Page:592

అప్పటి మా చర్చలకు సానుకూల్యము - సందర్భోచితము అయివున్నది. నేను మొట్టమొదటగా ఇట్లా పలుకరించాను.

నేను (రామచంద్రుడు) : బ్రహ్మ విద్యావరేణ్యులైన ఓ బ్రాహ్మణోత్తమా! కుందదంతమునీ! తమరు విదేహదేశం నుండి ప్రయాణించి ఎంతో అలసిపోయి ఉంటారు. ఆ ఆసనముపై సవిశ్రాంతులయ్యెదరు గాక! మీ రూపం బ్రహ్మ తేజస్సుతో ఉట్టిపడుతోంది. అయినప్పటికీ మీ సుందరమైన కళ్ళలో ఏదో ఆతురత నాకు కనిపిస్తోంది. అందుచేత, ఇప్పటి మీ రాక ఎచ్చట నుండో, ఏది తెలియగోరుచున్నారో ...తెలుపమని ప్రార్ధన. ఈ సభికులందరి తరఫున, అయోధ్యా నగర చక్రవర్తి - మా పితృదేవులైన శ్రీదశరథ మహారాజు తరఫున, అయోధ్యా నగరవాసుల తరఫున మీకు మరొక్కసారి సుస్వాగతం. ఇప్పుడు మీరు ఏది ఎరుగాలనే కించిత్ ఆవేశపూరితంగా కనిపిస్తున్నారో... అట్టి విశేషమును సవివరంగా ఈ పండిత సభకు ప్రకటించండి. మీరు సంభాషిస్తూ ఉంటే వినాలని ఇక్కడి సభికులంతా వేచి ఉన్నట్లున్నారు. దయచేసి మీ మనోహరమైన వాక్యపరంపర మాపై వెదజల్లండి. కుందదంత బ్రాహ్మణుడు : ఓ దశరథ వర కుమారా! శ్రీరాచంద్రా! నీవు చెప్పింది నిజమేనయ్యా! అత్యంత సునిశితమైన బుద్ధి కలవాడివి కాబట్టే అట్లా పలికావు. అవును. నేనిప్పుడు మహాప్రయత్న పరుడనై ఉన్నాను. ఒకానొక అతిముఖ్యమైన కార్యము కొరకై ఈ అయోధ్యకు వచ్చాను. ఇక్కడ సత్సంగము జరుగుచున్నట్లుగా విన్నాను. నీ దర్శనం, సభలో గల అనేకమంది వేద - వేదాంగ - వేదాంత పండితుల దర్శనం కోరుకున్నవాడనై ఇటు వచ్చాను.

ఓ రామచంద్రా! ఓ సభికులారా! మీ మీ చర్చనీయాంశానికి కొంచెం విఘాతం కలిగించానేమో! కానీ... మీ అతిథిమర్యాదలకు, ఈ శ్రీరామచంద్రుని ఆప్త వాక్య ప్రియత్వానికి పులకితుడనై మీ అందరి అనుజ్ఞతో ఇప్పుడు అస్మత్ సంబంధమైన ఒకానొక జరిగిన సంఘటనను ప్రస్తావిస్తాను.

ఎందుకు ఆ నా స్వీయానుభవం చెప్పుచున్నానంటారా? ఆ సంఘటన వలన నాలో ఒక గొప్ప సందేహం బయల్వెడలింది... “భూమి, సప్తసముద్రాలు, అనేక పర్వతాలు మొదలైన విశేషాలతో కనబడే ఈ ప్రపంచం అత్యంత సువిశాలమైనది కదా! "ఇక్కడికి చాలాదూరంలో ఒకానొక చిన్నగ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో నాకు పరిచయం గల ఒక కుటుంబం నివసి స్తోంది. ఆ ఇంట్లో కొన్ని గదులు ఉన్నాయి. అక్కడి ఒక్కొక్క గదిలో ఇంతటి సువిశాలమైన ఒక్కొక్క బ్రహ్మాండం ఉండి ఉన్నది. ఇది నమ్మసక్యమైన నిజమేనా? ఇది సాధ్యమా?

ముందుగా నా జన్మ -జన్మ స్థానముల గురించి ఈ విద్వత్ సభకు విన్నవించుకుంటున్నాను. ఈ భూమిపై స్వర్గధామం' అని చెప్పుకునే 'విదేహం' అనే ఒక దేశమున్నది. ఆ దేశంలో ఒకానొక బ్రాహ్మణ గృహంలో నేను జన్మించాను. మా ఇంట్లోనే తండ్రి దగ్గర కుల విద్యలగు వేదపారాయణ - వేదాంత విద్యలు బాల్యం నుండి అభ్యసించాను. నా దంతములు పుట్టినప్పటి అతిబాల్యం నుండి తెల్లటి స్వచ్ఛమైన ప్రకాశమును విరజిమ్ముచుండటం చేత మా పితామహులు "కుందదంతుడు అనే నామధేయం నిర్ణయించారు. (కుందం = మొల్లపూవు)

Page:593

నేను నా విద్యాభ్యాసం ముగించుకొని ఆ తరువాత ఈ జగత్తు యొక్క నిత్యానిత్యాలు విచారణ చేయసాగాను. క్రమంగా, వైరాగ్యవంతుడనయ్యాను. 'సంసారం' అనే శ్రమ సశాంతించటానికై గొప్ప ప్రయత్నశీలుడై అనేక మున్యాశ్రమాలు, బ్రహ్మజ్ఞుల గృహాలు సందర్శించి అనేక తత్త్వజ్ఞాన విషయాలు సేకరించసాగాను. అట్లా సంచరిస్తూ సంచరిస్తూ, ఒకసారి దక్షిణ దిక్కుగా ఉన్న శ్రీశైలం వెళ్ళాను. అక్కడ పర్వత ప్రాంతంలో మున్యాశ్రమం నిర్మించుకొని చాలాకాలం వరకు కోమలమైన తపస్సు ఆచరించాను. ఆ మున్యాశ్రమం సమీపంలో దట్టమైన ఒక అరణ్యం ఉన్నది. ఒకసారి నేను కాకతాళీయంగా ఆ అరణ్యంలో ప్రవేశించి సంచరించసాగాను.

అట్లా తిరుగుతూ ఉంటే, అక్కడకు అల్లంత దూరంగా నాకు విస్తారమైన కొమ్మలు - శాఖలు గలిగి... 7-8 అడుగుల ఎత్తు మాత్రమే ఉండే పొట్టిదైన ఒక వృక్షం కనిపించింది. అది కోమలమైన లేత ఆకులతో సుకుమారమైన కొమ్మలతో చాలా ప్రత్యేకమైన ప్రకాశంతో ఆకర్షణీయంగాను, ఆహ్లాదంగాను అగుపించింది. అది చూచి, నేను దూరం నుండే ఆకర్షితుడనై కాసేపు విశ్రాంతి కొరకై ఆ వృక్షమును సమీపించాను.

ఆశ్చర్యం! ఆ వృక్షము యొక్క ఒక శాఖకు పాదాలు త్రాళ్ళతో బంధించబడి క్రిందకు వ్రేలాడే శరీరము - శిరస్సులతో పవిత్రమైన ఆకారంతో ప్రకాశిస్తూ ఒక మానవ దేహం కనిపించింది.

ఆ సమయంలో ఆ ఏకాంత ప్రదేశంలో ఆ వృక్షానికి తలక్రిందులుగా వ్రేలాడే ఆ దేహము కనిపించటం నాకు ఆశ్చర్యజనకం అయింది. “ఏమిటిరా ఇది ...అని అనిపించింది. కొంపదీసి ఈ అఘాయిత్యాన్ని ఎవరైనా దుర్మార్గులు చేసి ఉంటారా? ...అని అనుకోసాగాను. నెమ్మదిగా ఆ

వృక్షాన్ని బాగా సమీపించి చూచాను. అతడెవరో శ్రోత్రియ బ్రాహ్మణుని వలె వీబూదితో ప్రకాశిస్తు న్నారు. కళ్ళు మూసుకుని ఉన్నారు. "అరె! ఇంకా ఈయనకు జీవకళ ఉన్నట్లే ఉన్నదే! ఏమి ఆశ్చర్యం!... అని తలచుచు మరింత సమీపించాను. ఆతడు ఉచ్ఛ్వాస - నిచ్ఛ్వాసములు నిర్వర్తిస్తూ ఉండటం గమనించి, “ఈతడు నిర్జీవికానేకాదు. సజీవియే! ...అని గ్రహించాను. ఇంకా ఇంకా సమీపించి చేతులతో ఆతని మణికట్టు, కణత విభాగం - గుండె సున్నితంగా స్పృశించాను. ఆతడు నా చేతి స్పర్శను ఎరుగుచున్నారని గమనించాను. నేలకు రెండు మూడు అడుగుల ఎత్తులో మాత్రమే ఆతని శిరస్సు వ్రేలాడుచున్నది.

ఇక ఆ క్షణం నుంచి సమాధిలో ఉన్న ఆ వ్యక్తికి పరిశుభ్రం - హస్త స్పర్శ మొదలైన వాటితో సేవిస్తూ కొన్ని రోజులు గడిపాను. నేను సేవించటం ఆ వ్యక్తి గమనిస్తూనే 'ధ్యాననిష్ఠ’ను కొనసాగిస్తు న్నారని నేను గ్రహించి... వారితో సంభాషించాలనే ఉత్సుకతతో ఆ సేవానిరతిని కొన్ని రోజుల వరకు కొనసాగించాను. క్రమంగా ఆయనకు నాపై విశ్వాసం కలిగినట్లున్నది.

ఒక రోజు నావైపు కొంచెం కళ్ళు తెరచి చూచారు. అప్పుడు నేను, మహాత్మా! మీరెవరు? ఈ లక్ష్య-అలక్ష్య రూపమగు జీవితము కలవారై ఇక్కడ ఈ దారుణమైన తపస్సు ఎందుకు కొనసాగిస్తున్నారు?” అని అత్యంత అనునయంగా ప్రశ్నించాను. అప్పుడాయన, పెదవులు విప్పి

Page:594

"బాబూ! నా యొక్క కుల దేశ తపః ప్రయోజనాలు తెలుసుకున్నందువల్ల నీకు ఏమి ప్రయోజనం చెప్పు? ఏదైనా ప్రయోజనముంటేనే ప్రాణులకు ఆయా విచిత్రములైన కోర్కెలు సంభవిస్తాయి. నా గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస వలన నీకు ఒరిగేదీ లేదు. జరిగేదీ లేదు. కనుక... నీవు వెళ్ళి నీ యథాతథ జీవితం కొనసాగించు" ...అని చిరునవ్వుతో చెప్పి వెంటనే కనులు మూసుకున్నారు. నేనప్పుడు ఈయన విషయం, చరిత్ర, ఆశయము తెలుసుకోవాల్సిందే! ...అని మరింత జిజ్ఞాస పొందాను. వారిని అట్లాగే సేవిస్తూ, పైన కొమ్మ వద్ద త్రాడుతో బంధింపబడిన పాదముల ఉపరితలమును అక్కడి ఔషధ రూప ఆకులతో సేవనం చేస్తూ మరికొన్ని రోజులు గడిపాను.

మరొక రోజు ఎప్పుడో ఆయన సేవాసంతుష్టి ప్రదర్శిస్తూ కనులు తెరిచారు. నేను మరల నా ప్రశ్నను పునరుద్ఘాటించాను. అప్పుడాముని మృదుమధురంగా, సౌమ్యంగా ఇట్లా పలికారు. చెట్టుకు రెండు పాదములు కట్టివేయబడి తపస్సు కొనసాగిస్తున్న ఆ ముని : "ఓ అకారణ మిత్రమా! బాటసారీ! నేను మధురా నగరంలో పుట్టాను. మా తండ్రిగారి శాస్త్రబోధచే పదపదార్థ జ్ఞానయుక్తుడ నైనాను. క్రమంగా యౌవన దశ పొందాను. అక్కడ నా తోటిమిత్రులు అయితే చక్రవర్తిగానే పుట్టాలి. చక్కగా అన్ని భోగాలు అనుభవించటం జరుగుతుంది కదా!" అని చెప్పగా... "ఆహా! నేను సప్త ద్వీపాలతో కూడిన రాజ్యమునకు రాజునై, నన్ను అర్థించ వచ్చిన జనులకు ఏది కావాలంటే అది ఇవ్వగలిగే సమర్థత ఎప్పటికి పొందుతాను? ... అని చిరకాలం చింతించసాగాను. ఆ విధంగా ఈ భూమికంతటికీ చక్రవర్తిని కావాలనే ఆశయంతో ఇక్కడికి వచ్చి 12 సంవత్సరములుగా ఈ తపస్సు కొనసాగిస్తున్నాను. ఓ మిత్రమా! విషయం ఇది... విన్నావు కదా! ఇక నీకు ఎటు ఇష్టమో అటు వెళ్ళు. నేను నా అభీష్టం నెరవేరే వరకు ఇట్లాగే తపస్సు కొనసాగిస్తాను.”

అది విని... నేను “ఓ సాధూ! మీరు మీ అభీష్ట సిద్ధిని పొందేవరకూ మీకు సేవచేస్తూ మీ రక్షణ అనే రూపంగా నా తపస్సు నేనూ కొనసాగిస్తాను" ...అని పలికాను. అది విన్న మరుక్షణం శమశీలుడగు ఆ తాపసి శిలవలె మౌనం వహించి, కనులు మూసుకొని, బాహ్య చేష్టలు త్యజించి తపస్సు నిర్వర్తించసాగారు. నేను అక్కడ కాలకృత్యమైన శీతోష్ణములను సహిస్తూ... భయ చింతారహితుడనై ఈ తాపసి యొక్క తపోసమయ భౌతికదేహ సేవయే నా తపస్సు అని అనుకుంటూ సేవానిరతిని కొనసాగించాను. అట్లా 6 నెలలు గడచిపోయాయి.

ఒక రోజు సూర్యబింబం నుండి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఒక కాంతి పురుషుడు ఆ తపస్వికి ఎదురుగా నిలచాడు. అప్పుడు మేమిద్దరం వారికి ప్రణమిల్లాం. మనోవాక్కాయములతో వారికి పూజ సమర్పించాం. ఆ సూర్యకాంత పురుషుడు అమృతప్రాయంగా ఇట్లు పలికాడు. సూర్యతేజో పురుషుడు : వృక్ష శాఖకు వ్రేలాడుతూ సుదీర్ఘంగా తపస్సు చేయటంలో తత్పరుడవై ఉన్న ఓ బ్రాహ్మణుడా! ఇక నీ తపస్సు చాలించి, నీ అభిమతం ఏమిటో... ఆ వరమును స్వీకరించు. దీర్ఘ తపస్వి : ఓ ఆదిత్య పురుషుడా! మీరు సర్వాత్మ స్వరూపులు. నా అభీష్టం మీకు తెలియనిది

Page:595

కాదు. అయినా చెప్పుచున్నాను. నాకు సప్త మహాద్వీపములతో కూడిన భూ సామ్రాజ్యానికి చక్రవర్తిని అవాలని కోరిక ఉన్నది.

సూర్యతేజో పురుషుడు (ఆదిత్య పురుషుడు) : ఓ బ్రాహ్మణుడా! అట్లాగే నీవు ఈ శరీరంతో నిర్వర్తించిన తపస్సుకు ఆదిత్య హృదయులమగు మేము మెచ్చాం. ఇట్టి తపస్సు యొక్క పుణ్యంచేత నీవు సప్త సముద్రములచేత - సప్త ద్వీపముల చేత కూడియున్న భూమిని చక్రవర్తివై 7000 సంవత్సరములు పాలించగలవు.

ఈ విధంగా పలికి ఆ ఆదిత్య పురుషుడు అంతర్ధానం అయ్యాడు. అప్పుడా దీర్ఘతపస్వితో నేను ఇట్లా అన్నాను - "హే మహాత్మా! మీ అభిమతం నెరవేరింది కదా! మీ పాదముల నుండి ఈ కట్టు త్రాళ్ళను విప్పి వేయమంటారా? ఇక ఇక్కడి నుండి మీరు మీ గృహం చేరవచ్చు కదా!”

అప్పుడా తపస్వి “అట్లాగే అని అనగానే, ఆయన సుతిమెత్తని పాదాలకు కట్టి ఉన్న కట్టుత్రాళ్ళను విప్పి ఆయనను నెమ్మదిగా భూమిపై జేర్చాను. అప్పుడా బ్రాహ్మణుడు ఆ ప్రక్కనేగల సెలయేరులో స్నానం చేసి అఘమర్ష మంత్రమును జపించారు. ఆ చెట్టు ఫలాలతో అప్పుడే పరమాత్మను నైవేద్యాది సేవలతో మంత్ర యుక్తంగా జపించారు. ఆ వృక్షం నీడలోనే ఇద్దరం కూడా క్షోభవర్జితులమై ఆ వృక్ష ఫలాలు భుజిస్తూ ఆతని పాదపీడనం యొక్క నివృత్తి అయ్యేవరకు 3 రోజులు అక్కడే ఉన్నాం.

2. వరములు - శాపములు

కుందదంతుడు : ఓ రామచంద్రా! ఓ సభికులారా! 3 రోజుల తరువాత ఉదయమే అక్కడి నుండి ఇక మధురాపురమునకు సూర్య చంద్రులవలె సంతోషాంతరంగులమై బయలుదేరాం. పగలంతా నడుస్తూనే ఉన్నాం. సాయంకాలం త్వరగా ఏదైనా సురక్షిత ప్రదేశమునకు చీకటి పడకముందే చేరుదాం” అని అనుకున్నాం. అట్లా పోతూ పోతూ మార్గమధ్యంలో రోధ అనే పేరుగల గ్రామం చేరాం. అక్కడి మామిడి తోటలలో రెండు రోజులు విశ్రాంతి తీసుకొని, ఇక అక్కడి నుండి అనేక సజల భూములు, నదీ ప్రాంతాలు, సెలయేళ్ళు, సరస్సులు దాటివేసి... ఆ రాత్రికి ఒక ప్రదేశంలో గల అరటితోటలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాం. ఆ తరువాత మరల 3 రోజులు ప్రయాణించి ఒక అరణ్య ప్రదేశం చేరాం. అప్పుడు ఆ దీర్ఘ తపస్వి నాతో ఇట్లా అన్నారు.

దీర్ఘ తపస్వి : మిత్రమా! మనం చక్కగా చాలాదూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చాం. అయితే, ఇక్కడి నుండి ఈ మధురానగరం వెళ్ళే మార్గాన్ని వదలి వేరే మార్గంలో 'గౌర్యాశ్రమము' అనే చోటికి పోదాం. ఎందుకో తెలుసా? ఆ గౌర్యాశ్రమంలోకి మనం ప్రవేశించటంలో నాకు రెండు ఉద్దేశాలు ఉన్నాయి.

1. గౌర్యాశ్రమం అత్యంత మనోహరంగా ఉంటుంది. నన్ను సేవించినట్టి నీకు ఆ సుందరమైన ఆశ్రమ దర్శనసుఖం లభించాలని నా వేడుక. అక్కడ అనేక మంది మహనీయులు వచ్చి తపస్సు

Page:596

చేసుకుంటూ ఉంటారు. తపస్సుకు సానుకూల్యంగా పర్ణశాలలు ప్రకృతి సిద్ధంగానే నిర్మితమై ఉంటాయి. సెలయేళ్ళు అత్యంత ఆహ్లాదజనకంగా ఉంటాయి. అక్కడి చిలకలు కూడా వేదగానం చేస్తూ ఉంటాయి. బ్రహ్మలోకంతో సమానమైన ఆ ఆశ్రమ దర్శనం చేత చిత్తము యొక్క సర్వదోషములు శమిస్తాయి. అక్కడి తత్త్వదర్శనంచే పూర్ణ మనోహర చిత్తులగు మునుల దర్శనభాగ్యం కొరకు, సేవాభాగ్యం కొరకు, సుదూర ప్రాంతం నుండి కూడా ముముక్షువులగు జనులు వచ్చి వెళుతూ ఉంటారు. ధీరులు, విద్వాంసులు అగు మహనీయులతో సంభాషించటం కొరకు వెళ్ళే మనవంటి వారి విషయం ఇక వేరే చెప్పేదేమున్నది?

2. మరొక్క ముఖ్యమైన విషయం. మేము 8 మంది అన్నదమ్ములం. అందరం కూడా "ఈ భూమికి చక్రవర్తి కావాలి... అనే ఆశయంతో ఆ గౌర్యాశ్రమం వచ్చి తపస్సు ప్రారంభించాం. 6 నెలలు తరువాత నేను మాత్రం శ్రీశైలం వచ్చి నా ఇచ్ఛానుసారంగా అక్కడి అరణ్యంలో తపస్సు చేయటం జరిగింది. బహుశః మా సోదరులు కూడా తపఃస్సిద్ధి పొందుతూ ఉండవచ్చు. ఇప్పుడు వారు ఎట్లా ఉన్నారో కూడా పరామర్శించవచ్చు.

#

అది విని నేను ఆ దీర్ఘ తపస్వితో సరే! తమ అభీష్టానుసారంగా అట్లే జరుగునుగాక! మనం ఇప్పుడు గౌర్యాశ్రమం వెళ్ళుదాం ... అని అన్నాను. అప్పుడు ఆయన చెప్పినట్లు మేము గౌర్యాశ్రమం’ అనే ప్రదేశం చేరాం. అయితే ఆ దీర్ఘ తపస్వి ... ఆ ప్రదేశమంతా శూన్యంగా ఉండటం చూసి, ఇదేమిటి? ఇక్కడ 12 సంవత్సరాల క్రితం గొప్ప వనం ఉండాలే! ఇప్పుడిదంతా శూన్యంగా ఉన్నదే!" అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అక్కడ వృక్షాలు గాని, ప్రకృతి నిర్మితమైన కుటీరాలుగాని, పొదలుగాని, మనుజులుగాని, మృగములుగాని, ఆ బ్రాహ్మణ సోదరులుగాని కనిపించలేదు. ఆ విశాలారణ్య ప్రాంతం కేవలం శూన్యమై ఉండగా వేడిమిచే సర్వత్రా సంతప్తమైన కొండరాళ్ళతో కనిపించింది. "అరె! ఏమి కష్టం! నా ఏడుగురు సోదరులు ఏమైనారు? అని ఆ తాపసుడు కంగారుపడుతూ ఉండగా, మేమిద్దరం ఆ ప్రదేశమంతా ఏవైనా వృక్షములు కనిపిస్తాయేమోనని వెదుకసాగాం. అట్లా వెతకగా వెతకగా చాలా సేపటికి ఒకచోట కొంత దూరంలో ఒక వృక్షం కనిపించింది. మేము ఆ వృక్షమును సమీపించాము. ఆ వృక్షం దట్టమైన కొమ్మలు ఆకులు కలిగినదై మనోహరంగా ఉన్నది. ఆ వృక్షపు మొదట్లో ఒక వృద్ధ తపస్వి సమాధి పరాయణుడై కనిపించారు. ఆ వృద్ధుడు సమాధి నుండి లేచేంత వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకొని ఎదురుగా గల ఒక ప్రదేశంలో ఆసీనులమైనాం. కొంత సమయమైన తరువాత నేను ఉద్వేగం ఆపుకోలేక చపలచిత్తుడనై "ఓ మునీశ్వరా! ఇక మీరు సమాధి నుండి లేవండి"... అని బిగ్గరగా పలికాను. అప్పుడు మేఘగర్జనచే సింహం మేల్కాంచినట్లుగా ...నా గొంతుక చేసిన శబ్దానికి ఆ మునివర్యులు సమాధి నుండి మేల్కొని కనులు తెరిచారు.

గౌర్యాశ్రమముని : ఓ సాధువులారా! మీరెవరు? (చుట్టూ ఒకసారి పరికించి, కించిత్ ఆశ్చర్యంగా) ...అరె! గౌర్యాశ్రమం ఏమైనది? నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు? ఇప్పుడు ఏ కాలం కడుస్తోంది?

Page:597

నేను (కుందదంతుడు) : హే మహాత్మా! ఈ విషయాలు మాకుకూడా తెలియవు. తమరు సర్వజ్ఞులు. యోగబలం కలవారు. మీరే విశేషాలు దివ్యదృష్టిచే వాటిని గమనించగలుగుతారు కదా!

అప్పుడా గౌర్యాశ్రమముని మరల కనులు మూసుకొని, ధ్యానపరాయణులై తన యొక్క - మా యొక్క వృత్తాంతమంతా దివ్యదృష్టితో యోగబలంచేత వీక్షించసాగారు.

గౌర్యాశ్రమముని : ఓ ఆర్యులారా! కార్యవేత్తలారా! ఈ వృత్తాంతం ఏమి ఆశ్చర్యకరం! ఈ కదంబ (కడిమి) వృక్షమే మొదటి నుండి కూడా నా నివాస స్థానమై కొనసాగుతోంది. నేను గౌర్యాశ్రమం విడచి మరెక్కడా లేను.

ఒకసారి ఏదో ఒక కారణం చేత గౌరీదేవి సరస్వతీ రూపమును ధరించి, సమస్త ఋతువులచే సేవించబడుచూ ఇక్కడ 12 సంవత్సరాలు ఉండటం జరిగింది. ఆ కారణం చేతనే, ఈ ప్రదేశం ఒకప్పుడు అనేక వృక్షములచే దట్టమై విస్తరించటం జరిగింది. అనేక సరస్సులతోను, మున్యాశ్రమాల తోను ఈ ప్రదేశము ఒకప్పుడు 'గౌరీవనము' అనే పేరుతో ప్రసిద్ధికెక్కియున్నది. అందుచేతనే ఈ వనం ప్రకృతిదేవత మనోహరంగా తీర్చిదిద్దిన సౌందర్యలహరివలె ప్రకాశిస్తూ ఉండేది. అప్పట్లో ఆ గౌరీదేవి ఈ కదంబ వృక్షపు నీడలోనే వసించేది. ఆ భగవతి కరస్పర్శచేతనే ఈ వృక్షం వృద్ధాప్యం పొందక నిత్యయౌవనంతో విరాజిల్లుతోంది. ఆ గౌరీ భగవతి ఈ స్థానమును విడచివెళ్ళిన తరువాత ప్రదేశమంతా ఫల-పుష్ప-కాష్ఠాదులు అమ్ముకొని జీవించే జనులకు ఆశ్రయమై సామాన్యమైన వనంగా మారిపోయింది. ఆ గౌరిదేవికి మాత్రం "కదంబవనవాసినీ అనే పేరు సార్థకమైనది.

ఇక నా గురించి. ఇక్కడికి సుదూరంగా 'మాలవము' అనే రాజ్యానికి నేనొకప్పుడు పూర్వాశ్రమంలో రాజును. ఒక సమయంలో వైరాగ్యపూర్వకంగా ఆ రాజ్యమును త్యజించి మునులచే పరివేష్టితమైన ఈ గౌర్యవనానికి వచ్చాను. ఇక్కడి ఆశ్రమవాసులచే సుస్వాగతుడనై కదంబ వృక్షం క్రింద ధ్యాన పరాయణుడనైనాను. కొంతకాలం తరువాత ఈ తాపసుడు, ఈతని ఏడుగురు సోదరులు తపస్సు చేసుకోవటానికి ఇక్కడికి ఆశ్రమానికి వచ్చి ఈ ప్రదేశపు తదితర తాపసువలెనే తమతమ తపస్సులు ప్రారంభించారు. ఒక 6 నెలలు తరువాత నీవు శ్రీశైల ప్రదేశపు అడవులలో తపస్సు చేసుకోవటానికి బయలుదేరావు కదా!

రెండవవాడు కార్తికేయస్వామి ఉండే ప్రదేశానికి, మూడవవాడు కాశీపుర ప్రాంతానికి, నాలుగవవాడు హిమాలయ పర్వత ప్రాంతానికి... తపస్సు కొరకై తమకు ప్రియమైన ప్రదేశాలకు వెళ్ళారు. మిగతా నలుగురు ఇక్కడే తపస్సు కొనసాగించారు. మీ 8 మంది సోదరుల ఆశయం కూడా "ఈ పృథివి కంతటికీ చక్రవర్తి కావాలి! ...అనియే కదా! మీ సోదరులందరూ ఇష్టదేవతా దర్శనముచే వరసిద్ధి పొందారు. నీవు ఇంకనూ తపస్సు కొనసాగిస్తూ ఉండగా... తక్కిన వారంతా మీ ఇల్లు చేరారు.

Page:598

మేము ఈ పృథివికి ప్రభువులం కావాలి. మా పాలనలో ప్రజలందరూ అసత్యమును త్యజించి ధర్మనిరతులై ఉండాలి. జనులందరు వారి వారి ఆశ్రమ ధర్మములు చక్కగా నిర్వర్తిస్తూ ఉండాలి. అని మీ సోదరులు ఆశయము కలిగి, తమ తమ ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకొని, అది అట్లే వరంగా పొందారు.

ఆ తరువాత - తరువాత ... ఇక్కడి చుట్టుప్రక్కల పట్టణంలోని ధనికులు ఇక్కడి ప్రదేశములను ఆక్రమించుకోవటం చేత ఇక్కడి 'వనము' శిథిలం కాసాగింది. ఇక్కడి ఆశ్రమవాసులంతా వేరే వేరే ప్రదేశాలకు తరలి వెళ్ళిపోకతప్పలేదు. నేను మాత్రం ఒంటరిగా ధ్యానమునందే లగ్నమైన చిత్తము కలవాడనై... గౌరీదేవి యొక్క కరస్పర్శచే పవిత్రమైయున్న ఈ కదంబ వృక్షము క్రిందే పర్వతం వలె నిశ్చలంగా ఉండిపోయాను. ఇక కాలం ఋతు సంవత్సర రూపంగా గడచిపోతూ ఉంటే ఈ వనమంతా అట్లా సమీప జనుల చేత ఛేదించబడినదయింది. ఈ కదంబ వృక్షమును మాత్రం ఇది సరస్వతీ స్వరూపం ...అని తలచి జనులు పాడుచేయలేదు. ఇక్కడి సమాధిలో నిమగ్నుడైన నన్ను పూజిస్తున్నారు. అందుచేతనే ఈ ఒక్క వృక్షం యథాతథంగా మిగిలిపోయింది. ఆ తరువాత కొద్ది నెలలకు మీరిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఓ ప్రియ మిత్రులారా! ఈ విధంగా నేను ధ్యాన నిష్ఠయందు చూచినదంతా మీకు చెప్పాను.

ఓ సుదీర్ఘ బాటసారులారా! ఇక మీరు మీ మీ గృహములకు వెళ్ళవచ్చు. అక్కడ ఈతని ఏడుగురు సోదరులు ఇప్పటికే ఇల్లు చేరి అక్కడి భార్య - పిల్లలు మొదలైన విశేషాలతో మునిగి తేలుచున్నారు. వారితో మరల కలయిక కలుగగలదు.

ఓ శ్రీరాముడు మొదలుగాగల ఆర్యులారా! అప్పుడు నాకు కలిగిన ఒక సందేహం గురించి యోచిస్తూ నేను ఈ విధంగా ప్రశ్నించాను.

నేను (కుందదంతుడు) : హే మహాత్మా! యోగిపుంగవులగు మీ సమక్షంలో నాకు ఇప్పుడో గొప్ప సందేహం వచ్చింది. కుందదంత నామధేయుడను, విదేహ సామ్రాజ్య వాసిని అగు నేను తమకు విధేయుడనై మీ పాదములు స్పృశిస్తూ నాకు వచ్చిన సందేహమును మీ ముందుంచుతాను. నివృత్తింపజేయ వేడుకొంటున్నాను.

కదంబ తాపసుడు : సరే! తప్పక అడుగు. నాకు తెలిసినంత వరకు నీ సందేహమును నివర్తింప జేయటానికి నేను సిద్ధమే!

నేను (కుందదంతుడు) : ఇప్పుడీ 8 మంది అన్నదమ్ములు సప్తద్వీప సప్త సముద్ర సహిత పృథివికి చక్రవర్తులం కావాలి ... అనే వరాలను తమతమ ఇష్ట దేవతల నుండి సిద్ధింపజేసుకొన్నారు. కదా! మరి ఈ 8 మంది పొంది ఉన్న వరముల ఫలితాలు ఒక్కసారే ఈ పృథివిపై ఎట్లా సిద్ధి స్తాయి? ఒకే ఒరలో 8 కత్తులుండవు కదా! ఒకే భూమికి 8 మంది చక్రవర్తులు ఎట్లా కానున్నారు?

Page:599

కదంబ తాపసుడు : ఓహో! ఇదేనా నీ సందేహం? అయితే ఈ వ్యవహారంలో ఇంతకన్నా అసమంజస మైన మరొక విషయం (వీరి కుటుంబంలో) ఏర్పడి ఉన్నది. అదేమిటంటే, ఈ 8 మంది సోదరుల దేహాలు నశించిన తరువాత...వారు తమ గృహంలోనే, తమ తమ పడక గదులలో సప్తద్వీప సమన్వితమగు భూమిపై 7000 సంవత్సరాలు చక్రవర్తులై ఒకేసారి రాజ్యం ఏలబోతున్నారు. నేను (కుందదంతుడు) : ఆశ్చర్యమే! వారు తమ పడకగదులలోనే సప్తద్వీపములతో గూడి ఈ భూసామ్రాజ్యాన్ని ఎలా ఏలటం జరుగుతుంది? అటువంటి సందర్శనం, అగత్యము ఎట్లా వచ్చాయి? కదంబ తాపసుడు : ఆ విశేషమేమిటో కూడా... చెపుతాను విను.

ఈ 8 మంది సోదరులకు అష్టతారల వలె ఉత్తమ గుణ సంపన్నులగు 8 మంది భార్యలు ఉన్నారు. తమ భర్తలు చిరకాలం తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు వారు ఎంతో దుఃఖం పొందారు. భర్తకు దూరంగా ఉండటమనేది ఏ స్త్రీకైనా దుస్సహమైన విషయమే కదా! అందుచేత దుఃఖనివారణం కొరకై ఆ 8 మంది తోడికోడళ్ళు శతచాంద్రాయణం అనే కఠోరమైన తపస్సు ఆచరించారు. వారి తపస్సుకు మెచ్చినదై భగవతియైన పార్వతీదేవి పూజ జరుగుచున్న సమయంలోనే అశరీరవాణిగా, ఆ 8 మందితో విడివిడిగా, "ఓ బిడ్డా! నీకేం వరం కావాలో కోరుకో”అని పలికింది. ఆ వాక్యాలను విని చిరంటిక అనే పేరుగల మృధుభాషిణి యగు పెద్ద కోడలు ఈ నీ మిత్రుని అర్ధాంగి.... భగవతి యొక్క కరచరణాలపై మనోకల్పితమైన పుష్పగుచ్ఛాలు ఉంచి, దేవికి స్తవనం సమర్పించింది. చిరంటిక : దేవీ! దేవాదిదేవుడగు శ్రీశంకరుల పట్ల నీకు ఏ రీతిగా ప్రేమ గలదో... ఆ రీతిగా నా భర్త పట్ల కూడా నాకు ప్రేమ! అటువంటి నా భర్త మృత్యురహితుడై ఉండుగాక! ఇది వరంగా ప్రసాదించు!

శ్రీ పార్వతీదేవి : ఓ సువ్రతీ! చిరంటికా! నీ భర్తకు మృత్యువే ఉండకూడదనియా... నీవు కోరుకొనేది? అయితే సృష్ట్యాది నుండి ప్రవృత్తమై ఉన్న నియతి (లేక) ఈశ్వరాజ్ఞ యొక్క దృఢత్వం అనివార్యం. ఏ జీవునికైనా ఎప్పటికో అప్పటికి ఈ భౌతిక దేహం నశించవలసినదే! తపోధ్యానాదులచే మృత్యు రాహిత్య పదవి లభించజాలదు. ఇంకొక వరమేదైనా కోరుకో!

చిరంటిక : ఓ దేవదేవీ! అంబికా! సరే, అట్టి అమరత్వ పదవి లభింపకపోతే ... నా భర్త ఎప్పుడు మరణించునో... అప్పుడు నా భర్త జీవచైతన్యం, మేము ఉండే పడకగదిలోనే, నా గృహంలోనే ఉండాలి. బయటకు పోనే కూడదు! ఈ వరం దయతో అనుగ్రహించు.

దేవి : పుత్రీ! అట్లే అగుగాక! మీరున్న గృహంలోనే మీ పడకగదిలోనే నీ భర్త సప్త ద్వీపములకు ఆధిపత్యం వహించటం జరుగుతుంది. ఆ తరువాత, ఈ నీ దేహానంతరం మరల నీవు ఆతని ప్రియురాలివగు భార్యవు అవుతావు. నీకు ఆనందమగుగాక!

వృద్ధ తాపసుడు : విన్నావా? కుందదంతా! ఇట్లా పలికి ఆ గౌరీదేవి అంతర్ధానం అయింది. అదే

Page:600

రీతిగా మిగతా ఏడుగురు భార్యలు అటువంటి వరాలే పొందారు. ఆ తరువాత ఈతని ఏడుగురు సోదరులు కూడా మహావరాలు పొందినవారై ఇంటికి జేరారు. ఈ పెద్ద సోదరుని గురించి అక్కడ వీరి కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు. ఈతడు తన భార్యయగు చిరంటిక వద్దకు వెళ్ళును గాక! ఈ సోదరుల - - బంధువుల సమ్మేళనం ఆ విధంగా జరుగున్నది. కనుక వారు ఆ గృహంలోనే వారి వారి పడక గదులలో ఒకేసారి సప్త సముద్ర సహిత మహాసామ్రాజ్యాలకు ఒకే సమయంలో వేరు వేరుగా ఆధిపత్యం వహించనున్నారు.

ఇది ఇట్లా ఉండగా... అక్కడ ఇంకొక సంఘటన కూడా జరిగింది. అది కూడా చెప్పమంటావా? నేను (కుందదంతుడు) : స్వామీ! మీరు చెప్పింది ఇంకా ఆశ్చర్యం. ఈ 8 మంది సోదరులు ఒకే గృహంలో వారి వారి పడక గది ఆకాశాలలో 8 సప్త సముద్రములతో కూడిన మహా భూమండలాలకు వేరువేరుగా ఒకేసారి సుదీర్ఘంగా చక్రవర్తులై ఆధిపత్యం వహించచున్నారా? ఇదంతా ఎలా సాధ్యం? అది అలా ఉండి... ఇది కాక వీరి కుటుంబంలో మరొక విశేషం కూడా జరిగిందని అంటున్నారు కదా! అది ఏమిటో చెప్పండి.

వృద్ధ తాపసుడు : అట్లాగే విను. చెపుతాను.

ఈ 8 మంది సోదరులు తపస్సుకు తరలి వెళ్ళిన క్రొత్తలో తమ 8 మంది కోడళ్ళ యొక్క భర్తృవిరహ దుఃఖం చూడలేక వారి తల్లిదండ్రులు, ఆ కోడళ్ళకు అత్తమామలు అయినట్టి ఆ వృద్ధ దంపతులు తమ కోడళ్ళతో సహా తీర్థయాత్రలకు బయలుదేరారు. త్రోవలో అనేక తీర్థములు, మున్యాశ్రమములు సందర్శించటం జరిగింది. ఒకసారి ఆ పుణ్య దంపతులు శరీరం యొక్క శ్రమను కూడా లెక్కచేయక, తమ పుత్రులు కార్యక్రమ దిగ్విజయం కొరకై కలాప” అనే తీర్థమునకు కోడళ్ళతో సహా బయల్వెడలారు. అట్లా నడుస్తూ ఉండగా ఒకచోట బాటప్రక్కగా ఊర్ధ్వ జటాధారియగు ఒక మనుజుడు కూర్చుని ఉన్నాడు. ఆయన తెల్లటి దేహంతో, పొట్టిగా అవయవములకు బూడిద పూసుకుని కనులు మూసుకొని ఉన్నాడు. కొందరు ఆతనికి నమస్కరిస్తూ వెళ్ళుచున్నారు. ఈ మన వృద్ధ దంపతులు ఆ మనుజుని చూచారు. కానీ ఈతడు ఎవరో సామాన్యుడగు వృద్ధ బాటసారి అయి ఉంటాడులే ... అని అనుకొని నమస్కరించక కొంచెం నిరాదరణ దృష్టి కలిగి ఉన్నవారై త్వరత్వరగా నడువసాగారు. అప్పుడు వారి పాదముల తాకిడికి బాటపైగల కొంచెం ధూళి గాలికి లేచి ఆ బాట ప్రక్కనున్న మనుజునిపై పడింది. ఆయన మరెవరో కాదు. శివాంశ సంభూతుడగు దుర్వాస మహాముని. ఆ ధూళి తనపై పడటం గమనించి ఆ మహాముని కోపంతో కళ్ళు తెరచాడు. దుర్వాస మహాముని : పత్నీ-కోడళ్ళు-వియ్యంకుల సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరిన ఓ మూర్ఖుడా! దుర్వాసుడనగు నాకు నమస్కరించకుండా ధాటిగా దాటిపోతున్నావు కదా! అయితే నీ 8 మంది కుమారులు - 8 మంది కోడళ్ళు కలిసి తమ తమ తపస్సులచే ఏఏ వరములు పొందనున్నారో... వాళ్ళంతా మహా వరములు సముపార్జించినప్పటికీ కూడా... అవి విపరీత దుః ఖ ఫలములనే ఒసంగుగాక! అవి నిష్ప్రయోజనమగు గాక! వారి పట్ల వరం శాపముగా అగుగాక!

Page:601

ఇది విన్న ఆ వృద్ధ దంపతులు జరిగిన ప్రమాదం గుర్తించి ఆ మునికి సాష్టాంగ ప్రణామములు సమర్పించే లోపే ఆ దుర్వాసముని అంతర్ధానమయ్యారు. అప్పుడా వృద్ధ దంపతులు చాలా దుః ఖితులయ్యారు. "ఇదేమి కర్మరా బాబూ? ఆయన దుర్వాసముని అని మాకు తెలియదు కదా! ఎవ్వరో సామాన్యులైన బాటసారి అని అనుకున్నాం. ఇంత మాత్రానికి ఇంత శాపమా? ...అని కృశించినవారై. దీనముఖులై, నిరాశ చెందినవారై యాత్ర నుండి తిరిగి గృహానికి చేరారు.

చూచావా కుందదంతా! ఒకరు సప్త సముద్రములతో కూడిన రాజ్యముపై ఆధిపత్యం పొంది చక్రవర్తి కావాలని వరం కోరుకోవటం. ఇంకొకరు ఆ వరభోక్త తమ ఇంట్లోనే ఉండాలని వరం పొందటం. మరొకరు వారి వరం నిష్ఫలమై దుఃఖమాత్రం కావాలని శాపం పొందటం.

కాబట్టే వీరి కుటుంబ సభ్యుల వృత్తాంతమంతా ఒక అసమంజసం కాదు... అనేక అసమంజసాలతో కూడుకొని ఉన్నదని నేననటం జరిగింది. కంఠముపై వాపు, ఆ వాపుపై కురుపు, ఆ కురుపు పగలటం" ...ఇట్లా అనేక అసమంజసమైన విషయాలు వీరి గృహంలో సమకూడుకొని ఉన్నాయి. ఇదేమంత విచిత్రమేమీ కాదు. ఎందుకంటావా?

శూన్యరూపమైన ఆకాశంలో గంధర్వనగరం వంటి భూప్రదేశాలు, అందులో ఉల్కాపాతాలు, ఇంకా ఎన్నో దృశ్య విజృంభణములు సంభవించటం లేదా? చిదాకాశము యొక్క సంకల్ప రచితమగు ఈ జగద్రూప మహాపురములలో చిత్ర - - విచిత్రములైన అసమంజస విశేషాలకు కొదవ ఏమున్నది?

3. వర - - శాపముల సంవాదము

నేను (కుందదంతుడు) : ఓ రామచంద్రా! ఓ వేదవేత్తలతో కూడిన ప్రియ సభికులారా! వింటున్నారు కదా! అప్పుడు నేను ఆ గౌర్యాశ్రమ వృద్ధ తాపసుని మరల ఇట్లా ప్రశ్నించాను.

నేను (కుందదంతుడు) : హే తాపసేశ్వరా! మీరు చెప్పే చమత్కారమైన విషయం ఎట్లా సంభవించు చున్నదో నాకు ఇప్పటికీ ఏమాత్రం బోధపడనేలేదు.

1. ఇచ్చట సప్త ద్వీపవతియగు పృథివి ఒక్కటే ఉన్నది కదా! మరి ఏకకాలంలో 8 మంది ఎట్లా సప్త ద్వీప ప్రభువులు కానున్నారు?

2.ఈ జీవులు వారియొక్క దేహములు పతనమైన తరువాత కూడా వారంతా ఆ గృహాంతర్గత ప్రదేశాన్ని విడవకుండానే .... సప్తద్వీప సమేత సామ్రాజ్యాన్ని 7000 సంత్సరాలు ఎట్లా ఏలనున్నారు? 3.ఆ వరములు నిష్ప్రయోజనం అవుతాయి అన్న శాపం ఎట్లా కార్యోన్ముఖం కాగలదు? అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడా?

వరదాతలచే ఒసగబడిన వరములు శాపప్రదాతలచే ఒసగబడిన శాపములచే ఆ కుటుంబం విరుద్ధ ఫలితాలు ఎట్లా పొందనున్నది? పరస్పర విరుద్ధములైనట్టి ఈ వరములు - శాపములు

Page:602

ఒకే ధర్మం పట్ల ఒకే తరుణంలో విరుద్ధ ధర్మాలు ఎట్లా ప్రదర్శించ గలుగుతాయి? ఒకవేళ వర శాపములు శుభ - అశుభ ధర్మములు ఒకదానికి మరొకటి ఆశ్రయంగా కలిగియున్నాయందామా? ఎక్కడన్నా ఆధారమే ఆధేయం కాగలదా? నేలపై నడిచేవాడు నేలకే ఆధారం అవుతాడా, ఎక్కడన్నా? లేదుకదా!

గౌర్యాశ్రమ వృద్ధ తాపసి : ఓ సాధూ! వీటన్నిటిలో ఏ అసమంజమైనది నీకు కనిపిస్తోందో... నాకేమీ అర్థం కావటం లేదు. అయితే... ముందు ముందు ఏమి కానున్నదో అది చెప్పుతాను... విను. ఇందులోని చమత్కారం నీకే అర్థమౌతుంది.

భవిష్యత్లోని సంఘటనలు ఈ రోజు నుండి 8వ రోజుకు ఇతడు మధురానగరం జేరనున్నాడు. అక్కడ స్వబంధువులతో కొంతకాలం గడచిపోనున్నది. ఈతని రాకచే వీరి గృహాలలో అందరూ చాలా సంతోషంగా కొన్ని రోజులు గడుపుతారు. ఆ తరువాత కొన్నాళ్లకి ఈ 8 మంది సోదరులు

గృహంలో మరణించటం జరుగుతుంది. అప్పుడు బంధువులు ఆ దేహాలకు దహన క్రియలు నిర్వర్తిస్తారు. అటు తరువాత ఆ ఈ 8 జీవచిత్ సంవిదాకారములు అదే గృహంలో వేరువేరుగా స్థితి పొందియున్నవై... 4 ఘడియల కాలం సుషుప్తిని పొంది జడస్థితియందు ఉంటాయి. అప్పుడు ఒక చమత్కారమైన విషయం జరుగుతుంది.

ఆ 8 మంది సోదరుల జీవ సంవిత్తులు వీరి మరణానంతరం కొంత సమయం జడస్థితిని అనుభవిస్తూ ఉంటాయని చెప్పాను కదా!... ఆ సమయంలో వారి వరరూప కర్మలు శాపరూప కర్మలు అవశ్యం ఫల దాతృత్వం చేసే నిమిత్తమై సంసిద్ధమై వీరి చిత్తాకాశాలలో ఒకచోట సమావేశ మౌతాయి. ఆ వర కర్మలు - శాపకర్మలు ఆయా ఫలములను ప్రసాదించే అధిష్ఠాన రూప దేవతా రూపములు దాల్చుతాయి. వేర్వేరు శరీరములు రచించుకుంటాయి.

వరరూప దేవతలు - - ఉత్తమ సౌభాగ్యశీలురై, చేతులలో పుష్పాలు, బ్రహ్మదండాలు ధరించి అతి శుభ్రమైన అవయవాలు కలిగి విష్ణురూపధారులై అక్కడికి వస్తారు. శాపరూప దేవతలు త్రినేత్రులై, చేతిలో శూలం ధరించి, భయంకరాకారాలతో మేఘం వంటి నల్లని భుజాలతో క్రోధ ముఖులై వస్తారు.

వర దేవతలు : ఓ శాపములారా! ఇక మీరు దూరంగా పోండి. మేము ఫలించనున్నాము. మమ్ములను క్రియత్వమునుండి ఆపటానికి సమర్థులెవరూ లేరు.

శాపములు : ఓ వరములారా! ఇది మేము ఫలించే సమయం. మీరే దూరంగా పోవలసి ఉన్నది.

వరములు : మీరు దుర్వాసమునిచే సంకల్పించబడ్డారు. ఇక మేమో? సూర్య భగవానునిచే నియమించబడ్డాం. మునుల కంటే ముందే బ్రహ్మదేవుడు సూర్య భగవానుని సృష్టించారు. కాబట్టి మునుల కంటే సూర్య భగవానుడే అధికుడు.

Page:603

శాపములు : (క్రోధంగా) ఓ వరములారా! మీరు సూర్యునిచే సంకల్పించబడ్డారు. నిజమే. కాని మేము రుద్రభగవానుని అంశభూతుడగు దుర్వాసునిచే నియమించబడ్డాం. అందరు దేవతలలోను రుద్రుడే అధికుడన్నది లోక విదితమే కదా! (అని తమ శూలాలను వరాలపై గురిపెట్టుట జరుగుతుంది.)

వరములు : (పకపకా నవ్వుచూ) ఓ శాపములారా! మీరు పాపరూపమగు అనుచితత్వమును కాస్త ఆపండి. ఈ సందర్భమేమిటో కొంచెం విచారణ చేయండి. ఎందుకంటే... కలహమంతా ముగిసిన తరువాత ఏది కర్తవ్యమై ఉంటుందో... దానిని మొట్టమొదటే విచారణ చేయటం ఉచితం. కలహం కొనసాగించినా చివరికి మనకు బ్రహ్మదేవుని నిర్ణయమే శిరోధార్యం అవుతుంది కదా! ఆ పని మొదటే చేస్తే పోలా? కాబట్టి మనం బ్రహ్మదేవుని దర్శించి వారు ఏది నిర్ణయిస్తే అది అనుసరిద్దాం.

ఇది శాపములకు సానుకూల్యమైన యుక్తిగానే అనిపించింది. సందేహ నివారణ కొరకై మహానుభావులే సర్వదా శరణ్యం కదా! అందుచేత శాపాలు సరే! అట్లాగే చేద్దాం... అని ఒప్పుకున్నాయి. అప్పుడు వరములు, శాపములు బ్రహ్మలోకం జేరి బ్రహ్మదేవుని దర్శించి తమ తమ వృత్తాంతములు, తమకు "క్రియాశీలత్వంలో ఎవరు ముందు? ...అనే విషయంలో వచ్చిన అభిప్రాయ భేదం సవివరంగా విన్నవించుకున్నాయి. అదంతా ప్రశాంతంగా విని బ్రహ్మదేవుడు ఇట్లా పలికాడు.

శ్రీబ్రహ్మదేవుడు : వత్సలారా! వర-శాపాధిపతులారా! ఇందులో వివాదం ఎందుకు? మీలో ఎవరు లోన సారత్వం కలిగి ఉన్నారో, ఎవరు సంకల్పం యొక్క సుదృఢత్వం కలిగియున్నారో... వారే క్రియాశీలురు కాగలరు. ఒకరి హృదయం మరొకరు పరిశీలించి చూచుకోండి. ఎవరి ప్రయోజనము అసారమో, వారు ఉపేక్షించండి. సారసహితులైనవారు అపేక్షను కొనసాగించండి.

8

అప్పుడు ఒకరి సారత్వం మరొకరు పరిశీలించటానికై ఆ వర - శాపములు ఒకరి హృదయంలో మరొకరు పరిశీలించసాగాయి. దేని పట్టుదల, సాధన, ఉద్దేశము ఎంతవరకు బలవత్తరమో పరిశీలించాయి. అట్లా ఒకరినొకరు చక్కగా పరిశీలించుకున్న తరువాత.. ఎద్దానియందు 'ఉద్దేశము' అనే సారము బలవత్తమో ... క్షణములలో ఒక అవగాహనికి వచ్చి... అప్పుడు మరల బ్రహ్మదేవుని సమక్షానికి వచ్చారు.

శాపములు : ఓ ప్రజానాథా! బ్రహ్మదేవా! మేమే ఓడిపోయి మా ఓటమిని అంగీకరిస్తున్నాం. మేము లోన సారత్వం కలవారం కాము. ఈ వరాలే బలసమన్వితమై, వెనుక బలవత్తరమైన ఉద్దేశంతో కూడిన ప్రయత్నంచే సారభూతమై ఉన్నాయి.

హే మహాత్మా! వరరూపులం - శాపరూపలం అగు మేము సంవిత్ యొక్క సంకల్పరూపులమే కదా! సంవిత్ (బుద్ధి) చైతన్య రూపమే అయివున్నది. కనుక చైతన్యం - చైతన్య సంవిత్లకు వేరుగా మాకెట్టి రూపమూ లేదు.

Page:604

వరదుడు వరలబ్ధుడు... ఈ ఇద్దరూ ఒకే చైతన్య సంవిత్తు యొక్క రెండు ప్రదర్శనములే కదా! అట్టి సంవిత్తు యొక్క స్ఫురణ’యే విజ్ఞాన రూపత్వము దాల్చుచున్నది.

వరము ప్రసాదించువాని యొక్క సంవిత్తు నేను వరం ప్రసాదిస్తున్నాను అనే రూపం కలిగి ఉన్నది. వరము స్వీకరించువాని యొక్క సంవిత్తు నేను వరం పొందుచున్నాను” అనే రూపం కలిగి ఉంటోంది. అట్టి విజ్ఞాన రూపమే... తన యొక్క సుఖభోగ భావనాబలం చేత శరీరత్వమును నిర్మించుకొంటోంది. అట్టి శరీరత్వధారణా సంవిత్తు క్రమంగా దేహాకారంగాను, దేశ - కాలాది అనేక భ్రమలకు అర్హముగాను అగుచున్నది. అట్టి భ్రమ సంవిత్తు క్రమంగా భ్రమచే ఆయా భోగ్య పదార్థములను గాంచుచూ, అనుభవించుచూ, భుజించుచూ కాలబద్దం అవుతోంది.

ఆ 8 మంది అన్నదమ్ములు దృఢ సంకల్పముచే "మేము తపస్సు చేసి చక్రవర్తులం కావాలి” అని దృఢభావన ఆశ్రయించటం చేత క్రమంగా తపోఫల సంవిత్తు దినానుదినంగా దృఢత్వం పొందటం జరిగింది. ఆ వర కల్పనారూప చైతన్యం కాలాంతరంగా ఫలావస్థ వైపుగా పరిపుష్టి పొంది ఉన్నది. సశాస్త్రీయమైన తపోయత్నమే ఆ పరిపుష్టికి కారణం. అందుచేతనే... ఆ 8 మందిలో సప్త ద్వీప భూమండలమునకు చక్రవర్తిత్వము సార్థకత పొందింది. కనుకనే “వరములు మా కంటే అధికంగా సారత్వము కలిగి ఉన్నాయి... అనే నిర్ణయానికి మేము వచ్చాం.

వరము కోసం శాస్త్రీయ ప్రయత్నం (వరార్ధి వరఫలం కోసం సుదీర్ఘంగా ప్రయత్నించి ఉండటం); వరము ప్రసాదించేవారు అది ప్రసాదించటం (వరప్రదాత వరదానమును సుదీర్ఘంగా అభ్యసించి ఉండటం)... రెండు చిరకాలాభ్యాసముచే ఫలవంతమవటానికి ఎంతో సారసహితమై ఉన్నాయి. ఆశయము పట్ల లక్ష్య శుద్ధి అత్యధికంగా కలిగి ఉన్నాయి.

ఏ సంవిత్తు చిరకాలము బాగుగా అభ్యసింపబడుచున్నదో ... అదే సారవంతం. అదే దృఢత్వం పొందుతోంది. అదే అధికంగా ఫలవంతమగుచున్నది. హే జగద్గురూ! బ్రహ్మదేవా! శాపములగు మేము, వరములు, వరశాపములు ప్రసాదించేవారు, వర శాపములు పొందేవారు, మీరు... మనమంతా సంవిత్ స్వరూపములమే కదా!

ఈ దృశ్యజగత్తులో ప్రయత్నము - ప్రయోజనములకు సంబంధించిన భేదముండవచ్చుగాక! ఏమైతేనేం? వరప్రదాత, వరము, వరాలబ్ధుడు, శాపప్రదాత, శాపము, శాపగ్రస్తుడు... ఈ ఆరుగురు ఒకే సంవిత్తు యొక్క స్వరూపములే!

శుద్ధ సంవిత్లందు ఏది అధికంగా శుద్ధమై (అభ్యాసపూర్వకంగా) ఉంటోందో ... అదియే తక్కిన సంవిత్తులకంటే అధికంగా ప్రబలమై ఉంటుంది. అశుద్ధ సంవిత్తులందు ఏది (అభ్యాస పూర్వకంగా) అధిక ప్రబలమై ఉంటుందో... అదియే తక్కిన అశుద్ధ సంవిత్తులను జయిస్తూ ఉంటుంది.

అట్లాగే కాలదృష్టితో ఏది జ్యేష్ఠమైతే (ఏది అధిక కాలం అధికంగా అభ్యసించటం జరిగితే)... అదియే తక్కిన వాటిని జయించటం న్యాయమే కదా! అల్పకాలం మాత్రమే అల్పమైన శ్రద్ధతో అభ్యసించింది, మరి, అధికాభ్యాసంతో కూడిన దానిని జయించి వేయటం న్యాయం ఎట్లా అవుతుంది?

Page:605

శుభ - అశుభ కర్మలు తత్పలములగు వర - - శాపములు ఒకదానితో మరొకటి ప్రమాణము - అభ్యాసము”లకు సంబంధించి సామ్యత్వం ఉన్నప్పుడైతే... అప్పుడు పాలు-నీళ్ళు కలిసినట్లు ఆ శుభ-అశుభ కర్మలు కలిసిపోయి మిశ్రమ ఫలములిస్తాయి. ఎక్కడ శుభ - అశుభ కర్మలు ఒకదానితో మరొకటి సామ్యత్వం ఉండదో - - అప్పుడు ఆ రెండింటి ఫలములు సామ్యత్వం కలిగి ఉండవు. ఎచ్చటైతే ఏకకాలంలోనే వేరు వేరైన కర్మఫలములుగా వర శాపములు ఫలీకృతం అవుతాయో ...అక్కడ ఆ జీవుడు ఒకే సమయంలో వేర్వేరు ఉపాధులతో వర-శాపముల ఫలమును పొందటం కూడా జరుగవలసి ఉంటోంది. ఎట్లా అంటే, ... నగర రూపధారియగు చైతన్యము ఆయా ఫలములను సామూహికంగా ఆ నగర జనులతో కూడిన అనేక రూపములతో పొందటం లేదా! ఇదీ అంతే.

హే ప్రభూ! తమ వద్ద మేము నేర్చుకొన్నదే... తమకు అప్పజెప్పుచున్నాం. అంతేగాని.... మీకు క్రొత్తగా తెలియజేయగల వారం కాదు. తమ సంకల్పమే మా రూపం కదా! కాబట్టి మా దుష్టత్వ రూపమగు అపరాధం చేత అల్పసార రూపమగు మేము అధికసార రూపమగు ఈ వరదేవతలను నిరోధించ యత్నించినందుకు క్షమించండి. మీకు సాష్టాంగ దండ ప్రణామములు. ఇక మాకు సెలవు ఇప్పించండి.

ఇట్లా పలికి ఆ శాపములు సిగ్గుపడుతూ తమను తామే శపించుకుంటూ - తిమిర రోగం వలన ఆకాశంలో కనిపించే కేశములు (దృష్టిదోషం పోయినప్పుడు) మటుమాయయినట్లు - అప్పటికప్పుడే ఎటో వెళ్ళిపోతాయి.

4. ఆధిభౌతిక భ్రాంతి

కుందదంతుడు : ఓ రామచంద్రా! ఓ పండిత సభా-మన్యులారా! ఆ 8 మంది సోదరుల యొక్క (ఆ గౌర్యాశ్రమ వృద్ధ తాపసి చెప్పుచున్న) సప్త ద్వీప సమేత భూమికంతటికీ చక్రవర్తులు కావాలనే వరం ఫలీకరించే సమయంలో జరుగబోవు విశేషాలు మీకు చెప్పుచున్నాను కదా! ఇంకా ఆ వృద్ధతాపసి తన సంభాషణమును ఇట్లు కొనసాగించారు.

గౌర్యాశ్రమ వృద్ధ తాపసి : ఓ కుందదంతా! ఆ విధంగా శాపములు అంతర్ధానమైన తరువాత ఇప్పుడు ఇరువురు వర పురుషులు పరమాత్మయగు బ్రహ్మదేవుని సమక్షంలో తమకున్న భేదాభిప్రాయాలను ఉటంకిస్తూ నిలబడతారు.

1.ఎనిమిది మందికి విస్తార భూమండలానికి చక్రవర్తిత్వము ప్రసాదించు మొదటి వరదేవత. 2.వారి భార్యలకు మీ భర్తలు మీ పడక గదులలోనే ఉంటారు ...అను రూపంలో ప్రసాదింపబడినట్టి రెండవ వరదేవత.

మొదటి దేవత సూర్య పురుష సంకల్ప నిర్మితము. రెండవ దేవత గౌరీ వర ప్రసాదరూప వరదేవత. గౌరీ వరప్రసాద దేవత అంతకు ముందు శాపములు నిలబడ్డ స్థానంలోకి వచ్చి నిలబడి బ్రహ్మదేవునితో ఇట్లా విన్నవించుకుంటారు.

Page:606

గౌరీ వరప్రసాద దేవత : హే దేవేశ్వరా! మేము ఆ 8 మంది భార్యల వ్రత పుణ్యఫలం చేత గౌరీదేవిచే సంకల్పించబడ్డాం. మా విధిని అనుసరించి ఆ 8 మంది జీవ సంవిత్తులను ఆ గృహం నుండి బయటకు వెళ్ళనీయకుండా చేస్తాం. ఇక ఆ గృహంలోంచి బయల్వెడలకుండా సప్త ద్వీప సమేత సామ్రాజ్యానికి ఎట్లా ఆధిపత్యం వహిస్తారు?... అనే ప్రశ్నకు మాకు సమాధానం తెలియదు.

ఈ సూర్య పురుష వరదేవత ఎట్లా ఫలమును ప్రసాదిస్తుందో... అది మాకు సంబంధించిన విషయం కాదు కదా! ఈ సూర్య దత్త వరదేవతేమో ఆ 8 మంది జీవులను సప్తద్వీపేశ్వరులుగా, యుద్ధంలో దిగ్విజయ యుక్తులుగా గావించటానికి ఆ గృహం నుండి తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉంది. మేమేమో ఆ గృహం నుండి వారు బయటకు వెళ్ళకుండా నిరోధిస్తున్నాం.

ఓ బ్రహ్మదేవా! జగద్గురూ! గౌరీ వరరూపులగు మాకు సూర్యదేవ వరరూపియగు ఈ వరదేవతతో విరోధము అనివార్యమౌతోంది. ఇప్పుడు ఏది శ్రేయమో... అది ఆజ్ఞాపించండి. శ్రీబ్రహ్మదేవుడు : ఓ సప్త ద్వీపేశ్వర ప్రదాతయగు వరదేవతలారా! మరియూ ...ఆ గృహము నుండి బహిర్గతం కాకుండా నిరోధించే వరదేవతలారా! మీరు ఒకరితో ఒకరు నిరోధించి తద్వారా విరోధం పొందవలసినది ఇక్కడ ఏమీ లేదు. మీరు పరస్పరం అపేక్షత్వమే పొందండి. ఒకరి కార్యమును మరొకరు దృష్టిలో ఉంచుకునే ప్రవర్తించండి. మీ ఇరువురి ప్రయత్నము ఇప్పుడు నెరవేరుతూనే ఉన్నది. ఎందుకంటే... ఆ 8 మంది సోదరులు మరణించిన మరుక్షణం నుండి చిరకాలంగా ఆ గృహంలో ఉండియే సప్తద్వీపేశ్వరత్వం వహించియే ఉన్నారు.

ఉభయ వరదేవతలు : హే మహాత్మా! బ్రహ్మదేవా! మీరు చెప్పేది ఎట్లా సాధ్యం? వారి 8 భూమండలాలు, ఆయా సప్త ద్వీపాలు, ఆ విధమైన ఐశ్వర్యములు ఒకే భూ మండలంలో ఎట్లా ఉంటాయి? ఇక అవన్నీ ఒకే గృహంలో ఉండటం అసాధ్యమని వేరే చెప్పక్కర్లేదు కదా! ఒక కలువ పువ్వులో 100 ఏనుగులు సంచరిస్తూ, నృత్యం చేస్తూ ఉంటాయా ఎక్కడన్నా?

హే పరంధామా! మేము ఒక్క భూమండలం గురించే విని ఉన్నాం. చూస్తున్నాం. అందులో ఒకేసారి 8 మంది సప్తద్వీపేశ్వరుల ఆధిపత్యం ఎట్లా ఒకనగూడుతుంది. అదీ వారంతా ఒకే గృహంలో ఉండి ఉండగానా?

శ్రీ బ్రహ్మదేవుడు : ఓ సూర్యదేవత సంకల్పిత - గౌరీ సంకల్పిత వరదేవతలారా! ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? ఇందులోని విశేషం ఏమిటో మీకు చెపుతాను... వినండి! మీతోను... మాతోను గూడియున్నట్టి ఈ సృష్టి - సమష్టి సహిత సమస్త జగత్తు వాస్తవానికి చిదాకాశమాత్రమే కదా! ఇదంతా చైతన్య పరమాణువు నందు స్థితినొందియుండగా... ఇది అద్దానియందు స్వప్నంలో దృశ్యంలాగా అనుభూతమౌతోంది. ఒక్క చైతన్య పరమాణువులో అసంఖ్యాక బ్రహ్మాండములు ఏర్పడి ఉంటూ ఉండగా, కించిత్ స్వప్న స్ఫురణలో సువిశాల స్పప్న జగత్ దృశ్యం సదృశ్యమగు చుండగా ...వారి గృహంలో ఆ 8 మందికి వేరువేరైన 8 భూమండలాలు అనుభూతం కావటంలో ఆశ్చర్యమేమున్నది? వారు మరణించిన మరుక్షణమే... సచ్చిదానంద ఘనాకారము - పదార్థ

Page:607

శూన్యము” అయినట్టి చైతన్యమే... యథారీతి స్థితి కలిగి ఉన్న జగత్తుగా వారికి భాసించనారంభిం చింది. ఏ జీవుడైనా సరే, ఏదేది ఎట్లెట్లు పొందుచున్నాడో... అదంతా తన స్వయంకృత స్ఫురణ యొక్క చమత్కారంచేత స్వస్వరూపమగు చిదాకాశమునందే, చిదాకాశం పట్ల పొందటమే జరుగుతోందని ఒకప్పుడు మీకు బోధించియే ఉన్నాను కదా! ఇక ప్రస్తుత క్రమంలో గల ఆశ్చర్యం ఏమున్నది? వారు మరణించి, వారి వారి పడక గదులలో స్వస్వరూప చిదాకాశమునందే - వేరు వేరుగా భూమండలమును దర్శించి, వాటికి మహా నాయకత్వం వహిస్తున్నారు.

ఓ వరస్వరూపదేవతలారా! ఏదైతే ఈ కనబడే జగత్తుగా... మీకుగాని, నాకుగాని, మరెవరికైనా గాని... భాసిస్తోందో... అది చైతన్య తత్త్వమే అయివున్నది. వాస్తవానికి ఈ జగత్తు మూర్తము(సాకారం) కాదు. ఆ గృహంగాని, ఆ 8 మంది ఇప్పుడు పొందుచున్న భూమండలం గాని సాకారం కాదు. సర్వమూ నిరాకారమే! ఆకాశం శూన్యరూపంగా భాసిస్తున్నట్లు చిన్మాత్రమే జగత్ రూపంగా భాసిస్తోంది. గృహము-భూమండలము నిరాకారమగు చిదాకాశ స్వరూపములే అయినప్పుడు ఒకదానిలో మరొకటి అమరి ఉండటం - - అమరిక ఉండకపోవటం అనే ప్రసక్తి ఎక్కడిది? ప్రతి జీవుడు ప్రతిరోజు చూస్తున్న స్వప్నములలో ఏది ఎందులో ఇమడదు? గదిలో నిదురించే స్వప్న ద్రష్ట స్వప్నంలో మహానగరములు చుట్టి వస్తున్నాడు కదా!

ఓ వరదేవతలారా! మీరు ఆధిభౌతిక భ్రాంతిని త్యజించండి. తత్త్వ విచారణచే ఈ ఈ భౌతిక రూపములకు సంబంధించినదై ఉన్న సూక్ష్మ (అతివాహిక) దేహములను గమనించండి. ఆ సూక్ష్మ దేహములకు కూడా ఆధారమైయున్న చిదాకాశ స్వరూపమును సంస్మరించండి. ఇక మీరు వెళ్ళి మీ మీ విధ్యుక్త ధర్మాలను నెరవేర్చెదరు గాక!

ఓ కుందదంతా! ఆ ప్రకారంగా సర్వ వరదుడగు బ్రహ్మదేవుడు అంతా సర్వదా చిదాకాశమే! చిదాకాశం యొక్క స్ఫురణ విశేషమే ఈ బ్రహ్మాండములు... అని విశదీకరించి చెప్పినదంతా ఆ

ఉభయ వరదేవతలు శ్రద్ధగా వింటారు. అప్పటికప్పుడే తత్త్వవిచారణచే ఆధిభౌతిక భ్రాంతిని త్యజించివేస్తారు. సూక్ష్మ దేహధారులై పరమాత్మయగు బ్రహ్మదేవునికి ప్రణామం చేసి... ఆయా 8 మంది సోదరుల మనోకల్పితములైనట్టి సప్తద్వీప మండలములలో ప్రవేశించి తమ తమ వరప్రసాద సంకల్పిత ఫలములను ప్రసాదించ నారంభిస్తారు.

ఇక ఆ 8 మంది సోదరులు పరస్పరం తమ సప్తద్వీపేశ్వరత్వం (ఒకరిది మరొకరికి) తెలియకయే ఉండగలరు. ఎందుచేతనంటే తత్త్వజ్ఞానం లేకపోవటం చేతనే! ఒకరి స్వప్నంలోని విశేషాలు ఆ ప్రక్కనే నిదురిస్తూ కలలుగనే మరొకరికి కనబడవు కదా! అయితే, వారి వారి స్వస్పందనరూప భూమండలములో మాత్రం అన్యోన్య బంధువులతో అన్యోన్యహిత తత్పరులై మనుగడ సాగించగలరు.

కుందదంతుడు : ఓ రామచంద్రా! ఆ గౌర్య వన వృద్ధ తాపసి ఆ విధంగా ఆ 8 మంది సోదరుల

Page:608

భవిష్యత్ కథనములను నా అసమంజసము కదా! అనే సందేహం నివృత్తింపజేయటానికి నాకు చెప్పారు. అప్పుడు నేను ఆయనతో ఇట్లా అన్నాను.

నేను (కుందదంతుడు) : స్వామీ! మీరు చెప్పినదంతా విన్న తరువాత కొంత వరకు నా సందేహాలు తొలగాయి. అయితే, సాంసారిక దృష్టి నాకు మీ వలె ఎంతగానో తొలగవలసి ఉన్నది కాబోలు. హే మహాత్మా! ఆ వర - శాప దేవతలు బ్రహ్మలోకం నుండి బయల్వెడలారు కదా! వరదేవతలు ఆయా వరములను సిద్ధింపజేయటానికి వెళ్ళినప్పుడు ఆ 8 మంది బ్రాహ్మణోత్తముల సంవిత్ (జీవ) చైతన్యములు ఏమేమి పొందుతూ ఉంటాయో... అది కూడా చెప్పండి.

గౌర్యవన వృద్ధ తాపసి : సరే! అది కూడా, ఒకానొక సమయానికి ఏదిట్లా ఉండబోవుచున్నదో... చెపుతాను విను.

1వ సోదరుడు : యౌవనావస్థ యందు ఒప్పుచు ఉజ్జయినీ మహాపట్టణంలో విస్తారమైన రాజ్యం పరిపాలిస్తూ సుఖవంతుడై ఉంటాడు.

2వ సోదరుడు : శాకద్వీపవాసి నాగలోకం జయించాలి అనే కోర్కెతో సర్వ దిక్కులలో విజయం పొందటానికై యత్నశీలుడై సముద్ర గర్భంలో సంచరిస్తూ ఉంటాడు.

3వ సోదరుడు : కుశ ద్వీప రాజధానిలో మనోవ్యధారహితుడై సుఖంగా సమస్త ప్రజలతో కూడుకొని ఉండి ఉంటాడు. అప్పటికే దిగ్విజయుడై రాజపత్ని కౌగిలిలో సుఖంగా నిదురిస్తూంటాడు.

4వ సోదరుడు : శాల్మలి ద్వీప మహా పర్వత శిఖరంపై గల నగరంలో గల సరోవరంలో విద్యాధర స్త్రీలతో కూడి జలక్రీడాతత్పరుడై ఉంటాడు.

5వ సోదరుడు : దండయాత్రలు నిర్వహించి సప్త ద్వీపాల నుండి కొనిరాబడిన మహాసంపద లచే క్రౌంచ ద్వీపంలో 8 రోజులు అశ్వమేధయాగం నిర్వర్తించే సంరంభంలో ప్రవృత్తుడై ఉంటాడు. 6వ సోదరుడు : ద్వీపాంతరంలో ఒక రాజుతో యుద్ధం చేసే వ్యవహారంలో ప్రయత్నశీలుడై

ఉంటాడు.

7వ సోదరుడు : గోమేధ ద్వీప నివాసి అయి, గొప్ప సైన్యం కలిగి ఉండి, పుష్కర ద్వీపరాజును జయించి, అక్కడి రాజకుమారిని కామదృష్టిచే బంధించి తన వెంట రథంలో తీసుకునిపోతూంటాడు.

8వ సోదరుడు : పుష్కరీ ద్వీపవాసి మిత్రుడగు లోకాలోక పర్వత ప్రదేశపు రాజదూతతో భూమిలోగల ధన నిక్షేపములను గుర్తించటానికి బయల్వెడలుతూ ఉంటాడు.

ఓ కుందదంతా! ఈ ప్రకారంగా వారిలో ప్రతి ఒక్క సోదరుడు ఆ గృహాకాశంలోనే తమ బుద్ధికి యోగ్యం అయినట్టి సప్త ద్వీప ప్రభుత్వాధిపత్యం పొందే మార్గంలో ఉంటారు. అప్పుడు ఆ వరదేవతలు బ్రహ్మలోకం నుండి వచ్చినవారై తమ తమ సూక్ష్మ దేహాలను కూడా త్యజించి ఆ 8 మంది సోదరుల జవ సంవిత్తులతో ఏకత్వం పొందటం జరుగుతుంది. ఆ తరువాత ఆ 8 మంది సోదరులు తమ అభిమతములను పొందినవారై... సంతుష్టులై... సప్త ద్వీపేశ్వరులై చిరకాలం వెలయగలరు.

Page:609

చూచావా కుందదంతా! దీనినిబట్టి మనం గ్రహించవలసినది ఏమిటి? సాక్షి చైతన్యము యొక్క అభ్యంతరమున దృఢ నిశ్చయ రూపంగా ఏది స్ఫురిస్తుందో... అదియే బాహ్యానికి ప్రదర్శిత మౌతూ ఉంటుంది. కనుక, ఎవ్వడు ఎద్దానిని కోరుకుంటాడో - అందుకు ఉచితమైనట్టి తపస్సు, జపము, ధ్యానము, తదితర యత్నములు, కర్మలు కొనసాగిస్తే - ఈ జగత్తులో పొందరానిది ఏముంది?

5. ఒక గృహంలో వేలాది జగత్తులు సంభవమే!

కుందదంతుడు : ఓ రామాది సభిక శ్రేష్ఠులారా! ఆ విధంగా కదంబ వృక్షము క్రింద ఉన్న ఆ వృద్ధ తాపసుడు ఆయా భూత-భవిష్యత్ విశేషాలన్నీ చెప్పగానే మరల నా సందేహం తీరక నేను ఇట్లా ప్రశ్నించాను.

నేను (కుందదంతుడు) : స్వామీ! ఇంకా నాకు కొంత సందేహంగానే ఉన్నది. "ఒక్కొక్కటి 50 కోట్ల యోజనములు విస్తీర్ణంగల సప్తద్వీపములతో కూడిన 8 భూములు అల్ప విస్తీర్ణంగల ఒక గృహంలో ఎట్లా ఉండగలుగుతాయి?... అనే ప్రశ్నకు నా బుద్ధికి సమాధానం కుదరటం లేదు. కదంబవన వృద్ధ తాపసి : ఓ సాధూ! మనందరి వాస్తవ స్వస్వరూపమే అయివున్న సర్వవ్యాపక చైతన్యము వాస్తవానికి ప్రపంచ శూన్యమైనది. అట్లా అయివుండి కూడా... తాను ఎచటెచట ఉనికిని అనుభూతపరచుకొంటే అచటచట స్వయంగా తనయందు తనను... త్రైలోక్య రూపంగానో, సుషుప్తి రూపంగానో, తురీయ రూపంగానో... సందర్శనము, అనుభవము కలిగి ఉంటుంది.

పరమార్థమున అయ్యది తన శుద్ధ తత్త్వరూపమును ఏమాత్రం త్యజించటమే లేదు. తరంగ ఆకారంగా అగుచున్న జలం తాను జలత్వం త్యజిస్తోందా? కోల్పోతోందా? లేదే! తరంగత్వం జలం యొక్క స్వభావమే అయివున్నది. నిర్మల చైతన్యత్వం జీవుని వాస్తవ స్వభావమే అయి ఉన్నది. నేను (కుందదంతుడు) : మహాత్మా! "ఏకం, నిర్మలం, శాంతం, మంగళకరం, పరమకారణం అయినట్టి పరబ్రహ్మము నందు... అట్టి తత్త్వమునకు - స్వభావమునకు విరుద్ధ స్వభావంగా ఈ ఈ నానా రూపత్వ స్థితి ఎట్లా కలుగుచున్నది?

కదంబవన వృద్ధ తాపసి : బిడ్డా! ఈ ఈ నానారూపత్వం వాస్తవం కాదు. ఇది భ్రాంతి మాత్రమే!

సర్వం శాంతం చిదాకాశం నానాస్తీ, హ న కించన I

దృశ్యమానమపి స్ఫారమావర్తాత్మా యథా అంబసి ||

సమస్తము శాంతమగు చిదాకాశమే! ఈ జగత్తు అనేక వస్తు - విశేషాదులతో సువిశాలమై ఉండవచ్చు గాక! ఇదంతా సర్వదా సత్ - చిత్ - ఆనందమే! ఏ తరంగం మొదలే జలము అయి ఉండలేదు? తరంగము యొక్క ఆకారమువలె అసత్యములైనప్పటికీ సత్యములవలె కనిపించే ఈ జగత్ పదార్థములన్నీ కూడా చిదాకాశము యొక్క నిజ నిర్మల యథార్థ స్వరూపమే! స్వప్నంలో కనిపించేదంతా స్వప్నద్రష్ట సంవిత్ స్వరూపమే అయినట్లు... జాగ్రత్ కూడా అట్టిదే!

Page:610

అయితే సర్వస్వరూపమగు పరమాత్మ వాస్తవ స్వరూపంలో సృష్ట్యాది స్వభావములూ లేవు. పదార్థములూ లేవు. ఇక సృష్ట్యాది యందు బ్రహ్మదేవునిచే ఏది ఎట్లు స్ఫురిస్తోందో... అది అట్లే స్థితినొందియున్నది. చిదాకాశమగు పరబ్రహ్మము యొక్క స్వరూపం... ప్రకాశాత్మకమూ కాదు, అప్రకాశాత్మకమూ కాదు. పదార్థరూపం కాదు. అచిద్రూపం కాదు. అది కేవలమూ శుద్ధ చిద్రూపములోనే స్థితినొందియున్నది. (చిద్రూపము = ఎరుగుటకు ముందే ఏర్పడియున్న నిర్మలమైన 'ఎరుక' స్వరూపం)

ఓ సాధూ! కుందదంతుడా! ఒకే స్వప్న చైతన్యము స్వప్న సైన్యంలో లక్షలాది సైనికుల రూపంగా అగుచున్నది కదా! అయినప్పటికీ ఆ చైతన్యము నిత్యనిర్మలం, సర్వమునకు పరము, అప్రమేయము కదా! ఒకే జాగ్రత్ చైతన్యము జాగ్రత్లో అనేక పదార్థముల రూపంలో అగుపిస్తూ కూడా తాను నిత్యనిర్మలమై ఉన్నది.

చిదాకాశము స్వతహాగా నిర్మల స్వరూపి అయి కూడా ఏఏ రూపములుగా స్ఫురిస్తోందో... ఆ స్ఫురణాకారమును స్వతహాగా తానే జగత్ రూపంగా అనుభవిస్తోంది.

స్వప్నంలో అగ్ని కనబడిందనుకో! అక్కడ వాస్తవానికి అగ్ని ఉన్నదా? స్వప్న చైతన్యమే ఉష్ణరూపంగా భాసిస్తోంది. కదా! స్వప్నంలో స్తంభము కనిపించిందనుకో! అది స్వప్నద్రష్ట బుద్ధి రూపమేగాని... వాస్తవమైన స్తంభం కాదు కదా! అట్లాగే జాగ్రత్లో కూడా 'సంవిన్మాత్రము' అగు చిదాకాశమున నిజస్వరూపమే నానారూపత్వంగాను, పదార్థాకారంగాను భాసిస్తోంది. చైతన్యంకంటే భిన్నమైనదేదీ ఎక్కడా లేదు.

ఆదిసృష్టియందు ఈ పదార్థములన్నిటి రూపము, నిర్మల చిద్రూపమే! అప్పుడు చిదాకాశము ఏ పదార్థమును ఏ అర్థంతో ఎరుగుట జరిగియున్నదో... అది నేటి వరకు ఆ రీతిగానే వర్తిస్తోంది. ఓ కుందదంతా! వృక్షమే పుష్పమునందు, ఆకుల యందు, పండ్లయందు, కాండమునందు వ్యాపించి ఉన్నట్లే... ఈ జగత్తంతా సర్వత్రా సర్వరూపమగు పరబ్రహ్మమే అయివున్నది. చిద్రూప మహా సముద్రంలో సృష్టి పరంపరలు జల తరగములవంటివి. తరంగాలన్నీ జలమే కదా! జలానికి వేరుగా తరంగాలు ఎక్కడున్నాయి? పరమార్థ మహాకాశమున ఈ సృష్టి ప్రతిభాసలు శూన్యరూపములే! తత్త్వబోధ’ అనే పవిత్ర పాఠ్యాంశము ఎరిగితే... 1. సృష్టి, 2. పరమార్థ చిద్రూపము (చిత్ చైతన్యం) ...ఈ రెండూ పర్యాయపదములే! ఇక అజ్ఞానము చేత... ఏది ద్వైతముగా (సృష్టి వేరు - ఆత్మ వేరు అను రూపంగా) తెలియబడుచున్నదో... అదంతా కూడా దుఃఖము కొరకే అగుచున్నది.

పరమార్థో - జగచ్ఛేదమ్ 'ఏకమ్ ఇత్యేవ నిశ్చయః అధ్యాత్మ శాస్త్ర బోధేన భావేత్సైషా హి ముక్తతా!

అధ్యాత్మ శాస్త్ర జ్ఞానం చేత...“పరమార్థము జగత్తు ఒక్కటే అనే నిశ్చయం తప్పక కలుగుతోంది. అట్టి అవగాహనయే ముక్తి. అదే అపరోక్షానుభూతి.

సంకల్పస్య వపుర్బహ్మ, సంకల్పకచిదాకృతేః

తదేవ జగతో రూపం, తస్మాత్ బ్రహ్మాత్మకమ్ జగత్ II

Page:611

సంకల్పించువాడు బ్రహ్మమే. సంకల్పము కూడా బ్రహ్మమే! ఆ సంకల్పముచే అనుభూతమయ్యే జగత్తు కూడా బ్రహ్మమే! కనుక ఈ జగత్తు బ్రహ్మాత్మకమే సుమా! ఇదంతా బ్రహ్మోత్సవం! నీ ఆలోచనయే ఈ జగత్తు రూపం. నీ ఆలోచన నీ రూపమే కదా! కనుక, ఈ జగత్తు నీ రూపమే!

యతో వాచో నివర్తన్త, న నివర్తన్త ఏవవా

విధయః ప్రతిషేధాశ్చ భావాభావదృశస్తథా ॥

ఎద్దానిని పొందజాలక వాక్కులు, విధి నిషేధాలు, భావాభావ దృష్టులు" ఇవన్నీ వెనుకకు

మరలుచున్నాయో... కాని సర్వమునకు అధిష్ఠానమే అయి ఉండటం చేత ఆ వాక్కులు - విధినిషేధాలు

- - భావాభావ దృష్టులు అద్దాని నుండి వెనుకకు మరలకయే ఉన్నాయో... అదియే బ్రహ్మము.

అమౌనమౌనం జీవాత్మ యత్ పాషాణవత్ ఆసనమ్

యత్సదేవా సదాభాసం తద్భహ్మాభిధముచ్యతే

మౌన - అమౌనముల మధ్యగల జీవస్వరూపము యొక్క చిదన స్థితియే బ్రహ్మము. సద్రూపమైనప్పటికీ ఈ శరీరము మొదలైన అసద్రూపముల తాదాత్మ్యాధ్యాస' చే అసత్తు వలె భాసించుచున్నట్టిది.

ఓ సాధూ! సర్వరూపము ఏకము - మహాచిదనము - నిర్వికారము అయినట్టి బ్రహ్మమునందు ఈ భావాభావ రూపపదార్థముల సృష్టి ఏమి? ప్రళయమేమి?... ఒకే నిద్ర’లో విచిత్రంగా స్వప్న సుషుప్తులు భాసిస్తున్నట్లు ఇక్కడ జాగ్రత్ - స్వప్నాలు నిరంతరం భాసిస్తున్నాయి కదా! అట్లాగే చిదాకాశ సత్తయందు ఈ సృష్టి - ప్రళయములు విచిత్రంగా భాసిస్తున్నాయి.

'జగత్తు' అంటే ఏమిటి?... ప్రాణుల అంతఃకరణమున అభివ్యక్తమైన ప్రమాత అనే చిత్సారం ఈ నేత్రాదుల ద్వారా బాహ్యమునకు బయల్వెడలి వస్తు ఆకారావృత్తులతో ఏకమై ద్రష్ట - దర్శన - దృశ్యములు అనే త్రిపుటిలో 'జగత్తు' అనే కార్యము సిద్ధింపజేసుకుంటోంది. ఈ దృశ్యములోని సర్వ పదార్థములు తమ అధిష్ఠానమగు చైతన్యమునకు అధీనమై అట్టి సత్తా స్ఫూర్తితో సదా చిత్సారములే అయి ఉన్నాయి.

ద్రష్ట, దృశ్యము... ఈ రెండూ చిత్ స్వరూపములే! రెండింటిలో ఒకే చిన్మాత్రము వెలయుచు ...ఒక దానిచే రెండవది ఉనికి కలిగి ఉంటున్నాయి. అట్టి చిన్మాత్రము యొక్క ద్రష్ట - దృశ్య ఏకత్వము సృష్ట్యాది యందు ఎట్లు వెలయుచున్నదో... ఇప్పుడు అట్లే వెలయుచున్నది. సమస్త పదార్థ శక్తులూ చిన్మాత్రమునందే వెలయుచు, చిన్మాత్రమును అనుసరించే స్థితి కలిగి ఉంటున్నాయి.

అవి నిశ్చలము - అమనస్క రూపము అయి ప్రకాశిస్తూ చైతన్యము యొక్క స్ఫురణచేతనే స్ఫురిస్తున్నాయి.

ఓ కుందదంతా! బ్రహ్మ - విష్ణు - రుద్రాది సహితంగా ఈ జగత్తు లేనిదే అయి ఉండి కూడా స్వప్నం వలె కనిపించుచు అనుభూతం అవుతోంది. 'చిద్రూపము' అనే జలంలో "హర్షము,

Page:612

క్రోధము, విషాదము, ఆశ, నిరాశ, ఆశయము, వాంఛ, కామము... మొదలైన విచిత్ర స్పందరూప తరంగాలు స్వప్నంవలె కనిపిస్తున్నాయి.

ఆహా! ఏమని చెప్పాలి? అజ్ఞాన చిత్స్వభావనిష్ఠ రూపమగు విక్షేప శక్తిచే ఈ జగత్సమూహములు చమత్కారంగా స్ఫురిస్తున్నాయి. ఇందు సత్వ - రజ - తమో గుణములు, జనన - మరణములు అనే భ్రమతరంగ విన్యాసములు సత్యమును మరుగు పరచి... ఎంతటి భేదమును కలిగిస్తున్నాయో!

తిమిరరోగ యుక్తమైన దృష్టికి ఆకాశంలో ఏవో వెంట్రుకలు వ్రేలాడుచున్నట్లు కనిపిస్తాయి. అట్లాగే.... అజ్ఞానావృత చైతన్యదృష్టికి నిజ చిదాకాశమున జగత్య్రాంతి భాసిస్తోంది. "ఓ మిత్రమా! కుందదంతా! ఈ జగత్తు మొదలే లేదు. కానీ... సంకల్పం ఉన్నంత వరకు ఆ సంకల్పానుసారంగా జగత్తు ఉంటూనే ఉంటుంది.

యావత్ సంకల్పితం తావత్, యథా సంకల్పితం తథా | యథా సంకల్ప నగరం కచతీదం జగత్తథా ||

సంకల్పం ఉన్నంతవరకు సంకల్పంలో దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది కదా! ఎంతవరకు సంకల్పించబడుతుందో... అంతవరకు సంకల్ప నగరంలాగా జగత్తు స్ఫురిస్తూనే ఉంటుంది. ఇది అసద్రూపమే అయినప్పటికీ... సంకల్పమును అనుసరించే సత్యమువలె అనుభవము వర్ధిల్లుతోంది.

అనగా, అనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు... అనే కథలో ఎందుకు ఏడుగురు కొడుకులు ఉన్నారు? ఆరుగురో ఎనిమిది మందో ఉండవచ్చుగా? అని ప్రశ్నిస్తే? అది అట్లా సంకల్పించబడింది కాబట్టి" - అనేగా సమాధానం! ఈ దృశ్యం అట్టిదే.

ఇక వస్తు ధర్మములంటావా? బ్రహ్మదేవుడు తన సంకల్పములచే నియత పదార్థములకు ప్రసాదించియున్న ఆ సంకల్పరూప నియతి యే ఇప్పుడూ కొనసాగుతోంది. ముందు ముందు కూడా అదియే కొనసాగబోతోంది. ఆ 'నియతి’ని అనుసరించే ఈ స్థావర జంగమాది ప్రాణి సమూహమంతా ఈ ఈ నియతి రూపస్థితిని పొందియున్నాయి.

అట్టి నియతిని అనుసరించే... జంగమ ప్రాణి జంగమ ప్రాణి నుండి, స్థావరము స్థావరము నుండి ఉత్పన్నమౌతున్నాయి. జలం పల్లమునకు, అగ్ని ఊర్ధ్వమునకు చనుచున్నాయి! ఈ శరీరములు అనే యంత్రములు నడుస్తున్నాయ్! జ్యోతిర్మయములగు సూర్యగోళములు, నక్షత్రములు అనునిత్యంగా తపిస్తున్నాయి! వాయువు నిత్యం గమనశీలమై ఉన్నది! పర్వతాదులు స్థిరంగా ఉన్నాయి! కాలచక్రం దక్షిణాయన-ఉత్తరాయణములు ప్రదర్శిస్తూ ఉన్నాయి. వర్షఋతువులో వర్షం కురుస్తోంది. కాలము రాత్రి-పగలు-నెలలు-సంవత్సరాలు-యుగములు అనే చక్రరూపంలో తిరుగుతోంది. భూమి ద్వీపభేదములచే మధ్యమధ్యలో సముద్రాలు పర్వతాలు కలిగియున్నది! పదార్థములు ఉత్పత్తి, వృద్ధి, నాశనము, గ్రహణము, త్యాగము మొదలైన స్వభావములు కలిగియున్నాయి! ఇదంతా బ్రహ్మదేవుని నియతియే! ఇట్టి బ్రహ్మదేవుడు చిదాకాశ స్వరూపుడే! కనుక ఇదంతా చిదాకాశ స్వరూపమే!

Page:613

నేను (కుందదంతుడు) : స్వామీ! గురుదేవా! ఇప్పుడొక సందేహం తమకు విన్నవించుకొని, మీ అమృత వచనములచే సంసార రోగము నుండి ఉపశాంతి పొందుతాను.

ఏ జీవుని విషయంలోనైనా పూర్వము అనుభవించినవే స్మరణకు వస్తూ ఉంటాయి కదా! ఇక నా వంటి సామాన్య జనుల వ్యవహారాలన్నీ బ్రహ్మదేవుని సంకల్ప రూపనియతి చేతనే వ్యవస్థితమై ఉన్నాయి. అయితే సృష్ట్యారంభంలో ఈ సృష్టికి పూర్వానుభవ సంస్కారాలే కారణమయి ఉంటున్నాయని, పూర్వానుభవ జన్యమైన సంస్కారాలు తప్పితే వేరే కారణం ఏదీ ఈ సృష్టికి ఉండదని నాకు అనిపిస్తోంది. అట్టి ఆదిసృష్టి యందు బ్రహ్మదేవునికి సంస్కారాలు ఎట్లా సిద్ధించాయి? పూర్వ జగత్ అనుభవాలు లేకపోతే... బ్రహ్మదేవునికి ఈ జగత్తు ఎట్లా భాసించ గలుగుతుంది?

శ్రీ కదంబవన తాపసి : ఈ జగత్ సృష్టి సిద్దించటానికి పూర్వ సంస్కారాలు - పూర్వ జ్ఞాపకాలు అవసరమని నీవు ఎందుకనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. స్వప్నంలో ఒక్కసారిగా అనేక విశేషాలు ముందుగా అనుకోకుండానే అనుభూతమవటం జరుగుతోంది కదా! వాటిలో కొన్ని పూర్వానుభవాలకు సంబంధం ఉండవచ్చు. ఉండకపోవచ్చు కూడా కదా! కనుక ఓ కుందదంతా! బ్రహ్మదేవుడు స్మృతి - - సంస్కారాదులు - జ్ఞాపకములు మొదలైనవాటి ఆవశ్యకత లేకయే, అప్పటికప్పుడు దివ్యజ్ఞానముచే ఒక్క క్షణంలో అనాగతమైన ఈ సమస్త జగత్తును దర్శించుచున్నారు. ఇదంతా అపూర్వంగానే కనిపిస్తోంది. తత్ఫలితంగా చైతన్య వివర్తరూపమే అయివున్న సంకల్పిత దృష్టి ప్రవర్తించనారంభిస్తోంది. మరల అచ్చోటే అభ్యాసవశంగా “ఇదంతా పూర్వం నాకు తెలిసినదే! నేను చూచినదే”... అని ఈ విధంగా స్మృతియొక్క అధ్యాసకూడా అఆతనికి సంభవిస్తోంది.

చిదాకాశము స్వయంగా చిద్రూపం కూడా కదా! అందుచేత ఈ జగత్తు చిదాకాశముచే సంకల్ప నగర రూపంగా, చిదాకాశమునందే దర్శించబడుతోంది. ఒకప్పుడు భాసించుచున్న ఈ జగత్తు మరొకప్పుడు భాసించటం లేదు. ఏ జగత్తు నీకిప్పుడు కనబడుతోందో... అది నీకు గాఢ నిద్రా సమయంలో అగుపించకపోవటమే ఇందుకు దృష్టాంతం. ఈ విధంగా ఈ జగత్తు ఒకప్పుడు భాసించి... మరొకప్పుడు భాసించకయే ఉంటోంది కనుక... ఇది సత్తు కాదు. అసత్తు కాదు.

బిడ్డా! స్మరణము అనేది లేకుండానే... ఈ జీవునకు చైతన్య ప్రభావం చేత స్వప్నంలోను - సంకల్పములందు కల్పనామాత్రమైన అనుభవాలు కలుగుచున్నాయి కదా! ఇక శుద్ధ చిదాకాశమునకు సంకల్ప మాత్రముచే జగద్రూపం స్ఫురించడంలో నాకేమీ ఆశ్చర్యం అనిపించటం లేదు. జ్ఞాపకములకు వెనుకగా స్వభావం ఉంటోంది. స్వభావమునకు వెనుకగా 'చిదాత్మ'యే వేంచేసి ఉన్నది.

నేను (కుందదంతుడు) : ఈ జగత్తు ప్రారబ్ధ వేగము చేతనే ప్రవర్తిస్తోంది. ప్రవాహ పతితమైన మార్గంలో ఈ జనులు చనుచున్నారని కొన్ని శాస్త్రములు శాస్త్రీకరిస్తున్నాయి కదా!

శ్రీ కదంబవన వృద్ధతాపసి : ఈ జగత్తు సత్యమే అని భావన కలిగి ఉండటమే సంసారము. అట్టి వారికి ప్రారబ్ధ - ఆగామి - సంచిత కర్మల గురించి బోధించవచ్చుగాక! తత్త్వజ్ఞులు జగత్తే స్వప్న తుల్యంగా గమనిస్తున్నారు. అప్పుడు ప్రారబ్ధ - ఆగామి - సంచిత కర్మలు కూడా స్వప్నతుల్యమే

Page:614

కదా! అయితే నియతి’ అనునది తత్త్వజ్ఞులపట్ల అయినా, అజ్ఞులపట్ల అయినా ఒకే రీతిగా ప్రవర్తిస్తోంది. ఈ జగత్తులో ఆత్మజ్ఞానమునకు ప్రయత్నించని జనులు జగత్తును చూస్తూ హర్ష, క్రోధ, సుఖ, దుః ఖాది భావాలు పొందుచున్నారు. ఇక తత్త్వజ్ఞులో?... వారు గుణదోషాల అస్మరణ స్థితిని ప్రజ్ఞతో అభ్యాసవశంగా సముపార్జించుకుంటున్నారు. ఇక వారిపట్ల ప్రారబ్ధ కర్మలు ఏమగుచున్నాయంటావా? వారు కుమ్మరివాని చక్రంలాగా ప్రారబ్ధ వేగమును పొందుచూ కూడా వాటిచే స్మృశించబడకయే ఇదంతా స్వప్నతుల్యంగాను, అధిష్ఠానముచే ఆత్మరూపంగాను ఒకేసారి దర్శిస్తున్నారు.

నిద్రావ్యపగమే స్వప్ననగరే యాదృశం స్మృతౌ |

చిద్వ్యోమాత్మ పరం విద్ధి తాదృశం త్రిజగత్ భ్రమమ్ ||

ఓ కుందదంతా! బిడ్డా! నిద్రలో నీకు ఒక భవనంలో కొందరి మిత్రులతో సమాగమం కనిపించిదనుకో! మెళకువ వచ్చేసరికి అదంతా ఒక 'స్మృతి'గా మాత్రమే మిగులుచున్నది కదా! అంతేగాని “ఆ భవనం నాది! నాది కాదు! వాళ్ళు నా వాళ్ళు! స్వప్నంలోని ఆ ప్రక్కవారు నా వారు కాదు. ఇటువంటి మమత్వాదులు స్వప్నానంతరం ఉంటాయా? ఉండవు కదా! మమత్వాదులు ఉండవు కాబట్టి "స్మృతి కాదు అని కూడా అనవచ్చును కదా! అట్లాగే జ్ఞానికి త్రైలోక్యభ్రమ నశించియే ఉంటుంది. కనుక అతనికి త్రైలోక్య స్మృతి ఉన్నప్పటికీ... అది స్మృతి కాకయే ఉంటుంది. ఆతడు సర్వమును అధిష్ఠాన మాత్రమగు చిదాకాశముగానే ఎరుగుచున్నాడు.

చైతన్యము యొక్క స్ఫురణ' లేక 'అభాస' మాత్రమే ఈ జగత్తు. అట్టి స్ఫురణ కూడా చిదాకాశమే! మాకు చైతన్యమునకు అన్యంగా ఏదీ విషయమవటమే లేదు. నీ రూపము - నా రూపము వాస్తవానికి చిదాకాశమాత్రమే నని మేము ఎరిగియే ఉంటున్నాం.

యస్మిన్ సర్వమ్, యతః సర్వం, యత్సర్వం సర్వతశ్చ యత్ | సర్వం సర్వతయా సర్వం తత్సర్వం సర్వదా స్థితమ్

(తస్మై సర్వాత్మనే నమః) దేనియందైతే ఈ సమస్తము కలదో... దేని నుండి ఈ సమస్తము ఆవిర్భవిస్తోందో... ఏది సర్వరూపమై సర్వత్రా సర్వదా వ్యాపించియే ఉన్నదో... అట్టి చిద్రూపమే ...సదా... సర్వదా... సర్వరూపముగా స్థితినొందియున్నది. అట్టి సర్వాత్మకునికి సాష్టాంగ దండ

ప్రణామములు.

ఓ ప్రియ సాధువులారా! ఈ విధంగా... బ్రహ్మదేవునిచే రచించబడిన ఈ సృష్టి ఎట్టిదో... ఈ దృశ్యము యొక్క రూపము, భావన ఎట్టివో... తనకి, ఈతని తదితర 7 గురు సోదరులకు ఏమేమి సంభవించుచున్నదో... ఇవన్నీ యోగదృష్టితో పరిశీలించి చెప్పాను. ఒక మీరిరువురు లేవండి. మీమీ గృహములకు వెళ్ళండి. అచ్చట మీక అభిమతములైన సత్కర్మలను త్వరత్వరగా ఆచరించండి. సత్కర్మలు వాయిదా వేస్తే ఉత్తమ భక్తి - జ్ఞానములు ఎట్లా అలవడతాయి?

ఇక నా విషయమంటారా? నేను సమాధిశీలిని కదా! ఇప్పటికే చాలా సమయం సమాధిని అభ్యసించక మీ కొరకై ఆయా విషయాలు దర్శించి చెప్పటం చేత నాకు అలసటగా ఉన్నది. కించిత్

Page:615

భేదముగా ఉన్నది నా భేదం తొలగాలంటే... దుఃఖపరిహారము కొరకై తిరిగి సమాధిలో ప్రవేశించి చిరకాలం ఉండాలని నిర్ణయించుకున్నాను. మీకు శుభమగుగాక! ఇక సెలవు!

కుందదంతుడు : (అయోధ్యలోని ఆధ్యాత్మిక సభలో) ఓ రామచంద్రా! ఈ విధంగా పలికి ఆ వృద్ధ గౌరీవన తపస్వి ధ్యానమునందు ప్రవేశించటానికై కనులు మూసుకొన్నారు. ఆయన మనస్సు ప్రాణములు బాహ్య చేష్టా రహితమైనాయి. అప్పుడు మేమిద్దరం అనేక అనునయ వాక్యాలతో మరల మరల ప్రార్థించినప్పటికీ... ఆయన మాకు ప్రత్యుత్తరం ఇవ్వనేలేదు. ఎందుకంటే బాహ్యవృత్తిని ఉపశమింపజేసుకొని ఉండటం చేత మా శబ్దాలు ఆయనకు వినబడటం లేదు. ఆయన చిత్రము నందు లిఖించబడినవానివలె నిశ్చల స్వరూపులైనారు. అమృతతుల్యమైన ఆయన వాక్కు . -

వాక్కు అందించే మహత్తర జ్ఞాన విశేషాలు - వీటికి దూరం కావలసినందులకు మేము ఎంతో దుః ఖం పొందాం. ఆ మహనీయుని వాక్కులు ఆమాత్రమైనా వినగలిగిన మహత్ భాగ్యం ప్రసాదించిన మా ఇష్టదైవములకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి మా వద్ద ఉన్న కొన్ని పుష్ప గుచ్ఛాలను వారి పాదాలకు సమర్పించి ఇక అక్కడి నుండి బయలుదేరి మేం మధురానగరం చేరాం. అక్కడి నుండి మా మా గృహాలు చేరాము. సుదీర్ఘకాలం తరువాత మా రాకచే మా మా కుటుంబ సభ్యుల నయనములు ఆనందమయం అయ్యాయి. ఆ తరువాత దేవతా పూజతో కూడిన ఉత్సవములు మా ఇంట్లోను, ఆ ఆ మిత్రుని ఇళ్ళలోను పండుగవలె జరిగాయి. ఆ విధంగా వారి గృహంలోను, మా గృహంలోను ఆనందపూర్వకంగా రోజులు గడవసాగాయి.

6. కుందదంత ప్రబోధం

కుందదంతుడు : ఓ శ్రీరామచంద్రాదిగాగల సభ్యులారా! ఆ తరువాత విశేషాలు కూడా ఇక సంక్షిప్తంగా చెపుతాను - వినండి.

కాలం మహత్తరమైనది కదా! కాలముచే మ్రింగబడనిదేమున్నది? అయినా సరే... మనకు అతిప్రియమైన బంధుమిత్రులు మన వెంటే ఉంటారులే అని అనుకుంటూ రోజులు గడుపుతాం. ఇంతలో వియోగ దుఃఖాలు వచ్చిపడుతూనే ఉంటాయి కదా!

కొంతకాలం గడచిన తరువాత ఆ 8 మంది సోదరులలో నా మిత్రుడు తప్ప మిగతావారంతా కొద్ది కాల వ్యవధిలోనే దేహములు త్యజించారు. నా మిత్రుడు తన సోదరుల పట్ల గల మమకారంతో దుఃఖితుడైనాడు. అప్పుడు నేను సాంత్వన వచనాలతోను, జ్ఞాన విశేషాలతోను ఓదార్చాను. ఇంతలో ఒక రోజు ఆ మృత్యుదేవత నా మిత్రుని కూడా నా నుంచి దూరం చేసివేసింది. ఇక నా దుఃఖానికి అంతులేకుండా పోయింది. నేనైతే నా మిత్రుని ఆతని సోదర వియోగం విషయంలో ఓదార్చానుగాని, ...నన్ను ఓదార్చే వారు నాకు లభించలేదు. అంతటి దుఃఖంలో జ్ఞాన వచనాలు ఏవీ నాకు గుర్తుకు

Page:616

రావటం లేదు. అత్యంత దుఃఖితుడనై ఉన్న నేను నాకు జ్ఞాన వచనాలు ప్రసాదించిన సద్గురువులగు ఆ గౌరీవన వృద్ధాతాపసియే శరణ్యం ... అనే నిర్ణయానికి వచ్చి ... ఇక మా నగరం నుండి బయలుదేరి గౌర్యవనానికి వచ్చాను. అచ్చట వృద్ధ తాపసి సమాధిలో ఉన్నారు. వీరిని నా కొరకై సమాధి నుండి విరమింపజేయటం ఉచితం కాదు. వీరు సమాధి నుండి బహిర్గతులై కనులు తెరచే వరకు ఇక్కడ వేచి ఉంటాను" అని... ఇక ఆ మహనీయుని సమక్షంలోనే వారిని ఆరాధిస్తూ, సమాధిని అనుభవించే ఆయన భౌతిక దేహాన్ని సేవిస్తూ... అక్కడే ఉండిపోయాను. 3 నెలలు గడచిపోయాయి. ఒక రోజు వారు కనులు తెరచి నన్ను చూచి ఆదరపూర్వకంగా చిరునవ్వు వెదజల్లారు.

నేను (కుందదంతుడు) : హే సద్గురూ! మీకు సాష్టాంగ దండ ప్రణామములు. స్వామీ! ఏమి చెప్ప మంటారు? నా మిత్రుడు దేహం చాలించాడు. ఇది నాకు ఎంతో దుఃఖం కలిగించింది. మీరు చెప్పి ఉన్న ఆప్తవాక్యాలను నా ప్రియ మిత్రునితో ఏర్పడిన వియోగ దుఃఖం కప్పివేసింది. ఇక దిక్కుతోచక మీ అమృతతుల్యమగు మధుర వాక్కులు వినాలని అనిపించింది. హే మహాత్మా! నాకీ దుఃఖం రావటానికి కారణమేమిటి? ఇది తొలగేది ఎట్లా? ఈ జగత్తుకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? మీరు చెప్పినట్టి జ్ఞానవాక్యాలు నా మిత్రునికి బోధించానుగాని... నాకు మాత్రం దుఃఖం తొలగనేలేదు. ఈ దుఃఖం తొలగేది ఎట్లాగో చెప్పండి.

గౌర్యాశ్రమ వృద్ధ తాపసి బిడ్డా! నీకు బోధించవలసినది సవివరంగా బోధించియే ఉన్నాను. ఇప్పుడు నేను సమాధిని చాలించి ఒక్క నిమిషం కూడా ఉండలేను. కాబట్టి కొద్ది క్షణాలలో నేను తిరిగి సమాధియందు ప్రవేశించనున్నాను.

నాయనా! నీకు పరమార్థోపదేశం అప్పుడు చేశాను కదా! కానీ ఏం లాభం? అభ్యాసం తగినంతగా లేకపోవటం చేత పరమార్థోపదేశం నీకు అంటటంలేదు. అందుచేత నీవు మరొక జ్ఞానప్రాప్యుపాయం చేపట్టక తప్పదు.

కుందదంతుడు : హే మహాత్మా! నేనిప్పుడు ఏ జ్ఞానప్రాప్యుపాయం చేపట్టాలో సెలవియ్యండి. మీ ఆజ్ఞను శిరసావహించి ఆత్మజ్ఞానిగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను.

గౌర్యాశ్రమ వృద్ధ తాపసి బిడ్డా! కుందదంతుడా! ఆత్మజ్ఞాన వాక్యాలు వినటానికి ముందుగా మనస్సును కొంత నిర్మలం చేసుకోవటం అత్యావశ్యకం. ధూళికప్పిన దర్పణంలో మన ముఖం సరిగ్గా కనిపించదు కదా! అందుచేత నీ ఇష్టదైవమగు ఆ శివభగవానుని స్తోత్రం చేస్తూ, పూజాది కర్మలు నిర్వర్తిస్తూ కొంతకాలం నీకు ఇష్టమైన ప్రదేశంలో గడుపు. ఆ తరువాత ఏం చేయాలో... నీకు ఒక గొప్పఉపాయం చెప్పుచున్నాను, విను.

అయోధ్యానగరం గురించి నీవు వినియే ఉన్నావు కదా! అచట దశరథ మహారాజు ఉంటారు. ఆయనకు శ్రీరామచంద్రుడు అనే లోక ప్రసిద్ధుడైన కుమారుడు ఉన్నారు. నీవు ఆతని దగ్గరకు వెళ్ళు. ఆతని కొరకై ఇక్ష్వాకు కుల గురువు, సప్తఋషులలో ఒకడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన

Page:617

శ్రీవసిష్ఠ మహర్షి నిండు సభలో 22 రోజులు మోక్షశాస్త్రాన్ని లోక కల్యాణార్థం ప్రవచించనున్నారు. దివ్యమైన ఆ మోక్షోపాయ కథ విన్నావంటే... నీవు కూడా నా వలెనే పరమపావనమైనట్టి బ్రహ్మపదాన్ని పొంది చిరకాలం విశ్రాంతి పొందగలవు. ఇప్పుడు నాకు సమాధి యందు ప్రవేశించవలసిన సమయం ఆసన్నమైనది. ఇంతకన్నా అధికంగా నీతో సంభాషించలేను. నీకు శుభమగుగాక! సద్గురూ!” అని సంబోధించియుండుటచే నా ఆశీర్వాదం నీ జ్ఞానమార్గ ప్రయత్నాలకు తోడుగా

ఉండగలదు. సెలవు. ఇక వెళ్ళిరా!

ఓ రామచంద్రా! ఓ ప్రియ వేదవరేణ్యులగు సభికులారా! నేను ఆ తరువాత విదేహ దేశం వచ్చి కొన్నాళ్ళు గురు ఆజ్ఞానుసారం పూజ - ధ్యానము గానము వంటి కార్యక్రమములతో పరమేశ్వరుడగు శివ భగవానుని అర్చించి ఈ రోజు అయోధ్యకు వచ్చాను. ఈ శ్రీరామచంద్రుడు ఈ సభకు వచ్చియున్నారని తెలిసి సభలో ప్రవేశించి మీ ముందు నా గత కథావిశేషాలన్నీ చెప్పాను. ఈ సమయమును కేటాయించి నా విన్నప సమన్వితమైన వాక్యములు విన్న సభికులకు, ఇక్కడి కార్యకర్తలకు, ఈ ప్రియ శ్రీరామచంద్రునికి ఇవే నా కృతజ్ఞతలు.

#

శ్రీరాముడు : హే మహర్షీ! సద్గురూ! వసిష్ఠ మునీంద్రా! ఒకానొక రోజు విద్వత్ వరేణ్యుల సభలో ప్రవేశించిన కుందదంతుడు చెప్పినదంతా పూసగుచ్చినట్లు చెప్పాను. ఈ విషయాలు చెప్పటానికి అనుజ్ఞ ప్రసాదించిన మీకు కృతజ్ఞతలు.

హే మహర్షీ! ఇదంతా ఎందుకు చెప్పానంటారా?... వినండి. ఆ సభలో ప్రసంగించిన కుందదంత నామధేయ బ్రాహ్మణుడు మరెవరో కాదు. ఇదిగో... ఈ ఆ ప్రక్కన ఆసీనుడై ఉన్న ఈతడే ఆ కుందదంతుడు. ఈతడు 21 రోజులుగా మీరు మహత్తరంగా ప్రవచించిన మోక్షోపాయ మంతా చక్కగా శ్రవణం చేశారు. అందుచేత స్వామీ! ఈ సంహితను వినిన తరువాత వీరికి సందేహ నివృత్తి అయిందా? లేదా? అనే విషయం ఈతనినే చెప్పమంటే మన సంవాదమునకు సముచితమవుతుందని మీకు ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేస్తున్నాను.

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! శ్రీరాచంద్రుడు ఈ విధంగా పలికి వినయంగా లోక గురువగు శ్రీ వసిష్ఠ మహర్షి వైపుగా ప్రణామపూర్వకంగా నిలుచున్నాడు. ఆ శ్రీరామచంద్రుని మాటలు విని, వక్తలలో శ్రేష్ఠులు, మునివర్యులు, లోకకల్యాణమునకై కంకణం కట్టుకున్నవారు అయిన శ్రీ వసిష్ఠ మహర్షి చిరునవ్వుతో... శ్రీరామచంద్రుని ప్రేమాస్పదమైన కన్నుల కదలికచే సుఖాసీనుని చేశారు. అటు తరువాత కుందదంతుని చూచి ఇట్లు పలికారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : పాపరహితుడవు, ఉత్తమ బ్రాహ్మణుడవు అగు ఓ కుందదంతా! ఈ శ్రీరామచంద్రుడు నీవు చెప్పినదంతా వివరించాడు. నేను చెప్పుకుంటూ వస్తున్న మోక్షశాస్త్రాన్ని 21 రోజులుగా విన్నావు కదా! ఇప్పుడు నిర్మొహమాటంగా చెప్పు తెలుసుకోవలసిన వాటిలోకెల్ల

Page:618

అత్యుత్తమమైనది, ప్రశాంతతను ప్రసాదించేది అయినట్టి బ్రహ్మ పదమును నీవు తెలుసుకొన్నావా? గ్రహించావా? ఇప్పుడు నీకేమనిపిస్తోందో సూటిగా సంక్షిప్తంగా చెప్పవచ్చు.

కుందదంతుడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ! మీ పాదములకు సాష్టాంగదండ ప్రణామములు. శ్రీవసిష్ఠ రామ సంవాదమునకు నాందీ వచనములు పలికిన బ్రహ్మర్షియగు విశ్వామిత్రుల సుందర పాదపద్మములకు హృదయపూర్వక నమోవాక్కులు.

హే మహర్షీ! ఇప్పుడు ఒకానొక అనిర్వచనీయమైన విశ్రాంతి సుఖమును ఆస్వాదిస్తున్నాను. సర్వ సంశయాలు ఛేదింపబడగా, నా చిత్తం అజ్ఞాన వీచికలను జయించివేసి దిగ్విజయానందమును పొందుతోంది. నా సమస్త సందేహాలు నశించాయి. నాయందు, సర్వులయందు జాజ్వల్యమానంగా వెలుగొందుచున్న భేదరహితమగు జ్ఞేయవస్తువైన ఆత్మానందమును, "ఆత్మను అంతటా దర్శిచ గలుగుట” అనబడు ఆత్మ సాక్షాత్కారమును మీ వాక్యములు విన్నటువంటి మహద్భాగ్యం చేత నేను పొందాను. ఈ 21 రోజులు వేలాది జన్మలలోని పుణ్యఫలం అని, నా ఇష్టదైవమగు శివదేవుని కృప అని, మద్గురువులు అగు గౌర్యవన వృద్ధతాపసి యొక్క కరుణా కటాక్ష వీక్షణమని నేను అనుకుంటున్నాను. హే మహాశయా! ఏమి ఈ నా భాగ్యం!

జ్ఞాతం జ్ఞాతవ్యమఖిలం, దృష్టం ద్రష్టవ్యమక్షతమ్ I

ప్రాప్తం ప్రాప్తవ్య మఖిలం, విశ్రాంతోస్మి పరే పదే ॥

ఇప్పుడు నేను తెలుసుకొనవలసిన నిర్మల వస్తువు గురించి తెలుసుకున్నాను. ఏది పొందాలో ...అది పొందాను. ఉత్తమమగు బ్రహ్మ పదమునందు నేను విశ్రాంతి సుఖమును అనుభవిస్తున్నాను. హే మహాత్మా! నిజ చిదాకాశము కంటే ఇతఃపూర్వపు ఇప్పటి, ఇక ముందటి జగత్తులు ఏ మాత్రం వేరు కానేకాదు. మహా పదార్థ ఘనమైనట్టి ఆత్మ చైతన్యమే నా స్వరూపమని ఇప్పుడు ఘంటాపథంగా ఎరుగుచున్నాను. నాచే పొందబడిన, పొందబడుచున్న, పొందబడబోవు జగత్తులన్నీ నా చిత్ చైతన్య స్వరూపాలే! ఇక అవి నాకు వేరుకానప్పుడు నన్ను దుఃఖింపజేయటమనే మాట ఎక్కడిది?

సర్వాత్మకతయా సర్వరూపిణః సర్వగాత్మనః I

సర్వం సర్వేణ సర్వత్ర సర్వదా సంభవత్యలమ్ ॥

సర్వాత్మకమై... సర్వాత్మకం కాబట్టి సర్వరూపిణి అయి, సర్వరూపిణి కాబట్టి సర్వ వ్యాపకమై, సర్వవ్యాపకము కాబట్టి స్వస్వరూపమే అయి వెలయుచున్న పరమాత్మ యందు సర్వత్రా సర్వదా సర్వ విధములా సమస్తము సంపూర్ణముగా సుసంభవమే!

సంభవన్తి జగన్త్యన్తః సిద్ధార్థ కరకోటరే |

న సంభవన్తి చ యథా జ్ఞాతమేతత్ అశేషతః ॥

ఒక ఆవగింజ యొక్క లేశము (చిన్న విభాగము) నందు కూడా సర్వశక్తియుతమగు చైతన్య

సత్త వేంచేసియే ఉన్నది. అట్టి చైతన్య సత్త ఉండి ఉండటం చేత ఆ ఆవగింజ అవశేష విభాగంలో అనేక బ్రహ్మాండములు సంభవించగలవు. కానీ... అలా సంభవించగలిగినప్పటికీ కూడా... పరమార్థ

Page:619

దృష్టిచే ఏదీ సంభవించకయే ఉన్నది. ఈ విషయం మీ బోధచే సుస్పష్టంగా, నిర్దుష్టంగా నేను ఎరుగుచున్నాను.

గృహే_న్తః సంభవత్యేవ సప్తద్వీపా వసుంధరా

గేహంచ శూన్యమేవాస్తే సత్యమేతత్ అసంశయమ్ ॥

ఒక గృహంలో ఒకే సమయంలో సప్తద్వీపములతో కూడిన 8 విస్తార భూములు సంభవమే! ఇక నాకు సందేహం లేదు. కాని, వాస్తవానికి ఆ గృహము శూన్యరూపమే అయివున్నది. ఈ విషయం కూడా అత్యంత నిర్దుష్టమైన సత్యమే! ఇందులో కూడా ఏమాత్రం సంశయం లేదు.

ఏఏ వస్తువు ఎచ్చటెచ్చట ఎపుడెపుడు ఏఏ ప్రకారంగా భాసిస్తోందో... మరియు జీవులకు అనుభూతమౌతోందో... అది అచట అప్పుడు ఆ ప్రకారంగా... మహాచిదనము, ఆద్యంత రహితము ముక్త స్వరూపము అయినట్టి బ్రహ్మమే... ఆ విధంగా వర్తించుచున్నదగుచున్నది! బ్రహ్మము కంటే భిన్నంగా ఎవనికీకూడా ఎక్కడాకూడా ఏదీ, ఏమాత్రంకూడా అనుభూతం అవటం లేదు.

అనుభూతమయ్యే సర్వము బ్రహ్మమే! బ్రహ్మము సర్వ అనుభూతులకు మునుముందుగానే ఏర్పడి ఉన్నది. అట్టి బ్రహ్మమే నేను. ఈ సభికులంతా కూడా నా బ్రాహ్మీ స్వరూపులే! అట్లాగే సభలోని, సభ వెలుపలి ప్రతి ఒక్క జీవుని పరబ్రహ్మ స్వరూపమే నేను!

7. జడ చేతనముల నిత్య ఏకత్వం

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! కుందదంతుడు ఈ ప్రకారంగా చెప్పి మౌనం వహించగా... అప్పుడు శ్రీవసిష్ఠ మహర్షి పరమార్ధ యోగ్యమైన మరికొన్ని విశేషాలు ఈ విధంగా చెప్పసాగారు. శ్రీ వసిష్ఠ మహర్షి : ఆహా రామచంద్రా! ఇది సంతోషకరమైన విషయం. మహాత్ముడగు కుందదంతుడు కరతల ఆమలకంలాగా (అరచేతిలోని ఉసిరికాయ వలె) ఈ ప్రపంచమును ఎటువంటి సందేహాలు లేకుండా, ప్రత్యక్షంగా "బ్రహ్మరూపముగా” దర్శిస్తున్నారు. ఓ సభికులారా! "అయ్యో! మాకు భ్రాంతి తొలగటం లేదే! జగత్తులోని సంబంధాలు మొదలైనవి మేము కలిగి ఉంటున్నామే! అని నిరుత్సాహ పడే బదులు... “భ్రాంతి కూడా బ్రహ్మరూపమే... అనే దృష్టిని అలవరచుకోండి. భ్రాంతాత్మకమగు ఈ ప్రపంచం కూడా వాస్తవానికి జన్మ రహితమగు బ్రహ్మరూపంగానే భాసిస్తోంది. కనుక సమస్తము కూడా "శాంతము, ఏకము, నిర్వికారము... అయినట్టి బ్రహ్మయే! ఇది గమనించండి.

యద్యథా యేన యత్రాస్తి యాదృగ్యావద్యదాయుతః

తత్తథా తేన తత్రాస్తి తాదృక్తావత్తదా తతః

ఏది, ఏ ప్రకారంగా, ఎట్లు, ఎంతగా, ఎప్పుడు, ఏ కారణం చేత, ఎచట ఉన్నదో... అది

- ఆ ప్రకారంగా దానిచే, అట్లు, అప్పుడు, ఆ కారణం వలన, అచట బ్రహ్మమే ఆ రూపంగా వర్తిస్తోంది.

Page:620

శివం శాంతం అజం మౌనమ్ అమౌనమ్ అజరం తతమ్ |

సుశూన్యా శూన్యమభవమ్ అనాది నిధనం ధ్రువమ్ ||

సమస్తము తానే అయి ఉన్న బ్రహ్మము - ఇక ఈ సర్వముకూడా అయి, - - శుభప్రదము శుభరూపము, పరమశివరూపము, జన్మాది వికారములు లేనిది, మౌన స్వరూపము, జడత్వ వర్జితము, జరత్వం (వార్ధక్యం) అనేది లేనిది, పదార్థ శూన్యము, ప్రపంచ వర్జితము, అనాది, సుస్థిరముగా ప్రకాశిస్తోంది.

ఈ జగత్తు బ్రహ్మము యొక్క కల్పనా విభాగమే! బ్రహ్మము సర్వదా యథాతథం. అద్దానికి అనన్యం అయినట్టి మాయా స్ఫురణ చమత్కార విభాగం ఏఏ విషయమును - విశేషమును దృఢ సంకల్పంతో భాసింపజేస్తోందో... ఆయా విశేషముగా విస్తారంగా అట్లే కనిపిస్తోంది.

ఈ బ్రహ్మాండమంతా చిదాకాశమునందే ఉన్నది. సముద్రంలో ఒక జలకణం ఉన్నట్లుగా... ఈ బ్రహ్మాండమంతా చిదాకాశములో పరమాణువై ఉన్నది. అంతేకాదు. తనయొక్క అభ్యంతరమున జగత్తును కలిగియుండటం చేత ... చిదాకాశమే బ్రహ్మాండమైయున్నది. అనగా... ఈ బ్రహ్మాండమే ...చిదాకాశము. చిదాకాశమే... ఈ బ్రహ్మాండం. ' రెండు వేరువేరు' అని చూచే దృష్టి భ్రమయే! కాబట్టి రామచంద్రా! ఈ సమస్త జగత్తూ కూడా - - ఆది మధ్యాంత రహితము, పరిపూర్ణము - శాంతము... అగు చిదాకాశమే! ఇది గమనించమని సభికులందరికీ పదే పదే గుర్తు చేస్తున్నాను. 'ఈ శరీరం నేను' మొదలుగాగల వైచిత్ర్య రూపములగు బంధములు నశించినవారై, కేవలము - -

నిర్వికారము నిర్వాణరూపము - యథాస్థితము అగు బ్రహ్మరూపులై ఉండండి.

మీరంతా దేహమనోస్వరూపులు కాదు. కేవల బ్రహ్మస్వరూపులే! (తత్త్వమసి)!

స్వయం దృశ్యం స్వయం ద్రష్టృ స్వయం చిత్తం, స్వయం జడమ్ |

స్వయం కించిన్న కించిచ్చ బ్రహ్మాత్మన్యేవ సంస్థితమ్ ||

వ్యవహార దృష్టిచే... బ్రహ్మమే ద్రష్ట దృశ్య, చిత్-జడ, దృశ్య- అదృశ్య రూపములుగా స్థితినొందియున్నది. కానీ, పరమార్థ దృష్టిచే... ఇదంతా పదార్థరూపం కానేకాదు. అద్వితీయ స్వయం ప్రకాశానందైక స్వరూపము అగు ఆత్మయందే ఆత్మకు అభిన్నంగా స్థితినొంది ఉన్నదై ప్రకాశిస్తోంది. అట్టి బ్రహ్మము... ఇచట ఆ రూపంతో వర్తిస్తోంది. అయినా కూడా నిజ చిదాకాశమునందు తన యథార్థ 'సత్చిత్' స్వరూపమును ఏ మాత్రం త్యజించటం లేదు. త్యజించకయే...ఇట్లు వర్తిస్తోంది.

బ్రహ్మ దృశ్యమితి ద్వైతం న కదాచిత్ యథా స్థితమ్ ఏకత్వం ఏతయోర్విద్ధి! శూన్యత్వాకాశయోరివ

ఓ రామచంద్రా! ఓ ప్రియ సభికులారా! "బ్రహ్మము మాయచే జగదృశ్యముగా అగుచున్నది... అని మీరు తలచకండి. జ్ఞానము యొక్క వర్తమానపు చర్చనీయాంశమగు స్థితిలో అటువంటి ద్వైతవాక్యాలకు (బ్రహ్మం వేరు - జగత్తు వేరు... అనే ద్వైత వ్యవహారానికి) తావు లేదు.

Page:621

ముత్యపు చిప్ప వెండిలా భాసిస్తోంది" అని చెప్పినప్పుడు, అక్కడ వెండి ఉన్నది అని అర్థం కాదు కదా! నిర్వికారమగు ముత్యపు చిప్ప అట్లే ఉన్నది. అది ఏమాత్రం మారటంలేదు.

అట్లాగే నిర్వికారమగు బ్రహ్మము ఈ దృశ్యముగా భాసించుచున్నట్లు ప్రాపంచిక దృష్టికి అనిపించినప్పటికీ... బ్రహ్మము సర్వదా తనయొక్క "పారమార్థిక నిర్వికార రూపము తోడనే సర్వత్రా వెలయుచున్నది. ఆకాశము - శూన్యత్వము... రెండూ ఒక్కటే కదా! అట్లాగే

బ్రహ్మము, దృశ్యము ఒక్కటే -

దృశ్యమేవ పరంబ్రహ్మ, పరంబ్రహ్మైవ దృశ్యతా

ఏతత్ న శాంతం నాశాంతం నానాకారం నచాకృతిః||

కనబడే దృశ్యమే పరబ్రహ్మము. పరబ్రహ్మమే ఈ దృశ్యమైయున్నది. అట్టి పరబ్రహ్మము... జగత్తుగా కూడా అయి ఉండుటచే 'శాంతము' కాదు. సర్వదా యథాతథము నిర్వికారము కాబట్టి అశాంతము’ కాదు.

సర్వ ఆకారాలు అద్దానివే. కాబట్టి సాకారమే! "అద్దాని ఆకారం ఇది అని అనలేం కదా! కనుక నిరాకారం. అది సర్వత్రా అనురాగము కలిగి ఉంటోంది. కనుక సరాగ స్వరూపమే! సర్వత్రా అనురాగమే విరాగం. కాబట్టి అది నిత్యవిరాగి!

శ్రీరాముడు మహర్షీ! అయితే, ఈ జగత్తు సాకారంగానే కనిపిస్తోంది కదా! బ్రహ్మమో....

నిరాకారం కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : నిద్రలో స్వప్నం సాకారమే. అయితే ఏం? స్వపద్రష్ట నిరాకారుడే కదా! నిద్ర లేవగానే? స్వప్నంలో కనిపించిన పదార్థాలన్నీ నిరాకారములుగానే భాసిస్తున్నాయిగా! అట్లాగే...

ఆత్మజ్ఞానం బుద్ధియందు ఉదయించనంతవరకు... ఈ జాగ్రద్దేహం సాకారం. ఆత్మజ్ఞాన ప్రాప్తికి అనంతరమో... ఈ జాగ్రత్ హం నిరాకారం.

స్వప్నంలో చిన్మాత్రాత్మ స్వయంగా సాకారంగా అనుభూతమైనప్పటికీ, వాస్తవానికి అట్టి ఆకారములన్నీ అసన్మయములే కదా! అట్లే జాగ్రత్లో కనిపిస్తున్న ఈ దేహాది ఆకారములన్నీ కూడా అనుభూతములైనప్పటికీ అసన్మయములే అయి ఒప్పుచున్నాయి. అయినా కూడా... నీ ప్రక్కన ఉన్న ఆ నీ మిత్రుడు కుందదంతుడు. దేహి, దేహముల కలయికయే కదా! 'మిత్రమా’ అని సంబోధిస్తున్నది, దేహినేగాని ఈ దేహమును కాదు కదా! దేహమునకు ఆకారము ఉన్నట్లుగా అ అనిపించవచ్చు గాక!

ఆకారం స్థిరం కాదు కదా! అది అట్లా ఉండగా, ఇక దేహికి ఆకారం ఎక్కడున్నది?... ఇక ఈ ప్రపంచంలోగల జడ చైతన్యములంటావా? ఈ జీవుడు చేతన స్వరూపుడే! చిన్మయుడే! అయితే ఏం? కాన ఈతడు సుషుప్తి (గాఢనిద్ర) యందున్నప్పుడో? జడుడే అగుచున్నాడు కదా! చేతన రూపుడగు ఈ జీవుడు గాఢనిద్రా సమయంలో జడుడై ఉంటున్నట్లే... చైతన్యమే స్థావరంగా కూడా కనిపిస్తోంది.

Page:622

సుషుప్తి దశనుండి జీవుడు... స్వప్న దశలకు వస్తున్నాడు. అప్పుడు జాగ్రత్ కల్పనలతో కూడి ఉంటున్నాడు. అట్లాగే... చైతన్యం సమక్షంలో ఘనీభూతమైన జడము ఒకానొకప్పటి ఆ జడమగు స్వతత్త్వము నుండి జంగమ - చేతన దశను పొందుతోంది.

ఓ సహ పరబ్రహ్మ స్వరూపులగు సభికులారా! బుద్ధికి ముక్తి కలుగనంత వరకు ఈ పృథివి, జలము, అగ్ని, వాయువు ఆకాశములందు అణువణువునా "స్వప్నతుల్యమైన - శూన్యరూపమైన' అనేక జగత్తుల అనుభూతులు, అనుభవాలు, స్థితిగతులు భాసిస్తూనే ఉంటాయి.

ఈ మనుజుడు జాగ్రత్ నుండి గాఢనిద్ర యొక్క అధ్యాసను పొందుచున్నట్లుగా (గాఢనిద్రను ఆస్వాదించ సంసిద్ధుడై జగత్ రాహిత్యమును ఆస్వాదిస్తున్నట్లుగా)... చైతన్యము జడత్వము యొక్క అధ్యాసమును కావించుచున్నది. జడత్వమగు (ద్రష్టయొక్క) అధ్యాస చేతనే అది జడరూప వస్తు సముదాయంగా కూడా అగుపిస్తోందే గాని... వాస్తవానికి చైతన్యము జడత్వమును ధరించటమే లేదు. స్వప్నంలో జడమగు ఇల్లు, రహదారి, రాయి, కొండ మొదలైన జడవస్తువులు కనిపించినంతమాత్రమే... స్వప్న ద్రష్ట జడముగా అగుచున్నాడా? లేదే! అవన్నీ కూడా స్వప్నద్రష్ట యొక్క స్వప్నచైతన్య ప్రదర్శనములే కదా!

జడత్వము’ను అనుభవించే జీవుని చైతన్య విభాగమే స్థావర శరీరమును నిర్మించుచున్నది. అట్లాగే చైతన్యము అనుభవించే జీవుని చైతన్య విభాగం చేతనములను నిర్మించుచున్నది. ఓ రామచంద్రా! గాఢనిద్రను ఒక జీవుడు అనుభవిస్తూ ఉండగా... ఇప్పుడు ఆతడు జడమా? ఆతడు అచేతనుడై వాక్ మనోరహితుడై ఉండవచ్చుగాక! ఆతని చైతన్య విభాగమే జడత్వమును ఆశ్రయించి ఉన్నది కాబట్టి ఆతడు చేతనుడుగా కొనసాగుచున్నట్లే కదా! ఆ జడమే జాగ్రత్ స్వప్నములకు ఉత్పత్తి స్థానం కాబట్టి ఆతడు జాగ్రత్ - స్వప్న సమయములలో కూడా జడరూపుడే కదా! ఈ విధంగా జడ - చేతనములు మా దృష్టిలో ఏకత్వమునే సంతరించుకున్నవై ఉంటున్నాయి.

చేతనములైనట్టి చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలైనవి, అచేతనములగు గోళ్ళు, కేశములు (జట్టు) మొదలైనవి ఒకే దేహంలో సమావేశమై ఉంటున్నాయి కదా! అన్నిటినీ కలిపే 'దేహము' అని పిలుస్తున్నాం. అయితే వాస్తవానికి దేహి రూపరహితుడు కదా! అట్లాగే నిరాకారమగు చైతన్యము నందు స్వాధ్యస్తములై కనబడే ఈ జగత్ శరీరుని జగత్ శరీర సమస్త స్థావర జంగమములు ఏక శరీర రూపములే అయి ఉన్నాయి.

సంకల్పమే బ్రహ్మదేవుని ప్రథమ సృష్టికి హేతువు. ఆ సంకల్పమే చిద్రూపమున (స్వప్నంలో లాగానే) స్థావర - జంగమాత్మక జగత్తుగా వ్యక్తీకరణమౌతోంది. అదే ప్రకారంగా ఇప్పటికీ స్థితినొందియున్నది. ఇట్లా ఈ జగత్తు చిరకాలంగా జడరూపంతో ఉన్నప్పటికీ... వాస్తవానికి ఇదంతా చిన్మయయే! ఇంతెందుకు? ఇదంతా సత్యము శాంతము నిరాకారము అయినట్టి బ్రహ్మమేనని మేము గమనిస్తున్నాం. ఈ రీతిగా జగత్తును జగత్తుగా కాకుండా... చిన్మయ బ్రహ్మముగా దర్శించటమే 'సృష్టి నశించటం- సృష్టి అంతము' అని చెప్పబడింది. ఎందుకంటే

Page:623

పారమార్థికంగా చూస్తే ఈ జగత్తు ఎప్పుడూ లేనేలేదు. లేదు కాబట్టి "బ్రహ్మమునందు జగత్తు వ్యక్తీకరణమవటం... అనునది జరగటమే లేదు. జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపించటమే 'జగత్ వినాశనం' అయివున్నది. ఈ మార్గంగానే ఈ జగత్తు “బ్రహ్మము”గా (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) అయివున్నది. జగత్తుగా అనిపించటమే 'జగదుత్పత్తి'. ఇంతకు మించి ఉత్పత్తి - - ప్రళయాలు ఎక్కడా లేవు.

ఓ రామచంద్రా! నిద్రాకోష్ఠము నందే స్వప్నం యొక్క ఆది అంతము” కల్పించబడు చున్నాయేగాని, జాగ్రత్ కోష్ఠమున కాదు కాబట్టే జాగ్రత్ దృష్ట్యా స్వప్నము మిథ్యయే అయి ఉంటోంది. అట్లాగే... త్రికాలములందు కూడా 'లేనిదే' అగు ఈ జగత్తు యొక్క ఆది - అంతముల గురించిన కల్పన (జ్ఞాన సూర్యుని ఉదయానంతరం) మిథ్యయే అయివుంటోంది.

ఓ సభికులారా! ఆద్యంత రహితము - పరమాత్మ ఘనము అగు చైతన్యమొక్కటి తప్ప తదితరమైనదేదీ ఎక్కడా లేదు. అందుచేత పేరుకు కూడా సృష్టి - స్థితి - లయములు మా దృష్టికి అగుపించటం లేదు. ఆ సృష్టి, స్థితి, లయముల రూపంలో బ్రహ్మమే మాకు ప్రదర్శితమగుచున్నది. ఇక వాటి రూపమగు ఈ జగత్తుల గురించి వేరుగా చెప్పేదేమున్నది? చిత్ర లేఖనంలో సుందర స్త్రీ నిజమైన స్త్రీయా? కాదే! అట్లాగే సృష్టి - స్థితి - - లయాలు, ఆ మధ్యలో జగత్ృష్టికి ఈ జగత్తులు కనిపిస్తున్నాయి. ఇవి ఆత్మకంటే వేరుకాదు. (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ).

ఎవరో అతిప్రావీణ్యుడైన చిత్రకారుడు కొన్ని రంగులను మేళవించి శుభ్రమైన తెల్లటి వస్త్రముపై రచించిన ఆ యుద్ధ సేనా చిత్రమును చూడు. అందులో అనేకమంది సైనికులు, రథములు, ఆయుధములు ఆ చిత్రకారుడు రచించాడు కదా! అందులో రచించిన యుద్ధ విన్యాసం, ఆ రథములు, ఆ ధూళి, ఆ ఆయుధములు, ఆ శత్రు, మిత్ర సేనలు ఇవన్నీ కూడా... అతికౌశలం గల చిత్రకారుని ఊహకంటే వేరుకాదు కదా! అట్లాగే... సాకారము, నానారూప సమన్వితము అగు ఈ సృష్టి - ఇద్దానిని సృజించు వాని యొక్క - ఇద్దానిని దర్శించు వానియొక్క “చిత్తముల యొక్క సారూప్యము మాత్రమే! ఇదంతా చిత్తము కంటే ఏమాత్రము వేరుకాదు.

ఈ జగత్తంతా అద్వైత రూపమే అయి ఉన్నది - చిదనము సర్వదా 'విభాగరహితం'. అయినప్పటికీ విభాగించబడిన దానివలె అగుపిస్తోంది. 'అవిద్య' అనే సుషుప్తి రూప ఆవరణచే వాస్తవ రూపం .... అగు 'మోక్షము' అనే ప్రసిద్ధమగు విభాగమును మరుగున పరచి ఉంచుతోంది. తాను చిత్తరూపంగా అయి ఈ జాగ్రత్ - స్వప్న విభాగములను దర్శింపజేస్తోంది. అయినా కూడా, “ఇది సృష్టి - ఇది ప్రళయము - ఇది స్వప్నము - ఇది జగత్తు" ... అనునవన్నీ కూడా - నిరాకారము - ప్రజ్ఞాన ఘనము - అనేక చిద్రూప కిరణ సమాహితము - అగు ఆత్మ” అనే మహాసూర్యుని ప్రకాశ భేదములే అయివున్నాయి.

చైతన్యము యొక్క వాసనా రూపమగు స్వప్న విభాగము ఉపాధి అంశ ప్రాధాన్యముచే “చిత్తము అని పిలువబడుతోంది. చిదంశ ప్రాధాన్యమే జీవుడు అని పిలువబడుతోంది.

Page:624

ఆ జీవుడే దేవ - మనుష్య ఆదిగా గల అధికార దేహములను పొంది 'తత్త్వజ్ఞానము'చే అవిద్యను పారద్రోలివైచి 'ముక్తుడు అగుచున్నాడు. అనగా, ఆతడు 4వ 5వ భూమికలను అభ్యసిస్తూ, 6వ భూమికలో స్వయంగా అంతయు ఆత్మరూపంగా అన్వయించుకుంటున్నాడు. అప్పుడిక 7వ భూమికయందు ప్రవేశించి మోక్షరూపుడగుచున్నాడు... అని మోక్షము గోరువారికి గురువులచే చెప్పబడుతోంది.

అట్టి మోక్ష శాస్త్రము యొక్క 'మోక్షము' అనే శబ్దానికి అర్థం ఈ దృశ్యమును ఆత్మరూపంగా దర్శించటమే అయివున్నది.

8. చిత్త విన్యాసం

శ్రీరాముడు : హే మహాత్మా! నిర్మలమగు ఆత్మ నుండి వాసనా విభాగరూపంగా ఉపాధి అంశ ప్రాధాన్యముచే చిత్తము బయల్వెడలుతోంది కదా! అట్టి చిత్తము “దేవతలు, అసురులు, మానవులు” మొదలైన భేదములచే ఎంత పరిమాణము కలిగియున్నది? ఆ చిత్తము స్థితి ఎట్టిది? నిద్రానిద్ర స్వరూపమగు చైతన్యము నందు ఈ జగత్తు ఎంత పరిమాణము కలిగియున్నది? ఈ జగత్తు ఎంత కాలం ఉండబోతోంది? చైతన్యము యొక్క గర్భంలో ఈ జగత్తు ఎట్లా స్థితి కలిగి ఉన్నది? దయచేసి ఈ జగత్తు గురించి ఈ ఈ విషయాలు చెప్ప ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవును. ఈ మనుష్య, దేవ, అసుర, స్థావర, స్త్రీ, పురుష, నాగ పర్వత, పిశాచ, రాక్షస, పక్షి, కీటకాదులన్నీ... 'చిత్తమే' అని ఎరుగు. అట్టి ఈ చిత్తం పరిమాణం అనంతం. అద్దాని యందు బ్రహ్మదేవుని నుండి స్తంభం వరకు గల ఇటువంటి జగత్తులు అసంఖ్యాంగా ఉన్నాయి. చిత్తమే ఇదంతా! ఈ నేత్ర జ్ఞానము ఊర్ధ్వమునకు పోయి సూర్య గోళమును కూడా దాటివేసి ఎంత దూరం పోగలదో... అదంతా చిత్తమే అయివున్నది. చిత్తము “అంతులేనంత విశాలం" అనునది అందరికీ అనుభవమైన విషయమే! ఇది ఇట్లా ఉండగా, ఈ చిత్తం అనేక దుస్సహ సంసార దుఃఖములచే పరిపూర్ణమై ఉండటం చేత అతిభయంకరమై ఒప్పుతోంది కూడా!

అయితే... ఈ చిత్తము వాస్తవానికి చైతన్య రూపమే! ప్రదర్శనా చమత్కారమే! ఎప్పుడైతే చిత్తము సమష్టి రూప విభాగంలో బ్రహ్మాండ కల్పన వలన లోక సమూహాలు కల్పనా మాత్రంగా వచ్చి చేరుచున్నాయో... అప్పుడు చిత్తం నుండి సృష్టులు వచ్చినాయి అని చెప్పబడుతోంది.

ఆద్యంత రహితమగు ఈ చిత్తమే "జీవుడు”. అన్ని కుండలలో ఆకాశం ఉన్నట్లు... ఈ చిత్తము సర్వదేహములందు కలదు. ఈ సర్వదేహములు బ్రహ్మదేవుని ఇచ్ఛయే కాబట్టి "ఈ ఈ దేహాలలో చిత్తము లేదు. చిత్తములోనే ఈ ఈ దేహాలు ఉన్నాయి... అని కొందరనటం కూడా యుక్తి యుక్తమే! నదీ ప్రవాహం సర్వ ప్రదేశాలలోనూ త్యజిస్తూ పోతున్నట్లు ఈ చిత్తము కూడా

అనేక ఉత్తమ - - అధమ దేహాలను గ్రహిస్తూ - - త్యజిస్తూ ఉంటుంది. మృగతృష్ణలో జలం ఉండదు”

Page:625

..అని తెలిసిన తరువాత ఇక అక్కడి జలం దాహం తీరుస్తుంది” అనే భ్రమ కూడా తొలగుతుంది కదా! ఆత్మ స్వరూపమును ఎరిగిన మరుక్షణం ఈ చిత్తము యొక్క దేహాది భ్రమ అతిశీఘ్రంగా నశించగలదు.

ఈ సువిశాల జగత్తును తన గర్భంలో ధరించుచున్నది ఈ చిత్తమే! అయితే ఏం? అనేక జగత్తులను కూడా తనయందలి స్వల్ప విభాగంలో ధరించగలిగి ఉండగలదో, అట్టి ఈ చిత్తము అణుప్రమాణము మాత్రమే!

అణుప్రమాణమై వుంటూకూడా, అది సర్వదా అభౌతికం. అట్టి అణు స్వరూపమగు చిత్తమే జీవుడు. కాబట్టి జీవుని అభ్యంతరముననే ఈ జగత్తు వెలయుచున్నది. స్వప్న భూముల వలె ఈ కనిపించే దృశ్యమంతా కూడా చిత్తమే అయివున్నది. ఆ చిత్తమే జీవుడు కూడా కదా! ఈ విధంగా జీవునికి - జగత్తుకు భేదం లేదు.

అయితే... చైతన్యమునకు అన్యమైన దేనికీ సత్తయే లేదు కదా! కాబట్టి ఇక్కడ పదార్థములే సంభవించవు. కనుక ఈ పదార్థ సమూహమంతా కూడా చిత్స్వరూపమే!

స్వప్నంలో స్వప్నదృశ్య వ్యవహారం ఉన్నట్లు... బంగారమునందు ఆభరణ విశేషం ఉన్నట్లు... సముద్రమునందు ఏకరూపమగు జలమున తరంగ - ఆవర్తాది భిన్న భిన్న రూపములు సర్వత్రా స్ఫురిస్తున్నట్లు... ఈ పదార్థ సమూహమంతా చైతన్యమునకు అభిన్నం. చిద్రూపమగు బ్రహ్మము నందు తదభిన్నరూపంగా అనేక దృశ్యరూప పదార్థములు స్ఫురించుచున్నాయి.

సముద్ర ఉదరంలో విద్యమానమగుచున్న "జలము - - ద్రవత్వము" అభిన్న రూపములే కదా! పరమాత్మ యందు పదార్థ సమూహాలు చైతన్యము కంటే వేరుకాకయే స్ఫురిస్తున్నాయి. ఈ జగత్ పదార్థాలన్నిటికీ చైతన్య అనుభూతియే ఆధారం. చైతన్యము - అద్దాని అనుభూతి అభేదం. కనుక ఈ జగత్తు - చైతన్యము అభేదం.

యథారీతిగా స్థితి కలిగియున్న ఈ జగత్తంతా కూడా... తన యొక్క శాంత చిత్స్వరూపమును త్యజించకుండానే.... స్వప్నరూపంగా చిదాకాశమున వ్యవస్థితమై విద్యమానమగుచున్నది. ఒక స్తంభము, అందులో శిల్పలేఖన రూపంగా రచించబడిన దేవతాప్రతిమ ఒక్కటే కదా! అట్లాగే... సమత్వం, సత్యత్వం, సత్త, ఏకత్వం, నిర్వికారత్వం, పరస్పర ఆధార ఆధేయత్వము అను వీటన్నిటియందూ జగత్తు - చైతన్యములు సాదృశ్యమైనవే! (ఒకదాని వంటిదే రెండవది అయి వున్నది.)

స్వప్నము - సంకల్పము; వరము - శాపము; సరోవరజలం - నదీజలం... ఇటువంటి ప్రతిభాసలన్నీ ఏకరూపమే కదా! అట్లాగే... జగత్ - - చైతన్యములకు వ్యవహార సమర్థమైన భేదం ఉండవచ్చుగాక! వస్తుతః పరమార్థమున భేదం లేదు.

బంగారపు ప్రక్కపిన్నుకు - బంగారమునకు సాదృశ్యమే యుక్తియుక్తం కదా!

Page:626

9. వర - శాపముల కార్య - కారణత్వం

-

శ్రీరాముడు : మహాత్మా! ఈ ప్రపంచంలో ఏదైనా జరగాలంటే "ఉపాదాన కారణం" అనేది ఉండాలి కదా! మరి వర-శాపముల విషయంలోనో? ఒకడు వరం పొందాడనుకోండి. లేక, శపించబడ్డాడనుకోండి. అప్పుడు ఏ ఉపాదానకారణం లేకుండానే ఆ వరమో, ఆ శాపమో ఎట్లా క్రియాశీలకం కాగలుగుతోంది?

ఉదాహణకు... ఇంద్ర పదవిలో ఉన్న నహుషునకు “నీవు సర్పమువై అరణ్యంలో సంచరిస్తావు గాక!” అని సప్త ఋషీశ్వరుడు శపించగా, ఆతని దేహం చంద్రామృత భాగం కోల్పోయి... పాంచ భౌతికమగు సర్పంగా అప్పటికప్పుడు పరిణమించటం. నంది (గోవు)కు ఈశ్వరత్వము వరంగా ఇవ్వబడగా, ఆ నంది భౌతిక దేహం పోయి చంద్రకిరణామృత నిర్మితమగు నందీశ్వరత్వం ప్రాప్తించటం... ఇవి ఉపాదాన కారణాలు లేకుండా ఎట్లా సంభవిస్తున్నాయి? అనేది ఇక్కడి ప్రశ్న. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సముద్రంలో జలము యొక్క స్ఫురణమందు తరంగాలు ఆవర్తాలు కనిపిస్తున్నాయి. అంతా జలమే! కానీ అవన్నీ ఆకారయుక్తంగా అగుపిస్తున్నాయి. జగత్ స్ఫురణ చిదాకాశము నుండే బయల్వెడలుతోంది కదా!

కాబట్టి... అతి నిర్మలమగు చిదాకాశము యొక్క తత్త్వజ్ఞానము నుండి బయల్వెడలిన 'సత్య సంకల్పమును అనుసరించి ఏర్పడిన స్ఫురణయే జగత్తు. అందుకే ఇది సత్యముగా కనిపిస్తోంది. అట్టి సత్య సంకల్ప రూపులగు వర - - శాప ప్రదాతల సంకల్పనాశక్తియే ఘనీభూతమగు శాపవర భోక్త యొక్క అనుభవంగా రూపుదిద్దుకుంటోంది. ఈ జగత్తంతా సంకల్ప రూపమే కదా!

సముద్రజలంలోంచి ధ్వనులు బయల్వెడలుచున్నాయి చూచావా! బ్రహ్మదేవుని యొక్క స్వాత్మ చైతన్యము” నందు చిద్రూపములే అగు జగద్భావములు అకస్మాత్తుగా భాసించుచున్నాయి. అట్టి భావములకే శ్రుతులు "సంకల్పములు మొదలైన నామములు కల్పించుచున్నాయి. ఈ జగత్తు యొక్క మూల పదార్థము ఆ సంకల్పములే! అట్టి సంకల్పముల అనుభవం అజ్ఞాన దృష్టికి 'సంసారము' రూపంగా ప్రాప్తిస్తోంది. అదియే బంధము. అజ్ఞాన దృష్టి తొలగితే బంధమూ లేదు. మోక్షమూ లేదు. "దృశ్యమునకు సంబంధించిన ఆశ - నిరాశ - పూర్వాపూర్వ విషయముల మననము - గుణదోషములు - - అభియోగదృష్టితో చూడటం... ఇదియే సంసారము. ఈ జీవుడు ఆత్మస్వరూపుడై ఉండి కూడా (ఆనందస్వరూపుడై ఉండి కూడా)... దుఃఖము పొందటానికి కారణం ఆత్మదృష్టి కొరవడటం తప్పితే వేరుకారణం లేదు. "తత్త్వదృష్టి అను శాస్త్రీయ ప్రతిపాదితమగు దివ్యౌషధమే అందుకు తరుణోపాయం. అభ్యాసయోగం చేతను, తత్త్వవిచారణ చేతను, శత్రు సమదర్శనము చేతను, నిర్మల సాత్విక భావములచేతను, భక్తి తత్పరతచేతను, ఈ సంసార దోష భూయిష్ఠుడగు జీవుడు సమ్యక్ జ్ఞానవంతుడు, యథార్థ తత్త్వదర్శి అగుచున్నాడు.

యథార్థ తత్త్వదర్శి యగు జ్ఞానియొక్క బుద్ధి ద్వైత - ఏకత్వ వర్జితమై ఉంటోంది. చిన్మాత్రరూపమై, ఆవరణ రహితమై, చిద్ర్బహ్మరూపమై, కేవల చిత్ప్రకాశమాత్ర స్వరూపమై, దేహాదేహ

Page:627

వర్జితమై, అత్యంత నిర్మలమై ఉంటోంది. అట్టి నిర్మల బుద్ధి - నిరావరణ - జ్ఞానము పొందినట్టి మనుజుడు ఏదేది సంకల్పిస్తాడో... అద్దానినంతా కూడా ఆతడు స్వాత్మయొక్క స్ఫురణగాను, ప్రశాంత రూపంగాను, పరమార్థ చిద్రూపముకంటే ఏమాత్రం వేరుకానట్టిదిగాను దర్శిస్తూ ఉంటాడు.

ఈ జగత్తంతా కూడా అట్టి శుద్ధ నిరావరణ హిరణ్యగర్భ చైతన్యము సంకల్ప చమత్కారమే అయివున్నది. ఇదంతా సంకల్ప చమత్కారమే కనుక.... సంకల్ప నగరము, స్వపాంతర్గతమైన మహాపురము అయి కూడా, భౌతికంగా (ఘనీభూతమైన అభ్యాసవశంచేత) ఇట్లా కనిపిస్తోంది.

ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మదేవుని (హిరణ్యగర్భుని) వలెనే శుద్ధాత్ములగు తదితరులు కూడా వర-శాపముల రూపములచే దేనిని ఏ ప్రకారంగా సంకల్పిస్తారో..... అది తదితరులపట్ల ఆ విధంగానే శీఘ్రంగా అగుచున్నది. నిర్మల హృదయులు ఏది ఎట్లు సంకల్పిస్తే అది అట్లే ఈ సంకల్ప నిర్మిత జగత్తులో సంభవిస్తూ ఉంటోంది.

ఒక బాలుడు తన ఊహాలోకంలో "శిలలు ఎగురుచున్నాయి అని ఊహించి, అది అట్లే సత్యముగా అనుభూతిపొందుతూ ఉంటాడు. అట్లే శీఘ్రంగా అనుభవము పొందుతూ ఉంటాడు చూచావా? అదే ప్రకారంగా ... హిరణ్యగర్భుడు మొదలైన నిరావరణ విజ్ఞాత్ములు వరము - -

శాపము - - మొదలైన 'నిజ సంకల్పము'ను తమకు అభిన్నమైన సత్యముగా ఎరుగుచున్నారు. ఒక పిల్లవాడు స్వప్నంలోనో, సంకల్పంలోనో నేను ఇసుకను గుప్పిటలో తీసుకొని నలుపుతుంటే తైలం ధారగా కారుతోంది” అని ఊహిస్తూ ఉంటే,... అది అట్లే ఆ పిల్లవానికి అనుభూతమౌతుంది చూచావా? అట్లాగే కల్పనా జనితములగు సృష్ట్యాది సంకల్పముల చమత్కారంచే 'వరము-శాపము’ ఇక్కడ సిద్ధిస్తున్నాయి. శుద్ధాత్మజ్ఞాన బుద్ధిగలవాని సంకల్ప రూపమైన వరము శాపము ఇక్కడ సిద్ధిస్తోంది. అట్లా కాకుండా... ఆవరణ సహితమైన జ్ఞానము (ఉదా : నా వారు, నీ వారు, నాది, నీది, పాపులు, పుణ్యులు, మంచివారు, చెడ్డవారు... ఈ రూపంలో) కలవారికి భేదబుద్ధి నశించటం లేదు. వారు ద్వైతభావముతో కూడి ఉంటున్నారు. అట్టివారి ద్వైత సంకల్ప వాసనలు కారణంగా వారి వర - శాపాలు సిద్ధించటం లేదు.

నిరావరణ యుక్తులగు బ్రహ్మదేవుడు మొదలైన సృష్టి సంకల్ప దృఢకల్పన పూర్వము ఎట్లా ఉన్నదో... ఇప్పుడూ అట్లాగే ఉన్నది. అది అంతటి మరొక దృఢకల్పనచే ప్రయత్నపూర్వకంగా కావించబడనంతవరకు... ఆ సంకల్ప ఫలప్రదమైనదంతా అట్లే కొనసాగుతూ ఉంటుంది.

ఓ రామచంద్రా! అవయవసహితమగు ఈ శరీరాది పదార్థములకు ఏ విధంగా అయితే అవయవక్రమము స్థితి కలిగి ఉంటుందో... అట్లాగే అవయవ రహితము - స్థిరము అయినట్టి బ్రహ్మమునందు ఈ ద్వైత - - ఏకత్వాదులు, వర - శాపాదులు స్థితి కలిగి ఉన్నాయి. శ్రీరాముడు : హే మహర్షీ! ఆవరణ రహితమగు జ్ఞానము కలవారు, తపో ధర్మాది నిరతులు అగు వర -శాపములు ఎట్లా ప్రదర్శిస్తున్నారు? అవి ఎట్లా సత్యములగుచున్నాయి? ఈ విషయాలు తెలియ జేయమని మరల ప్రార్థిస్తున్నాను.

Page:628

శ్రీ వసిష్ఠ మహర్షి : చిద్రూపము, నిర్మల బ్రహ్మ స్వరూపము అగు బ్రహ్మదేవుడు ఏ రీతిగా అయితే సృష్ట్యాది యందు తపస్సు - ధర్మము మొదలైనవాటి ప్రభావం చేత వరశాపాదులు సత్యములగుగాక!” ...అని దేనిని సంకల్పించారో .... అది ఆత్మ అట్లే అనుభవించుచున్నది. అద్దానికి ఎట్టి ప్రతిబంధకము ఉండటం లేదు. ఆ ప్రజాపతియగు బ్రహ్మదేవుడు ఆత్మరూపము - సత్యము అగు బ్రహ్మమును అనుభవ - - అనుభూతి పూర్వకంగా ఎరిగియుండుటచే... ఆతడు సత్య సంకల్పయుక్తుడై వెలయుచున్నాడు. కానీ... ద్రవత్వము కంటే జలము వేరుకాదు కదా! బ్రహ్మదేవుడు బ్రహ్మము కంటే వేరుకాదు. కాబట్టి ప్రథమ ప్రజాపతియగు బ్రహ్మదేవుడు దేనిని ఎట్లు సంకల్పిస్తున్నాడో... అది శీఘ్రంగా అట్లే అవుతోంది.

తదేదం కల్పనమ్ జగత్ - ఈ జగత్తు ఆతని కల్పనయే అయివున్నది. అయితే... ఒక్క

విషయం.

నిరాధారం నిరాలంబం వ్యోమాత్మ వ్యోమ్ని భాసతే | దుర్దృష్టేరివ కేశోణ్ణం దృష్ట ముక్తావలీవచ ॥

కంటికి దోషం కలవారికి ఆకాశంలో కేశముల ముత్యముల సమూహం కనబడుతూ ఉంటుంది చూచావా? నిరాధారము నిరాలంబము అయినట్టి చిదాకాశమే చిదాకాశమున జగదాకారంగా భాసిస్తోంది.

I +

ఆ ప్రజాపతియగు బ్రహ్మదేవుడే ప్రజలు - ధర్మము - దానము - తపస్సు - - సౌశీల్యము మొదలైన సాత్విక గుణములను, 4 వేదములను, షట్ శాస్త్రములను, సమస్త జీవజాలమును, సాంఖ్య - యోగ - పశుపతి - వైష్ణవ - ఆత్మ అనబడే పంచజ్ఞానోపదేశములగు మతములను సంకల్పించారు. ఆ తరువాత "వేదవేత్తలగు తాపసులు వాదములతోగాని, (లేక) సహజ వృత్తిచేతగాని యేది సందర్శించి చెప్పుదురో... అది వారివారికి అట్లే అగుగాక... అని కూడా సంకల్పించారు.

మరల... ఆ బ్రహ్మదేవుడే, చిద్రూపమగు బ్రహ్మము... ఛిద్ర స్వభావయుక్తమగు ఆకాశముగా అగుగాక! చలన స్వభావయుక్తమగు వాయువుగా అగుగాక! ఉష్ణ స్వభావమగు అగ్నిగా అగుగాక! ద్రవ స్వభావమగు జలముగా ఏర్పడుగాక! కఠిన స్వభావమగు పృథివిగా అగుగాక!...ఈ ప్రకారంగా సమస్త పదార్థముల స్వభావములను ఆ బ్రహ్మదేవుడే తన మనోవీథిలో సంకల్పించియున్నారు. అట్టి సమస్త కల్పన కూడా ప్రజాపతి వేషధారి అగు చైతన్యము చేతనే నిర్వర్తించబడుతోంది. అట్టి ప్రజాపతిరూప చిదాకాశముచేత కల్పించబడినదే ఈ జగత్తులో ప్రతి జీవియు అనుభవించడం జరుగుతోంది. అదియే నీ చేత - నా చేత అందరి చేత పొందబడుతోంది.

ఓ రామచంద్రా! ఒక స్వప్న ద్రష్ట తన స్వప్న చైతన్య రూపమును అసద్రూపములే అగు స్వప్న పదార్థములుగా సద్రూపమువలె పొందుచున్నాడు కదా! అట్లాగే చిదాకాశము ఏ వస్తువును ఎట్లు ఎరుగుచున్నదో... అట్లే పొందుచున్నది. సంకల్ప నగరంలో శిల్పం గాలిలోకి లేచి నృత్యం

Page:629

చేస్తున్నదని అంటే అందులో ఆశ్చర్యం ఉండదు కదా! 'జగత్తు' అనే సంకల్ప నగరంలో బ్రహ్మదేవుని అధికార ప్రారబ్ధ భోగ రూపమైన ఇచ్ఛ'సత్యము' గానే భాసిస్తోంది. శుద్ధ చిత్ స్వభావము దేనిని ఏ రీతిగా ఎరుగునో అద్దానిని - - ఏ అశుద్ధచిత్ స్వభావము మరొక తీరుగా మరల్చజాలదు.

అశుద్ధ చిత్ స్వభావుడు మాయాగ్రస్తుడు అగు జీవుడు... వర్తమాన జాగ్రత్నందు, స్వప్నమునందు కూడా... తన అభ్యాస దార్జ్యముచే 'సమస్తము సత్యము’ అను రూపముననే గాంచుచున్నాడు. ఎందుచేతనంటావా? నేను అల్పుడను, స్వల్పుడను, దేహమాత్రుడను”... ఇత్యాదిగా అస్వతంత్ర కల్పన యొక్క చిరభ్యాసంచేత ఇది కల్పనా మాత్రము" అనబడు సత్యానుభవమునకు విరుద్ధ కల్పన గురించిన స్వాతంత్ర్యము లేకయే ఉన్నాడు. "నేను కర్మలచే - పరిస్థితులచే వ్యవహారములచే - జన్మమృత్యువులచే - పాపపుణ్యములచే బద్ధుడను... అను రూపంగా దృఢమైన బంధమును అనుభవించుచున్నాడు. అట్టి బంధమునే స్వప్నంలో కూడా అనుభవిస్తున్నాడు.

కానీ... ఏకము - సత్యము అయినట్టి చిదాకాశమే సదా ద్రష్ట - - దర్శనము - దృశ్యము అగు త్రిపుటీ రూపమును గాంచుచు... ఈ రీతిగా జగదాకారంగా భాసిస్తోంది. అంతేగాని ఈ జీవుడు చిదాకాశమునకు వేరైనవాడు కాదు. అంతేకాదు.

ద్రష్ట, దృశ్యము... ఈ రెండూ కూడాఏక రూపమే అయివున్నాయి. ఎట్లా అంటావా?... ఏకము - సర్వవ్యాపకము అగు 'చిత్సత్త' చేతనే అవి రెండూ కూడా (ద్రష్ట - దృశ్యము కూడా) ఉపజీవింపబడుచున్నాయి. కాబట్టి... చిదాకాశము తన ఇచ్ఛానుసారమే ద్రష్టత్వము - దృశ్యత్వము గాంచుచు... తాను దానిని సత్యముగానే పొందుచున్నది.

వాయువునకు చలనమే అవయవ రూపం. జలమునకు ద్రవత్వమే అవయవ రూపం. బ్రహ్మమునకు మాయా శక్తిత్వమే అవయవ రూపం! ఈ రీతిగా ఈ జగత్తు విరాట్ పురుషుని అవయవమే అయివున్నది. అట్టి విరాట్ పురుషునకు నేను బ్రహ్మమునే అను నిర్మలానుభవం ఉండనే ఉన్నది. ఈ జగత్తో ... విరాట్ పురుషుని శరీరమే కదా! కాబట్టి ఆకాశము - శూన్యత్వముల వలె... బ్రహ్మమునకు ఈ జగత్తుకు భేదమే లేదు.

అందుచేత... పర్వతము పై భాగం నుండి క్రిందకు గంగాజలధారలు పడుచున్నప్పుడు జలతుంపరలు గాలిలోకి ఎగసి తిరిగి జలంలోనే లయం అవుతూ ఉంటాయి. చూచావా? అట్లా లయంకాక ముందో? ... జలకణములు గాలిలో భాసిస్తూ ఉంటాయి. ఈ విచిత్ర జగద్భేదములన్న అట్టివే! ఎందుకంటే ఇవన్నీ బ్రహ్మమునందే బయల్వెడలి మరల ఎప్పుడో విలీనం అవుతూ ఉన్నాయి. కాకపోతే... ఈ ఉపమాలంకారం ఒక్క భేదం మాత్రం కలిగి ఉన్నది. జలకణములేమో మనోబుధ్యహంకార రహితములై ఉన్నాయి. ఇక బ్రహ్మ సంవిత్తో ... స్వయంగా నిజశరీరములందు మనస్సు - బుద్ధి - అహంకారముల కల్పనను గావించుకొని... తనకు భోగ్యమగుచున్న ఈ సృష్టిని (జలం ద్రవత్వమును అంగీకరిస్తున్నట్లుగా) అంగీకరిస్తోంది. ఓ రామచంద్రా! మనో బుద్ధి జనితమైన అజ్ఞానము యొక్క దుద్బోధ చేతనే ఈ జగత్తు ఆత్మకు వేరైనదన్నట్లుగా విద్యమానమౌతోంది.

Page:630

నేను అట్టి దుర్బోధరహితుడను. నా యొక్క దృష్టియందు ... జగత్ నిర్మాణ కర్మ కేవలము కారణ వర్జితము, అద్వైత రూపము. (ఇది సర్వదా బ్రాహ్మమే కాబట్టి) ఇతఃపూర్వంగాని, ఇప్పుడుగాని, ఇక ముందుగాని ఏమాత్రం జనించనిదే అయివున్నది. మొదలే జనించని ఈ జగత్తును బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడు?... అనే ప్రశ్నయే ఉండదు. (స్వప్నంలో) నేను, నీవు, మీరు, మేము, వీరు, వారు, ఇది, అది, ఇక్కడ, అక్కడ, ఇప్పుడు, అప్పుడు, ఇటు, అటు, ఎందుకు, ఇందుకు, అందుకు”... అని దేనిని ఎట్లు ఎరుగుచున్నామో అట్లే అసద్రూపములైనప్పటికీ సద్రూపములవలె నీ స్వప్నంలో నీవు, నా స్వప్నంలో నేను ఎరుగుచున్నాము కదా! అట్లాగే... సృష్ట్యాదిలో బ్రహ్మదేవ వేషధారియగు చిదాకాశము ఏది ఎట్లు ఎరుగుచున్నదో అది అసద్రూపమైన్పటికీ సద్రూపముగా ఎరుగుచున్నది. ఇక వ్యష్టిరూప వేషధారిఅగు చిదాకాశము “జగన్నాటకము... అనే సందర్భంలో తత్ సానుకూల్యంగా "ఇది సద్రూపమే”... అని అంగీకారత్వం వహించి మాయానాటకంలో పాత్రధారి అగుచున్నాడు.

ఇది ఇట్లుండగా... పరమాత్మ యొక్క సత్తా మనోబుద్ధ్యాది రహితమై, నిర్విక్షేపమై నిశ్చల దీపకాంతివలె సదా చిద్రూపముగా అలరారుచున్నది. ఏ విధంగా ఈ శరీరమున మనోబుద్ధి రహితమగు మృతావస్థ - సంభవిస్తోందో... ఏ విధంగా శిలలందు జడసత్త విక్షేప రాహిత్యము కనబడుతోందో... చిద్రూపము యొక్క మనోబుద్ధి రాహిత్యము - విక్షేప రాహిత్యము అటువంటిది. అనగా (అవగాహన కొరకై) వాటితో పోల్చవచ్చు.

ఒకే నిద్రయందు స్వప్నం, సుషుప్తి ఉన్నట్లే... ఏకైక బ్రహ్మమునందు సృష్టి, ప్రళయం ఉన్నాయి. చేతన రూపుడే అయివుండి కూడా ఈ మనుజుడు గాఢనిద్రా సమయంలో సుషుప్త స్థితి - - ఒక శిలయొక్క స్థితిని అనుభవిస్తున్నాడు చూచావా? అట్లాగే పరమాత్మ కూడా ఈ జడ పదార్థముల స్థితి అనుభవించుచున్నాడు.

ఒకడు ఎక్కడో మరొక విషయం పై ఏకాగ్రతతో కూడిన ధ్యాస కలిగియున్నప్పుడు (అనగా) ఆతని ధ్యాస ప్రీతిపూర్వకంగా మరెక్కడో సంలగ్నమై ఉన్నప్పుడు తన బొటన వ్రేలును గాని, భుజములనుగాని తాకుచున్న పిల్లగాలుల వస్తువుల స్పర్శ - అనుభవమునకు రావు కదా! అట్లాగే శిలలందు ఆత్మ విద్యమానమై ఉండికూడా అవిద్యమానప్రాయమే అగుచున్నది. ఆకాశము

- - శిల - జలాదులు ఆయా ఆకాశ దేవత - - శిలాదేవత - జలదేవతలకు ఇదంతా మా శరీరమే”

అని అనుభూతం అగుచున్నది. అట్లాగే చిత్త రహితులగు మాకు సృష్టికాలంలో “ఈ సృష్టి అంతా మా శరీరమే ... అనురూపంగా అనుభూతమౌతోంది. అఖండము - అనంతము అగు కాలమునందు

రాత్రి - - పగలు - అసంఖ్యాకంగా ఏర్పడుచున్నట్లుగా... అనంత స్వరూపుడగు పరమాత్మ యందు అసంఖ్యాకములగు సృష్టి - - ప్రళయములు భాసిస్తున్నాయి.

ఆలోక రూప మనన అనుభవ ఈషణ ఇచ్చా ముక్తాత్మని స్ఫురతి వారి ఘనే స్వభావాత్ ఆవర్త వీచి వలయాది యథా తథాయం శాంతే పరే స్ఫురతి సంహృతి సర్గపూగః ||

Page:631

ఓ రామచంద్రా! ఈ దృశ్యాది వ్యవహారములు ఉండటంచేత కలత చెందవలసినదేమున్నది? ఆత్మ సర్వదా యథాతథం కదా! సముద్రమంతా శాంతమగు జలమాత్రమే అయినప్పటికీ... స్వభావ సిద్ధంగానే ఆ సముద్ర జలంలో జలమునకు అనన్యంగా ఆవర్తములు - తరంగములు - వలయములు - - బుడగలు మొదలైనవన్నీ ఏర్పడుచూ స్ఫురిస్తున్నాయి కదా! అట్లాగే పరమాత్మయొక్క స్వరూపము పరమశాంతము - నిర్లేపము నిర్లిప్తము అయివుండగా, అద్దానియందు స్వభావసిద్ధంగానే విషయముల యొక్క దర్శనములు, వాటి వాటి యొక్క రూపములు, మననములు,

అనుభవములు - ఈషణములు - ఇచ్ఛలు - - ఇవన్నీ ఏర్పడుచున్నాయి. జలము సర్వదా

నిరాకారమేగా! - అదేవిధంగా ఆత్మయందు ఇవన్నీ లేవు. ఒకవేళ ఉంటే అవి ఆత్మకు అభిన్నం. సృష్టి లయములతో సహా సర్వము ఆత్మయొక్క స్వభావమే అయి ఉండి, ఆత్మకు అభిన్నమే అయివుండి, ఆత్మ సర్వదా వీటన్నిటికీ అప్రమేయమై, అతీతమై అనునిత్య నిర్మలమైయున్నది. ప్రతిజీవుడు స్వతహాగా, నిర్ద్వంద్వంగా ఆత్మస్వరూపుడే అయివున్నాడు. ఇందులో సందేహించవలసిన దేమీలేనే లేదు.

ఓ సర్వజనులారా! మీరంతా నిర్మలము, అఖండము, జగత్తుచే అస్పృశ్యము - అగు ఆత్మయే స్వరూపముగా కలిగియున్నారు. అట్టి ఆత్మయే పరమసత్యమై ఉండగా ఇక తక్కిన సృష్టి-ప్రళయాలు ఆత్మయొక్క లీలావిన్యాసములు మాత్రమే! స్వభావమే అయి వున్నాయి! ఆత్మయే మీ స్వభావం! ఈ జగత్తు మీ శరీరమైనప్పటికీ, శరీరమునకు శరీరి వేరే అయివున్నట్లు... మీరు నిశ్చలము సర్వగతము అగు ఆత్మ స్వరూపములే అయివున్నారు. ఆ మీ ఆత్మ స్వరూపమును సర్వదా ఆస్వాదించి ఉండెదరుగాక! అట్టి మీ ఆత్మ స్వరూపమును ఋషులమగు మేము సదా ఉపాసిస్తున్నాం.

10. ప్రతి జీవుని అనంతాత్మలో అసంఖ్యాక జగత్తులు

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ అసంఖ్యాక పదార్థముల యొక్క నియతి (కార్యకారణ భావాది నియమము)... ఎట్లా సంభవిస్తోంది? అగ్నికి ఉష్ణత్వం, జలమునకు ద్రవత్వం, తదితర పదార్థములకు ఆయా స్వభావం... ఇవన్నీ ఒకే విధంగా, సుస్థిరంగా, సుదీర్ఘంగా ... ఏ కారణం చేత స్థితి పొంది ఉంటున్నాయి? ఎందుకంటే... జాగ్రత్ పదార్థాలలో నియతి కనిపిస్తోంది. కాని స్వప్నంలోను - మనోరథంలోను (ఊహాలోకంలోను) అటువంటి నియతి కనబడటంలేదు కదా! జాగ్రత్ పదార్థాలకు ఎట్లా ఈ నియతి ఏర్పడుతోంది? ఉదాహరణకు అసంఖ్యాకులగు దేవతలు ఉన్నప్పటికీ... అందు సూర్యుడు మాత్రమే మహా ప్రచండ ప్రకాశయుక్తుడై వర్తిస్తున్నారు. దివారాత్రములు సమయ నిర్ణయం (రోజుకు 24 గంటలు... ఇట్లా) ఏర్పడి ఉంటోంది. ఈ నియతి ఎట్లా ఏర్పడి ఎట్లా కొనసాగుతోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! స్వప్నంలో ఏఏ పదార్థములు ఏఏ రూపంచే భావిస్తున్నాయో ...అదంతా కాకతాళీయ న్యాయంచే అట్లా భాసిస్తోంది కదా! అట్లాగే బ్రహ్మదేవునికి ఆదిసృష్టి

Page:632

యందు కాకతాళీయ న్యాయం చేత ఏ పదార్థము ఏ రీతిగా స్వయంగా భాసిస్తోందో... అదే ప్రకారంగా అర్థ - క్రియాదులతో నియతమై నేటివరకు స్థితినొంది ఉండటం జరుగుతోంది. అట్లా నియతమై, కార్య-కారణ రూపంతో యథారీతిగా వర్తిస్తున్న దానినే "జగత్తు అని పిలుస్తున్నాం. కనుక, పదార్థముల యొక్క స్వభావములకు బ్రహ్మదేవుని ఇచ్ఛయే హేతువు!

ఓ రామచంద్రా! ఈశ్వరుని యొక్క ఇచ్ఛయే ఈ కనబడేదంతా! సర్వశక్తిమంతుడగు ఈశ్వరుని సత్య సంకల్ప సంవిత్తు”... యొక్క చమత్కారమే ఇది. ఆ సత్య సంకల్ప సంవిత్తుచే ఏఏ పదార్థము ఏఏ ప్రకారంగా 'సృష్ట్యాది' యందు భాసించిందో... అదియే ఈ ప్రకారంగా నియతి రూపంగా ఉంటోంది. అయితే... సంవిత్తు యొక్క భావనా మాత్రమే కదా ఇదంతా? ఆలోచనలచే ఆలోచించు వాడు బంధింపబడటమేమిటి? ఒకని భావనచే ఆ భావికుడు బంధించబడుచున్నాడు!"... అనునది ఎంత అర్థరహితమో... "నిర్విషయమగు సంవిత్తు నియతిచే బద్ధము... అనునది అంతే అర్థరహితం! మాయారూప మాత్రమైన ఈ జగత్తు బ్రహ్మమునందు యథారీతిగా ఈ స్థితిని కలిగియుండి... చిరకాలం అద్దాని చైతన్య శక్తిచే భాసిస్తూ... ప్రళయకాలంలో ఇది సూక్ష్మత్వం పొందినదై 'భాసించనిదే' అగుచున్నది. నిద్ర లేవగానే అనేక ప్రాపంచిక విషయాలు అనుభవ మగుచుండగా... గాఢనిద్రా దశలో అవన్నీ సూక్ష్మస్థితిని పొంది 'రహితం' అవటం ప్రతిజీవునికి దైనందిన అనుభవమే కదా! ఇదీ అట్టిదే! ఈ విధంగా సర్వ వస్తువుల యొక్క “అర్థ క్రియాశక్తి” ఆత్మ యొక్క విలక్షణ లక్షణమే కాబట్టి, ఆత్మవలెనే ఇది కూడా అనాదియే అయివున్నది. ఆత్మయొక్క అనాదియగు జగత్ కల్పనా సందర్శన విశేషమే 'నియతి' అనే శబ్దముచే ఉద్దేశింపబడుతోంది.

ఏ బ్రహ్మమైతే స్వయంగా ఇది అగ్ని-ఉష్ణము, ఇది జలము- శీతలము ... ఈ ప్రకారంగా భాసిస్తోందో... అట్టి సృష్టి - సంహార రూపధారియగు బ్రహ్మమే 'నియతి'గా అనుభూతమగుచున్నది. 'నియతి' అని వర్ణించబడేది అదియే!

ఓ రామచంద్రా! జలం కంటే ద్రవత్వం వేరా? కానేకాదు కదా! ఏ స్ఫురణ అయితే జాగ్రత్ లోను, స్వప్నంలోను, సుషుప్తిలోను స్వయంగా సంభవిస్తోందో... అది నిర్మలం, ఏకం అయినట్టి చిద్రూప బ్రహ్మం కంటే వేరుకాదు సుమా! ఆ స్ఫురణయే నియతి అనుభూతిని సిద్ధింపజేస్తోంది. యథా శూన్యత్వమ్ ఆకాశే, కర్పూరే సౌరభం యథా,

యదౌష్ట్యమాతపే, సాన్యజ్జాగ్రదాది తథా చితి ॥

ఆకాశమునకు శూన్యత్వం, కర్పూరమునకు సుగంధం, అగ్నికి ఉష్ణత్వం... ఎట్లా సహజమో, ఏ విధంగా అయితే, ఆ శూన్యత్వ, సుగంధ, ఉష్ణత్వాదులు - ఆకాశ, కర్పూర, అగ్నులకు వేరైనవి కాకయే ఉన్నాయో... అట్లాగే జాగ్రత్ - స్వప్న సుషుప్తులు చైతన్యమునకు వేరైనవి కావు. చిన్మాత్రాకాశ స్వరూపము - ఏకము అగు బ్రహ్మమునందు ... అద్దానికి అభిన్నమైన సత్త కలిగి ఈ సృష్టి - స్థితి

ప్రళయములు అనాది ప్రవాహ రూపంగా ఏర్పడి ఉంటున్నాయి. కాబట్టే... ఇద్దాని యందు ఇవన్నీ “నియతము అనబడే అర్ధ క్రియా సామర్థ్యము కలిగియున్నవై ఉండగలుగుచున్నాయి.

Page:633

సృష్టి దేనినైతే “సృష్టి అని - - చైతన్యము తన యొక్క స్ఫురణ ఇది కదా... ఎరుగుచున్నదో అదియే సృష్టి రూపమున అలరారుచున్నది. అదియే 'నియతి' రూపమున ప్రదర్శితమౌతోంది.

క్షణ - కల్పములు - చైతన్యము యొక్క స్ఫురణ దేనిని చూచి “ఇది కల్పము” అని ఎరుగుచున్నదో ...అది వాస్తవానికి క్షణమే అయినప్పటికీ 'కల్పము' రూపము అయి ఆ చైతన్య స్ఫురణచే

పొందబడుతోంది.

అట్లాగే, ఈ చైతన్యము దేనిపట్ల ఏ ఉద్దేశముతో కూడినదై ప్రసరిస్తోందో అదియే సంసారము, బంధము, స్వస్వరూపము, మంచి, చెడు, అభియోగము, వాస్తవము, అవాస్తవము, స్వల్పము, దుర్లభము, ఇది, అది, ఇట్లు, అట్లు, ఇట్లు కాదు, అట్లు కాదు... ఈ విధంగా ఆయా రూపములుగా (ఆ చైతన్యం యొక్క ఉద్దేశ స్ఫురణయే) అగుచున్నది. అట్టి చైతన్య స్ఫురణ ఏఏ రూపాలుగా దాల్చుచున్నదో... అదియే నియతి”.

సర్గోయమ్ ఇతి తద్బుద్ధం క్షణం యత్కచనం చితః |

కల్పోయమ్ ఇతి” తద్భుద్ధం క్షణం యత్కచనం చితః ॥

చితః (చిత్ స్ఫురణ)... దేనినైతే “ఇది సృష్టి అని భావన చేస్తోందో... అది 'జగత్తు’గా అనుభవమౌతోంది. అది క్షణమును 'కల్పము' అని తలిస్తే అది కల్పము అవుతుంది. కల్పమును “ఇది క్షణికం” అని భావిస్తే అది క్షణికమాత్రమే అవుతుంది. కాబట్టి... రామచంద్రా! చైతన్యము యొక్క స్ఫురణను అనుసరించే సర్వ నియమ వ్యవస్థ వర్తించటం జరుగుతోంది.

శ్రీరాముడు : స్వామీ! మహర్షీ! మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉన్నదే! ఈ జగత్తులో కనిపించే వస్తు

వ్యావహారిక - - కాల - పరస్పర సంబంధములు మొదలైన వాటితో కూడిన నియతి" అనేది స్వకీయమైన చైతన్యము యొక్క స్ఫురణ (లేక) 'ఎరుక' యొక్క చమత్కారమేనంటారా? ఇది మీరు చెప్పిన విధంగా అనిపించటం లేదే?

శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నంలో కాలము, నియతి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ఆ కాలమును నియమించిందెవరు? స్వప్న ద్రష్టయే కదా! ఆ స్వప్నంలోని సంఘటనలు, వాటికి అర్థాలు కల్పిస్తున్న దెవరు? స్వప్నకల్పనచేసే స్వప్న ద్రష్టయొక్క స్వప్న చైతన్య స్ఫురణ కాకుండా మరొకరెవరో ఆకాశంలో ఉండి నీ స్వప్నంలో వస్తువు, క్రియ, కాలము, వ్యవహారము, భయము, ఆశ్చర్యము, దుఃఖము మొదలైనవి కల్పించటం లేదే! స్వప్నంలో ఏ చిన్మాత్ర స్ఫురణ కలదో... అదే కాలము. అదే క్రియ. అదే ఆ స్వప్నంలోని తదితరములన్నీ కూడా కదా! స్వప్నంలోని ఆకాశం-ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా అదియే! ఇంతెందుకు? స్వప్నంలో కనిపించేదంతా కూడా ఆమూలాగ్రం స్వప్న చైతన్య స్ఫురణచే కల్పించబడి, ఆ స్వప్న చైతన్య స్ఫురణచే ఆయా రూపములుగా 'నిజమే' అన్నట్లుగా అనుభవించబడుతోంది ... అనేమాట ఎవరైనా కాదనగలరా?

ఇప్పుడు జాగ్రత్తుకు వద్దాం. ఇక్కడి బాహ్యమందలి రూపాదులు, అభ్యంతరమందలి మనః సంకల్పాదులు, ఇక్కడ అనుభూతమగుచున్న దేశ కాల క్రియాదులు... ఇవన్నీ కూడా అదే చైతన్య స్ఫురణ యొక్క 'జాగ్రత్ కల్పన'లోని విభాగములే!

Page:634

ఏ 'కాలము' చైతన్యముచే స్ఫురింపజేయబడుచున్నదో, ఏఏ పదార్థములు' చైతన్యముచే 'ఇది ఇట్లు' అని కల్పన గావించబడుచున్నదో ... అదియే 'నియతి'.

అట్టి నియతి’ యొక్క రూపమంతా కూడా చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే అయివున్నది. ఒక నిమిషము మొదలుకొని ఒక కల్పము వరకు ఉండునట్టి ఏఏ పదార్థములైతే ప్రదర్శితమగు చున్నాయో... అవన్నీ కూడా (ఉదా: అగ్నికి ఉష్ణత్వం, జలమునకు శీతలత్వం మొదలైనవి) ఏ ఏకైక స్ఫురణచే అట్లట్లు పొందబడుచున్నాయో... అదియే “స్వభావము” - - అని స్వభావ తత్త్వమును బాగుగా ఎరిగిన విశాల బుద్ధులగు మహనీయులు నిర్వచిస్తున్నారు. ఒకే అగ్ని దేశ కాల

భేదములచే అనేక ప్రకారములుగా స్థితినొంది ఉండవచ్చుగాక! అయితే ఏం? అది తన యొక్క ‘ఉష్ణత్వము - ప్రకాశత్వము' అనే సహజ లక్షణాలు త్యజించి ఉంటోందా? లేదు కదా! అట్లాగే - చైతన్యము అంశరూపుడగు ఒకే జీవుడు అనేక దేశ -కాలములలో మనుష్య - దేవ - పశు - పక్షి ఇత్యాది అనేక రూపములుగా స్థితి పొంది ఉంటే ఉండవచ్చుగాక! ఆ జీవుడు వాస్తవానికి సర్వానుగతమైన తన చిత్స్వరూపమును ఏమాత్రం త్యజించటమే లేదు.

చైతన్య స్ఫురణచే జగత్ నియతి పొందబడుచుండగా... చైతన్య స్ఫురణ నిర్విషయ చైతన్యము కంటే వేరు కాదు.

స్వభావము : ఏఏ పదార్థముల స్వభావము ఇట్లు కనిపిస్తోందో... అదంతా కూడా, ఎటువంటి దంటే... చిన్మయమగు పరబ్రహ్మమున, అట్టి పరబ్రహ్మముచే... 'స్వదేహం'తో పోల్చతగ్గ వృత్తి భేదములందు. ఏ ఏ వృత్తులకు ఏఏ ఆకార కల్పన గావించబడిందో... ఆ ఆకార కల్పనయే ఈ పృథివి - ఆకాశం మొదలైన వాటియొక్క స్వభావం అయివున్నది. చిన్మయ - సంకల్పవృత్తి అనునది కాకుండా ఈ భూమి-ఆకాశం మొదలైన వాటికి వేరే రూపాలే లేవు!

వాస్తవానికి నేల, నీరు, అగ్ని, వాయువు, ఆకాశముల పారమార్థిక స్వభావం అధిష్ఠానమగు చిదాకాశమే అయివున్నది. క్రమంగా ఆ పృథివి నీరు మొదలైనవి అనేకమైనట్టి వేరు వేరు కార్యములకు (పదార్థాలకు కారణరూపమై ఉంటున్నాయి. స్వప్నంలోని వస్తు ఆకారములకు కారణకారణంలాగా స్వప్న చైతన్యమే ఏర్పడి ఉండటం లేదా? ఈ నేల - ఆకాశం మొదలైనవాటి కారణ కారణం చిదాకాశ స్ఫురణయే!

ఈ విధంగా ఈ నేల - ఆకాశం మొదలైనవి స్వప్న సదృశమే! అట్టి స్వప్న సదృశ పదార్థములలో ఒకటైన సాకార కఠిన పదార్థం అగు ఈ భూమి సర్వ జనులకు నివాసయోగ్యమై, మహత్తరమైన పీఠభూమి” అయి మహారాజువలె సర్వ జీవప్రదంగా చెన్నొందుతోంది. అట్లాగే... అన్నిటికీ ఆదికారణం చైతన్యము - చైతన్యము యొక్క జాగృత్ విభాగ చమత్కారం.

గంగ మొదలైన నదీ జలములకు సముద్రం కారణం, అగ్ని మొదలైన తేజోమయ పదార్థములకు - సూర్యుడు కారణం, చలనములన్నిటికీ - వాయువు కారణం, శూన్యత్వమునకు - ఆకాశము కారణం... ఇవన్నీ కార్య కారణములుగా అయి చెన్నొందుచున్నాయి. ఈ పంచ

Page:635

భూతముల కలయికలచే రకరకాల పదార్థాలు - దేహాలు ఆకారాలు, వాటి వాటి ధర్మాలు ఈ దృశ్యంలో తాండవిస్తున్నాయి. ఈ విధంగా ఈ కనబడే సర్వమునందు బ్రహ్మమే అనుగతమైనట్టి సత్స్వభావం అయివున్నది. మరింక సూర్యగోళం ఎట్లా ఏర్పడింది? చంద్రబింబం ఎక్కడి నుండి వచ్చింది?... అనేవి పెద్ద విశేషాలెట్లా అవుతాయి?

చైతన్యము స్వయంప్రకాశము, సర్వప్రకాశకము, సర్వజ్ఞము కూడా! అట్టి చైతన్యము యొక్క సంవిత్తు సర్వ వ్యాపకమై, సర్వరూపమై, స్వస్వరూపంగాకూడా (దృశ్యము, ద్రష్టగా కూడా) సర్వదా ఏర్పడి ఉంటోందని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. చిదాకాశమే తనయొక్క స్వరూపంగా కలిగియున్నట్టి “చతుర్ముఖ బ్రహ్మ అనే చిన్న పిల్లవానియొక్క చిలిపి ఊహలే ఈ సర్వ దృశ్యాంతర్గత సర్వ విశేషాలు కూడా! ఆతని స్ఫురణ రూపమే ఈ ఆకాశము - భూమి.... ఇవన్నీ కూడా! ఆటలో అంతా కల్పించబడి... ఆట ముగియగానే అందులో సర్వ విశేషాలు మటుమాయమౌతాయి చూచావా? అట్లాగే... ఎప్పుడైతే సర్వజ్ఞుడు - సంవిత్స్వరూపుడు అయిన ఆ బ్రహ్మదేవుని భావనా సంరంభం అయినట్టి ఈ స్థూల - - సూక్ష్మ ప్రపంచము ఉపసంహరించబడుతుందో... అప్పుడు (ఇక్కడి సంవిత్ స్వరూపము యొక్క అంగవిన్యాసము వంటి) ఈ జగత్ చమత్కారం (ఏ ఆత్మయందు బయల్వెడలినదో)... అద్దాని యందే లయమై పోవుచున్నది.

సాలెపురుగు తన సంకల్ప బలంచేత బాహ్య సాధనములు లేకుండానే కళాత్మకంగా 'సాలెగూడు’ అనే చిత్ర విచిత్రాకారమైన వల కల్పించుచున్నది చూచావా? అట్లాగే బ్రహ్మదేవుని సంకల్ప రచనగా ఈ జ్యోతిశ్చక్రము రచించబడింది. ఆ జ్యోతిశ్చక్రంలో సూర్యగోళం యొక్క గతిభేదం, ఉత్తరాయన

దక్షిణాయనాలు, రాత్రింబవళ్ళు... ఇవన్నీ అల్పకాలిక - దీర్ఘకాలిక విశేషాలతో కూడిన కాలచక్రంగా ప్రవర్తిస్తోంది. వాస్తవానికి చిదాకాశమే ఈ సమస్త జ్యోతిశ్చక్రము మొదలైన సర్వ దృశ్యరూపంగా భాసిస్తోంది. అట్టి చిదాకాశ కల్పితమైన (కానీ, చిదాకాశరూపమే అయిన) జ్యోతిశ్చక్రంలో... కొన్ని సుదీర్ఘంగా మహాప్రకాశ శీలములై ఉంటున్నాయి. (ఉదా: సూర్యగోళం, నక్షత్రాలు మొదలైనవి)

మరికొన్ని అల్ప ప్రకాశశీలకములై ఉంటున్నాయి. (ఉదా: చంద్రబింబం మొదలైనవి). ఇంకొన్ని స్వయం ప్రకాశరహితములై ఉంటున్నాయి. (ఉదా: భూమి మొదలైనవి). ఈ విధంగా ఈ కనబడే పదార్థాలన్నీ చిత్ర విచిత్రములుగా భాసిస్తున్నాయి.

అయితే రామచంద్రా! జ్ఞాని యొక్క ఆత్మౌపమ్యేవ సర్వత్రా దృష్టికి... ఇక్కడ ఈ పదార్థ సమూహమంతా ఉత్పన్నమే అయివుండనిదై, వాస్తవముకానిదై ఉన్నది. మట్టితో తయారు చేయబడిన అనేక బొమ్మలు చూచి "మట్టి మాయమై ఈ బొమ్మలు ప్రత్యక్షమైనదెప్పుడు?” ... అనే ప్రశ్న

ఎవరికి ఉదయిస్తుంది?

మంచుగడ్డ యొక్క ఆకారం చూచి "ఇది నీరు కాదు. నీరు నీటి ఆవిరి కాదు. నీటి ఆవిరి ఆకాశ స్వరూపం కాదు. మంచుగడ్డ యొక్క చతురస్రాకారము సత్యమే”... అని ఆపః ధర్మాలు

Page:636

(జలము యొక్క ధర్మాలు) తెలిసియున్నవాడు అనుకుంటున్నాడా? ఆకాశమే వాయు రూపంగా అవుతోంది. కనుక వాయువు ఆకాశరూపమే! ఆ వాయు విభాగమే నీటి ఆవిరి. ఆ నీటి ఆవిరి రూపమే జలము. ఆ జలమే ఈ మంచుగడ్డ... అని విజ్ఞుడు గ్రహించయే ఉంటున్నాడు. అదే, ...మంచుగడ్డ యొక్క వివిధ స్థితులు తెలియనివాడో.... రూపముతో కూడిన ఈ మంచుగడ్డ రూపరహితమగు వాయువు ఎట్లా అవుతుంది? అవదు. ఆ వాయువు గుణరహితమగు ఆకాశం ఎట్లా అవుతుంది? కానే కాదు!... అని అనుకుంటున్నాడు. అయితే, జ్ఞానికి ఈ సమస్త దృశ్యము కూడా (మంచుగడ్డ యొక్క ఆకారమువలె) అనుత్పన్నమైనదై, స్వప్న సదృశ్యమై “చిదాకాశరూపం”గా భాసిస్తోంది.

ఈ జగత్ దృశ్యము ఇట్లు చిదాకాశమే అయివుండగా... ఇక ఈ “నీవు నేను అనే జగత్తులో అంతర్గతంగా కనిపించే వస్తువులను పరిశీలిద్దాం.

నీవు - నేను అనురూపంగా (మనలో ఒక్కొక్కరికి స్వస్వరూపంగా) అనుభూతమగుచున్నది చిన్మాత్రమే! అదియే నీవు - నేను ఇత్యాదులుగా భాసిస్తోంది. ఇక మనోబుద్ధి చిత్తాది అంతరంగ విభాగాలు గురించి వేరే చెప్పేదేమున్నది? ఏ చిదాకాశం 'నీవు- నేను' అయినట్లుగా కనిపిస్తోందో, 'నేను-నీవు’ను ఆశ్రయించి మనోబుద్ధి చిత్తాదులు కనిపిస్తున్నాయో... ఇవన్నీ కూడా జ్ఞానికి కేవలం చిన్మాత్ర రూపంగా యథాతథమై కనిపిస్తున్నాయి. ఈ నేను - నీవు మొదలైనవి దేహములు నశించినప్పుడు తాము కూడా నశిస్తున్నాయని "ఘనీభూత జగత్ దృశ్య దృష్టిచే అనిపిస్తే అనిపిస్తోందేమో! మంచు కరిగితే ఆకారంతో సహా ఆ పదార్థం నశించిందా? లేదే! అది జలరూపంగానో, వాయురూపంగానో మారవచ్చుగాక! 'వినాశనము' అనేది ఎక్కడిది? ఏ చిన్మాత్రము 'నేను-నీవు' ఇత్యాదులుగా కనబడుతోందో.... అయ్యది వాస్తవానికి దృశ్యరూపంగా భాసించటమూ లేదు, నశించటమూ లేదు.

అనగా... స్వప్నంలో దృశ్యంలాగా... చిదాకాశమే చిదాకాశమునందు చిదాకాశ సంకల్పం చేతనే జగదాకారంగా భాసిస్తోంది. ఈ జగత్తుకు చిదాకాశం కంటే వేరైన మరింకే రూపమూ లేదు! అట్టి ఆ చైతన్యమునకు 'సృష్ట్యాది' యందు ఏ పదార్థం ఏ రూపంగా స్ఫురిస్తోందో, అది ఆ ప్రకారంగానే అద్దానికి అనుభూతమౌతోంది. ఎంతవరకు ఏదేది వస్తురూపంగా విద్యమానమై ఉన్నదో అంతవరకు వాటివాటితో తాదాత్మ్యం నొందినదై స్ఫురించిన రూపము కలిగియున్నదగుచున్నది.

చైతన్యము యొక్క స్వకీయ స్ఫురణయే స్వభావము”. చైతన్యము యొక్క స్ఫురణయే “నియతి”. బ్రహ్మదేవుని భావనయే సృష్టికి మూలం. కనుక ఇదంతా భావనారూపమే! ఆ బ్రహ్మ సత్త... చిదాకాశరూపుడగు బ్రహ్మదేవుని యొక్క సంకల్ప - - భావనా శరీరంలో శబ్దతన్మాత్ర స్థితిచే ...ఆకాశంగానూ స్పర్శ తన్మాత్ర స్థితిచే ... వాయువుగానూ... ఈ విధంగా విత్తనంలోంచి మహావృక్షం లాగా అగుచూ... మహాప్రశాతంగా (బ్రహ్మసత్తయే అయి-బ్రహ్మ సత్తగానే) స్థితి నొంది ఉన్నది. శబ్దతన్మాత్ర నుండి (ఆకాశం నుండి)... స్పర్శ తన్మాత్ర (వాయువు), స్పర్శ తన్మాత్ర నుండి

Page:637

.తేజోతన్మాత్ర (అగ్ని), తేజో తన్మాత్ర నుండి... రసతన్మాత్ర (జలము), రసతన్మాత్ర నుండి... పృథివీ తన్మాత్రా... ఈ విధంగా భూతభౌతికాత్మికమైన ఈ జగత్తు క్రమంగా ఉత్పన్నమైనదగుచున్నది. అయితే... రామచంద్రా! ఆకాశాత్ వాయుః-వాయురగ్నిః - అగ్నిరాపః - ఆపః - పృథివీ"

...ఇత్యాది ఈ 'క్రమము'ను గూర్చిన కల్పన అజ్ఞానులు యొక్క తత్త్వబోధ కొరకై మునులచే ప్రతిపాదించబడుతోంది. అంతేగాని "ఈ సృష్టి వాస్తవమైన సత్యము”... అని ప్రతిపాదించటం కొరకై వారి ఉద్దేశంకాదు. ఈ సృష్టి నామరూపాత్మకమైన సత్యత్వము మూర్ఖులగువారిచేత మాత్రమే వెతకబడుతోంది. ఎందుకంటే....

నాస్తమేతీహా నో దేతి తత్కదాచన కించన

శిలాజఠరవత్ శాస్త్రం ఇదం నిత్యం సదప్యసత్

బ్రహ్మసత్త జగత్తుగా ఉదయించదు. మరల జగత్రూపంగా అస్తమించదు. శిలయొక్క గర్భమువలె అది సదా పరమశాంతరూపము వహించియే ఉన్నది. ఈ జగత్తంతా పరమార్థ సత్తచే సత్యము, నామరూపాది వ్యవహారములచే అసత్యము అయి ఉన్నది.

అవయవి” అగు పరమాత్మ యొక్క అవయవ రూపమగు ఈ దృశ్యము అనంతరూపమై ఉన్నది. తదవయవ ప్రాయములగు ఈ జగద్రూపాణువులు, అట్టి ప్రతి ఒక్క జగద్రూపాణువులో అసంఖ్యాక ప్రాణి సమూహములు అట్టి ప్రతిప్రాణి యొక్క అణువణువున అనేక జగత్తులు... ఇవన్నీ అనంత సంఖ్యారూపములుగా అయి చెన్నొందుచున్నాయి. సముద్రంలో తరంగాలు - - ఆ ఆ

తరంగాలలో జల బిందువులవలె, ఆ జలబిందువులలో జలపరమాణువుల వలె.... అసంఖ్యాక బ్రహ్మాండములు - అట్టి ప్రతి ఒక్క బ్రహ్మాండములో అసంఖ్యాక జగత్తులు, అట్టి ప్రతి ఒక్క జగత్తులో అసంఖ్యాక జీవులు, ఆ ప్రతి ఒక్క జీవునిలో అసంఖ్యాక జగత్తులు - ఇవన్నీ కూడా పరమార్థమున అనంతరూపములే! అవన్నీ పరమాత్మయందు ఉదయించక అస్తమించక వెలయుచున్నాయి. ఆకాశమున ఆకాశము ఉన్నట్లు 'బ్రహ్మము' అనే చిదాకాశమున జగత్తు అనే చిదాకాశము కలదు. బ్రహ్మ సత్తకంటే వేరుగా 'జగత్ సత్త' లేదు. ఈ జగత్తు చిద్రూపమే అయివుండగా, ...ఇక ఇది ఉదయించటం ఏమున్నది? అస్తమించటం ఏమున్నది?

11. సత్ నుండి అసత్ చమత్కారం - మణిదీపన్యాయం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మణిదీపన్యాయం... అనే ఒకానొక దృష్టాంతం అధ్యాత్మ శాస్త్రంలో ప్రసిద్ధమైయున్నది. అది ఇప్పుడు ఉదహరిస్తున్నాను. విను.

చైతన్యము వస్తుతః అనంత ప్రకాశరూపము - - సర్వ వ్యాపకము అయివున్నది. అట్టి 'చైతన్యము' అనే మణి కాంతి ప్రసరణయే సత్తామాత్రము (సత్ అనుభవం). ఆ చైతన్య మణియొక్క అసంఖ్యాక కాంతిపుంజములే ఈ అసంఖ్యాక 'జగత్తులు - - జీవులు' కూడా! అట్టి చైతన్య సత్తా మాత్రము యొక్క స్ఫురణరూపమే స్వభావము.

Page:638

ఆ చైతన్యము, తనయొక్క 'సత్తా మాత్ర యథార్థ స్వభావము'ను కొంచెము ఏమరచి, అద్దాని విస్మరణముచే స్వయముగా కించిత్ విషయాభిముఖం అయినదానివలె అగుచున్నది. అద్దానిని 'అజ్ఞాన సంవిత్' అని పిలుస్తున్నారు.

అట్టి అజ్ఞాన సంవిత్తు అన్యథా భావము ఆశ్రయించినదగుచున్నది. అట్టి అన్యథా భావముచే పరామర్శపూర్వకంగా భావికాల ప్రపంచము యొక్క నామ అర్థ కల్పనలతో వ్యవహరించ నారంబి స్తోంది. అయితే, ఆ కల్పనల రూపంగా తానే అగుచున్నది. అట్టి నామ అర్థ కల్పనలతో ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మము - శుద్ధము అయినట్టి రూపము ధరించి సర్వ పదార్థముల గూర్చిన భావి కాలపు నామ - రూపముల యొక్క 'పర్యాలోచన' నిర్వర్తిస్తోంది.

ఆ తరువాత అట్లు పర్యాలోచించినదానిని ప్రకాశింపజేయటానికి అభిముఖమగుచున్నది. (చేత యతీతి చిత్ - ప్రకాశింపజేసేదే చిత్). ఇప్పుడిది 'చిత్ చైతన్యము' అనే పేరుతో పిలువబడటానికి అర్హమగుచున్నది. ఆ తరువాత చిత్ చైతన్యము శరీరాదులందు ఘనీభూతమగు అభిమానము కలిగి ఉంటోంది. ఆ అభిమానముతో కూడిన ఆత్మసత్త భావికాలపు 'జీవుడు' మొదలైన సంజ్ఞలుగా అగుచున్నది.

అట్లు జీవుడు అనే సంజ్ఞను పొందిన దేహాభిమానియగు ఆత్మసత్త మరల ఎప్పుడో క్రమంగా ఆధికారికమైన జన్మలను పొంది తిరిగి మరల పరమపదరూపమగు బ్రహ్మముగా అగుచున్నది. బహిరంగంగా” అంతరంగంగా”

చైతన్యము

జన్మలు స్ఫురణ

నామరూపార్థ కల్పన స్వభావము

విషయాభిముఖము అట్టి ఆత్మసత్త జీవదశయందు,

చిదాకాశమును కప్పి ఉంచే అవిద్యచే * తన చిదాకాశత్వము ఏమరచి జగత్ భావంతో ప్రదర్శించుకుంటోంది. అయ్యది జ్ఞాన లాభము చేతనో తాను బ్రహ్మము కంటే వేరుకానిదై భాసిస్తోంది. అయితే, ఆవృతజీవదశయందు మాత్రం దేహ - ఇంద్రియములతో 'తాదాత్మ్య ధ్యాస' చే అనేక ఉపాధులతో వివిధ జన్మలందు తిరుగాడటానికి అభిముఖం అవుతోంది. అందుచేత అది శుద్ధరూపము యొక్క ఏమరపుచే జనించినన మలిన కర్మల రజోగుణము ధరించినదై ఉంటోంది.

Page:639

ఓ రామచంద్రా! ఈ విధంగా ఆ అద్వితీయమగు బ్రహ్మసత్త శబ్ద స్పర్వ రూప-రస-గంధాది ఆయా గుణములను-తన గర్భమున ధరించినదై... “సవికల్ప చిద్భావనచే సూక్ష్మ పంచభూతమగు చున్నది. ఆ సూక్ష్మ పంచభూతములే ఆకాశము మొదలైన నామముల యొక్క అర్ధ ప్రవృత్తికంతటికీ కారణభూతమౌతున్నాయి. ఆ సూక్ష్మభూత రూపమగు 'బ్రహ్మసత్త' నుండి లింగశరీరము (సూక్ష్మ శరీరము) యొక్క ప్రాణ సంచారక్రియ రూపుదిద్దుకుంటోంది. అట్టి లింగ శరీర ప్రాణసంచార క్రియచే ప్రేరితమైన అహంకారము కాలసత్తతో సహా ఉదయిస్తోంది. ఆ అహంకార-కాలసత్తలే ఈ జగత్తు యొక్క స్థితికి ముఖ్యబీజములై ఉంటున్నాయి.

“పరాచిత్శక్తి”... యొక్క నిజస్ఫురణ మాత్రము... అయినట్టి ఈ అపద్రూప జగత్ సమూహం "అధిష్ఠాన చైతన్యము వలననే సత్తువలె స్థితి నొంది ఉంటోంది. సంకల్పము” అనే మహా వృక్షమునకు బీజము చైతన్యమే సుమా! అట్టి చైతన్యము 'అహంత్వము'ను భావించుచు క్షణంలో అహంత్వరూపమై పోవుచున్నది. "హిరణ్యగర్భుడు"... అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఆ చైతన్యము “ఉత్పత్తి - వినాశనము" అనే భ్రమలతో కూడుకొనియున్నదై - జలము జలమునందే పరిభ్రమిస్తున్నట్లు - బ్రహ్మము నందే పరిభ్రమిస్తోంది.

భావన సూక్ష్మభూతముల ఘనీభూతం స్థూల భూతముల

భావన ఒనర్చబడగా రూపం

ఆ చైతన్యమే ఆ తరువాత తరువాత “నామ - రూప - - శబ్దార్థము అనే రూపం దాల్చుచున్నది.

ప్రతి ఒక్క జీవుని వాస్తవ - - నిజ స్వరూపమగు ఆ శుద్ధ చైతన్యమే వేద - శాస్త్రములకు పద - వాక్య - ప్రమాణములచే ఉద్దేశార్థమై చెన్నొందుతోంది. వేద శబ్దములకు ఆధారభూతమగు ఆ చైతన్యము నుండియే ఈ సమస్త జగత్తు ఉదయిస్తోంది. శబ్దము నుండి అర్ధభూత జగత్తు జనిస్తోంది. (సభూరిత వ్యాహరత్ భువమసృజత - ఆ చైతన్యము నుండి జనించిన 'భూః' శబ్దం చేత భూమి సృజించబడింది... ఇత్యాది).

ఈ ప్రకారంగా విచిత్ర సంకల్పములు నిర్వర్తిస్తున్న బ్రహ్మమే హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భ బ్రహ్మము ఆ తరువాత అనేక సంజ్ఞల (శబ్దార్థముల)తో కూడిన రకరకాల ప్రాణి సమూహములకు బీజము. ఆ హిరణ్యగర్భ బ్రహ్మమునుండే ఆకాశమంతా వ్యాప్తమై 14 లోకములకు సంబంధించిన 14 విధములైన ప్రాణి సమూహములు దీపమునుండి కాంతిపుజముల వలె బయల్వెడలుచున్నాయి.

హిరణ్య గర్భ స్పందన చైతన్యము చైతన్యము రూపమైన బ్రహ్మదేవుడు | (చలనరూపమైన ఈ సృష్టికి కర్త చిన్మాత్రము

1. వ్యాప్తత్వము : ఆ చైతన్యము నుండే వ్యాప్తరూపమగు 'ఆకాశము' బయల్వెడలినదై వ్యాప్తత్వ ధర్మము అవధరించుచూ... తన యందు 14 లోకములను, 14 ముఖ్య విధములైన ప్రాణి

Page:640

సమూహలను చైతన్యము యొక్క ప్రసరణరూపంగా కలిగి ఉంటోంది. ఈ విధంగా అంతవరకు కూడా శబ్ద వ్యహారము, శరీరాదుల వ్యవహారములైనట్టి హిరణ్యగర్భ చైతన్యము అకస్మాత్తుగా, కాకతాళీయంగా తన యందు తనకు అనన్యమైనట్టి వ్యాప్తత్వ ధర్మం ప్రదర్శిస్తోంది.

2. స్పందత్వము : అంతవరకూ నిశ్చల సత్ూపంగా ఉన్న హిరణ్యగర్భ (సృష్టికర్త) చైతన్యము తనయందు స్పందమును (చలనమును) కల్పించుకొంటోంది. ఆ స్పందము, వాయు సమూహమునకు బీజమై త్వక్ (చర్మ సంబంధమైన స్పర్శ) అనే తన్మాత్ర రూపముగా అగుచున్నది. సమస్త ప్రాణుల సంచలన హేతువగు వాయువు జనించుచున్నది.

3. ప్రకాశత్వము : ఆ హిరణ్యగర్భ చైతన్యస్పందము నుండి వాయురూపమును పొందిన హిరణ్యగర్భ చైతన్యము చిద్విలాసంగా 'ప్రకాశము' నకు సంబంధించిన అనుభవం ఆశ్రయిస్తోంది. అదియే రూపతన్మాత్ర’గా అగుచున్నది. భావికాలపు 'తేజము' అనే శబ్దమునకు అర్ధక్రియా కర్తృత్వము వహిస్తోంది.

ఓ రామచంద్రా! 'తేజము'లో ఏ ప్రకాశమున్నదో... అది చైతన్య ప్రకాశమే! అట్లాగే... స్పర్శ జ్ఞానమూ చైతన్యమే! చైతన్యమునకు అన్యంగా తేజము - స్పర్శ జ్ఞానము మొదలైనవి మరెక్కడి నుండో వచ్చి ఉండలేదు. అట్లాగే ... ఆకాశకోశమున చైతన్యమే స్వయంగా శబ్దరూపమై 'శబ్దజ్ఞానము'ను అనుభవిస్తోంది. చైతన్యమునకు అన్యంగా శబ్దజనకమైనదంటూ ఏదీ లేదు.

కాబట్టి... సృష్ట్యాది యందు సమష్టి దశయే ఉన్నది కదా! సమష్టిదశయందు చైతన్యమునకు అన్యంగా మరొక ఏదైనా కారణం చేత శబ్ద తన్మాత్ర - స్పర్శతన్మాత్ర - రూపతన్మాత్ర - రసతన్మాత్ర - గంధతన్మాత్ర ఏర్పడటం జరుగుతోందా? లేదు! తన్మాత్రలన్నీ కూడా చైతన్యము నుండే, చైతన్య రూపంగా చైతన్యమునకు అనన్యమై జనించాయి. అవి చైతన్యరూపములే!

అట్లాగే, ఇప్పుడు ఈ సృష్టి దశయందు కూడా ద్వైత - ఏకత్వములకు క్రొత్తగా స్థానమెక్కడిది? అందుచేత సమష్టి నుండి వ్యష్టి వరకు కూడా చైతన్యమే సర్వపదార్థ రూపముగా వెలయుచున్నది. ఈ ఈ "శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనబడే 5 తన్మాత్రలు స్వప్నమువలె అసత్యములే అయినప్పటికీ... వీటి మూలరూపము చైతన్యమే కాబట్టి... సత్యమువలె అనుభూతమగుచున్నాయి. తేజోరూపము పొందిన సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువులకు ఉత్పత్తి స్థానం అవుతోంది.

ఆ చైతన్యము ఈ ఈ రూపభేదములతోటి ప్రపంచము ఆ చైతన్య మణిదీప తేజమునుండే ప్రసరిస్తోంది. రంగు’ అనే వికారమే ఉండనట్టి ఆకాశమునందు నీలంరంగు కనబడుతోంది చూచావా? అట్లాగే నిర్వికారమగు ఆ తేజోరూప చైతన్యము నుండే రసతన్మాత్ర జనించి జలముగా రూపుదిద్దుకుంటున్నది. అన్నపానాదుల యొక్క మాధుర్య సంవిత్తు' ఆ 'రసతన్మాత్రము’యే సుమా! ఆ హిరణ్యగర్భుడు అనే జీవుడు భవిష్యత్ పదార్థముల గూర్చి సంకల్పించువాడు కదా! సమస్త కార్య - కారణ రూపుడగు ఆతడు ఆ పిమ్మట గంధతన్మాత్రను కల్పించుచున్నాడు. ఆ గంధ తన్మాత్రయే సర్వులకు - సర్వమునకు ఆధారమైన ఈ 'భూమి'కి బీజముగా అగుచున్నది.



Page:641

ఈ విధంగా... ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల సమూహమంతా వాస్తవానికి ఉత్పన్నము కాకయే ఉన్నప్పటికీ... ఉత్పన్నమైన వాటివలె ఉంటున్నాయి. వాస్తవానికి ఇదంతా నిరాకారమే అయినప్పటికీ చైతన్యము యొక్క మాయా విభాగ కల్పనావశం చేత సాకారమువలె అనుభవమగుచున్నది.

చైతన్య రూపమగు ఈ తన్మాత్ర సమూహం కాకతాళీయంగా... ఏ స్థానం నుండి రూపమును ఎరుగుచున్నదో... అదే 'నేత్రం'. ఏ స్థానం నుండి శబ్దమును ఎరుగుచున్నదో... అదే చెవులు’. ఏ స్థానం నుండి స్పర్శను ఎరుగుచున్నదో... అదే 'చర్మేంద్రియం'. ఏ స్థానం నుండి రసము (రుచి)ని ఎరుగుచున్నదో... అదే 'జిహ్వ' (నాలుక). ఏ స్థానం నుండి గంధము (వాసన) ఎరుగుచున్నదో... అదే 'ఘ్రాణేంద్రియం' (ముక్కు).

ఈ విధముగా ఆ తరువాత నియమితమగు ఆకృతి పొందిన ఈ జీవుడు “ఇవి దిక్కులు ఇవి కాలము మొదలైన ఈ ఈ భేదములన్నీ కల్పించుకుంటున్నాడు. ఆతడు వ్యష్టిభావమును పొందినవాడై “నేను ఈ దేహముతో సహావేరు - వీరు ఈ ఈ దేహములతో సహా నాకంటే వేరు వేరు అనే కల్పనను ఆశ్రయించి ఎక్కడి కక్కడ పరిమిత రూపత్వ దోషమును పొందుచున్నాడు. అట్టి "పరిమితరూపత్వదోషము చేతనే... కళ్ళతో చూస్తున్నాడు గాని ఆఘ్రాణించలేకపోతున్నాడు. అదే రీతిగా తదితర వేరువేరు దేహములచే వేరు వేరు భోగ్యములను ఎరుగుటలేదు.

ఓ రామచంద్రా! ఈ విధంగా ప్రతిజీవుని ఆత్మయందు అనంతమైన జగత్తుల కల్పన ఉండియే ఉన్నాయని గమనించు. కళ్ళతో వినలేనట్లే, ఈ జీవుడు నేను ఈ దేహమే పరిమితిగా కలవాడను... అను కల్పనను కాలగతంగా ఆశ్రయించి ఉంటున్నప్పటికీ ఈతని ఆత్మయందు అంతులేని జగత్తులున్నాయని ఈ వివరణ సారముగా అందరూ గ్రహించండి.

ఈ అనంత జగత్తు ఆత్మకంటే వేరు కాదు. ఇదంతా ఆత్మభూతమే అయి ఒప్పుచున్నది. కాబట్టి ఈ ఈ జగత్తులు పరమార్ధమున ఉదయించటమూ లేదు. అస్తమించటమూ లేదు. ఇదంతా కూడా... శిల్పము యొక్క గర్భ ప్రదేశమువలె... సచ్చిదానంద ఘనమగు మౌనరూపంగానే స్థితినొంది ఉన్నది.

“చైతన్యము” అనే మణి నుండి అనుక్షణికంగా ప్రసరిస్తున్న కాంతిపుంజములే ఈ జీవులు జగత్తులు - - బ్రహ్మాండములు - తన్మాత్రలు - దేహములు - భావములు - సుఖదుఃఖములు - జ్ఞానాజ్ఞానములు వగైరా! ఇందులో ప్రతి ఒక్క జీవుడు చైతన్య రూపమగు మణి అయి మణి, దీపన్యాయము అనే తాత్త్విక స్థితి అవధరించియే ఉన్నాడు. అట్లాగే, సర్వాత్మకమగు చిత్ చైతన్యమణి కాంతిపుంజము కూడా అయి ఉన్నాడు!

Page:642

12. జీవో బ్రహ్మేతి నా పరః

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీకు ఇంతవరకూ కూడా శుద్ధ చైతన్యము హిరణ్యగర్భ చైతన్యము, సమష్టి తత్త్వములైన ఆకాశ - వాయు - - తేజములు, అద్దాని అంగములైన శబ్ద - స్పర్శ

- - రూప - రస -గంధ తన్మాత్రలు, వాటి నుండి ఉదయించిన జీవుడు, ఆ జీవునిచే కల్పించబడిన దిక్ సత్త - కాల సత్తలు ... ఈ ఈ వరుస క్రమమంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఈ జీవుడు పరబ్రహ్మము కంటే వేరుకాదు అని నిరూపించటానికి ప్రారంభ పరిచయంగా అవి చెప్పాను. అంతేగాని "ఈ జీవునికి ఉత్పత్తి - వినాశనాలు ఉన్నాయి... అని చెప్పే ఉద్దేశంతో చెప్పినవి కావు. ఈ విధంగా "ఆత్మ యొక్క అకృత్రిమ అవయవరూపుడు - విషయాభిముఖుడు" అగు అద్దానిని చిదాభాసుడు అని పరమాత్మ యొక్క అంశరూపుడు అని పిలుస్తున్నారు.

ఆ చిదాభానుడే జీవుడు" అనే పేరుతో కూడా పిలువబడుచున్నాడు. ఆ చిదాభాసునికే అనేక పేర్లు...!

జీవనము (ప్రాణము), కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ధరించటం చేత “జీవుడు” అని; విషయాభిముఖుడై ఉండటంచేత 'చిత్తము' అని; ఆయా విషయములు ఎరుగుచుండుటచే 'చిత్' (ఎరుక) రూపుడు అని; ఇది ఇట్టిది కదా! అనే బోధ కలిగియుండటం చేత బుద్ధి అని; సంకల్పించటంచే, ఊహ-అపోహలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటంచేత “మనస్సు” అని; 'నేను' ఉన్నాను అనే అభిమానపూర్వకమైన వృత్తితో కూడి ఉండటం చేత అహంకారము అని; చైతన్య పరిపూర్ణమగు ఆత్మ వస్తుస్వరూపుడే అయి ఉండటంచేత చిత్స్వరూపుడు అని; దృఢమైన సంకల్ప సమూహముచే పూరితుడై ఉండటం చేత పుర్యష్టకము అని; సృష్ట్యాదికాలంలో ప్రథమంగా (ప్రకృతిరూపుడై) విద్యమానుడై ఉండటం చేత ప్రకృతి" అని; ఉపాధిపరుడై ఉండటంచేత ఔపాధికుడు" అని; తత్త్వజ్ఞానం విషయంలో ఏమరచి ఉండటం చేత (అవిద్యమానుడై ఉండటం చేత) అవిద్యా స్వరూపుడు" అని... ఈ విధంగా శాస్త్రములచేత, శాస్త్రకారులచేత ‘చైతన్యమణి’ అనతగు కేవల చిత్ స్వరూపుడగు ఈ వ్యష్టి రూపుడు 'చిదాభాసుడు' అని, 'జీవుడు' అని వర్ణించి చెప్పబడుచున్నాడు.

అయితే... ఈ జీవుడు వాస్తవానికి నిరాకారుడు, నిర్వికారస్వరూపుడు. కాని, తన లింగ శరీరము యొక్క కల్పనచే నాకు ఆద్యంతాలు ఉన్నాయి"... అని భ్రమను ఆశ్రయించి ఉంటున్నాడు. అట్లాగే స్వప్నము - సంకల్ప నగరము - వంటిదే ఈ త్రిలోకములతో కూడిన జగత్తు కూడా! భ్రమరూపమగు ఈ త్రైలోక్య జగత్తు అర్థ క్రియా సమర్థమై ఉన్నప్పటికీ కూడా... వాస్తవానికి ఇది శరీర రహితము, పదార్థ శూన్యము, నిరాకారము అయి భాసిస్తోంది.

కాబట్టి ఓ సర్వ సభికులారా! ఈ లింగ శరీరం (సూక్ష్మ శరీరం) చిదాకాశమే! ఈ చిత్త శరీరం వాస్తవానికి ఆకాశం కంటే కూడా అత్యంత శూన్యం! అయితే ఈ చిత్త శరీరమే 14 లోకములకు ఉత్పత్తి స్థానం. అట్టి ఈ 'చిత్త శరీరం' ఉదయించటమూ లేదు, అస్తమించటమూ

Page:643

అద్దము తనయందు ప్రతిబింబమును ధరిస్తుంది కదా! అట్లాగే ఈ చిత్తదేహము బాహ్య - అభ్యంతరములలో అనేక జగత్తులు ధరించి ఉంటోంది. అయినప్పటికీ కూడా... అది ఆకాశములె 'శూన్యరూపమే’ అయివున్నది. "ప్రాకృత ప్రళయం అనబడే మహాకల్పము యొక్క అంతిమ క్షణంలో సర్వదృశ్యము సర్వనాశనమునకు సంసిద్ధమగుచున్నది. అప్పుడిక నిర్వికారమగు బ్రహ్మాత్మపదము మాత్రమే శేషించబోవు క్షణాలలో... మరల చైతన్యమున, శుద్ధచిత్స్వరూపమును కొంచెము కప్పిపుచ్చు అజ్ఞానం’ చేత, చిదాకాశము స్వయంగా (ఇంతకు ముందు చెప్పిన క్రమంలో) సూక్ష్మ శరీరమును కల్పిస్తోంది. అట్టి బ్రహ్మము యొక్క ఒకానొక స్వల్ప విభాగము 'జీవ రూపము' అగు సూక్ష్మ శరీరమును ధారణ చేస్తోంది. జగత్తును అవలోకించటం అనే ఒకానొక ప్రకాశమును కలిగి ఉంటోంది. అద్దానికే "బ్రహ్మదేవుడు అని, 'విరాట్టు' అని శాస్త్రములు పేరు పెట్టాయి. అట్టి సూక్ష్మరూపుడగు పరమాత్మ యొక్క ఒకానొక విభాగమును సనాతన పురుషుడు" అని, వేరొక విభాగమును శ్రీమన్నారాయణుడు అని, మరొక విభాగమును ప్రజాపతి అని శాస్త్ర పురాణ ఇతిహాస ద్రష్టలు పేర్లు పెట్టడం జరుగుతోంది. ఈ 'జీవుడు' అనబడేవాడు కూడా బ్రహ్మము యొక్క విభాగమే అయి, బ్రహ్మమునకు అద్వితీయుడై ఉన్నాడు. అనన్యమై ఉన్నాడు.

ఓ రామచంద్రా! ఈ దృశ్యమంతా కాకతాళీయ న్యాయం చేతనే ఏర్పడి ఉంటోంది. కాకతాళీయ న్యాయముచే ఏఏ విభాగమందు ఏఏ ప్రకారంగా పంచేంద్రియ సంవిత్తులు భాసిస్తున్నాయో... ఆ ప్రకారంగానే ఇంద్రియార్థములు, ఇంద్రియ విషయములు స్థితినొంది ఉంటున్నాయి. ఈ ప్రకారంగా ఈ విశాల దృశ్యము పొందబడుచున్నప్పటికీ... ఇదంతా స్వస్వరూపమునకు అనన్యమే అయివుండటం చేత... వాస్తవానికి ఇది పొందబడకయే ఉన్నది. సూర్య కిరణాలు ఆయా ఆకారాదుల ద్వారా ప్రసరించి, ఆయా 'కిటికీ ద్వారము' వంటి ఆకారములు పొందుచున్నప్పటికీ వాస్తవానికి సూర్య కిరణాలు ఏ ఆకారమూ పొందటమే లేదు కదా! సర్వత్రా వ్యాప్తమైయున్న ఆత్మతత్త్వము సర్వదృశ్య శూన్యమే అయి వెలయుచున్నది. ఆద్యంతరహితమగు పరబ్రహ్మము సత్తు కాదు. అసత్తు కాదు. అయితే, అదియే సర్వరూప సాక్షాత్కారము - సర్వరూప సాక్షాత్కార రహితము అయి... ఇట్లు సత్ - అసత్ రూప జగదాకారంగా స్థితినొందియున్నది.

ఓ రామచంద్రా! స్త్రీ సంగమధ్యాస కలవానికి కలలో స్త్రీ కనబడుతుంది చూచావా? అట్లాగే సూక్ష్మశరీర రూపుడగు ఆ బ్రహ్మదేవుని అనుభవముచే... ఆతని సంకల్పమే స్వయంగా ఇట్లు జగత్ రూపంగా పరిపుష్టమై ఉంటోంది. స్వప్నంలో కనబడేదంతా ఆకార రహితమే అయినప్పటికీ ... చెట్లు, గృహాలు, గ్రామాలు, పట్టణాలు, అయినవాళ్ళు, కానివాళ్ళు - - ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ‘ఊహ’ అనే సంకల్పలోకంలో ఆ ఊహననుసరించి మిత్రుల ముఖాలు, ఇష్టమైన పదార్థాలు, ప్రదేశాలు (ఆ ఊహలో) అగుపిస్తాయి కదా!

Page:644

ఈ 'జాగ్రత్' నందు కూడా ఈ నిజదేహము ఈ జగత్తు కూడా వాస్తవానికి ఆకార రహితమే అయినప్పటికీ (ఒక ఊహయందువలె) అనుభూతం అవుతున్నాయి.

ఆ చిదాకాశము నిరాకారమై, పదార్థశూన్యమై ఉన్నప్పటికీ... స్వప్న జగత్తులాగానే అర్థక్రియా సమర్థమగుచున్నది. కఠినమైన ఆకారం కలిగి ఉంటోంది. ఇంతెందుకూ? ఈ జీవుని రూపమే అందుకు మనకు సుస్పష్టమైన దృష్టాంతం. ఈ జీవుడు స్థూలరూపంగా కనిపిస్తున్నాడు కదా! అయితే, ఈతనికి సూక్ష్మ శరీరం అనేది సుస్పష్టమే కదా! దేహానికి రూపముండవచ్చు! సూక్ష్మశరీరము ఏ ఆకారం? స్థూల - సూక్ష్మ దేహాల అనుభవం పొందే ఈ అనుభవమునకు ఆకారమెక్కడున్నది? అట్టి సూక్ష్మ శరీరరూపుడగు ఈ జీవుడు "నిరాకార శూన్య స్వరూపుడు - - స్వప్న సదృశుడు అయిన ప్పటికీ స్వయముగా - క్రమంగా ఆకారమును పొంది అద్దానిని అనుభవిస్తున్నాడు.

'సూక్ష్మ శరీరరూపుడు’ అయినట్టి ఈ జీవుడు ఈ 'స్థూల దేహము'ను కల్పించుకొనుచున్నాడు. ఇక ఈ స్థూలదేహం ఎముకల అమరికచే ఆకారము పొందినదై, కాళ్ళు - చేతులు కలిగియున్నదై వెంట్రుకలు - గోళ్ళు - మాంసము - చర్మములతో కూడినదై ఈ ఆకారము కలిగివుంటోంది. అట్టి ఈ దేహమునందు... జన్మ - కర్మల అనుభవం పొందుచున్నాడు. దేహం వయస్సునుబట్టి పరిణామ స్థితిని పొందుచున్నాడు. దేశ కాలముల విస్తారముతో కూడిన అనేక కాలగత అనుభవాలను కలిగి ఉంటున్నాడు.

పదార్థముల భోగము కొరకై అనేక ఊహ - అపోహలతో కూడిన భ్రమ పరంపరలను రచించుకొంటున్నాడు. వార్ధక్య - మరణాలను, అనేక గుణదోషములను ధరించినవాడై ఉంటున్నాడు. దశదిక్కులా సంచరిస్తూ 'నాది - నీది' మొదలైన అనేక హావ - భావ - అభావములు చమత్కారంగా కలిగి ఉంటున్నాడు. జ్ఞాతృ జ్ఞాన - జ్ఞేయములు అనే త్రిపుటిని చేతిలో ధరించి ఇక్కడ సంచరిస్తున్నాడు. అనేక పదార్థముల జ్ఞానమును సముపార్జించి... వాటి వాటి ఆది మధ్య - అంతముల పట్ల హర్ష - దుఃఖములను పెంపొందించుకొని కాలమును వెళ్ళబుచ్చుచున్నాడు.

ఈ తరువాత ఏమిటి? - ఇంతకు ముందు ఏమిటి?" అన్న ప్రశ్నకు పరిమితమైన దృష్టులతో పరిమిత అవగాహన కావించుకొని ఈ బొమికలు - రక్తము మాంసము చర్మములతో కూడిన ఈ ఆకారమే నాది .... అని తలచి ఈ జగత్తును దర్శిస్తూ "ఇంతకుమించి ఈ జగత్తు లేదు. ఇద్దానికి వేరుగా నేనూ లేను. ఇంకేదీ ఎక్కడా లేదు అని తలచుచు దృశ్యబద్ధుడు’ అగుచున్నాడు.

ఓ రామచంద్రా! ఈ విధంగా సనాతన పురుషుడగు పరమాత్మ సూక్ష్మ దేహరూపత్వము పొందినవాడై 'మనో - బుద్ధి బుద్ది - - చిత్త చిత్త - అహంకారాలు' అనే చతుర్ముఖములు కలవాడై వ్యష్టి - సమష్టి - స్థూలదేహము” లను నిర్మించుకొంటున్నాడు. వాటి నిమిత్తమై స్వయంగా పృథివి

- ఆకాశ జల - సూర్య - జన సమూహ - నగర వ్యవహార - శిఖర ..... ఆదిగాగల అనేక

పదార్థ రూపుడగుచున్నాడు.

Page:645

“ఈ కనబడే జగత్ పదార్థములే నాకు ఆధారములు. నేను వీటి యొక్క అధేయుడను.” ఇటువంటి భ్రాంతిమయ సంసారమును గాంచుచు తన స్వస్వరూపమును తానే ఏమరచి తిరుగాడుచున్నాడు.

13. అద్వయ బ్రహ్మమునందు దృశ్యము అసంభవం

శ్రీ వసిష్ఠ మహర్షి : చూచావా రామచంద్రా! ఈ దృశ్యము కల్పన చేతనే ఏర్పడి, కల్పన చేతనే అనుభవమగుచున్నది. అనగా ఇద్దాని యొక్క సృష్టి కర్తయగు ఆది ప్రజాపతి బ్రహ్మదేవుడు (ఆది స్రష్ట - ఆది ద్రష్ట) - దృశ్యమును అనుభూతమొనర్చుకొనే ఈ 'జీవుడు' అనే ద్రష్ట... ఈ ఇద్దరూ కూడా తమ స్వకీయ కల్పనల మేళనము చేతనే దృశ్య సమన్వితము అయిన ఈ జగత్తును తయారు చేసినవారగుచున్నారు. ఇంకా చెప్పాలంటే ... “ఆది ప్రజాపతి (సృష్టికి ఆదియందు ఉన్నవాడై ఈ జగత్ కల్పనకు కారకుడగు బ్రహ్మదేవుడు) తనయొక్క మహాసూక్ష్మ శరీరము (చతుర్ముఖ శరీరము -మనో-బుద్ధి-చిత్త-అహంకారములు) యొక్క విస్తారం చేతను, సత్య సంకల్పమగు తనయొక్క సంవిత్స్వభావము చేతను కాకతాళీయ న్యాయంచే.... దీనికి కారకుడై ఉంటున్నాడు. అట్టి ఆదిప్రజాపతిచే ఏది ఏ రీతిగా కాకతాళీయంగా సంకల్పించబడిందో... అది ఆ రీతిగానే చిరకాలం స్థితిని పొందినదగుచున్నది. ఆహా! ఆశ్చర్యమే మరి! ఎందుకంటే... అట్టి సంవిత్తు యొక్క సంకల్ప మాత్రం చేతనే ఈ జగత్తు భాసిస్తోంది. ఇక "ఇట్టి జగత్తు సత్యము కాదు... అని అనటంలో ఆశ్చర్యమేమున్నది? ఊహచే, కల్పనచే రచించబడింది సత్యమెట్లా అవుతుంది?

ఒకడు రచించిన కథలోని ఒక రాజుగారికి ఇద్దరు భార్యలు. ఒక రోజు ఐదుగురితో వ్యాహ్యాళికి బయలుదేరాడు అనే వాక్యం చదివి, ఇప్పుడు రాజుగారికి ఇద్దరు భార్యలా? ఐదుగురు భార్యలా? ఏది సత్యం? ఏది కాదు?... అనునది ఎటువంటి సత్యాన్వేషణయో... ఈ జగత్తు యొక్క సత్యాసత్యములు అట్టివే! మొదలు రాజుగారు - భార్యలు, అనునదే కల్పన కదా! ఇక ఆపై చర్చించటం, వాదించటం కల్పనా వ్యవహారములు కాక మరింకేమిటి? ఈ "ద్రష్ట - దర్శనము దృశ్యము... అనే మూడింటి సంయోగమైనట్టి త్రిపుటి మొదలే అసత్యమైయున్నది. లేదా... అధిష్ఠాన రూపముచేత... ఈ సమస్తమూ కూడా 'వ్యాపక బ్రహ్మమే కనుక... ఇవన్నీ సత్యములే! అందుచేతనే, ఇది సత్యమే... అనుకున్న వారికి ఇదంతా ఘనీభూత సత్యంగాను, “భ్రమయే” అనుకునే వారికి 'కేవలం భ్రమ’గాను ఈ దృశ్యమంతా అవగతం అవుతోంది.

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ సృష్టి అంతా 'ఆది ప్రజాపతి' ఊహా (సంకల్ప) నిర్మితమైన సూక్ష్మ శరీరమేనని మనం కాసేపు అనుకుందాం. అట్టి సూక్ష్మ శరీరము సంకల్ప మాత్రము - భ్రాంతిమయము కదా! అంతా భ్రాంతిమయమే అయినప్పుడు మరి ఈ కొండలు - నేల కఠినంగా ఎట్లా కనబడుచున్నాయి? నదులు, నగరాలు... ఇవన్నీ ద్రవరూపంగా ఎందుకు అనుభవ

Page:646

మౌతున్నాయి? ఇవన్నీ కూడా ఘనీభూత రూపంగా వస్తురూపంగా ఎట్లా అగుచున్నాయి? నేను ఒక కొండగుహను ఊహిస్తే, ఆ కొండగుహ నాకు ఎదురుగా కనిపించగా... అందులో ప్రవేశించి పచార్లు చేయగలనా? కుదరదు కదా? స్వప్న పదార్థములు సత్యత్వం పొందటం, క్రియాసమర్థం అవటం ఎట్లా జరుగుతుంది? కాని, ఈ జాగ్రత్ జగత్తులో అన్నీ క్రియాసమర్థమై ఉంటున్నాయి కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : ఇందులో ఆశ్చర్యమేమున్నది? సూక్ష్మ శరీరసంకల్పము నిరంతరము ఎడతెగకుండా స్వయంగా అనుభూతమగుచు, ఆదియే చిరకాలాభ్యాసముచే ఘనీభూతమైనదానివలె భాసిస్తోంది. ఐందవుల చిరకాల మనో అభ్యాసమే బ్రహ్మాండముల రూపం పొందలేదా? హరిశ్చంద్రుని సుదీర్ఘ స్వప్నమే ఆతనికి ఘనీభూతమై భౌతిక రూపంగా (శ్మశాన దృశ్యము మొదలైనవిగా) కనిపించలేదా? స్వప్నం కూడా చిరకాలాభ్యాసంచేత పరిపుష్టి పొంది అతి సత్యముగా అనుభవమవటం మనం మన ఈ సంవాదములో అనేక చరిత్రలలో గమనించాం కదా! అట్లాగే సూక్ష్మ శరీరము యొక్క సంకల్ప వ్యవహారం చిరకాలపు అభ్యాసం చేత 'సత్యమే' అన్నట్లుగాను, ఘనీభూతమైనట్లుగాను కనిపిస్తోంది. అట్టి సూక్ష్మ శరీరం యొక్క చిరకాల అనుభవంలో 'స్థూలత్వ బుద్ధి' జనించటం... మృగతృష్ణలో జలతరంగాలు కనిపించటం వంటిదే!

స్వప్న భ్రమ వలె, మృగతృష్ణాజలం వలె స్థితి నొంది ఉన్నట్టి ఈ జగత్తు సత్యమే” అనే విశ్వాసము కలిగించుచు భాసించవచ్చుగాక! కానీ ఇది 'అసత్యమే' అయివున్నది. ఇవన్నీ స్థూలంగా కనిపిస్తున్నప్పటికీ ... వాస్తవానికి ... ఈ వస్తుజాలము సూక్ష్మతత్త్వరూపములే అయివున్నాయి. సూక్ష్మ - సంకల్పమయ పదార్థములకు స్థూలత్వం అత్యంత అసత్యమే అయినప్పటికీ కూడా... అవివేకులు ఇద్దానియందు స్థూలత్వం స్వకీయమైన ఊహ కల్పించుకొని, తన్మయులై... తమ ఆసక్తిచే... ఆ స్థూలత్వమును స్వీకరిస్తున్నారు. ఇవి శరీరములు - ఇది నా శరీరం - అది వాడి శరీరం - ఇది నేను ఇది ఈతడు - వీరు నాకంటే వేరు - ఇది భూమి - - అది

ఆకాశము వీరు నా పుత్రులు - వారు నా సోదరుని పుత్రులు - వీళ్లేమో వేరే వారు - అది

పర్వతం - అవి దిక్కులు” ఈ విధంగా స్వప్నంలో ప్రకాశమానమయ్యే వస్తుజాలంలాగా, ఈ .

జగత్ రూపమైనటువంటి "మిథ్యాభ్రమ అంతా భాసిస్తోంది. అనగా... ఆది స్రష్ట అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క సూక్ష్మ శరీరము చిరకాలమైన దృఢాభ్యాసంచేత తన యందు తానే స్థూలత్వమును, ఈ పిండాకారమైన (స్థూలాకారమైన) భూమి - చెట్లు - - కొండలు మొదలైన రూపమును గాంచుచున్నది. చిదాకాశమే నేను బ్రహ్మమును... అను తనయొక్క యథార్థ స్వస్వరూపమును ఏమరచినదై, 'కల్పన'ను అనుసరించినదై ఈ మనుష్యుడు మొదలైన దేహమే నేను. ఈ భూమి మొదలైనవే నాకు ఆధారం”... అని... ఈ విధంగా గాంచటం యందు ఆసక్తిని కలిగి ఉంటోంది.

ఓ ప్రియ సభికులారా! అసత్యములు అయినట్టి ఈ శరీరము మొదలైనవాటి యందు ఇవే నాకు సంబంధించిన సత్యం. ఇవి లేకపోయాయా... ఇక నా గతి చెప్పలేను”... అను రూపంగా

Page:647

ఈ జీవుడు వాటిపట్ల సత్యబుద్ధితో కూడిన భావన కలిగి ఉంటున్నాడు. అట్టి భావనకు బద్ధుడగుచున్నాడు. అద్దానిని అనుసరిస్తూ అట్లే సుదీర్ఘకాలం దేహపురములలో మహాప్రయాణం కొనసాగించుచున్నాడు.

మొట్టమొదట ఆదిపురుషుడు ఆది ప్రజాపతి అగు బ్రహ్మదేవుడు శబ్ద స్వరూపుడై వైదిక - లౌకిక శబ్దములను సృజించుచున్నాడు. అటు తరువాత వాని యొక్క ఆయా ఉపాధివంతములైన అర్థములందు సంకేతముల ద్వారా సంజ్ఞలను రచిస్తున్నాడు. “ఓం అని ఉచ్చరించి ఆ తరువాత శబ్దరాశి భూతములైన 'వేదములు' రచన చేస్తున్నాడు. ఆ వేదశబ్దములచే శీఘ్రంగా ఈ ప్రపంచ వ్యవహారమంతా కల్పించుచున్నాడు. అంతా మనోకల్పనయే సుమా! ఈ మనస్సు దేనిని కల్పించుచున్నదో... అద్దానితో తన్మయమగుచున్నది. ఎవడు దేనియందు తన్మయుడౌతాడో... ఆతడు అద్దానిని దర్శించకుండా ఎందుకుంటాడు? ఈ విధంగా ఈ జగత్ భ్రాంతి అసత్యమే అయినప్పటికీ ...ఇదంతా దృఢత్వం పొందినదై ఉంటోంది. బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గులకరాయి వరకు ఈ జగత్తంతా కూడా చిరకాల స్వప్నము - ఇంద్రజాలములవలె మిథ్యగానే భాసించుచున్నది. ఇక ఇందలి స్థూలత్వమంటావా? సూక్ష్మ దేహము యొక్క స్థూలత్వము దృఢ సంకల్పము యొక్క పర్యవసానమే ఇదంతా అయివున్నది.

వాస్తవానికి 'స్థూలత్వం’ అనేదేదీ ఎక్కడా కూడా కించిత్ కూడా లేనేలేదు. సూక్ష్మ రూపమే అభ్యాసముచే ఇట్టి స్థూలత్వభావనను పొందుతోంది. మిథ్యానుభవాత్మకం అయినట్టి ఈ జగత్తు యొక్క స్థూలత్వ రూపమంతా కూడా... మోహమునకు మూలరూపుడైనటువంటి 'ఆదిస్రష్ట' యగు బ్రహ్మదేవుని వద్దనుండే వచ్చింది సుమా! అందుచేత తత్త్వవేత్తకు కూడా 'జగత్ దర్శనము' అనే భ్రమ ప్రారబ్ధ క్షయం అయ్యేవరకు ఉండియే ఉంటోంది. అయితే... రామచంద్రా! చిదేకరసరూపము అగు బ్రహ్మమునకు 'జగద్రూపము' అనే దశ ఎట్లా ఉంటుందయ్యా? లేదు. ఈ సమస్త జగత్తు కూడా స్వప్న ద్రష్ట యొక్క స్వప్న సామ్రాజ్యంలాగా భ్రాంతి మాత్రమే అయివున్నది. లేదా... బ్రహ్మమే లీలార్థం 'నిజశక్తి'చే జగత్తు - జీవుడు మొదలైన ఈ రూపములుగా భాసించుచున్నదని అనక తప్పదు.

నిర్మలము - - శాశ్వతము అగు బ్రహ్మము కంటే వేరుగా ఇట్టి జగత్తుకు మరొక కారణమేదీ లేనేలేదు. కార్యమే లేనపుడు కారణం ఎక్కడి నుండి వస్తుంది? నిర్వికారము - కూటస్థము -

చిదానందము - అద్వయముఅద్వయము” - అగు బ్రహ్మమునందు కార్య - కారణాలు ఎట్లా సంభవిస్తాయి? కాబట్టి ఈ జగదాకారములుగా కనిపించేది దృష్టి యొక్క భ్రాంతియేగాని బ్రహ్మము సాకార జగత్తుగా అగుచుండటం కాదు. కనుక, ఈ జగత్తు ఈ వస్తు గుణ సాకారాదుల దృష్ట్యా సత్యము కాదు. పరబ్రహ్మముగా పరమ సత్యమూ, అత్యంత మాధుర్యమూ కూడా!

Page:648

XIII. రామ పరిప్రశ్న

1. భ్రమ తొలగినప్పుడు అంతా బ్రహ్మమే!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్తును విజ్ఞులు రెండు భాగాలుగా విభజించారు. అట్లా విభాగించి దర్శించటమే యోగం గాను, జగత్తును బ్రహ్మ రూపంగా గాంచగలుగు ఉపాయం గాను చెప్పబడుతోంది. 1. తెలుసుకుంటున్నది (జ్ఞానము), 2. తెలియబడుచున్నది (జ్ఞేయము)... ఈ రెండింటి యొక్క అవినాభావ సంబంధమే జగత్తు. అట్టి ఈ జగత్తు భ్రమయే అయివున్నది. అట్టి జగత్ భ్రమ తొలగటమే దివ్యౌషధ రూపమైన ఉపాయం.

జ్ఞానము యొక్క 'జ్ఞేయ రూపత్వ ప్రాప్తి'యే బంధం! (జ్ఞేయము- జగద్ విషయాలు) అట్టి జ్ఞేయ రూపత్వం (జగత్ విషయాల) సశాంతించటమే ... కేవల జ్ఞాన రూపస్థితి" - అయివున్నది. అట్టి కేవల జ్ఞానరూపస్థితియే 'మోక్షము' - అని చెప్పబడుతోంది. ఇంతకు మించి మోక్షము’ అనబడేదానికి వేరే ఏ అర్థమూ లేదు.

శ్రీరాముడు : మహాత్మా! జ్ఞానం యొక్క విషయ రూపత్వమే జ్ఞేయం కదా! అట్టి "విషయ రూపత్వం అనే దోషం తొలగేది ఎట్లా? ఎందుకంటే జ్ఞేయత్వం అనేది దృఢంగా అభ్యస్తమై ఉన్నది కదా! విషయత్వ బుద్ధి అనేది ‘తొలగవయ్యా బాబూ' అంటే కూడా తొలగటం లేదే! అది నివర్తించేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : అట్టి "విషయరూపత్వ భ్రాంతి" తొలగాలంటే సమ్యక్ జ్ఞాన ప్రబోధమే ఉపాయం. “నాకు వేర్వేరుగా కనిపిస్తున్నదంతా అనేక బొమ్మలలోని మట్టిలాగా, అనేక ఆకారములైన ఆభరణములలోని బంగారంలాగా ఏకమేగాని, అనేకం కాదు. అనన్యమై ఉన్న పరమాత్మ రూపమే ఇది. ఈ జగత్తుకు ఆధారము - - ఆధేయము కూడా అదియే... అను దర్శనమే సమ్యక్ జ్ఞాన ప్రబోధం. అయితే అట్టి ప్రబోధం కలగాలంటే... శమము, దమము, ఈశ్వర ప్రణిధానము, భక్తి మొదలైన సాధనలు తీవ్రంగా అభ్యసించాలి. సశాస్త్రీయంగా అట్లా అభ్యసిస్తూ ఉండగా అట్టి శాస్త్ర గురుబోధిత సాధనముల క్రమము చేత సమ్యక్ జ్ఞాన ప్రబోధం కలుగుతోంది. అప్పుడు ఈ విషయరూపత్వ భ్రాంతి స్వయంగా వైదొలగుతోంది. భ్రాంతి నశించడంచేత, ఇకప్పుడు నిరాకారము, సత్యము, శాంతము అయినట్టి ఆత్మస్వరూప ప్రాప్తి అనబడే ముక్తి స్వయంగా ప్రవర్తించుచున్నది. “అంతా - అన్నిటా నేనే - నాయందే అనే అనుభూతి - సమ్యక్ జ్ఞానం స్వయంగా సిద్ధిస్తోంది. శ్రీరాముడు : మహర్షీ! దేనిచే ఈ జీవుడు ఇక సర్వదా బంధవిముక్తుడు అవుతాడో... అట్టి నిర్మల బోధస్వరూపమగు "సమ్యక్ జ్ఞానసిద్ధి"... అనగా ఏమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : "సమ్యక్ జ్ఞానం అనగా అభ్యంతరమందలి ఒకానొక సునిశ్చితరూపమే సుమా!

Page:649

జ్ఞానము అనబడు నిర్మల స్వస్వరూప సంస్థానమునకు విషయత్వ రూపమైన జ్ఞేయము (తెలియబడేది) అనబడే దోషమే లేదు. జ్ఞాన స్వరూపుడను నేను. (తెలుసుకొనుటయే స్వరూపముగా కలవాడను).‘తెలుసుకొనుట' అనే విశేషముగా గల నా యొక్క జ్ఞానరూపమునకు తెలియబడేది ఎట్లా దోషపూరితం చేయగలుగుతుంది? సూర్య కిరణం ఏదైనా వస్తువుపై ప్రసరించినంత మాత్రం చేత సూర్య కిరణానికి ఆ వస్తుదోషాలు అంటవు కదా! సూర్యుడు సూర్యకిరణ స్వరూపుడు కదా! జ్ఞాన కిరణ స్వరూపుడనగు నాకు తెలియబడే విషయముల దోషము అంటగలిగే ప్రసక్తే లేదు.

తెలియబడేది ఎట్లా అయినా ఉండవచ్చు. లేదా, అసలు ఉండకయే పోవచ్చుగాక! నేను సర్వదా నిర్మల జ్ఞాన (తెలివి) స్వరూపుడనే! నాతో సహా ఈ సర్వద్రష్టలు నిర్మల (జ్ఞేయరహిత) జ్ఞాన స్వరూపులే! ఈ ప్రకారమైన అభ్యంతర దృఢనిశ్చయమే “సమ్యక్ జ్ఞానం”... అని చెప్పబడుతోంది. శ్రీరాముడు : మునీంద్రా! చిదేకరసము - కేవల జ్ఞాన స్వరూపము అగు ఆత్మయందు అందుకు భిన్నమైన ఈ "జ్ఞేయము (తెలియబడేది) అనబడేది ఎట్లా, ఎక్కడి నుండి వచ్చింది?

జ్ఞానస్య జ్ఞేయతా భిన్నత్వన్తః కేతి, మునే! వద!

ఉత్పాద్యో జ్ఞాన శబ్దశ్చ భావే వా కరణేథ కిమ్?

జ్ఞానము అనే శబ్దము యొక్క వ్యుత్పత్తి జ్ఞప్తి. అనగా జ్ఞప్తి మాత్రమగు చైతన్యమే జ్ఞానము ...అని కదా! జ్ఞప్తి మాత్ర చైతన్యమే జ్ఞానమా? లేక, దేనిచే ఎరుగబడుచున్నదో... అది జ్ఞానమా? (జ్ఞాయతే అనే నేతి జ్ఞానమ్) ఓ మహర్షీ! జ్ఞానమంటే జ్ఞప్తియా? దేనిచే తదితరమైనదంతా తెలుస్తోందో... అట్టి తెలివియా?

శ్రీ వసిష్ఠ మహర్షి : "జ్ఞానము అనే శబ్దము యొక్క వ్యుత్పత్తి గురించి విను. భావము సాధనముగా అయినప్పటి బోధ రూపమే 'జ్ఞానం'. ఇక తెలియబడేది అనబడునది కూడా భావసాధకమే (భావనచే పొందబడేదే) కదా! ఈ దృశ్యం యొక్క రూపము జ్ఞానము యొక్క మాయచే వికల్పమైనదే! కాబట్టి వాస్తవానికి జ్ఞానము (తెలుసుకోవటం) - జ్ఞేయము (తెలియబడేది) అనే రెండు శబ్దములకు భేదమేమీ లేనేలేదు. జ్ఞానమునకు వేరుగా జ్ఞేయం లేనే లేదు.

శ్రీరాముడు : మహాత్మా! సరే! "జ్ఞేయరూపమగు ఈ దృశ్యము వాస్తవానికి మొదలే లేదు కొంతసేపు అనుకుందాం. అయితే కుందేటి కొమ్ములాగా ఈ దృశ్యము, ఈ రూప భ్రమ అసలు ఎట్లా సిద్ధించింది? పైగా, ఇదంతా ప్రత్యక్ష ప్రమాణములచేత, భూత - వర్తమాన వర్తమాన - భవిష్యత్ విభాగముల చేత ... అత్యంత నిర్దుష్టంగా వ్యవహార సమర్థమై ఎట్లా ఇక్కడ కనబడుతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి : (పక పకా నవ్వుచూ) ఓ రామచంద్రా! దృష్టి యొక్క బాహ్య వ్యవహార భ్రాంతిని అనుసరించే ఇక్కడ విషయాకార బుద్ధి రూపంగా ఇదంతా ఇట్లు (నామరూపాత్మకంగా అనిపిస్తోంది. దృష్టికి దృశ్యం నామరూపాత్మకంగా అభ్యాసవశం చేత అనిపించటమే 'జగత్తు'. అదే 'సంసారము'. అట్లా అనిపించటానికి వేరుగా జగత్తు ఎక్కడా లేదు. ఎందుకంటావా? వాస్తవానికి బాహ్యమునగాని, అభ్యంతరమున గాని ఆత్మకంటే భిన్నంగా ఏ పదార్థమూ ఎక్కడా సంభవించజాలదు.

Page:650

శ్రీరాముడు : మునీంద్రా! ఈ ఎదురుగా 'నీవు-నేను' మొదలైనవి కనబడుచున్నాయి. జీవుడు, శరీరము, భూమి, ఆకాశం, పుట్టుక, చావు, బాల్యము, యౌవనము, వార్ధక్యము, కొండలు, సముద్రాలు మొదలైనవన్నీ ఎదురుగుండా ప్రత్యక్షంగా అనుభవమగుచుండగా... ఈ జగత్తు లేదు - అనునది ఎట్లా యుక్తియుక్తం? ప్రత్యక్షము - అనుభవ సిద్దము అగుదాని పట్ల ఇవి లేవు అనే సిద్ధాంతం ఎట్లా కుదురుతుందో చెప్పండి? ఎదురుగా కనబడేవాటిని ‘లేవు’ అనుకుంటే

మాత్రం ఏం ప్రయోజనం?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మొట్టమొదట ఆత్మయే కలదు. అట్టి కేవలాత్మలో విరాడ్రూపం మొదలుగా గల పదార్థములేవీ మొదలే ఉత్పన్నములయి ఉండలేదు. అట్లాగే ఇప్పుడు కూడా ఏ పదార్ధము ఉత్పన్నమయి, (వాస్తవానికి) లేవు. కాబట్టి జ్ఞేయము (తెలియబడేది) అనే దృశ్య జగత్తు ఏమాత్రం సంభవించదు. దృష్టాంతంగా... ఒక చోట మూడు కుందేళ్ళు వేటగాడిని చూచి పరుగు లంకించుకున్నాయి. అవి అల్లంత దూరంగా పరుగులు తీస్తూ ఉండగా వెనుక నుండి పరిగెత్తే ఆ వేటగానికి ఆ 3 కుందేళ్ళ చెవులు నిక్కబొడుచుకొని కొమ్ములవలె కనిపించాయి. ఆ వేటగాడు తన ప్రక్కనున్న సేవకునితో "ఆ ముందు పరిగెత్తే కుందేటికి ఆ కొమ్ములు పొడుగ్గా, నిటారుగా ఉన్నాయేం? ఆ రెండవ కుందేలుకు కొమ్ములు కొంచెం సన్నగా ప్రక్కవైపుగా ఒదిగి కనిపిస్తున్నాయేం? మూడవ కుందేలుకు కొమ్ములు పొట్టిగా లావుగా కనిపిస్తున్నాయేం? ఎందుచేత?” అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా అయ్యగారూ! కుందేటికి కొమ్ములుండవు కదా! మనం కొన్ని వేల సంఖ్యలో కుందేళ్ళను వేటాడాం?" అన్నాడు. అప్పుడా వేటగాడు, "కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా! నా ప్రశ్నకు సమాధానం... ఆ కుందేటి కొమ్ములు తేడాగా ఎందుకు కనిపిస్తున్నాయో చెప్పు! అది చెప్పకుండా... కుందేటికి కొమ్ములు ఉంటాయా?... అని అడుగుతావేం?” అని కసురుకున్నాడు. కుందేటికి కొమ్ములు ఉండవన్నమాట పచ్చినిజం. అది వదలి, చెవులు నిక్కంచుకుంటే "కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా!... అని నిర్ణయించి, ఇక మరి ఎందుకు తేడాలుగా ఉన్నాయి?"... అని ఎరుగుటకు యత్నించటం తెలివితక్కువే కదా!

కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నప్పటికి, ఉండటానికీ వీలుకాదు అనునది ఎంతగా సత్యమో, "ఇక్కడ మొదలే జ్ఞేయము లేనే లేదు" అనునది అంతగానూ సత్యమే! లౌకిక దృష్టిచే ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది కదా అంటావా? (నేహ నానాస్తి కించన... ఇక్కడ కించిత్ కూడా అనేకత్వమనేది లేనే లేదు మొదలుగా గల) శ్రుతి యుక్తులను అనుసరించి ఇక్కడ దృశ్యము లేనే లేదు. ఇదంతా స్వప్నంలోలాగా భ్రమాత్మకమే! స్వప్నమే భ్రమ అయినప్పుడు ఇక అందులో 'మంచివారు ఎందుకున్నారు? చెడ్డవారు ఎందుకున్నారు? ఆ భవనం అంత ఎత్తుగా కట్టారేం? ఈ గుడిసె ఊరికి ఇంత దూరంగా ఉన్నదేం అనే ప్రశ్న - సమాధానం కూడా భ్రమయే కదా! మృగతృష్ణలో మొదటి తరంగం రెండవ తరంగం తేడాగా కనిపిస్తున్నాయేం? అనేది (మృగతృష్ణయే భ్రమ కాబట్టి) ఆ సమాధానం కూడా భ్రమయే కదా! ఆకాశంలో కేశాలు కొన్ని పొడవుగా - కొన్ని గుండ్రంగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆకాశంలో కేశములే ఉండవు. ఉన్నట్లుగా కనిపించటం దృష్టి దోషమే

Page:651

కదా! అట్లాగే జాగ్రత్ - స్వప్నములలో కనిపించే 'నీవు- నేను' మొదలైనవి వాస్తవానికి ఉత్పన్నము కాకపోయినప్పటికీ భాసిస్తున్నాయి. తత్త్వజ్ఞానముచే అవన్నీ నివారితమై పోగలవు.

శ్రీరాముడు : స్వామీ! ఈ 'నేను-నీవు' మొదలైనవి అసలే లేవు అని, ఈ జగత్తు మొదలే జనించలేదని, కనుక అవన్నీ ఇప్పుడూ లేవని మేం నిరూపణ పొందటమెట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : అందుకు అధ్యాత్మశాస్త్రం మనకు కార్య కారణ సిద్ధాంతం ప్రతిపాదిస్తోంది. కారణము నుండియే... కార్యము జనిస్తోంది. అంతేగాని కార్యము కారణము కంటే వేరైనదై ఉండజాలదు. సృష్ట్యాది యందు సర్వ కారణాలు శమించియే ఉంటాయి కదా! మరి సృష్టి జనించటానికి కారణం ఎక్కడినుండి వస్తుంది? కారణమే లేనప్పుడు 'సృష్టి' అనే కార్యము ఎక్కడిది? కారణమే లేదు కనుక ఈ జగత్తు సృష్ట్యాదిలో జనించనే లేదు. సృష్ట్యాదిలో లేనిది ఇప్పుడు మాత్రం ఎక్కడి నుండి వస్తుంది? కనుక, ఈ జగత్తు స్వప్న సదృశమే గాని వాస్తవం కాదు. శ్రీరాముడు : హే మునీంద్రా! ‘మహా ప్రళయం’ సంభవించిన తరువాత ఇక ఆపై జన్మ రహితము అవ్యయము అగు బ్రహ్మమే శేషిస్తుంది కదా! "అట్టి బ్రహ్మమే సృష్టికి కారణం" అని ఎందుకు అనకూడదు? ఈ సృష్టి ‘కారణరహితం' అనే బదులు బ్రహ్మము దీనికి కారణమనవచ్చును కదా! శ్రీ వసిష్ఠ మహర్షి :కారణము' నందు ఏ కార్యము అయితే ఉంటుందో... అదియే కార్యరూపంగా ఉత్పన్నం అవుతుంది గాని, కారణములో లేనిది కార్యరూపంగా రాదు కదా? ఘటంలోంచి వస్త్రం రాదు కదా! బ్రహ్మము చిదేక రసమై, కేవలం జ్ఞానరూపమై ఒప్పుచుండగా... అద్దాని యందు జ్ఞేయరూపమగు దృశ్యం ఎక్కడున్నది? బ్రహ్మము నిర్విషయం. కనుక అద్దాని నుండి విషయ రూపజగత్తు ఉద్భవించజాలదు. మేఘాలలో కొండలేదు. మరి మేఘాలలో ఆ పెద్ద కొండ - - ఈ చిన్న కొండ ఎట్లా వచ్చాయి?... అంటే అది దృష్టి భేదమే గాని, వాస్తవం కాదు కదా? శ్రీరాముడు : ఈ జగత్తు సూక్ష్మరూపంలో బ్రహ్మమునందే ఉంటోంది కదా! కనుక ఈ జగత్తు తిరిగి బ్రహ్మము నుండియే బయల్వెడలుతోంది అని అనటం ఎందుకు సరికాదు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ మహాబుద్ధీ! రామచంద్రా! మహాప్రళయంలో సృష్టి యొక్క బీజ సత్త చూస్తున్నవాడెవడు? చూస్తున్నవాడు ఉంటే సృష్టి ఉన్నట్లే కదా? కాబట్టి మహాప్రళయంలో చూచువాడు లేడు కనుక సృష్టియే లేదు. ఈ విధంగా సృష్టికి ముందు (సృష్టి ఏర్పడటానికి కారణములైన) సాధకాలు లేవు. బాధకములు లేవు. "మొట్టమొదట ఈ సృష్టి లేదు. బ్రహ్మము మాత్రమే ఉన్నది" అనేది ఆయా పరిభాషలలో అన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్న విషయమే! అట్టి నిర్విషయ బ్రహ్మములో సృష్టి యొక్క బీజ సత్త ఎక్కడిది? మరొకటి ఏదైనా జగత్ బీజ సత్తను ప్రవేశింపజేస్తోందని అందామా? అప్పుడు... బ్రహ్మమునకు వేరుగా మరొకటి ఉన్నట్లైతుంది. అప్పుడు "బ్రహ్మము ఏకము అద్వితీయము (- బ్రహ్మమేవ ఇదమగ్ర ఆసీత్ - ఏకమేవా ద్వితీయం బ్రహ్మ... మొదలైన) వేద - వేదాంత మూల వాక్యాలకు తిరస్కారం జరుగుతుంది కదా! అందుచేత మొట్టమొదట సృష్టి - దర్శకుడు - దర్శనము - నేను - నీవు" మొదలైనవి జనించటానికి కారణమే లేదు. ఇప్పుడు కూడా

Page:652

“నేను-నీవు-జగత్తు” జనించటానికి కారణం లేదు. కనుక ఈ సృష్టి దృష్టియే కాని, వాస్తవం కాదు. అంతేగానీ, బ్రహ్మము నందు ఉండే జగత్-బీజసత్తలు ఎట్లాంటివి? ఎట్లా ఉంటాయి... చెప్పు? శ్రీరాముడు : మహర్షీ! బ్రహ్మమునందు బ్రహ్మవేత్తలచే జగత్ రహిత స్థితిలో జ్ఞప్తి రూపమగు సత్తయే అనుభవమౌతుందని నా అభిప్రాయం. కాబట్టి 'జ్ఞప్తి' అనే సూక్ష్మతత్త్వం స్వప్రకాశ చిద్రూపమునకు అభిన్నంగా మహా ప్రళయంలో ఉంటుంది. అప్పటి జ్ఞప్తి రూప సత్త ఈ మాయాకాశ రూపము వంటిది కాదు. మాయాకాశ రూపము అసత్స్వరూపం అవటం చేత .... అసత్స్వరూపమైన మాయాకాశం నుండి సద్రూపంగా సృష్టి ఆవిర్భవించటమనేది అసంగతవాక్యం అవుతుంది. ఈ విధంగా చిద్రూపమగు బ్రహ్మమే జగత్తు యొక్క బీజసత్తా కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : కేవల చిద్రూపము (ఎరుగుట అనే విషయాలకు ముందే ఉన్నట్టి.... స్వసత్తా స్వరూపం) అగు బ్రహ్మమే ఈ జగత్తు యొక్క బీజ సత్త అనీ, అది జ్ఞప్తి మాత్ర రూపంగా స్వసత్తయందు మహాప్రళయ సమయంలో ఉన్నదని కాసేపు అనుకుందాం. అప్పుడు ఈ ముల్లోకములు కూడా జ్ఞప్తి రూపమే అవుతాయి కదా! ఎందుకంటే "విశుద్ధ జ్ఞాన స్వరూపుడు - సచ్చిదానంద ఘనము” ...అగు ఆత్మకు జనన మరణాలు ఎట్లా ఉంటాయి? లేవు కదా!

జగత్తుగా కనిపించేది ఆత్మ యొక్క జ్ఞప్తి రూపమే! ఆ జ్ఞప్తికి మునుముందే కేవల జ్ఞాన స్వరూపుడగు జగత్ ద్రష్ట జగత్ రహితుడై ఉండనే ఉన్నాడు. ఆతని స్వప్న సందర్శన చమత్కారమే ఈ త్రిలోక జగత్తు. ఆతడు తనను తాను ఎరిగినపుడు ఈ ముల్లోక జగత్తు లేదు. లేక, ఇది నిర్మల స్వకీయ జ్ఞప్తి రూపం మాత్రమే!

శ్రీరాముడు : మహాత్మా! "సృష్టి మొట్టమొదటి నుండి ఉన్నది కాదు. మొట్టమొదట కేవల బ్రహ్మము మాత్రమే ఉన్నది! అనేది మనం సిద్ధాంతీకరించుకున్నా మనుకుందాం సరే! ఈ జగత్తు మీరు చెప్పి నట్లు భ్రాంతి రూపమే అయివుండవచ్చు గాక! అయితే అట్టి జగత్ భ్రాంతి ఎక్కడి నుండి వచ్చింది? భ్రాంతి ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే ... అది తొలగించుకోవటం సులభం అవుతుంది కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : వాయువులో తరంగాలు, ఆ తరంగాలన్నీ వేరువేరుగాను, ఒక్కొక్క తరంగానికి ఒక్కొక్క ప్రాకృత ధర్మాలు ఉంటే ఉండవచ్చు. వాయుతరంగం వాయువు కానిదెప్పుడు? బ్రహ్మము సర్వదా బ్రహ్మమే! అందులో సృష్టి లేదు. ప్రళయము లేదు. ఇక ఈ జగదృశ్యానికి వస్తే...

ఏది ఎరుగబడుచున్నదో... ఎవనిచే ఎరుగబడుచున్నదో... ఏమని ఎరుగబడుచున్నదో అట్టి జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ రూపమగు ఈ త్రిపుటి ... ఇదంతా కూడా స్వాత్మయగు బ్రహ్మమే! అయిఉన్నది. శ్రీరాముడు : మహర్షీ! ఒక యంత్రము జడమే అయినప్పటికీ... అద్దాని అంతర్గతంగా గల యంత్రశక్తిచే చేతనమువలె చలిస్తూ ఉంటుంది చూచారా? అట్లాగే ఈ జడమాత్ర శరీరం ఇందలి కార్య-కారణ సంఘాత శక్తిచే ఆయా విశేషాలు ఎరుగుచుండుటమేమిటి? సర్వద్రష్ట అయిన ఈశ్వరుడు ఈ జడమగు దృశ్య రూపత్వం పొందటమేమిటి? రెండు ఆశ్చర్యకరమే! "కట్టెపుల్ల అటూ ఇటూ తిరుగుతూ త్రోవలో అగ్ని కనబడగానే ఆ కట్టెపుల్ల ఆ అగ్నిని తగలబెట్టింది... అనే

Page:653

వాక్యం ఎంతటి విపరీతము - - అర్థరహితమైన వాక్యమో, సర్వద్రష్ట అయిన ఈశ్వరుడే ఈ జడ జ్ఞేయ స్వరూపంగా అయ్యాడు ... అనేది అంతటి అర్థరహితం కాదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! నీ దృష్టాంతం ఆశ్చర్యమును గొలుపగలదు. అయితే దృశ్యము మొదలే అసంభవము. అట్టి మొదలంట అసంభవమైన దృశ్య రూపములను ఆ ఆత్మ సంతరించుకోవటమనే ప్రసక్తి ఎక్కడిది? అయితే ఒకవేళ 'దృశ్యము' వేరుగా కనబడుచున్నదంటావా... దృక్ మాత్రము - చిర్ఘనాకారము - సర్వాత్మకము ... అయినట్టి చిదాత్మయే ద్రష్ట, దర్శనము, దృశ్యము అనబడే త్రిపుటీ రూపంతో నిజమాయాశక్తిచే భాసించుచున్నదగుచున్నది.

శ్రీరాముడు : హే మహాశయా! అనాది - అనంతము అగు శుద్ధ చిదాత్మయే జగత్తును కల్పించటం వలన ఈ జగత్తు భాసిస్తోంది. అంతేకాని, మరింకేదీ ఈ జగత్తుకు కారణంగా లేదు”... అనేది ఒప్పుకుంటున్నాను. అయితే, అట్టి 'సృష్ట్యాది' సమయంలో ఇచ్చట చిద్రూప బ్రహ్మమునందు చేత్యము (దృశ్యము - అనేది ఎట్లా సంభవించింది?

శ్రీ వసిష్ఠ మహర్షి : శుద్ధ చిద్రూపము నందు 'దృశ్యము' అనబడునది ఏర్పడటానికి కారణమే లేదని నీవు ఒప్పుకున్నావు కదా! అందుచేత 'కారణము యొక్క అభావము' చేత చేత్యము అనబడే దృశ్య జగత్తు ఒకింతకూడా సంభవించదు. శుద్ధ చిదాకాశానికి వేఱుగా ఇంకేదీ కారణరూపంగా ఉండజాలదు. ఈ విధంగా చైతన్యమునకు (బ్రహ్మమునకు) వేఱుగా దృశ్యము లేదని తేలిపోతుంది కదా! కాబట్టి చైతన్యమునకు రెండు లక్షణాలు ఇక్కడ నిరూపించబడుచున్నాయి.

1. ఆత్మ నిత్యముక్త స్వరూపం, 2. చేత్య విషయములగు (దృశ్యాంతర్గత విశేషాలే అయినట్టి) వాక్ - మనస్సులకు ఆత్మ అగోచరమైనది.

శ్రీరాముడు : హే మహర్షీ! మీరు ఆత్మ సర్వదా ముక్తమే అయివున్నది. అది దేనికీ పట్టుబడేది కాదు అని సిద్ధాంతీకరించుచున్నారు. అది బాగానే ఉన్నది. అయితే, ఆత్మ 'నిత్యముక్తము అయి ఉన్నప్పుడు మరి ఈ అహంకారము మొదలుగా గల రూపమగు ఈ జగత్తు ఎలా ఉదయించింది? ఎచట నుండి ఉత్పన్నమయింది? అట్టి జగత్తులో ప్రవేశించి జీవుని యొక్క ఊపిరి పీల్చుకోవడం” అనే స్పందము’ నుండి, ఆయా 'సర్వ విషయముల జ్ఞానం' ఎట్లా కలుగుతోంది? ఆత్మ సర్వదా ‘నిత్యముక్తము', 'చేత్యమునకు (దృశ్యమునకు)' అతీతము అయినప్పుడు ఇక గురువులు, శాస్త్రములు, సాధనములు, నియమములు, మహదాశయములు, జీవితం, దీనిని సద్వినియోగ పరచుకోవటం... ఇటువంటి విషయాలతో పనేమున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : శాస్త్రముల ఉద్దేశసారము ఆత్మ నిత్యముక్తము అని నిరూపించటమే! "ఓయీ జీవుడా! నీ దృశ్యాతీత స్వస్వరూపమే ఆత్మ! అది సర్వదా సర్వమునకు అతీతమై కేవల సాక్షిగా ఉండి ఉండగా దుఃఖం ఎందుకు? (తత్త్వమసి - - జీవో బ్రహ్మేతినా పరః - - సోహమ్ - విశ్వమ్ విష్ణుః - అశోచ్వానవ్య శోచస్త్వమ్ మొదలుగా గల) అనేక సూచన వాక్యములను శాస్త్రాలు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూనే ఉన్నాయి కదా! ఆత్మకు 'జగత్తు, దృశ్యము, చేత్యము' ... అను పర్యాయ పదములతో

Page:654

చెప్పబడే అన్యము' ఏర్పడటానికి మొదలే కారణం లేదు. అనగా ఆత్మకు ఇది అనన్యం. ఆత్మకు అన్యమైన కారణమేదీ లేదు. కాబట్టి సృష్ట్యాది యందు ఈ జగత్తు కించిత్ కూడా ఉత్పన్నమగుటయే లేదు. ఇకప్పుడు 'దృశ్యము' అనబడేది (ఆత్మకు అన్యమైనది) ఎక్కడిది?

ద్రష్ట - దృశ్యము - దర్శనము; దృశ్యమునకు ఈవల - ఆవల; సృష్ట్యాది యందు - సృష్టి మధ్యలో - - సృష్ట్యాంతము నందు... సర్వము - సర్వదా - సర్వత్రా శాంతమగు పరబ్రహ్మమే అయివున్నది.

ఇక ఆత్మకు అనన్యంగా కాకుండా, ఏదైనా దృశ్యము - జగత్తు కనిపిస్తూ ఉంటే... అట్టి సృష్టి కేవలము భ్రమ మాత్రమే! అట్టి కేవల స్వకీయ భ్రమయే - కలలో స్వకీయ కల్పితమైన పులివలె - బంధము కల్పిస్తోంది. అనగా ద్రష్ట ఏ దృష్టితో ఈ జగత్తు పట్ల దర్శనము చేస్తున్నాడో... అద్దాని యందు చోటు చేసుకొన్న భ్రమయే ఇక్కడి బంధము! స్వప్నంలో పులికి స్వప్న ద్రష్ట అతీతుడే కదా! అయితే... అలా చెప్పటంలో స్వప్నంలోని స్వప్నద్రష్ట పులికంటే బలవంతుడు”... అని చెప్పటం ఉద్దేశం కాదు. స్వప్నంలో ద్రష్ట ఉన్నాడనునదే భ్రమ. పులితో సహా స్వప్నమంతా స్వప్న ద్రష్ట తనకు తాను కల్పించుకొన్న భ్రమ.

అందుచేత స్వప్నద్రష్ట స్వప్నాంతర్గత విషయములచే బద్ధుడెట్లా అవుతాడు? అట్లాగే జాగ్రత్ కూడా జాగ్రత్ ద్రష్ట యొక్క జాగ్రత్ కల్పనయే! కానీ ఆ ద్రష్ట (ఈ జీవుడు) "నేను బద్ధుడను అని వేదన చెందుచున్నాడు. ఆ వేదనను తొలగించి ఆతనిచే ఆతని ప్రశాంత - నిర్మల - ఆత్మానంద రూపం అనునిత్యంగా అనుభవింపజేయటమే శాస్త్రముల, సాధనముల మహోద్దేశం. అదే గురువుల ప్రయత్నమంతా! జగత్ భ్రమ తొలగటమే గురు - - శాస్త్రాదుల ప్రయోజము.

శ్రీరాముడు : హే మహాత్మా! మనమందరం సర్వదా ఏ స్వరూపమై ఉన్నామో... అట్టి నిర్మల పర బ్రహ్మమునకు చలనాదులు లేవు. వాక్కుకు, మనస్సుకు ఆవల ఉన్నది. మనోవాక్కులకు అవిషయమై ఉన్నది. సదా స్వప్రకాశ రూపమై ఉన్నది. నిర్మలము, నిత్యముక్తము అయివున్నది - అని మీరు సశాస్త్రీయంగా ప్రకటిస్తున్న సత్యమునకు మేము సదాంగీకారపూర్వకంగా జేజేలు పలుకుచున్నాం.

ఈ జగత్తు ఆ పరబ్రహ్మమునందే అనన్యంగా - కానీ భ్రమరూపంగా అనుభవమగుచున్నది కదా! బ్రహ్మమునందు ద్వైతమే లేనప్పటికీ... ఈ 'భ్రమ' అనే ద్వైతం - ఏ కారణం చేత, ఎవనికి, ఎందుకు కలుగుతోంది? ఈ విషయం చెప్పమని నా ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! బుద్ధి దోషయుక్తంగా ఉన్నప్పుడు దృష్టిలోని ద్వైతమే జగత్ - దర్శన రూపంగా ప్రదర్శితమౌతోంది. శాస్త్రములు చెప్పిన సాధనలచే బుద్ధి నిర్మలమవగా అప్పుడు గురువాక్యాలు ఆ బుద్ధిలో సారూపత్వం పొందగలవు. అట్టి బుద్ధి యొక్క వికాసముచే బ్రహ్మతత్త్వము పొందినవాని దృష్టి యందు బ్రహ్మమునకు వేరైన కారణమే రహితమై పోతోంది. అట్టి - నిర్మల - శాస్త్ర విజ్ఞాన పరిపుష్ట - గురువాక్యమనన శీలక - బుద్ధి” యొక్క దృష్టిలో ఈ జగత్తు మొదలే ఉత్పన్నము కానిదిగా అగుచున్నది. మొదలే లేనిది, ఉత్పన్నము కానిది ఇక

Page:655

తొలగవలసి రావటమెక్కడున్నది? కాబట్టి జగత్ భ్రమయే మొదలంటా తొలగగా... ఇదంతా (జగత్తంతా, దృశ్యమంతా) బ్రహ్మముగానే (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) అనుభవమౌతోంది. కాబట్టి రామా! ఈ నేను-నీవు దృశ్యములతో కూడిన జగత్తంతా కూడా "శాంతము - నిర్వికారము - ఏకము అగు ఆత్మయే అయివున్నది. ఎండమావులలో జలమే ఉండదు అని గ్రహించిన తరువాత ఇక ఎండమావులతో జలం ఎందుచేత కనిపించింది? అనే ప్రశ్న యొక్క అగత్యం ఏమున్నది?

శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! అప్పుడు రామచంద్రుడు ప్రశ్నలు అడగటం మానివేసి, మౌనంగా, ఏదో యోచన చేస్తూ కనిపించాడు. అప్పుడు సభలో నిశ్శబ్దం తాండవిస్తోంది. శ్రీరాముడు ప్రశ్నించటం మానివేసి యోచనాపూర్వకమైన మౌనము వహించటం శ్రీ వసిష్ఠ మహర్షి గమనించి, కించిత్ ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో రాముని వైపు చూచారు. అది గమనించిన రాముడు ఇట్లా అంటున్నాడు.

శ్రీరాముడు :

బ్రహ్మన్! భ్రమమివాపన్నః స్రష్టుం! జానామి నా ధికమ్ | నాత్యస్తం చ ప్రబుద్ధాస్మి! పృచ్ఛామి కిమిహాధునా ॥

హే బ్రహ్మర్షీ! ఇప్పుడు నేను ఏదో భ్రమను పొంది ఇట్లా అడుగుచున్నానా?... అని అనిపిస్తోంది. ఇక ఎంతగా ప్రశ్నించినా ఎందుకో ఏదో భ్రమ ఇంకా తొలగటం లేదేమో? నేను మీవలె అత్యంత ప్రబుద్ధుడను కాను. ఇంకా ఇంకా ప్రశ్నిస్తే మాత్రం "ఈ దృశ్యము ఎట్లా ఏర్పడుతోంది?... అనే నా భ్రమపూర్వకమైన ప్రశ్న నన్ను విడచి వెళ్ళటంలేదు. ఇక ఏం ప్రశ్నించను? శ్రీ వసిష్ఠ మహర్షి : సమాధానం నీకు అందక నిరుత్తరుడవుగా అగుచున్నప్పటికీ, ప్రశ్నించటం నుండి విరమించవద్దు. ప్రశ్నకు కారణం సంశయం కలిగి ఉండటమే కదా! ఒరిపిడి రాయితో మెరుపును పరీక్షించి మరల అగ్నిని పుట్టించటానికై ఒరిపిడి కొనసాగిస్తాం చూచావా? అట్లాగే ప్రశ్నకు కారణమైయున్న 'సంశయము' సారాసారత్వ పరీక్షకు లోను అగుచున్నప్పటికీ, అవిద్య క్షయించే వరకు నిరాటంకంగా ప్రశ్నిస్తూనే ఉండాలి.

ప్రశ్నకు కారణం - - సంశయం. సంశయమునకు కారణం - అవిద్య. ప్రశ్నలచే క్రమంగా అవిద్య క్షయిస్తూ చివరికి అది తప్పక మటుమాయమౌతుంది. అవిద్య పూర్తిగా క్షయించిన తరువాత స్వభావ సిద్ధంగానే వాక్కుకు అతీతమైనది (వాక్కుతో చెప్పనలవి కానిది) - సర్వోత్తమ స్వభావము అగు ఆత్మయందు స్వయంగా విశ్రాంతిని పొందగలవు.

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! అప్పుడు రామచంద్రుడు తనలో, అవును! నాలో సందేహం ఆమూలాగ్రం తొలగి ఆత్మయే, ఈ దృశ్యం" అని బుద్ధి అనుభూత పరచుకునే వరకు ప్రశ్నించాల్సిందే కదా! పైగా బ్రహ్మర్షి శ్రీ వసిష్ఠులవారు నాకు ఎదురుగా జ్ఞానాగ్ని రూపంలో సర్వ సందేహాలు

Page:656

మొదలంటా భస్మం చేసే ఉద్యమంలో ఉన్నారాయె! ఇక ఈ సమయ సందర్భాలను సద్వినియోగం చేసుకోవటమే ఉచితం కదా! ... అని తలచి, తలపైకెత్తి ఇట్లు మరల సంభాషించసాగాడు.

శ్రీరాముడు : మహాత్మా! ఆత్మయందు మొట్టమొదట - ఆత్మకు వేరైన కారణమే లేదు కాబట్టి . సృష్ట్యాది యందు ఈ సృష్టి ఉత్పన్నమే కాకయున్నదనే సిద్ధాంతం నేను గ్రహించాను. కానీ చైత్య -

- చేతన విభ్రమం (ద్రష్ట - - దృశ్యముల భ్రమ) కలుగుచున్నదెవరికి? ఎందుకు? ఎట్లు" అనే సంశయం ఇంకా పూర్తిగా తొలగటం లేదు. అందుచేతనే నేను కొంచెంసేపు ఊరకొని ఉండిపోయాను. దయయుంచి చెప్పండి. ఈ సంశయ విభ్రమం తొలగేది ఎట్లా? ద్రష్టత్వం పొందుచున్నదెవరు? ఆత్మయా? జీవుడా? ఆత్మ నిత్యనిర్మలం కాబట్టి అద్దానికి దృశ్యత్వము ఉండదు కదా! ఇక జీవుడు దృశ్యమును పొందుచున్నాడు ... అని అంటే ఆత్మకు వేరుగా 'జీవుడు' అనబడే దృశ్యద్రష్ట ఉన్నాడా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "ఈ దృశ్యము మొదలే ఉత్పన్నమయి ఉండలేదు" అని నేను సిద్ధాంతీకరించినది గ్రహించానని అన్నావు కదా! అంటే... మొదలే ఆత్మయందుగాని, ఆత్మకుగాని జగత్తు' అనబడేది జనించటానికి కారణమే లేనట్లు కదా! కారణమే లేదు కాబట్టి... ఈ జగత్తు ఎప్పుడూ లేనిదే! సర్వత్రా ప్రశాంతమగు పరమాత్మయే సర్వముగా ఏర్పడియున్నది. ఇక భ్రాంతి అంటవా... భ్రాంతి కూడా లేనిదే అయివున్నది. ఏది 'భ్రాంతి' అని, భ్రాంతి ఉన్నదని నీకు అనిపిస్తోందో ... అది శుద్ధ పరమాత్మ సర్వత్రా సర్వముగా కలదు ... అనే అభ్యాసం లోపించటం చేత మాత్రమే అట్లా అనిపిస్తోంది. అట్టి దృఢజ్ఞానం నీకు ఇంకా కలగకపోవటం చేతనే “ఆత్మ వేరు - దృశ్యము వేరు”... అని అనుకొంటున్నావు. దశ్యమే లేనప్పుడు ద్రష్ట ఆత్మకు వేరుగా లేడని వేరే చెప్పాలా? దీపం లేకపోవటం చేతనే చీకటిగా ఉన్నది... అని చెప్పిన తరువాత దీపం ఉంటే చీకటి ఉండదు... అని వేరుగా చెప్పనక్కరలేదు కదా! "అంతా ఆత్మ స్వరూపమే... అని గ్రహించి తద్రూపంగా పరిశుద్ధ దర్శన శీలత్వంతో దృష్టి పరిపుష్టి పొందనంతవరకు విశ్రాంతి లభించదు. అట్టి అవిశ్రాంతియే వ్యర్థంగా నానా సంశయములను కలిగించటం జరుగుతోంది. శ్రీరాముడు : స్వామీ! అభ్యాసము లేకపోవటం చేత అని అంటున్నారు కదా! జగద్ధాంతికి కారణమే లేనప్పుడు ఇక అభ్యాసము - అనభ్యాసం అనేవి ఎక్కడి నుండి సంభవిస్తాయి? అసలీ అభ్యాసము యొక్క అవసరము కలిగిస్తున్న భ్రాంతి ఎట్లా సంభవించింది? 'నేను-నీవు-ఈ దృశ్యము’ - అనే భ్రాంతి (ఇవన్నీ ఆత్మయే అయివుండికూడా,) తత్వ్యతిరిక్తంగా మాకు ఎందుకు అనిపిస్తోంది? శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఏ భ్రాంతి లేదు. ఆత్మకు వ్యతిరిక్తమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. పరమాత్మ అనంతరూపుడవటం చేత నిజమాయచే ఇట్లు అనంతంగా భాసించుచున్నాడు. జీవన్ముక్తుని దృష్టికి సర్వదా సర్వత్రా సర్వరూపములుగా పరబ్రహ్మమే తాండవిస్తున్నట్లు అనుభూతమగుచూ ఉండగానే... ఇక ఆపై సమస్త జీవులతోటి యథాతథంగా అందరిలాగానే ప్రవృత్తి కలిగి ఉంటున్నారు. చిదనము, నాశరహితము అగు పరమాత్మయే 'నేను-నీవు జగత్తు'లుగా భాసిస్తున్నదని ఎరిగి ఉండి వ్యవహారములలో పాల్గొనుచున్నాడు. మీ వంశమునకు ఆది పురుషుడగు రఘువు, (అట్లాగే)

Page:657

జనక మహారాజు మొదలైన వారెందరో... (అట్లాగే) సభయందు పాల్గొనుచు మన ఈ సంవాదమును ఆలకిస్తున్న అనేకమంది జీవన్ముక్తులు వ్యవహారరీత్యా జగద్విషయములందు పాల్గొంటూనే “భ్రాంతి బ్రహ్మము యొక్క చమత్కారమే! అంతా పరబ్రహ్మమే! అని నిర్దుష్టంగా, సుస్పష్టంగా నిర్మల దర్శనము కలిగియే ఉంటున్నారు. సమస్తము పరమార్ధమున చిదనమే అని ఎరిగియే సమస్త వ్యవహారములందు జీవన్ముక్త ప్రవృత్తిని నీవుకూడా కలిగియుండెదవు గాక!

శ్రీరాముడు : స్వామీ! వాస్తవానికి భ్రాంతి అనబడునదే లేదని అంటున్నారు కదా! అట్లా అయితే, మీరేమో జీవన్ముక్తులై జగత్ భ్రమ శమించగా, ఇప్పుడు ఈ అధ్యాత్మ రూప శబ్ద సంపత్తిచే మాకు, ప్రసాదిస్తున్నారు. తెలిసీ - తెలియని మేము మీ యొక్క ఉపదేశమునకు అర్హత పొందినవారమై మీ ఉపదేశ మహాప్రసాదమును పొందుచున్నాం.

అనగా ఈ జగత్తునందు తమవంటి భ్రాంతి రహితులగు జీవన్ముక్తులు - మావంటి అల్ప అభ్యాసపరులగు భ్రాంతి దృష్టి కలవారు ఉన్నట్లే కదా! మరి, భ్రాంతియే లేదని అనటం ఎట్లా? భ్రాంతియే లేకపోయి ఉంటే, ఉపదేశము చేయటానికి, "భ్రాంతిని తొలగించటం కాకుండా మరింకే కారణం లేదు కదా? కనుక భ్రాంతి ఉన్నట్లే కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవన్ముక్తుల దృష్టిలో ఉపదేశించువాడు - ఉపదేశించబడువాడు ... ఇరువురు, అట్లాగే తదితరము అంతాకూడా - ఈ సమస్తముకూడా - బ్రహ్మమే అయివున్నది. ఇదంతా బ్రహ్మమునందే నెలకొనియున్నది. బోధస్వరూపమగు పరమాత్మయందు బంధ - - మోక్షములు ఎట్లా ఉంటాయి? 'ఉండవు' అనునది సునిశ్చిత విషయమే అయివున్నది.

శ్రీరాముడు : మహాత్మా! ఆత్మయందు ఆత్మకు వేరుగా సర్వ పదార్థములు అసంభవమై ఉన్నాయి కదా! మరి అజ్ఞానుల దృష్టియందు ఇక ఈ దేశ కాల-క్రియ-ద్రవ్య భేదములతో కూడిన ఈ జగత్సత్త అంతా కూడా ఎట్లా స్థితినొందియున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : (పకపకా నవ్వుచూ) రామయ్యా! "అజ్ఞానుల దృష్టి యందు" - అని అంటున్నావు కదా! నీ ప్రశ్నకు సమాధానం నీ ప్రశ్నలోనే ఉన్నదయ్యా!

దేశకాల క్రియాద్రవ్య భేద వేదన చేతసామ్ అజ్ఞానమాత్రాదితరాసత్తా నా న్యాస్తి నో పురా!

దేశ-కాల-క్రియ-ద్రవ్యాదిగా గల భేదమును చూచుచున్న అజ్ఞానుల దృష్టి యందు జగత్ సత్త స్థితి పొంది ఉండటానికి కారణం అజ్ఞానం తప్ప మరింకేమీ కాదు.

శ్రీరాముడు : మహాత్మా! తత్త్వదృష్టిచే "ఆత్మయందు జగత్తు ఏర్పడటానికి కారణమే లేదు... అనే సిద్ధాంతమును అనుసరించి ఇక్కడ ద్వైత - ఏకత్వములు రెండూ అసంభవం కాబట్టి "బోధింపబడునది - బోధింపబడువాడు - బోధించువాడు ... అనే మూడింటికీ అభావమే సిద్ధిస్తుంది కదా! అభావం సంభవిస్తే శాస్త్రములు బోధించటమెట్లా? అనగా "దృశ్యమునకు అతీతమైన బోధత్వము... “నిర్మల బోధ స్వరూపమే ఆత్మ" ... అను శాస్త్ర పాఠ్యాంశాలు సమకూరటం మొదలైనవి ఎట్లా సంభవం?

Page:658

"ఈ జీవుడు అకర్మకమగు బోధ రూపమును సంతరించుకోవటమే మోక్షం"... మొదలైన నిర్వచనాలు అర్థరహితమంటారా? అజ్ఞాని - జ్ఞానమును సంతరించుకోవటం... లేవంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి :

బోధేన బోధతామేతి బోధ శబ్దస్తు బోధ్యతామ్ భవద్విషయమేవాయమ్ ఉచితో! న అస్మదాదిషు ॥

అజ్ఞాతమగు బ్రహ్మము నేను అజ్ఞానిని... అని తలచిన సందర్భంలో అట్టి "అజ్ఞానము యొక్క క్షయము”... అనే ఫలమును ఆశ్రయిస్తోంది. అట్టి బోధ కర్మత్వమును పొందుచున్నది. అప్పుడు ఆ ‘బోధ’ అనే శబ్దం ఫలరూపమగు సకర్మత్వము పొందుతోంది. అయినాకూడా, “జ్ఞాతము అజ్ఞాతము” - ఈ ఉభయములు బ్రహ్మమేగాని మరి ఏదీకాదు.

అయితే బోధసాధనలు బోధత్వం సాధనానంతరం పొందటం... ఇవన్నీ కూడా అజ్ఞాన యుక్తులగు వారి కొరకు మాత్రమే! అజ్ఞానము క్షయించినట్టి మా వంటి వారి యందు బోధ సాధనములు - బోధరూపము పొందటం ... ఇవన్నీ ఆత్మకు భిన్నమై లేవు. జగత్తులో పదార్థములన్నీ బ్రహ్మముగా కనిపిస్తున్నట్లే మాకు ఆయా బోధ సాధనలు, సాధనానుసారం బోధ స్వరూపం సంతరించుకోవటం... ఇవన్నీ బ్రహ్మమునందే బ్రహ్మము రూపంగానే అగుపిస్తున్నాయి. బ్రహ్మమునకు భిన్నమై ఎప్పుడూ ఏదీ లేదు.

శ్రీరాముడు : హే మహర్షీ! ఇప్పుడు మీరు జీవన్ముక్తుల దృష్టిని ఉద్దేశించి మా వంటి వారి యందు ఆత్మకు భిన్నమై ఎక్కడా ఏదీ ఉండదు... అని అంటున్నారు కదా! ఇట్టి "మావంటివారియందు” అని పదప్రయోగం చేస్తున్నారు కనుక... జీవన్ముక్తులలో కూడా 'అస్మత్' (నాకు సంబంధించినది) ...అనే ప్రవృత్తికి నిమిత్త భూతము అగు అహంత్వము మీచే గమనించబడుచున్నది కదా! అనగా... ఇక్కడ 3 విశేషాలు కనబడుచున్నాయి.

1.జీవన్ముక్తులలో అజ్ఞానం ఉండదు. (తదితరులలో ఉన్న అజ్ఞానదృష్టి జీవన్ముక్తులకు ఉండదు). 2.అయితే జీవన్ముక్తులలో “నేను అనే మూలపదార్థంతో తయారైన అహంత్వం ఉంటుంది. 3. జీవన్ముక్తులు జ్ఞానులై ఉన్నారు. అందుచేత ఈ అహంత్వము (నాకు సంబంధించినది - అనబడేది) అజ్ఞాన కార్యము కాదు. అది అజ్ఞాన కార్యమే అయివుంటే... అది జీవన్ముక్తులలో ఉండేది కాదు కదా?

4.బోధ” లేక “శుద్ధజ్ఞానం తానే ఈ అహంత్వము రూపంగా పరిణామం పొందుచున్న దగుచున్నది.

ఇంతవరకూ బాగానే ఉన్నది. అట్టి 'బోధ' (నిర్మల బోధసత్త) నుండి ఉత్పత్తి అయివున్న 'అహంత్వం' - బోధరూపం కంటే భిన్నమైన రూపం కలిగి ఉండటమే ఇక్కడ మాకు దుర్భరంగా అనిపిస్తోంది. స్వామీ! అహంత్వము' అనగా? ఈ జీవుని రూపము అహంత్వమే కదా!

మీరు జీవన్ముక్తులై "పరము - - అనంతము - భూత్ భవిష్యత్ వర్తమానములలో యథాతథము - జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే త్రివిధములైన పరిచ్ఛేదములు లేనిది - అతినిర్మలము అయినట్టి

Page:659

శుద్ధ చిన్మాత్ర స్వరూపము ధరించినవారై ఉన్నారు కదా! అట్టి చినాత్ర స్వరూపులగు తమయందు 'అహంత్వము' అనేది ఉండటం ఎట్లా కుదురుతుంది? జాగ్రత్లో ఉన్నవానికి స్వప్నం ఉండదు కదా? సూర్యకాంతిలో చీకటి ఎక్కడుంటుంది? అట్లాగే జీవన్ముక్తులగు మహనీయులలో అహంత్వము ఉండటానికి వీలేలేదు కదా? శుద్ధ చిన్మాత్ర స్వరూపం ధరించిన తరువాత కూడా ‘మా వంటివారు’ అనే రూపంలో ప్రదర్శితమయ్యే అహంత్వము ఎట్లా ఉండగలదు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! వాయువే వాయు స్పందరూపమగు వాయు తరంగాలుగా అగుచున్నది కదా! జలమే జలతరంగములుగా కనిపిస్తోంది కదా! అట్లాగే 'బోధ' యొక్క ఏ బోధరూపము కలదో... అదియే 'అహంత్వము' అనే పేరుతో కూడా చెప్పబడుచున్నది. కాబట్టి మాకు అనుభవమగుచున్న “నేను-అహమ్ అనునది 'ఆత్మకంటే భిన్నం కాదు.

బోధ, మరియూ బోధరూపత్వములే... జీవన్ముక్తులలో ఉండే అహంత్వము. అహంత్వము, మరియు, అభిమానములే అజ్ఞానుల అహంత్వము.

ఈ విధంగా జగత్తుకు సంబంధించిన అభిమానరహితమైన అహంత్వము బోధరూపమే అయివుండి, జీవన్ముక్తులలో కనబడుతోంది. అజ్ఞానులలో అహంత్వం దృశ్యమునకు సంబంధించిన అభిమానముతో కూడుకొని కనిపిస్తోంది. ఇంతకుమించి ఈ అహంత్వమునకు భిన్నత్వమేదీ జీవన్ముక్తులకు కనిపించటం లేదు. దృశ్యమునకు సంబంధించిన అభిమానము కూడా బ్రహ్మమునకు అభిన్నమైనదిగా మాకు అనుభూతమౌతోంది. కనుక 'జీవన్ముక్తులు' అని చెప్పబడుచున్నాం. శ్రీరాముడు : స్వామీ! శాంతి రూపమగు సముద్రజలమే తరంగముల రూపం ధరిస్తున్నట్లుగా... జీవన్ముక్తుల దృష్టిలో చిన్మాత్ర స్వరూపమగు ఆత్మయే అహంత్వము, జగత్తు : తెలుసుకొనువాడు (బోధ్య-బోధం-బోధ) అనే త్రిపుటి... అయినట్టి ఈ రూపాలుగా ధరిస్తున్నదని తేలిపోతోంది కదా? శ్రీ వసిష్ఠ మహర్షి : బాగా చెప్పావు. కాబట్టి "అనంతము - శాంతము - ఏకము - పరిపూర్ణము ...అయినట్టి కేవల పరబ్రహ్మమే సర్వదా పరమపదము అయి ఉండి... సర్వరూపంగా స్థితినొంది ఉన్నదగుచున్నది కదా! అనగా ...జగత్తుగా ఏది కనిపిస్తోందో... అది పరబ్రహ్మమే అయివున్నట్లే కదా! అప్పుడిక జగత్తు - అహంకారాలను గురించిన అద్వైత హానిదోషం ఇంకెక్కడిది? "అహం - - జగత్తుల వాస్తవ రూపం సర్వదా నిర్మల పరబ్రహ్మమే”... అనే నా సిద్ధాంతం దిగ్విజయంగా -

నిర్ద్వంద్వంగా జయప్రదమైనట్లే కదా!

శ్రీరాముడు : హే మహాత్మా! మీరు చెప్పుచున్నట్లు శుద్ధ - అద్వైత పక్షమే సరి అయినప్పుడు... మరి, దేనిమూలంగా ఈ అనంత సంసార భ్రమ విజృంభిస్తోందో... అట్టి "అహంత్వము అనే వికల్పమును కల్పిస్తున్నదెవరు? ఆ కల్పించిన వ్యవహారమును అనుభవిస్తున్న “అనుభవి” అనబడే

ఆ రెండవవారు ఎవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి :

జ్ఞేయ సత్త అవబోధే హి బంధనమ్ సచ్చ నాస్త్యలమ్ జ్ఞప్తేః సర్వార్థరూపత్వాత్, బంధమోక్షావతః కుతః?

Page:660

ఓ రామచంద్రా! "పరబ్రహ్మము కంటే భిన్నంగా దృశ్య పదార్థములు అనబడే జ్ఞేయ శక్తి ఉన్నది అను రూపముగల అభినివేశము చేతనే బంధము’ అనేది కలుగుతోంది. తత్త్వవేత్తలలో ఇటువంటి (దృశ్యము ఆత్మకు వేరుగా ఉన్నది - అను రూపంలో ఉండే) అభినివేశం ఏమాత్రం కించిత్ కూడా ఉండటం లేదు. వారికి జ్ఞాన స్వరూపమగు పరమాత్మయే తనతోసహా సర్వ పదార్థాకారములుగా, సర్వ పదార్థ ధర్మములుగా భాసిస్తున్నట్లు అగుపిస్తోంది.

జ్ఞానమే ... జ్ఞేయము, తెలుసుకుంటున్నదే ... తెలియబడురూపంగా ఏర్పడి ఉన్నది.

అందుచేత తత్త్వవేత్తల దృష్టిలో బంధ మోక్షముల కల్పనయే ఉండటం లేదు. అంతా యథా తథంగా ఆత్మగా అనిపించటమే సర్వశాస్త్ర సాధనముల అంతిమ ప్రయోజనం. అట్టి ప్రయోజనం సిద్ధించుకున్న తరువాత “జ్ఞానమునకు భిన్నంగా జ్ఞేయం లేదు అని స్వభావ సిద్ధంగా సుస్పష్టమౌతుంది.

జ్ఞాని - అజ్ఞాని కూడా ఆత్మస్వరూపుడే! జ్ఞానాజ్ఞానములు ఆత్మయొక్క లీలావినోదం మాత్రమే. దృశ్యము, ఆ దృశ్యమును దర్శిస్తున్న అహంప్రత్యయము, ఆ అహంప్రత్యయమునకు సాక్షి అయినట్టి ‘ఆత్మ - ఈ మూడు వేరు కాదు. ఆత్మయే అహంస్వరూపమై వెల్లివిరుస్తోంది. అహంప్రత్యయమే దృశ్యముగా తనను తాను విస్తరింపజేసుకొని ఆస్వాదిస్తోంది. అనునదే అద్వైతసిద్ధి! శ్రీరాముడు : స్వామీ! ఇక్కడ మీరు చెప్పే ఒక్క విషయం నేను కించిత్ ఇంకా ఒప్పుకోలేకపోతు న్నాను. ప్రకాశరూపుడగు సూర్యుడు ఎప్పుడైనా తాను ప్రకాశింపజేసే వస్తువుల రూపం అవుతాడా? దీపం వస్తువులను - రూపములను ప్రకాశింపజేస్తుంది. అంతేగాని ఆ దీప కాంతి తానే వస్తురూపంగానూ, ఆకారాదులుగానూ ఎక్కడైనా అవుతుందా?... లేదే! అట్లాగే జ్ఞానరూపమగు జ్ఞప్తి ఈ సర్వ పదార్థరూపంగా ఎట్లా అవుతుంది? అవకూడదు కదా!

జ్ఞాన స్వరూపమగు పరమాత్మ యొక్క 'సత్త' చేతనే ఈ బాహ్యమున ఉన్న సర్వ పదార్థాలు స్థితిని పొందుచున్నాయని నేనూ, ఒప్పుకుంటున్నాను. అయితే, తెలుసుకొను తత్త్వ స్వరూపమగు జ్ఞానమే తెలియబడే ఇదమ్ స్వరూపమగు జ్ఞేయము (దృశ్యము)గా అగుచున్నదనునది ఎట్లా యుక్తియుక్తం? చూచే నేను - చూడబడే ఈ దృశ్యము అత్యంత నిర్దుష్టంగా వేరువేరుగా వెలయుచు, సిద్ధించుచుండగా నేనే బాహ్య పదార్థ రూపుడనై ఉన్నాను అని, ద్రష్టయే దృశ్యరూపుడు కూడా ...అనే సిద్ధాంతం ఈ వర్తమానానుభవం దృష్ట్యా ఎట్లా పొసగుతుంది?

2. దృశ్య రూపమంతా ద్రష్టా స్వరూపమే!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! శుద్ధ జ్ఞాన స్వరూపమగు పరమాత్మ సత్త చేతనే ఈ సర్వ దృశ్య వస్తువులు 'సత్తా' పొందుచున్నప్పటికీ... జ్ఞాన స్వరూపమగు ద్రష్ట వేరు - జ్ఞేయ స్వరూపమగు దృశ్యము వేరు. ద్రష్ట దృశ్యరూపుడు కాజాలడు. ప్రత్యక్షానుభవమే ఇందుకు తార్కాణం ...అని నీవు అంటున్నావు కదా! అయితే, "ఈ గొడ్రాలి (వంధ్యా) రెండవ పుత్రుడు ఏ దారి నుండి మన

Page:661

ఊరికి వచ్చాడు? అనే ప్రశ్నలో "గొడ్రాలికి పుత్రుడెట్లా ఉంటాడు?" అనే మీమాంస చేత ఆ ప్రశ్న మొదలే శూన్యస్వరూపమగుచున్నది కదా! ఆకాశం మొదలైన ఈ సర్వ బాహ్య పదార్థాలు అగుపిస్తున్నాయే... అవన్నీ కారణ శూన్యములు. సర్వదా ఆత్మ ఒక్కటే అంతటా ఉండి ఉండగా ...అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? అందుచేత ఇవన్నీ కూడా వంధ్యా పుత్ర సదృశములే (గొడ్రాలి రెండవ కుమారుని వంటివే అయివున్నాయి. ఇక ఇవి ఘనీభూత సత్యముగా భాసిస్తున్నాయి కదా! ... అని అంటావా? ముత్యపుచిప్పలో వెండి యొక్క ప్రకాశము కనబడవచ్చుగాక! ముత్యపు చిప్పలో వెండి ఉన్నదా? లేదు కదా! 'శుక్తి రజతన్యాయం'గా ముత్యపు చిప్పలో వెండి ఉండటం ఎంతగా సత్యమో... ఈ దృశ్యము అంతే సత్యము. ఈ భూమి, ఆకాశం, దేహాలు, వస్తు సముదాయం... ఇవన్నీ కేవలం భావనారూప భ్రాంతి మాత్రమే అయి ఉన్నాయి. అంతేగాని, సత్యము గాదు. ఎవరైనా... ఇవన్నీ ఈ ఈ రూపాలుగా సత్యమే!... అనుకోదలిస్తే అనుకోనీ! అది సత్య దృష్టిచే, జ్ఞానదృష్టిచే (లేక) పరిపక్వ దృష్టిచే అనుభూతము అవగల ఆత్మజ్ఞాన వికాసము” చే క్రమంగా తొలగగలదని మాత్రం ఇక్కడ మనవి చేయగలను. ఇందులో సందేహమే లేదు. శ్రీరాముడు : హే మహర్షీ! జీవన్ముక్తులు, కార్యకారణ తత్త్వవేత్తలు అగు మీ దృష్టిలో ఈ దృశ్యమంతా గొడ్రాలి రెండవ కుమారునివలె, ముత్యపు చిప్పలో వెండిలాగా అసత్యమే అయివుండవచ్చు. మరొక అపరిపక్వ దృష్టి తో కూడిన ద్రష్టకు ఇదంతా సుస్పష్టమైన సత్యంగా అనిపించవచ్చుగాక! ఏది ఎట్లైతేనేం? ఈ దృశ్యము దుఃఖమును మాత్రం కలుగజేస్తోంది కదా! స్వప్నము సత్యమా? అసత్యమా?”...అనునది వేరే విషయం. ముందు... అది దుఃఖాన్ని కలుగజేస్తోంది కదా! అట్లాగే ఈ జగద్ర్భాంతి కూడా అనేక దుఃఖాలను కలుగజేస్తోందే! ఇది సత్యమనండి, అసత్యమనండి. ముందుగా, ఈ దుఃఖాలకు నివారణోపాయం ఏమిటో... అది చెప్పమని నా ప్రార్ధన. ఈ జగత్ప్రమ తొలగేది ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : (పకపకా నవ్వుతూ) నీ ప్రశ్న చమత్కారంగా ఉన్నదయ్యా!

ఏవం తావత్ యథాస్వప్నః తథేయం చేత్ జగస్థితిః |

తత్ పిండగ్రహతార్ధానాం సర్వైవ భ్రాన్తితోదితా! ॥

ఎప్పుడైతే "ఈ జగత్తు స్థితి స్వప్నము వంటిది... అని నీవు ఒప్పుకుంటావో, ఇక ఆపై పెద్దగా చెప్పవలసినదేమున్నది? జగత్ భ్రమ : జగత్ భ్రాంతి... అని నీవే అంటున్నావు కదా! స్వప్నంలో స్వప్న ద్రష్టను బాధిస్తున్న పదార్థాలు, సంఘటనలు, సందర్భాలు మెళుకువ రాగానే ఏమౌతున్నాయి? క్షణంలో అవన్నీ శూన్యరూపమైపోవటం లేదా? అప్పుడిక స్వప్నంలో కలిగిన దుఃఖం ఏమాత్రం (మెళుకువ తరువాత) ఉండటం లేదు కదా! అట్లాగే ఈ జాగ్రత్లో జగత్ ద్రష్ట జగత్తు యొక్క పిండత్వము చేత (సాకారత్వం - నామ రూపాత్మకత్వంచే) బాధింపబడవచ్చు గాక! ఆత్మజ్ఞానముచే ఈ సమస్త జగత్ పిండత్వము అద్దాని యొక్క నామరూపాత్మకత్వం కోల్పోతోంది. అప్పుడు అంతకుముందటి సమస్త దుఃఖములు సమసిపోతున్నాయి. శమించిపోతున్నాయి.

Page:662

ఓ రామచంద్రా! స్వప్నంలో లాగానే... ఈ జాగ్రత్లో కూడా... సమస్త పదార్థముల యొక్క సత్యత్వము భ్రాంతి చేతనే ఉదయించినదగుచున్నది. భ్రాంతి తొలగిన మరుక్షణం ఇక దుఃఖమునకు విషయమే ఉండదు. కాబట్టి స్వస్వభావమగు 'ఆనందము’నకు తలుపులు తెరుచుకుంటాయి. కనుక ‘భ్రాంతి’ ని ముందుగా తొలగించుకోవాలి. అందుకు ఔషధమే ఆత్మజ్ఞానం. శ్రీరాముడు : మీరు చెప్పేది వినటానికి చాలా బాగున్నది. కానీ మహాత్మా!

కిమ్ ఏతావతి సంపన్నే సంపన్నం భవతి ప్రియమ్?

కథంచ శామ్యతి అర్థానాం స్వప్నాదౌ పిండరూపతా?

ఒక నిరుపేదవాడు “నాకు చాలా డబ్బు ఉన్నదిలే అని అనుకుంటే ధనికుడైపోతాడా? “ఈ జగత్తు మిథ్య మాత్రమే... అని అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? అంత మాత్రం చేత ఆనందం కలుగుతుందా? "దృవ్యము కేవలం మిథ్యయే అనే జ్ఞానమాత్రం చేత స్వప్న -

జాగ్రత్తులలోని పదార్థముల స్థూలరూపత్వం ఎట్లా శమిస్తుంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అధ్యాత్మ శాస్త్ర పరిశీలన ద్వారా పూర్వాపర విచారణచే ‘జ్ఞానము ఉదయించగలదు. అట్టి జ్ఞానాగ్నిచే ఇక్కడ కనిపించే స్థూలత్వం భస్మీభూతమై నివర్తించగలదు. ఎట్లా అంటే, స్వప్నంలోంచి మేల్కొనగానే స్వప్నంలో కలిగిన స్థూలభావన, 'అవన్నీ సత్యమే’ అనే బుద్ధి నివర్తితం కావటం లేదా? ఇదీ అంతే!

శ్రీరాముడు : హే గురుదేవా! ఎవనికైతే పూర్వ - పర విచారణచే ఈ జగత్తు యొక్క స్థూలత్వము సన్నగిల్లుచున్నదో... ఆతడు జీవన్ముక్తుడు కదా! అట్టి జీవన్ముక్తుడు ఈ ప్రపంచమును ఏ ప్రకారంగా చూస్తున్నారు? ఆతనిపట్ల ఈ సంసార కూపరూపమగు భ్రమ ఎట్లా శమిస్తోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : వాసనారహితుడగు జీవన్ముక్తుడు ఈ ప్రపంచమును సర్వదా నశించినదాని వలె, అసత్తుగాను, గంధర్వ నగరంలాగా కల్పనామాత్రంగాను, వర్షముచే తుడిచివేయబడబోవుచున్న చిత్రలేఖనం వంటిదిగాను చూస్తున్నాడు.

శ్రీరాముడు : వాసనలు నశించగా, స్వప్నము వంటి ఈ జగత్తు యొక్క పదార్థములందు స్థూలత్వబుద్ధి శమిస్తోంది. అటు తరువాత ఆ మనుజునకు ఏమి కలుగుతుంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : సంకల్పరూపమగు ఈ జగత్తును గూర్చిన స్థూలబుద్ధి నశించగా... అప్పుడు బుద్ధి సూక్ష్మరూపం పొందుతోంది. అట్టి వానికి ఉత్తరోత్తర భూమికా పరిపాకము చేత క్రమంగా సూక్ష్మ వాసనలు కూడా నశిస్తూ వస్తున్నాయి. అట్లు సర్వవాసనా రహితుడగు జీవుడు 'ఆత్మానుభవం' పొందుచున్నాడు. అట్టి వాసనారాహిత్యముచే రూపుదిద్దుకున్న ఆత్మానుభవంచే ఆతడు పరమశాంతిని పొందుచున్నాడు.

శ్రీరాముడు : అయితే మహర్షీ! ఈ జగత్తు స్థూల దర్శనమునకు వాసనలే కారణమై ఉన్నాయి. ఈ వాసనలు అనేక జన్మలందు బాగా దృఢపడి ఉన్నాయి కదా! దృఢమైన మూలము - విస్తృతమైన శాఖలు ఈ వాసనావృక్షం కలిగియున్నది.

Page:663

అనేక జన్మ సంరూఢా శాఖా ప్రసవశాలినీ, భవ బంధకరీ ఘోరా, కథం శామ్యతి వాసనా?

అట్టి వాసనలే ఘోరమైన సంసార బంధములన్నీ కలుగజేస్తున్నాయి. అట్టి అతి భయంకరమై ఒప్పుచున్న ఈ వాసనలు తొలిగేది ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భ్రాంతిమాత్రమగు ఈ దృశ్యం 'ఆత్మ జ్ఞానం' అనే పవిత్రమైన అవగాహనచే మాత్రమే స్థూలరాహిత్యం పొందగలదు. అట్టి జ్ఞానంచే స్థూలత్వం తరుగుచూ ఉండగా ...అప్పుడు వాసనాక్షయం కూడా క్రమంగా దానంతట అదే, స్వయంకృతంగా కలుగగలదు. శ్రీరాముడు : ఓ మునీశ్వరా! జగతృశ్యచక్రము క్రమంగా స్థూలత్వరహితం కాగా... అప్పుడు ప్రాప్తించేదేమిటి? అట్టి వానికి పూర్ణశాంతి ఎట్లా లభిస్తుంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఎప్పుడైతే జగత్తుయొక్క స్థూలత్వమును గురించిన భ్రమ క్రమంగా ఉపశమిస్తూ వస్తుందో... అప్పుడిక దృశ్యమంతా కూడా చిత్త మాత్ర స్వరూపం పొందుతోంది. ఈ జగత్తు నిరోధ భార రహితమౌతోంది. అంతా కూడా అతి సూక్ష్మత్వం సంతరించుకుంటోంది. అప్పుడా మనుజునకు సర్వ భోగాలలో ఆసక్తి శమిస్తోంది. ఆతడు స్వభావ సిద్ధంగానే పరమవైరాగ్యవంతుడు అగుచున్నాడు. శ్రీరాముడు : హే మహర్షీ! ఒక బాలుడు అతికోమలుడు, ప్రకాశశీలుడు అయివుండి కూడా ఇంత లోనే ఆయా కనబడే వస్తు - - విషయాదులపట్ల ఏర్పడుచున్న సంకల్పముల పరంపరల చేత అనేక దుఃఖాదులు కొనితెచ్చుకుంటున్నాడు. అట్లాగే ఒక యువకుడు కూడా తెలివికలవాడై కూడా దృశ్యమునకు సంబంధించిన అనేక సంకల్ప - వికల్పాలు తనయందు పెంపొందించుకుని తద్వారా అనేక ఆవేదనలను దుఃఖాలను కొనితెచ్చుకుంటున్నాడు. అట్టి సంకల్ప పరంపరల వలన పుట్టుకొస్తున్న దుఃఖాదులకు తరుణోపాయం ఏమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్తు సంకల్పమాత్రమే! అని గ్రహించిన తరువాత, ఇక ఆపై దుఃఖం దేనికి? అవిచారణచే ఈ జగత్తు నా ఊహా సంకల్పచమత్కారం మాత్రమే... అని గ్రహించకపోవటం చేతనే బాలునికి (ఇదంతా స్థూలంగా నమ్మడం వల్ల) దుఃఖం కలుగుతోంది. మరి నీవో! మన ఈ చర్చనీయాంశం యొక్క సారమును గ్రహించి ఉండటంచేత ఇదంతా సంకల్పమాత్రమే” అని గమనించియే ఉంటావు కదా! అట్టి సంకల్పము చేతనే జగత్తు అనుభూత మౌతోందని గ్రహించినప్పుడు, ఇక ఆపై (ఈ జగత్తు నశిస్తున్నప్పుడు కూడా) ఏమాత్రం దుఃఖం కలుగదు. ఈ విషయమై నీవు 66 చిత్తము ఎట్టిది? అనే విషయం పదేపదే విచారణ చేస్తూ ఉండాలి. శ్రీరాముడు : మహర్షీ! ఈ చిత్తము యొక్క స్వరూపము ఎటువంటిది? అద్దాని గురించి విచారణ చేయటం ఎట్లా? అద్దాని గురించి బాగుగా విచారణ చేస్తే అప్పుడు లభించేదేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి :

చితః చేతో ఉన్ముఖత్వం యత్త్ “చిత్తమ్ ఇతి కథ్యతే | విచారణ ఏష ఏవాస్య వాసనానేన శామ్యతి ॥

Page:664

చిత్తము యొక్క స్వరూపము - - చైతన్యము విషయముల వైపుగా అభిముఖం కావటం. అట్టి విషయాభిముఖత్వం తప్పించి చిత్తమునకు వేరు రూపమూ లేదు, అంతకు వేరుగా చిత్తమూ లేదు. మన ఈ “వసిష్ఠ-రామ సంవాదం (యోగ వాసిష్ఠం) రూపంలో ఏ మహారామాయణం శ్రవణం చేస్తున్నామో... ఇదంతా కూడా చిత్తము యొక్క విచారణయే అయివున్నది సుమా! ఇటువంటి విచారణ చేత వాసనలు తప్పక క్షయిస్తాయి.

శ్రీరాముడు : ఒక ప్రక్క ఈ చిత్తము విద్యమానమై ఏదో రకంగా విషయోన్ముఖత్వం అవుతూనే ఉన్నదే! ఏదో కొద్ది సమయం నిరోధించినా కూడా, మరల ఎప్పుడో మాకు తెలియకుండానే మమ్ము లను మరపించి విషయాల వైపుకు పరుగులు తీస్తోంది! ఏమిటి చేయటం? మరి ఇది విషయాలను పొందకుండా ఎంతవరకు ఊరకుంటుంది? అట్టి చిత్తం యొక్క అచిత్తత్వ స్థితి ఉదయించటమెట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఈ దృశ్యమే అసంభవమై ఉన్నది. మొదలే లేని దానిని చిత్తము ప్రకాశింపజేయటమనే మాట ఎక్కడిది? కనుక, దృశ్యమే లేదు. కనుక ఇద్దానిని ధరించే చిత్తము మొదలే లేదు అని భావించటం చేత చిత్తము లేకయేపోతుంది. దృశ్యము లేదని అభ్యాసం నిర్వర్తించటమే చిత్త వినాశనమునకు ఉపాయం.

శ్రీరాముడు : మహాత్మా! ప్రత్యక్షంగా అందరిచేతా అన్ని సమయములలోను అనుభవించబడుచున్నట్టి దృశ్యజగత్తు “లేనిదే” ఎట్లా అవుతుంది? స్వామీ! ప్రత్యక్షంగా అందరికీ అనుభవమగుచున్నదానిని మీరు ఎట్లు నిషేధిస్తున్నారో ముందుగా నాకు చెప్పండి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇక్కడ ఏ సాకార జగత్తు అయితే అజ్ఞానులకు అనుభమౌతుందో ...అది సత్యము కాదు. ఇక జ్ఞానులకు ఏది అనుభూతమౌతోందో... అది వాక్కుకు అతీతము - అద్వయము - పరమ సత్యము అగు పరబ్రహ్మమే అయివున్నది.

శ్రీరాముడు : మహర్షీ! 1. అజ్ఞానులకు ఈ త్రైలోక్య జగత్తు ఎట్లు భాసిస్తోంది?2.అది సత్యము ఎందుకు కాదు? 3.జ్ఞానులకు ఈ జగత్తు ఎట్లు భాసిస్తోందో, అది చెప్పటానికే ఎందుకు వీలుకాదు? ఎందుకు వారి అనుభవం వాక్కుకు విషయం కాదు?

శ్రీ వసిష్ఠ మహర్షి : అజ్ఞానులకు ఈ జగత్తు... ఆద్యంత సహితంగాను, దేశ కాల వస్తు పరిచ్ఛేదయుక్తంగాను, ద్వైతరూపంగాను భాసిస్తోంది (అనిపిస్తోంది). ఇక జ్ఞానులకు ఆ రూపంగా ఇది భాసించటం లేదు. వారికి ఇదంతా కూడా... ఆరంభం నుండి ఎప్పుడూ కూడా ఉత్పన్నము కానిదియే గాను, గొడ్రాలి రెండవ కుమారుని గుణగణములవలె ఏ కాలమందునూ అసలు సంభవించనిదానివలె, అసద్రూపంగాను భాసిస్తోంది (అనిపిస్తోంది.

శ్రీరాముడు : హే బ్రహ్మన్! ఏ జగత్తెతే ప్రారంభం నుండి ఉత్పన్నమే అయివుండలేదో, ఎప్పుడూ కూడా ఏమాత్రం సంభవించనిదై ఉన్నదో, అసద్రూపం మాత్రమే అయివున్నదో, మొదలే భాసించనిదై ఉన్నదో... అట్టి ఈ జగత్తు సర్వులకు అర్ధక్రియా సమర్థముగా ఎట్లా అనుభూతమౌతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నంలో అనేక విశేషాలు కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కారణ శూన్యము

Page:665

ఉత్పత్తి రహితము అసద్రూపమే అయివున్నాయి కదా! అయినప్పటికీ కనబడటం, అర్ధక్రియా సమన్వితంగా అనిపించటం జరగటం లేదా? అట్లాగే... ఈ జగత్తు కూడా స్వప్నమువలె ఉద్భవించినదై... అర్ధ క్రియా సమర్థంగా అనుభూతమౌతోంది.

శ్రీరాముడు: స్వామీ! స్వప్నంలోను, మనోరాజ్య కల్పనయందు ఏ దృశ్యం అనుభవించబడుచున్నదో, ...అదంతా కూడా జాగ్రత్ వ్యవహారము యొక్క అనుష్ఠాన - అనుభవములచే కలిగిన సంస్కారము వలన అనుభవించబడుచున్నదే గాని, మరింకేమీ కాదు కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) ఓ రామచంద్రా! అయితే నా ప్రశ్నకు మొట్టమొదట సమాధానం చెప్పు. స్వప్నంలోను, సంకల్పములోను, మనోరాజ్యములోను ఏఏ పదార్థములు అనుభవించబడు చున్నాయో... అవి ఈ జగత్తులో ప్రసిద్ధమై కనిపించే పదార్థములేనా? (లేక) వేరే అన్యమైనవా? శ్రీరాముడు : మహర్షీ! స్వప్నంలోను, కల్పనాదులందు, మనోరాజ్యంలోను ఏఏ పదార్థాలు భాసించుచున్నాయో... అవన్నీ కూడా - జగత్ ప్రసిద్ధములైన పదార్థములే స్వప్నంలో భాసిస్తున్నాయి - అని నా అభిప్రాయం.

శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లాగా? సరే! ఒకవేళ నీవు చెప్పినట్లు జాగ్రత్ పదార్థములే స్వప్నంలో భాసిస్తు న్నాయనే అనుకుందాం. మరి రాత్రి స్వప్నంలో ఒక భవనం నేలమట్టం అయినట్లుగా కల వచ్చిన ప్పటికీ, తెల్లవారి లేచేసరికి ఆ భవనం నేలమట్టం కాకుండా యథాతథంగానే ఎందుకుంటోంది? శ్రీరాముడు : మహాత్మా! మీరు చెప్పింది నిజమే! స్వప్నంలోను, సంకల్పాదులందు... ఏ జగత్తు భాసిస్తోందో... అది ఈ జాగ్రత్ జగత్తు కాదు. బ్రహ్మమే అక్కడ స్వప్నంలోను సంకల్ప నగరం (ఊహారాజ్యం) లోను ఆయా విధాలుగా పదార్థరూపంగా భాసించుచున్న దగుచున్నదని మీ అభిప్రాయం నేను గమనిస్తున్నాను. కానీ, ఆ బ్రహ్మము అపూర్వమైన (ఇంతకు ముందు లేనట్టి) జగత్తు వలె ఎందుకు భాసిస్తోందో చెప్పండి?

శ్రీ వసిష్ఠ మహర్షి : జగత్తులో చిత్తముచే అనుభవించబడే పదార్థాలన్నీ కూడా... కొన్ని పూర్వము అనుభవించబడియో, సందర్భపడియో ఉండటంచేత అపూర్వములు కాకయే ఉంటున్నాయి. మరి కొన్ని పూర్వం అనుభవించబడకయే, పరిచయం లేనివే అవటం చేత అపూర్వములై ఉంటున్నాయి.

అయితే అవన్నీ కూడా దృష్టి యొక్క ఆది-అంతము-మధ్యలలో ఏ ఆకారములుగా అభ్యసిస్తే ఆయా ఆకారములుగానే భాసిస్తున్నాయి. కాబట్టి అభ్యాసమును అనుసరించే అనుభవం ఉంటోంది. ఇవన్నీ బ్రహ్మాకారమే”... అని బాగుగా అభ్యసిస్తే బ్రహ్మముగానే భాసిస్తున్నాయి. ద్రష్ట యొక్క అభ్యాసమునకు వేరుగా ఈ జగత్తుకు ఏ ఆకారమూ లేదు. ఎవరికీ ఏ ఆకారం ఎచ్చట అనుభవమగు చున్నదో అది అట్టి సుదీర్ఘమైన అభ్యాసం చేతనే ఆ విధంగానే సిద్ధించినదగుచున్నది. శ్రీరాముడు : మహాత్మా! మీరు ఈ విధంగా బోధిస్తూ ఉండగా, మీ పరమోత్కృష్టమైన బోధనా ప్రభావంచే బోధితుడను అగుచున్నాను. "ఈ జాగ్రత్ జగత్ కూడా పూర్వాపూర్వముల కలయికచే స్వప్నం వలె మిథ్యగానే భాసిస్తోంది అనే విషయం ఇప్పుడు నేను మరింత నిర్దుష్టంగా ఎరుగున్నాను.

Page:666

కాని గ్రహం పట్టిందా?”... అన్నట్లుగా 'సంసార స్వప్నము' అనే పిశాచం నన్ను ఇంకా బాధిస్తూనే ఉన్నది. దీనికి చికిత్స ఏమిటో... అది చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ "సంసార స్వప్నము అనే కార్యమునకు కారణం ఏమిటో మొట్టమొదట విచారణ చేయి. కారణము యొక్క నాశనముచే కార్య రూపమగు ఈ సంసార భ్రమ తనంతటతానే తొలగిపోగలదు.

శ్రీరాముడు : స్వప్న రూపములగు ఈ జగత్ పదార్థములకు హేతువు (కారణం) ఈ చిత్తమేనని నాకు అనిపిస్తోంది.

శ్రీ వసిష్ఠ మహర్షి : కాబట్టి అనుభవమగుచున్న సర్వ జగత్ పదార్థములు చిత్తము యొక్క రూపములే! అందుచేత అసారమగు ఈ ప్రపంచము వాస్తవానికి ఆద్యంతరహితము నిర్వికారము అగు బ్రహ్మమే అయివున్నది.

చిత్తము చిత్ రూపమే! దృశ్యము చిత్త రూపమే! కనుక, దృశ్యము చిత్ రూపమే!

అందుచే స్వప్నం - జాగ్రత్తు మొదలైనవి బ్రహ్మము కంటే భిన్నంగా కొంచెము కూడా లేవు. శ్రీరాముడు : మహాత్మా! ఈ జగత్తు బ్రహ్మము ఒక్కటేనని మీరు అంటున్నారు కదా! అయితే... అవయవియగు వృక్షము అవయవములగు కొమ్మలు ఒక్కటేగానూ అయి, వేరు వేరుగానూ అయి ఉంటున్నాయి కదా! అట్లే బ్రహ్మము - జగత్తులు అవయవి - అవయవములవలె ఏకభావంగాను, వేరువేరుగా కూడా ఉన్నాయని ఎందుకు అనుకోరాదు? "జగత్తు యొక్క ఆది సమష్టి చిత్తము. ఆ సమష్టి చిత్తము చిత్తుకు అవయవమువంటిది అయివుండవచ్చా?

శ్రీ వసిష్ఠ మహర్షి : అటువంటి కల్పన సంభవించునదే కాదు. ఎందుచేతంటావా? జగత్తు ప్రారంభం నుండే ఉత్పన్నమయి ఉండలేదు. మొదలే లేనట్టి ఈ ఈ కల్పనామాత్ర జగత్తుకు బ్రహ్మముతో భేదాభేద సంబంధంగాని, అవయవ - అవయవీ సంబంధంగాని ఏమాత్రం సంభవించదు. కాబట్టి జగత్తంతా కూడా "శాంతము, జన్మజరా వర్జితము, అఖండము అగు పరబ్రహ్మమే అయివున్నది. శ్రీరాముడు :

కాకతాలీయవత్ మన్యే సర్గాద్యన్తాదయో భ్రమాః

భ్రాంతిః ద్రష్టుత్వ - - బోక్తృత్వసహితాః పరమే పదే |

ఓ మహాత్మా! మహర్షీ! ఇప్పుడు నాకు ఏమి అనిపిస్తోందంటే... ఈ ద్రష్టత్వము భోక్త ృత్వము

భ్రాంతి మాత్రమే. అట్టి ద్రష్టత్వ - భోక్తృత్వ సహితంగా ఈ సృష్టి యొక్క ఆది - మధ్య - అంతము అనే భ్రమలు కాకతాళీయంగా, అకస్మాత్తుగా పరబ్రహ్మము నందే స్థితి కలిగియున్నాయి.

అయితే, బ్రహ్మమునకు వేరుగా ఈ జగత్తు అనబడే దంతా ఉండటానికే ఏమాత్రం వీలు లేదు” సమా!

Page:667

3. తాత్త్విక దృష్టి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో 3 విధములైన దృష్టులు ప్రసిద్ధములై ఉన్నాయి.

1. పామర దృష్టి / భౌతిక దృష్టి : వర్తమానంలో కనిపించే ఈ ఈ వస్తు ఆకారాలు - నేను - నీవు అనునవి ఈ ఈ రూపంగానే - సత్యమై ఉన్నాయని దర్శించే దృష్టి.

2. యౌక్తిక దృష్టి (యుక్తితో కూడినది)/ తార్కిక దృష్టి : ఈ జగత్ కార్యమునకు (దృశ్యానుభవమునకు) ఏ 'చిత్తము' అనబడే సూక్ష్మ సత్త కారణరూపంగా ఉన్నదో అద్దానిని గమనించే “దృష్టి”.

3. తాత్త్విక దృష్టి సశాస్త్రీయ గురుబోధచే ఈ నేను, నీవు, దృశ్యము, జగత్తు, సర్వదా నిర్మలము, అఖండము, అప్రమేయము, కాలాతీత సత్యము అగు బ్రహ్మమే సర్వదా అయివున్నదను ఆత్మసాక్షాత్కార దృష్టి.

ఈ 3 దృష్టులలో మొదటిది రెండవ దృష్టి చేత, రెండవది మూడవ దృష్టి చేత నిరాకరించబడుతోంది. నేను ఇంతవరకు సారాసార విచారులు ఉత్తమ దృష్టి యందు బహు సమర్థులు, ప్రమాణ ప్రమేయముల తత్త్వమును పరిశీలించిన వారు, పండితులు అగువారి దృఢవ్యాపార రూపమైన యౌక్తిక దృష్టిని అవలంబించి అనేక విశేషాలు చెప్పాను. అట్లాగే అధ్యాత్మ శాస్త్రముల శ్రవణ - మనన నిధిధ్యాసచే సిద్ధించే పరతత్త్వమును, ఆ పరతత్త్వము యొక్క అపరోక్ష స్ఫురణము, ఆ అపరోక్ష స్ఫురణము యొక్క చరమ సాక్షాత్కార వృత్తి యందు కనిపించే జీవన్ముక్తులలో ప్రసిద్ధమైయున్న తత్త్వదృష్టిని అనుసరించి కూడా అనేక విషయాలు చెప్పాను. ఈ తత్త్వదృష్టిచే ఈ ద్రష్టలు, దృష్టులు, జీవులు, త్రికాలములు చైతన్యాత్మ రూపమే అయివున్నాయో.... వివరించాను. నిత్య-అపరోక్ష-బ్రహ్మాత్మైక్య వస్తు స్థితి వరకు, ఈ జగత్తు ఏ విధంగా వస్తురూపం గాని, శూన్యరూపంగాని కాదో... అవన్నీ వివరించి చెప్పాను. నీ ఆత్మరూపమే నీకు తదితర జగత్తుగా కనిపిస్తోంది" అని గమనించటమే నా ఉపదేశసారం.

శ్రీరాముడు : అవును స్వామీ! కాబట్టి ఈ జగత్తంతా కూడా పరమార్థ భూతమగు బ్రహ్మము యొక్క వివర్తమే అవుతుంది. ఇక సదా స్వస్వరూపమై, సర్వ స్వరూపమై వెలయుచున్న బ్రహ్మము ఏ సమయమందూ ఉదయించటం లేదు. అస్తమించటం లేదు. తార్కిక దృష్టిచే (యౌక్తిక దృష్టిచే) . భ్రాంతియే ఇట్లు జగత్తు రూపంగా భాసిస్తోంది... అని తెలుస్తోంది. అనగా అవిద్య చేతనే ఈ దృశ్యము బ్రహ్మముగా కాకుండా, అనేక విశేషములతో కూడిన జగత్తుగా అనిపించటం జరుగుతోంది. తత్త్వదృష్టితో చూస్తే ఆ భ్రాంతి కూడా లేదు. కేవలం "బ్రహ్మసత్త" మాత్రమే కలదు! శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! చాలా చక్కగా చెప్పావు. బ్రహ్మము స్వయంగా తన యందు కాకతాళీయ న్యాయంచే ఏ రూపంగా (అవిద్యచే) భాసించుచున్నదో... అదియే జీవభూతము అయి, స్వయంగా 'జగత్తు' అనబడు దానిని ఎఱుగుచున్నది.

Page:668

శ్రీరాముడు : ఓ మునీంద్రా! ఇదంతా చాలా ఆశ్చర్యంగానే ఉన్నది. అయితే బ్రహ్మము నిత్యప్రకాశము కదా! త్రికాలములందు యథాతథము కదా! మరి... మహాప్రళయంలోను, సృష్టి ఇంకా ప్రారంభమే కానప్పుడు (సృష్ట్యాదియందు), మోక్షదశ యందు ఆకాశము - ఈ భూమి - ఈ దిక్కులు ఇవన్నీ ఉండవు కదా! మరి ఇవన్నీ లేనప్పుడు అపరిచ్ఛిన్నమైన చిత్రకాశము ఎట్లా ప్రకాశించగలుగుతుంది? ఎందుకంటే, గోడ మొదలైన ఏవైనా వస్తువులు అవలంబనం ఉంటేనే దీపకాంతి ప్రకాశిస్తుంది కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును! పరమాత్మ యొక్క వస్తు - - విషయ రహిత ప్రకాశ స్వరూపం అత్యంతాశ్చర్యకరమైనదే! అయితే అది నీకు నీవే నీ విచారణ దృష్టితో దర్శించు. సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువు లన్నిటినీ ప్రకాశింపజేసేది చిత్ప్రకాశమే! కాబట్టి అది అంధకారమును కూడా ప్రకాశింపజేస్తోంది. అందుకే అది సర్వప్రకాశ్యకం. (తమేవభాన్తమ్ అనుభాతి సర్వమ్! తస్యభాసా సర్వమిదం విభాతి!)... అని శ్రుతులు ఆ విషయం గానం చేస్తూనే ఉన్నాయి కదా!

సూర్యకాంతి గోడయొక్క అపేక్ష లేకయే అద్దానియందు ప్రవేశిస్తోంది. అంతేగాని గోడ ఉండటం చేత సూర్యకాంతి జనించటం లేదు కదా! పైగా... గోడ - - అద్దానిని ప్రకాశింపజేసేది రెండూ కూడా ఆత్మ ప్రకాశము చేతనే సిద్ధిస్తున్నాయి. అంతేకాదు. గోడను ఇంకా స్పృశించనప్పటికీ ఆకాశంలో కాంతి ఉన్నది కదా! అట్లాగే సృష్ట్యాది యందు, ప్రళయము నందు, మోక్ష దశయందు, వక్త - శ్రోత స్వరూపమగు ఆత్మ విషయరహితమై ప్రకాశించుచున్నది. అయితే అద్దాని "విషయరహిత స్వయం ప్రకాశకత్వం" గురించి నేను చెప్పగలిగేది కాదు. ఆ విషయం స్వయంగా ఎవరికి వారే గమనించవలసినది. కనుక నీకు నీవే విషయరహిత అహం త్వమ్ రహిత చిత్ప్రకాశమును నీకుగా దర్శించు. అద్దాని గురించిన సూచనఅంతా మన ఈ సంవాదము నందు తప్పక లభిస్తూఉంటుందని గుర్తు చేస్తున్నాను.

అందుచేత రామచంద్రా! ఈ ద్రష్ట - దర్శన - దృశ్యములనబడే త్రిపుటి కొంచెం కూడా వాస్తవానికి లేదు. సృష్ట్యాదియందు చిత్రకాశమే స్వయంగా ప్రకాశించునదిగా - ప్రకాశింపజేసేదిగా అగుచున్నది. దృష్టాంతానికి స్వప్న చైతన్యమే స్వప్నంలో స్వప్న ద్రష్ట - స్వప్న దర్శనము - స్వప్న దృశ్యము అగుచుండటం ప్రతి జీవునికి అనుభవైకవేద్యమే కదా! అట్లాగే ఇక్కడ కూడా ఒకే చైతన్యం ద్రష్ట - దృశ్యములుగా కూడా ప్రకాశిస్తోంది. ఈ విధంగా ప్రకాశింపజేసేది - ప్రకాశించునది - ప్రకాశము...ఈ మూడూ చిత్ప్రకాశమే అయివున్నది. ఇక సృష్ట్యాది యందు 1.ద్రష్ట, 2. దర్శనము, 3.దృశ్యము అనే మూడు రూపాలుగా అయి సృష్టివలె భాసిస్తోంది సుమా! ఈ విధంగా ప్రకాశమానమై జగత్తు (దృశ్యము) రూపంగా ప్రకాశించటమనేది ఆ చైతన్యం యొక్క మాయాశక్తి ప్రధానమగు స్వభావమే అయివున్నది.

అన్నిటికీ మును-ముందే సత్స్వరూపమైయున్న చిత్రకాశమే దృశ్యరూపంగా కనబడటం స్వప్నంలోను, సంకల్ప నగరంలోను అందరికీ అనుభూతమగుచున్న విషయమే కదా!

Page:669

ఆద్యంతరహితమైనట్టి చిదాకాశమే చిదాకాశమున... జగత్తు (దృశ్య) రూపంగా భాసిస్తోంది. చిదాకాశము యొక్క సృష్టి రూపంగా భాసించే చమత్కామే ఈ సృష్టి స్వరూపం.

ఈ జగత్తు అజ్ఞానులకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు గాక! (శుద్ధజ్ఞానులమగు) మాకు ఆశ్చర్యమేమీ లేదు. మాకు ఇదంతా బ్రహ్మము యొక్క స్వభావంగానే అగుపిస్తోంది. మాకు ఎప్పుడైనా కాకతాళీయంగా త్రిపుటిజ్ఞానం (ద్రష్ట - దర్శనము - దృశ్యము వేరువేరుగా) స్ఫురించినప్పటికీ... మా యొక్క తత్త్వానుసంధానం చేత ఆ త్రిపుటి (చూచువాడు వేరు. చూడటం వేరు - చూడబడేది వేరు అని అనిపించటం) వెనువెంటనే మటుమాయమై పోతోంది.

అందుచేత...సృష్టికి పూర్వం త్రిపుటి లేదు. ప్రకాశ్యము లేదు. ప్రకాశ్యకము లేదు. ఆ తరువాత మిథ్యాజ్ఞానవశం చేతనే పరమాత్మ యందు ఈ జగత్తు (నా దృష్టి దోషంచే) ఉదయించింది. అక్కడ ఉన్న మోడు (కొమ్మలు లేని ఎండిపోయిన వృక్షము) అయినప్పటికీ పసిపిల్లవానికి చీకట్లో ఎవరో మనిషి ఉన్నట్లు అనిపిస్తుంది కదా! అట్లా నాకు "నేను - నీవు - దృశ్యములతో కూడిన జగత్తు భ్రమచే అనిపిస్తోంది" - అని తత్త్వజ్ఞులు అనుసంధానం చేస్తున్నారు. అదియే తత్త్వానుసంధానం.

ఆత్మయందు 'ద్వైతము' యొక్క భాసనము వాస్తవానికి లేనేలేదు. మరి? ఈ ద్వైతము చిత్తమునందు మాత్రమే భాసించటం జరుగుతోంది. సృష్ట్యాది యందు ఈ ప్రకాశించబడే (ప్రకాశ్యకమగు) జగత్తు లేదు. కానీ చిదాత్మమాత్రం అవశ్యం ఉన్నది. చిదాత్మ ద్వైతంగా భాసించటానికి బాహ్యమైన హేతువు (కారణం) లేదు. కనుక, చిదాత్మయే ద్వైతరూపంగా భాసించుచున్నదగుచున్నది. కాబట్టి ఈ జగత్తంతా కూడా చిదాకాశ రూపమే! అట్లా కాకుండా శుద్ధ చైతన్యమున సృష్ట్యాది యందు ఏ కారణం (హేతువు) చేత జగత్తు ఉత్పన్నం కాగలదో చెప్పు?

ఎప్పుడైతే ఎవరైనా సరే... పవిత్రమైన ఆత్మదృష్టితో పదార్థముల యొక్క అభావము సముపార్జించుకుంటారో... వారికి "చైతన్యమే జగదాకారంగా భాసిస్తోంది"... అనునది క్షణంలో సుస్పష్టమైపోతోంది. అందుచేత ఈ జగత్తంతా కూడా జాగ్రత్ - స్వప్న - సుషుప్తి రహితమగు తురీయ బ్రహ్మ స్వరూపమే అయివున్నది.

స్వప్న రూపమగు ఈ దృశ్యము వాస్తవానికి సంభవించజాలదు. కేవలము బ్రహ్మమే దృశ్యముగా భాసిస్తోంది. సృష్ట్యాది యందు కూడా చిన్మాత్రాకాశమే ఇట్లు జగద్రూపంగా స్ఫురిస్తోంది. జగద్రహిత మగు చిన్మాత్రాకాశము నిజస్వరూపముననే జగత్తుగా ఎరుగుచున్నది. తాను ఎరుగు జగత్తుగా తానే అగుచున్నది. ప్రకాశ రూపమగు పరబ్రహ్మమే ఈ జగత్తు! ఆకాశమునకు - శూన్యత్వమునకు భేదమేమున్నది? అట్లాగే ఈ జగత్తుకు బ్రహ్మమునకు ఏమాత్రం భేదం లేదు.

ఓ రామచంద్రా! ఇదియే నాచే ఇన్ని రోజులుగా సుదీర్ఘంగా చెప్పబడుచున్న తత్త్వానుసంధానం. అట్టి తత్త్వానుసంధానంచే ఆత్మతత్త్వమును ఎరుగుచూ ఉండు. సప్త భూమికలలో ఒక్కొక్కటి అధిగమిస్తూ ఉండు. స్వానుభవం దృఢపడే వరకు తత్త్వాను సంధానమును ఆశ్రయిస్తూనే ఉండు,

Page:670

క్రమంగా వికల్పరహితుడవై, వాక్ - ఇంద్రియ వ్యాపార నిరోధము ద్వారా శిలవలె మౌనమును ధరించినవాడవగుము. నిర్వికల్ప సమాధి యందు స్థితిని సముపార్జించుకో! అజ్ఞాన దశయందు నీ చేత - తదితరులగు జీవులచేత అనాదిగా ఈ సంసారము మరల మరల అనుభవించబడియే ఉన్నది. క్రమంగా వైరాగ్య బలంతో బాహ్య విషయములన్నీ ఆత్మానుసంధానముచే లయింపజేయి. అప్పుడు బాహ్య విషయములు పొందుము" ... అని అజ్ఞులు ఎలుగెత్తి చెప్పుచున్నా సరే... మరల ఈ జగత్తును దృశ్యరూపంగా గ్రహించవద్దు. ఈ కనబడే విషయ సుఖములవైపుగా నీ దృష్టిని సారించనే వద్దు. ఎందుకంటే విషయ సుఖము సమాధికి విఘాతం కలిగిస్తూ ఉంటుంది. అయినా కూడా ఈ జగత్తులో తిను - - త్రాగు - - మాట్లాడు - పలకరించు - - వ్యవహరించు. తదితరులవలెనే సర్వము నిర్వర్తించు.

"నేను - నీవు - దృశ్యము ... అంతా బ్రహ్మమే”... అను ఆత్మానుసంధానమే సంసారమునకు దివ్యౌషధం. అట్టి ఆత్మానుసంధానమును అనుక్షణికంగా, అప్రతిహతంగా కొనసాగిస్తూ ఉండు!

Page:671

XIV. శ్రీరామ ప్రవచనం (శ్రీరామ హృదయం)

1. “భ్రాంతి కూడా బ్రహ్మము రూపంగా దర్శించటం" అనే విశ్రాంతి శ్రీరాముడు : హే మునీంద్రా! హే జగద్గురూ! ఓ సంసారరోగ దివ్యౌషధ స్వరూపుడవగు ఓ శ్రీ వసిష్ఠ మహర్షీ! ఏమి ఆశ్చర్యం!

అహోను సుచిరం కాలం సంభ్రాంతా వయమన్తరే |

అపరిజ్ఞాత మాత్రేణ సంసారపరమాంబరే ||

సంసార రూపమగు ఈ అనంతాకాశములో గల ఈ చిన్న బ్రహ్మాండమందలి ఈ అతిచిన్న ప్రదేశంలో... ఆత్మతత్త్వము యొక్క అపరిజ్ఞానమాత్రంచేత మేమందరమూ చిరకాలంగా ఈ విధంగా పరిభ్రమిస్తున్నాం! ఇది ఆశ్చర్యమే మరి! మీ బోధచే ఆత్మతత్త్వము బాగుగా బోధపడగా... ఈ జగత్తు అనేది భ్రమ మాత్రమే! ఇది కించిత్ కూడా పూర్వము ఉండి ఉండలేదు. ఇప్పుడూ లేదు. ఇకముందు ఉండబోవటమూ లేదు... అని మేము తెలుసుకున్నాం.

సర్వం శాంతం నిరాలంబం విజ్ఞానం కేవలం స్థితమ్, అనంతం చిల్డ్రనం వ్యోమ నీరాగమపకల్పనమ్!

ఈ జగత్తంతా కూడా... శాంతమై, నిరాలంబమైనట్టి (ఆలంబనమంటూ ఏదీ లేనిదై) కల్పనా రహితమైనట్టి రాగ వర్జితం అయినట్టి కేవల పరబ్రహ్మముగానే సర్వదా స్థితినొంది ఉన్నది. ఇదంతా ఎంత ఆశ్చర్యం! ఎందుకంటారా?... పరమ చిదాకాశమే అజ్ఞాన మాత్రం చేత జగద్రూపం పొందినట్లుగా మాకు భాసించటం ఆశ్చర్యమే కదా! పరమ నిర్మలమగు చిదాకాశమే మలినరూపం పొందిన దానివలె ఉన్నదై... ఈ విధంగా ద్వైతరూపంగా లోకాలు, పర్వతాలు కలిగి ఉన్నట్లు అగుపిస్తోంది!

అవును! మీరు చెప్పినట్లు సృష్ట్యాదియందు, ఈ లోకమునందు, పరలోకమునందు, స్వప్నం లోను, మనోరాజ్య కల్పనయందు కూడా చిద్రూపమగు పరమాత్మయే దృశ్యరూపంగా భాసిస్తోంది. కాబట్టి ఇక చైతన్యమునకు వేరుగా దృశ్యం ఎక్కడిది? చైతన్యమునకు వేరుగా ఏదైనా కనిపిస్తే... అది అట్లా అనిపించటమే భ్రాంతి. నేను ఇప్పుడు స్వర్గం చేరాను. నేనిప్పుడు నరకానికి పోతున్నాను... అని ఏ విభ్రాంతి కలిగియుంటామో... అదే నరకప్రాయం. ఈ దృశ్యమంతా వాస్తవానికి సర్వదా, సర్వవేళలా, అంతటా చిన్మయ స్వరూపమే అయివున్నది. కాని, మృణ్మయ స్వరూపం కానే కాదు. నే దం దృశ్యంచ, ద్రష్టా న సర్గో న జగన్నచిత్ న జాగ్రత్ స్వప్న సిద్ధాది, కిమపీదం తదప్యసత్ ॥

Page:672

వాస్తవానికి ఈ దృశ్యముగాని, ద్రష్టగాని, సృష్టిగాని, చిదాభాసుడు గాని (జీవుడుగాని) జాగ్రత్తుగాని, స్వప్నంగాని లేవు. అనిర్వచనీయం అయినట్టి ఈ అవిద్యంతా కూడా అసత్తే అయివున్నది.

ఓ మునీంద్రా! "ఈ భ్రాంతి ఎక్కడి నుండి ఉత్పన్నమైనది?" అనేది - విచారణకు కూడా అయోగ్యమై ఉన్నది. వెలుతురు లేకపోవటమే చీకటి కదా! ఇక ఈ చీకటి ఎక్కడి నుండి వచ్చింది?” అనే ప్రశ్న ఎక్కడిది? భ్రాంతి అసద్రూపమే కదా! ఇక ఎట్లా వచ్చింది? ఎక్కడి నుండి?" - అని చింతన చేయటం అప్రస్తుతం, అసందర్భం కూడా! అది వ్యర్థమైన పనే! “నిర్వికారము - తత్త్వజ్ఞాన స్వరూపము”... అయిన ఆత్మయందు భ్రాంతి సంభవించజాలదు. పైగా... అట్టి భ్రాంతి జ్ఞానం కూడా చిత్స్వరూపమగు పరమాత్మయే గాని అన్యమైనదేదీ కాదు. స్వప్నదర్శనం స్వప్నద్రష్ట యొక్క స్వీయకల్పనా చమత్కారమే అయివుండగా, ఇక స్వప్నంలోని విశేషాలకు కార్య కారణాలు ఎక్కడుంటాయి? అంతరాళమనేదే లేని స్ఫటిక శిలా గర్భంలోనూ, ఆద్యంత రహితమైన ఆకాశంలోను, తత్త్వజ్ఞాన ప్రదమైనట్టి ఆత్మ యందు ద్వైత భేద కల్పన చేయువాడెవడుంటాడు?

మిథ్యైవ అనుభవో భ్రాంతేః స్వప్నే స్వమరణోపమః యదనాలోకనం నామ శామ్యతీదం విలోకనాత్ II

విచారణ చేసియుండకపోవటం చేతనే 'భ్రాంతి' అనేది ఉండి ఉండవచ్చుగాక! స్వప్నంలో ఒకనికి "నేను మరణించాను... అని కల వచ్చినట్లుగా... భ్రాంతి మిథ్యయే అయివున్నది. కాబట్టే అది విచారణచే నశించుచున్నది. మృగతృష్ణలో జలం, రెండవ చంద్రుని రూపం... వీటిని గురించి ఎంతగా విచారిస్తే మాత్రం లభిస్తాయా? అవి భ్రమయే కదా! అట్లాగే జ్ఞానము యొక్క ప్రాప్తి తరువాత అవిద్యాభ్రమ ఎటో మటుమాయమైపోతోంది. ఇక దాని గురించి వెతకటమెందుకు?

బాలునికి చీకట్లో బేతాళము కనిపిస్తున్నట్లుగా ఈ భ్రాంతి జాగ్రత్తులో ప్రత్యక్షంగా కనిపిస్తు న్నప్పటికీ... ఇది (జగత్తుగా) యథార్థం కాదు. ఈ భ్రాంతి... అవిచారణచే వర్ధిల్లుతూ దృఢమవుతోంది. విచారణ చేత నశించిపోతోంది.

ఓ మునీంద్రా! ఇక "భ్రాంతి ఏ కారణం చేత కలిగినది? అనే ప్రశ్నయే శోభించదని గ్రహించాను. ఎందుచేతనంటారా? 'సత్తు' యొక్క విచారణ చేతనే మనకు లాభముంటుంది. గాని... అసత్తు గురించి ఎంత విచారణ చేసి ఏం లాభం? ఈ భ్రాంతి యొక్క మూలం అజ్ఞానమే కదా! అజ్ఞానం అసత్తే అయి ఉండటంచే అది విచారణకు యోగ్యమే కాదు. ఏ వస్తువైతే ప్రామాణిక మైన విచారణచే లభించదో... అది అసత్తే అయి ఉన్నది. "ఆ కథలో ఆతడు అట్లా ఎందుకు మాట్లాడాడు? అనేది విచారణ చేయటం అసంతగతమైన పనియే కదా! కథ మొదలే కల్పన కదా! అట్లాగే ఈ జగత్తు యొక్క మూలము అజ్ఞానమే అయివున్నది. అది అనుభవముచే భ్రమ రూపమేనని తెలియవచ్చుచుండగా... ఇక అద్దాని గురించి విచారణ చేసి ఏం ప్రయోజనం?

శ్రుతి ప్రమాణముచే బాగుగా విచారించిచూడగా ఈ జగత్తు లేకయే ఉన్నది. కాబట్టే పరిచ్ఛిన్నరూపమై వర్ధిల్లుతోంది. ఆకాశంలో ఆకాశపుష్పం కోసము, కుందేలు యొక్క కొమ్ముల

Page:673

కోసం వెతికితే దొరకుతాయా? అసద్వస్తువగు ఈ జగత్తును ఎంత పరిశీలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇద్దాని నుండి సద్వస్తువు ఎట్లా లభిస్తుంది? ఏదైతే అంతటా ఎంతగా చూచినప్పటికీ ప్రమాణములచేతగాని, కారణముల చేతగాని లభించుటయే లేదో, అట్టి దాని సత్త ఎటువంటిదని చెప్పాలి? గొడ్రాలి కుమారుల గుణగణముల గురించి వివరాలు అడగటం వల్ల ఏం ప్రయోజనం?

భ్రాంతి అనబడేది ఏదీ లభించనిదే అయి ఉన్నది. ఇక్కడ భ్రాంతి లేదు. జగత్తు లేదు. దృశ్యం లేదు. నిరావరణ విజ్ఞాన ఘనరూపమగు ఆత్మయే ఈ సమస్త జగద్రూపంగా వ్యాపించి ఉన్నది. ఏ జగత్తెతే ఇక్కడ ఇట్లా భాసిస్తోందో... అది పరబ్రహ్మ రూపమే అయివున్నది.

నిరతిశయానందముచే పరిపూర్ణమగు బ్రహ్మ స్వరూపమున, అపూర్ణమగు బ్రహ్మమే, ఈ విధంగా స్వమహిమయందు స్థితి కలిగియున్నది. 'జగత్తు'గా అజ్ఞులకు, 'కేవల పరబ్రహ్మమే'గా విజ్ఞులకు అనుభూతమౌతోంది. ఇక్కడ 'జగత్తు' అనబడునదేదీ ఒకింత కూడా ఏ సమయమందునూ భాసించటమే లేదు. భాసించకపోవటమూ లేదు. నిర్మలము - శాంతము అయినట్టి పరబ్రహ్మమే ఇట్లు జగద్రూపంగా వెలయుచున్నది.

మహాత్మా! వసిష్ఠ మహర్షీ! ఆ పరబ్రహ్మమే ఇట్లు జగద్రూపంగా భాసిస్తోంది. అట్టి పరబ్రహ్మము ఇట్లు జగత్తుగా భాసిస్తున్నప్పటికి కూడా... పరబ్రహ్మము... సదా నిత్యనిర్మలమై ఉన్నది. జరామరణ రహితమై ఉన్నది. అది ఎవరిచేతా అపహరించబడజాలదు. ఉత్తములచే గౌరవింపబడేది అదియే! వికార రహితము - - నిరామయము అయివున్నది. సర్వత్రా సర్వదా పరిపూర్ణమై ఉన్నది. అహంభావ బోధచే నిరహంభావమై ఉదయిస్తోంది. సర్వవ్యాపకము - పరిశుద్ధ ప్రభువు అయివున్నది. అనేక రూపములై ఉండి కూడా సర్వదా ఏకరూపమే అయివున్నది. ఆవరణ రహితము అయివుండటం చేత సర్వత్రా ప్రకాశించుచునే ఉన్నది. ఆ పరబ్రహ్మమే నేను! అట్టి రామ బ్రహ్మ స్వరూపమే జగత్తు! మీ అందరి స్వరూపుడను నేనే! నామ -రూప- ఆవరణ రహితుడనగు నేనే సర్వదా - సర్వత్రా సర్వముగా ఉదయిస్తూ ఉదయాస్తమములు లేనివాడనై సర్వదా యథాతథంగా ప్రకాశిస్తున్నాను. మీ అందరియొక్క స్వస్వరూపమే నేను. సర్వమునందు సర్వదా ప్రమేయ - అప్రమేయ స్వరూపమగు ఆత్మారామమే అయివున్నాను.

2. అజ్ఞాన నిద్ర నుండి మెలకువ!

శ్రీరాముడు : ఓ మునీంద్రా! వసిష్ఠ మహర్షీ! కర్మోపాసనాసిద్ధులగు దేవతలు గాని, తపఃసిద్ధులగు మునులుగాని ఏ ఆదిమధ్యాంత రహితమగు పరబ్రహ్మమును ఎరిగే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారో... అట్టి పరబ్రహ్మమే జగద్రూపంగా భాసిస్తోంది. కాబట్టి అద్దానికి వేరుగా జగత్తు ఎక్కడ? దృశ్యమెక్కడ? ఇక, ఇదంతా ద్వైతమా? అద్వైతమా? ఈ జగత్తు సాకారమా? నిరాకారమా!... ఇటువంటి చర్చల అనుసంధానం చేతను, వాటిచే మనస్సులో ఉత్పన్నమవ గల

Page:674

భేదభావాలతో కూడిన సందేహములతోను మాకు ఏ పనీ లేదు. అటువంటి విభ్రమములను స్వీకరించవలసిన అవసరమే ఇప్పుడు మాకు కనపించటం లేదు. హే మహర్షీ! ఆద్య స్వరూపమై, సృష్టికి పూర్వమే ప్రసిద్ధమై, సర్వదా శాంతము - - నిర్వికారము అయినట్టి ఏ బ్రహ్మము కలదో, అదియే ఇప్పుడు కూడా మనందరి నిత్య స్వరూపమై ఉన్నది. మనందరి రూపంగా భాసిస్తున్న ఆ బ్రహ్మమే ఈ దృశ్య - సృష్టి రూపంగా కూడా భాసిస్తోంది. ఆకాశమున నీలత్వము - కేశత్వము (వెంట్రుక ఆకారాలు కనిపించటం) - అనంతత్వము ఏ విధంగా అభేద రూపమే అయివున్నాయో, ... అట్లాగే చిదాకాశమున ఈ త్రైలోక్య జగత్తు అభిన్నరూపంగా ఉన్నది. మట్టికి బొమ్మ ఆకారం కల్పించటం చేత ఆ ఆకారము మట్టిని మరొక తీరుగా చెయ్యదు కదా! నిరాకారమైన మట్టియే సాకారమైన మట్టి బొమ్మ ఆకారంలో ఉన్నది. అంత మాత్రానికి ఆ ఆకారము మట్టియొక్క స్వస్వభావాన్ని మారుస్తోందా? లేదే! ఇదివరకు మేము దృశ్యముతో తదాత్మ్యము పొంది ఉండవచ్చుగాక! అంత మాత్రం చేత మా ఆత్మ స్వరూపానికి వచ్చిన లోటేమీ (అప్పుడుగాని, ఇప్పుడుగాని, మరొకప్పుడుగాని) లేనేలేదు.

ఆకాశమున ఆకాశతత్వము (శూన్యత్వము) లాగా, శిలయొక్క ఘనత్వంలాగా, మట్టి యొక్క దేవతాకారంలాగా, జలం యొక్క జలత్వంలాగా... చిదన బ్రహ్మమునందు ఈ ప్రపంచం వర్ధిల్లు చున్నది! అట్టి ఈ ప్రపపంచము ఎక్కడి నుంచీ రావటంలేదు. ఎటువైపుకీ పోబోవటం లేదు. బ్రహ్మమే అభ్యాసవశం చేత జగత్తుగా కనిపిస్తోంది. మీ వాక్య ప్రభావం చేత మేము కొంచెం కొంచెంగా ఇది బ్రహ్మమే కదా... అని అభ్యసిస్తూ వస్తే అంతా సర్వదా బ్రహ్మమేగా అనుభూత మౌతోంది. ఈ 'నేను-నీవు' మొదలైన అహంత్వాది సహితంగా ఈ దృశ్య జగత్తు ఆకాశమునందు దిక్కులందు ప్రసరించి అతి విశాలమై ఉంటే ఉండవచ్చుగాక! అయినప్పటికీ ఇదంతా పరమ శాంతము - పదార్థ శూన్యము అగు చిదాకాశమే అయివున్నది. అట్టి మహాచిదాకాశము సర్వదా అపరిచ్ఛిన్నమే! ఎవనికైనాసరే... ఈ జగత్తు అఖండ పరబ్రహ్మముగా బోధపడిందా... ఆ మాత్రపు ఆత్మ సాక్షాత్కారం చేత ఈ సంసార పిశాచము మరుక్షణం అనుక్షణికంగా శమించినదే అవుతోంది. ఈ జాగ్రత్ృశ్యం ఉండటం చేతగాని, ఇది తొలగి స్వప్నదృశ్యరూపు దిద్దుకోవటం చేతగాని, అది కూడా తొలగి నిర్విషయ సుషుప్తి అనుభవగతమవటం చేతగాని... ఆత్మత్వమునకు వచ్చే హాని, మార్పులు చేర్పులు లేవు. ఏ ఆత్మ వస్తువునందు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు కల్పిత రూపంగా వచ్చి - పోతున్నాయో... అట్టి నిర్మల - నిర్విషయ - అప్రమేయ చిదాత్మయే మనందరి రూపమై ఉన్నది. ఆత్మ విచారణచే మూఢునికి కూడా ఈ సంసార పిశాచము శమించిపోగలదు. ఇక సాధనపరుల విషయం వేరుగా చెప్పనక్కర్లేదు కదా! చిద్రూపమును సంతరించుకొనియున్న జ్ఞాని ఆయా వ్యవహారములందు ఎంతగానో తత్పరుడై ఉన్నప్పటికీ, తరంగానికి - తరంగానికి జలం దృష్ట్యా భేదమే లేనట్లుగా, ఆతనిపట్ల సర్వ భేదములు సమసిపోతున్నాయి. చీకటి తొలగినప్పుడు అంతా విదితమైపోతుంది. చూచారా? అట్లా "ఆత్మసాక్షాత్కార దృష్టిచే అన్ని భేదాలు ఎటు వెళ్ళిపోతు న్నాయో కూడా చెప్పజాలకున్నాను. 'అజ్ఞానము' అనే మండుటెండ అతి భీకరంగా కార్చిచ్చులాగా

Page:675

సెగలు కొల్పుచుండగా వచ్చే బాధలన్నీ... భ్రమ అనే సూర్యుడు అస్తమించగానే సమసిపోతున్నాయి. ఆధిభౌతికము - ఆధిదైవికము ఆధిదైవికము - ఆధి ఆత్మికము అనే త్రివిధతాపములు తొలగిపోగా... ఇక విషయ తృష్ణ నశించి పోతుంది. "ఏదో పొందాలి! లేకుంటే నా గతి ఇంత మాత్రమే... అనే భ్రమ, జ్ఞానము అనే చంద్రోదయంచే ప్రశాంతపడుచున్నది. సంసార సత్త" అనే పగలు అస్తమించగా, ఇక 'మోక్ష సుఖము' అనే అతి ప్రశాంత సమయమగు రాత్రి వచ్చి ఆహ్లాదపరుస్తోంది.

ఓ మహర్షీ! ఈ ఉత్పత్తి - వినాశనములు, కార్యాకార్యములు, జన్మ - జరా - మరణములు వ్యవహార విక్షేపము కలిగించవచ్చు గాక! ఇవన్నీ పొందుచూ కూడా జ్ఞాని ఏదీ పొందనివాడై ఉంటున్నాడు. జ్ఞాని వాటియందు వర్తించనివాడే అగుచున్నాడు. అన్నిటా అన్నివేళలా స్వస్వరూపాత్మ జ్ఞానియే నిశ్చితంగా ఈ సంసారమును నందనవనము వలె అత్యంత ప్రశాంతముగా దర్శించగలుగు చున్నాడు. మిగతావన్నీ ఏదీ ఎట్లున్నా, అవన్నీ దుఃఖమును తొలగించజాలవని నేనిప్పుడు అత్యంత ప్రత్యక్షంగా గమనించగలుగుచున్నాను.

ఓ మునీశ్వరా! వాస్తవానికి ఇక్కడ సుఖం లేదు. దుఃఖం లేదు. అవిద్య లేదు. విద్య అవిద్యలు, ఈ సుఖ దుఃఖాలు... ఇవన్నీ బ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నాయి. ఎరుగబడినదా, ...ఇదంతా నిర్మల పరబ్రహ్మ స్వరూపమే! ఇక్కడ బ్రహ్మమునకు వేరుగా తెలియందిగాని, తెలియవలసింది గాని ఏమీ లేదు. బ్రహ్మమునకు తన స్వరూపము కానిదంటూ ఇక్కడ ఏదీ లేదు. హే మహర్షీ! మీ ప్రవచనము అనే పవిత్ర గంగాజలంలో స్నానంచేసిన ప్రభావం చేత నేనిప్పుడు ప్రబద్ధుడను అయ్యాను.

ప్రబుద్దోస్మి ప్రశాంతా మే సర్వ ఏవ కుదృష్టయః,

శాంతం సమమ్ సో హమ్ ఇదం ఖం పశ్యామి జగత్తయమ్ ॥

నా సర్వ కుదృష్టులు, సమస్త భ్రాంతులు బాగుగా శమించాయి. ఇప్పుడు ఈ త్రిలోకములు ద్వైతము' అనే విషమత్వము త్యజించినవై, పరమశాంతరూపంగా నాకు కనిపిస్తున్నాయి. ఈ సమస్త జగత్తులు నా స్వస్వరూపమే! ఇదంతా చిదాకాశముగా గాంచుచున్నాను!

బాగుగా ఎరుగబడినదా... ఈ జగత్తంతా కూడా కేవలం పరబ్రహ్మమే అగుచున్నది. స్వామీ! ఇదిరవకు అజ్ఞాత స్థితిలో ఒక రూపంగాను, ఈ సమయంలో మరొక రూపంగాను ఉన్నానని, ఇప్పుడు నేను అనుకోవడం లేదు. ఆత్మ - అప్రాప్త స్థితిలో - - అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. నేను సర్వదా ఆత్మారాముడనే గాని, దేహ - మనో - బుద్ధి రూపుడను కాను. ఎటొచ్చీ, అప్పుడు నేను ఆత్మస్వరూపుడనని గమనించి ఉండకపోవచ్చు! ఇప్పుడు మీ 'బోధ' అనే మాధుర్య ప్రభావం చేత (నేను సర్వదా సర్వస్వరూపమగు ఆత్మయేనని గమనిస్తున్నాను. ఏ బ్రహ్మము ఇతఃపూర్వం నా యందు తన ఆత్మను ఎరుగక ఉండటం జరిగిందో... ఆ బ్రహ్మమే ఇప్పుడు తన ఆత్మను ఎరిగినదై స్వస్వరూపమున నెలకొనియున్నది.

Page:676

హే మహర్షీ! ఒకే ఆకాశము శూన్యత్వంగాను, నీలత్వంతోను, ఏకత్వంగాను... ఒకే సమయం లోను, సర్వవేళలందు కూడా నెలకొనియున్నది కదా! అట్లాగే బ్రహ్మము తనకంటే భిన్నమైన అజ్ఞాన - జ్ఞానములు లేనిదై ఉన్నది. జన్మ - - జరామరణ వర్జితమైయున్నది. జ్ఞాత - - అజ్ఞాత రూపమంతా బ్రహ్మమే! ఓ సభికులారా! మీరు నా పరంగా చూస్తున్నదంతా మీ ఆత్మ స్వరూపమే అయివున్నది! నా రూపమున మీరు, మీ రూపమున నేను ఆత్మయందే... ఆత్మగానే వెలయుచున్నాము.

ఓ మునీశ్వరా! ఇట్టి జ్ఞానోదయంచేత నేను పునీతుడనయ్యాను. నిర్వాణరూపుడనయ్యాను. అజ్ఞానము యొక్క రూపమును తెలుసుకొని జ్ఞానిని అయ్యాను. ఇప్పుడు నాకు ఎటువంటి సందేహాలూ లేవు. ఇక ఈ దృశ్యము ఎట్లా ఉండాలంటే అట్లే ఉండుగాక! నాకిప్పుడు ఏ కోరిక కూడా లేదు! కోరికలు తొలగాలనే విక్షేపమూ లేదు. విక్షేపరహితమగు ఆత్మ సుఖమందు నెలకొనియున్నాను. వేద-వేదాంగములు “యథాస్థితం - నిత్యం - అనంతం - సర్వమ్ - అధికస్య అధికం అల్పస్య అల్పం ...అని అనేక విశేషములు చెప్పే ఆ ఆత్మ నేనే! నేనే ఆత్మారాముణ్ణి! మీలోను - నాలోను - ఆకాశంలోను భూమిలోను - నా రూపమే సర్వదా నెలకొనియున్నది. మీ వాక్రవాహ మహిమచే అజ్ఞానం ఎప్పుడైతే తొలగిందో ... అప్పుడిక నా స్వరూపమగు బ్రహ్మమునందు ఈ సర్వము నెలకొనియుండకేం చేస్తుంది? బ్రహ్మమే నా స్వస్వభావం కదా! అది క్రొత్తగా వచ్చింది కాదు. ఇతఃపూర్వం ఎప్పుడూ నేను అదే కదా! కాబట్టి "ఇతఃపూర్వం లేనిది ఇప్పుడు వచ్చింది... అని ఏదో సంతోషించవలసిన అవసరం గాని, "ఇతరులకు లేనిది ఇప్పుడు నాకే లభించింది... అనే న్యూనాధిక భావాలు పొందే సందర్భంగాని లేదు. ఎందుకంటే తెలియని వారు - తెలిసినవారు ...అంతా ఆత్మ స్వరూపులే కదా!

సర్వం సదైవాహం అనంతమేకమ్ న కించిదేవాపి అధవాతిశాంతః ॥

సర్వం న కించచ్చ సదేకమస్మి నచాస్మి చేతీయమహో ను శాంతిః ॥

నేనే సర్వదా సర్వరూపమైయున్నాను. అనంతము, ఏకము అని శాస్త్రములు బ్రహ్మము గురించి చెప్పేది నా గురించే! అంతే కాకుండా... సర్వ ఉపద్రవ రహితుడనై, కొంచెము కూడా పదార్థ రూపము కానివాడనై, సర్వమునకు ఆధారమై అద్వితీయమైనట్టి 'సద్రూపం'గా సర్వదా వెలయుచున్నాను! ఈ సభలోని సభికులందరి రూపము నా రూపమే! బ్రహ్మాండాకార రహితుడనగు నేను సర్వ బ్రహ్మాండ రూపుడనై రామబ్రహ్మమునై వెలయుచున్నాను.

దేశ - కాల - ఆధార - అధేయములు లేనివాడనై ఉండటంచేత వాస్తవానికి నేను ఎచటనూ లేనేలేను. అంతా నేనే! కాబట్టి అంతటా ఉన్నది నేనే! నేను ఏదీ కాదు. అంతయూ నేనే! ఆహా! గురుసత్తమా! ఇట్టి నిర్వాణము పరమశాంత రూపమై, పూర్వానుభవముల దృష్ట్యా పరమాశ్చర్యకరము అయివున్నది.

అధిగతమధిగమ్యం ప్రాప్తమప్రాప్తమన్యైః గతమిద మలమస్తం వస్తుజాతం సమస్తమ్

ఉదితముదిత బోధం తాదృశం యత్ర భూయోః అస్తమయ సముదయానాం నామ నామాపి నాస్తి

Page:677

హే మునీంద్రా! హే మహానుభావా! ఇప్పుడు నేను పరమ పురుషార్థరూపమగు బ్రహ్మ తత్త్వమును తెలుసుకున్నాను. అజ్ఞానమునకు సుదూరమైయున్న మోక్ష సుఖమును పొందాను. ఇక ఈ సంసారానర్థరూపమగు వస్తు సమూహమంతా కూడా నాకు పూర్ణముగా నశించినదైపోయింది.

ఎచ్చటైతే మరల మరణం, దుఃఖం ఇటువంటి అనర్థముల ఊసు కూడా ఉండదో... అట్టి చరమ సాక్షాత్కారం నుండి ఉదితమైన ప్రబోధ రూపమే నా పట్ల ఉదయించినదగుచున్నది. నా ఈ ఇతఃపూర్వపు, ఇక ముందటి దేహాలన్నీ నా స్వస్వరూప మహాసముద్రంలోని పిల్లతరంగాలు మాత్రమే!

3. ఆత్మారామోస్మి సర్వదా!

శ్రీరాముడు : హే మహాత్మా! ఆ స్వయంప్రకాశమగు చిదాత్మ ఈ సమస్త జీవులపట్ల ఏ ఏ జీవుని మనోవృత్తులందు ఎప్పుడెప్పుడు ఏ ఏ భోగాభిలాషచే వివర్తభావము పొందుచున్నదో, ... అప్పుడప్పుడు ఆయా ప్రకారంగానే అద్దానికంతటికీ "భోక్త - భోగము - భోగ్యము అను త్రిపుటీ రూపంగా (ఆత్మయే స్వయముగా రూపం) దాల్చుచున్నది.

కొన్ని రత్నాలు ఒకచోట ఒక గదిలో ప్రోగుచేసి ఉంచామనుకోండి! ఇప్పుడు ఆ వివిధ రత్నముల కాంతి పుంజములు సమ్మిళితంగాను అసమ్మిళితంగాను ఆ గదిలో కనిపిస్తాయి చూచారా? అట్లాగే “ఏకము, అవయవరహితము, పరమ సూక్ష్మము... అగు పరబ్రహ్మమునందు ఒకే అధ్యాస ఒకే సమయంలో అనంత సృష్టుల సమ్మిళితమై ఉంటోంది. అయినప్పటికీ కూడా ... ప్రత్యేక జీవునకు ప్రత్యేక బ్రహ్మాండ... భువనాదులు అతి విస్తీర్ణము కలవై అనుభూతమౌతున్నాయి. అట్టి దృష్టులన్నీ ప్రత్యేకంగా ఉన్నట్లుండి సమ్మిళితములు అగుచున్నాయి.

ఈ సృష్టులు బ్రహ్మమునందు తాదాత్మ్య ధ్యాస చేతనే మనుగడ సాగిస్తున్నాయి. స్వాత్మయందు దేనికీ అవరోధం లేదు. అవకాశమూ లేదు! స్వాత్మ యొక్క స్వరూపమునకు వాటితో ప్రమేయమూ లేదు! విశాలమగు 'పరబ్రహ్మము' అనే రత్నము నుండి ఈ కంటికి కనబడే - కంటికి కనబడని అనేక జగత్ సృష్టులు రత్నము యొక్క కిరణ పుంజముల వలె పరస్పరము సంబంధ అసంబంధపూర్వకంగా వస్తున్నాయి - పోతున్నాయి.

ఒక గదిలో ఒకే సమయంలో అనేక దీపాలు వెలుగుచుండగా... సమాన నేత్రేంద్రియములు గల జీవులందరికీ ఒకే తీరుగా పరస్పరము అనుభవమగుచున్నట్లు.... సమాన కర్మ - వాసనలచే అధ్యస్తులైన అనేకమంది జీవులకు పరస్పరము సృష్టుల అనుభవం కలుగుతోంది. వేరువేరు కర్మ - -

వాసనలు గల జీవులకు వేరు వేరు సృష్టుల అనుభవం కలుగుతోంది. ఇంతకు మించి జీవులకు వేరుగా సృష్టులు లేవు. జగత్తులూ లేవు.

అనేక తరంగములతో కూడుకొన్న సముద్రజాలంలోని ప్రతి నీటి బొట్టునందలి లవణ సంబంధమైన రసం ఉన్నది కదా! అట్లా సృష్టియొక్క ప్రతి అణువునందు అనేక బ్రహ్మాండాలు

Page:678

ఉన్నాయి. ఆ ప్రతి బ్రహ్మాండములోను అసంఖ్యాకంగా అణువులున్నాయి. ఆ అణువులలోని ప్రతి ఒక్క అణువులోను అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి. అయితే ఆత్మయొక్క పరమార్ధము దృష్ట్యా ఆ అణువుల క్రమమూ లేదు. ఆ బ్రహ్మాండములూ లేవు.

సర్వత్ర సర్వతోనిత్యం చిల్డ్రనస్యాంబు వేదనమ్ సంఖ్యాతుం కేన శక్యంతే సర్గాధార పరంపరాః?

సముద్రమునందలి జల పరమాణువుల యందలి రసమువలె చిదన పరమాత్మయే సర్వత్రా వెలయుచున్నది. సర్వవ్యాపకము, నిత్యము అగు ఆ చిదన పరమాత్మ యందు వర్తించుచున్న సృష్టి పరంపరలను లెక్కించటం ఎవరి తరం అవుతుంది?

అవయవి యొక్క వేరువేరు అవయవాలు పేరుకు వేరువేరు కావచ్చుగాక! కాని అన్నిటియందు (కళ్ళయందు, చెవుల యందు, చర్మమునందు వగైరా)... ఒకే అవయవి ప్రసరించి ఉన్నాడు కదా! అట్లాగే ఒకే పరమాత్మ సర్వసృష్టులందు, మనందరి యందు సృష్టి శరీరుడై (జగత్ శరీరుడై) ప్రసరించి ఉన్నారు. ఆతడు 'ఏకం' అయివుండి కూడా మాయచే అనేక, అనంతరూపుడై ఒప్పుచున్నారు.

ఆత్మ స్వభావంగానే 'ఏకము' అయినప్పటికీ... స్వభావ సిద్ధంగానే 'అనేక - అనంత' రూపమై ఒప్పుచున్నది. అద్దాని జగదత్వము అద్దాని స్వభావమే గాని, అందుకు మరొక కారణమేదీ లేదు. అందుచేత ఈ జగత్తు వాస్తవానికి ఉదయించటమూ లేదు. అస్తమించటమూ లేదు. ఈ జగత్తంతా కూడా ఆత్మరూపమే అయి వెలయుచున్నది. సూర్యకిరణములు మేమే వస్తువులను ప్రకాశమానం చేస్తున్నాం అని అనుకోకుండానే, (ఎటువంటి కర్తృత్వము వహించకుండానే)... ఈ జగత్ పదార్థములను ప్రకాశమానం చేస్తున్నాయి కదా! అట్లాగే ఆత్మకు భిన్నం కానట్టి అఖండ రూపమగు జ్ఞప్తియే తాను స్వయం ప్రకాశమానంగా స్వయంగా ప్రకాశిస్తూ... తన యొక్క జ్ఞేయ రూపంగా (తెలివియే తెలియబడే రూపంగా)... ఈ సర్వ దృశ్యమును ప్రకాశింపజేస్తోంది.

చూచారా స్వామీ! మీరు ఈ 21 రోజులుగా మావంటి అజ్ఞానులకు అందించిన జ్ఞాన సుధారసం చేత ఈ దృశ్యమంతా ఇప్పుడు బహుమాధుర్యంగా, ఆత్మకు అనన్యంగా అగుపిస్తోంది. ఆత్మతత్త్వజ్ఞానము యొక్క మాహాత్మ్యం చేత ఇదంతా పదార్థ రూపంగా కాకుండా.... స్వయమాత్మ రూపంగా అనుభవమౌతోంది. ఈ విధంగా జ్ఞానమే జ్ఞేయరూపం”... అను మీ మహావాక్యాలు మాకు ప్రస్ఫుటం అవుచున్నాయి. మాకు ఇతఃపూర్వం జాడ్య రూపంగా అభ్యాసమైన 'తృష్ణ’ తొలగిపోవటం చేత “నేను - నీవు - అంతా ఆత్మ రూపమే... అను దర్శనం స్వభావసిద్ధమగుచున్నది.

స్వామీ! ప్రతి జీవుడు రెండు విభాగములుగా స్వరూపము (లేక) స్వభావము కలిగియున్నాడు. శశ్వరమ్ - మార్పు చేర్పులు లేనట్టి స్వరూపం / (సత్చిత్ ఆనందం)

నశ్వరము - అనుక్షణికంగా మార్పు చేర్పులు చెందుచున్నట్టి స్వరూపం (ఈ దేహ మనోబుద్ధుల అంతర్గత విశేషాలు)

ఈ విధంగా ఈ జీవునికి సంబంధించినవై, స్థిరము - చంచలము... ఈ రెండు కలిసివుంటున్నాయి. మీ బోధచే మాకందరికీ నశ్వర పదార్థముల తాదాత్మ్యాధ్యాస" సన్నగిల్లినదగుచున్నది. క్రమక్రమంగా

Page:679

మా అక్షయ స్వరూపం జ్ఞాపకానికి వస్తోంది. ఇంతవరకూ క్షయ స్వరూపములగు విషయములే మా స్వరూపమని భ్రమించాం. కాదు. మేము అక్షయము - అఖండము అగు ఆత్మయే స్వరూపంగా కలిగివున్నాం! ఏ మా అక్షయస్వరూపం మా యొక్క సర్వ శ్రేష్ఠ స్వభావమే అయి ఉన్నదో... అదే సర్వ విక్షేప శూన్యమగు “సమాధానము”. అద్దాని నిత్యానుభవమే సమాధి. అదే సంసృతి (సంసారము) యొక్క ‘ఆవలివొడ్డు అయినట్టి నిరంకృతి (శాంతి) స్వరూపం. అదియే నిర్వాణం.

సమస్త అధ్యాసపరంపల యొక్క 'సమాప్తి' చే శేషించే నిర్వాణ స్థితియే ఆ "పరమ పురుషార్థం. అట్టి పరమ పురుషార్థమగు అఖండాత్మాహమ్ అనునది బుద్దిచే అనుభూతమవటమే నిర్వాణ స్థితి. అట్టి స్థితికి మేము ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. ఏదో క్రొత్తగా సంపాదంచుకోవలసినదీ కాదు. అయితే అట్టి పరమ పురుషార్థమగు నిర్వాణస్థితి (లేక) మాయొక్క ఈ దృశ్యమంతా ఏ ఆత్మ స్వరూపమయి ఉన్నదో... అట్టి మా శాశ్వతాత్మానందాత్మ స్వరూపం ఇప్పుడు ఈ బుద్ధితోనే అనుభవిస్తున్నాం. కనుక ఈ బుద్ధియే పరమ పురుషార్థ ప్రయోజనం". అయితే, చరమ సాక్షాత్కారబుద్ధి ముక్త స్థితియందు ఆవశ్యకము అని ఎవరైనా అంటారేమో! అది కూడా సరికాదు. ఎందుకంటారా?... ఈ 'బుద్ధి' అనునది కూడా జడమే!

బుద్ధ్యాబుద్ధ్యతే బోధో, బోధా బుద్ధేర బోధ్యతే

న బుద్ధ్యతేవా తేనాపి, బోధ్యో బోధః కథం భవేత్?

ఈ బుద్ధి జడమే! కాబట్టి ఇది పరమ పురుసార్థము బోధరూపము- అగు ఆత్మను ఎరుగజాలదు. (ఇక్కడ బౌద్ధుల బుద్ధియే ఆత్మ అనునది కూడా దాటివేయబడుచున్నది. మా యొక్క సర్వాత్మ స్వరూపం బుద్ధికి కూడా అవిషయమే! బుద్ధిని ఈ దేహమువలె 'నాది' అనవచ్చు గాక! అది నేను కాదు. కొందరు - "నిద్రిస్తున్న రాజును వైతాళికులు (వందిమాగధులు) నిదుర లేపుచున్నట్లుగా బోధరూపమగు పరమాత్మ స్వరూపం బుద్ధిచే మేల్కొలుపబడుచున్నది... అని అనుకుంటే అనుకోనీయండి. ఎందుకంటే, నిదురిస్తున్న రాజును (బుద్ది అనే వైతాళికుడు మేలుకొలు పుటకు ప్రవర్తిస్తున్నప్పటికీ... 'మెలుకువ' అనబడేది వందిమాగధుల రూపం కాదు కదా!

బుద్ధి బోధరూపం, సర్వాత్మకం, అనునిత్యము అగు నా ఆత్మ స్వరూపమును ఎరుగజాలదు. తానే ఎరుగని నా యొక్క బుద్ధి నా “బోధ రూపమును నాకు ఎట్లా తెలియజేస్తుంది? మరి?... బోధ చేతనే బోధ ఎరుగబడుతోంది. ఆత్మ చేతనే ఆత్మ అనుభూతమౌతోంది.

వాస్తవానికి ఆత్మచేత ఆత్మ తెలియబడటం కూడా... అంతిమ సత్యం కాదు. ఎందుకంటే ఆత్మ సర్వదా నిష్క్రియం కదా! ఆత్మ నిర్వికారము నిష్క్రియము అయివుండగా... అద్దాని యందు బోధించటమనే కర్తృత్వ భోక్త ృత్వాలు ఎక్కడుంటాయి?

అందుచేత హే మహర్షీ! ఆత్మ సర్వదా స్వయంప్రకాశమే! అది ఎల్లప్పుడు స్వప్రకాశత్వముచే ప్రబుద్ధమే అయి, సర్వదా బోధరూపమే అయి ఉన్నది. మేఘములు ఆవరించటం చేత సూర్యుడు

Page:680

కనబడకుండా ఉంటారు చూచారా? మేఘాలు తొలగితే... సూర్యుడు ఆకాశంలో జాజ్వల్య ప్రకాశమానుడై కనిపిస్తాడు. మేఘాలు ఆవరించి ఉన్నప్పుడు సూర్యుడు స్వయంప్రకాశస్వరూపుడు కాకుండా పోయినాడా? లేదే! అట్లాగే అజ్ఞానావరణచే మా ఆత్మయొక్క స్వయంప్రకాశత్వము మేము గమనించక 'సంసారము' అనే జాడ్యం పొందాం! మీరు ఝంఝామారుతంగా జ్ఞాన వీచికలు మీ ప్రవచన రూపంగా ప్రసరింపజేయటంచేత అజ్ఞాన మేఘాలు ఎటో పరుగులు తీశాయి. ఫలితంగా మా జ్యోతిస్వరూప ఆత్మ ప్రకాశం అంతటా ప్రసరిస్తూ కనిపిస్తోంది.

మహాత్మా! ఇంకా నాకు ఏమి అవగతమైనదో చెప్పుచున్నాను. వినండి.

సర్వకర్మ వితృష్ణానాం శాక్తేచ్ఛానాం ప్రబోధతః సతామనిచ్ఛతామేవ నిర్వాణం సంప్రవర్తతే ॥

సర్వ కర్మలందు (వాటియొక్క ఐహిక పారలౌకిక ఫలాలపై)... అపేక్ష త్యజిస్తూ ఉన్నవారు, సకల కోర్కెలు నశింపజేసుకొనుచున్నవారు, వాసనలు సన్నగిల్ల జేసుకొంటున్నవారు... సజ్జనుల బోధచే తాము ప్రత్యేకంగా కోరుకోకపోయినప్పటికీ... నిర్వాణ స్థితిని సులభంగా పొందుచున్నారు.

మోహము’ అనే నిద్ర నుంచి మేల్కొన్నవాడు, చిదాత్మ స్వరూపమును సుస్పష్టపరచుకొనే ధ్యాననిష్ఠను ఆశ్రయించినవాడు, కేవల చిత్స్వభావమున వర్తించువాడు అగు మహాత్ముడు... ఈ దృశ్యము విషయంలో ఏదీ గ్రహించడు. దేనినీ త్యజించడు. అట్టివాడు ఆయా వ్యవహారములందు తత్పరుడై ఉండవచ్చుగాక! మనస్సుతో లోక వ్యవహారములను మననము చేయవలసినప్పటికీ... అంతరంగమున విషయములందు ఆసక్తి ఉండదు. కనుక ఆతడు అమనస్కుడే! దీపం వెలుగుచూ అంతా చూస్తున్నప్పటికీ... ఏదీ చూడనిదై ఉంటోంది కదా! ప్రకాశించుచు - - ప్రకాశింపజేస్తున్న దీపం అక్రియమై ఉంటున్నట్లే... ఆత్మజ్ఞుడు క్రియావంతుడైనప్పటికీ, నిష్క్రియుడై ఉంటున్నాడు.

వ్యుత్థాన కాలంలో (సాధి నిర్విషయ ధ్యానము నుండి లేచిన తరువాత) ఆతనికి ఈ సృష్టి కనిపించవచ్చుగాక! ఆతనికి ఇదంతా బ్రహ్మముగాను, అసృష్టిరూపంగాను, సత్యస్వరూపమగు చిన్మాత్రముగాను సర్వత్రా భాసిస్తోంది.

ఎవడైతే, సమాధియందలి కేవల బోధయే ఉత్థాన కాలంలో దృశ్యరూపంగా కనిపిస్తోందని గమనిస్తూ, బోధ సద్రూప స్వరూపానుభవమునందే స్థితి కొనసాగిస్తూ ఈ ప్రపంచమున ఉదాసీనవృత్తితో వీక్షిస్తూ ఉంటాడో... ఆతడు సర్వ సంసార విక్షేపములను జయించినవాడే అవుతాడు.

సమాధి - వ్యుత్థానములలో సమాన బోధ సంతరించుకొని ఉండటమే ఇక్కడి ఉపాయం. అట్టి బోధయే స్వభావమైనవాడు సంసార పరిశ్రమలనుండి విముక్తుడైనవాడగుచున్నాడు. శూన్యత్వము ఆకాశము కంటే భిన్నమైనదా? కాదు. అట్లాగే ఈ జగత్ పదార్థ సమూహమంతా కూడా ఆత్మ” కంటే వేరుకాదు. ఆత్మ యొక్క బోధరూపమే జగద్రూపంగా

Page:681

కనిపిస్తోంది. అందుచేతనే మహాత్ములు"సాక్షి చిన్మాత్ర సాక్షాత్కార రూపము”ను సంతరించు కొనియే ఈ జగత్తులో వర్తిస్తూ ఉంటారు. అనంతబోధ రూపమగు కేవలాత్మ స్వరూపులై 'తత్సత్త అను సమస్వరూపం సర్వదా సంతరించుకొని ఉంటారు. అఖండార్థ వాక్యముల (తత్త్వమ్ - సో2 హమ్ - అహమ్ సర్వస్య ప్రభవో, జీవో శివః శివో జీవః - సర్వమ ఖల్విదమ్ బ్రహ్మ... ఇటువంటి మహావాక్యముల) అర్థమే తాము అగుచున్నారు. వారు తమ స్వరూపమును బ్రహ్మ సన్మాత్రముగాను, సర్వ జీవుల రూపంగా (మమాత్మా సర్వభూతాత్మా) దర్శిస్తున్నారు. ఓ సద్గురూ! నా ఆత్మయే ఈ సర్వసభికుల స్వరూపం! వీరందరి యొక్క స్వస్వరూపమే నేను! అట్టి సర్వాత్మ స్వరూపం వాక్కుతోను, సంజ్ఞలతోను నేను ప్రకటించజాలను. కేవలం అనుభవమే అగుచున్నది. అట్టి అనుభవమును వ్యక్తీకరించటానికి వాక్కు సరిపోదు.

“నా స్వస్వరూపము సర్వదా సర్వుల అనంత రూపమునకు సమర్పించబడియే ఉన్నది. అట్టి బ్రహ్మభావముతో స్థితి పొందినట్టి అనుభూతియే ఆత్మజ్ఞానం. అట్టి ఆత్మజ్ఞానముచే అపూర్వమైన పరమాత్మ సత్తాగా శేషిస్తున్నాను. అట్టి సర్వాత్మ స్థితిగా, నేను శేషించి ఉంటున్నానా? నేను శేషించకయే ఉంటున్నానా? చెప్పనలవికాదు. అది వాక్కుకు అవిషయమని ముందే చెప్పాను కదా! పరబ్రహ్మము వాక్కుకు అతీతము కావచ్చుగాని... అది అనుభవైకవేద్యమే! ఆ కనబడే గోడకంటే కూడా నా పరబ్రహ్మ స్వరూపమే నాకు మరెంతెంతగానో సుస్పష్టమైయున్నది.

4. దృశ్యం ... మమ స్వరూపంచ!

శ్రీరాముడు : హే మహాత్మా! మీ ప్రవచనమంతా వినుచుండగా... నాకు నా స్వరూపం పట్ల - ఈ దృశ్యము పట్ల ఏ అభిప్రాయం దృఢపడిందో... అది మీ ముందు విద్యార్థినై విశదీకరిస్తున్నాను. మీ అనుజ్ఞచే నా అనుభవాన్ని పరిమిత సాధనమైన వాక్కులో ప్రకటిస్తున్నాను. మరికొంత వినండి.

'తత్' అని పిలువబడే ఆ పరమాత్మ సర్వుల సత్తామాత్ర స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ మీ పాదపద్మములను స్పృశిస్తూ ఆ రామానంద తత్ స్వరూపమే ... ఈ పలుకులు పలుకుచున్నది.

ఏ సత్తా సామాన్యము యొక్క స్వరూపము ఏ 'తత్ పదార్థము' అయిన ఆత్మ అయివున్నదో...

ఆ సత్తాసామాన్యమే ఈ 'త్వమ్' - - 'అహమ్' కూడా అయివున్నది. నాకు కనబడే త్వమ్ (నీవు - -

మధ్యమ పురుష) ఇత్యాది వ్యవహారమంతా నా స్వరూపమే! ఈ ఆకాశము - - భూమి - సూర్యచంద్రులు మొదలైన జాగృత్ - ఊహారూపమైన స్వప్నము - - నిర్లిప్త స్వరూపమైన సుషుప్తి... ఇదంతా నా నుండే, నా రూపంగానే బయల్వెడలుచున్నాయి. జగత్తంతా అస్తి - భాతి - ప్రియ రూపమగు అనుభవమే కదా! నా అనుభవమే ఈ దృశ్యము. నా అనుభవం నా స్వరూపమే కదా! కనుక ఈ శోధితత్వమ్ అనబడే దృశ్యము నేనే! ఇదంతా నా సద్రూపమే!

Page:682

సమస్తము కూడా శాంతము - - నాశరహితము అగు ఆత్మరూపమే! ఇదంతా కూడా నిర్వాణ రూపమే! అనగా... ఈ దృశ్య సత్తా, నిర్వాణరూపము, తృష్ణారహితము, అత్యంత స్వచ్ఛము, పరమశీతల సుఖ స్వరూపము - పరమ ప్రేమాస్పదము అయినట్టి - ఆత్మసత్తయేగాని, మరింకొకటేదీ కాదు! సర్వము ఆత్మ స్వరూపంగా, ఆత్మబోధమాత్రంగా దర్శించుటకై బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు కూడా వాంఛిస్తూ ఉంటారు. వారికి సర్వదా - “శుద్ధము - స్వప్రకాశరూపము - - సర్వులకు సదా ప్రేమాస్పదము” అగు చైతన్యమే అనుభవైక విషయమగుచున్నది. అట్టి శుద్ధ చైతన్యమే సర్వపదార్థ రూపంగా కూడా ఉదయిస్తోంది.

చైతన్యమే ద్రష్ట రూపం! చైతన్యమే దృశ్య రూపం! దృశ్యము చైతన్యరూపమే కాబట్టి "దృశ్యము నశించటం... అనునదేదీ లేదు. దృశ్యమును దృశ్యరూపంగా దర్శిస్తే... అదియే సంసారము. దృశ్యము సంసారరూపంగా దర్శిస్తే... ఇదంతా దుఃఖప్రదమే! దీనిని నిర్వాణరూపంగా, (లేక) బోధరూపంగా (లేక) ఆత్మరూపంగా దర్శిస్తే... ఇదంతా నిరతిశయ పరమానందరూపమే! అట్టి నిర్వాణరూపమే (ఆత్మరూపమే) అంతటా దృశ్యరూపంగా కూడా ఉన్నది. సంసారము కల్పితమే కాబట్టి... లేనేలేదు!

ఒక శిల్పి తన బుద్ధి (లేక) యోచనను అనుసరించియే శిల్పమును చెక్కుచున్నాడు కదా! శిల్పియందు శిల్పరూపం బుద్ధియందు ఉన్నట్లే, అఖండ పరిపూర్ణ బ్రహ్మము నందు జగత్తంతా కూడా ఉండి ఉన్నది. జలాశయంలోని శాంత జలం నుండే తరంగ సమూహములు స్ఫురిస్తున్నాయి! ఏ తరంగమైనా కూడా తనయొక్క జలత్వము కోల్పోయినదెప్పుడు? కోల్పోనే లేదు కదా! ఆ తరంగాలన్నిటిలో జలమే ఆకాశాదులుగా ఏర్పడి ఉన్నది కదా! నాశరహితమగు మహాచైతన్యమే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశములలో... ఆయా పంచకోశములుగా స్ఫురిస్తూ దృశ్యరూపముగా కూడా అనుభూతమౌతోంది.

వాస్తవానికి చిదాకాశము అవిభక్తము అయివున్నది. అట్లు అవిభక్తం అయివుండి కూడా ... అజ్ఞానావృతము - జడప్రాయము అయినట్టి అనేక కృత్రిమ వేషములను ధరిస్తోంది. చిదాకాశము విభక్తమైనదానివలె భ్రమచే అగుపిస్తోంది. అది ఏ ఏ జీవులచే ఏ ఏ ప్రకారంగా చిరకాలం భావించబడుచున్నదో, వారి వారికి ఆయా ప్రకారములుగానే - భోగ - మోక్షరూపమై ప్రాదుర్భవిస్తోంది.

మృతేవాపి అమృతేబస్ధా, స్వప్నే స్వప్న విబోధినః

న యథోదేతి సత్యాఖ్యా, తథా దృశ్యషు తద్విదః ॥

ఒకనికి స్వప్నంలో తన బంధువు చచ్చిపోయినట్లు కల వస్తూ ఉన్నదనుకోండి. ఆ స్వప్న ద్రష్ట దృష్టిలో స్వప్న సమయంలో ఆ బంధువు చనిపోయినప్పటికీ... వాస్తవానికి ఆ బంధువు మరణించనేలేదు కదా! స్వప్న సమయంలో “ఈ స్వప్నంలో కనిపించిన బంధువు చావు నిజమైన చావు కాదు”... అని గ్రహించకుండానే బంధు మరణం అనుభవిస్తున్నాడు. అట్లాగే అజ్ఞానికి "ఈ

Page:683

దృశ్యము ఈ ఈ రూపములు వాస్తవమే... అని అనుకుంటున్నాడు కాబట్టి, దుఃఖములకు అర్హుడను అని అనుకుంటున్నాడు. ఇక తత్త్వవేత్తకో... దృశ్యముపట్ల సత్యత్వబుద్ధి ఉదయించటమే లేదు. అందుచేత ఆతనికి హర్షంగాని, శోకంగాని కలగటమే లేదు! ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా కూడా శాంతం - శివం" అగు పరబ్రహ్మ స్వరూపమే అయివున్నదో - అట్టి భావన అత్యంత దృఢ తరంగా అగుచున్నదో... అట్టి వానికి ఇక 'భ్రాంతి అనేది ఎక్కడుంటుంది? ఎక్కడినుండి పుడుతుంది?

ఒకనికి రాత్రి స్వప్నంలో ఒక తాటి ఫలవృక్షం కనిపించింది. ఆ పళ్ళు కోసుకొని తినాలని ప్రయత్నించసాగాడు. కాని తాడిచెట్టు ఎక్కలేక, ఆ తాటి పళ్ళు కోసుకోలేక, వాటిని వదలలేక ఎంతో ప్రయాసపడుచున్నాడు. ఇంతలో ఆతనికి మెలుకువ వచ్చింది. "అయ్యో! ఆ తాటిపళ్ళు కోసుకొని రుచి చూడనేలేదే ఈలోగా, ఏమిటో, ఈ పాడు మెలుకువ రానేవచ్చింది?... అని ఆతడు దుఃఖాన్ని పగలంతా కొనసాగిస్తున్నాడా? లేదే! అట్లాగే "అఖండము - అప్రమేయము అగు ఆత్మయే నేను”... అను రూపంలో పూర్వజ్ఞానం ఉదయించిన తరువాత ఇక ఆపై దేహ సంబంధములైన భోగాలో, వాటికి సంబంధించిన ఉపాయాలలో 'తృష్ణారాహిత్యం' జనించటమనేది స్వభావ సిద్ధమే! తృష్ణారాహిత్యం చేత ఆత్మజ్ఞానం వర్ధిల్లుతోంది. ఆత్మజ్ఞానముచే తృష్ణ వైతొలగుతోంది. వైతృష్ణాత్ వర్ధతే బోధో, బోధాత్ వైతృష్ణ్య వర్ధనమ్,

పరస్పరేణ ప్రకటే, ఏతే కుడ్య ప్రకాశవత్

వెలుతురు వల్ల గోడ కనిపిస్తుంది. గోడ ఉండటం వలన దిశ యొక్క వెలుతురు కనిపిస్తుంది. అట్లాగే ఆత్మజ్ఞానం - తృష్ణరాహిత్యం ఒకదానివలన మరొకటి వర్ధిల్లుచున్నాయి. ఎక్కడ తృష్ణారాహిత్యం వృద్ధి చెందుచూ వస్తుందో అక్కడ జడదృష్టి యొక్క అభావం పెంపొందుతూ వస్తుంది. ఎంతెంతగా జడత్వం తొలగుతూ ఉంటే,... ఇదంతా అంతంతగా ఆత్మ చైతన్యరూపంగా” ఈ దృశ్యము ప్రస్ఫుటమవుతూ వస్తోంది. అంతే కాకుండా... ఎక్కడ ధన - దార - పుత్రాదులయందు తృష్ణ వృద్ధి చెందుతూ వస్తుందో... అచ్చట అదేరీతిగా జడదృష్టి ప్రవృద్ధమై, అంతంతవరకు బోధ దృష్టి (ఇది బోధరూపమే... అనుభవజ్ఞుని స్వకీయమైన అనుభవ రూపమే ... అనే దృష్టి) సన్నగిల్లుతూ వస్తోంది. “బోధ” యొక్క “బోధత్వము”... అనే పాండిత్యము తృష్ణారాహిత్యమే అయివున్నది. ఇక మూర్ఖత్వము యొక్క స్వరూపమో... తృష్ణ కలిగియుండటమే అయివున్నది.

ఓ సభికులారా! “1. తృష్ణా రాహిత్యం (వాసనాక్షయం), 2. బోధయొక్క ఆధిక్యత . ఇవి రెండూ పరస్పరం వృద్ధి చెందుచున్నప్పటికీ... ఇవి రెండూ దృశ్య సంబంధమైనవే కదా! ఆత్మ యొక్క అదృశ్య స్వరూపం వల్ల మాకు ఆత్మానుభవం లభిస్తుందా?... అని మీమాంస పొందకండి. ఆత్మత్వము పొందటానికి మరెక్కడో వెతకకండి. దృశ్య సంబంధమైన కోరికలు తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంటే చాలు... ఆత్మానుభూతి దానంతట అదే మీ గుమ్మం తొక్కుతుంది. అంతేగాని దృశ్య సంబంధమైన కోరికలను కొనసాగిస్తూ "మాకు అఖండాత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం లభించదే?... అని అనుకుంటూ ఉంటే... లాభమేమున్నది?

Page:684

పరమాబోధ వైతృష్ణ్య సంపత్తి : 'మోక్ష' ఉచ్యతే తత్రానస్తే పదే శాంతే వసతా చ న శోచ్యతే ॥

ఎందుకంటారా? ఆత్మజ్ఞాన సమాచారం తృష్ణా రాహిత్యానికి సహకరిస్తోంది. తృష్ణ వలననే సర్వ దుఃఖాలు వచ్చిపడుచున్నాయి. తృష్ణా రాహిత్యమే స్వయంగా దుఃఖ క్షయ స్వరూపం. తృష్ణా రాహిత్యమే మహనీయుల దృష్టిలో ఉత్తమోత్తమ సంపద. కనుక 'తృష్ణారాహిత్యం' అనే ఔషధం అత్యవసరం అయివున్నది. అనంతము - పరమశాంతము అగు మోక్షపదము అధిరోహించిన జీవునకు ఇక శోకమంటే ఏమిటో కూడా తెలియదు!

హే మహర్షీ! ఇప్పుడు నాకు మీరు - - మా తండ్రిగారు - సభికులు - భూత భవిష్యత్ సర్వ జీవరాసులు - నేను .... అంతా బ్రహ్మము రూపంగా భాసిస్తున్నారు.

గతం గమ్యం, కృతం కార్యం, దృష్టం దృశ్యమశేషతః

యావత్ సర్వ శివం శాంతం ఏకమ్ ఆద్యమ్ అనామయమ్ ॥

బోధ (నిర్మల ప్రజ్ఞా) స్వరూపుడనగు నేను ఈ బోధ్యరూపంగా (తెలియబడే ఈ సర్వముగా) వెల్లివిరిసి ఉన్నాను. ఆహా! ఏదైతే పొందతగినదో అది పొందినవాడనయ్యాను. చూడవలసినది పరిపూర్ణంగా చూస్తున్నవాడనై ఉన్నాను. ఈ సమస్తమూ కూడా ఇప్పుడు నాకు శివరూపమై, శాంతమై, ఏకమై, ఆద్యమై, నిర్వికారమైనట్టి బ్రహ్మముగానే భాసిస్తోంది. ఇప్పుడు నేను ఆత్మారాముడను, అధ్యాత్మరాముడను అయ్యాను! పరమశాంతమును పుణికి పుచ్చుకున్నాను. తృష్ణా రహితుడను, అహంకార వర్జితుడను అయ్యాను! ఇప్పటికి నా అంతరంగం సంకల్ప రహితమై, ఆకాశమువలె అతి నిర్మలమైయున్నది.



మహాత్మా! ఎందుకో ఈ జీవులలో అనేకులు ఆత్మజ్ఞానం విషయంలో అశ్రద్ధ గలవారై అనేక దుఃఖములకు అనవసరంగా ఎర అగుచున్నారే! ఏమి ఆశ్చర్యం! ఈ ఇంద్రియ విషయాలలో వారు ఏవేవో వెతుకుచూ మోసపోవుచూ... అవకాశములను వృథా చేసుకుంటున్నారు. తెలుసుకోవలసినది తెలుసుకోకుండా... అందుకు వేరైన దృశ్య విశేషాలు ఎన్ని తెలుసుకొని ఏం ప్రయోజనం? సహస్రేభ్యః సహస్రేభ్య కశ్చిత్ ఉత్థాయ వీర్యవాన్ |

భినత్తి వాసనా జాలం పంజరం కేసరీ యథా ||

చాలామంది ఈ దృశ్య సంస్కారాలను జయించే ప్రయత్నమే చేయటం లేదు. 'కృష్ణ'ను ఆశ్రయించి, అనేక జన్మలుగా... ఈ ఈ దృశ్యంలో ఏదో పొంది, ఎప్పటికో ఆనందించాలని అనుకుంటూ పరుగులు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి దుఃఖాలు తొలగటమే మన ఈ సంవాదం ప్రయోజనం కదా!

అట్లా విషయ తృష్ణలను జయించాలని కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నించే వారిలో కొద్దిమంది మాత్రమే విషయతృష్ణను జయించి వీర్యవంతులనిపించుకుంటున్నారు.

Page:685

అట్టి వీర్యవంతులు పంజరమును ఛేదించిన సింహంలాగా వాసనా జాలమును ఛేదించి ఆత్మానందము” అనే సువిశాల భూమిలో ప్రవేశించి ఆనందిస్తున్నారు. మన ఈ సంవాదము అనేకులకు వాసన ఛేదమునకు మార్గదర్శకమగుగాక!

ఆ విధంగా శుద్ధ బోధయుక్తుడు, వాసనాక్షయం సముపార్జించుకున్నవాడు, అభ్యంతరమున పరమ ప్రకాశయుక్తుడు, ఆత్మజ్యోతిని సముపార్జించుకున్నవాడు స్వయంగా పరమశాంతిని పొందుచున్నాడు. జ్ఞేయమగు ఆత్మను ఎరిగినవాడై, ఆతడు సంకల్పములకు ముందే ఉన్న తన స్వరూపమును అంతటా అన్నిటా దర్శిస్తున్నాడు.

సర్వ సంకల్పములను అతిక్రమించిన ఆశయము కలవాడై ఉంటున్నాడు... ఇక ఆపై వాయువు ఉద్దేశరహితంగానే దేహములలో ప్రవేశించి ఉజ్జీవింపచేయటం, చెట్ల ఆకులను కదల్చటం... ఇవన్నీ నిర్వర్తిస్తుంది చూచారా! ఆ విధంగా వాసన వర్జితుడై, ఈ జగత్తులో చేష్టలను సలుపుచూ ఉంటున్నాడు. సమస్త పదార్థముల పట్ల తత్త్వమననం ('తత్ త్వమ్ అసి' - అని మరల మరల సంభావించటం) చేస్తూ ఉంటాడు కదా! అందుచేత, ఆత్మకు వేరుగా ఎప్పుడైనా అనిపిస్తే ... అది భ్రమయేనని గమనించియే ఉంటాడు. సమస్త పదార్థములు ఆత్మ స్వరూపమే! కేవల చైతన్యమాత్రమే” ...అను నిర్మల దృశ్యరహిత భావనయే "వాసనారహిత స్థితి" అయివున్నది.

అట్లాగే, వాసనారహిత భావన ఉదయించినప్పుడు సర్వము పరబ్రహ్మ స్వరూపంగా అనిపించటం అత్యంత స్వభావసిద్ధమైయున్నది. ఆతనికి ఈ సర్వము బ్రహ్మమే అని అనిపించటమే ముక్తి! అదియే స్థిర నిర్వాణ పదము. అట్టివాని పట్ల సర్వ సంసార ప్రశమనము స్వయంగా ప్రకటితమౌతోంది.

5. శిష్య పరీక్షార్థ ప్రశ్నలు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు ప్రబుద్ధుడవు అయ్యావయ్యా! నీవిప్పుడు చెప్పిన వాక్యాలు అజ్ఞానుల పామరదృష్టులను హరించేవై ఉన్నాయి. అనుభవసిద్ధములు, యుక్తియుక్తములు కూడా! అందుచేత జ్ఞానులకు ఆనందమును గొలుపుచున్నాయి. నీవు చెప్పినదంతా పరమ సత్యమే! ఈ దృశ్య జగత్తు అసత్తే అయినప్పటికీ... సంకల్పముల కారణంగానే ఈ ఈ రూపములుగా భాసించుచున్నదగుచున్నది. నిస్సంకల్పము చేతనో... ఇదంతా సర్వదా మొదలంట శమించినదే అగుచున్నదది. ఆత్మగా అనిపించటమే దృశ్యము యొక్క శమనము. ఆత్మగా అనిపించగానే సర్వము సశాంతి పొందుచున్నది. అదియే పరమార్థము. నీవు చెప్పినట్లుగా... చలనము - చలన రహిత స్థితి" ఈ రెండూ కూడా వాయువు యొక్క రూపములే అయి ఉన్నాయి కదా! అట్లాగే... కల్పనా రూపమగు బంధము, అకల్పనా రూపమగు మోక్షము... ఈ రెండూ కూడా పరబ్రహ్మము యొక్క రూపములే అయివున్నాయి. అంతేగాని అవి మరొక రూపం కాదు. పరబ్రహ్మమునందు ఏకత్వము

Page:686

లేదు. ద్వైతమూ లేదు. ప్రబుద్ధుడైన మనుజుడు 'సమాధి - వ్యవహారము' - - ఈ ఉభయ సందర్భాలలోనూ ఒకానొక అనిర్వచనీయమైన శిలాగర్భము వంటి నిశ్చలస్థితి వహించి ఉంటున్నాడు. అట్టి నిర్వాణ పదమునందు నిశ్చల స్థితి కలిగి ఉండి జీవన్ముక్తులు వ్యవహారములోను - సమాధి యందు కూడా సమాన రూపంగా వర్తిస్తున్నారు. అట్లాగే ప్రబుద్ధులగు బ్రహ్మ - విష్ణు మహేశ్వరులు, తదితర జీవన్ముక్తులు కూడా ఇటు వ్యవహారమునందు - - అటు సమాధి యందు నిత్య చిదన పదమునందు సదా వెలయుచున్నారు. నీవు కూడా మావలెనే చిన్మయ పదమును సముపార్జించుకుని జీవన్ముక్తుడవై ఉండెదవుగాక!

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జగత్తు బ్రహ్మమునందు బ్రహ్మమే అయి, - - అసద్రూపంగాను, ఉత్పత్తి రహితంగాను, అప్రకాశరూపంగానూ, ఆరంభమే లేనిదానిగానూ, ఆకార శూన్యంగానూ మిథ్యగానూ భాసిస్తోంది. మృగతృష్ణలో జలం, ఆ జలంలో ఆవర్తములు కనిపిస్తాయి చూచారా? బంగారంలో ఆభరణం కనిపిస్తోంది కదా! స్వప్న - సంకల్పములలో పర్వతములు, ఇళ్ళు, వాకిళ్ళు ఎప్పుడో చూచిన, ఎప్పుడూ చూడని నగర వీథులు అగుపిస్తాయే! అట్లాగే పరబ్రహ్మమునందు ఈ జగత్తు భాసిస్తోంది!

శ్రీ వసిష్ఠ మహర్షి : బిడ్డా! రామచంద్రా! నీ వాక్యాలు మృధుమధురములు. పరమ సత్యములు. అయితే నోటితో చెప్పగలగటం వేరు, అనుభూతి / అనుభవం వేరుకదా! అందుచేత నీ బోధాభివృద్ధి కొరకు, (అంతే కాకుండా) మన ఈ సంవాదము మరికొన్ని విశేషాలు ముముక్షువులకు అందించటానికి వీలుగాను, శిష్య పరీక్షార్థము కొన్ని ప్రశ్నలడుగుతాను. సర్వ సభికులకు నీ సమాధానాలు సంశయములన్నిటినీ తొలగించటమే నా ఉద్దేశం.

ఈ దృశ్యము అందరికీ ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణములచే దృఢీకరించబడినదై, అర్ధక్రియా సామర్థ్యంతో కూడినదై ఉంటోంది కదా! నెత్తి మీద కూర్చుని ఉన్నదానివలె అగుపిస్తోంది. అట్లు మహాప్రకాశశీలమై ఉన్నప్పటికీ... ఈ 'జగత్తు' అనే అభాస లేకపోయేవున్నదని ఎట్లా చెప్పగలవు? శ్రీరాముడు : మహాత్మా! సర్వ జగదనుభవములకు ముందుగా అనుభవజ్ఞుడు ఉండాలి కదా! అనుభవజ్ఞుడు (అనుభవాలు ఎరుగువాడు) ముందుగానే ఉండి ఉండకపోతే అనుభవాలకు నాంది ఎక్కడిది? అట్టి అనుభవజ్ఞుడు సర్వానుభవాలకు మునుముందుగా ఆత్మ స్వరూపుడే అయివున్నాడు. అట్టి కేవలాత్మ స్వరూపుని సమక్షంలో 'జగత్ దృశ్యము' అనబడే బాహ్యత్వము జనించటానికి కారణము కాగలిగినదేమి ఉన్నది? ఏదీ లేదు. కారణమే లేనప్పుడు కార్యము ఎక్కడుంటుంది? కనుక ఈ జగత్తు ఉత్పన్నమే అయివుండలేదు. గొడ్రాలి రెండవ కుమారుడు - మూడవ కుమార్తెల ఆస్తి తగాదాలు ఎక్కడుంటాయి? ఈ జగత్తు ఈ రీతిగా భ్రమయే అయివున్నది.

స్వప్న ద్రష్టకు వేరుగా స్వప్నము లేనట్లే, జాగ్రత్ ద్రష్ట యొక్క స్వకీయ తాత్పర్యమునకు వేరుగా జాగ్రత్ దృశ్యము కూడా లేదు. దేని నుండి ఈ జాగ్రత్ భ్రాంతి ఉత్పన్నమైనదో... అట్టి దానికి ఆత్మకు వేరుగా కారణమెక్కడున్నది?

Page:687

పోనీ కారణము ద్రష్ట స్వస్వరూపమగు బ్రహ్మమని అందామా? అది కుదరదు. బ్రహ్మము సదా నిర్వికారము - జరామరణ రహితము కదా! అట్టి నిర్వికార బ్రహ్మము దృశ్యమునకు కారణం ఎట్లా కాగలదు? అవజాలదు. బ్రహ్మమే కాకుండా దృశ్యము యొక్క కల్పనకు మరొక కారణమెక్కడిది? మరొకటేదైనా ఉండి ఉంటే ఆత్మ అనన్యం ఎట్లా అవుతుంది? దృశ్యమునకు 'ఇది' అనతగిన రూపమెక్కడిది? పైగా, సవికారమైన ఏ వస్తువైనా సరే... ఒకానొక పూర్వావస్థ నశిస్తేనే వర్తమాన అవస్థ పొందుతోంది కదా! సృష్ట్యాదిలో సర్వము పదార్థ శూన్యము అయివుండగా... కేవలము చైతన్యం మాత్రమే శేష్యమైయుండగా... ఏ పూర్వావస్థ నుండి ఈ జగత్ పదార్థముల ఉత్పన్నమవగలవు?

అవాచ్యము (వాక్కుచే చెప్పబడలేనిది) - - నిర్వికారము అగు బ్రహ్మమే, త్రాడు పాముగా కనిపిస్తున్నట్లుగా ఈ రీతిగా జగదాకారంగా విజృంభిస్తోందని అందామా? అప్పుడిక జగత్తు యొక్క శబ్ద అర్థములు సత్యములై లభించనట్లే కదా? రజ్జు సర్పభ్రాంతిలో సర్పము మొదలే లేదు కదా! "త్రాడు 'సర్పము' అనే రూపమును దాల్చింది"... అనేది (రజ్జు - సర్పభ్రాంతిలో) అయుక్తం కదా!

కాబట్టి... అవాచ్యము, శాంతము అయినట్టి బ్రహ్మపదమున బ్రహ్మమునకు అనన్య స్వరూపుడగు "హిరణ్యగర్భుడు అనే (జలంలోని ప్రథమ తరంగం వంటి) ప్రప్రథమ చైతన్యతరంగము... కొంచెం నామరూపాత్మకమైన సూక్ష్మశరీరం ధరిస్తోంది.

స్వప్నంలో కొద్ది సమయం తన స్వల్ప కల్పనా శరీరములో తనకు అనన్యమైన స్వప్న దృశ్యమును ప్రతిజీవుడు తనకు అన్యమైనదానివలె చూస్తూనే ఉన్నాడు కదా! అట్లాగే ప్రప్రథమ చైతన్య స్వరూపుడగు హిరణ్యగర్భుడు కూడా ఒకింతకాలం వివర్తరూపమగు సూక్ష్మశరీరం ధరించినవాడై ఉంటున్నాడు. అట్టి స్వప్న సదృశ సూక్ష్మశరీరం... ఈ జీవుని స్వప్నంలా కాకుండా... బహుదీర్ఘకాలం కొనసాగవచ్చు గాక! కానీ, ఈ ముల్లోక జగత్తు ఆ హిరణ్యగర్భుని సుదీర్ఘ స్వప్నమే అయివున్నది. సత్య సంకల్ప రూపుడగు ఆ బ్రహ్మదేవునకు దేశ కాల క్రియాది సమన్వితమగు ఈ జగత్తంతా కూడా చిదాకాశమునందే స్వయంగా భాసిస్తోంది.

తస్మిన్ మిథ్యోపసంపన్నే స మిథ్యాపురుషస్తతః మిథ్యైవ తత్సమాచారం కుర్వన్తి విపరివర్తతే ||

మిథ్యా భూతమగు ఈ జగత్తునందు, మిథ్యా రూపుడే అగు ఆ బ్రహ్మదేవుడు... మిథ్యగానే

ఈ భూత - - భువనాది సర్వ సమాచారములను గావించుచు ... వివర్త భావమును పొందుచున్నాడు.

ఆయనే అనర్థరూపములైనట్టి అనేక పదార్థ సంరంభముల గూర్చిన భ్రమను కల్పిస్తున్నారు. స్వకల్పితములగు లోకములలో ప్రవేశించి వ్యష్టి జీవరూపంతో పుణ్య - పాపభోగార్థం తన కల్పిత త్రిజగత్తులందు తానే తిరుగాడుచున్నారు. ఆతని సంకల్పము యొక్క పూర్వస్థితి ఎట్టిదో ... ఇప్పటి

Page:688

స్థితి కాకతాళీయంగా అట్టిదే అయివుంటోంది. ఆతని సంకల్పము చేతనే జగత్తునందు ఈ ఎదురుగా కనిపించేదంతా సుస్థిరస్థితి వలె అగుపిస్తుంది. అట్టి సంకల్ప నిర్మితమైన ఈ ఈ దృశ్య జగత్తు మిథ్యగానే స్థితినొందియున్నది.

శిలా -వస్ధ్వాసుత న్యాయం -

శిలా వన్యాసుతముఖే వ్యోమ చూర్ణేన రంజనమ్ కరోతి ఇత్యాదివత ఇదం, మిథ్యాజగదుపస్థిమ్ ॥

ఒకానొక ప్రదేశంలో ఒకచోట శిల ఉన్నది. ఆ శిల ఒక సమయంలో కామవికారం పొంద సాగింది. ఇకప్పుడు తనకు తగిన ఒక ప్రియుని కొరకై వెతకసాగింది. వెతకగా, వెతకగా శిలకు ఒక గొడ్రాలి పెద్దకుమారుడు నవయౌవనుడై కనిపించాడు. ఆ శిల ఆ గొడ్రాలి కుమారుణ్ణి సమీపించింది. తన హాస విలాస విన్యాసాలతో ... ఆ గొడ్రాలి కుమారునికి తన ప్రేమను తెలియజేసింది. అప్పుడు ఆ వంథ్యా పుత్రుడు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టపడ్డాడు. అనేక ఇబ్బందులను, అడ్డులను అధిగమించి వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారు. వివాహానంతరం తన పతి సౌందర్యం చూచి ఆ శిల మురిసిపోయింది. అప్పుడు ఆ శిల తన ప్రియుని ముఖంలోకి చూచి, కించిత్ ఆదుర్దాగా, "అయ్యో! అదేమిటీ! నీ ముఖానికి బొట్టు లేదేం? అని వయ్యారంగా పలికింది. అప్పుడు ఆ గొడ్రాలి కుమారుడు తన ప్రియ సఖియగు ఆ శిలను చూచి, "ఓ ప్రియురాలా! నీ కోసం నేనేమైనా చేస్తాను! ఇక బొట్టు మాత్రం ఎందుకు ధరించను? నీవే నా నుదుటికి బొట్టు అలంకరించు....” అని అనునయంగా పలికాడు. అప్పుడా శిల తన చేతులతో ఆకాశమును చూర్ణం చేసి, చూపుడు వ్రేలుతో తిలకంగా చేసి తన ప్రియుడగు ఆ వంథ్యా పుత్రుని నుదిటిపై ఆ తిలకంతో కళ్యాణపు బొట్టును పెట్టి, అలంకరించి ఎంతో సంతోషించింది. అప్పుడొక మహోత్సవం జరిగింది. ఆ మహోత్సవానికి భూమిపైగల వంటపాత్రలు చాలక ... చంద్రమండలం నుంచి కూడా మరికొన్ని వంటపాత్రలు తెప్పించారు.

ఇటువంటి వాక్యముల అర్థసారంలాగా (ఆద్యంతమూ ఏమాత్రం సమకూడని విధంగా) ఈ జగత్తు మిథ్యగానే స్థితినొంది ఉన్నది. వాస్తవానికి ఈ జగత్తు ఆకాశకోశమువలె అతి స్వచ్ఛమై, శిలయొక్క గర్భభాగంలాగా చిదనమై, పరమ మౌన - శాంతరూపమై, నాశరహితమై వెలయుచున్నది.

జగత్తు = సర్వాకారుడు - సర్వ సంకల్పధారుడు - - చిన్మాత్రరూపుడు అయిన విరాట్ పురుషుని యొక్క “సూక్ష్మ శరీరము నందు గల విషయాభిముఖమైన స్ఫురణము. అట్టి స్ఫురణమే ఈ జగద్రూపంగా భాసిస్తోంది.

ఈ ప్రకారంగా ఈ సమస్తము కూడా సర్వదా . - 'విషయత్వము' మొదలైన దోషములు లేని బ్రహ్మమే! ఇదంతా దోషరహితమైన, సచ్చిదానందరూపమై, శాంతము - - ఏకము ఆద్యంత

Page:689

వర్జితము అగు బ్రహ్మాకాశమే అయివున్నది. ఇక 'జగత్తు' అని దేనిని అనగలం? జలంలో అనేక తరంగముల ఉత్పత్తి వినాశనములు సంభవించవచ్చుగాక! వాటిలో ఏ తరంగం జలంకన్నా భిన్నం? అట్లాగే బ్రహ్మమునందు ఈ జగత్తు యొక్క సృష్టి - స్థితి - ప్రళయముల మాత్రంచేతకూడా బ్రహ్మము కంటే ఈ జగత్తుకు భిన్నత్వం ఏమాత్రం లేదు! శుద్ధ జలబిందువు శుద్ధ జలంలా స్వభావ సిద్ధంగా లయమొందుతుంది, చూచారా? అట్లాగే.... సారాసారములను గూర్చిన వివేకము గల తత్త్వజ్ఞానులు కొందరు ఈ సభలో ఉండియున్నారు. వారు 'శుద్ధ బ్రహ్మము' అనే ఏకరసత్వము పొందియే ఉన్నారు.

ఆహా! ఏమి ఆశ్చర్యం! ఈ జగత్తు పరబ్రహ్మం యొక్క అవయవమా అన్నట్లుగా, (లేదా) పరబ్రహ్మం యొక్క కార్యమా అన్నట్లుగా బ్రహ్మమునకు భిన్నమైన దానివలె భాసిస్తోంది! కాని విచారించి చూస్తేనో?... ఈ జగత్తు బ్రహ్మమే అయివున్నది! ఎందుకంటే శాంతం, నిర్మలం, నిష్క్రియం అగు బ్రహ్మమునందు, బ్రహ్మం చేతగాని, మరింకే కారణం చేతగాని జగత్తు ఏర్పడజాలదు.

స్వప్న పదార్థములన్నీ... స్వాత్మరూపమే అయివున్నాయి! దృశ్యరూపములన్నీ... బ్రహ్మమే అయివున్నాయి. మృగతృష్ణగా కనిపించేదంతా... ఎడారి భూములే కదా! ఎరుగబడిన తరువాత స్వప్నాదులందు ఎవరికి సత్యత్వబుద్ధి ఉంటుంది? అట్లాగే... ఈ జగత్ దృశ్య విషయం కూడా!

శ్రోత్రియుడగు బ్రాహ్మణునకు మద్యము మత్తు ఏమిటో తెలియదు కదా! అట్లాగే జ్ఞాని ఈ దృశ్యము ఏమిటో... బాహ్య రూపమగు ఈ ప్రపంచపు భోగరసము యొక్క విశేషరుచి ఏమిటో ఎరుగుటలేదు. ఈ సంస్పర్శజనిత భోగములు వస్తుతః పైకి ఆకర్షితంగా కనిపిస్తున్నప్పటికీ... ఇవి దుఃఖ ప్రదములే! ఇట్టి విషయోన్ముఖత్వము భ్రమచేతనే రూపుదిద్దుకుంటోంది. అందుచేత ఈ దృశ్యము స్వకీయమగు ఆత్మరూపంగా ఎరుగుటచేతను, నిజశుద్ధ రూపంగా దర్శించటం చేతను నిత్యముక్తమగు ప్రశాంతాత్మానుభవం సిద్ధిస్తోంది.

ప్రియజనులారా! మీరంతా అట్టి స్వస్వరూప ప్రశాంతాత్మత్వ దృష్టిచే మీకు కనబడుచున్న ఈ వారి దృశ్యమును పునీతం చేసుకొనెదరు గాక!

6. శ్రీరామ జగద్దర్శనం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మరొక ప్రశ్న. బీజంలో అంకురం ఉంటుంది చూచావా? ఆ విధంగా కారణభూతమగు బ్రహ్మమున కార్యభూతమగు ఈ 'జగత్తు' అనబడే దృశ్యము విద్యమానమగుచున్నదని అనుకోవచ్చు కదా! కనుక ఈ జగత్తు సత్తాస్వరూపమే అవుతుంది కదా? అంతేగాని, ఈ జగత్తు స్వతహాగా లేదని ఎందుకు సిద్ధాంతీకరించాలి?

శ్రీరామచంద్రుడు : మహాత్మా! బీజమునందు అంకురము (మొలకెత్తే వృక్షము) అంకుర రూపంలో ఉండి ఉంటే... అప్పుడు మనం "అకురం బీజం పొట్ట చీల్చుకొని బయల్వెడలుతోంది... అనవచ్చు

Page:690

నేమో! కానీ, మనం బీజమును ఛేదించి చూచామనుకోండి. అప్పుడు అందులో అంకురం లభిస్తుందా? లేదే! బీజము అంటే ఏమిటి? బీజము నందలి అంకుర సంబంధమైన సత్తా విభాగమే బీజము. అంతేగాని బీజము ఆకారమో, పై చర్మమో బీజం కాదు కదా! కనుక బీజమే అంకురంగా పరిణతి పొందుతోంది! అనునది ఇక్కడ సిద్ధిస్తోంది.

కానీ... బ్రహ్మమునందు జగత్ సత్త అట్లా లేదు. బ్రహ్మమే జగత్తు వలె సర్పరజ్జుభ్రాంతి విశేషంగా అనిపిస్తోంది. బ్రహ్మము నందు జగత్తు ఎక్కడున్నది? అది సదా దాగివుండటం, ఒకానొకప్పుడు బయల్వెడలటం... ఇది యుక్తీయుక్తం కాదు. అందుచేత బ్రహ్మము - జగత్తులకు బీజాంకుర న్యాయము ఏమాత్రం తగియుండటమే లేదు.

స్వామీ! నిర్వికారమగు దాని నుండి సవికారమగు వస్తువు, నిరాకారమైన దానినుండి సాకారమైనది ఉత్పన్నమవటం ఎట్లా కుదురుతుంది? అట్టిది నేను విని ఉండలేదు. చూచి ఉండలేదు. కాబట్టి నిర్వికారమై, అవయవ రహితమైన బ్రహ్మమునందు సాకారము - - సావయవము అయినట్టి జగత్తు ఉండజాలదు. ఆవగింజలో ఏనుగుల గుంపు ఎక్కడైనా ఉంటుందా?

“ఒక పెట్టెలో (పేటికలో) రత్నము ఉన్నట్లుగా ఈ జగత్తు బ్రహ్మమునందు కలదు ...అని కొందరు చేస్తున్న ప్రతిపాదనకూడా నా ఉద్దేశంలో వృథా ప్రేలాపనవంటిదే! ఎందుకంటారా? నిరాకారమగు దానియందు గొప్ప సాకార జగత్తు ఉన్నదనటం ఎట్లా పొసగుతుంది?

కొందరు సాకార జగత్తుకు బ్రహ్మమే ఆధారం" అని అంటున్నారు. అది కూడా కుదిరేది కాదు. ఎందుకంటే, సర్వ వస్తు రహితము - పరమ శాంతము అగు పరబ్రహ్మము సర్వ వస్తు సహితము అశాంతము అగు జగత్తునకు ఆధారం ఎట్లా అవుతుంది? ఆధారము - ఆధేయము కొంత సమాన ధర్మములు కలిగినవై ఉండాలి కదా! అందుచేత ఈ కనబడే దృశ్యమునకు బ్రహ్మమే ఆధారం అనటం కూడా ఏమాత్రం యుక్తియుక్తం కాదు.

ఒకడు నిదురించగానే స్వప్న దృశ్యం ఉత్పన్నమౌతోంది కదా! అట్లాగే... బోధ (ఆత్మ)యే క్షణిక సాకారయుక్తంగా ఉత్పన్నమగుచున్నది" అనే సిద్ధాంతం కూడా కుదిరేది కాదు. ఎందుచేత నంటారా? జాగ్రత్తునందు బాగుగా అనుభవించబడి బాగుగా, అభ్యస్తమైనట్టి పదార్థములకు (దృశ్యమునకు) సంబంధించిన సంస్కారములే స్వప్నంలో స్వప్నరూపంగా సాక్షాత్కరిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసినదై, అనుదినం అనుభవమగుచున్న విషయమే కదా! ఇక ఈ సృష్టియో... పూర్వకాలమున అనుభవించబడినది కాదు కదా! ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా, కళ్లకు ప్రమాణ రూపంగా అగుపిస్తోంది. కనుక ఇది 'స్వప్నమాత్రము' కాదు. కాబట్టి ఏది జాగ్రత్తో... అదియే స్వప్నము అను (బౌద్ధుల) సిద్ధాంతము కథనంకూడా యుక్తము కాదు. జాగృత్ - స్వప్నము ఒక్కటే అయివుంటే స్వప్నంలో మరణించిన బంధువు జాగ్రత్తులో కూడా మరణించాలే గాని, జీవించివుండకూడదు కదా! కానీ ఆతడు ఆ మరునాడు తెల్లవారగానే ఎట్లా కనిపిస్తాడు? కాబట్టి ఈ జాగ్రత్ జగత్తు క్షణికమాత్ర స్వప్నము వంటిదని అనవీలులేదు.

Page:691

ఇక మరొక సిద్ధాంతము (చార్వాకులు) ను అనుసరించు “ఈ జీవుడు స్థూల శరీరుడే! ఈ దేహము నశించిన తరువాత జీవుడు కూడా నశిస్తాడు! ఈ జీవునకు స్థూల శరీరమే ఉన్నదిగాని, ఆ తదనంతరంగాని, ఇప్పుడుగాని, (శరీరము ఉన్నప్పుడు గాని) ఆతనికి మరొక సూక్ష్మ శరీరమేదీలేదు... అని చెప్పటం కూడా సముచితం కాదు. ఎందుకంటే... ఈ జగత్తులో పిశాచా దులు, వాటి యొక్క స్వప్నము వంటి స్థితులు లోక ప్రసిద్ధమే అయి వున్నాయి కదా!

కాబట్టి హే మహర్షీ! ఆత్మ చైతన్యము సర్వదా నిరాకారమే అయి, తన చిత్స్వరూపముననే స్థితి కలిగియున్నది. స్వప్న ద్రష్ట నిరాకారుడైనప్పటికీ స్వప్నం సాకారంగా కనిపిస్తోంది. వాస్తవానికి స్వప్నము కూడా నిరాకారమే! అట్లాగే ఆత్మ చైతన్యమే 'సృష్టి' అనబడే వివిధాకారములుగా అజ్ఞాన దృష్టికి అగుపిస్తున్నది. జ్ఞానదృష్టిచే - సాకరమగు జగత్తు నిరాకారమగు పరమాత్మయే అయివున్నది...అను సిద్ధాంతం ఇక్కడ ఒనగూడుచున్నది.

స్వప్నంలో చైతన్యమే తనయందు తాను పర్వతాది ఆయా ఆకారములుగా స్థితి కలిగి ఉండటం సుస్పష్టమైన విషయమే కదా! అట్లాగే సర్వజీవులలోని సాక్షి చైతన్యము సర్వసంబంధరహితమగు బ్రహ్మమే అయివున్నది. ఆ సాక్షి చైతన్యముచే జగత్ రూపంగా అజ్ఞానంచేత పొందబడుచున్నది. (లేక దర్శించబడుతోంది) స్వప్న దృశ్యం ఉన్నదా? లేదా? స్వప్నద్రష్టకు ఉన్నది. మరొకరికో, ఆ స్వప్నదృశ్యం లేదు. స్వప్నము మిథ్యయేనని మేల్కొనిన తరువాత ఆ స్వప్నద్రష్ట గమనిస్తూనే ఉన్నాడు కదా! అట్లాగే అజ్ఞానదృష్టిచే ఈ జగత్తు ఉన్నది. జ్ఞాన దృష్టిచే ఇది పరమాత్మ స్వరూపమే అయివున్నది. ఇదియే ఇక్కడి బ్రహ్మము - జగత్తుల సత్ - అసత్ సంబంధం! అనగా... ఈ జగత్తు సత్-అసత్ రూపంగా విజృంభించుచున్నదై, అనిర్వచనీయమై, స్వానుభవవేద్యమై, అజ్ఞాన దశయందు అనుభవించ బడుచున్నది. ఆత్మజ్ఞానము ఉదయించినప్పుడో... 'జగత్' అనబడునది అనుభవించబడకయే (పొందబడకయే) పోతోంది. అనగా ఇదంతా జ్ఞానిచే బ్రహ్మముగానే దర్శించబడుతోంది. ఈ భావ - అభావాలన్నీ కూడా జ్ఞాని దృష్టిలో సర్వదా ఆత్మ ప్రకాశ రూపమును సంతరించుకుంటున్నాయి. భావము అభావ రూపంగాను, అభావము భావరూపంగాను (ఆత్మ నిత్యానుభవంగాను, జగత్తు మిథ్యానుభవంగాను) అగుచున్నది.

బృంహతి బ్రహ్మణి బ్రహ్మ వ్యోమ వ్యోమని వర్ధతే నచోపపద్యతే కించిత్ బ్రహ్మ వ్యోమ్ని విబృంహణమ్

బ్రహ్మాకాశమున బ్రహ్మాకాశమే జగతూపంగా వర్ధిల్లుతోంది!... కానీ, వాస్తవానికి నిర్వికారమగు బ్రహ్మాకాశమున 'జగత్తు' అనబడేది వర్ధిల్లటానికి అవకాశమే లేదు. ఈ ద్రష్ట - దర్శనము - దృశ్యము - వీడు - - వాడు - నేను - నీవు ... ఇత్యాదిగాగల ఈ సృష్టి విభ్రమమంతా కూడా... శాంత స్వరూపమగు చిదాకాశము యొక్క అనన్యవిస్తార స్వరూపమే! కాబట్టి ఈ జగత్తుకు సాకారత్వం వాస్తవానికి లేదు! ఏ విధంగా స్వప్నంలోను, సంకల్పం (ఊహ)లోను కనిపించే నగరము - · భవనము వగైరా సత్యమే కాదో, .... అట్లాగే సాకారంగా పొందబడినప్పటి ఈ జగత్తు సత్యమే కాదు! ఇదంతా కూడా శాంతము - ఏకము - నిర్వికారము అగు బ్రహ్మమే అయివున్నది.