Page:492

కొంచెం చదివి మాకు అంతా తెలిసిపోయింది.... అని అనుకొని అభ్యాసపూర్వకంగా అధ్యయనం చేయకపోతే ఇంక వేరైన మార్గంలో మోక్షము సులభమే! సుసాధ్యమే” అని తెలియజేసేది

ఎట్లా? మాకు తెలియటం లేదు!

పరమ పురుషార్థమగు మోక్షఫలమును ప్రసాదించగల బ్రహ్మదేవుని నిత్యమనోగతమైన ఈ శాస్త్రమును వేదము వలె మరల మరల పఠించాలి. వ్యాఖ్యానం చేయాలి. పూజించాలి. ఈ శాస్త్రము నుండి ఏది లభిస్తుందో, అద్దానిని ఎరిగినచో జీవునియొక్క క్రియ - జ్ఞానములు రెండూ పవిత్రమౌతాయి. వేద తాత్పర్యమే ఈ శ్రీవసిష్ఠ-రామ సంవాదము (యోగవాసిష్ఠము మహారామాయణము) అనబడెడు శాస్త్రము. ఇది వేదాంత శాస్త్రములలో ఉత్తమైనది. మీ అందరిపై గల స్వాభావ సిద్ధమైన ప్రేమచేతనే ఈ మోక్ష శాస్త్రమును మీ ముందు ఉంచుచున్నాను. మీరందరూ ఈ శాస్త్ర పఠనముచే ఆత్మానందము పొందాలనే ఉద్దేశమేగాని, మరింకేమీ కోరి ఈ ప్రవచనమును చెప్పటం లేదు. ఈ శాస్త్రమును పరిశీలించటంచే ఈ దృశ్య సమూహం మాయ అని గ్రహించగలరు. కనుక శ్రద్ధాసక్తులతో ఈ శాస్త్రమును పఠిస్తూ విచారణ చేయండి. ఈ యోగ వాసిష్ఠము”ను పఠించిన తరువాత అప్పుడు తక్కిన శాస్త్రములను పరిశీలిస్తే అవన్నీ లవణము కలిపిన తరువాత పప్పులాగా అతి రుచికరంగా గోచరించగలవు. "ఆ! ఇది ఒక కావ్యం వలె చెప్పబడలేదు. అందు చేత ఉత్తమ శాస్త్రం అని అనిపించుకోదు అని అనాదరించి, భాషాసక్తులు మాత్రమే అయి మీకు మీరే ద్రోహం చేసుకోకండని మా మనవి. మేము మా పూర్వీకులు చెప్పిన ఒక్క శాస్త్రాన్నే చదువుతాం. ఇది మాకు అక్కర్లేదు ... ని తలచి ఈ శాస్త్రమును పరిశీలించనివారు “మా తాతలు త్రవ్విన నూతి లోని నీరే త్రాగుతాం. ఇక తదితర నదీ జలములతో మాకేమి పని? ...అని తలచిన వారగుచున్నారని మా ఉద్దేశం.

కనుక రామచంద్రా! ఈ అఖండ రామాయణ శాస్త్ర పఠనము క్రమంగా ఇంద్రియ జయము’ అనే ప్రయోజనమును స్వయంగా స్వభావసిద్ధంగా సిద్ధింపజేయగలదని ఋషులమగు మా ఉద్దేశం.

3. సమస్త జీవులు చిదాకాశ స్వభావులే!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటే ...ప్రపంచంలో వస్తువుల యొక్క ఆకారం, నామము, రంగు మొదలైనవి దృశ్యమానమగుచున్నవి కదా! అట్లాగే బ్రహ్మము ప్రకాశిస్తూ ఉంటే... ఈ జగత్తు విద్యమానమై ఉంటోంది. జగత్తు నామ రూపాత్మక మైనప్పటికీ, ఇది బ్రహ్మం యొక్క అవయవం వలె అనిపించినప్పటికీ, బ్రహ్మం సర్వదా నిరవయవి. ఇక జీవునికి - జీవునికి గల భేదము, ఆకాశ భేదం వలె (ఆకాశంలో కనిపించే, దిక్కులు - - పైన

క్రింద... మొదలైన వాటి వలె) అంతఃకరణం యొక్క దృష్టిచే కలుగుచున్నది మాత్రమే! సమస్త భేద-అభేదములు తన యొక్క ఉపాధిగా ప్రకటన సలుపుచున్నట్టి అఖండ పరిపూర్ణ బ్రహ్మమే

Page:493

నేను”... అను మహావాక్య బోధనచే సర్వజగత్ దృష్టులు స్వయముగా ఉపశమిస్తున్నాయి. అట్టి అఖండ బ్రహ్మముతో తన స్వరూపము యొక్క అభేదం సుస్పష్టపరచుకొన్న మహనీయునికి జీవాజీవ భేదమిక అగుపించటం లేదు. తత్త్వజ్ఞానికి శుద్ధ బ్రహ్మమే సర్వదా సర్వత్రా విషయమగుచున్నది. అట్టి శుద్ధ బ్రహ్మము సర్వకాల సర్వావస్థలయందును భేదకళంక రహితమై, సదా నిర్మలమై వెలయు చున్నది. అది సదా యథాతథంగానే ఉంటోంది. అంతేగాని, మరింకేదో రూపంగా అగుటయే లేదు.

ఇక తత్త్వజ్ఞానులు కానట్టి అజ్ఞానులకు అంటావా? వారికి తెలియవచ్చే నేను, నాది, నీవు, నీది, వారు, వీరు" ...మొదలైనవాటి యొక్క వాటి వాటి వాస్తవ రూపాలేమిటో... వారికే తెలియాలి. "ఎండమావులలో తరంగాల భేదం మాకు తెలియవస్తోంది" అనే మాట "అవి ఎండమా వులే! జలం అందులో ఉండదు ...అని తెలిసినవారికి అజ్ఞుల దృష్టితో పనిలేదు కదా! "వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని, వీడు వేరు, వాడు వేరు ... మొదలైన బుద్ధి అజ్ఞాని యందు అనునిత్యంగా అజ్ఞానికి అనుభవమగుచున్నప్పటికీ... అట్టి భేదములు జ్ఞానికి కనిపించటం లేదు. దాహంగా ఉన్నవాడికే “ఆ మృగతృష్ణలో జలం ఉండవచ్చు... అనే భ్రమ కలుగుతుంది కదా! "ఇది విగ్రహం

- ఇది పురుషుడు”... అని తెలిసినవానికి ఇక ఏది పురుషుడో ఏది స్థాణువో సంశయముండదు కదా! బ్రహ్మతత్త్వము తెలిసిన తరువాత ఇక భేదజ్ఞానములన్నీ సమసిపోతున్నాయి.

ఓ రామచంద్రా! ఈ జగత్తు పూర్వము ఉండి ఉండలేదు. ఇప్పుడు కూడా లేదు. అసలు ఉత్పన్నమే అవలేదు. ఇక ముందు కూడా ఉండబోవటం లేదు. మరి? సద్వస్తువగు బ్రహ్మమే ఈ రీతిగా జగద్రూపంగా కనిపిస్తోంది. "అట్టి జగద్రూపంగా గ్రహించబడుచున్న చిదాకాశము యొక్క స్ఫురణ వాస్తవానికి స్వాత్మయందే స్థితి కలిగియున్నట్టిది ...అని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. అట్టి విజ్ఞులు జగత్తును బ్రహ్మముగానే ఎరుగుచున్నారేగాని... జడముగా కాదు. స్వప్నంలో కనిపించే దంతా ద్రష్ట స్వరూపమగు చిదాకాశమే! అట్లాగే మనోరాజ్యము యొక్క కల్పిత పురంగా కనిపించేది కూడా మనోద్రష్ట స్వరూపమగు చిదాకాశమే! అదే తీరుగా జాగ్రత్ ద్రష్ట స్వరూపమగు చిదాకాశమే ఏకము నిర్మలము అయి చెన్నొందుచూనే జాగ్రత్ దృశ్యరూపంగా కనిపిస్తోంది.

ఈ జగత్తుకు పూర్వము ఏకమగు చిద్వస్తువు మాత్రమే కలదు - - (సదేవ సౌమ్యే దమగ్ర ఆసీదేకమేవారి ద్వితీయమ్ బ్రహ్మ)... అని శ్రుతులు చెప్పే వాక్యములే "ఈ జగత్తు ఏ సమయ మందునూ లేదు”... అని చెప్పటానికి ప్రమాణ వాక్యములైయున్నవి. "సృష్టికి పూర్వము ఎచ్చటా కూడా నిమిత్త కారణంగాని ఉపాదాన కారణంగాని లేకయే ఉన్నాయి"... అని వేదవాక్కులు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాయి.

(ఉపాదాన కారణం = మట్టి బొమ్మలోగల మట్టి; నిమిత్త కారణం = మట్టి బొమ్మ తయారు చేసే వ్యక్తి)?

ఇక జగత్తు ఎక్కడున్నది? ఇది కొంచెం కూడా ఉద్భవించనేలేదు. ఏది ఉద్భవించినట్లు తోచుచున్నదో... అది అనాదియగు పరబ్రహ్మమే అయివున్నది. సర్వదా శుద్ధమగు పరబ్రహ్మము తన యొక్క 'స్వభావము' అనే శక్తిచే, (లేక) చమత్కారముచే జగతూపంగా భాసించుచున్నది.

Page:494

జగత్ ద్రష్టయగు జీవుని భావనయే జగత్తు. జీవుని భావన జీవునికి అభిన్నం. కనుక జగత్తు జీవుని స్వస్వరూపమే! కనుక... సృష్ట్యాదిలో ఇక్కడ ఏదీ ఉత్పన్నం కాలేదు. అనగా... అజ్ఞానులచే ఎరుగబడుచున్న బ్రహ్మదేవుడు మొదలైన సమష్టి-వ్యష్టి జీవులుగాని, వారి వారి ఉపాధులుగాని వాస్తవానికి లేకయే ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఈ జీవులు కూడా బ్రహ్మం సమక్షంలో బ్రహ్మమునకు వేఱుగా చూస్తే శూన్యరూపులే అయివున్నారు.

చిదాకాశమే... తన చిత్స్వభావముచే... 'జగత్తు - జీవుడు' అను రూపములుగా భాసిస్తోంది.

4. జాగ్రత్ - స్వపములు ఒక్క తీరైనవే!

శ్రీరాముడు : మహర్షీ! జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల రూపమేమిటో, ఎద్దాని నుండి ఏది బయల్వెడలుచున్నదో ఆ వివరాలు మరొక్కసారి సవివరణగా ప్రవచించమని నా ప్రార్థన. శ్రీ వసిష్ఠ మహర్షి :

జాగ్రత్ స్వప్నము సుషుప్తి

ఈ జాగ్రత్ - స్వప్న సుషుప్తులు మూడూ కూడా పరస్పరం ఒకదానిలో మరొకటి ప్రవేశిస్తూ ఉన్నాయి. అందుచేత ఒక్కొక్కటి ప్రత్యేకంగా మూడు మూడు విధాలుగా అగుచున్నాయి.

జాగ్రత్ జాగ్రత్ జాగ్రత్తు

జాగ్రత్ జాగ్రత్ స్వప్నము

జాగ్రత్ జాగ్రత్ సుషుప్తి

స్వప్నము స్వప్న జాగ్రత్తు

స్వప్నము స్వప్న స్వప్నము

స్వప్నము స్వప్న సుషుప్తి

సుషుప్తి సుషుప్తి జాగ్రత్తు

సుషుప్తి సుషుప్తి స్వప్నము

సుషుప్తి సుషుప్తి సుషుప్తి

జాగ్రత్ స్వప్నం - ఇది మనోరాజ్య రూపం. ఇంద్రియాలు ఆ సమయంలో వ్యాపారరహితమై ఉంటున్నాయి. ఈ దశ కేవలము మనోమయత్వమై ఉన్నది. పదార్థముల యొక్క స్వప్న సాదృశ్యము వలన స్వప్నమే జాగ్రత్ దశను పొందుతోంది.

స్వప్నంలో కూడా "ఇంత కాలం నేను నిద్రించాను. ఇప్పుడు మేల్కొన్నాను... అనే అనుభవం స్వప్నాంతర్గతమై ఉంటోంది కదా! స్వప్న జాగ్రత్ స్థితియందు స్వానుభవమగుచున్న జాగ్రత్తే జాగ్రత్ సమయంలో స్వప్నరూపంగా ఎరుగబడుచున్నది.

స్వప్నో జాగ్రత్ ప్రవిశతి, జాగ్రత్ స్వప్నాత్ర బుధ్యతే జాగ్రత్ స్వప్నం ప్రవిశతి, ప్రబుద్ధం స్వప్న జాగ్రతః ॥

Page:495

ఆత్మ జాగ్రత్ స్వప్నం నుండి మేల్కొని స్వప్న రూప జాగ్రత నందు ప్రవేశిస్తోంది. అట్లాగే స్వప్నరూప జాగ్రత్ నుండి జాగ్రత్ రూప స్వప్నంలో ప్రవేశిస్తోంది. ఈ విధంగా జాగ్రత్ స్వప్నములు రెండూ పరస్పరం ఒకదానికి మరొకటి కారణమగుచూ ఉంటున్నాయి.

జాగ్రత్ జాగ్రత్వంతుని స్వప్నం స్వప్నస్వప్నం అని; స్వప్నజాగ్రత్వంతుని యొక్క జాగ్రత్ --జాగ్రతాగ్రత్ అని కూడా చెప్పబడుతోంది.

స్వప్నంలో స్వప్నమందలి జాగ్రత్తు వర్తమాన జాగ్రత్తులాగానే అనుభూతమౌతోంది. కనుక స్వప్నంలోని జాగ్రత్తు జాగ్రత్తేగాని అప్పటి అనుభవం అనుసరించి అది స్వప్నం కాదు.

అట్లాగే జాగ్రత్ స్వప్నము అనే మనోరాజ్యమందలి జాగ్రత్తు అనుభవముచే స్వప్నమే అవుతుంది గాని, జాగ్రత్తు కాదు.

ఇక కాలవిషయానికి వస్తే... జాగ్రత్ కాలమునందు స్వప్నము సదా అల్పకాలికమై ఉంటోంది. అట్లాగే స్వప్న కాలమున జాగ్రత్ సదా అల్పకాలికమై ఉంటోంది.

కనుక ఓ రామచంద్రా! జాగ్రత్తు స్వప్నము వంటిదే! స్వప్నము జాగ్రత్తు వంటిదే! కనుక వాటిలో ఒకటి మరొక దాని నుండి బయల్వెడలటమనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ రెండింటికీ భేదమే లేదాయె! ఇంటి యొక్క బయట - - లోపల ఒకే ఆకాశం వెల్లివిరుస్తోంది కదా!

అయితే... స్వప్నము జాగ్రత్తు నందు పూర్ణముగా శమించిపోవుచున్నది. అప్పుడు స్వప్న పదార్థములు శూన్య రూపములే అగుచున్నాయి.

శ్రీరాముడు : స్వామీ! స్వప్న సమయంలో జాగ్రత్తు శమించటం గాని, శూన్య రూపములుగా గాని అవటం లేదు కదా! జాగ్రత్లోని పదార్థములు మొదలైనవన్నీ స్వప్నమునకు పూర్వంలాగా స్వప్నానంతరం తిరిగి (జాగ్రత్తుకు వచ్చిన తరువాత) కొనసాగుచూనే ఉన్నాయి కదా! కానీ జాగ్రత్ అనంతరం స్వప్నంలో క్రితం రోజు (రాత్రి) స్వప్న వ్యవహారం కొనసాగటం లేదు. మరి స్వప్నము జాగ్రత్తు ఒక్కటే అని ఎట్లా అర్థం చేసుకోవటం?

అనగా... మహర్షీ!... నేడు స్వప్నంలో చూచినవి రేపటి స్వప్నంలో ఉండటం లేదు. కానీ... నేడు చూచిన జాగ్రత్తు రేపటికీ యథాతథంగా ఉంటోంది కదా? ఈ సాయంకాలపు జాగ్రతే, రేపు ఉదయం కొనసాగుతోంది కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : కానీ రామా! ఈ విషయం మనం చర్చించియే ఉన్నాం. అయినా, మరికొన్ని విశేషాలు చెప్పుతాను.

ఈ వర్తమానపు జాగ్రత్తు మరణానంతరం పరలోక జాగ్రత్ నందు శమించి పోతోంది. లేక ఆత్మ ప్రబోధ సమయానికి సమస్త ద్వైతం శమించిపోతోంది. అది అట్లా ఉంచి ప్రతిరోజు స్వప్నానుభవ కాలంలోను, సుషుప్తి స్థితి సమయానికీ జాగ్రత్తు పదార్థములన్నీ శూన్య రూపములయిపోతున్నాయి. కనుక “జాగ్రత్ - స్వప్నములు అభేదమైనవి అనునది ఇక్కడ సిద్ధిస్తోంది కదా!

Page:496

జీవితము అనబడే స్వప్న సమయంలో “గత జన్మ జీవితము అనే స్వప్నము సమసిపోయినదే అగుచున్నది కదా! అట్లాగే వర్తమాన జన్మ తదనంతర జన్మ జాగ్రత్ సమయానికి శూన్యరూపమై స్వప్నమువలె సమసిపోయినదే కాబోవుచున్నది. పరలోక జాగ్రత్ ... ఇహలోక జాగ్రత్లో "అవిషయము - శూన్యరూపము అగుచునే ఉన్నది కదా!

నేటి స్వప్న విషయములో జాగ్రత్కు సంబంధించిన సర్వ పదార్థములు శూన్యమై పోవుచున్నాయి. మరల “నానా రూపాత్మకమగు ప్రపంచంలో నేను ఇంకా జీవించియే ఉన్నాను... అనే బోధ ప్రారంభం కాగానే జాగ్రత్ ప్రారంభమౌతోంది. జాగ్రత్ రూపుదిద్దుకోగానే ఆ రాత్రి, ఆ ముందటి రాత్రి స్వప్నాలు పరలోక జీవితము వంటివే అగుచున్నాయి. ఈ రోజు జాగ్రత్తుకు ఈ రాత్రికి కలుగబోయే స్వప్నదశ రాబోవు పరలోకమే కదా! రాబోయే స్వప్నములోని ఏ పదార్థము ఇప్పటికి ఇంకా లేనివే కదా!

అట్లాగే మరణానంతర జాగ్రత్తు ఇప్పటికి లేదు. మరణానంతర జాగ్రత్తులో ఇప్పటి జాగ్రత్తు లేదు. ఈ విధంగా జన్మకు ముందటి జాగ్రత్తు ఇప్పటికి శూన్యమగుచున్నది.

ఈ వర్తమాన జాగ్రత్తు మరణానంతర జాగ్రత్తు దృష్ట్యా శూన్యరూపమే కానున్నది. స్వప్నములో కనిపించే త్రిలోకములు చైతన్యము యొక్క చమత్కారమే కదా! అట్లాగే సృష్ట్యాది నుండి ఈ విభాగ పూర్వకమైన రెండూ కూడా (జాగ్రత్తు ఈ జాగ్రత్తులో కనిపించే జాగ్రత్ జగత్తు) చైతన్యము

యొక్క చమత్కారమే అయి, హృదయమునందు భాసిస్తోంది.

ఓ రామచంద్రా! జాగ్రత్తు సమస్త పదార్థములు విశాలాకారయుక్తంగాను, స్థూలంగాను భాసిస్తున్నప్పటికీ కూడా స్వప్నంలోని భూమి ఆకాశం మొదలైన పదార్థములలాగానే ఇవన్నీ లేకయే ఉన్నాయి. స్వప్న జగత్తు స్వప్నంలో భాసిస్తున్నప్పటికీ ఎట్లా శూన్యరూపమే అయి ఉన్నదో... ఈ జాగ్రత్ పదార్థములు ఇంద్రియాల స్థితిని అనుసరించి పొందబడుచున్నప్పటికీ... పరమార్థమున లేకయే ఉన్నాయి! స్వప్నంలో కనిపించేదంతా చిదాకాశమే! అట్లాగే ఈ జాగ్రత్తులో కనిపించేదంతా కూడా చిదాకాశమే అయివున్నది. ఈ సూర్య చంద్రాదులతో కూడి భాసించటమనేది చిదాకాశం యొక్క స్వభావమే అయి ఉన్నది. స్వప్నంలో కనిపించిన భవనం ఏ సూర్యుని వెలుతురులో ప్రకాశిస్తోంది చెప్పు? అట్టి చైతన్యం ఆకాశం, గోడ, ఒక పరమాణువు, స్థలము, జలము, అన్నింటిలో ప్రకాశిస్తూ ఉండటమే 'జగత్తు' అనే పేరుచే పిలువబడుతోంది. అది అద్దాని స్వాభావిక చమత్కారమే!

భ్రాన్తాః అసత్యరూపాయాం స్థితాయాం సత్యవస్తువత్ | ఆకాశమాత్ర దేహాయాం క ఇవైనాం ప్రతిగ్రహః ॥

ఈ జగత్తు భ్రాంతి రూపమైనది. శూన్యమాత్ర రూపము కలది. అసత్యమైనది. అట్లయి ఉండి కూడా సత్య వస్తువువలె ఇంద్రియములకు అనుభూతం మాత్రం అవుతోంది. అట్టి ఈ అసత్య జగత్తు పట్ల విశ్వాసం కలిగి ఉండటమనేది మా ఉద్దేశంలో అనుచితమే! ఈ జగత్తు యొక్క రూపం

Page:497

1.గ్రహీత 2.గ్రహణం 3. గ్రాహ్యం అనబడే త్రిపుటి యొక్క సంయోగ రూపము మాత్రమే! ఇది అధిష్ఠానసత్తుచే అసత్తు" అగుగాక! లేక, నిజసత్తుచే సత్తు అగుగాక! ఈ విషయంలో (ఈ జగత్తు ఉన్నది - - లేదు అనే విషయంలో) ఒక పక్షము స్థాపించాలనే మొండిపట్టుదల వలన మాకు ఏ ప్రయోజనమూ కనిపించకయే ఉన్నది. ఈ జగత్తు ఈ విధంగా ఉంటే ఏమున్నది? మరొక విధమైనది అయితే ఏమున్నది? అందులో ఏకపక్షం స్థాపించవలసిన పనేమిటి? ఎవరికైనా కించిత్ అవిచారణచే అట్టి ఏకపక్షాభిమానము ఉంటే ఉండవచ్చు గాక! కాని ఇప్పుడు ఈ జగత్తు యొక్క తత్త్వమేమిటో మనం ఈ శాస్త్ర సందేశము సహాయంచే గ్రహించాము కదా! కాబట్టి ఓ జనులారా! ఇట్టి కాలబుద్ధి, జగత్తు పట్ల భోగరూపమైన అల్ప ఫలములపట్ల కోర్కె అనవసరమనేది సునిశ్చితమే కదా! ఇక ఇది సత్యమా? అసత్యమా? అనే మీమాంసగాని, పట్టుదలగాని ఉండవలసిన అవసరమేదీ లేదనియే మా నిర్ణయం! భావనానుసారమే ఇది అనుభూతమౌతోందని మాత్రమే గమనిస్తున్నాం.

5. ఆత్మఖ్యాతి - అఖ్యాతి - - అసత్యాతి - - అన్యథాఖ్యాతి

శ్రీరాముడు : హే మహర్షీ! అధ్యాత్మ శాస్త్రంలో "ఆత్మఖ్యాతి, అఖ్యాతి, అసత్యాతి, అన్యథా ఖ్యాతి” ...అని నాలుగు శబ్దములు ఉపయోగించి ... పరమాత్మ యొక్క నిర్వచనాన్ని శాస్త్రీయంగా చెప్పుతూ ఉంటారు. అవి సందర్భానుచితమని మీరు కూడా అనుకుంటే, ఆ ఆధ్యాత్మిక శాస్త్ర ప్రవచిత శబ్దార్థముల గురించి వివరించవలసినదని నా ప్రాథేయము.

శ్రీ వసిష్ఠ మహర్షి : "ఆత్మ" గురించి కొందరు గురువులు శిష్యులకు బోధించేటప్పుడు నీవు చెప్పిన నాలుగు శబ్దములు ఉపయోగించి వివరణను చెప్పటం జరుగుతోంది. అలౌకికమైనది, అఖండ తత్త్వమైనట్టిది ఆత్మ. అట్టి ఆత్మకు 4 విశేషములు పాఠ్యాంశబోధ కొరకై చెప్పబడుచున్నాయి.

1. ఆత్మఖ్యాతి - సృష్ట్యాదిలో పూర్ణము, వ్యాపకము (ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది) అగు చిదాకాశమే ఈ ప్రకారం జగత్ూపంగా తనలో తాను స్ఫురిస్తోంది. అట్టి చిదాకాశం తనలో ఏ నిజచైతన్య చమత్కారం చేత జగత్తును ఖ్యాపితం ఒనర్చుచున్నదో (ప్రసిద్ధి కలిగింప జేస్తోందో)... అట్టి జగత్కారణం “ఆత్మఖ్యాతి" అని చెప్పబడుతోంది. అనగా, ఆత్మలో ఏదైతే జగత్తుగా ప్రకటిత మవటానికి కారణభూతమౌతోందో... 'ఆత్మఖ్యాతి' అని చెప్పబడుతోంది.

2. అఖ్యాతి - - ఏ విశేషం చేత ఆత్మ అంతటా ప్రసరింపబడినదై ఉండి కూడా తాను ఎటూ - ఎటు నుంచి కూడా రాక... సర్వదా యథాస్థితమైయున్నదో అదియే అఖ్యాతి.

వెళ్లక 3. అసతాఖ్యాతి - (ఏది వాస్తవానికి అసత్ అయివున్నదో వాస్తవానికి లేదో)... అట్టి లేనిది' ఉన్నట్లుగా అనిపించటానికి ఏది కారణమగుచున్నదో అద్దానిని అసతాఖ్యాతి అని చెప్పుచున్నారు.

4. అన్యథాఖ్యాతి - ఆత్మయే అన్ని రూపాలుగా అగుచున్నప్పటికీ, ఆత్మ ఎక్కడో వేరుగా ఉంది. అద్దానిని మనం ప్రయత్నంచే దరి చేరాలి అని ఏ కారణంచే అనిపిస్తోందో... అదే అన్యథా ఖ్యాతి.

Page:498

ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం విను. వాస్తవానికి ఇక్కడ నదులు మొదలైనవి ప్రవహించటమూ లేదు. వాటిలో ఏదీ మునగటమూ లేదు, తేలటమూ లేదు. ఈ జగత్తులో జరిగే వ్యవహారాలన్నీ వాస్తవం కాదు. నిష్క్రియము, చిద్రూపము అయినట్టి చిదాకాశమే ఈ సమస్త జగద్రూపముచే నిజ చిదాకాశమునందు ఇట్లు స్ఫురించుచున్నదగుచున్నది.

ఖ్యాతి - భాషాపూర్వకంగా అర్థం స్ఫురించటం - ఆత్మ మరొకటిలాగా తానుగా స్ఫురించటం లేదు. ఆత్మ సర్వదా ఆత్మగానే ప్రకాశిస్తోంది. ఆత్మ సర్వదా సమస్త ప్రకటనా రహితమై ఉన్నది. స్వప్రకాశకమైనది. అది అజ్ఞాన దృష్టిచే జగత్తుగా ప్రకటితమగుచున్నట్లు అనిపిస్తోంది. అయినా, జగత్తుగా కనిపించేది ఆత్మయే! కనుక ఈ జగత్తు ఆత్మఖ్యాతియే... అని పదప్రయోగ పూర్వకంగా ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు.

అఖ్యాతి - మరొక రీతిగా స్ఫురించకపోవటం జగత్తంతా ఆత్మయే అయివున్నది. ఆత్మ ఎన్నడూ కూడా తన స్వప్రకాశం కంటే భిన్నమైన ఎద్దాని చేతనూ తనకంటే భిన్నంగా ప్రకాశింపజేయ బడటమే లేదు. తనకు భిన్నమైనట్టి దేనిని తాను ప్రకాశింపజేయటమూ లేదు. అందుచేత ఆత్మ అఖ్యాతము. ఆత్మయే ఆత్మచేత ఆత్మకు భిన్నమా? అన్నట్లుగా ఈ జగత్తును ప్రకాశింపజేస్తోంది. మరొకటి (ఆత్మకు భిన్నంగా ఉండి) జగత్తును ప్రకాశింపజేయడం లేదు కాబట్టి జగత్తు 'అఖ్యాతము' (దేనిచేతా ప్రకాశింపబడజాలనిది) అని చెప్పబడుతోంది.

ఖ్యా (ధాతువు) = ప్రసిద్ధి; తి (ప్రత్యయం) = సత్త; ఖ్యాతి = ప్రసిద్ధరూపమగు సత్త; ఆత్మ = ప్రసిద్ధ రూపమగు ఖ్యాతి.

కొందరు “సజ్ + ఖ్యాతి” = అఖ్యాతి. ఆత్మ అఖ్యాతి. కనుక, ఆత్మ అనబడేదే లేదు (బౌద్ధవాదులు) అని అఖ్యాతి కి వ్యాఖ్యానం చెప్పుచున్నారు.

కానీ... అది సరికాదు. ఆత్మను ఆత్మకు వేరైనదేదీ ప్రకాశింపజేయదు. ఆత్మయే ఆత్మచే ఆత్మను ప్రకాశింపజేస్తోంది. కనుక ఆత్మ (బాహ్యమైన ఎద్దాని చేతనూ కూడా) “అఖ్యాతము”... అనియే అఖ్యాత శబ్దానికి అర్థంగా గ్రహించాలని మా ప్రతిపాదనం. మా అవగాహన.

అసత్ఖ్యాతి - అసత్తును కల్పించేది ఆత్మయందే! అసత్తు అంటే లేనిది ఉన్నట్లుగా కల్పించటం. అట్లా కల్పించేవారెవరు? ఆత్మకు అన్యంగా ఎవరైనా వచ్చి అట్లా ఆత్మయందు ఆత్మకు వేరైన జగత్తును కల్పించి చూపిస్తున్నారా? లేనేలేదు. ఆత్మయందు ఆత్మయే ఆత్మను ఏమరచిన దృష్టిని కలిగి ఉన్నప్పుడు 'జగత్తు' అనే పేరుతో ప్రసిద్ధమగుచున్నది. ఈ విధంగా ఆత్మయందు ఆత్మచే ఆత్మకు వేరైన దృష్టియే ‘జగత్తు' అనబడు అసత్యాతి" అయివున్నది.

అన్యథాఖ్యాతి - సజ్ యథా ఖ్యాతి... ఖ్యాతి అంటే ప్రేరణాత్మకమైనది. ఆత్మయందు జగత్తును ప్రేరేపించేదేదీ లేదు. జగత్తు ఆత్మ చైతన్యమునకు భిన్నమైనది కాదు. భిన్నమైనదైయుంటే ప్రేరేపించునది-ప్రేరేపించబడే జగత్తు ఉండేవి. అప్పుడు ఆత్మ అద్వితీయం ఎట్లా అవుతుంది?

సజ్ = సద్వస్తువగు ఉనికి; యథా = ఏ విధంగా అయితే; ఖ్యాతి = కనిపింపజేస్తోందో; ఆత్మ = అది ఆత్మయే

Page:499

ఆత్మయే ఆత్మను ఈ జగత్తుగా చూస్తోంది. ఈ విధంగా అసతాఖ్యాతి = అసత్తును కనిపింప చేసేది. అన్యథా ఖ్యాతి = మరొకటిగా మార్చుచున్నది.

ఇవన్నీ ఏమీ లేవు. అందుచేత 1. ఆత్మ వేరు - జగత్తు వేరు, 2. ఆత్మలో జగత్తు ఉన్నది?... రెండు కూడా ఖండించబడుచున్నాయి.

శ్రీరాముడు : ఆత్మ - జగత్తుల సంబంధ నిర్వచనములైన అఖ్యాతి - అన్యథా ఖ్యాతి - అసత్యాతి అనేవి స్వప్న - మనోరాజ్య - - తదితర దృశ్యములవలె కల్పనా మాత్రము లేనని అనుకోవచ్చు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఆత్మ-జగత్తుల ఆ సంబంధము కల్పనామాత్రమేనని, జగత్తు చైతన్యము యొక్క చమత్కారభూతమేనని అనుకొంటే అద్దానియందు మాకు ఎట్టి అభ్యంతరమూ లేదు.

ఎప్పుడు, ఎచట- చిన్మాత్రాకాశం యొక్క ఏఏ నిర్మల విభాగాలు ఎట్లెట్లు (ద్రష్టత్వంచే) స్ఫురిస్తున్నాయో... అప్పుడు అచట - అది ఆయా ప్రకారంగానే స్థితినొంది ఉన్నదగుచున్నది.

ఆత్మఖ్యాతిః అసత్యాతిః అఖ్యాతిః ఖ్యాతిరన్యథా |

ఇత్యేతాః చిత్ చమత్కృత్యా ఆత్మఖ్యాతేర్విభూతయః ॥

కాబట్టి రామచంద్రా! లక్ష్యార్థము ఆత్మ యొక్క (లేక ఆత్మఖ్యాతి) యొక్క విభూతులే వ్యాఖ్యార్థమగు 1. ఆత్మఖ్యాతి, 2. అసత్యాతి, 3. అఖ్యాతి, 4. అన్యథాఖ్యాతి అనే నాలుగు అయివున్నాయి. అనాత్మ అయివున్నది, అన్యథాగా కనిపింపజేసేది... ఇవన్నీ ఆత్మ విభూతులే! అట్టి ఆత్మ విభూతులకు వేటే అయి సర్వదా యథాతథమై ఉన్నదేదో... అదియే ఆత్మ అనబడే ప్రతి జీవుని స్వస్వరూపం. ఆత్మకు వేరుగా ఏదైనా ఎక్కడైనా - ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటే... అట్లా అనిపించటమే అనాత్మత్వం.

చిద్రూపమగు పరబ్రహ్మము... ఆత్మఖ్యాతి (ఆత్మయొక్క ప్రసరణం) అనునదేదీ కలిగి ఉండలేదు. అద్దానికి వాచ్యార్థముకానిది, లక్ష్యార్థమయినది ఆత్మ. అట్టి ఆత్మకు ఆద్యంతాలు లేవు! జీవ - జగత్ పరిమితాలు లేవు! ఆ చిద్రూప పరబ్రహ్మమగు ఆత్మ వాక్కుచే చెప్పబడగలిగేది కాదు! అది సర్వదా ఏకము! శిలా గర్భము వలె అత్యంత ఘనీభూతమైనది!

6. శిలాఖ్యానం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సర్వ ద్వైత దృష్టులను నిరసిస్తూ జ్ఞానమును ప్రకాశింపజేసే శిలాఖ్యానము అను అధ్యాత్మ శాస్త్రములోని ఒక విశేషాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. విను.

మాకు తెలిసియున్నట్టి, మాకు ఎదురుగా కనిపిస్తూవున్నట్టి ఒకానొక శిల ఉన్నది. ఆ శిల పరిణామం కొన్ని కోట్ల - కోట్ల యోజనములు. అసలు అద్దాని పరిణామమెంతో మేము చెప్పలేం. అది అన్ని వైపులా విస్తరించి ఉన్నది. ఈ కనబడే ఆకాశమునంతా ఆక్రమించిన ఒక గోడ ఉన్నదనుకొంటే, అది అత్యంత విస్తారం కదా! అట్టి లక్షలాది గోడలకంటే కూడా విస్తీర్ణమైనది. ఆ శిల అతి కఠినమైనది. కానీ బహు నిర్మలమైనది, సువిశాలమైనది.

Page:500

మాకు కనబడుచున్న ఆ మహావిస్తీర్ణమైన గండశిలకు అవయవాలు లేవు. సంధులు లేవు. అది అతి దట్టమై, వజ్రంలా అతి దృఢమైనది. అతి విశాలమైనది. మిక్కిలి పరిపుష్టమైనది.

ఆ శిల యొక్క గర్భం అతి కఠినంగాను పరమ గాంభీర్యంగాను చెన్నొందుతోంది. అయినా ఆ శిలా గర్భకోశం ఆకాశంలాగా అతి నిర్మలమై ప్రకాశిస్తోంది. అసంఖ్యాక కల్ప సమూహములు గడచిపోతున్నప్పటికీ ఆ గండ శిల అద్దాని శిలాగర్భ విభాగము ఏ మార్పులు చేర్పులు లేకయే ప్రకాశిస్తోంది. అద్దాని ఉపరితలం, దేహభాగం... ఇవన్నీ అతి రమణీయమై, ప్రశాంతమయమై, అతి నిర్మలమై, మధురాతిమధురమై అత్యంత సౌందర్యంగా ఒప్పుచున్నాయి.

“ఆ శిల ఏ జాతి శిల?" అని నేను పరిశీలించాను. అప్పుడు అద్దానికి భిన్నంగా మరొక వస్తువే లేదు. ఇక అద్దాని విశిష్ట జాతిని ఎవరం నిర్ణయించగలం? అని నిశ్చయానికి వచ్చాను. ఆ మహా శిల ఏ ప్రదేశంలో ఉన్నది? ఏ కాలంలో ఉన్నది? ఏ ప్రకారంగా వర్తిస్తోంది? ఎక్కడి నుండి వచ్చింది?... అనే విషయాలు ఎన్నటికీ ఎవరికీ తెలియవచ్చేవి కావు. ఇక నాకు మాత్రం

ఏం తెలుసు?

వింటున్నావుగా రామచంద్రా! అత్యంత ఘనీభూతమై, మహాకఠినమై, వజ్రమువలె అతిదృఢమై, నాశరహితమై ఉన్న ఆ శిలయొక్క అంతర్భాగంలోకి తొంగిచూచాను. ఆ శిలయొక్క గర్భమునందు (అంతర్భాగంలో) పంచ మహాభూతాలుగాని (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంగాని), చతుర్విధ భూత సముదాయాలు గాని (అండజ, స్వేదజ, వాయుజ, గర్భజ జీవులు గాని) నాకు ఏమాత్రం కనిపించలేదు. అంతా ఘనీభూతమై, ప్రశాంతంగా ఆకాశంవలె నిర్మలత్వము, అత్యంత నిశ్శబ్దముతో కూడిన 'మౌనము' అక్కడ తాండవిస్తోంది. అట్లా ఆ శిలయొక్క గర్భ ప్రదేశంలోకి దృష్టి సారించిన నాకు, ఆ శిలాగర్భంలో, స్ఫటిక శిలలోని రేఖలలాగా అనేక స్వావయవభూతములైన (వాటికవే అవయవాలుగా కలిగియున్న) అనేక పద్మములు, శంఖములు, గదలు, చక్రాలు మాత్రం కనిపించాయి. అవన్నీ శిలా దేహములే! ఆ శిలాగర్భంలో వాస్తవానికి ఆకాశ-వాయు-అగ్ని-జల –పృథివి మొదలైనవాటిచే నిర్మించబడిన జగత్తు ఏదీ లేదు. లేదు కానీ... అందులో అనేక రేఖలు ఉన్నాయి. ఆ రేఖలలో కొన్ని ఆకాశంగాను, మరికొన్ని జీవులుగాను కల్పించబడినట్లు కనిపించాయి. వాస్తవానికి ఆ శిలా గర్భంలో ఉన్నదంతా శిలయే అయినా... ఆ రేఖలు అనేక ఆకారాలుగా కనిపించాయి. అట్లా ఆకాశాదులుగాను, జీవులుగాను కనిపిస్తున్న ఆ రేఖలను చూస్తూ ఉన్నాను. శ్రీరాముడు : మహర్షీ! మీరు చూస్తున్నది శిల - అద్దాని కోశవిభాగం కదా! శిల ఎప్పుడూ జడమే కదా! ఆ శిలలో చేతనులగు 'జీవులు' అనే రేఖలు కనిపించటమేమిటి? ఇంతకీ అదంతా శిలయా? జీవులా? అందులో పంచభూతాలే లేవని అంటున్నారు కదా! ఇంతలోనే 'ఆకాశము - - జీవులు' అనబడే రేఖలు కనిపించాయని అంటున్నారేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నాచే దర్శింపబడుచున్న విశాలమైనది - ప్రశాంతవంతమైనది అగు ఆ శిల చేతనం కాదు. జడం కాదు. అద్దానికి భిన్నంగా జడ - చేతనములే లేనపుడు మరి

Page:501

అద్దానిని జడం అని చెప్పనా? చేతనము అని చెప్పమంటావా? అద్దానికంటే వేరుగా ఎవరూ ఎక్కడా లేరు.

శ్రీరాముడు : మునీంద్రా! దానికి వేరుగా ఎవడూ లేడా? లేకపోయినప్పుడు అద్దాని గర్భమందున్నట్టి ఆకాశ జీవులుగా కనిపించే రేఖలను చూస్తున్నదెవరు? ఆ శిలా గర్భంలో ఆ రేఖలను చిత్రీకరించిన వారెవరు? ఏ ఉలి మొదలైన సామాగ్రితో ఆ శిలా గర్భంలో రేఖలను చిత్రీకరించారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : అతి దృఢమైన ఆ శిలను ఉలి మొదలైన పనిముట్లతో ఛేదించటం, చిత్రీకరించటం ఎవరివల్ల సాధ్యమయ్యేది కాదు. అద్దానిని ఛేదించగలిగిన వాడెవడూ లేడు. ఆ శిలయే తనయొక్క అపారమైన దేహంతో సర్వత్రా వ్యాపించి ఉన్నది. అయితే ఆ శిలాగర్భంలో రేఖారూపములైన వృక్ష సమూహాలు, పర్వత సమూహాలు, గ్రామ నగరాదులు నాకు కనిపించాయి. సూక్ష్మమైన సాకార - నిరాకారములగు ప్రతిమలలాగా ఆ శిలా గర్భంలో రేఖామయములైన అనేక దేవ దానవ కోట్లు ప్రదర్శనమగుచున్నాయి. అందులో విశాలమైన ఆకాశం" అనే ఒక పెద్ద రేఖ ఉన్నది. మధ్య మధ్యలో సూర్యుడు, చంద్రుడు మొదలైన పేర్లు గల అనేక అడ్డ దిడ్డమైన రేఖలు కూడా ఉన్నాయి. శ్రీరాముడు : స్వామీ! ఆ శిలా గర్భంలో ఎప్పుడు ప్రవేశించారు? ఎందుకు ప్రవేశించారు? ఎవరు చూచారు? ఆ ఘనీభూతమైన శిలాకోశంలో ఆకాశము, మానవులు, దేవతలు, దానవులు మొదలైన జడము-చైతన్యము కూడా అయినట్టి ఆ రేఖలు ఎట్లా కనిపించాయి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ శిలాగర్భాంతర్గతమైన రేఖలన్నీ నేను చూచాను. కాస్త తలచుకుంటే నీవు కూడా ఆ ఆకాశ - జీవాది రేఖలను తప్పకుండా చూడలగవు.

శ్రీరాముడు : మహర్షీ! ఆ శిల వజ్రము వలె అతిదృఢమని, అద్దానిని ఛేదించటం ఎవరివల్లా కాదని మీరే అన్నారు కదా! ఆ శిలాంతర్భాగంలోకి మీరు ఆ ఆ శిలను ఛేదించి ఎట్లా ప్రవేశించారు? అందలి అంతర్భాగంలో ఆ రేఖలను ఎట్లా చూడగలిగారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ! నేనెట్లా ప్రవేశించి ఆ రేఖలను చూచానా! అనియా నీ సందేహం? అయితే విను. ఆ శిలాగర్భంలో నేను ప్రవేశించనేలేదు. ప్రవేశించవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే ఆ శిలా గర్భంలో గల రేఖలలో నేను కూడా ఒకానొక రేఖను అయి ఉన్నాను కాబట్టి. అందులో రేఖను కాబట్టే తదితర సర్వ రేఖలను దర్శించగలిగాను. అంతేగాని, ఆ శిలను ఛేదించటం ఎవరి తరం? శ్రీరాముడు : ఓ మునీశ్వరా! అసలు ఆ శిల వాస్తవంగా ఏమైవున్నది? "ఆ శిలా గర్భంలోగల నేను కూడా ఒకానొక రేఖను"... అని మిమ్ములను గురించి మీరు చెప్పుకుంటున్నారు కదా! తాము వాస్తవానికి ఎవరు? మా గురుదేవులు వసిష్ఠులు కాదా! మీరు అందులో జడము, చైతన్యము గాని ఒక రేఖ అనేది నేను ఊహించలేకపోతున్నానే! మీరు వర్తిస్తున్నది ఎచ్చట? ఆ శిలారూపం గురించి చెప్పటంలో తమ ఉద్దేశము ఏమిటి? ఆ శిలయందు తాము ఏమేమి చూచారు? అవన్నీ వివరించండి.

Page:502

7. శిలాఖ్యాన సారాంశము

శ్రీ వసిష్ఠ మహర్షి : నేను శిలాఖ్యానము అనే ఒకానొక చమత్కారమైన కథనాన్ని వినిపించాను కదా! ఈ విశేషమును సర్వవ్యాపకమగు పరమాత్మయొక్క మహాసత్త' గురించి చెప్పటానికే ఉద్దేశించాను. అంతేగాని మరేదో విశాలమైన శిల గురించి కాదు. ఆ 'పరమాత్మ మహాసత్త' అనబడే శిలాఘనము యొక్క గర్భమున నీవు, నేను, ఈ సర్వసహజీవులు మనమంతా ఏర్పడి ఉన్నవారమై వర్తిస్తున్నాం. ఈ ఆకాశము, సమస్త క్రియలు, ఈ శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు, సమస్త జీవుల వాసనలు, కాలము, సప్త సముద్రాలు, అందలి వివిధ జీవుల సంస్కారాలు... ఇవన్నీ కూడా ఆ మహాశిలాంతర్భాగపు విభాగములే సుమా! ఈ పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సర్వజీవుల మనస్సులు, బుద్ధులు, చిత్తములు, అహంకారములు... ఇవన్నీ కూడా ఆ పరమాత్మ సత్తా మహాశిల యొక్క వివిధ అంతర్భాగరేఖలే. వాస్తవానికి ఆ 'మహాసత్త కంటే వేరుగా ఇక్కడగాని, మరెక్కడైనాగాని, ఇప్పుడుగాని, మరొకప్పుడు గాని మరింకా ఏదీ లేనే లేదు. అద్దాని కంటే మనమంతా ఏమాత్రం వేరుకానప్పటికీ అద్దానికంటే నీవు, నేను, వారు, వీరు వేరుగా ఉన్నట్లు భ్రమ చేత మాత్రమే తలచుచున్నాము. సమస్తము చిన్మాత్రైక స్వరూపమే అయివున్నది. చిన్మాత్ర సత్తకంటే ఎచ్చట ఏది ఉన్నదో చెప్పు చూద్దాం! కుండ, మట్టి, దూది, వస్త్రం... అన్నీ కూడా శుద్ధ జ్ఞానైకమాత్రమేనయ్యా!

ఒకే స్వప్నం అనేక నామరూపాలుగా వర్తిస్తున్నట్లుగా... ఒకే జలం అనేక తరంగాలు వివిధ ఆకారాలుగా కనిపిస్తున్నట్లుగా... ఒకే వాయువు అనేక తరంగాలుగా ప్రసరణ మగు వేరువేరు చోట్ల వేరు వేరు కార్యక్రమములను నిర్వర్తిస్తున్నట్లు, ఒకే సూర్యుని నుండి అనంతసంఖ్యగా కిరణాలు బయల్వెడలుచున్నట్లు. ఏకము అయినట్టి చిద్రూపం మనందరి రూపాలుగా ఈ ఈ లోకాలుగా, అనుభవాలుగా వ్యక్త-అవ్యక్తములు ప్రదర్శితమౌతున్నాయి.

ఇదం బ్రహ్మఘనం సర్వం చిన్మాత్ర ఘనమాతతమ్ |

పరమార్ధ ఘనం శాంతమ్ సర్వమ్ “ఏకఘనమ్ విదుః ||

ఇదంతా కూడా ఇద్దాని భూత-వర్తమాన భవిష్యత్తులతో సహా సర్వ వ్యాపకము, చిన్మాత్ర ఘనము, పరమ శాంతము, పరమార్థ ఘనస్వరూపం, ఏకము, నిర్లిప్తము, మహా మౌనస్వరూపం”... అగు పరబ్రహ్మమే అయి ఉన్నది.

ఓ రామచంద్రా! మనకు కనిపించే జగత్తంతా కూడా... ఏకము, ఛిద్రరహితము, అనంతము, ఆది మధ్యాంత రహితము” అయినట్టి “మహాచైతన్యము అనబడే ఒక మహాశిల యొక్క ఉదరభాగమే! అట్టి బ్రహ్మమే తన రూపముగా గల ఆ శిల తానే సృష్టి-జగత్తు-భువనము మొదలైన పర్యాయ పదములచే ప్రసిద్ధమగుచున్నది. అట్టి కల్పనను స్వీకరిస్తున్నది అదియే! అందుచేత ఓ సభికులారా! నాచే దర్శించబడుచున్న ఈ సర్వ దృశ్యమంతా ఈ ద్రష్టగా వ్యవహరిస్తున్న నాతో సహా పరబ్రహ్మము

Page:503

నకు అద్వితీయమై, అభేదమై జలంలో జలతరంగాలలాగా... చెన్నొందుచున్నది... అనే అధ్యాత్మ దృష్టిని, ఆత్మ దర్శనమును సముపార్జించుకొని తద్వారా సత్యద్రష్టలు కండి.

8. జ్ఞాని దృష్టి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇంతకుముందు నాలుగు ఖ్యాతుల గురించి చెప్పాను కదా! 1.ఆత్మఖ్యాతి : ఈ జగత్తు ఆత్మయొక్క విన్యాసం.

2.అసత్యాతి : ఈ జగత్తు అసత్తు. అట్టి అసత్తు సత్తుయగు పరమాత్మ నుండే వ్యక్తమౌతోంది. 3.అఖ్యాతి : నిర్మలమైన పరమాత్మలో దోషభూయిష్ఠమైనట్టి ఈ జగత్తు ఉంది. 4.అన్యథాఖ్యాతి : పరమాత్మలో పరమాత్మకు అన్యమైనట్టి ఈ జగత్తు ఉన్నది.

ఈ నాలుగు అవగాహనలు కూడా జ్ఞానియొక్క దృష్టిలో కుందేటి కొమ్ములలాగా మొదలే లేనివగుచున్నాయి. అనగా అవి మిథ్యయే! జ్ఞానికి అసత్యాతి మొదలైనవి సంభవించుటయే లేదు. ఎందుకంటే ఈ జగత్తు ఎట్లా ఉన్నప్పటికీ ఆతడు సదా శాంతము, అనిర్వచనీయము, సర్వ కల్పనలకు ఆవల ఉన్నది - చిత్తం యొక్క చేష్టలచే స్పృశించబడనిది, ఈ జీవ జగత్తులకు అతీతమైనది, అప్రమేయమైనది... అగు ఆత్మస్వరూపమునే అంతటా స్వభావ సిద్ధంగా గాంచుచున్నాడు.

'ఆత్మఖ్యాతి' మొదలైన భ్రాంతి దృష్టులన్నీ చిన్మాత్రము నుండే ఉదయిస్తున్నాయి. అట్టి చిన్మాత్రం పరమార్థమున “మహాశుద్ధము - సర్వ కల్పనా శూన్యము అయినట్టి చిదాకాశమే అయివున్నది. కాబట్టి సమస్త కల్పన కూడా చిదాకాశమే అయివున్నది.

అయమాత్మా త్వియం ఖ్యాతిః ఇత్యస్తః కలనాభ్రమః |

న సంభవతి అతశ్చైనం శబ్దం త్యక్త్వా భవార్థభాక్ ॥

ఓ రామచంద్రా! ఇది ఆత్మ, ఇది ఆత్మ యొక్క ఖ్యాతి (సృష్టిరూపం) ఈ ప్రకారంగా అనిపించే దంతా కల్పనాప్రభావమే అయివున్నది. ఆత్మ-ఆత్మకు వేరుగా సృష్టి"... అనబడే విభాగం ఎన్నడూ సంభవించటయే లేదు. కాబట్టి ఇట్టి శబ్ద విభాగమును త్యజించి 'పరమార్థభాగి’విగా అగుము. "విభాగ రహితమగు పరమాత్మ యందు పరమాత్మకు వేరుకానట్టి పరమాత్మతత్త్వమే విభాగమే నేను”... అన్న భావనను పెంపొందించుకో! ఈ జగత్తులో జీవులు రావటం, జీవులు పోవటం, భోజనాదులు, అనుభూతులు, అనుభవాలు... ఇవన్నీ జరిగిపోతూ ఉన్నప్పటికీ వాస్తవానికి ఈ దృశ్యజగత్తు వ్యాపార శూన్యమై ఉన్నది. ఆకాశమువలె ఇదంతా మహామౌన స్వరూపమై ఉన్నది. అభేద్యమగు చిన్మాత్రమే ఈ జగత్తు.

ఈ జగత్తు... అనేక శబ్దములతో కూడుకొని ఉన్నప్పటికీ, యథార్థానికి మౌనంగా వర్తిస్తోంది. నిరంతరము గమన-ఆగమనము (రాక పోకలు) సల్పుచున్నప్పటికీ, ఇదంతా ఆకాశమువలె, ఒక పర్వతమువలె ఒకే స్థానములో ఉండి ఉన్నది.

Page:504

అనేక కార్యారంభములతో కూడుకొని ఉన్నప్పటికీ, మార్పు చేర్పులు లేనట్టి ఆకాశమువలె వెలయుచున్నది. పంచభూత సహితమైనప్పటికీ, పంచభూత రహితమైయున్నది. అనేక పదార్థములతో పరిపూర్ణమై ఉన్నప్పటికీ, సర్వ పదార్థ వర్జితమై కేవలము జ్ఞానమాత్రంగా చెన్నొందుచున్నది.

స్వప్నంలో కనిపించే మహానగరంలాగా అగుపిస్తున్నప్పటికీ... సదా నిర్మల చిన్మయ స్వరూపమే అయివున్నది. అనేక ప్రయత్న సంరంభములతో కూడుకొని ఉన్నప్పటికీ... సంకల్పం (ఊహ)లో కనిపించే దృశ్యంలాగా సర్వ ప్రయత్న శూన్యమై ఒప్పుచున్నది.

అంతేకాదు ఈ 'జగత్తు' అనబడే దృశ్యము స్వప్నంలో కనిపించిన స్త్రీతో సంగమంలాగా భ్రాంతిరూపము. ప్రతిబింబ స్త్రీవలె (అనుభూతమగుచున్నప్పటికీ) వ్యర్ధము అయివున్నది. ఇది అనేక అనుభవములతో కూడుకొని ఉండవచ్చుగాక! కానీ, వాస్తవానికి సర్వానుభవరహితమై వస్తుశూన్యమై వర్ధిల్లుతోంది!

శ్రీరాముడు : హే మహర్షీ!... ఎప్పుడైతే జాగ్రత్ స్వప్న రూపమని అనతగ్గ ఈ జగత్తు “లేనిదే” (లేక) “వాసనామాత్రమే” అయి కనిపిస్తోందో... ఇకప్పుడు ఇది "స్మృతి యొక్క రూపమేనని నేను అనుకుంటున్నాను. “సద్రూప బాహ్య పదార్థముల యొక్క స్మృతియే ఈ జగత్తుకు కారణం. అంతే గాని ఈ జగత్తు భ్రాంతి కాదు" అని కొందరికి అనిపిస్తోంది.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! చిదాకాశము నందు "అద్దానికి అభిన్నమే అనతగిన రూపం గల ‘స్ఫురణ’ అనబడేది బయలుదేరుతోంది. అట్టి స్ఫురణకు, చిదాకాశము కంటే వేరైన రూపమేదీ లేదు. ఎందుకంటే చిదాకాశం కంటే వేరైనదేదీ చిదాకాశంలోనుంచి బయల్వెడలటానికి ఏ బాహ్య కారణం ఉండజాలదు కాబట్టి. అట్టి నిరాకారము - చిదాకాశ స్వరూపము అగు స్ఫురణకు కారణం లేదు. గాలియందు వాయుతరంగాలవలె, అగ్నియందు అగ్నిశిఖలకు గల ఆకారం వలె, బంగారమునకు ఆకారం వలె చిదాకాశం యొక్క చిత్ స్ఫురణకు కారణమేమిటి? అనే ప్రశ్నకు సమాధానం ఉండజాలదు. అందుచేత అది స్వభావసిద్ధమే!

చిదాకాశమునందు చిత్ స్ఫురణ స్వభావ సిద్ధమే! - అట్టి సత్తా మాత్రమైనట్టి స్ఫురణయే కాకతాళీయంగా శరీరమును ధరించినదై నిష్కారణంగా దృశ్యరూపంగా భాసిస్తోంది. అదియే భ్రాంతిరూపంగా కనిపించే ఈ జగత్తు. ఇక 'స్మృతి' అంటావా! అట్టి స్మృతియొక్క నాందీ ప్రస్తావనా రూపం స్ఫురణయే! అట్టి స్ఫురణ చిదాకాశమే! కనుక ఈ 'జీవుడు అనబడే ద్రష్ట - ఆతని స్మృతి రూపంగా నీవు అనుకుంటున్న ఈ జగత్తు... ఉభయములూ లేకపోయినప్పటికీ, (జలానికి అభిన్నమైన... జలానికి స్వభావమే అయి ఉన్న తరంగం వలె) ఆకారం కలిగి ఉంటోంది కదా! నాశరహితం, సర్వవ్యాపకం, శాంతం, జగద్రహితం - అయినట్టి పరమాత్మలో జగద్భావ రూపమగు ఈ జగత్తు పరమాత్మకు అభిన్నమై వెలయున్నది. సర్వ రూపం, పదార్థ రహితం, పరమ శాంతం, చిదాకాశమయం - అగు పరమాత్మ ఎట్లా కారణరహితమో... అట్లాగే జగత్తు చైతన్యమునకు అభిన్నమైన కారణంగా జగత్తు కూడా అకారణమే! అట్టి పరమాత్మ చైతన్యం ఎప్పుడెప్పుడు తనలో

Page:505

అవిద్య ద్వారా ఎట్లెట్లు స్ఫురిస్తోందో... అపుడపుడు అచ్చటచ్చట ఆయా ప్రకారంగానే ఈ జగత్తు భాసిస్తోంది. ఎక్కడెక్కడ చైతన్య స్ఫురణ భాసించదో... అక్కడక్కడ జగత్తు కూడా భాసించదు.

ఓ రామచంద్రా! బ్రహ్మస్వరూపమగు ఆత్మ తనయొక్క పరమాత్మ స్వరూపమును ఏమాత్రం ఏ క్షణంలోనూ త్యజించుటయే లేదు. అయ్యది సర్వ శక్తిమంతమగు చిత్స్వరూపమే కాబట్టి సర్వమునకు తానే కారణమై ఉంటోంది. తన నిర్మల స్వభావమగు బ్రహ్మ స్ఫురణకే ఇది జాగ్రత్తు, ఇది స్వప్నం, ఇది సుషుప్తి, ఇది తురీయం, ఇది బ్రహ్మము, ఇది ఆత్మ"... ఇత్యాది నామములను తానే స్వయంగా గావించుచున్నది.

వస్తుతస్తు అస్తి న స్వప్నో, న జాగ్రత్, న సుషుప్తతా

న తుర్యం, న తతో అతీతం, సర్వం శాంతం పరం నభః ||

కానీ రాఘవా!... వాస్తవానికి జాగ్రత్తుగాని, స్వప్నంగాని, సుషుప్తిగాని లేవు. వాటన్నిటి యందు పుష్పమాలయందు దారమువలె అనుస్యూతమై, వాటన్నిటికంటే పరమై, శాంతమగు పరబ్రహ్మ రూప చిదాకాశమే ఆ సమస్తము కూడా అయివున్నది.

లేదా... ఇదంతా కూడా ఈ జగత్తంతా కూడా)... చైతన్యము ఏ క్షణము నిదురించదు కాబట్టి సర్వము అనునిత్య జాగ్రత్ రూపమే అయివున్నది. ఇదంతా చైతన్యము యొక్క స్వప్న మాత్రమే కాబట్టి, సర్వము స్వప్న రూపమే అయి ఒప్పుచున్నది. అంతా అవిద్య మాత్రమే కనుక... సర్వము సుషుప్తి రూపమే అయి వెలయుచున్నది.

ఈ ద్రష్ట సర్వదా అవస్థాత్రయమును దాటివేసిన తురీయరూపుడే కాబట్టి ఈ 'జగత్తు' అనబడే సర్వము తురీయ రూపమేనని కూడా మనం తప్పకుండా అనవచ్చు. ఆత్మానుభూతులగు జ్ఞానుల దృష్టి యందు 'నీవు, నేను, అది, ఇది' అనే కల్పనలు ఉండటం లేదు కనుక అంతా కూడా పరమాత్మ యందు పరమాత్మకు అభిన్నమై, పూర్ణశాంతరూపమై ఉన్నది... అన్నది కూడా ఎవరమూ కాదనలేని సత్యం.

అంతటా జలమయమైయున్న సముద్రంలోకి మనం పోయి... ఇవి తరంగాలు కాదు, తరంగాలుగా కనిపించేదంతా సముద్ర జలమే! ఇది తెల్లటి నురుగు కాదు, నురుగుగా కనిపించే సముద్ర జలమే! ఇవి బుద్బుదములు (బుడగలు) కావు, బుద్బుదములుగా కనిపించేదంతా జలమే! అయినా కూడా తరంగాలు వేరు, నురుగు వేరు. తుంపరలు వేరు. బుద్భుదములు వేరు... ఇట్లా చెప్పుకోవటం ఎట్లా ఎంతవరకు మిథ్య (మరియు) యుక్తియుక్తమో... అట్లాగే చిదాకాశము” అనే మహాసముద్రంలో కనిపించే ఆయా విశేషాలను "ఇది జాగ్రత్. ఇది స్వప్నం. ఇది జగత్తు. ఇది ద్రష్ట”... అని చెప్పుకోవటం చిదాకాశం ద్రష్ట్యా మిథ్య - యుక్తియుక్తము కూడా అయివున్నది.

అయితే ఈ జగత్తు సత్తా? అసత్తా? అని ఎవరైనా ఇంకా ప్రశ్నించారనుకో, అపుడు, ఒకానొకటి సత్తు అయినా, అసత్తు అయినా చిదాకాశం దేనిని ఎట్లు ఎరుగుచుండటం జరిగితే అది ఆ ప్రకారమే అనుభవమగుచున్నది... అని చెప్పక తప్పదు. ఈ విధంగా చైతన్యం నిజ చిదాకాశమునందే

Page:506

సత్-అసత్ పదార్థములను స్వయంకృతంగా అనుభవమునకు, అనుభూతికి తెచ్చుకోవటం జరుగుతోంది. కనుక ఓ రామచంద్రా! ఈ జగత్తంతా కూడా చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే అయివున్నది. అనగా చైతన్యము ఎట్లా స్ఫురిస్తోందో... ఈ జగత్తు అట్లే భాసించుచున్నది. వాస్తవానికి చిదాకాశమునందు చిదాకాశమే జగద్రూపంగా భాసించుచున్నదగుచున్నది.

చైతన్యము చిదాకాశము యొక్క సారమేనయ్యా! అది సదా ఏకరూపమై ఉదయాస్తమయములు లేకయే వెలయుచున్నది. ఈ జీవుడు చైతన్య స్వరూపుడే! అట్టి చైతన్యము యొక్క స్వకీయమైన అవయవం వంటిదే ఈ జగత్తు. అనగా సృష్టి, మహా ప్రళయ రాత్రింబవళ్ళు, తదితర కాలవిభాగం, ఇవన్నీ కూడా చైతన్యం యొక్క అవయవ విభాగత్వముగానే ఏర్పడినవై ఉన్నాయి. అందుచేత వాయువు, వాయువు యొక్క చలనం వలె స్ఫురించేది, స్ఫురించనిది, చిద్రూపము, మాయారూపంగా భాసించేదీ... అంతా కూడా చిదాకాశం యొక్క ఒకానొక విభాగమే సుమా! దేహానికి గోళ్ళు మొదలైనవి శరీర విభాగంగానే ఉన్నట్లు జగత్తు చిదాకాశ దేహము యొక్క ఒకానొక విభాగము వంటిదే! కనుక ఇక జాగ్రత్తు ఏమి? స్వప్నం ఏమి? సుషుప్తి ఏమి? తురీయమేమి? స్మృతి ఏమి? విస్మృతి ఏమి? ఇచ్ఛ ఏమి? జగత్తు ఏమి? ఇట్టి కుదృష్టులన్నీ మిథ్యయే అయివున్నాయి.

అన్తః సంవేదనం భాతి స్వం బాహ్యార్థతయా యతః ॥

క్వ ద్వైతం? క్వచ కా అర్ధశ్రీః? స్మృతిరేవమతః కుతః ॥

చైతన్యం యొక్క స్వకీయమైన అభ్యంతర స్ఫురణయే బాహ్య పదార్థాకారంగా భాసించు చుండగా... ఇక ద్వైతమెక్కడ? పదార్థములెచట? పదార్థములే లేనప్పుడు, ఇక వాటి గురించిన 'స్మృతి' ఎక్కడున్నది? నిరాధారమగు ఆకాశమున ప్రకాశించే సూర్యగోళం యొక్క ప్రకాశం దేనినీ ఆపేక్షించకుండానే అంతటా వెలుగొందుచున్నది చూచావా? భేదరహితమగు ఆత్మరూపంగా ఈ దృశ్యం భాసిస్తోంది. అట్టి ఆత్మ ప్రకాశం భౌతిక పదార్థవర్జితం. ఈ జగత్తు ఆత్మయొక్క నిజస్వరూప ప్రకాశమేగాని భౌతికం కాదు. భౌతికంగా (సాకారయుక్తంగా) లేదు.

ఈ భౌతిక పదార్థములు నిజదృశ్య రూపముచే సత్యమయివుంటే... అప్పుడు వాటికి సంబంధించిన స్మృతి సృష్టికి కారణభూతములని అనవచ్చునేమో! కానీ ఇది పంచభూత సమ్మేళనమే! ఏ దృష్టితో ఇవి చూడబడుచున్నాయో... అదంతా కూడా స్వకీయమైన ద్రష్టయొక్క కల్పనా సదృశమే! కల్పనా చమత్కారమే! సృష్ట్యాది యందు అంతా అకారణమై ఉండగా పంచభూతాలు ఉద్భవించటానికి కారణమేమున్నది? అట్టి కారణ అభావం చేత దృష్టికి వేరుగా పంచభూతములే జనించటం లేదు. ఈ రీతిగా ఈ బాహ్య పదార్థములు లేకయే ఉన్నాయి.

కుందేటి కొమ్ములు ఎవరి వలన ఏ కారణంచేత కనిపిస్తున్నాయి? ఆకాశంలో వెంట్రుకాకారాలు ఎవరి కారణంచేత మెలికలు పడిన దారమువలె అగుపిస్తున్నాయి? వంధ్యా పుత్రుడు (గొడ్రాలి కుమారుడు) వీథిలో ఎందుకు అల్లరి చేస్తున్నాడు? దూరపు కొండలు నునుపుగా ఎందుకున్నాయి? నక్షత్ర మండలం సింహము - - తేలు మొదలైన ఆకారాలలో ఎందుకు కనిపిస్తోంది? ఎండమావులలో జలము ఎందుకు అగుపిస్తోంది?

Page:507

ఈ జగత్తు కూడా అట్లాగే అనుభవమౌతోంది. కనుక ఈ జగత్తు వాస్తవం కాదు. ఇక 'నీవునేను మొదలైన వేరు వేరైనట్లుగా కనిపించే జగత్ పదార్థములన్నీ విచారణ చేయకపోవటం చేతనే అట్లా భాసిస్తున్నాయి. విచారణ చేసినప్పుడు అవన్నీ స్వప్నంలోని 'నేను - నీవు' లాగానే లేనివే అగుచున్నాయి. ఓ రామచంద్రా! అజ్ఞానులకు మహాకారయుక్తంగా భాసించుచున్న ఈ జగత్తు తత్త్వజ్ఞుల దృష్టి యందు మూర్తామూర్త రహితమైనట్టి అఖండ చైతన్య ఘనము. నిత్యోదితమై ఉన్నప్పటికీ... అయ్యది వ్యవహారమునందు ఎప్పుడెప్పుడు ఉదయించుచున్నదో... అప్పుడప్పుడే అట్లే ఉదయ - అస్తమయము ఉన్నదానివలె అగుపిస్తోంది. ఎప్పుడైతే జీవుడు ఇది భూమి - అది ఆకాశంఅని ఎరుగుచున్నాడో... అప్పుడు ఆత్మ సత్తా యొక్క ప్రకాశమే అట్లు 'భూమి - ఆకాశము' మొదలైన రూపములుగా ఆతనికి కనిపించుచున్నదగుచున్నది. జన్మరహితమగు మహాచైతన్య రూప చిదాకాశము తన యొక్క స్ఫురణకు 'ఇది నేల, ఇది ఆకాశం' మొదలైన పేర్లను కల్పించి, అటు తరువాత వాటితో వ్యవహరిస్తున్నది. ఒక పసిబాలుడు తన మనోరాజ్యంలో బంధు గృహములను, ఆట వస్తువులను, సహచరులగు బాలురను దర్శిస్తాడు చూచావా? అట్లాగే నాశనరహితమగు చిన్మాత్రము తనయొక్క ఆకాశమువలె నిర్మలము, విశాలము అయినట్టి స్వరూపమునే ఈ భూమి మొదలైన సర్వ విశేషములతో కూడి దృశ్యముగా దర్శిస్తోంది. ఓ ప్రియ సభికులారా! ప్రియ పాఠకులారా! మీకు జగత్తుగా కనిపించుచున్నదంతా నాశరహితము - నిర్మలము అగు పరమానంద చిన్మయాకాశమే! మీ మహానంద స్వస్వరూపమునకు అన్యంగా జగత్తు అనబడునది ఏదీ లేదు.

అంతా మీ చిదాకాశ స్వరూపమే అయివుండగా... ఇక స్ఫురణ ఎక్కడ? అస్ఫురణ ఎక్కడ? కనుక, అయ్యో నాకీ జగత్ స్ఫురణ తొలిగేది ఎట్లా?" అనే వ్యర్థ భావన కూడా అనవసరమే కదా! ఎందుకంటే... వాయువుకు తరంగాలవలె! [అనగా వాయువు నిశ్చలం (అస్పందము) - - వాయు తరంగాలు చంచలం (స్పందము)] వాస్తవానికి మనందరి చిత్స్వరూపం నిశ్చలం. మన చిదానంద స్వస్వరూపం - చైతన్య శక్తిచే నిశ్చలం. ప్రాణ మనోశక్తిచే చంచలం. నిశ్చల చంచలములు మన ఆత్మయొక్క చమత్కారములే!

చిదాకాశము ఏ విధంగా స్ఫురిస్తోందో ఆయా ప్రకారంగానే ఈ భూమ్యాకాశాదులు భాసిస్తున్నాయి. అనగా మనకు భూమ్యాకాశాలుగా భాసించేది మనలో ప్రతి ఒక్కరి చిదాకాశ రూపమే! చిదాకాశమే చిదాకాశము నందు చిదాకాశంగా భాసిస్తోంది. చిదాకాశ స్వరూపులమగు మనయందు చిదాకాశ స్వరూపమగు మనస్సు ద్వారా చిదాకాశ స్వరూపమగు ‘జగత్తు భాసిస్తోందని వేదాంత జ్ఞానులగు మహనీయులు సుస్పష్టంగా నిర్దుష్టంగా గ్రహించియే ఉంటున్నారు.

ఓ జనులారా! "ఈ సమస్త రూపముగా రూపరహిత చిదాకాశమే ప్రకాశించుచుండగా, ఈ జగత్తు నాతో సహా మనమందరం కూడా సర్వదా చిదాకాశరూపులమై సర్వదా ప్రకాశిస్తున్నాం!”... అను అవగాహనయే వేదాంత జ్ఞానము యొక్క పరాకాష్ఠ, ఓ రామచంద్రా! అట్టి "స్వయమేవ ఆత్మన్ ఆత్మానం వేత”... స్వరూపులు, ఆత్మ సాక్షాత్కారానంద స్వరూపులగు మహనీయులు ఈ విశ్వామిత్ర నారదాది అనేకమంది ఎందరో ఈ సభలో ఉన్నారు. చిత్స్వరూపుడగు జీవుని

Page:508

చిత్స్వరూప విన్యాసమే ఆతనికి కనిపించే జగత్తు ... అని వారు అత్యంత నిర్దుష్టంగా యెరిగియే మన ఈ సంవాదమును ఆనందంగా ఆస్వాదిస్తున్నారయ్యా!

ఇక ఈ అనేక నామ రూప భేదాలతో కూడిన ఈ జగత్తు అంటావా? ఇది ఎట్లా భాసిస్తుంటే అట్లాగే భాసించనీ! భాసించుచున్నదంతా వాస్తవానికి చిదాకాశ స్వరూపమే కదా! కనుక ఇదంతా సర్వదా సత్తు కాదు. అసత్తు కాదు. వస్తువు కాదు. అవస్తువు కాదు. ఇది అనిర్వచనీయం అని మేము గ్రహించియే ఈ జగత్తులో క్రీడగా, లీలగా సంచారం చేస్తున్నాం.

ఇదమిత్థం అనిత్థంచ సద్వా అసద్వా యథా స్థితమ్ లోక పర్యాయ వృత్తాంతం ప్రాజ్ఞో జానాతి, నే తరః ॥

ఓ రామచంద్రా! ఈ జగత్తు ఈ ప్రకారంగానే ఉన్నదా? మరొక విధంగా ఉన్నదా? ఇది సత్తా? అసత్తా? ఇటువంటి లోక పర్యాయవృత్తాంతం తత్త్వజ్ఞాని మాత్రమే యథార్థంగా ఎరుగు చున్నాడు. తత్త్వజ్ఞానదృష్టి లేనివాడు ఈ జగత్తు ఎట్టిదో ఎరుగనేలేడు. ఎందుకంటే, తత్త్వజ్ఞుడు సర్వుల హృదాకాశమున నేనే ఆత్మరూపంగా వెలుగొందుచున్నాను అనీ, “నా రూపమే వీరికి ఈ జగత్తుగా కనిపిస్తోంది అనికూడా గ్రహించి... ఉత్తమ బుద్ధిని సంతరించుకొని ఉంటున్నాడు. అందుచేత “నా యొక్క దృశ్య సంవిత్తే అభ్యంతర మనోబుద్ధ్యాదులు అయివుండగా, బాహ్యరూప బ్రహ్మాండములుగా వెలుగొందుచున్నది అను అవగాహనచే ఆతడు ఈ దృశ్య వ్యవహారమంతా ఆస్వాదిస్తున్నాడు.

ఓ ప్రియ జనులారా! వాస్తవానికి ఇచ్చట బాహ్యం లేదు. అంతరం లేదు. దృశ్యం లేదు. అదృశ్యం లేదు. అందుచేత రామా! ఈ శాంత - అశాంత రూపమగు సమస్తమును “ఓం కార లక్ష్యార్థమగు "శివ రూప బ్రహ్మం" నందు లయింపజేసినవాడవై పరమశాంత స్వరూపుడవగుము. శ్రీరాముడు : స్వామీ! అంతాకూడా శాంతరూప శివబ్రహ్మమే అయివుండగా, ఇక శరీర-మనోబుద్ధి-బాహ్య-అంతరంగాదుల గురించి శాస్త్రములు ప్రతిపాదించే సంవిధానమంతా వృథా కల్పనయేనంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! శాస్త్రీయ చర్చా సంరంభమంతా అధ్యాత్మాయానంలో ఒక చోట ఆగిపోవుచున్నాయి. అయితే... శాస్త్ర విచారణ లేకపోతే స్వయంకృత జగత్తు - సర్వాత్మకమగు సో హమస్మీ భావం అనుభవానికి రావు.

వాచ్య - వాచక సృష్టి లేకపోతే శాస్త్ర విచారణ సంభవించదు. ఇటువంటి శాస్త్రీయ దృక్పథం, అవగాహన... శాస్త్రకారులు ప్రతిపాదించేది, ప్రబోధించేది - మొదలైనదంతా కూడా 'ఆత్మజ్ఞాన సిద్ధి' కొరకే అయివున్నది. అట్టి 'విచారణ' లేకపోతే... దీపం ఉన్నప్పటికీ కళ్ళు మూసుకున్న వానికి గదిలో ఏదీ కనబడనట్లే... ఆత్మ అంతటా సర్వదా ఏర్పడియే ఉన్నప్పటికీ, తాను ఆత్మయే అయి ఉన్నప్పటికీ అజ్ఞానం తొలగదు. నేను ఈ దేహ పరిమిత జీవుడను" అనే చీకటి తొలగదు. అసత్తే

Page:509

అయినప్పటికీ వాచ్య-వాచక వికల్ప వ్యవహారం శాస్త్ర జ్ఞానానుసారం ఆశ్రయించవలసియే ఉంటుంది. ఆ తరువాత క్రమంగా చర్చనీయాంశాలన్నీ ఎందుచేత అసత్ పరిమితమో కూడా స్వయంగా స్వభావ సిద్ధంగా గ్రహించబడుచున్నది కూడా! అందుకే మనం ఈ 'ఉత్తమ విచారణ'ను ఈ సభలో ఇన్ని రోజులుగా కొనసాగిస్తున్నాం. మన ఈ 'విచారణ'ను అనుసరిస్తూ వస్తే క్రమంగా బుద్ధి శుద్ధము, నిర్మలము, ఉత్కృష్టము అగుచూ వస్తుంది. అట్టి మధురమైన నిర్మల బుద్ధితో సంకల్పమయమగు సమస్త శారీరక శాస్త్రీయ జనిత వికల్ప సమూహములు అంతఃకరణం నుండి పారద్రోలివేయబడగలవు. అప్పుడీ మనస్సు సకల శాస్త్రముల అంతిమసారమగు అద్వయ సచ్చిదానందాత్మ యందే నెలకొనగలదు. ఓ రామా! అట్టి తదేక నిష్ణాపరుడవై, ఈ సంసారము ఏమిటో ఎరిగి, ఇద్దాని నుండి ఎగిరి మోక్ష గగనంలో విహరించు!

9. అబుద్ధిపూర్వకమిదమ్ జగత్

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! వృక్షము అబుద్ధిపూర్వకంగానే కొమ్మలు, ఆకులు, కాయలు, పూలు మొదలైన విభాగములన్నీ తనయందు కలిగి ఉంటున్నట్లు... సముద్రము అబుద్ధిపూర్వకంగా తనలో ఆవర్తములు, తరంగాలు రచించుకొంటున్నట్లు... జన్మ-కర్మ మొదలైన ఎట్టి వికారాదులు లేని పరమాత్మ, ఆకాశము నిర్మలము-విశాలము అయినట్టి తన స్వరూపమునందు... శూన్య రూపములే అగు చిత్ర - విచిత్ర ప్రపంచముల యొక్క అధ్యాసలను, అనేక జాగ్రత్ స్వప్నచిత్ ప్రతిభాసములను గావించుచు... నిజ స్వరూపములగు జగదాకార సంవిత్తులకు, (లేక) చైతన్య వృత్తులకు మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము మొదలైన వివిధ నామములను స్వయముగా కల్పించుచున్నాడు. చైతన్యమునకు, చైతన్యరూపమే అయి - - బుద్ధిరూప చైతన్యముచే అగుపించే దృశ్యము - సముద్ర తరంగములాగా అబుద్ధిపూర్వకమే అయివున్నది.

అబుద్ధిపూర్వకంగా బుద్ధి జనిస్తోంది. బుద్ధి జనించిన తరువాత సంకల్పించబడేదంతా బుద్ధిపూర్వకం అయివున్నది.

సముద్రంలో ఆవర్త-కణ-కల్లోల-తరంగాదులు ప్రవృత్తములగునట్లు చిన్మాత్రమగు ఆత్మ నుండి మనో-బుద్ధి-చిత్త-అహంకార రూపమగు సృష్టి ప్రవృత్తమౌతోంది. గోడపై ఉలిచే లిఖించబడిన చిత్రము గోడయే కదా! అట్లాగే చిదాకాశమున అభాస మాత్రమగు ఈ జగత్తు చిదాకాశమాత్రమే అయివున్నది. చైతన్యమునందు అబుద్ధిపూర్వకంగా ప్రవృత్తిరూపంగా ఈ సృష్టి ప్రారంభము పొందిన తరువాత, ఇక బుద్ధిచే కూడుకొనినదై ప్రకృతిచేత యథాయోగ్యమగు ఆకారముగా ఒనర్పబడుచున్నది. వృక్షం జనించిన తరువాత ఇది కాండము, ఇది కొమ్మలు, ఇవి రెమ్మలు, ఇవి పూలు, ఇవి కాయలు ...అని ఎవరో పేర్లు పెట్టుచున్నారు కదా! వాస్తవానికి వృక్షమునకు వేరై వృక్షమునందు ఏమి ఉన్నది? అట్లాగే చైతన్యము నందు అబుద్ధిపూర్వకంగా జనించే ఈ పృథివి, ఆకాశము,

Page:510

సమష్టి, సృష్టి రూపులగు హిరణ్యగర్భుడు మొదలైన ఆయా పేర్లు పెట్టుచున్నారు. పరమాత్మ నుండి అబుద్ధిపూర్వకంగానూ, అకారణంగానూ జనించిన ఈ పృథివి మొదలైన వాటితో కూడిన జగత్తు పరమాత్మ కంటే వేరుకాదు. చిదాకాశరూపమగు ఆత్మయే, వ్యష్టి జీవునివలె అయి... ఈ చిదాకాశమునకు అనన్యము అయినట్టి ఈ ఎదురుగా కళ్ళకు కనిపించే సృష్టిని నామరూపాత్మకం తెచ్చిపెట్టుకుంటోంది.

చిద్రూప వృక్షమే ఈ ప్రకారంగా కార్యకారణ రూపమైన స్వీయాలంకారములతో స్వయంగా భాసించుచున్నది.

శ్రీరాముడు : మహాత్మా! కొందరు గురువులు తమ శిష్యులకు... ఇహ-పరలోకాలు ఉన్నాయి. ఇహంలో చేసిన పాప పుణ్య ఫలాలు పరలోకంలో అనుభవిస్తారు అని బోధిస్తున్నారు. ఈ సృష్టియే లేదని మీరు ప్రతిపాదదిస్తున్నారు కదా! మరి ఇహలోక విహిత - నిషిద్ధ కర్మలు, వాటి ఫలములను అనుభవించవలసియున్న పరలోకముల గురించి మీ అభిప్రాయం?

శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! కర్మఫలములు, ఆ ఫలములను అనుభవించటానికి వేరే కొన్ని లోకములు ఉన్నాయనే అనుకుందాం. ఆ లోకములో అనుభవాలవంటివే ఈ ఇహలోకంలోకూడా అనుభవానికి వస్తున్నాయి కదా! ఈ జాగ్రత్లో పొందుచున్న సుఖ-దుఃఖాలు కూడా కర్మఫలరూపాలే అని ఎందుకనుకోకూడదు? "జగత్తు ఉన్నది" అని ఈ జీవుడు సంకల్పం కలిగి ఉన్నంతవరకు ఈ జగదనుభవములు సత్యముగానే సుఖ దుఃఖాదులుగా ప్రాప్తించటం కొనసాగుతూనే ఉంటుంది. అద్దానికి అంతు అనేదే లేదని మహాశవోపాఖ్యానంలో గమనించాము కదా!

నిరాకారమగు చైతన్యమున సాకారమగు ఈ జగత్తు చైతన్యము చేతనే సంకల్పింపబడినదై “ఇది నాకు దుఃఖం. ఇది నాకు సుఖం... ఇటువంటి సుఖ దుఃఖ - అత్యాశ్చర్య - అతి సామాన్య రూప నిర్వచనాలన్నీ మూలముగా కలిగినదై చెన్నొందుతోంది. పుష్పానికి సుగంధంలాగా, అకాశానికి శూన్యత్వంలాగా, వాయువుకు చలనత్వంలాగా చైతన్యమునకు ఈ బ్రహ్మాండ సృష్టులన్నీ అభిన్నమై వెలయుచున్నాయి. చైతన్యమునకు వేరుగా చూస్తే ఈ సృష్టులు అత్యంత శూన్యరూపములే!

ఆకాశం కంటే శూన్యత్వం వేరుకాదు. జలముకంటే ద్రవత్వం వేరుగాలేదు. పుష్పము కంటే గంధము వేరుగా ఉండదు. వాయువుకు వేరుగా స్పందము లేదు. అగ్ని కంటే భిన్నంగా ఉష్ణము ఉండదు. మంచుకంటే శీతలత్వం వేరుకాదు.

అట్లాగే... చిదాకాశ స్వరూప పరమాత్మ కంటే జగత్తు వేరుగా లేదు. 1. సృష్ట్యాదిలో కనిపించే ఈ జగత్తు, 2.స్వప్నంలో కనిపించే దృశ్యము... ఈ రెండూ కూడా కూటస్థ చైతన్యము కంటే భిన్నం ఎట్లా అవుతాయి చెప్పు?

"చిత్ చైతన్యం కంటే చేత్య (తెలియబడే) జగత్తు వేరు కాదు అనే సిద్ధాంతానికి దృష్టాంతం ఏమిటంటావా? స్వప్న ద్రష్ట కంటే స్వప్నము వేఱుగా ఉన్నదెప్పుడు? ఎక్కడ? అట్లాగే చిన్మాత్రము

Page:511

కంటే సారరూపమైనదేదీ ఈ జగత్తులో లేదు. జగద్రష్ట చిన్మాత్ర స్వరూపుడేనని మరల మరల గుర్తు చేస్తూనే ఉన్నాను.

శ్రీరాముడు : మహర్షీ! 1. స్మృతి-జగత్తు 2. స్మృతి-స్వప్నము ...అను జంట విషయములలో ఇంకా కొంత సంశయం చోటుచేసుకొని ఉండటం చేత ఈ రెండింటి విషయంలో ఈ "జగత్తు యొక్క నిర్వచనం గురించి మరొక్కసారి మాకు బోధించండి.

స్వప్నం ఎక్కడి నుండి వస్తోంది" అనే ప్రశ్నకు సమాధానంగా... “గత స్మృతులందలి సంస్కారంలో నుంచే బయల్వెడలుతోంది. స్మృతులలో నుండి 'అది' అనబడే దత్తాంశముగా భాసిస్తోంది. జగత్తులో 'ఇది' అనే ఇదంశము రూపంలో పూర్వ స్మృతులు, వర్తమాన దృశ్యం సమ్మిళితమై జాగ్రత్ రూపంగా పొందబడుతోంది.

ఈ విధంగా బుద్ది నుండే రెండూ జాగ్రత్ - స్వప్నాలు స్మృతి రూపంగా సంభవిస్తున్నాయి. స్మృతిలో పూర్వకాలిక పదార్థానుభవములు ఘనీభూతమై ఉండి పరోక్షంగా స్వప్నంలోను, ప్రత్యక్షంగా జాగ్రత్తలోను పాల్గొనుచున్నాయి.

కాబట్టి జాగ్రత్ స్వప్నములు రెండూ స్మృతి రూపములే అవుతాయి కదా! (లేక) ఈ జీవుని స్వస్వరూపమే (చిదాకాశరూపమే) ఎట్లా అవుతాయి? పై విధంగా కొన్ని సిద్ధాంతాలున్నాయి. వీటికి సమాధాన పూర్వకంగా ప్రవచనం ప్రసాదించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒకానొకడు ఉదయం అడవికి వెళ్ళి ఒక సింహమును చూచాడు. భయపడి పరుగులు తీయనారంభించి ఎట్లాగో స్వగృహం చేరాడు. ఆ రాత్రి నిదురించినప్పుడు కలలో సింహం కనిపించింది. ఇప్పుడీ జాగ్రత్-స్వప్న అనుభవములను విశ్లేషిద్దాం. రాత్రి స్వప్నంలో కనిపించిన సింహం ఆ ఉదయం చూచిన సింహమే కదా! రెండూ ఒక్కటే అయితే అడవిలో సింహం అడవిలోనే ఎందుకుంటోంది?

కనుక స్వప్నంలో కనిపించేది వస్తువు లేకుండా స్మృతియే వస్తురూపంగా కూడా కనిపిస్తోందని తేలుతోంది కదా! అయితే స్వప్న సమయంలో అది సత్యమనియే అనిపిస్తోంది కాబట్టే స్వప్నం మనకు ఇప్పుడు చర్చనీయాంశమగు విషయమగుచున్నది. అవునా?... కనుక స్వప్నంలో కనిపించేది స్వప్న సమయంలో ఇందంశము అగుచున్నదే గాని తదంశము అవదు కదా!

ఇక ఈ జగత్తు 'స్మృతి' అనబడే ఇతఃపూర్వ అనుభవాలు దృష్టిని ప్రేరేపించునదై 'దృశ్యము'గా అనుభూతమగుచున్నది. అయితే స్వప్న దృశ్యమునకు, జాగ్రత్ దృశ్యమునకు ద్రష్ట ఒక్కడే కదా! అనగా ఉభయ సందర్భములలోను ద్రష్ట వేరుగా అప్రమేయుడై తాను మార్పు చేర్పులు చెందక ఆ రెండింటికీ కేవలం సాక్షి అయి, అదే సందర్భములలో ఆ రెండింటికీ అర్థము ప్రతిపాదించువాడై ఉన్నాడు కదా! ఆ ద్రష్ట ఏ సమయంలో ఎద్దానిని ఏ దృష్టితో చూస్తాడో అది అట్లే అనుభవమగు చున్నది. దృశ్యం దృష్టిపైనే ఆధారపడి ఉంటోంది. దృష్టి ద్రష్ట నుండే బయల్వెడలుతోంది. ద్రష్ట ద్రష్టత్వము వహించకముందే ఎట్లున్నాడో, దృశ్య సందర్భంలో కూడా యథాతథంగా అట్లే ఉన్నాడు.

Page:512

ఇక ఈ జగత్తు యొక్క స్థితి స్వప్నములోవలె కాకతాళీయంగా ఏర్పడే వృత్తి వంటిదే! జలంలో ఒకానొక తరంగం ఒకానొక ఆకారంగా బయల్వెడలటానికి ఏ విధంగా కార్య కారణములు లేవో ...ఈ జగత్తు కార్యకారణ రహితమగు వృత్తి వ్యవహారం మాత్రమే! చైతన్యము తనయందే తనకు అవిభాజ్యము, అద్వితీయము, అభేదము అగు జాగ్రత్ స్వప్నములను, (ఆ తదనంతరం) అందరి ఆయా విశేష పరంపరలను కాకతాళీయంగా సిద్ధింపజేసుకొనుచున్నది. సముద్రంలోని తరంగాల వలె మొట్టమొదట అబుద్ధిపూర్వకంగా సృష్టి ఏర్పడుచుండగా, ఆ తరువాత అద్దాని అవయవ రచనాదుల స్థితి ప్రకృతి సిద్ధంగా బుద్ధిపూర్వకంగా సంభవించుచున్నది.

ముత్యపు చిప్పలో వెండి ఏ కారణంచేత కనిపిస్తోంది? అద్దానికి ఏ కారణమూ లేదు. కుందేటికి కొమ్ములున్నట్లు ఎందుకు (దూరం నుండి చూచినప్పుడు) కనిపిస్తోంది? అట్లాగే సృష్ట్యాది యందు ఈ జగత్తు జనించటానికి కారణం లేదు. అందుచేత ఇది ఉత్పన్నమే అయివుండలేదు. ఆద్య స్వరూపమగు బ్రహ్మమే జగద్రూపంగా కనిపిస్తూ బ్రహ్మము రూపముగానే స్థితినొంది ఉన్నది. విచారణచే “ఈ కనబడేదంతా మమాత్మకు అభిన్నం. అద్వితీయం" అని ఎవ్వరికైనా తెలియబడ

గలదని మా మనవి.

రత్నమునకు కాంతులు ఎట్లా అబుద్ధిపూర్వకంగా ప్రదర్శితమగుచున్నాయో, బ్రహ్మ సత్త అట్లాగే జగద్రూపంగా అబుద్ధిపూర్వకంగా స్ఫురిస్తోంది. ఈ విధంగా మొట్టమొదట జగత్తు భావనారూపంగాను, ఆ తరువాత ఇందులో అర్థ-క్రియా సామర్థ్యము ఏర్పడుతోంది. చిదాకాశము నందు ఏ కారణం లేకుండానే, సముద్రంలో తరంగాలలాగా, స్వప్న సమూహములవంటి అతిశూన్య రూపములగు అనేక బ్రహ్మాండములు ఉత్పన్నములై విలీనములగుచున్నాయి.

కార్య-కారణత్వముల పరిధిలో కనిపించేదంతా (ఈశ్వరుడు మొదలైన సమస్తం కూడా) మాయా మాత్రాలే అవటంచేత స్వపాంతర్గత వ్యవహారంలాగా శూన్య రూపములే అయివున్నాయి. జాయతే శూన్యమేవేదం శూన్యమేవ చ వర్ధతే ॥ |

నను శూన్యతయాత్యన్తం శూన్యమేవ వినశ్యతి ॥

ఈ జగత్తు శూన్యమే లేనిది)అగుచు ఉత్పన్నం అగుచున్నది. శూన్యమే అయి వృద్ధి పొందుతోంది. అత్యంత శూన్యరూపమే అయి, శూన్యరూపంగానే నాశనమును పొందుచున్నది. జలతరంగానికి ఆకారం జలంలోంచే బయల్వెడలి, జలంలో లయిస్తున్నట్లు - ఈ దృశ్యము శూన్యంలో జనించి, శూన్యంలో కనిపించి శూన్యంలోనే లయిస్తోంది. ఈ జగత్తు సర్వదా అసత్తే అయివుండి సత్తువలె అనుభూతమౌతోంది. స్వానుభవమగు స్వప్నమే ఇక్కడ మనకు దృష్టాంతం. అట్టి జగత్ స్వప్న సిద్ధాంతాన్ని తిరస్కరించటం ఎటువంటిదంటే... గొర్రెల కాపరి ఒక గొర్రెను తోడేలు ఎత్తుకు పోతుంటే తోడేలే లేదు అని పాటలు పాడుకోవటం వంటిది.

ఓ రామచంద్రా! చైతన్యము యొక్క చమత్కారమే స్వరూపంగా కలిగి ఈ జగత్తు అనుభవ మౌతోంది. ఇది అసద్రూపం. భ్రాంతి మాత్రమే. మహా కృత్రిమ స్వరూపం. అట్టి ఈ జగత్తు జ్ఞాని దృష్టిలో అకృత్రిమమగు బ్రహ్మంగానే భాసిస్తోందిగాని సాకారయుక్త జగత్తుగా కాదు.

Page:513

ఈ సృష్టి - ప్రళయ విభ్రమమంతా చాలాకాలం కొనసాగుచున్న సంకల్ప మాత్ర స్వభావం అయివున్నది. ఈ కనబడే సృష్టి- ప్రళయములు యథార్థము - పారమార్థికము అగు స్వస్వభావము యొక్క స్ఫురణయే! ఇది గమనించుటయే తత్త్వజ్ఞానం. భ్రాంతిచే ఇద్దానిని జగత్తు రూపంగా (స్వస్వరూపమునకు వైరైన మరొకటేదోగా) దర్శిస్తూ ఉండటమే అజ్ఞాన విజృంభణము.

మనందరికీ సుషుప్తి తరువాత ఏ కారణం లేకుండానే స్వప్నదృశ్యం అగుపిస్తోంది. అట్లాగే స్వప్నానంతరం అకారణంగానే జాగ్రత్ సంభవిస్తోంది. మరల జాగ్రత్ అనంతరం అకారణంగానే స్వప్న సుషుప్తులు అగుపిస్తున్నాయి. నిద్రించాం కాబట్టి స్వప్నం . గాఢ నిద్రవల్ల సుషుప్తి. మెళకువ వచ్చింది కాబట్టి జాగ్రత్తు. ఈ విధంగా ఈ మూడూ కూడా అంతకుమించి కారణం లేకుండానే సంభవిస్తున్నాయి కదా! అట్లాగే మాయాసహిత బ్రహ్మము ఏ కారణం లేకుండానే తనయందు ఈ దృశ్యము ఉదయించటం గాంచుచున్నది. అట్లా దృశ్యం పొందిన తదనంతరం అర్థ క్రియా సామర్థ్యం తోటి, కార్య కారణ భావాది రూపంగానూ నియతిని పొందుతోంది. వాస్తవానికి బ్రహ్మము తన చిత్స్వభావముననే ఉన్నది. అయినా కూడా సముద్రంలో తరంగాలు అకారణంగా పరిఢవిల్లుచున్నట్లు కాకతాళీయంగా చైతన్యమునందు చిద్రూప పర్యంతం వలన దృశ్యము స్వయంగా ప్రకాశిస్తోంది. చిదాకాశ మాత్రరూపమగు చైతన్యము తన చిన్మాత్రత్వమును త్యజించకయే జగత్తుగా స్ఫురించటమనేది అద్దాని స్వభావమే అయివున్నది.

మొట్టమొదట అబుద్ధిపూర్వకమైన "దృశ్యాకార ప్రతిభాస వలన దృశ్యరూపముగా అగుచున్న చిదాత్మ అట్లు దృశ్యరూపంగా అయిన తరువాత, తనయందు స్మృతి - పృథివి - ఆకాశం -బుద్ధి - కర్మ - జ్ఞానం మొదలైన సంజ్ఞలను (తన యందలి దృశ్యమునకు) కల్పన గావించుచున్నది. ఇంతకు మించి దృశ్యమునకు వేరు కారణం లేదు. చిదాత్మయందు చిదాత్మయే చిదాత్మ రూపమగు దృశ్యమును అబుద్ధిపూర్వకంగా - అకారణంగా కాకతాళీయ న్యాయముచే నిర్వర్తించే దర్శనమే జగత్తు.

10. దృశ్యము చిన్మయరూపమేగాని మృణ్మయ రూపం కాదు!

శ్రీరాముడు : హే మహర్షీ! 'జగత్తు' అనబడు ఈ ఎదురుగా కనబడే 'దృశ్యం' గురించి మీరు మాకు ప్రసాదించిన నిర్వచనం అమోఘం. ఇదంతా కూడా ఆత్మయందు ఆత్మయే కాకతాళీయంగా దృశ్య రూపంగా జాగ్రత్-స్వప్నములందు దర్శించుచున్నదనునది నిర్వివాదమైన సత్యమని అంగీకరించక తప్పదు. అయితే, ఇక్కడ నాదొక సందేహం -

ఇదంతా కూడా నిద్ర లేవగానే వచ్చిపడి, నిద్రపోగానే అదృశ్యమగు స్వప్నమువలె ప్రతిభాస యందలి కల్పనా మాత్రమేనని కాకతాళీయంగా వచ్చి కాకతాళీయంగా పోవుచున్నదని మీరు

Page:514

సిద్ధాంతీకరిస్తున్నారు కదా! మీరు వ్యాఖ్యానించిన దానిని అనుసరించి అప్పుడు ఈ జగత్తుకు క్షణిక వాద దోషం సంభవిస్తుదేమో? అప్పుడు ఈ 'జగత్తు' అనే అనుభవం తాత్కాలిక కల్పన మాత్రమే అవుతుంది కదా! ఈ వర్తమాన జగద్దర్శనం 1. స్మృతి (పాత జ్ఞాపకాలు), 2.ప్రత్యభిజ్ఞానయ (ఇతః పూర్వపు సంస్కార బంధము) 3. పూర్వం అనుభూతములైన విషయాల భాగస్వామ్యం కొనసాగటం అనేవి ఉండకూడదు కదా! మరి ఆ మూడు ఇప్పటి ఈ వర్తమాన క్షణ జగత్తులో పాల్గొనుచున్నాయి కదా! "పూర్వము ఉత్పన్నమైన బుద్ధి యొక్క ప్రామాణికానుభవము చేతనే ఇప్పుడు వర్తమానంలో సంస్కారము, ఆ సంస్కారములోంచి వర్తమాన బుద్ధి, ఆ బుద్దిచేత స్మృతి, ఆ ఆ స్మృతిలోంచి అనుభవములు వచ్చి కొనసాగుతున్నాయి అనునది ఇక్కడి అందరి అనుభవం కదా!

మరి ఈ జగత్తు క్షణిక కల్పన, పూర్వాపర రహితం ఎట్లా అవుతుంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సింహము ఏనుగు పిల్లను చీల్చివేస్తుంది చూచావా! ఆ రీతిగా ఈ ప్రశ్న (లేక) ఆక్షేపమును ఛేదించివైచి అభేదరూపమగు అద్వైత తత్త్వానుభూతిని ప్రసాదించే వాక్యములు చెప్పుచున్నాను. విను!

ఈ జగత్తు అసత్తు. క్షణికమైన ప్రతిభాసచే ఉత్పతన్నమౌతోంది" అను (బౌద్ధ) సిద్ధాంతము మనం అంగీకరిస్తే అప్పుడు నీవు చెప్పినట్లు క్షణిక దోషము ఘటిల్లగలదు. అయితే వేదాంత సిద్ధాంతము ఇదంతా క్షణికం" అని చెప్పి ఊరుకోవటం లేదు మరి?

నిత్య బ్రహ్మ సత్తా రూపమే అగు ఈ జగత్తు ... బ్రహ్మము నందలి విశేషమగు అవిద్యావరణ విక్షేపశక్తుల ప్రభావం చేత... ఒకప్పుడు ఆవిర్భవించినదగుచున్నది. మరొకప్పుడు తిరోభావం పొందినదగుచున్నది. ఒకప్పుడు స్థిరంగాను, మరొకప్పుడు క్షణికంగాను భిన్న భిన్న రీతులుగా భాసించుచున్నది.

కాబట్టి ఈ జగత్తు అనబడుదానిపట్ల స్మృతి - ప్రత్యభిజ్ఞానము రెండూ తగియే ఉన్నాయి. కొయ్యలో చెక్కబడిన దేవతావిగ్రహం కొయ్యలోనే ఉండి ఉన్నట్లుగా ఈ జగత్ రూప దృశ్యము స్వస్వరూపమగు, చిదాకాశ చైతన్యము నందే చిత్రించబడినదై ఉంటోంది.

అయితే... ఒక కొయ్య యొక్క కొన్ని కొన్ని విభాగములను ఉలితో ఛేదించి వడ్రంగి కొయ్యను దేవతా విగ్రహంగా మలచుచున్నాడు. కాని అద్వితీయమగు చైతన్యమునందు 'జగత్తు' అనబడేది చెక్కటానికి ఉలివంటి పరికరములుగాని, వడ్రంగి వంటి నిమిత్త ఉపాదాన కారణాలుగాని లేవు. ఈ జగత్తుకు వేరుగా కర్త ఎవరూ లేరు. కాదు బ్రహ్మదేవుడు దీనికి కర్త కదా!... అంటావా? ప్రతి జీవునికి తన రీతిలో తన కల్పనానుసారమే జగదనుభవం ఉంటూ ఉండగా,... అద్దానికి మరొకరికి కారణం ఆపాదించటం ఎట్లా? కనుక ఈ జగత్తు వడ్రంగి వృక్ష కాండ ఖండంలో చెక్కే దేవతా విగ్రహం వంటిది కాదు.

జడమగు వృక్షస్తంభమును ఎవరో చెక్కితేగాని దేవతా విగ్రహంగా బయల్వెడలదు. కానీ, చైతన్యమున ఆ చైతన్యము యొక్క ప్రభావం చేతనే 'జగత్తు' అనే విగ్రహం పూర్ణముగా అభివ్యక్తం

Page:515

అవటం, ప్రకాశించటం జరుగుతోంది. ప్రతి జీవునియందు తనకు తనయందు తాను బ్రహ్మదేవత్వము వహించియుండటం ఏర్పడియే ఉన్నది.

ఈ జగత్తు సర్వదా చిదాకాశమే! ఇది పరమార్థ స్వరూపము నుండి చ్యుతిని పొందకుండానే చిన్మాత్రత్వముచే స్వాత్మయందే నెలకొని ఉంటోంది. కాబట్టి ప్రళయ - సుషుప్తి సమయములలో ఇది సత్తామాత్ర స్వరూపం పొందినదై ఉంటోంది. అనగా ఆ సమయములలో ఇది కనబడకపోయినప్పటికీ, లేకుండా పోవటం లేదు.

సృష్ట్యాదియందు ప్రప్రథమంగా ఈ చైతన్యం నిర్వికల్పరూపంగానే ఉన్నది. ఆ తరువాత ప్రాణుల అభీష్టానుసారంగా మనో వికల్పములచే చిత్ర విచిత్రములైన సృష్టుల కల్పనను గావించుచున్నది. అనగా ఈ రోజు కన్నకలలాగా చిదాకాశరూపమగు చైతన్యము తన హృదయంలో జగద్రూప దృశ్యపరంపరలను తానే కల్పించుకొనుచున్నది.

ఇది చిన్మాత్రముతో కూడి సత్తా సామాన్య రూపమైనట్టి, జగత్తుకే బీజరూపమైనట్టి బ్రహ్మకళ”. ఇది ఆ బ్రహ్మకళయందు ప్రతిబింబించే చైతన్యము. ఇది ప్రాణాదియుక్తమగు ప్రతిబింబ స్వరూపమగు జీవుడు. ఇది అభిమానవృత్తి ప్రధానమగు ఆ చిత్ప్రతిబింబరూపమగు అహంకారం. ఇది నిశ్చయాత్మక ప్రతిబింబ చైతన్య రూపమగు బుద్ధి. ఇది సంకల్పాత్మక ప్రతిబింబ చైతన్య రూపమగు చిత్తము. ఇది కాలము. ఇది ఆకాశము. ఇది 'వీడు, వాడు, నేను, నీవు' అనే రూపములు. ఇది క్రియ. ఇవి పంచతన్మాత్రలు. ఇవి ఇంద్రియ సమూహములు. ఇది మనో-బుద్ధి-ఇంద్రియ-చిత్త-అహంకారాది రూపమగు పూర్యష్టకము. ఇది దేహ ఇంద్రియ సమూహ మధ్యగా సంచరించే సూక్ష్మదేహం. ఇదేమో స్థూల శరీరం. నేను బ్రహ్మదేవుడను. నేను విష్ణువును. నేను మహేశ్వరుడను. నేను సూర్యుడను. ఇది బాహ్యము. ఇది సృష్టి. ఇది జగత్తు...

ఇటువంటివన్నీ చైతన్యము తనయందు సృష్ట్యాది యందు కల్పన గావించుకొనుచున్నది. అయితే... అట్టి కల్పనా సమూహమంతా కూడా సర్వదా అతి నిర్మలమగు చిదాకాశమే అయివున్నదిగాని... చిదాకాశముకంటే అన్యముగా అణుమాత్రం కూడా లేనేలేదు. కాబట్టి రామచంద్రా! ఇక అజ్ఞానులచే కల్పించబడే జడ పదార్థ సమూహమెచ్చట? స్మృతి ఎచ్చట? ద్వైత - ఏకత్వమెచట? చిదాకాశ రూపమే అగు విశాల జగత్ ఖండము కారణము లేకయే స్వప్నంలోలాగా భాసించుచు వికారయుక్తంగా ఉన్నదానివలె భాసిస్తోంది. చిన్మయమగు ఆకాశమున చిన్మయరూపమే అయి ఈ జగత్తు స్ఫురించుచున్నది. అట్టి జగత్తును ఎరుగుచున్నది కూడా చిదాత్మయే! తెలుసుకునేది తెలియబడేది కూడా చిదాత్మరూపమే అయివుండగా ఇక కల్పిత జగత్తు ఎచ్చట? ఆకాశంలో శూన్యత్వంలాగా “ఏకం, శాంతం అయినట్టి చిదాకాశమున చిదాకాశ రూపమేయగు జగత్తు స్ఫురిస్తూ ఉంటే ఇక స్మృతి ఏమి? స్వప్నమెచట? కాలము ఎచట? అనేక బ్రహ్మాండాల కల్పన ఎచట?

ఓ రామచంద్రా! చిదనము యొక్క అంతరమున ఏ 'సత్త' కలదో... అదియే బాహ్యంగా పంచభూత రూపముగా ప్రదర్శితమౌతోందయ్యా! వాస్తవానికి బాహ్యమున గాని - అభ్యంతరమున

Page:516

గాని సన్మాత్రము తప్ప వేరుగా మరేదీలేదు. ఓ వాదోపవాదములు చేయు మిత్రులారా! ఇది

వినండి.

నిరస్తావయవాచ్ఛాన్తాదనాఖ్యాద్యత్ప్రవర్తతే

అకారణం భవేద్భూతం తదః కథమన్యథా?

అవయవ రహితము, శాంతము, వాక్కునకు అవిషయము అయినట్టి చిన్మాత్రము నుండి కారణము లేకయే ఏది ఉత్పన్నమగుచున్నదో, అది మంచుశిల యొక్క ఆకారమువలె ఉత్పన్నము కాకయే ఉన్నది సుమా! అయినా, కూటస్థమగు చైతన్యమును వికారవంతం చేసేదెవరు? ఎట్లా వికారవంతమౌతోంది? అందుచేత... పరబ్రహ్మము ఎట్టి శుద్ధ చిన్మయ స్వరూపము అయివున్నదో... ఈ దృశ్య జగత్తు కూడా అట్టి చిన్మయరూపమే అయివున్నది.

కలలో ఏది ద్రష్టరూపమో అదియే స్వప్ననగరం కదా! ఏది స్వప్న నగరమో అది స్వప్న ద్రష్టరూపమే కదా! అందుచేత ఈ దృశ్యము ఒకింతకూడా లేదు. నిర్మల జలంలో ధూళి ఎక్కడుంటుంది? పరమ చిదాకాశంలో దృశ్యం లేదు. ఇక ఇక్కడ ఏది భాసించుచున్నదో అది విషయరహితమై, కాబట్టి స్వమాత్ర ప్రకాశమై, ప్రశాంతమైనట్టి చిన్మాత్రమే... తనయందు ఈ ప్రకారంగా జగత్తువలె స్థితిపొందినదగుచున్నది.

పూర్ణాద్వై బ్రహ్మణః పూర్ణమప్యనుద్ధృతముద్ధృతమ్ ఇవేదం భాతి భారూపమాభాసం పరమాత్మకమ్ ||

పూర్ణమగు బ్రహ్మము నుండి పూర్ణము, ప్రకాశరూపము అగు ఏ ఈ జగత్తు వాస్తవానికి ఉత్పన్నమే కాకయున్నదో... కాని ఉత్పన్నము అయినట్లు భాసించుచున్నదో... అదంతా కూడా ప్రకాశరూపమగు పరమాత్మయే అయివున్నది. ఓ దృశ్య జగత్ రూపమగు పరమాత్మా! మాకు అనన్య స్వరూపమగు మీకు ఇవే మా సాష్టాంగ దండ ప్రణామములు!

11. విశ్రాంత చిత్తుని జీవన్ముక్త లక్షణములు

శ్రీ వసిష్ఠ మహర్షి కాబట్టి ఓ సర్వసభికులారా! మీరంతా "చిదాకాశ రూపమ్ - శివో2 హమ్ -

శివోహమ్ అని గ్రహించినవారై జీవన్ముక్తులయి ఉండండి. శ్రీరాముడు : మహాత్మా! జీవన్ముక్తుడు అనగా ఎవరు? శ్రీ వసిష్ఠ మహర్షి :

న సుఖాయ సుఖం యస్య, దుఃఖ దుఃఖాయ యస్య నో॥ అంతర్ముఖమతోర్నిత్యం స ముక్త ఇతి కథ్యతే ॥

ఓ రామచంద్రా! ప్రత్యగాత్మయందు మాత్రమే ఆసక్తి గలిగియుండి అంతర్ముఖమైనట్టి నిత్యబుద్ధిని

ఏ ఆత్మజ్ఞాని సంపాదించుకుంటాడో... ఏ శుద్ధ దర్శనముచే సహజీవుల బాహ్య నామరూపాలకు అతీతంగా ఆ సహజీవులను ఆత్మదృష్టిచే దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటాడో...ఏ అవగాహనాపరునికి

Page:517

సుఖహేతువగు విషయ సమూహము సుఖమునుగాని, దుఃఖహేతువగు విషయ సమూహము దుః ఖమునుగాని కలిగింపజాలవో... అట్టి వ్యక్తియే "జీవన్ముక్తుడు”. ఏ విధంగా అజ్ఞానుల బుద్ధి విశాలభోగవాసనలనుండి చలించకయే ఉంటుందో... ఆ విధంగానే, అంతగానూ జీవన్ముక్తుడగు జ్ఞాని యొక్క బుద్ధి చిదాకాశదృష్టిని విడజాలక అద్దానియందు నిశ్చలంగా ఉంటోంది. ఎవని చిత్తమైతే చిన్మాత్రాత్మయందు విశ్రాంతి పొందినదై, మనస్సు మరల ఈ దృశ్యమునందు ప్రీతి గొనకయే ఉంటుందో... అట్టివాడే 'జీవన్ముక్తుడు' అని శాస్త్రములచే నిర్వచించబడుచున్నాడు. శ్రీరాముడు : ఓ మునీంద్రా!

న సుఖాయ సుఖం యస్య, దుఃఖం దుఃఖాయ యస్య నో జగమేవ మునే మన్యే మానవమ్ తమచేతనమ్ ||

ఎవనికైతే సుఖహేతువైన విషయము సుఖమునుగాని, దుఃఖహేతువగు విషయము దుః ఖమునుగాని కలిగించవో... అట్టి జీవుని "చేతనరహితుడు అని అనుకోవటం కద్దు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! శుద్ధబోధ స్వరూపుడగు జీవన్ముక్తుడు సర్వదా చిదాకాశమునందే స్థితి కలిగి వుంటాడు. అప్రయత్నముగానే ఈ లౌకిక సుఖ దుఃఖములను అధిగమించినవాడై, అతీతుడై ఉంటాడు. అట్టి విశ్రాంత చిత్తునికి శాస్త్రములు 'జీవన్ముక్తుడు' అని పేరుపెట్టాయి. ఆతని యందు స్వవివేకముచే మూలాజ్ఞానము నశించి ఉంటుంది. సమస్త జగద్విషయముల పట్ల సర్వ సందేహములు తొలగిపోయి ఉంటాయి. ఆతడు 'పరమాత్మ' అనే మహత్తరమైన శయ్యలో పరమ విశ్రాంతి పొందుతూ ఈ జగత్తులో వ్యవహరిస్తూ ఉంటాడు. వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆతని అంతరంగం ఈ దృశ్యంలో ఏ ఒక్క విషయము పట్ల ప్రీతిగొని ఉండదు. ఏ విశేషముపట్లాకూడా రాగం-కామం ఉండదు. సమస్త కార్యములపట్ల ఆతని యందు కోర్కె యొక్క సంకల్పము ఉండదు. ఏది చేయవలసి వచ్చినా ఫలాపేక్ష రహితుడై ఉంటాడు. అపేక్షా రహితంగా ఇది విధ్యుక్త ధర్మానుసారం ఇట్లే జరుగుగాక... అని ఒకానొక అస్పృశ్య - అంతర్ముఖ దృష్టి పెంపొందించుకొని ఉంటాడు.

యథా ప్రాప్తములైన పదార్థములను అనుభవిస్తూ రాగరహితుడై ఏదీ తనకు చెందినది కాదు" అనే అవగాహనను సుస్థిరీకరించుకొని ఉంటాడు. ఓ రామచంద్రా! ఓ సర్వజనులారా! ఈ సంసార మార్గంలో ఎక్కడా విశ్రాంతి లేదు. ఆత్మజ్ఞానం - ఆత్మ దర్శనంలో మాత్రమే విశ్రాంతి ఈ జీవునికి లభిస్తుంది. ఇదంతా (ఈ సంసార మార్గమంతా) అతిదీర్ఘము, ఆధార వర్జితము.

అలసి ఉన్న ఓ బాటసారులారా! మీరంతా జీవన్ముక్తునివలె చిన్మాత్ర దర్శనమును అభ్యసించి ఆత్మయందు విశ్రాంతిని పొందటమే ఈ సంసార రోగమునకు ఔషధమని గమనించండి. ఆత్మయందు విశ్రాంతిని అనుభవించే జీవన్ముక్తుడే సర్వోత్తముడు.

ఓ సహమిత్రులారా! ఈ సంసారమునందు చిరకాలము పరుగులుతీసి అలసిపోయి ఉన్నారని విచారించకండి. ఆత్మజ్ఞానమును సముపార్జించి బ్రహ్మీదృష్టిచే జీవన్ముక్తుని వలె బ్రహ్మపదమునందు విశ్రాంతిని ఆశ్రయించండి.

Page:518

జీవన్ముక్తుడు బ్రహ్మపదమునందు విశ్రాంతిని పొందుచుండగా, ఇక ఈ జగత్తులో వ్యవహారపరుడైనప్పటికీ “సుషుప్తి యందు ఉన్నవానివలె ఉంటాడు. అట్టి జ్ఞానులు ద్రష్ట - దృశ్య - దర్శన (త్రిపుటి) రహితమగు శుద్ధ స్వచిత్తాకాశంలో శుద్ధ చిద్రూపులై నిత్యోదిత సూర్యునివలె భాసిస్తూ ఉంటారు. వారికి ఈ సంసారము పట్ల ప్రీతి నిరాశ - దుఃఖము - గర్వము

మొదలైనవి ఉండవు. అట్టి ఉత్తమోత్తములగు జీవన్ముక్తులు దేహధారులై ఉండి కూడా దేహరహితులై ఉంటారు. లౌకిక వ్యవహారముల పట్ల నిద్రించుచున్న వారివలె ఉంటారు. వారు పైకి జడులుగా చూపట్టవచ్చునేమోగాని, జడులు మాత్రం కారు. అయితే, వారి దృష్టిలో ఈ జగత్తు స్వప్న సదృశమైపోవటం చేత ఇద్దానిపట్ల వారు అంతరంగంలో ఉదాశీనులై చరిస్తూ ఉంటారు. అందుచేత వారు ఈ ప్రపంచం పట్ల నిద్రితులై ఉంటారు అని చెప్పబడుచున్నారు. అంతేగాని, వాస్తవానికి వారు జడ నిద్రకు వశీభూతులైనవారు కానేకాదు సుమా!

వారు 'సంసారము' అనే దీర్ఘ మార్గమునందు పరిభ్రమించటం నుండి నివృత్తి పొందినవారై ఉంటారు. ఆత్మయందు సుఖ విశ్రాంతి పొంది ఉంటారు.

ఆ మహానుభావుడగు జీవన్ముక్తుడు బహిర్ముఖ వృత్తిగల అజ్ఞానులతో సంభాషించేటప్పుడు నిరతిశయానంద రూపమగు ఆత్మయందు మౌనముగా సుఖ విశ్రాంతిని కొనసాగిస్తూనే ఉంటాడు. అంతేగాని జడస్వరూపుడు కాదు.

యా నిశా సర్వభూతానామ్ అవిద్యాన్తమయాత్మికా | పరో బోధః పరా శాన్తిః తత్రాసౌ సమమాస్థితః ||

అవిద్యాంధకారంలో వ్యవహరించే సమస్త జీవులకు ఏది రాత్రి"వలె ప్రాముఖ్యం లేక అపరిశీలనాత్మకమై ఉంటోందో, వారు అద్దాని పట్ల నిద్ర వ్యవహరిస్తున్నారో... అది జీవన్ముక్తునకు పరమబోధరూపమై, పరమ శాంత రూపమగు ఆత్మస్థానము అయి ఉంటోంది. ఆ ఆత్మదర్శనయోగం ఆతనికి సర్వదా జాగ్రత్ వ్యవస్థగా కన్పట్టుచున్నది. అట్టి జ్ఞానానందమయమగు జీవన్ముక్తుడు సదా సర్వత్రా సమరూపమున వెలయుచు పరమానందముగా ఈ జగత్తులో సంచరిస్తూ ఉంటే, అట్టి సమదర్శి యొక్క పవిత్ర పాదముల స్పర్శకు భూదేవత పులకిస్తూ ఉంటుంది. దుఃఖ ప్రదమగు ఏ ఈ సంసార రూప దృశ్యమున సమస్త సంసార తన్మయ ప్రాణులు మేల్కొని ఉన్నవారై అతిజాగరూకతతో ఏదేదో వెతుకుతూ కాలం వెళ్ళబుచ్చుచున్నారో... జీవన్ముక్తుడు అద్దానియందు నిదుర కలిగి ఉంటున్నాడు. ఆతడు పరమ సుఖి అయి ఉండగా... ఇక జడుడు ఎట్లా అవుతాడయ్యా?

యః కర్మౌఘమనాదృత్య స్వాత్మన్యేవావ తిష్ఠతే |

స ఆత్మారామ ఇత్యుక్తో, న జడో సౌ, రఘూద్వహ |

ఓ రఘుకుల శ్రేష్ఠుడగు రామచంద్రా! ఎవడైతే ఈ సంసారంయొక్క సర్వ విషయాల పట్ల విరక్తుడై సమస్త కర్మఫల సమూహాలను బుద్ధిచే త్యజించినవాడై, సర్వదా స్వాత్మయందే నెలకొని ఉంటాడో... అట్టివాడు ఆత్మారాముడు అని చెప్పబడుచున్నాడు. అట్టి ఆత్మారాముడు జడుడా?

Page:519

కానే కాదు. ఆతడు భవ్య పురుషుడు. విదిత వేద్యుడు. తెలుసుకొనవలసింది తెలుసుకొని ఉన్నవాడు. ఈ సంసార సముద్రపు ఆవలి తీరమును జేరి విశ్రాంతి సుఖమును అనుభవించుచున్నాడు. ఆత్మనే దర్శిస్తూ, ఆత్మనే ఆరాధిస్తూ, ఆత్మయందే రమిస్తూ, ఆత్మయందే స్థితి కలిగి ఉన్నాడు సుమా! ఆతడు మాకు తారసపడినప్పుడు మహర్షులమైన మేము ఆతనికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం.

ఈ జీవుడు అనబడే బహుదూరపు పథికుడు (బాటసారి) సుదీర్ఘమగు సంసార మార్గంలో చిరకాలంగా సంచరించుటచే అలసిపోయి ఉన్నాడు. భోగసాధకాలగు పదార్థములను సేవించి, సంసారంచే మోసగించబడి వ్యాకులుడై ఉన్నాడు. వంచించుటలో అతి ప్రావీణ్యం చూపించే క్రూరులగు 'విషయాలు' అనే దారిదోపిడిగాండ్రచే సంసార మార్గంలో అతి బాధితుడై వేదన చెందుతూ, బయటకు మాత్రం “నాకు అది తెలుసు, ఇది తెలుసు. వీళ్ళ సంగతి నేను చూస్తానుగా ఇట్లా తలచుచు వ్యర్థంగా కాలమును, అవకాశాలను వృథా చేసుకుంటున్నాడు. వార్ధక్యం అనే మంచువర్షానికి పీడితుడై మరల మరల లోక వ్యవహారములచే పరివంచితుడగుచున్నాడు. 'జన్మలు' అనే మహారణ్యంలో చిక్కుకున్న జింకలాగా అటూ ఇటూ తిరుగాడటంలో వ్యర్థంగా ఆసక్తుడై ఉంటున్నాడు. అనేక దుఃఖ సంకటాలచే పరిపూర్ణమై సుఖం’ అనే నీడయే కనబడనటువంటి సంసార ఎడారిలో స్వయంగా నిస్సహాయుడై దూరదూరంగా వెళ్ళుచున్నాడు. పాపదృష్టులు అనే మూట భుజముపై పెట్టుకొని అడుగడుగున పడుతూ, లేస్తూ దొర్లుతూపోతున్నాడే! అర్థ- అనర్థములనే రెండు అంచులు గల బాటలో నడుస్తూ అనేక సంకటములచే బుద్ధి కలత చెందుచుండగా తన దుఃఖములు తనకే అర్థం కాకుండా మహా ప్రయాణం కొనసాగిస్తున్నాడు.

ఆ విధంగా సంసార మార్గంలో నడుస్తూ మిక్కిలి అలసిపోయినట్టి ఈ జీవుడు ఒకానొకప్పుడు సౌభాగ్యవశం చేత, అనేక జన్మలలో చేసుకొన్న పుణ్యవశంచేత సాధన చతుష్టయ సంపత్తియుక్తుడై సచ్ఛాస్త్ర - సద్గురువుల అనుగ్రహమునకు పాత్రుడగుచున్నాడు. తత్త్వమును సేవించి తత్త్వసాక్షాత్కారం సముపార్జించుకొని ప్రబుద్ధుడగుచున్నాడు. ఆత్మజ్ఞాని అయి, సంసార సముద్రమును దాటి, ఆవలి తీరం చేరి శయ్య లేకున్నా సుఖముగా, విశ్రాంతిగా ఆత్మానుభూతియందు శయనిస్తున్నాడు. అట్లు ఆత్మనే అంతటా దర్శించే దృష్టియందు శయనించువాడే జీవన్ముక్తుడు.

ఆహా! ఆ జీవన్ముక్తుని ఆత్మదృష్టిలో పొందే సుఖనిద్ర గురించి ఏమని చెప్పమంటావు? అక్కడ భౌతికమైన 'శయ్య' లేకపోవచ్చు. ఆతని ప్రాణాలు ప్రశాంతత సంతరించుకుంటున్నాయి. ఆతడు స్వప్న రహితుడై, సుషుప్తి వర్జితుడై నిత్య ఆత్మసాక్షాత్కార జాగ్రత్లో స్వస్వరూపానందముచే సుఖంగా విశ్రమిస్తూ ఉంటే, బ్రహ్మ ఋషులమగు మేము కూడా ఆతనిని చూచి ఆనందిస్తున్నాం. ఆ జీవన్ముక్తునికి మేము చేతులెత్తి సదా నమస్కరిస్తున్నాం. ఆహా! జాతి గుఱ్ఱంలాగా ఆ ఆత్మజ్ఞాని భుజించుచున్నప్పుడు, నడుచుచున్నప్పుడు, శ్వాస తీసుకుంటున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, సంసార మహారణ్యం మధ్యగా ఉండి కూడా సుఖపూర్వకంగా ఆత్మయందు సుఖ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు కదా!

Page:520

ఓ రామచంద్రా! ఈ సంసారులుకూడా ఆదమరచి కొంచెంసేపు గాఢనిద్ర అనుభవిస్తున్నారు. అయితే తత్త్వజ్ఞుల యొక్క నిద్ర సాంసారిక నిద్ర కంటే అత్యంత విలక్షణమైనది. అక్కడ విశ్రాంతి అత్యంత ఘనీభూతమై ఒప్పుచున్నది. ఎందుకంటే గట్టిగా శబ్దం అయితే చాలు, సాంసారిక జీవుని సుఖ నిద్ర విచ్ఛేదనమౌతోంది. ఇక జీవన్ముక్తుని ఆత్మసుఖనిద్ర ప్రళయ గర్జనలచేతగాని, ఈ అవయవాలు ఛేదింపబడుచున్నప్పుడుగాని, మృత్యువు ఆసన్నమై ఈ దేహాన్ని స్తంభింపజేస్తున్నప్పుడు గాని, ఈ దేహాదుల రాకపోకల చేతగాని ఏ మాత్రం చెదరటమే లేదు. ఆహా! తత్త్వజ్ఞుల ఆత్మదర్శనం అపూర్వం! మహాఘనీభూతం! అమోఘం! చిన్మాత్ర దర్శనముచే వారు ప్రబుద్ధులై ఈ బాహ్యేంద్రియా లను నిరింద్రియాలుగా దర్శిస్తున్నారయ్యా! వారు కళ్ళు మూసుకోకపోయినప్పటికీ ఈ ప్రపంచమంతా ఇందలి సర్వ సంక్షోభాదులతో సర్వదా విలీనమై ఉంటోంది. జగత్తునంతా మ్రింగివైచి, జగత్తును స్వాత్మయందు లయం చేసివేసి, ఆత్మానంద రసామృతమును గ్రోలి పరమపూర్ణత్వమును పొందినవాడై ‘ఆత్మజ్ఞాని ప్రశాంతంగా జగద్విషయములపట్ల నిదురిస్తున్నాడు. ఆత్మయందు ప్రశాంత సుఖమును, జగత్తుపట్ల సుషుప్త సుఖమును సంపాదించుకొని తృప్తుడై ఉంటున్నాడు. ఆతని నిరతిశయమగు ఆనందం ముందు విషయజనితమైన ఆనందము, - సూర్యభగవానుని సహస్రకిరణ తేజస్సు ముందు నూనె దీపం వంటిది. అట్టి ఆత్మానందముతో కూడుకొనినవాడై స్వయంప్రకాశమగు స్వాత్మ ప్రకాశముచే అద్వయము - - తెంపులేనిది అగు సుఖమును అనుభవిస్తూ ఆత్మజ్ఞాని ఈ ఈ సర్వజగత్ విషయముల పట్ల మౌనరూప నిద్రాముద్రను వహించి ఉంటున్నాడు. కామ క్రోధ-లోభ-మోహ –మద-మత్సర్యాలు అనే అరిషడ్వర్గాంధకారమునకు ఆతని హృదయంలో చోటు దొరకటం లేదు. అమూర్తమగు ఆత్మ జ్ఞాన జ్యోతి వెలుగుచుండగా కామక్రోధాది చీకట్లు ఎట్లా ఉంటాయి? ఆత్మానంద రసము గ్రోలుచూ ఆతడు ఇక్కడ నేనేం పొందాను? నా కర్మ! నా బ్రతుకు ఇంతే!... ఇత్యాది అల్పవాక్యములు రావు. గంభీర్యము సంతరించుకున్నవి, ఈ జగత్తులన్నీ ఆక్రమించివేసినవి అగు మహత్తర, మహనీయ, మాననీయ వాక్యములు మాత్రమే ఆతని పెదవులు ఉచ్చరిస్తాయి.

ఆతడు సుఖంగా స్వాత్మయందు శయనించి ఉండగా, ఆతని ఒకానొక విభాగం ఈ ప్రపంచంలో ఆశ - అడియాసలచే స్పృశించబడకుండానే వర్ణాశ్రమమునకు ఉచితమైన వ్యవహారము నిర్వర్తిస్తూ లోక కల్యాణార్థం (లోకమునకు ఏ విధంగా సానుకూల్యమో... ఆ రీతిగా) వ్యవహరిస్తూ ఉంటోంది. ఆతడు సర్వదా సర్వ బాహ్య పదార్థములందు అనాసక్తుడై, అభ్యంతరమున ఆత్మానందరసమునందు మాత్రమే అనురక్తుడై ఆత్మయందు విశ్రాంతి పొందుచూ ఉండగా శాస్త్రములు ఉద్దేశసారం ఆతని యందు సార్థకమై ఉంటుంది.

ఆతడు ఆత్మను సూక్ష్మ పదార్థములన్నిటికంటే అతిసూక్ష్మమైన దానిగాను, స్థూలములన్నిటికంటే అతి స్థూలమైనదిగాను దర్శించుచు 'చిదాకాశము' అనే శయ్యపై పరుండి మమాత్మా సర్వభూతాత్మా ...అను రూపముతో కూడిన ప్రశాంతతతో నిద్ర సుఖం అనుభవిస్తూ ఉంటున్నాడు.

జగత్తులోనో, ఆయా లోకములలోనో ఒక మూలగా ఉండే ఈ దేహము నేను కాదు. నాది చిత్స్వరూప దేహం. అట్టి నా చిత్స్వరూపదేహంలో అణువణువునా ఇటువంటి అనేక బ్రహ్మాండాలు

Page:521

ఉన్నాయి. నా చిత్స్వరూపం అతి సూక్ష్మము అత్యంత స్థూలము అగుటచేత అణురూపం - విశ్వరూపము కూడా అయివున్నది. ఈ విశ్వమంతా నా దేహమే! ...అని తలచుచు ఆతడు ఈ బ్రహ్మాండములన్నీ తన యొక్క చిత్స్వరూప దేహమునందే గాంచుచున్నాడు. ఆహా! ఆత్మజ్ఞాని అనేక సృష్టి సమూహములను సంహారం చేసివేస్తూ, వాస్తవానికి దేనినీకూడా సంహారం చేయకయే ఉంటూ మహత్తరమైన ఆత్మప్రకాశము' అనే శయ్యపై యోగనిద్ర అనుభవిస్తున్నాడు. ఇక ఈ ఎదురుగా కనిపించే సంసార సమూహమంతా సాంసారిక జీవునికి దాటరాని సముద్రంలా అగుపిస్తుంటే... ఆ ఆత్మజ్ఞానియగు జీవన్ముక్తునికి ఇదంతా కలలో చూచే దృశ్యంలా అసలు విషయమే కానట్లు అనిపిస్తోంది. పూర్ణ ప్రకాశముతో వ్యక్తమయ్యే ఎనిమిది దిక్కులవలె ఆతడు అంతటా అన్నివైపులా అంతా నా ఆత్మ స్వరూపమే” అనే ప్రకాశాన్ని అనుభవిస్తున్నాడు. నేను నా సద్రూపంచే అంతటా (సర్వత్రా) సర్వదా వ్యాపించి ఉన్నాను. సమస్త పదార్థముల స్వసత్తా సామాన్యమును సంతరించుకొనియే ఉన్నాను. అంతటా వ్యాపించియున్న ఆకాశం కూడా నా చిత్ శరీర విభాగమే అగుచున్నది. అందుచే ఆకాశము కంటే కూడా అధిక వ్యాపకుడను" అని ఆతడు తన చిత్ శరీరమును గాంచుచున్నాడు.

"ఈ పృథివి మొదలైనవి ద్రవరూపం నుండి (ఆపోరూపం) వస్తున్నాయి. ద్రవరూపాలు అగ్ని నుండి వస్తున్నాయి. అగ్ని వాయువునుండి, వాయువు ఆకాశము నుండి వస్తున్నాయి. అట్టి ఆకాశము ఎందులోంచి బయల్వెడలుతోందో, ఎందులో ఉండి ఏది ఆధారముగా కలిగి ఉంటోందో... అట్టి చిదాకాశమే నా దేహం.”

అని అతడు సర్వము తనయందే గాంచుచున్నాడు. ఆతడు ఆత్మగా అంతటా అనుభూతం చేసుకొని ఉండగా, ఇక ఆత్మ జ్ఞాన చర్చ' అనే భాషా ప్రయుక్తితో కూడిన సుదీర్ఘ వ్యవహారంతో పనేముంది? "నిర్మల చిదాకాశ రూపుడను, సర్వదా సర్వమునకు కేవల సాక్షిని అగు నా యొక్క ఒకానొక మూల 'జగత్తు' అనబడే స్వప్న సదృశదృశ్యమును గాంచుచున్నాను కదా... అను అనుభవముచే ఆత్మశయ్యపై నిద్రిస్తున్నప్పటి (ఇదంతా ఆతనికి) 'జగత్' అనే మధుర స్వప్నముగా అగుచున్నది. 'ఆత్మ' అనే రసముచే ఆతనికి ఇది మధుర పానీయమే అవుతోంది.

ఇక ప్రవాహ పతితమైన యథాప్రాప్తములైన వ్యవహారాలన్నిటినీ 'ఆత్మజ్ఞానము' అనే శయ్యపై శయనిస్తూనే, యోగనిద్రావశుడై ఉంటూనే నిర్వర్తిస్తున్నాడు. నిద్ర మేల్కాంచినవాడు నిద్రలో అనుభూతమైన స్వప్నమును ఎంతో ప్రయత్నం చేస్తేగాని స్మరించలేకపోవుచున్నాడు కదా! ఆత్మయందు మేల్కొనియున్న జీవన్ముక్తుడు అతి ప్రయత్నంచేత తనయొక్క బహిర్ముఖత్వమును, బాహ్య దేహత్వమును అతి కొంచెంగా వహిస్తూ ఆత్మయందే స్థితిని కొనసాగిస్తున్నాడు. ఆ పరమ చిదాకాశ రూపత్వము పొందిన ఆత్మజ్ఞాని ఆకాశమువలె విశాలమై, సూక్ష్మమైనట్టి నిజస్వరూపముయొక్క జ్ఞానమును సర్వదా కలిగి ఉంటున్నాడు. ఈ దేహాదుల వ్యవహారం 'అసత్తు' అని ఎరిగి ప్రయత్నపూర్వకంగా ఈ జీవ - జగదాది ధర్మములు లీలగా, క్రీడగా నెరవేరుస్తున్నాడు.

చూచావా రామచంద్రా! ఈ ప్రకారంగా జ్ఞాని ఆత్మయందు విశ్రాంతి పొందుచూ సదా నిదురిస్తున్నప్పటికీ, ఇక లోకప్రసిద్ధములై ఉన్న జాగ్రత్ - స్వప్నములలో ఇతరుల వలెనే మేల్కొనుచు,

Page:522

నిదురించుచూ ఇక్కడ లీలామాత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఆతనికి ఈ జగత్తుతో స్వస్వరూపానుసంధాన ప్రాభవం చేత మిత్రత్వమే గాని, శత్రుత్వం ఉండదు.

సర్వ వైషమ్యములను సర్వదా ఆతడు మొదలంటా త్యజించియే ఉంటాడు. సమచిత్తుడు కాబట్టి స్వభావ సిద్ధంగానే శమము, దమము, తితిక్ష, జ్ఞాన వైరాగ్యం, సంతోషము మొదలైన మనోహరమైన వృత్తిరూపుడై ఉంటాడు.

దేహమున్నంతవరకు దేహముతోను, ఆ తదనంతరం దేహరహితంగాను (విదేహం) ఆతడు కైవల్యమునందు విశ్రమిస్తున్నాడు. అంతేగాని ఈ తుచ్చ జగత్ విషయ పరంపరలయందు గాదు. ఆతని మిత్రత్వం సర్వదా శ్రేయోమయమే అయి ఉంటుంది. ఇదంతా ఆతనికి క్రీడయే! దృశ్య విషయములు అనే స్వకీయ మిత్రులలో లీలగా క్రీడిస్తూ హాయిగా గడుపుతూ ఉంటాడు.

12. తత్త్వజ్ఞాని - వ్యవహార విశేషాలు

శ్రీరాముడు : మహాత్మా! మహానుభావుడు, తత్త్వజ్ఞాని అగు జీవన్ముక్తుడు ఎవరెవరితో క్రీడిస్తాడు! ఆతనికి మిత్రులెవరు? ఆతని క్రీడ ఎట్టి స్వభావం కలిగి ఉంటుంది? ఆతని క్రీడ స్వాత్మస్థితి రూపమై నదా? లేక ప్రాపంచికమైనదా? ఆతడు తనయందే ప్రీతిని పదిలపరచుకుంటాడా? ఆతని ప్రీతి ఈ భోగపదార్థముల పట్ల అందరికీ ఉండే ప్రీతి వంటిదేనా? లేక ఆతని ప్రీతికి వేరే ప్రత్యేకత ఏమైనా

ఉంటుందా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆతనికి ముగ్గురు కర్మ దేవతా రూపులగు దేవతలే స్నేహితులు. వారితోనే ఆతని క్రీడ!

1. సహజకర్మ : తాను జన్మించిన ఉపాధిని అనుసరించి కుల వృత్తి ధర్మంగా ఆతడు నిర్వర్తించవలసిన ఏఏ కర్మలు తదితరులకు సానుకూల్యమో... ఆయా విధులు-ధర్మములు ఆతనికి సహజ కర్మ మిత్రుడు. ఆతడే ఆతని మొదటి సహచర స్నేహితుడు.

2. శాస్త్రీయ కర్మ : లోకకల్యాణార్థం శాస్త్రములు ప్రవచించే ఏఏ కర్మాచరణం ఉంటుందో, అద్దానిని ఆతడు ప్రయత్నపూర్వకంగా నిర్వర్తిస్తాడు. శాస్త్రములు అందరి సానుకూల్యమును అనుసరించి చేయవలసినవి - చేయకూడనివి అని చెప్పుతాయి కదా! ఆ కర్మలచే స్పృశించబడకయే వాటిని స్వధర్మనిరతిగా సంతోషంగాను, ఉత్సాహంగాను, తదితరులకు సానుకూల్యంగాను నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ విధంగా శాస్త్రీయ కర్మదేవత ఆతని రెండవ స్నేహితుడు.

3. స్వకర్మ : స్వప్రయత్నముచే సచ్ఛాస్త్రములు అభ్యాసము, విచారణ, సత్సంగము, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, సంయమము - ఇవి మనస్సును శుద్ధ పరచుకోవటానికి, విస్తార పరచుకోవటానికి, నిర్మల పరచుకోవటానికి, జ్ఞాన పరిపుష్టి కొరకు నిర్వర్తిస్తూ ఉంటాడు.

Page:523

అట్టి సహజ కర్మ - - శాస్త్రీయ కర్మ - స్వకర్మలు అనే దేవతలను తన స్నేహితులుగా చేసుకొని వారితో ఈ జగత్ మైదానంలో క్రీడిస్తూ (జీవన్ముక్తుడు) ఉంటాడు.

నాయనా! రామచంద్రా! ముముక్షువైనవాడు ఉత్తమ కర్మలను ఆశ్రయించాలి. అట్టి "ఉత్తమ కర్మ” అనే మిత్రుడు... తండ్రి వలె ఊరడిస్తాడు. ఆత్మీయురాలగు ప్రియ పత్ని వలె, అన్న వలె దుష్కర్మల నుండి నివారిస్తాడు. మహాసంకటాలలో ప్రియస్నేహితుని వలె తోడవుతాడు. ఉపాధ్యాయుని వలె, గురువు వలె కార్యములందు సంశయములను తొలగిస్తాడు.

అగ్నిని ఉష్ణము విడువనట్లు, పుష్పమును సుగంధం వదలనట్లు ఈ జీవుని ఆతని ఉత్తమ కర్మలే సదా తోడుగా ఆతనిని సంసారలంపటం నుండి ఎప్పటికైనా ఉద్ధరించగలుగుతాయి. ఉత్తమ కర్మలు జీవునకు కాలక్రమేణా యుక్తాయుక్త-నిత్యానిత్య విచక్షణా జ్ఞానం ప్రసాదించే మహావర ప్రసాదమగు కులదైవం. ఉత్తమ కర్మలు సత్పురుషులను సేవింపజేసి వారి సాంగత్యముచే ‘అజ్ఞానము' అనే జన్మజన్మార్జితమైన మహాసంకటము నుండి పరిరక్షిస్తాయి.

ఓ రామచంద్రా! ఈ జీవుని సర్వవిధాలా రక్షించేది, అధ్యాత్మ మార్గంలో తోడు అయ్యేది, ఆత్మజ్ఞానం వైపుగా ప్రేరేపించేది, మహనీయులగు ఆత్మజ్ఞుల దగ్గరకు జేర్చేది ఈ సహజకర్మశాస్త్రీయ కర్మ - స్వకర్మ ... అనబడే ముగ్గురు మిత్రులేనయ్యా! అందుకే ఉత్తమకర్మ నిర్వర్తించటం పట్ల మనుజుడు అత్యంత శ్రద్ధ, ఆసక్తి, పూజ్యభావన పెంపొందించుకొనటం ఆతనికి శ్రేయోదాయకం. ఇదియే తత్త్వశాస్త్రము యొక్క 'కర్మ సిద్ధాంతము' అయివున్నది. ఆత్మజ్ఞాని ఉత్తమ కర్మలయందు స్వభావ సిద్ధంగా అనునిత్యమూ ప్రేరేపితుడై ఉంటాడు.

ఓ రామచంద్రా! "జీవితము అనే అవకాశమును సద్వినియోగపరచుకొనే ప్రయత్నశీలురగు జీవులు స్వకర్మను ఆరాధిస్తూ జీవన్ముక్తత్వము వైపుగా ధృతి - - ఉత్సాహాలతో ప్రయాణిస్తున్నారు. ఈ భౌతికమైన భార్య - పిల్లలు నిజమైన కుటుంబం కాదు.

స్నాన-దాన-తపో-ధ్యానములే ఆ ముముక్షువుకు పిల్లలు. అవి తదితరులను తనకు సానుకూల్యురై ఆధ్యాత్మికయానంలో తోడుగా ఉండేటట్లు ప్రేరేపించి తయారు చేస్తాయి. నిత్య సంతోషమే ఆతని భార్య. అట్టి నిత్యసంతోష కళత్రమును సంపాదించుకున్నవారు తదితరులనుకూడా అనేక రుగ్మతల నుండి వైదొలగింపజేస్తూ దర్శనమాత్రం చేతనే ఆనందిపజేస్తూ ఉంటారు.

ప్రేమ - కరుణ ఆతని చెలికత్తెలు. 'సమత్వము' ఆతని సోదరుడు. వినమ్రత, ధైర్యము, ధర్మనిరతి ఆతని బంధువులు. సర్వుల పట్ల మైత్రి ఆతని ప్రియసఖుడు.

ఈ విధంగా జీవన్ముక్తుడు కోమలమైన స్వభావముతో నిత్యసంతోషము అభ్యసిస్తూ స్వభావసిద్ధంగా ప్రేమ - - కరుణ - మైత్రి కలవాడై లోకకళ్యాణకారకుడై ఉంటాడు. 'స్వకర్మ' అనే మిత్రునితో వ్యవహరిస్తూ లాభాలాభములచే ప్రసన్నుడు గాక, క్రోధయుక్తుడు గాక సర్వదా

Page:524

వసంతకాలపు మేమరహిత ఆకాశంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. నిరంతరం అనేక లోకవ్యవహారములమధ్య వ్యవహరిస్తూ ఉండవలసి వచ్చినప్పటికీ ఆ జీవన్ముక్తుడు అనుక్షణం నిర్వాణ-శాంత మనస్కుడై చెన్నొందుచున్నాడు. తత్త్వజ్ఞాన-రహితమైన, సారరహితమైన, సంభాషణలు ఆతనిని సమీపిస్తున్నప్పుడు ఆతడు శిలా విగ్రహమువలె మౌనం వహించినవాడై ఉంటాడు.

అర్హులు, ఆశ్రయించినవారు తటస్థపడితే ఆతని ఆత్మజ్ఞాన వ్యాఖ్యానాలు మహా ప్రవాహంలా పెల్లుబుకుతాయి. లోకవిరుద్ధమైన కర్మల పట్ల అతడు శవప్రాయంగానూ, శిష్ట అభ్యాస కార్యములందు ఆదిశేషునివలె - బృహస్పతివలె అతి ఉత్సాహ - శౌర్య - బుద్ధి పరాక్రమాదులతో అనువర్తిస్తూ ఉంటాడు. ఆతని నోటి వెంట పుణ్య కథలు గంగా ప్రవాహంలా జాలువారుతూ ఉంటాయి. ఆ జీవన్ముక్తుడు “ఏది మేలు, ఏది కీడు, ఏది ఉచితం, ఏది దోషం” ఎరిగియే ఉంటాడు. ఆ సమదృష్టి కలిగి ఉండటంచేత ఆతడు క్షణంలో ఉచితానుచితములను నిర్ణయించగలుగుచూ ఉంటాడు.

ఆతడు... సమదృష్టి కలిగి, దానశీలుడై, ఉదార చరితుడై, గుణదోషములను విభజించువాడై, అతి కోమల స్వభావుడై, మధుర స్నేహయుక్తుడై, మనోహరుడై, పుణ్యకీర్తిమంతుడై, ఈ జగత్తులో విలాసంగా, క్రీడగా, ఆనందంగా విహరిస్తూ ఉంటాడు.

ఓ రామచంద్రా! పవిత్ర మాతృమూర్తియగు ఈ భూదేవత అనేకమంది జీవన్ముక్తులగు సత్పుత్రులను కలిగియే ఉన్నదయ్యా! మనం చెప్పుకున్న ఉత్తమ గుణములు సమత్వ ప్రభావంచేత జీవన్ముక్తులకు సహజములై ఉంటున్నాయి. అంతేగాని ఎవరో చెప్పారనో, ఏదో ఆశించియో వారు ఆ ఉత్తమ కర్మలను - గుణములను ఆశ్రయించవలసిన అవసరం లేదు. అగ్నికి ఉష్ణము, సూర్యునికి ప్రకాశము, చంద్రునికి శీతల కిరణములు ఎవరైనా బోధిస్తేనో, నియమిస్తేనో, చెప్పితేనో వస్తున్నాయా? కాదు కదా! జీవన్ముక్తుల సద్గుణములు అట్టివే!

13. తత్త్వవేత్త యొక్క జగదవగాహన

శ్రీరాముడు : తత్త్వవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ వసిష్ఠ మహర్షీ! అందరికీ ఎదురుగా ఘనీభూతమై కనిపించే ఈ దృశ్యమును తత్త్వవేత్తలగు మీవంటి మహనీయులు ఏ రీతిగా, ఏ అర్ధంగా, ఏ అవగాహనతో, ఏ రూపంగా, ఏ విధంగా, ఎట్టి భావనతో, ఏ అభిప్రాయంతో, ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో చూస్తున్నారో .... అట్టి అవగాహన గురించి వర్ణించి చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒక్క మాటలో చెప్పాలంటే చిదాకాశము యొక్క ఆభాసయే ఈ జగత్తు. వాస్తవానికి జగత్తూ లేదు. ఆభాసకూడా లేదు. శూన్యము లేదు. వ్యక్తి చైతన్యము లేదు. శూన్యత్వము ఆకాశము కంటే వేరా? కానేకాదు కదా! అట్లాగే 'జగత్తు' అనబడునది ఏదైతే అజ్ఞానుల దృష్టిలో వేరువేరుగా భాసిస్తోందో... అది చిదాకాశము కంటే కించిత్ కూడా వేరుకాకయే ఉన్నది.

Page:525

దేశాద్దేశాన్తర ప్రాప్తా మధ్యే యత్సంవిదో వపుః ॥ తద్దృశ్యమితి భాతీదం దృశ్యమన్యన్న విద్యతే ॥

దేశాద్దేశాన్తర ప్రాప్తే యన్మధ్యే సంవిదో వపుః స్వస్వభావో హి భూతానాం తత్పదం పరమాత్మకమ్ ॥

దేశాద్దేశాన్తర ప్రాప్తే యన్మధ్యే సంవిదో వపుః ఏతత్తత్పరమాకాశమ్ అత్ర సర్వమ్ ప్రతిష్ఠితమ్

దేశాద్దేశాన్తర ప్రాప్తా యన్మధ్యే సంవిదోవపుః ఏతస్యావ్యతిరేకేణ జగత్తా నాస్తి కించన ॥

దేశద్ధేశాన్తర ప్రాప్తా విద్ధి మధ్యమ సంవిదః జగదిత్యపరం నామ స్వరూపాదచ్యుతాత్మనః ॥

ఓ రామచంద్రా! మాకు ఈ దృశ్యము ఎట్టిదని సుస్పష్టంగా అనిపిస్తోందంటే... మరొక ప్రదేశము బుద్ధివృత్తి ఒక ప్రదేశము

ఒక ప్రదేశం నుండి ఈ బుద్ధి వృత్తి నేత్రేంద్రియం ద్వారా మరొక ప్రదేశానికి వెళ్ళు చున్నప్పుడు, ఆ రెండు ప్రదేశముల మధ్యగా నిర్విషయమగు ఏ చైతన్య రూపము కలదో... అదే ఈ దృశ్యముగా భాసిస్తోంది. అంతకు వేరుగా ఈ దృశ్యము ఏమాత్రమూ ఏ క్షణమందు కూడా లేనేలేదు.

ఆ రెండు ప్రదేశముల మధ్యగా ఏ నిర్విషయమగు చైతన్యము యొక్క స్వరూపము కలదో...అదియే సర్వ జీవుల స్వస్వభావమైయున్నది. అదియే అందరికీ నెలవైన పరమాత్మ పదం.

ఆ రెండు ప్రదేశముల మధ్య ఏ నిర్విషయమగు చిత్స్వరూపము కలదో,.... అదియే పరమాత్మ రూపమగు చిదాకాశము. అచటనే ఈ సమస్తము ప్రతిష్ఠితమై ఉన్నది. అదియే సర్వమునకు అధిష్ఠానం. నీవు, నేను, ఈ సర్వ సభికులు, భవిష్యత్ పాఠకులు ఉన్నది ఆ నిర్విషయ చైతన్యమునందే! ఆ నిర్విషయ చైతన్యముగానే! ఆ రెండు ప్రదేశముల మధ్య ఉన్న నిర్విషయ చైతన్యము కంటే వేరుగా జగత్తు ఏమాత్రం లేనే లేదు.

సుషుప్తి సంవిత్

జాగ్రత్ ప్రదేశం స్వప్న ప్రదేశం

సుషుప్తి సంవిత్తు సుషుప్తి సంవిత్తు

ప్రళయం

పూర్వసృష్టి ప్రదేశము తదనంతర సృష్టి ప్రదేశము

సంవిత్తు సంవిత్తు

సంవిత్తు - జాగ్రత్, స్వప్నముల మధ్య గల సుషుప్తి సంవిత్ రూపమే సృష్టి - తదనంతర సృష్టి మధ్యగల సుషుప్తి సంవిత్తు కూడా!

Page:526

మూర్ఛావస్థ సంవిత్తు . ఆ సుషుప్త సంవిత్తే జాగ్రత్ స్వప్నములను తన రూపంగా ప్రదర్శిస్తోంది.

ఆ ప్రళయ సంవిత్తే పూర్వ - - పర సృష్టుల రూపంగా కూడా వ్యవహరిస్తోంది. ఆ మూర్ఛావస్థ సంవిత్తే ..... ఇహ పర లోకాలుగా కూడా అభివ్యక్తతమౌతోంది.

ఆ సంవిత్తే సర్వకాల, సర్వావస్థల యందును యథాతథమైయున్నది. అది ప్రతిజీవుని కూటస్థ రూపం. అది ఎవరి పట్ల ఎద్దాని కొఱకు కూడా ఏమాత్రం తన స్థానం నుండి చ్యుతి పొందటం లేదు.

అట్టి చిద్రూపానకే కొందరు (అజ్ఞానులు) 'జగత్తు' అనే పేరుపెట్టారు. మహాప్రళయం తరువాత మరల ఆదిసృష్టి సంభవిస్తోంది. అయితే మహాప్రళయానికి ముందు ప్రళయం సృష్టుల మధ్యగా, సృష్టి కొనసాగు సమయంలో ముందు, ఆవల, ఈవల, ఇక్కడ, అక్కడ, ఇప్పుడు, అప్పుడు, మరెప్పుడైనా సరే... పరమాత్మ కంటే వేరుగా జగత్తుకు మరొక కారణం లేదు. జగత్తే పరమాత్మ! పరమాత్మయే జగత్తు. (సదేవ సౌమ్యే దమగ్ర ఆసీత్ - సృష్టికి పూర్వం సద్రూపమగు పరమాత్మయే కలదు!) మహాప్రళయదశలో 'జగత్తు' అనబడేదానికి బీజమే లేదు. ఇక “పరమాణువు మొదలైన వాటి నుండి ఈ మూర్తివంతమగు జగత్తు ఏర్పడుతోంది అనే కల్పన అంతా అసంగతమే సుమా!

ఉత్పన్నమేవ నైవాతో మూర్తం దృశ్యమిదం జగత్ | వస్ధ్యాపుత్రఇవాత్యస్తమతో స్యేవ న దృశ్య ధీః |

మూర్తివంతమై కనిపించే జగత్తు ఆత్మదృష్ట్యా ఉత్పన్నమే అయివుండలేదు. సమస్త శ్రుతులు ఈ విషయం ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. శ్రుతుల తాత్పర్యం ఇదియే! కాబట్టి గొడ్రాలి రెండవ కుమారునివలె ఈ దృశ్యము అత్యంత అసత్యమై ఒప్పుచున్నది. “ఈ నలువైపులా కనిపించే దృశ్యము పరమాత్మపదమగు శుద్ధ-నిర్మల చిదాకాశమే... అని శ్రుతి తాత్పర్యవేత్తలు ఎరిగియే ఉన్నారు.

చిన్మాత్రము తన నిర్మల - నిర్వికార రూపమును త్యజించకయే సుషుప్తి నుండి స్వప్నమునకు, స్వప్నం నుండి జాగ్రత్తుకు, జాగ్రత్తు నుండి సుషుప్తికి వెళ్ళుచున్నది. అట్లాగే అయ్యది నిజచిదాకాశ రూపం త్యజించకయే సృష్ట్యాది, సృష్టి, సృష్టి అంతం పొందుచూ ఈ సృష్టిరూపంగా కూడా భాసిస్తోంది. సుషుప్తి నుండి స్వప్నదశకు వచ్చినప్పుడు ఆ స్వప్నంలో భాసించే నగరాలు మనో సంబంధమైన స్వప్న సంకల్ప రూపమే కదా! అట్లాగే చిదాకాశమే సృష్ట్యాది యందు సృష్టిరూపంగా (ఈ దృశ్య జగత్తుగా) భాసిస్తోంది. వాయువు స్పంద రూపమే ఎట్లా తన స్వరూపమునందు స్వయంగా చక్ర తరంగాది రూపములను చేష్టితం చేస్తోందో (ప్రదర్శిస్తోందో)... అట్లాగే అజ్ఞాన చిదాకాశ విభాగము కూడా సృష్ట్యాదిలో తానే స్వయంగా దృశ్యరూపమున తనయందు స్థితినొంది ఉన్నది. ఎరుగబడినప్పుడు (తత్త్వజ్ఞానము కలిగినప్పుడు త్రైలోక్యరూపమైనట్టి ఈ దృశ్యజగత్తు దృశ్య జగత్తుగా కాకుండా పరబ్రహ్మముగానే భాసించుచున్నది. కనుక పరబ్రహ్మమే తన యందు ఈ విధంగా దృశ్యరూపంగా నెలకొనియున్నట్లు సుస్పష్టమౌతోంది కదా!

Page:527

ఓ రామచంద్రా! ఈ పృథివి మొదలైనవి ఎప్పుడూ కూడా మూర్తివంతము సాకారము కాదు. ఇవన్నీ కూడా అజ్ఞాని దృష్టికి మూర్తివంతంగాను, జ్ఞానిదృష్టికి అమూర్తివంతంగాను అగుచున్నది. ఏది ఏమైనప్పటికీ మూర్త-అమూర్తవంతంగా విరాజిల్లుచున్నది పరబ్రహ్మమే సుమా!

స్వప్నంలో కనిపించేదంతా మూర్తవంతంగా కనిపించవచ్చుగాక! మేల్కొనిన తరువాత స్వప్నంలో కనిపించిన పర్వతం ఏమైపోతోంది? అంతా రూపరహితమై శూన్యాకాశమునందు విలీనం అగుచున్నది కదా! అట్లాగే ఆత్మజ్ఞానము సంపాదించుకొని అనుభూత మొనర్చుకొన్నవారికి ఈ ముల్లోకములు కూడా శాంత చిన్మాత్రాకాశముగా అగుచున్నాయి. జ్ఞానులు దృష్టియందు ఈ జగత్తు విభాగ రహితమగు పరబ్రహ్మముగానే విరాజిల్లుచున్నది. ఇక అజ్ఞానుల దృష్టియందంటావా ... అజ్ఞానులనే అడుగు. ఎందుకంటే వారి దృష్టి క్షణ మొకరీతిగా ఉంటోంది.

ఓ రామచంద్రా! నిర్విషయమగు పరమాత్మ పదము ఎట్టి రూపము కలిగియున్నదో... ఈ సత్-అసదాత్మకమగు జగత్తు కూడా అట్టి రూపమే కలిగియున్నది. ఎట్లా అంటావా?

ఈ సమస్త ప్రపంచము పంచభూతములకంటే వేరు కాదు. ఇక పంచభూతములో... తమ అధిష్ఠానమగు పరమాత్మ కంటే వేరుగా ఎక్కడినుంచీ వచ్చియుండలేదు.

అందుచేత ... బాహ్యేంద్రియములచే జనించే రూప - ప్రకాశాదులుగాని, అభ్యంతరమగు మనస్సుకు అధీనమైయుండే సంకల్పము-యోచన-భావన-వేదన గాని, ఈ సమస్త బాహ్య అభ్యంతర ప్రపంచము పరమాత్మ పదరూపమే అయివున్నది. మహాసముద్రంలో తరంగాలు, సుడులు, బుడగలు, ఆవర్తాలు మొదలైనవిలాగా... ఈ బాహ్య - అభ్యంతరాలలో అనుభవమగుచున్న సర్వము 'పరమాత్మ పదము' అనే మహాసముద్రంలోని అనన్యమగు విశేష పరంపరలేనయ్యా!

రాగము, ద్వేషము, భావము, అభావము.... ఇవన్నీ కూడా సద్రూపము త్యజింపకయే ఉన్నట్టి చిదాకాశ స్వరూపం అయివున్నాయి. తరంగములుగా ప్రదర్శితమగుచున్నప్పుడు సముద్రజలం తన ద్రవత్వము త్యజిస్తోందా? లేదు కదా!

త్యక్త్వా పూర్వాపరే కోట్యౌ మధ్యే యత్సంవిదో వపుః | స స్వభావః పరో జ్ఞేయో జగత్పయసి సంజ్ఞతః II

ఒకానొకడు ఒక వృక్ష శాఖమీదుగా ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుని వీక్షించుచున్నప్పుడు పూర్వవిభాగమగు శాఖను ఆ తరువాత విభాగమగు చంద్రుని... రెండింటిని విడిచిపెట్టితే మధ్యలో గల చైతన్యం యొక్క నిర్విషయమగు స్వరూపమేది ఉన్నదో... అదియే చైతన్యము యొక్క పరమోత్తమ మగు స్వభావం. మృగతృష్ణలో జలం కనిపిస్తున్నట్లు అద్దానియందే అద్దానికి అభిన్నమై 'జగత్తు' అనబడేది కనిపించటం జరుగుతోంది. వాస్తవానికి ఈ జగత్తు సృష్ట్యాది యందు జనించియే ఉండ లేదు. ఏది ఉత్పన్నమైనట్లు కనిపిస్తోందో... అది ఇంద్రజాలంలో కనిపించే వస్తు సమూహం వంటిదే!

Page:528

కష్టం! నాస్త్యేవ యదృశ్యం! తదపి అస్థి ఇతి సంస్థితమ్! యదపి అస్థి పరంబ్రహ్మ, కష్ట! “నాస్థి” ఇతి తతమ్ ||

ఆహా! ఏమి ఆశ్చర్యం! గాజును చూచి మణి అని, మణిని చూచి గాజు అని భ్రమించినట్లుగా అజ్ఞానులు ఏ జగదృశ్యం లేదో... అద్దానిలో కలదు అనే బుద్ధిని పొందుచున్నారు. ఏ పరబ్రహ్మం సర్వదా ఘనీభూతమై ఉండియే ఉన్నదో... అద్దాని పట్ల 'లేదు' అనే బుద్ధి ఏర్పడుచున్నదే! ఇంక ఏం చెప్పాలి?



ఓ రామచంద్రా! నాకు బ్రహ్మం యొక్క భావనకు వేరైనట్టి వివర్తిత జగత్తు ఎక్కడా ఈషణ్మాత్రం కూడా కనిపించటమే లేదు. కొందరు అసత్తగు ఈ దృశ్యం 'సత్తు' అని చెప్పుచున్నారు. 'సర్వదా సత్తు అగు బ్రహ్మమును సత్తుగా వారు గమనించటం లేదు. వాస్తవానికి దృశ్యము కొంచెం కూడా ఉత్పన్నమే అయివుండలేదు. దృశ్యమనునది ఎక్కడా భాసించటమూలేదు. మరి? ఇక ఇట్లు భాసిస్తు న్నట్లుగా కనిపించే దంటావా? బ్రహ్మమే స్వయంగా ఇట్లు జగత్తు రూపంగా అజ్ఞానం చేత అనిపిస్తోంది. ఇక ఇంద్రనీలమణి, తన కంటే ఏమాత్రం వేరుకానట్టి ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తుంది చూచావా? అట్లాగే చిదాకాశము కూడా తన కంటే ఏమాత్రం వేరుకానట్టి సృష్టిరూపంగా ప్రకాశిస్తోంది. సూర్యుడు కూడా శాంతమగు పరమాత్మ పదమునందే సద్రూపముతోటి వెలుగొందుచున్నాడు. ఆ పరమాత్మ యొక్క అవయవమే ఈ సూర్యుడు. సద్రూపుడగు పరమాత్మకంటే సూర్యుడు వేరుగా లేనే లేడు.ఈ సూర్య చంద్రులు చిత్స్వరూపమున ఉన్నవారైనప్పటికీ తమ భౌతిక ప్రకాశముచే ఆ చిత్స్వరూపమును ప్రకాశింపజేయలేకపోతున్నారు.

ఆ పరమాత్మయే సూర్య చంద్రులను ప్రకాశింపజేస్తున్నాడు. అంతేగాని సూర్యచంద్రులు పరమాత్మను ప్రకాశింపజేయటం కాదు.

ఆహా! ఆ చైతన్యము యొక్క ప్రకాశము చేతనే ఈ దృశ్య సమూహమంతా ప్రకాశిస్తోంది. ఇక “ఆ పరమాత్మ సాకారరూపుడా? నిరాకారరూపుడా?... అనే శబ్దార్థ కల్పన ఆకాశ పుష్పం”లాగా అసద్రూపమైనది. అటువంటి కల్పన తత్త్వజ్ఞానులలో సంభవించటమే లేదు.

సర్వులకు జీవమును ప్రసాదిస్తున్న జీవన ప్రదాత, జగద్రష్టలో సూర్యుని యొక్క తేజోకిరణంలో ఆయన అవయవరూపమగు అణువు కిటికీ ద్వారా ఎట్లా భాసిస్తోందో... అపరిచ్ఛిన్న చిత్రకాశమయ మగు బ్రహ్మంలో సూర్యుడు మొదలైనవి అణువులవలె భాసిస్తున్నాయి. ఇంకో విధంగా చూస్తే, పరబ్రహ్మంలో ఏదీ భాసించుటయే లేదు. ఎందుకంటే పరబ్రహ్మం సర్వదా అతినిర్మలం, పదార్థ రహితం, నిర్విషయం అయి ఉన్నది కాబట్టి! మణికి మణికాంతులు వేరైనవి ఎట్లా అవుతాయి? అట్లాగే 'పరమాత్మ' అనే మణి యొక్క వేరువేరు కిరణ రూపములైనట్టి ఈ జీవులు, సూర్యుడు, చంద్రుడు నీవు, నేను ... ఇవన్నీ పరమాత్మకు వేరైనవి కావు. పరమాత్మ పదము ద్వంద్వాతీతం. అందుచేత అద్దానియందు చిత్ - జడ భేదం లేదు.

Page:529

అది సర్వత్రా పరిపూర్ణం. కనుక శూన్యవర్జితం. పదార్థములు అసత్తు కాబట్టి అది సర్వపదార్థ రహితం. సర్వకల్పనలకు అధిష్ఠానం అగు చైతన్యమునందు ఆరోపిత (కల్పిత) దృష్టిచే జగత్తులు ఉన్నాయి. అధిష్ఠాన దృష్టిచే అవేవీ లేవు. అట్లాగే ఈ సర్వజీవులు కూడా! మనమంతా ఆరోపిత దృష్టిచే ఆత్మయందే ఉన్నాం. అధిష్టాన దృష్టిచే అంతా ఆత్మయే కాబట్టి మనమెవరమూ లేము. అవయవ సహితంగా కనిపించే ఈ సర్వజీవులు, సూర్య చంద్రాది ఖగోళ పదార్థాలు, నీవు, నేను... మొదలైన మనమంతా కూడా అవయవ రహితమగు చిద్రూపంలో అవయవ రహితమగు చిద్రూపాణువులుగా ప్రకాశిస్తున్నాం. ఇవన్నీ ఆరోపిత దృష్టిచే చిద్రూపమునందే ఉన్నప్పటికీ... చిద్రూపం నిజ సత్తును త్యజించకయే ఉన్నది. ద్వైత-ఏకత్వాలు ఆ చిద్రూప నిజసత్తలో లేనేలేవు.

ఓ రామచంద్రా! ఆ ఆ శుద్ధ నిర్విషయ చిత్స్వరూపము, సమక్షంలో... ఇది పదార్థ సహితం. ఇది పదార్థ రహితం. ఇది స్థూలం. ఇది సూక్ష్మం. ఇది అల్పం. ఇది అధికం”... ఇత్యాది కల్పనలు అతిదూరమైనవై ఉన్నాయి.

ఈ జగత్తు మాకు ఎట్లా కనిపిస్తోందంటే... ఏకం, శాశ్వతం, అనంతం, సదా అతివ్యాపకం - అయినట్టి చిన్మాత్రాకాశసత్త` యే తనలో తాను ఈ 'జగత్తు' అను నామముతో స్థితినొంది ఉన్నట్లుగా!

ఈ బుద్ధివృత్తి ఒక విషయమును త్యజించి మరొక విషయమును గ్రహించుచున్నప్పుడు మధ్య ఉండే చైతన్యము యొక్క నిర్విషయ వృత్తిరహిత బుద్ధిరూప చైతన్యమే ఈ వివిధ జగత్ రూపములుగా ప్రకాశించుచున్నది. స్వప్నంలో జీవచైతన్యము అనేక రూపములుగా ప్రకాశిస్తున్నట్లే... జాగ్రత్ చైతన్యము ఈ వివిధ రూపములతో జగత్తుగా (వ్యాప్తరూపంగా) ప్రకాశిస్తోంది.

జబ సు సుషుప్తి నుండి స్వప్నంలో ప్రవేశించే చైతన్యము తన యొక్క నిజ ఒక షు స్వప్నం స్వరూపమున యథారీతిగా ఉండి ఉండియే స్వప్న రూపమును మారి పొంది వివిధ స్వప్నాంర్గత రూపములను అనుభవిస్తోంది. ప్రళయము నుండి సృష్టియందు ప్రవేశించుచున్న ప్రళయ చైతన్యము ఎప్పటి యట్లుగా తన అద్వైత రూపమున ఉండియే ఈ జగత్ ' సృష్టి రూపమును (వేషమువలె) ధరించినదై ఈ నానావిధ రూపములుగా యం

ప్రదర్శనమగుచున్నది.

అనగా... చైతన్యము ఒక సృష్టి ప్రళయము నుండి మరొక సృష్టిని కల్పిస్తున్నప్పటికీ, తన స్వస్వరూపములో కించిత్ మార్పు కూడా పొందటం లేదు. అంతే కాదు! చైతన్యమే ఈ సృష్టిగా, ఇందులోని వివిధ వస్తువులుగా భాసిస్తోంది.

సుషుప్తి ఎట్లు చిద్రూపమో... అట్లాగే స్వప్నము చిద్రూపమే అయివున్నది. జాగ్రత్తు కూడా అట్లే చిద్రూపము అయివున్నది. ఇట్లు ఈ జగత్తంతా కూడా చిదాకాశరూపమై వెలయుచున్నది. ఈ

Page:530

విధంగా తత్త్వవేత్తల దృష్టిలో జాగ్రత్ స్వప్న సుషుప్తి రూపమగు ఈ సమస్త జగత్తు కూడా తురీయమే అయివున్నది. అట్టి అవగాహన తత్త్వవేత్తల సంప్రదాయమే!

ఇక మూఢులేమి తలచుచున్నారో... ఏమి ఎరుగుచున్నారో... అది ఒక రూపమంటూ ఏదీ లేకుండా పోతూ, క్షణక్షణికం అగుచున్నది కదా! అందుచేత అట్టిది, ఇట్టిది అని మేము చెప్ప జాలకున్నాం. వారి దృష్టిని నిర్వచించలేకున్నాం.

ఈశ్వరుడే ఈ జగత్తుల యొక్క జీవుల యొక్క సమస్త పదార్థముల యొక్క అభ్యంతరము అయివున్నాడు. అంతర్యామి రూపముచే... ఈశ్వరుడు దుర్లక్ష్యమైయున్నాడు. అట్టి ఈశ్వరత్వము ప్రతి జీవుని యందు ప్రతి పదార్ధమునందు అంతర్యామి రూపంలో దుర్లక్ష్యమై... మనోబుద్ధులకు లభించనిదై ఉన్నది. మనోబుద్ధులకు అతీతంగా పరిశుద్ధమగు జీవ - చైతన్య స్వరూపమై ఉన్నది.

కనుక రామచంద్రా! సమస్త పదార్థములు ఈశ్వర స్వరూపములే అయి ఉన్నాయి. ఈ విధంగా చిద్రూపుడగు ఈశ్వరుడే జగదాకారంగా ఉన్నాడని నిరూపించబడుతోంది. అట్లాగే, “నిజ దృశ్యరూపముచే జగత్పదార్థములు సత్యములు కావు... అని కూడా తెలియవచ్చుచున్నది కదా!

ఈ పృథివి మొదలైన సర్వ పదార్థములందు పరమాత్మ అంతర్యామి అయి సమస్తమునకు సాక్షిరూపము వహిస్తూనే సర్వమును పరిణామమొనర్చుచున్నాడు. అయితే పరిణామము అనే శబ్దం ఉపయోగించటమనేది లౌకికమైన వ్యవస్థను బట్టి ఉపదేశార్థమేగాని... పరమార్థంగా పరిణామము' అనే కించిత్ ప్రత్యయము కూడా ఎక్కడా లేనే లేదు. సమస్తము చిద్రూపమే అయివుండగా... ఇక పరిణామమనేదెక్కడ? వాస్తవానికి సాక్షిత్వ - ప్రేరణత్వాలు కూడా లేవు.

ఆదిసృష్టి మొదలుకొని ఇప్పటి దాకా సర్వదా ఏకమే అయినట్టి చిన్మాత్ర పరమాకాశమే మహాసత్తా రూమగు స్వాత్మ యందు 'జగత్' రూపంగా స్థితినొంది ఉన్నది. ఇందుకు తత్త్వవేత్తల యొక్క “పరిపూర్ణకాత్మ” గురించిన అనుభవం, ఆ అనుభవాన్ని క్రోడీకరిస్తూ (తత్వమ్ - స్కో

హమ్ - - జీవో బ్రహ్మేతినాపరః - అయమాత్మా బ్రహ్మ - త్వమేవాహమ్ - - సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ

- జీవశివః శివో జీవః - సర్వమ్ శివమయమ్ - వంటి) వేద వేదజ్ఞుల ఆప్త వాక్యములు మనకు ప్రమాణం సుమా! మహనీయుల అనునిత్యానుభవమైనట్టి సర్వవ్యాపక చైతన్యమే సర్వత్రా స్థితినొంది ఉండగా... ఇక అట్టి చైతన్యమునకు వేరుగా ఎద్దానిని చూచి “ఇది జగత్తు" అని అంటున్నారో... అది జ్ఞానదృష్టి కలవానికి ఏదీ కనిపించటం లేదు. అందుచేత మా కనుభవమగుచున్న సర్వవ్యాపక ఆత్మ చైతన్యాన్ని చూచియే అజ్ఞులగు జనులు 'జగత్తు' పేరుతో పిలుస్తున్నారు... అనే మేము గ్రహించి ఉంటున్నాం.

శ్రీరాముడు : మరి జీవునికి (అజ్ఞాత భ్రష్టమ్) అగు దుఃఖం ఎందుచేత సుదీర్ఘంగా కొనసాగుతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి :

పరిజ్ఞాతే యథా స్వప్నే స్వార్గీకారాత్సుఖం సుఖమ్ | అనంబ్లీకారతో దుఃఖం స దుఃఖమ్ భవతి క్షణాత్ ||

Page:531

ఒకానొకడు స్వప్నంలో దృశ్యముతో తాదాత్మ్యమై అనేక వేదనలు అనుభవిస్తున్నాడనుకో! అప్పుడిక మేల్కోగానే మహాసుఖముగాను, మేల్కొననంతవరకు మహా దుఃఖంగానూ ఉంటోంది కదా! అట్లాగే, ఈ జీవుడు ఆత్మ స్వరూపమును ఎరిగిన తరువాత నేలతి - నే తి" సూత్రానుసారంగా అప్పటికీ శేషించు ఆత్మయొక్క అంగీకారముచే తాను అప్పటి నుంచి దర్శించే జగత్కౌతుకమంతా ఇక మహా సుఖప్రదమే అవుతుంది.

అట్లా కాకుండా అప్రమేయ - కేవల శుద్ధాత్మ మాత్రము యొక్క స్వరూపమును అంగీకరించక (ఎరుగక) పొందుచున్న జగత్తంతా దుఃఖప్రదమే అయి ఉంటోంది. ఇదంతా స్వప్న సదృశమేకదా!” అని మొదలే ఎరిగియున్న కారణం చేత తత్త్వజ్ఞాని ఈ జగత్తునందు పాల్గొనుచున్నప్పుడు, ఇద్దానిని చూస్తున్నప్పుడు తనయందు దుఃఖము” అనే విక్షేపభావమును బలపడనివ్వడు. అందుచేత ఆతడు కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, మేల్కొనినప్పుడు, నిదురిస్తున్నప్పుడు... అన్ని వేళలా ఆత్మదర్శనము” అనే సమాధి సుఖస్థితిని కొనసాగించుచున్నాడు.

ఎందుచేతనంటే... ఆతడు... మాయా నిర్మితములగు భేదములయందు వసించుచున్నప్పటికీ అభిన్నము - ఏకరసము అగు ఆత్మయందు తత్పరుడై ఉంటున్నాడు. దుఃఖాదులు ఉంటే ఉండవచ్చుగాక! ఆతడు మాత్రం నిరతిశయమగు స్వాత్మయందే వెలయుచున్నాడు. బాహ్యప్రపంచమున వ్యవహరిస్తూనే ...అంతరంగమునందు సర్వదా ముక్తుడై బాహ్యత్వము-అసత్ ప్రపంచత్వము లేనివాడై ఉంటున్నాడు. ఇక అట్టి జ్ఞానికి గ్రహించతగినదేమి? త్యజింపవలసినదేమున్నది?

ఓ రామచంద్రా! పరిజ్ఞాతమగు ఆత్మజ్ఞాని బాహ్యమున సర్వకార్యములు నిర్వర్తిస్తూనే... అంతరమున ఏదీ గ్రహించడు. త్యజించడు. ఎల్లప్పుడు సర్వకార్య వర్జితమైనట్టి బ్రహ్మమునందే స్థితి కలిగి ఉంటున్నాడు. అగ్నికి ఉష్ణత్వం ఎట్లాగో, మంచుకు చల్లదనము ఎట్లాగో... అట్లా జ్ఞానికి నిర్విషయమగు ఆత్మత్వము స్వభావ సిద్ధమే అయివున్నది. అంతేగాని అది ప్రయత్నపూర్వకంగా చేసే కార్యము వంటిది కాదు. ఎవనికైతే నాది అంటూ ఏదీ లేదు అని గ్రహించినట్టి గ్రాహ్య - త్యాజ్యములకు అతీతమైన బుద్ధి నిశ్చలంగాను, స్వభావ సిద్ధంగాను ఉంటుందో.... అట్టివాడు “తత్త్వవేత్త” ... అని పిలువబడుచున్నాడు. ఎవడికి "గ్రహించబడవలసిదిగాని, త్యజించబడవలసినది గాని ఏదీ ఈ దృశ్యమునందు లేదు... అనునది స్వభావమై ఉండదో... అట్టివాడు జ్ఞాని ఎట్లా అవుతాడు? ఎందుకంటే ఆత్మకు అన్యమైనదాని పట్ల అభిలాష కలిగి ఉండటమే అజ్ఞానానికి చిహ్నమై ఉన్నది కదా! 'అజ్ఞానం' అనే ఆవరణం లేనట్టి జ్ఞాని సదా శాంతచిత్తుడై, ఈతడు మిత్రుడు, ఈతడు శత్రువు" అను రూపంతో కూడిన వికల్పములన్నీ మొదలంటా క్షయించినట్టి వాడై, సారభూతమగు స్వాత్మ సుఖముచే పరిపూర్ణుడై, “మహాశాంతి అనే అమృత పానముచే సంతృప్తి సంపాదించుచున్నవాడై, ఆత్మయందే సదా సర్వదా సర్వత్రా స్థితిని సుస్థిరీకరించుకొని ఉన్నవాడై, స్వయం ప్రకాశకస్వయంజ్యోతి అయి వెలుగొందుచున్నాడు. అట్టి జ్ఞానమే సర్వుల ఆయా వివిధ సర్వసాధనముల అత్యుత్తమమగు ప్రయోజనమై ఉన్నది సుమా!

Page:532

14. మనోమాత్రమిదమ్ జగత్

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ విధంగా ఆదిప్రజాపతి అగు విరాట్ పురుషుడు కూడా "పృథివి మొదలైనట్టివి లేనిది - నిరావరణము అగు చిదాకాశ స్వరూపుడే అయివున్నాడు. ఆతడు కేవలము మనోమాత్రుడుగాను, ఈ జగత్తు ఆతని మనోమాత్రముగాను శాస్త్రకారులు నిర్వచించియే ఉన్నారు. అట్టి సమష్టిరూప మనస్సు ఎక్కడి నుండి వచ్చింది? అది చైతన్య మాత్ర స్ఫురణయే కాబట్టి ఆతడు చిన్మాత్ర స్వరూపుడేనని నిర్ద్వంద్వంగా నిర్ణయించబడుచున్నది. ఎందుకంటే మననమే మనస్సు. జగత్తుకు సంబంధించిన మనోధర్మమగు మననాకార కల్పనకు పూర్వము ఆతడు చిన్మాత్రుడుగానే అయివున్నాడు. జలంలో తరంగాలు తదనంతరం ఏమి కానున్నాయి? జలంలోనే లయమగుచున్నాయి కదా! ఆ తరువాత జలంలోంచే తరంగాలు బయల్వెడలుచున్నాయి కదా! అట్లాగే విరాట్ పురుషుని (సమష్టి సృష్టికర్త యొక్క) మనోమాత్రమగు (భావనామాత్రమగు, సంకల్ప జనితమగు, ఊహవంటిదగు) ఈ వర్తమాన జగత్తు ఒకానొకప్పుడు ఆత్మయందే లయము పొందబోవుచున్నదగుచున్నది. ఆ బ్రహ్మదేవుడు జలంలో తరంగాలవలె తనయందుతానే మనస్సు’ అనబడుదాని పేరుతో చైతన్య తాదాత్మ్యధ్యాస (చైతన్యము యొక్క దృశ్య సంబంధమైన ధ్యాస) ను కల్పించుకొనుచున్నాడు.

బ్రహ్మదేవుడు కేవల సత్తామాత్ర స్వరూపుడే! అట్టి సత్తాస్వరూపమునందు బుద్ధి మొదలైనవి ఎట్లా ఉంటాయి? శూన్య స్వరూపము-అనంతము అగు ఆకాశంలో మట్టి - ధూళి ఉండవు కదా! ఆ బ్రహ్మదేవుడు వాస్తవానికి శుద్ధ-బుద్ధ-స్వయమాత్మ స్వరూపుడే కాబట్టి ఆయనకు దేహముగాని, చిత్తాదులుగాని, ఇంద్రియములుగాని, వాసనలు గాని... ఇవన్నీ లేవు. జలమునకు తరంగాదుల పొడవు, వెడల్పులు జల స్వస్వభావమునకు ఆపాదితాలే గాని జలం యొక్క వాస్తవస్వరూప ధర్మములు కావు కదా! అయితే, వ్యవహార నిర్వహణార్థం కల్పిత దేహేంద్రియాదులు ఆతనిపట్ల సదా విద్యమానమై ఉన్నప్పటికీ, ఆతని స్వరూపము సర్వదా నిష్ప్రపంచము - నిర్వికల్పము అగు పరమాత్మయే! అట్టి ఆత్మకు వేరైన కారణమేమీ లేదు కదా! ఇక పూర్వ ప్రజాపతి పూర్వమే ముక్తుడైనాడు కదా! నూతన ప్రజాపతికి ఆతడు కారణం కాదు కదా! ఈ విధంగా ఆ వర్తమాన ప్రజాపతి (బ్రహ్మదేవుడు) ప్రభవించటానికి ఆత్మకు వేరుకారణమేదీ లేదు. కనుక ఆతడు ఆతని మనోవీథిలో ప్రభవించుచున్న ఈ సృష్టి ఆత్మకు అన్యమైనది కాదని (అభిన్నమని) సిద్ధాంతీకరించ బడుచున్నది. ఈ విధంగా ఉత్పత్తి స్మృతి అనునది మొదలే లేవు.

శ్రీరాముడు : మహర్షీ! ఇతఃపూర్వపు ప్రజాపతి (ఇతఃపూర్వపు సృష్టి యొక్క సృష్టికర్త) ముక్తుడై, ఆ తదనంతరం కించిత్ ఇతఃపూర్వ స్మృతిచేత మరల దేహోత్పత్తి పొందియుండవచ్చును కదా! ఆ విధంగా ఈ జగత్తు స్మృతి’యే ఆధారముగా కలిగియున్నదని అనవచ్చునా? మరి, ఈ జగత్తుకు ఆధారమే లేదు అని ఎందుకనుకోవాలి?

Page:533

శ్రీ వసిష్ఠ మహర్షి : సంసారము కొనసాగుచున్నట్టి జనన - - మరణ పరివర్తన శీలురగు జీవులకు ‘స్మృతి’ కారణభూతమై కొనసాగుచున్నదని అనవచ్చు. అయితే శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదు లతో కూడిన ఈ జగత్ వ్యవహారాదుల నుండి, అందుకు మూలమైనట్టి భావనాదుల నుండి ముక్తత్వము పొందిన హిరణ్యగర్భుడు (సమష్టి సృష్టికర్త) వంటి వారికి సంసార స్మృతియే ఉండదు. స్మృతియే అవిషయమై, కల్పనామాత్ర స్వరూపమై, స్వప్నసంగతమైయున్న ముక్తునకు మరల దేహోత్పత్తి ఉండజాలదు. వారికిక దేశాంతరము గాని, కాలాంతరముగాని పునరావృత్తి పొంద జాలవు. కనుక వర్తమాన ప్రజాపతి సృష్టికి పూర్వ ప్రజాపతి యొక్క 'స్మృతి' కారణం కాజాలవని సుస్పష్టీకరించబడుతోంది.

సరే! కాసేపు పూర్వపు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునకు పూర్వకల్ప వాసనాజన్యమగు హిరణ్యగర్భాహంభావం”... అనే స్మృతిచే దేహాదులు ఒకింత సంభవించి ఉండవచ్చునని కాసేపు అనుకుందాం. పూర్వపు సృష్టి కేవలము మనో (ఊహా) కల్పితాలే కదా! అట్లాగే వర్తమాన సృష్టి కూడా కేవలం మానసిక కల్పితాలే. పృథివి మొదలైనవి ఏవో పదార్థముల నుండి ఉత్పత్తి కానివి, అతి తుచ్ఛములు, సర్వదా శమించినవి, సంకల్ప నగర ప్రాయములు, మిథ్యాభూతములు మాత్రమే అగుచున్నవి కదా! కలలోనో, (లేక) ఊహ (సంకల్పము)లోనో కనిపించిన పర్వతాదులు ఎట్లా పృథివీ సంబంధం కావో (మిథ్యా భూతములో), అట్లాగే విరాట్టు యొక్క శరీర రూపమున ఏ పాదార్థిక విశ్వము స్ఫుటంగా కన్పించుచున్నదో అది పృథివీరహితమే (మిథ్యయే) అయివున్నది. మంచుతో ఏర్పడిన గృహం మంచు దృష్ట్యా ఎట్లా భ్రాంతియో, ఈ ఎదురుగా కనిపించే సృష్టి కూడా స్వకీయమైన భ్రాంతి దృష్టి వ్యవహారమే అయివున్నది. క్రితం రోజు రాత్రి స్వప్నమే ఈ రోజు రాత్రి స్వప్న విశేషాలుగా కొనసాగుతోంది" అనునది జనుల అనుభవం కాదుకదా!

ఆది సృష్టి పూర్వానుభవమే లేదు. పూర్వానుభవము యొక్క అభావం చేత పూర్వ ప్రజాపతి యొక్క 'స్మృతి' నూతన సృష్టికి నాందిగా అవజాలదు.

శ్రీరాముడు : కొన్ని కొన్ని వేదవాక్యములను అనుసరించి (ఉదా: ధాతా యథా పూర్వమకల్పయత్

- బ్రహ్మదేవుడు పూర్వ కల్పానుసారంగా ఈ సూర్య - చంద్ర - - పృథివి మొదలైన వాటితో కూడిన జగత్తును కల్పించెను... అను శ్రుతి వాక్యముల ద్వారా) బ్రహ్మదేవునికి (వర్తమాన ఈ సృష్టి కర్తకు) పూర్వ స్మృతి ఉండి ఉంటుందని కూడా కొన్ని సందర్భాలలో శాస్త్రకారులచే సూచనగా చెప్ప బడుతోంది కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! అయితే, అట్టి శ్రుతి వాక్యములు 1.లౌకికులగు అజ్ఞానుల నిమిత్తం, 2. అనాది సిద్ధమగు కర్మమార్గము యొక్క ప్రవర్తనము కొరకై, 3. ఇతరుల బుద్ధిని అనుసరించి సంహితా విభాగంలో (కర్మకాండ విభాగంలో) బోధించబడినది. అది మధ్యేమార్గ పాఠ్యాంశమే గాని అంతిమ వేదసారం కాదు. (ఉపనిషత్ అంగం యొక్క సారం గ్రహించినట్టి) తత్త్వవేత్తల యొక్క దృష్టి యందు ప్రజాపతికి పూర్వస్మృతి అనే ప్రసంగమే లేదు.

Page:534

శ్రీరాముడు : స్మృతి శాస్త్రమునందు ప్రావీణ్యులలో శ్రేష్ఠులు, ఉత్తమ గుణ నిలయులు అగు ఓ మునీశ్వరా! హిరణ్యగర్భాదులు స్మృతి లేకుండా సృష్టి ఎట్లా చేస్తున్నారు. వారికి స్మృతియే లేకుంటే పూర్వకాలికమైన బ్రహ్మాండం యొక్క సమస్త గుణాలు ఈ బ్రహ్మాండమంతా ఎట్లా సిద్ధిస్తున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ స్మృతిని రెండు విధాలుగా మనం ఇక్కడ చెప్పుకుందాం. 1. మాయోపహిత స్మృతి : ఈ స్మృతి కల్పిత విశేషములపై ఆధారపడి ఉన్నది. సత్య పదార్థ శూన్యం, కల్పితం, మొదలే భ్రాంతిమయము అయివున్నది. భ్రాంతి సంస్కారాలచే జనించినదై ఉన్నది. అద్దాని యందు మాత్రం కార్య కారణత్వముల కల్పన సంభవమౌతోంది.

2. సత్యవస్తు స్మృతి : సత్య పదార్థము యొక్క (ఆత్మ వస్తువు యొక్క) అనుభవస్మృతి వాస్తవానికి సంభవించదు, సత్య వస్తువు స్మృతి కాదు. అది స్వానుభవరూపం కాబట్టి.

ఆ బ్రహ్మ స్తమ్బపర్యన్తం దృశ్యం కించిన్న విద్యతే |

యత్ర, తత్ర కథం, కీదృక్, కుతః స్యాత్ సంభవః స్మృతేః

కాబట్టి రామచంద్రా! ఎచ్చటైతే బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డిపరక వరకు గల సమస్త దృశ్యము వాస్తవానికి కొంచెమైననూ ఆత్మకు వేరుగా లేకయే ఉన్నదో... అచ్చట ఇక ఏ స్మృతి ఎట్లు సంభవించగలదు చెప్పు? ఈ దృశ్యం గనుక వాస్తవానికి ఉత్పన్నమై, విద్యమాన దశయందు ప్రమాణములచే అనుభూతమౌతూ ఉంటే అప్పుడు దృశ్యమునకు పూర్వకాల స్మృతి కారణమగు చున్నదని అనవచ్చేమో? కానీ ఈ దృశ్యము స్వప్నదృశ్యములాగానే ఉత్పన్నము అయి ఉండనే లేదు. తత్త్వజ్ఞులకు ఇది సత్యముగా నిరూపణ కావటం లేదు. ఎవరు ఎట్టి దృష్టితో చూస్తే అట్లు అనుభూతమయ్యే ఈ దృశ్యమునకు 'ఇది సత్యము' అనునదేది? ఎక్కడ ఈ రీతిగా దృశ్యమే లేదో ... అక్కడ “స్మృతి యొక్క కల్పన ఎక్కడిది?

అత్యంతాభావఏవ అస్య దృశ్యస్య కిల సర్వదా,

సర్వం బ్రహ్మేతి సత్యార్థాం తత్ స్మృతేః కలనాః కుతః?

ఈ విధంగా వాస్తవానికి... 1. ఈ దృశ్యం యొక్క అత్యంత అభావం (స్వతహాగా ఏమాత్రం లేనిదిగా) సిద్ధించుచున్నది. 2. ఒకవేళ; "దృశ్యం అనుభవమౌతోంది కదా!" అని అంటే... అట్లా దృశ్యంగా విద్యమానమయ్యేదంతా సదా బ్రహ్మమే అయివున్నది. ఇక బ్రహ్మమునకు వేరుగా దృశ్యం యొక్క కల్పన ఎచట?

ఈ కారణం చేత ప్రజాపతికి 'ఆదిస్మృతి'యే సంభవించనేరదు. ఎందుకంటే, శుద్ధ జ్ఞాన రూపుడగు ఆతనికి దేహమేది? దేహమే లేనివానికి స్మృతి ఎక్కడిది? బ్రహ్మదేవునికి వాస్తవానికి 'పూర్వజన్మ' ఉండి ఉంటే, అప్పటి శరీరత్వ భావనావశముచే ఇపుడు నేను జగత్తంతా శరీరముగా కలిగియున్నవాడను”... అని అనుకుని ఉండేవాడేమో? కాని లౌకిక జీవునివలె ఈతడు తండ్రి, ఈతడు నా తాత మొదలైన లౌకిక స్మృతులు బ్రహ్మదేవునికి (స్మృతిచే) జనించవు కదా! లౌకికమైన పితృ-మాతాది సంబంధాలు గృహబద్ధులైన జీవులు కలిగి ఉంటున్నారు. కాబట్టి స్మృతికి యోగ్యు

Page:535

లగుచున్నారు. కాని, బ్రహ్మదేవుని ఉపాసనా విషయమైనట్టి ఈ జగత్తు మనోరాజ్యము వంటిది కూడా కాదు. ఎందుచేతనంటావా?

స్కృతి = (ప్రాపంచకమైన అర్థం రీత్యా) అనుభూతమైనట్టి భూతకాలిక పదార్థముల యొక్క సంస్కారముల వశంగా వర్తమానంలో ఏర్పడే స్మరణయే “స్మృతి”.

ప్రజాపతికైతే (సృష్టికర్త / బ్రహ్మదేవునికి) కల్పాదియందు పదార్థములే లేవు. కాబట్టి ఆతనికి స్మరణము’ తో కూడిన 'స్మృతి' ఎక్కడిది?

ఏవం హి ఖల్విదం బ్రహ్మ పరమేవాచలం యతః అనాది మధ్య పర్యన్తం కుతః స్మృత్యాదయస్తతః ?

ఈ ప్రకారంగా ఈ సమస్తమూ కూడా ఆది మధ్యాంతరహితమగు కూటస్థ పరబ్రహ్మమే అయివుండగా, ఇక స్మృత్యాదులు ఎక్కడివి? ఎవరివి?

ఇక నీవు, చైతన్యం సమస్త పదార్థముల యొక్క ఆత్మయే అయివున్నది. కాబట్టి స్మృతి కూడా చిదాకాశం యొక్క స్ఫురణయే అయివున్నది. పూర్వ ప్రజాపతి యొక్క - వర్తమాన ప్రజాపతి యొక్క ఆత్మ ఒక్కటే అని అంటావా?... అది మేమూ (వేదాంతవాదులు) ఒప్పుకుంటున్నాం. 1."ఏది కలదో... అదంతా బ్రహ్మమే

2. సృష్టికర్త సృష్టిరూపంగా వ్యవహరించినప్పటికీ సర్వదా ఆతడు స్వయమాత్మరూపుడుగా పరమశాంతుడై ఉన్నాడు.

స్వప్నద్రష్ట పరమశాంత స్వరూపుడై ఉండియే, స్వప్నంలో అనేక విశేషాలు దర్శిస్తున్నాడు... అనునదే ఇందుకు దృష్టాంతం... అని నేను చెప్పియే ఉన్నాను కదా! ఆత్మయొక్క అజ్ఞాత బ్రహ్మ స్వభావమే స్మృతి రూపంగా స్ఫురించటం జరుగుతోంది. నేను బ్రహ్మమును అనే సమగ్ర స్వస్వరూప తత్త్వమును కించిత్ ఏమరచి... "నేను సృష్టికి కర్తృత్వం వహించే బ్రహ్మదేవుడను అనునట్టి ఉపాసనా రూపముచే బ్రహ్మరూపమగు ఆత్మయే మరల మరల అభ్యస్తమై ఉపాసనా ఫలరూపమగు బాహ్య పదార్థం వలె (ఉపాసనచే) కల్పితమైన ఆకాశం యొక్క సాదృశ్యముచే భాసిస్తోంది. అజ్ఞానోపహితమగు బ్రహ్మంచే (జీవుని ద్వారా) ఏఏ పదార్థం ఎట్లెట్లు ఎరుగబడు చున్నదో... ఆ ఆలంబనం యొక్క ఫలితంగా అట్టి ఆకారముతోడనే కూడి ఉంటోంది. అట్లు ఆ ఆకారము దర్శించు స్వభావమే 'స్మృతి' చే ఉద్దేశింపబడుతోంది.

'మృగతృష్ణ' అనే భ్రాంతియందు 'జలతరంగాకారము' అనే దృశ్యం భాసిస్తున్నట్లుగా స్మృతి యందు అవిద్యమానమైన ఆయా పదార్థములు భాసించుచున్నాయి.

స్మృతి = సత్యస్వరూపమైన సర్వాత్మకమగు పరబ్రహ్మము నందు / సమక్షంలో సాదృశము లగుచూ స్ఫురించే చైతన్య వృత్తులు.

ఈ విధంగా 'స్మృతి' అనబడేది సర్వాత్మకమగు చిద్రూప పరబ్రహ్మమునందు అద్దాని అవయవముల వలె ఉంటున్నాయి. ఈ స్మృతుల విషయముల వైపుగా ఉన్ముఖమై ఉండటం చేత పరోక్షములుగా అగుపిస్తున్నాయి. స్వతఃగా స్మృతులు కూడా చిద్రూపమునకు అపరోక్షములై ఉన్నాయి.

Page:536

ఈ విధంగా ఏ సంవిత్తు కాకతాళీయంగా (ఆకస్మికమైన ఉద్బోధవశంగా భాసించుచున్నదో, .అద్దాని స్వరూపము పేరే స్మృతి" సంవిత్తు అనబడేది. సర్వాత్మకమగు పరబ్రహ్మము యొక్క స్వాంగభూతమై, సద్రూపమై స్వతఃగా స్ఫురిస్తూ అభ్యస్త పదార్థము యొక్క సాదృశ్యము వలన ప్రకాశించుచున్నప్పుడు... అదియే స్మృతి.

వాయువు యొక్క చలనమునకు హేతువు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. మొత్తంమీద వాయు తరంగాలు అనుభవమగుచున్నాయి కదా! అట్లాగే హేతు సహితంగానో, హేతురహితంగానో అభ్యాసముచే రూఢిపడిన పదార్థముల గూర్చిన వృత్తుల 'సాదృశము' వలన ఏర్పడుచున్న దానినే లోకంలో 'స్మృతి' అని పిలుస్తున్నారు.

ఓ రామచంద్రా! నీ మనస్సు ఒకప్పుడు చేతులలోనో, కాళ్ళలోనో, తదితర అవయవములందో సంలగ్నమైనప్పుడు... ఆయా చోట్ల సంవిత్తు అనుభవరూపంలో భాసిస్తోంది కదా! అట్లాగే... చైతన్యము యొక్క కల్పిత అవయవభూతమే సంవిత్తు అయివున్నది.

ఆ సంవిత్తు కాకతాళీయ న్యాయంచేత ఒకానొకప్పుడు వేరే కాలపు వ్యవహారములందు స్ఫురిస్తూ ఉంటుంది. అట్టి సంవిత్ ప్రకాశము యొక్క పూర్వ సంబంధ విషయములకే 'స్మృతి' అనే పేరు పెట్టబడినది. స్మృతికి ముందే ఆ స్మృతిని వ్యవస్థీకరించుచున్న జీవాత్మ ఉండనే ఉన్నది కదా! అదియే పరమాత్మ స్వరూపం!

ఓ రామచంద్రా! ఇక్కడ స్వప్నమును, ఇంద్రజాలమును దృష్టాంతంగా తీసుకుందాం! ఈ రోజు రాత్రి నీకు వచ్చిన కలలో ఒకానొక స్వప్న ప్రపంచం కనబడటం, అందులో నీవు విహరించి ఉండటం జరిగిందని అనుకుందాం! ఆ స్వప్నలోకంలోని ఆయా విశేషాలే కనబడటానికి కారణం? కొంత స్మృతి అయివుండవచ్చు. (లేక) పూర్తిగా స్మృతికి సంబంధించినది అయి ఉండవచ్చు. ఒక్కొక్కసారి స్మృతికి ఏమాత్రం సంబంధించకపోయి ఉండకపోవచ్చు. స్మృతియా? విస్మృతియా? అల్ప స్మృతియా? అత్యంత నూతనమా?"... అని ప్రశ్నిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వప్నం ఒక్కొక్క రీతిగా ఉంటోందే గాని, "ఇది స్మృతియే! (లేక) స్మృతి కాదు!" అని ఏమీ చెప్పలేం. అయితే మిథ్యా జ్ఞానంలో ఘట-వస్త్రాది ఆయా వస్తువులన్నీ కనిపించి, అవి సత్యమువలె అనుభూతమవటమే స్వప్నం”... అని మాత్రం అనగలం. ఏది ఏమైనప్పటికీ... స్వప్నంలోని పదార్థాలన్నీ ఆకస్మికంగా భాసిస్తున్నాయి కదా! అట్లాగే, ఆత్మయందు సర్వరూపములగు సంవిత్తులు కలవు. అవి ఆయా సమయములందు (స్వపాంతర్గత విషయములవలె) ఆకస్మికంగా భాసిస్తున్నాయి. ఈ విధంగా ఈ సృష్టి ఆకస్మికమేగాని... స్మృతిమాత్రం కాదు అని చెప్పబడుతోంది.

ఓ రామచంద్రా! "ఈ రోజు స్వప్నంలో ఆ భవనమే ఎందుకు కనిపించింది? ఆ వ్యక్తులే ఎందుకు కనిపించారు? ఆ సంఘటనలే ఎందుకు కనిపించాయి?... అని స్వప్న పదార్థముల మూలమును ఎవరైనా విచారిస్తున్నారా? లేదు. ఎందుచేత? ఏది ఎట్లా కనిపించినప్పటికీ స్వప్నంలో కనిపించింది భ్రమయే కాబట్టి. స్వప్న సమయంలో అదంతా “నిజమే కదా! అని పొరబడినప్పటికీ,

Page:537

జాగ్రత్ సమయానికి స్వప్నాంతర్గత విశేషాలన్నీ అసత్యమై తెలియవస్తున్నాయి. అట్లాగే జాగ్రత్లోని ఆయా సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, అనుబంధ విఘాతములు, మిత్ర శత్రుభావనలు, ఇష్ట-అయిష్ట అనుభూతులు - - ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం ముందుసూర్యగోళము సమక్షంలో దీపపు బుడ్డీలవలె అగుచున్నాయి. అటువంటప్పుడు భ్రమమయమగు ఈ స్మృతి పదార్థముల యొక్క మూలమును గురించి ఎందుకు విచారిస్తున్నావో చెప్పు?

జ్ఞాని యొక్క దృష్టిలో... ఈ దృశ్యమే అసంభవమైయున్నది. కనుక వాస్తవానికి “స్మృతి” అనునది మొదలే లేనిది' అగుచున్నది. ఆతని అవగాహన యందు ఈ జగత్తు... పరమాత్మఘనమై, చిదాకాశమాత్రమై, యథారీతి సదానిర్వికారముగానే... ఉండివున్నది.

ఇక, అజ్ఞానియొక్క దృష్టియందో... ఈ జగత్తు దృశ్యరూపంగాను, సత్యముగాను - భాసించటం జరుగుతోంది. అందుచేతనే ఆతనికి (అజ్ఞాన దృష్టిని కొనసాగించుచున్నవానికి) భూతకాలంలో అనుభూతములైన పదార్థములూ, వాటికి సంబంధించిన స్మృతియు 'సత్యము’గా తోచుచున్నాయి. అప్పుడాతడు ఆయా సంబంధిత వర్తమాన పదార్థములందు పూర్వ - అపూర్వ అనుభవ, ఊహలను జోడించి దర్శిస్తూ తన్మయుడగుచున్నాడు. అందుచేతనే నిర్వికారుడై ఉండలేక పోవుచున్నాడు.

శ్రీరాముడు : హే మహాత్మా! అజ్ఞాని - - తత్త్వజ్ఞానుల పరస్పరానుభవం గురించి-(ఈ స్మృతి”ని గురించి చర్చించుచున్న ఈ సందర్భంగా) మరికొన్ని విశేషాలు వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి :

న మోక్షోపాయ కథనం న చ జానామి తత్సితిమ్ | సందేహాదివ జిజ్ఞాసుం తావత్ మోక్ష కథోచ్యతే, యావత్ దృశ్యమ్ స్మృతిశ్చైవ సంస్మృతిశ్చాస్య శామ్యతి ||

ఓ రామచంద్రా! 'పూర్ణ తత్త్వజ్ఞాని'కి మోక్షోపాయము గురించిన కథన రచన చేయవలసిన ఆవశ్యకతయే ఉండదు. అజ్ఞానికి దృశ్యముపైగల నమ్మకం చేత మోక్షపాయ కథనాలు చెప్పినా లాభం ఉండదు. కనుకనే ఈ కథన రచన జిజ్ఞాసువు కొరకే!

ఇక అజ్ఞాని తత్త్వజ్ఞాని గురించి ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాడనేది రెండు రకాలుగా ఉంటోంది. 1. ఈతడు పట్టించుకోవలసింది వదిలేసి చాదస్తంగా అనవసరమైనది పట్టుకొని వ్రేలాడుచున్నాడు. 2. ఈతడొక పిచ్చివాడు, అమాయకుడు, అనవసరంగా మోసగించబడుచున్నాడు. ఇదే అభిప్రాయం తత్త్వజ్ఞాని అజ్ఞాని గురించి కూడా కలిగి ఉంటున్నాడు.

అయితే ఇక్కడ ఒక విశేషం. ఆ అజ్ఞాని కూడా సౌభాగ్యవశంగా సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకొన్నప్పుడు ఈ దృశ్యము యొక్క తత్త్వ స్వభావముల పట్ల సందేహములు పొందినవాడై జిజ్ఞాసువు అగుచున్నాడు. అట్టి జిజ్ఞాసువు తత్త్వజ్ఞుడగు గురువును (మార్గదర్శకుని) సమీపిస్తున్నాడు. ఆత్మతత్త్వజ్ఞానమునందు అనుభవశీలుడగు ఆ గురువు ఆ ముముక్షువైనట్టి (మార్గాన్వేషి అయినట్టి)

Page:538

ఆశ్రిత శిష్యునికి ఆతనియొక్క దృశ్య సశాంతి" కొఱకై మోక్ష కథన రూపమగు మోక్ష శాస్త్రమును విశదీకరిస్తున్నాడు. అట్టి ఉపదేశము యొక్క ప్రభావముచే ఆ ముముక్షువు యొక్క దృశ్యము శమించినదై, ఇక ఆపై అవిద్యచే జనించిన స్మృతికథనం మొదలైనవి ఆతనిపట్ల ఈ జగత్తు స్మృతి యొక్క ఫలమా? ఏక ఆత్మయొక్క విస్మృతియా? ఇదంతా కాకతాళీయమా? లేక ఇది కార్య-కారణ పరంపరయా?" అనే సందేహాలు పటాపంచలై పేరు లేకుండా అదృశ్యమైపోతున్నాయి.

ఏ విధంగా అయితే తత్త్వజ్ఞల జగత్ దర్శన విశేషం ఎటువంటిదో అజ్ఞులు (దృశ్యముపై ఇది నిజమే కదా!”... అనే మూర్ఖత్వముతో కూడిన నమ్మకము గలవారు) ఎరుగ లేకపోతున్నారో... అట్లాగే మూర్ఖత్వము - - మోహములతో కూడిన అజ్ఞులకు ఏ అనునిత్యమైన సత్యము (శాశ్వతమైన విశేషం) ఈ దృశ్యములో అగుపిస్తోందో... అది తత్త్వజ్ఞులకు తెలియటం లేదు. కళ్ళు వినటం, చెవులు చూడటం జరుగదు కదా! సూర్యునికి రాత్రి అనుభవం ఉంటుందా? ఉండదు కదా! అట్లాగే తత్త్వజ్ఞుల తాత్త్విక దృష్టి అజ్ఞులకుగాని, అజ్ఞుల భోగాశ-నిరాశ దురాశ పరనిందలౌకికాశయములు మొదలైన వాటితో కూడిన వస్తు దృష్టి తత్త్వజ్ఞులకుగాని తెలిసిరావటం లేదు. శ్రీరాముడు : మహర్షీ! "సంసార మని దేనిని ఉద్దేశించి అంటున్నారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : అంతఃకరణసహిత చైతన్యంలో బాహ్యవస్తు సేవనం చేత బాహ్య వస్తుస్వరూపం భాసించటం జరుగుతోంది. అట్టి బాహ్య వస్తు స్వరూపము మరల మరల వ్యవహారముల ద్వారా అభ్యస్తమై అంతరంగమున నాటుకొనుచున్న స్థానమే “చిత్తము”. అట్టి చిత్తము ఇష్ట - అయిష్టాలతో కూడి వాసనారూపమై ఉండటం చేత అదియే “సంస్కార మని శాస్త్రకారులచే పిలువబడుతోంది.

అయితే... తత్త్వజ్ఞానుల దృష్టియందు మాత్రం అట్టి "సంస్కారం, చిత్తం, మనస్సు, బుద్ధి మొదలైన సమస్త పరికల్పిత పదార్థములు కూడా (అధిష్ఠాన దృష్టిచే) ఆత్మస్వభావ భూతములే అయి ఉంటున్నాయి. దర్పణంలో కనిపించే దృశ్యము దృశ్య దృష్టిచే దృశ్యముగా... దర్పణ దృష్టిచే దర్పణమాత్రంగా గమనించబడుచున్నది. కదా! అవన్నీ ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ (జ్ఞానదృష్టిచే) దగ్ధపటన్యాయమువలె (అగ్నిచే కాల్చబడిన వస్త్రం వస్త్రాకారము కలిగియున్నప్పటికీ వస్త్రమువలె ఉపయోగపడనట్లుగా)... అభాసగా ఉండీ ఆత్మకు వేరుగా లేనట్లే అగుచున్నది. వాటి యొక్క సాదృశ్యత్వం జ్ఞానుల దృష్టి యందు మొదలే తుడిచివేయబడినదై ఉంటోంది. అందుచే తత్త్వవేత్తల దృష్టిలో దృశ్యమే లేనప్పుడు ఇక దృశ్య సంసారమెక్కడిది? అది ఎప్పుడూ సంభవించకయే ఉన్నది. మృగతృష్ణలో జలం ఉండదు. "స్వప్న పదార్థములు అసలు పదార్థములే కాదు”... అను అవగాహన వలె, జ్ఞానులకు- ఈ సృష్టి మొదలే లేనిదై, సృష్ట్యాదియందే అసలే భాసించినదై ఉంటోంది. "దృశ్యము వస్తుతః లేదు అనే నిశ్చయమును వారు సర్వదా కలిగియే ఉంటున్నారు.

పరమాత్మ రూపమగు చిదాకాశమే తనయందు ఇట్లు జగత్ రూపంగా స్థితినొంది ఉన్నది. కాబట్టి 1. చిదాకాశము, 2. సృష్టి అనబడు రెండు శబ్దములూ పర్యాయ పదములే అయివున్నాయి.

Page:539

1. బ్రహ్మము తనయందు తానే ఇట్లు జగత్తురూపంగా భాసిస్తోంది. 2. (బ్రహ్మమునకు వేరైనట్లు) మిథ్యగా ఈ జగత్తు భాసిస్తోంది. 3. బ్రహ్మమే సృష్ట్యాది యందు జగత్తువలె స్థితినొందియున్నది.

అంతా బ్రహ్మము రూపమే అయివుండగా ఇక ఇందులో గ్రాహ్యం యొక్క త్యాజ్యం యొక్క భాసనమేమున్నది? బ్రహ్మరూపమే అయినట్టి జగత్ చమత్కారంలో ఆకారవంతమైనది గాని, స్మృతి సంబంధమైనదిగాని సంభవించనే సంభవించదు. పరమాత్మ యందు జగత్తు భాసించటానికి ఉపాదాన కారణమంటూ (కుండ తయారవటానికి ఉపాదాన కారణం కుమ్మరిలాగా) ఏదీ పరిశీలనకు కించిత్ కూడా లభించటం లేదు. కాబట్టి... పరమాత్మ స్వరూపమే ఇట్లు జగత్తుగా అజ్ఞానదృష్టిచే భాసించుచున్నదగుచున్నది.

శ్రీరాముడు : స్వామీ! సాధన కొరకై ఈ జగత్తు సాకారమను భావన ఉచితమా? నిరాకారమను భావన ఉచితమా?

శ్రీ వసిష్ఠ మహర్షి : "ఈ జగత్తు సాకారము అనే భావనను ఉపాసించే వారికి పుత్రుడు మొదలైనవారి మరణం యొక్క స్మృతియందులాగా... ఇద్దాని స్మృతి యందు కూడా దుఃఖం కలిగే అవకాశముంది. ఎందుకంటే... సాకారమైనదంతా నిరంతరం మార్పు చేర్పులు చెందుతూనే పోతోంది కదా!

ఈ జగత్తు యొక్క ఆకారము, అద్దాని స్మృతి... రెండూ కూడా మిథ్యయే! మిథ్య అయినది స్వయంగా బంధం కలిగించగలదా? లేదు. ఈ భూతాకాశమునందు కనిపించే నీలత్వంలాగా... చిదాకాశమునందు ఈ జగత్తు కూడా శూన్యరూపంగా వర్తించుచున్నది.

స్వప్నంలో విశాలమైన దిక్కులు, ఆకాశం మొదలైనవి కనబడుచున్నాయి. అవి ఎక్కడి నుండి అక్కడికి వచ్చాయి? స్వప్నంలో చిదాత్మ తనయొక్క చిదాత్మ నిజ స్వరూపమును త్యజించకుండానే ఆయా దిక్కులు, భూమి, ఆకాశము, కాలము మొదలైన వాటితో కూడిన జగద్రూపంగా భాసిస్తోంది కదా! ఎందుకంటే స్వప్న సమయంలో స్వప్నద్రష్టకంటే వేరుగా అక్కడ ఎవరూ లేరు. పోనీ, వేరుగా ఎవరైనా స్వప్న దృశ్యం కల్పించటానికి కారకులా? కాదు. కనుక స్వప్నమంతా కూడా స్వప్న ద్రష్టరూపమే! అట్లాగే పరబ్రహ్మము తన శుద్ధ సచ్చిదానంద స్వరూపమును త్యజించకయే ఈ సూర్య, చంద్ర, పర్వతాది రూపములుగా స్థితినొందియున్నది.

ఏ విధంగా తన శుద్ధ చిదాకాశ స్వరూపమును త్యజించని చిదాకాశము యొక్క అంతరమున స్వానుభవమాత్ర స్వరూపమై స్వప్న ద్రష్ట యొక్క స్వప్న పురము విద్యమానమగుచున్నదో... అట్లాగే ప్రతి జీవుడు తన చిదాకాశ స్వరూపమునందే ఈ జగత్తును గాంచుచున్నాడు. అనగా, తన స్వరూపమునకు అనన్యమైన దానియందే ఈ సర్వ దృశ్య వ్యవహారములను సందర్శించుచున్నాడు. సృష్టి యొక్క ఆదియందు కూడా (స్వప్నమందు లాగానే) పృథివి మొదలైనవి ఉత్పన్నమే కాలేదు. బ్రహ్మ సత్తయే సృష్ట్యాది యందు జగత్ రూపంగా భాసిస్తోంది.

Page:540

పరమాత్మయే "హిరణ్మగర్భుడు అనబడే సమష్టి మనోరూపమును ధరించి, స్వకీయ భావనానుసారంగా సృష్టియొక్క కల్పనను గావించి, అద్దానియందు ప్రవేశించి, "ఇది మట్టి, ఇది రాయి, ఇది గోడ, ఇది ఇల్లు... ఇత్యాది సంజ్ఞలను గావించుచున్నాడు. అయితే పృథివి మొదలైన వాటి ఉనికియే అసంభవం. అందుచేత, ఈ జగత్తు బ్రహ్మదేవుని స్మృతి రూపమూ కాదు, సాకారమూ కాదు. భ్రాంతీ కాదు. వివర్త రూపమూ కాదు.

ఇది కేవలం బ్రహ్మమే! అట్టి బ్రహ్మము సృష్టి - - ప్రళయములందు కూడా తన నిర్వికార చిత్ స్వభావమునందే వెలయుచున్నది. అదియే రమణీయమగు ఈ జగత్తుగా కూడా భాసిస్తోంది. ఈ విధంగా సృష్టి - ప్రళయ - దృశ్య రూపములుగా భాసిస్తున్నప్పటికీ ఆ బ్రహ్మము సర్వదా ఏకము నిర్మలము ప్రశాంతము - నిత్యోదితము అయిన చిదాకాశముగానే చెన్నొందుచున్నది.

15. చైతన్యము యొక్క అనేక విన్యాసములు

శ్రీరాముడు : హే మునీంద్రా! సర్వానుభవరూపము, అనంతము, సర్వ స్వరూపము అయినట్టి ఆత్మయొక్క చమత్కారమే ఈ జగత్తు"..... అని మీరు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నారు కదా! అంతా ఆత్మయే అయినప్పుడు అద్దానికి దేహంలోనే "అహమ్అనే భావన కలిగివుండటం, ఒక రాయి కొండ మొదలైన జడ పదార్థములందు అహంభావము కలిగి ఉండకపోవటం... ఎందుకు జరుగుతోంది? అన్ని వస్తువుల యందు ఆత్మ అహంభావము కలిగివుండవచ్చు కదా! జడములందు 'నేను' అనునది ఎందుకు కలిగివుండటం లేదు?

ఆ చైతన్యము చైతన్య విరుద్ధములైన గోడ రాయి మట్టి-ఇల్లు వంటిరూపములను జాగ్రత్స్వప్నాలలో ఎందుకు కలిగి ఉంటోంది? చైతన్యము సర్వదా చైతన్యమే అయినప్పుడు,.

జడరూపములనేవే ఉండకూడదు కదా!

రాయి, కట్టె చైతన్యరూపం కాకపోయివుంటే అవి 'లేవు' అనటానికి వీలులేదు కదా! కనుక చైతన్యమునకు వేరైనది ఉన్నట్లే కదా! మరి చైతన్యం 'అనన్యం' అనటమెట్లా? రాయి, కట్టె చైతన్య రూపములే అయివుంటే, అవి జడరూపములే కదా! చైతన్యము 'సత్' అని, అందుకే అన్యమైనది 'అసత్' అని గదా సిద్ధాంతం!

కాబట్టి చైతన్యము సర్వరూపమైనది అనెడి జడవస్తువుల పట్ల ఎట్లా సిద్ధిస్తుంది? ఒక శరీరంవలెనే రాయి జడమా? చైతన్యమా? చైతన్యమునకు జడత్వం కూడా (రాయిలో) సిద్ధిస్తోందా? అది ఎట్లా? (లేక) చైతన్యం కొన్ని కొన్ని చోట్ల జడంగా ఉండిపోతోందా ఏమి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! మంచి ప్రశ్నే అడిగావు. "చైతన్యము చైతన్య విరుద్ధమైన జడరూపమగు రాయి, కట్టెగా కూడా అగుచున్నదా?... అని కదా నీ ప్రశ్న? కదిలే శరీరాలు చైతన్యమనవచ్చునుగాని, కదలని రాయి, కట్టె చైతన్యము లెట్లా అవుతాయి? అవి చైతన్యము కాకపోతే, మరప్పుడు 'సర్వజగత్

Page:541

చైతన్య స్వరూపమేవ'... అనే సిద్ధాంతం కుదురదు కదా! కట్టె - రాయి చైతన్యం కాకపోతే, అప్పుడు చైతన్యం కొన్నిచోట్ల జడంగా కూడా ఉంటుందా?... అని కదా నీ సందేహా?

సరే! జడంగా కనిపించే రాయి - కట్టె ఎట్లా చైతన్య స్వరూపములో వివరిస్తాను విను.

దేహధారియగు జీవుడు అనే చైతన్యం విశ్వరూప చైతన్యం

1. దేహధారియగు జీవునకు శరీరమంతా 1. సర్వరూపమగు చైతన్యమునకు కూడా అట్లాగే అహంకారం (నేను అను భావన) ఉన్నప్పటికీ కూడా దేహము నందు మాత్రమే దేహమునకు చేతులలో మాత్రమే ‘ఇవి నా చేతులు' అనే అహం సంబంధించిన అహంభావం ఏర్పడుతోంది. అట్లే భావం, కళ్ళ వద్ద మాత్రమే 'ఇవి నా కళ్ళు' అనే భూమి - ఆకాశం - రాయి మొదలైన వాటిపట్ల అహంభావం ఏర్పడుతోంది. పాదాల వద్ద పాదాలకు ... ఆయా పరిమిత అహంభావములు కలిగి సంబంధించిన అహంభావం మాత్రమే ఏర్పడు ఉంటోంది.

తోంది.

2. వృక్షాభిమానియగు జీవుడు వృక్షమంతటా 2. సర్వరూపమగు చైతన్యం వృక్షంలో వృక్ష అహం’ భావము సమంగా కలిగివుంటాడు. కాని సంబంధమైన అహంకారం, పర్వతంలో పర్వత ఆకులలో ఆకులకు సంబంధించిన అహంభావం, సంబంధమైన అహంకారం, మానవులో మానవ కాండము వద్ద కాండమునకు సంబంధించిన దేహాహంకారం వేరు వేరుగా కలిగి ఉంటోంది. అంతే అహంభావం కలిగి ఉంటాడు. కాని, మానవుని యందు పర్వతాహంకారం కలిగి ఉండటం లేదు.

3. ఆకాశాభిమానియగు జీవునకు శూన్యత్వం 3. చైతన్యానికి శూన్యం నందు శూన్యమేవాహం నందే శూన్యత్వమును గూర్చిన అహంభావం భావం, మణి - సువర్ణాది ద్రవ్యముల పట్ల ద్రవ్యత్వ ఉంటోంది. ఆతనికి వస్తురూప-దేహరూప" అహంభావం కలిగి ఉన్నదగుచున్నది. అహంభావం ఉండటంలేదు.

4. స్వప్నద్రష్టకు నిరాకారరూపమగు స్వప్న పురం 4. సర్వరూపమగు చైతన్యమునకు స్వప్నమందు పట్ల స్వప్న రూపత్వానికి సంబంధించిన అహం స్వప్నాహంభావం, జాగ్రత్ నందు జాగ్రదాహం భావం భావం ఉన్నది కదా! కలిగినదై ఉంటోంది.

5. మహాపర్వతాభిమానియగు జీవుడు 'ఇది నా 5. సర్వాత్మ” యగు చైతన్యమునకు మహా పర్వత శిలారూపం, ఇది నా వృక్ష రూపం, ఇది నా పుర ఆదిగా అహంకారాలు ఉండి ఉంటున్నాయి. జలరూపం' ... ఇత్యాది వివిధ అహంకారములు అయ్యది సర్వాహంకార రూఎం (ఇదంతా నేనే -

కలిగి ఉంటున్నాడు. అనే అహంకారం) కలిగి ఉన్నదై ప్రదర్శితమౌతోంది.

6. చేతన రూపియగు ఈ దేహి దేహమునకు 6. సర్వరూపమగు చైతన్యము కాష్ఠ - శిలాదులపట్ల “గోళ్ళు - వెంట్రుకలు మొదలైన అచేతనములు (కొయ్య-రాయి పట్ల) కాష్ఠ - శిల అవయవత్వము కలిగి ఉండాలి" అనే పట్టుదల కలిగియే ఉన్నాడు. - జడత్వము ధరిస్తోంది.

Page:542

7. మనుజుడు చైతన్య స్వరూపుడే కదా! 7. "సర్వస్వరూపుడు, శుద్ధ చైతన్య ఆతని దేహమో ... గోళ్ళు, వెంట్రుకలు, రక్తం, స్వరూపుడు" అగు పరమాత్మ శరీరమగు ఈ జగత్తు ఆకాశం ఇత్యాది ధర్మాలు కలిగి ఉన్నదై చేతన కూడా స్థావరజంగమాత్మకాలతో, చేతన - అచేతనాత్మ కమై శోభాయమానంగా వెలుగొందు అచేతనాలతో కూడి శోభాయమానమై ఉన్నది. చున్నది కదా! అయినప్పటికీ ఇదంతా నిరాకారం, యథాతథం. 8. జీవుడు కలలో అనేక దృశ్యాలు వాస్తవమే 8. ఈ జగత్తు కనిపించవచ్చుగాక. కానీ కదా అనే బుద్ధితో చూస్తున్నాడు. మెలకువ సమ్యక్ జ్ఞానముచే ఇదంతా శమించినదై జడ + రాగానే...? స్వప్నాంతర్గతమైన స్వప్న భ్రమ క్షణంలో చైతన్యాలుగా కాకుండా కేవల శుద్ధ చైతన్యంగా తొలగి పోతోంది. అగుపిస్తోంది.

9. అతిదీర్ఘమైన అనేక బీభత్సాది విషయా 9. అట్లాగే... ఆత్మజ్ఞానము పొందిన తరువాత లతో కూడిన స్వప్నం నుండి తెల్లారి మెలుకువ ఇక ఈ దృశ్యము - ఇద్దానిని దర్శించే ద్రష్ట. రాగానే ...ఆ స్వప్నాంతర్గత విశేషాలు, స్వప్నం, ఆ ఇరువురూ కూడా చిదాకాశమాత్ర రూపులై తెలియ స్వప్నద్రష్ట మటుమాయమై పోతున్నారు కదా! ఇక వస్తున్నారు. జగత్తే బ్రహ్మమగుచున్నది. ఇక జడ - స్వప్న ద్రష్ట లేడు, స్వప్నం లేదు. ఏమయ్యారు? చైతన్య భేదమెక్కడ? బ్రహ్మమే ఈ జగత్తు! మౌనరూపచిన్మాత్రాకాశంగా పరిణమిస్తున్నాడు కదా!

10.సముద్రంలో అసంఖ్యాక తరంగాలు పెల్లు 10. చిదాకాశము అనే మహా సముద్రంలో

బుకుతున్నాయి. సముద్రంలో అటు ఇటూ సంచ చిదాకాశానికి అనన్యమైనట్టి అనేక కోట్ల “సృష్టులు” రిస్తున్నాయి. ఆ తరంగాలన్నీ కాలాంతరంలో ఏమి అనే తరంగాలు ఉత్పన్నమై, కొంత కాలం కనిపించి కానున్నాయి? ఏ జలంలోనుంచి బయల్వెడలు మరల చిదాకాశమునందే విలీనమైపోతున్నాయి. చున్నాయో... ఆ జలంలో ఆకారాదులన్నీ త్యజించి అయినా కూడా, అసంఖ్యాక సముద్ర తరంగాల విలీనమవుతున్నాయి. వలె అసంఖ్యాక సృష్టులుగా కనిపించినప్పటికీ చిదాకాశము యొక్క “ఏక రూపత్వము”నకు వచ్చే హాని ఈషణ్మాత్రం కూడా లేదు.

11. సముద్రజలం తరంగాలు, బుడగలు, నురుగు, 11.సర్వదా నిర్మల చైతన్యమున చిత్స్వరూపములే ఆవర్తాలు, సుడులు మొదలైన వివిధ రూపాలుగా అగు అనేక సృష్టులు ప్రభవించి మరల ఎప్పుడో ఒకే సముద్ర జలం కనిపిస్తున్నప్పటికీ.... సముద్ర నిర్మల చైతన్యమునందే లయిస్తున్నాయి. అట్టి జలం సర్వదా యథాతథమైయున్నదిచిత్స్వరూపమున తరంగాలు - ఆవర్గాల వలె .

| సృష్ట్యాదిగా అనేక సంజ్ఞలు రచించబడుచున్నాయి.

ఓ రామచంద్రా! అజ్ఞానికి జగత్తులో తనకు సంబంధించినవి - సంబంధించనివి అనేక వస్తు - విషయ - సంఘటన - వ్యక్తుల పరంపరలు అగుపిస్తున్నాయి కదా! అయితే జ్ఞానికి ఈ జగత్తు యథాతథంగా సదా నిర్వికారమగు పరబ్రహ్మముగా విద్యమానమగుచున్నది.

Page:543

జ్ఞానుల నిత్యస్వభావమగు ఆత్మాహమ్ దృష్టిని సుస్పష్టపరచటానికి ఇక్కడ ఒక చమత్కారమైన దృష్టాంతపూర్వకమైన విశేషం చెపుతాను.

నాహం తరంగః, సలిలమహమ్ ఇత్యేవ యుక్తితః బుద్ధం యేన తరన్గేణ కుతస్తస్య తరంగతా?

ఒకానొక మహాసముద్రం ఉన్నది. అద్దానియందు ఎక్కడో, ఎందుకో, ఏదో సమయంలో (సముద్ర జలంలో) ఒకానొక 'తరంగం' ఉత్పన్నమైనది. తదితర తరంగములలాగానే అది సుదీర్ఘకాలం అవిశ్రాంతంగా మహాసముద్ర జలంలో అటూ - ఇటూ సంచరిస్తూ ఎంతో చంచలత్వం, వేదన, శ్రాంతి(Restlessness), శ్రమ పొందినదయింది. అట్టి ఉద్వేగము, వేదనలను తొలగించుకోవటానికి మార్గం అన్వేషించటం ప్రారంభించింది. చివరికి ఆ తరంగమునకు ఎవరో ఉద్బోధించారు. ఏమని?

నీవు జలము నుండియే ఉత్పత్తిని పొందావు. ఆ జలమును చేరగానే నీవు సశాంతిస్తావు... అని. అప్పుడు ఆ తరంగం "జలం ఎక్కడున్నది? అద్దానిని దర్శించి అద్దానియందు లయమొందే ఉపాయమేమిటి?” అని తీవ్రమైన ఆందోళనతో కూడిన అన్వేషణ ప్రారంభించింది. అప్పుడు అద్దానికి మరెవరో ఇట్లా బోధించారు.

ఓ తరంగమా! నీవు జలముతోనే తయారయ్యావు. జలానికి అన్యంగా నీవు లేవు. ఇక తరంగత్వమునకు సంబంధించిన నామరూపాదులు నీ యొక్క భ్రమయే! నీవు జలమునకు వేరైన క్షణమే లేదు. జలమునకు అన్యంగాని నీవు జలం కోసం వెతకటమేమిటి?

పై అంశాన్ని గ్రహించిన ఆ తరంగం పరమానందమును పరమశాంతిని పొందినదై తన జల సంచారము లీలగా, క్రీడగా కొనసాగించసాగింది.

ఇప్పుడు “నేను జలమునే అని గ్రహించిన ఆ తరంగమునకు నేను ఈ తరంగత్వము -

అనే బంధం తొలగించుకునేది ఎట్లా?" ... అనే ఆవేదన ఉండదు కదా! "చైతన్య మహాసముద్రంలోని చైతన్య స్వరూప తరంగమే నేను ...అని గ్రహించిన తరువాత, ఇక, నాకు మోక్షం ఎప్పటికి? ఈ జీవుడు' అనబడే బంధం, ఈ దేహబంధం, ఈ దృశ్యబంధం ఇట్లాగే ఉంటాయా? తొలిగేది ఎన్నటికీ? ...అనే సంశయ -ఆవేదన - ఆందోళనలు ఉండవు.

-

ఈ జగత్తు 'బ్రహ్మము' అనే సముద్ర జలము యొక్క తరంగమువలె భాసిస్తోంది. తరంగం ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా జలము సర్వదా జలమే అయినట్లుగా... 1. జగత్తు, 2. జగత్తు యొక్క అభావము ఈ రెండూ కూడా బ్రహ్మము యొక్క శక్తి చేతనే స్థితిని పొందినవగుచున్నాయి.

ఓ రామచంద్రా! స్వప్నంలో జడ-చైతన్య పదార్థములను గాంచుచున్న స్వప్న ద్రష్ట తన యొక్క స్వప్నమునకు అప్రమేయమైన స్వస్వరూపమును త్యజిస్తున్నాడా? లేదే! అట్లాగే, చిదాకాశము తన శుద్ధ స్వస్వరూపమును కించిత్ కూడా త్యజించకుండానే... పరస్పర ధర్మ-నియమములగు చేతనాభావం కలిగి ఉంటోంది. అట్టి చైతన్యంతో కూడిన సమష్టి భావనా స్వరూపమే “మనస్సు”. ఆ సమష్టి మనస్సే “పితామహుడు, సంకల్ప పురమువలె అకారణుడు, చిన్మాత్ర రూపుడు" అగు ఆది ప్రజాపతి”.

Page:544

ఇప్పుడు సువర్ణాభరణమును దృష్టాంతంగా తీసుకొందాం. ఒక బంగారు భుజకీర్తి (భుజమునకు అలంకరించే ఆభరణం) నేను బంగారంగా అవాలి. బంగారంగా ఉండాలి"... అని ఆవేదన చెందటం ప్రారంభించిందనుకో! ఆ ఆభరణము "నేను బంగారమునే! ఈ ఆకారం ఆపాదితం, ఈ ఆకారం (భుజకీర్తిగా) కలిగి ఉన్నంత మాత్రంచేతగాని, (లేక) ఇది తొలగుటచేతగాని నేను బంగారం కాకపోవట మెక్కడిది?"... అని గ్రహించిన తరువాత, ఇక... అద్దానికి ఆభరణత్వమెక్కడిది? అట్లాగే “నేను సర్వదా చిదాకాశ స్వరూపుడనే అని గ్రహించిన మహనీయునికి ఇక, “ఈ ‘జీవుడు’ అనే బంధం, ఈ అహంకారం, ఈ జన్మలు, ఈ కర్మలు నాకు తొలగేది ఎట్లా?" అనే ఆవేదన ఇంకెక్కడుంటుందయ్యా?

ఈ సృష్టికి కర్త అగు బ్రహ్మదేవుడు సంకల్ప స్వరూపుడు. చిన్మాత్రాకాశ దేహధారి. జన్మ రహితుడు. ఇక ఈ జగత్తులో భాసించే 'అహమ్' మొదలైనవి, అద్దానిని ఆధారంగా కలిగి ఉండి భాసించే తదితరములు... ఇవన్నీ కూడా బ్రహ్మదేవుని స్వరూపమే అయివున్నవి.

ఇక ఈ సృష్టి-స్థితి-లయాలంటావా? ఇవన్నీ కూడా చిదాకాశమున శూన్యరూపాలైన చైతన్య చమత్కృతులే! చిన్మాత్రాకాశము యొక్క స్వయం స్ఫురణయే బ్రహ్మదేవుడు. అట్టి స్వయం స్ఫురణ నిర్మలము, స్వప్నతుల్యము చిత్తత్త్వమాత్రము అయివున్నది. ఆద్యంతరహితమగు చిద్రూపమే స్ఫురణ మాత్రంగా సృష్టి-స్థితి-ప్రళయ విభ్రమరూపంగా స్ఫురిస్తోంది. హిరణ్యగర్భ రూప సమష్టి మనస్సు”... “విరాట్ అని చెప్పబడుతోంది. అట్టి విరాట్ యొక్క సంకల్ప నగరం వంటి నిర్మల స్ఫురణములే ఈ భూ - భువన సమూహ సృష్టి. అనగా ఆ చిదాకాశరూపమగు విరాట్టుయే ఈ సృష్టి.

ఆ విరాట్ ఈ సృష్టిని తన రూపముగా కలిగివున్నాడు. స్వప్నద్రష్టయే స్వప్నరూపముగా అగుచున్నట్లుగా ఈ సృష్టియే ఆతని స్వప్నం. ఆ స్వప్నమే ఈ జాగ్రత్లోని వ్యష్టి - సమష్టి - జడాది దేహరూపములను ధరించుచున్నది. సుషుప్తియే స్వప్నానుభవంగా ఉత్పన్నమగుచున్నట్లుగా... 'అవిద్య' అనే అంధకారముచే ఆవృతమైన ఆత్మయే జగదనుభవముగా బయల్వెడలుచున్నది.

ఆ విరాడ్రూపుడగు పరమాత్మకు... కల్పాంతమందలి రాత్రి, అవాంతర ప్రళయములు చిన్న -పెద్ద కేశములవంటివి. కాలము-క్రియ-పగలు-రాత్రి ఆతని అవయవ సంధులు. అగ్ని ఆతని ముఖము. స్వర్గము శిరస్సు. ఆకాశము నాభి. భూమి పాదములు. సూర్య చంద్రులు నేత్రములు. దిక్కులు చెవులు. ఈ ప్రకారంగా మనఃకల్పనయే విరాడ్రూపంగా విజృంభించుచున్నది.

ఈ విధంగా విశాలరూపుడగు విరాట్ భగవానుడు ఈ విశాల విశ్వము రూపంలో ఘనీభూతమై బాగుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇదంతా స్వప్నంలో కనిపించే మహా పర్వతంలాగా స్థితినొందియున్నది. వాస్తవానికి ఈ విరాట్ పురుషుడు ప్రపంచ రహితుడైన చిదాకాశరూపుడే అయివున్నాడు.

జగత్తు = ఏదైతే చిదాకాశమున... చేతనాత్మకమగు జీవరూపమును పొంది స్వయంగా అతిశయ రూపమున ప్రకాశించుచున్నదో... అదియే - - చిదాకాశ రూపమగు ఆత్మరూపజగత్తును చిదాకాశ రూపమగు ఆత్మయే పొందుచున్నదిగా - అగుచున్నది.

Page:545

విరాడ్రూపం - సర్వవ్యాపకమైన చిన్మయాకాశమే స్వప్నంలో వ్యవహారంలాగా ఇట్లు విరాడ్రూపంగా జడ - చేతనములతో కూడి భాసిస్తోంది.

అనుభవితైవ అనుభవం సత్యం స్వాత్మానమప్యసస్తమివ అనుభవతీయత్త్వేన స్వప్ననటః స్వప్నదేశమివ ॥

ఒకానొక నృత్య కళాకారుడున్నాడు. ఆతడు ఒక రాత్రి కలలో తాను నృత్యం చేస్తూ ఉండగా అనేక మంది ప్రేక్షకులు అభినందనలతో కరతాళ ధ్వనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడీ స్వప్నంలో జరుగుచున్నదేమిటి?... ఆ స్వప్నం, అందులోని ప్రేక్షకులు, వారి కళాభిరుచికి అనుగుణంగా నృత్యం చేసే తాను, ఆ నాటక రంగం, అక్కడి వాయిద్యములు, తదితర వాయిద్య కళాకారులు, తాళ - లయ విన్యాసం చేసే శబ్ద సూత్రధారి... ఇవన్నీ ఆ నటుని కల్పనయే అయి, ఆ నటుని స్వప్న స్వస్వరూపమే కదా!

అట్లాగే...అనుభవకర్తయగు చిదాత్మయే... అనుభవైక రసము, స్వస్వరూపము అయినట్టి స్వస్వరూప పరమాత్మమునందు- మాయావరణముచే స్వస్వరూపమును “లేనిదాని వలె” ఏమరచి, పరిచ్ఛిన్నమగు ప్రపంచమును తన స్వస్వరూపమున కల్పించుకొని, ఆ కల్పనను తనకు వేరైన సత్యము వలె ...అనుభవిస్తోంది. ఇదియే మనలో ప్రతి ఒక్కరికి - మనచే దర్శించబడే దృశ్యమునకు గల సంబంధం.

శ్రీరాముడు : స్వామీ! ఈ దృశ్యము మాయా సమ్మిళితమైన స్వప్నరూపమేనని, స్వప్నంలోలాగా ఇది స్వస్వరూపమునకు వేరైనట్లు, (స్వస్వరూపము యొక్క తత్త్వమును ఏమరచిన సందర్భంలో అన్యమగు జగత్తుగా అనిపిస్తోందని... మీరు సిద్ధాంతపూర్వకంగా ఇంతసేపూ సుస్పష్టంగా ప్రకటించుచున్నారు. మీ "ఆత్మాపమ్యేవ సర్వత్రా అను సిద్ధాంతము అమోఘం - అప్రతిహతం. అయితే, ద్రష్టయగు జీవునికి దృశ్యమునకు గల సంబంధమును వేర్వేరు విధాలుగా నిర్వచించి వేర్వేరు గురువులు తమ శిష్యులకు వేర్వేరు రీతులుగా ప్రబోధించటం లోకంలో చూస్తూ ఉన్నాం. ఆ గురు బోధానుసారం శిష్యుల యొక్క వారి వారి అనుభవం ఉంటున్నట్లు ప్రకటించటం కూడా చూస్తున్నాం. ఇది అట్లా ఎందుకు జరుగుతోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను. వేర్వేరు గురువులు తమ శిష్యులకు వేర్వేరు సిద్ధాంతాలు ద్రష్ట దృశ్యముల సంబంధం గురించి నిర్వచించటం జరుగుచున్న మాట నిజమే! ఆ స్థితిని అనుభవించి గురువులు అనుభవ వాక్యములను బోధించటం ఆ శిష్యులు నిరూపణగా అనుభూతి పొందటం కూడా జరుగుతోందనే మాట నిజమే!

వేదాంతులు..... వారి గురువులు (వ్యాసులు)

అర్హతులు వారి గురువులు (అర్హత)

సాంఖ్యులు వారి గురువులు (కపిలముని)

సౌగతులు వారి గురువులు

Page:546

సూత్రాంతిక

వైభాషిక బుద్ధులు, పాశుపతులు అట్లాగే... యోగాచార గాణాపతులు, వైష్ణవులు, శక్తులు

మాధ్యమికులు

ఈ విధంగా వివిధ మతములున్నాయి. ఆయా గురువులు ఈ దృశ్యం, ద్రష్ట భావనానుసారమని, ద్రష్ట ఊహా స్వరూపమని, ద్రష్ట యొక్క స్వస్వరూపమేనని, ఇదంతా మాయా కల్పితమని, ద్రష్ట కోసం భగవంతుడు ఈ ఈ విధంగా కల్పించారని, పరమాత్మ జగత్తులో లేడు; అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములకు ఆవల ఉన్నారు” అని, బుద్ధికి ఈవల జగత్తు-ఆవల పరమాత్మ అని, ఇహలోకంలో చేసినవి పరలోకంలో ఫలిస్తాయని, ఈ కనబడే ప్రకృతియే పరమాత్మయని, పరమాత్మ ఎక్కడా ఏ రూపంగానూ లేనే లేడని...

ఈ విధంగా ఆయా గురువులు తమ శాస్త్రములందు ఏఏ దృశ్య నిర్వచనము పొందుపరచి బోధిస్తున్నారో, వాటన్నిటి యొక్క రూపముచే అనువర్తులగు శిష్యులకు వారి వారి వాసనానుసారమే వారికి బ్రహ్మము ఆ చెప్పబడిన రీతిగానే స్ఫురిస్తోంది. ఆయా వాదుల యొక్క నిశ్చయానుకూలమగు ఐహిక - - పారలౌకిక ఫలములుగా స్ఫురించేదంతా బ్రహ్మమే అయివున్నది. ఎవరు ఏ దృఢ భావన కలిగివుంటే వారిపట్ల అదియే సత్యముగా అనుభూతమవటం బ్రహ్మము యొక్క ఒకానొక చమత్కారమైన ధర్మము అయివున్నది. ఎందుకంటే ఆయా వాదులంతా (ఆయా మత గురువులంతా) తమ ఆత్మయందే ఆయా ఫలసిద్ధిని గురించి భావించి ఆయా రీతులుగా పొందియున్నారు కాబట్టి! శిష్యులు కూడా అదే భావనచే అట్టిదేయగు ఫలమును సిద్ధించుకుంటున్నారు కాబట్టి!

బ్రహ్మము యొక్క మాయా చమత్కారం సర్వాత్మకమై, సర్వుల వాసనానుసారంగా ఆయా శరీరములను ధరించి ఆయా ఫలములన్నిటినీ సిద్ధింపజేస్తోంది. బ్రహ్మము యొక్క మహిమ అట్టిది మరి!

16. అజ్ఞానం తొలగిందా.... అంతా బ్రహ్మమే!

శ్రీరాముడు : మహాత్మా! "ఈ జగత్తు సంసార రూపం. ఇద్దానిని ధ్యాన తపో-సమాధి నిష్ఠల వంటి ప్రయత్నములచే తొలగించుకుంటేగాని బ్రహ్మము అనుభూతం కాదు. సాధకులు ఈ జగత్తును త్యజించగలిగే ఉపాయాలు ఆశ్రయించాలి ...అని కొందరు గురువులు (జైనమతం) తమ శిష్యులకు క్రమగతిపూర్వకంగా బోధిస్తున్నారు. వారి అభిప్రాయం గురించి వ్యాఖ్యానించ ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ముందుగా మా అభిప్రాయమగు ఒక పరమ సత్యమును ప్రకటిస్తున్నాను. విను.

Page:547

సృష్ట్యాది యందు కేవల చిన్మాత్రమే ఈ జగత్తుగా భాసిస్తోంది, - స్వప్న ద్రష్ట యొక్క చిన్మాత్ర స్వరూపమే స్వప్నంగా భాసించుచున్నట్లుగా!

ఇది శాస్త్ర నిర్ణయం. కనుక ఈ ముల్లోకములు బ్రహ్మమే అయివున్నాయి. ఇట్టి దృఢజ్ఞానమే మోక్షోపాయ ఔషధం. బ్రహ్మము' అనే మహా సముద్ర జలమునకు ఈ సృష్టులు తరంగముల వంటివి. తరంగములన్నీ ‘జలమే అయినట్లు సృష్టులన్నీ బ్రహ్మమే! ఎండమావులలోని జలమునకు ద్రవత్వం ఎట్టిదో సృష్టుల అనుభవం అట్టిది.

అయితే... అజ్ఞానుల దృష్టికి దుఃఖమయమై, ఎట్లా దాటిపోవాలిరా బాబూ! అనిపించే జగదనుభవ వ్యవహారం జ్ఞానముచే తుడిచివేయబడుతోంది. అజ్ఞానము తొలగినప్పుడు ఈ జీవుడు జీవన్ముక్తుడగుచున్నాడు. అట్టి జీవన్ముక్తునికి వ్యవహారార్థం శేషించియుండే ఈ జగత్తు ఇక అక్కడ అద్వైతమా? ఏకమా? అనేకమా?... మొదలైన ప్రశ్నలు ఉండజాలవు.

శ్రీరాముడు : స్వామీ! జీవన్ముక్తులు విదేహముక్తులు అనే రెండు పదాలు అధ్యాత్మశాస్త్రంలో చోటుచేసుకొంటున్నాయి. కదా! వారిరువురి అనుభవం ఒకే తీరుగా ఉంటుందా? వేర్వేరు తీరులుగా ఉంటుందా? వారీ జగత్తును ఏఏ విధాలుగా దర్శిస్తున్నారు? (లేక) ఎట్లా సమన్వయించు కుంటున్నారు? వారిరువురిలో అధిక సుఖి ఎవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి : జీవన్ముక్తునకు జగత్తుగా కనిపించేది బ్రహ్మముగానే అయివున్నది. విదేహముక్తునకు - - బ్రహ్మమే ఉన్నదిగాని జగత్తనబడేది లేదు.

స్వప్న - సుషుప్తులలో ఒకదానిలో దృశ్యం ఉండవచ్చు. రెండవదానిలో లేకపోవచ్చు. కానీ రెండూ నిద్రారూపములే కదా! అట్లాగే జీవన్ముక్తునికి దృశ్యము బ్రహ్మముగాను, విదేహముక్తునికి బ్రహ్మము తప్పితే... దృశ్యము మొదలే లేనిదిగాను అగుచున్నప్పటికీ... ఆ ఇరువురి చిదాకాశము యొక్క మూల నిర్వచనం ఒక్కటే! కాబట్టి.... ఆ రెండింటి సుఖస్థితి సమానమే అయివున్నది. అంతేగాని భేదమేమీ లేదు. జాగ్రత్ - స్వప్నములు ఒకే నిద్రలోని విశేషములు అయినట్లు జీవన్ముక్త

- విదేహముక్తులు ఒకే ముక్తి యొక్క పరమానందభరితమైన రెండు ఆత్మసాక్షాత్కార చమత్కారాలు కలిగి ఉంటున్నారు. రాత్రి స్వప్నంలో ఒక నగరం కనబడిందనుకో. తెల్లవారి లేచిన తరువాత ఆ స్వప్న నగరం గురించి, “ఆ భవనాలు ఎవరు కట్టారు? ఎందుకొరకై కట్టారు? ఆ జనులు ఎక్కడి నుండి వచ్చారు? ఆ మన బంధువు అట్లా ఎందుకు మాట్లాడారో వారిని ఇప్పుడు కనుక్కుందామా?” ...అని మనం పరిశీలించే ప్రయత్నంలో ఉంటున్నామా? లేదు. స్వప్నానంతరం స్వప్నంలాగానే బ్రహ్మమును ఎరిగిన తరువాత ఈ దృశ్యం (స్వప్న సదృశ్యంగా) భాసిస్తుంది. అప్పుడిక ఏ వివేకి ఈ జగత్తు గురించి ఆసక్తి కలిగి ఉంటాడో చెప్పు?

తత్త్వజ్ఞుడు... సృష్ట్యాది యందు నిర్వికల్పము నిర్విషయము అగు ఆత్మయందు సృష్టి జనించటానికి కారణమేమీ లేదు. కనుక సృష్టి మొదలే ఉత్పన్నమై ఉండలేదని

Page:548

సృష్టి యొక్క యథార్థ జ్ఞానం కలుగగానే స్వప్న దృశ్యంలాగా ఈ జగత్తు బాధితమై పోతోందని (జగత్తు మొదలే లేదని తెలిసిపోతోందని), అందుచేత ఇందు దుఃఖాదులు కలిగియుండటం అర్థంలేని పని అని... గ్రహించి ఉంటున్నాడు.

జాగ్రత్ దృష్ట్యా స్వప్నంలో వివిధ వాసనలచే ఆయా విశేషాలు ప్రదర్శనమయి ఉండినప్పటికీ, స్వప్నం అసత్యమేనని జాగ్రత్లో ఎరిగియే ఉంటున్నాడు కదా! అట్లాగే ఈ జగత్తులోని ఆయా వాసనా సమూహములు దగ్ధమైన కాగితపు ఆకారమువలె జ్ఞానికి ఏ మాత్రం క్లేశము కలిగించటం లేదు. ఈ విధంగా తత్త్వబోధచే ఈ దృశ్యం భ్రాంతిమాత్రంగా నిశ్చితమై, బాధితం అగుచున్నది. అంతేగాని, జగత్తు “పరమాణువుల సంయోగ - వియోగము అనియో, లేక, కర్మ వ్యవహారముల ఫలితం అనియో, కాక దీనికి మూల కారణం దైవము... అనియో నిశ్చయము కలిగి ఉన్నంతకాలము భ్రాంతి తొలగిపోదని, ముముక్షువులకు నా మనవి. జగత్తు ఏదో కారణం చేత “ఉన్నది” అని గాని, “సత్యమే అని గాని భావించినప్పుడు అది ఆ అనుభవమునకు సత్యమేనని అనిపించినప్పటికీ, జగత్ భ్రమ తొలగదు సుమా! శ్రుతులు ఇది స్వప్న సదృశం అని సిద్ధాంతీకరించియే ఉన్నాయి కదా! మరప్పుడు అతి సమీపమగు స్వప్న దృష్టాంతాన్ని జగత్తుకు ఎందుకు సమన్వయించరాదో చెప్పు?

"జగత్తు స్వప్నమువలె భ్రాంతియే... అని చెప్పటానికి ఇంకొక ప్రత్యక్ష గుర్తు (ప్రమాణం) కూడా ఉన్నది. ఇది భ్రాంతి గాక సత్యమే అయివుంటే... అప్పుడు ఈ మనుజుడు తనకు ఇష్టమైన వస్తువులను స్వీకరించి, అయిష్టమైన వస్తువులను త్యజించివేసి హాయిగా సుఖంగా ఉండగలిగేవాడే! ఆకస్మిక దృశ్యమును (అయిష్టమయినప్పుడు) గాంచకయే హాయిగా ఎప్పుడూ సుఖమును కలిగి ఉండేవాడే! అట్లా జరుగుతోందా? లేదు. ప్రతి జీవుడు ఈ దృశ్యమును వెంబడించి అనేక దుః ఖాలను ఎందుకు కలిగి ఉంటున్నాడు? భ్రాంతిని భ్రాంతిగా గమనించకపోవటం చేతనే! ఈ విధంగా ఈ జగత్తు భ్రాంతి మాత్రమేనని (ఉపనిషత్ మొదలైన) వేద విభాగములచే నిర్ద్వంద్వంగా సిద్ధాంతీకరించబడుతోంది.

సమాధి -

శ్రీరాముడు : స్వామీ! కొందరు యోగులు "ఈ జగత్తు భ్రమ అని గ్రహించి, - జన్మ జన్మలుగా అభ్యాస వశంచే సంస్కార రూపం దిద్దుకున్న ఇట్టి జగత్ భావోద్వేగం త్యజించి వేయటానికై ఏకాంత ప్రదేశంలో జగత్యాజ్యరూపమగు జగద్రహిత సమాధిని సాధనోపాయంగా గ్రహిస్తూ ఉంటారు. ఈ జగత్తు దుఃఖమయమని, జగద్రహిత సమాధి యొక్క అభ్యాసముచే ఆనందరూపమగు ఆత్మానుభూతిని, సమాధిసేవనముయొక్క ఆవశ్యకత గురించి విశదపరచండి.

ఓ రామచంద్రా! ఈ జగత్తును ఏమరచి జగద్రహిత సమాధిని ఆశ్రయించేవారి ప్రయత్నంలో ...“ఈ జగత్తు సత్యమే!” ...అను ఒక భ్రమ కొనసాగుచునే ఉన్నది. ఈ జగత్తును ఆత్మకు అన్యమైన దానిగా తలచి కొనసాగించే జగద్రహిత సమాధి మరల జడత్వమే అగుచున్నది. పైగా జగత్తును ఏమరచాలి అనే ఆవేశము కలిగి ఉండి జగద్రహిత సమాధికై శక్తి యుక్తులను వినియోగించటమనేది

Page:549

సవికల్ప సమాధియేగాని, నిర్వికల్ప సమాధి కాదు. అందుచేత అది సంసారమే అయివున్నది. అట్టి జగత్తును త్యజించివేయాలని తపనతో కూడిన సమాధి వలన పరమ పురుషార్థమగు మోక్షము కలుగనేరదు. నిర్విషయక ధ్యానం ...సంసారమే అయివున్నదని మరల గుర్తు చేస్తున్నాను. అది శిల వంటి జడస్థితయే అయివున్నది. ఇక, మోక్షమో, వికల్పాత్మకమగు సంసార రూపం కాదు. శిలవంటి జడ స్థితి కూడా కాదు. జగత్తును వదలి ఆత్మకొరకై నిర్వికల్ప ధ్యానం వలన జడస్థితి కంటే అన్యమైనదేదీ లభించదు. అట్టి సమాధి వలన ముక్తి లభిస్తుందనుకుంటే, అప్పుడు మనుజునకు గాఢనిద్ర వలన కూడా ముక్తి లభించేదే కదా?

అందుచేత రామచంద్రా! ఉత్తమ ఆత్మజ్ఞానం ద్వారా 1.జగత్తుగా ఆత్మయే భ్రాంతిచే కనిపిస్తోందని, 2. ఆత్మ సర్వదా నిరతిశయ ఆనంద సచ్చిదేకరస స్వరూపము అని నిశ్చయించుటయే ఈ జగత్తు యొక్క లయము. అదియే జగత్తు యొక్క అత్యంతాభావము కూడా!

భ్రాంతిహేతువగు జగత్తును ఆత్మకు వేరుగా దర్శించటం ... అనే అజ్ఞానావరణము క్షయించుటయే భ్రాంతి క్షయము.

జగత్తును ఆత్మరూపంగా దర్శించటమే ఆత్మ సాక్షాత్కారం. అట్టి (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ మొదలైన వేద వాక్యార్థమైన) నిశ్చల దృఢాభిప్రాయమే సమాధి కూడా! (సమ + అధి ). వివేకి జీవన్ముక్తత్వము అదియే! అదియే (సర్వము ఆత్మయే అను దృష్టియే) 'నిర్వికల్ప సమాధి' అని, 'అనంతమగు నిర్వాణము' అని కూడా చెప్పబడుతోంది. "స్వస్వరూపమున వికారరహితంగా ఎప్పటి యట్లు స్థితి కలిగి ఉండటం అనబడునది కూడా అదియే! అట్టి చిత్స్వరూపమాత్ర స్థితియే అనంత సుషుప్తి అని, ‘తురీయము' అని, 'నిర్వాణము' అని, 'మోక్షము' అని కూడా పిలువబడుతోంది.

అట్టి సర్వము ఆత్మరూపంగా అనిపించటమే "సమ్యక్ జ్ఞానైక ఘనత్వం. అదియే ధ్యానము. అట్టి దృశ్యము యొక్క అత్యంత ఆత్మభావపూర్వకమైన ఆత్మజ్ఞానమే పరమ పదము. "ఇదంతా ఆత్మస్వరూపమే ...అను అత్యంత దృఢనిశ్చయమే (మమాత్మా సర్వభూతాత్మా!”... “తత్త్వమసి”, "అయమాత్మా బ్రహ్మ వంటి) వేదమహా వాక్యముల సారం కూడా!

మోక్షస్థితి” అనబడేది... జడత్వం కాదు. ప్రకృతి విలయము వంటి సుషుప్తి కాదు. జగత్తును త్యజించిన జగద్రహిత సమాధి కూడా కాదు. సవికల్పము కూడా కాదు. అసత్, శూన్యము, నైరాత్మ్యరూపము ('ఆత్మ అనబడేది లేదు' అని తిరస్కరించి దర్శించటం వంటిది) కూడా కాదు.

ప్రియ రామచంద్రా! అది దృశ్యము పరమాత్మగా అనిపించే స్థితి. ఓ సర్వ సభికులారా! ఈ దృశ్యం సర్వదా ఆద్యస్వరూపమగు పరబ్రహ్మమే! అట్టి శుద్ధ బ్రహ్మమే నేను (అహం బ్రహ్మాస్మి) అనునట్టి దృఢభావం పొందటమే మోక్షం. ఆ బ్రహ్మము అధిష్ఠాన రూపముచే సర్వదా యథాతథమేగాని దృశ్యము కాదు. ఏ అనుభవం కూడా అట్టి బ్రహ్మం కంటే వేరుగా అనిపించని స్థితియే పరమపదము. అది నిరతిశయానంద స్థితి. ఆత్మయొక్క అట్టి ధ్యానముచే(అంతా పరమాత్మ స్వరూపమేనని ఉంటే) ఆత్మ యొక్క పరిపూర్ణజ్ఞానం తప్పక లభించగలదు. అదియే పరమ నిర్వాణం. అట్టి స్థితిలో ఈ జగత్తు ఇట్లాగానీ, మరింకెట్లాగైనాగాని కనిపిస్తున్నప్పటికీ స్వస్వరూపమగు ఆత్మగా అనిపించగలదు.

Page:550

అట్టి చిద్రూప పరమాత్మయందు ఏకత్వం లేదు. అనేకత్వం కూడా లేదు. అది పదార్థ రహితం కాదు. పదార్థ సహితం కాదు. అది సమస్త సత్ - అసత్ పదార్థముల సీమాంతరము... అని చెప్పబడుతోంది. అట్టి స్వరూపస్థితియగు "నిర్వాణము దృశ్యము యొక్క అత్యంత అసంభవపూర్వకమైనది, సర్వ విక్షేప రహితమైనది, నిరతిశయానందమయమైనది! అట్టి శుద్ధ బోధోదయమగు శాంతరూపమే పరమపదం. అదియే పరమ పురుషార్థమని గమనించు. అటువంటి ఆత్మ స్వరూపమే ఈ దృశ్యము" అను ఉత్తమ బుద్ధి ఈ “యోగ వాసిష్ఠం వంటి మోక్ష శాస్త్రముల పరిశీలనచే తప్పక కరతలామలకం కాగలదు. అందుచేత మోక్షోపాయమైనట్టి ఈ శాస్త్రమును విచారణపూర్వకంగా జనులు పఠించెదరు గాక! అధ్యాత్మ శాస్త్రమును విచారణపూర్వకంగా పరిశీలించుటచే ఆత్మయొక్క శుద్ధజ్ఞానము లభించగలదు.

న తీర్థేన న దానేన న స్నానేన న విద్యయా | న ధ్యానేన న యోగేన న తపోభిః నచాధ్వరైః ॥

1. దృశ్యము దృశ్యముగా కాకుండా స్వస్వరూపము - సత్స్వరూపము అగు చిత్స్వరూపాత్మగా అనిపించటం, 2. తానే ఆ చిత్స్వరూపాత్మగా నిర్దుష్టంగా స్వభావ సిద్ధంగా (అకృత్రిమంగా) అనుభూతం కావటం, 3. నేనే ఈ సర్వత్రా సర్వదా సమరూపమై ఉన్నాను అనే (మమాత్మా సర్వభూతాత్మా - అహం సర్వస్య ప్రభవో, మత్తసర్వమ్ ప్రవర్తతే - మత్తః పరతరమ్ నాన్యత్ కించిదస్తి - అహంహి సర్వయజ్ఞానామ్ భోక్తాచ, ప్రభురేవచ... మొదలైన ఉత్తమ వేదోపనిషత్ వాక్యాల అర్ధసారం హృదయమంతా నిండిపోగా) వేదార్థ సారం సుస్పష్టం అయి, అట్టి "దృశ్యమంతా నా స్వరూపమే” అనే దర్శనం... ఈ మూడు మోక్షము యొక్క లక్షణాలు అయివున్నాయి. అట్టి మోక్షస్థితి తీర్థములను సేవించటంచేతగాని, అనేక దానములు చేస్తేగాని, స్నానాదులచేతగాని, లౌకిక విద్యల చేతగాని, ధ్యానముల చేతగాని, యోగముల చేతగాని, తపో యజ్ఞాదుల చేతగాని లభించేది కాదు. మరి? ఆత్మజ్ఞాన శాస్త్రముల యొక్క నిర్మల-నిర్దుష్ట అవగాహనచే, బుద్ధి సుసంపన్నమై ఉపనిషత్ - ఈ యోగ వాసిష్ఠాది శాస్త్రముల సారం హృదయస్థమై, అంగీకారయోగ్యమై భావనాభ్యాసాల వల్ల అనుభవజ్ఞానం రూపుదిద్దుకొనుటచే అట్టి మోక్షస్థితి లభిస్తోంది. మిగతా సర్వ ప్రయత్నములు బుద్ధిని నిర్మలం, విశాలం, పవిత్రం చేస్తాయి. అప్పుడు (ఆత్మోపమ్యేవ సర్వత్రా - సమం పశ్యతి - మొదలైన వాక్యముల అనుభవజ్ఞానంచే)... అట్టి జీవుడు సర్వము ఆత్మగా దర్శించుటచే జగత్తును జయిస్తాడు.

భ్రాంతి మాత్రం కిలేదం సదసత్పదివ లక్ష్యతే |

వ్యోమైన జగదాకారం స్వప్నో అనిద్రే చిదంబరే ॥

ఓ రామచంద్రా! సత్-అసత్ రూపము, అనిర్వచనీయము అయినట్టి ఈ నామరూపాత్మక జగత్తు భ్రాంతిమాత్రమే అయివున్నది. అయితే అజ్ఞానముచే సత్యముగా అనిపిస్తుంది. నిద్రారహితమగు చిదాకాశమే చిదాకాశమున ఇట్లు స్వప్నరూపమై జగదాకారముగా స్థితినొంది ఉన్నదని గ్రహించు. ఇదంతా ఆత్మకు వేరుగా అనిపించటమే భ్రమ.

Page:551

న శామ్యతి తపస్తీరైః భ్రాంతిర్నామ కదాచన | తపస్తీర్ధాదినా స్వర్గాః ప్రాప్యన్తో, నతు ముక్తతా ॥

ఇది ఆత్మకు వేరైన జగత్తు" అను భ్రాంతి (లేక) మాయ తపస్సులచేగాని, తీర్థములు సేవించటంచేతగాని తొలిగేది కాదు. అవన్నీ స్వర్గాది సుఖప్రదమైన లోకములు ప్రాప్తింపజేయగలవే గాని ముక్తిని కాదు. ముక్తి కొరకై జ్ఞానమయమైన ఆత్మదృష్టి పెంపొందింపబడి, పరిరక్షింపబడక తప్పదు. (దృష్టిమ్ జ్ఞానమయమ్ కత్వా పస్యేత్ బ్రహ్మమయమ్ జగత్). భ్రాంతి పూర్తిగా తొలగాలంటే ఆత్మ జ్ఞానమయమగు మోక్షోపాయమైన వసిష్ఠ రామ సంవాదము వంటి శాస్త్రములను, ఆత్మ దర్శన భాగ్యం సంపాదించుకున్న మహనీయుల వాక్య - అభిప్రాయములను సేకరించి హృదయస్థం చేసుకోవటమే ఉపాయం. క్రమంగా సర్వము పరమాత్మకళామయంగా దర్శిస్తూ ఉండగా మనోబుద్ధి చిత్త అహంకారాలు పవిత్రమై అవన్నీ వాటివాటి విషయములతో సహా పరమాత్మరూపంగానే అనుభమౌతాయి. సూర్యుడు ఉదయించిన తరువాత ఇక చీకటి, ఆ చీకటిలో కనిపించిన ఆకారాది వికారముల గురించి మీమాంస ఎక్కడిది? నిర్మల జ్ఞానమును కలుగజేయగల ఆధ్యాత్మ శాస్త్రముల యొక్క అర్థముచే సాంసారిక భ్రాంతి అంతా పూర్తిగా తొలగిపోగలదు. శమించగలదు. అయితే, అందుకు అత్యవసరమైయున్న నిర్మల మనోబుద్ధులను తపస్సు - తీర్థము మొదలైనవి ప్రసాదిస్తున్నాయి. కనుక, అవి అత్యవసర సాధనములుగా శాస్త్రములు ప్రతిపాదిస్తున్నాయి.

వాయువునందు వాయుతరంగాలవలె, జలమునందు ద్రవత్వంలాగా... స్వస్వరూపమగు చిదాకాశమునందు ఈ సృష్టి-స్థితి-లయముల ప్రతిభాసలు కనిపిస్తున్నాయి. ఇవి ఉంటే ఉండనీ, లేక ఉండకపోనీ, ప్రతిభాసా మాత్రము అగు ఈ జగత్ గా దర్శనమయ్యే దానిని ప్రక్కన ఉంచి ఇది ఏ ఆత్మయందు సర్వదా భాసిస్తోందో... అట్టి ఆత్మదర్శనము సర్వదృష్టి సంబంధమైన రుగ్మతలు వాటికవే తొలగుతాయి. అప్పుడిక (సాంసారిక భ్రాంతి "భ్రాంతి మాత్రంగా గమనించబడిన తరువాత) ఆత్మీదృష్టి స్వభావసిద్ధమే అగుచున్నది. ఇక ఆపై తొలగవలసినదేమిటి? పొందవలసిన

దేమిటి?

కాబట్టి రామచంద్రా! వటవృక్షానికి (మఱిచెట్టుకు) ఆకులు పూయటం, రాలటం ఆ వృక్షము లోని విభాగమే కదా! వాయువులో అసంఖ్యాక తరంగాలు ఉద్భవించటం వాయువు యొక్క స్వభావమే అయివున్నది కదా! మాయా శబలితమైన చిదాకాశమునందు యథాస్థితి కలిగియున్న ఈ జగత్తుల యొక్క సృష్టి స్థితి లయాలు చిదాకాశమునకు వేదికీకాదు. చిదాకాశమే మాయచే జగత్తుగా కనిపిస్తోంది. కనిపించే జగత్తు స్వస్వరూపమగు చిదాకాశముగా అనిపించటమే మోక్షము, నిర్వాణము, విదేహముక్తి, ఆత్మలయం, పరమాత్మత్వం, పరమాత్మ దర్శనం, ఆత్మసాక్షాత్కారం మొదలైన ఆయా శబ్దములచే ఉద్దేశించబడుతున్నాయి.

ఆ ఆ శబ్దములన్నీ ఒక దానికి మరొకటి పర్యాయపదములేనయ్యా!

Page:552

XI. బ్రహ్మగీత (బ్రహ్మాండోపాఖ్యానం)

1. దృశ్యమసంభవమ్

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జీవుడు సర్వదా చిదాకాశ స్వరూపుడే కదా! అట్టి ఈతనికి మరి ఈ భౌతిక దేహములు ఎందుకు, ఎక్కడినుండి, ఎట్లా, ఎవరి వలన వచ్చిపడుచున్నాయి? ఎందుకంటే, దేహికి ఈ దేహమే ఐహికభ్రాంతి కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను భ్రాంతియే! అయితే ఈ దేహవీ, దృశ్యవీ మొదలైనవి ఇప్పుడు ఉండవచ్చు మరొకప్పుడు ఉండకపోవచ్చు. అయినా కూడా దేహి సర్వదా చిదాకాశ స్వరూపుడేనని మనం నిర్ద్వంద్వంగా ఇప్పటిదాకా యుక్తియుక్తంగా నిరూపించుకున్నాం కదా! ఆద్యస్వరూపమగు చిదాకాశవీచి... స్వకల్పితమైనట్టి అవిద్యచే... స్వప్నసదృశంగా నేను జీవరూపము ధరించాను” అని తలచి ఈ సంసారమున తిరుగాడుచూ... నేను దేవతను. నేను మానవుడను ...అని ఈ ప్రకారంగా ఆయా దేహములతోటి దేహాత్మాధ్యాస" కలిగి ఉంటోంది. అట్టి అధ్యాసచే కలిగియుండే కామ, కర్మ, వాసన మొదలైనవే ఆయా దేహములకు కారణమగుచున్నాయి. అయితే అట్టి దేహత్వమనేది స్వప్నాంతర్గత విశేషములవలె భ్రాంతియే! అయితే ఈ జీవనోపాధికి పూర్వం ఈ జీవుడు మహాప్రళయమున చిదాకాశ రూపుడే! అనగా ఈ సృష్టి-స్థితి-ప్రళయములు, ఇహపర లోకాలు ఆతని దేహము అవుతాయిగాని, కేవలం ఈ కాళ్ళు, చేతులు మాత్రమే ఆతని దేహం ఎట్లా అవుతుంది? ఈ జీవుని స్వస్వరూపమగు చిదాకాశము నందు దృశ్యరూప భేదం అత్యంత అసంభవం. మరప్పుడు ఈ సృష్టి రూపమగు దృశ్యము అట్టి చిదాకాశమునకు దేహమెట్లా అవుతుంది? ఇక దృశ్యమానమగు సృష్టి, పరలోకాదులన్నీ కూడా స్వప్న సంవిద్రూ కల్పనల చేతనే సిద్ధిస్తోంది. అంతేగాని స్వకీయ స్వల్పకల్పనకు నేరుగా సృష్టికి ఏ కారణం లేదు. స్వప్నంలో స్త్రీ సంగమంలాగా ఈ దృశ్యం ప్రాప్తిస్తోంది. అయితే కేవలమూ అనుభవరూపం, శాంతం అయినట్టి చిదాకాశమే స్వమాయాశక్తిచే ఈ ప్రకారంగా అసత్తైన జగద్రూపంగా భాసిస్తోంది. ఏదైతే తాను శుద్ధ రూపమైనప్పటికీ, దృశ్యశూన్యమైనప్పటికీ ఈ రీతిగా జగద్రూపంగా భాసిస్తోందో... అది ఆద్యంత రహితం, నిర్మలం అయినట్టి చైతన్య వస్తువే అయివున్నది సుమా! తెలియబడనంతవరకూ ఆ పరమాత్మయే ఈ ఈ జగతూప అవిద్యగా భాసించటం కొనసాగుచూనే ఉండగలదు. అవిద్య చేతనే “నేను వేరు - ఈ దృశ్యం వేరు - ఆ పరమాత్మ వేరు ...అని అనుకుంటూ అజ్ఞాన ద్రష్ట అవిద్యయందు తిరుగాడుచూనే ఉంటున్నాడు. తెలియబడిన తరువాత నేను, దృశ్యం, పరమాత్మ” అను మూడు ఏకత్వం చెందుచున్నాయి. అప్పుడు స్వకీయ ద్రష్టత్వం, దృశ్యం కూడా నిర్మల పరబ్రహ్మంగానే కానవచ్చుచున్నాయి. మేల్కొనిన తరువాత స్వప్న దృశ్యం పటాపంచలైపోతున్నట్లుగా

Page:553

.ఇక ఆద్యంత రహితమగు చిదాకాశమే తనయందు తదితరులయందు ఈ సమగ్ర దృశ్యమునందు - ఇహ పరలోకములయందు ఆక్రమించినదై అగుపిస్తుంది. అట్టి చిదాకాశ దృష్టి అనుభూతమైన తరువాత ఇక అవిద్య ఎక్కడిది?

కాబట్టి రామచంద్రా! పరమాత్మ యొక్క దృశ్యచమత్కారముతో కూడిన అనుభవమే ఈ జగత్తు. ఇక ఈ పృథివి మొదలైనవి కారణము లేకపోవుటచే, పరమాత్మయందు ఇవి జనించనే లేదు. చిదాకాశము యొక్క స్ఫురణ'యే ఈ పృథివి మొదలైన భౌతికములను, మనో - బుద్ధి ఆదిగాగల సూక్ష్మ తత్త్వములను చిదాకాశమునందు పరికల్పించి పొందుచున్నది. జలంలో తరంగాలలాగా, వాయువులో చలనరూప తరంగాలలాగా అబుద్ధిపూర్వకమైన అసంకల్పిత స్వభావ రూపమైన - నిష్కారణమైనట్టి స్ఫురణ ఉదయించి జగత్తుగా అగుచున్నది.

ఆ విధంగా ఆకస్మికంగా జగత్తు భాసించిన తరువాత ఆ ఆ స్ఫురణయే జీవరూపముతో పరమాత్మయందు ప్రవేశించి "నేను సృష్టి కర్తయగు బ్రహ్మదేవుడను"... ఇత్యాది ఐశ్వర్యమును ప్రకటించుచున్నది. ఆపై ఇక స్వయముగా బుద్ధి - మనస్సు - పృథివి మొదలైన సదసన్మయ -

మూర్తామూర్త మయములతో కూడిన ఈ ప్రపంచమును కల్పన కావించుకొనుచున్నది. నిర్మలాకాశం కంటే కూడా లక్షలాది రెట్లు అత్యంత నిర్మలమైన ఆ మహాచైతన్యము నిజమాయాశక్తిచే స్వయంగా జగద్రూపంగా భాసిస్తోంది. కాబట్టే చిదాకాశమే జగత్తుగాను, జగత్తే చిదాకాశముగాను సిద్ధాంతీకరించబడుతోంది. జగత్తు - చిదాకాశము వేరు వేరు కాదు.

ప్రియ రామచంద్రా! ఈ ప్రకారంగా విచారణ దృష్టితో చూచినప్పుడు చైతన్యమునకు అన్యంగా ఏదీ భాసించటమే లేదు.

అద్వయ చిన్మాత్రమే ఈ జగత్తు వాస్తవ రూపం. తన స్వరూపముచే తాను పూర్ణమైయున్న చిదాకాశమే తన సచ్చిదానంద చిదాకాశమునందు యథాతథంగా ఉంటూనే చిత్తముగాను, ఆ చిత్తమునందు దృశ్యరూపముగాను స్వయంగా భాసిస్తోంది. నిద్రపోయేటప్పుడు నీవు నీవుగానే ఉంటూనే స్వప్న చిత్తముగాను, స్వప్నరూపంగాను భాసిస్తున్నావు కదా! ఇది కూడా అట్టిదే! ఇంతకు మించి సృష్ట్యాదియందు సృష్టికి వేరు కారణం లేదు.

చిదాకాశము చిత్తము రూపంలో భాసించటమంతా మాయారూపమే! కేవల లీలా - క్రీడా వైచిత్రమే! స్వప్నంలో కనిపించే స్వప్న దృశ్యానికి, జాగ్రత్లో కనిపించే ఈ జాగ్రత్ దృశ్యానికి భేదమే లేదు. అందుచేత ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఆకాశమువలె పదార్థ శూన్యమైనట్టి చిదాకాశమే సుమా! స్వరూపరహితమైనట్టి పరబ్రహ్మము సర్వదా తనయొక్క సచ్చిదానంద అద్వయ రూపముతోటియే స్థితినొంది ఉన్నది. అట్లు ఉన్నప్పటికీ నిజ మాయాశక్తిచేత ఇట్లు సర్వ జగద్రూపంగా కూడా వర్తించుచున్నది.

చిద్రూపం - సమష్టి మనోరూపం - జగత్ూపం - ఓ రామచంద్రా! ప్రతిజీవుడు ప్రతిరోజు స్వప్న జీవితమును అనుభవిస్తూనే ఉన్నాడు కదా! అట్లు స్వప్నరూపంగా భాసించేది ఆత్మయే కదా!

Page:554

అట్టి స్వప్నాంతర్గత జగదనుభవాన్ని దృష్టాంతంగా తీసుకొని... “ఏకము - నిర్మలము - జ్ఞానమాత్ర స్వరూపము అయినట్టి పరబ్రహ్మమే ఇట్లు నానా ప్రకారాలుగా జగత్ రూపంచే కనబడుతోంది.” ...అని ఆత్మజ్ఞులు ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు. బ్రహ్మమే ఎరుక రూపంగా చిద్రూపం అయివున్నది.

చిద్రూపము ఎరుగునది, ఎరుగబడుచున్నది కూడా! ఆ బ్రహ్మం తనయందు జీవత్వమును కల్పించుచున్న దానివలె ఉన్నదై, తన నిర్మల స్వభావమును కించిత్ కూడా త్యజించకుండానే -

మనోరూపమును పొందిన దానివలె అగుచున్నది.

కనుక... పరబ్రహ్మమే చిద్రూపముగా, మనస్సు రూపంగా కనబడుతోంది. పరబ్రహ్మమునకు వేరైన చిద్రూపం లేదు. మనోరూపం లేదు. ఆ చిదాకాశమే సమష్టి మనోరూపముచే ఈ 'జగత్తు అనబడు రూపమును విస్తరింపజేయుచున్న దానివలె అగుచున్నది. తాను సర్వదా నిర్వికారరూపమే అయినప్పటికీ వికారివలె అగుపించుచున్నది.

జలమునకు ఆకారం ఉన్నదా? లేదు. మరి తరంగమునకో... ఉన్నది. తరంగమునకు ఎక్కడి నుండి ఆకారం వచ్చింది?

జలము నిరాకారమే అయినప్పటికీ తరంగమువలె ఆకారము పొందినదానివలె కనిపిస్తోంది కదా! అట్లాగే - విషయరహితము అగు పరబ్రహ్మము చిద్రూపము, మనోరూపము, సమష్టి మనోరూపము, వ్యష్టి మనోరూపము వలె, వికారివలె - (అజ్ఞాన దృష్టికి) అగుపిస్తోంది.

సమష్టి మనస్సే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే సృష్టి యొక్క హృదయం. ఆతడు సమస్త సృష్టిని స్వయంగా రచించుచు, స్వయంగా ఉపసంహరించుచున్నాడు. శ్రీరాముడు : స్వామీ! సమష్టి మనోరూపుడగు బ్రహ్మదేవుడు నిరాకారుడా? సాకారుడా? నిరాకారుడైతే ఆతని నుండి సాకార జగత్తు ఎట్లా వచ్చింది? సాకారుడైతే ఆతని సాకారమును సృష్టించినవాడెవడు? ఆ బ్రహ్మదేవుని సృష్టించినవాడు సాకారుడే అవుతాడా? నిరాకారుడౌతాడా? శ్రీ వసిష్ఠ మహర్షి : (పకాపకా నవ్వి) స్వప్న ద్రష్ట నిరాకారుడా? సాకారుడా? దేహానికి ఆకారం ఉన్నది గాని... చిత్ స్వరూపుడగు స్వప్న ద్రష్టకు ఆకారం ఎక్కడున్నది? జీవుడు అనగా దేహి, దేహం కదా! దేహమునకైతే ఆకారమున్నది గాని, మరి దేహికి ఆకారమేది? ఒక ఆలోచన వచ్చి నీవు ఒక పని చేశావనుకో. నీవు చేస్తున్న పని తదితరులకు కనిపించవచ్చుగాని, నీ ఆలోచనకు ఆకారమేది? అది ఎవరికి కనిపిస్తుంది?

నిరాకారమగు ఆత్మయే స్వప్నంలో స్వప్న పదార్థముల రూపంగా భాసిస్తోంది కదా! అట్లాగే ... పృథివి మొదలైనవి లేనివాడు - - సమష్టి మనోరూపమే తన రూపంగా కలవాడు" అగు బ్రహ్మ దేవుడు అవయవ రహితమగు స్వహృదయమున స్థితినొంది ఉన్నవాడై... అద్దానికి వేరుకానట్టి ఈ త్రిలోకములుగా భాసిస్తున్నాడు. ఆ స్వప్న హృదయరూపమే చిదాత్మ. ప్రతిజీవుడు నిరాకారుడై చిదాత్మయగు స్వప్న హృదయం నందు చిత్ స్వరూపమగు జగత్తుగా భాసిస్తూ తనకన్నా వేరుగా ఉన్న దానివలె జగత్తును పొందుచున్నాడు.



Page:555

ఓ రామచంద్రా! సమష్టి మనోరూపుడగు బ్రహ్మదేవుడు వాస్తవానికి సర్వదా అద్వితీయుడు. అనగా... తనకు వేరైనదంటూ ఏదీ ఎక్కడా లేనివాడు. నిరాకారుడు. (అన్ని ఆకారాలు తనవే అయినవాడు). పరిపూర్ణ చైతన్య స్వరూపుడు. అయినప్పటికీ కూడా, ఆ సమష్టి మనోరూపుడు తన అవిద్యచే తన పూర్ణ చిత్ స్వభావము నుండి చ్యుతి పొందినవానివలె అగుచున్నాడు. (వాస్తవానికి చ్యుతియే పొందటం లేదు). అయితే... తనకు అనన్యమగు అహంకార రూపముతో గూడి... ఈ జగద్రూపములచే అనంతరూపుడై... ఈ జడ చేతనాత్మక జగత్తుగా (భ్రమచే) అగుపిస్తున్నాడు. కాని వాస్తవానికి ఇక్కడ ఈ భూమి, ఆకాశం, పదార్థాలు, దేహములు... ఇవన్నీ చైతన్యరూపములే! చైతన్యము కంటే వేరుగా ఏ దృశ్యమూ ఎక్కడా లేదు. చిదాకాశమే కల్పిత మనోరూపమై, ఈ రీతిగా (క్రమంగా) కల్పిత జగత్ రూపంగా స్ఫురిస్తోంది.

విచార్య దృష్యై తదపి న కించదపి విద్యతే కేవలం భాతి చిన్మాత్రమాత్మనాత్మని నిర్ఘనమ్ ॥

ప్రియ రామచంద్రా! విచార దృష్టితో చూస్తే... ఈ కల్పిత జగత్తుకు కొంచెం కొంచెం కూడా ఉనికి లేదు. కేవలం ఆనందమయమగు చిన్మాత్రమే తనయందు తాను ఇట్లు భాసిస్తోంది.

యతో వాచో నివర్తన్తె, తూప్లీంభావో అవశిష్యతే

వ్యవహార్యసి ఖాత్మైవ తద్వత్ తిష్ఠతి మూకవత్ II

అట్టి ఈ జగత్తు ఎక్కడ దాకా కనిపిస్తుంది? వాక్-మనస్సులకు అగోచరమైనట్టి, నిరతిశయానంద రూపమై ఆత్మను గమనించనంతవరకే! ఆత్మ గమనించబడిందా, ఇక ఇది దృశ్యముగా గాని, జగత్తుగా గాని గోచరించదు. ఆత్మగానే గోచరిస్తుంది. ఇదంతా కేవలం మౌన స్వరూపంగా శేషిస్తోంది. ఓ రామచంద్రా! "నేను - ' నాకు కనబడే జగత్తు శుద్ధ సచ్చిదాత్మ స్వరూపమే!.... అని అనుభూత మొనర్చుకొన్న తత్త్వజ్ఞాని, ఇక ఆపై ప్రాపంచిక వ్యవహారములందు ముగ్ధుడు కాడు. సర్వవేళలా నిజ చిత్స్వరూపమునందే ఎప్పటియట్లు మౌన స్వరూపుడై ఉంటున్నాడు. తన యొక్క అట్టి నిశ్చలత్వమును ఈషణ్మాత్రం కూడా కోల్పోవటమే లేదు.

2. ఆత్మజ్ఞాన ప్రబుద్ధుని నిత్యమౌన స్వరూపం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆత్మ స్వరూపంలో ప్రబుద్ధుడైనపుడు ఈ జీవుడే పురుషోత్తముడు అగుచున్నాడు. నిశ్చల ఆత్మరూపత్వముచే కేవలం మౌనస్వరూపముగా శేషించుచున్నాడు. అనంతము, అపారము, చిన్మాత్ర రూపము, పరమ ప్రేమాస్పదము అయినట్టి "నిరతిశయానంద ఘనత్వము ను స్వయముగా అవధరించుచున్నాడు. జలము నందలి ద్రవత్వం చేత ఆవర్త - తరంగాదులు కల్పనచే కనిపిస్తున్నట్లు... బ్రహ్మము యొక్క అవిద్యా చమత్కారంలో చిత్తము, బుద్ధి, జగత్తుల - కల్పన స్వయంగా ప్రదర్శితమౌతోంది. ఆ ఆ ప్రబుద్ధుడు తనయొక్క, సర్వుల యొక్క చిత్త -బుద్ధి-జగత్తులను ఆత్మస్వరూప చమత్కారంగా ఆస్వాదిస్తున్నాడు.

Page:556

వాయువులో వాయుతరంగాలు అబుద్ధిపూర్వకంగా స్పందన ప్రభావంచేత కనిపిస్తున్నాయి. కానీ, వాయు తరంగాలుగా అనిపించేది వాయువే కదా! అవిద్యావృతుడగు పరమాత్మచే తనకంటే వేరుకానట్టి ఈ బుద్ధి చిత్తము-జగత్తుల కల్పన కావించబడుతోంది. వేలాది వాయుతరంగాలు వాయువుకంటే వేరుకానట్లే... చిదాభాస రూపులగు ఈ జీవులు "సాక్షి" యగు పరమాత్మకంటే ఏమాత్రం వేరు కానేకాదు.

అందుచేత... మహాప్రజ్ఞావంతుడగు ఓ రామచంద్రా! చిదాకాశం-బ్రహ్మము చిన్మాత్రముజీవచైతన్యము-మహాచిద్రూపము-పరమాత్మ ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని చెప్పే పర్యాయపదాలే! కంటిరెప్పలు మూసుకోవటం, తెరుచుకోవటం నిర్వర్తిస్తున్నట్లుగా .... అవిద్యావృతమగు బ్రహ్మము యొక్క భావనా వ్యాకోచముచే సృష్టి, భావనాసంకోచముచే ప్రళయం సంభవిస్తున్నాయి. వాయువు చలనముచే తరంగాలు, చలనరాహిత్యంచే తరంగ రాహిత్యం ప్రదర్శిస్తున్నట్లే బ్రహ్మమునందు సృష్టి - ప్రళయాలు ఉంటున్నాయి.

పరమాత్మయొక్క మహామనోవికాసమే దృశ్యము. భావన సంకోచమే... భావనా దృశ్యము యొక్క అభావం. కళ్ళు తెరవటం, మూయటం ఒకే కంటి రెప్పల చర్యయే కదా! రెప్పలు తెరిస్తే దృశ్యం. మూస్తే దృశ్యరాహిత్యం. అట్లాగే సృష్టి, ప్రళయాలు ఒకే చిన్మాత్రం యొక్క మాయా వ్యాకోచ-సంకోచాలు మాత్రమే! ఆ ఉభయాలు చిన్మాత్ర స్వరూపాలే! కాబట్టి దృశ్యం యొక్క భావ - అభావాలు రెండూ కూడా చైతన్యం నుండే స్ఫురిస్తున్నాయి.

ఈ దృశ్యము సత్తు-అసత్తు కూడా! చైతన్యమో... సర్వదా అనునిత్యసత్త స్వరూపమై ఉన్నది. నేత్రము యొక్క కదలికలే నేత్ర సంకోచ-వికాసాలు కదా! అందుచేత వికాసము సంకోచంకంటే వేరుకాదు. సంకోచము వికాసము కంటే వేరుకాదు. అట్లాగే సృష్టి - ప్రళయములు ఒకదానికంటే మరొకటి అభిన్నములు.

అందుచేత ఓ రామచంద్రా! ఈ సమస్త జగత్తునూ - "జన్మజరావర్జితము, సౌమ్యము, శాంతము, సృష్టి ప్రలయములందు సమరూపము - అగు చిదాకాశముగానే దర్శించు. ఆకాశము తనయందు కల్పితమైన నీలం రంగు కలిగివున్నట్లు... చైతన్యం కూడా అచేతనమగు జగద్రూపంగా స్ఫురిస్తోంది. ఏదైతే భాసిస్తోందో... అది జగత్ స్వరూపధారియగు చిన్మాత్రమే అయివున్నది.

ఈ దృశ్యం వాస్తవానికి ఉత్పన్నమవటమూ లేదు. నశించటమూ లేదు. ఎవరిచేతా అనుభవించబడటమూ లేదు. కేవలం అత్యంత నిర్మలమగు చైతన్యమే తనయందు జగత్ రూపమగు చమత్కారమును భావించుచున్నది. అట్టి ఈ దృశ్యం "మహా చిదాకాశం" అనే మణియొక్క కాంతి కిరణరూపమే! సూర్యకిరణం కంటే 'కాంతి' వేరుకాదు కదా! ఈ జగత్తు తన ఉత్పత్తి స్థానమగు చిద్రూపమణి’ కంటే వేరుకాదు. సుషుప్తియే స్వప్నంగా భాసిస్తోంది కదా! అట్లాగే బ్రహ్మమే సృష్టిగా భాసిస్తోంది. ఈ జగత్తు నానా రూపాలుగా కనబడవచ్చు గాక! కానీ, ఈ జగత్తంతా కూడా వాస్తవానికి ఏకము, శాంతము, శివరూపము, అద్వైత రూపము అగు బ్రహ్మమే! ఇక ఈ దృశ్య

Page:557

వ్యవహారమంటావా? ఇది సత్తు గావచ్చు. అసత్తు గావచ్చు. చైతన్యము దేనిని ఎట్లు (సత్తుగా - లేక అసత్తుగా) భావిస్తే అది అట్లే (చైతన్యముచే) పొందబడుతోంది.

ఓ రామచంద్రా! ఒకవేళ ఎవరైనా ఈ కనబడే జగత్తుకు పరమాత్మ కంటే వేరుగా - ప్రధాన అప్రధాన విభాగములనో, (లేక) పరమాణు నిర్మితమనో, మరింకేదైనా అన్యకారణంగానో కల్పించ యత్నిస్తే... అదంతా స్వప్న పదార్థాల గురించి చర్చలాగా యుక్తియుక్తం కాదు. స్వప్నంలో కనబడే గృహ గ్రామాలకు కారణం ఏమున్నది... ఆత్మ ఆయారూపాలు ధరించటం తప్పించి? కనుక బ్రహ్మముయొక్క స్వకీయ భావనా విశ్వాసమే ఈ జగత్తు! ప్రమాణాలకు అతీతమై, అనిర్వ చనీయమై ఉన్నదని, వాస్తవానికి ఈ జాగ్రత్ దృశ్యము ఏ సమయమందును స్వతహాగా ఉదయించనే లేదని నిరూపించబడుతోంది.

శ్రీరాముడు : కానీ స్వామీ! ఏ జగత్తు స్వతహాగా లేనేలేదని మీరు సిద్ధాంతీకరిస్తున్నారో... అట్టి ఈ జగత్తు అనేక సంఘటనలతోను, వస్తు-విశ్వాసములతోను కూడినదై ఈ జీవులందరికీ పరిపరి విధాలుగా ఎదురుగా ఘనీభూతానుభవంగా ఉంటోంది కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఎవని చిత్తము దేనియందు ఆసక్తమై ఉంటోందో... ఆతడు అద్దానినే అనుభవిస్తున్నాడు. అట్లాగే, ఎవని మనస్సు బ్రహ్మమునందే అనురక్తమై ఉంటోందో... అట్టి ద్రష్టకు ఈ జగత్తు జగత్తుగా కాకుండా బ్రహ్మము రూపంగానే గోచరిస్తోంది. అందుచేత ఓ జనులారా! ఈ జగత్తును మీ ఇష్టదైవంగా సర్వవేళలా సందర్శించటం అభ్యసించండి. ఎవని చిత్తము - ప్రాణము దేనియందు అనురక్తమై ఉంటే, అది సత్యజ్ఞాతమై అనుభూతమవటం ఈ సృష్టి యొక్క లక్షణమే సుమా! అంతేకాదు. బ్రహ్మమునందు అనురక్తి గలవానికి క్షణంలో ఇదంతా బ్రహ్మమైపోతోంది. దృఢ నిశ్చయమే అనుభవరూపం దాల్చుచున్నది. ("అనురక్తోహి జగత్ దృశ్యమ్).

శ్రీరాముడు : మహర్షీ! కొందరు బ్రహ్మవేత్తలగు మహనీయులు కూడా శాస్త్ర ప్రవచితములైన యజ్ఞ యాగాదులు నిర్వర్తించటం మా వంశ పూర్వీకులగు దిలీపుడు కుకుత్సుడు మొదలైన వారిలో - మనం గమనిస్తూ ఉన్నాం కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మవేత్తలు స్వనిశ్చితమగు "సర్వము సర్వదా బ్రహ్మమే! అని దర్శిస్తూనే, అట్టి సునిశ్చిత వస్తువుకంటే అన్యములైనట్టి శాస్త్ర మర్యాదలను అనుసరించి యజ్ఞ యాగ - దానాదులు, సదాచారం కొరకు, తదితరుల శ్రేయస్సు కొరకు స్వభావసిద్ధంగాను, అనాసక్తి పూర్వకం గానూ నిర్వర్తిస్తూ ఉంటారు. వారి పవిత్రమైన ఆశయంచేత అదంతా ఆత్మోపాసనయే అగుచున్నది.

ఓ ప్రియజనులారా! “నా ప్రియ పరమాత్మయే ఈ ఈ రూపాలుగా ప్రదర్శితులగుచున్నారు. నా యందు నా సర్వస్వం ఆయనయే! ఆయనకు అన్యంగా, భిన్నంగా నేనుగాని, నాకు కనబడే జగత్తుగాని లేవు” అను సర్వసమర్పణ బుద్ధితో ఆత్మ సాక్షాత్కారం నిర్వర్తించే మహనీయులు ఎందరో ఈ భూమిపై వెలసియే ఉన్నారు.

నేను చెప్పుచున్న ఈ ఉపాయం ద్వారా ఈ జగత్తంతా కూడా సత్తా మాత్రంగానూ, దృక్ రూపమగు పరబ్రహ్మముగాను అతి సులభంగా అభ్యాసముచే అనుభూతమవగలదు.

Page:558

ఎందుకంటే... ఇక్కడ వాస్తవానికి ద్వైత - ఏకత్వ కల్పనయే ఎప్పుడూ కూడా లేనేలేదు. దృశ్య రహితమగు బ్రహ్మమే సత్-అసత్మూర్త-అమూర్త' రూపమగు దృశ్యజగత్ ఆకారము ధరించుచున్నదను కృతనిశ్చయం గలవారికి ఇక ఆపై ఇక్కడ 'కర్త'గాని, 'భోక్త'గాని, జీవుడు ఉన్నాడు-లేడు ... మొదలైనవి గాని భాసించవు. ఎందుకంటే వారికిక్కడ సర్వము సర్వమయంగా, బ్రహ్మమాత్రంగా, బ్రహ్మమునకు అభిన్నంగా దర్శనమగుచున్నది.

వాస్తవానికి కేవల చిదన బ్రహ్మము జగత్తు యొక్క పర్యాయరూపమై, ఆద్యంతరహితమై, మహాశాంతమై అక్కడ - ఇక్కడ, అప్పుడు - ఇప్పుడు వెలయుచున్నది. మార్గమధ్యంలో గల ఒక విగ్రహం దొంగవలె కనిపించి భయం కలిగించునట్లు, ఈ జగత్తు బ్రహ్మమే అయివుండి, అజ్ఞులకు భయోద్వేగాలు స్వకీయ కల్పనచే కలుగటానికి అవిచారణమే కారణమగుచున్నది.

3. ఈ జీవితం మహత్తరమైన అవకాశం!

శ్రీ వసిష్ఠ మహర్షి :

యదేవ బ్రహ్మ బుద్ధ్యాది తదేవైతన్నిరజ్ఞనమ్ |

యదేవ గగనం శాస్త్రం శూన్యం విద్ధి తదేవతత్

ఓ రామచంద్రా! ఏది శాంతమైనట్టి ఆకాశమో అదియే 'శూన్యం' కూడా కదా! అంతేగాని, ఆకాశం వేరు, శూన్యం వేరు కాదుకదా! అట్లాగే ఏది నిరంజనము, దోషరహితము అగు బ్రహ్మమో... అదియే ఈ “బుద్ధి, మనస్సు, ఆలోచనలు, జగత్తు" మొదలైన వాటితో కూడిన ఈ దృశ్యం అయి ఉన్నదని గ్రహించు. ఒకనికి కంటి దోషం చేత ఆకాశంలో వెంట్రుకాకారాలు కనిపిస్తున్నాయనుకో. అవి ఉన్నాయా? కంటి దోషం లేనివానికి అవి లేవు. అగుపించవు. కంటిదోషం కలవానికో, - కనిపిస్తున్నాయి కాబట్టి... అవి ఆతనికి ఉన్నాయి. ఆ కనబడేవన్నీ ఆకాశమునకు అభిన్నమైనట్లు ...ఈ జగత్తు పరమాత్మకు అభిన్నం. పరమాత్మయందు అనంతరూప సంఖ్యలో బుద్ధులు, దేహాలు, మనస్సులు, అనుభవాలు - అనేకములుగాను, భిన్నములుగాను భాసించుచున్నప్పటికీ కూడా వేర్వేరు వస్తువులను ప్రకాశింపజేసే ఒకే సూర్యుని అనేక కిరణాలులాగా - వాస్తవానికి అవన్నీ కూడా బ్రహ్మమునకు అభిన్నములై ఉండి వర్తిస్తున్నాయి. సుషుప్తి నుండి స్వప్నంలోకి వచ్చినప్పుడు స్వప్నంలో కనిపించే అనేక రూపములన్నీ ఏకమగు సుషుప్తి రూపములేకదా! ప్రళయము నుండి సృష్టి రూపంగా ప్రవేశించి, ఈ సృష్టిగా కనబడుచున్నట్టి బ్రహ్మమునకు ద్వైత - అద్వైతాలు లేవు.

ఓ ప్రియ సర్వజనులారా! నేను చెప్పినదే చెప్పుచున్నప్పటికీ, ఇదంతా కూడా... మీకందరికీ పరమ సత్యమును మరల మరల సుబోధకం చేయటానికే సుమా!

1. మహాచైతన్యపు స్వకీయమైన నిర్మల చైతన్యం యొక్క కాంతియే జగద్రూపంగా భాసిస్తోంది. కానీ, వాస్తవానికి అది తన నిర్మలరూపంగానే భాసిస్తోంది. అనగా, జగత్తుగా కించిత్ కూడా అవటమే లేదు.

Page:559

2. చిదాకాశమున చిదాకాశమే ఉన్నది. తన యొక్క శుద్ధ చిదాకాశ స్వరూపము కొనసాగిస్తూనే స్వప్నంలోలాగా ఆ చిదాకాశము దృశ్య జగత్తుగా భాసిస్తోంది.

3. సద్వస్తువు కంటే వేరుగా మరి ఏ వస్తువు లేదు. ఉన్నదని ఎవరైనా అంటే అద్దానికి కారణమే లేదు. బాహ్యకారణమే లేనప్పుడు ఇక భిన్నమైనదెక్కడున్నది?

4. నిరాకారమగు చిదాకాశమే సృష్ట్యాది యందు జగదాకారంగా భాసిస్తోంది. అయితే అట్టి భావన స్వప్నంలోలాగా, సంకల్పంలోలాగా... మిథ్యాజ్ఞానమువలె సర్వదా భ్రమరూపమే అయివున్నది.

5. ఈ దృశ్యం స్వప్నం వలె సర్వవస్తుధర్మశూన్యమగు చిదాకాశమే అయివున్నది. చిదాకాశానికి జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. అవిద్యామలము చేత మాత్రమే చిదాకాశము ఇట్లు వికారవంతముగాను, వస్తుధర్మ సహితంగాను ప్రతీత మగుచున్నది.

6. స్వప్నాకారమగు ఈ జగత్తు చూడటానికి వస్తుధర్మసహితంగా కనబడుచున్నప్పటికీ... వాస్తవానికి సర్వధర్మరహితమై ఉన్నది. అధిష్ఠానమగు సన్మాత్ర బ్రహ్మము కంటే ఇది వేరేమీ కాదు. అజ్ఞానుల దృష్టియందు మాత్రమే ఇదంతా బ్రహ్మమునకు వేరుగా జగదాకారంగా స్థితినొందియున్నది.

కలలో కనిపించే పెద్దకొండ అసలైన రూపమేమిటైయున్నది? స్వప్నాధిష్ఠానమగు స్వప్న చైతన్యరూపమే కదా! అట్లాగే అధిష్ఠానమగు జాగ్రత్ చైతన్యమునకు, ఈ కనబడే జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. ఇదంతా చిదాకాశంలాగా అతి సూక్ష్మరూపంగానే సిద్ధిస్తోంది. సర్వరూప బ్రహ్మమే సృష్టిరూపంగా స్థితినొంది ఉంటోంది.

ఇప్పుడు నీకు ఈ అయోధ్య మొదలైన నగరాలన్నీ భాసిస్తున్నాయి కదా! అయితే... స్వప్నంలోని నగరాల రూపంలో ఆత్మయే భాసిస్తున్నట్లుగా ఈ ఈ నగరాదుల మన అనుభవమంతా మన ఆత్మ స్వరూప చమత్కారానుభవమే! స్వప్నంలో హృదయ కంఠ నాడీరంధ్ర ప్రదేశాలలో గృహములు - గ్రామములు మిద్దెలు - జనులు ఉంటారా? ఉండరు కదా! కానీ వాటి యొక్క 1. ప్రత్యభిజ్ఞానము 2. సంస్కారము 3. స్మృతి స్వప్నంలో సంభవములు అగుచున్నాయి కదా! ఆ మూడూ ప్రక్కన పెట్టామనుకో....! అప్పుడు బ్రహ్మ సంవిత్తే నిద్రాదోషముచే ఆ విధంగా భాసించుచున్న దగుచున్నది కదా! స్వప్నంలో 'ఊహ'చే కనిపించిన వాటిని జగత్తులో కనిపించే పదార్థముల సాదృశ్యము వలన స్మృతి’ యొక్క సాదృశ్యం కల్పించుకొని ఆ స్వప్న ద్రష్ట నాకు కలలో అది కనిపించింది. ఇతను కనిపించాడు అని స్మృత్యత్వం ఊహించుచున్నాడు. ఈ జాగ్రత్ కూడా అట్టిదే! అనేక దేహములకు సంబంధించిన ప్రత్యభిజ్ఞానము, సంస్కారములు, స్మృతి క్రోడీకరించుకొని, ఇప్పటి ఈ దృశ్యమునకు ఏదో అర్థమును ఊహించుకొని, నేను అది చేస్తున్నాను ... ఇది చూస్తున్నాను” అని అనుకుంటున్నాడు.

ప్రత్యభిజ్ఞానం - అప్పటి అదియే ఇది" అని తలచటం (తత్రైవ ఇతి)

సంస్కారములు - అనేకసార్లు నిర్వర్తించిన ఒక భావన అభ్యాసమై స్వభావంగా మారటం. ‘అభిప్రాయం’ అనే స్వభావం ఘనీభూతం కావటం.

Page:560

స్మృతి - కొన్ని జ్ఞాపకముంటాయి. కొన్ని మరచిపోబడతాయి. జ్ఞాపకమున్నవి వర్తమాన అనుభవమునకు ఇచ్చే అర్థాన్ని ప్రభావితం చేయటం.

వాస్తవానికి బ్రహ్మమునందు అనేక భిన్న జగత్తులు ఎప్పటికప్పుడు మరల మరల స్ఫురిస్తూ ఉండగా... ఈ జీవుడు, ప్రత్యభిజ్ఞానము (అదియే ఇది) అనే భ్రాంతి జ్ఞానమును కలిగివుంటున్నాడు. అయితే ఆయా భిన్న జగత్తులన్నీ కూడా అధిష్ఠాన చిదాకాశము కంటే ఏమాత్రం వేరు కాదు.

ఈ కనబడే నేల, ఆకాశం - ఇవన్నీ పరమాత్మయందు ఓత-ప్రోతములై ఉన్నాయి. అందుచేత ఇక్కడ అనేకత్వం ఏమాత్రం లేదు (నేది హ నానాస్తి కించన). ఇక్కడి విధి - నిషేధాలన్నీ విభక్తములై, మిళితములై... అధిష్ఠాన దృష్టిచే బ్రహ్మమునందే విద్యమానములై ఉంటున్నాయి. ఇక ఆరోపిత దృష్టితో చూస్తే ఇవేవీ మొదలే లేవు.

ఇక్కడ సంభవిస్తున్న అనేకానేక విషయాలు : తస్మాత్ సత్బ్రహ్మ సర్వాత్మకమివాత్ర న విద్యతే! ఈ లోకంలో అనేక వ్యక్తిగత, సాంఘిక, సైద్ధాంతిక, వ్యావహారిక, సంఘటనపరమైన అనేక సంబంధాలు, అనుభూతులు, బాంధవ్యాలు, ప్రేమాస్పద స్పందనలు, అనుబంధాలు ఏర్పడుచున్నాయి. తొలగిపోతున్నాయి. ఎందుచేతనంటావా? సద్రూపమగు ఆ బ్రహ్మము సర్వాత్మకం కదా! అందుచేత అయ్యది తన నిజమాయాశక్తి చమత్కారంచేత ఇక్కడ సంఘటితం కానిదేమున్నది? ఆ బ్రహ్మ సత్తయే సర్వుల రూపమై వెలయుచున్నది. అందుచేత ఈ సమస్త జగత్తు బ్రహ్మరూపమై, సద్రూపమై ఒప్పుచున్నది.

“పరమాత్మ - జీవుడు గురించి వివిధ వాదముల చమత్కారం - బ్రహ్మసత్త... సర్వాత్మకమని మనం చెప్పుకున్నాం కదా! కాబట్టే బ్రహ్మసత్త యందు వివిధ వాదుల యొక్క సమస్త కల్పనలకు ఇక్కడ అనవరోధపూర్వకంగా నిజమే అనే అనుభవత్వం సిద్ధిస్తోంది. సర్వకల్పనలను త్యజించినవానికి మోక్షం కూడా అట్లే సిద్ధిస్తోంది. ఎట్లా అంటావా? ఏదో ఆటలాగా ఒక బాలుడు తనచుట్టూ తాను కాసేపు తిరుగాడాడనుకో! ఆ ప్రక్కనేగల మరొక బాలుడు చూస్తూ నిలబడ్డాడనుకో! మొదటి బాలునికి తాను నిలబడిన నేల గిర్రున తిరుగుచున్నట్లు అనిపిస్తుంది. అది ఆతనికి సత్యం. ఆ

రెండవ బాలునకో... అంతా ఏదీ కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఈతనికి సత్యం.

అజ్ఞానుల దృష్టిలో అజ్ఞాన భ్రమ ఉన్నది. వారికి ఈ దృశ్యము స్థిరంగా ఉన్నట్లుగా అగుపిస్తోంది. అది వారికి సత్యమే! అయ్యో! వాళ్ళు నన్ను అంతమాట అన్నారే... ఇంత సహాయం నేను వాళ్ళకు చేసియున్నప్పటికీ కూడా? అనునది ఆ ద్రష్టకు సత్యం. కానీ, - జ్ఞానికి ఈ వర్తమాన జగత్తు స్వప్న సదృశంగాను, మొదలే అవాస్తవంగాను అగుపిస్తోంది. అజ్ఞాని ఎంతగా సత్యమనుకుంటున్నాడో... జ్ఞాని అంతగానూ ఇది కేవలం భ్రమగా గమనిస్తూ చిరునవ్వుతో దర్శిస్తున్నాడు.

మోక్షోపాయం - ఏది ఏమైతే ఏం? ఒకడు జ్ఞాని అయినా, లేక అజ్ఞాని అయినా... ఆత్మ స్వరూపమునందలి స్థిరత్వం (నేను సర్వదా అఖండము - అప్రమేయము - నిత్యము -నిత్యసత్యము - సర్వము అగు ‘ఆత్మనే’ అనే స్థిరభావం) అనే అభ్యాసం లేకపోతే ఈ దృశ్యము శమించటం కల్ల.

Page:561

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ దృశ్యము పట్ల ఏర్పడే అనుబంధకమునకు సంబంధించిన (ఇది సత్యమే అనే రూపంలో ఉండే) సంసారదోషం తొలగితేగాని దుఃఖం ఉపశమించదు కదా! అట్టి ఈ సంసారదోషం ఈ జీవునకు మొదలంటా తొలగేది ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవును. అట్టి సంసారదోషం తేలికగా పోయేది కాదు. మరి అది జన్మ జన్మార్చితం కదా! ఎట్లా పోతుంది? అయితే అందుకు ఉపాయం లేకపోలేదు సుమా! సాధక జనులు నిరుత్సాహపడవలసిన పనేమీలేదు. ఓ ప్రియ జనులారా! అట్టి మోక్షమును కరతలామలకం చేసుకొన్న మహనీయులు భూమిపై సర్వజీవజాతులలోను ఉన్నారు. ఈ వర్తమాన యోగవాసిష్ఠం’ అని ప్రసిద్ధికి ఎక్కబోయే శాస్త్రం యొక్క శ్రవణ - మననాలు మోక్షము ఎంత సులభమో చెప్పటానికే ఉద్దేశించబడింది. అంతేగాని, “అది చాలా కష్టం అని చెప్పి ముగించటానికి కాదు సుమా! ముందుగా విజ్ఞులగు సద్గురువులను గుర్తించండి, వారిని మీ సేవలచే మెప్పించి "మేము మోక్షశాస్త్రం వినాలని, గ్రహించాలని మీ పాదారవిందములు ఆశ్రయిస్తున్నాం. అందుకు పట్టుదల కలిగి ఉన్నాం అని సుస్పష్టపరచండి. అప్పుడు మోక్షోపాయమైన ఇట్టి శాస్త్ర బోధ శ్రద్ధగా శ్రవణం చేయండి. ఆ తరువాత నిధి ధ్యాసనముల ద్వారా ఆ పాఠ్యాంశములను హృదయస్థం చేసుకోండి. ఈ దృశ్యము బ్రహ్మమే! ఆత్మరూపమే! నా రూపమే”... అనే పరమ సత్యం సుస్పష్టంగా, సంశయరహితంగా అనుభూతమవటానికి అనుభవజ్ఞుల వాక్యప్రవాహం తప్పితే వేరే ఉపాయమే మున్నది? ఉండలేదు. ఉండబోదు.

న జీవన్, న మృతం చిత్తం రోధమాయాతి సంస్కృతేః

అవినాభావిదేహత్వాత్ బోధాత్వేతన్నపశ్యతి I

ఓ ప్రియ సభికులారా! ఈ చిత్తము, సంసారము అనబడే రెండూ అవినాభావమైనట్టి ఒకానొక సంబంధం కలిగి ఉంటున్నాయి. ఒకటి ఉంటే రెండవది ఉంటోంది. అయితే ఈ చిత్తము యొక్క పరిస్థితి ఏమిటి? జాగ్రత్-స్వప్నములలో గంతులు వేస్తోంది. సుషుప్తికి వచ్చేసరికి లయించి పోతోంది. జాగ్రత్-స్వప్నములలో మాత్రం అది "యోగాభ్యాసం, తీర్థాలు సేవించటం, క్రతువులు నిర్వర్తించటం ....మొదలైన ప్రయత్నములచే నిరోధించబడినప్పటికీ, మరల తగుదునమ్మా!” అని ఎప్పుడో బయల్వెడలి కుప్పిగంతులు ప్రారంభిస్తోంది.

అయితే... మోక్ష శాస్త్రము యొక్క అభ్యాసము చేత జనించే జ్ఞానముచే ఈ 'సంసారము’ అనబడేది మొదలంటా శమించినదై, ఇక మరల చిగురించటం లేదు. (జ్ఞానేదైవ తు కైవల్యమ్). కాబట్టి ఈ శాస్త్రము యొక్క అభ్యాసం చిత్త నిరోధమునకు ఉపాయమే అయివున్నది.

ఈ చిత్తము సంసారముతో అవినాభావ సంబంధం కలిగియున్నదని చెప్పుకున్నాం కదా! అట్లాగే... ఈ చిత్త, సంసారములు శరీరముతో అవినాభావం కలిగి ఉంటున్నాయి. ఈ శాస్త్రాభ్యాసం చేత దేహినైన నేను సర్వదా దేహము కంటే వేరై, సమున్నతుడనై, నిర్మలుడనై, అప్రతిహతమైన సర్వాత్మకమైన-సువిశాల స్వరూపుడనై ఉన్నాను ... అని ఆ అభ్యాసకుడు గ్రహిస్తున్నాడు. అభ్యాసకుడు

Page:562

ఎవరైనా యోగవాసిష్ఠ మోక్షశాస్త్ర కథన ప్రభావంచేత ఇప్పటికిప్పుడే, ఈ జన్మయందే తత్త్వబోధచే చిత్తమును సంసార దృష్టి నుండి నివర్తింపజేసుకుంటున్నాడు. లేదా... ఆతని ప్రతిబంధకములు ఒకవేళ బహుళంగా ఉంటే మరుజన్మలో తప్పక (ఈ గ్రంథం అందించే జ్ఞాన బలంచేత) చిత్త శమనమును పొందుచున్నాడు.

వాయుచలనముచే దూదిపింజములవలె ఆకాశంలో ఎగిరే మేఘపుంజములు గాలి వీచికలు శమిస్తే ఆకాశంలో కదలక ఉంటాయి కదా! జ్ఞానముచే అవిద్యకు కారణములు శమిస్తూ వస్తాయి. ఇక ఆపై ఈ చిత్త దృశ్య శరీర భావములు కారణరహితమై పోతాయి. ఈ మూడు శమిస్తే ఇక శేషించేది ఆత్మతత్త్వమే! ఎందుకంటే చిత్త - దృశ్య - శరీరమేవాహంకారాలకు అజ్ఞానమే కారణం! అట్టి అజ్ఞానమో... ఒకింత సంస్కరించబడిన బుద్ధి గలవాడు ఈ శాస్త్రమును అధ్యయనం చేస్తే తప్పక శమించగలదు.

ఈ గ్రంథం పూర్వ విభాగంలో విషయాలన్నీ చర్చించబడియే ఉన్నాయి. అప్పటికీ ఏమేమి బోధపడలేదో అవన్నీ ఈ ఉత్తరార్ధం చదవటంచేత తప్పక సుబోధపడగలదు. పదపదార్థ జ్ఞానం కూడా చక్కగా అలవడగలదు. ఈ గ్రంథం తదితర గ్రంథాల కంటే కొంత విలక్షణమై ఉన్నది. సంసార భ్రమ వినాశమునకై ఉత్తమ ఉపాయం. అందుచేత పూర్వార్ధ ఉత్తరార్ధములలో ఒక విభాగంగాని, రెండూగాని చక్కగా పఠించి విచారించండి. దీనిచే సర్వదుఃఖాలు తప్పక తొలగుతాయి.

ఒకవేళ ఎవరైనా, “ఈ శాస్త్రము వేద విభాగం కాదు కదా! వేదసారములైన ఉపనిషత్తులే మాకు రుచిస్తాయి ...అని అంటారా! సరే, మంచిదే! ఉపనిషత్తులలో చెప్పినదే ఈ శాస్త్రంలో యుక్తి యుక్తంగా చెప్పబడింది కదా! వేదముల విభాగమైన ఉపనిషత్ సారమే ఇందులో పాఠకులకు వినపడగలదు. కాబట్టి ఉపనిషత్తులు పఠిస్తామని అన్నా కూడా మాకేమీ అభ్యంతరం లేదు. ఏది ఏమైనప్పటికీ ఒక్క విషయం నేను ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. ఓ సర్వజనులారా! ఆత్మజ్ఞానమును ప్రతిపాదించే శాస్త్రముల పట్ల బద్ధకము - అశ్రద్ధ కలిగి ఉండకండి. మీరు ఆత్మజ్ఞానం పొందుటకు మానవజన్మ అత్యంత దుర్లభమైన - ఉత్తమమైన అవకాశం అయివున్నది నాయనలారా!

అనర్థేన అవిచారేణ వయః కుర్యాత్ న భస్మసాత్ |

బోధేన జ్ఞానసారేణ దృశ్యం కర్తవ్యమాత్మసాత్ ॥

అవిచారణ అనే అనర్థమును ఆశ్రయించి మహదవకాశమైనట్టి ఆయుష్షును బూడిదపాలు చేసుకోకూడదు సుమా! శ్రవణ-మనన-నిధి-ధ్యాసాది ఉపాయములచే తత్త్వజ్ఞానం (తత్ - త్వమ్ - నాకు ఎదురుగా కనిపించే నీవు ఆ పరమాత్మ స్వరూపమే. నా స్వరూపం కూడా పరమాత్మయే! కనుక నీవు నా స్వరూపుడవే... అనే జ్ఞానం) చేత ఈ దృశ్యమును ఆత్మయందు లయింజేసి ఇదంతా ఆత్మరూపంగా చేసివేయండి.

ఆయుషః క్షణ ఏకోపి సర్వరత్నైః న లభ్యతే | నీయతే తద్మృథా యేన ప్రమాదః సుమహానహో ||

Page:563

ఓ ప్రియ జనులారా! "ఆ! ఇవన్నీ తెలుసుకోవటానికి మాకు చాలా సమయం ఉన్నదిలెండి. అప్పుడే ఇవన్నీ దేనికి?” అని ఆత్మజ్ఞాన సముపార్జనం విషయంలో అనేకులు అశ్రద్ధయే కలిగి ఉంటున్నారే! ఇది ఉచితం కాదు. ఆయుస్సు యొక్క ఒక్క క్షణం వ్యర్థంగా గడచిపోయినప్పటికీ, ఆ ఒక్క క్షణమును సమస్త రత్నములు ఇచ్చి కూడా సంపాదించుకోలేరని తాత్సారం చేసే వారందరికీ మా హెచ్చరిక! ఆత్మ విచారణ లేకుండా ఆయుస్సు గడపివేయటం సర్వ అనర్థములకు మూలమని, మహాప్రమాదకరమైన విషయమని మీరంతా గుర్తుపెట్టుకొని ఉండండి.

అనుభూతమపిచ నో దృశ్యమిదం ద్రష్ట సహితమపి |

స్వప్న నిజమరణ బాంధవరోదనమివ, సదివ కచితమపి ॥

ఓ రామచంద్రా! ఒకానొకడు నిద్ర నుండి లేచి తన మనుమడి దగ్గరికి వెళ్ళి గాభరాగా... ఓరే! మనవడా! ఇప్పుడు నాకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చిందిరా! అన్నాడు. “తాతా, కలయా? ఏమని? అని ఆ మనుమడు ప్రశ్నించాడు. అప్పుడా ముసలాయన, “నాయనా! నేను మరణించాను. అప్పుడు నా చుట్టూ చేరి నీవు, మీ నాన్న, మీ అమ్మ, మీ బామ్మ, మీ బాబాయి... అందరూ ఎలుగెత్తి దుఃఖిస్తున్నారు... అని చెప్పసాగాడు.

అపుడా మనుమడు తాతా! ఆగాగు! నీవు మరణించావు కదా! మరి ఆ స్వప్నంలో మా ఏడ్పులు నీకెట్లా వినిపించాయి? అని ప్రశ్నించాడు. ఆ తాతకు సమాధానం దొరకలేదు. అవును. అదంతా మిథ్యయే కదా! అని సమీక్షించక తప్పలేదు.

'స్వప్నంలో తాను మరణించటం' అనేది, చుట్టూ బంధువులు రోదించటమనేది ఆ స్వప్న కాలంలో సత్యముగా భాసించవచ్చుగాక! వాస్తవానికి అదంతా మిథ్యయేనని జాగ్రత్ సమయంలో ఆ జాగ్రత్ ద్రష్ట ఒప్పుకోక తప్పలేదు కదా! అట్లాగే ఈ దృశ్యము ప్రత్యక్షంగా అనుభూతమవచ్చు గాక! అంతఃకరణోపహితమగు జీవుడు ద్రష్టత్వముతో కూడి ఉండవచ్చుగాక! అయినప్పటికీ జ్ఞానదృష్టిచే” ఇదంతా మిథ్యయే అని సుస్పష్టమగుచున్నది.

4. బ్రహ్మదేవుని జగత్ వ్యాఖ్యానం

శ్రీరాముడు : హే మహర్షీ! జగత్తు మిథ్య అని, జగత్తు లేదని, జగత్తు ఆత్మ రూపమేనని... ఇంకా ఆయా జగత్ను దర్శించే అనేక ఉపాయాలు చెప్పారు, మంచిదే! జగత్తు ఎట్టిదో అనేక కోణాల నుండి మీరు సుదీర్ఘంగా మహాశవోపాఖ్యానంలో కూడా ఉపన్యసించారు.

కానీ స్వామీ! అనేక అసంఖ్యాక జగత్ సమూహాలెన్నో గడచిపోయాయి. మరి ఇంకెన్నో జగత్తులు ముందు ముందు రానున్నాయి. ఈ 'జగత్తు లేదు' అను ప్రసంగము ద్వారా బంధము యొక్క అభావం సుస్పష్ట పరచుకోవటం ఎట్లా?

పూర్వ జగత్తు లేదు. రాబోయే జగత్తులు లేవు అని మీరు యుక్తియుక్తంగా చెప్పుకుంటూ

Page:564

వస్తున్నారు. అయితే, పూర్వ జగత్తులు గడచిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటి గురించి మనం చర్చించవలసిన పనిలేదు.

రాబోయే జగత్తులు ఇప్పటికి మనకు బంధం కాదు. భూత భవిష్యత్ జగత్తుల బంధము లేదు' అనునది స్వతహాగానే సిద్దించుచున్నది. ఇప్పటి ఈ జగత్తే కదా, బంధం! కాబట్టి వర్తమాన జగత్తు మా పట్ల ఎట్లా తొలగుతుందో... అద్దాని గురించి బోధింపమని నా విన్నపం.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మోక్షశాస్త్ర శ్రవణానికి నీవు అధికారివి (అర్హుడవు) అయి ఉన్నావు. అట్టి నీవు 'జగత్తు' అనబడు దాని యొక్క శబ్ద-అర్థములు, అద్దానితో జీవునికి గల సంబంధం చక్కగా ఎరిగివుంటే చాలు. ఇక మన భూత - భవిష్యత్ బ్రహ్మాండముల కథనం వ్యర్థం అవదు. ఎందుకంటే, భూత భవిష్యత్ బ్రహ్మాండముల వంటిదే వర్తమాన బ్రహ్మాండము కూడా!

భూతకాలిక - భవిష్యత్ కాలిక బ్రహ్మాండముల గురించి (మహాశవోపాఖ్యానంలో) విచారణ చేయటంలో ఒకానొక ముఖ్యోద్దేశం ఉన్నది. అది ఏమంటే... జీవుని యొక్క ఈ వర్తమాన పదార్థ సంబంధం, భూతకాలిక వ్యవహారముతోనే ముడిపడి ఉన్నది. భూత - భవిష్యత్తుల రెండింటినీ వచించకపోతే అధ్యాత్మ శాస్త్రము నందు ప్రవృత్తి సంభవించదు.

ఒకనికి ఒక అత్యాశ్చర్యం, అత్యావశ్యకం అయిన విశేషం గురించి చెప్పదలచుకున్నామనుకో! అప్పుడు ఆ వినేవానికి ఆతనికి తెలిసిన శబ్దాలు ఉపయోగించి చెప్పితేనే ఆతడు సులభంగా ఆ విషయం గ్రహించి అవగాహన చేసుకోవటానికి, ఆనందించటానికి వీలుంటుంది కదా! కాబట్టి అధ్యాత్మ బోధలో భూతకాలిక బ్రహ్మాండ వ్యవహారాల గురించి చెప్పటంలో ఉద్దేశం అట్టిదే! ఓ రామచంద్రా! ముందుగా మరొక విషయం ప్రస్తావిస్తాను. నీవు జ్ఞేయమగు పరమాత్మను ఎరిగినావనుకో. (విదితవేద్యుడవయ్యావనుకో)... అప్పుడు త్రికాలములలో సమరూపమైయున్న నీ స్వరూపమును ఎరుగగలుగుతావు కదా! “సర్వదా సమము అయివున్న నీ స్వరూపం గురించి బోధించటానికి భూత-భవిష్యత్ వర్తమాన జగత్తులలో ఏది తీసుకుంటే మాత్రం ఇబ్బంది ఏముంది? వాటి అన్నిటికీ అప్రమేయమైన నీ స్వస్వరూపమగు ఆత్మ గురించిన జ్ఞానము దృష్ట్యా ఆ మూడు స్వప్నతుల్యమేనని ప్రత్యక్షంగా గ్రహించటమే ఇక్కడి ఉద్దేశము సమస్తమునకు ఆది” అగు చిన్మాత్రమే స్వయంగా స్వప్నంలో జగత్తు రూపంలో భాసిస్తోంది! భూత-వర్తమాన-భవిష్యత్ సమస్త సృష్టులకు మునుముందుగానే స్వస్వరూపమగు చిన్మాత్ర బ్రహ్మమే ఉండివున్నది. అదియే సర్వకాల జగత్తులుగా భాసిస్తోందాయే! అట్టి చిన్మాత్రమునకు అన్యమైనదంటూ ఎప్పుడూ లేదు!

ఓ రామచంద్రా! ఇక ఈ వర్తమాన జగత్ విషయానికి వచ్చాం అనుకో! ఆ పరమాత్మ యొక్క మాయాశక్తిచే ఒక్కొక్క అణువునందు అసంఖ్యాకములైన బ్రహ్మాండాలు వర్తించుచున్నాయి. అట్టి అసంఖ్యాక బ్రహ్మాండాలు లెక్కపెట్టడం ఎవరి తరం? అణువణువులో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి అనే విషయం పూర్వం ఒకసారి మా తండ్రి, సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఒకానొక విశేషపూర్వకమైన వివరణతో నాకు బోధించటం జరిగింది. ఆ విశేషం ఇప్పుడు వివరిస్తాను.

HH

Page:565

ఒకసారి నా తండ్రి శ్రీ బ్రహ్మదేవులు పద్మమునందు జగన్మాత సరస్వతీదేవితో కూడుకొని సుఖాసీనులైన తరుణంలో, వారిని సమీపించి మాతా పితల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రమాణమములు సమర్పించి నేను ఇట్లా ప్రశ్నించాను:

నేను : హే మహాత్మా! ఈ జగత్ సమూహములు దశదిశలా వ్యాప్తమై కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఎంత విస్తీర్ణంగా వ్యాపించి ఉన్నాయి? ఇవి అసలు ఎచ్చట భాసిస్తున్నాయి?

బ్రహ్మదేవుడు : ఓ ప్రియపుత్రకా! బ్రహ్మమే ఈ సర్వజగత్ రూపములుగా భాసిస్తోందయ్యా! అయితే ఇక్కడ ఒక విశేషం నీవు గమనించు. బ్రహ్మమును ఎరిగిన తత్త్వజ్ఞానులకు ఈ జగత్తులన్నీ బ్రహ్మ సత్తారూపంగానే భాసిస్తున్నాయి. అజ్ఞానులకో... ఇవి జగద్రూపములుగా కనిపిస్తున్నాయి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇట్లా చెప్పి ఆయన ఈ వ్యష్టి - సమష్టి యొక్క సృష్టి విశేషం ఏ విధంగా ఏర్పడు తోందో చెప్పారు. చెవులకు ఇంపైనట్టి అట్టి బ్రహ్మాండాఖ్యాయిక అని, “బ్రహ్మాండపిండాఖ్యానము” అని చెప్పబడే ఆ విశేషాలు విను.

#

బ్రహ్మాండాఖ్యాయిక - - బ్రహ్మాండపిండాఖ్యానము -

బ్రహ్మదేవుడు : మొట్టమొదట నిష్ప్రంచకమగు చిదాకాశ పరమాణువు మాత్రమే ఉన్నది. అది సర్వదా సర్వత్రా తనకంటే వేరైనదంటూ ఏదీ లేకయే వర్తిస్తోంది.

స్వప్నానికి దృశ్యంలాగా, ఆకాశానికి శూన్యంలాగా, వాయువుకు స్పందనలాగా ఆ చిదాకాశ పరమాణువు తనయందు 'సమష్టి జీవత్వము'ను గాంచుచున్నది. అయితే ఆకాశ సదృశమగు అట్టి సమష్టి జీవత్వము గాంచుచున్నప్పుడు తన నిర్వికార - అసంగ - పరిపూర్ణ - సూక్ష్మ చిద్రూపమును ఏమాత్రం త్యజించటమే లేదు. అట్టి ఆకాశ సదృశ సమష్టిరూప అహంకారం తనయందు 'బుద్ధి' అను దానిని గాంచుచున్నది. అట్టి బుద్ధి 'నిశ్చయము'చే నిర్మితమై ఉన్నది. అది అసత్ పదార్థముల గురించిన భ్రమ కలిగి ఉండటం జరుగుతోంది. అందుచేత అట్టి బుద్ధి మాయ యొక్క అనురూపంగా చెప్పబడుతోంది.

ఆ బుద్ధి వికల్పరహితమగు తనను వికల్ప భాసముల యొక్క ఆరోపణములచే తనే స్వయంగా క్రిందికి నెట్టుకొనుచూ, క్రమంగా స్వప్నంలోలాగా... మనస్సును గాంచుచున్నది.

ఆ మనస్సు తన దేహమునందు అసన్మయము అగు మనస్సు’ను గాంచుచున్నది. ఇక ఆపై ఈ త్రిలోకముల వ్యవహారమంతా అనేక అనుభూతములచేతను, స్థావర - జంగమరూపులగు అనేక ప్రాణికోట్లచేతను వ్యాప్తమై ఉన్నట్లుగా దర్శిస్తోంది. ఇక ఇందులో 'కాలము' యొక్క కల్పన, పదార్థముల పరస్పర సంగమం, కల్పించబడుతోంది.

స్వప్నంలో లాగా... త్రిలోకాలలో ప్రతి వ్యష్టి జీవుడు తనకు ప్రత్యేకంగా 1. ద్రష్ట-దర్శన -దృశ్యములు 2. భోక్తృ-భోగ-భోగ్యములు 3. కర్త-క్రియా-కార్యములు అను 'త్రిపుటిత్రయం’ (3×3=9) రంగుటద్దం లోంచి ఈ త్రిలోకములను గాంచుచున్నాడు.

Page:566

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇట్లా అనేక విశేషాలు వారు చెప్పారు. ఆ రోజు సంభాషణ సారాంశం నా మాటలలో చెప్పుచున్నాను. సభికులంతా వినండి.

ఓ రామచంద్రా! నీకు స్వప్నంలో పదిమంది మిత్రులు, నీ సోదరులు ముగ్గురు కనిపిస్తు న్నారనుకో, వారందరు ఎవరికి వారుగా వేరువేరుగా కనిపిస్తారు కదా! అదే రీతిగా ఈ జాగ్రత్తునందు కూడా ప్రతివ్యష్టి జీవుడూ తన హృదయంలో ద్రష్ట - దర్శన - దశ్య, భోక్తృ - భోగ - భోగ్య, కర్తృ - - క్రియా కార్యములు అనే త్రిపుటీత్రయ (9) దర్పణమును హృదయాకాశంలో నిర్మించుకుంటున్నాడు. ఆ దర్పణంలో స్వర్గ - మర్త్య - పాతాళలోకములను కల్పించుకొని అనుభవ పరంపరలను కొనసాగిస్తున్నాడు.

చూచావా రామచంద్రా! ఈ విధంగా చిదాకాశ పరమాణువు తన యొక్క అతి సూక్ష్మమైన ఉదరమునందు ప్రత్యేక జీవభేదములచే విభిన్నమైనట్టి (ఇందాక చెప్పుకున్న) అనేక కల్పిత విశాల మహాజగములు కలిగి ఉంటోంది. అయితే ఏ వ్యష్టి సహిత అసంఖ్యాక మహాజగత్తులు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పుకుంటున్నామో... అదంతా కూడా అవిద్యయే అయివున్నది.

ఇక అవిద్య అనగా? స్వాత్మ తత్త్వమును గూర్చిన అజ్ఞానము యొక్క రూపమే సుమా! అట్టి అవిద్య అనంతమై, అనుక్షణికమై ఒప్పుచున్నది. కానీ... ఆత్మజ్ఞానము అనే దీపకాంతిని ప్రసరింపజేసి చూస్తేనో... అంతా నిర్మల పరబ్రహ్మముగానే అగుచున్నది, కానవచ్చుచున్నది. ఈ విధంగా "ఈ కనబడే సమస్తం బ్రహ్మమే అనబడు బ్రహ్మీదృష్టి' సముపార్జించుకొన్న వానిని 'తత్త్వవేత్త' అని, విదిత వేత్త' అని, 'బ్రహ్మయశస్వి' అని, 'జీవన్ముక్తుడు' అని, 'వేదవేద్యుడు' (తెలుసుకొనవలసిన దానిని తెలుసుకున్నవాడు) అని, 'ఆత్మజ్ఞాని' అని, 'పండితుడు' అని శాస్త్రకారులు పిలుస్తున్నారు. అట్టి తత్త్వవేత్తకు ఇదంతా స్వప్నముతో సమానమైనదే అగుచున్నది. అనుభవ స్వరూపుడగు ద్రష్టయే స్వప్న తుల్యమగుచుండగా... ఇక ద్రష్టకు సంబంధించిన దృశ్యము గురించి వేరే చెప్పేదేమున్నది?

సర్వము బ్రహ్మరూపమై, ద్రష్ట - దృశ్యములే లేవని నిర్ధారించబడుచుండగా... ఇక ద్వైతమెచట? దానికి కారణమెచట?

కాబట్టి రామచంద్రా! కేవలము మహాశాంతము - భేదరహితము - నిర్మలము - ఆద్యంత పరివర్జితము”... అయినట్టి చిదాకాశరూపమగు బ్రహ్మమే తనయందు ఇట్లు సమస్త జగద్రూపంగా స్థితినొందియున్నదగుచున్నది. సముద్రంలో 'తరంగ వేగము' అనే కారణంచేత చంచలమై ఉంటున్న జలంలో అసంఖ్యాక పరమాణు సమూహములు వర్తిస్తున్నాయి కదా! అట్లాగే అజ్ఞానము ఉన్నంతవరకు పరమాత్మ యందు లక్షల - కోట్ల కొలది బ్రహ్మాండములు మనం చెప్పుకుంటున్న రీతిగా ఒకదానికొకటి (బ్రహ్మము రూపముచే) అభిన్నమైనప్పటికీ భిన్నమైనవాటివలె భాసిస్తున్నాయి.

అజ్ఞాన దృష్టిచే ఇట్టి ఈ జగత్తులకు అంతంలేదు. జ్ఞానదృష్టిచే జగత్తులు ఇప్పుడు లేవు. ఇతఃపూర్వం లేవు. ఇక ముందు ఉండబోవు,

Page:567

తత్త్వవేత్తల దృష్టిలో ఈ అసంఖ్యాక జగత్ సమూహాలన్నీ స్వస్వరూప చిదాత్మరూపమే అయివున్నాయి. ఇక అట్టి జగత్తులకు భూతకాలమని - వర్తమానకాలమని - భవిష్యత్ జగత్తు అని చెప్పుకోవలసినది ఏమున్నది? ఉన్నదానికైతే కాలమానం. లేనిదానికి కాలమానమేమిటి? కథలో కల్పించబడిన అనగా అనగా ఒక రాజు, - ఇప్పుడున్నాడా?".... అను చర్చకు ఉపక్రమించలేం కదా! కథ విని ఊరకుంటాం. ఈ జగత్తు కూడా అంతమాత్రమే!

5. ఈ జగత్తులు కల్పనా దృష్టిచే కారణ సహితం ! యథార్థ దృష్టిచే కారణ రహితం!

శ్రీరాముడు : మహాత్మా! శ్రీ వసిష్ఠ మహర్షీ! ఈ జగత్తులు యథార్థ దృష్టిచే కారణ రహితమని మీరు ప్రవచిస్తున్నారు కదా! ఇదంతా కూడా స్వప్నంలోలాగా, సంకల్పంలో (ఊహలో) లాగా... కారణ రహితంగా బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచున్నదని కదా సిద్ధాంతం! అప్పుడు ఈ జీవుడు ఏఏ వస్తువులను కోరుకొంటే ఆయా వస్తువులు తమంతట తామే అప్పటికప్పుడే కారణరహితంగా సంభవించాలి కదా! అట్లా జరగటం లేదేం? ఉదాహరణకు ఒక రైతు అత్యధికంగా ధాన్యం పండించాలనుకున్నాడనుకోండి. ఆ రైతు కార్య రూపమగు కృషి - సకాలంగా వర్షం కురియటం

ఇవన్నీ ఒనగూడితేనే సాధ్యపడుతోంది. ఈ జగత్తులో కొంచెం కూడా కారణం లేకుండా ఏదీ సంభవించటం లేదు కదా! అకారణంగా బ్రహ్మము నుండి జనించిన ఈ జగత్తులలో అనివార్యమగు కార్య-కారణ వ్యవహారం ఎట్లా ఏర్పడుతోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవుని గురించి రెండు విభాగములుగా బోధ కొరకై విభజించి చెప్పబడుతోంది. 1. నిర్మల చిదాత్మ, 2. అద్దాని భావనా వైశిష్ట్యము... ఈ విధంగా ద్రష్టాహంకారము - వ్యవహార దశ అనే రెండూ స్వప్నతుల్యంగా ఏర్పడి ఉంటున్నాయి.

వ్యవహార దశ - - ఈ వ్యవహార దశయందు ఎవడు దృఢమైన అభ్యాసంచే... దేనిని ఎట్లు భావిస్తాడో, కల్పిస్తాడో... అద్దానిని అట్లే కల్పితమైన కార్యనియమబద్ధంగా గాంచుచూ ఉంటాడు. ఎవనికి వ్యావహారిక నియమము దృష్టియందు ఉండదో... ఆతనికి కల్పనయే ఉండజాలదు. కనుక “కల్పనామయమగు ఈ దృశ్యము ఇట్లు అనిపించటానికి కారణం దృక్ స్వరూపుడగు ద్రష్ట స్వయంకృత కల్పనా విశేషమే”.... అని చెప్పబడుతోంది.

యథేదం కల్పితం దృశ్యం మనసా యేన తత్తథా | వేత్త్యసౌ యాదృక్ అన్యేన కల్పితం, వేత్త్యసౌ తథా ||

ఎవడు తన మనస్సుతో ఏ విధంగా, కల్పించుకుంటాడో... దానిని ఆతడు ఆ విధంగానే పొందుచున్నాడు. అద్దానినే మరొకడు నిజకల్పనా భేదంచే మరొక విధంగా అనుభవిస్తూ ఉంటాడు.

ఉదాహరణకు... ఒకడు "అయ్యా! నేను పడే అన్ని కష్టాలు ఎవ్వడూ పడటంలేదు... అను కల్పనను మనస్సుచే ఆశ్రయిస్తే ... ఆతనికి నిజంగానే అన్నీ భరించలేని కష్టాలుగా కనిపిస్తాయి.

Page:568

మరొకాయన అవే కష్టాలుపడుతూ, ప్రపంచంలో అందరికీ ఏవో కొన్ని కష్టాలు ఉంటాయి. నాకు కూడా అట్లాగే ఈ ఈ కష్టాలు ఉన్నాయి"... అని మనస్సుచే అనుకుంటే... ఆతనికి ఆయా కష్ట సంఘటనలు తనకు - తదితరులకు సర్వులకు సామాన్య విషయములవలె గోచరిస్తాయి.

ఇంకొకడు “నా ఇష్టదైవం నాకు ఈ దేహం ప్రేమతో ప్రసాదిస్తున్నట్లే... ఈ ఈ కష్టాలన్నీ నా అభ్యున్నతి కొరకై పాఠ్యాంశాల రూపంలో ప్రసాదిస్తున్నారు. ఇవన్నీ నాకు అవసరమే! లేకుంటే పరమాత్మ ఎందుకిస్తారు?... అని మనస్సుతో భావన చేస్తే ... ఆతనికి అవి కష్టాలుగా కాకుండా బోధసాధనలైపోతాయి. బాధలన్నీ బోధలైపోతాయి.

వేరొకడు... ఈ దేహాదులు నావి కావు. దేహాన్ని బట్టి ఇవి ఉంటాయి. కనుక ఈ కష్టాలు నాకు సంబంధించినవి కావు. నేను అప్రమేయమగు ఆత్మను కదా? ... అని అనుకుంటే... సర్వ ప్రాపంచిక వ్యవహారాలు ఆతనికి ప్రక్క గ్రామంలో అపరిచితుల గృహంలో జరిగే వివాహ సందర్భపు మేళతాళాలవలె తనకు సంబంధించనివై ఉంటాయి.

ఈ కష్టాలు ఇతఃపూర్వపు నా తప్పుల ప్రక్షాళనము కొరకే ... అని మనస్సులో భావించేవారికి అవన్నీ దేహమును పరిశుభ్రం చేసే జలంలాగా ప్రియమైనవై పోతాయి. మనస్సును పరిశుద్ధపరిచేవిగా కనిపిస్తాయి.

అయితే రామచంద్రా! "కల్పన, అకల్పన... ఈ రెండూ కూడా ఏకమగు బ్రహ్మము యొక్క స్వభావ చమత్కారం వల్లే ఏర్పడుచున్నవగుచున్నాయి. ఇందులో... చిదంశము (అకల్పనారూపం); అచిదంశము (కల్పనారూపం)... రెండూ ఉంటున్నాయి.

ఎట్లాగంటే మనుష్యుడు చేతనాస్వరూపుడే అయినప్పటికీ... ఆతని జుట్టు, గోళ్ళు, బొమికలు మొదలైనవి అచేతనములుగాను - ఆతడు చేతన రూపుడుగాను ఉంటున్నారు కదా! ఈ దేహము చేతన, అచేతనముల కలగలపుగా ఉన్నట్లే... ఈ జగత్తు కూడా కల్పన + అకల్పన ఉభయ రూపములతోకూడి ఉంటోంది. పదార్థములన్నీ కూడా... పరమార్థ దృష్టిచే - అకారణములుగాను, కల్పనా దృష్టిచే - సకారణములుగాను... అయి వుంటున్నాయి.

బ్రహ్మము నందు ఈ రెండు ధర్మాలు అవిరోధపూర్వకంగా వర్తిస్తున్నాయి. ఎట్లా అంటావా? ...మరి... బ్రహ్మము సర్వశక్తిమంతమై అలరారుచున్నది కదా! పూర్ణజ్ఞానుల దృష్టిలో బ్రహ్మము కంటే భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు. స్వప్నంలో స్వప్న ద్రష్ట యొక్క చైతన్యమునకు భిన్నంగా ఏదైనా ఉన్నదా? 'ఊహ' అనునది స్వప్న చైతన్యము నుండి జనించిన స్ఫురణయే కదా! ఆ స్ఫురణయే ఆయా ‘ఇల్లు - వీథి - గ్రామము - - నగరం - మిత్రులు - సంఘటనలు' మొదలైనవాటి రూపంగా వర్తిస్తోంది కదా! ద్రష్ట యొక్క స్వస్వరూపమునకు అనన్యమైనట్టి జాగ్రత్ చైతన్య స్ఫురణయే జాగ్రత్ జగత్తు రూపంగా అనుభవమౌతోందని వారు గ్రహించియే ఉంటున్నారు. నిర్మల జ్ఞాన దృష్టిచే జగత్ రూప అనుభవాలన్నీ స్వస్వరూప విస్తరణా చమత్కారం అని, అట్టి స్వస్వరూపం త్రికాలాలలో

Page:569

వాస్తవానికి యథాతథం ...అని వారు సర్వదా గ్రహించియే ఈ జగత్తులో మనందరి మధ్య బాహ్యానికి మామూలుగానే అనువర్తిస్తున్నారు.

ఇక అజ్ఞానుల దృష్టిచే బ్రహ్మము కంటే భిన్నంగా ఎచటైనా ఎపుడైనా ఏదైనా 'ప్రతీతి’ ఉంటుంటే, అది కారణము యొక్క 'వికల్పన' కలిగి ఉంటోంది. నా తమ్ముడైయుండి, అంతమాట అంటాడా? ఎవరు దీనికి కారణం? .... అనే విషయం, ప్రశ్న, సమాధానం మొదలైనవి కారణరూప ప్రతీతిని కలిగియున్నప్పటికీ సర్వమూ బ్రహ్మమే అయిఉండగా... ఈ 'తమ్ముడు' అనబడేవాడు ఎక్కడి నుండి వస్తాడు? ఎక్కడ ఉంటాడు?" ... అనే జ్ఞానదృష్టి కలవానికి, ఇక అంతా కూడా చిరునవ్వుకు మాత్రమే అర్హమౌతుంది కదా!

కాబట్టి సర్వప్రియ జనులారా! మీ యొక్క సమస్త జాగ్రత్ - స్వప్న జగదనుభవములన్నీ కూడా బ్రహ్మముతో సంయోగపరచటమే సంసారమును దాటివేయటానికి ఉపాయం. అంతేగాని, కార్య - కారణముల చర్చచే... ఇది ముడిపడేది కాదు. కాదూ... ఈ కారణ వ్యవహారమే పరిశీలించుచూ పోయినా... అది అజ్ఞాన సోపాన పరంపరయే అవుతుంది. అనగా ఎక్కడో అక్కడ అజ్ఞానమే (లేక) కల్పనయే (కాక) ఆత్మజ్ఞాన రాహిత్యమే - ఇట్టి వ్యవహారానికి మూలం... అని చర్చ ముగించక తప్పదు.

నేహ ప్రవర్తతే కించిత్, న చ నామ నివర్తతే ॥

స్థితమ్ ఏకమ్ - - అనాద్యంతం, బ్రహ్మైవ బ్రహ్మఖాత్మకమ్ ||

కిం కస్య కారణం, కేన, కిమర్ధం, భవతు క్వ వా ?

కిం కస్య కారణం, కేన, కిమర్ధం, మా స్తువా క్వచిత్?

ఓ రామచంద్రా! ఈ ప్రపంచము వాస్తవానికి కొంచెం కూడా ఉత్పన్నమవటం లేదు. నశించటమూ లేదు. పరబ్రహ్మమే సర్వదా ఏకము - ఆద్యంతరహితము - చిదాకాశ రూపము” ... అయి ఉండి ఇట్లు ఈ జగత్ రూపంగాకూడా స్థితినొంది యున్నది. పరబ్రహ్మమునకు అన్యంగా ఇక్కడ గాని, మరొకచోట గాని... ఎక్కడా ఏదీ లేదు. ఎక్కడైతే పరమార్థంగా అంతా అకారణమే అయివున్నదో... ఇక కారణత్వం' అనేది కేవలం కల్పన మాత్రమే అయివున్నదో... అప్పుడిక ఏది ఎచ్చట ఎందుకొరకు దేనికి కారణం చెప్పు? ఏది ఎచ్చట ఎందుకొరకు దేనికి కారణం కాకూడదో చెప్పు? ఎందుకంటే కల్పితమైన "కార్యము యొక్క ఉత్పత్తి, “కార్యము యొక్క అనుత్పత్తి... అనే రెండూ సమానములై, అవిరుద్ధములై ఉంటున్నాయి. ఉదాహరణకు "ఈ దేహం కనబడుతోంది. కాబట్టి ఈ జీవుడు ఫలానప్పుడు పుట్టాడు" అనునది సకారణరూపంగా అగుచున్నది. "ఈ దేహి దేహమును కదల్చుచున్నవాడై దేహానికి ముందే ఉన్నాడు. అట్టి దేహి పుట్టుకకు ముందే ఉన్నప్పుడు పుట్టటమెక్కడ?... అనేదీ యుక్తియుక్తమే అవుతోంది.

బ్రహ్మమునందు జగత్తు శూన్యత్వముగా లేదు. అశూన్యత్వముగా లేదు. ఎందుకంటే అశూన్యత్వము అనేది 'శూన్యత్వము' అనే దృష్టిలోనుంచే వస్తోంది. 'శూన్యత్వము' అనేది అశూన్యత్వం

Page:570

దృష్ట్యానే చర్చనీయాంశం అవుతోంది. అట్లే బ్రహ్మము నందు సత్తుగాని, అసత్తుగాని, సదసత్తుగాని లేదు (అందు ఉన్నది గాని, లేనిదిగాని, కొంత ఒకానొక దృష్టిచే ఉండి - కొంత లేక గాని లేదు). అట్టి పదార్థరహిత + సహిత చిదాకాశమునందు ఇది అవును, అది కాదు... అనునది కూడా

ఏదీ లేదు.

ఓ రామచంద్రా! సమస్తమూ దృశ్యరూపంగా ఏదీ కాదు. అధిష్ఠాన రూపముచే సద్రూపమే! ఇది దృశ్యరూపంగా చూస్తే లేదు. అధిష్ఠాన రూపంగా ఇదంతా ఉన్నది. ఎందుకంటే అధ్యారోప దృష్టిచే బ్రహ్మమే ఇదంతా! అపవాద దృష్టిచే బ్రహ్మము ఆకారరహితం. వస్తురహితం. విషయరహితం.

ఉదాహరణకు, నీ చేతికి ధరించిన బంగారు కంకణం తీసుకుందాం. బంగారం అనే ఖనిజమే ఆ కంకణమంతా అయివున్నది కదా! కంకణంగా కనిపించేది బంగారమే కదా! బంగారం దృష్ట్యా ఆ కంకణం ఉన్నది. గుండ్రటి ఆకారం ఎక్కడున్నది? ఆ బంగారం కరిగిస్తే గొలుసుగా తయారయినప్పుడు ఆ ఆకారం ఏమైనది? ఆకారంగా కనిపించేదంతా బంగారమే! బంగారానికి ఆకారం లేదు. బంగారం లేకపోతే ఆకారమే లేదు. బంగారానికి ఏదో ఒక ఆకారం ఉంటూనే

ఉంటుంది. కాని "ఇది మాత్రమే అనబడే ఏ ఆకారమూ లేదు. "ఆత్మ జగత్ సహితం. జగత్ రహితం అనునది బంగారము యొక్క “ఆకారం ఆకారరాహిత్యం వంటిదే!

6. జగత్తు కార్య - కారణ రహితం

-

శ్రీరామచంద్రుడు : హే మహర్షీ! మీరు మా అజ్ఞానుల బోధ కొరకై 1. అధ్యారోపవాదం, 2. అపవాదం స్వీకరిస్తూనే వస్తున్నారు కదా!...

అధ్యారోపవాదం = ఈ జగత్తుగా బ్రహ్మమునందే ఉన్నది. అపవాదం = జగత్తంగా కనిపించేదంతా బ్రహ్మమే!

ఈ విధంగా ఈ జగత్తూ ఉన్నదని, బ్రహ్మమూ ఉన్నదని చెప్పుతూ కూడా వస్తున్నారు కదా! మరిక ఈ క్రింది వాదములు ఎందుకు మన పరిగణనలోకి తీసుకొని ఒప్పుకోకూడదు?

1. ప్రధాన వాదం - ఆత్మయే అన్నిటికన్నా ప్రధానం. అద్దాని నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలము నుండి పృథ్వి జనిస్తున్నాయి. ఈ విధంగా అవన్నీ ఒకదానికి మరొకటి కారణం.

2. పరమాణువాదం పరమాణువుల సంయోగ వియోగం చేతనే జగత్తు యొక్క నిర్మాణం, వినాశనం జరుగుచున్నాయి. కనుక జగత్తుకు ప్రళయ - మహాప్రళయాలు ఉన్నాయి. జగత్తుకు కారణం పరమాణువులగుచున్నాయి.

ఈ ప్రపంచంలో అనేక పదార్థములున్నాయి. అవన్నీ పంచభూత నిర్మితములు. ఆయా వివిధ పదార్థములు రకరకాల కలయికలచే రకరకాల వేర్వేరు ధర్మములు, గుణములు ఏర్పడు

Page:571

చున్నాయి. ఉదాహరణకు మద్యము సేవించినవాడు 'మత్తు' అనే ఒక వేరైన గుణములు పొందుచున్నాడు. సాత్వికమైన ఆహారం సేవించటం చేత మరొకడు సాత్విక గుణములు కలిగివుంటున్నాడు.

ఇదంతా ఈ జగత్తులో ఇట్లా ఒక్కొక్క పదార్థం మరొకదానికి కారణమగుచూ ఉండటం మనం ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఈ జగత్తులో ప్రతిదానికి ఒక కారణం ఉండనే ఉంటోంది. ఏదీ కూడా, కారణరహితమైనది ఈ జగత్తులో ఎక్కడా కనిపించదు. మరి "సృష్ట్యాదిలో జగత్తుకు కారణమే లేదు. కనుక జగత్తు మొదలేలేదు. జగత్తుగా కనిపించేది బ్రహ్మమే! - ఇట్టి "అద్వితీయ బ్రహ్మమాత్ర శేష్య సిద్ధాంతం" ఎట్లా ఒనగూడుతుంది? శ్రీ వసిష్ఠ మహర్షి : (పకపకా నవ్వి) “ఈ జగత్తు కార్యకారణాలు కలిగి ఉన్నది... అని చెప్పటానికి "మా అజ్ఞానుల బోధ కొరకై...” అని నీవు మొదలే సమాధాన రూపంలో ఒప్పుకున్నావు. అందుకే నాకు ఇంత నవ్వు వచ్చింది. "మొట్టమొదట పరమాత్మయే ఉన్నాడు. అయితే, అజ్ఞానుల కొరకై బ్రహ్మదేవుడు ఈ కార్యకారణ వ్యవస్థతో కూడిన జగత్తును సృష్టించాడు ... అని కొందరు గురువులు తమ శిష్యులకు బోధించు సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నమాట నిజమే! ఎందుకంటే..."ఈ జగత్తులో కనిపించే కార్యకారణ వ్యవస్థ ఎవడో మానవుడు కల్పించింది కాదు కదా! ఈ జగత్తులో ఎవరు ఈ కార్యకారణ వ్యవస్థ కల్పించారో... వారు ఎందుకు కల్పించారు?... అనే ప్రశ్నకు సమాధానంగా ఆయా గురువులు "అజ్ఞానుల కొరకై”... అని సమాధానం చెప్పుచున్నారు.

అయితే "ఈ అజ్ఞానులు అనబడేవారు ఎక్కడి నుండి వచ్చారు?... అని అప్పుడు మరొక ప్రశ్న బయలుదేరుతుంది. సృష్టికి ముందే 'అజ్ఞానులు' అని, 'జ్ఞానులు' అని రెండు తెగలవారు న్నారా? అజ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు? జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు? అందుకే ఈ మన చర్చనీయాంశానికి సమాధానంగా వేదాంత సార శాస్త్రజ్ఞులు మొట్టమొదటగా సర్వమత సిద్ధాంతా లను రెండు విధాలుగా విభజిస్తున్నారు.

I II

మొట్టమొదట పరమాత్మయే పరమాత్మ అనబడేవాడెవడూ లేడు ఉన్నారు. ఆయన అటుతరువాత ఈ ఇక ఈ కార్య-కారణాలు జగత్తును సృష్టించారు? ఆతడే కార్య స్వభావసిద్ధం. పరమాత్మ ఉంటే కారణాల రచయిత! ఎందుకు....? కనబడాలిగా? ఇదంతా స్వభావమే అజ్ఞానుల కొరకు! గాని ఎవరి అధీనం కాదు.

మొదటి సిద్ధాంతముల వ్యవస్థలో మొట్టమొదట జగత్తు లేదని, అజ్ఞానుల కొరకై పరమాత్మ ఇది రచించారని చెప్పబడుతోంది. అంటే జగత్తు లేనప్పుడు అజ్ఞానులు ఉన్నారని చెప్పటమే ఇక్కడ కనబడుతోంది కదా!

Page:572

ఇక రెండవ సిద్ధాంతాన్ని అనుసరించి, ఈ జగత్తుకు రచయిత అంటూ లేడని, ఇక్కడి కార్యకారణ వ్యవస్థ దానంతట అదే జనించి కొనసాగుతోందని చెప్పబడుతోంది. ఇప్పుడు సర్వ ప్రమాణములగు వేదములలోని మహావాక్యములు ప్రమాణంగా తీసుకొని చెప్పుకుందాం.

సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ॥ నే హనానాస్తి కించన॥ సోహమ్ అయమాత్మా బ్రహ్మ|| తత్త్వమసి|| బ్రహ్మమేవ ఇదమగ్ర ఆసీత్ జీవో బ్రహ్మేతి నా పరః॥ ... మొదలైన వేదసారమగు (వేదములకు తలమానికం వంటి ఉపనిషత్తుల) మహా వాక్యములుగాని, (మత్తః పరతరమ్ నాన్యత్ కించిదస్తి, త్వమేవాహమ్) ఆప్త మహావాక్యములు గాని... మనం ప్రమాణంగా తీసుకొని పరిశీలిస్తే... ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మమే (లేక, పరమాత్మయే) కలదు... అని చెప్పబడుచున్నట్లే అవుతోంది కదా! అట్టి శ్రుతి వాక్యములను అనుసరించి సృష్టి యొక్క 'ఆది' యందు అజ్ఞానియే లేడు. ఇక అజ్ఞాని కొరకు ఈ కార్య కారణ రూప జగత్తును సృష్టించడం... అనే వ్యవహారం ఎక్కడ నుండి వస్తోంది? కాబట్టి రామచంద్రా! నీవు చెప్పిన అధ్యారోపవాదం - అపవాదం మొదలైనవన్నీ బ్రహ్మమును బోధించటానికి కల్పించబడ్డాయేగాని... "బ్రహ్మము జగత్తుకు కారణం... అని అంతిమంగా సిద్ధాంతీకరించటానికి కాదు. ఇక ఇక్కడ కనబడే పరమాణు కార్య కారణత్వం దృష్టి యొక్క పరిమితత్వపు స్థితికి ఉపాహారాలు అవుతున్నాయి. అద్వైత బోధమయులు - శాంత విజ్ఞాన ఘనరూపులు అగు జ్ఞానుల దృష్టి - ఈ కనబడే పదార్థ ధర్మాలను జీవుల పరస్పర సంబంధ బాంధవ్యాలను దాటివేసి ఉంటోంది. అందుచేత వారి పరిశీలనలో ఇవి అల్పవివరాలే అవుతున్నాయి గాని... సిద్ధాంతపరమైన ఆవశ్యకతకు అర్హమగుట లేదు. వారికి ఈ పరమాణు - వస్తు ధర్మాలకు సంబంధించిన కార్య కారణములకు బ్రహ్మమునకు అభేదమే ప్రస్ఫుటం అవుతోంది. ఎవరి దృష్టిలో ఏది విశేషమైన విషయమో... అదియే వారికి ఇక్కడ విషయమైన రూపంగా కనిపిస్తుంది సుమా! ఒక రూపమైన నిద్ర'కు స్వప్న - సుషుప్తులు రెండు అవయవముల వంటివి కదా! ఆ రెండింటి యొక్క రూపం నిద్రయే కదా! అంతేగాని, "స్వప్నం నిద్ర కాదు. ఏవో దృశ్యాలు”... అని ఎవరూ అనలేరు కదా! నిద్రయే స్వప్న సుషుప్తుల రూపంలో ఉంటున్నట్లు, బోధమయము - - అధిష్ఠాన రూపము అగు పరబ్రహ్మము నందే జ్ఞాన - అజ్ఞానములు రెండూ వెలయుచున్నాయి. అనగా... అజ్ఞత్వమునకు 'నేను అజ్ఞానిని అనే అనుభవం అద్దానియొక్క అంగమై భాసిస్తోంది. కాబట్టి అజ్ఞానము కూడా పరబ్రహ్మము కంటే వేరు కాదు. అజ్ఞానము అజ్ఞాన దృష్టి - అజ్ఞాన దృష్టికి కనిపించే సమస్త జగత్తు - - అధిష్ఠాన బ్రహ్మము... ఇట్లా ఇదంతా అజ్ఞానుల యొక్క బోధనార్థం వారి బుద్ధిని అనుసరించి శుద్ధ బ్రహ్మమును బోధించే నిమిత్తం మాత్రమే చెప్పబడటం జరుగుతోంది. అంతేగాని... బ్రహ్మము స్వరూపతః నిత్య - శుద్ధ - నిర్వికార పరమానంద సత్యమే అయివున్నది. అయివుండబోతోంది కూడా!

ఇక ఈ జగత్పదార్థాలకు వద్దాం. ఇవన్నీ కూడా (ఈ కనబడే దృశ్యమంతా కూడా) కల్పనానుసారంగా కారణ రహితములు కారణ సహితములు కూడా అయివున్నాయి. ఉదాహరణకు... అగ్నిచే కాల్చబడటంచేత ద్రవం వాయువుగా మారగలదు అని ద్రవం

Page:573

వాయువుగా మారటానికి కారణం మనం చెప్పుకోవచ్చు. అగ్నికి వస్తువులను దహించే శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ...అని ప్రశ్నిస్తేనో?... సమాధానమేమున్నది? ఈ ధర్మము ఏర్పడటానికి కారణం ఎవరు చెప్పగలరు? ఒకవేళ "ప్రకృతియే ఇదంతా నిర్వర్తిస్తోంది... అని అంటే... ప్రకృతి ఎందుకు ఎవరి ఆజ్ఞకు లోబడి ఇట్లు ఈ ఈ ధర్మాలన్నీ కలిగి ఉంటోంది?... ఈ విధంగా ఈ సర్వం అకారణం. అయితే, ప్రతిదీ ఇట్లు ఉండటానికి ఏదో కారణం చెప్పవచ్చు కూడా! ఈ విధంగా సకారణంగాగాని, అకారణంగా గాని కల్పనను అనుసరించే ఈ జగత్తు ఉంటోంది. ఎందుకంటే ఈ బుద్ధిరూప సంవిత్తు ఎట్లు కల్పనచేస్తే... దానిని అట్లే నిజానుభవంగా పొందగలదు. ఒక జీవుని బుద్ధిరూప సంవిత్తు... “ఇదంతా నా ఇష్టదైవం యొక్క స్వరూపమే”... అని భావన చేస్తే, అంతాకూడా అట్లే అనుభూతవిషయమై గోచరిస్తుంది. అందుచేతనే అజ్ఞానులకు ఇదంతా స్వకీయ భావనానుసారంగా అన్యంగా అనుభూతమౌతుంటే అట్టి భావనను అనుసరించని (ఆత్మసాక్షాత్కారం పొందిన ఆత్మజ్ఞులకు ఇదంతా స్వస్వరూపమునకు అనన్యంగా అనుభూత మౌతోంది. దృష్టియే సృష్టి. ద్రష్ట దృష్టికి కేవల సాక్షి - అతీతుడు కూడా!... అని గమనించి, వారు సర్వదా సాపేక్షత్వము నుండి కేవలత్వం వైపుగా అడుగులు వేస్తున్నారు.

ఓ రామచంద్రా! అవిద్యయే ఈ సమస్త జగత్తుకు కారణభూతమై ఉన్నది. అట్టి అవిద్య జ్ఞానాభ్యాసముచే నశించినప్పుడు... అట్టి అనుభవశీలురగు తత్త్వవేత్తల దృష్టిలో 'సృష్టి’ అనే దానికి కారణమంటూ ఏదీ లేకుండానే పోతోంది. కాబట్టి వాస్తవానికి ఈ సృష్టి కారణరహితమై ఉన్నది. శ్రీరాముడు : మహర్షీ! మహాత్మా! "ఈ జగత్తు అకారణం. అందుచేత వాస్తవానికి లేదు. భావనానుసారమే అనుభూతమౌతోంది. ఆత్మజ్ఞానము అనుభూతమొనర్చుకొన్న వారి దృష్టిలో ఇదంతా ఆత్మకు అనన్యం. ఆత్మకు వేరైనదిగా ఉండటానికి కారణమేలేదు. కాబట్టి ఇది స్వతహాగా లేదు. కల్పనచే అనుభూతమౌతోంది.... అనునది అప్రతిహతమైన, అత్యంత యుక్తియుక్తమైన మహావాక్యసారమే! ఇట్టి మహత్తరమైన 'గుర్తు'ను ప్రసాదిస్తున్న ఋషీశ్వరులగు మీకు సాష్టాంగ దండ ప్రణామములు. వేర్వేరు జీవులు వేర్వేరు అనుభవములు ఒకే విషయం గురించి కలిగి ఉండటం, ఒకే వ్యక్తి వివిధ సందర్భములలో వివిధ రీతులుగా ఈ జగత్ దృశ్య సంఘటనాదులు చూస్తూ ఉండటం “లోక విదితాయ విషయః కదా!

ఇవన్నీ యుక్తి యుక్తమని నేను ఒప్పుకుంటున్నాను. అయితే... (సృష్టికర్త స ఈశ్వరః” ప్రత్యేకం తమ్ ఈశ్వరమ్మాయాంతు ప్రకృతిం విద్ది. మాయినంతు మహేశ్వరః ఇత్యాది వేద పురాణ ఇతిహాస వాక్యాలచే) ఈ మాయోపహిత బ్రహ్మం కంటే వేరుగా తటస్థేశ్వరుడు ఒకరున్నారని, కొందరు అభిప్రాయం ప్రకటిస్తున్నారు. "ఈశ్వరుడు ప్రధానుడు. ఇది అప్రధానం" అని వారు అంటున్నారనుకోండి. మరికొందరు గురువులు ఇది పరమాణువుల ప్రయోగంగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ జగత్తు లేకుండా ఎందుకు పోతుంది? అని ప్రశ్నిస్తూ తమ శిష్యులకు ప్రబోధిస్తున్నారు. మరి ఈ జగత్ - శరీరాలు లేవని నిర్ణయించటమెట్లా?

Page:574

శ్రీ వసిష్ఠ మహర్షి : "సంకల్పానుసారమే జగదనుభవం ఉంటోంది కాబట్టి, జగత్తుకు మూలం సంకల్పమే” అనునది విద్వజ్ఞుల ప్రత్యక్ష - శ్రుతి - స్వానుభవసారమై ఉన్నది. ఈ జగత్తు ఎట్లా నిర్మించబడినా, ఎవరు నిర్మించినా... ద్రష్ట మాత్రం తన దృష్టి ననుసరించి, దృష్టిలోంచి చూస్తున్నాడు కదా! ద్రష్ట సర్వ దృశ్యమునకు వేరై (స్వప్నద్రష్ట స్వప్నం కంటే వేరు అయినట్లుగా) లేడని, కేవల తటస్థ - ప్రత్యేక రూపుడు కాదని ఎవరైనా నిరూపించగలరా? తత్త్వజ్ఞులకు ఈ సృష్టి ఉన్నది. దీనికి ఎవరో కారణమైయున్నది"... ఇటువంటి వాక్యాలు అజ్ఞుల బోధ వాక్యాలవలె, ఆత్యంతికమైన సత్యము కావు అని సుస్పష్టంగా తెలియవచ్చుచున్నది.

అందుచేత రామచంద్రా! "ప్రకృతి వేరు - పురుషుడు వేరు, ద్రష్ట వేరు - దృశ్యము వేరు. ఈశ్వరుడు వేరు - జీవుడు వేరు... ఇటువంటి మాటలన్నీ జ్ఞానము యొక్క పరాకాష్ఠ సమక్షంలో “వ్యర్థవాగ్జాలమేవతత్ ...వ్యర్థ వాక్ ప్రవాహమేనని మేం అనుభవపూర్వకంగా ప్రకటన చేస్తున్నాం. అది తత్త్వజ్ఞుల హృదయానుకూలం కాదయ్యా! ఏ దృశ్యం ఘనీభూతంగా కనిపిస్తోందో.... అదంతా కూడా స్వప్నము వంటి కల్పన మాతమ్రే. బాల్యంలో చూచిన గ్రామము - సహబాలుర ఆకారాలు ఒక తాతగారికి జ్ఞాపకముండవచ్చు గాక! అవి నిత్య సత్యమగుచున్నాయా? కనుక ఈ ప్రదర్శన మయ్యేదంతా స్వప్నము వంటి కల్పన మాత్రమే. అంతేగాని... ఇక్కడ స్థూలాకారమైన దృశ్య కల్పన ఏదీ లేదు. అట్టిదాని కొరకై కారణ కల్పన యొక్క అవకాశమే లేదు. అయినా రామా! స్వప్నంలో ఆ గోడ కనిపించింది కదా! దానిని ఎవరు కట్టి ఉంటారు?... అని మెలకువ వచ్చిన తరువాత ఎవరైనా తర్క-వితర్కములు చేస్తున్నారా? ఎందుచేత చేయటం లేదు? స్వప్నంలో నాకు కనిపించిన ఆ భవనం నా ఊహాకల్పితమే కదా!... అని జాగ్రత్ సమయంలో ఎరిగి ఉండటం చేత. అట్లాగే ఆత్మజ్ఞానం పరిపుష్టి పొందనంతవరకు గురువులు శిష్యులకు అనేక కథనముల కల్పన చెప్పవలసి వస్తోంది. స్వప్నంలో కనిపించిన అరణ్యాలు, గృహాలు, ఆరామాలు, వ్యక్తులు - ఇవన్నీ చిత్స్వభావం కంటే వేరు కాదు కదా! ద్రష్ట యొక్క నిర్మల చిత్స్వభావం కంటే వేరైతే... అప్పుడు “ఆ స్వప్న పదార్థాలు ఎట్టివో, ఎవరిచే కల్పించబడినవో, ఎందుకు కల్పించబడినవో... ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అయితే స్వప్న పదార్థాలు మిథ్యారూపమే కదా అని తెలియబడనంత వరకు అవన్నీ మహామోహాన్ని కలుగజేస్తున్నాయి. మిథ్యా రూపమే! అని ఎరుగబడిన తరువాత ఇక దుఃఖం ఉండదు. దుఃఖాన్ని అధిగమించటానికి ఇంతకు మించి ఉత్తమమైన ఉపాయం మాకు ఇంకేమీ కనబడటం లేదు. శుష్కతర్క హఠావేశాత్ యద్వాపి అనుభవవోజ్ఝతమ్ |

కల్ప్యతే కారణం కించిత్సా మౌర్యాభినివేశితా ॥

స్వప్న దృష్టాంతం మేం ఒప్పుకోం. అయినా, స్వప్నం సంకల్పమయమే కావచ్చు గాక! స్పష్టంగా కనబడే ఈ జాగ్రత్ భ్రమ ఎట్లా అవుతుందిట? కాబట్టి ఈ సృష్టికి కర్త ఉన్నాడు. ద్రష్ట ప్రమేయం ఏమీ లేదు”... అందుచేత జగదనుభవానికి సంబంధించి ద్రష్ట సంకల్పిత దృష్టిని మేము పరిశీలించం - అని ఎవరైనా అంటారా? శుష్కతర్కమును గూర్చిన హఠము యొక్క ఆవేశంతో ...

స్వప్నము, ఊహ, భావన మొదలైన మూలానుభవమును ఒప్పుకోక, ఈ జగత్తు ఒకాయన

Page:575

కల్పించారు! పరమాణువుల సంయోగమే దీనికి కారణం. కాబట్టి ఇదంతా సకారణయుతమే గానీ, అకారణము కాదు...అని అనటం మా ఉద్దేశంలో మూర్ఖత్వంతో కూడిన పట్టుదలలే అవుతుంది.

ఒకవేళ ఏదైనా కారణం ఏదో ఉండాలి, చెప్పండి" అని అంటే... అగ్నికి ఉష్ణత్వం కారణమైనట్లు, జలమునకు ద్రవత్వం కారణమైనట్లు, సమస్త తేజస్సులకు ప్రకాశము కారణమైనట్లు... సర్వ పదార్థములకు కూడా, అజ్ఞానోపహితమగు 'బ్రహ్మము' యొక్క 'స్వభావం తప్ప మరింకేమి

కారణం కాగలదు?

మనోరథ కల్పన (ఊహా కల్పన)లో పురాణ కథ పాత్రలు పురాణోపాసకునికి కనిపిస్తాయి చూచావా? అట్లాగే ధ్యాత కల్పనా భేదం చేతనే ధ్యేయము అగు ఈ జగత్తు ఆకార భేదం సంభవిస్తోంది. మరప్పుడు ఈ జగత్తుకంతటికీ ఏదో ఒకటే కారణమని చెప్పటం ఎట్లా కుదురుతుంది? కుదరదు. అనేక ధ్యాతల అనేక ధ్యేయములకు ఒకే కారణం ఎట్లా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే... గంధర్వ నగరంలో (మనోకల్పిత లోకం గంధర్వలోకం) కనబడే మేడకు కారణం ఏది ఉంటుంది?

ఇప్పుడు కొందరి సిద్ధాంతాలను మన చర్చ - అవగాహనల కొరకై ఇక్కడ ప్రస్తావించుదాం. కర్మమీమాంసకులు: వీరు ఈ దేహం రావటానికి పూర్వకర్మలే కారణం" ... అని ఈ దేహానికి కారణం చెప్పుచున్నారు. అట్టి కర్మమీమాంసకుల యొక్క కర్మలు, కర్మఫలాలు, తద్వారా ఈ శరీరం ...అను శాస్త్ర కల్పన సంపూర్ణమైనది కాదు. ఎందుకంటావా? పరలోకమందలి ధర్మ అధర్మములు అమూర్తములు (నిరాకారాలు) కదా! మరి ఈ దేహాదులేమో... సాకారములయ్యే! అమూర్తములగు ఇతఃపూర్వపు ధర్మాధర్మములు ఈ దేహాదులకు ఉపాదాన కారణం కావటం ఎట్లా కుదురుతుంది? దేహమునకే అవి కారణం కానప్పుడు... ఇక సువిశాలాకారయుక్తమైన సృష్టి

- - దృశ్యములకు కారణమెట్లా అవుతుంది? కనుక “ఈ సృష్టికి జీవుల పూర్వపూర్వ కర్మలే కారణం... అని అనటం యుక్తియుక్తంగా లేదు. కనుక "కర్మలు, కర్మఫలాలు అను కర్మమీమాంసకుల సిద్ధాంతం ఈ దృశ్యం/ జగత్తు యొక్క ఉత్పత్తి - ఉనికిల గురించి సమగ్రంగా నిర్వచించటం లేదని మేము భావిస్తున్నాం.

క్షణికవాదులు : ( వీరు విజ్ఞానవాదులలో ఒక తెగవారు). వీరు మరొక తీరైన అవగాహన ప్రతిపాదిస్తున్న వారు. ఈ జగత్తులో ప్రతిదీ ఇతఃపూర్వం ఒక తీరుగా ఉన్నది. ఇప్పుడు ఇట్లా ఉన్నది. ముందు ముందు మరొక తీరుగా ఉండబోతోంది. మహాప్రవాహం ఒకసారి ఒక క్షణంలో ఒక ఆకారాదులతో కనిపించి, మరుక్షణం మరొక ఆకారం పొందుచున్నట్లే ఈ జగత్తులో ప్రతిది క్షణికం. క్షణికం కానిదంటూ ఏదీ లేదు. జీవులు, వీరి మనోభావాలు ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు పొందుతూనే పోతూవుంటాయి. కనుక జగత్తు క్షణికం.

వారి దృష్టిలో ఈ జగత్తు నిరాకారం, క్షణికం. ఇక్కడ సర్వము సర్వదా నశించటం, పునరుత్పత్తి పొందటం అనంతకాలంగా ఇట్లే జరుగుతూ పోతోందని వారి అభిప్రాయం. అయితే ఇది ఇట్లు కొనసాగటానికి ఉపాదాన కారణం ఏది? అది వారి సిద్ధాంతము చర్చించటం లేదు. కనుక క్షణికవాదుల జగత్ నిర్వచనం అసమగ్రమైనదే అగుచున్నది.

Page:576

చార్వాకులు : వీరు... అంతా తనంతట తానే జరుగుతోందని, దీనికి వెనుక 'పరమాత్మ' అనబడే వారెవరూ లేరని చెప్పుచున్నారు. వానకురిస్తే వస్త్రం తడుస్తోంది. విత్తనం మొలకెత్తే స్వభావం కలిగియున్నది. ఆయా వస్తువులు వస్తు స్వభావం కలిగియున్నాయి” అని వారు ప్రతిపాదిస్తున్నారు. ఇది ఈ దృశ్య నిర్వచనమునకు సరిపోదు. ఎందుకంటే...

బీజము స్వభావం = అనగా = బీజము యొక్క స్వభావం

ఇట్లా పదప్రయోగం చేయటంలోనే... షష్ఠీ తత్పురుష అగు యొక్క అనే పద ప్రయోగం చేస్తున్నారు కదా! వస్తువు వేరు - స్వభావం వేరని, వస్తువు స్వభావం కంటే ఉన్నతమైనదని చెప్పినట్లే కదా! "కాబట్టి స్వభావమే జగత్తుకు కారణం ఆ స్వభావం ఎవ్వరిదీ కాదు... అనే నిర్వచనం జగత్తును అర్థం చేసుకోవటానికి సరిపోదు.

కాబట్టి రామచంద్రా! ఈ సమస్త పదార్ధములు, వాటి వాటికి మూలమైనట్టి పంచభూతములు .. ఇవన్నీ కారణరహితం. అయితే, అజ్ఞానదృష్టిచేత (లేక పరిమితమైన పరిశీలనచేత) కారణ సహితమైన వాటివలె భ్రాంతిచే భాసిస్తున్నాయి. జ్ఞాని దృష్టియందో... సర్వకార్యములు చిద్రూపములే అయివున్నాయి. ఎందుకంటే సర్వ పదార్థములు, ఆ పదార్థములను విషయములుగా గలిగియున్నట్టి సర్వభావాలు... అన్నీ కూడా చైతన్యమునందే, చైతన్య చమత్కారం చేత చైతన్యమునకు అనన్యంగా ఆవిర్భవించి తిరిగి చైతన్యమునందే తిరోభావం చెందుచున్నాయి. స్వప్నంలో కనిపించిన దొంగలు స్వప్నంలో చేసిన హంగామా, స్వప్నంలో బాధించటం-బాదటం-భయపెట్టటం మొదలైనవి స్వప్న సమయంలో బాధిస్తాయేమో గాని, మెలకువ రాగానే? అవి దుఃఖ కారణాలు కాదు కదా! జన్మ మృత్యువుల మధ్యగల దేహము యొక్క శబ్ద-స్పర్శ - రూప - - రస - గంధ మాత్రములే అయినట్టి ముల్లోక విశేషాలు ద్రష్టయొక్క వాస్తవ చిద్రూపము ఎరిగినప్పుడు ఏ మాత్రం భేద-మోదాలు కలిగించవు. వాస్తవానికి ఈ దృశ్యము సృష్ట్యాదియందే ఉత్పన్నమై ఉండలేదు. చిదాకాశమే స్వప్నంలోలాగా ఇట్లు పదార్థ రూపంగా కూడా భాసిస్తోంది. చిదాకాశము కంటే వేరుగా ఇక్కడ

ఏదీ ఏ సమయమందుకూడా లేనేలేదు.

ఇట్టి " చిదాకాశ జగత్ న్యాయం కంటే వేరుగా మరొక కల్పనాయుక్తి ఏదీ ఇక్కడ కనబడటం లేదు. కాబట్టి, జగత్ కల్పన బ్రహ్మానుభవమాత్రమే అయివున్నది. అదియే బ్రహ్మీదృష్టి, బ్రహ్మానందం, ఆత్మసాక్షాత్కారం, మోక్షము మొదలైన శబ్దములచే ఉద్దేశించబడుతోంది. ఈ జగత్తంతా బ్రహ్మ స్వరూపమే”... అనే వాక్యం మాకు (తత్త్వజ్ఞులకు) వేద వేదాంత మహావాక్యార్థంగాను, స్వానుభవం గాను ఉభయత్రా సుస్పష్టమవుతోందని సర్వలోకులకు ఎలుగెత్తి గానం చేస్తున్నాం.

శుద్ధ జలంలో తరంగాలు - ఆవృత్తములు సాకారంగా కనిపిస్తున్నట్లు మాకు బ్రహ్మమునందు ఈ జాగ్రత్-స్వప్న జగత్తులన్నీ నిర్దుష్టంగా, సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మమునందు బ్రహ్మరూపంగా ఈ సృష్టి భాసిస్తోంది. బ్రహ్మము, సృష్టి... ఈ రెండూ పర్యాయపదాలే!

Page:577

నిర్మల వాయువునందు వాయుతరంగాలు, ఆవర్త - వివర్తాదులవలె (అవన్నీ వాయువే

ఆయా తత్త్వములుగా అయివున్నట్లు)... 'బ్రహ్మము' అనే వాయువు నందు ఈ సృష్టి" అనే

స్పందము ప్రకటితమౌతోంది.

మహాకాశమునందు... 1. అనంతత్వము, 2. ఛిద్రత్వము, 3. శూన్యత్వము... ఈ మూడు ఎట్లా ప్రదర్శితమగుచున్నాయో... అట్లాగే సద్రూపమగు చిదాకాశమున బోధాత్మకమై పరాపర రూపంగా అనంతము - ఛిద్రత్వము - శూన్యము అగు ఈ జగత్తు వర్తించుచున్నది. స్వప్నంలోను, ఊహ (సంకల్పం)లోను ఎట్లాగైతే అసన్మయమైన పదార్థాలు చిద్రూపములుగా (స్పష్టంగా తెలియవచ్చే ఉనికి గల పదార్థాలుగా) స్పష్టంగా ఎరుగబడుచున్నాయో... అట్లాగే ఈ జాగ్రత్లో ఇవన్నీ తెలియ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సత్చిత్ రూపమగు పరబ్రహ్మము కంటే ఏమాత్రం వేరుకాదు.

శుద్ధమైన గాఢనిద్ర యందు - స్వప్నము, సుషుప్తి ఎట్లా వర్తిస్తున్నాయో... అదేవిధంగా ఆత్మరూపమగు పరబ్రహ్మమందు - - సృష్టి, ప్రళయములు ...వర్తిస్తున్నాయి.

ఒకడు నిద్రలో ఒక స్వప్నము నుండి... అనేక స్వప్నాంతరములు పొందుచున్నాడు చూచావా? అట్లా జన్మాదులు కించిత్ కూడా లేనట్టి పరమాత్మయే స్వసత్తయందు ఒక సృష్టి. ఆ సృష్టికి అన్యములగు అనేక సృష్టులు పొందుచూ... ఆయా సర్వ సృష్టి రూపములుగా వర్తిస్తున్నాడు.

నిర్వికారమగు బ్రహ్మాకారంలో వాస్తవానికి పృథివి మొదలైన ఆయా వస్తుజాలమంతా లేనే లేదు. కానీ... 'స్వప్నానుభవం'గా ఈ ఈ పృథివి మొదలైన వాటితో కూడినదై, (స్వప్నములోలాగా) పొందుచున్నది.

ఈ కనబడే సృష్టి పరమాత్మయందు పరమాత్మకు అనన్యమైయున్నది. అట్లాగే ఇతఃపూర్వపు సృష్టులు, ఇక ముందు ముందు సృష్టులు పరమాత్మ రూపములే! ఆ పరమాత్మకు అభిన్నం! కాబట్టి రామా!... సృష్టి, బ్రహ్మం... ఈ రెండు శబ్దాలు ఒకటి మరొకటికి అర్థముగా అయి ఉన్నాయి.

ఇక "బ్రహ్మమునందు సృష్టి"... అనే మాట ఎక్కడిది? అది కల్పిత కథా శ్రవణం కాక మరి ఇంకేమిటి? సమస్త శబ్దాలు, ఆ శబ్దాలకు అర్థాలైన దృశ్యాంతర్గత విశేషాలూ... బ్రహ్మమే! అంతా బ్రహ్మమే (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) అయివుండగా ఇక శాస్త్రాలు శాసించేదెక్కడ? దేనిని? వేరుగా మోక్షఫలం అనేదెక్కడ? అప్పుడిక "ప్రాపంచిక బంధములు ఎక్కడుంటాయి? శాస్త్రములు, అందలి కథా విచారములచే ప్రయోజనం ఏముంటుంది? (శాస్త్రానపి సంత్యజ్యతి)

వాసనా రహితమగు దృష్టి"యే మోక్షం - అట్టి మనుజునకు ఈ జగత్తులో సిద్ధించవలసిన దేముంటుంది? భావాతీతమైన స్థితిలో సృష్టులే లేవు. ఈ ప్రపంచంగా కనిపించేదంతా భావాతీత చిదాకాశతత్త్వమే!

ఓ రామచంద్రా! ప్రపంచం పట్ల కలిగి ఉన్న వాసనలే స్వప్నంలో నగరాలు, తదితర దృశ్యాలుగా భాసిస్తున్నాయి కదా! అట్లాగే జగత్తులో జగత్తుగా కనిపించేదంతా ద్రష్ట యొక్క దృశ్య వాసనారూపమే!

Page:578

వాసనల చేతనే బోధసత్తా స్వరూపమగు దృశ్యము పరిపరి విధములుగా అనుభూతమౌతోంది. వాసనలు లేకపోయినప్పుడు ఇదంతా కూడా చిత్ సత్తా స్వరూపమగు స్వస్వరూపాత్మయే!

7. ఐందవోపాఖ్యాన బ్రహ్మగీత సప్రతిఘ - అప్రతిఘాన్యాయం

-

శ్రీరాముడు : మహర్షీ! నాకు ఈ సందర్భంలో సప్రతిఘ - అప్రతిఘ అనే ఇతఃపూర్వం నేను వినియున్న ఒకానొక విశేషం గురించి అడగాలని అనిపిస్తోంది.

హే మహాత్మా! ఈ మూడు లోకాలలోని విశేషాలన్నీ క్రోడీకరించి రెండు విభాగాలుగా విభజించవచ్చు - 1.మూర్తములు (లేక) సాకారములు (సప్రతిఘములు). 2. అమూర్తములు (లేక) నిరాకారములు (అప్రతిఘములు). వీటిలో కొన్ని ఒక దానిని మరొకటి తాకుచున్నాయి. అనగా అవి ఒకదానితో మరొకటి కూడి ఉంటున్నాయి. ఇక మరికొన్నియో... ఒకదానితో మరొకటి ఉండటమే లేదు.

ఏదైతే మరొక దానిని చలింపజేస్తోందో... అవి సప్రతిఘములని, ఏది మరొక దానిని స్పృశించటం గాని - చలింపజేయటం గాని చేయటం లేదో... అవి అప్రతిఘములని చెప్ప బడుచున్నాయి.ఈ ప్రపంచంలో సప్రతిఘ పదార్థములగు భౌతిక పదార్థములు పరస్పరం కూడి ఉండటం, చలింపజేయటం చూస్తున్నాం. అప్రతిఘములైనవి (నిరాకారాలైనవి) సాకారాలను చలింపజేయటం గాని, సాకారములతో కూడి ఉండటంగాని జరగటం లేదు. ఉదాహరణకు అగ్ని గడ్డిపరకను తగలబెట్టగలదు గాని, ఆకాశమును తగలబెట్టలేదు కదా! ఈ పాత్రను చేత్తో అక్కడ పెట్టవచ్చు గాని... ఒక ఆలోచనతో ఈ పాత్ర అక్కడికి వెళ్ళదు కదా!

స్వామీ! ఇక క్రమంగా నా అసలు సందేహమేమిటో చెప్పటం ప్రారంభిస్తున్నాను... వినండి. ప్రతి జీవునిలోను సంవేదం" అని చెప్పబడే అనుభవరూపమైన (లేక) వృత్తిరూపమైన జ్ఞానం ఉన్నది. అట్టి వృత్తి జ్ఞానంతో ఒకడు ఆకాశంలో చంద్రబింబాన్ని ఇక్కడి నుండి చూస్తున్నప్పుడు... నేత్రజ్యోతిని అనుసరించు చిత్తముతో సహా బయలుదేరిన చైతన్య వృత్తులతో చంద్రబింబాన్ని చూస్తున్నాడు. అట్టి 'జ్ఞానము’నకు రూపంలేదు (అమూర్తం). ఆ చైతన్య వృత్తులు నిరాకారమై... సాకారమగు చంద్రబింబంలో సంవేదనం పొంది ఇది చంద్రబింబ రూపం... అనే అనుభవానికి కారణమౌతున్నాయి.

జ్ఞానమునకు రూపం లేదు. కానీ, చూపును నడిపించేది జ్ఞానం కదా! ఆ చూపులు రూపంగల చంద్రబింబం చూపగలుగుచున్నాయి. ఇది అందరి అనుభవమే కదా!

ఈ "చూపు ఒకచోట నుండి బయల్వెడలి చంద్రబింబం చేరే ప్రయత్నంలో... మొదటి వస్తువును వదలిన తరువాత... చంద్రుని ఇంకా చేరకముందు గల నిర్విషయ దృష్టి సత్తాయే ఆత్మ” అని మీరు ఇతఃపూర్వమే చెప్పారనుకోండి. ఆ విషయం కాసేపు ప్రక్కకు పెడదాం. ఎందుకంటే

Page:579

కేవలం ప్రబుద్ధుని దృష్టిని అనుసరించిగాని, లేక కేవలం అప్రబుద్ధుని దృష్టినిగాని అనుసరించి ఇప్పుడు నేను చెప్పటం లేదు. ఒక అర్ధ ప్రబుద్ధుని దృష్టిలోంచి ఈ విషయం విశ్లేషిస్తున్నాను. అట్టి అర్ధ ప్రబుద్ధుని సంకల్ప - వికల్ప రూపమైన ఈ జగత్తు ఉన్నది... అని అనుకుని ఈ ప్రశ్న అడుగుచున్నాను. అంతేగాని, జ్ఞాని దృష్టి చిన్మాత్రానుభవం నుండి కాదు.

హే ప్రభూ! ప్రతి జీవునిలోను హృదయమున ఒకానొక తత్త్వము (లేక, శక్తి) ఉండి, అంతటా వెలసియున్న ప్రాణ వాయువును క్షోభితం చేసి... ఆ ప్రాణవాయువులను ముక్కు రంధ్రం నుండి లోపలికి - బయటకు చాలనం చేయిస్తోంది. అట్టి హృదయాంతర్గతమైన ప్రాణవాయు చలనం నిర్వర్తించే తత్త్వం కేవల జ్ఞాన స్వరూపమే కదా!

వింటున్నారా స్వామీ! - ఒక వ్యక్తి తన భుజముపై బియ్యపు మూటను మోస్తున్నట్లు రూప రహితమగు ఆ జ్ఞాన తత్త్వము రూప సహితమగు ఈ ప్రాణవాయువులు చాలనం చేయటం, దేహమును క్షణక్షణం రక్షించటం ఎట్లా చేస్తోంది? నిరాకారమగు జ్ఞానము సాకారమగు ప్రాణములను చలింపజేయటం ఎట్లా జరుగుతోందో... నాకు ప్రశ్నార్థకమై ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ మనందరి హృదయములోని జ్ఞానశక్తి మహత్తరమైన మాహాత్మ్యము కలిగివున్నదని అంటారా? అప్పుడు ఈ మనుజుని సంకల్పం ఆ చెట్టు కొమ్మపై గల రంగురంగుల పక్షి నా భుజంపై వచ్చి వ్రాలాలి... అని అనుకోగానే జ్ఞానశక్తి ప్రభావం చేత ఆ పక్షి వచ్చి భుజంపై వ్రాలాలి కదా! మరి అట్లా జరగడం లేదు కదా! ఎందుచేత?

శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! ఈ నీ ప్రశ్న ఈ సందర్భంలో నాకు కూడా చమత్కారంగానే కనిపిస్తోందయ్యా! సరే! విను. కమ్మరివాని కొలిమి తిత్తిలోకి అంతటా ఉన్న వాయువులోని కొంచెము విభాగం వేగంగా ప్రవేశించి... మరల ఆ కమ్మరివాని చేతుల స్పర్శ సంవేగానికి కొలిమి తిత్తిలోంచి బయల్వెడలుతుంది చూచావా? అట్లాగే ఈ వాయువు హృదయములోకి రాక-పోకలు సలుపుతోంది. ఎప్పుడైతే హృదయ ప్రదేశంలోగల నాడి సంకోచం - వికాసం పొందుచున్నదో. అప్పుడు ముక్కుపుటముల ద్వారా వాయువు హృదయంలోంచి బయల్వెడలటం - - హృదయంలోకి ప్రవేశించటం జరుగుతోంది.

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ కొలిమితిత్తి విషయంలో అయితే,... చేతన రూపుడగు కమ్మరివాడు కొలిమితిత్తులకు చేతుల తాడనంతో వాయువు యొక్క సంకోచ వ్యాకోచములు జరగటానికి కారణమగు చున్నాడు. మరి గుండెలో ఏ కమ్మరి ప్రవేశించి... గుండెలను అరచేతులతో మర్దించి ప్రాణవాయువులు ప్రవేశ - నిష్క్రమణములు నిర్వర్తించేటట్లు చేస్తున్నాడు?

హే మహాత్మా! మీరు ఆశ్రమంలో ఈ దేహ స్వరూప - స్వభావాల గురించి మాకందరికీ బోధించియున్నారు. ("శతంచఏకాచ- హృదయస్య నాడ్యః" - - అను శ్రుతి వాక్యాలు సూచిస్తున్న ట్లుగా) హృదయ ప్రదేశంలో 101 నాడులు ఉన్నాయి. అందులో ప్రతి నాడి నుండి చెట్ల శాఖల వలె మొత్తం 72000 ఉపనాడులు బయల్వెడలినవై ఉంటున్నాయి. ముక్కుపుటాల నుండి హృదయం

Page:580

లోకి ప్రవేశించిన వాయువు ఆ 101 నాడులలోకి, అక్కడి నుండి 72000 ఉప నాడులలోకి -

గుండ్రటి రాయిపై పడ్డ కడివెడు జలంవలె ప్రసరిస్తోంది. కాబట్టే ఆ నాడులచే ఈ దేహము యొక్క సర్వాంగములు సంచలనం పొందగలుగుచున్నాయి. అంతేకాని, ఒక్కొక్క అంగము తనంతటతానే కదలగలగటం లేదుకదా! ఒక్కొక్క అంగమును కదలటానికి, ప్రవర్తించటానికి, ఈ జీవుడు తలచినట్లు ఉపయోగించటానికి ఈ వాయువు యొక్క నాడి - ఉపనాడులలో ప్రవేశ నిష్క్రమణము అను విశేషమే కారణం.

కొన్ని నాడులు ఒక అంగము కదలటానికి కారణమౌతున్నాయి. అన్ని అంగములు చలనం పొందాలంటే దేహములోని అనేక నాడి ఉపనాడులు కదలవలసి వస్తోంది. అవి కదలాలంటే ప్రాణ వాయువుల సంచలనం అవసరం.

నాడి ఉపనాడులలో

హృదయంలోని వాయు వాయువు యొక్క అంగముల

జ్ఞానం సంచలనం ప్రసరణ - నిష్క్రమణం సంచలనం

(A B

ఇక...

జ్ఞానం నాడుల సంచలనం

A B

నిరాకారం సాకారం

ఒకవేళ... నిరాకారమగు చైతన్యము యొక్క పాత్ర లేకుండానే వాయువు యొక్క ప్రసరణము చేతనే నాడులు సంచలనం పొందుతున్నాయని అందామా? మరి అదే వాయువు యొక్క స్పందముచే రాయి - కట్టెలోకూడా సంచలనం కనిపించాలి కదా? మరి మనిషియొక్క ఇంద్రియ సంచలనంలాగా రాయి - కొయ్యలో జరగటం లేదే? అవి అచేనతములై ఎందుకుంటున్నాయి?

కమ్మరి ఊది తిత్తిని పనిచేయిస్తున్నట్లు, అదే వాయువుచే స్పర్శించబడే రాయి మొదలైన అచేతనములు ఎందుకు చలించటం లేదు! జంగము అగు ఈ దేహాలు మాత్రమే వాయు సంచలనంచే చలనం పొందుచున్నాయేం?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవ చైతన్యమే ఇక్కడి కమ్మరివాడు. అదియే వాస్తవానికి కార్యకారణములను అనుశాసించే ప్రభువు. సర్వ కార్యకారణములకు భోక్త కూడా అదియే!

అట్టి జీవచైతన్యము తనయొక్క కార్య - కారణముల యజమాన్యము - - భోక్తృత్వము ఏమరచి... అనాదికాలంగా ప్రవాహ పతితములైనట్టి - కామ్య, కర్మ, వాసన... ఈ మూడింటికీ దాసోహమ్ అగుచున్నది. ప్రాణవాయువుతో తాదాత్మ్యం అయి ధ్యాస” పొందుచున్నదై ఉంటున్నది.

ఆ విధంగా ప్రాణవాయువుతో అభేదాభిమానము పెంపొందించుకొని ఉన్న ఆ యొక్క అభ్యంతర జీవచైతన్యము స్వతంత్రంగా... ప్రాణవాయువుల సంచలనమును, అభ్యంతర నాడీ సమూహమును, తద్వారా ఈ దేహమును, ఈ దేహం ద్వారా బాహ్య ప్రదేశమును... (కమ్మరివాడు

Page:581

కొలిమి తిత్తిని చలింప జేయుచున్నట్లు) చలింపజేయుచున్నది. కనుక ఇక్కడి హృదయము యొక్క ప్రాణ వాయువు యొక్క ఆగమన - నిష్క్రమణములను - ఒకడు ఈ రెండు చేతులను కదల్చుచున్నట్లు అనునిత్యంగా - అసంకల్పిత - సంకల్పిత రూపంగా జీవ చైతన్యము అనుసంధానం నిర్వర్తిస్తూ ఉన్నది. తదనుసారంగానే ఈ ప్రపంచమున సర్వులు బాహ్యమున వ్యవహరించుచున్నారు. కనుక ఈ బాహ్య జగదనుభవములకు కూడా అనుసంధాన కర్త జీవ చైతన్యమే! శ్రీరాముడు : స్వామీ! అదియే నా ప్రశ్న.

ఈ దేహమునందలి వాయువులు, నాడులు... సాకారములు కదా! ఇక జీవచైతన్యమేమో ...నిరాకారం! నిరాకార జీవచైతన్యం సాకార ప్రాణనాడులను ఎట్లా చలింపజేయటం జరుగుతోంది? అంతేకాదు! అదే జీవ చైతన్యము ఒక వైపు ప్రాణ - నాడి - ఉపనాడులను - కదుల్చుచున్నప్పటికీ కూడా... “నాకు దాహం వేస్తోంది. కనుక... అక్కడ దూరంగా బల్లపై ఉన్న గ్లాసు ఆ బిందెలో మునిగి ఆ గ్లాసుడు నీళ్ళు నా సమీపానికి వచ్చుగాక! అని అనుకుంటే ... అట్లా జరగటం లేదు. మరి ఎందుకు అట్లా జరగటం లేదు?

కాదూ! సాకార నిరాకార పదార్థముల యొక్క పరస్పర సంబంధం సంభవిస్తూనే ఉంటుంది” అని అంటారా? అట్లా అయితే అప్పుడు ఆ జీవచైతన్యము తనకు తానే మాట్లాడటం - గ్రహించటం - విహరించటం మొదలైన సర్వ కార్యములకు కర్త అయి ఉండి .... తానే నిర్వర్తించవచ్చు కదా! ఇక ఈ ఇంద్రియములు ఉండవలసిన పనేమున్నది? వాటి వలన ప్రయోజనమేమున్నది? కానీ ... ఇంద్రియాలు ఉంటేగాని, మాట్లాడటం - గ్రహించటం - విహరించటం జరగటం లేదు కదా!

హే మహర్షీ! ఈ బాహ్యమున ఎట్లాగైతే సాకార - నిరాకార పదార్థముల పరస్పర సంబంధం ఉండటం లేదో... అట్లాగే అభ్యంతరంలో కూడా ఈ నిరాకార - సాకార పరస్పర సంబంధం ఏర్పడటం జరగదనే నా అభిప్రాయం. అందుచేత స్వామీ! ఇంకేదైనా యుక్తి ద్వారా ఈ నిరాకారమగు జ్ఞానము సాకారమగు కార్యక్రమాలకు ఎట్లా కారణమో (లేక) ఈ సాకారములగు ప్రాణవాయువు దేహ సంచలనాలకు, జడవస్తువులను కదిలించటానికి మరింకేదైనా విశేషమున్నదేమో చెప్పండి.

లేదా? ...నా ప్రశ్న మరొక వైపునుండి అడుగుతాను. మీరు 'యోగిరాట్' కదా! అట్టి తమరు తమ అంతఃకరణంలో సాకార - నిరాకారములు పరస్పర సంబంధాన్ని మీ యోగబలంతో... ఏ ఉపాయం ద్వారా... మీరు అనుభవిస్తున్నారో... అది చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సర్వసందేహములను తొలగించగల ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనబడు “సమస్తము యొక్క ఏకత్వము ...యొక్క అనుభవమే నీ ఈ సుదీర్ఘమైన ప్రశ్నకు సమాధానమై ఉన్నది. తత్త్వసాక్షాత్కారం యొక్క సమస్తము యొక్క ఏకత్వానుభావం... గురించి ఇక్కడ ప్రసంగిస్తున్నాను... విను.

నే హకించిన్న నామాస్తి వస్తు సప్రతిఘం క్వచిత్ | సర్వదా సర్వమేవేదం “శాంతమప్రతిఘం తతమ్ ||

Page:582

ఓ రామచంద్రా! ఈ ప్రపంచంలో 'సప్రతిఘం' అని నీ పదజాలంచే చెప్పబడే సాకారం' అనేదేదీ లేనేలేదు. ఈ కనబడేదంతా కూడా సర్వవేళలా సర్వదా శాంతము, సర్వ వ్యాపకము, నిరాకారము - అగు బ్రహ్మమే అయివున్నది. స్వప్నంలో అనేక పదార్థజాలం కనిపించవచ్చుగాక! అదంతా సాకారమా? కాదు. నిరాకారమే (అప్రతిఘమే) కదా! ఒకడు తన సంకల్పంతో దర్శించే జగదృశ్యం ఆ చూచే వానికి చూచేటప్పుడు సాకారంగా కనిపించవచ్చుగాని, వాస్తవానికి

సంకల్పము నిరాకారమే కదా! అట్లాగే... ఈ కనబడే సర్వదృశ్యము... ఈ మట్టి రాయి, నేల,ఆకాశం, ఇళ్ళు, వాకిళ్ళు, దేహాలు, భావాలు, అనుభవాలు... ఇవన్నీ నిరాకారము, శాంతము, శుద్ధజ్ఞాన మయము - అయినట్టి బ్రహ్మమే! (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ). అట్టి నిరాకార శుద్ధ బ్రహ్మంలో... సాకారం (సప్రతిఘం) అయినట్టి జగత్తు ఉత్పన్నమవటానికి కారణమే లేదు. ఈ జగత్తుకు కారణమే లేదు. కాబట్టి... ఇద్దానికి ఆద్యంతములు లేకయే ఉన్నాయి. అంతేకాదు. జగత్తుగా కనిపించే ఆకాశం భూమితో కూడిన దృశ్యము భ్రాంతి రూపమే అయివున్నది. స్వప్నంలో స్వప్నద్రష్ట చైతన్యమే భాసిస్తున్నట్లుగా... ఈ సమస్త రూపముగా అప్రతిఘమగు (నిరాకారమగు) చైతన్యమే భాసిస్తోంది.

“ఈ జగత్తు నాకు ఇట్లా ఎందుకు పదార్థ రూపంగా, సాకారంగా భాసిస్తోంది?... అని అడుగు తావా? ఇదంతా 'సాకారంగా చూడటం' అనే అభ్యాసం చేత వాసనారూపం పొంది ఈ రూపంగా అనుభవమౌతోంది. (లేక) సాకారంగా అనిపిస్తోంది. అందుకే, తత్త్వమును శ్రవణం చేసిన తత్త్వజ్ఞులగు వారు ఇది సాకారమా? నిరాకారమా? అనే చర్చను ప్రక్కకు పెట్టి మునుముందుగా "వివేక, వైరాగ్య, త్యాగ, శ్రవణ, మనన, నిధిధ్యాసన మొదలైన ఆయా సర్వ ప్రయత్నాలను నిర్వర్తించి నిర్మలమైన, జ్ఞాన పరిపుష్టమైన దృష్టికై ప్రయత్నశీలురై ఉంటున్నారు. అట్టి సాధనముల ద్వారా... సాకారంగా అనిపిస్తున్న దృశ్యము పట్ల వాసనా సహితంగా తుడిచి వేయబడిన 'దృష్టి'ని పెంపొందించు కుంటున్నారు. ఇకప్పుడు ఈ అంతరిక్షం, నేల, వాయువు, ఆకాశం, పర్వతాలు, నది, సముద్రాలు, వాయుచలనాలు, దేహాంతర్భాగాలు... ఇవన్నీ నిరాకారబోధ స్వరూపాలుగా ఎరుగుచున్నారు.

ఓ రామచంద్రా! ఈ సందర్భంలో "ఐందవ బ్రహ్మాండములు" గురించి చెపుతాను. విను. ఇంతకు ముందు ఉత్పత్తి ప్రకరణంలో ఐందవ జగత్తులు" గురించి ఐందవోపాఖ్యానంలో... "జగత్తు మనోమయం. ఇదంతా క్షణోత్పత్తి ప్రదర్శనం అని నిరూపించటానికి చెప్పటం జరిగింది. ఆ ఐందవోపాఖ్యాన విశేషాలే ఇప్పుడు కించిత్ కథా పరిచయంతో "ఈ జగత్తుగా కనిపించేదంతా నిరాకారమగు చిన్మాత్రమే...అని చూపటానికి, నిరూపించటానికి మరల ఉదహరిస్తాను. నిరాకార మగు చైతన్యం (అప్రతిఘం) సాకారమగు ఈ శరీరాదులను (సప్రతిఘములను) ఎట్లా చలింప జేస్తోంది? ...అనే నీ ప్రశ్నకు సమాధానంగా ఈ ఐందవోపాఖ్యాన సోదాహరణమును ఇచ్చట ఉపయోగిస్తున్నాను. ఇది వింటే ఈ నదీ - పర్వత-భూమ్యాది సహితంగా ఇదంతా ఈ దేహదేహాంతర్భాగములతో సహా చిన్మాత్రమే!" ...అనే విషయం అనుభూతం కాగలదు.

Page:583

ఈ అనంత జగత్ సమూహ-సహిత-సదృశ బ్రహ్మాండాలలో కనిపించే ఒకానొక బ్రహ్మాండం లోని ఒకానొక జగత్తులో ఇందువు అనబడే శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తపస్సు, వేదాధ్యయనము, వేదోక్తములైన కర్మానుష్ఠానములకు అందరికి ఆదర్శప్రాయుడై ఉండేవాడు. ఆయనకు కాలక్రమేణా పదిమంది పుత్రులు కలిగారు. ఆ పదిమంది కుమారులు మహాశయులై (ఉత్తమమైన ఆశయాలు కలవారై) మహాత్ముల, మహనీయుల, సజ్జనుల పట్ల సేవానిరతులై ఉత్తమమైన కర్మానుష్ఠానంతో తమ తండ్రివలె లోకప్రసిద్ధి పొందుతూ పెరిగారు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. ‘కాలం’ ఏదీ పట్టించుకోకుండా మౌనంగా తన పనిని తాను చేసుకుంటూనే పోతుంది కదా! ఒకనాడు ఆ ఇందువు దేహం త్యజించాడు. ఆయన భార్య వైధవ్య భీతితో భర్తతో పాటే అనుగమించింది. అప్పుడు ఆ 10 మంది కుమారులు తమ మాతాపితరులకు ఊర్ధ్వదైహిక క్రియలను ఆచరించారు. ఆ తరువాత తల్లిదండ్రుల వియోగ దుఃఖంచేత వారి మనస్సు వేదన పొందింది. అందుచేత వారున్న ఆశ్రమాన్ని, ఆ వాతావరణాన్ని వదలి దూరంగా గల ఒక పర్వత ప్రదేశంజేరారు. అక్కడ గల ఒక ఏకాంతమైన గుహలో ప్రవేశించి ఒక చోట సమావేశమై చుట్టూ ఆసీనులైనారు.

ఏదైనా సాధించాలంటే ‘ధారణ కావాలి. అయితే 'ధారణ' కుదరాలంటే... చక్కటి ఆశయం కావాలి. లేకుంటే ధారణ దానంతట అదే కుదరేది కాదు. అందుచేత ఏ ఉత్తమమైన 'సిద్ధి' కొరకై మనం ధారణకు ఉపక్రమిద్దాం?... అని మొట్టమొదటగా ఆ సోదరులు చర్చించటం ప్రారంభించారు.

"ఏ ధారణ యందు తన్మయులమైతే మనందరం అత్యంత ఉన్నతస్థితి పొందగలం?” అనే విషయం తర్క - వితర్కించుకోసాగారు. చివరికి "సృష్టిలో ఈ సృష్టి యొక్క కర్తయగు బ్రహ్మదేవుని స్థితియే అత్యున్నతమైనది. అందుచేత మనమందరం సృష్టికి కర్తృత్వం వహించగల 'ధారణ'కు ఉపక్రమించి, తద్వారా బ్రహ్మదేవులుగా అవుదాం" ... అనే తర్క వితర్కానంతర సుస్థిర నిర్ణయానికి ఆ 10 మంది వచ్చారు. ఇహనేం! వారు అప్పటికప్పుడే హింసక జీవులు ప్రవేశించజాలని ఒకానొక ఏకాంత ప్రదేశమును ఆ కొండ గుహలోనే ఎన్నుకొన్నారు. ఇక పద్మాసనాసీనులై ధారణకు ఉపక్రమించారు. నేత్రములు మూసుకున్నారు. నిశ్చల ధ్యానం ప్రారంభించారు. చతుర్ముఖ బ్రహ్మచే అధిష్ఠితమైయున్న ఈ సమస్త బ్రహ్మాండము నేనే! సృష్టంతా నా స్వరూపమే! నా సంకల్పమే ఈ సర్వసృష్టి" ... అనే ధారణకు ఉపక్రమించారు. అట్టి బలవత్తరమైన ధ్యాసచే వారు, ఈ శరీరము నాది! దీని సంరక్షణయే నా కార్యక్రమం! ఇది లేకుంటే నేను లేను” అన్నట్టి దేహధ్యాసను మొదలంటా క్రమంగా త్యజించివేశారు. అట్టి ధారణతో 18 నెలలు స్థూలశరీరం ఉన్నంత వరకు చ్యుతి పొందకుండా ఉండిపోయారు. క్రమక్రమంగా వారి భౌతిక దేహాలు శుష్కించసాగాయి. అవి ప్రేతములచే భక్షించబడి అస్తిపంజరాలుగా అయిపోయాయి. ఆ విధంగా సూర్యరశ్మిచే ఛాయా విభాగం తొలగిపోయినట్లు భౌతిక దేహాలు నశించాయి. అయితే

"నేనే సృష్టికర్త యగు బ్రహ్మదేవుడను. సృష్టి అనే సమస్త కథా సంవిధానము నా యొక్క యోచన చేతనే రూపం పొందుచున్నది. అష్ట దిక్పాలకులు, నవగ్రహములు, సప్తఋషులు, పాపపుణ్యలోకానుభవాలు, విహిత కర్మలు, వేద శాస్త్రములు... అంతా నా సంకల్పాకాశం నుండే

Page:584

బయల్వెడలుచున్నాయి... అనే రూపంగా ఆ 10 మంది ధ్యానమును సుదీర్ఘకాలం అక్కడే కొన సాగించారు. క్రమక్రమంగా వారి శరీర శూన్యములగు 10 చిత్తములు వారి వారి ధ్యానపరిపాకముచే వేరు వేరుగా 10 బ్రహ్మాండములైనాయి. వారు 10 బ్రహ్మాండ శరీరధారులుగా (బ్రహ్మదేవులుగా) అయ్యారు.

చూచావా, రామచంద్రా! ఆ ప్రకారంగా "అత్యంత నిర్మలము - నిరాకారము అయినట్టి ఆ 10 మంది ఐందవుల చైతన్యమూ ఇచ్ఛారూపమై... సమస్త బ్రహ్మాండ స్వరూపములుగా అవటం అక్కడ జరిగింది. కనుక వారి చిత్త నిర్మితమైన సమస్త బ్రహ్మాండములు చిన్మయ రూపములే కదా!

అట్లాగే “ఈ భూమి - - పర్వతం - - ఆకాశం - ఇవన్నీ కూడా చిద్రూపమే! అని గ్రహించు. అట్లా కాదనుకుంటే ... ఆ ఐందవుల యొక్క 10 విధములైన త్రైలోక్య సమన్విత బ్రహ్మాండములకు మరింకే రూపం కలదో చెప్పు? కాబట్టి అంతాకూడా చిదాకాశ మాత్రమేగాని.... అందుకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు.

విద్యతేన యథా కించిత్ తరంగః సలిలాదృతే |

సంవిత్ తత్త్వాదృతే, తద్వత్ విద్యతే చలనాదికమ్ ||

జలంకంటే తరంగం-తరంగ కదలికలు ఎక్కడైనా వేరుగా ఉన్నాయా? ఉండవే! అట్లాగే చైతన్యము కంటే చలనాదులు వేరుగావు. ఆ ఐందవ కల్పిత 10 బ్రహ్మాండములు ఎట్లాగైతే చిన్మయరూపములే అయివున్నాయో,.... అట్లాగే ఈ జగత్తులో కూడా కాష్ఠము, లోష్ఠము, శిల ... ఇవన్నీ చిన్మయ రూపములే! ప్రజ్ఞా రూపములే! భావనారూపములే! ఆలోచనారూపములే! సంకల్పరూపములే! ఐందవుల ఆ సంకల్పముచే జగత్ రూపం పొందినట్లే... బ్రహ్మదేవుని సంకల్పమే” అయివున్నట్టి చమత్కారమే ఈ మనకు కనబడే జగద్రూపంగా కూడా ఉన్నది. అందుచేత ఈ పర్వత - వృక్ష - మేఘ - మహా భూతములన్నీ కూడా సర్వవ్యాపకమగు చిన్మాత్రమే అయివున్నాయి.

వృక్షాలన్నీ చిద్రూపమే! ఈ భూమి అంతా చిద్రూపమే! రాళ్ళు - రప్పలు కూడా చిద్రూపమే! అంతరిక్షం కూడా చిద్రూపమే! ఆకాశం, పర్వతాలు చిత్స్వరూపములే! ఈ దేహము ఈ దేహంలోని రక్త, మాంస, అస్థి, క్రొవ్వు... మొదలైనవాటితో సహా చిద్రూపమే అయి ఉన్నాయి!

అంతెందుకు! ఇక్కడ చైతన్యము కానిదంటూ ఏదీ లేదు.

చిన్మాత్రాకాశమున చిన్మాత్రకులాలుడు (కుమ్మరి) స్వశరీరమైనట్టి 'చిద్రూపం' అనే చంచల చక్రంపై స్వచిత్ శరీరం' అనే చిత్ - మృత్తిక (మట్టి)తో ఈ సృష్టిని నిరంతరం సృష్టిస్తూనే ఉన్నాడు. కానీ వాస్తవానికి ఇక్కడ ఏదీ సృష్టింపబడటమే లేదు. ఎందుకంటే చిన్మాత్రం సర్వదా యథాతథం.

ఓ రామచంద్రా! "ఐందవ బ్రహ్మాండములు అనే కథనాన్ని "ఈ దృశ్య జగత్తు కేవలం కల్ప నిర్మితమే! అని చెప్పటానికి పునరుద్ఘాటించాను. ఇక ... సంకల్పనిర్మితమైన ఈ సృష్టియందు శిలలు చేతనములు కాకపోతే... మరింకే మౌతాయి? ఏది 'జడము' అని అనిపిస్తోందో..... అది

Page:585

ఆ ద్రష్టయొక్క అనుభవము, స్మృతి, సంస్కారము, ఇచ్ఛల సంయోగఫలమే అయివున్నది. నిరాకారమగు జలమునకు అనేక ఆకారములు కూడా (తరంగాదులందు) కనిపిస్తోంది చూచావా? అట్లాగే... అనుభవము, స్మృతి, సంస్కారము, ఇచ్ఛ ఇవన్నీ కూడా చైతన్యం ... యొక్క ఆకార విశేషములే అయివున్నాయి. ఇవన్నీ తనయందు చిత్స్వరూపమునే ధరిస్తున్నాయి. అంతేగాని జడస్వరూపమును కాదు! కాబట్టి అవి చిద్రూపములే అయివున్నాయి! అర్థ శూన్యులగు అజ్ఞానులకు ఇవి జడం - ఇవి చేతనం... అని అనిపిస్తే అనిపించవచ్చుగాక! "తత్త్వావగాహన కలిగినట్టి కుశలురగు విజ్ఞుల దృష్టికి సర్వత్రా చిన్మాత్రము మాత్రమే అగుపిస్తోంది. ఈ విధంగా జడ చేతనాలను చక్కగా మేము విమర్శించి చైతన్యమే ఇదంతా... అని నిర్దుష్టంగా, సుస్పష్టంగా నిర్ణయించాం.

దృష్టిని బట్టే ఇది. దృష్టి చైతన్యరూపమే కాబట్టి... ఇదంతా చేతనమే! పరమ చైతన్య ధామమగు బ్రహ్మమే సమష్టి-వ్యష్టి చిత్తముల రూపంగా దేదీప్యమానంగా వెలుగొందుచూ... ఒకచోట కాష్ఠ పర్వతాది రూపములుగా ఉదయిస్తోంది. మరొకచోట కదిలే దేహాలుగా వెలుగొందుతోంది. సూర్యుని కాంతి సూర్యునికంటే వేరా? కాదు కదా! అట్లాగే... ఎక్కడా కూడా ఈ తృణము, కాష్ఠము, కొండ, రాయి, రప్ప, కదిలే దేహాలు మొదలైన పదార్థాలన్నీ కూడా కార్య కారణ రహితమగు బ్రహ్మము కంటే వేరు కించిత్ కూడా కానే కాదు! సూర్యుని కాంతి సూర్యుని స్వభావమే గాని... సూర్యునికి అన్యం కాదు కదా! సూర్యుడు అప్రకాశకుడై ఉండే ప్రసక్తి ఎక్కడిది? అట్లాగే ... ఈ పదార్థ జాలము - అంతా కూడా బ్రహ్మము యొక్క స్వభావమే అయి ఉన్నది. అంతేగాని, బ్రహ్మమునకు భిన్నమై జడము లేదు. చేతనము లేదు. కనుక ఈ సమస్తము బ్రహ్మమే” అనునది వేద - ఉపనిషత్ - - శాస్త్ర - విజ్ఞుల అనుభవం... క్రోడీకరించగా... మా దృష్టికి సుస్పష్టం అగుచుండగా... సునిశ్చితం అని మేము ఎలుగెత్తి గానం చేస్తున్నాం. జలం పల్లం వైపుగా ప్రవహిస్తూ ఉంటే... ఆ జలంలో ఏ కారణం లేకుండానే, ఏ స్వప్రయత్నమూ లేకుండానే స్వయంగా ఆవర్తము - తరంగము మొదలైన రూపములు ఏర్పడి, ఇక జలం అతి తీవ్రంగా ప్రవహిస్తూ ఉండటం సహజమే కదా! అట్లాగే చైతన్యము కూడా స్వభావ సిద్ధంగాను, సహజంగాను జగద్రూపంగా ప్రవృత్తమగుచున్నదగుచున్నది.

ఓ రామచంద్రా! పద్మకల్పమున విష్ణు భగవానుని నాభి కమలము యొక్క లీలయే బ్రహ్మదేవుని రూపంగా అగుచున్నది కదా! ఆ లీలయే బ్రహ్మదేవుని సంకల్ప రూపంగా విలసిల్లి జగత్తుగా ప్రదర్శితమౌతోంది.విష్ణు భగవానుని కంటే ఈ జగత్తు అన్యం కాదు (విశ్వమ్ విష్ణుః). అదే రీతిగా చిన్మాత్ర బ్రహ్మము వలననే ఈ జగత్తు భాసిస్తోంది. అట్లు భాసించే ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరుకాదు. చిదాకాశ రూపము పరమ శాంతము భావాభావ రహితము జన్మరహితము

- - సన్మాత్రము - చిత్ ప్రకాశ మాత్రము అయినట్టి బ్రహ్మమే - ఈ జగత్తు రూపంగా కనిపిస్తోంది.

సంకల్పమే ఈ జగత్తు యొక్క మూలపదార్థం. సంకల్ప విరచితమగు ఈ జగత్తులో ఈ పర్వతాలు, తృణములు - కొయ్య - రాయి మొదలైనవి చైతన్య రహితమని అజ్ఞాని అనుకోవచ్చు

Page:586

గాక! ఆత్మతత్త్వము గ్రహించిన జ్ఞాని మాత్రం ఆ అభిప్రాయం విని నవ్వుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు ఈ జగత్తులన్నీ స్వసంకల్పమయములుగానే స్వయముగా ఎరుగుచున్నాడు. ఇదంతా ఆతని సంకల్పము చేతనే ఉత్పన్నమై ఉండటంచే... ఇదంతా కూడా మనోరాజ్యంవలె చిదాకాశరూపమే అయివున్నది.

ఓ ప్రియ సభికులారా! ఇక్కడ ఈ సందర్భంగా ఒకానొక అతి ముఖ్యమైన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను.

యావత్ యావత్ ఇయం దృష్టిః శీఘ్రం శీఘ్రం విలోక్యతే,

తావత్ తావత్ ఇదం దుఃఖం శీఘ్రం శీఘ్రం విలీయతే ॥

ఎంతెంత శీఘ్రంగా దృష్టి పవిత్రమై ఇదంతా చైతన్య స్వరూపమే అని చూడటం జరుగుతుందో, ... అంతంత శీఘ్రంగా సప్రతిఘరూపమగు సాకారదృష్టి విలీనమైపోతోంది. (యావత్ దృష్టిః విలోక్యతే తావత్ దుఃఖం విలీయతే)

యావత్ యావత్ ఇయం దృష్టిః ప్రేక్ష్యతే నాచ్చిరాచ్చితా

తావత్ తావత్ ఇదం దుఃఖం భవేత్ ప్రతిఘనం ఘనమ్ ॥

ఎ ంతెంత వరకైతే దృఢమగు చైతన్య దృష్టితో (వాస్తవానికి చిత్ స్వరూప మాత్రమగు) ఈ జగత్తు చూడబడదో... అంతంత వరకు జడదృష్టి కొనసాగటం చేత ఈ సంసార దుఃఖం ఘనీభూతమై ఉండియే తీరుతోంది. కాబట్టి ఇదంతా చిత్ చైతన్య స్వరూపమే”... అన్న సమున్నత దృష్టియే ఇక్కడి సర్వ దుఃఖములకు ఉపశమనం. ఓ ప్రియజనులారా!

దీర్ఘ దుష్కృత మూఢానాం ఇమాం దృష్టిమ్ అపస్యతామ్ సంసృతిః వజ్ర సారేయం న కదాచిత్ ప్రశామ్యతి ॥

ఎవరైతే దోషదృష్టిచే మూఢులై ఈ జగత్తును జడదృష్టితో, ఇక్కడి వస్తు జాతమును భౌతిక దృష్టితో, దేహములను రక్త మాంస దృష్టితో, తదితర జనులను వర్ణాది దృష్టితో చూడటం కొనసాగిస్తూ... ఇదంతా చైతన్య దృష్టితో వీక్షించరో... అట్టి వారి సంసారము వజ్రమువలె దృఢపడియే ఉంటుంది. అది ఎన్నటికీ శమించదు. ఇదంతా పరమాత్మరూపమే! పరమాత్మ చైతన్యమే జగత్తులోని సర్వ రూపములుగా, సర్వ తత్త్వములుగా, సర్వ స్వభావములుగా, సర్వ దృశ్య చమత్కారములుగా అయి ఉన్నది. కానీ, నా జడదృష్టికి జడమువలె అగుపిస్తోంది"... అని గమనించి ఎవరైతే చైతన్య దృష్టిని అభ్యసిస్తూ... అట్టి చైతన్య దృష్టిని పరిపుష్టి చేసుకుంటూ వస్తారో... అట్టివారి సంస్కృతి (సంసారము) తనంతట తానే ఎప్పుడో తుర్రుమని తొలగిపోగలదు.

నేహ ఆకృతిః న చ భవాభవ జన్మనాశాః సత్తా నచైవ న చ నామ తథాస్థి అసత్తా శాంతం పరం కచతి కేవలమాత్మ నీతం బ్రహ్మాథవా కచన మపి అలమ్ అత్ర నాస్తి ! ఓ రామచంద్రా! వాస్తవానికి ఇక్కడ ఆకారాదులు లేవు. భవము-అభవములు (ఉన్నవి - లేనివి) గాని లేవు. జన్మ-వినాశనాలూ లేవు. సత్త-అసత్తలూ లేవు. మరి?... శాంతమగు పరబ్రహ్మం తనయందు తానే ఇట్లు ఈ సర్వముగా ప్రకాశించుచున్నది. (లేక) పరబ్రహ్మం కంటే వేరుగా "ప్రపంచ రూపంగా ప్రకాశించటం" అనేది కొంచెంకూడా ఎక్కడా ఎప్పుడూ లేనేలేదు.

Page:587

ఓ ప్రియ సభికులారా! స్ఫటికంలో స్ఫటికమే జలాకారరూపంగా కనిపిస్తుంది చూచారా? బ్రహ్మమే తనయందు సృష్టిరూప ప్రతిసమూహముచే పూర్ణమైయున్నట్లు కనిపించవచ్చుగాక! స్ఫటికంలో జలం ఉన్నదా? లేదు. స్ఫటికము సర్వదా అంతటా స్ఫటికమే! అట్లాగే జగత్తులు, వాని విభాగములు, జీవులు, లోకములు, జ్ఞాన జ్ఞానములు మొదలైన చమత్కారములన్నీ కలిగి ఉంటూనే ....ఆద్యంత రహితమగు పరబ్రహ్మము అతి స్వచ్ఛంగాను, జన్మకర్మరహితంగాను, చిదానంద ఘనైక రూపంగాను, కైవల్య రూపంగాను నిత్యము సర్వదా యథాతథంగాను స్థితినొందియే ఉన్నది.

మనమంతా అట్టి నిర్మల పరబ్రహ్మ స్వరూపులమే! ఏకమగు నిర్మల పరబ్రహ్మమే... ఇటు ముక్త - - అటు అముక్త రూపములను స్వయంగా... లీలామాత్రంగా అవధరిస్తోంది. అట్టి పరబ్రహ్మము యొక్క చమత్కారమైన అముక్త రూపం జగత్ రూపముగాను - జగత్ జీవుల రూపంగాను, అసంఖ్యాక శిరములు, హస్తములు, కళ్ళు, కాళ్ళు రూపంగాను, చెవులు, కంఠములుగాను కలిగి ఉన్నదై ఒప్పుచున్నది. ఇక ముక్తి స్వరూపమో... ఆత్మాకాశరూపమై, ఉత్తమ స్తంభం వలె దృఢమైనట్టి 'సన్మాత్ర' రూపమై జన్మాది వర్జితమై, సర్వదా యథాతథమై, మౌన స్వరూపమై... వర్ధిల్లుతోంది.

అట్టి సన్మాత్ర పరబ్రహ్మరూపమే నేను అయి ఉన్నాను. ఇక తదితర వికల్పాలతో నాకేమిపని?*

8. అనేక ద్రష్టల ఏకైక రూపం

శ్రీ వసిష్ఠ మహర్షి : చూచావా రామచంద్రా! ఈ విధంగా ఈ త్రిజగత్తులు కూడా 'ఏకము' అయినట్టి సచ్చిన్మాత్రమగు పరబ్రహ్మమేనయ్యా! ఇక అజ్ఞానదృష్టిచే కనిపించే సాకార భూజగత్తులేవీ ఇక్కడ సంభవమే అగుటలేదు. సాకారమైనదంటూ ఏదీ లేనే లేదు. ఇక ఈ సాకారమగు శరీరము మొదలైన పదార్థములెచట? ఈ కనిపించేదంతా కూడా.... నిరాకారమగు బ్రహ్మమే ఈ ఈ రూపములుగా వ్యాపించి ఉన్నది.

చిదాకాశమున చిదాకాశమే, శాంత రూపమున శాంతరూపమే.... సర్వవైషమ్య రహితంగా ఇట్లు స్థితినొంది ఉన్నది. ఆకాశమున ఆకాశమే, జ్ఞానమున - జ్ఞానమే... ఈ ప్రకారంగా విజృంభించుచున్నది.

'అంతా రామమయం ఈ జగమంతా రామమయం ॥ అండాండంబులు పిండాండంబులు,

బ్రహ్మాండంబులు - బ్రహ్మలు మొదలుగ అంతా రామమయం ॥

అష్టదిక్కులును - ఆదిశేషుడును అనంతరూపులై వింతలు సలుపగ ... అంతా రామమయం ||

నదులు వనంబులు, నానా మృగములు,

విహిత ధర్మములు - వేద శాస్త్రములు .... అంతా రామమయం ॥

ధీరుడు భద్రాచల రామదాసుకు కోరికలొసగే .... తారకరాముడు

అంతా రామమయం ..... ఈ జగమంతా రామమయం ॥ - భక్త రామదాసు

Page:588

సర్వం సంవిన్మయం శాస్త్రం సత్స్వప్నఇవ జాగ్రతి, స్థితమ్ అప్రతిఘాకారం, క్వా సౌ సప్రతిఘా స్థితిః?

స్వప్నంలో లాగానే ఈ జాగ్రత్తులో కూడా సమస్తము నిరాకారము, చిన్మయము, శాంతము” అగు బ్రహ్మమే అయివుండగా... ఇక సాకార జగత్తు ఉన్నదెక్కడ?

క్వ దేహావయవాః? క్వ అస్త్రవేష్టనీ? క్వ అస్థి పంజరమ్? వ్యోమేవాప్రతిఘం విద్ధి దేహం సప్రతిఘోపమమ్ ॥

ఓ రామచంద్రా! అంతా చిన్మాత్రమే అయివుండగా... ఇక దేహం యొక్క అవయవములెచట? ప్రేగులను చుట్టి ఉండే నాడులు ఎచట? అస్థిపంజరం ఎచట?

స్వప్నతుల్యమగు ఈ దేహము నిరాకారమే!- రెండు చేతులూ చిద్రూపమే! ఈ శిరస్సు చిద్రూపమే! ఇంద్రియ సమూహాలు చిద్రూపమే! ఇన్ని మాటలెందుకు? ఈ సమస్త జగత్తు "శాంతము, నిరాకారము” ...అగు చిన్మాత్రమే అయివున్నది. దేహంలోగాని, ఈ బాహ్యానగాని సాకారమైనదంటూ ఏదీ లేనే లేదు. చిదాకాశమగు బ్రహ్మము యొక్క స్వప్నరూపస్వభావమే ఈ జగత్ స్థితికి మూలం!

కాబట్టి ఈ సమస్తమూ కూడా ప్రత్యక్షము, ప్రమాణములకు సిద్ధమైయున్నప్పటికీ... ఇద్దాని ఆది యందు ప్రమాణరహితమే! సకారణమైనప్పటికీ అకారణమే! ఇందుకు (నే హనానాస్తికించన ...మొదలైన) శ్రుతి వాక్యాలు, విజ్ఞుల అనుభవాలు మనకు ప్రమాణం! శ్రుతి ఈ సాకారత్వమును నిషేధిస్తూనే వస్తోంది.

బ్రహ్మము నిర్వికారమై, అద్వయమై ఉండటం చేత... ఈ 'జగత్తు' అనబడేది ఉత్పన్నమవటానికి వేరే కారణమంటూ ఏదీ లేకపోవటం చేత... ఈ జగత్తు తత్త్వ దృష్టిచే "ఉత్పన్నమే కాలేదు” అనునది తగియే ఉన్నది.

భ్రాంతి దృష్టి చేతనో... ఈ జగత్తు కార్యకారణ సంభవము' అగుటచేతను బ్రహ్మమే జగత్ దృష్టికి అప్రసిద్ధమగుట చేతను ఇది "ఉత్పత్తి పొందియున్నది అని అనిపించటం అజ్ఞానదృష్టికి సహజమే కూడా! అయితే... ఇక్కడ ఒక పరమసత్యం కూడా గమనించక తప్పదు. ఏది ఎవనిచే ఎట్లు నిర్ణయించబడుచున్నదో అది వానిచే అట్లే గాంచబడుచున్నదది. భ్రాంతి దృష్టియందు కార్యకారణములు రెండూ కూడా వారి వారి నిశ్చయమును అనుసరించి తగియే ఉంటున్నాయి.

ఇక యుక్తి దృష్టిచేతనో... ఈ జగత్తు కారణము లేకయే ఉత్పన్నమైనది. ఇది సంవిద్రూపమే! (విత్ = తెలుసుకొనుట. తెలుసుకొనే రీతిని అనుసరించే తెలియబడుతోంది).

కాబట్టి... ఈ జగత్తు అత్యంత సత్తు కాదు. అత్యంత అసత్తు కాదు. ఉన్నదాని వలె అగుపి స్తోంది”... అని అనవచ్చు. సంవిత్తు దేనిని ఎట్లు భావించుచున్నదో... అది అట్లే సత్యంగా పొందటం మాత్రం జరుగుతోంది. నా స్వప్నంలో ఆ పట్టణం, ఆ పట్టణంలో ఆ కొండశిల, ఆ కొండశిలపై ఆ అంతఃపురం ఎందుకు కనిపించాయి?... అని ఒక స్వప్న ద్రష్ట తన స్వప్న విశేషం గురించి మనలను ప్రశ్నించాడనుకో! అప్పుడేం చెప్పాలి? స్వప్న చిత్ స్వరూపతత్త్వము యొక్క చిన్మయము సర్వరూపత్వము అనే లక్షణ విశేషములచేత సర్వదా సర్వత్రా సర్వము సంభవమే ... అని

Page:589

అనక తప్పదు. అట్లాగే ఈ జాగ్రత్తులో కూడా ఆత్మయొక్క చిన్మయత్వ - సర్వరూపత్వ విశేషముల చేతనే సమస్తము సంభవిస్తున్నాయి. 'మాయ'తో సమన్వితమైయున్న సర్వాత్మరూప బ్రహ్మపదమున పదార్థముల సత్త ఏకము - అనేకముగా కూడా స్థితి పొంది ఉండగలడు. కల్పితదృష్టియందు కార్యసత్త కారణజన్యమై ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా... పరమార్థ దృష్టియందు మాత్రం సర్వము కారణరహితమే అయి ఉన్నది.

శ్రీరాముడు : స్వామీ! ఈ జగత్తులు వేరువేరైన అసంఖ్యాక బుద్ధులు - దృష్టులు - - అనుభవములు - ఉద్దేశములు - ఆశయములు మొదలైనవి వేరువేరు దేహుల పట్ల కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ వేరువేరా! ఒక్కటే అవుతాయా? ఒక్కటే ఎట్లా అవుతాయి?

శ్రీ వసిష్ఠ మహర్షి : "ఏకః సహస్రంభవతి” అని అన్నట్లుగా ఒకే చైతన్యము అసంఖ్యాక రూపములుగా అగుచున్నది. ఐందవుల సంకల్పరహిత బ్రహ్మాండములలో ఆ ఒక్కొక్క ఐందవుని చైతన్యమే ఆ ఒక్కొక్క బ్రహ్మాండములో అసంఖ్యాక జీవుల రూపంగా అగుచున్నది కదా! ఐందవ చైతన్యం కాకుండా వారి బ్రహ్మాండంలోకి మరొకటేదీ అసంఖ్యాక రూపములు దాల్చటం లేదే! సహస్రమ్ ఏకం భవతి సంవిదాంచ తథా హి యత్ |

సాయుజ్యే చక్రపాణ్యాదేః సర్గెరేకం భవేత్ వపుః ॥

జలంలో వేలాది తరంగాలు ఏమౌతున్నాయి? అవన్నీ జలమే అయి, జలంలోనే ఉంటూ జలంలోనే ఉత్పత్తి అయి, జలంలోనే నిరాకారం పొందుచున్నాయి కదా! ఈ అసంఖ్యాక 'జీవులు’ అనబడే సంవిత్ తరంగాలు సంవిత్ మహా సముద్రములోని సంవిత్ స్వరూపాలే గాని, దేహ స్వరూపాలు కాదు.

వందల కొలది నదులన్నీ కలిసి చివరికి ఒకే సముద్ర జలంగా అగుచున్నది కదా! అనేక ఋతువులు - సంవత్సరాలు... అన్నీ కలిసి ఒకే కాలము యొక్క స్వరూపమే అగుచున్నది కదా!

ఒకే స్వప్నద్రష్ట యొక్క సంవిత్తు స్వప్నంలో అనేక కదిలే - కదలని జీవ - వస్తు రూపములుగా -

అగుచున్నది కదా! అట్లాగే... ఒకే చిదాకాశం భ్రాంతిచే ఈ దేహాది నానా రూపత్వము పొందినదాని వలె అజ్ఞాన దృష్టికి అగుపిస్తోంది. అందరికీ దైనందిన అనుభవమయ్యే స్వప్నం సాకారమా?

నిరాకారమా?

స్వప్నంలో మిత్రులు బంధువులు - గృహములు మొదలైనవన్నీ ఉన్నాయి కాబట్టి సాకారమే కదా! కానీ, స్వప్న ద్రష్ట యొక్క ఊహాకల్పితమే స్వప్నాంతర్గత విశేషాలు కదా!ఊహకు రూపమెక్కడున్నది? కాబట్టి స్వప్నం నిరాకారమే కదా!

అట్లాగే ఈ దృష్టాంతాన్ని అనుసరించి ఈ దృశ్య జగత్తు సాకారంగా కనిపిస్తున్నప్పటికీ కూడా... ఇది నిరాకారమే! అట్టి చిదాకాశ స్వరూపం వాస్తవానికి అందరికీ స్వానుభవ రూపమే అయినప్పటికీ... దర్శన - ద్రష్ట - దృశ్య... ఆదిగా గల భ్రాంతి విభాగ దృష్టిచేత అననుభవ రూపం'గా ఇట్లు భాసిస్తోంది.

Page:590

కాబట్టి వాస్తవానికి ఈ జగత్తంతా కూడా ఏకము అయినట్టి చిదాకాశమే అయివున్నది. నిద్ర అనేది ఒక్కతీరైనదే... అయినప్పటికి స్వప్నంలో పదార్థజ్ఞాన రూపంగాను, గాఢనిద్రా సమయంలో ఏమీ తెలియని స్థితిగాను... ఈ విధంగా రెండు విధాలుగా భాసించవచ్చు గాక! కానీ .... నిద్ర ఎల్లప్పుడూ (ఉభయ సందర్భములలోనూ)... ఏకరూపమే కదా! వాయువు తరంగముల రూపములో స్పందిస్తున్నప్పుడు... స్పందరహితమై నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా వాయువు వాయువే కదా!

చిదాకాశము - - జగత్తు ఈ రెండూ ఏకరూపములే అయి ఉన్నాయి - స్వప్నంలో పరమార్థ చిదాకాశం పదార్థ శూన్యమై ఉండి కూడా... ద్రష్ట-దర్శన-దృశ్యములుగా భాసిస్తున్నట్లే, అదే పరమార్థ చిదాకాశము జగత్ శూన్యమై ఉండి కూడా... ఇక్కడ జాగ్రత్లో ద్రష్ట దర్శన దృశ్యములుగా భాసిస్తూ, వీటన్నిటికీ కూడా సర్వదా “ప్రత్యేకము అయి కొనసాగుతూనే ఉన్నది. ఆదిసృష్టి యందు ఈ జగత్తు అసద్రూపం. ఇప్పుడు కూడా అంతే! స్వప్నంలో కనిపించిన పులిని చూచి భయం పోవాలంటే... మెలకువ వస్తే అంతా హుళక్కి అయి, ఆ భయం అర్థాన్ని కోల్పోతోంది కదా! అట్లాగే ఈ జగత్తంతా సర్వదా ఆత్మస్వరూపమే... అని ఎరుగబడినట్టి ఆత్మసాక్షాత్కార సిద్ధి సముపార్జించు కున్నవానికి ఇక్కడ నామరూపత్వం ఇక శేషించదు.

స్వప్నంలో ఒకే సంవిత్తు అనేక రూపములుగా భాసిస్తున్నట్లు... సృష్ట్యాది యందు ఒకే చిదాకాశ సంవిత్తు... ఈ ఏకానేక రూపాలుగా భాసించటం జరుగుతోంది.

ఒకే దీపము (అగ్ని) అనేక గృహాలలో దీపశిఖ అయి దీపకాంతి వెదజల్లుచున్నట్లుగా... సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని ఒకే శక్తి అనేక రూపములుగా ప్రకాశిస్తోంది.

ఆకాశంలో భ్రాంతిచే చక్రాకారాలు కనిపించుచున్నట్లు... జగత్తులో పదార్థముల నామ రూపాలు, దృశ్యాలు, సంఘటనలు, సంబంధాలు, బాంధవ్యాలు ఆత్మాకాశంలో అగుపిస్తున్నాయి.

సముద్రజలంలో అనేక వింత ఆకారాలు కనిపిస్తున్నప్పటికీ... అంతా సముద్ర జలమే కదా! ఆత్మయందు ఈ వృక్ష - జంతు - మానవ దేహాలు స్ఫురిస్తున్నాయి. బ్రహ్మమహాసముద్రంలో అగుపించే ఈ సృష్టి జలకణ సహస్రాలు బ్రహ్మము కంటే కొంచెం కూడా భిన్నం కానేకాదు.

Page:591

XII. బ్రహ్మగీతాంతర్గత కుందదంతోపాఖ్యానం

1. కుందదంత వరసిద్ధి

శ్రీరాముడు : హే మహర్షీ! సూర్యుడు ఉదయించగానే సర్వ అంధకారములు తొలగిపోతాయి చూచారా? అట్లా.... “సర్వ వస్తువులు బ్రహ్మమే అనే పూర్ణబోధ కొరకై తమరు నా యొక్క ఒకానొక సంశయమును ఛేదించ ప్రార్థన. నేను మీ ముందుంచబోయే ఈ సంశయం వెనుక ఒకానొక సంఘటన కొంత వరకు కారణమై ఉన్నది. అద్దానిని ముందుగా వర్ణించి చెప్పటానికి కొద్ది సమయమును ప్రసాదించమని మిమ్ములను వేడుకుంటున్నాను.

శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లాగే! ఆ సంఘటన ఏమిటో సవివరంగా చెప్పు. అంతా వింటాం. శ్రీరాముడు : ఓ మహాత్మా! వసిష్ఠ మహర్షీ! పితృదేవులగు దశరథ మహారాజా! ఈ సభకు వేంచేసిన తదితర సర్వసభికులారా! ఈ మహర్షి ప్రవచనం సందర్భంలో నా ఈ గురుదేవుల అనుజ్ఞతో చెప్పుచున్న ఈ కుందదంతాఖ్యాయిక వినండి.

కొన్ని నెలలు క్రితం ఒక రోజు అయోధ్యలోగల విద్యాపీఠంలో విద్వాంసులగు వేద పండితుల సదస్సు జరిగింది. రాజకుమారుడుగా ఆహ్వానితుడనై మా తండ్రిగారి అజ్ఞానుసారం నేనాసభలో పాల్గొన్నాను. ఆ రోజు విద్వత్తములైన ఎందరో పండిత బ్రాహ్మణ్యులు వేద - వేదాంత విశేషములను ప్రవచిస్తూ ఉండగా సోదరులతో కూడి అత్యంత ఏకాగ్రచిత్తులమై అందరం వింటున్నాం. అట్టి సమయంలో ఆ సభకు అక్కడి కార్యకర్తలు విదేహ దేశము నుండి ఉత్తమ బ్రాహ్మణుడు, గొప్ప శాస్త్ర విద్వాంసుడుగా లోకప్రసిద్ధి పొందినవాడు, మహా శ్రీమంతుడు, మహాతపస్వి, గొప్ప జ్ఞానైశ్వర్య కాంతులతో ప్రకాశించువాడు, దుర్వాస మహర్షి వలె దుస్సవహమైన తేజోధారియగు 'కుందదంతముని' అతిథిదేవరూపులై వేంచేశారహో! అని ప్రకటన చేశారు.

మేమంతా అప్పుడు నిజపఠితములైన వేదాంత - - సాంఖ్య సిద్ధాంతవాద - ప్రతివాదములను ఆపాం. ఆ బ్రహ్మయజ్ఞ సభలో ఉన్నవారమంతా లేచి గౌరవ సూచకంగా నిలబడి నమస్కరిస్తూ ... కరతాళ ధ్వనులు చేయసాగాం. అప్పుడు మహా దీప్తివంతుడగు బ్రాహ్మణుడు మాకు ప్రతి నమస్కారాలు చేస్తూ సుపరిచితులతో కరచాలనం చేస్తూ మహారణ్యంలోంచి నడచివచ్చే గంభీర సింహంలాగా సభాగ్ర భాగంలో మేమున్న సభామండప అగ్రస్థానానికి నడచి వచ్చారు. అలవోక అయిన చిరునవ్వుతో నన్ను, మా ముగ్గురు సోదరులను పలకరించి సుఖాసీనులైనారు. అప్పుడు నేను లేచి వారి పాదములపై పుష్ప గుచ్ఛములు ఉంచి నమస్కరించాను. వారి 'ప్రియవాక్కును అనుసరించి అందరం సభలో ఆసీనులమైనాం. అప్పుడు నేను కుశల ప్రశ్న పూర్వకంగా పలకరించాను. పలకరిస్తూ ఒకానొక విషయం అడిగాను. అప్పుడు నాచే అడగబడిన విషయం