్వాత్మయందు సంకల్పించబడినదై ఉన్నది. నాచే జగత్తుగా పొందబడుచున్నదంతా నా సంకల్పం”... అనే రూపం తప్పితే వేరైన రూపమేదీ కలిగి ఉండలేదు. ఒక ఆలోచనకు కారణమే మున్నది? అట్లాగే ఈ జగత్తు అనబడేదంతా కారణరహితమై ఒప్పుచు కాకతాళీయ న్యాయముచే స్వయముగా (మిథ్యగా భాసిస్తోంది.

యథార్థానికి ఈ జగత్తు కారణరహితం. కనుక నాకు వేరుగా లేదు. (నా సంకల్పం లేకుండా) భాసించటమే లేదు. ఏ చిత్రకాశం చేత ఇదంతా ప్రత్యక్షంగా, వ్యక్తమై భాసిస్తోందో... ఆ చిత్రకాశమే

Page:489

“నేను” కూడా! ఆ చిత్ప్రకాశమును పెద్దలు, తత్త్వజ్ఞులు పరమ పదము - చిదాత్మ బ్రహ్మము పరమాత్మ... మొదలైన ఆయా శబ్దాలతో ఉద్దేశిస్తున్నారు.

ఓ రామచంద్రా! శూన్యత్వంగా కనిపించేది ఆకాశమాత్రమే కదా! ఆవర్త - తరంగాదులుగా కనిపించేది జలమే కదా! అట్లాగే... ఈ జీవుడు మొదలైన సర్వరూపాలుగా కనిపించేది / స్ఫురించేది ఆ చిద్రూపమే! ఒకానొక జీవుడు “ఒక్కడే” అయినప్పటికీ... అవయవిగా అనేక దేహ విభాగాలుగా కనిపిస్తున్నాడు కదా! అట్లాగే వాస్తవానికి అవయవ రహితము - ఏకము అయినట్టి బ్రహ్మము "జీవుడు - జగత్తు మొదలైన అనేక అవయవ సహితముగా కనిపిస్తోంది.

ఒకే జీవుడు కుడికన్ను, ఎడమకన్నులతో వ్యవహరిస్తున్నట్లు సర్వదా ఏకమే అయి ఉన్న బ్రహ్మము ఈ దృశ్యములో అనేక దేహములుగాను, ద్రష్ట - దృశ్యములుగాను, జడ - చైతన్యములుగాను వ్యవహరిస్తోంది.

ప్రశాంతంగా ఉండే స్ఫటికశిలయందు ఎదురుగా ఉన్న వనములు - - వృక్షములు - పక్షులు మొదలైన వాటితో కూడి మహారణ్యం అభాసమాత్రంగా ప్రతిబింబిస్తోంది చూచావా? నాశరహితముపరమశాంతము అగు చిన్మాత్రమునందు ఈ దృశ్య జగత్తు అభాస మాత్రంగా, ప్రతిబింబమాత్రంగా ఇట్లు ఉంటోంది.

నిర్మల చిన్మాత్రమే తన స్వభావ ప్రభావం చేత ఈ జగద్రూపంగా వెలయుచున్నది. అనగా ఈ జగత్తు ఆత్మ స్వరూపమే అయివుండగా, ... అట్టి ఈ జగత్తును గూర్చి ఎవరైనా సరే విచారించవలసిన పనేమున్నది?

ఓ రాఘవా! పరమ పదమగు బ్రహ్మమునందు "ఇది మొదలు, ఇది, మధ్య, ఇది అంతము” ... అను కల్పన ఏదీ లేదు. ఇక ఈ జగత్తు, ఇద్దాని కారణరూపమగు అవిద్య ఈ రెండూ పరమాత్మ రూపములే అయివున్నాయి. పరమాత్మకు భిన్నంగా అవిద్య అనేది లేనేలేదు. విద్యా అవిద్యా స్వరూపుడై కనిపిస్తున్నది పరమాత్మయే! (విద్యా - అవిద్యా స్వరూపిణీ - లలితా సహస్రం

ఇక ఈ జీవులంటావా? ఈతడు ప్రబుద్ధుడై ఉండవచ్చుగాక! ఉండకపోవచ్చు గాక! స్వప్నము నుండి జాగ్రత్తులోనికి జాగ్రత్తు నుండి స్వప్నములోనికి ప్రవేశించుచు తాను సర్వదా 'ఏకము' అయినట్టి శుద్ధ చిద్రూపముతోటియే వెలయుచున్నాడు.

సుషుప్త్యవస్థలో... అజ్ఞానావృతమైన ఆత్మ; తురీయావస్థలో... శుద్ధాత్మ

ఈ రెండూ కూడా... అజ్ఞాన రజ్జువు - కేవల రజ్జువు" (త్రాడును పాముగా అనుకొన్నప్పటి త్రాడు - త్రాడును త్రాడుగా దర్శిస్తున్నప్పటి త్రాడు) వలె ఉంటున్నాయి. సుషుప్తిలో, తురీయావస్థలో ఏ ఆత్మ అయితే ఉన్నదో, అదే ఆత్మ జాగ్రత్ - - స్వప్న సమయాలలో కూడా అదే రీతిగా ఉండి ఉన్నది. ని - జాగ్రత్ స్వప్నముల సమయంలో కూడా తురీయ స్థితిని ఎరుగుచున్నాడు.

అజ్ఞాని - - జాగ్రత్ స్వప్న సమయంలో తనయొక్క తురీయ స్థితిని ఏమరచుచున్నాడు.

Page:490

కాబట్టి జ్ఞానికి జాగ్రత్ - స్వప్న - - సుషుప్తులు మూడు స్థితులు కూడా తురీయమే అగుచున్నాయి. ఆతనిలో అవిద్య లేనందువల్ల ఆతడు ద్వైతములో ఉన్నప్పుడు కూడా అద్వైత రూపుడై వెలయుచున్నాడు. జ్ఞానియొక్క దృష్టి - అనుభవములు 'ద్వైతము' అనే పరిమిత అవస్థను అధిగమించినదై ఉంటోంది. అందుచేత ఆతనికి ద్వైతము - అద్వైతము - నేను - నీవు - ఇది - - మొదలుకొని ఇంకెక్కడుంటాయి? ఆతడు సర్వత్రా పూర్ణత్వమును దర్శించుచుండగా ఇక ఆతనికి 'శూన్యము' అని అనిపించేదేమున్నది?

ద్వైతాద్వైత సముత్భేదైః వాక్య సందర్భ విభ్రమైః, క్రీడంతి అబుద్ధాః శిశవో! బోధవృద్ధా హసన్తి తాన్!

అజ్ఞానులగు బాలురు మాత్రమే కాదు, ద్వైతం - కాదు కాదు, అద్వైతం”... మొదలైన భేదములతో కూడిన వాక్య విభ్రమముతోటి క్రీడిస్తున్నారు. ఇక బోధవృద్ధులగు జ్ఞానులో... వారిని చూచి నవ్వుకుంటున్నారు.

శ్రీరాముడు : మరి గురువులు ద్వైత అద్వైత ప్రవచనములు ఎందుకు సిద్ధాంతపూర్వకంగా శిష్యులకు ప్రతిపాదిస్తున్నారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : గురువులు శిష్యుల ప్రబోధము అనే ఫలమును ఫలదీకరింపజేయటానికి ద్వైతాద్వైత వివాదముల కోర్కె అనే ఫలతీగను పెంపొందింపజేయుచున్నారు. అజ్ఞానుల హృదయాలను పరిశుద్ధపరచటానికి, విజ్ఞానమయం చేయటానికి ఆయా ద్వైతాద్వైత వాదోపదాములు ఆవశ్యకమై ఉన్నాయి. అందుచేత గురు స్థానంలో ఉన్న నేను కల్పితమైనట్టి "ద్వైతాద్వైత విచారణ” అనే చీపురును మిత్ర భావంతో వివాద రహితంగా అంగీకరిస్తూ వస్తున్నాను. గృహిణి గదిని శుభ్రంగా ఊడ్చివేసిన తరువాత ధూళిని ప్రోగుచేసి తొలగించి ఆ చీపురు మాత్రం ఒక మూల ఉంచుతుంది కదా! "జీవుల హృదయ గృహములను పరిశుభ్రపరచటం అనే కార్యమునకు బ్రహ్మదేవునిచే ఉద్దేశించబడినట్టి బ్రహ్మ మానసపుత్రుడనగు నేను "ద్వైతాద్వైత విచారణ అనే చీపురుచే ఆశ్రితుల హృదయాలలోని ధూళిని ఊడ్చివేస్తూ ఆ తరువాత ఆ విచారణను ఒకవైపుగా దూరంగా ఉంచుతూ వస్తున్నాను. అనుభవమును ఉద్దీపింపజేస్తున్నాను.

తచ్చిత్తాః తద్గగత ప్రాణా బోధయన్తః పరస్పరమ్ కథయన్తశ్చ తన్నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥

ఆ విధంగా “అవిద్య అనే ధూళి తొలగిపోయిన తరువాత అధికారులగు ముముక్షువులు బ్రహ్మమునందే నెలకొని ఉంటారు. వారికిక ద్వైత-అద్వైత పాఠ్యాంశమాత్ర దృష్టి - తన విషయత్వం కోల్పోతోంది. (అది చెప్పుకోదగ్గ విషయం కాకుండా పోతోంది.) ఉదాహరణకు "ఎడమ కన్ను, కుడి కన్ను ఉపయోగించుచున్న జీవుడు సర్వదా ఒక్కడే కదా! ... అనే దృష్ట్యాంతాన్ని ఆత్మ వస్తుపరంగా సుస్పష్టం చేసుకొన్న తరువాత ఎడమకన్ను - కుడికన్ను ఒక్కటా? వేరువేరా? అనే చర్చకు ప్రసక్తి ఎక్కడిది? అవిద్య తొలగిపోయిన తరువాత అట్టి అధికారులగు ముముక్షువులు తమ ప్రాణమనస్సు లను బ్రహ్మమునందే నెలకొల్పుకొని, బ్రహ్మం గురించే పరస్పరం బోధించుకుంటూ, నిత్యం

Page:491

బ్రహ్మమునందే క్రీడిస్తూ పరమానందానుభవులై ఉంటారు. తృప్తి, సంతోషం కలిగి ఉన్న వారై ఉంటారు. ఇక వారి దగ్గరకు వెళ్ళి మీది ద్వైత సిద్ధాంతమా? అద్వైత సిద్ధాంతమా? అని అడిగితే "అసలు విషయం తెలుసుకొనిరండి. అప్పుడు మీకు చెప్పుతాం! అని చెప్పి మౌనంగా ఉంటారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్

జాయతే బుద్ధియోగో సౌ యేన, తే యాన్తి తత్పదమ్ ||

ఇట్లు నిరంతరం ప్రీతిపూర్వకంగా బ్రహ్మతత్త్వమును విచారణ చేస్తూ, సేవిస్తూ ఉంటూ ఉండగా క్రమంగా నేను చెప్పినట్టి సారాసార వివేచనా బుద్ధి యోగం స్వయంగా దృఢమౌతుంది. అద్దానిచే వారు 'మోక్షము' అనే బ్రహ్మపదమును పొందుచున్నారు. ఓ ప్రియ సభికులారా! శ్రోతలారా! ఈ ప్రపంచంలో ఒక గడ్డిపరక సంపాదించాలంటే కూడా అది కొంత ప్రయత్నముచేత మాత్రమే సాధ్యమౌతుంది కదా! మరి, ఈ త్రిలోకములు ఎందులో కనిపిస్తున్నాయో అట్టి బ్రహ్మముతోటి ఏకత్వము సముపార్జించాలంటే, అట్టిది ప్రయత్నం లేకపోతే ఎవరైనా పొందేది ఎట్లా? కనుక మీరంతా మహదాశయముతో ప్రయత్నశీలురై ఉండాలి. ఓ ప్రియజనులారా! ప్రతి జీవుడు సుఖము పొందాలని నిత్యము అనేక ప్రయత్నములలో నిమగ్నమై ఉంటున్నాడు. మంచిదే! అయితే మనుష్యానందము మొదలుకొని బ్రహ్మదేవుని ఆనందము వరకు గల పది పది రెట్లు ఆనందమును ఏ బ్రహ్మానందము సమక్షంలో మహాసముద్ర జలము ముందు ఒక చుక్క నీటితో సమానంగా (ఉపనిషత్తులలో) పోల్చబడిందో... అట్టి బ్రాహ్మీ దృష్టికై ఎందుకు ప్రయత్నించి సంపాదించరాదు? మనస్సు యొక్క అంకుర స్వరూపమగు ఈ సంసారమునందలి రాజ్య సుఖం అసలు నిజమైన సుఖమా! ఆత్మానందం ముందు అది ఎంతటి అల్పమైనది? తత్త్వజ్ఞానమున పూర్ణ విశ్రాంతి ప్రాప్తించుకున్న మనుజునకు ఇంద్రుని త్రైలోక్య - ఆధిపత్యానందము ఒక తృణముతో (గడ్డిపరకతో) సమానమగుచున్నదే!

ఓ ప్రియజనులారా! అజ్ఞాన నిద్రయందున్న విషయలంపటులు దృశ్యము పట్ల ఎంతో ఆసక్తిపరులై ఉన్నారు కదా! వారెంత ఆసక్తి కనబరుస్తున్నారో... అంతగానూ తత్త్వజ్ఞులు దృశ్యము పట్ల నిదురించినవారివలె ఉంటూ... నిరతిశయమగు ఆత్మ పదమునందు మేల్కొని, సర్వదా అద్దానినే అంతటా గాంచుచున్నారు.

ఓ రామచంద్రా! మరల ప్రకటిస్తున్నాను. అట్టి నిత్య అపరోక్ష నిరతిశయానంద రూపమగు మోక్షరూప స్థితి ప్రయత్నముచేతనే లభించగలదు. మహాభ్యాసము అనే వృక్షము యొక్క ఫలమే పరమాత్మ పదము. కనుక సర్వజీవులారా! మీరు ఆ మార్గములో ప్రయత్నశీలురై ఉండండి.

సకల జనులపైగల అవ్యాజమైన ప్రేమ చేతనే ఈ రామచంద్రుని నిమిత్తముగా చేసుకొని లోకములకు ఈ జ్ఞాన శాస్త్రమును ప్రతిపాదిస్తున్నాను. ఒకడు, అజ్ఞాని అయినా సరే... జిజ్ఞాస - శ్రద్ధలతో యావృత్తి పూర్వకంగా ఆత్మజ్ఞాన శాస్త్రం పఠించటం, విజ్ఞుల ద్వారా ప్రవచనమును వినటం మొదలైన అభ్యాసములచే తప్పక గొప్ప ఆత్మజ్ఞాని కాగలడు. అట్లా కాకుండా, ఏదో