[[@YHRK]] [[@Spiritual]]
VasisTha Rāma Samvādam [Volume 4 of 4] in Telugu by Yeleswarapu Hanuma Rāma Krishna
(Yoga VāsisTha - 6 of 6 Prakaranams] Nirvāna Prakaranam - Chapter 05 of 17
గ్రంథము: శ్రీ వసిష్ఠ - రామ సంవాదము (Volume 4 of 4)
వచన అనువాద రచయత: శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (https://yhramakrishna.com)
ముద్రణ: రామకృష్ణ మఠం, హైదరాబాదు.
సంస్కృత మూల గ్రంథము: వాల్మీకి మహర్షి ప్రణీత "యోగవాసిష్ఠం"
[1] వైరాగ్య, [2] ముముక్షు వ్యవహార, [3] ఉత్పత్తి, [4] స్థితి, [5] ఉపశమన, [6] నిర్వాణ ప్రకరణములు
విషయ సూచిక :
అఖండ రామాయణంలోని చివరి ప్రకరణం అయిన నిర్వాణ ప్రకరణం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. ఆరు ప్రకరణాల్లోకీ శ్లోక సంఖ్యాపరంగా ఇది పెద్దదవటమే కాకుండా; ఇందులో చర్చించిన అంశం కూడా గంభీరమైనది. మొదటి ప్రకరణాల్లో చర్చించిన అంశాలు సూక్ష్మమైనవైతే, ఇందులో చర్చించిన విషయం సూక్ష్మతరం, సూక్ష్మాతిసూక్ష్మం అని పేర్కొనవలసి ఉంటుంది. నిజానికి అన్నింటిలో చర్చించిన విషయం ఒక్కటే ఐనప్పటికీ ఏ స్థాయినుంచి, ఏ భూమికనుంచి, ఏ కోణం నుంచి విషయాన్ని విశ్లేషిస్తున్నాం అన్న దాన్ని బట్టి చర్చించిన అంశం విభిన్నంగా వ్యక్తమవుతుంది.
ఈ ప్రపంచమంతా ఉదయాస్తమ రహితమై, అఖండ ప్రకాశరూపమై, నిర్మలమై, శిలవలె మౌనరూపమై, నిర్వికారమైనట్టి శాంతమగు బ్రహ్మయే అయిఉన్నది అంటుంది ఈ ప్రకరణం. ఇది కేవలం భావన కాదు. పరమ సత్యం. మనకు అనుభవమౌతున్న జగత్తు అవిద్యారూపం. అజ్ఞాన జనితం. బ్రహ్మానికి వేరైన సత్తా లేనిది. కావున, ఈ ప్రకరణం నుంచి మనకు ద్రష్ట దర్శన దృశ్య త్రిపుటిని భేదించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించి, ఏకత్వరూపంగా మిగిలిపోవలసిందని శాస్త్రమాత ఉద్భోధము.
వాయువు, వాయు స్పందన ఏ విధంగా వేరుకావో అదేరీతిన చైతన్యం లేదా చిత్తు మరియు విషయ జగత్తు వేరు కావు. చిత్ స్పందనే జగత్తు.
చైతన్యానికి వేరుగా ఏమీ లేదని, ఇంద్రియాలు, వాటికి అధిష్ఠానమైన మనస్సు, మనోకల్పితమైన విషయ ప్రపంచంతో సహా సర్వం బ్రహ్మమయమని ఈ ప్రకరణం నుంచి జ్ఞాని గ్రహిస్తాడు. దేహం అందులోని చిత్ రెండూ వేరు కావన్న భావం కలిగిన సాధకుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. నిర్వాణ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. సర్వం చిన్మయమని గ్రహించిన వ్యక్తి శోక మోహ రహితుడై, భేదదృష్టి వీడినవాడై, ఏకత్వానుభవం పొంది కేవాలానంద స్వరూపుడిగా నిలుస్తాడు.
నిర్వాణ ప్రకరణంలో చెప్పిన విషయాన్ని సులభంగా గ్రహించాలంటే ముందు ప్రకరణాల్లో పేర్కొన్న విషయాన్ని అవగతం చేసుకుని ఉండాలి. ఉత్పత్తి, స్థితి ప్రకరణాలు దృశ్యావిర్భావానికి మరియు దృశ్యానుభూతికి కారణాలు బోధించాయి అని అనుకున్నట్లైతే; నిర్వాణ ప్రకరణం సముద్రం నుండి ఉద్భవించే తరంగాలు ఏవిధంగా సముద్రానికి భిన్నం కావో అదేవిధంగా దృశ్యజగత్తు కూడా చిదభేదం కాదని ఉద్ఘాటిస్తుంది. మనోనిర్మితమైన వస్తు ప్రపంచం మనస్సుతో సహా చిత్ శక్తియే. చిద్విలాసమే. చిదాంతర్గతమే. చిద్రూపమే. చిన్మయమే. చిత్స్ఫురణయే అని తెలుపుతుంది.
ఐతే జగత్తు చిదభిన్నం ఐనప్పుడు పురుష ప్రయత్నం చేయటం, మోక్షాన్ని పొందటం అన్నీ అసంగతాలు కావా అంటే మనకు ఇంద్రియగోచర జగత్తుకు సంబంధించిన ఎరుక ఉన్నంత సేపు ఆ ఎరుక తొలగే వరకూ ప్రయత్నం చేయాల్సిందే. అంటే మొదటి ప్రకరణాల్లో చెప్పిన విచారణ అనే పురుష ప్రయత్నాన్ని అనుష్ఠించి మనస్సును పరిశుద్ధమొనర్చుకున్న జిజ్ఞాసువు మాత్రమే ఈ ప్రకరణంలో పేర్కొన్న కేవలాద్వైతాన్ని అనుభవ మొనర్చుకోగలడు. అలా కాకుండా ఇందులోని ఉత్కృష్ట భావనలను అపరిశుద్ధ మనస్కుడికి బోధిస్తే విరుద్ధంగా, విపరీతంగా అర్థంచేసుకునే ప్రమాదముంది. అందువలన శాస్త్రంలో పేర్కొన్న విషయాన్ని అందులో పేర్కొన్న క్రమంలోనే చదవాలి.
- ప్రకాశకులు
Page:1
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆకాశం ఎక్కడుంటే అక్కడ శూన్యత్వం కూడా ఉంటుంది చూచావా? జలం ఎక్కడుంటే అక్కడ ద్రవత్వం కూడా ఉంటుంది కదా! అట్లాగే చిన్మయమగు బ్రహ్మాకాశమున సర్వత్రా సర్వము సర్వవిధాలుగా నిస్సంకోచంగా సంభవిస్తున్నాయి. వాస్తవానికి అలా సంభవించేదంతా ఆకాశ శూన్యత్వంలాగా స్వచ్ఛమైనదే అయి ఉన్నది. సమస్త పదార్థములు చిన్మయరూపములే. కాబట్టి ఈ పృథివి మొదలైన సర్వ పదార్థములు చిత్ రూపములే గాని, అచిత్ అయినది ఎక్కడా ఏదీ లేదు. ఎచ్చట చైతన్యము ఉన్నదో... అక్కడ సృష్టి యొక్క శోభ కూడా ఉన్నది. స్వప్నంలో కనబడిన నగరం, పర్వతం... మొదలైనవన్నీ స్వప్న చైతన్య స్వరూపములే కదా! జాగ్రత్ నందలి సర్వ పదార్థములు కూడా ఏకమగు చిదాకాశమే అయి ఉన్నాయి.
ఈ సందర్భంలో పూర్వం నాకు స్వానుభవమై ఒకానొక విశేషం గుర్తుకొస్తోంది. ఆ నాచే పొందబడిన విశేషం పాషాణాఖ్యాయిక, అనే పేరుతో మహాశ్చర్యకరం అతివిచిత్రమైనది కూడా. భ్రమ అను రోగమునకు అమృత రసాయనం వంటిది. ఆ “ఆ పాషాణాఖ్యాయి” అను పేరుతో చెప్పబడే విశేషం విను చెబుతాను.
❖
పూర్వం ఒకానొకప్పుడు నిజాశ్రమంలో జ్ఞానార్తితో నన్ను ఆశ్రయించవచ్చిన శిష్యగణానికి ఆత్మతత్త్వాన్ని బోధిస్తూ ఉన్నాను. ఎఱుగవలసిన ఆత్మను ఎఱిగి శాంత చిత్తుడనై రోజులు గడుపు చున్నాను. ఆ సమయంలో నా బుద్ది ఎందుకో ఏకాంతం వైపుగా మరలింది. భ్రమయుక్తము, చంచలం అగు సర్వలోక వ్యవహారాలు వదిలి ఏకాంతంగా ఉండాలనే అభిలాష కలిగింది. అప్పుడు శిష్యులను ఆయాశాస్త్ర పఠణాదులలో నియమించి విశ్రాంతి కొఱకై దేవలోకంలోని ఒకానొక ఏకాంత స్థానంలో ప్రవేశించాను. మెల్లమెల్లగా ఆత్మధ్యానతత్పరుడనైనాను. పరమ విశ్రాంతిని అనుభవించసాగాను. అయితే, ఆ ఏకాంత ప్రదేశంలోకూడా దేవతల నృత్యగీత వాద్యాదులు నా ఏకాగ్రతకు కొంచెం విక్షేపం కలిగించసాగాయి. అప్పుడు ఈ జీవులకు క్షణభంగురమైన ఆయా ప్రాపంచిక దశలు కలుగజేసే భ్రమ - విక్షేపముల గురించి ఇట్లు యోచించసాగాను.
❖
"ఆహా! ఈ ప్రపంచంలోని ఆయా విశేషాలన్నీ రమణీయంగా అనిపించటానికి కారణం? బుద్ధిమాంద్యం చేత, అవిచారణచేతనే కదా! స్థూల బుద్ధిని అధిగమించి ఆయా సర్వస్థితుల వెనుక ముందులను పరిశీలించి - చూచినపుడు ఈ ప్రపంచం యొక్క స్థితి రసహీనమే అవుతుంది.
Page:2
అట్టి ఈ ప్రపంచం ఎవనికి కూడా ఏ కారణం చేతా, ఎప్పుడూ ఎక్కడా సుఖప్రదం కాదు. ఏదో పొందాలనుకోవటం, ఇంకేదో తొలగాలనుకోవటం, కొన్ని ఇష్టములు, కొన్ని అయిష్టములు ఇంతకు మించి ఈ సాంసారిక జీవితంలో చెప్పుకో తగినవి ఏమున్నాయి? ఈ జీవునికి ఎందుకో ఈ దృశ్యవిషయాలపై అత్యంత నమ్మకం ఏర్పడి ఉంటోంది. అందుకే ఇక్కడ ఏవేవో పొందాలని ఈ ద్రష్టత్వము వహించి తద్వారా ఎన్నో ప్రయాసలు ఆశ్రయిస్తున్నాడు. ద్రష్టయగు ఈ జీవుడు ఈ ఈ లోకాలలో ఏదేదో పొందాలని చేసే తీవ్రమైన శ్రమ అంతా చివరికి దుఃఖప్రదంగాను పరిణమిస్తున్నదే తప్పించి, ఈ దృశ్యములో ఏది పొందినా ఏం ప్రయోజనం ఉండటమే లేదుకదా!
కిమిదం దృశ్యతే? కిం వా ప్రేక్ష్యతే? కోఽహమేవ వా? ।
సర్వం శాంతం అజం వ్యోమ చిన్మాత్రాత్మ నిరంజనమ్ ॥
ఈ కనిపించుచున్నదంతా ఏమిటి? దీనిని చూచునది ఏది? నేనెవరు? ఈ ప్రకారంగా వివేకంతో “విచారణ" చేసి చూచామా... ఇదంతా శాంతము-అజము-ఆకాశసదృశమునిర్మలచిన్మాత్రం అగు ఆత్మలో వివర్తమే కదా... అని తెలియవస్తోంది. అయినా దృశ్యం యొక్క భేద దర్శనమంతా దృష్టి మొక్క విక్షేపమే కదా! ఇట్టి భ్రమాత్మకమైన దృష్టిని పొందుచున్నంత వరకూ నాకు శాంతి లేదు. అట్టి విక్షేపం యొక్క శమనం కొరకై ఒకానొక ఏకాంత స్థానంలో సమాధిని ఆశ్రయించటమే ఉచితం. అట్టి రహస్య స్థానం సమస్త సిద్ధ - ఇంద్ర - దైత్యాదులకు కూడా సమీపించరానంత రహస్య స్థానమై ఉండాలి. అట్టి స్థానంలో దాగుకొని ఇక నేను ఏ జీవికీ కనిపించకుండెదను గాక ! అక్కడ నిర్వికల్ప సమాధిలో తత్పరుడనై ఉంటాను. సర్వవృత్తులను త్యజించివేస్తాను. అతి నిర్మలం - శాంతం - సమం అయినట్టి ఆత్మపదమున సుస్థితుడనై ఉంటాను.
మరి, శబ్ద-స్పర్శ-రూప-రస గంధములనే ఐదు కించిత్ కూడా సంభవించనట్టి అత్యంత శూన్యమైన ప్రదేశం ఎక్కడ? అట్టి ఏకాంతస్థానం చేరెదనుగాక! ఎందుకంటే వన జలమేఘాదులచేత వ్యాప్తమై... సింహము-పులి-మొదలైన జంతువులు మాత్రమే సంచరించే జనరహిత పర్వత ప్రదేశం కూడా నాకు శత్రువు వలె ప్రతికూలంగానే అనేక విక్షేపములతో కూడి కనబడుతోంది. పర్వతముల మధ్య ప్రదేశం కూడా ఆయా కిరాత జీవుల సంరంభములతో నిండి ఉంది. సముద్రతీరాలు ఖాళీగా లేవు. అవన్నీ కూడా అనేక వ్యగ్రులగు జనుల సంచారాలతో నిండి ఉంటున్నాయి. సముద్రగర్భమేమో, జల జంతువుల చేత నిండి ఉన్నది. అక్కడ కూడా ఏకాంతం లభించదు. సముద్రతీరాలు, పర్వతప్రాంతాలు, లోకపాలుర గ్రామాలు, కొండశిఖరములు, పాతాళ కందరాలు, ఇవన్నీ కూడా అనేక ప్రాణుల వ్యవహారిక సంరంభాలతో నిండి ఉన్నాయి. కొండగుహలందామా? వాటిలో సింహ - సర్పాదులు భీకర శబ్దాలు చేస్తూనే ఉంటాయి. ఇక సరస్సులందామా! అక్కడ స్నానం చేయటానికి వాళ్ళు - వీళ్ళు వచ్చిపోవటం చేత నా ఏకాంతమునకు ఎన్నో విఘ్నాలు కలుగుచున్నాయి. పైగా, అక్కడి తరంగములు శబ్దాలు చేస్తూనే ఉంటాయి. కనుక సరస్సులు ఉన్న ప్రదేశములు కూడా విక్షేప రహిత ఏకాంత మౌన స్థితిని ప్రసాదించలేవు.
Page:3
కాబట్టి... సర్వదా శూన్యమే అయినట్టి ఆకాశం యొక్క సుదూరమైన ఒకానొక మూల మనోకల్పనచే ఒక కుటీరం నిర్మించుకొంటాను. అత్యంత ఏకాంత స్థానంలో ఉత్తమమైన 'యోగము’ అనే యుక్తిని అవలంబిస్తాను. ఈ చిత్తమును ఎటూ ప్రసరించకుండా సుదృఢం చేస్తాను. అక్కడ వాసనారహితుడనై సమాధి పరాయణుడను అవుతాను.
❖
ఇట్లా ఆలోచించి నేను ఆ దేవలోకంలోని ఆ ప్రదేశం నుండి బయలుదేరాను. ఖడ్గధారతో పోల్చతగిన నిర్మలమగు, అత్యంత సూక్ష్మమగు దేవలోక సంబంధమైన సూక్ష్మ ఆకాశంలో ప్రవేశించాను. అయితే ఆ ఆకాశము యొక్క అంతరాళంలో కూడా అనేక సమాధి విఘ్నం చేయగల ఏవేవో దృశ్యలు (ఇక్కడి లాగానే) కనిపించసాగాయి.
ఆ దేవలోకాంతర్గతమైన ఆకాశం నందు... ఒకచోట సిద్ధులు సంచరిస్తున్నారు. మరొకచోట మేఘములు గర్జిస్తున్నాయి. ఇంకొకచోట విద్యాధరులు విహరిస్తున్నారు. ఇంకోచోట యక్షులు ఇష్టం వచ్చినట్లు వినాశన క్రియలను చేస్తూ కనిపించారు. ఒక ప్రదేశం గంధర్వ నగరంచే పూర్ణమై ఉన్నది. ఇంకొక ప్రదేశంలో గొప్ప యుద్ధ సంరంభమంతా సంసిద్ధమై భయానకమైన వాతావరణంతో కూడుకొని ఉన్నది. మరొక చోట మేఘాలు భయంకరంగా శబ్దాలు చేస్తూ అతి తీవ్రంగా వర్షిస్తున్నాయి. వేరొక ప్రదేశంలో యోగినులు (మంత్రగత్తెలు) ఉన్మాద రౌద్ర వృత్తులతో కూడి వర్తిస్తున్నారు. ఒకచోట దైత్యుల నగరాలు గంధర్వ నగరాలను వేగంగా ఢీకొనటం, దానితో ఆ గంధర్వ నగరాలు అందులో గంధర్వ జనులతో సహా ఆకాశంలోకి ఎగిరెగిరి పడుచుండటం కనిపించింది. ఇంకొక చోట గ్రహములు అటూ ఇటూ పక్షులలాగా ఎగురుచున్నాయి. ఒక చోట నక్షత్ర సమూహంచేత ఆ ప్రదేశమంతా వ్యాకులమై ఉన్నది. ఒక ప్రదేశం రకరకాల పక్షులతో పరిపూర్ణమై ఉన్నది. మరొక చోట హింస- హత- రోదన గావుకేకలు పిచ్చి కేరింతలు వంటి ఏవేవో దుశ్శకున శబ్దములతో పూర్ణమై ఉన్నది. ఇంకొక చోట పిశాచాలు మొదలైన భయంకరాకారములు కలిగిన ప్రాణిసమూహాలు యథేచ్చగా అటూ ఇటూ సంచరిస్తున్నాయి. ఒక చోట అనేక నగరాలు, ఆ నగరములలో అనేక సంరంభములతో అల్లకల్లోలంగా ఉన్నది. ఒక ప్రదేశమంతా సూర్యరథంచే ఆక్రమించబడి ఉన్నది. వేరొక చోట చంద్రుడు, శుక్రుడు, గురుడు మొదలైన గ్రహముల రథముల రాకపోకలతో, విన్యాసాలతో కూడుకొని ఉన్నది. ఒక ప్రదేశం సూర్య తాపం కొద్దికొద్దిగా అధికమైపోతూ ఉండగా, ఆ తాపానికి క్రమక్రమంగా అనేకమంది జీవులు వినాశనం పొందుచూ కనిపించసాగారు. మటొక ప్రదేశంలో చంద్రకళలు ప్రవేశించటంచే ప్రశాంతంగా ఉన్నది. ఇంకొక చోట భూత-ప్రేతములు అనేక హింసాక్రియలు నిర్వర్తిస్తుంటే, ఆ ప్రదేశం భయంకరంగా ఉన్నది. ఒకానొకచోట అగ్నియొక్క ఉష్ణత్వముచే అతి తీక్షణంగా ఉన్నది. ఇంకొక చోట బేతాళములు నివసిస్తున్నాయి. వేటొక చోట భారీ శరీరములు గల పక్షులు వసిస్తున్నాయి. ఒక చోట ప్రళయ మేఘాలు. ఇంకొక చోట ప్రళయకాల ప్రచండ అగ్ని-వాయు వీచికలతో నిండి ఉన్నాయి.
నేను ఆ ప్రాణి సమూహాలన్నీ వదిలి అతి దూరంగా పయనించాను. అట్లా వెళ్ళి వెళ్ళి “అతి విశాలము, అత్యంత శూన్యము” అగు ఒక నిర్జన ప్రదేశంలో ప్రవేశించాను.
Page:4
అక్కడ కలలో కూడా ఒక్క ప్రాణి లేదు. అయితే ఆ ప్రదేశంలో ఎక్కడి నుండో మెల్లగా వాయువు వీస్తోంది. అక్కడ ఎట్టి శుభ-అశుభ శకునములు లేవు. ఆ ప్రదేశం ప్రపంచ జీవులకు సాధారణంగా అప్రాప్యమైనది. అక్కడ నా మనఃసంకల్ప బలంతో ఒక కుటీరం నిర్మించాను. నాచే నిర్మించబడిన ఆ కుటీరం కమలం యొక్క మొగ్గలాగా అతిసుందరంగా ఉన్నది. గోడలకు రంధ్రాలు లేవు. లో భాగాలన్నీ స్వయంప్రకాశవంతమై ఉన్నాయి. ఆ అందమైన కుటీరమును నా సత్య సంకల్ప ప్రభావంతో నిర్మించాను సుమా! ఇక ఆ తర్వాత ఆ చుట్టు పక్కలకు ఏ సాంసారికమైన ప్రాణి రాకుండా చిత్తముచే సంకల్పించాను. ఇక అక్కడ కుటీరంలో సర్వ భూతములకు(జీవులకు) అగమ్యం అయినట్టి (చేరుటకు వీలుకానట్టి) “నిర్వికల్ప సమాధి” యందు సంస్థితుడనైనాను.
ఆ విధంగా నిర్వికల్ప సమాధిలో 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తరువాత ఎందుకో "సమాధి నుండి లేవాలి" - అనే ఒక ఆలోచన కలిగింది. అప్పటి దాకా పద్మాసనముపై కూర్చుని శాంతచిత్తుడనై మహామౌనమును అవధరించి సమాధి స్థితిని అనుభవిస్తున్నాను కదా! అప్పటి వరకు గాఢనిద్ర యందు ఉన్నవాని వలె నిశ్చలముగాను, ఆకాశం వలె నిర్మలంగాను, చిత్రంలో చిత్రింప బడిన మనుజుని వలెనూ, నా నిర్వికల్ప సమాధి కొనసాగింది. అయితే ఎప్పుడైతే "ఈ సమాధి నుండి లేచెదనుగాక” అనే స్పురణ కలిగిందో, అప్పుడు ముకుళించుకొన్న నా చిత్తము “వాయువు - దిశలు” వలె వికసించసాగింది. ఈ చిత్తము చిరకాలం ఏ పదార్థమును ధ్యానిస్తుందో అద్దానిని అది తక్షణం గాంచుతుంది కదా! అప్పుడు 'బోధ’ అంకురించసాగింది. 'వ్యుత్థానం' నిమిత్తమై ‘కర్మవీచిక’ నా హృదయమున ఉదయించి విస్తార మొందసాగింది. ఇక నాయొక్క జీవ చైతన్యము వృత్త సహితమై ప్రబుద్ధం కాసాగింది.
సమాధిలో గడిపినట్టి ఆ నూరు సంవత్సరములు నాకు మాత్రం ఒక్క నిమిషం లాగా గడిచిపోయింది. ఎట్లా అంటావా? ఇందులో నీకు క్రొత్తగా చెప్పవలసిన విశేషం ఏమున్నది? ఏకాగ్రమైన చిత్తము కలవానికి సుదీర్ఘకాలం కూడా అత్యల్పంగానే తోస్తోంది కదా!
నేనిక సమాధి నుండి విరామం భావిస్తుండగా, ఒకానొక క్రమంగా నా యొక్క బాహ్య జ్ఞానేంద్రియాలు కూడా వికసించసాగాయి. ప్రాణ వాయువులు దేహమంతా ప్రసరించి పరిపూర్ణం చేయనారంభించాయి. నెమ్మదిగా ఇంద్రియ వృత్తులతో కూడి జీవచైతన్య సహితుడనైనాను. అప్పుడు నా వద్దకు ‘ఇచ్ఛ’ అనే పత్నితో కూడిన 'అహంకారం' అనే పిశాచం ఎక్కడి నుండో వచ్చి చేరింది.
❖❖❖
శ్రీరాముడు :
త్వామపి ఉదిత నిర్వాణం అహంకార పిశాచకః ।
బాధతే కిమపి? బ్రూహి, మునే! సందేహశాంతయే ॥
Page:5
హే మహర్షీ! మీరు చెప్పింది వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. నిర్వాణ స్థితి సంపాదించుకొని ఉన్నట్టి తమంతటి వారిని కూడా ఈ 'అహంకార పిశాచం' సమీపించి ఆవేశించగలదా? నా యొక్క సందేహ నివృత్తి కొరకై ఈ విషయం విశదపరచండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇటు జ్ఞానికైనా అటు అజ్ఞానికైనా కూడా... ‘అహంకారము’ అనేది లేకపోతే ఆ ఇరువురికీ కూడా 'శరీర స్థితి' సంభవించజాలదు. ఎందుకంటావా? ఒక వస్తువు ఉండటానికి ఆధారం అక్కడ ఉండాలి కదా! ఆధారం లేకపోతే ఆధేయ పదార్థస్థితి ఉండజాలదు కదా! కనుక, శరీరం నిలబడాలంటే దానికి ఆధారమైన 'అహంకారం' ఉండక తప్పదు. అయితే, జ్ఞాని - అజ్ఞానుల అహంకారం విషయంలో ఒక ప్రత్యేకమైన విశేషమున్నది. ఆ విశేష తత్వమేమిటో వింటే చిత్త విశ్రాంతి కలుగుతుంది. అహంకార పిశాచం తొలిగిపోతుంది కూడా! కనుక చెబుతాను, విను.
అహంభావ పిశాచో అయమ్ అజ్ఞాన శిశునామునా ।
అవిద్యామాన ఏవాన్తః కల్పతస్థేన సంస్థితః ॥
వాస్తవానికి 'అహంభావం' అనేది లేదు. పసిపాప ఒక బొమ్మను చంకన పెట్టుకొని “నా బిడ్డ! పడిపోతాడేమో?” అని అనుకొంటుంది చూచావా? అట్లా ఒకానొక ఉద్వేగం ప్రారంభమౌతోంది. అట్లాగే, ఈ అహంభావ పిశాచం 'అజ్ఞానము' అనే బాలునిచే అంతఃకరణంలో కల్పించబడుతోంది. కల్పన చేత మాత్రమే అద్దానికి ఉనికి లభిస్తోంది. అయితే, దీపం దగ్గిర పెట్టుకున్న వానికి చీకటి సమీపించగలదా? ఏ జ్ఞాని 'విచారణ' అనే ఉద్యమాన్ని తన వెంట ఉంచుకొని ఉంటాడో అట్టి వానికి అజ్ఞానము- అహంకారముల ఛాయ కూడా సమీపించలేదు. అసలు అది ఉంటే కదా, లభించటానికి? జ్ఞానదృష్టిచే అది వాస్తవానికి లేదు.
యథాయథా విలోక్యతే తథా తథీవిలీయతే ।
ఇహ అజ్ఞాతా పిశాచికా తథా విచారితా సతీ ॥
ఎంతెంత వరకు విజ్ఞాన దృష్టితో విలోకనం చేస్తామో, అంతంత వరకు ఈ 'అహంకారం' విలీనమై ఆత్మకు అనన్యంగా రూపుదిద్దుకుంటోంది. 'విచారణ' యొక్క ఆధిక్యతను అనుసరించి ఈ అహంకార పిశాచి క్షయిస్తూ ఉంటుంది. ఒకనికి (తన బుద్ధియొక్క భ్రమచే) చీకట్లో అక్కడ ఖాళీ ప్రదేశమే అయినప్పటికి.... దేహ రహిత పిశాచం కనిపిస్తూ ఉంటున్నట్లు, మూల అవిద్య ఉన్నంత వరకు కార్య రూప అవిద్య ఉంటూనే ఉంటుంది. (కారణము “అజ్ఞానము”... కార్యము “అవిద్య”).
ఆకాశంలో ఉన్నది ఒక్క చంద్రుడే అయినప్పటికీ కంటి దోషం చేత రెండవ చంద్రుడు, ఆ రెండవ చంద్రునిలో రెండవ కుందేలు ఆకారం కనిపిస్తుంది. ఈ “సృష్టి" అనే ప్రదర్శనమంతా అజ్ఞానము చేతనే ఉత్పన్నము అగుచున్నందున వాస్తవానికి ఇది 'లేనిదే' అయి ఉన్నది. ఆకాశంలో వృక్షం ఉండటానికే అవకాశం లేదు. అనంతమగు ఆకాశంలో "నీ భాగం, నా విభాగం” అనేవి ఎక్కడుంటాయి? అట్లాగే అనంతమగు చిదాకాశంలో "నీవు - నేను - నీది - నాది”....అనేవి ఉండజాలవు. ఎక్కడైనా లభిస్తూ ఉంటే అది అజ్ఞాన భ్రమను కారణముగా కలిగి ఉన్నది.
Page:6
ఆదిసృష్టి నిర్వికారమై ఉన్నది. ఇప్పుడు కూడా ఎప్పటియట్లే నిర్వికారమై ఉన్నదయ్యా!
మరి ఎదురుగా కనిపిస్తున్న ఈ జగత్తు, ఈ జగత్తును అనుభవిస్తున్న 'వ్యష్టి అహంకారం' మాట ఏమిటంటావా?
నిరాకారమగు బ్రహ్మం పంచేంద్రియాలకు, వాటిని సమన్వయపరిచి ఉపయోగించే మనస్సుకు కూడా అతీతమై, కేవలసాక్షి అయి ఉన్నది. మనస్సుతో కూడిన పంచేంద్రియాలకు “విషయం” అగుచున్న ఈ సాకార జగత్తునకు కారణం మనస్సుకు అతీతమగు బ్రహ్మం ఎట్లా అవుతుంది? అవదు. ఎందుకంటే, బీజం ఉన్నచోట ఆ బీజం వల్ల 'అంకురం' అనే కార్యం ఉత్పన్నమౌతోంది. ఎచ్చట బీజమే లేదో అచ్చట వృక్షం ఎట్లా ఏర్పడుతుంది? కారణం లేనిదే కార్యం ఏర్పడ జాలదు కదా! అంతటా ఆకాశమే అయి ఉండగా "ఇది తూర్పు ఆకాశం, అది పడమర ఆకాశం” ... అనేది ఎట్లా ఏర్పడగలదు చెప్పు? "అయినా తూర్పు-పడమర ఉన్నాయి కదా?"... అని అంటావా? అది 'సూర్యోదయం' అనే ఒక విన్యాసానికి భూమికి గల సంబంధం కావచ్చునేమోగాని, ఆకాశంలో 'దిక్కులు' అనేదాని స్వకీయమైన సత్త కాదు.
సంకల్పముచే ఆకాశంలో (జ్ఞప్తి రూప) వనములు కనిపించునట్లు... ఈ జగత్తు సంకల్పమయం మాత్రమే! పదార్థముగా కనిపించేది కూడా పదార్థ భావన యొక్క స్థూలానుభవం మాత్రమే! అందుచేతనే ఒకే రూపం ఒక దేహికి ప్రియంగాను, మరొకరికి అప్రియంగాను, ఇంకొకరికి ఉదాసీనంగాను అనిపించటం జరుగుతోంది. అంతేకాదు. ఈ విధంగా, ఈ జీవుడు "జగత్తును పొందటం" అనేది సందర్భ చమత్కారమేగాని, వాస్తవ స్వభావం కాదు.
“సృష్ట్యాది” యందు ఏ నిష్కంటకమగు 'బ్రహ్మాండం' యొక్క స్థితి అనుభూతమగుచున్నదో... అది కూడా శూన్యమాత్రమే అయి ఉన్నది. వాస్తవానికి ఈశ్వరుడు సృష్టి యొక్క విషమత్వము లేనివాడు. చిదాకాశస్వరూపుడు. చైతన్యమయుడు. అట్టి ఈశ్వరుడే స్వకల్పిత స్వభావపూర్వకంగా తనయందు సృష్టిరూపంగా భాసిస్తున్నాడు. 'అహంకారము' ఈశ్వర స్వరూపమే గాని ఈశ్వరునికి అనన్యమైనది కాదు.
ఇందుకు దృష్టాంతం - ప్రతి రోజు ప్రతి జీవికి అనుభవమయ్యే స్వప్నవృత్తాంతమే. స్వప్నంలో పర్వతాలు, నదులు, జీవులు మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి. వాటన్నిటి యొక్క అసలు రూపం ఏమిటి? స్వప్నద్రష్ట చైతన్యమే, ఆయా వివిధ రూపములుగా స్ఫూర్తిస్తోంది కదా! అనగా, స్వప్నమునందు చైతన్యం యొక్క స్వభావముచేతనే సృష్టి ఉన్నట్లే భాసిస్తున్నది. అదే రీతిగా సృష్ట్యాదియందు చిదాకాశమున ఈ సృష్టి వాస్తవానికి లేకపోయినప్పటికీ, ఉన్నట్లే భాసిస్తోంది.
సృష్టికి మునుముందే ఏ విషయజ్ఞానాతీత - శుద్ధ - జన్మాదిరహిత - అవ్యయ - అనాది అనంతమైనట్టి ఆత్మతత్త్వము అప్రతిహతంగా ప్రకాశించి ఉన్నదో, ఆ అప్రతిహత ఆత్మప్రకాశమే సృష్టి సమయంలో కూడా ఈ అహంకారము - జగత్తు మొదలైన వాటితో కూడిన సృష్టి రూపంగా భాసిస్తోంది, సృష్టి రూపంగా స్థితినొంది ఉన్నదంతా అదే! ఇక్కడ వాస్తవానికి సృష్టిగాని, పృథివి మొదలైన గోళములు గాని లేవు.
Page:7
అంతా కూడా... "సర్వం శాంతం అనాలంబం బ్రహ్మైవ బ్రహ్మిణి స్థితమ్" - శాంతము, నిరాలంబనము అగు బ్రహ్మమే బ్రహ్మమునందు స్థితి కలిగి ఉన్నది. కనుక, 'అహంకారం' అనేది బ్రహ్మము యొక్క (లేక) ఈశ్వరుని యొక్క ఒకానొక ప్రదర్శనా చమత్కారం మాత్రమే!
ఓ రామచంద్రా! మరల మరొకసారి క్రోడీకరించి సిద్ధాంతపూర్వకంగా ప్రకటన చేస్తూ చెప్పుచున్నాను, విను.
సర్వశక్త్యాత్మ తత్ బ్రహ్మ యథా కచతి యాదృశమ్ ।
రూపమత్యజదేవాచ్ఛం తథా భవతి తాదృశమ్ ॥
బ్రహ్మం సర్వశక్తిమంతం. అట్టి బ్రహ్మం ఎట్లు ఎచ్చట స్ఫూర్తించనెంచుతుందో, అట్లట్లు తన శుద్ధరూపాన్ని ఏమాత్రం త్యజించకుండానే సృష్టి మొదలైన రూపాలుగా అగుచున్నది. స్వప్నద్రష్ట యొక్క చైతన్యం యథాతథంగా ఉంటూనే స్వప్నంలో అనేక పదార్థముల - వ్యక్తుల కల్పనారూపం పొందుచుండటమే ఇందుకు మనకు దృష్టాంతం. ఈ స్వప్న ద్రష్టలాగానే... సృష్ట్యాదిలో ఈ జగత్తు కూడా చిన్మాత్రం యొక్క విలాసమే అగుచున్నది. నిర్మలమగు ఆకాశంలో 'నీలివర్ణం' అనే చిత్రం కనిపించటంలేదా? అట్లాగే శుద్ధాకాశమున అద్దాని స్వభావమే... ఆ చైతన్యం యొక్క భావన చేత సృష్టి రూపంగా స్ఫురిస్తోందని గ్రహించవలసినదిగా సర్వ సహజీవులకు నా విన్నపం.
“భావించునది – భావించబడునది - భావన" ఈ త్రిపుటి రూపాల యొక్క నిరంతర ఉత్పత్తి మొదలైనవన్నీ ... చిదాకాశమే తనలో తాను ఆ విధంగా స్థితి కలిగి ఉన్నది. కనుక చిదాకాశమే 'అహంకారం' రూపంగా కూడా తనలో తాను ప్రదర్శితమగుచున్నది. చిదాకాశమే చిదాకాశంలో స్థితి కలిగి ఉండగా ఇక సృష్టి ఎచట? అవిద్య, అజ్ఞానాలెచట? అహంకారం మొదలైనవి ఎచట?...
అంతా కూడా శాంతము, చిద్ఘనము అయినట్టి బ్రహ్మమే అయి ఉన్నది!
ఓ రామచంద్రా! ఈ విధంగా అహంకారము యొక్క వాస్తవ స్వరూపం ఏమై ఉన్నదో... నీకు వచించాను.
↳ “అహంకారం స్వతహాగా లేదు. ఆత్మయే అహంకార రూపంగా ప్రదర్శిత మౌతోంది” అని గ్రహించుటయే అహంకారం యొక్క ప్రశమనం.
↳ ఎఱుగబడిందా, ఈ అహంకారం బాలుడికి కనబడే పిశాచం (వెలుతురు ఏర్పడగానే) తొలగిపోవుచున్నట్లు తొలిగిపోతుంది.
ఈ అహంకార పిశాచం యొక్క రూపం ఏమిటో పూర్ణముగా నేను ఎఱిగి ఉండటం చేత... అది నాకు ఉన్నప్పటికీ నిష్ఫలమైనదే అవుతుంది. ఆ 'కనబడేది గోడపై రంగులతో లిఖించబడిన అగ్ని చిత్ర లేఖనమేగాని నిజమైన అగ్ని కాదు' అని ఎఱిగిన తరువాత ఇక ఆ అగ్ని వల్ల చర్మం కాలుతుందేమోనన్న శంక ఎందుకుంటుంది? ఎఱుగబడిన తరువాత అహంభావం, సృష్టి మొదలైనవన్నీ నిష్ఫలమే అవుతాయి. అవి ఉన్నా, ఉండకున్నా ఆత్మ యథాతథమేనని మేము గమనించియే ఉంటున్నాం. ఈ ప్రకారంగా అహంకారం యొక్క “త్యాజ్యస్థితి” (నిర్వికల్ప సమాధి) యందు, “గ్రాహ్యస్థితి” (వ్యవహారస్థితి) యందునూ కూడా నాకు సమత్వమే ఏర్పడి ఉంటోంది. మేఘాలు లేనప్పుడూ, మేఘాలు ఉన్నప్పుడూ కూడా ఆకాశం సర్వదా ఆకాశంగానే ఉంటోంది కదా! సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నాయొక్క స్థితి సమముగానే ఉంటున్నదగుచున్నది.
Page:8
అహంభావస్య నైవాహం నా అహంభావో మమేతి చ ।
తేన విద్ధి చిదాకాశమేవేదమితి నిర్ఘనమ్ ॥
“నేను అహంభావానికి చెంది ఉండలేదు. అహంభావము నాకు చెంది ఉండలేదు” అని సునిశ్చితం చేయి. అహంకారంతో సహా, ఈ సర్వజగత్తును "చిదాకాశ ఘనము”గా ఎఱుగుము.
నా దృష్టిలో 'అహంభావము - జగత్తు' మొదలైనవి ఎట్లా లేవో... అట్లాగే ఈ సభలోని తదితర జ్ఞానుల దృష్టిలో కూడా అవి లేకయే ఉన్నాయి.
చిత్రపటంలో సెలయేరును చూచి 'ఆ జలం నా ఆర్తిని (దాహాన్ని) తొలగిస్తుందేమో'... అని ఆశించేవారు బాలురేగాని, జ్ఞానులు కాదు. ఈ జగత్తు, అహంకారాలను “ఉన్నాయి”... అని అనటం చిత్రపటంలోని అగ్నిని ఉపయోగించి వంట చేయటానికి ఉపక్రమించటం వంటిదే అవుతుంది.
నాఽహమస్మి ! న చ అన్యోఽస్థి ! “సర్వం నాస్తి” ఇతి నిశ్చయే ।
ప్రకృత వ్యవహారస్త్వం శిలామౌనమయోభవ ॥
ఓ రామచంద్రా! “వాస్తవానికి, 'నేను' గాని, మరొకడు గాని, ఈ సమస్త బ్రహాండములు గాని లేవు”... అను నిశ్చయం కలిగి ఉండు. ఇక ఆపై యథాప్రాప్తమగు వ్యవహారం ఆచరిస్తూనే అంతరమున మౌనం వహించి ఉండు. ఆ విధంగా చిరకాలం దృశ్యభావమునంతటినీ తొలగించు కుంటూ శిలామధ్యభాగంలాగా చిద్ఘనరూపుడవై ఉండు. ఆకాశం వలె నిర్మలమైన ఆకృతితో 'స్వాత్మ' రూపముననే స్థితి కలిగి ఉండు. ఎందుకంటావా? ఈ సృష్టికి ముందు, ఈ సృష్టి కాలంలో, ఈ సృష్టి శమించిన తరువాత కూడా సర్వవేళలా ఈ సమస్తం చిన్మయమగు శివరూప బ్రహ్మమే అయి ఉన్నది. "దృశ్య ప్రపంచం” అనునదేదీ లేదు.
✤✤✤
శ్రీరాముడు : ఆహాఁ ! మహాత్మా! మాయొక్క జ్ఞానైశ్వర్యము కొఱకే మీరు ఇట్టి గంభీరమునిర్మలము-విపులము-నిశ్చలము- విశాలము అయినట్టి “ఆత్మదృష్టి" గూర్చి మరల మరల పలుకుచున్నారు. మునీంద్రా! మీరు చెప్పినదంతా పరమ సత్యమే!
సర్వథా సర్వదా సర్వం సర్వం సర్వత్ర సర్వదా ।
“సత్” ఇత్యేవ స్థితం సత్యం సమం సమనుభూతితః ॥
“సర్వ విధాలుగా–సర్వవేళలా-సర్వం-అంతటా అన్ని సమయాలలోనూ ఇదంతా సద్రూప మగు బ్రహ్మమే" అని సెలవిచ్చారు కదా! అది సత్యమే. అట్లా ఎవరికైనా అనిపించకపోవటానికి కారణం ‘విచారణ-అనుభవం’ తగినంతగా లేకపోవటం చేతనే. విచారణ-అనుభవాలచే ఇదంతా అట్టి ఏకరసమగు చిన్మాత్రంగానే ఒప్పుచున్నది స్వామీ! వేదాంత వాఙ్మయంలో “అంతా పాషాణ మాత్రమే" అని అంటూ ఉన్నారు కదా! హే బ్రహ్మజ్ఞా! మాకు మరింతగా బ్రహ్మజ్ఞానం అనుభవమయ్యేందుకుగాను మీరు ప్రారంభించిన "పాషాణాఖ్యాయిక” కొనసాగించమని నా విన్నపం.
Page:9
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అట్లే అగుగాక!
| “పాషాణాఖ్యాయిక” అను ఈ మన వర్తమాన విశేష సంవాదమునందు 'సర్వత్రా సర్వదా సర్వం సద్రూపమే' అను సిద్ధాంతం ప్రతిపాదించబడుతోంది. |
అట్టి పాషాణదృష్టాంతం గురించి చెపుతాను... విను.
“రంధ్రములు లేనట్టి ఘనమైన శిలయొక్క మధ్యభాగంలో శిలారేణువులు అకారాదులతో ఉండి ఉన్నట్లుగా... అధిష్టానమై చెన్నొందుచున్న పరబ్రహ్మము నందు (శిలాంతర్భాగ శిలారేణువుల లాగా) ఈ అనేక బ్రహ్మాండములు ఉంటున్నాయి”... అని ఈ అఖ్యాయిక నిరూపిస్తోంది.
అట్లే, “మహత్తరము, స్వరూపతః శూన్యము అయిన భూతాకాశంలో అసంఖ్యాక సృష్టులు ఉన్నాయి. ఒక విత్తనంలో, ఒక లతలో, ప్రతి ఒక్క ప్రాణిలో, జడవస్తువులో, వాయువులో, అగ్నిలో, జలంలో, ఆకాశంలో, ఒక అణువులో కూడా... అనేక సృష్టులు ఉన్నాయి”... అని కూడా ఈ అఖ్యాయిక నిరూపిస్తోంది.
శ్రీరాముడు : స్వామీ! 'ఒక రాయిలో, గోడలో, లతలో కూడా అనేక సృష్టులు ఉన్నాయి'... అని ఇప్పుడు అంటున్నారు కదా! మరి "చిదాకాశమునందే సమస్త సృష్టులు భాసిస్తున్నాయి”... అను మీ ఇతఃపూర్వపు వాక్యమునకు, ఇప్పటి ఈ మీ వాక్యమునకు సమన్వయం ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ కనిపించే సృష్టి విషయమై... 'చిదాకాశమే చిదాకాశమున ఇట్లు సృష్టి రూపంగా కనిపిస్తోంది”... అనునది పరమసత్యం. అదియే ముఖ్యమైన పక్షము కూడా. గోడ - లతగా కనిపించేదీ చిదాకాశమే! అందులో గల సృష్టులు చిదాకాశమే! ఇది ఇట్లుండగా, అసలీ దృశ్యము ‘ఆది’ యందు ఉత్పన్నమే కాలేదు సుమా! మొదలే ఉత్పన్నం కానిది ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది? కనుక అది ఇప్పుడు కూడా ఉండి ఉండలేదు. ఉన్నది బ్రహ్మము మాత్రమే! అయితే ఆరోప దృష్టికి ఆరూఢమై ఈ ఈ భౌతికమగు పృథ్వి - జలము మొదలైనవి అగుపిస్తున్నాయి. అట్టి ఆరోపిత దృష్టికి అనుభవమయ్యే సృష్టులు పృథ్వి యొక్క ప్రతి అణువు నందు (సృష్టిసమూహములు) అనుభవించబడుచున్నాయి. ఎవరికి? ఆరోపిత దృష్టి కలిగియున్న జీవులకు! అపవాద దృష్టిచే వీటన్నిటి వాస్తవరూపం గమనించబడినప్పుడు ఈ 'పృథివి' అనబడేది అణు మాత్రంగాకూడా లేదు. అందులో అణువులూ లేవు, ఆ అణువులలో సృష్టులూ లేవు. అవన్నీ కూడా వాస్తవానికి చిదాకాశరూపమగు బ్రహ్మమే అయి ఉన్నాయి.
అట్లాగే... జలము-అగ్ని-వాయువు-ఆకాశం-పంచభూత కలయికలచే ఏర్పడే పదార్థాలు, బ్రహ్మదేవుని "సూక్ష్మభూత ఉపాధి”యగు “సమష్టి అహంకారాలు-సమష్టి చిత్తములు, -సమష్టి బుద్ధులు-సమష్టి మనస్సులు”... ఇవన్నీ కూడా ఆరోప - దృష్టిచే అణువణువునా ఉన్నాయి. ప్రతి అణువు అనేక బ్రహ్మాండాలు కలిగి ఉన్నది. అందులోని ప్రతి బ్రహ్మాండంలోని ఆయా పంచభూత ప్రపంచపు అణువణువులో మరింకెన్నో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి.
Page:10
అపవాద దృష్టిచే (బ్రహ్మాండాలు... అనునవి విభాగించి 'అవన్నీ ఏమిటి?' అని పరిశీలించి చూచినపుడు) అవేవీ ఎక్కడా లేవు.
శ్రీరాముడు : మరి బ్రహ్మమున మనకు కనిపించే సృష్టులు ఎట్లా వస్తున్నాయి? “బ్రహ్మం, సృష్టి” అను ఈ రెండింటికీ గల భేదమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తున్నాను. విను.
“బ్రహ్మ - సర్గాత్” తథా ఇత్యేష వాచి భేదో న వస్తుని ॥
'బ్రహ్మము' అని పిలవబడుదానికి, సృష్టి అని చెప్పబడుదానికి ఏమీ భేదం లేదు. ఒకవేళ “నాకు భేదం గోచరిస్తోంది కదా?”... అని నీవు అంటావేమో? ఏ భేదమైతే గోచరిస్తుందో ... అది వాచిక భేదమేగాని, వాస్తవానికి వస్తుతః ఆ రెండింటికీ భేదం లేదు.
సర్గా ఏవ పరంబ్రహ్మ పరంబ్రహ్మైవ సర్గతా ।
మనాగపి అస్తిన దైవమత్ర “అగ్ని - అర్కే” ఉష్ణ్యయోరివ ॥
ఈ సృష్టియే ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఈ సృష్టియే అయి ఉన్నది.
"ఉష్ణము” దృష్ట్యా అగ్నికి - సూర్యునికి భేదమేమున్నది? రెండూ ఉష్ణరూపములే కదా! “ద్రవత్వము” దృష్ట్యా జలమునకు - తరంగమునకు ఉన్న తేడా ఏమిటి? "వాయుత్వము దృష్ట్యా వాయువుకు - వాయు తరంగమునకు భేదమెక్కడ? అట్లాగే బ్రహ్మమునకు - జగత్తుకు భేదమేమీ లేదు!
సృజనము అను క్రియచే 'సృష్టి' అనేది (శబ్దం) ఏర్పడింది (సృజి...ఇతి క్రియేతి సృష్టిః); వర్ధనము అను క్రియచే ‘బ్రహ్మమ్' అనేది(శబ్దం) ఏర్పడుతోంది (బృం హి... ఇతి క్రియేతి బ్రహ్మమ్). ...ఈ రెండు క్రియలకు (సృజన క్రియ, వర్ధన క్రియ) పరస్పరం అభేదమే అయి ఉన్నాయి సుమా! పోనీ, ఒకదానిని 'ఆధారము' అని, రెండవదానిని 'ఆధేయము' అని అందామా? అట్టి ఆధార - ఆధేయముల తేడా ఉన్నదని గాని, లేదు అని గాని నిరూపించలేము. అందుకే, ఆ రెండింటికి ఉన్న భేదం అనిర్వచనీయం అని అంటూ ఉంటారు. కర్త కన్నా క్రియ వేరైన స్వరూపం కాదు కదా! (ఉదాహరణకు "అతడు పరిగెత్తుచున్నాడు”... అను దానిలో అతనిని, అతని పరుగుని వేఱుచేసి చూపలేం కదా!) అట్లాగే 'బ్రహ్మము' అను దానికి సృష్టికి వేరైన ఉనికి ఎక్కడా కనిపించదు. 'సృష్టి' అనునది భావనకు వేఱుగా ఏదీ ఉండటం లేదు.
అందుకే "సృష్టి-బ్రహ్మము అను ఉభయ శబ్దముల భేదం కొయ్య చీల్చుచున్నప్పుడు వచ్చే “పర్..ర్" శబ్దము వలె అర్థరహితం అని కూడా విజ్ఞులు అంటూ ఉంటారు.
ద్వైతము ("ఒకటి రెండుగా అగుచున్నది"); ఏకత్వము (“రెండూ ఒక్కటే అయి ఉన్నది”)... ఈ రెండు కనిపిస్తున్న ఏ వ్యవహార దశ అయితే ఉన్నట్లున్నదో, అది కూడా 'చిన్మాత్రము' యొక్క వివర్తనమే. అందుచేత అప్పుడు కూడా “సృష్టి, బ్రహ్మం" అను ఉభయ శబ్దములు, వాటి అర్థములు వేఱువేఱు కాదు. ఇట్లు ఈ సృష్టి బ్రహ్మమే అయి ఉండగా ...ఇక ఎవనికి ఎట్లు విభిన్న రూపములు భాసించగలవో చెప్పు?
Page:11
కాబట్టి రామచంద్రా! నీవు సర్వదా జ్ఞానివై ఉండు. వ్యవహారంనందు ప్రవృత్తుడైనప్పటికీ జ్ఞానికి ఈ సమస్త జగత్తు 'శిల' వలె చిద్ఘనం - శాంతం - ఏకం - అద్యంతరహితం - నిర్మలం - నిర్వికారం - మౌనస్వరూపం అగు బ్రహ్మంగానే ప్రకాశమానమగుచున్నది.
ఓ రాఘవా! ఈ “నీవు, నేను, పర్వత సమూహములు, దేవతలు, అసురులు” ఈ మొదలగు సమస్త దృశ్యమున్నూ కేవలం నిర్వాణరూపమగు 'చిదాకాశము' మాత్రమేనయ్యా! కాబట్టి, ఒకడు మేల్కొనిన తరువాత తను రాత్రి కలలో చూచిన దృశ్య వ్యవహార జాలమును ఎట్లు ఉద్దేశించి ఉంటాడో ...నీవు ఆ విధంగా ఈ జగత్తును వర్తమానంలోనే (స్వప్న సదృశ్యంగా) చూడు.
✤✤✤
శ్రీరాముడు : మహర్షీ! మీరు అట్లు ఆకాశంలోని ఒకానొక ఏకాంత ప్రదేశంలో 'కుటీరం' కల్పించుకొని 100 సంవత్సరాలు గడిపానని, ఆ తరువాత జీవచైతన్య సహితులు కాగా, అప్పుడు ‘ఇచ్ఛ, అహంకారం’ అనేవి రెండు వచ్చి చేరాయని చెప్పారు కదా! ఆ తరువాత ఏమైందో చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఇక విను, చెపుతాను.
క్రమంగా నేను సమాధి నుండి ప్రబుద్ధుడనై లేచాను. అప్పుడు అతి సూక్ష్మమైన ఏదో ‘ధ్వని’ నా చెవులకు వినిపించింది. ఆ ధ్వని అల్పంగా వ్యక్తమైన ఏవో పదాలతో కూడుకొని అతి మనో హరంగా ఉన్నది. అయితే ఆ సన్నగా వినబడే మాటలకు అర్థమేమిటో ఏమీ తెలియలేదు. ఆ వినబడిన శబ్దాన్ని బుద్ధితో పరిశీలిస్తే ఆ ధ్వని ఒక స్త్రీ కంఠం నుండి వెలువడినట్లు నాకు అనిపించింది.
ఆ ధ్వనిని విన్న నేను “ఆ ధ్వని ఎవరిది? ఎటువైపు నుంచి వచ్చింది?” అని పరిశీలించసాగాను. అది అతిమధురమైన ఏదో ఆలాపనలాగా ఉన్నది కాని... అది 'రోదన' వలె లేదు. పఠనం వలె కూడా లేదు. అది కమలంలో ఉన్న భ్రమరం చేసే శబ్దంలాగా ఉన్నది. అయితే ఆ ‘ధ్వని’ అత్యంత మృదుమధురంగా ఉన్నదని అనిపించింది. "ఆ ధ్వని ఎటునుంచి వచ్చిందా?” అని కొంచెం ఆశ్చర్యంతో దశదిక్కులా పరికించి చూచాను. నాకు ఏమీ అగుపించలేదు. అప్పుడు నేను ఇట్లా అనుకున్నాను.
✤
“చాలా ఆశ్చర్యంగా ఉన్నదే! సిద్ధులు కూడా వచ్చుటకు అవకాశము లేనంతగా లక్షల కొలది యోజనములు అతిక్రమించి ఈ ఆకాశవిభాగం స్థితి కలిగి ఉన్నది కదా! అటువంటి ఈ ఏకాంత స్థానంలో స్త్రీ గొంతును బోలిన శబ్దం ఎలా సంభవించింది? ఎంతో ప్రయత్నించి కూడా ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో ... అవలోకించలేకపోయానే? ఈ నా ఎదురుగా "అనంతము, మహా శూన్యము, నిర్మలము” ... అయినట్టి ఆకాశం తప్పితే మఱింకేమీ లేదు కదా! ఇక్కడ ఒక్క ప్రాణి కూడా ఉండటానికి అవకాశమే లేదు. మరి ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చినదబ్బా?”
Page:12
ఇట్లా ఆలోచిస్తూ నేను మఱల మఱల పది దిక్కులలోకి మార్చి మార్చి దృష్టి సారించి చూచాను. ఎక్కడా ఏదీ కనిపించనేలేదు.
✤
అప్పుడు నేను ఇట్లా భావించాను. “సరే! ఈ వర్తమాన ఉపాధిని త్యజించి చిదాకాశ రూపుడనయ్యెదను గాక! ఆ చిదాకాశమునందు అధ్యస్తమైయుండే 'అవ్యాకృతాకాశము'తోటి ఏకత్వము సంతరించుకొంటాను గాక! ఆ వ్యాకృతాకాశము యొక్క గుణము అయినట్టి శబ్దమును, ఆ శబ్దము యొక్క అర్థమును ఆ ఆకాశకోశమున అనుభూతం చేసుకొనెదనుగాక! నా ధ్యానబలంతో ఈ దేహాకాశమును ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడే స్థాపించి ఉంచి చిదాకాశరూపుడనై... జలబిందువు జలముతో ఐక్యము పొందినట్లుగా... అవ్యాకృతాకాశముతో ఐక్యము పొందెదను గాక!
ఇట్లా అనుకున్నవాడనై దేహమును త్యజించుటకై అక్కడే పద్మాసనం అవధరించాను. సమాధిని శీలించుటకై మఱల కనులుమూశాను. ఆ తరువాత ఇంద్రియ సంబంధములైన శబ్ద-స్పర్శ–రూప-రస-గంధాది బాహ్య విషయములన్నీ త్యజించాను. అటుపై అభ్యంతరములైన ‘సంకల్పములు’ మొదలైనవాటిని కూడా వదిలివేశాను.
అప్పుడు “చైతన్యస్ఫురణ”చే “చిత్తాకాశరూపుడను" అయ్యాను. క్రమంగా, ఆ చిత్తాకాశ రూపం కూడా త్యజించి "బుద్ధి రూపం”ను పొందాను. ఆ తరువాత ఆ బుద్ధి రూపమును కూడా త్యజించి కేవలం ‘జగత్సమూహమునకు దర్పణం’ అనదగు అనంతమగు "చిదాకాశము”ను అయ్యాను.
అటు తరువాత... “జలం” అనే శబ్దంలో సముద్రజలం, నదీజలం, తటాకజలం, నూతిజలం మొదలైనవన్నీ ఏకరూపం పొందుతాయి కదా! సామాన్య “సుగంధం”లో అన్ని ప్రత్యేక సుగంధాలు ఏకమై ఉంటాయే! ఆ విధంగా నేను ఆ 'చిదాకాశ స్వభావము’చే “భూతాకాశరూపము”ను పొంది దానితో ఏకత్వం సంచరించుకున్నాను.
ఇక ఆపై, ఏ చిదాకాశము సమస్తమునందు వ్యాపించి “అనంతము సర్వ వ్యాపకము” అయి ఉన్నదో... అది నేనయ్యాను. అనగా నేను సమస్తమునందు వ్యాపించి, అనంతుడనై సర్వ ఆధారునిగా నా స్వరూపమును పొందినవాడనై సర్వవ్యాపక అనుభవం పొందుచున్నవాడనైనాను. ఆకార రహితుడను - ఆధారవర్జితుడను అయి ఉంటూనే, అదే సమయంలో సర్వ పదార్థములకు ఆధారభూతుడనైనాను.
అట్టి స్థితియందు నేను నా చిదాకాశదర్పణ దేహంలో అనేక త్రైలోక్య సమూహములను, వందలకొలది జగత్తులను, లెక్కించుటకు అలవికాని బ్రహ్మాండాలను వీక్షించాను. అయితే, ఆ బ్రహాండాలన్నీ కూడా అన్యోన్య దృష్టికి (ఒకదానిచే మరొకటి) నిర్మల వ్యాకృతాకాశ రూపములుగానే ఉంటున్నాయి. అనగా, ఒక బ్రహ్మాండంలోని జనులకు రెండవ బ్రహ్మాండము వాస్తవానికి లేనిదిగా శూన్య మాత్రంగా ఉంటోంది. కాబట్టి, ఆ బ్రహ్మాండాలు శూన్యములు - అశూన్యములు కూడా!
Page:13
చిదాకాశమున అనేక బ్రహ్మాండములు అనుక్షణం ఉత్పత్తి అవుతున్నాయి. ఇంతలోనే అనేక బ్రహ్మాండములు ప్రవృద్ధమౌతున్నాయి. ఇంకా ఎన్నో జగత్తులు నదీ ప్రవాహంలాగా కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎన్నో విద్యమానమైనములై ఉన్నాయి. మరెన్నో ఉత్పన్నములు కాబోతూ ఉన్నాయి. అక్కడి శూన్యాకాశంలో వివిధ జనులతో కూడిన జగత్తులు అసంఖ్యాకంగా కనిపించాయి. మనోరాజ్యములవంటి, చిత్ర సమూహములవంటి అనేక బ్రహ్మాండములు కనిపించాయి.
కొన్నింటికి ఆవరణములు లేవు. మరికొన్నిటికి అసంఖ్యాకములైన ఆవరణములు (ఉదాహరణకు భూతావరణ, మనో ఆవరణ చిత్తావరణ మొదలైనవి) ఉన్నాయి. కొన్ని 5 ఆవరణలు మరికొన్ని 7 ఆవరణలు కలిగి ఉన్నాయి. కొన్ని పంచీకృత + అపంచీకృత 5+5=10 ఆవరణలతో కూడి ఉన్నాయి. ఉదాహరణకు, ఒక ఆవరణం కేవలం శబ్దమయం. మరొక ఆవరణం కేవలం స్పర్శమయం ఇట్లా - కొన్ని బ్రహ్మాండాలు ప్రకృతి అహంకారము మహత్ మొదలైన 14 ఆవరణాలు కలిగి ఉన్నాయి.
ఇంకా కొన్ని (సాంఖ్యశాస్త్ర ప్రవచనానుసారం) 24 తత్త్వములు, 36 తత్త్వములు (శైవ మతానుసారం) ఆవరణములుగా కలిగి ఉన్నట్లు నాకు కనిపించాయి. కొన్ని జగత్తులు శూన్యమాత్రంగా ఉన్నాయి. మరికొన్ని జగత్తులు వివిధ ప్రాణులతో నిండి ఉన్నాయి. కొన్ని పంచ భూతమయములు. ఇంకొన్ని పంచభూతములలో ఒక్కొక్కదానితో మాత్రమే నిండి ఉన్నాయి. (ఉదాహరణకు, సూర్యగోళం కేవలం అగ్నిమయం, అంగారక గ్రహం-రాతిమయం... ఇట్లా!)
కొన్ని పంచభూతాలు, దిక్కులు, కాలము ...ఇట్లా సప్తమహాభూతాలతో కూడి ఉన్నాయి. కొన్ని లోకాలలో ఒకే జాతి జీవులు మాత్రమే ఉన్నారు. ఈ మానవుని జీవ దశలకు (బాల్య యౌవన వార్ధక్యాలకు) విరుద్ధమైనట్టి దశలుగల విద్యాధరులతో నిండి కొన్ని జగత్తులున్నాయి. అక్కడి జీవుల జన్మలు వార్ధక్యంతో ప్రారంభంమై బాల్యవస్థతో ముగుస్తోంది.
కొన్ని జగత్తులు ప్రళయ సుషుప్తులనుబోలి నిర్మానుష్యమై ఉన్నాయి. కొన్ని లోకాలలో ఒక్క ప్రభువే అధిష్ఠాన దేవత అయి ఉన్నాడు. మరికొన్ని వివిధ అధిష్ఠాన దేవతల ఆరాధనతో కూడి ఉన్నవి. కొన్ని జగత్తులు వైరాగ్యమును బోధించే వేదాంత శాస్త్రములు, ఆత్మజ్ఞాన శాస్త్రపాఠములు సర్వ ప్రసిద్ధిమై ఉంటున్నాయి. కొన్ని జగత్తులలో అట్టి వేదాంత శాస్త్రం యొక్క ప్రసిద్ధతయే లేదు. వాటి పాఠము - చర్చ మొదలైనవి అగుపించటమే లేదు.
కొన్నిటిలో జీవులు మేడిపండులోని పురుగులవలె అనేక కార్య సంరంభములలో మునిగి - తేలు చున్నారు. మరికొన్నిటిలో నిత్యం నిద్రాపరవశులై ఉంటున్నారు. కొన్ని లోకములలో బ్రాహ్మణాది జాతులచే వంశపారంపర్యంగా నిర్దేశించే శాస్త్ర ఆచార - విచారాదులు మాత్రమే అనుసరించబడుతూ కనిపించాయి. మరికొన్ని లోకములలో ఎవరికి వారే (శాస్త్రానుసారంగా కాకుండా) స్వయం నిర్ణయాభినివేశంతో వర్తిస్తున్నారు.
కొన్ని కేవలం జలం, కేవలం వాయువుచే పూర్ణమైయుండగా మరికొన్ని పంచభూతములు లేకుండా ‘ప్రజ్ఞలు’ మాత్రమే ప్రవర్తిస్తున్నాయి. కొన్ని నిరంతరం ఎక్కడా ఒక్కచోట ఉండకుండా ఆకాశంలో అటూ ఇటూ సంచరిస్తున్నాయి.
Page:14
కొన్ని పుడుతున్నాయి. కొన్ని ప్రవృద్ధమౌతున్నాయి. కొన్ని అనేక భోగాలతో కూడి ఉన్నాయి. కొన్నిటిలో దేవతలు మాత్రమే ఉన్నారు. కొన్ని అసురులతో నిండి ఉన్నవి. కొన్ని అల్ప బుద్ధ జీవులైన క్రిమి-కీటకములతో మాత్రమే నిండి ఉన్నవి.
అరటి పట్టలు ఒకదానిలో మరొకటి ఉంటుంది కదా! అట్లా బ్రహ్మాండంలో అనేక అణువులు, ఆ అణువులతో బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండములలో అణువులు... ఇట్లా అంతు కనబడనంతగా ఉన్నాయి. కొన్ని బ్రహ్మండములు ఒకే తరుణంలో ఒకేచోట ఉత్పన్నమౌతూకూడా ఒకదానితో మరొకటి ప్రక్కప్రక్కన నిదురించే సైనికుల స్వప్నముల వలె - సంబంధం లేకయే ఉన్నాయి.
ఓ రామచంద్రా! ఆ జగత్తులు (లేక బ్రహ్మాండాలు) అన్నీ కూడా వేర్వేరు క్రియలు, వేర్వేరు స్థితులు కలిగి ఉన్నప్పటికీ... ఆ వివిధ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా... “చిదాకాశరూపము” అయి ఉన్నాయి.
కొన్ని పరస్పరం శాస్త్రజ్ఞానమునకు లభ్యములగుచున్నాయి. (అనగా ఒక జగత్తులోని యోగ శాస్త్రజ్ఞానులకు మరొక జగత్తు కనిపించుచున్నది.) కొన్ని ఒకే రకమైన ఆకారాలు కలిగి ఉన్నాయి.
కొన్ని బ్రహ్మాండాలు పరస్పరం పరలోకములుగాను, పరస్పరం అంతర్ధాన శక్తితో కూడిన సిద్ధ నగరములు కలిగినవిగాను ఉన్నాయి. అనగా ఒకదానిలోని కొందరు జీవులు అక్కడ మాయమై మరొక దానిలో ప్రత్యక్షం కాగలుగుచున్నారు. కొన్ని పరస్పర భిన్న దశలు కలిగి ఉంటున్నాయి. అనగా ఒక జగత్తులోని జీవులు ఒక దశ తరువాత మరొక జగత్తులో ప్రవేశం పొందుచున్నారు. కొన్ని మరికొన్నిటికి సిద్ధనగరములవలె తపోధ్యానముల ఫలితంగా పొందబడుచున్నవగుచున్నాయి. కొన్ని భిన్న భిన్న దశలు కలిగి ఉంటున్నాయి. అనగా వర్తమానంలో ఒక దశలో ఉన్న జగత్తు కొంత కాలానికి మరొక జగత్శను పొందుచున్నది.
కొన్ని లోకములు ఈ మానవజాతికి అనుభవ ప్రయత్నములకు అలభ్యములై ఉంటున్నాయి. అవి ఈ జగత్తుకు అతి సమీపంగా వచ్చినప్పటికీ మావంటి తపోశాలురచే మాత్రమే గమనించబడుచూ... మేము వర్ణించి చెప్పినా కూడా ఈ జీవుల అనుభవమునకు అందనట్లుగా, విపరీత గాథలాగా ఉంటున్నాయి.
కొన్ని చైతన్యము అను సూర్యుని యందు గల పరమాణువులవలె ఉంటున్నాయి. కొన్ని బ్రహ్మాండములలో జీవులు మోక్షస్థితిని అనునిత్యంగా అనుభవిస్తూ ఉండటం చేత ఆ బ్రహ్మాండాలు 'మోక్షము' అనే పరదేవతకు కుండలాలవలె ఉన్నాయి. అవి అటు అవ్యాకృతాకాశమునందు ఇటు భూతాకాశమునందు మేలిరతనముల వలె మెరుస్తున్నాయి.
కొన్ని మామిడి వృక్షం యొక్క ఆకుల వలె పదే పదే ఉత్పత్తి, నాశనం, పునరుత్పత్తి పొందు చున్నాయి. మరికొన్ని... వాటిని బోలిన రూపంతో మరొక చోట జనిస్తున్నాయి. కొన్ని బ్రహ్మాండాలు పరస్పరం సదృశ్యంగా ఉన్నాయి. ఇంకొన్ని ఒకదాని దృష్టిలో మరొకటి (అదృశ్యంగా) లేనే లేవు.
కొన్ని కొంతకాలం ఒక రూపంతో కనబడి ఆ తరువాత మరొక రూపం సంతరించుకొంటున్నాయి. కొన్ని అల్పకాలం ఉంటున్నాయి. మరికొన్ని దీర్ఘకాలం ఉంటున్నాయి.
Page:15
కొన్ని దేశ వస్తు స్వభావనియతిని కలిగి ఉంటున్నాయి. మరికొన్నిటిలో 'సూర్యుడు' లేకపోవటం చేత కాలజ్ఞాన రహితమై ఉంటున్నాయి. కొన్ని లోకములు ఎవరి ప్రయత్నమూ లేకుండానే స్వయంగా జనించి వృద్ధి చెందుతున్నాయి. మరికొన్ని ఎవరో యోగుల సంకల్ప శక్తిచే జనిస్తున్నాయి. కొన్ని స్థిరంగాను, కొన్ని అస్థిరంగాను ఉంటున్నాయి.
✤
ఓ రామచంద్రా! ఈ బ్రహ్మాండాలన్నీ కూడా 'అజ్ఞానం' అనే దోషముచే అనాది కాలం నుండి సాక్షి చైతన్యము నందు ఆధ్యస్తములై ఉంటున్నాయి, అట్లా ఉంటున్నప్పటికీ కూడా... రూఢి పడి ఉన్న ఈ బ్రహ్మాండములన్నీ కూడా వాస్తవానికి శూన్యరూపములేనయ్యా! ఈ అనేక సముద్ర - పృథివీ - సూర్య - ఆకాశ - మేరు పర్వతాదులతో కూడిన గణింపశక్యంకాని బ్రహ్మాండాలన్నీ 'చిదాకాశం' అనే దర్పణంలో "త్రిగుణాలు” అనే దోషం చేత స్వప్న సమూహాలవలె భాసిస్తున్నాయి.
అవి అనుభవమునకు లభిస్తున్నప్పటికీ, వాస్తవానికి లేవు! నిజరూపంచే ఇవన్నీ కూడా చిదాకాశ రూపమే! అనగా, అవి చిదాకాశం వలె సర్వదా ఉన్నాయి. అవన్నీ అనుభవానికి సత్యం వలె అనిపించవచ్చు గాక! మృగతృష్ణలో జలతరంగాలు కనిపిస్తున్నప్పటికీ అక్కడ జలతరంగాలు లేవు కదా!
✤
అవన్నీ కూడా “చైతన్యం” యొక్క సంకల్పజనితమైన ఆకాశమునందు సంకల్ప స్వభావముచే అగుపిస్తున్నాయి. వాసనచే ప్రేరితమై స్వచేష్టచే ఇటు అటు పరిభ్రమిస్తున్నాయి. చైతన్యం అనే బాలుడు 'సృష్టి' అనే క్రీడచే ఉపయుక్తుడై ఉండటం చేతనే ఈ జగత్తులన్నీ సంకల్పనగరమున ఉంటున్నాయి. తడిమట్టిచే తయారుచేసిన బొమ్మలు సూర్యకాంతి పడటంచే గట్టి పడతాయి చూచావా? అట్లా ఈ జగత్తులన్నీ అభిమానపూర్వకమగు బుద్ధి యొక్క బలముచే దృఢపడుచున్నాయి. రాగయుక్తము, కర్మఫలదాయకమగు "నియతి" ఈ బ్రహ్మాండాలన్నిటినీ శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తోంది.
శ్రీరాముడు : మహాత్మా! ఈ సృష్టికి అసలు కర్త ఎవరు? "సృష్టికర్త" అను శబ్దము వేద వాఙ్మయమునందు ప్రసిద్ధమై ఉండటంచేత ఈ ప్రశ్న అడుగుచున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : శ్రుతులు రెండు రకములైన అభిప్రాయం ప్రకటించాయి.
1.) "పరమాత్మయే భూమి-స్వర్గము మొదలైన లోకాలన్నీ నిర్మించారు" - ఈ అర్థమును ప్రతిపాదించే శ్రుతుల విభాగములను అనుసరించి సమస్త బ్రహ్మాండములకు కర్త చిదాకాశ రూపమగు పరబ్రహ్మమే అయి ఉన్నది. "కర్తృత్వము ఆపాదించుకొనుట చేతనే పరమాత్మచే సృష్టి భావనావ్యవహారంగా వ్యక్తీకరించబడుతోంది" అని శ్రుతులు గానం చేస్తున్నాయి.
2.) బ్రహ్మము శుద్ధమైనది. కర్తృత్వ దోషం లేనిది - ఇట్లా వచించే శ్రుతుల విభాగములను అనుసరించి సమస్త బ్రహ్మాండములకు 'కర్త' అంటూ ఎవరూ లేరు. అనగా, అవి కర్తృత్వరహితములై చిదాకాశమున స్వయంసిద్ధమైన రూపములో కలిగియున్నవి అగుచున్నాయి.
Page:16
ఈ జగత్తులన్నీ పరమార్థమున బ్రహ్మస్వరూపములే అయి ఉన్నాయి. అయినా కూడా, అవి అట్టి బ్రహ్మస్వరూపమునకు వేరుగా ఉన్నట్లు - బంగారు ఆభరణంలో బంగారము, ఆభరణము లాగా - ఉదయించిన వగుచున్నాయి. వాస్తవానికి చూస్తే జగత్తుగా చెప్పబడేది అలబ్ధమే (ఇది అని ఏదీ లభించనిదే అయినా లభించినట్లుగా) ఉంటున్నది! సదా ఈ జగత్తులు ‘లేనివే’ అయినప్పటికీ ఉన్నట్లుగా ఒప్పుచున్నాయి.
ఇక్కడి జీవులు, 14 లోకములు, ఒక్కొక్క లోకంలో అనేక జీవజాతులు... ఇవన్నీ మరల మరల (అవే) ఉత్పన్నమౌతున్నాయి. ఒక్కొక్కప్పుడు వేరైన జగత్తులుగా ఉద్భవిస్తున్నాయి.
ఈ జగత్తు కాస్త పరిశీలించి చూస్తే... ఇందలి నరక - భూ - స్వర్గ - పాతాళాది లోకాలు, ఇందలి బంధు - మిత్ర సమాగమాలు, ఇందలి మహాకార్య సమారంభాలు... ఇవన్నీ కూడా పరమార్థమున శూన్యరూపములే అయి ఉన్నాయి.
ఈ జగత్తులన్నీ క్షీరసాగరంలోని జలంలాగా స్నేహము, రాగము మొదలైనవి కలిగి ఉండి కూడా సముద్ర జలతరంగాలలాగా క్షణభంగురములు అయి ఉన్నాయి. జగత్తుగా ఏ రూపమై కనిపిస్తోందో ఆ రూపం పరివర్తనం పొందబోతూనే ఉన్నది కదా! అందుచేతనే, ఇవి “ఆత్మ అను సూర్యుని యొక్క తేజమునకు సంబంధించిన 'ఆభాస' మాత్రమే” అని అనతగి ఉన్నవి.
వాయువు యొక్క చలనముచే చెట్లు కదులుచున్నాయి. కనుక, చెట్లు కదలటానికి వాయుచలనం కారణం అని మనం అనవచ్చు. మరి వాయువు ఏ కారణం చేత కదులుతోంది? వాయువు నందు చలనము స్వయంగా ఉత్నన్నమగుచున్నట్లే ఈ జగత్తులు కూడా స్వయముగానే ఉత్పన్నమౌతున్నాయి. ఈ జగత్తులు 'వృక్షములు’ అని అనుకుంటే, అట్టి జగత్ వృక్షములకు బుద్ధి, అహంకారము, చిత్తము మొదలైనవి ఆకుల వంటివి. అట్టి ఈ ద్రష్టకు దర్శనమగుతున్న జగత్తు స్వప్నంలో కనిపించే ఆయా రూపాలవలె అసత్తే!
పురాణ - వేద - శాస్త్రాదులతో ప్రసిద్ధములైయున్న యజ్ఞ - దాన - జప - తపాదుల కల్పనారూప స్వప్నంలో ఈ జగత్తులు మహానిద్రను అనుభవిస్తు న్నాయి. అట్టి ఈ జగత్తులన్నీ కూడా 'ఆత్మరూప జ్ఞానము' అనే మెలకువ వచ్చినప్పుడు అవన్నీ స్వప్నాంతర - స్వప్నములోని, స్వప్నాంతర్గత స్వప్నంలోని జనుల గతిలాగా శవరూపమును దాల్చుచున్నాయి. (అనగా ఈ జగత్తులన్నీ 'లేనివే' అగుచున్నాయి).
బ్రహ్మమునందు 'మాయమోహిత చైతన్యము’ అను చమత్కార పురుషునిచే ఈ జగత్తులన్నీ నిర్మించబడినవై... సూర్యుని వెలుగులో కనిపించే నగరములోని అనేక గృహముల లాగా ఆత్మ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి.
ఓ రామచంద్రా ! ఆ విధంగా ఆ సమాధి కాలంలో నాచే అవధరించబడిన అనంతమగు చిదాకాశంలో.... కారణము లేకయే జనిస్తూ, కారణము లేకయే నశిస్తూ, తిమిర దోషము (సంసార దోషము) గల కనులకు కనిపిస్తూ... వాస్తవానికి భ్రాంతి మాత్రమే అయి ఉంటున్న అనేక జగత్తులను చూచాను.
✤✤✤
Page:17
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఆ విధంగా నేను అవిచ్ఛిన్నమైన 'చిదాకాశరూపత్వం' అవధరించిన వాడనై అట్టి చిదాకాశములో వివిధములైన బ్రహ్మాండాలను గమనిస్తునే... మరొక వైపు “ఆ వినబడే శబ్దానికి కారణం ఏమిటి?" అని నలువైపుల వెతుకుచూ చాలాసేపు గడిపాను. అట్లా వెతుకుచూ ఉండగా నాకు ఆ శబ్దం క్రమంగా మృదుమధురమైన వీణానాదంగా వినబడసాగింది. క్రమక్రమంగా అది మరి కొంత స్పష్టపడుతూ 'ఆర్య' అనే ఛందస్సు రూపం సంతరించుకొన్నది. అప్పుడు ఆ శబ్దం ఏర్పడుచున్న ప్రదేశం మీద నా యోగదృష్టి పడింది. వెంటనే అక్కడ ఒకానొకచోట నిలబడి ఉన్న ఒక స్త్రీని చూచాను. ఆమె తన బంగారపు ప్రకాశంతో ఆకాశాన్ని ప్రకాశితంగా చేస్తోంది. ఆమె వస్త్రములు చిరుగాలికి కదులుచున్నాయి. ఆమె ధరించిన సుందరమైన ఆభరణాలు, చంచలమైన దీర్ఘకేశాలు, అతి రమణీయమైన వర్చస్సు, సాక్షాత్తూ లక్ష్మీదేవిని గుర్తుచేస్తున్నాయి. హాస్యయుక్తం, యౌవన శోభితం అగు ఆమె ముఖం వన దేవత వలె శోభాయమానంగా ఉన్నది. ఆమెను దర్శించిన నేను దృష్టిని కించత్ మరలించే ప్రయత్నంలో ఉండగా ఆమె నా సమీపాన్నే ఉండి ‘ఆర్య' (ఛందస్సు) ను గానం చేస్తూ నా వైపే చూస్తూ పెదవులు విప్పి చిరునగవుతో పలుకసాగింది.
ఆ స్త్రీ : దుష్టులచే సేవించబడే రాగ - ద్వేష- కామ - క్రోధాది దోషములు ఈషణ్మాత్రంగా కూడా లేనట్టి ఓ మునీంద్రా! 'సంసారం' అనే నదిలో మునుగుచున్న మనుజులకు మీరు ఒక ఆలంబనము వంటివారు. మిమ్మల్ని సర్వశ్రేష్ఠులుగా గుర్తించిన నేను మీకు, ఇదే నమస్కరిస్తున్నాను!
✤
శ్రీ వసిష్ఠ మహర్షి : శ్రీ రామచంద్రా! నేను ఆమె పలికిన శబ్దములు విన్నాను. ఆమె ముఖం వైపు చూచాను. “ఆఁ! ఈమె ఒక స్త్రీ కదా! ఈమెతో నాకు పనేమున్నదిలే?” అని తలచాను. ఎందుకోగాని, అప్పుడు అత్యంత ఉదాసీనత వహించాను. ఇక అక్కడి నుండి నా దృష్టిని మరల్చసాగాను. ఆ తరువాత అనేక జగత్ సమూహములను చూచాను. “ఆహాఁ! ఈ మాయ ఎంతటి విస్తారమైనది!' అని ఆశ్చర్యపడసాగాను. అట్లా జగత్సమూహములను గమనిస్తూ, వాటిని కూడా ఉపేక్షించినవాడనై ఆకాశమున సంచరించటానికి ఉద్యక్తుడనయ్యాను. 'మాయా జనితమైన చింతననంతా వదలి, చిదాకాశమున ఉన్న జగన్మాయ యొక్క ఉత్పత్తి స్థానమేమిటో గమనించెదను గాక' అని అనుకొని చిదాకాశ రూపమును కొనసాగించ దలిచాను. అప్పుడు నాకు కనిపించిన జగత్ సమూహములన్నీ స్వప్నములో వలె, ఊహలోలాగా, కథాజగత్తులవలె శూన్యరూపంగానే అనిపించాయి. అవన్నీ శూన్యరూపములే కాబట్టి పరమార్థమున జగత్తులనేవి ఎచ్చట ఏవీ లేవు, కాంచబడటమూ లేదు, వినటమూ లేదు. అంతే కాదు! అక్కడ నాకు కనిపించటం జరిగిన జగత్తులలోని ఒకదానిలోని దేవతాది జీవులకు మరొక జగత్తు లేకయే ఉన్నది.
శ్రీరాముడు : అదేమిటి స్వామీ! ఒక జగత్తులోని వారికి మరొక జగత్తు 'లేనిది’గా అయి ఉండటం ఎట్లా సాధ్యం?
Page:18
శ్రీ వసిష్ఠ మహర్షి : ఒక గదిలో ఇద్దరు మనుజులు నిదురిస్తున్నారనుకో! ఒకడు తన స్వప్నంలో చూస్తున్న యుద్ధ విన్యాసాలు, గజబల ఘీంకారాలు ఆ ప్రక్కనే నిదురిస్తున్న రెండవ మనుజునకు వినబడవు, కనబడవు కదా! అవన్నీ రెండవవానికి అవిషయములే కదా! ఒకనికి తన ప్రియురాలితో ఏర్పడే మధురానుభూతి - ప్రేమావేశము అతని సోదరులకో, మిత్రులకో అనిపించదు కదా! అట్లాగే అనేక బ్రహ్మాండములలోని ఒక దానిలో జరిగే కల్పాంతాది విన్యాసాలు మరొక బ్రహ్మండములోని జనులకు తెలియరావటమే లేదనునది నేను గమనించాను. అనగా, అవి పరస్పరం ఒకదానిలోని జీవులకు మరొకటి శూన్యరూపంగా ఉన్నాయి. ఆ విధంగా కోట్ల కొలది బ్రహ్మలు, లక్షల కొలదీ విష్ణువులు, అనేక కల్పసమూహములు నాకు ఈ గోడ మనందరికీ కనిపిస్తున్నట్లు కనిపించాయి. ఆ పలు విధమైన జగత్తులలో కొంతవిభాగం సూర్య రహితమై, రాత్రి-పగలు తేడా లేనిదై ఉన్నది. అక్కడ కల్ప-యుగ-సంవత్సరాది కాలము కూడా లేదు. అయితే అట్టి చిద్వస్తు విభాగమునందు ఊహామాత్రం చేతనే సమస్తము యొక్క క్షయము-ఉత్పత్తి కూడా సంభవించటం నేను గాంచాను.
శ్రీరాముడు : స్వామీ! మీరు చెప్పే చిదాకాశమునందలి అట్టి విభాగము బహు చిత్రంగా ఉన్నదే!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను.
చితి సర్వం చితః సర్వం చిత్ సర్వం సర్వతశ్చ చిత్ ।
చిత్ సత్ సర్వాత్మికేత్యేతత్ దృష్టం తత్రమయాఖిలమ్ ॥
ఓ రామచంద్రా! సమస్తం చైతన్యముననే కలదు. సమస్తం చైతన్యం నుండే కలుగుతోంది. చైతన్యమే సమస్తము అయి ఉన్నది కూడా! అంతటా చైతన్యమే వ్యాపించి ఉన్నది సుమా! ఇన్ని మాటలెందుకు? "ఏ చైతన్యమైతే ఉన్నదో, అదియే సర్వాత్మకమై ఉన్నది" అనునది నేనచ్చట నా యోగదృష్టి సహాయముతో సుస్పష్టంగా గమనించాను.
అంతేకాదయ్యా! "ఇది కుండ, అది వస్త్రము, అదేమో మానవుడు, ఇక ఇది జంతువు" అని దేనినైతే నీవు అంటున్నావో ఆ విధంగా చైతన్యమే నామ రూపముల దృష్ట్యా చెప్పబడుచున్నది.
ఈ విధంగా చైతన్యం కొంచెంగా “నామరూపాత్మకంగా అవటం” అనునదే పదార్థముల యొక్క ఉత్పత్తి - అని నేను గ్రహించాను. ఎప్పుడైతే ఆ చైతన్యము ఆకాశం కంటే కూడా అత్యంత శూన్యమైనట్టి రూపంగా చెప్పబడుతోందో (లేక, దర్శించబడుతోందో) నామరూపరాహిత్యత చేత ఆ దశయే పదార్థముల క్షయముగా చెప్పుకోవచ్చు.
చిదాకాశరూపమగు ఆ శూన్యమాత్రమైన ఆకాశమే “వాయువు” మొదలైన ఆయా క్రమముల వలన 'జగత్తు' అని చెప్పబడుతోంది. అట్టి జగత్తులో 'నేను-నీవు' ఆదిగా నానాత్వమంతా ద్యోతకమౌతోంది. అట్టి నానాత్వంగా అనుభవమగుచున్న ఈ జగత్తు మహావాక్య మనన ప్రభావం చేత ("అహం బ్రహాఽస్మి - తత్త్వమసి - నేహ నానా స్తి కించన - జీవో బ్రహ్మేతి నాపరః” మొదలైన వేద ప్రతిపాదిత మహా వాక్యాల అర్థమును అంతర్గతపరచుకొనుచుండగా) చిదాకాశరూపంగా పరిణతి చెందుతోంది. అనగా, “అంతా చిదాకాశం మాత్రమే" అను మహానుభావంలో అనేకత్వమంతా ఒదిగి, రహితమైపోతోంది. అదియే ప్రపంచం యొక్క క్షయం.
Page:19
ఓ రామచంద్రా! "ఆకాశవృక్షం యొక్క వ్రేలాడే పుష్పగుచ్ఛాలు” అనునది ఎంతగా ఊహా జనితము, మరియు భ్రమాత్మకమో... ఈ దృశ్య దృష్టి కూడా అంతగానూ కేవలం భ్రాంతిమాత్రమే అయివున్నది.
సకల దృష్టులూ ఆపాదిత మాత్రం అవగా... దీనికి ఆవల గల 'దృక్' స్వరూప చిదాకాశమే నిరతిశయ సుఖ రూపమని సర్వత్రా గ్రహించియున్న నేను సమాధియందు అంతిమ సాక్షాత్కార వృత్తి రూపమైన చిదాకాశముతోటి ఏకరూపం పొందాను. నేనే ఆ చిదాకాశమైనాను. సర్వవ్యాపిని, అనంతరూపుడను అయ్యాను. నిస్సంకల్పపూర్వకంగా అక్కడి సమస్త బ్రహ్మాండ సమూహములను అస్మత్ స్వరూపంగా అనుభవం పొందాను. అనగా, ఆ బ్రహ్మాండములు, తదంతర్గతమైన దశదిశలు, అందలి దేశ కాల-ద్రవ్య-క్రియా కల్పనలు 'నేనే' అయ్యాను. సమస్తమూ బ్రహ్మాకారరూపమేనను అనుభవం పొందసాగాను. అంతే కాదు, యుగభేదములతో కూడి ప్రకాశించే అక్కడి అనేక జగములతో నావంటి రూపాలే అయినట్టి వసిష్ఠ నామధేయులైన ఉత్తములగు అనేకమంది మునీశ్వరులు కూడా నాకు కనిపించారు. శ్రీ రామావతార సహితంగా 72 త్రేతాయుగాలు నేనక్కడ చూచాను.
అయితే, భేద వాసన యొక్క ఉద్బోధము చేతనే ఆ సృష్టి దశలన్నీ నాకు ఆ విధంగా కనిపించాయి సుమా! ఇంతలో బ్రహ్మజ్ఞాన బలంచేత అదంతా కూడా అతి నిర్మలము - ఏకము - సర్వ వ్యాపకము అయిన చిదాకాశంగానే కూడా దర్శించగలిగాను.
నామ రూపాత్మక దృష్టికి అనేక మట్టి బొమ్మలు కనిపిస్తున్నప్పటికీ మట్టియందు అనేక రూపములు గాని, ఒక్క రూపముగాని లేవు కదా! అట్లాగే, నామరూపాత్మకం దృష్ట్యా ఈ "జగత్తు” అనేది బ్రహ్మమునందు లేదు. అయితే అన్ని మట్టిబొమ్మలలోని ఆయా నామ రూపాలన్నీ మట్టియే కదా! అధిష్ఠాన చైతన్యం దృష్ట్యా ఈ జగత్తు బ్రహ్మమే.
నామరూపాత్మకం దృష్ట్యా ఈ జగత్తు భ్రమ మాత్రమే! అధిష్ఠాన చైతన్యం దృష్ట్యా ఈ జగత్తంతా జన్మరహితం (అజం), ఆద్యంతాలు లేనిది (అనాది), అనంతమైనది అయిన బ్రహ్మమే!
ఓ రామచంద్రా! ఏ బ్రహ్మము సర్వదా ఒక శిల వలె మౌనరూపమై, నామరూపవర్జితమై, జ్యోతి స్వరూపమై ఉన్నదో... ఆ బ్రహ్మమే ఈ రీతిగా జగద్రూపమున ఉన్నది అని గ్రహించు.
ఒకడు తాను నిరాకార స్వరూపుడే అయి ఉండి కూడా, తన స్వక్రీయ ఊహా నిర్మిత స్వప్నమున “తన రూపాలే” అనతగ్గ అనేక ఆకార వికారాలన్నీ పొందుచున్నాడు చూచావా? ఆ విధంగానే, నిరాకారమగు చిదాకాశమున వాస్తవానికి “చేత్యం (తెలియబడేది లేక, దృశ్యం)" అనేది లేకపోయినప్పటికీ, అద్దాని కల్పనచే (స్వప్నాంతర్గత దృశ్యం వలె) నిరాకారమగు చైతన్యమే జగద్రూప దృశ్యంగా భాసించుచున్నది.
ఒక దీపంలోంచి ప్రకాశం బయల్వెడలి ఆయా వస్తువులను ప్రకాశింపజేస్తోంది. అయితే జ్యోతి ప్రకాశము జ్యోతి కంటే వేఱు కాదు కదా ! అదే రీతిగా, ప్రకాశమాత్ర రూపమగు చైతన్యం తన కంటే వేరుకాని రూపాన్ని జగత్తుల రూపంగా రచించుచున్నది. అంతర్గత జ్యోతి తత్త్వమగు సూర్యుడు, సూర్యకిరణం ఒక్కటే అయినట్లు, చైతన్యం - చైతన్యస్ఫురణ మాత్రమగు ఈ నామ రూప జగత్తు ఒక్కటే! “జగత్తు అనేది రచించబడటం లేదు. చైతన్యమే జగత్తుగా (భ్రమచే) అనిపిస్తోంది” ... అని కూడా చెప్పబడుతోంది.
Page:20
ఈ విధంగా బ్రహ్మము యొక్క వివర్త రూపములే అనతగిన అక్కడి అనేక జగత్తులందు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కనిపించసాగాయి.
ఒక జగత్తులో చంద్రబింబము ఉష్ణంగాను, సూర్యబింబము శీతలంగాను అనుభూతమౌతున్నాయి. అక్కడ నాకు తారసపడిన మరొక జగత్తులో జీవులు గుడ్లగూబల వలె చీకటిలో అన్నీ చూడగలుగుచున్నారు. వెలుతురులో ఏమీ చూడలేకపోతున్నారు. అట్లాగే అక్కడి ఇంకొక జగత్తులో జీవులు తమ శుభకర్మల ప్రభావం చేత వినాశనం పొందుచున్నారు. అశుభ కర్మల ద్వారా స్వర్గము మొదలైన ఉత్తమ లోకములు పొందుచున్నారు. కొన్నిచోట్ల విషమును భక్షించుటచే సుఖము, దీర్ఘ జీవనము పొందుచున్నారు. అమృత భక్షణ చేత మరణం పొందుచున్నారు.
ఆ విధంగా మనస్సు యొక్క కల్పన చేతనే అదంతా అట్లు పరిఢవిల్లుతోంది సుమా!
శ్రీరాముడు : స్వామీ! అదేమిటీ? ఆయా జగత్తులలో సరస్పర విరుద్ధంగా విషము జీవనంగాను, అమృతము మరణంగాను ఎందుకు ప్రయోజనప్రదాతలుగా అగుచున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ మనస్సే అంతయు అగుచున్నది కదా! ఒకానొకటి సత్తు కావచ్చు, లేదా... అసత్తు కావచ్చు. ఏదైనా వస్తువు చిరకాలంగా “ఇది నాకు హితము” అని అభ్యసిస్తే అది అట్లే అనుభవమౌతుంది. అట్లాగే "అది నాకు అహితము” అని అభ్యసిస్తేనో, కర్మవశంగా భోగకాలంలో శీఘ్రంగా ఆ రూపముననే స్పష్టంగా ప్రకటనమగుచున్నది. మనస్సును బట్టే దృశ్యం ప్రాప్తిస్తోంది. మనస్సు లేనిచోట దృశ్యమే లేదు.
ఇంకా అక్కడ నాకు కనిపించిన వివిధ జగత్తుల యొక్క కొన్ని విశేషాలు చెబుతాను. విను. కొన్ని జగత్తులలో అనేక పుష్ప-ఫలభరిత వృక్షములతో కూడిన వనసమూహాలు ఆకాశంలో అటూ, ఇటూ గాలి పటాల లాగా ఎగురుచున్నాయి. ఇంకొన్ని జగత్తులలో విరుద్ధ పదార్థ ధర్మాలు ప్రవర్తిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని జగత్తులలో తైలయంత్రములచే ఇసుక పిండబడగా, ఆ ఇసుకలోంచి నూనె (తైలము) ఉత్పత్తి అవుతోంది.
కొన్నిట్లో కొండరాళ్ళ లోంచి కమలములు ఉద్భవించి వికసిస్తున్నాయి. కొన్నిచోట్ల శిలతో చెక్కబడిన విగ్రహములు చలనము పొంది దేవతా స్త్రీలతో కలసి నృత్యం చేస్తున్నాయి. హావభావా లతో కూడిన సంభాషణ నిర్వర్తిస్తున్నాయి.
ఇంకొక జగత్తులో ఎందరో జీవులు ఆకాశంలో పరిగెత్తే మేఘములను రెండు చేతులతోను పట్టుకొని వస్త్రములుగా మలచుకొని ధరిస్తున్నారు. కొన్నిచోట్ల ఒకే వృక్షమునకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఫలములు ఫలిస్తున్నాయి. ఒకచోట ఒకే జాతికి చెందిన ప్రాణులతో అవయవాలు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క రకంగా అమర్చబడి ఉంటోంది. వాటి దేహముల రచన అనిమియతమై ఉంటోంది.
కొన్ని జగత్తులలో ఎందరో జీవులు తమ శిరస్సులతో నడుస్తున్నారు. కొన్ని జగత్తులలో అధోలోకములలోని జీవులు వేద - శాస్త్రవిహీనంగా, ఇచ్ఛ వచ్చినట్లు చరిస్తున్నారు.
Page:21
కొన్నిచోట్ల జీవులకు “కామము” అనేది ఉండక, ఇక జీవులు స్త్రీకి జనించక - కేవలం గాలిలోనో, ధూళిలోనో ఉత్పన్నం అగుచున్నారు. కొన్ని లోకములలో జీవులకు దయ-దాక్షిణ్యం అంటే ఏమిటో తెలియక జీవిస్తున్నారు. మరికొన్ని లోకములలో వాయుభక్షణ చేతనే జీవులు జీవిస్తున్నారు. మరికొన్ని లోకములలో జీవులకు ధనవ్యవహారమే లేదు.
మరికొన్ని జగత్తులలో 'వ్యష్టి అహమ్' అనే భేదమే లేకుండానే ఉంటోంది. అనగా సమష్టి విరాడహమ్ భావన చేతనే సర్వదేహముల వ్యవహారం జరిగిపోతోంది. అనగా ఒక జీవుడు "ఈ చేతులు నావి. ఈ గోళ్ళు నావి”... అని అనుకొనే విధంగానే ఆ బ్రహ్మాండములలోని జీవులు తక్కిన జీవులందరినీ తమ దేహములోని విభాగమునే వీక్షిస్తున్నారు. ఏకాత్మ భావనచే తదితర సర్వజీవులను తమ వలెనే గాంచుచున్నారు.
కొన్ని జగత్తుల నిండా ఒకేవిధమైన ప్రాణులున్నారు. మరికొన్ని జగత్తులలో వివిధ రకములైన ప్రాణులు కనిపిస్తున్నారు.
ఒకానొకచోట సృష్టి గూర్చిన భేదవాసనయే లేకపోవటం చేత అదంతా కూడా అనంతంగాను, అపారంగాను, శూన్యంగాను అనుభూతమౌతోంది. ఇంతలోనే మరల సృష్టివాసనారూపమగు ఏదో ప్రయత్నము ఎక్కడినుండో బయల్వెడలి అక్కడ జగత్తులు ప్రస్పుటమౌతున్నాయి. మరికొంత సేపటికి అవి మరల శూన్యరూపత్వం సంతరించుకుంటున్నాయి.
ఓ రామచంద్రా! ఏది ఏమైతేనేం? “నిర్విషయ బ్రహ్మభావన దృష్టి" కి మాత్రం ఆ లోకాలన్నీ అత్యంత మిథ్యా రూపాలుగానే ఒప్పుచున్నాయి. మట్టిబొమ్మలలోంచి మట్టిని వేరుచేసి చూస్తే ఏనుగు-గుఱ్ఱం మొదలైన ఆకారాలు శూన్యమే కదా! ఆ ఆ జగత్తులన్నిటిలో గల ప్రాణుల నుండి చైతన్యమును వేఱుచేసి చూస్తే అవన్నీ - అదంతా శూన్యంకాక మరింకేమిటి?
ఇంకా ఆ జగత్తుల విశేషాలు విను. కొన్ని జగత్తులలో జ్యోతిశ్చక్రము లేకపోవటం చేత వాటిలో 'కాల కల్పన' అనేదే లేదు. మరికొన్నిటిలో జీవులు మూగ అయి, సంకేత మాత్రం చేత మాత్రమే సంభాషించుకుంటున్నాయి. కొన్ని జగత్తులలో జీవులకు నేత్రేంద్రియం లేకపోవటం చేత వాటి పట్ల సూర్య ప్రకాశం మొదలైనవి వ్యర్థమే అగుచున్నాయి. వీటికి పరస్పరం కనులలో చూచు కోవటం సాధ్యపడకపోయినా తదితర ఇంద్రియాల ద్వారా పరస్పరమైన ప్రవర్తనను నిర్వర్తించు కుంటున్నాయి. ఇంకొన్ని జగత్తులలో జీవులకు ఘ్రాణేంద్రియంగాని, తజ్జనితమైన జ్ఞానం గాని లేక అక్కడ సుగంధ-దుర్గంధములు వ్యర్థమే అగుచున్నాయి. కొన్నిచోట్ల జీవులంతా మూగవారు, చెవిటివారు అవటం చేత అక్కడ శబ్దము వ్యర్థత్వం చెందుతోంది. ఇంకొన్ని జగత్తులలో స్పర్శజ్ఞానం లేక జీవులంతా శిల వలె ఉంటున్నారు.
కొన్ని జగత్తులలో మనస్సుతోనే ఒకరితో మరొకరు ప్రవర్తిస్తున్నారు. వారు వ్యవహారయుక్తులు అయినప్పటికీ ఇంద్రియాలకు అగ్రాహ్యులై పిశాచాల వలె అనువర్తిస్తున్నారు. కొన్ని లోకాలు అంతటా పృథివీమయమే గాని కొంచెం జలబిందువు కూడా లేదు.
Page:22
మరికొన్ని జలమయమే గాని “భూమి” అనేదే లేదు. ఇంకొన్ని అగ్నిమయం. మరికొన్ని వాయుమయం. కొన్నేమో సర్వకార్య సమర్థములైన సర్వ వస్తువులతో కూడి ఉన్నాయి. ఆహా ! ఏం ఆశ్చర్యం ! చిదాకాశమున చిదాకాశ రూపములే అయినట్టి అనేక చిత్ర విచిత్ర జగత్తులు అక్కడ భాసిస్తున్నాయి.
రాయిలో కప్ప జీవిస్తున్నట్లు, భూమిలో కీటకములు జీవిస్తున్నట్లు కొన్ని లోకములలో జీవులు ఆలోచన-జ్ఞానం-విచక్షణ లేకుండా జీవిస్తున్నారు. అగ్నిమయజగత్తులలో అగ్నిరూపులగు జీవులు జీవిస్తున్నారు. వాయుపూరితములగు లోకములలో వాయురూపులగు జీవులు వాయు కెరటముల వలె స్ఫురిస్తూ మనుగడ సాగిస్తున్నారు. అట్లాగే ఆకాశమయములగు లోకములలో ఆకాశమాత్ర దేహధారులగు జీవులు పరస్పర దర్శనాది ఏవేవో చిత్ర - విచిత్ర ఊహా వ్యవహారాలతో జీవనము కొనసాగిస్తున్నారు.
ఈ విధంగా సర్వజ్ఞుడను, కేవల సాక్షినియగు నాకు అక్కడ అనేక బ్రహ్మాండాలు కనిపించాయి. అవి చిదాకాశమునందు కల్పన చేయబడి దిక్కులలో అటూ-ఇటూ పరిభ్రమణం చేస్తున్నాయి. పైకి ఎగురుచున్నాయి. క్రింద పడుచున్నాయి. చైతన్య మహాసాగరమున చంచల బుద్భుదముల వలె (కదిలే నీటి బుడగల వలె) అవి చిత్ర విచిత్ర విశేషముతో పరిభ్రమణం చేస్తున్నాయి.
✤✤✤
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జలంలో జలతరంగ ధారలు కనిపిస్తున్నాయి. జలం యొక్క దృష్టి లేనివారికి ఒక్కొక్క తరంగ ధార ఒక్కొక్క రీతిగా అనిపిస్తాయి. అట్లాగే చిత్స్వరూపమును గూర్చిన అజ్ఞానముచే చిదాకాశమున ప్రాణరూపోపాధితో కూడిన పరిచ్ఛిన్నములగు చైతన్య రూప జీవులు స్ఫురిస్తున్నారు. ఆ పరిచ్చిన్నచైతన్యరూపములే ఉత్తరోత్తరా అనేక సంకల్ప వికల్పములతో కూడినవై కనిపిస్తున్నాయి. అట్లు అనేకత్వపు భ్రాంతి ప్రవృద్ధమగుచూ అదియే మనస్సుగా రూపుదిద్దుకుంటోంది. వాస్తవానికి చిదాకాశ రూపాలే అయిన ఆ మనస్సులే తమయందు కల్పించుకొన్న జగద్వాసనలచే స్వయంగా అనంత జగదాకారములుగా పరిణతి పొందుచున్నాయి సుమా!
శ్రీరాముడు : స్వామీ ! ఈ బ్రహ్మాండములన్నీ సమష్టితత్త్వమైనట్టి హిరణ్యగర్భుని స్వప్నమువంటి సంకల్పముచే జనించినవే కదా !
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును.
శ్రీరాముడు : అట్టి మహాకల్పము క్షయం అయినప్పుడు ఆ హిరణ్యగర్భుడు, ఆతనిచే ఉత్పన్నమైన సమస్త ప్రాణి సమూహం కూడా ముక్తి పొందుచున్నది కదా! మరల సృష్టిని గురించిన “జ్ఞాపకం” ఎవరికి? మరల సృష్టి ప్రారంభం ఎవరిచేత ఎందుకు నిర్వర్తించబడుతోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మహాకల్పాంతమునందు పంచభూతములగు ఈ పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వాటి యొక్క అంతర్గతమైనట్టి సమస్తమైన ప్రాణికోట్లు ముక్తిని చెందుతాయి. అయితే, ఆ తదనంతరం ఈ జగత్తు ఎట్లా అనుభూతం అవటం జరుగుతుందో చెబుతాను... విను.
Page:23
సమస్తము నశించినప్పటికీ వాక్కునకు అవిషయము అయిన సత్తత్వము శేషించియే ఉంటుంది. అద్దానిని 'పరమార్థఘనము-చిన్మాత్రబ్రహ్మము - శుద్ధ పరతత్త్వము'.... అని శాస్త్రములు వర్ణిస్తున్నాయి. అద్దాని హృదయరూపమే ఈ జగత్తు కనుక ఈ జగత్తు కూడా అద్దానికి వేరుకానిదై ఉన్నది. ఆ పరమాత్మ భగవానుడే తనయొక్క హృదయరూపమును జగత్తుగా ఎఱుగుచున్నాడని గ్రహించు. మాయొక్క దృష్టిలో (జీవన్ముక్తుల అనుభవంలో) ఈ జగమంతా ఊహాలోకంలాగా మిథ్యారూపమే అయి ఉన్నది. ఇది మొదలే 'కల్పన' నుండి ప్రభవించియున్న దానిగా గమనిస్తున్నాం. ఇది గ్రహించి దీనిని మేము వినోదము కొరకే పొందుచున్నాం.
విస్తవానికి ఈ జగత్తుకు “ఇదీ రూపం” అంటూ ఏదీ లేదు. కాబట్టే విచారణ చేసినప్పుడు “ఇది స్వతహాగా లేనిది” అని (విజ్ఞానదృష్టికి) తెలిసిరావటం జరుగుతోంది. విచారణ చేస్తే “ఇక్కడ ఏదీ నశించటం లేదు. జనించటంలేదు” ... అని మేము గ్రహిస్తున్నాం. కనుక పరమ కారణమగు బ్రహ్మము ఎట్లా నాశనరహితమో .... ఈ జగత్తు అనబడేది కూడా అట్లాగే నాశనరహితం.
ఎందుకంటే, ఇది భావనచే ఉండటం, అభావనచే రహితమవటం జరుగుచున్నది. కాబట్టి! ఇక నీవు చెప్పిన కల్ప - మహాకల్పాది కాల చమత్కారాలు కూడా కల్ప- (లేక) భావన యొక్క అవయవముల భేదము కొరకు కల్పించబడ్డాయి. అయితే, నిత్యమగు బ్రహ్మమునకు అనిత్యముకల్పితము అగు 'మహాకల్పము' మొదలైనవి అవయవాలు అవటమేమిటి? కానేకాదు. అవి భావనా కల్పనలు మాత్రమే !
కాబట్టి, నశించిన కల్పములు - మహాకల్పములు మరల మరల రావటానికి - పోవటానికి శక్యములై ఉన్నాయి. దృష్టాంతానికి... ఒకనికి ఒక ఆలోచన వచ్చి, అంతర్గతమై మరల మరొక్కప్పుడు ఆ ఆలోచన బహిర్గతం కావటం అందరికీ అనుభవైకవేద్యమే కదా! ఇదీ అట్టిదే! బ్రహ్మము సర్వదా విద్యమానమై ఉండగా ఇక “కల్పములు” అనే జపమాల యొక్క పరివర్తనము “కాలచక్రం” రూపంగా సంభవించుచున్నది. కాని, విచారించి చూస్తే ఆలోచనలు చేసేవాడు సర్వ ఆలోచనలకు ఆవల యథాతథంగా ఉండి ఉంటున్నట్లే వాస్తవానికి కల్పాదులు ఆత్మ దృష్ట్యా లేనివే - అని కూడా గ్రహించు.
తస్మాత్ న కస్యచిత్ కించిత్ కదాచిత్ నశ్యతి క్వచిత్ ।
నచైవ జాయతే, బ్రహ్మశాస్త్రం దృశమ్ అజం స్థితమ్ ॥
కనుక, ఎచట ఎప్పుడూ దేనికి ఏదీ కనిపించటమూ లేదు, ఉత్పన్నమవటమూ లేదు. ఇక ఈ దృశ్యమంటావా? ఇదంతా వాస్తవానికి అజము, శాంతము అయినట్టి బ్రహ్మముగానే స్థితినొంది ఉన్నది. విస్తారమైన ఆకాశమునందు, ఒక పరమాణువు యొక్క వెయ్యవ వంతు విభాగమునందు కూడా ఏ ఒకే శుద్ధ చిన్మాత్ర సత్త కలదో ... అదియే ఆ పరబ్రహ్మము.
Page:24
సర్వదా, సర్వత్రా పరబ్రహ్మము విద్యమానమై ఉండగా ఇక ఈ జగత్తు మాత్రం నశించటమనే ప్రసక్తి ఎక్కడిది? నిద్రపోవువాని చైతన్య స్వరూపమే స్వప్నంలో స్వప్న జగద్రూపంగా భాసిస్తున్నట్లు, చిదాకాశము యొక్క అంశమే సృష్ట్యాది యందు సమస్త పదార్థరూపములుగా భాసిస్తోంది.
చిదాకాశం యొక్క అవయవమే ఈ సృష్టి. సృష్టి యొక్క అవయవాలే నాశన - ఉత్పత్తులు. ఈ విధంగా సర్వము చిదాకాశమే అయిఉండగా... ఇక నశించునదేమీ?నశించని దేమున్నది? పరమార్థచైతన్యము ఛేదించబడేదికాదు, దహించబడేదికాదు, తడుపబడేది కాదు, ఎండించబడేది కాదు. తత్ప్రృదయమైనట్టి ఈ జగత్తు, అట్టి జగత్తు యొక్క కారణం అయినట్టి అజ్ఞానము, అట్టి అజ్ఞానానుభవము అట్లే నశించటంలేదు, జనించటంలేదు.
శ్రీరాముడు : అదేమిటి మహర్షీ !"అజ్ఞానము కూడా జనించటం లేదు, నశించటం లేదు”... అని చెప్పుచున్నారు. జ్ఞాని - అజ్ఞాని వేరువేరుగా అవగాహన కలిగి ఉంటున్నారు కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, చైతన్యం కేవలం తన యొక్క స్మరణ - విస్మరణల సూత్రం చేత ఈ జగత్తుల అనుభవము - అనుభవరాహిత్యము కూడా అనుభవిస్తోంది.
రామచంద్రా! ఒకానొక వస్తువు ఏ ముడి పదార్థం యొక్క ఒకానొక రూపమై ఉన్నదో అట్టి ముడి పదార్థం నాశరహితమై ఉన్నప్పుడు... ఇక ఆ వస్తువు కూడా నాశరహితమైనదే కదా! కాబట్టి బ్రహ్మమే స్వరూపంగా గల ఆ దృశ్యం కూడా బ్రహ్మం వలెనే అక్షయం అయి ఉన్నదని గ్రహించు. మహాప్రళయాదులు ఆ బ్రహ్మం యొక్క అవయవాలే అయి ఉన్నాయి. చిన్మాత్రం అగు పరమ చిదాకాశానికి నాశనం గాని, ఉత్పత్తిగాని ఎక్కడున్నాయి? నిరాకారమగు చిదాకాశమునకు పదార్థ సంబంధమైన ఉత్పత్తి - వినాశనాది వికారాలు ఎట్లా ఉంటాయి?
ఓ రామచంద్రా! ఈ జగత్తు చిన్మాత్ర స్వరూపమేనని మరల మరల గుర్తు చేస్తూ ఆయా దృష్టాంతాలు ఆత్మశాస్త్రజ్ఞులచే చెప్పబడుచున్నాయి.
1.) స్ఫటిక శిల - ప్రతిబింబం దృష్టాంతం - ఒకచోట ఒక స్ఫటిక శిల ఉన్నది. అందులో చిత్ర విచిత్రమైన రంగులతో ఆయా వస్తువులు ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు చెప్పు! ఆ స్ఫటిక శిలలో రకరకాలుగా ప్రతిబింబిస్తూ కనిపించేవన్నీ స్పటికశిలారూపమేగాని మరొకటేదీ లేదు కదా! ఆ ప్రతిబింబంలో కనిపించే ఒక రూపమూ మరొక రూపమూ కూడా స్పటిక శిలయే కదా!
ఈ వివిధ జగత్తులు, మహాకల్పం మొదలైనవి కూడా చైతన్య బ్రహ్మం నందు తత్ బ్రహ్మ రూపంగానే ఇమిడి ఉన్నాయి. (లేక) నెలకొని ఉన్నాయి.
2.) మనోరాజ్య దృష్టాంతం - ఒకాయన తన మనస్సుతో ఒక రాజ్యం ఊహించి ఆ రాజ్యంలో అంతఃపురం, యువరాణి మొదలైనవన్నీ దర్శిస్తున్నాడనుకో...! అవన్నీ కూడా అనగా రాజు, రాణి, మంత్రి, శత్రురాజు... అన్నీ కూడా - అతని ఊహ (మనస్సు) యొక్క రూపాలే కదా.
ఆ ఊహ (మనస్సు), ఆ అనుభవ రూపాలన్నీ (తదనంతరం) మనోరూపంలో కలిసిపోతాయి. అట్లాగే చైతన్యం యొక్క సంకల్పమాత్రంచే ఉత్పన్నమగుచున్న ఈ జగదృశ్యాలన్నీ కూడా నిరాకారం, నిర్మలం అగు చిన్మాత్ర రూపాన్నే పొందనున్నాయి, పొందుచున్నాయి.
Page:25
3.) వృక్షము-వృక్షావయవముల దృష్టాంతం - "అవయవి” యగు వృక్షమునకు వ్రేళ్ళు-కాండము-కొమ్మలు-ఫలములు-ఆకులు-పుష్పములు-చిగుర్లు మొదలైనవన్నీ అవయవములు కదా? అట్లాగే పరమార్థ ఘనము ఆకాశము కంటే కూడా అతి నిర్మలము-సూక్ష్మము-వాక్కుకు అవిషయము అయి ఉన్నది. బ్రహ్మము "అవయవి”. ఇక ఈ ప్రళయ-మహా ప్రళయ-నాశఉత్పత్తి-భావ-అభావ-సుఖ-దుఃఖ-జన్మ-మరణ -సాకార-నిరాకారాదులన్నీ ఆ అనిర్వచనీయ బ్రహ్మముయొక్క ‘అవయవములు’.“అవయవి” ఏ రీతిగా వాక్కుకు అవిషయమై నాశరహితమై ఉన్నదో... అట్లాగే అద్దాన్ని అవయవములగు ఈ సృష్టి మొదలైనవి కూడా పరమార్థ దృష్టియందు నాశన రహితములేనని గ్రహించు. వాస్తవానికి “అవయవి” - “అవయవములు” అభేదములే కదా! అట్లా ఏక స్వరూపములగు దృశ్య - అదృశ్యములకు భేదమేమి ఉండజాలదు.
వృక్షము యొక్క ఉనికికి వృక్ష చైతన్యమే మూలం కదా! అట్లాగే ఈ జగత్తుకు పరమార్థ ఘనమగు చైతన్యమే మూలమైయున్నది.
బ్రహ్మము అనే వృక్షానికి... “సృష్టి” అనేది - కాండము; లోకాలు, లోకాంతరాలు - శాఖలు; జంబూ ద్వీపాదులు - ఉపశాఖలు; పర్వత, నదీ, గ్రామాదులు - పల్లవములు; చంద్ర సూర్యాదులు - దానికి పూచే పుష్పగుచ్ఛాలు; అంధకారం - ఆకుల పచ్చదనం; ఆకాశమే - దాని కణుపులు; ఇందలి జడత్వం - ఆ వృక్ష చర్మము... ఈ విధంగా ఈ జగత్తు నిరాకారమై స్వయంగా చిదాకాశరూపమై చిదాకాశమునందే వెల్లివిరిసియున్నది.
4.) నిశ్చలకాలం - చంచలకాలాంతర్గత విశేషాలు - ఆత్మయే వివిధ కల్పనా రూపాలతో ఒకచోట భూతకాలంగానూ, మరొకచోట వర్తమాన కాలంగానూ, ఇంకొకచోట భవిషత్కాలం గానూ, వేరే ఒక చోట ప్రళయ-మహాప్రళయాలుగానూ స్థితిని పొందుతూ తాను సర్వదా నిశ్చలంగానే ఉన్నది. చంద్రునిలో కళంకత్వము భ్రమచే కనబడుతుంది చూచావా? అట్లాగే నిర్మల పరబ్రహ్మాకాశమున కనబడే సృష్టి-ప్రళయాది దోషాలు వాస్తవానికి భ్రమయే గాని సత్యము కాదు. నిర్మలమగు చిదాకాశమున భావ-అభావముల గురించిన రంజనము మాత్రం ఎక్కడ? అందులో "ఇది ఆది, ఇది మధ్యం, ఇది అంతం" అనబడే కల్పన ఎక్కడ? లోక లోకాంతరాల గురించిన విభ్రమములు ఎచ్చటున్నాయి. ఇవన్నీ లేనే లేవు.
❖
శ్రీరాముడు : మరి సంసార జీవులకు అవన్నీ ఎందుకు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : సమస్త భ్రమలకు అసలైన కారణం ఆత్మజ్ఞానం లేకపోవుట చేతనే!
శ్రీరాముడు : మరి ఆ భ్రమ తొలగేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ప్రియ సభికులారా! మీ మీ దృష్టిని సాక్షి చైతన్యమగు ఆత్మ వైపుగా ప్రసరింపజేసుకున్నంత మాత్రం చేత ఈ జగద్భ్రమంతా శమించిపోగలదు. వాయువు చేత ఉత్పన్నమై వాయువు సహాయం చేతనే వెలుగుచున్న దీపం తిరిగి వాయువు చేతనే నశించుచున్నది చూచారా?
Page:26
అట్లాగే, ఆత్మ స్వరూపము చేతనే తన యొక్క 'సత్త'ను సంపాదించుకున్న 'అజ్ఞానము' అనేది తిరిగి తత్త్వవిచారణచే జనించే ఆత్మజ్ఞానము చేతనే నశించుచున్నది. జ్ఞాన ప్రకాశముచే అజ్ఞానము తొలగగా “అజ్ఞానం అనేదేదీ ఎక్కడా లేదు" అనే నూతన బోధ కలుగగలదు. దీపం వెలిగిన తర్వాత చీకటి ఏమౌతోంది? బయటకెక్కడకన్నా పోతోందా? లేదు. వెలుతురు లేకపోవటమే చీకటిగాని, చీకటికి వేరుగా ఏ ఉనికీ లేదు. “సర్వమూ బంధ-మోక్ష రహితమగు బ్రహ్మమే" అనే నూతన జ్ఞానం అప్పుడు ఉదయిస్తుంది. అజ్ఞానం ఎటుపోతుందో (చీకటిలాగానే) ఏమీ చెప్పలేం!
ఓ రామచంద్రా! ఈ ప్రకారంగా ఆత్మజ్ఞానాది ఆయా ఉపాయాలను 'మోక్షము’ కొఱకై మనం చెప్పుకున్నాం. ‘ఆత్మ విచారణ’ యందు నిరంతరము యత్నీకృతుడైన వాడు ఆత్మజ్ఞానాన్ని తప్పక సముపార్జించగలడు.
‘అనాది' అనతగినట్లు ఈ 'జగత్తు' అనే జాలం ఎన్నడూ ఉత్పన్నం కానిదే అగుచున్నది. బ్రహ్మమే ఈ జగత్తు-జీవుడు మొదలైన రూపాలుగా ప్రకాశిస్తోంది. అట్లా ప్రకాశిస్తూ తనకు తానే 'మాయ'ను తెరగా ధరించి అజ్ఞానావరణ ప్రభావం చేత “నాకు భోగాలు కావాలి. నాకు మోక్షం కావాలి” అని తన ముంగిట తానే ప్రార్థనలు సల్పుచున్నది. ఇదియే మాయ యొక్క ప్రభావం. అణిమ-గరిమ మొదలుగా గల ఈశ్వరత్వము కూడా మాయామాత్రమేనని ఎఱిగి అద్దానిని కూడా తృణముతో (గడ్డిపరకతో) సమానంగా చూచుటయే ఉచితం. కనుక నిరతిశయానందయుతుడైన స్వాత్మయందే సుస్థిరుడవై ఉండెదవు గాక!
❖❖❖
శ్రీరాముడు : మహర్షీ! మీ వచన ప్రవాహం అమోఘం! స్వామీ! మీరు అప్పుడు చిదాకాశ శరీరులై అనేక జగత్సమూహములను వీక్షిస్తూ ఉన్నట్లు చెప్పుతూ వస్తున్నారు కదా! మరల ఆ కథనమును కొనసాగించవలసినదిగా నా ప్రార్థన. ఇక్కడ నాదొక చిన్న సందేహం
మీరు ఆ జగత్ సమూహములను ఒక పక్షి ఆకాశంలో సంచరించుచున్నట్లుగా అటు ఇటూ వెళ్ళుచూ చూచారా? లేక, ఒడ్డున ఉన్నవాడు సముద్రపు అలలను చూస్తున్నట్లుగా ఒకే ప్రదేశమున స్థిరంగా ఉండియే ఆ జగత్సమూహములను గాంచటం జరిగిందా?
శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వు చిందిస్తూ) ఓ రాఘవా! ఎప్పుడైతే నేను అనంతం, సర్వవ్యాపకం అయినట్టి చిదాకాశమే అయ్యానో, ఇకప్పుడు ఒక చోటనే ఉండటమో, లేక ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణించటమో (గమన - ఆగమనములు నిర్వర్తించటం) అనేది ఎక్కడుంటుంది? కాబట్టి నేనప్పుడు గమనశీలుడనై ఉండలేదు.
అట్లాగే ఏదో ఒక ప్రదేశమున కూడా స్థితిని పొంది ఉండలేదు. “ఈ చోటు - ఆ చోటు” అనునవన్నీ భౌతికాకాశం యొక్క ధర్మాలు గాని... చిదాకాశ ధర్మాలు కావు కదా!
Page:27
శ్రీరాముడు : ... మరి?
శ్రీ వసిష్ఠ మహర్షి : అపరిచ్ఛిన్నము-నిత్య అపరోక్షము అగు నా ఆత్మయందే ఆయా జగత్సమూహం లన్నిటినీ నేను వీక్షించాను. దేహాత్మ బుద్ధితో ఈ శరీరమును పాదముల నుండి మస్తకము (నుదురు) వరకు ఈ చర్మ నేత్రములతో చూస్తాం కదా! అట్లాగే, ఈ చర్మనేత్రములతో కాకుండా చిద్రూప నేత్రాలతో అప్పుడు ఆ జగత్తులను నాయందే (స్వాత్మయందే) చూడటం జరిగింది. ఆ సమయంలో సమాధిస్థితిని అవధరించిన నేను నిరాకారంగాను, నిరవయవంగాను, నిర్మలచిదాకాశ రూపంగాను స్థితి పొంది ఉన్నాను. అందుచేత ఆ నాచే చూడబడిన జగత్తులన్నీ నా యొక్క అవయవ విభాగాలు గానే నాకు అనిపించసాగాయి. వాస్తవానికి ఆ జగత్తుల యొక్క వస్తుత్వం జనించటమూ లేదు, నశించటమూ లేదు. వాటన్నిటి (స్వస్వరూపం) యొక్క సత్తా నా యొక్క సత్తా చేతనే ఏర్పడినాయి సుమా! అనగా నా సత్తయే వాటి ఉనికికి ఆధారం. ఆ విధంగా అవి నా అవయవాల వలెనే నాకు అనిపించాయి. వాటికి స్వతఃసత్తా లేదు. కాబట్టి అవి వస్తుతత్వరహితములని కూడా గ్రహించు.
శ్రీరాముడు : మహాత్మా! అనగా మీకు దర్శనమైన ఆ జగత్సమూహములన్నీ మీ యొక్క స్వరూప విభాగమేనని మీ ఉద్దేశమా? చాలా ఆశ్చర్యంగా ఉన్నదే!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అవన్నీ నా స్వసత్తాపై ఆధారపడి దర్శించబడుచున్నాయి. కాబట్,టి అవన్నీ నా స్వరూపానికి అభేదములే! అయితే, ఇందులో ఆశ్చర్యపడవలసినదేమున్నది? అందుకు మనకు దృష్టాంతం ప్రతిజీవునికి ప్రతిరోజు అనుభవమయ్యే స్వప్నమే. స్వప్నంలో కనిపించేది స్వప్నద్రష్ట యొక్క ఊహాజనిత కల్పనయే కదా! ఏది ఎవరి కల్పనయో అది వారి స్వరూపమే కాక మరింకేమిటి? స్వప్నంలో ఒకచోట నుండి మరొకచోటికి స్వప్న ద్రష్ట పరుగులు తీస్తున్నాడా? లేదు. ఎందుకంటే స్వప్నం యొక్క ఆద్యంతాలు స్వప్నం యొక్క మనో విభాగమే! మనస్సు అతని స్వరూపంలోనుంచే కదా, బయల్వెడలింది? స్వప్నదృశ్యమంతా చిదాకాశం కంటే వేఱుకానట్లే... నేనప్పుడు గాని, లేక ఎప్పుడైనా సరే - చూచే జగత్తులు- చిదాకాశ స్వరూపమే అయి ఉన్నాయి.
దేహాభిమానియగు జీవుడు ఏ విధంగా ఈ కాళ్ళు-చేతులు తన దేహ విభాగంగానే అనుభవం పొందుచున్నాడో, అంతగానూ నేను ఆ జగత్తులనన్నిటినీ అవయవాలుగా గాంచాను. 'వృక్షాభిమాని' అయిన జీవుడు ఆకులు-పూలు-కొమ్మలు మొదలైనవన్నీ తన అంగాలుగా గాంచుతాడు. అనంతమగు సముద్రాభిమాని యగు జీవుడు సమస్త జలచరజీవులను, తరంగాలను ఫేనము (నుఱుగును), ఆవర్తాదులను తన స్వరూపంగా ఎఱుగుతాడు. సర్వాంతర్యామిత్వం సముపార్జించిన జ్ఞాని తదితర జీవులందరినీ తన శరీరములోని విభాగంగా దర్శిస్తాడు. అట్లాగే అక్కడ నాకు తారసపడిన బ్రహ్మాండములన్నీ నాయందే ఉన్నట్లు నాకు అనుభూతి అగుచున్నది. అవయవి ఏ విధంగా తన అవయవములను తనకు అభిన్నంగా అనుభవం పొందుచున్నాడో... అట్లాగే నేను కూడా ఆ బ్రహ్మాండాలన్నీ (ఆయా సృష్టులన్నీ) నాకు అభిన్నంగా ఉన్నట్లు నాకు అనుభూతమగుచున్నది.
Page:28
అంతే కాదు, ఇప్పుడు కూడా సుమా! బోధరూపమగు ఆత్మతోటి ఏకత్వము పొందిన నేను ఇప్పుడు కూడా ఈ అనేక సృష్టులతోను, ఈ దేహ ఆకాశ- పర్వత స్థలములతోను అభేదత్వ స్థితినే గాంచుచున్నాను. మనకందరికీ ఈ విశ్వం ఎదురుగా ఎట్లా కనిపిస్తుందో... అట్లాగే, ఈ సభా ప్రాంగణం యొక్క బాహ్య-అభ్యంతరాలు కూడా అనేక జగత్తులలో పూర్ణమై ఉన్నట్లు నేను ఎఱుగుచున్నాను.
ఓ రామచంద్రా! జలము తనయందలి రసమును, మంచు తనయందలి శీతలత్వమును, వాయువు తనయందు చలనత్వమును గాంచుచున్నట్లు, శుద్ధబుద్ధి అయినట్టి జ్ఞాని కూడా ఈ జగత్తును తనయందు ఉన్నదానిగా ఎఱుగుచూ ఉంటాడు.
నేనే కాదు, బోధస్వరూపముతోటి ఏకత్వము పొందినట్టి వివేకులందరూ కూడా నాలాగానే ఏకాత్ములై ఉంటున్నారు. నేను నా యందలి ఆత్మనే వారి ఆత్మగాను, వారు వారి యందలి ఆత్మను నా ఆత్మగాను ఎఱుగుచూ ఉంటాం. ఇదియే ‘సర్వాత్మ స్వరూప దృష్టి" ... అని చెప్పబడుతోంది. ఎప్పుడైతే అట్టి సర్వాత్మస్వరూప దృష్టి పరిపక్వ మౌతుందో ...అప్పుడిక “తెలియబడేది - తెలుసుకొనేవాడు - తెలియబడటం” అనే త్రిపుటి జయించబడి అధిగమించబడుతోంది. ఎందుకంటే విజ్ఞాన స్వరూపమగు ఆత్మతో సమస్తం యొక్క ఏకత్వం స్వభావసిద్ధంగా, అనుస్యూతంగా (ఒక్కటిగా కూర్పబడ్డ దాని వలె) సంభవిస్తుంది.
యోగాదులచే సిద్ధులు సంపాదించుకున్న యోగసిద్ధ పురుషుడు ఒక పర్వతముపై నిలబడి తన యొక్క యోగదృష్టితో కోట్లాది యోజనముల దూరం, అంతదూరములో ఉన్న బాహ్య - అభ్యంతర పదార్థములను దర్శించగలుగుతాడు చూచావా? నేను కూడా సమస్త లోకములను అట్లే గాంచాను. భూమండలాభిమాని యగు దేవత భూమి యందలి సమస్త పదార్థములను, సమస్త ధాతు-రసాదులను తనయందే ఉన్నట్లు ఎఱుగుచున్నట్లుగా - అక్కడి దృశ్యమంతా నాకంటే వేఱుగా లేనట్లు నేను అనుభవం పొందాను.
✤
శ్రీరాముడు : మహాత్మా! తమవంటి చిదానంద స్వరూపజ్ఞాన సమన్వితులకు అట్టి దర్శనం యుక్తియుక్తమని, స్వభావ సిద్ధమని గ్రహించాను. స్వామీ! అప్పుడు చిదాకాశమున అనేక జగత్తుల మధ్యగాను, ఆవలగానూ పయనిస్తూ, దర్శిస్తున్న మీ సమీపంలో ఒక వనిత 'ఆర్య' ఛందస్సు గానం చేస్తూ కనబడిందని చెప్పారు కదా! ఆమె ఆ తర్వాత ఏమి చేసిందో చెప్పవలసినదిగా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ విధంగా 'ఆర్య' ఛందస్సును అత్యంత మధురంగా గానం చేస్తున్న ఆ చిదాకాశస్వరూపిణియై 'దేవి' వలె ప్రకాశిస్తూ నా వెంటనంటి నా సమీపంలోనే ఉండటం అప్పుడు నేను గమనించాను. నేనట్లా చిదాకాశరూపం దాల్చానో అట్లే ఆమెకూడా చిదాకాశరూపమే కలిగి ఉన్నది. అంతేగాని ఆ సమాధికి ముందటి శరీరముచే ఆమెను గాంచలేదు. ఆ సమాధికాలంలో నేను, ఆమె, ఆ జగత్సమూహాలు చిదాకాశమాత్రంగానే ఉండి ఉన్నాము.
శ్రీరాముడు : మునీంద్రా! మీరు ఆమె యొక్క గానమును వింటున్నారని చెప్పుచున్నారు? 'గానం' అనేది ఉత్పన్నం కావాలంటే నాలుక కంఠము మొదలైన కరణములు, ప్రాణవాయువు యొక్క చేష్ట ఉండాలి కదా! కానీ ఆమె ఏమో నిరాకారమైన చిదాకాశరూపధారిణి అంటున్నారు. అట్టి స్త్రీ నుండి శబ్దము ఎట్లా ఉద్భవమైనది?
Page:29
బాహ్యమైన రూపాదుల యొక్కయు, మరియు అభ్యంతర మానసిక వ్యాపారముల యొక్క కలయికచే 'పాట పాడటం' మొదలైనవి సంభవిస్తాయి. మరి చిదాకాశ రూపమైన ఆత్మయందు అవి ఎట్లా సంభవిస్తాయి? చిదాకాశమున జగద్దర్శనము- పర్యావలోకనం మొదలైనవి తామెట్లా నిర్వర్తించారో, ఆమె గానం మీకెట్లా వినబడిందో, ఆ తత్త్వమును నిశ్చయముగా వచించమని వేడుకొంటున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఈ విషయం నీకు కొన్నిసార్లు సూచించాను. మరల చెప్పుచున్నాను విను.
ఒకడు కలకంటున్నాడనుకో, అతనికి ఆయా స్వప్న విశేషాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అయితే అతని భౌతికమైన కళ్ళు, చెవులు, జడత్వం పొంది ఉపయోగించబడకుండానే ఉన్నాయి. కదా! మరి స్వప్నంలోని ఆకారాలు ఏ కళ్ళకు కనిపించాయి? శబ్దాలు ఏ చెవులకు వినిపించాయి? అదేరీతిగా చిదాకాశమున కూడా సమస్తమూ సంభవమే! స్వప్నంతో స్వప్నసంవిత్ - చిదాకాశమే బాహ్య అభ్యంతర పదార్థములుగా ఉదయిస్తోంది కదా! అదేరీతిగా, ఆ సమాధి యందు దృశ్యమంతా కూడా చిదాకాశరూపముగానే ఉండి ఉన్నది.
కేవలం ఆ సమాధి సమయంలో నాకు కనిపించే జగత్తులు, స్త్రీ మొదలైన దృశ్యమే కాదు. మన ఇక్కడి బుద్ధికి గోచరమయ్యే ఈ సమస్త జగత్తు కూడా నిర్మలమగు చిదాకాశరూపమే అయి ఉన్నది. ఇందులో ఎవరికీ ఏమాత్రం సందేహం ఉండవలసిన పనిలేదు.
ఈ జగత్తు నిశ్చయంగా చిన్మయమై, విషయరహితమై, చిత్స్వభావము యొక్క స్వరూపమైయున్నది. స్వయముగా చిదాకాశమే ఇట్లు భాసించుచున్నది. అందుకు ప్రమాణమేమిటంటావా? స్వప్న శరీరము యొక్క కళ్ళు-కాళ్ళుచేతులు మొదలైన కరణముల సత్తకు నీకేమి ప్రమాణమున్నది? స్వప్నము యందు దేహాదుల సత్తా ఎట్లా కలతో, అట్లే మన ఈ జగత్తు యొక్క 'సత్తా' కూడా అట్టిదే. స్వప్న జగత్తు ఎట్టిదో ఈ జాగ్రత్ జగత్తు కూడా అట్టిదే. జాగ్రత్ సత్తా ఎట్టిదో స్వప్న సత్తా కూడా అట్టిదే! అజ్ఞాన కారణంచేత అసత్తు అగు నామరూపాదులు సత్తాను పొందినట్లు అనిపిస్తున్నాయి. అంతే చమత్కారంగా నిర్విషయాత్మతత్త్వమగు సత్తు (ఆత్మతత్త్వము/ చిదాకాశము) అసత్తుగాను అప్రసిద్ధమైనదిగాను అజ్ఞానం చేత అనిపిస్తోంది.
స్వప్నంలో భూమిపై నిర్వర్తించే కృషి, మార్గాలలో చేసే ప్రయాణం, పర్వత గుహాదులలో నిదురించటం మొదలైన సర్వ స్వప్న వ్యవహారములు చిదాకాశరూపమే అయినట్లుగా ఈ జగత్తులో కూడా నీవు - నేను - ఆ స్త్రీ - ఈ జగత్తు తదితర సమస్తం కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నాము. స్వప్నంలో కనిపించిన యుద్ధ కోలాహలాలు రాకపోకలు మొదలైనవన్నీ వాస్తవానికి లేకపోయినప్పటికీ మనుజులకు స్వప్న సమయంలో వాస్తవమైనట్లు అనుభవమగుచున్నది కదా! అట్లాగే, ఈ జగత్సమూహములలో ఈ ఈ ఇంద్రియ విషయాలన్నీ కూడా అనుభవమౌతున్నాయి. 'స్వప్న మందలి ఆ దృశ్య వైచిత్రం దేనివలన కలిగింది?' అని ఎవరైనా అడిగితే దానికి సమాధానమేమున్నది? ఈ జీవునకు జగత్తు అనేది ఎందుకు ప్రాప్తిస్తోంది?" అనే ప్రశ్న అంతగానూ అసమంజసమే అవుతుంది. ఎందుకంటే, ఈ జగత్తు విషయంలో కూడా స్వప్నానుభవస్థితి తప్ప ఇక్కడ అన్యమైన కారణం ఏదీ అవాచ్యమై ఉన్నది (చెప్పుటకు కుదరనిదై ఉన్నది).
Page:30
“కథమాలక్ష్యతే స్వప్నః?” ఇతి ప్రష్ఠుః ప్రకథ్యతే ।
యథైవం పశ్యసీత్యేవ! హేతుః అత్ర అస్తి నేతరః ॥
“నాకు స్వప్నంలో అది అట్లా ఎందుకు కనిపిస్తోంది?" అని ఒకాయన ప్రశ్నించాడనుకో. దానికి మనం సమాధానం ఏం చెబుతాం? “బాబూ! నీవు ఎట్లా దానిని గాంచుచున్నావో అద్దానిని అట్లే పొందుచున్నావు” ... అని మాత్రమే సమాధానం చెప్పగలం. అట్లాగే ఈ ప్రపంచం యొక్క విషయం కూడా. "ఈ ప్రపంచం నాకు ఇట్లా (నిర్మలమైన ఆత్మగా కాకుండా నామ రూపాత్మకమైన ఆయా విశేషాలతో కూడి) ఎందుకు కనిపిస్తోంది?" అని ఎవరైనా ప్రశ్నిస్తే, "అయ్యా! ఇద్దానిని నీవు నామ రూపాత్మకంగా చూస్తున్నావు కాబట్టి నామరూపాత్మకంగా కనిపిస్తోంది” అని అనక తప్పదు.
దీనిని ఆత్మతత్త్వంగా చూస్తే (ఆత్మయే ఈ ఈ రూపములుగా అగుచున్నది కదా!... అను దృష్టితో చూస్తే) ఇదంతా నిర్మలమగు ఆత్మగానే కనిపిస్తుంది. ఇంతకుమించి ఈ జగత్తుకు వేతే హేతువు ఏదీ లేదు. ప్రథమ సృష్టి మొదలుకొని విరాడాత్మరూపం వరకు, వ్యష్టి మొదలుకొని సమష్టి వరకు చిదాకాశమే చిదాకాశంలో తన యొక్క పరస్పర సాపేక్ష చమత్కారం చేత భాసించుచున్నది.
శ్రీరాముడు : స్వామీ! అయితే ఈ జగత్తంతా ఒక స్వప్నం వంటిది మాత్రమేనంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి :
స్వప్న శబ్దేన బోధార్థం తవ వ్యవహరామ్యహమ్ ।
దృశ్యం తు ఇదం న సత్, న అసత్, న స్వప్నో, బ్రహ్మ కేవలమ్ ॥
ఓ రామచంద్రా! నీకు బోధించటం కొరకు మాత్రమే స్వప్న శబ్దాన్ని (స్వప్న దృష్టాంతాన్ని) ఇక్కడ వాడాను. వాస్తవానికి ఈ దృశ్యం సత్తు కాదు. అసత్తు కూడా కాదు. స్వప్నము కాదు. మరి? ఇదంతా కేవలము బ్రహ్మమే అయి ఉన్నది. భ్రమచే వివిధ రూపములతో కూడిన జగత్తుగా అనిపిస్తోంది. భ్రమతొలగినప్పటి దృష్టికి ఇక్కడ బ్రహ్మము తప్పించి మరేమీ అగుపడుటయే లేదు. జగత్తు అనబడేది (నిర్మలబ్మాహీ దృష్టిచే) ఎక్కడున్నది?
✤
సరే! ఇక ఆ స్త్రీ విషయానికి వద్దాం. ఆ స్త్రీ గానం చేస్తూనే - నేను ఎటు వెళ్ళితే అటే వస్తోంది. “అనురాగవతి, దృశ్య రూపిణియగు ఈ స్త్రీ నన్ను వెంబడించటంలో ఈమె అభిప్రాయం ఏమిటో తెలుసుకొనెదను గాక!” అనే సంకల్ప సంవిత్తును నేను ఆశ్రయించాను. స్వప్నంలో స్వప్నజనులతోటి వ్యవహారం సిద్ధించునట్లుగా ఆమెతో కూడా నాకు 'ప్రశ్న-సమాధానం' మొదలైన వ్యవహారము సిద్ధించింది.
శ్రీరాముడు : “ప్రశ్న-సమాధానం” అను రూపంలో అప్పుడు సిద్ధించుచున్నది స్వప్న సదృశమేనా? జాగ్రత్ సదృశమా?
శ్రీ వసిష్ఠ మహర్షి : మరల చెప్పుచున్నాను. స్వప్నంలోని వ్యవహారమంతా చిదాకాశ రూపమే అయినట్లు ఆ నేను, నా వ్యవహారము, ఆ జగత్తు, ఈ మనకు కనిపించే జగత్తు చిదాకాశ రూపముగానే గ్రహించు.
Page:31
కాబట్టి, స్వప్నము-జాగ్రత్తు సమానమే! జాగ్రత్తు యొక్క ఏమఱుపు నుండి భావించే దానిని స్వప్నమని పిలుస్తున్నాం. అట్లాగే, ఆత్మత్వము యొక్క ఏమఱపు నుండి భాసించేదానిని 'జగత్తు' అని పిలుస్తున్నాం. ఇంతకు మించి స్వప్న - జాగ్రత్తులకు వేఱే భేదమేమీ లేదు. ఎందుకంటావా? ఈ జగత్తు ఆత్మకు స్వప్నమే అవుతుంది. అయితే, ఈ జగత్తు దీనియొక్క అధిష్ఠాన రూపముచే కేవలం చిదాకాశము మాత్రమే! ఈ జగత్తు దృశ్యరూపంగా (నామ రూపాత్మక దృష్టిచే) అసత్తే అయి ఉన్నది. వాస్తవానికి నిర్మలము, జ్ఞప్తి మాత్రము, సన్మాత్రము అయినట్టి బ్రహ్మమే ఈ జగద్రూపంగా స్థితినొందియున్నది.
ఓ సర్వ ప్రియ సభికులారా!
స్వప్నస్య విద్యతే ద్రష్టా, సాకారో యుష్మదాదికః ।
ద్రష్టా తు సర్గ స్వప్నస్య చిద్వ్యోమైవామలం స్వతః ॥
సాకారుడు ఈ జీవుడు స్వప్నము యొక్క ద్రష్టగా అగుచున్నారు. స్వప్నదృష్టానుభవం ప్రతి ఒక్కరికీ దైనందినమే కదా! అట్లాగే 'సృష్టి' అనే స్వప్నమునకు ద్రష్ట స్వయంగా నిర్మలమగు చిదాకాశమే అగుచున్నది సుమా! స్వప్నమునందలి ద్రష్ట - దర్శనము - దృశ్యములు కూడా నిర్మల చిదాకాశమే అయి ఉన్నది. ఈ జగద్రూప స్వప్నం నిరాకారమగు చిదాకాశమునందే స్వయంగా స్ఫురిస్తోంది.
చిదాకాశము నిరాకారమై ఉండగా ఈ జగత్తుకు మాత్రం సాకారత్వం ఎక్కడున్నది? కనుక, ఈ జగత్తు కూడా వాస్తవానికి నిరాకారమే! ఇందలి సాకారత్వం? 'భ్రమ' ఉన్నంత వరకే అట్లు అగుపిస్తుందని గ్రహించబడు గాక!
ఇంకొక విషయం. సాకారులగు జీవుల, నిర్మలమగు ఈ జగత్తు - ఈ రెండూ కూడా చిదాకాశం కాక ఏమౌతుంది? ఈ స్వప్న సదృశ జగత్తు వాస్తవంగా రచించబడకపోయినప్పటికీ గోడ లేని రంగుల చిత్రలేఖనం లాగా చిదాత్మ ఈ జగత్తును రచించబడినదానివలె గాంచుచున్నది.
'చిదాకాశము' అనే కోమలమైన మట్టితో 'హిరణ్యగర్భుడు' అను కళాకారుడు 'ఇంద్రియములు' మొదలైన వాటితో కూడిన ఈ సృష్టి మండపాన్ని నిర్మించినప్పటికీ, వాస్తవానికి ఈ జగత్తు నిర్మించబడనిదేనని గ్రహించు.
✤
ఓ రామచంద్రా! వాస్తవానికి ఇక్కడ కర్తృత్వము లేదు. భోక్తృత్వము లేదు. జగత్తులు లేవు. తదితర ద్వైతభావములూ లేవు. ఈ సర్వమునకు కేవల సాక్షియైనట్టి చిద్రూప బ్రహ్మమొక్కటే ఉన్నది. కాబట్టి, నీవు అభ్యంతరమున 'శిల' వంటి మౌనాన్ని అవలంబించు. ఇక బాహ్యమునందో... యథాప్రాప్తములైనట్టి ప్రవాహపతిత కర్మలను ప్రశాంత స్వభావుడవై ఆచరించు.
ఈ దేహము ప్రారబ్ధ పర్యంతము ఉంటే ఉండనీ, ఆ తర్వాత ఉండకపోతే పోనీ, ఇందులో ఇంకే విశేషమూ లేదు.
✤✤✤
Page:32
శ్రీరాముడు : ఓ మహర్షీ! "ఆ స్త్రీ యొక్క నిరాకారమగు దేహముచే తమకు సాకార సంబంధమైన వ్యవహారం ఎట్లా సిద్ధించింది?” అనే విషయంలో ఇంకా కొంత శంక నా యందు మిగిలియే ఉన్నది. అట్టి స్థితిలో జిహ్వ (నాలుక) లేదు కదా! జిహ్వ లేకుండా “క-చ-ట-త-ప” మొదలైన వర్ణనలు మీరు ఎట్లా ఉచ్చరించగలిగారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! ఆ విషయం గురించి మరల ప్రస్తావిస్తున్నావా? నీ శంక తొలగటానికి మరికొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. విను.
చిదాకాశమే శరీరముగా గలిగియున్నట్టి జ్ఞానుల యొక్క అనుభూతి (లేక) అనుభవమునకు ఈ ‘క-చ-ట-త-ప’ మొదలైన ఉచ్చారణ యొక్క ఆవశ్యకతయే లేదు. ఎందుకంటావా? ఆయా ఉచ్చారణా శబ్దములన్నీ వాస్తవానికి కల్పితములే కదా! శబ్దములన్నీ అర్థ కల్పిత మాత్రములే కదా! భావమును పరస్పరం ఉచ్చరించటానికి శరీరము అత్యావశ్యకమేమీ కాదు. మనం చెప్పుకున్నట్లు స్వప్నంలో శరీరము యొక్క ఆవశ్యకత లేకుండా 'మాట్లాడుకోవటం’ మొదలైనవి జరుగుతున్నాయి కదా! ఒకవేళ శరీరమే మాట్లాడుతుందని అంటావా? శవం నోరు-కళ్ళు-చెవులు మొదలైనవన్నీ కలిగి ఉండి కూడా మాట్లాడటం-చూడటం-వినటం మొదలైనవి నిర్వర్తించలేదు కదా!
శ్రీరాముడు : మహర్షీ! స్వప్నంలో అనుభవమయ్యే ఉచ్చారణ, సంభాషణ మొదలైనవి ఆ స్వప్న సమయంలో సత్యమువలెనే ఆ స్వప్న ద్రష్టకు అనిపించటం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ స్వప్నంలో జరిగే సంభాషణ సత్యమా? అసత్యమా?
శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వు నవ్వి) రామచంద్రా! స్వప్నంలో జరిగే ఉచ్చారణే కనుక (జగత్ వ్యవహారం దృష్ట్యా) సత్యమే అయితే ఆ ఉచ్చారణ ఆ ప్రక్కనే (జాగ్రత్లో ఉన్న) తదితర సహజీవులకు వినిపించాలి కదా! స్వప్న ద్రష్టకు వినిపించే ఉచ్చారణ జాగ్రత్లో ఉన్నవానికి వినిపించటం లేదు. కనుక “సత్యము కాదు” అని అనక తప్పదు మరి? స్వప్నంలో స్వప్న ద్రష్టకు వినిపించే ఉచ్చారణంతా ఆ స్వప్న ద్రష్ట యొక్క భ్రమ మాత్రమే! కనుక "నిద్రా స్వభావ బలం చేత కల్పించబడిన చిదాకాశము యొక్క స్ఫురణయే ఆ విధంగా స్వప్నంగా భాసిస్తోంది" అని గ్రహించు.
భ్రాంతిచే ఆకాశంలో రెండు చంద్ర బింబములు ఉన్నట్లు (కళ్ళకు సంబంధించిన తిమిర రోగ ప్రభావం చేత) అనిపించవచ్చు. ఆకాశంలో ఏవేవో ఆకారాలు ఉన్నట్లు కనిపించవచ్చు. భ్రమచే శిలా ప్రతిమ నృత్యం చేస్తున్నట్లు కనిపించవచ్చు. అట్లాగే, భ్రాంతిచే స్వప్న దేహములందు చిదాకాశమే ఆయా ఉచ్చారణలతో కూడిన శబ్దరూపమును పొందుతోంది. ఆకాశంలో భ్రమచే కనిపించే ఆకారం ఆకాశం కంటే వేరుకాదు కదా! అట్లాగే స్వప్నానుభవమునందు కనిపించే జగదాకారరూపమైనట్టి చిదాకాశ స్ఫురణము ఏమాత్రం కూడా చిదాకాశము కంటే భిన్నం కాదు.
Page:33
స్వప్నంలో కనిపించే జగత్తులాగానే మనందరికీ ఈ ఎదురుగా కనిపించే జాగ్రత్ జగత్తు కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నది.
చూచావా? ఆకాశం మొదలైనవన్నీ ఎట్లా చిదాకాశమే అయి ఉన్నాయో... అట్లాగే నా సమాధిలో నాచే గాంచబడిన జగత్సమూహములన్నీ కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నాయి. అనగా, ఏ జగత్తైతే సత్యంగాను, స్థిరంగాను, మనోహరంగాను మనకందరికీ ఎదురుగా భాసిస్తోందో ... అట్టి ఇదంతా చేతనమైన చిదాకాశమే ఈ విధంగా స్థితినొంది ఉన్నది -- అని గ్రహించి ఉండు.
శ్రీరాముడు : మహాత్మా! నాదొక సందేహం. ఈ జగత్తు స్వప్నము వంటిదేనని అన్నారు కదా! అయితే, స్వప్నరూప మాత్రమైన ఈ జగత్తు జాగ్రత్ స్వప్నరూపంగా ఎట్లా అయింది? ఇదంతా అసత్యమే అయినప్పటికీ సత్యము వలె ఈ కళ్ళు మొదలైన వాటికి విషయమై ఎందుకు భాసిస్తోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! “ఈ జగత్తులన్నీ నిజానికి స్వప్నమువంటివే...” అని శాస్త్రములచే ఎందుకు సిద్ధాంతీకరించబడిందో,... చెబుతాను, విను.
స్వప్నము స్వప్నద్రష్టకంటే వేరైనదా? కాదు కదా! అట్లాగే, ఈ జాగ్రత్లో సిద్ధించుచున్న జగత్తులు కూడా ఆత్మకంటే భిన్నం కాదు. నామరూపాత్మకం దృష్ట్యా చూస్తే ఇవి వాస్తవములు కావు. స్థిరములు కావు. ఇవి సత్తు కావు. అసత్తు కావు. ఇవి అనిర్వచనీయములై ప్రతిభాస రూపమున ఆత్మ సత్తాచే స్థితిస్తూ ఉన్నాయి.
గింజలగుట్టలో కొన్ని గింజలు ఒకే రీతిగా ఉంటాయి. మరికొన్ని ఆకారం దృష్ట్యా వేర్వేరుగా ఉంటాయి. బీజములన్నీ ఒకే రీతిగా ఉన్నా, అవి వృక్షములుగా అయినప్పుడు (ఆకృతి-కొమ్మల సంఖ్య మొదలైన వాటిచే) వేర్వేరుగా ఉంటాయి. అట్లాగే, చిదాకాశమున ఉన్న ఈ జగత్తులు కొన్ని ఒకే రీతిగాను, మరికొన్ని వేర్వేరు రీతులుగాను ఉంటున్నాయి. చిదాకాశమున ప్రళయానంతరం కొన్ని పూర్వంలాగానే ఉంటున్నాయి. కొన్ని సమంగాను, ఇంకొన్ని అసమంగాను ఉంటున్నాయి.
మరొక విషయం... ఒక స్వప్నంలో మరల మరికొన్ని స్వప్నములు కలుగుతూ ఉంటాయి చూచావా? అట్లాగే, ప్రతి ఒక్క జగత్తులో మరల మరికొన్ని జగత్తులు ఉద్భవమగుచున్నాయి.
1.) "జగత్తులో జీవులు,
2.) ప్రతి జీవుడు తనదైన రీతిలో జగత్ స్వప్నం గాంచటం,
3.) ప్రతి ఒక్క స్వప్నంలో ఎన్నో జగత్తులు,
4.) ఆ జగత్తులలో మరికొన్ని జీవులు,
5.) అట్టి ఆ జీవులలో అంతర్గత జగత్తులు
...ఇట్లా ఒకదానికి మరొకటి అదృష్టములై (ఒక జగత్తుకు మరొక జగత్తు యొక్క ఉనికి తెలియరానిదై) ప్రవర్తిస్తున్నాయి కదా! “ధాన్యపు కొట్టులోని బీజరాసులు ఒక్కొక్క బీజంలో వృక్షతత్వం - ఆ బీజం మరల వృక్ష రూపంగా అనేక బీజముల ఉత్పత్తికి కారణమవటం - అట్లా ఉత్పన్నమైన ప్రతి బీజంలో అనేక తదనంతర వృక్షముల అంకుర తత్త్వం” ... ఇవన్నీ ఎట్లా ఏర్పడుచున్నాయో, అట్లాగే జగత్తు ఆ జగత్తులో అసంఖ్యాక జీవులు - అట్టి జీవాంతర్గత జగత్తులలోని ప్రతి దానిలో అనంత సంఖ్యలో జీవులు... ఇదంతా ఏర్పడి ఉంటోంది. ధాన్యపు గుట్ట నశిస్తే అందలి జీవ-జీవాంతర్గత తత్త్వము కూడా నశించునట్లు, ప్రళయంలో జగత్తులు నశిస్తున్నాయి.
Page:34
ఈ విధంగా ఈ స్వప్నరూప జీవులు ఈ కనబడే జగత్తులోనే అసంఖ్యాకంగా కనిపిస్తున్నారు కదా! ఇప్పుడీ జగత్తు నశించిందనుకో, అప్పుడేమౌతుంది? జగత్తు నశించినప్పటికీ ఇందలి జీవులందరూ వాస్తవానికి చిదాకాశరూపులే కాబట్టి ఈ జీవులు చేతన రూపులుగానే ఉంటున్నారు. అంతేగాని, వీరందరు - ఎన్నటికీ శూన్యరూపత్వం పొందరు.
'జీవులు' అనగా అజ్ఞానముచే ఆవరించబడిన చేతనరూపులే కదా! కనుక, వీరందరు దేహము ఉన్నప్పుడు, దేహానంతరము కూడా వారివారి జగత్తులను స్వయం కల్పితంగా అనుభవిస్తూనే ఉన్నారు, ఉంటారు.
ప్రక్క ప్రక్కన నిద్రిస్తున్నప్పటికీ ఒకరి స్వప్నమును మరొకరు ఎఱుగజాలనట్లుగా - ఈ జీవులు నిరంతరము పరస్పరము ఎఱుగజాలని తమ తమ జగత్తుల అనుభవమును కొనసాగిస్తూనే ఉంటారు.
నిద్రించిన జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ దృశ్య దేహసంబంధమైన జగత్తును వదలి స్వప్నజగజ్జాలమును పొందుచున్నాడు. అట్టి స్వప్నజగత్తుతో ఈ ఎదురుగా కనిపించే జగత్తుకు సంబంధించని స్వయం కల్పితమైన స్వప్న జగత్తులో పగలు రాత్రి వ్యవహారములు మొదలైనవన్నీ ఆస్వాదిస్తున్నాడు.
స్వప్న జగత్తులో కూడా త్రిలోకములు ఉంటున్నాయి. ఆ స్వప్న జగత్తులోని అసురులు, అదే స్వప్నజగత్తులోని దేవతలచే హతులు అయ్యారనుకో! అప్పుడు ఆ హతులైన రాక్షసులు ఏమౌతున్నారు? వారు ఇంకా అజ్ఞానము కలిగి ఉండటం చేత ముక్తులు అగుటలేదు. రజో సంబంధమైన ఉత్సుకత ఉండనే ఉన్నది కాబట్టి ఇటు శిలారూపులు అగుటలేదు. దేహ సహితులూ కాదు! అట్టి స్థితిలోని దేహరహిత జీవులకు అట్టి దశయందు “స్వప్నజాగ్రత్ స్థితి” తప్ప వేరే స్థితి ఏముంటుంది?
నిర్మోక్షా నిఃశరీరాస్తే చేతనావాసనాన్వితాః ।
దృష్టం స్వప్నజగజ్జాలం వినా చ క్వ వసంతు తే? ॥
"ఏ జీవులైతే మోక్షరహితులై ఉన్నారో, శరీర శూన్యులైనారో, చేతనాయుక్తులు, వాసనా సహితులు అయి ఉన్నారో - అట్టి జీవులు జాగ్రత్తును పొందనప్పుడు ఎక్కడ ఉంటారు?” అను ప్రశ్నకు నా సమాధానం విను. అట్టి జీవులు స్వప్నజగత్తులో తప్ప మఱి ఎచ్చట నివసించగలరు!
అట్లాగే నిద్రించు రాక్షసులు కూడా వారివారి స్వప్న జగజ్జాలం యొక్క వ్యవస్థను అనుసరించి వారి స్వప్న జగత్తులో వ్యవహారములు ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ వారివారి స్వప్న జగత్తులో దేవతల చేతులలో నిహతులైనారనుకో... అప్పుడు? అప్పుడు కూడా వారి యొక్క స్వప్నాంతర్గతమైన మరొక స్వప్నంలో ప్రవేశించి స్వప్నక్రియలను కొనసాగిస్తూ ఉంటారు.
కాబట్టి రామచంద్రా! ఈ ప్రకారంగా స్వప్నంలో హతులైనవారు ఏం చేస్తున్నారు? వారు అజ్ఞానవశంచేత ముక్తిపొందక, చేతనరూపులవటం చేత శిలాత్వం కూడా పొందక ఉంటున్నారు. దేహం పోయిన తర్వాత మోక్ష రహితులగు జీవులు తదనంతర దేహము పొందనంతవరకు తమయందలి చేతనత్వము కారణంగా తమ తమ సంస్కారానుసారం స్వప్నజగత్తులో ప్రవేశించి ఆ స్వప్న లోకములను అనుభవిస్తున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! దేహానంతర స్వప్నలోకములలోని ఆ మరణించినవాని జగద్దర్శనం మన ఈ శిల - కొండ - ప్రదేశాలలోని జగద్దర్శనంగానే ఉంటుందా? లేక మరొక రీతిగా ఉంటుందా?
Page:35
శ్రీ వసిష్ఠ మహర్షి : మనం జాగ్రత్తులాగే ఏ విధంగా అయితే, ఈ దృశ్యమును నమ్మి 'ఇది పర్వతం - అది గ్రామం - ఇది నా దేశం - అది నీ దేశం” మొదలైనవన్నీ పొందుచున్నామో... అదే రీతిగా దేహానంతర మోక్షసిద్ధిరహిత జీవుడు కూడా అంతటి నమ్మికతోనూ, తన స్వప్నంలో పర్వత - సముద్ర - పృథ్వి - జన సమూహాదులతో కూడిన యథాస్థితమైన సమస్త దృశ్యమును చిరకాలంగా సత్యమని నమ్మి అనుభవించుచున్నాడు. కాబట్టి, అతని స్వప్నము కూడా మన ఈ జాగ్రత్ స్వప్నము వంటిదే అగుచున్నది.
అతని జగత్ స్థితి - కల్పము మనకు వలెనే ఉన్నాయి. మన జగతిస్థితి - కల్పము అతనికి వలెనే ఉన్నాయి. ఈ జాగ్రత్ దృశ్య జగత్తు - జగద్విషయాలు మనకు ఎంతగా అత్యంత సత్యమని అనిపిస్తోందో,... ఆ స్వప్న దృశ్య ద్రష్ట అంతగానూ అది వాస్తవమేనని తలచియే అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఉభయస్థితులలోనూ ఆయా దృశ్యరూపాలుగా పరిఢవించేది మనస్సే కదా!
అంతేకాదు. మనచే అనుభూతమగుచున్న ఈ జగత్తు, ఈ జగత్తులో అంతర్గతమైన మనము వారి స్వప్నములో గాంచబడటం జరిగిందా... అప్పుడు వారి స్వప్న ప్రపంచంలో మన ఈ జగత్తు కూడా ఒక విభాగమౌతోంది. అప్పుడు మనమందరం కూడా అతనికి స్వప్న పురుషులం అగుచున్నాం. అతని స్వప్న మనుజులంతా (మనమంతా) అతనికి సత్యముగానే ఉన్నారు.
శ్రీరాముడు : స్వామి! మీరిప్పుడు చెప్పిన చివరి వాక్యం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. “స్వప్నం భ్రమ మాత్రమే” అనునది ప్రతి ఒక్కరి దైనందినానుభవం కదా! 'స్వప్నంలో కనిపించిన స్వప్న జనులందరూ సత్యంగానే ఉన్నారు'... అను మీ వాక్యం ఎట్లా సమన్వయించుకోవాలి?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అందుకు కొన్ని సమన్వయ పూర్వక సిద్ధాంతాలు చెబుతాను.
1.) ‘స్వప్న సత్త’ యొక్క చమత్కార ప్రదర్శనమే స్వప్నము.
2.) ‘స్వప్న సత్త’కు నిమిత్తకారణం అధిష్ఠాన సత్ - చిదాత్మయే! మట్టి కుండలన్నిటికీ మట్టియే నిమిత్త కారణమైనట్లు!
3.) అధిష్ఠాన చిదాత్మ సర్వగామి. అనగా, సర్వదా అంతటా ఏర్పడి ఉన్నది.
ఈ విధముగా తమ యొక్క, ఇతరుల యొక్క అనుభవం సమానం అవటంచేత వారి స్వప్న మనుజులు సత్యముగా ఉన్నట్లే కదా! వారి స్వప్నజగత్తులో మన ఈ జగత్తు, మన స్వప్న జగత్తులో వారి స్వప్న వివేషాలు తారసపడటం జరుగవచ్చు కూడా!
యథా తే స్వప్న పురుషాః సత్యమాత్మన్యథా పరే ।
తథాపి స్వప్న పురుషాః సత్యమేవ తథైవ తే ॥
ఆ స్వప్న పురుషులు వారివారి దృష్టి యందు ఏఏ విధంగా సత్యమై ఉన్నారో... ఆయా విధంగానే నా చేత, నీ చేత, ఈ సభలో సభికులందరిచేత, తదితర సర్వ జీవుల చేత - ప్రతి స్వప్నంలో అనుభూతులగు మనుజులంతా కూడా - స్వప్నద్రష్ట స్వరూపమైన అధిష్టాన ఆత్మయే అట్లు అనుభూతమగుచుండుట చేత - సత్యమే అయి ఉన్నారు.
అనగా, ప్రతి ఒక్క జీవుని జాగ్రత్, స్వప్నములు స్వస్వరూప సంప్రదర్శన - సందర్శనా చమత్కారములే!
Page:36
స్వ స్వప్నపుర పారా యే త్వయే దృష్టాస్థథైవ తే ।
స్థితాస్తత్ర తథాద్యాపి బ్రహ్మ సర్వాత్మకం యతః ॥
నీవు నీ స్వప్నంలో ఏ నగరాలను, నగరవాసులను దర్శించావో... వారంతా ఆ విధంగా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఎందుచేతనంటే, బ్రహ్మం సర్వదా సర్వ స్వరూపం, సర్వాత్మకం అయి ఉన్నది కదా!
స్వప్న పదార్థములు జాగ్రత్తుకు వచ్చేసరికి అవి నశించునట్లు అనుభూతమగుచున్నట్లే... అవన్నీ స్వప్నం నందు (స్వప్న సమయంలో) స్థితి కలిగి ఉన్నట్లే అనుభూతమౌతున్నాయి.
స్వప్నస్థితి ఈ జాగ్రత్ వ్యవహారాన్ని నశింపజేయటం లేదు కదా! అట్లాగే, జాగ్రత్ స్థితి స్వప్నాంతర్గత ఆయా జీవాదులను నశింపజేయటం లేదు.
సమస్త సత్తయు బ్రహ్మ సత్తామయమే కాబట్టి ఎద్దాని సత్తయు (జాగ్రత్ సత్త - స్వప్న సత్త) రెండవదానిని స్పృశించటం లేదు. తొలగించటం లేదు.
ఈ సమస్త జగత్తు ఆకాశం యొక్క కార్యమే! అనగా, ఆకాశమే ఇట్లు జగద్రూపంగా అనుభవమౌతోంది. ఆకాశం నాశరహితం కదా! అట్లాగే ఇక్కడ జాగ్రత్న గానీ, స్వప్నమున గాని ఏదీ నశించటం లేదు, పరిఢవిల్లటం లేదు. అట్లాగే, సర్వము సర్వత్రా సర్వదా పరమాత్మ రూపమే అవటం చేత, ఎద్దాని రూపము కూడా ఏమాత్రమూ నశించటం లేదు.
'ఉత్పత్తి శూన్యము, ఆది-మధ్య-అంత రహితము, అనంతము' అయినట్టి 'చిదాకాశ రూప పరబ్రహ్మము'నందు అనంతములైన చిత్త సమూహములు ఉన్నాయి.
అట్టి ప్రతి ఒక్క చిత్తమునందు అసంఖ్యాకమైన జగత్ సమూహాలు ఉన్నాయి. అట్టి ప్రతి ఒక్క జగత్తు యొక్క ఆకాశంలో అనేక ప్రపంచ మండలాలు ఉన్నాయి. అట్టి ప్రతి ఒక్క ప్రపంచ మండలంలోను అనేక లోకాలు ఉన్నాయి. అట్టి ప్రతి ఒక్క లోకములోను అనేక ద్వీప - ద్వీపకల్ప - పర్వతప్రాంత - పుర - గ్రామ - గృహాలలో అనేకమంది అసంఖ్యాక జీవులున్నారు. అట్టి ప్రతి ఒక్క జీవుని లోను, అసంఖ్యాక వత్సర-యుగాది కాల విభాగాలతో కూడిన అసంఖ్యాక జగత్తులు ఉన్నాయి.
ఒక జీవుడు జీవిస్తూ ఉండవచ్చును గాక! లేక మరణించి ఉండవచ్చు గాక! ఆ జీవుడు మోక్షమును పొందనంతవరకు అతనియందు అనంతమైన సంఖ్యలో జగత్తులు వేర్వేరుగాను, అక్షయంగాను ఉంటూనే ఉంటాయి. ఆ జీవుని వాసనల యందు మరల అసంఖ్యాక జీవులున్నారు. అట్టి వాసనలతో గల అసంఖ్యాక జీవులలోని ప్రతి ఒక్కని మనస్సులోను అసంఖ్యాక జగత్తులు ఉన్నాయి. అట్టి ఆ మనస్సులో గల ప్రతి ఒక్క జగత్తునందలి ప్రతి ఒక్క జీవుని మనస్సునందును మరల అనేక బ్రహ్మాండములు ఉన్నాయి.
ఈ విధంగా ఈ దృశ్య భ్రమ మొదలు, చివర అనేవి లేకుండానే అనంతంగా కొనసాగుచూనే ఉన్నది. దీనికి హద్దూ-అంతూ అంటూ ఏదీ లేదు. మనస్సే దాని మొదలు - మధ్య - చివర కూడా అని గ్రహించు.
కాని, బ్రహ్మజ్ఞాని యొక్క దృష్టి యందు మాత్రం ఇవన్నీ కూడా బ్రహ్మరూపమే అయి ఉన్నాయి. చిదాకాశము తప్పించి వాటికి వేరే రూపమే లేదు.
Page:37
ఓ రామచంద్రా! ఒక గోడయందు, ఆకాశమునందు, ఒక శిలయందు, జలమునందు, స్థలమునందు... అంతటా చిన్మాత్రమగు పరబ్రహ్మమే వేంచేసి ఉన్నది. ఈ జగత్తంతా కూడా చిన్మాత్రమే! చిన్మాత్రమే స్వప్న జగత్తు కూడా! అసలు జగత్తు అనబడే వస్తువు (పరబ్రహ్మమునకు) వేరుగా లేనే లేదు.
అట్టి చైతన్యము 'సర్వవ్యాపకం' కాబట్టి సర్వత్రా అనేక జగత్తులు ఉండి ఉన్నవే అగుచున్నాయి. అట్టి జగత్తుల సంఖ్యను లెక్కించటం ఎవరితరం అయ్యేది కాదు. అయితే... 'జ్ఞాని దృష్టిలో మాత్రం ఈ జగత్తులన్నీ కూడా 'నిర్విశేషం, నిరతిశయానందరూపం' అయిన బ్రహ్మమే అయి ఉన్నాయి.
‘అజ్ఞాని' యొక్క మనస్సుకో... అవన్నీ ఉత్తమ ఘనీభూత దృశ్యములుగానే అనుభవవానికి వస్తున్నాయి. కాబట్టి, అజ్ఞానికి అతని అనర్థపరంపర ఏమాత్రం శమించటమే లేదు. జ్ఞాని వీటన్నిటినీ ఆత్మగానే దర్శిస్తున్నాడు కనుక, అతనికి అనర్థమే కనిపించటం లేదు. అజ్ఞానికి అనర్థం శమించటం లేదు. జ్ఞానికి అనర్థమేదీ కనిపించటం లేదు.
✤✤✤
శ్రీరాముడు : మహర్షీ! మీరు చిదాకాశంలో కల్పనా మాత్రాలైన అనేక జగజ్జాలాలను చుట్టివస్తూ ఉండగా మిమ్ములను అనుసరిస్తున్న ఆ ఆ స్త్రీ ఆర్య ఛందస్సు (వేద మంత్రాలు గానం చేసే ఒకానొక రాగం) గానం చేస్తూ ఉన్నదని అన్నారు కదా! మరి ఆమెతో మీరేమైనా సంభాషించారా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. సంభాషించాను. కమల నేత్రములతో విరాజిల్లుచున్న ఆ విద్యాధర స్త్రీ వైపుగా చూచి వినోదపూర్వకంగా నేనిట్ల సంభాషించాను.
⌘
శ్రీ వసిష్ఠ మహర్షి : కమలగర్భము వంటి శోభతో ప్రకాశిస్తున్న ఓ లలనా! నీవు ఎవరివి? ఇటు వైపుగా ఎందుకు వస్తున్నావు? ఎవరికి సంబంధించినదానవు? ఏమి ఇక్కడ సంచరిస్తూ నన్ను వెంబడిస్తున్నావు? ఎచటకు నీ ప్రయాణం? నీ అసలు నివాస స్థలం ఎక్కడ?
విద్యాధర స్త్రీ : హే మునీంద్రా! మిమ్ముల్ని అనుసరిస్తూ వస్తున్న నన్ను ఇప్పటికైనా ఇట్లా ప్రశ్నించటం నాకు సంతోషాన్ని కలుగజేస్తోంది. వినమ్రురాలనై నా వృత్తాంతమంతా ఉన్నది ఉన్నట్లుగా మీకు విన్నవించుకుంటాను.
సంసారదుఃఖముచే పీడితురాలనైన నేను అట్టి దుఃఖమును, ఉపశమింపజేయ గల ఉపాయములను అర్థించే ఉద్దేశంతో మిమ్ములను అనుసరించి వస్తున్నాను. నన్ను విశ్వసించి నాపై కరుణతో నా వృత్తాంతం విని నాకు సద్ధతిని ప్రసాదించే మార్గం ప్రబోధించండి.
⌘⌘
ఓ మునీంద్రా! చిదాకాశము యొక్క ఒకానొక కోణమునందు ఈ మీరు ఉంటూ ఉండే 'జగత్తు' అనే గృహం ఒక చిన్న విభాగంగా ఉన్నది. ఈ మీ జగద్రూప గృహంలో "పాతాళము - భూలోకము - స్వర్గలోకము" అనేవి 3 కూడా లోపలి గదుల వంటివి.
Page:38
ఈ జగత్ గృహంలో హిరణ్యగర్భ స్వరూపిణియగు (సృష్టికర్త స్వరూపిణియగు) మాయ 'సృష్ట్యాది వైచిత్ర్య కల్పన' అనే చమత్కారం రచించింది. ఈ జగత్తు ద్వీపముల చేత, సముద్రముల చేత వలయముల వలె చుట్టబడి ఉన్నది. ఈ జగత్తుకు సప్తద్వీపములకు, సముద్రములకు ఆవల సువర్ణరంగు గల భూమి ఉన్నది. ఆ భూ ప్రదేశం 10,000 యోజనముల విస్తీర్ణం కలిగి ఉన్నది. ఆ భూప్రదేశం రాత్రులందు స్వయంగా (సూర్యాదులు లేకుండానే) ప్రకాశిస్తూ ఉంటుంది. అందులో ఈ భూభాగంలాగా ధూళి ఉండదు. ఆ భూ ప్రదేశం ఎవరు ఏది కోరితే అద్దానిని అప్పటికప్పుడే ప్రసాదించగలదు. అద్దాని శోభ ముందు మీ స్వర్గము మొదలైన లోకాలు ఎందుకూ పనికిరావు. ఎందుకంటారా? అక్కడి భూమి సంకల్పించినంత మాత్రం చేత ఏది కోరుకుంటే అది అందజేస్తూ ఉంటుంది. అది సుందరమైన భూప్రదేశం, సిద్ధులు, అప్సరసలు మొదలైన ప్రబుద్ధజీవులు లీలా విహారంగా ఆ భూప్రదేశానికి వస్తూ ఉంటారు.
అట్టి ఆ విస్తార భూభాగానికి చివరగా 'లోకాలోకం' అనే ఒక ప్రసిద్ధమైన పర్వతం ఉన్నది. ఆ మహా పర్వతము యొక్క ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క తీరుగా ఉంటుంది.
ఒకచోట మూర్ఖుని హృదయంలాగా అంధకారం. ఒకచోట సజ్జనుని మనస్సు లాగా నిత్యప్రకాశం. ఒకచోట సజ్జన సాంగత్యంలా ఆహ్లాదజనకం. ఇంకొకచోట మూర్ఖులతో సహవాసంలా దుఃఖప్రదం.
ఒకచోట బుద్ధిమంతుల చిత్తంలాగా సర్వప్రయోజన పరిపూర్ణ శోభతో గాలి, నీరు, ఫలములు లభిస్తున్నాయి. ఇంకోకచోట శుష్క- మూర్ఖ కేవల వేద పాఠకునిలా (అర్థం గ్రహించనివానిలా) నీరు, ఆహారం, పళ్ళు లభించని స్థలాలు.
ఒకచోట సూర్యకిరణాలు ప్రవేశించలేకపోతున్నాయి. మరొకచోట సూర్య, చంద్ర నక్షత్రములచే నిత్య ప్రకాశం. ఒకచోట జనావాసం. ఇంకొకచోట జనశూన్యం. జంతు-వృక్ష రహితం. ఒకచోట ఉద్యానవనాలు. విద్యాధరీ గణసహితం. ఇంకొకచోట భయంకర చీకటిగుహలు. అందులో 'కుంభాండు' డనే రాక్షస జాతి నివాసం.
ఇట్లా రాక్షస-పిశాచ జనం నివసించే భయంకర స్థానాలతో, మానవ జనవాస ప్రదేశాలతో, విద్యాధర స్త్రీలు నృత్యగానాలు చేసే వీలున్న నదీతీరాలతో, వనములతో ఒప్పుతోంది.
ఆ లోకాలోక పర్వత శిఖరాలపై అనేక రత్నమయ శిలలు ఉన్నాయి. ఆ పర్వతపు ఉత్తర దిక్కు విభాగంలో గల ప్రాంతంలో అనేక పెద్ద పెద్ద గండశిలలు ఉన్నాయి. ఆ ప్రాంతపు సుదీర్ఘమైన కొండ ప్రదేశం యొక్క తూర్పువైపుగా ఒకానొక చోట గల దృఢమైన ఒక శిల యొక్క గర్భభాగమున మేము నివసిస్తూ ఉంటాము. ఆ బ్రహ్మదేవుని నియతిని అనుసరించి అక్కడ ఉన్నాము. శిలాంతర్భాగం(కొండరాయి)లో జనించాము.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఏమీ! ఆ కొండరాయిలో ఉంటున్నారా? ఎప్పటి నుండి? ఒంటరిగా ఉంటున్నారా? ఎందుకు అక్కడ (లోకాలోక పర్వత శిఖరాలపై గల ఒకానొక కొండశిల అంతర్భాగంలో) ఉంటున్నారు?
Page:39
విద్యాధర స్త్రీ : అవును మహర్షీ! అక్కడ నేను వసిస్తూ ఉండగా అసంఖ్యాకమైన యుగ సమూహాలు గడచిపోయాయి. ఆ శిలాగర్భ విభాగంలో నేనొక్కతినే కాదు. భ్రమరము పద్మములో సాయంకాలం చిక్కుకుని ఉన్నట్లు నా భర్త కూడా అందులోనే బద్ధుడై ఉన్నారు. మేమిద్దరం కలిసి ఉండి ఎన్ని వేల సంవత్సరాల సమూహాలు గడచిపోయాయో చెప్పలేను. ఇంత సుదీర్ఘకాలం గడచిపోయినా కూడా కామ వాసనా దోషముచే కాబోలు... మేము ఇరువురం మోక్షం పొందకయే ఉన్నాం. మమత్వబుద్ధి మమ్ము వెంటనంటియే ఉన్నది.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ శిలాకోశ (గర్భ) విభాగం అంతా శిలా కణమయమే కదా! మీరిద్దరు అందులో వేలాది సంవత్సరాలుగా ఉండటం నాకు చమత్కారంగా ఉన్నది. సరే! అయితే, ఆ శిల అంతర్భాగంలో మీరిద్దరు మాత్రమే ఉన్నారా? ఇద్దరూ అందులో ఎందుకున్నారు?
విద్యాధరి : మేమిద్దరమే కాదు. మా పరివారమంతా కూడా అచ్చట బద్ధమై ఉన్నది. నా భర్త పురాణ పురుషుడగు (అతి ప్రాచీన కాలంగా ఉంటున్న) బ్రాహ్మణుడు. ఆయన అనేక వేల యుగాలుగా జీవించి ఉంటున్నప్పటికీ ఎక్కడికీ కదలకుండా అక్కడే ఒకే స్థానంలో ఉన్నాడు. మరింకెక్కడికీ వెళ్ళటమే లేదు.
ఆ నా పతి బాల్యకాలం నుండీ బ్రహ్మచారి అయి ఉన్నాడు. వేదము ఎఱిగినవాడు. కపటము లేనివాడు. ఇంద్రియ చాపల్యము లేనివాడు. ఏకాంతవాసి కూడా! అతని పట్ల వ్యసనురాలైన భార్యనగు నేను అతడు లేకపోతే ఒక్క నిమిషం కూడా దేహము ధరించజాలనంటే నమ్మండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : అతడు మిమ్ములను ఎట్లా భార్యగా స్వీకరించాడు. మీ ఇఱువురికి స్వాభావికమైన స్నేహం ఎట్లా పెంపొందింది?
విద్యాధరి : కమలనేత్రుడవగు మునీంద్రా! నా భర్త అయిన ఆ బ్రాహ్మణుడు ఉత్తమ కులమున జన్మించినవాడు. బాలుని స్వభావం గలవాడు, సజ్జనుడు. చాలా వరకు జ్ఞానసంపన్నుడు. అతడు కాలక్రమంగా బాల్యం నుండి యౌవనంలో ప్రవేశించాడు. అతడు అప్పుడు ఒకసారి 'నాకు భార్యగా అగుటకు అర్హత గల ఒక స్త్రీ లభించు గాక! ఆమె నిర్మల స్థానమున వసించే కుల స్త్రీ అయి, వేదజ్ఞత్వం, వేద వేదాంగాలు గ్రహించినదై ఉండాలి. సౌందర్యవతి, సద్గుణరాశి అయి ఉండాలి' అని చిరకాలం పసిబాలుడు ఆటబొమ్మను కోరుకొనునట్లు చింతన చేశాడు. అప్పుడు చంద్రుని నుండి చంద్రిక జనించినట్లు ఆయన దేహం నుండి అనిందితం అగు శరీరం గల నేను జనించాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ విద్యాధరీ! మీరు ఎట్లా జనించారు? అతనికి సహధర్మచారిణిగా ఇతః పూర్వమే (మీరు జనించటానికి పూర్వమే) ఎవరైనా ఉండి ఉన్నారా?
విద్యాధరి : లేదు. అతని యొక్క శోభాయమానమగు మనస్సు నుండే నేను ఉత్పన్నమైనాను. అతని సంకల్పం యొక్క శోభ నుండి ఉద్భవించాను. ఈ విధంగా నేను అతని మానసిక భార్యను. క్రమంగా స్వాభావికమైన వస్త్రములు ధరిస్తూ సర్వ జీవుల చిత్తమును ఆహ్లాదపరుస్తూ యౌవనవతినైనాను. ఆ దశలో ఎత్తైన స్థనములతో, లేత చేతులతో, సమస్త గుణములు కలిగి ఉన్నదాననయ్యాను.
Page:40
నా కళ్ళు జింక వలె పెద్దవి. నా సౌందర్యముచే సర్వ జీవుల హృదయమును హరించుదానివలె శోభించాను. సమదర్శియగు పతి యొక్క మనోమయ రూపిణిని అవటం చేత నాకు కూడా 'సమత్వము' అనే లక్షణం అబ్బింది. మోహజాలమునందు పడి ఉండి కూడా సంపద, ఆపదల పట్ల భేదరహితురాలనై ఉండేదానను.
అయితే, నేను లీలా విలాసములందు ప్రీతి కలిగి ఉండే దానిని. నా మనస్సు 'కౌతుకము' కలిగి ఉండేది. నాకు గాన-వాద్యములందు మిక్కిలి ప్రీతి ఉండేది.
ఓ మునీంద్రా! ఇక్కడ ఒక విషయం. నా భర్త తన సంకల్పధారణ చేత ఆ శిలాంతర్భాగంలో త్రిలోకాలు ధారణ చేస్తున్నాడు. అనగా ఆ కొండరాయిలో అతని 'ఆలోచన' లోంచి స్వర్గ - మర్త్య - పాతాళ లోకాలు ఉద్భవించి వ్యవహరిస్తున్నాయి. నేను కూడా నా భర్త యొక్క మనోమయ కల్పిత రూపిణినే కదా! కనుక నేను ఆ కొండశిలలోనే కాకుండా అక్కడ ఆయనచే కల్పించబడిన త్రిలోకములను ధారణ చేస్తూ ఉన్నాను. నేను ఆ సృష్టికర్త యొక్క కుల స్త్రీని కదా! గర్భిణి స్త్రీ తన గర్భములోని శిశువుకు పోషణను అసంకల్పితంగా అందిస్తున్నట్లుగా, నేను ఆ త్రిలోకములను పోషణ చేస్తూ ఆ త్రైలోక్యగృహం యొక్క భారము వహిస్తున్నాను.
ఇది ఇట్లా ఉండగా, ఆయన మానసిక సృష్టి నుంచి జనించిన నేను ఒకప్పుడు యౌవనంలో ప్రవేశించాను. ఉన్నత స్థనములు గలదాననయ్యాను. ఆయనకు సహధర్మచారిణిగా వర్తింపటానికి ఆయన చేతనే సృష్టించబడిన నాకు వివాహితను అవటానికి సర్వ లక్షణసమన్వితను అయ్యాను. అయితే నన్ను సృష్టించిన ఆ బ్రాహ్మణుడు నన్ను వివాహం చేసుకోవటం లేదు. ఎందుకంటారా? అతడు దీర్ఘసూత్రి అయ్యాడు. పైగా అతడు వేదజ్ఞుడు. సదా తపస్సునందు ఆసక్తి గలవాడు. నేను యౌవనవతిని అయినా కూడా అతడు నా వైపు కన్నెత్తి చూడటంలేదు. ఇక నాకు అతనితో యౌవన సంపన్న భోగాలు అనుభవించాలని అత్యంత కుతూహలం. నా యౌవన కవళికలతో అతనిని ఆకర్షించ యత్నిస్తున్నప్పటికీ, అతడు మోక్షాపేక్ష వలన నన్ను పట్టించుకోవటం లేదు. అతని భోగ వ్యసన రాహిత్యం చూచి నేను అగ్ని వలె దహించుకుపోతూ ఉండేదానను. నా అవయవములు నిరంతరం అతని స్నేహము కొరకై తపిస్తూ ఉండేవి.
అతని సాంగత్యం లభించక పూర్ణ వనాలు కూడా శ్మశానాలు లాగా కనబడసాగాయి. సరస్సులు నీరసంగా తోచాయి. పరిజనులైన నా ఇష్ట సఖీ జనం నా దేహోపశాంతికై పుష్పశయ్యలపై పరుండబెట్టి ఊపినా కూడా అవి నాకు ముళ్ళ పొదలపై పరుండిన విధంగా బాధపెట్టసాగాయి. శీతల శిలలు నా శరీర స్పర్శకు ఉడికి మసి అవుతూ ఉండేవి. ఎక్కడైనా అందమైన ప్రకృతి దృశ్యం చూసినప్పుడు పరవశించటానికి బదులుగా నా కళ్ళు దుఃఖముతో జలపూరితమౌతుండేది. నా అశ్రుబిందువులు రాలుటచే చేతిలో ధరించిన కమలంపై ఆ బిందువులు పడి అది కాస్తా క్షణంలో శుష్కించిపోయేవి. సిగ్గుచే నా సఖీ జనంతో కూడా నా మానసిక స్థితిని చెప్పుకోలేక పోయేదానను. సారస పక్షుల జంటను చూసి అసూయతో క్రుంగిపోసాగాను.
Page:41
శుభసందర్భములు దుఃఖ కరములుగాను, అశుభ సందర్భములు సుఖకరంగాను - నాకు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఆయా సందర్భాలలో ఎట్లా ఉంటున్నానో నాకే తెలియటం లేదు. ప్రకృతిలో రమణీయమైన పుష్పాలు, సెలయేళ్ళు మొదలైనవి శ్మశానంలో కాళ్ళకు స్పర్శించే భస్మంలాగా కనిపించసాగాయి. ఈ విధంగా నా నవయౌవన దినములు శుష్కంగా గడిచిపోసాగాయి.
విద్యాధరి : ఓ మునీంద్రా! ఆ విధంగా అతి దీర్ఘకాలం విరహం అనుభవించాను. క్రమంగా నా విషయానురాగదశ 'వైరాగ్యదశ'ను పొందింది. మొట్టమొదట నా చిత్తములో 'విచారము' జనించనారంభించింది.
మునీంద్రా! మీకు అన్నీ తెలుసు కదా! నా భర్తయా, ఏకాంత ప్రియుడు. నీరసుడై ఉన్నవాడు. స్నేహం అభిలషించనివాడు. సరళబుద్ధితో మౌనం వహించి ఉన్నవాడు. ఇక నా సౌందర్యానికి, స్త్రీత్వానికి, సౌకుమార్యానికి... అసలు నా జీవితానికి ప్రయోజనమేమున్నది చెప్పండి? అట్టి అరసికుడైన భర్తను కలిగి ఉండటం కంటే మరణమే శ్రేష్ఠమేమో? బాల్య వైధవ్యమే ఉచితమేమో! అంతకన్నా నిరంతరమైన ఆపదల మధ్య ఉండటమే మంచిదేమో! రసికుడు-కోమలమైన ప్రకృతి గలవాడు అగు యువకుడు భర్తగా లభించటమే స్త్రీ యొక్క జన్మకు సాఫల్యం. అదే అఖండ సౌభాగ్యం.
అరసికుడైన భర్తను పొందిన స్త్రీ జీవితము, సంస్కారం లేనట్టి బుద్ధి, దుర్జనుల సహవాసంతో కూడి ఉన్న సిరి, వేశ్యలచే అపహరించబడిన జీవితం గల శాస్త్ర విజ్ఞాని యొక్క విజ్ఞానము - ఇవన్నీ వ్యర్థములే కదా!
పతిని అనుసరించగలిగినట్టి స్త్రీయే స్త్రీ. సజ్జనులచే పొందబడే సంపదయే సంపద. 'శమము’ మొదలైన ఉత్తమ గుణములు గల బుద్ధియే బుద్ధి. 'సమబుద్ధి' సహితమైన సాధుత్వమే సాధుత్వము.
నాఽధియో వ్యాధయో నైవ నాఽపదో న దురీతయః ।
కుర్వన్తి మనసో బాధాం, దంపత్యోః అనురక్తయోః ॥
పరస్పరమూ అనురాగం కలిగి ఉన్న దంపతుల మనస్సుకు ఆధి-వ్యాధులు గాని, ఆపదలు గాని ఉండవు. అతివృష్టి-అనావృష్టి వంటి ఉపద్రవములు బాధను కలిగించజాలవు. దుష్టుడైన (లేక) అనురక్తి రహితుడైన పతి కలిగిన స్త్రీకి సంపదలు కూడా ఆపదలుగానే ప్రాప్తిస్తాయి. స్త్రీ ఈ ప్రపంచంలో సర్వసంపదలూ త్యజించటానికైనా సిద్ధపడుతుంది గాని, ప్రమాదవశంగా పతి మాత్రం దూరం కావటం సహించలేదు కదా!
మునీంద్రా! నా దౌర్భాగ్యం చూడండి. యౌవనంలో ఉన్న నేను భర్త సమీపంలో ఉంటునే భర్త యొక్క కరస్పర్శ, సాంగత్యము సంపాదించుకోలేక అనేక సంవత్సరాలు గడిపాను.
Page:42
అట్లా దీర్ఘకాలం గడిచిపోవటంచేత క్రమంగా భోగముల పట్ల నాకున్న అనురక్తి కాస్తా విరక్తి రూపం దాల్చసాగింది. వైరాగ్య వాసన పొంది సమస్త పదార్థముల పట్ల 'విరాగము' కలదాననైనాను. ఇక 'ముక్తిని పొందాలి' అనే ఉద్దేశంతో మీ వద్ద 'ఉపదేశము' పొందదలిచాను.
ఇష్ట పదార్థములను పొందనివారికి... పరబ్రహ్మమునందు విశ్రాంతి పొందని బుద్ధి కలవారికి... మరణతుల్యములైన దుఃఖ ప్రవాహములందు కొట్టుకొని పోవువారికి... అట్టి వారికి 'జీవించటం’ కంటే మరణించటమే శ్రేష్ఠం అగుచున్నది కదా!
ఇక నా పతి విషయం! రాజు సహాయంతోనే మరొక రాజును జయించుటకు ప్రయత్నిస్తారు చూచారా? అట్లా నా భర్త రాత్రింబగళ్ళు 'నిర్వాణము' గురించిన చేష్టయందు తత్పరుడై ‘మనస్సు’ చేత ‘మనస్సు’ను జయించే ఉద్యమంలో ఉన్నారు. నన్ను ఏమాత్రం ఆపేక్షించక ఆత్మయందే స్థితి కలిగి ఉండే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు. దానితో నాకు కూడా ఈ జగత్ స్థితి యందు వైరాగ్యం కలిగింది.
అట్లా వైరాగ్యం కలిగిన నాటినుండి నా యందు సంసార వాసన యొక్క ఆవేశం సన్నగిలసాగింది. అప్పుడిక 'ఖేచరీ ముద్ర' ను ధారణ చేసి, అట్టి అవలంబనచే ఆకాశగమన స్థితిని పొందాను. క్రమంగా ఆకాశ నివాసులగు సిద్ధులతో సంభాషించగల ధారణను అభ్యసించాను. ఆ తర్వాత యోగదృష్టితో నేనున్న బ్రహ్మాండము యొక్క పూర్వాపరాలను దర్శించగలిగే ధారణకు ఉపక్రమించాను. క్రమంగా అట్టి ధారణ నాకు సిద్ధించింది. ఆ తర్వాత ఆ బ్రహ్మాండము యొక్క అంతర్గతములైన సమస్త పదార్థములను దర్శించి, వాటికి అతీత్వము సంపాదించి ఆ బ్రహ్మాండము నుంచి యోగశక్తితో బహిర్గతురాలను కాగలిగాను. అట్లా బయల్వెడలి వచ్చిన తర్వాత నేనీ లోకాలోక పర్వతాలను చూడగలిగాను.
ఓ మునీంద్రా! ఇంతకాలం ఈ బ్రహ్మాండాలను చూడాలనే ఇచ్చ మా దంపతులిద్దరికీ కలుగనే లేదు. అయితే నేను మాత్రం ధారణశక్తిచే ఆ బ్రహ్మాండంలో నుంచి బయల్వెడలాను కదా! నా భర్త మాత్రం ఎటువంటి కోర్కెలు లేనివాడై కేవలం వేదములచే ప్రతిపాదించబడిన శుద్ధధర్మం యొక్క పరమాత్మ యొక్క అనన్యచింతనలో మాత్రమే మునిగి తేలుచున్నారు. ఆయనకు కాలం యొక్క అంగములైనట్టి భూత వర్తమాన భవిష్యత్తుల ధ్యాసగాని, పదార్థముల దృష్టిగాని లేదు. అయినప్పటికీ కూడా అతడు బ్రహ్మత్వాన్ని వాస్తవంగా ఎఱుగనేలేదని నా అభిప్రాయం. విద్వాంసుడు అయి ఉండి కూడా నా భర్త బ్రహ్మ పదమును పొంది ఉండలేదు. ఈ కారణం చేత మా దంపతులమిరువురం ప్రయత్నించి బ్రహ్మపదము యొక్క ఉపదేశం పొందాలని నిశ్చయించుకున్నాం.
కాబట్టి మహాత్మా...! బ్రహ్మజ్ఞానము కొఱకై మేమిరువురము మిమ్ములను ప్రార్థిస్తున్నాము. మా ఈ ప్రార్థనను సఫలం చేయమని మా విన్నపం. తమ ఉపదేశ ప్రభావం చేత బ్రహ్మపదము పొందాలని వాంఛిస్తున్నాం. మహానీయులను అర్థించినవారెవరూ నిష్ఫలులు కారు కదా! హే మహనీయా! ఆకాశంలో సిద్ధుల సేవలు అందుకునే నేను అజ్ఞానారణ్యాన్ని భస్మీభూతం చేయగల మీ వంటి జ్ఞానాగ్నిని మరెక్కడా చూడలేదు.
Page:43
తమవంటి సజ్జనులు ఏ కారణం లేకుండానే అర్థించువారి అభీష్టములను సిద్ధింపజేస్తారని లోకప్రతీతి. కనుక, మిమ్ములను శరణువేడినట్టి మమ్ము “ఉపేక్షించకండి” అని అభ్యర్థిస్తున్నాం.
⌘⌘
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అలా ఆమె నాతో పలికింది. బ్రహ్మాండాకాశమున కల్పించ బడిన ఆసనంపై ఆసీనురాలై చెప్పుచున్న ఆమె మాటలన్నీ విన్నాను. ఆమెతో ఇట్లా సంభాషించాను.
⌘
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ బాలా! మీ వంటి దేహధారులకు ఆ శిల లోపల స్థితి ఎట్లా సంభవించింది? ఆ శిలలో బ్రహ్మాండము - గృహాలు - బ్రహ్మాండాంతర్గత సంచలనాలు ఎలా ఏర్పడ్డాయి?
విద్యాధరి : మునీంద్రా! తమ యొక్క ఈ విశాలమైన జగత్తు ఎట్లా విరాజిల్లుతోందో, అదేరీతిగా ఆ శిలలో కూడా సంసారయుక్తమైన మా యొక్క జగత్తు కూడా విరాజిల్లుతోంది. ఆ మా జగత్తులో కూడా... పాతాళంలో నాగులు, దైత్యులు, దానవులు; భూమిపై పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, ప్రాణిసమూహాలు; ఆకాశంలో వాయువీచికలు, గంధర్వనగరాలు; సముద్రంలో జలపూర్ణాలు, జల జంతువులు; జనుల రాకపోకల, పుట్టుక, చావు వ్యవహారాలు; గ్రహాలు, నక్షత్రమండలాలు; రాజులు భూమిని ఏలటాలు; నదులు సముద్రం వరకు ప్రవహించటాలు; దేవత, అసుర, మనుష్యుల సంచనాలు, వ్యవహారాలు; ఆకాశ మేఘాలు, కల్పములు, కల్పంతాలు; కాలగతి యొక్క మార్పుచేర్పుల చమత్కారాలు; జ్యోతిష్యులచే ఎఱుగబడే ఉత్పాత, గ్రహణ, ఉల్కాపాతాలు... ఇటువంటి సర్వ వ్యవహారాలు ఆ శిలాంతర్భాగంలోని ఒక రేణువులోనే ఉండి ఉన్నాయి. స్వామీ! "ఇవన్నీ ఆశ్చర్యం కదా?” అని అంటారేమో! అట్లా అయితే, తామే దయచేసి ఆ శిల వద్దకు వచ్చి శిలాంతర్భాగ జగత్తును ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎందుకంటే, ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం తటస్థితించినప్పుడు మహానీయులు అద్దానిని పరిశీలించి అర్థం చేసుకొనే కుతూహలం కలిగి ఉంటారు కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆమె అన్న మాటలు విని ఆ శిలాంతర్గత బ్రహ్మాండమును చూడటానికి నేను ఒప్పుకున్నాను. శూన్యమగు ఆకాశంలో వీచే గాలి వీచికల వెంట సుగంధం పయనించినట్లు, నేను ఆమెను అనుసరించి ప్రయాణించసాగాను. ఆకాశంలో సుదూరంగా ప్రయాణించి దేవతలు మొదలైన అనేక భూత సమూహములను అధిగమించి లోకాలోక పర్వతంపై గల ఆకాశం చేరాం. ఉత్తర దిశ యొక్క పూర్వ భాగాన గల మేఘపంక్తిలోంచి క్రిందికి దిగి బంగారపు రంగుతో ప్రకాశించే ఒక శిలను సమీపించాం. విద్యాధరి ఆ శిల వైపు 'ఇదియే నేను చెప్పిన శిల' అనే అర్థం వచ్చేటట్లు చేతివ్రేళ్ళను, కనుబొమలను కదిలించింది. ఆ శిలవైపు నేను కొద్దిసేపు ఏకాగ్రదృష్టితో చూచాను. అది మామూలు పసిమిఛాయతో కూడిన శిలగానే కనిపించింది నాకు. మరి అందులో ఆమె వర్ణించి చెప్పిన జగత్తేమీ కనిపించనేలేదు.
Page:44
నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : అమ్మా! మీరు చెప్పిన సూర్య చంద్ర నక్షత్రమండలాది విశేషములతో కూడిన సముద్ర - ఆకాశ - దిక్కులతో కూడిన జగత్తేదీ కనిపించడం లేదే? మీరు చెప్పిన లోకాలు - సురాసుర మానవాది జీవులు మొదలైన సంరంభమంతా ఎచట? ఇది ఒక సామాన్యమైన శిలే కదా?
నేను అడిగిన ప్రశ్న విని ఆ విద్యాధర స్త్రీ కొంచెం ఆశ్చర్యం ప్రకటించింది. నా వైపు, ఆ శిల వైపు మార్చి మార్చి చూచి, ఇట్లా అన్నది.
విద్యాధరి : ఓ మునీంద్రా! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయే! అద్దంలో ప్రతిబింబించిన నగరంలాగా ఈ శిలలో దేవ - మనుష్య - ఆకాశ - సముద్రాదులతో కూడిన మా జగత్తు నాకు స్పష్టంగా అగుపడుతోంది.
మరి మీకు కనిపించక, నాకు ఎట్లా కనిపిస్తోందంటారా?
ఈ శిలలో మా జగత్తును గాంచటం నాకు నిత్యానుభవమే అయి ఉన్నది. మీరు జగత్తును భావించటం లేదు కాబట్టి ఇక్కడి జగత్తు మీకగుపించటమే లేదు.
స్వామీ! ఇందులో మీకు తెలియని క్రొత్త విషయమేమున్నది? సర్వజీవులూ విశుద్ధ మనోమయదేహులే అయినప్పటికీ... ఈ మనస్సు అనేది వాస్తవానికి సర్వ సూక్ష్మ పదార్థములను గ్రహించగల శక్తి అంతర్గతంగా కలిగి ఉన్నప్పటికీ కూడా... సుదీర్ఘ కాలంగా అభ్యసిస్తూ వస్తున్న ద్వైత వృత్తుల కారణంగా ఒక్కొక్క సందర్భంలో సూక్ష్మ విషయాలు గమనించకయే ఉంటోంది. ఎవడు ఎట్టి దృష్టి (లేక) ధ్యాసను అభ్యసిస్తాడో అదియే దృఢాభ్యాస సంస్కార ప్రభావం చేత చిత్తము యొక్క ఘనీభూతానుభవంగా ప్రాప్తించటమనేది ఈ చిత్తము యొక్క స్వభావమే అయి ఉన్నది. చిన్నపిల్లవాడి నుండి వయోవృద్ధుని వరకు... ఏది ఎట్లు అభ్యాసపూర్వకంగా భావిస్తే అది అట్లే సిద్ధించటమనేది గమనార్హమే కదా!
"ఏ సూక్ష్మజ్ఞానం (లేక) బ్రహ్మజ్ఞానం నిరంతర అభ్యాసంచే సిద్ధిస్తుందో... అట్టిది శాస్త్రాలు చదువుటచే గాని, సుదీర్ఘ తర్కాలచే గాని, ఉపన్యాసాదులు వినుటచే గాని సిద్ధించదు” అని శాస్త్రములు కూడా ఒప్పుకుంటున్న విషయమే కదా! ఇంతెందుకూ...? ఉదాహరణకు నన్నే తీసుకోండి. కొంతకాలం క్రింద నా జగత్తులో నాచే పొందబడుచున్న పరిసరాలన్నీ నా యొక్క 'విరహవేదన’ కారణంగా కాబోలు, అత్యంత దుర్భరంగా కన్పట్టుచూ ఉండేవి. చిరకాలంగా వ్యర్థంగా ప్రవృత్తమైన నా పతి వ్యధా సంబంధమైన బాధ వలన స్వతహాగా అతి స్వచ్ఛము-వ్యాపకము అయినట్టి నా సూక్ష్మజ్ఞానం మరుగున పడింది. ఆ సమయంలో స్థూలంగా ఈ జగత్తు అభ్యస్తమై నా అనుభవంలో ఉండేది. అట్టి అప్పటి స్వకీయ జగత్తు ఇప్పుడు ఈ క్షణంలో గడిచిపోయిన స్వప్నంలాగా నశించిన దానివలె అస్పష్టమైన రూపంగా కనిపిస్తోంది.
ఆకాశంలో (భ్రమచే) లతను చూచేవానికి కొంతసేపు మరొక వైపు చూచి, మరల ఆకాశంలోకి చూస్తే, ఆ 'లత' కనిపించదు చూచారా? అట్లా నాచే సుస్పష్టంగా ఇతఃపూర్వం గాంచబడిన ఈ శిలలోని జగత్తు ఇప్పుడు ప్రతిబింబంలాగా కొంత అస్పష్టంగా కనిపిస్తోంది. అందుకు కారణం అప్పటి అనురక్తి తరువాత క్రమంగా విరక్తి అభ్యసించి ఉండటమే!
అంతేకాదు...! ఒక భ్రమ అభ్యాసవశం చేత ఏర్పడి, ఇంతలోనే వేరైన మరొక భ్రమను అభ్యసిస్తూ వస్తున్న కారణంగా మొదటి భ్రమ క్రమంగా తొలగటం కూడా లోకంలో అందరి అనుభవమే కదా!
Page:45
ఉదాహరణకు బాల్యంలోని “ఆటలు” అనే భ్రమ యౌవన దశలో తొలగి, ఇంతలోనే 'స్త్రీ సౌందర్యం - ప్రేమాకర్షణ' వంటి భ్రమలు చిత్తమును చేరుచున్నాయి. యౌవనదశలో ఆ జీవుడు బాల్య క్రీడలను “ఆ..! అవన్నీ నా భ్రమే కదా!" అని అనుకుంటూనే వర్తమానంలోని ‘ప్రేమాధిక్యత’ అనే భ్రమలో మునిగి తేలుతూ ఉంటాడు. క్రమంగా మరికొంత కాలానికి మధ్య వయస్సులో... యౌవన సంబంధమైన ప్రేమను ఉద్దేశించి... "ఆహా! అదంతా భ్రమే కదా!” అని తలచుచూనే వర్తమానంలోని “ధనధ్యాస, సంఘ గౌరవం” వంటి భ్రమలో ప్రవేశిస్తూ ఉంటాడు.
ఈ విధంగా ఈ జీవుని పట్ల నిరంతరం ఒక భ్రమ తొలగి మరొక భ్రమ చోటు చేసుకోవటమే ఈ సంసారం యొక్క లక్షణం కదా! అయితే, ఈ జీవుడు స్వతహాగా శుద్ధజ్ఞాన స్వరూపుడు అయి ఉండి కూడా 'భ్రమపరంపరలు' అనే ఆవరణచే ఆవరించబడి ఉన్నాడు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. తమతోటి 'సంవాదం' అనే ఈ భ్రమ ఇతఃపూర్వపు నిరంతరాభ్యాసముచే జనించి ఉన్న భ్రమను చాలా వరకు జయించివేసింది. ఈ జీవుడు పొందే రెండు భ్రమలలో ఏది బలవత్తరమైతే, అది రెండవదానిని జయించి వేయటం ప్రతివారికీ దైనందినానుభవమే కదా!
కనుక, ఓ మునీంద్రా! ఒక ఇష్టమైన వస్తువును కోరుకునే వారికి ఆ వస్తువు గురించి తెలిసి ఉన్నవారు అత్యంత ప్రియులు అవుతారు కదా! అట్లాగే, ఈ అజ్ఞాన జనిత సంసార భ్రమ తొలగాలంటే ఉత్తమ గురువు యొక్క ఉపదేశమును ఆశ్రయించి మరల మరల అభ్యసించటం తప్పించి వేఱే ఉపాయమేమున్నది? దృఢమైన అహంభావ రూపం, అనాది అయినట్టి అజ్ఞాన భ్రమ - శ్రవణ మననాది జ్ఞానరూప విచారణ చేత, తదభ్యాసం చేత తప్పకుండా శమిస్తుంది కదా! మరి, అభ్యాసము యొక్క ప్రభావం అంతటిది!
హే మహర్షీ! నేను మీకు శిష్యురాలనై మిమ్ములను శరణు వేడుచున్నాను. అజ్ఞానకారణంగా అబలను. బాలను. అయితే, నా యొక్క అభ్యాసవశం చేతనే ఈ శిలాంతర్గమైన జగత్తును వీక్షిస్తున్నాను. తమరు సర్వజ్ఞులగు గురువులు అయినప్పటికీ కూడా ఈ శిలయందు 'జగద్దర్శనం' అనే అభ్యాసం లేకపోవటం చేతనే నాకు కనబడుచున్న జగత్తు మీకు అగుపించటం లేదు.
ఆహా! ‘అభ్యాసం’ యొక్క ప్రభావం ఎట్టిదో మీకు తెలిసినదే కదా! అభ్యాసవశం చేత అజ్ఞాని జ్ఞాని అగుచున్నాడు. అభ్యాస బలం చేత గొప్ప పర్వతం కూడా మెల్లమెల్లగా పిండి పిండిగా అగుచున్నది. అభ్యాస ప్రభావం చేత ఒక విలుకాడు సుదూరంగా ఉన్న సూక్ష్మమైన లక్ష్యాన్ని బాణంతో ఛేదించగలుగుచున్నాడు. మహాదృఢం, మిథ్య అయినట్టి 'అజ్ఞానం' అనే మహమ్మారి కూడా తత్త్వ విచారణ రూపమైన అభ్యాసం చేత శమించిపోతుంది. అభ్యాసవశం చేతనే కొందరు కారపు వస్తువును చప్పరించి మహదానందంగా మ్రింగుచున్నారు. చేదు వస్తువును కొందరు ఇష్టంగా నములుచున్నారు. తీపి అయిన వస్తువు మధురంగా ఉండటానికి అభ్యాసమే కారణం. అభ్యాసవశం చేత కొంచెం కూడా పరిచయం లేని క్రొత్త వ్యక్తి కొన్నాళ్ళకు అతి సన్నిహితుడైన మిత్రుడుగా అగుచున్నాడు.
అబంధుః బంధతామేతి నైకట్యాభ్యాస యోగతః ।
యాతి అనభ్యాసతో దూరత్ స్నేహో బంధుషు తానవమ్ ॥
Page:46
అట్లాగే, వర్తమానంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు మొదలైన బంధువులు అభ్యాస రాహిత్యం కారణంగా కొద్దిరోజులు దూరంగా ఉండటం చేత ఒకరి గురించి మరొకరు స్నేహభావం కోల్పోతున్నారు. శుద్ధ చిదాకాశమగు సూక్ష్మ శరీరం స్వకీయ భావనాభ్యాసంచేత స్థూలత్వం (భౌతికరూపం) సంతరించుకుంటోంది.
అభ్యాసం యొక్క ప్రభావం ఇంతా అంతా కాదు. ఒక స్థూల శరీరధారి కూడా ‘ప్రాణాయామం’ మొదలైన అభ్యాసం చేత, ధారణ చేత, పక్షివలె ఆకాశంలో ఎగురగలుగుచున్నాడు.
పుణ్యాని యాన్తి వైఫల్యం, వైఫల్యం యాన్తి మాతరః ।
భాగ్యాని యాన్తి వైఫల్యం, న అభ్యాసస్తు కదాచన ॥
ఓ మునీంద్రా! గొప్ప పుణ్యం నిష్ఫలం కావచ్చునేమో! తల్లి కూడా బిడ్డను ద్వేషించవచ్చునేమో! సిరులు, భాగ్యాలు నిరుపయోగం కావచ్చునేమో! కాని అభ్యాసం మాత్రం ఎన్నటికీ నిష్ఫలం కాదు.
దుస్సాధ్యాః సిద్ధిమాయాన్తి రిపవో యాన్తి మిత్రతామ్ ।
విషాని అమృతతాం యాన్తి సంతతాభ్యాసయోగతః ॥
నిరంతరమైన అభ్యాసయోగం చేత దుస్సాధ్యాలగు కార్యాలు కూడా సుసాధ్యం అవుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విషం కూడా అమృతంగా అవగలదు. కాబట్టి, ఒకడు “నాకు అదంటే ఇష్టం. అయితే అది పొందటానికై అభ్యాసం కొఱకు మాత్రం నేను సిద్ధం కాను”... అని అనుకుంటే అతడు మూర్ఖుడే అవుతాడు. వంధ్య తన పుత్రుని ఎప్పటికీ పొందలేదు. అభ్యాసం లేకుండా అభిలషించేవాడు అభిలషిత వస్తువును ఎప్పటికీ పొందలేడు. అభ్యాసం లేకుండా అభిలషించటమనేదే ఈ సంసార జీవుని దౌర్భాగ్యం.
మృత్యు పర్యంతమూ ప్రతి జీవునికీ 'బ్రతికి ఉండాలి’ అనే అభిమతం ఉంటుంది. అయితే, యోగులు తమ అభ్యాసం చేత యుక్తిపూర్వకంగా మృత్యు భయాన్ని తొలగించుకొని ఉంటారు.
కొందరు ధన-దారాదులు అతి ప్రియంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైరాగ్యాభ్యాసం చేత వాటి పట్ల గల అభినివేశాన్ని యుక్తిపూర్వకంగా త్యజించగలుగుచున్నారు. యోగ్యాభ్యాసం చేత వాటి నుంచి వచ్చే మనోవ్యాకులతను దూరం చేసుకోగలుగుచున్నారు.
ఆహా! ఏం ఆశ్చర్యం! ప్రతి మానవునికి అన్నింటికంటే తనంటే తనకే ఇష్టం కదా! ప్రతి ఒక్కరికీ అత్యంత ఇష్టమైన వస్తువైన ‘ఆత్మజ్ఞానం’ అనే అభ్యాసాన్ని త్యజించి కొందరు మనుజాధములు దేహాదులందలి అహంభావం అనే అరిష్ట వస్తువును ఆశ్రయించి అందుకు ఫలితంగా ఒక దుఃఖం నుండి మరొక దుఃఖం వైపుగా పయనిస్తూనే పోవుచున్నారే!
తరంతి సరితం స్ఫీతాం సంసార అసార సేవినః ।
త ఏవ ‘ఆత్మ విచారాఖ్యమ్' అభ్యాసం న త్యజన్తి యే ॥
'ఈ సంసారం అసారం' అనే వివేకమును ఆశ్రయించి ఎవరైతే 'ఆత్మవిచారణ' అనే అభ్యాసమును త్యజించకయే ఉంటారో... వారు మాత్రమే ఈ విశాలమైన 'మాయ'ను దాటివేయగలుగుతారు. చీకట్లో 'కుండ' ఎక్కడున్నదో తెలుసుకోవాలనుకుంటే గుడిసెలో దీపం వెలిగించి చూస్తేనే... కుండ కనబడుతుంది కదా!
Page:47
శ్రవణము-మననము మొదలైన రూపమైన నిరంతరమైన శ్రద్ధతో కూడిన అభ్యాసములచే మాత్రమే సాధకుడు నిర్విఘ్నంగా ఆత్మ వస్తువును దర్శించగలుగుతాడు. కల్పవృక్షం ఏది కోరితే అది ప్రసాదించగలదు. 'ఆత్మవిచారణ' అనే చిరకాల అభ్యాసంచే అతి దుర్భరమనిపించే ఇంద్రియ విషయ జనితములైన రాగ-ద్వేషములను విజ్ఞులు క్రమంగా జయించివేస్తున్నారు. సూర్యుడొక్కడే సమస్తమునూ ప్రకాశింపజేస్తున్నట్లు... ‘అభ్యాసం’ అనేదే సర్వ అజ్ఞానాంధకారాలనూ పటాపంచలు చేయగలదు.
ఈ 14 లోకాలలో ఏ జీవునికైనా ఏదైనా సరే, అభ్యాసం లేకుండా లభించడమే లేదు. అభ్యాసాలలోకెల్లా ఉత్తమ ప్రయోజనం కలిగించేది 'ఆత్మవిచారణ' అను అభ్యాసమే కదా! దానినే ‘పురుష ప్రయత్నం' అని కూడా అంటారు. అది తప్పితే ముక్తికి వేరే స్థానము-మార్గము ఏమున్నది? ఎవరికైనా సరే, ‘దృఢాభ్యాసము' అనే స్వప్రయత్న రూపమైన కర్మచే మాత్రమే మోక్షసిద్ధి లభిస్తోంది. అంతకుమించి వేరు త్రోవలేదు.
ఓ మునీంద్రా! 'అభ్యాసము'ను ఆశ్రయించే జితేంద్రియునికి లభించని-సిద్ధించని పదార్థం ఎక్కడా ఏదీ లేదు, ఉండజాలదు. అటువంటి అభ్యాసం చేతనే కొండగుహలలో ఏకాంత ప్రదేశంలో కూడా కొండచిలువ అభయరూపంగా ఉండగలుగుతోంది.
విద్యాధరి : హే మహర్షీ! ఈ జీవుడు అభ్యాసవశం చేతనే భ్రమమాత్రమగు ఈ స్థూల దేహభ్రాంతిని పెంపొందించు భ్రమలో చిక్కుకొని ఉంటున్నాడు. అట్టి భ్రమ ఏకానేక దుఃఖపరంపరలకు దారి తీస్తోంది. దేహాదుల పట్ల, బంధుమిత్ర వ్యవహారముల పట్ల ఏర్పడిన 'స్థూల దేహభ్రాంతి' అనేది సమాధి యొక్క దృఢాభ్యాసం లేకపోతే తొలగదు. సూక్ష్మభావం కలుగదు. అందుచేత, నిర్మలమగు పరమాత్మయందు సర్వజ్ఞత్వం కలుగటానికిగాను మనమిద్దరం సమాధిని అభ్యాసం నిర్వర్తించెదం గాక! అప్పుడు గాని, ఈ శిలలో ఉన్న జగత్తు ప్రకటన కాదు.
⌘
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విద్యాధరి యొక్క యుక్తియుక్తమైన వాక్యములు విన్న నేను అప్పుడు పద్మాసనం వైచుకొని సమాధికై ఉద్యుక్తుడను అయ్యాను. క్రమంగా సమస్త పదార్థములకు సంబంధించిన భావనను త్యజించివేశాను. 'నిర్మల చిత్'ను మాత్రమే భావన చేయసాగాను. క్రమక్రమంగా ఆ సమయంలో నా దృష్టిలో ఏర్పడి ఉన్న స్థూల దేహసంబంధమైన భావన సంస్కారాలను మొదలంట త్యజించివేసాను. అట్టి చిదాకాశరూపాన్ని పొందటంచేత నేను 'దివ్యదృష్టి’ని సంతరించుకున్నాను. అట్టి సత్యమగు 'పరమాత్మ' యొక్క దృఢాభ్యాసం చేత దేహసంబంధమైన ఆధిభౌతిక భ్రాంతి పూర్తిగా శమించింది. ఉదయాస్తమయ రహితం, నిత్యస్వయం ప్రకాశం, నిర్మలము అగు మహాచిదాకాశము నాకు ప్రకటనమయింది.
Page:48
అప్పుడు 'నిజసాక్షిచైతన్యము' యొక్క నిర్మల తేజముచే అంతకుముందు కనిపించిన శిలవైపు మరల చూచాను. అప్పుడు నాకు శిల కనిపించలేదు. ఆకాశమూ కనిపించలేదు. అంతా కూడా పరమాత్మమయంగా కనిపించింది.
పరమార్థఘనం స్వచ్ఛం తత్ తథా భాతి తాదృశమ్ ।
తధా భావనయా హి ఆత్మా మదీయో దృష్టవాంస్తథా ॥
నా ఆత్మయే ఆ శిలారూపంగా కూడా భాసించుచున్నట్లు అనుభవమైంది. అంతే కాకుండా, నా ఆత్మయే తన యొక్క “శిలాభావన"చే శిలను గాంచుచున్నదని అనుభవమౌతోంది.
శ్రీరాముడు : మహాత్మా! ఆశ్చర్యంగా ఉన్నదే! మీ ఆత్మయే ఇటు ద్రష్టగాను - అటు దృశ్యవిభాగమగు శిలగాను అనుభవమగుచున్నట్లు మీకు అనుభూతమగుచున్నదా! ఇది యుక్తియుక్తమేనా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎందుకు యుక్తియుక్తం కాదు? దృష్టాంతానికి ఒక స్వప్నద్రష్టకు స్వప్నంలోని గృహంలో చూడబడిన శిల స్వప్నద్రష్ట యొక్క చైతన్యరూపమే కదా! అట్లాగే, స్వతఃసిద్ధం - నిర్మలం అగు స్వస్వరూపచైతన్యమే అచ్చట కూడా శిలారూపంగా స్ఫురిస్తోంది.
ఒకడు జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా కూడా ఆ ఇరువురికి స్ఫురించేది, అనుభవమయ్యేది కూడా చైతన్యమే. "స్వకీయ చైతన్యమే ఆ ఇరువురిపట్ల అట్లు ఆ రూపమున స్ఫురిస్తోంది” అనునది ఆత్మజ్ఞానసారం.
ఇక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న భేదమేమి అంటావా? స్వప్నం కనుచున్న ఒకానొకడు ఆ స్వప్నంతో ఉంటూనే “ఇప్పుడు నాకు మెలుకువ వచ్చింది" అని తలచుచూ ఆ స్వప్నంలోనే మరొకరూపం ధరించటం ఎటువంటిదో... అజ్ఞానదశలోనే ఉండి "నేను ప్రబుద్ధుడను అయ్యాను” అని తలచు స్థితి అటువంటిది. ఎందుకంటే శాస్త్ర శబ్దమాత్ర జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. “అంతటా నా స్వరూపమే తాండవిస్తోంది"... అను సుస్పష్టమైన ఘనీభూత అనుభవమే జ్ఞానం.
ఏ జీవుడు తన సర్వాంతర్యామి స్వరూపమును గమనించక “నేను ఆత్మ స్వరూపుడనే” అని పెదవులతో మాత్రం చెప్పుతూ ఉంటాడో, అట్టివాడు అట్లు ఉచ్చరించి కూడా ఏం ప్రయోజనం? స్వప్నంలో శిరచ్ఛేదం జరిగినప్పటికీ ఆ స్వప్నద్రష్ట జాగ్రత్తుకు రానంతవరకు స్వప్నంలోనే ఉంటూనే ఉంటాడు కదా! అట్లాగే, ఘనమైన “అజ్ఞానరూప నిద్ర" లో ఉన్నవాడు అజ్ఞాన మూలం తొలగించుకొన్నపుడు మాత్రమే "జ్ఞానరూప జాగ్రత్" కలుగగలదు.
ఇక భౌతికమైన జాగ్రత్ నిజమైన జాగ్రత్ కాదు.
బోధః కాలేన భవతి మహామోహవతామసి ।
యస్మాత్ న కించనాపి అస్తి బ్రహ్మతత్త్వాదృతేఽక్షయమ్ ॥
ఎందుకంటే... వాస్తవానికి జాగ్రత్-స్వప్నముల ఉభయములోనూ అక్షయమగు 'బ్రహ్మ తత్త్వము’ తప్పించి మరింకేమి లేదు. జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా తాను తెలిసిగాని, తెలియక గాని జగత్తుగా చూస్తున్నది తన ఆత్మస్వరూపమునే!
ఈ కారణం చేత “నిర్మలము, చిద్ఘనము" అగు చిదాకాశమే శిలాకారంగా అక్కడ నాకు కనిపించింది. అంతేకాని, ఆధిభౌతిక శిలాకారంగా కాదు.
Page:49
సృష్ట్యాది యందు ఏ “శుద్ధ పారమార్థిక బ్రహ్మస్వరూపం” ఉన్నదో అదియే సమస్త పదార్థముల యొక్క రూపమై ఉన్నది. అదియే తత్త్వజ్ఞులకు ధ్యాన లభ్యమగుచున్న అంతిమ సాక్షాత్కారం కూడా!
ఓ రామచంద్రా! “అనాది, శాశ్వతం” అగు బ్రహ్మస్వరూపమే ఈ సమస్త ప్రాణుల యొక్క యథార్థ రూపమై ఉన్నది. అదియే ఇప్పుడు అజ్ఞానులచే “మనోరాజ్యం” అని, “సంకల్ప నగరం” అని, “సంసారం” అని, “జగత్తు” అని చెప్పబడుతోంది.
బ్రహ్మచైతన్యము యొక్క మాయతో కూడిన జగత్ సంస్కార సహితమగు పరమార్థ సత్తావిభాగమే “సూక్ష్మ శరీరం” అని శాస్త్రములచే పిలువబడుతోంది. అంతేకాదు. అపరోక్ష రూపమగు “శుద్ధచిత్ అంశ”యే “ఆది” అగు “చిత్ స్వరూప ప్రకాశము” అని చెప్పబడుతోంది. ప్రతి జీవి కూడా స్థూల రూపుడు కాదు, సూక్ష్మరూపుడూ కాదు. అతడు “ఆది”యగు చిత్ స్వరూప దేహుడేనయ్యా!
ఆ చైతన్య సత్తారూపమే...
↳ ఈ సృష్ట్యాదిలో ఉదయించుచున్న దాని వలె ఉంటోంది.
↳ అదియే మొట్ట మొదటి సృష్టి యొక్క అధ్యక్ష రూపం అనతగు “సమష్టి జీవుని యొక్క మనో శరీరం” అని చెప్పబడే హిరణ్యగర్భ శరీరమగుచున్నది.
↳ అదియే బుద్ధియొక్క మాంద్యం చేత తన సమష్టి భావనను కూడా మరిచి వ్యష్టిత్వమును ఆపాదించుకొంటోంది.
↳ అదియే సర్వ జీవులలో ప్రత్యక్షమై ఉంటున్న మనస్సు.
ఈ ప్రకారంగా “చిత్” స్వరూపం స్వయంగా సమష్టి రూపం పొందినట్లున్నదగుచున్నది కదా! అట్టి సమష్టి రూపానుభవమునే “యోగిమనః ప్రత్యక్షం" అంటారు. ఆ సమష్టిలో ఒక అల్ప విభాగం అనతగు వ్యష్టియొక్క అనుభవమును 'సామాన్యమనః ప్రత్యక్షం' అంటున్నారు.
అనగా, 1.) “యోగి మనః ప్రత్యక్షం”గాను, 2.) “సామాన్య మనః ప్రత్యక్షం”గాను అగుచున్నది ఆ చిత్ సత్తాయేగాని మరొకటేదీ కాదు. అట్లా, యోగి మనః ప్రత్యక్షత్వం (సమష్టి) సామాన్య మనః ప్రత్యక్షత్వం (వ్యష్టిత్వం) అను రెండూ కూడా అజ్ఞానం చేతనే ఏర్పడుచున్నాయి.
ఓ రామచంద్రా! అట్లా, వ్యష్టి స్థూల శరీరాది మనః ప్రత్యక్షంగా ఏది కనబడుతోందో... అది అసద్రూపమని గ్రహించు. ఇక సమష్టి సూక్ష్మ శరీరాది యోగ ప్రత్యక్షంగా కనిపించేదే ముఖ్య ప్రత్యక్షమని గ్రహించు.
ఆహాఁ! పరమాత్మ యొక్క మాయ ఎంత చిత్రమైనది. ముఖ్యమైనట్టి సమష్టి మనస్సు యొక్క ప్రత్యక్షము పరోక్షంగా కనిపిస్తోంది. అత్యంత కల్పితము అయినట్టి వ్యష్టి మనస్సు యొక్క ప్రత్యక్షము ఎదురుగా నిజమై ఉన్నట్లుగా భ్రమింపజేస్తోంది కదా!
ఓ రామచంద్రా! మొట్ట మొదటి చైతన్యంలో సూక్ష్మ శరీరం ప్రత్యక్షం అవుతోంది. అందుచేత, అట్టి సూక్ష్మ శరీరమే (అతివాహక దేహమే) సత్యమని, సర్వ వ్యాపకమై ఉన్నదని గ్రహించు. ఇక ఈ భౌతికమగు స్థూల దేహమంటావా... ఇది మిథ్య మాత్రమే సుమా! బంగారు ఆభరణంలో ఆభరణం అతి స్పష్టంగా కనిపించవచ్చు గాక! బంగారమునకు వేరై 'ఆభరణము’ అనేది ఎక్కడున్నది చెప్పు? ఆ ఆభరణంగా కనిపించేదంతా బంగారం కాక మరింకేమి కాదు కదా! అట్లాగే, సూక్ష్మ శరీరము యొక్క "ఆధి భౌతికత్వము” అనేది వాస్తవానికి లేదు.
శ్రీరాముడు : ఈ భౌతిక శరీరము మిథ్య మాత్రమేనని మీరు ప్రవచిస్తున్నారు. కాని, భౌతిక శరీరం అగుపిస్తోంది కదా! కళ్ళకు కనిపించేది అసత్యమని ఎట్లా అనటం?
Page:50
శ్రీ వసిష్ఠ మహర్షి : కళ్ళకు కనిపించినంత మాత్రం చేత నిజమా? కనిపిస్తూ కూడా సత్యం కానివి అనేకం ఉన్నాయి. దూరం నుంచి కొండ నునుపుగా కనిపించువచ్చు గాక! అది వాస్తవమా? జలంలో తరంగాలు ఉండటమేమిటి? జలమే తరంగాలుగా కనిపిస్తోందిగా? “దిక్కులు” అనేవి భూమిసూర్యుల ఉనికిచే కల్పించబడినవి మాత్రమే కదా! శూన్యాకాశం నీలంగా కనిపిస్తున్నప్పటికీ, అక్కడ నీలత్వమున్నదా? ఆహాఁ! ఈ జనుల యొక్క మూఢత్వం ఏమని చెప్పాలి? తత్వవిచారణ లేకపోవటం చేతనే జీవుడు భ్రమను అభ్రమగాను, అభ్రమను భ్రమగాను గాంచుచున్నాడు కదా!
ఆధి భౌతిక దేహోఽయం విచారేణ న లభ్యతమే ।
ఆతివాహిక దేహస్తు కిల లోకద్వయే అక్షయః ॥
“ఈ భౌతికదేహం ఉంటేనే నాకు ఉనికి, ఇది లేకపోతే నాకు ఉనికి లేదు" అని ఈ జీవుడు ఎందుకో భ్రమిస్తున్నాడు? స్వప్నంలో కూడా (స్థూలదేహం వినియోగపడుచుండనప్పటికీ) శబ్ద-స్పర్శ-రూపాదులతో కూడిన అనుభవం ఉంటోంది. భౌతికదేహం ఉపయోగించబడకుండానే అది ప్రాప్తిస్తోంది కదా! కనుక, భౌతికదేహం లేకపోయినప్పుడు కూడా “అనుభవం” అనునది కొనసాగుచూనే ఉంటుంది. అసలు, విచారణ చేసి చూస్తే “వాస్తవానికి భౌతికదేహం లేదు” అని గ్రహించబడగలదు.
శ్రీ రాముడు : మరి అతివాహిక (సూక్ష్మ) దేహమో?
శ్రీ వసిష్ఠ మహర్షి : సూక్ష్మ శరీరం మోక్షపర్యంతం ఈ ఇహ-పర లోకాలలో తిరుగాడుతూనే ఉంటుంది.
శ్రీరాముడు : మహర్షీ! “సూక్ష్మ శరీరోపహితమైన చైతన్యమునందు ఈ స్థూల రూపత్వం ప్రకటితమౌతోంది” అని అనవచ్చా?
శ్రీ వసిష్ఠ మహర్షి : సూక్ష్మ దేహంలో ఏ ఈ స్థూల దేహత్వం కనిపిస్తోందో... అది ఎండమావులలో కనిపించే జలతరంగాల వలె కేవలం భ్రమ (లేక) మిథ్య మాత్రమే! చీకట్లో రాయిని చూచి ఎవరో కూర్చొని ఉన్నట్లు భ్రమ కలుగుతోంది చూచావా? కంటి దోషము చేత రెండవ చంద్రుడు అగుపిస్తాడే! అవన్నీ భ్రమయొక్క అభ్యాసం చేత క్రమంగా ఘనీభూతమై ప్రాప్తిస్తున్నట్లే... స్థూల శరీరమునకు సంబంధించిన దృఢ సంస్కారంచే స్థూల బుద్ధి ప్రౌఢత్వం చెందినదై ఉంటోంది. స్థూల శరీరత్వమనేది మిథ్య. మాయా జనితము మాత్రమే అయినప్పటికీ... అది అభ్యాసవశంగా ఏర్పడి ఉంటోంది.
యత్ అసత్... తత్ కృతం సత్యం, యత్ సత్యం... తత్ అసత్ కృతం ।
అహో ను మోహమహాత్మ్యం! జీవస్య అస్య అవిచారజం ॥
ఆహాఁ! అవివేకంచే ఉత్పన్నమౌతున్న ఈ జీవుని మోహము యొక్క మాహాత్మ్యం ఎంతటిది! అతడు అసత్తును సత్తుగాను, సత్తును అసత్తుగాను గాంచుచున్నాడే!
ఏది ఏమైనా... యోగుల యొక్క సూక్ష్మ ప్రత్యక్షమే (యోగులకు అనుభవమయ్యే సర్వ వ్యాపకమగు సూక్ష్మ దేహానుభవమే) సత్యం.
ఇక ఈ మనోస్పందము మాటేమిటంటావా? అది కించిత్ సత్యంగా చెప్పబడుతోంది. ఎందుకంటే, ఈ ఇహ-పర ఉభయ లోకముల యొక్క వ్యవహార సిద్ధికి 1.) సూక్ష్మ (సర్వగతమైన) శరీర స్ఫూర్తి, 2.) మానసిక చేష్ట... ఈ రెండింటి చేతనే అగుచున్నది కదా!
Page:51
ఓ రామచంద్రా! ప్రత్యక్షము అనేది రెండు రకములు. అవి - 1.) స్థూల శరీర ప్రత్యక్షము, 2.) సూక్ష్మ శరీర ప్రత్యక్షము. మొదటిది భ్రమ. రెండవది సత్యం.
ఎవడైతే “ఆది” అనతగు “సూక్ష్మ శరీర ప్రత్యక్షము”ను వదలి “ఈ స్థూల దేహ ప్రత్యక్షమే సత్యం” అను బుద్ధి కలిగి ఉంటాడో... అట్టి వాడు మృగతృష్ణాజలం త్రాగి సుఖంగా ఉన్నవాడే అగుచున్నాడు. బంగారమును వదలి ఆభరణము స్వీకరించువాడు అవుతాడు.
శ్రీరాముడు : మహాత్మా! ఈ జీవుడు స్వతహాగా సర్వగతమగు సూక్ష్మదేహి అయి కూడా, మరి స్థూల శరీర స్వభావం (భౌతిక దేహమే నేను అను పరిమిత / సంకుచిత తత్త్వం) అనే భ్రష్టత్వమునకు ఎందుకు లోను అగుచున్నాడు?
శ్రీ వసిష్ఠ మహర్షి : జీవునిలో ఎప్పుడో అజ్ఞానంతో కూడిన “సుఖాశ” ప్రవేశించటంచే అతడు క్రమంగా స్థూల దేహ పరిమితత్వం ఆశ్రయించటం, స్వస్వరూప సర్వగతత్వం ఏమరచటం జరుగుతోంది. అయితే...
యత్ సుఖం దుఃఖమేవాహుః క్షణనాశానుభూతిభిః ।
అకృత్రిమమ్ అనాద్యన్తం యత్సుఖమ్ తత్సుఖం విదుః ॥
ఈ దేహములోని పంచేంద్రియములకు సంబంధించిన విషయ సుఖం క్షణభంగురమైనదని వివేకులు గమనించుచున్నారు. అందుకే, వారు విషయ సుఖంగా కనిపించుచున్న దానిని "ఇది దుఃఖము కొఱకే” అని చెప్పుచున్నారు. ఇంకా, “సహజము - అనాది - అనంతము అగు ఆత్మజ్ఞాన జనిత సుఖమునే వాస్తవమైన సుఖం" అని గమనిస్తున్నారు.
✤✤✤✤
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ప్రియ జనులారా!
ప్రత్యక్షేణైవమ్ అధ్యక్షం ప్రత్యక్షం ప్రవిచార్యతామ్ ।
యదాద్యం తతసత్ అధ్యక్షం తత్ప్రత్యక్షేణ దృశ్యతామ్ ॥
మీరంతా "సూక్ష్మ శరీర ప్రత్యక్షము" చేతనే అధ్యక్ష రూపమగు “సాక్షి చైతన్య ప్రత్యక్షము” గురించి విచారణ చేయాలి. సమస్తమునకు 'ఆది' అయినట్టి సాక్షిచైతన్య ప్రత్యక్షమును శుద్ధమగు సూక్ష్మ చైతన్య ప్రత్యక్షముతో దర్శించాలి సుమా!
నాయనలారా! మూడు లోకముల అనుభవమును ప్రసాదించగల మీ యొక్క సూక్ష్మ చైతన్య ప్రత్యక్షమును వదలి, 'ఐహికము - మాయా స్వరూపం' అయినట్టి ఈ స్థూల శరీరాది ప్రత్యక్షమును ఎవడు గ్రహిస్తాడో,... అతడి కంటే తెలివి తక్కువవాడు మరొకడు ఉండడు.
ఓ రామచంద్రా! వాస్తవానికి ఈ జీవులకు సూక్ష్మ శరీరం మాత్రమే ఉన్నది. అందులో స్థూల శరీరం గురించిన వ్యాప్తి ఉండటమనేది అసత్యమైన పిశాచం ఆవహించటం వంటిది. మొదలే ఉత్పత్తి కానిది, సంకల్పానుసారంగా అనుభవమయ్యేది అగు స్థూలదేహ ప్రత్యక్షం సత్యమెట్లా అవుతుంది. అంతేగాక, స్వయంగా అసత్యమైనవి అర్థ-క్రియ-సామర్థ్యం ఎట్లా కలిగి ఉంటుంది?
Page:52
ఈ స్థూల దేహ ప్రత్యక్షం యొక్క ఉపకరణములు అనతగు ఈ కళ్ళు-చెవులు మొదలైనవే యోగుల దృష్టిలో అసత్యాలై ఉండగా... ఇక వానిచే ప్రాప్తిస్తున్న తదితర విషయాల గురించి వేఱే చెప్పేదేమున్నది? అసత్యమగు పదార్థములచే సిద్ధించేదంతా అసత్యమేగాని, సత్యమెట్లా అవుతుంది? ఈ విధంగా ప్రత్యక్షములైయున్న చెవులు - చర్మం - కళ్ళు - నాలుక - ముక్కు అసత్యములై ఉండగా, వాటి విషయములైన శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములనే అనుమానముల గురించి ఇంకేమి చెప్పాలి. ఎచ్చట పెద్దపెద్ద ఏనుగులే కొట్టుకుపోతున్నాయో అచట గొఱ్ఱెల గురించి చెప్పేదేముంది?
అందుచేత రామచంద్రా! ఎదురుగా సిద్ధించుచున్న ఈ దృశ్యం మొదలే లేదు. ఏది ఉన్నట్లుగా భాసించుచున్నదో... అది సద్రూపమగు సాక్షి చైతన్యము కంటే వేరు కాదు. కనుక, "దృశ్యంగా కనిపించేదంతా మహాచిద్ఘనమగు బ్రహ్మమే" అను ఎఱుకను భద్రపరచుకొని ఉండు.
శ్రీరాముడు : స్వామీ! ‘ఈ దృశ్యం లేదు' అని ప్రవచిస్తున్నారు కదా! మరి ఎదురుగా ఆ శిల ఉన్నది. అది శిలగా మీకు-నాకు కూడా కనిపిస్తోంది కదా! ఎదురుగా కనిపించేది లేదని గ్రహించటమెట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఒకనికి కలలో ఒక పర్వతం కనిపిస్తోందనుకో. అతనికి అది సత్యము వలెనే తోచుచున్నది. అయితే వాస్తవానికి అతనికి కనిపించిన పర్వతం శూన్యమే కదా!
1.) స్వప్నే ద్రష్టుః ఖమేవ - అద్రిః - గృహే - నాఽన్యస్య వై యథా ॥
ఆ ప్రక్కనే మెళుకువతో ఉన్న అతని బంధువునకు అతనికి కనిపించిన పర్వతం శూన్యం - భ్రమ - ఊహా మాత్రం కాదా! స్వప్నంలో కనిపించిన ఆకాశం, కొండ ఇల్లు ఒకే భ్రమచే కల్పించబడినవే కదా! అట్లాగే,
2.) తథా తద్భావనవతోరావయోః సా శిలైవ చిత్ ॥
శిలా భావంతో కూడుకొని ఉన్న మన ఇద్దరికీ ఆ ఎదురుగా కనబడేది శిలగానే కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి అది చిద్రూపమే అయి ఉన్నది.
"ఇది పర్వతం - అది ఆకాశం - ఇది జగత్తు - అది నేను” ఈ మొదలైన రూపములతో చిదాకాశము-చిన్మయము అగు ఆత్మయే తనయందు అట్లట్లుగా స్వయంగా భాసిస్తోంది. ఎందుకంటావేమో! దీనినంతా ప్రబుద్ధమగు చైతన్యమే తన యందు అట్లు గాంచుచున్నది. అప్రబుద్ధమైనదేదీ ఎచట కూడా గాంచటం లేదు. కథార్థం వినేవాడికే తెలుస్తుంది గాని, విననివానికి తెలియదు కదా! మద్యం త్రాగిన వారికి నిజంగానే చెట్లు-కొండలు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అట్లాగే, అజ్ఞాన భ్రాంతికి అనేకములుగా కనిపించే జగత్తు సత్యత్వము పొందుతోంది. అనగా, అప్రబుద్ధునికి “ఇవన్నీ ఇట్లు నిజమే కదా”... అని అనిపిస్తోంది.
కనుక, రామచంద్రా! మరల చెప్పుచున్నాను.
యోగులకు ప్రత్యక్షమై, సర్వత్రా అప్రతిహతమై, ఏకమై, బోధ రూపమైనట్టి, “పూర్ణానందైక రసము” అగు చిత్స్వరూపమును గ్రహించకుండా ఎవరైతే తుచ్ఛమగు జగద్రూప ప్రత్యక్షమును ఆశ్రయించి ఉంటారో అట్టి మూఢులు ఆత్మవంచకులు. తృణప్రాయులు. వారి వలన శాశ్వత ప్రయోజనమూ ఉండదు. మనస్సుతో ఆత్మను ఎఱిగినవారే ధన్యులు.
Page:53
ఆ విరామమగు బ్రహ్మము ఈ సమస్త బ్రహ్మాండములూ తన అవయవములుగా కలిగి ఉన్నది. అది ఈ భౌతిక సూర్య చంద్రాదులచేత గాని, భౌతికమైన ఈ కనులకు గాని అప్రకాశితమై ఉంటోంది. అది వాస్తవానికి అదృశ్యము అయినప్పటికీ దృశ్యంగా ఉన్నదంతా అదే! అట్టి నిరామయ బ్రహ్మము సమాధి యొక్క దృష్టిచే అత్యంత స్పష్టంగా కనిపించగలదు సుమా!
అట్టి “చిదాకాశం” అనే గొప్ప అద్దంలో ఈ “పర్వత - నదీ - లోక - లోకాంతరములు, దేహదుల రాక-పోకలు, మనో-బుద్ధ్యాది అంతరంగ విభాగాలు” అనే రూపభ్రమలన్నీ భాసిస్తున్నాయి. అద్దంలో ప్రతిబింబించేవి అద్దంలో స్పృశిస్తున్నాయా? లేదు కదా! ఈ శరీర - మనో - బుద్ధి ధర్మాలు, ఈ జగత్ దృశ్య దర్శ- అదర్శనాలు ఆత్మను స్పృశించజాలవు.
✤✤✤✤
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అప్పుడు ఆ విద్యాధరి అనిరుద్ధమైన (Unstoppable) చేష్ట కలిగినదై అక్కడి శిల యొక్క అంతర్గతమై ఉన్న సృష్టిలో ప్రవేశించింది. నేను కూడా నా యొక్క సంకల్ప సమేతుడనై ఆ సృష్టిలో ప్రవేశించాను. మేమిద్దరం ఆ సృష్టిలోని బ్రహ్మలోకం ప్రవేశించాం. ఆమె భర్త ఉన్న మందిరంలో అడుగిడాము.
విద్యాధరి : హే మునిశ్రేష్ఠా! ఈతడే నా భర్త. నన్ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్వ కాలంలో నన్ను సృష్టించారు. ఇప్పటికి ఆయన ముదుసలి అయ్యారు. అయినా కూడా నన్ను ఇప్పటిదాకా వివాహమాడలేదు. కాబట్టి నాకు వైరాగ్యం కలిగింది. నా ఈ పతి కూడా విరాగి అయినారు. ఈయన "ద్రష్ట - దృశ్యము - శూన్యత్వము” లేనట్టి నిర్మలమైన పదమును పొందాలనే అభిలాషతో ఉన్నారు. ఇప్పుడు ఈ జగత్తుకు మహా ప్రళయం దాపరించినా కూడా పట్టించుకొనే స్థితిలో లేరు. తన ధ్యానమునందే మౌనం వహించి పర్వతమువలె చలించక ఉన్నారు.
కాబట్టి స్వామీ! నన్ను, నా పతిని మీ తత్త్వోపదేశముచే ప్రబోధమొనర్చి పునీతులని చేయమని నా విన్నపం. మహాకల్పము వరకు గల సమస్త సృష్టుల యొక్క మూలభూతమైన బ్రహ్మమునకు మాకు మార్గం చూపండి.
ఓ రామచంద్రా! ఇట్లా ఆ విద్యాధరి నాతో పలుకుచున్నప్పుడు ఆమె పతి సమాధిని ఆశ్రయించి ఉన్నాడు. అప్పుడామె ఆయనతో మంద్రస్వరంతో ఇట్లా పలికింది. “స్వామీ! ఈ రోజు మన గృహం పావనమైంది. మునిశ్రేష్ఠులైన వసిష్ఠ మహర్షి మన గృహానికి వేంచేశారు. వీరు మరొక బ్రహ్మాండానికి ప్రభువైనట్టి బ్రహ్మదేవుని కుమారులు. పూజార్హులు. కనుక, కనులు తెరిచి వీరికి సుస్వాగతం పలకమని ప్రార్థన. వీరిని అర్ఘ్యపాద్యాలతో పూజించండి. మహానీయులను సత్కరించటం వలన ఫలమేమిటో మీకు వేరే నేను చెప్పనక్కర్లేదు కదా!”
వీణవలె మంద్రము-సుమధురము అయిన ఆమె శబ్దజాలాలను విని మహాబుద్ధియగు బ్రహ్మ క్రమంగా స్పందించసాగారు. నిశ్చలజలంలో ఆవర్తంలాగా సమాధి నుండి లేచారు.
Page:54
నెమ్మదిగా కనులు తెరిచారు. దేహమంతా మెల్లగా దృశ్యజ్ఞానం ప్రకటనమైంది. వెంటనే నా వైపు చూచారు. చిరునవ్వుతో ఆయన పెదవులు విచ్చుకున్నాయి. ఇంతలో దేవ-సిద్ధ-అప్సరస సమూహములు అచ్చటకి వచ్చి ఆజ్ఞలకై నిలుచున్నారు.
అన్య జగత్ బ్రహ్మ : అసారమైన సంసారము యొక్క సారభూతమైన 'ఆత్మ'ను కరతలామలకముగా గాంచుచున్న ఓ మునీంద్రా! వసిష్ఠ మహర్షీ! మీకు సుస్వాగతం. జ్ఞానామృత మహాసముద్రుడవగు ఓ మహాత్మా! మీకు సర్వదా శుభమగుగాక! మీ రాకతో మా ఈ బ్రహ్మాండ గృహం పావనమైనది. మీరు చాలా దూరం నుంచి శ్రమపొంది వచ్చారు. రండి! ఇక్కడి ఈ ఆసనంపై సుఖాశీనులు కండు.
రామచంద్రా! అక్కడి గంధర్వ-ముని-విద్యాధరుల స్తోత్రాలకు చిరునవ్వుతో సమాధానం చెప్పాను. అప్పుడు ఆ అన్య జగత్ బ్రహ్మతో ఇట్లు పలికాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : హే మహాత్మా! బ్రహ్మదేవా! మీరు భూత-భవిష్యత్ వర్తమానములకు ప్రభువు. ఈ విద్యాధరీమాత అత్యంత ఏకాంతాకాశ ప్రదేశంలో ఉన్న నన్ను సమీపించి 'జ్ఞానయుక్తములైన వాక్యాలతో మా ఇద్దరికి ఆత్మజ్ఞానం ప్రబోధించాలి' అని కోరింది. ఇది యుక్తమేనంటారా! ఎందు చేతనంటారా? మీరు సకల జ్ఞాన పారంగతులు. సర్వ భూతములకు ప్రభువు. అన్నీ ఎఱిగినవారు. ఇక నేను బోధించగలిగిన దేముంటుంది? ఇక ఈ విద్యాధరి కామదృష్టి కలిగి ఉండటం చేత బోధకు అనర్హురాలు. మరి ఈమె ఆత్మజ్ఞానము కొఱకు నన్ను ఇట్లు ఎందుకు అర్థించిందో మీరే కారణం తెలియజేయ గోరుచున్నాను. అంతేకాదు మరొక ప్రశ్న “నాకు పత్ని కావాలి" - అనే ఉద్దేశంతో మీరు ఈమెను సృష్టించారు. మరి మీరు ఈమెను భార్య స్థానమును ప్రసాదించలేదేమిటి? మఱియు ఈమెకు వైరాగ్యదశను ఎట్లా పెంపొందించారు? ఈ విషయం కూడా నా అర్హతను దృష్టిలో ఉంచుకొని నాకు తెలియజేయవలసినదిగా నా విన్నపం.
అన్యజగత్ బ్రహ్మ : ఓ మునీశ్వరా! ఆ వృత్తాంతమంతా ఉన్నది ఉన్నట్లు తెలియజేస్తున్నాను వినండి. సజ్జనులకు యథార్థం తెలియజేయటం ఉచితం కదా! సర్వమునకు ఆదికారణమైన 'సత్' పదం ఒక్కటి ఉన్నది. అది సర్వదా యథాతథం, జన్మాది రహితం, జరా వర్జితం, చిద్రూపం అయి ఉన్నది. అట్టి 'కేవల చిత్ ప్రకాశం' నుండి అనిర్వచనీయంగా నేను ప్రకటనమయ్యాను. చిదాకాశం నుండి ఉదయించిన నేను కూడా చిదాకాశ రూపుడనే. సదా ఆత్మయందే నెలకొని ఉన్నాను. ఈ ప్రజాసృష్టి విద్యమానమైనప్పుడు నేను ఈ ఈ జనుల దృష్టిలో "స్వయంభువు” అను పేరు కలవాడను అగుచున్నాను. ఇక “నేను-నీవు-నాది-వారు-వీరు మన ఈ పరస్పర సంభాషణ”... ఇవన్నీ కూడా ఏకమగు సముద్రమునందు తరంగ భేదముచే జనించిన శబ్దముల వంటివి మాత్రమే!
వస్తుతస్తు న జాతోఽస్మి, న చ పశ్యామి కించన ।
చిదాకాశశ్చిదాకాశే తిష్ఠామ్యహమ్ అనావృతః ॥
యథార్థానికి నేను ఏ సమయమందును ఉత్పన్నము కానేలేదు. దేనినీ గాంచుటయూ లేదు. నిరావరణుడను. చిదాకాశరూపుడను అగు నేను చిదాకాశమునే స్థితి కలిగి ఉన్నాను.
Page:55
ఈ విధంగా సముద్రజలంలోంచి బయల్వెడలిన తరంగంలాగా ఒకప్పుడు ఒకింత దృశ్య రూపం కలవాడనయ్యాను. కొంతకాలం గడిచింది. కాలవశం చేత మరికొంత స్వరూప విస్మరణం జరిగింది. ఆ కారణం చేత అశుద్ధమైన ఆకృతి కలవాడనయ్యాను. చిదాకాశరూపుడనగు నా యొక్క అంతఃకరణమున స్వభావంగా 'నేను-నాది' అను వాసన ఉదయించింది. అట్టి 'నేను' అనేది పరబ్రహ్మమే! నా దృష్టి యందు 'నేను'గా భాసించేది, 'మీరు' మొదలైన వాటిగా భాసించేది భిన్నం కాదు. కాబట్టి, ఇతరుల దృష్టిలో నేను ఉదయించినట్లుగా ఉన్నప్పటికీ నా దృష్టి యందు చిదాకాశమున ఏదీ ఉత్పన్నము కాకయే ఉన్నది.
నేను నాశరహితమైన సత్తాస్వరూపుడను. ఏ సమయమందునూ దృశ్యరూపంగా ఉదయించనివాడను. ఆత్మస్వభావం నుండి చ్యుతి నొందనట్టి ఆకృతి కలవాడను. స్వాత్మారాముడను. స్వయం ప్రభువువై ఆత్మరూపుడనై ఆత్మయందే నెలకొని ఉన్నవాడను. ఇక ఈ విద్యాధరి అంటారా? ఆమె మీరు అన్నట్లు నా సంకల్పముచే దేవరూపిణి అయి వెలయుచున్నది. ఈమె పూర్వ-పూర్వ అహంకార స్మృతి రూపమగు 'అహం' అను భ్రాంతి, జగతి, వాసన యొక్క అధిష్ఠాత్రి అయిన దేవత!
ఈ విధంగా ఈమె వాసన యొక్క అధిష్టాన దేవతయే గాని ఈమె నా గృహిణి కాదు. గృహిణి కొరకై వాస్తవానికి ఈమెను నేను సృజించలేదు. అనగా, ఈమె నా అంతరంగమున “సర్వజగద్వాసన అయి ఉన్నది. స్వవాసనావశం చేత 'నేను బ్రహ్మదేవుని గృహిణిని' అను భావనను కల్పించుకొని ఉన్నది. అట్టి స్వకీయ కల్పనచే వ్యర్థంగా స్వయంగా దుఃఖమును పొందుచున్నది. ఆమె నా వాసనా స్వరూపమే గాని అందుకు వేరైన రూపమేదీ లేదు. నాకు వేరైనది కాదు.
అన్య జగత్ బ్రహ్మ : ఓ మునీంద్రా! వసిష్ఠ మహర్షీ! ఇప్పటి వరకు అతి దీర్ఘకాలం స్వసంకల్పితమైన బ్రహ్మాండ రచనను నా వాసనా ప్రభావం చేత ఆస్వాదించాను. అనుభవించాను. ఇక ద్విపదార్థాంత కాలం సమీపిస్తోంది. నాకు ద్వితీయమైనదిగా పొందబడినదంతా ఉపసంహారం చేయబోతున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ ద్వితీయ రచన అయిన బ్రహ్మాండమును ఉపసంహరించి ఏం చేయాలనుకుంటున్నారు?
అన్య జగత్ బ్రహ్మ : స్వయంకల్పితమైన ద్వితీయత్వమును ఉపసంహరించి అద్వితీయత్వం సంతరించుకోబోవుచున్నాను. అనగా, "చిద్వివర్త రూపం, చిన్మయమైనట్టి చిత్తాకాశరూపం” కలిగి ఉన్న నేను ఈ కల్పితమైన ఆయువు పూర్తి అగుచుండుటచేత సర్వ కల్పనలు త్యజించి తిరిగి "పరము, నిరతిశయానంద రూపం, చిదాకాశం" అయిన కైవల్యస్థితిని పొందదలచుకున్నాను.
కాబట్టి స్వవాసనాకల్పితమైన ఈ జగత్తుకు మహా ప్రళయము సంభవించబోతోంది. మహా ప్రళయం సమీపించటాన్ని పురస్కరించుకొని నేను ఈ (నా వాసనా రూపమే అగు) విద్యాధరిని త్యజించడం మొదలెట్టాను. అందుచేత, ఈమె వైరాగ్యం పొందింది.
Page:56
నేను ఈ చిత్తాకాశత్వమును త్యజించి బ్రహ్మకాశత్వమును పొందిన మరుక్షణం మహాప్రళయం, వాసనాక్షయం సంభవించనున్నది. ఈ కారణం చేతనే ఈ విద్యాధరి విరక్తి చెందినదై నా మార్గమగు "బ్రహ్మ జ్ఞానముచే నిర్విషయస్థితి” వైపుగా పరిణమించ ప్రారంభిస్తోంది. తనను నిర్మించిన వారిని అనుసరించటం వస్తు ధర్మం కదా! ఆభరణత్వం వీడిన ఆభరణం తిరిగి కేవలం బంగారం అవటం యుక్తమే కదా!
ఇప్పుడు చతుర్యుగాలు (కృత - త్రేతా - ద్వాపర - కలి యుగాలు) చివరికి వచ్చాయి. కలియుగ అంతం సమీపించింది. అట్లాగే, ప్రజాపతి - మనువు - ఇంద్రుడు - దేవతలు - కల్పము - మహా కల్పముల సంబంధమైన నా వాసన క్షయిస్తోంది. దేహాకాశం అంతం కానున్నది. సరస్సు ఎండిపోతే కమలం కూడా ఎండునట్లు, తత్సంబంధమైన సువాసనలు కూడా రహితమై పోవునట్లు, నా సర్వ వాసనలు నశించనున్నాయి.
జడమైన సముద్రంలో ఏ కారణం లేకుండానే చంచలమైన తరంగాలు పుడతాయి చూచారా? అభిమానముచే దేహములు ధరిస్తూ వస్తున్న ఈ 'వాసన' యందు ఏ బాహ్య కారణం లేకుండానే స్వభావవశం చేత ‘ఆత్మ దర్శనం' గురించిన ఇచ్ఛ స్వయంగా జనించుచున్నది. నా యొక్క వాసనా స్వరూపమైనట్టి ఈ విద్యాధరి స్వయంగా ఆత్మత్త్వం బోధించగల మిమ్ములను వెతుక్కుంటూ ఈ బ్రహ్మాండం నుండి బయల్వెడలింది. ధర్మ-అర్థ-కామ మోక్షములనే పురుషార్థములను సాధించుట యందు వ్యగ్రులైనట్టి ప్రజలు ఉండే మీ బ్రహ్మాండమును గాంచగలిగింది. ఆకాశ గమనమున తత్పర అయిన ఈమె ఈ జగత్తుకు స్థానభూతమైన లోకాలోక పర్వతంపై గల శిలను చూసింది.
శ్రీ వసిష్ఠ మహర్షి : లోకాలోక పర్వతముపై గల ఆ శిలలో ఈ బ్రహ్మాండం ఏ కారణం చేత, ఎందుకు నిర్మించబడింది?
అన్య జగత్ బ్రహ్మ : అందుకు ప్రత్యేకమైన కారణం అంటూ ఏముంటుంది? మా దృష్టియందు ఆ శిల చిదాకాశరూపమే అయి ఉన్నది. ఆ మాటకు వస్తే ఏ లోకాలోక పర్వతముపై గల ఏ శిలలో ఈ బ్రహ్మాండం ఉన్నదో... అటువంటి బ్రహ్మాండాలు తదితర శిలలలో కూడా ఉన్నాయి. అటువంటి ప్రతి బ్రహ్మాండంలోనూ అసంఖ్యాక పర్వత శిలలు, ఆ శిలలలో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ అనేక బ్రహ్మాండాలు భేద దృష్టి కలవారికి కనిపించవు. ఎప్పుడైతే మనం సమాధిచే ‘బోధైకత్వము’ పొందుతామో అప్పుడు యోగదృష్టిచే ఆ అనేక బ్రహ్మాండములను గాంచగలం. ఏ సమతత్త్వము అంతటా (అన్ని జీవులలోను) సర్వదా అభేద రూపమై ప్రకాశిస్తోందో... దాని దర్శనమే బోధైకత్వం. ఆ శిలలో బ్రహ్మాండము ఉన్నట్లే ఒక ఘటము (కుండ) యందు, వస్త్రమునందు, మఱ్ఱి చెట్టునందు, ఆకాశంలోను, వాయువులోను, అగ్నిలోను, జలంలోను సర్వత్రా సదా అనేక జగత్తులు ఉన్నాయి.
అయితే మహర్షీ! స్వప్న నగరాల వలె ఆ జగత్తులన్నీ కూడా (మిథ్యా-భ్రాంతిచే) ఉన్నదెచట? వాస్తవానికి అవేవీ లేవు. భ్రాంతిచే అనుభవమౌతున్నాయి. అవన్నీ చిద్రూపమే కాబట్టి, చిద్రూపము సత్యమే కాబట్టి, అధిష్ఠాన చిద్రూపముచే అవి సత్యములే అగుచున్నాయి. ఇది ఇట్లా ఉండగా... ఒక జగత్తులోని వారికి మరొక జగత్తు మిథ్యయే అయి ఉన్నది.
Page:57
పరిజ్ఞాతా సతీ యేషామేషా ఛిన్నభసైకతామ్ ।
గతాతే న విముహ్యన్తి శిష్టాస్తు భ్రమ భాజనమ్ ॥
ఎవరైతే ఈ జగన్మాయను “అసత్తు" అని ఎఱుగుతారో వారికి ఈ జగత్తుగా కనిపించేదంతా చిదాకాశ రూపంగానే అనిపిస్తుంది. అట్టివారు ఈ జగత్తులను చూచి కూడా మోహం చెందరు. ఇక తక్కిన వారంతా (ఈ జగత్తు సత్యమేనని నమ్మి ఉంటారో) భ్రమభాజనులే అయి ఉంటున్నారు.
ఓ మహర్షీ! ఈ విద్యాధరి వైరాగ్యవశం చేత తత్త్వజ్ఞానం పొందాలని అభిలషించింది. అట్టి జ్ఞానానికి అనుకూలమైన శ్రవణ మననాదుల కొఱకై తమ ఉపదేశం సంపాదించుకోవాలనుకొంది. ఖేచరీముద్ర యొక్క ధారణాభ్యాసంచే ఆకాశమున సంచరించుచున్న మిమ్ములను సమీపించింది. ఓ మునీంద్రా! మీరు అంతా ఎఱిగినదే కదా! చిత్ శక్తియే అజ్ఞాని విషయంలో దాటుటకు కష్ట సాధ్యమైన మాయ యొక్క రూపంగా విజృంభిస్తోంది. జ్ఞానికి ఈ సమస్తమూ అద్యంతరహితము నిరామయము అగు బ్రహ్మం యొక్క శక్తిగాను, చమత్కారంగాను ప్రస్ఫుటమౌతోంది.
ప్రవర్తన్తే నివర్తన్తే నేహ కారణి కానిచిత్ ।
ద్రవ్య-కాల-క్రియాద్యోతా చితిస్తపతి కేవలమ్ ॥
యథార్థానికి ఇక్కడ సృష్టి లేదు, లయము లేదు. ఇచ్చట ఏ కార్యమూ ఉత్పన్నమగుట లేదు. నశించటం లేదు. అయితే, చిత్ శక్తియే ఈ దేశ - కాల - క్రియ - ద్రవ్యాది రూపంగా అభివ్యక్తమౌతోంది. అందుచేత, ఓ మునిసత్తమా! శిల్పాలన్నీ శిలారూపమే కదా! అట్లాగే, ఈ దేశ - కాల - క్రియా - ద్రవ్య - మనో - బుద్ధ్యాదులన్నీ కూడా ఉదయాస్తమయ రహితమైన 'చిద్రూపం' అనే శిలచే తయారు చేయబడిన వివిధ శిల్పములేనని గ్రహించు.
చిత్ శక్తియే లోకాలోక పర్వతముపై గల శిలాకారం ధరించింది. వాయు తరంగాలన్నీ వాయువునకు చెందినవే అయినట్లు జగత్ సమూహములన్నీ చిత్ శక్తి యొక్క అంగాల వంటివే! చైతన్యం సర్వదా ఆద్యంతరహితమైనప్పటికీ పరిచ్ఛిన్నం పొందిన దానివలె ఉంటోంది. విజ్ఞాన ఘనమగు చైతన్యం తనను తానే 'జగత్తు' రూపంగా ఎఱుగుచున్నది.
స్వప్న చైతన్యమే ఆ స్వప్నంలోని గృహములు - కొండలు - శిలలు - మనుజులుగా కనిపించుచున్నది కదా! అట్లాగే, జాగ్రత్లో జాగ్రత్ చైతన్యమే ఈ జాగ్రత్లోని ఆయా శిల మొదలైన సర్వ పదార్థములుగా అగుపించుచున్నది.
ఓ మునీంద్రా! వాస్తవానికి ఇక్కడ నదులు ప్రవహించటం లేదు. నక్షత్రములు తరగటం లేదు. ఏ పదార్థమూ పరిణామం పొందటం లేదు. మరి? చిదాకాశము తనయందే ఈ ఈ పదార్థముల రూపాలను వివరితమగుచున్నది. ఈ కల్ప-మహాకల్పముల జ్ఞానం కూడా వాస్తవానికి లేనివే సుమా! సముద్రంలోని తరంగాలు సముద్రం కంటే వేఱు కాదు కదా! అట్లాగే, అవన్నీ కూడా చిదాకాశమున (జలంలో జలము కంటే అభిన్నమై భిన్నమైనట్లుగా కనిపించే తరంగాలవలె) వేరుగా భాసిస్తున్నప్పటికీ వేఱుకాదు.
Page:58
ఘటంలోని ఆకాశం మరియు మహాకాశము వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ వేర్వేరు కాదు కదా! అట్లాగే, చిత్ సత్త వలన చిద్రూపములై ఈ జగత్తులు విద్యమానమైనప్పటికీ,... చైతన్యమునకు భిన్నమగు జగత్తు అను రూపం ఎక్కడా లేదు.
కనుక, ఓ వసిష్ఠ మునీంద్రా! ఇక మీరు, మీరు నివసించే బ్రహ్మాండమును చేరెదరు గాక! అక్కడ ఏకాంతమున పూర్వం మీచే కల్పించబడిన ఆసనమును అధిరోహించి విక్షేపరహితమగు ఆత్మ సుఖమును అనుభవించటం కొనసాగించెదరు గాక! ఎందుకంటే, నాచే కల్పించబడిన ఈ బుద్ధి-అహంకారము-చిత్తము మొదలైనవాటితో కూడిన ఈ జగత్తు అవ్యక్తరూపమును పొందబోవుచున్నది. మేమైతే పరబ్రహ్మపదమగు కైవల్యమును పొందబోవుచున్నాము.
బ్రహ్మదేవుడు ఇట్లా పలికి బ్రహ్మనివాసులతో సహా పద్మాసనం అవధరించాడు. మరల వ్యుత్థానం లేనట్టి 'సమాధి' యందు తత్పరుడైనాడు.
✤✤✤✤
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అప్పుడు ఆ అన్యజగత్ బ్రహ్మదేవుడు 'ఓం'కారము యొక్క “ఉత్తరార్ధం” అగు అర్ధమాత్రయందు తన చిత్తమును పూర్తిగా లయింపజేశారు. తద్వారా శాంత మనస్కుడైనారు. సమస్త ఇంద్రియజ్ఞాన రహితుడైనారు. అప్పుడు చిత్తము అనే పటంలో లిఖించబడిన చిత్రం వలె నిశ్చల స్వరూపుడైనారు. ఆ ‘విద్యాధరి' అనే బ్రహ్మదేవుని వాసనా స్వరూపిణి బ్రహ్మదేవుని అనుసరించింది. బ్రహ్మదేవుని వలెనే ధ్యానతత్పర అయింది. క్రమంగా పూర్ణంగా శమించిన రూపం కలదయింది. ఆకాశ రూపిణిగా సంతరించుకొన్నది.
'ఓం'కారము ఉత్తరార్ధం అర్ధమాత్రము అనగా జగత్ - స్వప్న - సుషుప్తులకు ఆవల కేవల సాక్షియై వేంచేసియున్న శుద్ధ స్వస్వరూపం
ఆ అన్యజగత్ బ్రహ్మదేవుడు తన శరీర-ఇంద్రియాదులుగా గల సమస్తం ప్రణవం యొక్క అర్ధమాత్రముయందు లయింపజేశాడు. సంకల్పరహితుడైనాడు. స్థూల భావం నుండి సూక్ష్మ భావం పొందసాగాడు. అప్పుడిక నేను కూడా సమాధిచే “సర్వ వ్యాపకం, అనంతం” అగు రూపాన్ని సంతరించుకున్నవాడినై అక్కడ జరుగుచున్న స్థూల సూక్ష్మ తతంగమంతా చూస్తూ ఉన్నాను.
ఆ బ్రహ్మదేవుని సంకల్పము ఏ రీతిగా క్షీణింపజొచ్చిందో, ఆ రీతిగా భూమిపై తృణముల - లతల - ధాన్యముల మొదలైన వాటి ఉత్పత్తి సన్నగిల్లసాగింది. విత్తనాలు అంకురించు (మొలకెత్తు) స్వభావాన్ని మెల్లమెల్లగా కోల్పోసాగాయి. పృథ్వి ఆ విరాడ్రూపుడగు బ్రహ్మదేవుని అవయవములోని ఒక విభాగము వంటిదే కాబట్టి, అతని సంకల్పముతో బాటే అది చేతనారహితం, రసహీనం కాసాగింది. నిస్సారం కాసాగింది. పృథ్వి అనేక దుశ్శకునములతో నిండసాగింది. పాపులగు జనులు విపరీత ధోరణులను ప్రదర్శిస్తూ 'నరకం' వైపు త్రోవలు నిర్మించుకోసాగారు.
అనేక చోట్ల క్షామం, రాజుల క్రూర ప్రవర్తన, అగ్ని చోరాది ఉపద్రవములు, దీనత్వ దారిద్ర్యాదుల దౌర్భాగ్యము, మర్యాదహీనమైన ప్రవర్తనములు, దుష్ట స్త్రీల ఆధిపత్యములు మొదలైన దుఃఖస్థితులు ప్రవృద్ధం కాసాగాయి.
Page:59
పెనుగాలులు వీచుటచే ఆకాశము ధూళిచే ఆవరించబడ సాగింది. ఆ ధూళి ఆకాశంలో పేరుకు పోవటంచేత సూర్యగోళం మసక మసకగా కనిపించ సాగింది. శీతల-ఉష్ణ వాయువులు ఒకదాని వెనుక మరొకటి తీవ్రంగా వీచటం చేత జనులు హాహాకారాలు చేయసాగారు. అనేక ప్రదేశాలు మూర్ఖులచేత, మహాదుఃఖితుల చేత, దుర్వాసనా పరుల చేత, రోగులచేత, అకారణంగా ప్రచ్ఛన్నయుద్ధమునకు ఉపక్రమించేవారి చేత నిండిపో సాగింది. ఒక గ్రామంలో అతివృష్టి, ఆ ప్రక్క గ్రామంలోనే అనావృష్టి ఒకచోట నీరు లభించక జనులు అల్లల్లాడుచుండగా, కొద్దిదూరంలో వరదలు వచ్చి జనవాసములు కొట్టుకుపోసాగాయి. ఒక గ్రామం ప్రజలు మరొక గ్రామం ప్రజలతో చిన్నచిన్న కారణాలుగా ముఠా తగాదాలు పెంపొందించుకోవటంచేత పరస్పర సహకారం లభించక సామాన్య జనులు అష్టకష్టములపాలు కాసాగారు. జనులు అత్యంత స్వల్ప కారణాలకు ఒకరి ఒళ్ళు మరొకరు తగలబెట్టుకోవటంవంటి నీచ ప్రవృత్తులు కలిగి ఉండసాగారు.
పర్వతాలపై, నగరాలపై పిడుగులు పడటం వంటి ఆకస్మిక ఉత్పాతాలు ఏర్పడసాగాయి. శిశువులు, శ్రోత్రియులు, మాన్యులు, విద్వాంసులు గుణవంతులు మొదలైనవారు దుష్టజనుల వలన అనేక హింసలకు గురి కాసాగారు. అకస్మాత్తుగా జన సమ్మర్దమైన ప్రదేశాలలో భూ ప్రకంపనాల వల్ల అగాధ కూపాలు ఏర్పడి క్షణంలో అనేకమంది జనులు భూమిలో కూరుకుపో సాగారు.
రాజులు వర్ణ సంకరులగు స్త్రీల సాంగత్యంలో తమ కనీస కర్తవ్యములను ఏమరచి ప్రవర్తించ సాగారు. జనులు వర్ణాశ్రమ ధర్మములను ఉల్లంఘించి ప్రవర్తించసాగారు. రాజులు తమ దుష్ట వ్యసనాలకు అవసరమైన ధనాన్ని విచక్షణారహితమైన పన్నులు వసూలు చేస్తూ ప్రజాకంటకులు కాసాగారు.
అనేక ప్రాంతాలు దుఃఖముచే రోదన కలిగించే సమాచారాలతో పూర్ణమవసాగాయి. రక్షించ వలసిన రాజుల చేతనే జనులు బాధింపబడసాగారు. కొందరైతే దొంగలను ముఠాగా జేర్చి అపహరించటమే వృత్తిగా కలిగి జనులలో నాయకులుగా చెల్లుబడసాగారు. వారి అధర్మం ధర్మం వలె చెల్లుబాటు కాజొచ్చింది.
పండితులు-సజ్జనులు-పురోహితులు మొదలైనవారు అనాదరణ, అగౌరవాలను పొంద సాగారు. జనులు స్వధర్మమును ఏమరచి పరధర్మమును అనుసరించసాగారు. ఎల్లప్పుడు ఇతరులను పీడించటం, అవమానించటమే వృత్తిగా గల జనుల సంఖ్య అధికం కాసాగింది. దొంగలు యథేచ్చగా దేవాలయాలను, పవిత్ర ప్రదేశాలను ఆక్రమించి అక్కడి సొమ్మును దొంగిలించసాగారు.
భౌతిక సుఖములకే ప్రాముఖ్యమిచ్చి జనులు అల్పాయుష్కులు కాసాగారు. సోమరితనముచే, విలాసముచే జనులు సంధ్యావందనాది ఆధ్యాత్మిక క్రియలు ఏమరచసాగారు.
అంటు రోగములు, ఆపదలు, ఆకస్మిక సామూహిక మరణములు ప్రవృద్దం కాసాగాయి. అభాగ్యులగు జనుల ఆక్రందనములు వినేవాళ్ళు, వినినా పట్టించుకొనేవారు కరువయ్యారు.
Page:60
ఈ ప్రకారంగా బ్రహ్మదేవుని విరాట్ దేహంలోని చైతన్యం ఉపసంహరించబడనారంభించింది. ప్రళయం వచ్చి పడింది. పృథ్వి రసహీనం కాసాగింది. ఋతువులు వక్రించనారంభించాయి. నేలలో నీరు ఇంకి కాటకం తాండవించసాగింది. చైతన్యము యొక్క అభావ ప్రభావం చేత సముద్రజలాలు విక్షుబ్దం కాసాగాయి. సముద్రజలం అనియతిని పొందసాగింది. క్రమంగా తీరంలోని అరణ్యాలు సముద్రజలంలో మునిగిపోసాగాయి. అక్కడి జనులు జనావాసాలవైపు పరుగులు తీయనారంభించారు. సముద్రం ఆకాశమును ఆక్రమించ నారంభించింది. సముద్రజలం పెద్ద ఆవర్తములతో కొండ గుహలలోకి ప్రవేశించ సాగింది. మరొకవైపు నుంచి ఆ కొండలపై భీకర గర్జనతో మేఘములు వర్షించసాగాయి. కొండ గుహలలో మొసళ్ళు ప్రవేశించాయి. సింహములు ఊళ్ళ పైబడి పెంపుడు జంతువులను, మనుష్యులను అప్రతిహతంగా ఆరగించనారంభించాయి. సముద్ర తరంగముల రాపిడికి బడబాగ్ని జనించసాగింది. జలచర జీవులు భూమిని ఆక్రమించసాగాయి. తరంగములచే కొట్టుకొని వచ్చిన రాక్షస తాబేళ్ళు వనములలోని మహావృక్షములను ఆక్రమించసాగాయి. జనులలో విపరీత వృత్తులు పొడమసాగాయి.
పుత్రులు - మిత్రులు - తదితర సహజీవులు నీళ్ళలో కొట్టుకుపోతుంటే కూడా పట్టించుకోకపోవటం సర్వసామాన్యమైపోయింది. నీటి ఏనుగుల కళేబరాలు గృహద్వారాలకు అడ్డంగా వచ్చి పడసాగాయి. దిక్కులు ప్రళయకాల మేఘ గర్జనలతో పిక్కటిల్లాయి. ఆకాశంలో అకస్మాత్తుగా తోకచుక్కలు పొడిచాయి. అగ్ని సమూహాలు ఆకాశంలో అటూ ఇటూ పరుగులు తీయసాగాయి. ఈ విధంగా బ్రహ్మదేవుని సంకల్పము యొక్క ఉపసంహరణ కారణంగా భూమి మొదలైన మహా భూతములన్నీ సంక్షోభం పొందసాగాయి. సూర్య-చంద్ర-అగ్ని-వాయు-ఇంద్ర-యమాది దేవతలు కూడా ఆ కోలాహలమునకు వ్యాకులం చెందసాగారు. ఇప్పటి వరకు అధికారము వహించిన దేవతలు అధఃపతన తత్పరులు కాసాగారు. పర్వతములు - నగరములు - జల ప్రదేశములు అరణ్యములు మొదలైన వాటితో కూడిన అక్కడి సమస్త జగత్తు కల్పాంత వాయువుల భీకర వీచికలచే చూర్ణమగుచూ శైథిల్యం పొందసాగింది.
✤✤✤✤
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ తర్వాత ఆ విరాడ్రూపుడగు అన్యజగత్ బ్రహ్మ తన ప్రాణాలను ఉపసంహరించనారంభించారు. అప్పుడు గ్రహ-నక్షత్రాదులు తమ గతిని వీడసాగాయి. ఎందుకంటావా? అవన్నీ బ్రహ్మదేవుని ప్రాణస్వరూపాలే కదా! అట్టి ప్రాణాలు ఉపసంహరిస్తున్నప్పుడు గ్రహ నక్షత్రాలు ఎట్లా నిలుస్తాయి? ప్రాణ వాయువులు అట్లు ఉపసంహరించబడుచుండగా భీకర సంక్షోభం ఉదయించి సూర్యులు తమతమ స్థితిని కోల్పోయారు. భోగ స్థానములగు స్వర్గాది లోకాలు తమ ఉత్పత్తి స్థానమైన కర్మమూలస్థితిని పొందసాగాయి. అప్పుడు వాయు సహితమగు అగ్ని అంతటా ఉత్పన్నం కాజొచ్చింది. నక్షత్రములు నిరాధారాలై క్రిందకు పడిపోసాగాయి.
Page:61
"బ్రహ్మదేవుని సంకల్పం” అనే ఇంధనం తరిగిపోవటం చేత సిద్ధ లోకాల గతి శమించనారంభించింది. సిద్ధ సమూహాలు తమ శక్తులను కోల్పోవటం చేత దూది పింజముల వలె ఆకాశంలో పరిభ్రమించసాగాయి. ఇంద్రాది లోకములకు స్థానమైన మేరు పర్వత శిఖరములు విఱిగి పడిపోసాగాయి.
శ్రీరాముడు : మహాత్మా! "విరాట్టు - బ్రహ్మాండ శరీరుడు” అని చెప్పబడే బ్రహ్మదేవుడు ఆ చైతన్యము యొక్క సంకల్పమాత్ర స్వరూపుడని గదా, శ్రుతి-స్మృతి ప్రసిద్ధము? అట్టి సంకల్ప మాత్రము నిరాకారమగు శరీరము గల బ్రహ్మదేవునికి సాకారములగు ఈ భూ-నక్షత్రాదులు అవయవములు ఎట్లా అవుతాయి? ఒకవేళ ఈ లోకములన్నీ అతని అవయవములనే అనుకొందాం. అప్పుడు ఈ భూలోకము అతని ఏ అవయవము? స్వర్గ-రసాతలాది లోకములు అతని ఏఏ అవయవములు? అతనిలో ఈ విశాల లోకములు అవయవములుగా ఎట్లా ఉన్నాయి? అట్టి అతడు 'బ్రహ్మాండము’ అనే తన ఈ శరీరము లోపల సత్యలోకంలో ఎట్లా స్థితి కలిగి ఉన్నాడు?
మహర్షీ! బ్రహ్మదేవుడు సంకల్పమాత్రుడనీ, నిరాకారుడనీ అంటూ ఉంటారు. మరి ఈ జగత్తేమో సాకారమని సుస్పష్టమే అయి ఉన్నది కదా! సాకార జగత్తులో నిరాకారుడు ఎట్లా ఉన్నాడు? ఒకవేళ నా ప్రశ్నలలోనే స్వతహాగానే ఏదైనా దోషం ఉన్నదా? వివరించ ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ కనబడే ‘జగత్తు' అని దేనినంటున్నామో... అట్టి ఇయ్యది మొట్టమొదట సృష్ట్యాదియందు ఏ రూపంలో ఉన్నది? సృష్ట్యాదియందు ఈ జగత్తు సత్తు కాదు. అసత్తు కాదు. ఇది మొట్టమొదటి సర్వ దశదిశలను పరిపూర్ణం ఒనర్చునట్టి నిరామయమైన పరమాకాశ రూపమగు చిన్మాత్ర-బ్రహ్మమే అయి ఉన్నది. అట్టి ఆ పరమాకాశము తన పరమాకాశ స్వరూపమును ఏ సమయమందునూ త్యజించనే లేదు. అట్టి ఆ పరమాకాశమే తన యొక్క చిదాకాశత్వ స్వరూపమగు ఈ జగత్తును తనకంటే వేరైన వస్తువు వలె (లేక చేత్యము లేక దృశ్యము వలె) ఎరుగుచున్నది (లేక) చూచుచున్నది.
నిశ్చల జలంలో చంచలరూపమగు ఆవర్తములు ఏర్పడుతూ ఉంటాయి కదా! అయితే, అట్లా ఆవర్తరూపంగా కనిపించేదంతా కూడా జలమునకు వేరైనదేదీ కాదు కదా! అట్లాగే, 'చిదాకాశము' అనబడు అత్యంత నిశ్చలము- శుద్ధము-అనన్యము-పూర్వాత్ పూర్వము అగుదాని యందు కారణమంటూ ఏదీ లేకుండానే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే ఒకానొక త్రిపుటి తనంతట తానే జనిస్తోంది. అందుకు కారణమంటూ ఏదైనా ఉంటే ఆ కారణం కూడా చిదాకాశమునకు అనన్యం అనియే చెప్పబడింది. ఆ త్రిపుటి యొక్క మననముచే ‘ఘనీభావము’ వలన “మనోరూప స్థితి” పొందిన చిత్ చైతన్యమే ఈ జీవుడు. ఈ రీతిగా త్రిపుటి సమూహముల యొక్క అధ్యాస పొందుచున్నప్పటికీ చిదాకాశము యథాతథంగా నిరాకారంగానే ఉన్నది గాని, అద్దానియందు సాకారమనునదేదీ లేదు. అనగా త్రిపుటి జనించటానికి ముందు, జనించిన తర్వాత కూడా చిదాకాశము తనయందు చిదాకాశముగానే నెలకొనియున్నది. ఇక ఈ త్రిపుటిగా భాసించేదంతా ఏమిటంటావా? ఇది కూడా “శివరూపమగు పరమాత్మ" కంటే వేఱు కాదు.
Page:62
ఆ విధంగా త్రిపుటి ఏర్పడిన తర్వాత అట్టి విశాలమగు సంకల్పరూపమైన మనస్సునందు అభిమాన రూపమగు భావనచేత “అహంకారం”గా స్ఫురిస్తోంది. అయితే అట్టి అహంకార రూపంగా స్ఫూరించేది కూడా వాస్తవానికి 'నిశ్చలం, నాశరహితం' అగు బ్రహ్మమే అయి ఉన్నది.
అట్టి అహంకార - సంకల్ప రూపుడగు చిత్స్వరూపుని 'చిదాభాసుడు (చిత్ అభాసుడు)' అని శాస్త్రాలు పిలుస్తున్నాయి. ఆ చిదాభాసుడు 'నేను ఆకాశరూపుడను' అని భావించటం జరుగుతోంది. ఆ విధంగా చిదాకాశమే చిదాకాశమున “అసత్తు” అగు ఆకాశరూపంగా పొందుచున్నది. ఆ సంకల్పరూపుడగు చిదాభాసుడు శూన్యమునే దేహాకారంగా భావించటం చేత “దేహమును చూడటం, దేహమును ఎఱగటం, దేహమును అనుభవించటం”... అనునవన్నీ సంభవిస్తున్నాయి.
శ్రీరాముడు : శూన్యమును దేహాకారంగా భావించి దేహానుభవం పొందటం ఎట్లా జరుగుతుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఊహలో శూన్యమునందే తనకు ఎక్కడో-ఎప్పుడో పరిచయమున్న నగరంలోని వీథిగా ఊహించి ఆ ఊహలోంచి అనుభవం పొందుతారు కదా! ఒకడు తనకు ఇష్టమైన రూపమును ఊహలో (లేక జ్ఞప్తిలో) దర్శించటం జరుగుతోంది కదా! స్వప్నసంవిత్తు వాస్తవానికి శూన్యమే అయినప్పటికీ స్వప్నంలో నగరములు-ఆకారములు అనుభవానికి ప్రాప్తిస్తున్నాయి.
జన్మరహితమగు చిదాకాశ స్వరూప బ్రహ్మము శూన్యమగు ఆకాశమును దేహరూపంగా గాంచుచున్నది. అయినప్పటికీ కూడా, చిదాకాశమున చిదాకాశమే అనుభవించబడుచున్నదగుచున్నది. జ్ఞానము యొక్క నిర్మలత్వముచే ఆ పరమాత్మ స్వసంకల్పితమైన జగత్తును అనుభవిస్తూ మరల మరొకప్పుడు తన ఇచ్ఛ చేతనే అద్దానిని శమించజేయుచున్నాడు.
ఓ రామచంద్రా! మనలో ఎవరికి ఎప్పుడు బ్రహ్మతత్త్వము యొక్క వాస్తవ పరిజ్ఞానం కలుగుతుందో... అప్పుడు అతనికి ఈ జగత్తు “దృశ్య శూన్యంగాను, వ్యాప్తము-సత్యము అయినట్టి చిదాకాశమాత్రం”గాను కనిపించుచున్నదని గ్రహించు. జగత్ వాసనలు శమించినప్పటి దృష్టికి ఇదంతా నిరాకారము-నిత్యసత్యము అగు బ్రహ్మముగానే గోచరించగలదు సుమా!
శ్రీరాముడు : జగత్ వాసనలు త్వరితంగా తొలిగేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి :
1.) బ్రహ్మమే పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వదేహులుగా, సర్వతత్త్వములుగా కనబడుచున్నదను “అద్వైతతత్త్వము” చేతనూ,
2.) “అహంకారం భ్రమ మాత్రమే” అను అవగాహనచే ప్రస్ఫుటమయ్యే అహంకార రాహిత్యం చేతనూ,
3.) “ఈ జగత్తు యొక్క అసలైన రూపం ఏమై ఉన్నది?" అను ఉత్తమ పరిశీలన యొక్క ప్రయోజనమైనట్టి యథార్థజ్ఞానము చేతనూ,...
మనుజునకు ఈ జన్మయందే వాసన శమించిపోగలదు. ఆ తర్వాత మోక్షరూపమగు ఆత్మయే అంతటా అన్నిటా (అన్నీగా) శేషించుచున్నది.
Page:63
ఓ రామచంద్రా! ఈ విధంగా "చిత్స్వరూపమగు బ్రహ్మము" అనబడునది ఏదైతే కలదో, అదే ఈ జగత్తు అయి ఉన్నది. విరాడ్రూపమగు బ్రహ్మము యొక్క దేహమే ఈ జగత్తు. చిన్మాత్ర బ్రహ్మం సంకల్పాకాశరూపత్వమును అభ్యసించినదై ఉంటోంది. అట్టి సంకల్పవశ చిన్మాత్ర బ్రహ్మానికి సంబంధించిన స్థూల శరీర భ్రాంతి ఉదయించి, అదియే ఈ జగదాకారంగా భాసిస్తోంది. అదియే “బ్రహ్మాండము” అని కూడా పిలువబడుతోంది. ఈ జగత్తంతా బ్రహ్మము యొక్క “సంకల్ప కల్పనా రూపం” మాత్రమే! అనగా అధిష్టాన దృష్టిచే ఇదంతా చిదాకాశము మాత్రమే! కనుక యథార్థానికి నామరూపాత్మకమైన ఈ దృశ్య జగత్తు లేదు. అహమ్-త్వమ్ ఇత్యాదులు కూడా వాస్తవానికి లేవు.
చిన్మాత్రము - నిర్మలము - వికారరహితము అగు చిన్మాత్రమునందు సాకారమగు ఈ జగత్తు ఎట్లు దేనిచే జనించగలదు చెప్పు? కాబట్టి, ఈ జగత్తు మిథ్యగానే జనించినదని, మిథ్యగానే కనబడుతోందని అనక తప్పదు. మిథ్యగానే ప్రియ-అప్రియ భావములకు కారణమౌతోంది. నిష్ప్రపంచమగు బ్రహ్మమే తన “ఇచ్ఛ”చే జగత్ శూన్యము అగు చిదాకాశమును జగద్రూపంగా చూడటం జరుగుతోంది.
వాయువు అంతటా ఉన్నప్పటికీ అది కదలుచున్నప్పుడే అద్దాని ఉనికిని మనం గుర్తిస్తున్నాం కదా! గాలి తనకు తానే కదలుచున్నట్లు చిన్మాత్రమగు బ్రహ్మం తన యొక్క అద్వితీయమగు చిదాకాశమున స్వయంగా “జగత్తు” మొదలుగా గల రూపంగా ఎఱుగుచున్నది.
అందుచేత రామచంద్రా! నీవు కూడా నా వలెనే సర్వ విశేషాలు శమించినవాడవై ఉండెదవు గాక! ఈ దృశ్యం అధిష్ఠాన రూపముచే సత్యము, నిజదృశ్యరూపముచే అసత్యమయి ఉన్నది. కనుక, పరమార్థమున ఈ దృశ్యమును శూన్యము, నిర్మలము అగు చిదాకాశముగానే ఎఱిగి ఉండు. మమత్వరహితుడవై పరమార్థమున సత్-చిత్ రూపుడవై, వ్యవహారమునందు మాత్రం దేహధారివలె ఉండు. వాసనారహితుడవు అగుము.
సమాధి నుండి లేచినప్పుడు (ఈ ప్రపంచమున ప్రవేశించి ఉన్నప్పుడు) వాసనా రహితుడవై, శాంతచిత్తుడవై, మౌనివై, చపలత్వ రహితుడవై ఆయా యథాప్రాప్త వ్యవహారాలను నిర్వర్తించు. సమాధి స్థితుడవైనప్పుడు ఏ ఏ వ్యవహారాలు చెయ్యకయే విషయరహితుడవై ఉండు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానియందు ఎట్టి పట్టుదల కలిగి ఉండనే వద్దు.
ఓ రామచంద్రా! మరల మరొక్కసారి ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను -
1.) సత్యమగు పరమాత్మ అనుభూతియే జీవించినందుకుగాను పొందాల్సిన పరమావధి.
2.) అట్టి పరమాత్మ అనుభూతము కాగా అప్పుడు ఈ దృశ్యము అత్యంత స్వభావసిద్ధంగా “అనాది - నిత్యానుభవరూపము - ఏకము” అయినట్టి పరబ్రహ్మమేనని సుస్పష్టం కాగలదు.
3.) దృశ్యము అనునదేదీ వేఱుగా లేనేలేదని విదితమౌతుంది.
అట్టి పరమాత్మను గురించిన అనుభవం లేకుండటంచేతనే - ఈ విశాలమైనట్టి నామరూపాత్మక దృశ్యమహాదృష్టి ఈ జీవునికి ఎదురుగా మోసపూరితంగా తాండవం చేయటం జరుగుతోంది.
Page:64
శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చెప్పిన విషయాలను అనుసరించి రెండు విశేషాలు సుస్పష్ట మౌతున్నాయి.
1.) ఈ బంధము-మోక్షము-జగత్తు మొదలైనవి శూన్యము గాని, సత్తు గాని కాదు.
2.) ఈ దృశ్యము అనేది అవాఙ్మానస (అవాక్మానస) గోచరము - ఉదయాస్తమయ రహితము - ఆధిభూత వస్త్రధారి అయినట్టి పరబ్రహ్మమే!
ఈ రెండు విషయాలు మీరు ప్రవచించుచుండగా సందేహరహితంగా సుస్పష్టమౌతున్నాయి. అయినా కూడా, ఈ విషయం మరికొన్ని విశేషాలతో కూర్చి మరల చెప్పవలసినదిగా నా అభ్యర్థన.
ఎందుకంటారా?
ఉపదిష్టం ఇదం బ్రహ్మమ్ త్వయా బుద్ధం అలం మయా ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతమ్ ॥
అమృతము వలె అతి మాధుర్యములైన మీ వచనములు ఎంతగా వినినా కూడా "ఇక చాలు” అని ఏమాత్రం అనిపించటమే లేదు.
హే ప్రభూ! అటు సృష్ట్యాది సంభ్రమముల దృష్టులు గాని, ఇటు శూన్యత్వాది దృష్టులు గాని సత్యమూ కాదు! అసత్యమూ కాదు! ... అని నేను ఎఱుగుచున్నాను. అంతేకాక, 1) మాయతో కూడిన బ్రహ్మం, 2) నిత్య యుక్తము - సత్యము అగు బ్రహ్మం అను ఈ రెండింటి గురించి తమ అనుగ్రహంచేత నేను ఎఱుగుచున్నాను.
అయితే, ఇప్పుడు బోధ యొక్క దృఢత్వము కొఱకై ప్రపంచము యొక్క అధ్యారోపక్రమమును మఱల తెలియజేయ ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ స్థావర జంగమాత్మక జగత్తు సర్వవిధముల అనేక వస్తువిషయములతో నిండి ఉన్నదై, దేశ-కాల-క్రియా సహితమై ఎదురుగా కనిపిస్తోంది కదా! అట్టి ఈ కనిపించే స్థూల భూతములు సూక్ష్మ భూతములందు లయించటమే “జగద్వినాశనము”... అని వర్ణించబడుతోంది. అనగా...
భూమి- భూతత్త్వమునందు (ఘనం); జలము జలతత్త్వమునందు (ద్రవం); అగ్నిఅగ్నితత్త్వమునందు (ఉష్ణం); వాయువు- వాయుతత్త్వమునందు (వాయువు); ఆకాశం - ఆకాశ తత్త్వమునందు (ఆకాశం)... లయం పొందినప్పుడు ఈ భౌతిక దృశ్యజగత్తు నశించినదగుచున్నది.
మరొకప్పుడు సూక్ష్మ భూతములు కూడా నశించి "అవ్యాకృతము” నందు లయించటం జరుగుతోంది. దానినే “మహాప్రళయం” మరియు “మహానాశనం" అని కూడా పిలుస్తూ ఉంటారు. అట్టి “మహాప్రళయం” అనే పేరుగల మహానాశనం సంభవించినప్పుడు బ్రహ్మ-ఉపేంద్ర-మరుత్రుద్ర-మహేంద్రాదుల దేహాల యొక్క అంతిమభావవికారం తటస్థిస్తోంది. ఆ తదనంతరం ఇక ఆపై కూడా శేషించి ఉండేది శాంతం, నిర్మలం, అనిర్వచనీయం, అజం, అనాది, సన్మాత్రం అగు బ్రహ్మమేనయ్యా! ఉపమాలంకారం ఉత్ప్రేక్షాలంకారం, సాపేక్ష సిద్ధాంతాలు ఉపయోగించి “అది ఇట్టిది" అని మాటలతో చెప్పలేం.
Page:65
అద్దాని పట్ల వాక్కులన్నీ అశక్తతచే వెనుతిఱుగుచున్నాయి. దానికి అన్యమైనది ఉంటే కదా, అద్దానిని తెలుసుకోవటం? అనగా ఆ స్థితి అయ్యది తనను తానే పొందుచున్నది-అనుభవించుచున్నది అగుచున్నది. ఆవగింజకంటే మేరుపర్వతం అత్యంత స్థూలం కదా! అట్లాగే ఆ బ్రహ్మము కంటే ఈ శూన్యాకాశం అత్యంత స్థూలం. మహాపర్వతము కంటే త్రస రేణువులు అత్యంత సూక్ష్మమైనట్లే, స్థూలమగు ఈ బ్రహ్మాండము కంటే బ్రహ్మము అత్యంత సూక్ష్మం.
బ్రహ్మమునందు జగత్తు - ఆ విధంగా మహాప్రళయంలో జగద్రహితమై మౌనం, శాంత, వహించి బ్రహ్మం ఉంటుంది కదా! కాలప్రమాణహేతువగు సూర్య చంద్రాదులు కూడా విలయం పొందటం చేత... అయ్యది "ప్రమాణరహితమగు ప్రళయకాలం" నందు చిరకాలం ఉంటోంది. సౌమ్యం-కేవలీ అనుభవాత్మకం-ఆధిభూతం అయినట్టి చిదాకాశంగా శాంత స్థితి నొంది ఉంటోంది.
అవరోహణక్రమం - బ్రహ్మము చిద్రూపముగా అగుట - వాస్తవానికి సంకల్పరహితం, మహత్తరం, దేశకాలాలచే అపరిచ్ఛిన్నం అగు అట్టి బ్రహ్మం ఒకానొకప్పుడు తన స్వరూపం నందే “జగత్ సంస్కారం” అను “స్వప్న సదృశ కల్పిత ద్వితీయం" వైపుగా అభిముఖం అవుతోంది. తన యొక్క స్వరూపం నందే జగత్ సంస్కార రూపమగు పరమాణుత్వమును అనుభవిస్తోంది. “బ్రహ్మం” అను శబ్దం యొక్క శబ్దార్థం “వృద్ధి పొందటం” అని కదా! ఆ విధంగా సర్వత్రా వ్యాప్తమైన “నిజ చిద్రూపం" ను ఎఱుగుచున్నది.
“చిత్స్వరూపము” అగు బ్రహ్మము చిద్రూపముగా అయి తనయందు నిజచిద్రూపము అగు అణుత్వ మును అనుభవిస్తోంది. అద్దానిని గాంచుచుండుటచే “ద్రష్ట” అను స్థితిని పొందుచున్నది. స్వప్న ద్రష్ట తన స్వరూపమునందే స్వప్నం పొందుచూ, ఆ స్వప్నంలో తాను మరణించినట్లు కూడా గాంచుచూ ఉంటాడు చూచావా? అనగా ఒకడు తన స్వప్నంలో తన మృతత్వమునకు తానే ద్రష్ట అయి తనకంటే తన మృతత్వమును అన్యమైనదిగా వీక్షించుచున్నాడు కదా! అట్లాగే చిదాకాశము కూడా తన నిజస్వరూపమును తనకంటే భిన్నమైనదాని వలె గాంచుచున్నది. తన అద్వైత రూపమును ద్వైతరూపము వలె గాంచుచు "ద్రష్ట-దర్శనము-దృశ్యము" అను త్రిపుటిని పొందుచున్నది. తన దేహము యొక్క రాక-పోకలకు తానే సాక్షి అయి చెన్నొందుచున్నాడు. అది అట్లు అగుచున్నప్పటికీ యథార్థానికి ఏకరూపం వలెనే ఆత్మ వర్తించుచున్నది. అనగా చిదాకాశం సర్వదా మూర్తి (ఆకార) శూన్యమై, ఏకమై, నిరాకారమై ఉన్నప్పటికీ “నిజసూక్ష్మ రూపం” అనతగిన అద్వైత రూపమున “ద్రష్ట-దృశ్యం” అను ద్వంద్వమును ద్వైత భావముచే ధరిస్తోంది. అట్టి దర్శనమును “దృష్టమాయ” అని అంటారు. అట్టి దృష్టమాయాబలముచే తన ప్రకాశరూపమగు ఆత్మను పరిచ్ఛిన్నంగా గాంచు చున్నది. అట్టి పరిచ్ఛిన్న భావనాభ్యాసంచే “పృథ్వి" మొదలైన ఆయా వివిధ వస్తు అనుభవం రూపు దిద్దుకుంటోంది. ఈ దేశ కాల-క్రియల యొక్క అసలైన రూపము ఆత్మయే! అట్లే...
దృక్ : లబ్ధమగుచున్నదానిని “ద్రవ్యము” అని, ఆ ద్రవ్యమును చూచువానిని “ద్రష్ట” అని, ఆ చూచుటను “దర్శనము” అని ఆ చూచుటకు గల కారణమును “దృక్” అని చెబుతారు.
Page:66
జగత్తు : 1.) దేశ-కాల వస్తు పరిచ్ఛేదములచే పరిమితి గలది, 2.) సంఖ్యా పరిణామముచే అనంతమైనది, 3.) “దృష్ట దర్శనము దృశ్యము” అనబడు త్రిపుటిచే భేదము కలిగి ఉన్నది.
అట్టి ఈ జగత్తు యొక్క రూపవృద్ధి అసత్యముగానే భాసించుచున్నది. వాస్తవానికి ఈ 'జగత్తు' అని చెప్పబడుచున్నదంతా చిదాకాశరూపమే అయి ఉన్నదనుటలో ఏమాత్రమూ సందేహం లేదు.
తన్మాత్ర :
చిదణు ప్రతిభాసే అన్తః ప్రథమమ్ నామవర్జితమ్ ।
తన్మాత్ర శబ్దమ్ ఏతేషామ్ ఏతత్ ఆకాశరూపి తత్ ॥
చేతనరూపుడగు ఈ జీవుని దేహమందలి ఏ గోళక ఛిద్రము ద్వారా ఆయా వస్తువులను చూస్తున్నాడో (లేక) ఏ ఇంద్రియం ద్వారా ఈ సూర్యుడు, చంద్రుడు మొదలైన వాటిని చూస్తున్నాడో... అద్దానినే “నేత్రేంద్రియాలు” అని పిలుస్తున్నారు. ఎద్దానిచే శబ్దము వింటున్నాడో వానిని చెవులు అని పిలుస్తున్నారు. ఈ కళ్ళు-చెవులు-ముక్కు-నాలుక-చర్మముల యొక్క (ఇంద్రియాల) నామ రూపభేద కల్పనం పూర్వాపూర్వ స్థితిని “తన్మాత్రా” మాత్రం అత్యంత సూక్ష్మమై ఆకాశరూపమై ఉన్నది. “చైతన్యాణువు” అనతగు ఈ జీవుని యొక్క ప్రతిభాసరూపమగు ఆకాశమే 'తన్మాత్ర'. అట్టి తన్మాత్రయే స్థూలదేహంగా అగుచున్నది. ఈ జీవుడు రూపాదుల అనుసంధాన వశంగా పంచేంద్రియాల అనుభవం పొందుచున్నాడు. “ఏమీ తోచటం లేదు. ఎక్కడికైనా వెళ్ళాలి. ఏమైనా చూడాలి... అను ధ్యాసతో పోల్చతగినదే ఈ తన్మాత్ర యొక్క స్ఫురణ రూపము.
స్థూల దేహం :
చిదణు ప్రతిభాకాశక పిణ్ణ ఏవ ఘన స్థితిః ।
అనుసంధాన వివశశ్చ ఏతత్ “ఇంద్రియ పంచకమ్” ॥
ఈ జీవుడు చైతన్యాణువు అనుకున్నాం కదా! అనగా చిదాకాశం ద్వితీయ భావనచే అణుత్వం పొందినప్పటి అణుస్వరూపమే ఈ జీవుడు. అట్టి ఈ జీవుని ప్రతిభాస రూపమగు ఆకాశమే తన్మాత్ర. అట్టి తన్మాత్ర ఒక సమయంలో ఘనస్థితి పొందుతోంది. అట్టి ప్రతిభ యొక్క ఘనస్థితియే స్థూలదేహంగా అగుచున్నది. మరియు అట్టి స్థూల సంబంధమైన రూపాదుల అనుసంధానం చేత పంచేంద్రియాల అనుభవం చిదణురూపుడగు ఈ జీవుడు పొందుచున్నాడు.
దృశ్యము : తన్మాత్ర యొక్క సుదీర్ఘమననముచే శబ్ద రూప రస గంధాదుల గురించిన ఆసక్తి తీవ్రరూపం దాల్చుతోంది. అట్టి విషయాల అనుభవం ద్వారా చిదణుస్వరూపజీవుడు దృశ్యం యొక్క పుష్టిని పూర్ణంగా బడయుచున్నాడు. దృశ్యము పట్ల ఏర్పడిన తాదాత్మ్యంచే ఈ దృశ్యంతో ప్రమేయం లేని (ఈ జగదృశ్యానికి సంబంధించని) తన యొక్క చిదానంద రూపాన్ని ఏమఱుచుచూ, అనేక దేహాలు పొందుచూ భావనాస్థితికి లోను అగుచున్నాడు. ఇట్లు ఈ దృశ్యాన్ని అనుభవించ టంలో నిమగ్నమై ఉండగా వందల, వేల ఉపాధులు (శరీరములు) వస్తున్నాయి, పోతున్నాయి.
చిత్తము : ఈ జీవుడు “పొందాలి-కావాలి” అను భావావేశమును ఇంద్రియ విషయాల పట్ల కలిగి ఉంటున్నాడు కదా!
Page:67
వాటికి సంబంధించిన సుఖ-దుఃఖములు, ఆశ-నిరాశలు, ఉత్సాహ భయములు, గర్వ-ఆందోళనలు స్మృతి రూపంగా ఏర్పడి ఉంటున్నాయి. అంతరంగాకాశంలో పేరుకొని ఉన్న స్మృతుల సముదాయమే చిత్తాకాశం.
జలబిందువులు మేఘరూపం పొందినట్లుగా, అంతరమున రూపుదిద్దుకొనినట్టి చిత్స్వభావమును ఈ స్మృతి ఆవరించి ఉంటోంది. ఈ విధంగా ఇంద్రియములచే గ్రహించబడిన విషయముల యొక్క "స్మృతి" అనే భ్రమ ఆకాశమును ఆవరించిన మేఘ సముదాయము వలె స్వస్వరూపమును కప్పి ఉంచుతోంది.
చిత్తము అంటే ఇంద్రియ విషయముల స్మృతి మరియూ తత్ సంబంధమైన ఇచ్ఛావేశము. ఈ చిత్తములో అనేక ఉపాధుల “స్మృతి” సంబంధమైన జ్ఞానం శుద్ధ జ్ఞానాన్ని ఆవరించి ఉంటోంది.
బుద్ధి : స్మృతి దశయందలి జ్ఞానమును "చిత్తము” అని పిలుస్తున్నారు కదా! అట్లాగే “ఇది చేద్దాం, ఇది వద్దు, ఇది చూద్దాం - ఇది ఇప్పుడు వద్దు" అనే నిశ్చయ దశయందలి జ్ఞానం ప్రవర్తిస్తోంది. అట్టి నిశ్చయదశ యందలి జ్ఞానమును “బుద్ధి” అని పిలుస్తున్నారు.
మనస్సు : చిదణుస్వరూపుడగు ఈ జీవుడు ఇంద్రియ విషయముల ధ్యాసచే ఒక విషయమును సంకల్పిస్తున్నాడు. మరల అద్దానిని వదలుచూ, మరొక విషయమును సంకల్పిస్తున్నాడు. ఈ విధంగా అనునిత్యంగా సంకల్ప-వికల్పములను నిర్వర్తిస్తున్నాడు. అట్టి సంకల్ప-వికల్పముల పరంపరా ప్రక్రియకు “మనస్సు” అని పేరు పెట్టారు.
అహంకారము : “ఇది నేను అది నాది" అను దృశ్య సంబంధమైన అభిమానము ఈ చిదణుస్వరూప జీవుడు పెంపొందించుకొని ఉంటున్నాడు. అట్టి అభిమానముచే ఈ జీవుడు “అహంకారము” అను ఒకానొక పదమును అవధరించి ఉంటున్నాడు.
దేశ - కాల పరిచ్ఛేదము :
చిదణోరస్య భావస్య ప్రత్యగ్రం యత్ర వేదనమ్ ।
స తత్ర ఉత్తరకాలేన పూర్వాభిఖ్యాం కరిష్యతి ॥
ఈ చిదణుస్వరూప జీవునికి ఏ చోట శబ్దాది విషయజ్ఞానం కలుగుతుందో, ఆ చోటు అతనికి “దేశము” గా అనుభవమౌతోంది. తదితర ప్రదేశము అన్యదేశము అగుచున్నది.
ఏ కాలంలో శబ్దాది విషయాల జ్ఞానం (లేక అనుభవం) కలుగుతుందో... అది వర్తమాన కాలము, అందుకు ముందుకాలం భూతకాలం, అప్పటికి తరువాతి కాలం భవిష్యత్ కాలం అగు చున్నది. ఈ విధంగా భూత భవిష్యత్ వర్తమానాలు ఆ చిదణురూప జీవుని పట్ల ఏర్పడి ఉంటున్నాయి. దేశమునకు తూర్పు-పడమర-ఉత్తర-దక్షిణములు, కాలమునకు భూత వర్తమా నాది ఆయా ప్రమాణములు ఆ తదనంతర కల్పన అయి ఉంటోంది.
చైతన్య రూపమగు ఆత్మ స్వయంగా ఆకాశం వలె నిర్మలం - అపరిచ్ఛిన్నం అయినప్పటికీ ఈ ప్రకారంగా దేశ-కాల-క్రియ-ద్రవ్యాది నామాలన్నీ కల్పించుకొని, క్రమంగా అర్ధజ్ఞాన స్వరూపాన్ని బడయుచూ పరిచ్ఛిన్నము వలె అగుచున్నది.
Page:68
ఈ విధంగా చైతన్యము స్వయముగానే...
1.) మొట్టమొదటి సూక్ష్మ శరీరముగా అగుచున్నది.
2.) క్రమంగా... దేశ-కాల-వస్తు-విభాగము అగుచున్నది.
3.) ఆపై సర్వజగత్ శరీరంగా అగుచున్నది.
అయితే వాస్తవానికి చిదాకాశం చిదాకాశరూపమే అగు జగత్తును స్వయంగా ధరించి ప్రవర్తి స్తోంది. ఈ “జీవుడు" అనబడువాని వాస్తవరూపం చైతన్యమే గాని ఈ సూక్ష్మ-స్థూల దేహాదులు కాదు. చైతన్య రూపుడగు జీవుడు తన సూక్ష్మ శరీరమునందు చిరకాలం స్థూలత్వము గురించి భావించుచు, క్రమంగా ఆ "స్థూలము” యొక్క పూర్ణ నిశ్చయమును ఆశ్రయించి ఉంటున్నాడు.
అనగా, నిర్మలమగు చిదాకాశమే తన స్వస్వరూపంలో ఈ “జగత్తు” అను చిత్రాన్ని రచించింది. ఈ నామరూపాత్మక జగత్తు భ్రమాత్మకమే అయి ఉన్నదయ్యా! వాస్తవానికి చిదాకాశం సర్వదా సద్రూపమే అయి ఉండి కూడా మృగతృష్ణాజలంలాగా అసత్తే అగు ఈ జగద్రూపంగా భాసిస్తోంది.
దేహం : నిర్మల చిదాకాశరూపుడగు ఈ జీవుడు క్రమంగా తన దేహమున ఒకచోట 'ఇది శిరస్సు' అనే శబ్దార్థం ఇస్తున్నాడు. 'ఇది పాదములు' అను మరొక శబ్దార్థం ఒసగునట్టి కల్పనను గావించుచున్నాడు. అట్లాగే మఱొకచోట 'ఇది వక్షస్థలం' అని, 'ఇవి భుజాలు' అని ఇట్లా శబ్దార్థ కల్పన గావించుచున్నాడు.
భావాభావ కల్పన : అట్లాగే భావాభావములు గ్రాహ్యము-త్యాగములను నిర్వర్తిస్తున్నాడు. చిదణు స్వరూపుడగు ఈ జీవుడు ఒక భావాన్ని గ్రహించటం-త్యజించటం, మరొక భావాన్ని ఆశ్రయించటం అనుక్షణికంగా నిర్వర్తిస్తున్నాడు.
వస్తు కల్పన : ఆ తరువాత 'ఇది గోవు - ఇది గుఱ్ఱము' ఇత్యాది దేశ-కాల-రూప-గుణ సంబంధమైన భేద కల్పన గావించుచున్నాడు. ఇంద్రియ సమూహముచే తెలియవస్తున్న విషయోన్ముఖత్వ కల్పనను ఈ చిదణుస్వరూప జీవుడు స్వయముగా ధరించుచున్నాడు. ఇక అతడు ఈ కాళ్ళు-చేతులు గల శరీరముతో కూడుకొనినవాడై చిత్తాదుల కల్పనతో కూడినట్టి స్వయం కల్పితమగు ఆకృతిని ఎదురుగా దర్శించుచున్నాడు.
ఏవం సంపద్యతే బ్రహ్మా తథా సంపద్యతే హరిః ।
ఏవం సంపద్యతే రుద్రంః, ఏవం సంపద్యతే కృమిః ॥
ఓ రామచంద్రా! ఈ ప్రకారంగా ప్రతి జీవునికి దేహానుభవ కల్పన ఉదయించి ప్రదర్శిత మౌతోంది. బ్రహ్మ-విష్ణు మహేశ్వరుల దగ్గర నుండి క్రిమికీటకాదుల వరకు కూడా సంకల్ప వశం చేతనే ఈ దేహాదుల కల్పన సిద్ధించుచున్నదని గ్రహించు. అయినా కూడా... యథార్థానికి ఎక్కడా ఏదీ ఉత్పన్నమే అగుటలేదు. అంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా సద్రూపమే-ఆయా విశేష సద్రూపమై వెలయుచున్నది సుమా! ఈ సమస్తం కూడా... శూన్యమునందు శూన్యంగానూ, చైతన్యమునందు చైతన్యముగానూ... విజృంభించుచున్నది.
వ్యష్టి – విరాట్ పురుషుడు : సమష్టి స్వరూపుడగు విరాట్ పురుషుడు కూడా వ్యష్టి జీవుని వలెనే స్వయంగా చిదాకాశమునందు సంకల్ప మాత్రముచే ఆవిర్భవించినవాడే సుమా!
Page:69
ఆ విరాట్ పురుషుడే ఈ వ్యష్టి శరీరములన్నిటి యొక్క మూలము. ఈ స్వర్గ-మర్త్య-పాతాళములనబడే త్రిలోకములు ఒక ‘లత’ అనుకుంటే ఈతడు ఈ లతకు బీజమువంటివాడు. 'ముక్తి' అనే మార్గమధ్యంలో 'విషయ సృష్టి' అనే ప్రతిబంధకమును కలిగించేవాడుగా కూడా ఆ విరాట్ పురుషుని గురించి కొందరు చెప్పుతారు. “సంసారము" అనే వర్షధారకు ఆయనే మేఘమువంటివాడు. సర్వ కార్యములకు కారణం ఆ విరాట్ పురుషుడే! అతడు కూడా వ్యష్టి పురుషునివలె సంకల్ప మాత్రజనితుడే అయినప్పటికీ, యథార్థానికి అతడు “ఆవిర్భావ-తిరోభావ రహితమగు చిత్ స్వరూపుడే” అని గ్రహించు. అతని దేహము భౌతికము కాదు. అతని శరీరమునకు వ్యష్టి దేహమువలె భూమికలు మొదలైనవి లేవు. అందుచేత అతనిని ఈ భౌతికమైన చేతులతో ఎవరూ పట్టుకోలేరు.
దృష్టాంతానికి... ఒక మనుజుడు మౌనంగా నిద్రిస్తూ కలగంటున్నాడనుకో! కలలో ఆ సముద్రముల యొక్క, ఆ మేఘముల యొక్క ఆ యుద్ధముల యొక్క, ఆ సింహగర్జనల యొక్క భీకరనాదములను వింటూనే వాస్తవానికి మౌనముగా ఉన్నవాడగుచున్నాడు కదా! అట్లాగే ఆ విరాట్పురుషుడు కూడా తన యొక్క చిత్ స్వరూపమునందు ప్రపంచరహితమైన స్థితిని కలిగియున్నాడు. స్వప్నంలో కనిపించిన సైనికుల కోలాహలమంతా జాగ్రత్ వచ్చేసరికి కేవలం ఒక జ్ఞాపకమాత్రంగాను, సర్వదా అసత్తు- సత్తులు కానిదిగాను ఉంటోంది కదా! ఈ ప్రపంచము యొక్క స్థితి కూడా అటు విరాట్ పురుషునికి ఇటు వ్యష్టి పురుషునికి కూడా అట్టిదే!
ఓ రామచంద్రా! స్వప్న సంవిత్ యొక్క ఒక అణువులో “విశాలము-సుదీర్ఘము అగు స్వప్న జగత్తు" అనుభవింపబడగలదు చూచావా? అట్లాగే అనేక లక్షల యోజనముల సమూహము వరకు విస్తృతమైన ప్రమాణం గల-అసంఖ్యాక దేహములుగా త్రిలోకములచే వ్యాపించిన అనేక జగత్తుల సమూహములు ఒక రోమము (వెంట్రుక) యొక్క అల్పమైన చివరి భాగంలో కూడా భాసించగలవు. ‘బ్రహ్మదేవుడు' అనబడు ఈ విరాట్ పురుషుడు సమస్తమహాపర్వతములకు కూడా ఆధారమై అనేక బ్రహ్మాండ సమూహమయుడై ఉండి కూడా, ఒక మట్టి ఆకు చివరలోని ఒక ఛిద్ర భాగమును కూడా పూరించజాలడని కూడా గ్రహించు. అనేక జగత్తులను తన అతివాహిక దేహంతో పూరించునట్టి విశాలాకారుడగు బ్రహ్మదేవుడు చిదాకాశమునందు అణుమాత్ర స్వరూపుడే అవుతాడు. స్వప్నంలో కనబడిన కొండ ఏ ప్రదేశమునూ ఆక్రమించనట్లే వాస్తవానికి ఆ విరాట్ పురుషుడగు బ్రహ్మదేవుని దేహము ఏ ప్రదేశమునందూ వ్యాపించియే లేదని గమనించు.
ఈ బ్రహ్మదేవుని (విరాట్ పురుషుని)...“స్వయంభువు, విరాట్టు, బ్రహ్మాండాత్మ జగత్ శరీరుడు”... ఇట్లా పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి అతడు చిదాకాశమయుడే సుమా! అంతేకాదు. అతడే 'సనాతన పురుషుడు' అని 'రుద్రుడు' అని కూడా చెప్పబడుచున్నాడు. ఇంద్ర - ఉపేంద్రమరుత్-మేఘ-పర్వత సమూహాదులన్నీ అతని దేహమే! అనగా అవన్నీ అతడే అయి ఉన్నాడు. పరమ సూక్ష్మమగు చైతన్యమున చేతితమొనర్చటం-ప్రకాశిత మోనర్చటం అను ఒక చమత్కారం బయల్వెడలుతోంది. అద్దాని నుండి చిత్తశరీరం ఆవిర్భవిస్తోంది.
Page:70
ఆ చిత్త శరీరము క్రమంగా విశాల జ్ఞానయుక్తమై “మహత్తరమైన బ్రహ్మాండమే నేను” అను చింతన చేస్తూ చేస్తూ 'జగత్ శరీరం’గా అగుచున్నది. స్పందన జ్ఞానముచే ఆ బ్రహ్మదేవుడు ప్రాణాదుల సంచలనమును అనుభవిస్తున్నాడు. అతని ప్రాణ సంచలనమే వాయు సమూహంగా జగత్తులో నెలకొనియున్నది. అనగా, స్పందన జ్ఞానముచే బ్రహ్మదేవుడు ఏ ప్రాణ-అపానాలను అనుభవించుచున్నాడో... అద్దానినే బ్రహ్మాండ ఆకాశమున మనం “వాయు సమూహములు" అని పేర్కొనుచున్నాం.
బాలుని చిత్తముచే పిశాచం కల్పించబడి, అనుభవించబడుచున్నది చూచావా? అట్లాగే బ్రహ్మాదేవుని చిత్తంచే ఈ సూర్య-చంద్ర నక్షత్రాది రూపాలు కల్పించబడుతున్నాయి. చిత్తం యొక్క కల్పించబడిన-వాస్తవానికి లేనివే అగు-తేజఃకణములచే అవన్నీ రూపత్వం పొందుచున్నాయి.
హృదయము : ఈ జీవుని ఉదరం ప్రాణ-అపానాల పరివర్తనమునకు (ప్రాణం అపానదశ పొందటం, అపానం ప్రాణదశను పొందటం జరుగుచుండటం చేత ఊయలవంటిది. ప్రాణఅపానాల లయ స్థానమే హృదయస్థానం సుమా! అదియే జగత్తు యొక్క హృదయం.
వ్యష్టి జీవుల ప్రథమ బీజం బ్రహ్మదేవుడే! ఈ వ్యష్టి శరీరాలన్నీ ఈ జీవుల యొక్క వాసనలచే కల్పితములగుచున్నాయి. ఈ జగత్తునందు 'కల్పం' వరకు వ్యవహరించునట్టి సమస్త జీవుల యొక్క వాసనలచే కల్పితాలై ఉన్న ఈ వ్యష్టి శరీరాలకు మొట్టమొదటి బీజం బ్రహ్మ దేవుడే అయి ఉన్నాడు. ఈ జీవులందరి వాసనలు అతనిచే సృజించబడుచున్నాయి. అతని వాసనలే జగద్రూపములుగా ప్రకటితములగుచున్నాయి. ఈ అనేక దేహాల బాహ్య అభ్యంతరాలలో అతడు ఏకరూపం తోటి స్థితి కలిగి ఉన్నాడు. అందుచేత అతడు "చిద్రూపుడు, ఆది బీజం అగు హిరణ్య గర్భుడు”గా వర్ణించబడుచున్నాడు. అతని ఇచ్ఛచే ఇతఃపూర్వమే ఏ ఏ విధంగా ఆయా జీవులందు ఆయా వాసనలచే జగత్ పరంపర ఉదయించిందో... ఇప్పుడు కూడా అదే విధంగా ఉదయిస్తోంది.
బ్రహ్మదేవుని శ్లేష్మ-పిత్త-వాయువులే ఈ సూర్య చంద్ర-వాయువులై ఒప్పుచున్నాయి. అతని శ్లేష్మ బిందువులే ఈ తదితర గ్రహ నక్షత్రాదులుగా చెన్నొందుచున్నాయి. పర్వత సమూహములన్నీ అతని అస్థులు. మేఘములు అతని మేధస్సు నుంచి ఉద్భవించిన వ్యవహారయోచనా క్రమములే! అతని పాదములే ఈ ఊర్ధ్వ-అధో లోకాలు. ఈ బ్రహ్మాండావరణం అతని చర్మము. అతని దేహమే అంతటా ఆవరించి ఉన్నప్పటికీ అతని అట్టి దేహమును ఈ భౌతికమైన కళ్ళతో చూడలేం.
ఓ రామచంద్రా! ఈ జగత్తును "సంకల్పరూపుడగు విరాట్ పురుషుని కల్పనామయ శరీరం"... అని ఎఱుగుము. అతని మనోకల్పనయే ఈ జగత్తు. మనస్సుతో కల్పించబడినది సత్యమెట్లా అవుతుంది చెప్పు?
కాబట్టి... ఈ ఆకాశం, పర్వతాలు, నేల, సముద్రాలతో కూడిన సమస్త జగత్తు కూడా అధిష్ఠాన రూపముచే ప్రశాంతమగు చిదాకాశమే అయి ఉన్నది. భావికుని కంటే భావన వేరు కాదు కదా! స్వప్న ద్రష్టకంటే స్వప్నం వేతైనదా! కానేకాదు కదా!
Page:71
శ్రీరాముడు : మహర్షీ! మీకు లోకాలోక పర్వతంపై ఆ శిలలో విద్యాధరి బ్రహ్మాండాన్ని చూపగా మీరు అందులో ప్రవేశించి ఆయా లోకాలన్నీ దాటి బ్రహ్మలోకంలో గల బ్రహ్మదేవునితో సంభాషిం చటం జరిగింది కదా! ఆ బ్రహ్మదేవుడే విరాట్ పురుషుడు అయి ఉన్నాడని, మన కథాక్రమం అనుసరించి ఆ విరాట్ పురుషుడు తన బ్రహ్మాండ శరీరాన్ని ఉపసంహరించే ఉద్యమంలో ఉన్నాడని కూడా చెప్పారు. ఇప్పుడు ఆ శిలయందు గాంచబడిన బ్రహ్మకల్పమందలి బ్రహ్మదేవుని (లేక) విరాట్ పురుషుని యొక్క సంకల్పమయ బ్రహ్మాండ శరీరం గురించి మరికొంత తెలుసుకోవాలని ఉన్నది. బ్రహ్మాండ శరీరుని బ్రహ్మాండ శరీరము గురించి, అద్దాని విచిత్రాచారములతో కూడిన బ్రహ్మాండ వ్యవస్థ గురించి మరికొన్ని జ్ఞాన విశేషాలు ప్రవచించమని నా ప్రార్థన!
బ్రహ్మాండ నిర్మాణానికి ముందు ఆ బ్రహ్మాండ శరీరుని రూపము-ఉనికి ఎట్టిది? బ్రహ్మాండ నిర్మాణానంతరం అతని ఉనికి బ్రహ్మాండంలో ఎట్లు ఏ రూపంలో ఉన్నది? బ్రహ్మాండమంతా నిండి ఉన్న అతడు బ్రహ్మలోకంలో దర్శనమిస్తూ ఎట్లా ఉన్నాడు?... సాధకులమగు మా సంశయ నివృత్తి కొఱకు, చిత్తవృత్తి ప్రశాంతత కొఱకు చెప్పవలసినదని నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ కనబడే బ్రహ్మాండ సృష్టి అంతా ఒక కల్పన. కల్పనకు ముందే కల్పన చేస్తున్నవాడు ఉంటాడు కదా! కనుక విరాట్ పురుషుని మొట్టమొదటి కల్పనారహిత శరీరము “ఆది-మధ్య-అంతరహితమగు పరమచిదాకాశమే”... అయి ఉన్నది. అతని తదనంతర కల్పనా శరీరమగు ఈ జగత్ శరీరము ఆ చిదాకాశ స్వరూపము ముందు అత్యంత స్వల్ప విశేషం మాత్రమే! అనగా విరాట్ పురుషుడగు బ్రహ్మదేవుని స్వసంకల్ప శరీరమే ఈ బ్రహ్మాండం. అట్టి ఈ బ్రహ్మాండానికి వెలుపల ఆ బ్రహ్మదేవుడు చిదాకాశమాత్రుడై నిస్సంకల్ప సాక్షిగా తన ఈ బ్రహ్మాండాన్ని గాంచుచున్నాడు. ఈ విధంగా ఈ జీవుడు-ఆ విరాట్ పురుషుడు ఇద్దరూ కూడా...
1.) సంకల్ప రూపులు, మరియు 2.) సర్వ సంకల్పములకు మునుముందుగానే ఏర్పడి ఉన్న నిర్మల చిదాకాశ స్వరూపులు కూడా!
చిదాకాశ స్వరూపుడగు బ్రహ్మదేవునిచే (విరాట్ పురుషునిచే) గాంచబడే ఈ బ్రహ్మాండం కూడా పరమార్థ దృష్టిచే చిదాకాశమే అయి ఉన్నది. పక్షి తన నుండి జనించిన గ్రుడ్డును "పై విభాగం-క్రింద విభాగం” అని విభజనచే చూస్తుంది చూచావా? తనచే కల్పించబడిన బ్రహ్మాండాన్ని ఆ విరాట్ పురుషుడు రెండు విభాగాలుగా గాంచుచున్నాడు -
1.) ఊర్ధ్వ విభాగం ఆకాశము; 2.) అధో విభాగం పృథ్వి మొదలైన లోకములు. అయితే అవన్నీ ఆత్మకంటే భిన్నమైనవి కావు సుమా!
బ్రహ్మాండము యొక్క ఊర్ధ్వ విభాగము విరాట్ పురుషుని శిరస్సు. అధోభాగం అతని పాదములు. మధ్యనున్న విభాగము ఆయన ఊరువులు (తొడలు).
Page:72
ఊర్ధ్వ అధోభాగముల మధ్యగల మధ్య విభాగమే అనంతము నీలవర్ణము - శూన్య రూపము అగు ఆకాశముగా జనులకు దృగ్గోచరమౌతోంది.
అట్లాగే స్వర్గలోకం-నక్షత్రములు-సురాసురులు-మనుష్యులు, బుద్ధి-ప్రాణములు, వృత్తి భేదములు, అతని శరీర విభాగములే! భూత పిశాచములు అతని దేహములోని క్రిములు. లోక-లోకాంతరములు ఆ విరాట్ పురుషుని కనులు. ఈ భూమండలము అతని తలదిండు. పాతాళాది లోకాలు అతని పాదాలు. సముద్రము-ద్వీపములతో చుట్టబడిన పృథ్వి అతని దేహ మధ్య ప్రదేశం. ఈ నదులు, దిక్కులు, మేఱుపర్వతం, తదితర పర్వతములు, చంద్ర-సూర్యులు, అతని శరీర విభాగములే! బ్రహ్మలోకం అతని శిరస్సు.
శ్రీరాముడు : మహర్షీ! ఈ బ్రహ్మాండమే దేహంగా గల ఆ బ్రహ్మదేవుని అసలు స్వరూపం ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ బ్రహ్మదేవుడు సమష్టి మనఃస్వరూపుడు. అతడే స్వయముగా ఈ జీవుల మనస్సు అయి ఉన్నాడు. అతని మనస్సును మరొక మనస్సేదీ సృజించటం లేదు. ఈ సృష్టి ఆత్మచే కల్పించబడలేదు. ఎందుకంటే ఆత్మ కూటస్థము, అద్వయస్వరూపము కదా! ఆత్మయందు ఎవనిచే జగత్తు ఎవనికి సంభవిస్తుంది? కాబట్టి ఈ కనబడేది మనోకల్పన మాత్రమే!
ఆ బ్రహ్మదేవుడు స్వయముగా సమస్త ఇంద్రియరూపుడై ఉన్నాడు. అతని చేతనే నా యొక్క తదితరుల యొక్క ఇంద్రియముల అస్తిత్వము కల్పించబడింది. అయితే అతని ఈ ఇంద్రియ సమూహము కూడా కల్పనా మాత్రమే! (ఉదాహరణకు) అవయవి - అవయవములు ఏక శరీరమే కలిగి ఉన్నారు కదా! అట్లాగే మనస్సు ఇంద్రియములు అను ఈ రెండింటికీ ఏమాత్రం భేదం లేదు. అంతేకాదు! ఈ జగత్తునందలి సమస్త క్రియలు అతని క్రియలే అవుతాయి.
శ్రీరామచంద్రుడు : ఇది ఎట్లా మహర్షీ!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును.
1.) బ్రహ్మదేవుడు సమష్టి మనోరూపుడు. కనుక ఈ సర్వజీవుల మనస్సు ఆయనవే!
2.) మనస్సును బట్టే ఇంద్రియాలు వ్యవహరిస్తున్నాయి. కనుక ఈ ఇంద్రియాలన్నీ ఆయనవే!
3.) మనో-ఇంద్రియాలకు సంబంధించినవే సర్వక్రియలు. కాబట్టి సమస్త క్రియలు అతని క్రియలే అవుతాయి.
సమస్త సంకల్పములు బ్రహ్మదేవునివే! జలమందు తరంగత్వము ఉదయించి, ఆ తరంగత్వమే అనేక తరంగములుగా ప్రదర్శితమౌతోంది కదా! తరంగములన్నీ తరంగత్వమునకు సంబంధించినవే కదా! అట్లాగే అతని సంకల్పములే సర్వజీవుల యొక్క (ఆరోపితమగు) ద్వైతవ్యవహార రూపంగా నడచుచున్నది.
జాగతే తస్య విజ్ఞేయే నాఽన్యే అస్య మృతి-జన్మనీ ।
స ఏ వేదం జగత్యస్మత్ సంకలాత్మా అస్య నేఽతరత్ ॥
సమస్త జగత్తు యొక్క ఉత్పత్తి-వినాశనములే ఆ బ్రహ్మదేవుని జనన-మరణములని గ్రహించు. అంతేగాని ప్రత్యేక వ్యక్తివి నిజమైన జనన మరణములు కావు సుమా!
Page:73
ఈ ప్రపంచము యొక్క సమష్టి రూపమే ఆ బ్రహ్మదేవుని రూపం. అందరి సంకల్పముల సమష్టియే ఆయన. నావంటి సర్వుల యొక్క సమష్టి రూపము అతడేగాని మతెవ్వరూ కాదు. బ్రహ్మాండ శరీరుడగు విరాట్ పురుషుని సత్తయే జగత్సత్త.
తత్ సత్తయా జగత్సత్తా, తత్మృత్యైవ జగత్ మృతమ్ ।
యాదృశీ స్పందమరుతోః సతైకా, తాదృశీ తయోః ॥
జగత్ సమష్టి స్వరూపుడు–బ్రహ్మాండ శరీరుడు-హిరణ్యగర్భుడు విరాట్ స్వరూపుడు - సమష్టి మనోస్వరూపుడు-సమష్టి ఇంద్రియ స్వరూపుడు-సమష్టి క్రియా స్వరూపుడు-జగదుత్పత్తి వినాశన స్వరూపుడు - సర్వ సంకల్ప స్వరూపుడు" - అగు ఆ బ్రహ్మదేవుని సత్తాచేతనే ఈ జగత్ సత్తా ఏర్పడి ఉంటోంది. అతని సంకల్ప ఉపసంహారముచే జగత్తు సత్తాను కోల్పోతోంది. అతని ఉపసంహరణ రూప మరణముచే జగత్తు యొక్క మరణము సంభవిస్తోంది.
స్వప్న ద్రష్టకు - స్వప్నములో విషయాలకు భేదంలేదు కదా! జలమునకు-జలతరంగములకు భేదమేమున్నది? వాయువుకు-వాయు చలనమునకు భేదమెక్కడిది?... అట్లాగే... బ్రహ్మదేవుడుఅతనిచే కల్పితమైన జగత్తు ఒకే సత్త కలిగి ఉన్నాయి.
ఓ రామచంద్రా! బ్రహ్మములో (జలంలో ఉద్భవించే తరంగంలాగా) 'విరాట్టు' అనే మహా కెరటం ఉద్భవిస్తోంది. అదియే ‘ప్రథమ స్పందన’ అని కూడా అంటారు. బ్రహ్మములో ఉదయించే విరాట్టుకు బ్రహ్మమునకు (జలము జలములోని స్పందన వలె) భేదమే లేదు. అట్టి విరాట్టుకు ఆ విరాట్టు యొక్క స్వరూపమగు ఈ జగత్తుకు భేదం లేదు. కనుక
జగత్ బ్రహ్మ-విరాట్ చేతి శబ్దాః పర్యాయవాచకాః ।
సంకల్పమాత్రమేవై తే శుద్ధచిత్ వ్యోమరూపిణిః ॥
జగత్తు-బ్రహ్మము-విరాట్ అను ఈ మూడు పదములు ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయని గ్రహించు. ఆ మూడూ పర్యాయపదములే సుమా! ఈ విరాట్-జగత్తులు శుద్ధ చిదాకాశరూపుడగు పరమాత్మ యొక్క సంకల్ప మాత్రములే అగుటచేత ఆ రెండు బ్రహ్మరూపములే అయి ఉన్నాయి. “అధిష్ఠాన రూపముచే సర్వము బ్రహ్మమే" అని శాస్త్రములచే సిద్ధాంతీకరించబడుతోంది కదా!
శ్రీరాముడు : మునీంద్రా! "పరమాత్మ తన యొక్క సంకల్పముచే విరాడ్రూపియై సాకారత్వము పొందారు” అను విషయం మీ విశదీకరణచే నేను అంగీకరిస్తున్నాను. అయితే ఆ బ్రహ్మదేవుడు తన విరాడ్రూప శరీరం లోపల (తన కల్పనయగు సాకార జగత్తు లోపల) తానే ఎట్లా వసించు చున్నాడు? ఈ విషయం మరింత సుస్పష్టపరచండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీ ఇష్టదైవమైన ఆ చంద్రశేఖరుని నీ మానస పూజయందు నీ హృదయమునందు కల్పించబడిన రత్న మండలములో ఆ దేవదేవుని ఆసీనుని చేసి మనోకల్పితమైన ఛత్రచామరములచే నీవు ఆయనను పూజిస్తూ ఉంటావు కదా! నీవు నీ మనస్సు నందు ఉండి నీ ఇష్టదైవాన్ని మానసికంగా పూజిస్తున్నప్పుడు నీలో నీవే ఉంటున్నావు కదా!
Page:74
అట్లాగే సంకల్ప రూపుడగు బ్రహ్మదేవుడు తన సంకల్ప వసించగలడు. అంతేకాదు - - శరీరమునందు తానే "ఈ స్థూల దేహమందలి హృదయకమలమున సూక్ష్మ దేహాత్మకమగు నా యొక్క జీవరూపస్థితి ఉన్నది” అనే విషయం వివేకులందరికీ అనుభవ సిద్ధమే అయి ఉన్నది. అట్లాగే బ్రహ్మదేవుడు ఈ సమష్టి స్థూల ప్రపంచంలో సూక్ష్మదేహి అయి ఉన్నారు. ఓ రామచంద్రా! సర్వజీవుల యొక్క ఈ భౌతిక దేహములన్నీ కూడా మట్టితో నిర్మించబడిన బొమ్మలవంటివి. అద్దంలో ప్రతిబింబమువలె సర్వజీవులలోను బ్రహ్మదేవుడి చిత్తాకాశం వేంచేసియే ఉన్నది.
యత్ర త్వమపి దేహాన్తః కర్తుం శక్తో అస్య అలం స్థితమ్ ।
సంకల్పాత్మా విభుః తత్ర బ్రహ్మ కిం న కరిష్యతి? ॥
నీవే నీ స్థూల దేహమునందు వసించగలిగినప్పుడు... ఇక సంకల్పరూపుడు, సర్వవ్యాపి అయిన బ్రహ్మదేవుడు ఆ విరాట్ సృష్టిలో ఎందుకు వసించలేడు చెప్పు? అనేక లక్షణాలతో ఉండి ఉండగా... ఇకప్పుడు సర్వశక్తి తత్త్వ స్వరూపుడై ఆవిర్భవించినట్టి చైతన్యకల్పాత్మకుడైన బ్రహ్మదేవుడు నిజదేహమగు ఈ బ్రహ్మాండమున ఎందుకు వసించలేడు? ఓ రామచంద్రా! చిదాకాశరూపుడే అయి ఉన్న బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండము దృష్ట్యా సాకారరూపుడే అగుగాక! లేక... తన యొక్క సమష్టి మనోరూపముచే నిరాకారాకాశ రూపుడు అయి ఉండవచ్చు గాక! ఆ ఉభయ స్థితులందు కూడా సమస్త పదార్థముల యొక్క బాహ్య-అభ్యంతరాలలో ఆయన వెలయుచునే ఉన్నారు. అయితే వాస్తవానికి బాహ్య-అభ్యంతర కల్పన పరమాత్మ యందు లేదు. ఆ బ్రహ్మదేవుడు బాహ్యమున బ్రహ్మాండ రూపుడై ఉంటున్నారు. అభ్యంతరముననో, 'అహంత్వం' మొదలైనవన్నీ తన రూపంగా కలిగి ఉంటున్నారు. ఆత్మయందు ఆత్మారాముడై ఉంటున్నాడు. అన్ని క్రియా విశేషాలకు తానే ఒక వైపు కారణమై ఉంటూనే, మరొక వైపు కాష్ఠమౌనం వహించి కేవల సాక్షి అయి ఉంటున్నారు. అతడు జడ స్వరూపుడు కాకపోయినప్పటికీ, నిత్యోదితమగు చైతన్యస్వరూపుడే అయినప్పటికీ, ఏ మార్పు చేర్పులు లేనివాడై (జడ విలక్షణుడై) స్వాత్మయందు విరాజిల్లుచున్నారు.
ఓ రామచంద్రా! కేవలమూ అ విరాట్ పురుషుడే కాదయ్యా! తత్త్వజ్ఞానులగువారంతా కూడా ఆయా బంధాలు ఉన్నప్పుడుగానీ, అవన్నీ లేనప్పుడుగానీ తృణం- కాష్ఠం-మనుజ విగ్రహాల వలె క్రోధ-రాగ-ఆశాదులచే స్పర్శించబడని వారై మహా మౌనస్వరూపులై ఉంటున్నారు. జల ప్రవాహం నిరోధించబడినట్లు వారు నిరోధాలు పొందవచ్చుగాక! ఈ అవయవాలు ఛిన్నాభిన్నమగు క్షణాలు సమీపించ వచ్చుగాక! వీరు తమ శాంత-అంతరంగ మౌనస్థితిని విడుచుటయే లేదు. వారు వివిధ కార్యజాలలో నిమగ్నమైయున్న సమయంలో కూడా శిలామధ్య భాగం వలె నిశ్చల స్వరూపులై, క్రోధాది చంచలత్వాన్ని పొందనివారై, శాంతచిత్తులై ఆద్యంతాలను ఎఱిగి ఉన్నవారై ఉంటున్నారు. పరమశాంత చిత్తులై సర్వ సంరంభాలను ప్రశాంత-మౌన స్వరూపంచే కేవల సాక్షిగా దర్శిస్తున్నారు.
అట్టి మహనీయు లెందరో ఈ సభకు వేంచేసి మన ఈ సంవాదమును అంగీకార పూర్వకంగా సమృద్ధి పరస్తూనే ఉన్నారు కూడా!
Page:75
శ్రీరాముడు : ఓ మహర్షీ! ఆ లోకాలోక పర్వత శిలలో గల బ్రహ్మాండమునకు అధిపతియగు బ్రహ్మదేవుడు ధ్యానతత్పరుడైయున్నారు కదా! అప్పుడేమైనది?
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! ఇక కథాక్రమంలోకి వద్దాంబ్రహ్మదేవుడు అత్యంత మౌనముతో కూడిన ధ్యానతత్పరుడై ఉన్నారు. అప్పుడు నాకు ఎదురుగా ఇంద్రాది దేవతల నగరములు పతనమవటం కనిపించింది. మెల్లగా నా దృష్టిని నలువైపులా సారించాను. ఆకాశంలో ఊర్ధ్వంగా ప్రకాశించే మధ్యాహ్న సూర్యునికి వేతైన మరొక రెండవ సూర్యుడు పశ్చిమంగా ఉదయించటం కనిపించింది. ఆ తరువాత నైఱుతి దిక్కులోను, దక్షిణ దిక్కు, పూర్వ దిక్కులోను, ఈశాన్య దిక్కులోను, ఉత్తర వాయవ్య దిశలలోను భిన్న భిన్న సూర్యులు ఉదయించటం చూచాను. "ఆహాఁ! ఏమి ఈ దైవ ప్రతికూలత”.... అని ఆశ్చర్యపడుతూ ఉండగా ఇంతలో భూమియొక్క ఉపరితలం నుండి ఇంకొక సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. ఆ తర్వాత దిక్ సమూహముల మధ్యగా ఆకాశంలోంచి 11వ సూర్యుడును, ఆపై మరొక సూర్యుడును-ఇట్లా ద్వాదశాదిత్యులు ఉదయించారు. 11వ సూర్యబింబమునందు సమస్త సూర్యుల ప్రతిబింబమువలె మరల ముగ్గురు సూర్యులు ఉదయించారు. ఆ సూర్య సమూహము రుద్రుని శరీరముగా ఆకారం సంతరించుకున్నాయి. ఆ రుద్ర శరీరమునందు 3 నేత్రములు ఉన్నాయి. ఆ రుద్రశరీరమే ద్వాదశాదిత్య సమూహరూపమై దిక్కులన్నీ భస్మీభూతం చేయనారంభించింది.
అటు తరువాత భూమినే శుష్కింప జేయగల గ్రీష్మఋతు పవనాలు (వాయు, వీచికలు) ఎక్కడి నుంచో వీచసాగాయి. అక్కడి నుండి అదృశ్యరూప శిఖల నుండి అగ్ని రహితమైన ఉష్ణము ఎక్కడబడితే అక్కడ ఉదయించసాగింది. అక్కడ అగ్నికి నా అవయవాలు దగ్ధమై భిన్నములవ సాగాయి. నేనిదంతా గమనిస్తూ “ఇక ఇక్కడ ఉండటం ఉచితం కాదు. క్షేమం కాదు" అని అనుకొని, నా స్థూలాన్ని వీడి ఊర్ధ్వమున సుదూరంగా గల ఆకాశప్రదేశం చేరాను. ఆ సుదూర ఊర్ధ్వ ఆకాశ ప్రదేశం నుండి ప్రచండ తేజస్సుతో ఉదయించి బంతివలె ఎగుఱుచున్న ద్వాదశాదిత్య సమూహమును గమనించసాగాను. ఆ ఆదిత్య సమూహం దశ దిక్కులను తపింపజేయసాగాయి. అప్పుడు ఆయా దిశలలో వర్తులాకారముగా దిక్కులను పూరిస్తూ నక్షత్రమండలాలు కనిపించాయి.
అక్కడి ద్వాదశ సూర్య సమూహముల నుండి భీకర 'కుహ-కుహ' శబ్దాలతో బయల్వెడలిన అగ్ని జ్వాలలు లోకలోకాంతరములను, అసంఖ్యాక జీవులను దహించసాగాయి. నక్షత్రాలు ఆ వేడికి రాలసాగాయి. జీవుల హాహాకారాలు మిన్నుముట్టాయి. అసంఖ్యాక ప్రాణులు భీకర శబ్దాలు చేస్తూ మరణించసాగాయి. మహా పర్వతములు నేలమట్టం కాసాగాయి. విద్యాధర స్త్రీలు నేలకూల సాగారు. ఆ అగ్ని శిఖలచే బాధింపబడి కొందరు జీవులు ఏడుపులు - పెడబొబ్బలు పెట్టుచుండగా మరికొందరు జీవులు తమ యొక్క యోగబలం చేత బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని బయల్వెడలి అమరులయ్యారు.
Page:76
సముద్రంలోని జలచరాలు జలము ఇంకుచుండటంచే అటూఇటూ పరుగులు తీయసాగాయి. జలం ఆవిరి అగుచుండుటచే తరంగములే ఇంధనంగా కలిగి ఉండే బడబాగ్నులు ఖండఖండములు కాసాగాయి.
అటు తర్వాత “ప్రళయాగ్ని” అనే నటుడు “జ్వాలలు" అనే వస్త్రములు ధరించి కొఱివులను మాలలుగా ధరించి జగత్తు అనే కుటీరంలో నృత్యం చేయసాగాడు. ఆ ప్రళయాగ్నిచే అరణ్య - గ్రామ-నగర సమూహాలు దగ్ధం కాజొచ్చాయి. స్వర్గలోకం యొక్క ఉపరిభాగం కూడా జ్వలింఎ "సాగింది. సిద్ధలోకములు కూడా అగ్నికి ఆహుతి కాజొచ్చాయి. దిక్కులు అగ్ని గోళాలతో ఒకటితో మరొకటి బంతులాట ఆడుకుంటున్నట్లు కనిపించసాగింది. దశదిశలు ఆ ద్వాదశాదిత్య స్వరూపుడగు రుద్రునిచే దహించవేయబడసాగాయి. ఆ రుద్రుడు కదలుతుంటే పర్వతగుహ లోంచి అగ్నిశిఖలు బయల్వెడలసాగాయి. దిక్కులు సంపత్తి రహితం కాసాగాయి. అప్పుడు జనించుచున్న ధూమసమూహం (దట్టమైన పొగజ్వాలలు) దిక్కులను మూసివేస్తున్నట్లు కనిపించాయి. సహ్య పర్వతము వంటిది అసహ్యత్వము పొందింది. ఆకాశం అగ్నిజ్వాలలతో కూడిన సరోవరరూపంగా కనిపించసాగింది. బ్రహ్మాండము యొక్క ఊర్ధ్వభాగం మూత గలదై, అధోభాగం ప్రజ్వరిల్లుచుండగా ఉడుకుచున్న అన్నపుగిన్నెవలె కనిపించింది. ఆ ప్రళయకాలం చూచిన జగత్ల లక్ష్మి గుండెలు బాదుకుంటున్నట్లు అనిపించసాగింది. సప్తసముద్రజలం కాగుచున్న నీటి బిందెలోని నీరువలె ఉడక నారంభించింది. సముద్ర జలములు ఇంకిపోవుచుండగా సముద్రా లలో కొండగుహలు కనిపించసాగాయి. లోకపాలకులు నగరాలు నేలకూలసాగాయి. మేఱుపర్వత శిఖరాలు ద్వాదశ ఆదిత్యుల వేడికి కరిగిపోసాగాయి. ఆ ప్రళయాగ్నికి అన్నీ నశిస్తూ ఉంటే ఇక సువర్ణము ఆకాశము మాత్రమే ఆ అగ్నికి దహించక ఉన్నాయి.
అవి రెండు - 1.) ఆకాశం వ్యాపకమయి ఉండటంచేత, 2.) సువర్ణము (శుద్ధ సత్త్వము) దోషరహితమైన దగుటచేత ప్రళయాగ్నులచే దగ్ధం కాబడలేదు. అందుచేతనే “రజస్తమో గుణములు లేనట్టి బ్రహానందదాయ కమగు శుద్ధసత్వగుణమే సుఖసారము” (సత్వమేకం సుఖం మన్యే న రజో నచవా తమః)... అని నా అభిప్రాయం.
ఆ సమయంలో మేఘములన్నిటినీ దహించివేయగల ప్రళయాగ్ని మేఘం ఆకాశమంతా ఆవరించి నిప్పుల వర్షం వెదజల్లింది. నేలపై గల జలంలో ఆ నిప్పుల వాన కురుస్తున్నప్పుడు నీరు ఆవిరైపోసాగింది. ఇక నీటిలోను, నేలపైన గల చతుర్విధ ప్రాణులు ఆ అగ్నివర్షానికి ఆహుతి కాసాగాయి. దానితో జగత్తు ఆకులురాలిన వృక్షంలాగా నిర్మానుష్యం కాసాగింది. క్రమంగా అగ్ని మేఘముల తాకిడికి భస్మమైన సృష్టి వస్తువుల భస్మంకూడా కనిపించకుండాపోతుంది. ఆ ఉల్లాస సహితమగు అగ్నివర్షానికి ఒక్క కైలాసం మాత్రం దగ్ధం కాలేదు. అప్పుడు మరికొంత సమయానికి కల్పాంత కారణంగా కుపితుడైన రుద్రుని యొక్క నేత్రాగ్నిచే కైలాసం కూడా భస్మీభూతం కాసాగింది. అగ్నిజ్వాలలు ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఆకాశం కనిపించింది.
Page:77
ఇన్ని మాటలెందుకు? సమస్తమూ కూడా “ఎప్పుడో భూతకాలంలో సృష్టి ఉండేది” అన్నట్లుగా సృష్టి యొక్క ఛాయ కూడా మిగలకుండా కరిగిపోసాగింది.
అప్పుడు కల్పాంతం ప్రత్యక్షం కాసాగింది. మూర్ఖులకు కూడా "ఈ సంసారం అసారమే కదా” అన్నట్లుగా ఆ కల్పాంతం ప్రకటితమవసాగింది. అప్పటి ప్రళయాగ్నులు జగత్తు యొక్క నామ-రూప సమూహములను కుందేటి కొమ్మువలె ఏమాత్రం ఉండనివిగా చేసివేయసాగాయి. అగ్ని జ్వాలలు క్రమంగా శ్యామవర్ణం (నల్లటి రంగు) సంతరించుకోసాగాయి. ఇంతలో ఎక్కడి నుండో ప్రచండ వాయువులు వీచసాగాయి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అప్పుడు ఆకాశంలో 'పుష్కరావర్తం' అనే కాలమేఘం ఎక్కడి నుంచో ఉదయించింది. అది పర్వతములను కంపింపజేయసాగింది. ఆ మేఘం యొక్క ప్రకంపనాలకు సాగర తరంగాలు ఆకాశంలో ఎత్తుగా లేవగొట్టబడ్డాయి. సముద్రం హద్దుదాట సాగింది. భూతలము-పాతాళము క్రమంగా నశించటం ప్రారంభించాయి. దిక్కులన్నీ శోకనిమగ్న మైనాయి. మేఘాల ‘గులుగులు’ శబ్దాలు అంతటా ఆవరించాయి. ఆ ధ్వని అత్యంత కోలాహలం గాను, దుస్సవహంగాను ఉన్నది. ఆ శబ్దముల భయంకర మార్మోతలు స్వర్గ మర్త్య-పాతాళ లోకాలను నింపివేశాయి. ఆ 'ఘనా - ఘన' శబ్ద తరంగాలు క్షీర సాగర మధ్య ఘటన శబ్ద విన్యాసాలను మించిపోయాయి. అప్పుడు "అరె! ఈ ప్రళయాగ్నిలో కాలమేఘాలు ఎలా స్థితి పొందాయి"... అని విస్మితుడనయ్యాను. ఆ మేఘాలు జనించిన విధం, స్థానాలను అన్వేషిస్తూ ఒక్క అధోదిశ తప్ప మిగిలిన 9 దిశలను పరికించి చూచాను. నాకు ఏ దిక్కులోనూ మేఘాలు కనిపించ లేదు. విశాలమైన కొఱవుల యొక్క-పిడుగుల యొక్క వృష్టి మాత్రమే నాకు గోచరిస్తోంది. ఆ వృష్టి కోట్లయోజనాల వరకు ఉన్న పదార్థములన్నిటిని భస్మీభూతం చేసివేయటం మాత్రం కనిపించింది.
అటు తర్వాత ఆకాశంలో అతిదూరంగా ఊర్ధ్వము నుండి శీతల వాయువులు-అధోభాగం నుండి ఉష్ణ వాయువులు వీచుచున్నట్లుగా నా త్వగింద్రయం (స్పర్శేంద్రియం) గుర్తించసాగింది. వాటికి ఆవలగా వలయాకారంగా కల్పాంత మేఘములు ఆవరించి ఉన్నట్లు గమనించాను.
రామచంద్రా! ఆ సమయంలో మేఘాల యొక్క - అగ్నుల యొక్క సమావేశంచే ఛట ఛటా శబ్దములు ఉదయించి మహా సంగ్రామమును తలపింపజేయసాగాయి. ఆ సమయంలో (ఆ మహా ప్రళయ కాలము) పృథ్వి-జలము-అగ్ని-వాయువు అనే నాలుగు భూతములూ మహాసంక్షోభం చెందుచుండగా ఇక ముల్లోకముల విలయ స్థితి భీకరాకృతితో కనిపించింది. అప్పుడు కొంచెం త్రాణతో మిగిలి ఉన్న జీవుల ఆర్తనాదాలు మిన్నుమిట్టుచూ ఉన్నాయి. శిష్టులగు దేవతలు అతి దీనంగా విలపించటం కనిపించింది.
Page:78
క్రమక్రమంగా ఒకప్పటి సృష్టి యొక్క స్థూల సూక్ష్మ తత్త్వాల కించిత్ గుర్తు కూడా అనేకచోట్ల కనబడకుండా పోయినాయి. ఇతఃపూర్వం సృష్టి భాసించినచోట వర్తమానమున సర్వనాశనముచే (ఆ స్థానము - space) పరమ శాంతిని సంతరించుకొని అతి శోభాయమానముగా ఉన్నది.
శ్రీరాముడు : స్వామీ! సృష్టియే సర్వనాశనమైన తరువాత ఇక పరమశాంతిగా శేషించటానికి అక్కడ ఏమి ఉండదు కదా! ఇంకా "శోభాయమానంగా ఉన్నది” అంటున్నారేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : సృష్టిలోపించినప్పటికీ “వాస్తవానికి ఉత్పత్తి-నాశనరహితుడు" అగు పరమాత్మ శేషించియే ఉంటాడు కాబట్టి “ఆతనిచే శోభించుచున్నది” అని పలికాను.
ప్రచండవాయువులచే ఏకముగా అయ్యే సముద్రంలాగా అక్కడ ద్వీప-పాతాళాది లోకాలన్నీ శమించుచున్నాయి కదా! ఇక అక్కడ ప్రపంచమునంతా ఏకంచేసే మహాసముద్రం మెల్లగా వృద్ధినొందసాగింది. జలవృష్టి మొట్టమొదట రోకలి ప్రమాణంలోను, తరువాత స్తంభాకారంగాను ఆ తర్వాత మహావృక్షాకారంగాను జలధారలుగా కురవనారంభించింది. ఆ తర్వాత కుంభవృష్టి కురిసింది. ఆ మహావృష్టిచే అక్కడ ప్రజ్వలిస్తున్న అతి దాహక ఉష్ణము శమించుచున్నదయింది.
ఓ రామచంద్రా! అనేక ద్వీపములు-ద్వీపకల్పములు-పర్వతములు-స్థాణువులు-జలాంతర్గత లోకములు-ఊర్ధ్వ-అధో లోకములు గలిగి ఉండే ఆ బ్రహ్మాండకోటరము ఇసుకచే బాలుడు నిర్మించిన పిచ్చికగూడులాగా వినాశనము పొందింది. అప్పటి జలప్రళయం సర్వమును ముంచెత్తివేసింది. సర్వ ప్రాణులు-పదార్థములు ఆ జలప్రళయముచే మ్రింగివేయబడ్డాయి.
శ్రీరాముడు : మహర్షీ! ఆ విధంగా కల్పాంత వాయువుల చేత, జల మహాప్రళయం చేత, రుద్రుని మూడవ కన్ను నుండి జనించిన అగ్నివర్షం చేత, లోకములన్నీ జీవ వస్తురహితమగుచుండగా మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడి నుండి అదంతా గమనిస్తున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! తపోలోకం వరకు ఆ విధంగా ప్రళయ సముద్రంలో మునిగి పోవుచుండగా నేను సత్యలోకమున గల ఆకాశంలో ఉండి అదంతా గమనిస్తున్నాను. అంతా లయం పొందుచుండగా ఇక నేను సత్యలోకం వైపుగా దృష్టిని సారించసాగాను. అక్కడ నాకు శిలా నిర్మిత విగ్రహం వలె నిశ్చల సమాధి యందు కూర్చుని బ్రహ్మదేవుడు కనిపించారు. ఆయనతో సమానంగా కైవల్యం పొందుటకు అధికారులగు దేవతలు, నిర్మల హృదయులగు మునులు, బృహస్పతి, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, చంద్రుడు, వరుణుడు, అగ్ని, ఋషులు, దేవగంధర్వ సిద్ధ-సాధ్యుల నాయకులు మొదలైనవారు నిశ్చల సమాధియందు ఆసీనులై కనిపించారు. వారంతా పద్మాసనం ధరించి ధ్యాన పరాయణములైఉండి బాహ్యానికి మాత్రం నిర్జీవుల వలె కనిపించారు. ఇంతలో ద్వాదశాదిత్యులు కూడా ఆ చోటకు విచ్చేశారు.
Page:79
శీఘ్రంగా వారు కూడా అక్కడి దేవ-మునుల వలె పద్మాసనమున బంధించి కూర్చున్నారు. అట్లా ముహూర్తం కాలం (48 నిమిషములు) గడిచింది. స్వప్నం నుండి మేల్కొనిన మనుజుడు స్వప్నంలో తనకు అనుభవమై కనిపించిన వస్తు విశేషాలన్నీ ఇట్టే విడిచివేస్తాడు చూచావా? ఇక అతనికి స్వప్నమంతా జ్ఞాపకమాత్ర విశేషంగానే ఉంటుంది కదా! అట్లాగే ఆ బ్రహ్మదేవుని ఆత్మమాత్రపరిశేషునిగా నా ఎదుట చూచాను. ఆతనికి ఆతని ఇతఃపూర్వ సృష్టి అంతా ఇతఃపూర్వపు స్వప్నమువలె అయింది. ఆతడు 'బ్రహ్మాండ కల్పన' అనే స్వప్నం ముగించి నిదుర నుంచి లేచిన వానివలె కనిపించారు.
ఆ విధంగా బ్రహ్మదేవుని అంతిమసాక్షాత్కార సమయమున అతడు, అచట ఉన్న తదితరులు విదేహముక్తిని పొందటం చూచాను. అప్పుడు బ్రహ్మలోకం కూడా జనశూన్యమైన అరణ్యం వలె గోచరించింది. అప్పటిదాకా దృశ్యరూపంగా కనిపించిన సమస్త ముని-ఋషి-విద్యాధరాదులు కూడా అదృశ్యరూపులైనారు. ఓ రామచంద్రా! వారు ఆ చోటనుండి ఎక్కడికీ పోకుండానే ఆత్మ స్వరూప విలీనులైనారు సుమా! ఎందుకంటే నేను ఆకాశమున ఉండియే, “ధ్యానముచే బ్రహ్మదేవుని వలె వారందరూ కూడా నామ రూపములను త్యజించి నిర్వాణమును పొందారు” అని నా సూక్ష్మ దృష్టిచే గ్రహించాను.
వాసనాయాం విలీనాయామ్ 'అదర్శనమ్' ఉపాగతాః ।
స్వప్నలోకాః ప్రబుద్ధానామివ స్వం రూపమాగతాః ॥
నిద్ర నుండి మేల్కొనినవారు మరల నిద్రకు ముందటి స్వస్వరూపమును పొందుతారు చూచావా? ఆట్లాగే, వాసనలు నశించటం చేత వారందరు భౌతిక దృష్టికి అదృశ్యులైనారు.
శ్రీరాముడు : మహర్షీ! అదృశ్యులై, వారు ఏ రూపమును పొందారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : వారు వారి యొక్క-మనందరి యొక్క స్వస్వరూపమగు శుద్ధ బ్రహ్మరూపము యొక్క ప్రాప్తిని పొందారు. నాయనా రామచంద్రా! ఈ ఆకాశరూపమగు దేహము అనేది వాసనచే ప్రత్యక్షంగా భాసిస్తోంది. వాసన యొక్క అభావముచే భాసించకయే ఉంటుంది. స్వప్నంలో కనిపించిన ఆకాశ విశేషం మేల్కొనిన తర్వాత కనిపిస్తోందా? వాసనలు క్షయిస్తే దేహము దేహముగా కాకుండా అద్దాని అసలైన రూపమగు ఆకాశముగా కనిపించగలదు. అందుచేత జాగ్రత్తునందే వాసనలు క్షయించాయా ఇక ఈ స్థూల సూక్ష్మ దేహాలు రెండు భాసించకయే ఉంటాయి. అనగా అవి రెండూ కూడా చిదాకాశరూపములేనని అనుభవమౌతాయి.
స్వప్నానుభవ ఏషోఽత్ర దృష్టాంతత్వేన లక్ష్యతే ।
అబాలమేతత్ సంసిద్ధం అనుభూతం, శ్రుతం, స్మృతమ్ ॥
ఇందుకు పసిబాలుని దగ్గర నుండి పండుముదుసలి వరకు అనుభవమౌతూ శ్రుతి-స్మృతిపురాణాదులచే దృష్టాంతంగా చెప్పబడిన “స్వప్నమే” మనకు అతి సమీపమైన సుస్పష్టమైన దృష్టాంతం.
Page:80
స్వప్న సమయంలో స్వప్నం వాస్తవము వలెనే అనుభూతమౌతోంది. కనుక వాస్తవంగానే అనుభవించ బడుతోంది. జాగ్రత్కు వచ్చినప్పుడో? స్వప్నం అవాస్తవంగాను భ్రమచే సిద్ధించినది గాను తెలిసిపోతోంది కదా! అట్లాగే అజ్ఞానం ఉన్నంత వరకు ఈ 14 లోకాలలో అనేక ఉపాధులు, దృశ్యాలు, సంబంధ-బాంధవ్యాలు వాస్తవ దృష్టిచే అనుభవించబడవచ్చుగాక! “నా స్వరూపము ఇటువంటిది”.... అనే ఆత్మజ్ఞానము లభించిన తర్వాత ఈ స్థూల సూక్ష్మ దేహులతో నిర్వర్తించిననిర్వర్తించుచున్న-నిర్వర్తించబడబోవుచున్న సర్వ వ్యవహారాలు, కార్యక్రమాలు, అనుభూతులు మొదలైనవన్నీ స్వస్వరూపమగు ఆత్మకు అప్రమేయమైనవని, ఆత్మ సర్వదా యథాతథంగానే ఏర్పడి ఉంటోందని గ్రహించబడగలదు సుమా! "స్వప్ననాశనముచే స్వప్నంలో కనిపించేవన్నీ నశించు చున్నాయి కదా! అట్లాగే, ఆత్మకు అన్యమైనవన్నీ, “స్వప్న సదృశ జగద్వ్యవహారాలన్నీ భ్రమసిద్ధమే”... అను (దృష్టాంతపూర్వక) సుజ్ఞానానుభవాన్ని ఎవరు అంగీకరించరో, అట్టి మూర్ఖుని త్యజించి ఉండటమే మంచిది. ఎవడైతే “ఇవన్నీ అనిత్యం అనటం ఒప్పుకోం. సంబంధాలు-అనుబంధాలుసుఖాలు-దుఃఖాలు-ఇవన్నీ ఉన్నాయి.
శరీరం ఉంది కాబట్టే 'నొప్పి' కలుగుతోంది" ఇత్యాది వాదములతో 1.) ఆత్మయొక్క నిత్య సత్యత్వాన్ని, 2.) ఈ జగత్తును పొందుచున్నప్పుడు ఇందలి భ్రమత్వాన్ని గమనించుటకు సిద్ధంకాడో... అట్టివానికి మేమేం చెప్పగలం? అట్టి మిథ్యారూపుడగు స్వప్నశీలుని (ఆత్మజ్ఞానంలో) మేలుకొలపటం ఎట్లా? మేలుకొలుపబడతగినవాడు అగుట లేదు.
ఎవరైనా... “ఈ జాగ్రత్ శరీరానికి కారణం పితృ శరీరం. స్వప్న శరీరానికి పిత్రాదుల శరీరం కారణం కాదు. కాబట్టి స్వప్నంలో వాస్తవానికి దేహం లేదు. జాగ్రత్తులోనే, దేహం ఉన్నది. కాబట్టి జాగ్రత్ అనుభవంతో స్వప్నదృష్టాంతం సరి అయినది కాదు” అని వాదిస్తారేమో? వారికి మేము చెప్పేది ఏమిటంటే... నాయనలారా! యజ్ఞయాగాది కారణములుగా పరలోకంలో ఉత్పత్తి అయ్యే శరీరములు కూడా అప్పుడు మిథ్యయే! కాబట్టి జీవుడికి ఈ దేహం తర్వాత పరలోకంలో లేనిదే అని అంటున్నట్లే అవుతుంది. అప్పుడు నీవు నాస్తికుడివే అవుతావు.
పోనీ... “దేహముచే కాకుండా తదితర కారణములచే ఉత్పన్నమయ్యే ఏ దేహమైనా సర్వదా అసత్తే!”... అని అనుకుందామా? అప్పుడు దేహముచే ఉత్పన్నముగాని బ్రహ్మదేవుని శరీరము కూడా సర్వదా అసత్తే కదా! పూర్వ కల్పాంతమున సర్వ శరీరాలు క్షయమై పోయినప్పుడు ఇక దేహాలే లేవు కాబట్టి 'సృష్టి'యే ఉండకూడదు. కానీ పూర్వ కల్పాంతానంతరం మరల సృష్టి-శరీరాలు ఎక్కడి నుండి వచ్చాయి? కనుక ఈ భౌతిక శరీరం అసలైన శరీరం కాదని, భౌతికశరీరం లేకుండా కూడా ఈ జీవుడు అనుభవాలు పొందగలడని... వాస్తవానికి ఈ భౌతిక శరీరం అతని సత్యం నిత్యం అగు ఆత్మ స్వరూపం సమక్షంలో ప్రవర్తించే ఒక ఉపకరణం మాత్రమేనని గ్రహించబడగలదు.
శ్రీరాముడు : మహర్షీ! దేహాల నుండియే దేహాలు ఉత్పత్తి అగుచూ, అర్థ క్రియా సమర్థములగు చున్నాయి. ఈ విధంగా - "ఈ జగత్తు ప్రవాహరూపమున అనాది- నిత్యసిద్ధము అయి ఉన్నది. "ప్రళయం అనేది ఎన్నటికీ సంభవించదు” అని (జైమినీ మతానుసారం) కొందరిచే చెప్పబడుతోంది కదా! అట్టి "సృష్టి-ప్రళయాలు లేవు" అనే అభిప్రాయంపై మీ ఉద్దేశాన్ని వివరించమని నా ప్రార్థన.
Page:81
శ్రీ వసిష్ఠ మహర్షి :“దేహ తదనంతర దేహాల నిత్య ప్రవాహం ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. దేహముల నుండి దేహములు వస్తున్నాయి. ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇంతకు మించి సృష్టి లేదు. ప్రళయం లేదు”... అని సిద్ధాంతీకరించే (జైమినీ మతవాదుల) అభిప్రాయములో 'జగత్తు' అనగా ఏమిటి? ఈ కనబడే వస్తుసముదాయమేనా? అట్టి ఈ కనబడే (వారి సిద్ధాంతానికి విషయ మగు చున్న) భౌతిక జగత్తు పంచభూతాల సంయోగ రూపమే కదా! సంయోగముచే ఏర్పడే జగత్తులోని పదార్థములన్నీ వియోగం పొందుటచే నశించటం అనివార్యమే కదా! సంయోగం ఉన్నప్పుడు వియోగం కూడా ఉంటుంది. కనుక ఈ జగత్తు నాశనం అనివార్యమే అయినప్పుడు “సృష్టి ప్రళయాలు లేవు" అని ఎట్లా అనటం? ఇక్కడ మరికొందరి సిద్ధాంతకారులు సిద్ధాంతాలు పరిశీలిద్దాం.
పాంచభౌతిక నిత్యత్వము - మరొక సిద్ధాంతం : ఈ జగత్తుకు కారణం- పృథ్వి, జలం, అగ్ని, వాయువు అనే భూత చతుష్టయం. అట్టి ఈ భూతచతుష్టయం ఎన్నటికీ నశించదు. కాబట్టి జగత్తు నశించనిదే అవుతుంది. వాటి మధ్య ఏర్పడే ఒకానొక మదశక్తి ఉదయిస్తుంది. ఆ మదశక్తియే ఈ “నేను” అనేది. పంచభూతములు దేహాకారంగా పరిణమించినప్పుడు అందులో 'జ్ఞానము' అనే ఒక గుణం ఉదయిస్తుంది. ఆ దేహాకారం పోతే జ్ఞానము పోతుంది. అంతకుమించి జీవునికి “ముందు” లేదు. “వెనుక” లేదు. (ఇది చార్వాకుని సిద్ధాంతం)
ఇది సమగ్ర సిద్ధాంతమైతే, అప్పుడు వస్తు వినాశనముగాని, చతుర్విధ ప్రళయాలు గాని, పురాణ ఇతిహాసాలు ప్రవచించే ఆయా ధర్మాధర్మ సిద్ధాంతాలు గాని, ఐహిక-పౌరలౌకిక, హితఅహిత ధర్మాధర్మాలు ప్రతిపాదించే శ్రుతులు స్మృతులు, సదాచారాలు -– మొదలైనవన్నీ వ్యర్థములు, అప్రమాణాలు అవుతాయి. "దేహాత్మ వాదులమగు మా మతాచార్యుల దృష్టిలో వాటివాటి వ్యర్థత్వం, అప్రమాణత్వము మాకు సమంజసమే” అని వారు అంటారంటావా? అనేకమంది శిష్టుల అభిప్రాయాలన్నీ అప్రమాణాలే అయినప్పుడు “వంధ్య అనేక సుతులను కనెను” అనే వాక్యంలాగా “పంచభూతాల కలయికలో నుంచే ఈ 'నేను' అనేది ఉద్భవించి నశిస్తోంది” అని చెప్పే వారి వాక్యాలు మాత్రం ఎట్లా ప్రమాణం అవుతాయి? “ఈ జగత్తు ఎప్పటికో అప్పటికి నశించటం తథ్యం”... అనునది కల్ప-మహా కల్పసంబంధమైన కాలక్రమ సిద్ధాంతం వేదాలచే, విజ్ఞులచే ప్రతిపాదించబడి ఉన్నది. అందుచేత జగత్తు శాశ్వతం"... అను (చార్వాక) మతసిద్ధాంతం యుక్తి యుక్తం కాదు. “మద శక్తి వల్లే జ్ఞాన గుణం దేహంలో ఉత్పన్నమౌతున్నది” అను సిద్ధాంతమును ప్రతిపాదించు (చార్వాక మత) అనుయాయులారా! మరొకచోట ఎక్కడో మరణించినవాడి శరీరము నశించిపోయిన తర్వాత ఆ జీవుడు పిశాచం మొదలైన అన్య దేహముచే స్వదేశమునకు వచ్చి పరశరీర ప్రవేశం ద్వారా బంధువులతో సంభాషించటం జరుగుతోంది కదా! (“సోది” మొదలైన) కొందరు సాధకయోగుల మనస్సులోంచి చనిపోయినవారు సంభాషిస్తున్నారు కదా!
“పిశాచాలు అప్రత్యక్షములు కాబట్టి, మరణించినవారు పిశాచాది దేహాలు ధరించి బంధువులను సమీపిస్తున్నారు అనునది కల్పన మాత్రమే”అని అంటారా?...
Page:82
అప్పుడు పాంచభౌతికవాదులు కూడా ఎట్టి ప్రమాణము చూపించకుండానే “పంచ భూతముల కలయిక వలన అహంకారము ఉత్పత్తి అవుతోంది”... అని ఎట్లా అనగలరు?
"జీవుడు శరీరముతో మాట్లాడుచున్నాడు కాబట్టి అహంకారము అనేది శరీర నిర్మాణంలో ఒక భాగమని, శరీరం లేకపోతే అహంకారం లేదని చెప్పుచున్నాం” అని వారు అంటారా? నేను ఈ దేహాన్ని కదలుస్తున్నాను. అనగా నేను ఈ కాలును, చేయిని, కన్నును కదల్చుచున్నాను. అంతేగాని ఈ కాలు-చేయి-కళ్ళు నన్ను కదల్చుట లేదు కదా! కనుక కదలించుచున్న నేను కదల్చబడుచున్న ఈ కాలు-చేయి కన్నులతో కూడిన దేహముకంటే ముందే ఉన్నానని ఎందుకు ఒప్పుకోరాదు? "మా గురువులు (చార్వాకాదులు) చెప్పారు. అందుచేత లోహాణువుల కలయికలో నుంచి అయస్కాంత శక్తి ఉద్భవిస్తున్నట్లు పంచభూతముల ఒకానొక కలయికలోనుంచి ఈ 'నేను' అనునది ఉద్భవిస్తోంది. ఆ అణువులు విడిపోగానే అయస్కాంత శక్తి తొలగునట్లుగానే ఈ దేహాణువులు విడిపోగానే 'నేను' అనేది అప్రత్యక్షమౌతుంది. ఇంతకు మించి ఎక్కడా 'నేను' అనేది లేదు.”... అని అంటారా? శబ్దాలే ప్రమాణమునకు సమ్మతము అయినచో... నిర్దోష శబ్ద రూపము లగు శ్రుతులు చెప్పేది ఎందుకు ప్రమాణమని అనుకోకూడదు? ఆ శ్రుతులు ప్రతిపాదించే ఆత్మతత్త్వం పరలోకములు-స్వర్గ నరకాది స్థితులు ఉన్నాయని ప్రమాణం ఎందుకు ఒప్పుకోకూడదు? ఎందుకంటే అవి చెప్పేవి గురువు వాక్యములుగానే భావించవచ్చును కదా!
“ద్రాక్షరసం వంటి పానీయాలు సేవించినప్పుడు మత్తు వస్తోంది కదా! అట్లాగే, ‘నేను’ అనేది ఒక విపరీత చమత్కారంగా అనుభవమౌతోంది. కనుక నేను అనేది దేహము-ఆహారముల కలయికచే ఉత్పత్తి అయి... ఉనికిని పొందుతోంది. (ద్రాక్షరస ప్రభావం తొలగగానే మత్తు తొలగు నట్లు) దేహ-పదార్థముల అవినియోగముచే 'నేను' అనేది రహితమౌతోంది"... అని అంటారా? 'పిశాచం' అను భౌతిక దేహరహిత జీవుడు (సూక్ష్మ-కారణ దేహాలు మాత్రమే కలిగిన వ్యక్తి) మరొకని దేహమున ఆశ్రయించునట్టి అనుభవం మనం లోకంలో చూస్తున్నాము కదా! ఉదా హరణకు ఒక శిష్యుడు తన గురువు తనయందు ఆవేశించి ప్రవచనము చేస్తున్నట్లు ప్రవర్తించటం, లోకంలో చూస్తున్నాం కదా? "అట్టి పిశాచం గూర్చిన బుద్ధియే సత్యము కాదు" అని అంటారా? అది సత్యం కాకపోతే ద్రాక్షరసమువంటి పానీయాలు సేవించినప్పుడు ప్రాప్తించే 'మదశక్తి' కూడా సత్యం కాదు. ఈ విధంగా 'మదశక్తి' అనే దృష్టాంతం 'నేను' అనుదానిని దేహ విభాగంగా చెప్పటానికి సరిపోదు.
పంచభూతాలు 'జ్ఞానం' కలిగి ఉండటం మనం చూడటం లేదు. వాటి కలయికలో నుంచి మాత్రం “జ్ఞానం” ఎట్లా సిద్ధిస్తుంది? కాబట్టి దేహానంతర స్థితులుగా చెప్పబడిన పరలోకాత్మికమగు స్వర్గ-నరకాది స్థితులను నిరసించటానికి (అటువంటివేమి ఉండవని సిద్ధాంతీకరించటానికి) నీవు (చార్వాకమతవాదుడు) ఎట్లా శక్తుడవౌతావు?
“దేహనంతర స్థితి ఏ జనులకు అనుభవసిద్ధమని నిరూపించలేం కదా! ‘అనుభవం’ అను దానికి ప్రమాణం కాదు కాబట్టి, దేహం నశించిన తర్వాత ఈ జీవుడు ఏదైనా స్థితి కలిగి ఉంటాడు అనేది (అనుభవసిద్ధం కాదు కాబట్టి) మేము ఒప్పుకోం” అని అంటారా?
Page:83
అట్లా అయితే “గురువులు ఆవహించటం” అను అనేక జనుల అనుభవ ప్రమాణము ఒప్పుకోవాలి కదా! అది ఒప్పుకుంటే “దేహానంతరం జీవుడు ఉంటాడు. కనుక పరలోకం కలదు” అని కూడా ఎందుకు ఒప్పుకోకూడదు?
"లోకంలో స్థూల దేహ రహితులగు పిశాచ జీవులు ఆవహించటం అనేది శ్రుతి వంటి దృఢతర ప్రమాణజన్యం కాకపోయిప్పటికీ అది లోక జనులను వారి భావాన్ని అనుసరించి అనుభవ ప్రసిద్ధము. అట్లాగే 'జ్ఞానము' అనేది అనుభవ ప్రసిద్ధము. కానీ పరలోకములు అనేవి అనుభవ ప్రసిద్ధము కాదు కాబట్టి శ్రుతులు అవి ఉన్నాయని చెప్పుచున్నప్పటికీ మేము ఒప్పుకోం!" అని వారు (చార్వాకమత వాదులు) అంటారా? (చార్వాకుని వంటి) మరొకరి అనుభవం మనకు ప్రామాణ్యం అయినప్పుడు అనేక మందికి అనుభవమైనట్టి శ్రుతులు, ఆ శ్రుతులు చెప్పే ఇహ లోకానంతర పరలోక స్థితి గతులు 'సత్యము కాదు' అని మాత్రం ఎట్లా అనగలరు? దృఢతరమగు శ్రుతులు బోధించే కారణ సహితమైనట్టి పరలోక జ్ఞానము సత్యం కాదని ఎట్లా చెప్పగలరు?
శ్రీరాముడు : మహాత్మా! కొందరు సిద్ధాంతకారులు "జీవిస్తున్నంతకాలం ఏది అనుభవమవుతోందో అది సత్యము. మరణానంతరం పరలోకం కలదు. అయితే ఆ పరలోకం మనకు స్వప్నము ఎటువంటిదో అటువంటిది.
కనుక మరణానంతరం ఏది అనుభవమౌతోందో అది సత్యము కాదు. దేహముచే అనుభవించబడుచున్నదే సత్యము” అంటారు. ఇట్టి "జగత్ సత్యమ్-పరలోకమ్ మిథ్యా" అని చెప్పువారి మాటల గురించి మీ అభిప్రాయం?
శ్రీ వసిష్ఠ మహర్షి :
యా అంతర్ వేత్తి యథా సంవిత్, సా తథా అనుభవత్యలమ్ ।
అస్తు సత్యమ్ అసత్యమ్ వా సిద్ధమ్ ఇత్యనుభూతితః ॥
ఓ రామచంద్రా! వాస్తవానికి ఇక్కడ ఏది సత్యం? ఏది సత్యం కాదు?”... అనేది ముఖ్యం కాదు. ఎందుకంటావా? ఏది సత్యమైనా, లేక అసత్యమైనా కూడా, ఏ సంవిత్తు (ఈ జీవుడు అనబడు జ్ఞాన స్వరూపి) ఏ వస్తువు యొక్క సత్తాను ఏ ప్రకారంగా ఎఱుగుతుందో, అది ఆ సంవిత్తుకు ఆ ప్రకారంగానే అనుభూతమౌతోంది. ఎవరూ ఏ భావనతో దేనిని చూస్తారో, వారికి ఆ భావనచే అది అట్లే అనుభూతమౌతుంది. అందుకే ఈ జగత్తు కొందరికి "పంచభూతముల కలయిక” గాను, మరి కొందరికి "బ్రహ్మదేవుని కల్పనా వ్యాసంగం" గాను, ఇంకొందరికి "పరమాత్మ స్వరూపం” గాను అనుభూతమౌతోంది.
Page:84
ఒకరి అనుభవాన్ని తొలగించి మరొక రకంగా అనుభూత మయ్యేటట్లుగా ఎవరూ చెయ్యలేరు వారికి వారు మరొక రీతిగా దర్శించటానికి సిద్ధపడినప్పుడు తప్పితే! ఏది ఎట్లు ఎఱిగితే అది అట్లే అనుభూతమగుచుండటం ఆబాల గోపాలం విదితమే! అందుకే సత్యమని ఒకరికి అనిపించినదే "సత్యము కాదు” అని మరొకరికి అనిపించటం మనం ఈ జగత్తులో చూస్తూ ఉన్నదే కదా! ...ఇక నీ ప్రశ్నకు వద్దాం.
మృతస్య అస్తి పరోలోకో విదిత్యేవం మయా భవేత్ ।
సతి వాసతి దేహేంస్మిన్ తేన కిం సదసచ్చ కిం? ॥
శ్రుతులు చెప్పుచున్న దానిననుసరించి, విజ్ఞుల ప్రవచనము అనుసరించి 1) “దేహముతో జీవించి యున్న స్థితి (ఇది అందరికీ అనుభవమగుచున్నదే కదా! 2) దేహానంతర పరలోక స్థితి అనే రెండు ఉన్నాయని ఒప్పుకొన్న తర్వాత ఇప్పుడు “వాటి వాటి అనుభవాలు ఎట్లా ఉంటాయి?" అనే విషయానికి వద్దాం. నీవు చెప్పినట్లు “మరణాంతర పరలోకానుభవం స్వప్నానుభవం వంటిది. ఈ దేహంతో అనుభవించబడేదే వాస్తవం" అని (చార్వాకమత శాఖ) కొందరు అంటూ ఉంటారు.
అయితే... "జీవించి ఉన్నవాని అనుభవం సత్యం, మరణించినవాని అనుభవం అసత్యం (స్వప్నతుల్యం)” అని అనటం ఎట్లా! జీవించియున్నవాడు మరణించినవాని అనుభవమును స్వప్నతుల్యంగా అసత్య మైనదిగా భావించవచ్చు. అట్లాగే మరణించినవాడు జీవించియున్నవాని అనుభవమును అసత్యమైనదిగా భావించనూవచ్చు కదా!
జీవించియున్నవానికి జీవితానుభవం సత్యం. మరణించిన వానికి మరణానంతర అనుభవం సత్యం. ఉభయుల అనుభవం తిరస్కరించటానికి గాని, తొలగించటానికి గాని వీలుకాదు. "ఈ లోకంలో కూడా ఎవరు ఏది సత్యమని భావిస్తే, అది వారికి సత్యముగానే అనుభూతమౌతుంది.
అంతేగాని ఇక్కడ వేరే సత్యాసత్యాలు లేవు" - అనునది అనేక విషయాలలో అందరికీ అనుభవమే! అందుచేత సజీవుని అనుభవమే సత్యమని, మృతుని అనుభవం సత్యం కాదని సిద్ధాంతీకరించటం ఉచితం కాదు. ఇక, వేదములు ప్రమాణపూర్వకంగా “ఆత్మ”ను ప్రతిపాదిస్తున్నాయి.
తస్మాత్ స్వభావః ప్రధమం ప్రస్ఫురన్వేత్తి సంవిదమ్ ।
వాసనా కారణం పశ్చాత్ బుద్ధ్వా సంపశ్యతి భ్రమమ్ ॥
మొట్టమొదటగా వేదాది ప్రమాణాలచే ప్రతిపాదించబడుచూ, స్వయంసిద్ధమె, జ్ఞానమే తన యొక్క స్వరూపంగా గలిగి ఉన్నదై... “ఆత్మ” ఉన్నది. అట్టి ఆత్మ స్వయంప్రకాశమైనది. అందుచేత ఈ జీవుని స్వస్వరూపమగు ఆత్మ జాగ్రత్- స్వప్నం మొదలైన సర్వ వ్యవహారాలకు మునుముందుగానే ఉండి ఉన్నది. అట్టి ఆత్మ తన యొక్క నిత్య సిద్ధమగు నిజస్వరూప జ్ఞానమును ఎఱిగియే ఉన్నది.
ఆ తర్వాత ...ఆ ఆత్మ తనయొక్క వాసనలు కారణంగా 'సూక్ష్మ శరీరము' ను ఎఱుగుచున్నది. అట్టి సమయంలో ఆ సూక్ష్మ దేహమునకు ప్రమేయంలేని ఆత్మయొక్క నిత్యత్వ - నిర్మలత్వములను ఎందుకో కించత్ ఏమరచుచున్నది.
Page:85
ఆ తదుపరి... సూక్ష్మ దేహముతో ఏర్పడిన తాదాత్మ్యముచే స్థూల దేహాదిగా గల ఈ సంసార భ్రమనంతా ఎఱుగుచున్నది.
అయితే రామచంద్రా! ద్రష్ట దర్శన దృశ్య రూపమగు వాసనలు లయింప జేసుకున్నప్పుడు అది అప్రతిహతంగా, అడ్డులు తొలగించుకొనినదై తన నిత్యనూతన రూపమగు ఆత్మత్త్వమును దర్శించుచున్నది. వాసనలు ఉన్నప్పుడు 'సంసారం' అనే పిశాచం ఉదయిస్తోంది. వాసనలు తొలగి నాయా ఆత్మత్త్వమే స్వభావసిద్ధమై శేషిస్తోంది. అనగా "ఆత్మత్త్వమే ఈ జీవుని వాస్తవ స్వభావం” అని గ్రహించు. ఈ వ్యవహారమంతా “ఆత్మ చైతన్యము చ్యుతి జగత్విలాసము మోక్షభావము” అను విశేషములుగా శాస్త్రములు ప్రవచిస్తున్నాయి.
ఓ రామచంద్రా! “సృష్ట్యాది" యందు ‘చిత్సాగర జలము యొక్క ప్రప్రథమ కెరటము' అనతగ్గ బ్రహ్మదేవునికి "జగత్తును నిర్మించాలి” అనే ఒకానొక ఇచ్ఛ జనిస్తోంది. ఆ తదుపరి “పూర్వకాలికమైన వాసన యొక్క ఉత్పత్తి” సంభవిస్తోంది. కాబట్టి... “వాసనయొక్క అస్తిత్వమే సంసార భ్రమ”... అని గ్రహించు.
శ్రీరాముడు : స్వామీ! ఈ “వాసన" అనునది పరబ్రహ్మము నుండే జనించిందా? ఎందుకు అడుగుచున్నానంటే... “జగత్తే వాసనల రూప” మని చెప్పబడుతోంది కదా? "ఈ జగత్తు బ్రహ్మము నుండే జనించింది”... అను సిద్ధాంతము కూడా శాస్త్ర ప్రతిపాదితం కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మము సర్వదా కూటస్థము - (మార్పు చేర్పులు లేనిది అద్వితీయముఅద్దానికి ద్వితీయమైనదేది లేనిది) కదా! మరి అట్టి నిత్య నిర్మల పరబ్రహ్మమునుండి వాసనలు జనించటమేమిటి? కనుక ఈ వాసనలు పరబ్రహ్మము నుండి జనించలేదు.
శ్రీరాముడు : వాసనలు పరబ్రహ్మము నుండి జనించనప్పుడు, మరిక వాసనలు ఎక్కడి నుంచి జనించాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : "వాసనలు” అనబడే శబ్దం, దాని అర్థము కూడా అద్వితీయమగు బ్రహ్మము గురించి బోధించటానికి శాస్త్రములు కల్పించాయి. అయితే జ్ఞానోదయం అయ్యే వరకు ఈ వాసనలు ఎక్కడో-అక్కడనుండి, ఏదో ఒక కారణం చేత జనించాయనే ఒప్పుకుంటూ రావాలి. జ్ఞానము ఉత్పన్నమైన తర్వాతనో... ఈ ‘వాసనలు' అనబడే వాటితో సహా (తత్ శబ్దార్థంతో సహా) ఈ సమస్త జగత్తు కూడా బ్రహ్మమేనని తప్పక గ్రహించబడగలదు.
ఏతావత్ యత్ పరిజ్ఞానం తత్ 'నిర్వాణం' విదుర్ బుధాః ।
యత్ అత్రైవ అపరిజ్ఞానం తం “బంధం” విద్ధి, రాఘవ! ॥
ఓ రాఘవా! “ఈ సర్వము బ్రహ్మమే”... అను పరిజ్ఞానమునే తత్త్వజ్ఞులు “నిర్వాణము” అని పిలుస్తున్నారు. అట్టి బ్రహ్మము గుఱించి జ్ఞానము లేకపోవటమే “బంధము” అని గ్రహించు.
Page:86
‘విజ్ఞాన ఘనము' అగు ఆత్మ "ప్రకాశరూపము-అప్రకాశరూపము” కూడా అయి ఉన్నది. ఎందు కంటావా? ఎఱుగబడినచో, అది స్వయముగా ప్రకారూపముగా అంతఃకరణమున స్ఫురించగలదు. ఎఱుగబడకపోయిందా, అది స్ఫురించకయే, గుర్తించబడకమే ఉంటోంది.
ఓ రామచంద్రా! "నేను బద్దుడను" అనే భావనచే బంధం కలుగుతోంది. “నేను ముక్తుడను” అను భావన ముక్తికి దారితీస్తోంది.
శ్రీరాముడు : మీరు ప్రవచించే అట్టి 'ముక్తి' అను భావన కష్టతర కాదంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ముక్తి అనునది ఒక భావనయే కదా! భావన యొక్క పరివర్తనా మాత్రంచేత బంధ-మోక్షములు సిద్ధిస్తున్నాయి. విషయము ఇంతమాత్రం అయి ఉండగా, భావనామాత్రం చేత మోక్షం సిద్ధిస్తుండగా, ఇక "మోక్షం పొందటం బహుక్లేశాలతో కూడుకున్నది” అని ఎవరైనా చెప్ప దలిస్తే అది సమంజసమెట్లా అవుతుంది చెప్పు? భావనమాత్ర ప్రయత్నంచే 'మోక్షం' అనే అవగాహన లభించుచుండగా... ఇక "మోక్షస్థానం సంపాదించటం కష్టం” అని అనటం ఉచితమెట్లా?
సంవిత్ ఉద్బోధనే “బంధః”, తత్ అనుద్బోధనే "శివమ్” ।
అసత్ సద్వత్ జగత్ భాతి సంవిత్ ఉద్బోధనోదరమ్ ॥
అనేక జగద్విషయముల పట్ల ఏర్పడుచున్న ధ్యాసల సమూహమును 'చిత్తము’ అంటారు. అట్టి చిత్తము అనేక జన్మలలో ప్రాపంచిక విషయములపై పెంపొందించుకున్న భావావేశములచే నిర్మించబడుతోంది.
చిత్తవృత్తిని బహిర్ముఖం ఒనర్చటమే బంధం. చిత్తవృత్తి అంతర్ముఖమై అత్మయందు లీనం కావటమే సమాధి. అదియే మోక్షము అని కూడా చెప్పబడుతోంది.
"దృశ్య ప్రపంచ అతీతత్వము-శాంతము” అయినట్టి చైతన్య స్వరూప స్థితియే మోక్షం. దృశ్య సహితమైన స్థితి, దృశ్య పరిమిత, దృశ్యాంతర్గత చంచల స్థితిని ‘బంధము’ అని పిలుస్తున్నారు.
ఓ రామచంద్రా! ఈ రెండింటిలో ఏది ఉచితమో విచక్షించి అద్దానిని ఆశ్రయించు. విక్షేప రహితమగు సుఖం ఎట్టిదో గ్రహించి అట్టి అభ్యాసమును తీవ్రతరం చేయి. “వాసనారహితంఅనాది-అనంతం నిర్మలబోధరూపం-ఏకత్వ-ద్విత్వ వర్జితం - శూన్యత్వ రహితం-ఆకాశం వలె నిర్మలం” అయినట్టి బ్రహ్మ స్వరూపంతోటి ఏకస్థితిని కలిగి ఉండి, తద్వారా బంధరహితుడవగుము.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! మరల మనం “అన్యజగత్ ప్రళయ దర్శనం” సందర్భానికి వచ్చి, అక్కడ నేను చూచిన విశేషాల గురించి చెప్పుకుందాం.
అప్పుడు నేను సత్యలోకం సమీపంగా గల ఆకాశంలో ఆకాశరూపం దాల్చి బ్రహ్మలోకంవైపు దృష్టి సారించి చూస్తున్నాను కదా! అప్పుడు ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడు, బ్రహ్మలోక నివాసులు, ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు కూడా బ్రహ్మరూపత్వము పొందుటచే వత్తిలేని దీపం వలె అదృశ్యులయినారు.
Page:87
అప్పుడు భూలోకము వలెనే బ్రహ్మలోకం కూడా ప్రకాశవంతమగు అగ్ని జ్వాలలచే భస్మీభూతం ఒనర్చివేయబడింది. ఆ తర్వాత భూమండలమును ముంచివేసిన జలప్రళయ తరంగయుక్తమగు మహాసముద్రం బ్రహ్మదేవుని నగరమును కూడా ముంచివేయుట చేత బ్రహ్మ లోకంతో సహా బ్రహ్మాండమంతా జలమయం అయింది. “పుష్కరావర్తము” అనే కాలమేఘాలు కురిపించే జలధారలకు పెద్ద పర్వత సమూహాలు ఆ జలంలో ఎండుతాటి ఆకు వలె తెలియాడుతూ, ఇంతలోనే జల సంఘట్టనచే ఛిన్నాభిన్నం కాసాగాయి. ఇదంతా గమనిస్తూ ఇక అక్కడి నుండి బయల్వెడలాలనే ప్రయత్నంలో ఉండగా అచ్చట ఒకానొక భయంకర రూపం కనిపించింది. ఒక్కసారిగా భీతిల్లాను. ఆ భీకర రూపం "కల్పాంత జగదాకారమా?”... అని అనిపించింది. తన యొక్క కృష్ణవర్ణముచే ఆకాశమును పూరించుచు “అంధకారం ఈ విధంగా మూర్తీభవించిందా...?” అన్నట్లుగా ఉన్నది. అయితే ఆ కృష్ణ (నల్లని) వర్ణరూపం లక్షల కొలది సూర్యుల తేజమును ఆభరణాలుగా ధరించినట్లుగా ఉన్నది. దేదీప్యమానమైన కాంతిచే కళ్ళు ప్రకాశిస్తున్నాయి. నోటి లోంచి అగ్నిజ్వాలా సమూహములు బయల్వెడలుచున్నాయి. ఆ ఆకారము 3 నేత్రములు, 5 ముఖములు 10 భుజాలు కలదిగా ఉండటం చేత "త్రినేత్రుడు పంచముఖుడు-దశాబాహుడుగా” ఉన్నది. చేతిలో త్రిశూలం ధరించి ఉన్నది. అనంతాకాశంలాగా విశాలమైన ఆకృతి కలిగి ఉన్నది. ఆ ఆకారం బ్రహ్మాండం యొక్క బాహ్యమున గల ఆకాశమున స్థితి కలిగి ఉన్నది. "అంతకు ముందటి బ్రహ్మాండం ఎందులో ఏర్పడి ఉన్నదో... అట్టి దహరాకాశమే ఆ విధంగా హస్తముపాదము మొదలైన అవయవాలతో ఆకృతి ధరించిందా!”... అని నాకు అనిపించసాగింది.
ఆ భీకర ఆకారం యొక్క ఉచ్ఛ్వాస నిశ్ఛ్వాసలు మహాసముద్రమును కూడా ప్రకంపింపజేసే టట్లు అత్యంత వేగముతోనూ, కొండలను పిండి చేయగల 'ఊఁఊహూ' నినాద ధ్వనుల జనింపజేస్తూ ఉన్నాయి. ఆ భయంకరమైన ఆకారం... పురుషాకారం దాల్చిన కల్పాంత సముద్రం వలె ఉదయించింది. బ్రహ్మాండ జీవులందరి యొక్క సమష్టి అహంకార రూపం మూర్తిత్వం దాల్చి నట్లు అగుపడింది. కుల పర్వతాల మహా సమూహం వలె అత్యంత ఘనీభూతంగా ప్రత్యక్షమైనది. ఆకాశ మండలమునంతటినీ ఆక్రమించి విలయతాండవం చేస్తూ విజృంభించసాగింది.
ఆకాశంలో అగుపించిన ఆ అతి దీర్ఘమైన భీకరాకారం మూడు కనులను-త్రిశూలమును కలిగి ఉండి తాండవం చేస్తూ ఉంటే “ఓహో! ఈయనే ప్రళయకాల రుద్రుడు కదా” అని నా యొక్క యుక్తాయుక్త విచక్షణచే ఊహించాను. వెంటనే లేచి నిలబడి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ ప్రళయకాల రుద్రునికి 'సాష్టంగదండ ప్రమాణం' చేశాను.
శ్రీరాముడు : హే మహాత్మా! మునీశ్వరా!
కిం స తాదృగ్విధో రుద్రః? కిం కృష్ణః? కిం మహాకృతిః?
కిం పంచవదనః? కస్మాత్ దశబాహుః స తిష్ఠతి?
కిం త్రినేత్రః? కిం ఉగ్రాత్మా? కిం ఏకః కిం ప్రయోజనః?
కేనేరితః? కిమకరో ఇచ్ఛాయాసీత్ వద కా? మునే!
Page:88
పరమేశ్వరుడగు రుద్ర భగవానుడు ఆ విధంగా కృష్ణ వర్ణాన్ని, పంచముఖాలను త్రినేత్రాలను, దశభుజాలను, ఉగ్రరూపాన్ని తనయందు ఏకరూపమున ప్రదర్శిస్తున్నారు కదా! ఏ కారణం చేత అంతటి భయంకర రూపం అవధరించారు? ఆయనే లయకారుడగు పరమేశ్వరుడా? ఆయన స్వతంత్రుడా? పరతంత్రుడా?... “స్వతంత్రుడే” అయితే పూర్ణకాముడు (పొందవలసినది గాని పొందజాలనిది గాని, కించిత్తు కూడా లేనివాడు అగు ఆ రుద్రభగవానునికి అట్టి సంహార ప్రవృత్తి ఎందుకు?... ఒకవేళ “పరతంత్రుడు” అయితే ఎవరి ప్రేరణచే ఆయన ఆ సంహార కార్యక్రమమును నిర్వర్తిస్తున్నారు? ఏ ఉద్దేశముతో ఆ ప్రళయరూపం దాల్చారు? దయచేసి అవన్నీ వివరించి చెప్పవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : కకుత్స వంశమున మణిరత్నం వలె ప్రకాశిస్తూ జనించిన ఓ రామచంద్రా! ఆ ప్రళయకాల రుద్రుడు ఎవరో, ఎందుకు విలయతాండవం చేస్తున్నారో, ఆయన ఉద్దేశం ఏమిటో?... అన్నీ వివరిస్తాను. వినుఆ ప్రత్యక్షమైన విలయతాండవం చేస్తున్న పరమేశ్వరుడు సృష్టి-స్థితి-సంహారాదులు గూర్చిన సంకల్పాదులకు కారణభూతమగు అహంకారమే స్వరూపంగా ధరించినవాడు. అందుకే ఆయనను “రుద్రుడు” అని అంటారు.
1.) సర్వదుష్ట ప్రాణులకు రోదన మొనర్చువాడు - కాబట్టి రుద్రుడు!
2.) శరణువేడిన వారి సమస్త రోగములను పారత్రోలువాడు కనుక రుద్రుడు.
దుష్టజనులకు... విషయాభిమాన రూపుడు. శరణాగతుల దోషములను బాపుట కొరకై 'ఏకాభిమానరూపము' ధరించినవాడు.
వాస్తవానికి ఆయన (అసలైన) స్వరూపం చిదాకాశం మాత్రమే! సర్వసారమగు చిదాకాశమే తన స్వరూపంగా కలిగి ఉండటం చేత ఆ రుద్ర భగవానుడు “ఆకాశం వంటి ఆకారం-వర్ణం” కలవాడై, మహా ప్రకాశమయుడై చెన్నొందుచూ “ఆకాశ రూపుడు”... అని చెప్పబడుచున్నాడు.
సర్వ ప్రాణులు తన స్వరూపముగా కలవాడు- సర్వవ్యాప్తి అయి ఉండటంచే “మహాకారము”ను ధరించినవాడై ఉన్నాడు. సృష్టిలో గల పంచ జ్ఞానేంద్రియాలే ఆయన యొక్క పంచ ముఖాలు. అందుచేతనే ఈ పంచ జ్ఞానేంద్రిక్ష్మీ ఆలు ప్రకాశ స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
ఈ సర్వుల పంచ కర్మేంద్రియాలు (వాక్కు-కాళ్ళు-చేతులు-పాయువు-ఉపస్థ) వాటి పంచ విషయాలు (వచనం-భ్రమణం-అదానం-విసర్జనం- కామం) ఈ 10 కూడా ఆయన యొక్క 10 భుజాలై ఉన్నాయి.
ఇక ఈయన ఎటునుంచి వచ్చారంటావా? ప్రజాపతి యగు బ్రహ్మదేవుడు ప్రళయకాలంలో సర్వ జీవులతో సహా "బ్రహ్మరూపత్వం” పొందారు కదా! అందుచేత చిదాకాశమున కల్పించబడిన పంచ ప్రాణ-పంచ జ్ఞానేంద్రియ-పంచ కర్మేంద్రియ వ్యవహారాలను త్యజించారు. అప్పుడు చిదాకాశ రూపుడగు రుద్రుడు కేవలాకాశ మాత్ర పరిశేషమగు కారణ రూపాన్ని అవధరించు చుండటమే ఆయన విలయ తాండవం.
Page:89
అనగా... బ్రహ్మాండ రచనలో ఒదిగి ఉన్న సర్వజీవుల ఉపకరణ రూపంగా ప్రాప్తిస్తూ వచ్చిన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ కర్మేంద్రియ విషయాలు ఇప్పటివరకూ సమిష్టిగా వ్యవహరించి ఇప్పుడు నిజరూపాలు సంతరించుకొని నిజస్థానం పొందుచున్నాయన్నమాట!
శ్రీరాముడు : మునీశ్వరా! ప్రళయమున సమస్త కార్యములు లయింపగా, ఇక ఆకాశమాత్ర పరిశేషమగు చిదాకాశ రుద్ర భగవానునికి రూపం ఏముంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. సమస్త కార్యములు (పంచ జ్ఞానేంద్రియ-పంచ కర్మేంద్రియ-పంచ జగత్ విషయ కార్యములన్నీ) లయించగా, కారణాంశ మాత్రముచే శేషించి ఉన్న ఆ రుద్ర భగవానునికి వాస్తవానికి ఏ ఆకారమూ లేదు. అయితే కేవలం తన ఉపాసకుల యొక్క వాసనలచే వారికి 'భ్రాంతి’ ద్వారా ఆయన ఆ విధంగా (నేను వర్ణించిన విధంగా) మూర్తీభవించి ఉన్నారు. ఒక వస్తువు భస్మీభూతమగుచున్నప్పుడు ఏర్పడే పొగకు కొంచెం సమయం ఏదో ఆకారం కనిపిస్తుంది కదా! ఇది కూడా అట్టిదే!
చిదాకాశగతే స్ఫారే భూతాకాశే స తిష్ఠతి ।
దేహే చ సర్వ భూతానాం నిత్యం వాయురివ ఈశ్వరః ॥
వాయువు సర్వజీవుల అంతరం-బాహ్యమున సంచరిస్తూ ప్రాణ స్వరూపి అయి సర్వకార్యాలు నిర్వర్తిస్తోంది చూచావా? అట్లాగే ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు “వ్యాపకమగు చిదాకాశరూపం” పొందుతాడో, అప్పుడు భూతాకాశమునందు సర్వ దేహాలలో స్థితి పొందినవాడై ఉంటున్నాడు. అట్టి ఆ చిదాకాశ స్వరూపుడు 'ప్రళయం' అను క్షణకాలమున సమస్తం క్షోభితం చేసి సర్వ భూత రహితుడై, చిదాకాశమాత్ర దేహధారి అయి పరమశాంతిని పొందుచున్నాడు.
త్రినేత్రములు : త్రిగుణాలు (సత్త్వరజస్తమోగుణాలు) - త్రికాలాలు (భూత, భవిష్యత్, వర్తమానాలు) - త్రి అంతఃకరణాలు (చిత్త, అహంకార, బుద్ధులు) - ప్రణవ త్రివర్ణాలు (అ, ఉ, మ) - త్రివేదాలు (బుక్, యజో, సామ)... ఇవే ఆ రుద్రుని యొక్క త్రినేత్రాలై వెలయుచున్నాయి.
త్రిశూలం తేన త్రైలోక్యం గృహీతం కరకోటరే!
ఆ ప్రళయకాల రుద్రుని పిడికిలిలో గల త్రిశూలం ఈ స్వర్గ-భూ పాతాళ లోకాలు సుమా!
యస్మాత్ తత్ వ్యతిరేకేణ సర్వ భూతగణేష్వపి ।
అన్యత్ నవిద్యతే కించిత్, దేహాత్మైవ తతః స్థితః ॥
ఈ సర్వభూత సమూహములలో అతనికి వేరైనది కించిత్ కూడా లేదు. ఆయన తన యొక్క జగత్ శరీరముచే అంతటా వ్యాపించి ఉన్నాడు.
శ్రీరాముడు : మహర్షీ! స్వరూపతః చిదాకాశమే అయి ఉన్న ఈ సృష్టికి గల ప్రయోజనమేమిటి ?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ సృష్టికి రెండు ప్రయోజనములు శాస్త్రములు వివరిస్తున్నాయి.
1.) సర్వ జనులకు వారి వారి కర్మానుసారంగా విషయ ఫలములను అందించటం.
2.) 'అధికారి’ అయినవానికి 'జ్ఞానము' అనే ఫలమును ఇవ్వటం.
ఈ రెండూ ఒసంగుటయే సృష్టి యొక్క స్వభావమై ఉన్నదని విజ్ఞుల అభిప్రాయం.
Page:90
ఇక సృష్టి కర్త యొక్క వాస్తవ రూపం శివము-చిదాకాశ మాత్రము అయి ఉన్నది. ఆతడు తన శివఅంతరంగ జనిత మాయాచిత్ స్వరూపముచే ప్రేరితుడై ఈ సృష్టిని నిర్వర్తించే కార్యమునందు ప్రవృత్తుడై ఉంటున్నాడు. మరియు అదే చిత్స్వరూపము చేత ప్రళయము కొఱకై కూడా ప్రేరితుడై ఒకానొకప్పుడు సమస్త జగత్తును సంహారమొనర్చి మరల శాంతించుచున్నాడు. చిదాకాశరూపుడగు ఆ పరమాత్మయే 'సృష్టి' అనే కార్యము నిర్వర్తిస్తూ ప్రజాపతి అగుచున్నాడు. నిర్మల చిదాకాశ రూపుడగు ఆ పరమేశ్వరుడే మహాకాలరుద్ర రూపమును ధరించి ఈ సృష్టి మహాసముద్రమును పానమొనర్చి పరమశాంత స్వరూపమును ప్రదర్శిస్తున్నాడు.
రామచంద్రా! ఆ విధంగా మహాకాల రుద్ర రూపాన్ని, ఆ విలయతాండవం దర్శిస్తున్నాను కదా! ఆ రుద్రరూపంతో మహా ప్రళయ సముద్రమును తన యొక్క ఉచ్ఛ్వాస వేగంతో పానం చేయటానికి ప్రవృత్తుడైనారు. ఆ రుద్రుని ప్రాణవాయువుచే ఆకర్షితమైన మహాసముద్రము జ్వాలా సమూహములచే వ్యాప్తమైయున్న ముఖంలోనికి-జలం బడబాగ్నిలో ప్రవేశించినట్లు-ప్రవేశించు చుండటం కనిపించింది. అహంకార రూపుడగు ఆ రుద్రుడు ఆ సమయమున క్రమంగా కల్పాంత సముద్రమంతా త్రాగివేశారు. అప్పుడు సర్వమూ సర్వవిశేష శూన్యంగా అయింది. అప్పుడక్కడ ఆకాశం వలె నిర్మలము-నిశ్చలము అగు ఈ నాలుగు మాత్రమే శేషించాయి.
1.) ఆకాశము వలె విశాల రూపుడు, కృష్ణవర్ణయుతుడు, ఆధారరహితుడు "నిశ్చల సుగంధ మనోహర స్వరము” వలె ఉన్నట్టి రుద్రభగవానుడు
2.) బ్రహ్మాండమునకు ఆ బ్రహ్మాండములో అధోభాగమున ఒకప్పుడు పర్వత-దేవతాది అనేక అడుగున గల పదార్థములతో విశేషములతో కూడుకొని ఉండేది. ఇప్పుడో? దేవతాది పృథ్వి భాగము సర్వ జీవుల సహితంగా పాతాళ భూలోక స్వర్గలోకములు భస్మీభూతమైనాయి కదా! ఆ భస్మము జల ప్రళయంచే ముంచివేయబడింది. జలమంతా రుద్రునిచే త్రాగి వేయబడగా ఇక అచ్చోట బురదమయమై శేషించింది. అట్టి పార్థివమయమై (బురదమయమై) ఆ బ్రహ్మాండము యొక్క అధోభాగమంతా (బురదతో నిండి) కనబడుతోంది.
3.) ఊర్ధ్వమున ఆకాశం అతిదూరంగాను అత్యంత విస్తారంగాను నేత్రజ్యోతికి నిరామయము అందనిదై ఉన్నది. దుర్లక్ష్యమై ఆకాశం శ్యామవర్ణంగా (నల్లగా) ఆ బ్రహ్మాండ ఖండమునకు ఊర్ధ్వంగా కనిపిస్తోంది.
4.) బ్రహ్మైకాశము బ్రహ్మాండ ఖండముల మధ్యగా ఉన్నట్టి “అనాది-అనంతము-సర్వ వ్యాప్తము” అగు బ్రహ్మాకాశము.
...ఈ నాలుగు వస్తువులు మాత్రమే అక్కడ అప్పుడు నాకు కనిపించాయి. ఇవి తప్ప మరే వస్తువూ ఎక్కడా గోచరించనే లేదు.
శ్రీరాముడు : మహాత్మా! ఈ బ్రహ్మాండ కటాహములో భూమి-నక్షత్రములు-త్రిలోకాదులు ఉన్నాయి కదా! అట్టి బ్రహ్మాండమునకు బాహ్యమునకు ఏమేమి పదార్థములున్నాయి? వాటి తర్వాత ఏ ఆవరణలు ఉన్నాయి. నిరాధారములగు ఆ ఆవరణలన్నీ ఎచ్చట ఎట్లా స్థితి కలిగి ఉన్నాయి.
Page:91
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ బ్రహ్మాండమునకు ఆవల ఈ బ్రహ్మాండం కంటే 10 రెట్లు విశాలమైనట్టి జలం ఉన్నది. ఈ బ్రహ్మాండ ఖండముల మధ్యగల ఆకాశము అనంతమై ఉన్నది. అట్టి ఆకాశం అనంతత్వముచే అట్టి బ్రహ్మాండ ఖండములకు లోననే గాక బయట కూడా వ్యాపించి ఉన్నది.
అట్టి జలమునకు ఆవల ఆ జలావరణము కంటే 10 రెట్లు అధికంగా జ్వాలామయమగు అగ్ని ఉన్నది. ఆ తర్వాత ఆ అగ్నికంటే 10 రెట్లు అధికంగా నిర్మల వాయువు కలదు. ఆ వాయువుకు ఆవల ఆ వాయువు కంటే 10 రెట్లు అధికంగా విశాలము శుద్ధము అగు ఆకాశము ఉన్నది.
అటు తర్వాత పరమ పవిత్రము-అతి నిర్మలము-అనంతము అగు బ్రహ్మాకాశము కలదు. మహేశ్వరుడు, కపిలుడు మొదలగు వేర్వేరు యోగుల యొక్క మతమును అనుసరించి... మాయా సమన్వితమైన బ్రహ్మాకాశమున 1.) అహంకారం, 2.) మహత్తు, 3.) ప్రకృతి మొదలైనవి ఒకదాని కంటే మరొకటి 10 రెట్లు అధికంగా వర్తిస్తున్నాయి.
ఈ విధంగా పరస్పర వివాదములతో కూడుకొన్న అనేక వర్ణనలు లోకంలో ప్రసిద్ధమై ఉన్నాయి. అందుకే అవి ఉపేక్షించాను. నీవు అడిగావు కాబట్టి పై విశేషాలు చెప్పాను.
శ్రీరాముడు : మహర్షీ! బ్రహ్మాండ ఖండం యొక్క ఊర్ధ్వ-అధో భాగములకావల ఆ భాగాలన్నిటికీ ఆవరణగా ఉంటూ జలం ఉన్నదని చెప్పారు కదా! జలం నేలపైనే నిలుస్తుంది గాని, అంతరిక్షంలో కాదు కదా! మఱి మీరు చెప్పిన జలము ఎట్లు దేనిచే ధరింపబడుచున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : అమ్మ పిలిచినప్పుడు బిడ్డలు ముద్దుగా పరుగులు తీస్తారు చూచావా? అట్లాగే బ్రహ్మాండ కపాలం యొక్క పార్థివ పదార్థ విభాగం వైపుగా ఆకర్షించబడుచున్నవై ఆ చలవాయుఆకాశాదులు పరుగులు తీస్తున్నాయి. అట్టి 'గతి' యొక్క విశేషం చేతనే ఆ జలాదులు కూడా (గతిచే) స్థితిని పొందుచున్నాయి. 'గతి' లేకుంటే, 'స్థితి’ పటాపంచలు కాగలదు సుమా! దప్పికగొన్న వాడు నీరు ఉన్న వైపుగా పరుగులు తీస్తాడు చూచావా? అట్లా బ్రహ్మాండ మహా శరీరం యొక్క 'కపాలం' వైపుగా సర్వమూ నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఈ తేజస్సు మొదలైన పదార్థాలన్నీ లోపల గల ఆకర్షణ శక్తిని అవలంబించి 'స్థితి' కలిగి ఉండ గలుగుచున్నాయి. శరీరమును-శరీర భాగములగు కాళ్ళు చేతులు మొదలైన అవయవములు త్యజించనట్లే ఆ జలాదులు తమ స్థితిని త్యజించటం లేదు.
శ్రీరాముడు :
బ్రహ్మన్! బ్రహ్మాండఖండే తే తిష్ఠతః కథముచ్యతామ్?
కిమాకృతీ? ధృతే కేన? కథం వా పరినశ్యతః?
హే బ్రహ్మజ్ఞా! ఈ విధంగా ఇతరములైన జల-అగ్ని-ఆకాశాది ఆవరణలకు ఆధారమైనట్టి ఈ బ్రహ్మాండ ఖండములు ఎట్లా ఏ ఆధారంతో 'స్థితి' కలిగి ఉంటున్నాయి? ఈ బ్రహ్మాండముల యొక్క ఆకారాలు ఎటువంటివి? వాటిని ఏది ఎట్లు ధరించుచున్నది? అట్టి బ్రహ్మాండములు ఎవరి కారణంగా ఎందుకు ఎట్లా నాశనము పొందుచున్నాయి?
Page:92
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నంలో స్వప్న జగత్తుకు ఆధారమేమున్నది? ఏ ఆధారం లేకపోయినా, వాటిని ధరిస్తున్న వారంటూ ఎవరూ లేకపోయినా స్వప్న జగత్తులోని పదార్థాలు ధరింపబడు చున్నాయి కదా! అవన్నీ ఏచోటా పడకపోయినా, (మరొకప్పటికి) పడి నశిస్తున్నాయి కదా! వాటికి ఏ ఆకారమూ లేకపోయినా కూడా “ఇల్లు-మనుష్యులు-ఊరు” మొదలైన ఆకారాలతో కనిపిస్తు న్నాయి కదా! అట్లాగే ఈ జగత్తు వాస్తవానికి ఎవరి చేతా ధరింపబడకపోయినప్పటికీ బాగుగా ధరించబడుచున్నట్లే స్థితి కలిగి ఉంటోంది. ఇది ఎటూ పడకపోయినప్పటికీ పడుచున్నదే అగుచున్నది. నిరాకారమే అయినప్పటికీ, సాకారముగానే ఉన్నది. ఈ మాయా మయ ప్రపంచంలో పడునదేమిటి? లేచునదేమిటి? పొందుచున్నదేమున్నది? ఎవరు ఎట్లా దేనిని ధరిస్తారు? ఆ ధరించే వారు కూడా మాయలోని విభాగమే కదా! చైతన్యము యొక్క స్ఫురణను అనుసరించే ఇదంతా ప్రకాశిస్తోంది. ఆకాశంలో కేశములు-శూన్యత్వము ఎట్లా కనిపిస్తున్నాయో, వాయువులో చలనం ఎట్లా ఉన్నదో, జలమునందు తరంగత్వం ఏ విధంగా ఉన్నదో... ఆ విధంగానే చిదాకాశంలో ఈ జగత్తు కూడా కలదు. 'సంకల్పం'లో నగరం ఉన్నట్లే, ఈ బ్రహ్మాండగృహం చైతన్యమున (లేక) చిదాకాశమున ఇట్లు నియమిత ఆకారమును ధరించనదానివలె వర్తిస్తోంది.
శ్రీరాముడు : స్వామీ! ఈ కనబడే జగత్తు యొక్క అసలైన రూపమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ 'జగత్తు' అనబడేది ద్రష్ట యొక్క "అధ్యాస చమత్కారమేనయ్యా! వాస్తవానికి ఇదంతా 'సంవిజ్మయము మాత్రమే'!
పూర్ణమగు సంవిత్తే... గమనము యొక్క అధ్యాసచే గమనశీలమున వర్తిస్తోంది. 'పతనం' యొక్క అధ్యాసచే రాత్రింబవళ్ళు 'పడుట' యందు (పతనమునందు) తత్పరమగు చున్నది. 'ధారణ' యొక్క అధ్యాసచే సదా స్థితి కలిగి ఉంటోంది.
ఊర్ధ్వ గమనమున చైతన్యముతో కూడి ఈ జగత్తు అట్టి అధ్యాసచే ఊర్ధ్వమునకు జనుచున్నది. నాశ సంవిత్తుతో కూడిన అధ్యాసచే కల్పాంతమున నశించుచున్నది. చిన్మయమగు సంవిత్తో కూడి సృష్ట్యాదియందు సృష్టి యొక్క అధ్యాసచే చిదాకాశమున జనించుచున్నది.
రామచంద్రా! శరత్కాలాకాశం వైపుగా దృష్టిని సారించిన మనుజునికి ఆకాశంలో అసంఖ్యాక ముత్యముల సమూహములు గోచరిస్తూ ఉంటాయి చూచావా? అట్లాగే ఈ జగత్తులు అసత్యములే అయినప్పటికీ... భ్రాంతిచే సత్యము వలె చిదాకాశమున గోచరిస్తున్న ఈ జగత్తులకు ఆధారం గణించటం ఎవరి తరం? వీటన్నిటి యొక్క మూలము మాత్రమూ “అధ్యాస”యే!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ తర్వాత ఆ మహాకాశంలో మదించినట్టి విశాల రూపియగు రుద్ర భగవానుడు లయమొనర్చటంలో ప్రవృత్తుడవటం నాకు కనిపించింది.
Page:93
అతడు ఆకాశమే ఆకృతిగా ధరించి వచ్చారు. ఘన శ్యామవర్ణం కలిగి ఉన్నారు. తన యొక్క మహత్తరమైన ఆకారంతో దశదిక్కులు పూరించి ఉన్నారు. సూర్య - చంద్ర-అగ్నులే అతని మూడు నేత్రాలు. చలించు దశ దిక్కులు అతని వస్త్రముల వలె కనిపించాయి. ఘనమైన-దీర్ఘమైన నీలివర్ణపు కాంతి పుంజములను ఆయన వెదజల్లుచున్నారు. ఆయన నేత్రాలు, బడబాగ్ని వలె కదలుచున్నాయి. సప్త సముద్రాలు అప్పటి జలప్రళయానికి ఏకంకాగా, ఆ మహాజలమంతా అతని దేహములోనికి అతివేగంగా ప్రవేశించివేసింది.
ఆ ప్రళయకాల రుద్రభగవానుడు ఆ విధంగా విలయతాండవం చేస్తూ ఉండగా, ఇంతలో ఒక చమత్కారమైన సంఘటన జరిగింది. ఆ రుద్రుని శరీరం నుండి ఒక ఛాయ బయల్వెడలి ఆతని నృత్యమును అనుకరించసాగింది. అది చూచిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది! అరె! ఏమి ఆశ్చర్యం! సూర్యుడు మొదలైన కాంతిమయ వస్తువులు లేకపోవటంచే ఆకాశమంతా అంధకారంచే ఆవరించబడి ఉన్నది కదా! నీడ ఉండాలంటే ఎక్కడి నుండైనా ఒక వస్తువుపై కాంతి ప్రసరించాలిగా! కాంతి ప్రసరించాలంటే ఏ చోటినుంచైనా సూర్యుడి వంటి కాంతిమయగోళం ఉండాలిగా! మరి అంధకారమయమైన ఆకాశంలో ఛాయ ఎట్లా స్థితి పొంది ఉన్నది?".... అనే అనుమానం నాలో ఉదయించింది. నేను ఇట్లా అనుకుంటూ ఉండగా, ఇంతలో ఆ ఛాయ అతి శీఘ్రంగా విశాలరూపం దాల్చింది. ఆ ఛాయ అత్యంత శోభాయమానంగా మూడు కన్నులు కలిగియున్నదై నృత్యం చేస్తూనే రుద్ర భగవానుని ఎదురుగా నిలబడింది.
ఆ ఛాయా రూపిణి కృష్ణ (నలుపు) వర్ణం కలిగి ఉన్నది. నాడీ రూపములగు శిథిలమైన ఛిద్రావయవములు కలిగియున్నది. విశాలమగు ఆకారముతో అగ్నిజ్వాలలచే ఆ ఛాయ యొక్క రూపం వ్యాపించి ఉన్నది. కృష్ణపక్ష రాత్రిలాగా అంధకారమే దేహరూపంగా గ్రహించి ఏతెంచి నట్లుగా కనబడింది. ఆ ఆకృతి ఆకాశమును దిగమ్రింగునంతటిదిగా ఉన్నది. ఆ ఛాయారూపిణి ముఖం అతిదీర్ఘంగాను, భయంకరంగాను ఉన్నది. తన భుజస్కంధములచే దిక్కులను ఢీకొట్టు చున్నది. నాసికతో ఆకాశమును కొలుచుచున్నట్లుగా ఉన్నది. శరీరం చూస్తేనేమో అధికమైన ఉపవాసములచే బక్క చిక్కినట్లున్నది. కృషించటంచే నిలువలేకపోతూ ఉండగా బ్రహ్మదేవుడు ఆమె స్థిరత్వం కొరకై దీర్ఘనాడులు సృష్టించి ఆ రూపం కుచించకుండా నిలుపుచున్నట్లుగా ఉన్నది. అతి దీర్ఘమైన దేహం చూచిన నేను “ఆమె శిరస్సు - పాదాలు ఎక్కడున్నాయి?"... అని వెతుకుతూ అతి దీర్ఘకాలం ఊర్ధ్వ-అధోగమనాలను సల్పవలసివచ్చింది. ఆ ఛాయారూపిణియగు భగవతి ధరించిన మాలకు సూర్య - దేవతా - అసురుల శిరస్సులు మందారపూలవలె గ్రుచ్చబడి ఉన్నాయి. ఆమె వాయువుచే ప్రదీప్తమగుచున్న అగ్నిశిఖలను వస్త్రంగా ధరించి ఉన్నది. అతి దీర్ఘములగు ఆమె చెవులు చంచలమైన సర్పాలతో శోభిస్తున్నాయి. ఆ చెవులకు చనిపోయిన అనేకమంది మనుజుల దేహములు బుట్టలోలాకుల వలె వ్రేలాడుచున్నాయి. ఆమె స్తనములు సొరతీగలాగ మోకాళ్ళ వరకు వ్రేలాడుచున్నాయి.
Page:94
ఆమె దంతములు అనేకమంది దేవతా సమూహములచే అలంకరించబడి ధగధగా తెల్లగా మెఱుస్తున్నాయి. ఆమె అవయవ గ్రంథులు వాయువు యొక్క సంఘటనచే ‘ఫటా-ఫటా’ శబ్దములు చేస్తున్నాయి. ఆమె నృత్యం ప్రళయకాల సముద్రతరంగముల విన్యాసమును మించిపోయి ఉన్నదనిపించింది.
ఆ ఛాయాస్వరూపిణియగు దేవి ఒక సమయంలో ఒక్క భుజంతో కనిపించింది. ఇంతలోనే వేలాది భుజాలు ఎక్కడి నుండో ఉత్పన్నమైనాయి. ఆమె యొక్క అనంత సంఖ్యాకములగు భుజాలు 'జగత్తు' అనే మండపమును వ్యాకులపరుస్తున్నట్లున్నది. ఒకప్పుడు ఆమెకు ఒక్క ముఖమే కనిపిం చింది. కొంచెం సేపటిలో అనేక ముఖములు ధరించింది. ఇంకొంచెం సేపట్లో ముఖరహితంగా కనిపించింది. అట్లాగే ఒకసారేమో ఏకపాదం కనిపించింది. ఇంతలోనే వేలాది పాదాలు ... అట్లా చూస్తూ ఉండగానే పాదరహితంగా కనిపించింది. పురాణ కథనాలను విని ఉన్నట్టి నేను ఆమె దేహాన్ని బట్టి “ఒహో! ఈమెయే ‘కాళరాత్రి'!”...అని ఊహించాను. అది నాలాగే గమనిస్తున్న కొందరు సజ్జనులు "హే కాళీమాత! కాళీ భగవతీ!"... అని గానం చేయటం నాకు వినిపించింది.
త్రినేత్రములు, జాజ్వల్యమానమగు లాలాటం, ఇంద్రనీల పర్వతంలా ప్రకాశించే చెక్కిళ్ళు, నక్షత్రములే ముత్యాలమాలగా ధరించిన ఆ మెడ, ఆమె సమీపమును ఆశ్రయించిన భయంకరమైన వాయసము (కాకి), ఆ నృత్యంలో చలించే భుజాలు, ఆ ఆకాశమును తమ రంగుతో పూరించే గోళ్ళు, మహాకాంతిని వర్షించే పిక్కలు, మహాకాశము యొక్క ఆవలను స్పృశించే ఆ కేశములు, మేఱు పర్వతములు కూడా కూకటి వేళ్ళతో పెకలించగల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు... మొదలైనవన్నీ గమనించసాగాను. ఆకాశమునందు ఉన్నట్టి నేను నృత్యవశంగా వృద్ధి చెందుచున్న ఆ కాళీ భగవతి శరీర భాగములను సావధానంగా వీక్షించసాగాను. ఆమె నృత్యం చేయటమే ప్రయోజనంగా కలిగి ఉన్నట్లు కనిపించింది. ప్రళయకాలపు పుష్కరావర్త మేఘాలు ఆమె వక్షస్థలమును చుట్టుకొని కనిపించాయి. ఆమె ఉదరము నడుము, కంఠము అనేక ఆభరణములతో ప్రకాశిస్తున్నాయి. సప్త పర్వతములు ఆమెకు కంఠమాలలయ్యాయి.
ఓ రామచంద్రా! ఆ భగవతి యొక్క అంగములలో అనేక నగర-గ్రామ ఋతు-మాసదివస-రాత్రాది సమూహములతో కూడిన త్రిలోక పరంపరలు నాకు కనిపించాయి. ధర్మాధర్మాలు ఆమె ఇతర కర్ణ భూషణములుగా కనిపించాయి. ఆమె నాలుగు స్తనములు కలిగియుండి సకల శాస్త్రార్థ క్షీరముచే నిండి ఉన్నాయి. త్రిశూలము పట్టిక-బాణశక్తి-ఖడ్గాది అనేక ఆయుధములు ఆమె చేతికి చుట్టుకొని ఉన్నాయి. పదునాలుగు విధములైన దేవతాది ప్రాణజాతులు ఆ భగవతి యొక్క రోమములై కనిపించాయి. ఆమె యొక్క దేహములో కనిపించిన నగర-గ్రామ-పర్వతాదులు పునర్జన్మ గురించిన ఆనందంతో ఆమె దేహంతోబాటే నృత్యం చేయసాగాయి. అంతకుముందు నశించిన స్థావర జంగమాత్మకమైన జగత్తంతా ఆమె యొక్క 'దేహము' అనే పరలోకంలో నృత్యం చేస్తూ సుఖంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె దేహంలో స్థానం పొందియున్న మేరు-హిమాలయమందరాది పర్వతాలు ఊయల ఊగుచున్నట్టి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. బ్రహ్మాండమాలను అటూ ఇటూ త్రిప్పుచూ ఆ భగవతి చేస్తున్న తాండవ నృత్యం చేస్తుంటే “మరల మరొక ప్రళయం ప్రారంభమైనదా?” అని అనిపించింది.
Page:95
సుర-అసుర-ఉరగ(పాములు) మొదలగు సమూహాలతో కూడిన ఆ దేవి శరీరం ఏ ఒక్క చోటా ఆగుచున్నట్లు కనిపించటం లేదు. ఆ దీర్ఘ శరీరం ఒక చక్రంలాగా తిరుగాడసాగింది. 1.) వివిధ కర్మల రూపమగు విభవములు, 2.) వాని అనుష్ఠానములకు కారణములైన విజ్ఞానములు, 3.) ఆ విజ్ఞానమునకు అనుష్ఠానమైనట్టి యజ్ఞములు - అనే మూడు సూత్రములు గల యజ్ఞోపవీతం ధరించి నృత్యం చేస్తున్న ఆ భగవతి వేదఘోష చేసే బ్రహ్మచారిణి వలె అనిపించింది. ఆ ప్రళయ నృత్యంచే భూమి ఆకాశంగాను, ఆకాశం భూమిగాను పరివర్తన మొందసాగాయి. కానీ... ఏదీ కూడా పరివర్తనం పొందటమే లేదు! ... ఎట్లా అంటావా?
ఆ రెండూ కూడా (భూమి-ఆకాశం) తమయందలి సమస్త పదార్థములన్నిటితో సహా క్రిందికిపైకి తిరుగాడుచుండగా ఇక భూమి-ఆకాశాదులలో పరివర్తనం మాత్రం ఏమున్నది?
ఆ భగవతి ముక్కు నుండి వెలువడిన గాలి 'ఘుమ్-ఘుమ్' శబ్దాలు చేస్తున్నది. ఆమె అసంఖ్యాక హస్తములు ఆకాశమును ఆక్రమించి వ్యాప్తిని పొంది ఉన్నాయి. ఆమె అంగాలలో జనితమైన జగద్వస్తువుల యొక్క భ్రమణమును చేస్తున్నట్టి నేను మామూలుగా స్థైర్యము కలవాడిని అయి ఉండి కూడా-యుద్ధంలో దెబ్బతిన్న సైనికులవలె కుంఠితుడను అయ్యాను. ఒక అద్దం గుండ్రంగా కదులుతూ ఉంటే అందులో ప్రతిబింబించే కొండలు కూడా కదలుచున్నట్లుగా కనబడ తాయి చూచావా? ఆమె దేహమునందు కూడా మహా పర్వతములు కూడా యంత్రముల వలె అట్లాగే చలించుచూ కనిపించసాగాయి. ఆకాశ సంచారులగు దేవతలు, సిద్ధులు మొదలైనవారు ఆమె దేహంలో అటు ఇటూ తిరుగుతూ ఆకాశంలో సంచరించే పక్షులలాగా కనిపించారు. సమస్త ద్వీపాలు, దేవతాలోకాలు సరోవర పుష్పాలలాగ ఆమె దేహంలో ప్రవర్తిల్లుతూ ప్రకాశిస్తున్నాయి. కోటి సూర్యుల ప్రభాసమానంతో వెలుగుచున్న ఆమె దేహంలో స్థావరములగు మహాపర్వతాదులు జంగమత్వం పొందుచున్నాయి. ఆమె తాండవం చేస్తూ ఉంటే ఆ మహా పర్వతాదులు కూడా ఆకాశంలో నృత్యం చేస్తూ కనిపించసాగాయి.
ఇంకా అనేక ఆశ్చర్యాలు! ఆమె దేహంలో సముద్రాలు పర్వతములపై నాట్యమాడు చున్నాయి! సూర్య-చంద్రులతో సహా ఆకాశం పృథ్వి క్రిందికి కదిలిపోవటం కనిపించింది! సముద్ర జలంలో గడ్డిపరకలు చంచలంగా తిరుగాడుచున్నట్లు జగత్-దిక్ మండలాలు ఆమె దేహంలో పరిభ్రమణం చేస్తూ కనిపించాయి. ఆ దేహంలో కనిపించిన ఆకాశంలో ప్రళయమేఘాలు పైకిక్రిందికి ఎగురుచూ భాసిస్తున్నాయి. ఆ దేహములోని పృథ్వి-బాహ్య-అభ్యంతరములు పైకి క్రిందికి తిరుగాడుచున్నాయి.
అంతే కాదు! ఆ భగవతి యొక్క దేహంలో సృష్టి-ప్రళయాల సమూహములు దివారాత్రాల వలె అల్పములుగా (చిన్న సంఘటనల వలె) భాసించుచున్నాయి. శుక్ల-కృష్ణ పక్షములు, సూర్య - చంద్రులు, నక్షత్ర సమూహములు ఆమెకు ఆభరణముల వలె కన్పట్టుచున్నాయి.
Page:96
ఆ భగవతి నృత్యమునకు సకల అంతర్గత భూతజాతమంతా నిత్య భ్రమణం పొందుచున్నప్పటికీ 'అధిష్ఠాన బ్రహ్మము' యొక్క దృష్టిచే నాకు అంతా అత్యంత సుస్థిరమైనదిగానే కూడా అనిపించుచునే ఉన్నది. గిఱ్ఱున తిరుగుచున్న మట్టి బొంగరములోని మట్టి సర్వవేళలా యథాతథం కదా!
ఆ ఛాయ స్వరూపిణియగు దేవి అప్పుడు ధరించియున్న దేహము భూత భవిష్యత్ కాల మందలి అనంతకోటి సృష్టి-ప్రళయములతో కూడి ఉన్నది. అట్టి దేహంతో ఆ ఛాయదేవి నృత్యం చేస్తూ ఉంటే బ్రహ్మ-విష్ణు-ఇంద్రాది దేవతలు, అసురులు వారివారి అధికారములను, ప్రవృత్తులను మార్చుకుంటూ గాలిచే కదిలే దోమలవలె అస్థిరంగా వచ్చుచూ, పోవుచూ కనిపించారు. అట్టి సృష్టి-స్థితి-లయాలన్నీ నీళ్ళలో పుట్టినశించే బుడగలు-ఆవృత్తములు వలె మిథ్యా మాత్రములే! వాటి వాస్తవ స్వరూపములన్నీ స్వప్న పదార్థాలవలె మిథ్యయే! అవన్నీ పరస్పర విరుద్ధములైన “ఉత్పాత-ఉపశాంతులు, జనన-మరణములు, యుద్ధ-స్నేహాది అభావములు, రాగ-ద్వేషములు, భయ-అభయములు”- ఒకచోట పోయబడిన రత్నముల సమూహములవలె శోభిస్తున్నాయి. ఆ శరీరంలో ఒక దానిచే మరొకటి గమనించబడనట్టి సృష్టిపరంపరలు ఒక స్రవంతివలె బయల్వెడలుచూ ఇంతలోనే మటుమాయమౌతున్నాయి. కంటిదోషం కలవానికి ఆకాశంలో వెంట్రుకలు కనిపించునట్లు వాస్తవానికి చిదాకాశరూపమే అయినట్టి ఆ భగవతి శరీరంలో 'మాయావరణ’ యొక్క ప్రభావం చేత అనేక సృష్టి స్థితి ప్రళయాలు భాసిస్తూ ఇంతలో అవన్నీ ఎటో తరలి వెళ్ళిపోతున్నాయి.
ఓ రామచంద్రా! నిశ్చలమైన పర్వతం కదలుచుండే అద్దంలో చంచలంగా తోచుతుంది కదా! ఈ జగత్తు చంచలరహితమగు అధిష్ఠాన బ్రహ్మమున ఎట్టి సంక్షోభము లేనిదై ప్రదర్శితమౌతోంది. అనేక తరంగాలు, బుడగలు మొదలైనవి ప్రదర్శించే జలము సర్వదా జలత్వము దృష్ట్యా యథా తథంగానే (జలంగానే) ఉండి ఉంటోంది కదా! సంక్షోభమనేది ఏదీ-ఎక్కడా లేకపోయిప్పటికీ ఈ జగత్తు మాయాక్షోభ దృష్టిచే సంక్షుభితంగా భాసిస్తోంది. ఆ 'మహామాయ' యొక్క శరీరమున ప్రవేశించిన సమస్త జగత్ పదార్థములూ "బాలుని ఊహలోని దృశ్య వస్తువుల" వలె ప్రతిక్షణం పరిణామం పొందుతూనే ఉన్నాయి. అవన్నీ తమ పూర్వ స్థితిని త్యజిస్తూ ఇంతలోనే అన్యస్థితిని గ్రహిస్తూ ఉన్నాయి. అ భగవతి యొక్క శరీరం నిరంతరం క్రియాశక్తి-పరిపూర్ణమై కనబడుతోంది. పెసలరాశి వలె బ్రహ్మాండ సమూహాలు ఆమె దేహంలో కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అవన్నీ ఒకసారి కలిసి ఉంటూ, ఇంతలోనే మరల విడిపోతున్నాయి. పరిణామ జగత్తులతో విరాజిల్లు తోంది. ఒక క్షణం అంగుష్ఠమాత్రంగాను, మరుక్షణం ఆకాశరూపిగాను అగుచూ కనిపిస్తోంది.
శ్రీరాముడు : స్వామీ! మాయాస్వరూపిణి యగు ఆ భగవతి యొక్క అసలైన రూపమేమిటి?
యస్మాత్ సా సకలాదేవీ సంవిచ్ఛక్తిః జగన్మయీ, అనన్తా పరమాకాశకోశ శుద్ధశరీరిణీ ॥
ఆ దేవి "చైతన్యము యొక్క స్ఫురణమాత్రమగు శక్తి స్వరూపిణి”... అని మేము గ్రహిస్తున్నాము. అందుచేతనే ఆమె “జగన్మయి... అయి ఒప్పుచున్నది.
Page:97
వాస్తవానికి ఆ దేవి “అనంత-శుద్ధ చిదాకాశ శరీరధారిణి" అయి ఉన్నది. ఆ భగవతి త్రికాలాలో ఉన్నట్టి పరిణామ శీలమగు జగత్రయము యొక్క అభ్యంతరమందు ఉన్నట్టి చిత్స్వరూపిణి సుమా! చిత్రకారుని విశాల చిత్తములో ఒదిగియున్న చిత్రమే ఒకగొప్ప కళాఖండంగా ప్రదర్శిమగుచున్నట్లు... ఆ భగవతియే ఆయా కర్మ-వాసనల పరిపక్వతను అనుసరించి ఈ విచిత్ర జగద్రూపంగా పరిణమించి శోభిస్తోంది. ఆ దేవి “అవిద్యావృతమగు చిత్ స్వరూపిణి" అయి ఉండటంచేత “సర్వ సంసారమయి” అయి చూపట్టుచున్నది. ఎప్పుడైతే విద్యచే అవిద్య బాధితమౌతుందో... అప్పుడు “శుద్ధచిదాకాశరూపం”గా వెలుగొందుచున్నది.
ఈ విధంగా, బద్ధుని యొక్క- ముక్తుని యొక్క దృష్టుల చేతను, నిమేష -ఉన్మేషము చేతను, అవిద్య-విద్యల చేతను... క్రమంగా సంసారమయమైనట్టి శుద్ధ-చిన్మయ-అనాది-అనంతమైనట్టి చిదాకాశమే ఆ దేవి శరీరం. ఆ దేవి యొక్క శరీరమునందు ఈ ఈ దృశ్యములన్నీ అభిన్నరూపంగా భాసిస్తున్నాయి.
మహాభయంకరరూపిణి యగు ఆ దేవి తన దేహముచే ఆకాశమును పూర్ణము చేసివేసినదై భైరవరూపధారియగు ఆ కల్పాంతరుద్రుని సమ్ముఖంలో పలుగు-కత్తి-ఱోలు-రోకలి-ఫలముకుండ మొదలైన చిత్ర విచిత్రములైన వస్తువులను మాలగా ధరించి నృత్యము చేయసాగింది. మధ్యమధ్యలో తన మెడను అలంకరించిన ఆయా వస్తు జాలములతో కూర్చిన దండను త్రెంచి నలువైపులా అద్దాని ఖండములను వెదజల్లి మరల మరొక పూలదండను ధరించుచున్నది. భగవతిచే నమస్కరించబడుచున్న వాడై ఆ భైరవ భగవానుడు ఆకాశములె విశాలరూపము ధరించి - ఆ నృత్యం చూస్తూ - తాను కూడా మహా నృత్యము చేయసాగారు.
డింబం డింబం సుడింబం పచపచ సహాసా ఝమ్య ఝమ్యం ప్రఝమ్యం
నృత్యన్తీ శబ్దవాద్వైః స్రజమురసిశిరః శేఖరం తార్క్ష్యపక్షైః ।
పూర్ణం రక్తావసానాం యమమహిష మహాశృంగమాదాయ పాణౌ
పాయాద్వో వన్ద్యమానః ప్రలయముదితయా భైరవః కాలరాత్ర్యా ॥
ఆ కాళరాత్రీ దేవి యముని వాహనమగు దున్నపోతు యొక్క కొమ్ములను రెండు చేతులలో ధరించి "డింబం-డింబం-డిడింబం-ఝమ్య-ఝమ్య-ప్రఝమ్య" అను తాళ శబ్దములచే నృత్యం చేస్తూ వక్షఃస్థలమున శిరస్సులమాలలను ధరించినదై, గరుత్మంతుని టెక్కల యొక్క ఈకలను మస్తకమున ధరించినదై, ప్రళయ జగత్తును భక్షించిన సంతోషంతో ఆ భైరవ భగవానుని సమక్షంలో నృత్యం చేస్తూ ఆయనకు అనేక విధములైన సత్తులను సమర్పిస్తోంది.
అట్టి భైరవ భగవానుడు- కాళీదేవీ మనందరి యొక్క జ్ఞాన ప్రతిబంధకములను నివారించి, కాపాడి దరిజేర్చుటకై సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించెదము గాక! వారి కరుణచే మన సంసార భ్రమ తొలగిపోవును గాక!
Page:98
శ్రీరాముడు : మహర్షీ! మీరు ఆ బ్రహ్మాండ విలయ సందర్భంలో గాంచిన కాళరాత్రీ దేవితో కూడి భైరవ భగవానుని విలయ నృత్యమునకు, వారిరువురి పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామం సమర్పిస్తున్నాను. ఇక్కడ నాదొక చిన్న సందేహం –
కిమేతత్, భగవన్! సర్వనాశే నృత్యతి కేన సా?
కిం శూర్ఫఫల కుంభాద్యైస్తస్యాః స్రగ్ధామధారణమ్?
కిం నష్టం త్రిజగత్ భూయః? కిం కాల్యా దేహసంస్థితమ్
పరినృత్యతి నిర్వాణం కథం పునరుపాగతమ్?
హే భగవాన్! వసిష్ఠ మహర్షీ! ప్రళయమునందు అంతా అప్పటికే నశించిపోయింది కదా! ఇక ఏ అంగాలతో ఆ కాళీ భగవతి నృత్యం సల్పుచున్నది? పదార్థములన్నీ నశించగా ఒక శూలం-ఖడ్గం-గద వంటి ఆయుధాలతో కూడిన మాలను ఆ కాళరాత్రీ దేవి ఎట్లా ధరించింది?
అసలీ మూడు లోకాలలోనూ నశించునదేది? నశించనిదేది? ఆ కాళీదేవి దేహంలో స్థితి నొంది ఉన్న లోకాలు ఎట్లా వచ్చాయి. నశించిపోయిన జగత్తు మరల వచ్చి నృత్యం సల్పుచుండటం ఏమిటి? అసలా భైరవ భగవానుడు పురుషుడా? ఆ నృత్యం ఆయన కాళీదేవితో కలిసి ఎందుకు చేస్తున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ భైరవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు! ఆ నృత్యమంతా వాస్తవమూ కాదు. ఆ భైరవ కాళీ ఆకృతులు కూడా లేనివే అయి ఉన్నాయి.
శ్రీరాముడు : మరి వారెవరు?
శ్రీ వసిష్ఠ మహర్షి : వారిరువురూ కూడా “అనాది-చిన్మాత్రము - చిదాకాశరూపము - సర్వ కారణ కారణము - అనంతము - శాంతము - ప్రకాశమాత్రము - అవ్యయము - సర్వవ్యాపకము” అయినట్టి పరబ్రహ్మమే అయి ఉన్నారు. నిరతిశయానందము- సద్రూపము అగు సాక్షాత్ పరబ్రహ్మమే నీలకంఠ త్రినేత్రత్వాది ఆ శివ శివారూపము ధరించుచున్నది.
శ్రీరాముడు : ఎందుచేత?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఉపాసకుల యొక్క వాసనానుసారమే ఆ చిన్మాత్ర బ్రహ్మం అట్లు భైరవాకారాన్ని స్థితినొంది ఉన్నది. జగత్తు అనునది శమిస్తే ఇక ఆ భైరవాదులు చిదాకాశమే అయి ఉంటారు.
శ్రీరాముడు : శుద్ధ చైతన్యంలో ఒకానొకప్పుడు సృష్టి, మరొకప్పుడు ప్రళయం ఎందుకు ఏర్పడు చున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : బంగారం యొక్క వేర్వేరు ఆకారాలనే 'ఉంగరం రెండు పేటల గొలుసు – వడ్డాణం- అరవంకి-పాపడ" మొదలైన పేర్లతో పిలుస్తున్నాం.
Page:99
బంగారానికి 'ఇది' అనే ఆకారం ఏదీ వాస్తవానికి లేదు కదా! అయితే... బంగారం ఏదో ఒక ఆకారం లేకుండా ఉంటుందా? ఉండదు. ఏదో ఒక ఆకారం కలిగి ఉండటం బంగారం యొక్క స్వభావం కదా! మిరియపుగింజ 'కారపుదనం’ కలిగి ఉండటమనేది అద్దాని స్వభావమే కదా! చెఱుకు రసం 'మాధుర్యం' లేకుండా ఎట్లా ఉంటుందో చెప్పు? మాధుర్యం లేకపోతే అది చెఱుకు రసమనియే అనిపించుకోదు.
అట్లాగే... అజ్ఞాతమగు చైతన్యము చేతనరూపం అయిఉండటం చేత తన యొక్క “సృష్టిస్థితి-లయములు” అనే స్వభావం విడిచి ఉండజాలదు. అనగా అది తన విషయాకారాన్ని త్యజించి ఉండదు. ఏ పదార్థమైనా తన యొక్క స్వభావాన్ని విడచి ఉంటుందా? ఏదో ఒక దానికి ప్రకాశింప జేయకుండా ఉంటే చిన్మాత్రం 'చిన్మాత్రం’ అని అనిపించుకోజాలదు. అట్లాగే చిదాకాశానికి ‘నాశనం’ అనేది ఉండజాలదు. అనగా, సత్తు ('అ'కారం - చిత్తును ('ఉ'కారాన్ని - ఎఱుకను), ఆనందాన్ని (‘మ'కారాన్ని - - ఎరుగబడేదానిని ఎరుగబడేదానిని - జగదత్వమును) స్వభావసిద్ధంగా కలిగియే ఉంటుంది.
శ్రీరాముడు : ప్రకాశరూపమగు బ్రహ్మమున ప్రకాశరూపమగు జగత్తు ఎట్లు ఉద్భవిస్తోంది? ఈ లోకాలు, లోక పాలకులు ఎట్లా ఉత్పత్తిని పొందుచున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి బ్రహ్మము యొక్క స్వసత్తామాత్రము నకు 'అన్యము’ అనేదేదీ లేనే లేదు. ఆ బ్రహ్మమే తన యొక్క 'అనేకత్వము' అను 'చమత్కారమైన ఇచ్చచే తనకంటే భిన్నంగా అనిపించే ఈ 'జగత్తు' అనే అన్యత్వమును కల్పన చేసి, అంగీకరించుచున్నది. కాబట్టి ఈ ముల్లోకముల సృష్టి-వీటి కల్పాంతము కూడా "ఆది-మధ్య-అంతరహితము-క్షోభవర్జితముసర్వశక్తి మయము” అయినట్టి బ్రహ్మము యొక్క నిజ సత్తామాత్ర ప్రకాశమే సుమా! అదియే ఆకాశము-భూమి-దిక్కులు కూడా అగుచున్నది. అదియే ఆది-మధ్య-అంతము కూడా! నిర్మలము-వస్తు రహితము అగు ఆకాశం నీలంగా కనిపిస్తోంది చూచావా? అట్లాగే నిర్విషయ బ్రహ్మమునందు అవిద్య దృష్టిచేత ఉత్పత్తి - నాశనములు భాసిస్తున్నాయి.
జననం మరణం మాయా మోహమ్ మాన్యమ్“అవస్తుతా”!
వస్తుతా చ వివేకశ్చ బంధో మోక్షః శుభాశుభే
విద్యా అవిద్యా విదేహత్యం సదేహత్వమ్ క్షణఃచిరమ్
చంచలత్వ, స్థిరత్వం వా, త్వం చ అహం చేతరశ్చ తత్ ॥
సత్ అసత్చ అధ సదసన్ మౌర్యంపాండిత్య మేవచ దేశకాల క్రియాద్రవ్య కలనా కేతి కల్పనమ్ రూపలోకనమ్ అమనస్కారః కర్మ బుద్ధిః ఇంద్రియాత్మకమ్ తేజో వారి అనిల ఆకాశ పృథివ్యాదికమ్ ఇదమ్ తతమ్ ॥
ఏతత్ సర్వమసౌ “శుద్ధ చిదాకాశో నిరామయః”
అజహద్వ్యోమతామేవ! సర్వాత్మైవైవ మాస్థితః!
Page:100
ఓ రామచంద్రా! జననం-మరణం-మాయ-మోహం-మందత్వం-అవస్తుత్వం, వివేకముబంధము-మోక్షము-శుభము-అశుభము-విద్య-అవిద్య, నిరాకారత్వం-సాకారత్వం-క్షణకాలం చిరకాలం-స్థిరత్వము, 'నీవు' అను భావం, 'నేను' అనే భావం 'వారు వీరు' మొదలైన అన్యత్వం, సత్తు-అసత్తు-మూర్ఖత్వము-పాండిత్యము, దేశము-కాలము-క్రియ, ద్రవ్యము-కళ-క్రీడ-కల్పననామ రూపములు, బాహ్య అభ్యంతర విషయములు-కర్మేంద్రియములు-జ్ఞానేంద్రియములు, ఈ అంతటా నిండియున్న పృథివి- జలము- అగ్ని -వాయువు-అకాశం అనబడు పంచ భూతములు... ఇవన్నీ కూడా నిరామయమై - చిదాకాశమే అయి ఉన్నాయి. ఆ చైతన్యము తన యొక్క “శుద్ధ చిదాకాశ రూపత్వము” ను త్యజించకుండానే సర్వరూపముగా అయి చెన్నొందుచున్నది.
ఈ సమస్త జగత్తు చిదాకాశమే అయి ఉన్నది. అత్ర న సంశయః! ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చైతన్యము కంటే వేఱుగా ఏదీ లేదు. స్వప్నంలో కనిపించే ఏ పదార్థమైనా స్వప్న ద్రష్ట యొక్క స్వప్న సత్తా చైతన్యమే! అట్లాగే జాగ్రత్తులో కనిపించేదంతా జాగ్రత్ ద్రష్టా చైతన్యమే!
రామచంద్రా! ఏ చిన్మయమగు చిదాకాశం గురించి మనం ఇప్పటి వరకూ చెప్పుకుంటున్నామో, అదియే "సనాతనుడగు శివుడు" అని కూడా చెప్పబడుచున్నదని నీవు గ్రహించు. ఆ శివరూపుడగు పరమాత్మయే "బ్రహ్మ-విష్ణు-చంద్ర-సూర్య-ఇంద్ర-వరుణ-యమ-కుబేర-అగ్ని”... ఆదిగా గల రూపములన్నీ ధరించుచున్నాడు. వాయు-మేఘ- సముద్రాదులు గాను, సర్వభూత - భవిష్యత్ పదార్థములుగాను అగుచున్నాడు. అంతేకాదు. “అది కలదు - ఊహూఁ! లేదు" అని - సంకల్పించబడు వికల్పించబడు సర్వ వస్తువులు కూడా పరమాత్మయే అయి ఉన్నాయి.
ఈ ప్రకారం... ఈ బ్రహ్మ మొదలైన సర్వపదార్థాలు కూడా, ఆయా ఉపాధుల దృష్ట్యా, చిన్మయమగు “బ్రహ్మ ప్రకాశం” యొక్క అంశరూపాలే అయి బ్రహ్మాండంగా స్ఫురిస్తున్నాయి. అనగా, పరమాత్మయే ఇట్లు బ్రహ్మ మొదలైన ఈ లోకాలలోని సర్వాకారాలుగా “అన్యథా గ్రహించటం” అను అవిద్యచే చూపట్టుచున్నది. ఈ బ్రహ్మ మొదలైన సర్వ పదార్థాలు కూడా -“స్వభావమాత్ర బోధ” (“స్వభావం - స్వభావి' అను విశ్లేషణ)చే “ఇదంతా చిన్మాత్రమే” అని తెలియబడగలదు.
రఘురామా! అన్నిటా-అంతటా-అన్ని రూపాలుగా ఉన్నది చిదాకాశం మాత్రమే! చిదాకాశా నికి 'అన్యథా’ అనునది ఏదీ లేదు. చిదాకాశ బ్రహ్మమే అజ్ఞాన దృష్టిచే 'అబోధ రూపం' అగుచు 'జీవ-జగత్ రూపం' తోటి తనలో స్థితి నొంది ఉన్నది. అజ్ఞాన దృష్టి బ్రహ్మం యొక్క స్ఫురణయే కనుక బ్రహ్మానికి అభేదమే అగుచు, తద్వారా ఈ జీవ జగత్తులన్నీ బ్రహ్మానికి అద్వితీయమగు చున్నాయి. తత్త్వదృష్టిచే ... అదే బోధ రూపంగా అగుచు, చిదాకాశం గానే తన యందు వెలయు చున్నది. అందుచేత రామచంద్రా ! “భేదము- ద్వైతము - ఐక్యము మొదలైనవి ఏవీ కూడా లేవు” అని ఎరిగినవాడవై, శాంతుడవగుము.
తావత్ తరంగత్వమయం కరోతి జీవః స్వసంసార మహా సముద్రే ।
యావత్ న జానాతి పరం స్వభావం నిరామయం తన్మయతాం ఉపేతః ॥
జీవుడు తన స్వరూపాన్ని ఎఱుగనంత వరకు కూడా ఈ 'సంసారం' అనే మహా సముద్రంలో ‘జనన-మరణ-భ్రమణ’ ఆదిగాగల వివిధ కల్పనా తరంగాలను పొందటం జరుగుతూనే ఉంటుంది.
Page:101
శ్రీరాముడు : మహర్షీ ! ఈ విధంగా జన్మ మరణ-కర్మ-పునర్జన్మ-లోకాలోక భ్రమణాలతో కూడిన ఈ సంసార మహాసాగరమును పొందుచున్న జీవుని అవస్థల ముగింపునకు ఉపాయం లేదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఉపాయం ఎందుకు లేదు. తప్పకుండా ఉన్నది. అది తన వాస్తవస్వరూపము ఎట్టిదో తాను ఎఱుగుటయే! దానినే 'ఆత్మజ్ఞానం' అంటున్నాం. సర్వభావములకు ముందే నిర్మలమైనిత్యబుద్ధ స్వరూపమై సర్వ విషయాతీతమై ఉన్న తన వాస్తవ స్వభావం - స్వరూపం ఎఱిగిన మరుక్షణం ఈ ‘సంసారము’ అనే స్వప్నసదృశ మహాసాగరం, మెళకువ వచ్చినప్పటి కలలోని సంఘటనలవలె, పటాపంచలు కాగలదు. అప్పుడు సంసారమంతా శమించగా, ఇక ఆత్మయే తానుగా శేషించినవాడై ఈ జీవుడు పరమ శాంతిని అనుభూతపరచుకోగలడు.
జ్ఞానేతు శాంతిం స తథోపయాతి యథా న సో అబ్ధిః, న తరంగకోఽసౌ ।
యథా స్థితం సర్వమిదం చ శాంతం, భవత్యనస్తం పరమేవ తస్య ॥
ఓ రామచంద్రా ! జ్ఞానముకలుగగా ఇక ఆ పై ఈ జీవుడు తరంగ రహితమగు సముద్రవలె శాంతిని పొందుచున్నాడు. అప్పుడు ఆతనికి ఈ జగత్తు యథా తథంగా ఉంటూనే, ఇదంతా పరమశాంతమగు బ్రహ్మరూపమే అగుచున్నది.
శ్రీరాముడు : స్వామీ! మీరు “మహాప్రళయానంతరం ప్రళయకాల రుద్రుని విలయతాండవం” గురించి వర్ణించి చెప్పారు కదా ! "అంతా లయించిపోగా ఆ ప్రళయకాల రుద్రుడు ఎక్కడి నుండి ఎందుకు వచ్చాడు? లోకాలన్నీ ఆయనలో ఎందుకు ప్రవేశిస్తున్నాయి? ఆ తాండవం చూస్తూ ఉంటే మీకు భయం కలుగలేదా? ఆ తదనంతరం ఏమికానున్నది?"...అను ప్రశ్నలు ఇంకా నన్ను వెంట నంటియే ఉన్నాయి. కనుక ఆ ప్రళయకాల రుద్రుడు ఎవరో, ఆయన వాస్తవ స్వరూపమేమిటో వివరించ వలసినదిగా నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి : మనం ఏ “చిన్మాత్రమగు మహాకాశం" గురించి ఇంతవరకు అనేకసార్లు చెప్పుకొంటున్నామో, అదియే 'శివుడు' అని (పురాణాదులచే, ఉపాసకులచే) చెప్పబడింది. ఆ చిన్మాత్ర మహాకాశమే ఇప్పుడక్కడ రుద్రరూపం ధరించి ప్రళయ కాలమున నృత్యము చేయుచున్నది.
శ్రీరాముడు : 'కేవలానంద స్వరూపం' అని చెప్పబడే చిన్మాత్ర మహాకాశం ఆ విధంగా ప్రళయకాల రౌద్ర స్వరూపుడగు రుద్రుని రూపం ధరించటం ఎందుకు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా ! ఏ భయంకరాకృతిచే రుద్ర భగవానుడు అక్కడ నాకు దర్శన మిచ్చారో, వాస్తవానికి ఆయన ఆకృతి అది కాదు. పరమ శాంతము-పరమానందము-చిదనము అగు చిదాకాశమే అట్టి రూపంగా స్ఫురించుచున్నది. నా యొక్క తత్త్వదృష్టి ప్రభావం చేత ఆ రుద్ర రౌద్రాకారమును శాంతమగు చిదాకాశంగానే వీక్షించాను.
Page:102
అయితే ఆ రౌద్ర స్వరూపంగా కనిపించే రుద్రుని చిదాకాశ స్వరూపంగా దర్శించగలగటం తత్త్వదృష్టి (తత్ త్వమ్ అసి - అను దృష్టితో) మాత్రమే సాధ్యం.
శ్రీరాముడు : స్వామీ ! అట్టి వివేక దృష్టి ఎట్లా లభిస్తుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జగత్తును తత్త్వదృష్టిచే దర్శించటమే వివేకదృష్టి. అనగా “నిర్మల అప్రమేయనిత్య సత్య స్వరూపుడే ఈ ఈ సర్వ స్వరూపాలుగా అయి, మాయను అంగీకరించి ఇట్లు ఒకచోట, బహు ప్రజ్ఞాస్వరూపుడుగా, మరొకచోట అజ్ఞానబద్ధుడుగా కనిపిస్తున్నాడు. ఒకే జలం ఒకచోట చంచలంగా ఉన్నట్లు ఈ కనబడే సహజీవులుగా ఉన్నది, సకల లోకస్థులుగా ఉన్నది ఆ అద్వితీయ పరమాత్మయే! ఆయనయే నా రూపంగా కూడా ఉన్నారు” అనే దృఢమైన భావనాపూర్వకమైన అవగాహనను "వివేక దృష్టి- తాత్త్విక దృష్టి" అని పిలుస్తారు. అట్టి తాత్త్వికదృష్టిని సముపార్జించు కొన్న వారు ఈ మాయా జగత్తును చూచి మోహం చెందరు. ఎవరిచేతనో కల్పించబడిన నాటకాన్ని చూస్తున్నట్లు వారు అంతరంగమున నిశ్చింత కలిగినవారై ఉంటూ, బాహ్యమున యథారీతిగా వర్తిస్తూ ఉంటారు.
అట్టి క్రమమైన అభ్యాసంచే మాత్రమే "ఇదంతా ఆత్మ యొక్క విలాసమే” అని గ్రహించబడ గలదు. అట్టి అభ్యాసము గల ఎవరైనా సరే, ఈ సంసారాన్ని అధిగమించగలుగుతారు. అట్టి దృష్టినే (అంతయూ ఆత్మ యొక్క విన్యాసం మాత్రమే, అను అవగాహన - మరియు అనుభూతిని) “ఆత్మజ్ఞానం” అని “ఆత్మయోగం” అని “ఆత్మసాక్షాత్కారం” అని విజ్ఞులు పిలుస్తున్నారని గ్రహించు. ఈ సహజీవులు, తత్సంబంధమైన సంఘటనలు ఈ కంటికి కనిపించే దృశ్యము, ఈ మనస్సుకు అనుభవమయ్యే భేద-అభేదములు పరమశాంతమగు ఆత్మకు వేరుగా అనిపించటమే సంసారము యొక్క స్వరూపం. ఇంతకుమించి వేతే 'సంసారము' అనబడునది ఎక్కడా ఏదీ లేదు.
కనుక రుద్రతాండవం, కాళీ దేవతానృత్యం మొదలైన సర్వం, సమస్తం కూడా పరమశూన్యమైన చిదాకాశమే అయి ఉంది. ఇక ఆ ఆకారం గాని, ఆ నృత్యంగాని వాస్తవానికి లేనివే అగుచున్నాయి.
శ్రీరాముడు : మహర్షీ! మీ వాక్యములు పరస్పర విరుద్ధంగా లేవంటారా? ఆ "రుద్ర-ఛాయాదేవిల ప్రళయ తాండవం చూచాను” అని ఒకవైపు అంటున్నారు. ఇంతలోనే “అవేవీ లేవు” అని కూడా చెప్పుచున్నారు. దయచేసి అలా అనటంలో తమ ఉద్దేశమును విశదీకరించమని నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఈ జగత్తు వాస్తవానికి లేకపోయినా, ఉండి ఉన్నట్లే కనిపించటం జరుగుచున్నదని చెప్పటానికి మనకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి.
జలంలో వేరువేరు తరంగాలు కనిపిస్తున్నాయి. కానీ తరంగాలన్నీ ఒకే జల స్వరూపం కదా! జలం సర్వదా - తరంగం ఉన్నచోట, తరంగం లేనిచోట - జలంగానే ఉంటోంది కదా!
ఒకే మట్టితో కోతి-కుక్క-రాజులు-మంత్రులు-సైనికులు మొదలైన అనేక బొమ్మలు తయారు అయినప్పటికీ అవన్నీ ఒకే మట్టి కదా! ఆకారం దృష్ట్యా అవి వేరువేరైనప్పటికీ మట్టి దృష్ట్యా ఒక్కటే కదా! మట్టికి ఆకారం లేనప్పటికీ, ఆకారాలన్నీ మట్టివే కదా!
Page:103
జనులందరు రక్త-మాంస-అస్థిమయ (మఱియు) అస్థిర స్వరూపులే అయినప్పటికీ కొందరికి మరికొందరు బంధువులై ఉండటం, ఇంకొందరు బంధువులు కాకపోయి ఉండటం అనుభవానికి సిద్ధిస్తోంది కదా! ఉన్నదంతా పాంచభౌతికమైన దేహములు తోలుబొమ్మల సమావేశమే అయినప్పటికీ... దేహముల-దేహముల మధ్య ప్రేమ ద్వేషాది రకరకాలైన ఉద్వేగములు వేరువేరుగా వేరువేరు దేహములతో ఏర్పడుచున్నాయి కదా!
అంతా బంగారమే అయినప్పటికీ రకరకాల పేర్లుగల ఆభరణాలు సంభాషణా ప్రయుక్తమై ఉంటున్నాయి కదా! పంటభూమి అంతా ఒక్కటే అయినప్పటికీ “ఇంతవరకు మీ చేను - అది మా చేను అనునవి లోకవిదితమై ఉంటోంది కదా !
అట్లాగే ఆ ఆకారములు, ఆ నృత్యము అక్కడ కనిపిస్తున్నప్పటికీ అని వాస్తవానికి లేవని నేను గ్రహించియే అదంతా దర్శించాను. మరి ఆ ఆకారములు ఎట్లా ఏర్పడ్డాయంటావా? అదంతా కూడా, ఉపాసకుల వాసనచే ఆ భగవంతుడు అట్లు భైరవాకారంగా కానుపించుచున్నాడు.
శ్రీరాముడు : స్వామీ! మీరు చూచినదంతా ఉపాసకుల కల్పనా చమత్కారం మాత్రమే అయినప్పుడు, ఆ ప్రళయ తాండవం గురించి వర్ణించి చెప్పటంలో మీ ఉద్దేశం చెప్పవలసినదిగా నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి :
వాచ్య - వాచక సంబంధం వినా బోధో న జాయితే ।
యస్మాత్ - తస్మాత్, త్వయి - మయా దృష్టమేవ ప్రవర్ణితమ్ ॥
ఓ రామచంద్రా! చెప్పబడే విషయం, చెప్పటం (వాచ్యం, వాచకం) అనే సంబంధం గురించిన కల్పన లేకపోతే ‘బోధ’ అనునది కుదరదు కదా! అందుచేత తత్కల్పనచే నాచే గాంచబడిన ప్రళయ కాల నృత్యములను నీకు వర్ణించి చెప్పాను. ఆ ప్రళయమే కాదు, ఈ కనబడే జగదృశ్యం కూడా వాస్తవం కాదు. ఈ జగత్తు పట్ల ఏ ఆధిభౌతిక దృష్టి జీవునికి కలుగుచున్నదో... అట్టిది చిరకాల అభ్యాసంచే ప్రౌఢమై, వాక్కుచే మాత్రమే దృఢమై చెన్నొందుతోంది. అనగా ఈ జగత్తు పంచభూతాల కలయికయే కదా! ఇక తదితరంగా కనిపించే 'నా వారు, నీ వారు, నీది, నాది' అని అనిపించేది భ్రమయే! ఏదైతే “అయోధ్యా నగరం” అని, “మా నగరం!” అని అనిపిస్తోందో... అదంతా ఆధిభౌతిక భ్రమ యొక్క చమత్కారం (లేక) విన్యాసం మాత్రమే! అదంతా మాయామాత్రమే అగుచు క్షణకాలంలో సత్యత్వం పొందినదగుచున్నది. వాస్తవానికి ఆ భైరవుడుగాని, భైరవిగాని, ప్రళయంగాని, సృష్టిగాని ప్రశాంత చిదాకాశం దృష్ట్యా లేవు. అదంతా కూడా భ్రాంతి మాత్రమే. “నీడ యొక్క కదలిక” అను దృశ్యంలో 'నీడ' ఒక పదార్థమేమీ కాదు కదా! "ఛాయ యొక్క నృత్యం" అని నాచే గాంచబడినదంతా అవస్తువేనని గ్రహించు. మరి?... పరమార్థమున చిదాకాశమే ఆ ఛాయాదేవి దేహంగానూ, ఇక్కడ మనకు ఎదురుగా దృశ్య ప్రపంచంగానూ అనుభూతమగు చున్నాయని గ్రహించు.
శ్రీరాముడు : హే మహాత్మా ! చిదాకాశమే అయి ఉన్న ఈ జగత్తులో వేఱు వేఱు పదార్థాలు మాకు కనిపించటం ఎందుకు జరుగుతోంది? స్థావర జంగమ భూతజాలమంతా పరస్పరం ప్రతిస్పందనలు కలిగి ఉంటూ ఉండగా “ఈ జగత్తు లేదు” అను వాక్యం ఎట్లా యుక్తియుక్తం?
Page:104
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నమంతా భ్రమ కల్పితమే అయినప్పటికీ, స్వప్నములోని కల్పిత స్థావర జంగమ దృశ్యం యొక్క అంతర్గతంగా పరస్పర స్పందన అనుస్పందన - ప్రతిస్పందనలు కూడా కలుగుచున్నాయి కదా! ఊహలోని యుద్ధ సన్నివేశంలో శత్రుసైనికులు మొదలైనవి అనుభూతమౌ చున్నాయి కదా! కథను వింటూ అందులోని పాత్రల పరస్పర స్పందన-ప్రతిస్పందనలు నిజమైనవై నట్లు పాఠకుడు అనుభూతి పొందుచున్నాడు కదా! మనోకల్పిత రాజ్యంలో భవనాలు, ఆ భవనాల యొక్క రంగులు కనిపిస్తున్నాయి కదా! ఈ సృష్టి ప్రళయాలు కూడా అట్టివే! ఇందాక నేను వర్ణించిన... నాకు అనుభూతమైన "భైరవ భైరవీ నృత్యవిలాసము” అట్టిదేనని తెలిసియే, ఇంతదాకా నేను దర్శించియుండి... నీకు వర్ణించి చెప్పాను.
భ్రాంతిచే ‘చిత్ ఘనం’నందు అచిత్తు భాసిస్తోంది. నిరాకారమగు జలమునందు సాకారమగు తరంగము, నిరాకారమగు బంగారమునందు సాకారమగు ఆభరణము భాసించుచున్నట్లుగానే, నిర్విషయాత్మ యందు సవిషయమగు జగత్తు - జగద్విషయాలు భాసిస్తున్నాయి. జ్ఞానము కలిగిన మరుక్షణం "నిర్మల చిదాకాశమే స్వయముగా తనయందు ఈ జగద్రూపమున భాసించుచున్నది” అని ఎఱుగబడగలదు.
ఆత్మ ప్రతిజీవుని యందు నామ రూప గుణాత్మకంగా ఎట్లా ప్రకాశిస్తోందో, అట్లాగే అయ్యది వస్త్రమునందు, కల్పాంత వాయువులలో, ప్రళయానంతర రుద్ర నృత్యంలో కూడా ప్రకాశిస్తోంది.
ప్రియ రామా! ఈ విధంగా భైరవీదేవి విపుల నిరాకారమగు ఆకారాన్ని నేను వర్ణించి చెప్పాను. ఇప్పుడు ఆ నృత్యం యొక్క మిథ్యాత్వం ఏమిటో, ఎందుచేతనో మరొక్కసారి చెప్పుచున్నాను... విను.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఒకాయన “ముత్యపు చిప్పలో వెండి ఉన్నది” అని నిర్ణయించు కొన్నవాడై ఆ వెండిని సొమ్ము చేసుకోవాలని మూటకట్టుకొని ముత్యపుచిప్పలను ఇంటికి చేర్చుకొని సంతోషించాడట! వెండి గురించి తెలిసినవాడు ముత్యపు చిప్పలో వెండి ఉండగలదని భ్రమించడు కదా! అట్లాగే జ్ఞానికి ఈ జగత్తు నిర్విషయంగాను, నిరాకారంగాను విదితమౌతోంది.
లోహానికి ఒక ఆకారమంటూ ఏదీ లేకపోయినప్పటికీ, ఏదో ఒక ఆకారం లేకుండా ఎప్పుడూ ఉండదు కదా! అట్లాగే చిన్మాత్రమగు పరమాత్మ యొక్క చేతనం ఒకింత స్పందనం లేకుండా ఉండ జాలదు. బంగారమే ఆభరణంగా పరివర్తితమగుచున్నట్లు... చైతన్యమే నిజభావనా చమత్కారంచే రుద్ర రూపమున స్థితినొంది ఉన్నది. జలం ఉన్నచోట ద్రవత్వం కూడా ఉంటుంది కదా ! అట్లాగే చైతన్యం ఎక్కడ ఉంటే అక్కడ అయ్యది 'స్పందం' అనే ధర్మం అవశ్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే స్పందనం అనేది చైతన్యం యొక్క స్వభావమే అయి ఉన్నది. జలం యొక్క కదలికలే తరంగాల రూపంగా అగుపిస్తున్నట్లు... “చిదనం-శివరూపం” అగు పరమాత్మ యొక్క స్పందనగా ఏదైతే ఉన్నదో ...
Page:105
అదియే మనకు స్వవాసనచే జగత్తుగాను, నృత్యం(తాండవం) ఒనర్చుచున్న "భైరవ పరమేశ్వరుడు - ఛాయాదేవి”...మొదలైనవిగానూ కనిపిస్తున్నాయి సుమా! కాబట్టి రామచంద్రా! భయంకరమైన ఆకృతిని దాల్చి స్వేచ్ఛగా నృత్యం చేస్తున్నట్టి శివరూపుడగు రుద్రుడు చిదనం యొక్క నిజస్పందనమేనని గ్రహించు.
శ్రీరాముడు : స్వామీ ! ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తాను. “ప్రామాణిక దృష్టి” చే చూస్తే ... ఈ దృశ్యం కించిత్ కూడా వస్తుతః లేనే లేదు. ఇక, “అప్రామాణిక దృష్టి"చే ఏ దృశ్యం అయితే కనిపిస్తోందో... అదంతా కూడా కల్పాంతమున నశించి పోవటం జరుగుతోంది.
ఇది ఇట్లా ఉండగా 'కల్పాంతము' నందు చైతన్యము విషయరహితమై మహా శూన్యత్వం వహించు చున్నప్పుడు అట్టి చైతన్యమున ద్రష్ట (చూచువాడు) ఉండడుకదా ! అట్టి చిదాకాశము దృశ్యమాన మవటమెట్లా? పైగా, చిదనమునకు అన్యమైనదేదీ లేనప్పుడు అద్దాని ఉనికి ఎవరికి అనుభవమౌతుంది? చిదనము తనకంటే వేరైన 'క్రియ' అనునదే లేనప్పుడు అద్దానిని ప్రకాశింపజేసేది ఏముంటుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! "ప్రళయసమయమునందు 'విషయము' అనేదేదీ ఉండదు కనుక చిన్మాత్రము (లేక చిదాకాశము) అనునది 'ఉన్నది' అనటానికి సాక్షి ఎవరంటారు?”.... అని కదా, నీ సందేహం? అప్పుడు “అది ద్వైతమా? ఏకత్వమా? ద్వైతమైతే చిన్మాత్రమునకు అద్దానిని దర్శించే ద్రష్ట వేఱుగా ఉంటున్నాడు కాబట్టి చిన్మాత్రాకాశము నిర్విషయం కాదు. ఒకవేళ ఏకత్వమే అయి ఉంటే ఆ ఏకత్వానికి ‘ద్రష్ట' లేడు కాబట్టి అద్దాని యొక్క ఉనికి దర్శించటానికి ద్రష్ట లేడు. కాబట్టి “ద్రష్ట లేనప్పుడు నిర్విషయ చిన్మాత్రము ఉన్నట్లుగా ఎలా ఎవరు చెప్పగలరు?” అను నీ సందేహం మొదలంట తొలగవలసియున్నది. అందుచేత నీ ప్రశ్నకు నా ప్రత్యుత్తరం విను.
ఓ రామచంద్రా! ఈ జగత్తునందు -
1.) చైత్యము అంటే తెలియబడేది (విషయాలు) (చేత్యం)
2.) చేత్యత అంటే తెలుసుకొంటున్నది
... అనే రెండూ పాల్గొనుచున్నాయి కదా!
ఈ చిత్-చేత్యాలు రెండూ ఉంటేనే 'జగత్తు' అనేదో, దృశ్యం అనేదో (లేక) సుఖదుఃఖాలు అనుభవించటం అనేదో జరుగుతోంది. అయితే...
న కించిచ్చేతతి తతః కించిత్ కించిత్ కదాచన ।
సర్వం శాస్త్రం దృషన్ మౌనం విజ్ఞానఘనమంబరమ్ ॥
యథార్థానికి ఏ సమయంలోనూ, ఏ చోటా కూడా పైన చెప్పిన చేత్యం (అనుభవించబడే విషయాలు) గాని... (లేక) చేత (అనుభవం పొందుచున్న 'జీవుడు' అనబడునది) గాని లేనే లేవు. మరి?... ఈ సమస్తం కూడా - అనగా ఈ అనుభవం పొందేవాడు - ఈ అనుభవాలుగా ఏర్పడు చుండే విషయాలు కూడా చిదాకాశమే అయి ఉన్నది. అట్టి చిదాకాశం సర్వదా శాంతము, శిల వలె మౌన రూపం, విజ్ఞాన ఘనంగానే ఉన్నది.
Page:106
అనగా... “అనుభవించువాడు- అనుభవించబడుచున్నది - అనుభవములు" అను మూడు ఏర్పడుచున్నప్పుడు, ఏర్పడనప్పుడు కూడా చిదాకాశం ఎట్టి మార్పు-చేర్పులు పొందటం లేదని గ్రహించు. ఓ చిదాకాశ స్వరూపులైనట్టి సర్వ జనులారా! ఈ దేహం - జగత్తు- ఈ అనుభవ పరంపరలు మొదలైనవి ఉన్న సమయంలోనూ, ఉండని సమయంలోనూ కూడా మీరు నేను ఈ రామచంద్రుడూ మనమంతా కూడా సర్వదా “అప్రమేయం-నిత్య బుద్ధం శాంతం-మహా మౌన స్వరూపం - విజ్ఞాన ఘనం” అగు చిదాకాశమే స్వస్వరూపంగా కలిగి ఉన్నామని గమనించెదరు గాక!
ఇక ఏ చేతితము [విషయములు (లేక) ప్రకాశింపబడుచున్నవి] కనిపిస్తూ ఉన్నదో... అదంతా కూడా స్వప్నమువలె చిత్స్వభావం తన యొక్క నిజసత్తయందు శాంతముగా ఉంటూనే అజ్ఞానాంగీకారముచే తనకుతానై జగద్రూపంగా స్ఫురించటం మాత్రమేనని గ్రహించండి. కనుక ‘జగత్తు’గా (లేక) దృశ్యంగా, లేక 'విషయం'గా పొందబడుచున్నదంతా కూడా ఆ పొందుచున్నవానితో సహా చిదాకాశమే గాని మరేదీ కాదు. అటు ద్రష్టగా, ఇటు దృశ్యంగా స్ఫురించుచున్నట్లు (అజ్ఞానంచే) అనిపించుచున్నప్పటికీ, వాస్తవానికి చిదాకాశము యథాతథంగానే ఉన్నది, ఉంటుంది.
శ్రీరాముడు : “ద్రష్ట-దృశ్యం ఒక్కటే. ద్రష్ట యొక్క చిదాకాశస్వరూపమే ఒకానొక స్వకీయ విభాగము నందు దృశ్యముగా కూడా అగుచున్నది”... అని మీరిప్పుడు చెప్పుచున్న సిద్ధాంతం సమన్వయిం చుకొని గ్రహించటానికి వీలుగా మరికొంత దృష్టాంతపూర్వకంగా మాకు బోధించ ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఒకడు నిదురిస్తూ స్వప్నం కంటున్నాడు. ఆ స్వప్నంలో ఆ ఆ స్వప్న ద్రష్టకు కనిపించే నగరాలు, భవనాలు వాస్తవానికి ఉన్నాయా? లేవు. మరి వాటి వాస్తవ స్వరూపమేమిటి? వాటన్నిటి యొక్క వాస్తవ స్వరూపం స్వప్న ద్రష్ట యొక్క స్వప్నచిత్స్వరూపం కాక మరింకేమి కాదు కదా! అవన్నీ (స్వప్నంలోని విశేషాలన్నీ) చిదాకాశమే "ఈ ద్రష్ట-దృశ్యము (లేక) అనుభవిఅనుభవములు అనునవి రెండూ చిదాకాశ స్వరూపమే అయి ఉన్నాయి” అనటానికి దృష్టాంతం “స్వప్నం సత్యం కాదు కదా!”... అంటావా?
అజ్ఞానికి ఈ జగత్తు ఎట్లు రసానుభూతమై అనుభవమౌతుందో, అది ఆత్మజ్ఞానికి సత్యము కాదు. స్వప్న సమయంలో స్వప్నము వాస్తవమైనదాని వలె స్వప్నద్రష్టకు అనుభవమగుచున్నట్లు... ఇక్కడ చిదాకాశమే అజ్ఞానదృష్టికి “జగత్తు” అనబడు విషయాల సముదాయంగా అనిపించుచున్నది.
శుద్ధ చైతన్యము తనయందు ఈ "జ్ఞేయము (లేక) దృశ్యము” అనబడు దానిని ఎల్లప్పుడూ ఎఱుగుచున్నప్పటికీ తనయందు తానే సర్వదా జ్ఞేయాతీతమై వెలయుచున్నది. ఒక వైపు సృష్టి మొదలుకొని ప్రళయము వరకు జగత్తును స్ఫురణగా ఎఱుగుచూనే మరొక వైపు అట్టి స్ఫురణకు ఆవల ఏకాకృతియై వెలుగుచున్నది. ఆ చైతన్యం తన యొక్క “స్వభావం” అనబడు చిత్ స్వభావాకాశంలో తనయొక్క కల్పనచే ఈ "క్షణ-కల్పన-భావన-జగత్తు" గురించిన భ్రాంతిని ధరించుచున్నది. ఆ తేజోమయ చైతన్యము తన యొక్క చిత్స్వభావాకాశమున ఈ జగత్ కల్పనలను గావించుచున్నది.
Page:107
కాబట్టి,
తస్మాత్ న ద్వైతమస్తి ఇహ, న చ ఐక్యం, న చ శూన్యతా ।
న చేతన - న అచేతనం వై మౌనమేవ న తచ్చ వా ॥
ఇక్కడ వాస్తవానికి ద్వైతమూ లేదు, ఏకత్వమూ లేదు, శూన్యత్వమూ లేదు-అట్లాగే చైతన్యచేతయిత (విషయాలు-విషయాలను పొందేది) మౌనం-అమౌనం మొదలైనవేవీ కూడా లేవు. ఎందుచేత నంటావా? చైతన్యం (దృశ్యం-విషయాలు-జగత్తు-తెలియబడునది) అనేది అధిష్ఠాన దృష్టిచే చిద్రూపం కంటే వేరు కానేకాదు కదా! వాస్తవానికి చైతన్యము ఏ సమయమందును దేనినీ ఎక్కడా చేతితం (ప్రకాశం) చేయటమే లేదు. కనుక చేతయిత (విషయాలను దర్శించేది/ పొందేదిఅనునది కూడా) (చిదాకాశం కంటే వేఱుగా) లేనేలేదు. చైత్యం చేత అనే రెండూ కూడా యథార్థానికి మిథ్య మాత్రమే! కనుక మౌనమాత్రమగు చైతన్యమే సర్వదా శేషించియున్నది.
ఓ రామచంద్రా! సమస్త వాఙ్మయ ప్రపంచంలోనూ, సమస్త సిద్దాంతాల అంతిమసారం కూడా “నిర్వికల్ప సమాధి” యే అత్యంతిక సిద్ధాంతమై ఉన్నది. అట్టి సమాధి యొక్క శాంత మౌన స్థితియే పరమావధి కనుక నీవు ఆత్మయందు మౌనముతో కూడిన స్థితిని కలిగి ఉండు. ఈ లోకదృష్టిచే ప్రస్తుతం యథా ప్రాప్తములైన రాజ్యపాలన పితృ-పితామహుల నుంచి ప్రాప్తించి క్రమమును అనుసరించి నిర్వర్తిస్తూనే “స్వదృష్టి" చే పరమార్థమౌనముతో కూడినవాడివై ఉండు. అన్నీ నిర్వర్తిస్తున్నప్పటికీ మోహములన్నిటినీ త్యజించినవాడవై, ఆకాశము వలె నిర్మలుడవై, విక్షేపములు లేనివాడవై ఆత్మయందే స్థితి కలిగి ఉండుము. జగత్తు - మౌనము - ఉభయము ఏక సమయంలో కలిగి ఉండటమనేది ఈ సభలో పాల్గొనే అనేకమంది ఆత్మజ్ఞానులకు దైనందిన విషయమే సుమా! వారంతా లోకదృష్టితో లోకమున వ్యవహరిస్తూనే ఆత్మదృష్టిచే ఘనీభూతమైన మౌనస్థితిని అంతరంగమున వహించియే ఉంటున్నారు.
శ్రీరాముడు : మహర్షీ! తమ ప్రవచనం అమోఘం, శిరోధార్యం కూడా! ఇప్పుడు మీరు చూస్తూ వస్తున్న విద్యాధరీ బ్రహ్మాండము యొక్క మహాప్రళయ సందర్భంలో చూచిన "ప్రళయ కాలరుద్రుడు-ఛాయా భగవతి" ల విలయతాండవం విశేషాలు మనం చెప్పుకుంటున్నాం కదా! ఆ కాళీదేవి “చాట-ఫలములు" మొదలైన వాటితో కూర్చబడిన మాలను ఎందుకు ధరించింది? ఏ కారణం చేత నృత్యం చేస్తోంది. ఈ విషయాలు ప్రవచించమని ప్రార్థన. ఆ కాళీదేవి ఎవరు? ఆ శివరూపుడగు రుద్రుడు ఎవరు? ఎందుకా నృత్యం? వారిరువురికి సంబంధ-భేదములు ఎట్టివి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ భైరవుడు చిదాకాశమగు శివస్వరూపుడే! ఇక ఆ కాళికాదేవి అతనికంటే వేఱుకాదు. ఆ దేవి ఆ నిర్మల చిదాకాశరూపము యొక్క స్పందన శక్తియే! అతని మనోమయరూపమే ఆ దేవి.
Page:108
దృష్టాంతానికి... వాయువు అద్దాని స్పందనము (కదలుచున్న వాయువు యొక్క కదలిక అగ్ని-అద్దాని ఉష్ణత్వము అనునవి మొదటిదానికి రెండవది అభేదము కదా! అయినా స్పందనము చేతనే వాయువు తెలియబడుతోంది. ఉష్ణత్వముచే అగ్ని తెలియబడుతోంది. అట్లాగే చిన్మాత్రరూపుడు పరమశాంతుడు అగు శివుడు స్పందన రూపమగు మాయాశక్తి చేతనే ఎఱుగబడగలడు గాని, అన్యథా కాదు. అట్టి ఆ శివుడు బ్రహ్మం కంటే వేఱు కాదు. ఎందుకంటే శ్రుతులు, వేదాలు, బ్రహ్మ వేత్తలు ‘ఆ శివుడే బ్రహ్మం' అని సిద్ధాంతీకరిస్తున్నాయి. నిరాకారమగు "ఇచ్చ” చే సాకారమగు చిత్ర లేఖనం, శిల్పం నిర్మించబడుచున్నాయి కదా! అట్లాగే శివుని యొక్క నిరాకారమగు స్పందన శక్తియగు ఇచ్ఛారూపిణి కాళీదేవి ఈ దృశ్యమునంతా విస్తరింపజేస్తోంది.
శివుడు - శివేచ్ఛ - క్రియ :
ఈశ్వరేచ్ఛ : నిరాకారమైనట్టి శివుని యొక్క ఇచ్ఛయే ఈ జగత్తును నిర్మించుచున్నది.
ఆరాధనారూపం : అట్టి ఇచ్ఛాశక్తి యొక్క అరాధనా రూపమే కాళీదేవి.
ఆ ఇచ్ఛా-క్రియా రూపిణియే సర్వజీవుల యొక్క జీవన హేతువు అయి ఉండటం చేత “జీవ చైతన్యము” అనికూడా పిలువబడుతోంది. ఈ కనబడేదంతా శివేచ్ఛయే!
ఆ శివేచ్ఛయే ఇంకా... స్వయంగా జగద్రూపంగా పరిణమించి ఉండటం చేత ప్రకృతి రూపంగా ప్రదర్శితమౌతోంది. 'దృశ్యాభాస' యందు అనుభూతమగుచు 'ఉత్పత్తి-స్థితి-వినాశనము’ మొదలైన వికారములను ప్రదర్శించుచుండుటచే 'క్రియా స్వరూపిణి' అనిపించుకుంటోంది.
ఇంకా కూడా చెప్పాలంటే ఆ “శివేచ్ఛా స్వరూపిణి” యగు కాళీ భగవతియే... బడబాగ్ని స్వరూపంతో అంతయూ దహించి వేయుచుండటం చేత 'శుష్క' అని దుష్ట శిక్షణా వ్యాసంగం కలిగి ఉండటం చేత 'చండిక’ అని, నీలకమల వర్ణముచే ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ‘సోత్ఫల’ అని, ప్రార్థించు భక్తజనులకు జయమును ప్రసాదించటంలో 'తత్పరత' కలిగి ఉండటం చేత 'జయ' అని, ‘జయంతి’ అని 'విజయ' అని, మహా పరాక్రమశీలి, అయి ఉండటం చేత 'అపరాజిత' అని, గ్రహించుటకు కష్టసాధ్యమై ఉండటం చేత 'దుర్గ' అని, ఓంకారము యొక్క సారభూతమైన తత్త్వమై ఉండటం చేత... అనగా ‘ఉమ’ (అ + ఉ + మ; అ = శుద్ధ చైతన్య స్వరూపమగు శివుడు; ఉమ = ఇచ్ఛ - ప్రేరణా స్వరూపమగు శక్తి) అని, గానం చేసేవారికి (జపించే వారికి) పరమ పురుషార్థం ప్రసాదిస్తుంది. కాబట్టి ‘గాయత్రి’ అని, సంతతి యొక్క స్థితికి తానే కారణం కాబట్టి ‘సావిత్రి’ అని కర్మ-ఉపాసన-జ్ఞానము మొదలైన ఉత్తమ దృష్టులను, ప్రేరణను ఆరాధకులకు అందించుతుంది. కాబట్టి 'సరస్వతి’ అని, గౌరవర్ణపు దేహంతో ధ్యానించే వారికి అభయప్రదాతగా స్ఫురిస్తుంది. కాబట్టి 'గౌరి' అని, జగదుత్పత్తికి కారణభూతుడగు భవుని అర్ధాంగి కాబట్టి (మహేశ్వరుని దేహమును అర్ధభాగం ఆశ్రయించి-ఆక్రమించుకొని ఉంటుంది కనుక) 'భవాని' అని...
Page:109
ఈ త్రిలోకములోని సర్వప్రాణులు నిద్రిస్తున్నప్పుడూ మేల్కొని ఉన్నప్పుడు కూడా వారిలో ప్రతి ఒక్కరి హృదయంలోనూ అకార ఉకార మకారములకు అతీతమైన ప్రణవనాద భాగమగు శబ్ద బ్రహ్మ స్వరూపముతో 'ఉ...మ్...' అను ఉచ్చారణ స్వరూపిణి అయి ఉంటోంది. అందుచేత “ఇందు కళారూపిణి” అని 'ఉమ' అని పురాణాదులచే, మంత్రద్రష్టలచే, యోగపరాకాష్ఠపరులచే పరికీర్తించబడుతోంది.
ఓం కాళీభ్యాం నమః
ఓం జయంతిభ్యాం నమః
ఓం ఛాయారూపిణీభ్యాం నమః
ఓం విజయాయ నమః
ఓం ఇచ్ఛాస్వరూపిణీభ్యాం నమః
ఓం అపరాజితాయ నమః
ఓం స్పందస్వరూపిణీభ్యాం నమః
ఓం దుర్గాయ నమః
ఓం మాయాశక్తిభ్యాం నమః
ఓం ఓంకారసార ఉమాయ నమః
ఓం దృశ్య విస్తారకారిణీభ్యాం నమః
ఓం గాయత్రీభ్యాం నమః
ఓం జీవచైతన్యభ్యాం నమః
ఓం సావిత్రీభ్యాం నమః
ఓం ప్రకృతిమాతాభ్యాం నమః
ఓం సరస్వతీభ్యాం నమః
ఓం భగవతిభ్యాం నమః
ఓం గౌరియే నమః
ఓం శుష్కాయ నమః
ఓం అకార-ఉకార-మకారాతీతాయ నమః
ఓం చండికాయ నమః
ఓం ఇందుకళారూపిణీభ్యాం నమః
ఓం జయాయ నమః
ఓ రామచంద్రా! శివుడు ఇచ్ఛాదేవి ఈ ఇరువురు ఆకాశరూపులే అగుటచే వారిద్దరు శ్యామ వర్ణ (నీలివర్ణం) శరీరులుగా ఆరాధించబడుచున్నారు. వాస్తవానికి ఇరువురు చిదాకాశరూపులే అయినప్పటికీ-అనగా, ఎట్టి వర్ణం ఆపాదించటం కుదరనిది అయినప్పటికీ వారి శరీరాలు (ఉపాసకుల) సృష్టి సంకల్ప దృష్టిచే మాంసమయ శరీరాలు శ్యామవర్ణంగా స్ఫురిస్తున్నాయి. చిదాకాశ స్వరూపులగు వారిరువురు చిదాకాశమునందే సర్వదా స్థితి కలిగి ఉన్నారయ్యా!
వారిరువురు ఆది స్వరూపులు కదా! అతి స్వచ్ఛస్వరూపులగు వారిరువురిని ఆకాశరూపులుగా గ్రహించు. హస్త-పాద-ముఖ-శిరస్సు మొదలైనవాటిని కలిగియుండి బహుత్వ-అల్పత్య భేదాలతో “నానాత్వం” ధరిస్తూ ఉన్నప్పటికీ వారిరివురు సర్వదా ఏకరూపులేనని మా అనుభూతపూర్వకమైన అనుభవం.
“ఆ దేవి శూర్ప (చాట)-ఫలములు మొదలైన వాటితో కూడిన మాల ఎందుకు ధరించింది?” అంటావా?
ఆ భగవతి ఒకవైపు ‘అనాది, అనంతం' అయినట్టి చిచ్ఛక్తి స్వరూపిణి. అట్టి భగవతీదేవి ‘స్వ-ఇచ్ఛ' చేత స్వయంగా సర్వవైదిక క్రియారూపిణి అయింది. అట్లే దాన-స్నాన-యాగాది శ్రేష్ఠ శరీరరూపిణి కూడా అయింది.
Page:110
ఆ దేవి యొక్క నానా ప్రకారాలైన అభినయాలతో కూడిన నర్తనములే ఈ సృష్టులు, ఈ జరామరణాది బ్రహ్మ కల్పితములగు క్రియా ప్రదర్శనములు కూడా! ఆమె వాస్తవానికి రూపరహితయే! అయితే రూపరహితకు క్రియలు అప్రసిద్ధము కదా! అందుచేత ఆమె కల్పితాలగు క్రియా ప్రదర్శనాలు కూడా! కల్పిత అవయవి! ఆయా వస్తు గ్రామ-నగర-ద్వీపమండల సమూహాలను తన శరీరంగా ధరించినదై క్రియా రూపత్వం ప్రకటించుచున్నది.
కాళీ భగవతి : కల = 'ధారణ' మొదలైన సర్వక్రియా వాచక ధాతువు. కల శబ్దం నుండి ‘కాళీ’ అనే శబ్దం ఉత్పన్నమైనది. ఆ కాళీభగవతి బ్రహ్మాండ రూపం గల బీజకోశాలను తన యందు ధరిస్తూ వాటి యొక్క ఉత్పత్తి-పాలన మొదలైన క్రియలన్నిటికీ కారణమగుచూ... స్వయంగా ఆ మొదలైన క్రియలన్నిటినీ నడుపుతోంది. స్వయంగా క్రియారూపిణి అయి ఈ దృశ్య శోభనంతో తన యందు ధరిస్తోంది. 'అనేక కోటి బ్రహ్మాండ జననీ-దివ్యవిగ్రహా' అని స్తుతించబడుతోంది. అయితే, ఈ జగత్తులన్నీ తన అవయవాలుగా కలిగి ఉన్నప్పటికీ పరమార్ధమున 'శివేచ్ఛా- క్రియా స్వరూపిణి - చిద్రూపిణి' యగు ఆ దేవి ఎచ్చట కూడా ఏ సమయమందునూ అవయవ సహిత అయి ఉండనే లేదు.
శివ - శివా : ఓ రామచంద్రా! శివేచ్ఛా-క్రియా స్వరూపిణి యగు ఆ భగవతి శివునికంటే వేఱుగా లేదు సుమా! కనుక ఆ దేవిని శివరూపిణిగానే గ్రహించు. అంతేకాదు. ఆకాశమునకు శూన్యత్వము, వాయువునకు స్పందత్వము, చంద్రునికి ప్రకాశత్వము వాటి వాటి అంగములే కదా! అట్లాగే ఈ క్రియారూపమగు దృశ్యము కూడా ఆ భగవతీదేవికి అంగము వంటిదిగా దర్శించటం సర్వదా అభ్యసించు. అట్లు దర్శిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ దేవి యొక్క స్వరూపం వాస్తవానికి శివము-శాంతము-స్వభావ సిద్ధము-అవ్యయము-నిర్మలము అగు చైతన్యమేనని ఎఱిగి ఉండు.
నిష్క్రయాస్వరూపిణి : సృందాస్పందాతీత - ఆ చైతన్యమునకు కించిత్ కూడా స్పంద ధర్మంగాని, అస్పంద ధర్మంగాని లేదు. అజ్ఞానవశం చేత స్పంద-అస్పంద రహితమగు చైతన్యం క్రియారూపంగా కనిపిస్తోంది. ఎప్పుడు జ్ఞానవంశం చేత తన క్రియా స్వభావం నుండి తొలగి వాస్తవ స్వభావంతోటి వర్తిల్లునో, అప్పుడు ఆ దేవియే శివస్వరూపంగా వచించబడుతోంది.
క్రియాస్వరూపిణి - కూటస్థ చైతన్యశక్తి స్వరూపిణియగు ఆ దేవి తనలో తన యొక్క స్పందజడ భావములతో కూడి ఉంటోంది. అట్లు కూడి ఉండుటచే 'క్రియ' అను శబ్దంచే చెప్పబడుతోంది. తన స్వాభావికమైన చిన్మాత్ర స్వభావంతోటి ఉంటున్నప్పుడు ఆమెయే 'శివ స్వరూపం' అగుచున్నది.
ఇదం జగత్ దృశ్య స్వరూపిణి - ఆ భగవతీదేవి క్రియా రూపిణి, చిత్-శక్తి సమన్విత. మహత్తర మైన ఆకారం కలది. ఈ అనేక జన సమూహయుక్తములై, ప్రకాశితములై కనిపించే సృష్టులు, ఈ లోకాలు-ఇవన్నీ కూడా ఆ దేవికి అభిన్నములైన అవయవాలు. ఈ దేశ దేశాంతరాలతో కూడిన భూమి, వనభూములు, పర్వతములు, సాంగ-ఉపాంగములతో కూడిన మూడు వేదాలు, విద్యాస్థాన యుక్తములైన సర్వగీతములు, విధి-నిషేధములతో కూడిన శుభాశుభ కల్పనలు, సర్వయజ్ఞములు, భక్ష్యములైన పురోడాశములు, సర్వ యజ్ఞపాత్రలు, సమస్త యజ్ఞభస్మములు, సమస్త ప్రాణికోట్లు, సప్తద్వీపములు, 14 లోకములు- ఇవన్నీ కూడా 'కల్పితాకారధారిణి' యగు దేవి యొక్క విభిన్నములైన అభిన్నావయవములు అయి ఉన్నాయి. అట్లే మాకు అనుభూతమగుచున్నాయి.
Page:111
శ్రీరాముడు : స్వామీ! మీరు ఆ భగవతి గురించి చెప్పేటప్పుడు - - ఆ దేవి శివస్వరూపిణియేనని, ఈ బ్రహ్మాండములన్నీ ఆమె దేహమేనని, జగత్ భావనావశం చేత బ్రహ్మాండములను భావనామాత్రంగా ధరిస్తోందని, ఈ జగత్ దృశ్యమునకు అభిన్నమని, జగత్ దృష్టి తొలగుటచే ఆమె శివస్వరూపిణియేకాని, శివునికి-భగవతికి భేదమే లేదని, శివుని నుండి బయల్వెడలిన ఇచ్ఛాస్వరూపమే ఆమె అని, ఇచ్ఛా క్రియల సంయోగమే ఆమె అని...
ఇట్లు పరస్పర భేద-అభేదముల కలయికతో ప్రవచిస్తున్నారు. ప్రభూ! ఇది ఇట్లా ఉండగా, ఇంతకుముందు మీరు రుద్ర-కాళీ రూపధారిణి యగు చైతన్యము యొక్క శరీరంలో కనబడిన భూత-భవిష్యత్ కాల సృష్టి-ప్రళయముల గూర్చి వర్ణించి చెప్పారు. ఇప్పుడు నా ప్రశ్నను విన్నవించుకుంటాను. ఆత్మయందు (శివుని యందు) సృష్టి-ప్రళయములు ఉన్నాయా? లేవా? అవన్నీ వాస్తవములా? అవాస్తవములా? చెప్పవలసినదిగా ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ చితశక్తి ప్రేరణస్వరూపిణియై ఈ సర్వజీవుల యందు ప్రకాశిస్తోంది. ఆ చిత్శక్తియే ఈ జీవుల కర్మవాసనానుసారం దేనిని గూర్చి ఎట్లు ప్రేరణ చేయు చున్నదో... అది అట్లు సత్యంగానో, (లేక) అసత్యంగానో పొందబడుచున్నది. అద్దంలో ప్రతిబింబంఆ ప్రతిబింబ వస్తువుల కదలికలు వాస్తవం కాకపోయినా వాస్తవంగానే కనిపిస్తాయి కదా! పూర్వ వాసనలు కారణంగా చైతన్యం విషయములందు దృశ్యములందు సత్యరూపంగానే ప్రతిబింబించి, సత్యముగానే అనుభవ ప్రాప్తి పొందుచున్నది.
వాసనాయుతులైన జీవుల అనుభవ బలం చేత ఈ జగదనుభవాలు సత్యంగానే పొందబడు చున్నవి. యథార్థానికి జీవులంతా చిద్రూపులే కదా! చిద్రూపంలో అచిద్రూపం ప్రవేశించదు కదా!
కనుక ఈ సర్వ దృశ్య పదార్థములన్నీ కూడా సంకల్పనగరం వలె మిథ్యయే అయి ఉండి, వాసనా ప్రభావం చేత సత్యం వలె అనుభవించబడుచున్నాయి. అట్టి వాసనలు దృఢమైన నిర్మల చిత్రాధాన్యం చేత మాత్రమే క్షయిస్తాయి. వాసనలు జయించిన మనుజునికి 'దృశ్యం’ అనబడు ప్రసక్తియే ఉండదు. దృశ్యముగా కనిపించేదంతా అతనికి పరమాత్మ స్వరూపంగానే సుస్పష్టబడు చున్నది. స్వప్నంలో కనిపించేదంతా స్వప్న ద్రష్ట యొక్క భావనా ఊహాతరంగ పరంపరలే! కనుక స్వప్న ద్రష్టకు వేరైన సత్తా స్వప్నమునకు లేదు. అట్లాగే ఈ జాగ్రత్ దృశ్యం జాగ్రత్ ద్రష్ట యొక్క వాసనా సమూహం (లేక) వాసనా తరంగాల సాఫల్యం అయి ఉన్నది.
పరాభవం (పరా+అభవం) అంటే ఈ దృశ్యాన్ని తదితర జీవులను పరమాత్మ ప్రదర్శంగా దర్శించకపోవటం, పరమాత్మకు భిన్నమై ఉన్నట్లు దర్శించటం.
ఎందుకంటే... 'దృశ్యం' ఒక్కటే అయినప్పటికీ వేఱువేఱు ఆకారదర్పణాలలో (కుంభాకార, పుటాకార, రంగులతో కూడిన, ఎత్తుపల్లాలతో కూడిన, గీతలతో కూడిన వివిధ రకాలైన దర్పణాలలో వివిధ రీతులుగా కనిపించుచున్నది కదా!
Page:112
అట్లాగే పరమాత్మకు వాస్తవానికి అభేదమే అయిన ఈ దృశ్యము ప్రతిజీవుడు తన యొక్క వాసనాదర్పణమునందు ప్రతిబింబించు భావన - అనుభవాదుల ద్వారా, తదనుగుణంగా సమకూర్చి పొందుచున్నాడు.
స్వప్నాంతర్గతమైన విశేషాలు స్వప్న సమయంలో స్వప్న ద్రష్టకు వాస్తవమనియే అనిపిస్తు న్నాయి. ఊహానగరం, ఊహ కొనసాగుచుండగా, అదంతా సత్యముగానే అనుభవమౌతోంది. ఎందుచేత? అవి ఆయా సమయాలలో ప్రతీతి (నమ్మిక)తో కూడిన భావనచే పొందబడటంచేత! అట్లాగే ఈ సృష్టి కూడా ఇద్దానిని గాంచుచున్న కాలంలో అర్ధ-క్రియా సామర్థ్యాలను కలిగి ఉండటం చేత, అట్టి ‘దృష్టి’ కొనసాగుచున్న సమయంలో అర్ధ క్రియాపూర్వకంగా సత్యమనియే అనిపిస్తోంది.
శ్రీరాముడు : మహాత్మా! ఈ ప్రపంచంలో ఆయా పదార్థములు మొదలైనవన్నీ కొందరికి ఉచ్ఛమైన విగా, అవే పదార్థములు మొదలైనవి మరికొందరికి నీచము-అల్పము అయినవిగాను అనిపిస్తూ ఉంటోంది కదా! ఇట్లా ఎందుకు జరుగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపం వాస్తవానికి అనన్యమగు ఆత్మయే అయి ఉన్నది. అయినా కూడా ఒకే మట్టి అనేక నామ రూపాలు గల బొమ్మలుగా ప్రతితీ పొందుచున్నది కదా! అయితే అన్ని బొమ్మల వాస్తవ స్వరూపం మట్టియే కదా? మట్టిచే తయారు కాబడిన కోతి ఆకారానికి మట్టికి సంబంధమేముంటుంది? అయినా కోతి రూపంగా కనించేదంతా మట్టియే కదా!
ఈ విధంగా ద్రష్టలందరూ దేహ-మనో-బుద్ధ్యాదుల దృష్ట్యా వేర్వేరుగా కనిపించవచ్చుగాక! అయినప్ప టికీ ద్రష్టలందరూ ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నారు. అట్టి ఆత్మ సర్వదా యథాతథం, త్రికాలములచే అబాధ్యం అను నిస్సందేహమగు పరిజ్ఞానమే 'ఆత్మయోగం' అని, 'మోక్షం' అని ‘సమాధి’ అని ఆయా మొదలైన పేర్లతో పిలువబడుతోందని గ్రహించు. ఇక మనో బుద్ధ్యహాంకారా లను మనం అంగీకరించినప్పటి దృష్టికి 'వేర్వేరు ద్రష్టలు' అనునది అనుభవసిద్ధమగుచున్నది. ఇక ఏ పదార్థం ఏ ద్రష్టకు ఏ ఏ అర్ధ-క్రియా సమర్థమై ఉంటోందో, అతని దృష్టికి ఆ పదార్థాదులు ఆయా విధంగానే సత్యభూతాలై అనుభవమగుచున్నాయి. ఆ ఆ పదార్థాలు అట్టి ద్రష్టస్థితిని పొందనట్టి అన్యునికి ఆయా పదార్థముల పట్ల అట్టి దృష్టి ఏర్పడటమే లేదు.
భూత-భవ్య-భవిష్యస్థాః సంకల్ప స్వప్న పూర్గణాః ।
సర్వేసత్యా పరం తత్త్వం! సర్వాత్మా కథమ్ అన్యథా? ॥
ఓ రామచంద్రా! ఈ భూత వర్తమాన భవిష్యత్తులలోని పదార్థ సమూహాలు, స్వప్నములోనిసంకల్ప రాజ్యంలోని నగరాలు మొదలైనవి-ఇవన్నీ కూడా ఆయా దశలందు సత్యమే అయి ఉన్నాయి. ఎందు కంటావా? అట్లా కాకపోతే “ఆత్మతత్త్వమే సర్వరూపం”“ఇదంతా ఆత్మయే” అనే వేదవాక్యం పొసగదు కదా!
ఈ ఈ జాగ్రత్లోని ఆయా నగరాలన్నీ సత్యము కాబట్టే మనం ఇక్కడి నుండి బయలుదేరి ఆయా నగరం ప్రవేశించి ఆ నగరంలో ఆయా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం.
Page:113
అట్లాగే స్వప్నములోని వ్యవహారం సత్యము కాబట్టే యోగులు ఇతరుల స్వప్నములో ప్రవేశించి ‘బోధించటం-సూచించటం' మొదలైనవి నిర్వర్తిస్తున్నారు. అట్లాగే యోగశక్తిచే యోగులు తమ ప్రియతమ శిష్యుల మనో ఆకాశంలో ప్రవేశించి వారికి అనుభవ విషయంగా దర్శనమిచ్చి (మనం ఇతర ప్రదేశములలోని పర్వత గ్రామాలు పొందుచున్నట్లుగా ఆయా క్రియా-వ్యవహారాలు (ఆ తదితరుల మనస్సులో) నిర్వర్తిస్తున్నారు.
శ్రీరాముడు : స్వామీ! కాళీమాత నృత్యం చేస్తున్నప్పుడు ఆ జనని దేహములోని జగత్తులు ఒకదానితో మరొకటి ఢీకొనక కదలకయే ఉంటున్నాయా? ఇది ఎట్లు? ఆమె కదలికలతోబాటే ఆ జగత్తులు కూడా క్రింద మీద పడాలి కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆమె విలయతాండవం చేస్తున్నప్పటికీ ఆమె దేహములోని జగత్తులందలి ఆయా పర్వత-నదీ-నగరాదులు ప్రకంపనము పొందకయే నాకు కనిపించాయి. ఎట్లా అంటావా? ఇప్పుడు చూడు! ఒకడు ఒక మంచంపై నిదురిస్తూ కల కంటున్నాడనుకో! అతని మంచమును మనం అక్కడి నుండి మరొకచోటికి తరలిస్తున్నప్పటికీ అతని స్వప్నములోని నగరాదులు చలింపకయే ఉంటాయి కదా! ఆ నృత్యం సమయంలో కాళీ భగవతి యొక్క దేహము చలించుచున్నప్పటికీ ఆమె యొక్క శరీరములోని జగత్ అంతర్గత నగర పర్వతాదులు చలించటమే లేదు.
ఓ రామచంద్రా! ఈ త్రిలోకముల మహారంభసంరంభమంతా ఆయా దశలందున్న మనుజులకు సత్యముగా తోచినప్పటికీ, వాస్తవానికి “భ్రాంతి మాత్రమే” అయి ఉన్నది. భ్రాంతి అయిన దానికి కదలటం ఏమున్నది? కదలకపోవటమేమున్నది? స్వప్నంలో కనిపించే మిత్రులు, గృహములు, సంపదలు సత్యముగా ఉన్నదెప్పుడు? (మెళుకువ వచ్చేసరికి అవి ఉండవు కనుక) మిథ్య కానిదెప్పుడు? ఉన్నదెపుడు? (స్వప్న సమయంలో వాస్తవంగానే అనుభూతమౌతోంది కనుక) నశించినదెపుడు? స్థితినొంది ఉన్నదెపుడు? చెప్పు? అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే ఏం చెపుతాం? అందుచేత బిడ్డా! ఈ ఎదుటగా కనిపిస్తున్న దృశ్యశోభ అంతా భ్రాంతి మాత్రమే! ఈ జగత్ శోభనంతా భ్రాంతి మాత్రంగాను, అవాస్తవంగాను ఎఱిగియే ఉండెదవుగాక!
“మరి మాకు వాస్తవంగానే కనబడుతోంది కదా?" - అని ఎవరైనా అంటారేమో? “సంకల్పము (లేక) ఊహ” తో కూడి ఉన్న దృష్టికి జగత్తు అనుభవమౌతోంది. “స్వప్నము” నందు, కథను చదువుచున్నప్పుడు, (లేక) వింటున్నప్పుడు, 'నాటకం' చూస్తున్నప్పుడు 'భ్రమ' యందు - ఆయా అనుభవములను నమ్మికతో అనుభూతిపరంగా పొందటం ఎటువంటితో, ఈ జగత్తు యొక్క “వాస్తవం” అనిపించే అనుభవం అటువంటిదే! నాటకం చూచి శోకించేవారునవ్వేవారు–కోపించేవారు జాలిపొందేవారు ఆశ్చర్యపడేవారు మౌనంగా చూచేవారు ఉంటున్నట్లే జనులు ఈ జగత్తును చూస్తూ నవరసాల అనుభవములను పొందుచున్నారు.
Page:114
ఓ రామచంద్రా! వాస్తవానికి చైతన్యము-జగత్తు ఇత్యాది వ్యవస్థ లేనేలేదు. ఆకాశంలో కంటిదోషం చేత వెంట్రుకలు కనిపించునట్లు, మెల్లకన్నువాడికి ఒకే స్తంభం రెండుగా అగుపించు నట్లు ఈ ‘జగదనుభవం’ అనబడేది జగత్తు దృష్ట్యా భ్రాంతియే అయి ఉన్నది. కానీ చిత్స్వరూపము ఎట్టిదో ఎఱిగినప్పుడు అట్టి భ్రాంతి తొలగిపోతుంది. అప్పుడు 'ఈ జగత్తంతా, ఇందులోని నగరాలు-దేహాలు-సందర్భములు-సంఘటనలు మొదలైన వాటితో సహా సర్వదా యథాతథమై ఉన్న చిదాకాశమే’ అని నిర్ద్వంద్వంగా నిస్సందేహంగా ఎఱుగబడగలదు. ఆ చిదాకాశమే నీ-నామన-వారి-అక్కడి-ఇక్కడి ఏకాంత-నిర్విషయ సర్వస్వరూపంగా ఆస్వాదించబడుతుంది. ఇప్పుడు మనం ఆ భగవతీదేవి-రుద్రభగవానుల నృత్య విశేషానికి వద్దాం.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ ప్రకారంగా ఆ దేవి తన యొక్క సుదీర్ఘమైన భుజమండలంచే ఆకాశ విభాగాన్ని భీకరారణ్యంగా చేసివేస్తూ నృత్యం చేస్తోంది. ఆ దేవి అజ్ఞాత-నిర్వికార చైతన్యశక్తితో కూడిన క్రియారూపిణి కదా! ఆ నృత్యం స్వభావ సిద్ధంగానే సల్పుచున్నది. కళా-క్షణ-ఘటికమాసాదులతో కూడిన కాలచక్రమంతా ఆ దేవి పమిట యొక్క విన్యాసంలా ఒప్పుచున్నది. హృదయమున ఊహా చైతన్యము, 'నగరములు' మొదలైన ఆకారములు ధరించుచున్నది కదా! ఆ భగవతి తన యందు అట్లే జగత్తులను, కాల విన్యాసమును చమత్కారంగా ఆభరణాలుగా అలంకరించుకొని అనేక నాట్య భంగిమలు ప్రదర్శిస్తోంది.
కల్పనయే జగద్రూపంగా అగుచున్నది. అట్లే, ఆ దేవియే 'జగద్రూపం' అయి ఉన్నది. వాయువునందు స్పందము (కదలిక అను స్వభావం) ఉన్నట్లే శివుని యందు ఆ భైరవీదేవి కలదు. స్పందం వాయువు కంటే వేఱ? కాదు. శివేచ్ఛ కూడా శివుని కంటే వేఱు కాదు. కనుక శివుని వలెనే శివేచ్ఛాస్వరూపిణియగు ఆ స్పందదేవి నిర్మలం-ప్రశాంతం అయి వర్తిస్తోంది. ఆకాశం వస్తుతః నిర్వికారం. అట్టి నిరాకారమగు ఆకాశమునందు 'శబ్దము-సంచలనము' మొదలైన అడంబరమంతా ప్రకటితమగుచున్నట్లు... నిరాకారమగు నిజేచ్ఛ జగత్తును విస్తరింపజేస్తోంది.
శివస్పర్శ - ఆ విధంగా ఆ దేవి చిదాకాశమున నృత్యం చేస్తూ ఉన్నది. ఇంతలో ఒకానొక చమత్కారం జరిగింది. ఆ దేవి కాకతాళీయ యోగముచే ... ప్రేమవశంగా సమీపమున ఉన్న శివుణ్ణి స్పృశించింది.
ఆ స్పర్శ మాత్రం చేత తన యొక్క "ఆవరణ శక్తిని దూరీకరించుకొన ప్రారంభించింది. సముద్ర తరంగాలు తమ తరంగ శక్తిలోంచి బడబాగ్నిని సృష్టించుకొని ఇక ఆ బడబాగ్నిలో ప్రవేశించి స్వవినాశనం పొందుతాయి చూచావా? ఆ విధంగా ఆ శివ స్పర్శచే ఆ దేవి తన రూపాన్ని కోల్పోతూ క్రమక్రమంగా శివునితో ఐక్యం కాజొచ్చింది. పరమకారణమగు శివుని స్పర్శించినంత మాత్రం చేతనే మెల్లగా సూక్ష్మమగుచు తన యొక్క 'వాస్తవ స్వభావము'ను పొందనారంభించింది.
Page:115
మొట్టమొదట ఆ దేవి తన అనంతాకారమును విడచి పర్వతాకారమాత్రంగా అయింది. ఆ పిదప నగరాకారమాత్రంగా అయింది. ఆ తర్వాత సుందరమగు వృక్షాకారమాత్రంగా అయింది. ఆ తదుపరి 'అవ్యాకృతాకాశ రూపము'ను ధరించి నది సముద్రంలో ప్రవేశించునట్లు శివుని ఆకారమున ప్రవేశించింది. అప్పుడు...
ఏక ఏవా భవదథో శివయా పరివర్జితః ।
శివ ఏవ శివః శాంత ఆకాశే శమనోఽఖితః ॥
భవానీ లయస్వరూపుడు, సర్వసంహారకర్త, శాంతుడు భక్తులకు మంగళప్రదుడు, సర్వ ఉపద్ర వాల నుండి కాపాడువాడు అద్వైతరూపుడు అగు శివుడు మాత్రమే ఆకాశంలో ఒప్పుచున్నాడు.
శ్రీరాముడు : స్వామీ! శివుని స్పృశించిన మాత్రం చేత ఆ పరమేశ్వరి ఎందుచేత శమించింది? ఆ విశేషమంతా ఏమిటో, తెలియజేయ ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : 'తరంగము' అనేది జలము యొక్క స్వాభావిక శక్తియే కదా! అగ్నికి ‘ఉష్ణత్వము’ అనేది అట్లే స్వాభావిక శక్తియే కదా! అదే రీతిగా శివుని యొక్క స్వాభావిక విశేషమే శివేచ్ఛ-క్రియా విశేషముల స్వరూపమగు ఛాయదేవి. ఆ దేవియే 'ప్రకృతి' అని, 'శివేచ్ఛ' అని, 'పరమేశ్వరి' అని, ‘ఆది జగన్మాయ’ అని... వివిధ నామ రూపములచే ప్రసిద్ధికెక్కి ఉంటోంది. 'ఈ ప్రకృతియే ఆ దేవి యొక్క రూపం' అనికూడా చెప్పబడుతోంది.
శివరూపధారియగు పరమేశ్వరుడు ఈ ప్రకృతికంటే పరమైనవాడు. అతడు వాయువు వలె సర్వవ్యాపి, వాయురూపుడు, పరమశాంతుడు, మేఘరహిత ఆకాశమువలె ప్రశాంతశీలుడు, పరమ పురుషుడు, శివా నందస్వరూపుడు, నిర్వికారుడు, నిత్యతృప్తుడు అయి ఉన్నాడు. అట్టి "ఆద్యంత రహితుడు-ద్వైతవర్జితుడు" అగు పరమశివుని గాంచనంత వరకు “భ్రమరూపిణి - స్పందమాత్ర స్వరూపిణి-చిత్ శక్తి-పరమేశ్వరేచ్ఛ” అగు ప్రకృతీదేవి సంసారమున పరిభ్రమిస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రకృతీదేవి కేవలం 'జ్ఞానమాత్ర స్వరూపిణియే’ అయి ఉండటంచే ఆ జ్ఞానస్వరూపిణి శుద్ధ తత్త్వమగు శివుని కాకతాళీయ యోగంచే స్పర్శించగానే, ఆ శివుని యందు పూర్ణంగా తన్మయమగుచున్నది.
అజ్ఞానంచే ప్రకృతి పురుషునికి ద్వితీయమైనట్లుగా కనిపిస్తుంది. జ్ఞానయోగ స్పర్శచే ఆ ప్రకృతి (పురుష స్పర్శచే) అనిర్లిప్త-నిర్వికార శివునితో ఏకత్వం పొందినదై అతనిలో 'అద్వితీయత' సంతరించుకుంటోంది. అది “ద్రష్టచే దర్శించబడే దృశ్యం ద్రష్ట నుండి బయల్వెడలి తిరిగి ద్రష్టయందే లయించటం” వంటిది సుమా!
ప్రకృతిః పురుషం స్పృష్ట్వా ప్రకృతిత్వం సముజ్ఘతి
తదన్తరేకతాం గత్వా నదీరూపమివ అర్ణవే ॥
జలమాత్ర స్వరూపమగు నది సముద్రమునందు కలియగానే తనయొక్క ద్వితీయత్వమును త్యజించినదై సముద్రజలంతో ఏకత్వం పొందుతోంది చూచావా?
Page:116
లోహ మయమగు పదునైన కత్తిని కరగించినప్పుడు తన జన్మస్థానమగు 'లోహం' గా మారి తన పదునైన ఆకృతినంతా కోల్పోవటం లేదా? శివేచ్ఛారూపమగు చైతన్యం కూడా శివరూపుడగు దేవదేవుని స్పర్శచే తన ప్రకృతిత్వం కోల్పోయి, శివ స్వరూపంగా శమించుచున్నది. ఎండలో నుండి నీడలోనికి వచ్చినప్పుడు ఆ మనుజుని ఛాయ అతని శరీరమునందు శీఘ్రంగా ప్రవేశించినదై మటుమాయమగుచున్నది కదా! వాస్తవానికి చిద్రూపమే అయి ఉండటం చేత 'చిత్ శక్తి' యగు ప్రకృతి తన నిజరూపమగు సనాతన పురుషుని పొందినదై, అజ్ఞానం నశించటం చేత ఇక మరల సంసారమున తిరుగాడక ఆ పురుషుని యందే విలీనమగుచున్నది. ఒక సాధువు పొరబాటుగా చోరుల సమూహంలో ప్రవేశించాడనుకో! ఎప్పుడో 'వీరు చోరులు' అని గ్రహించినవాడై ఇక ఆ సమూహంలో ప్రీతిగొనక సంఘం నుండి బయటపడనెంచుతాడు చూచావా? అట్లాగే పరమ పురుషుని గాంచనంతవరకు ఆ ప్రకృతి అసద్రూపమగు ద్వైతమున రమించుచు పరిభ్రమించుచునే ఉంటుంది. ఆ పరమ పురుషుని దర్శించి స్పర్శించగానే అతనియందు ప్రకృతీదేవి తన్మయమగుచున్నది.
నేను = పరమపురుషుడు, నాది = ప్రకృతి స్వభావం ప్రకృతీ స్వరూపం,
స్వభావం = నేను (శివుడు) + భావన (దేవి స్వరూపం)
నదిలో ఉన్నదీ జలమే కాబట్టి, సముద్రం చేరగానే ఆ నదీజలం కాస్తా సముద్ర జలరూపమే అగుచున్నది. ఈ ప్రకృతి కూడా స్వతహాగా చైతన్య స్వరూపము-పరమ పదము-నిర్వాణ రూపము అయి ఉండటం చేత ఆ పరమపురుషుని పొందిన మరుక్షణం ఆ శివరూపమే అగుచున్నది.
ఆ పరమ పురుషుని గాంచనంత వరకు "ప్రకృతి-స్వభావం-జీవత్వం" మొదలైన ఆయా పేర్లతో పిలువబడే అజ్ఞాత చైతన్యం వ్యాకులములై ఉన్న ఈ అనేక సృష్టులందు ఆయా దుఃఖ మయములైన జన్మాది దశలతోకూడి అవిశ్రాంతంగా మోహవశంచేత పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆ పరమ పురుషుని గాంచగానే తుమ్మెద తేనెను గ్రోలటంలో నిమగ్నమగునట్లు అతనియందే ఆ ప్రకృతి నిమగ్నమగుచున్నది.
ఓ రామచంద్రా! "నేను ఖండము-ఉపాధి సహితము-పరిమితము-ప్రమేయ సహితముజన్మ జరా మరణ సహితము-ద్వితీయము దోషపూరితము అగు జీవుడను" అను దశనుండి “నేను ‘అఖండము-నిరుపాధికము-అపరిమితము-అప్రమేయము-జన్మజరామరణవర్జితము - అద్వితీయము-నిర్దోషము అగు ఆత్మస్వరూపుడనే" ... అను సుజ్ఞాన స్థితి సముపార్జనమే "ప్రకృతి యొక్క లయము" ...అను రూపంగా ఉద్దేశించబడిందని కూడా సూక్ష్మబుద్ధితో గ్రహించు. అట్టి ఆత్మతత్త్వమును ఎఱిగి, స్వస్థితిని పొందిన తర్వాత ఎవడైనా అద్దానిని త్యజిస్తాడా? లేదు. 'నేను ఆత్మనే' అను ఎఱుకను పొంది సర్వకాల సర్వావస్థలయందు అనుభూతపరుడై ఉంటున్నాడు. దేనిచే జనన-మరణ-మోహమయములగు సమస్త దుఃఖములు శాశ్వతంగా శమించిపోవుచున్నాయో అటువంటి 'ఆత్మామృతము'ను గ్రోలినవాడు ఇక మరల అద్దానిని వదలి ఉంటాడా? లేనే లేదు. వదిలి ఉండజాలడు.
Page:117
శ్రీరాముడు : హే మహర్షీ! మహాకాశమునందు తాండవం చేస్తున్న రుద్రదేవుని దేహంలోంచి జనించిన 'కాళీదేవి' అను పేరుతో ఆరాధించబడే ఛాయ జనించి, మరల ఆ పురుషోత్తముని స్పర్శచే ఉపశాంతిని పొంది మూలస్థానమగు రుద్ర భగవానుని యందు లయమును పొందినది కదా! ఆ రుద్ర భగవానుడు తన దేహమునందలి భ్రాంతిని త్యజించి ఎట్లు శాంతించారో... ఆ కథాక్రమము వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : నేను ఆ సమయమున అట్లా చూస్తూ ఉండగానే రుద్ర భగవానుడు. కూడా చిత్రములో లిఖించబడిన మనుజుని వలె ముహూర్తకాలం (48 నిమిషాలు) ఆ ఆకాశమున నిశ్చలత్వం పొందటం జరిగింది. అప్పుడు ఆ రుద్ర భగవానుడు ఆ ముహూర్తకాలం ఆ ఆకాశమున గల ఊర్ధ్వ-అధో బ్రహ్మాండ మండలాలను రెండిటినీ అవలోకించ సాగారు. ఆ తర్వాత ఒక్క నిమిష కాలంలో తన యొక్క శ్వాస వాయువుచే ఆ ఉభయ (ఊర్ధ్వ-అధో) (బ్రహ్మాండ ఖండాలను ఆకర్షించి తన ముఖమున లయం చేసుకొన్నారు. పక్వాన్నమువలె వాటిని భుజించినవారై అఖిలాకాశమున ఆకాశం వలె స్థితిని పొంది ఉన్నారు. అటు తర్వాత ఆ రుద్ర భగవానుడు మరొక మూహూర్తకాలంలో తన సువిస్తార రూపమును త్యజించి మేఘం వలె చిన్న రూపం పొందారు. తర్వాత చేతికఱ్ఱ ప్రమాణంగానే ఆపై అంగుష్ఠ మాత్రంగాను సూక్ష్మాకృతిని దాల్చారు. అటు తర్వాత ఒక చిన్న గాజు ముక్క ప్రమాణం పొందారు. ఆపై ఇక పరమాణు ప్రమాణం కావటం దివ్య దృష్టితో వీక్షించాను. అట్లా పరమాణు రూపం పొందిన ఆ రుద్ర భగవానుడు అటు తర్వాత అంతర్ధానం అయ్యారు.
ఈ ప్రకారంగా 'విస్తార జగదృశ్యం' నుండి 'రుద్రాకారాంతర్ధన పర్యంతం' జరిగిన మహా సంరంభమంతా నేను చూచుచుండగానే శమించినదయింది.
ఆహాఁ! ఆకలిగొన్న జింక చిన్న చిన్న ఆకులను మ్రింగినట్లు ఆ రుద్రాకార భగవానుడు బ్రహ్మాండ కవాటాల రెండింటిని మ్రింగివేశారు. ఆ రుద్రుడు అట్లా అంతర్ధానమయిన తర్వాత అచ్చట గల ఆకాశం 'కేవల నిర్మల బ్రహ్మరూపం' గానే కనిపించింది. చూచావా, రామచంద్రా! ఆ ప్రకారంగా "అనేక రూపాలుగా భ్రమ యుక్తమైనది- అద్దములోని ప్రతిబింబమును బోలినది అగు ఆ శిలాఖండములోని మహాప్రళయ దృశ్యమును నేను ఆది-మధ్య-అంత రహితమగు చిదాకాశముగానే గ్రహించి వీక్షించాను!
ఇక ఆ తర్వాత "ఆ విద్యాధరి-ఆ శిల-ఆ బ్రహ్మాండం-ఆ మహాప్రళయం- ఆ రుద్ర భగవానుడు-ఆ కాలీళీవానీ" ఇవన్నీ స్మరిస్తూ రాజప్రసాదమును చూచిన ఒక గ్రామస్థుని వలె ఆశ్చర్యపోయాను. అప్పుడు ఎందుకో ఆ శిల యొక్క మరొక వైపునకు యథాలాపంగా చూచాను.
ఆశ్చర్యం! ఆ ప్రక్క శిలయందు కూడా అంతటా నా దివ్యదృష్టికి అనేక సృష్టులు కనిపించసాగాయి.
Page:118
ఓ రామచంద్రా! దివ్యదృష్టిచే సర్వత్రా స్థితి కలిగి ఉన్నదంతా సదా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మామూలు దృష్టితో చూస్తే (మాంసమయమైన భౌతిక కన్నులతో చూస్తే) అది దూరంగా ఉన్న ఒక మామూలైన శిల మాత్రమే! మాంసపు కళ్ళకు సృష్ట్యాదులు భాసించవు సుమా!
ఆ విధంగా నా దివ్యదృష్టికి ఆ మరొక శిల యొక్క మరొక మూలగా కూడా ఇతఃపూర్వం నేను చూచినటువంటి సృష్టులే అనేకం కనిపించాయి. ఆ శిలకు మరొక మూలగా చూచాను. ఆ శిల యొక్క అన్ని వైపులా అనేక జగత్తులు అద్దంలో నిర్మల ప్రతిబింబాల వలె కనిపించాయి. అప్పుడు నేను కౌతుకం ఆపుకోలేక తక్కిన శిలల యొక్క ఆయా విభాగాల వైపు చూచాను. వాటిలో కూడా అనేక సృష్టులు కనిపించాయి. అంతేకాదు! అక్కడ గల గడ్డిమొక్క దగ్గర నుండి ఆయా సర్వ పదార్థములలోను వస్తువులలోను అసంఖ్యాకాలైన జగత్ సమూహాలు యథాస్థితంగా వర్తిస్తూ కనిపించాయి.
శ్రీరాముడు : మీకు అక్కడి ఆయా శిలలలోను, గడ్డి మొక్కలలోను, వృక్షపు ఆకులలోను, తదితర సర్వ పదార్థజాలములోను కనిపించిన అసంఖ్యాక బ్రహ్మాండములను ఈ మీ కళ్ళతోనే దర్శించారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : లేదు. ఆ అనేక విధములైన జగత్తులన్నీ కూడా ఆధిభౌతికభ్రాంతి రహితమగు - సర్వ సాక్షీభూతమైన బుద్ధికి మాత్రమే అగుపిస్తాయిగాని... ఈ భౌతికమైన కళ్ళకు కాదు.
ఆ అనేక జగత్తులలో... ఒకచోట ప్రథమ సృష్టి కొరకై ప్రజాపతి అప్పుడే జనిస్తూ ఉన్నాడు. ఇంకొక సృష్టిలో బ్రహ్మదేవుడు-సూర్యుడు-చంద్రుడు-నక్షత్రమండలం-రాత్రింబవళ్ళు-సంవత్సరాల యొక్క కల్పనచే జలధారగా సాగిపోతోంది.
ఒక బ్రహ్మాండంలో భూతలం జన సమూహంతో కూడి ఉన్నది. ఒక జగత్తులో సాగరాలు ఇంకా జన్మించక పోవటం చేత సముద్రాలు ఏర్పడవలసియున్నది. వేరొక జగత్తులో దేవతలు జన్మించారు గానీ, ఇంకా రాక్షసులు, మానవులు జన్మించలేదు. ఒక జగత్తులో గల సజ్జనులలో కృతయుగాచారములగు యజ్ఞ యాగ-అగ్నికార్యాలు జరుగుచూ ఉన్నాయి.
మరొక జగత్తులో దుర్జనులందు 'హింస-మోసము-దగా' మొదలైనవి అంగీకార యోగ్యములగుచూ కలియుగాచారములు ప్రవృత్తములగుచున్నాయి. ఇంకొక జగత్తులో అనేక భూ-స్వర్గ పురుషులు, దైత్యనగరములు ప్రవర్తిల్లుచున్నాయి. ఒకానొక జగత్తులో భూతలం పర్వత సమూహములచే నిండిపోయి ఉన్నది.
ఒకచోట మృత్యు ఖేళిచే జనులు నశించుచుండగా క్రమక్రమంగా నిర్జనంగా కనబడుతోంది. ఒకచోట చంద్రుడు ఇంకా ఉత్పన్నమే కాలేదు. ఇంకొక జగత్తులో క్షీరసాగర మథనం ఇంకా జరుగవలసి ఉండటం చేత దేవతలు మృత్యు సహితులై కనిపిస్తున్నారు. ఆ జగత్తులోని దేవలోకంలో అమృతం, ధన్వంతరి, కామధేనువు, లక్ష్మి, కాలకూట విషము, ఉచ్ఛైశ్రవము (తెల్ల గుఱ్ఱము) ఇంకా జనించనేలేదు. ఒకచోట శుక్రాచార్యులు మృతసంజీవినీవిద్య కొరకై తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు అతని ప్రయత్నమునకు అనేక విఘ్నాలు కల్పిస్తూ కనిపించాడు.
Page:119
ఒకచోట ధర్మము శ్రద్ధగా నిర్వర్తించబడుతోంది. అందుచేత ప్రజలందరూ స్వప్రకాశమాన మగు బ్రహ్మ జ్ఞానముతో కూడుకొనినవారై ఉన్నారు. కొన్నిచోట్ల పదార్థాలన్నీ మామూలుగా కాకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆకాశం క్రిందికి భూమి పైకి ఉంటూ అక్కడి జీవులు సాధారణ రూపానికి వ్యతిరేకమైన రూపం ధరించి ఉన్నారు.
ఒక చోట జనులు అపూర్వమైన వేద శాస్త్రములను విచారణ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇంకొక జగత్తు కల్పాంత సంక్షోభములు లేకుండా కొనసాగుతూనే ఉన్నది. మటొక జగత్తులో దైత్యులు దేవతల పురములను జయించి, ఆక్రమించుకొని అల్లకోల్లోలాలు సృష్టిస్తూ పోతున్నారు. వేడొక జగత్తులో దేవలోకంలోని నందనవనంలో గంధర్వ-యక్ష-కిన్నరులు తీయగా గానములు చేస్తూ, ఆ రాగాలాపనలో తన్మయులగుచూ కనిపించారు.
...ఈ ప్రకారంగా భూత భవిష్యత్ వర్తమానములందలి అనేక జగదాడంబరములు నాకు కనిపించ సాగాయి. వాటినన్నిటినీ నేను మహా విశ్వరూపుడగు పరమాత్మయొక్క స్వరూపంగా గాంచసాగాను.
ఇంకా కొన్ని విశేషాలు విను. కొన్ని జగత్తులలో పుష్కరావర్త (ప్రళయ) మేఘాలు ప్రవృత్తం అవుతూ ఉంటే జీవులు మృత్యు భయంతో గగ్గోలు పెట్టుచుండటం కనిపించింది. ఇంకొక చోట భూతకోట్లన్నీ శాంతముగా ఉన్నాయి. వేరొక చోట ప్రళయారంభ సంరంభంచే దేవ దైత్య - భూలోకాలు అత్యంత సంక్షోభం పొందుచున్నాయి.
ఒక్కొక్క జగత్తులో సూర్యుడే లేక నిబిడాంధకారంతో నిండి ఉన్నది. మరికొన్ని జగత్తులలో సూర్యుడు నిత్యమూ వెలుగుచుండటం చేత ఆ జగత్తులు సదా సుందరంగానూ జ్వాలా సదృశంగాను, దేదీప్యమానంగాను వెలుగొందుచున్నాయి.
ఒకచోట నారాయణ భగవానుని నాభికమలమున మధు-కైటభులు విలీనులై ఉన్నారు. ఒకచోట భగవంతుని నాభికమలంలో జనించిన నూతన బాలకుడైన బ్రహ్మ నోటిలో వ్రేళ్ళుంచుకుని నిద్రిస్తున్నాడు. ఒకచోట కల్పాంతరాత్రి ప్రవేశించటంచే ఆ జగత్తు శూన్యమగు అంధకారంతో వ్యాప్తమై ఉన్నది. మరొక చోట మహాప్రళయసముద్రము మధ్యన గల ఎత్తైన వటవృక్షపు ఆకుపై మాధవ భగవానుడు నిదురిస్తున్నాడు.
ఒక జగత్తులో ఇంకా పృథ్వి ఉత్పన్నం కాకపోవటం చేత శిలాగర్భభాగంలాగా నిశ్చలవిశాల ఆకాశము తప్పితే మరింకేమీ లేదు. ఒకచోట జగత్తు అప్రతర్క్యమై (ఒకరితో మరొకరు ‘ఇది’ అని చెప్పుకోవటానికి వీలుకుదరనిదై), అవిజ్ఞేయమై 'సుషుప్తి' (గాఢనిద్ర) అన్నిటా - అంతటా ఏర్పడినదై ఉన్నది. (గాఢ నిద్ర ఎట్టిది అని అంటే - ఏం చెప్పగలం?)
ఇంకొక జగత్తులో వజ్రాయుధాలు అటూ ఇటూ సంచరిస్తూ ఉంటే పర్వతములు ద్రవీభూతమగుచు కనబడుచున్నాయి. ఇంకొకచోట జగత్తులో త్రిపురాసుర వృత్తాసుర-అంధకాసుర -బలి వంటి అసురులు చేస్తున్న యుద్ధ సంరంభములచే నిండిపోయి ఉన్నది.
Page:120
ఒక జగత్తులోని పాతాళములో మత్తగజేంద్రముల (ఏనుగులచే భూమిలోని కొన్ని కొన్ని విభాగములు కంపింపజేయబడుతూ కనిపించాయి. అవి ప్రకృతి వైపరీత్యములుగా భూకంపములుగా భూతలముపై ప్రదర్శనమగుచుండగా, ప్రాణులు అస్తవ్యస్తంగా పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు.
ఇంకొక చోట కల్పాంతమున ఆదిశేషుని శిరస్సుపై గల భూమి అటూ ఇటూ దొర్లుతోంది. వేరొక చోట సీతను అపహరించిన నేరానికి రాముని చేతిలో రావణుడు నిహతుడగుచూ కనిపించాడు. మరొకచోట అప్పుడే సీతను అపహరించే వ్యవహారానికి రావణుడు ఉద్యుక్తుడగు చున్నాడు. ఒక జగత్తులో కాలనేమి తన పాదములతో భూమినంతా ఆక్రమించు చుండగా, శిరస్సు సుమేరు పర్వతాన్ని స్పృశించుచుండగా ఆకాశమునంతా ఆవరించి ఉండి కనిపించాడు.
శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ!
కిమహం, భగవన్! పూర్వమభవమ్? కథయేతి మే?
అభవం చేత్ అనేనైవ సంనివేశేన తత్కథమ్?
స్వామీ! పూర్వ కల్పంలోనూ నేను ఇట్లాగే ఉన్నానా? ఇదే ఆకారంతోనా, లేక మరియొక ఆకారం తోటియా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్తులలోని సర్వ పదార్థములు అనుక్షణం పరిణామం చెందుతూనే ఉన్నాయి, చెందుతూనే ఉంటాయి. ఒక పాత్రలోంచి ధ్యానం ఇంకొక పాత్రలోకి పోశామనుకో! అప్పుడు ఆయా ధాన్యపు గింజలలో కొన్ని పూర్తిగాను, మరికొన్ని కొంతవరకు స్థానభ్రంశం చెందుతూ ఉంటాయి. ఇంకొన్ని ఇతఃపూర్వపు వంటి స్థానమే పొందుతూ ఉంటాయి.
అట్లాగే ఈ జీవుల కల్ప-కల్పానంతర గమనాగమనములు కూడా! కొందరు జీవులు సముద్ర తరంగముల వలె ఒకప్పుడు సమాన రూపములుగా స్ఫురిస్తూ ఉంటారు. నీవు-నేను సమస్త ప్రజలు మరల మరల ఉత్పన్నములగుచూనే ఉన్నాం. సముద్రంలోని జల విభాగం ఒకసారి ఒకసారి ఒకే విధమైన తరంగాలుగాను మరొకసారి వేర్వేరుగాను వస్తూ పోతూ ఉంటుంది చూచావా? అయితే ఏ జలం ఏ తరంగాలుగా వచ్చినా (లేక) తరంగరూపం పొందక ఆ తరంగా లకు అంతరంగా ఉన్నా... ఉన్నదంతా జలమేగాని మరేమీ కావు కదా!
పరమార్థ దృష్టిచే చిదాకాశమున ఈ జీవులు గాని, వారివారి రాకపోకలుగాని సంభవించట మనేదే లేదు. జలం సర్వదా ఆకార రహితంగానే, యథాతథంగానే ఉంటుంది కదా!
ఇక మాయా దృష్టి చేతనంటావా? సముద్రతరంగము వలె ఈ జీవులు అదే రూపముగా గాని, అన్య రూపముగా గాని స్ఫురిస్తూ ఉంటారు. సంసార భ్రమచే అనంతకోటి జీవులు మరల మరల వచ్చుచూ-పోవుచూ ఉన్నారు కదా! ఈ జగత్పదార్థములన్నీ కూడా... ఒకప్పుడు సమరూపంగాను... మరొకప్పుడు అసమ రూపంగాను ఉంటున్నాయి. ఇక నీ విషయానికి వస్తే... సర్వదా ఆత్మారాముడవైన నీవు దైవకార్య నిమిత్తం అయోధ్యారాముడుగా ప్రకటనమవటం నీ అవతార-చమత్కార విశేషం!
Page:121
ఓ రామచంద్రా! “జగత్తు” అనే మహా సముద్రంలో ఈ జీవులందరు బిందుకణముల వంటి వారిగా గ్రహించు. ఈ జీవులలో కొందరు మరల మరల అవియే ధన-బంధు-వయః-కర్మవిద్యా-విజ్ఞాన చేష్టలతో కూడిన దేహములతో ప్రవేశిస్తూ-నిష్క్రమిస్తున్నారు. మరికొందరేమో వాటివాటిలో సహభాగం మాత్రమే కలిగి ఉంటున్నారు. ఇంకొందరు వాటిలో నాలుగవ వంతు మాత్రమే పరిణామస్థితిలో తోడు తెచ్చుకుంటున్నారు. కొందరు జీవులు తమ దేహానంతరం అవియే దేహములు కలిగి ఉంటున్నారు. ఇంకొందరు భిన్నమైన శరీరములు పొందుచున్నారు. మరి కొందరికి అన్ని విషయములు ఇతఃపూర్వపు దేహము వలెనే ఉంటున్నాయి. కాని కాలం మాత్రం వారి పట్ల విలక్షణంగా ఉంటోంది. ఇంకొందరు కాలమునందు సమంగాను, తక్కిన సర్వ విషయములలోను విలక్షణంగాను ఉంటున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! ఒక్కొక్కసారి సలక్షణంగాను, మరొక్కసారి విలక్షణంగాను ఈ జీవుల భవిష్యత్ దేహాదుల పరిణామములు ఎందుకుంటున్నాయి? వీటి వెనుక అంతర్లీనంగా ఉన్న రహస్యమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అనేక రాగ-ద్వేషాదుల చేతను, విచిత్ర ధర్మాధర్మముల ప్రసంగ-చేష్టల చేతను నింపబడిన చిత్తములే ఈ పరిణామ విపరిణామములన్నిటికీ కారణం! ఆయా స్వకీయ నిర్మిత భావావేశములతోనూ, చేష్టలతోను కూడిన ఈ జీవులు వివిధ దేహములు ధరిస్తూ ఇక్కడి స్వర్గ నరకాది ఊర్ధ్వఅధో లోకాలలోనికి మరల మరల ప్రవేశ-నిష్క్రమణములు నిర్వర్తిస్తున్నారు. అందుకే “ఈ జీవులు చంచల మహా సముద్రంలోని చక్రావర్తములందు సంచరించే జలబిందువుల వంటివారు” అని వ్యాఖ్యానించాను. మహా సముద్రంలో ఏ జలం ఆవర్తమగు చున్నది? ఏ జలం తరంగాలుగా అగుచున్నది? ఏ జలం ఎటు వెళ్ళుచున్నది? ఏ జలం ఎన్నెన్ని రూపాలు పొందుచున్నది? ...అనునదంతా వాఖ్యానించటం ఎవరి తరం? అట్టి వ్యాఖ్యానాలలో విశేషం మాత్రం ఏమున్నది?
ఈ ‘భూతకోట్లు’ అనే జలబిందువులు సదృశములా? (ఒకే తీరుగా ఉంటున్నాయా), లేక భిన్నములా? (వేర్వేరు తీరులుగా పరిణమిస్తున్నాయా?); తద్రూపములా? అన్యరూపములా?... అని బాగుగా నిర్ధారించటానికి సమర్థుడెవరు?
మహాజల ప్రవాహం సందర్భంలో ఏ నీరు ఎటు పోవుచున్నదో చెప్పలేకపోయినప్పటికీ... ఒక్కటి మాత్రం సత్యం. ప్రతి జలకణం జలమేగాని అన్యం కాదు.
ప్రతి జీవుడు అత్మస్వరూపుడే అయి ఉన్నాడు. ఆత్మానందమే మనందరి రూపాలుగా వెల్లివిరుస్తోంది!
Page:122
శ్రీరాముడు : స్వామీ! ఆ సమయంలో అనేక జగత్తులలో వివిధ విశేషాలు గాంచుచున్న మీరు ఏ జగత్తులో, ఏ దేహంతో ఉండి అదంతా చూచారు? మీ దేహం ఏ జగద్వస్తువుతో ఆ సమయంలో తయారై ఉన్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "అనేక సంఘటనలతో కూడిన వివిధ జగత్తులన్నీ ఆత్మ స్వరూపం మాత్రమే” అను ఎఱుకతో నేనదంతా చూస్తున్నాను కదా! అందుచేత అనంతము - నిరామయము-చిదాకాశము అగు స్వరూపముతోనే నేనున్నాను.
అక్కడ ఇంకొక చమత్కారమైన విషయం జరిగింది. అదికూడా చెపుతాను శ్రద్ధగా ఆలకించు. ఏదో కాకతాళీయంగా ఏకాగ్రచిత్తుడనై నేను నా దేహమువైపు పరికించి చూచాను. అప్పుడు నేను అనంతము నిరామయము-చిదాకాశ స్వరూపము అగు దేహమై ఉన్నాను కదా! అట్టి నా దేహంలో తడిసిన ధాన్యపు గుట్టలో ఒక గింజ అంకురించి కనబడునట్లు ఒకచోట సృష్టి కనిపించింది. ఆ జగత్తులో ఆకార యుక్తములు అనాకారయుక్తములు, చేతనములు-అచేతనములు అగు సమస్త వస్తువులు కనిపించసాగాయి. ఆహా! సుషుప్తి నుండి స్వప్న దశకు వచ్చిన మనుజునికి ఎదురుగా స్వప్న దృశ్యం ప్రకాశిస్తుందే! స్వప్న దశ నుండి జాగ్రత్ దశకు వచ్చినవానికి ఎదురుగా ఈ జాగ్రత్ జగత్తు కనిపిస్తుంది కదా! ఆ రీతిగా ఆత్మస్వరూపమును అనుభూతమొనర్చుకొని ఉన్నట్టి నా యొక్క హృదయమున సృష్ట్యాదియందు సృష్టి ఉదయించింది.
అయితే ఆ సృష్టి కూడా చిదాకాశముకంటే భిన్నం కాదు.
శ్రీరాముడు : హృదయాకాశమే స్వరూపముగా గల ఓ మహాత్మా! చిదాకాశరూపులగు తమయందు సృష్టి ఎట్లా ఉత్పన్నమైంది? నాకు ఇది ఆశ్చర్యంగా ఉన్నది! ఆ విశేషమంతా ఏమిటో సవివరంగా తెలియజెప్ప ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : "స్వప్నంలోని నగరం” లాగా అసత్తే అయినప్పటికీ 'సత్తు' వలె సర్వజగత్ కల్పనా వ్యవహారుడగు బ్రహ్మదేవుని పదమును నేను నాయందు ఎట్లా అనుభవించానో,... యథారీతిగా వర్ణిస్తాను, విను.
చిదాకాశరూపుడనగు నేను ఇతఃపూర్వం చెప్పుకొన్న శిలయొక్క వేర్వేరు భాగాలలో సృష్టులను పరికించే అభ్యాసంతో నా శరీరం వైపుగా చూచాను. అభ్యాసవశంగా నా చిదాకాశ దేహమందలి ఒకానొక విభాగమును సంవిత్తు (జ్ఞానము) + సృష్టి సంకల్పములతో కూడిన సంకల్ప దర్శనముచే జగద్వ్యవహారమును అసంకల్పితంగా, నాకు తెలియకుండానే మేలుకొలిపాను. నాయందు ఎప్పుడైతే సంవిత్తు (జగత్ సంబంధ జ్ఞానము) ఒకింత స్ఫురించిందో, ఆ మరుక్షణం నాయందు ఒకానొక చోట “ఆకాశరూపత్వము” గాంచాను.
Page:123
శ్రీరాముడు : అద్దానిని గాంచింది కళ్ళతోనా?
శ్రీ వసిష్ఠ మహర్షి : కాదు. గాఢ నిద్రలో కేవల-నిర్విషయ చిదాకాశమును అనుభవిస్తున్న చిదాకాశ రూపుడగు ఈ జీవుడు ఏ విధంగా గాఢ నిద్రానంతరం స్వప్న - జాగ్రత్ దశలను ఘనీభూతమైన స్వభావముచే పొందుచున్నాడో అట్లాగే అప్పుడు నాయందు ఆకాశరూపత్వం పొందాను. ఒక జీవుడు స్వప్నంలోని నగర-గృహాదులను ఏ స్వభావము అను కళ్ళతో చూస్తున్నాడో... నేను ఆ స్వభావచక్షువులతో నా యందు జగత్తును చూచాను. ఆ తర్వాత ఆ నా ఆకాశరూపమున 'దిక్కులు’ గురించిన బోధ కలిగింది. 'ఆకాశము దిక్కులు' గురించి పర్యాలోచించటం చేత మొట్టమొదటగా ‘చిత్తము' అనునది ఏర్పడింది.
చిత్తము నుండి ఉదయించిన “ఈ ఆకాశాదులే నేను” అను జ్ఞానమే “అహంకారము”. అట్టి అహంకార జ్ఞానము యొక్క కించిత్ ఘనీభూత స్థితి “బుద్ధి”. ఆ బుద్ధి “సంకల్ప + వికల్పములచే మరికొంత ఘనీభూతమగుటయే మనస్సు.
ఈ విధంగా ఆకాశత్వము-దిక్కులు-చిత్తము-అహంకారము-బుద్ది-మనస్సు అని పిలువ బడుచున్నవన్నీ భావావేశ మాత్ర రూపంగా నాయందు గల ఆ ఒకానొక విభాగంలో క్షణంలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆ మనస్సు “శబ్దము స్పర్శ - రూపము-రసము గంధము”లను ఎఱుగుట ప్రారంభించగానే పంచతన్మాత్రలు కల్పితమైనాయి. ఆ తర్వాత ఆ ఆ స్థానంలో క్రమంగా సూక్ష్మస్థూల పంచేంద్రియ క్రమమంతా ఉదయించసాగింది.
‘సుషుప్తి దశ’ నుండి స్వప్నము నందు ప్రవేశించగానే 'జగత్తు' అనే ఘనీభూత దృశ్యము అనుభూత విషయంగా..., అగుచున్నది కదా! అట్లాగే సృష్టికి పూర్వం దుఃఖ రహితమై ఉండే “శుద్ధాత్మ”... సృష్ట్యాది యందు ఎప్పుడైతే సృష్టి వైపుగా అభిముఖమౌతోందో అప్పుడు ఒక్క నిమిషంలో 'దుఃఖము’ ఉదయిస్తోంది. అనంతమగు పరమాత్మయందు ఒకేకాలంలో ఈ దృశ్య సమూహమంతా ఉదయిస్తూ ఉండగా... దానిని కొందరు “ఆకాశము-ఆకాశము నుండి వాయువు -వాయువు నుండి అగ్ని”... మొదలైన ఒక క్రమమును వర్ణిస్తూ చెప్పుచున్నారు. మరికొందరు “ఒకదాని నుండి మరొకటి కాదు. సృష్టి ఏర్పడిన క్షణంలో అన్నీ ఒక్కసారిగా ఏర్పడుచున్నాయి” అని సిద్ధాంతీకరిస్తున్నారు.
కల్పనచే క్షణంలో కల్పము, పరమాణువులో దీర్ఘ ప్రదేశం అనుభవమగునట్లు నేను అచట బ్రహ్మాండరూపమగు చైతన్యాత్మను అనుభవించాను. కానీ, రామచంద్రా! యథార్థానికి నిర్మలాత్మ సదా సర్వదా చిదాకాశరూపమే అయి ఉన్నది. స్వభావంగానే వాయువు ఆకాశమున అంతటా నిరంతరం చలిస్తూ ఉంటుంది కదా! అట్లాగే మనస్సు కూడా స్వభావంగానే సర్వత్రా శరీరాదుల కల్పన గాంచుచూ ఉంటోంది. ప్రథమంగా మనస్సు యొక్క పరశక్తి జగత్తు యొక్క రూపాదుల కల్పనను ఎట్లు గావించిందో... అద్దానిని మరొకటేదీ స్వయంగా గొప్ప ప్రయత్నం చేసి కూడా మరొక విధంగా చేయజాలదు.
Page:124
ఆ తర్వాత నేను స్వయంగా అపరిచ్ఛిన్నుడను అయినప్పటికీ కల్పన చేత నన్ను నేను పరిచ్ఛిన్న రూపంగా అనుభవించసాగాను. 'చిద్రూపము' నుండి 'చిత్తము’ రూపమున స్థితినొందాను.
ఆ తర్వాత... 'చిత్ ప్రతిబింబము' అనదగు "చిత్తము” యొక్క ప్రాప్తిచే తేజఃకణములాగా వెలయునట్టి లింగ శరీరము (మనో-బుద్ధి-చిత్త-అహంకారములతో కూడిన శరీరము) అనుభవించసాగాను.
ఆ తర్వాత భావనా సమూహముల పరిపుష్టిచేత “స్థూల శరీరత్వం” పొందాను. ఆ స్థూల శరీరంలో "నేను చూచుచున్నాను” అను ఒకింత బోధ చేత “చూడటమనే అనుభవం” వైపుగా ప్రవృత్తుడను అగుటచే 'నేత్రములు' అను ద్వారముతో కూడుకున్నవాడనైనాను.
ఏ రంధ్రముచే నేను చూచుటకు ప్రవృత్తుడనైనానో వాటినే "కళ్ళు” అని పిలుస్తున్నారు. దేనినైతే నేను చూస్తున్నానో... అదియే “దృశ్యము” అనబడుతోంది. దర్శనమే అద్దాని 'ఫలం'. ఎప్పుడు చూస్తున్నానో.... అదియే 'క్రమము'. ఎచట చూచానో... అదియే ఆకాశము... అదియే ‘దేశము’... ఈ విధంగా ఒక దృఢమైన నియతి ఆత్మకు ప్రవృత్తం కొనసాగింది.
శ్రీరాముడు : స్వామీ! అఖండాత్మ స్వరూపులగు మీరు ఆ విధంగా దేహధారణ చేస్తూ మీ యొక్క ఆత్మ స్వరూపాన్ని ఏమఱిచారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : లేదు. "సమస్తము చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే” అనియు, నేను చైతన్యమేనని, అందుచేత చూడబడే అంతటికీ నేనే కారణము అనియు అనుభవం ఆ సమయంలో అనుక్షణికంగా కలిగియే ఉన్నాను. అనగా... 'నేత్రములు' అనే రెండు ద్వారముల గుండా నేను ఎప్పుడైతే చూడటం ఆరంభించానో, అపుడు “ఈ కనబడుచున్నదంతా చిదాకాశమే” అను నిర్మల బోధ యథాతథమై ఉండనే ఉన్నది.
ఏ రంధ్రముల గుండా చూచానో అవి నేత్రములై వర్తించాయి కదా! ఆ తర్వాత 'శబ్దమును ఒకింత విందును కదా' అనే చిత్తవృత్తి నాకు ఉదయించింది. అట్లా ఉదయించగానే ఒకానొక ఝంఝూనాదం నాకు వినపడసాగింది. ఆ శబ్దము శంఖానాదమును బోలి ఆకాశమునకు స్వాభావికమైనదిగా అనిపించింది. అది ఇంకా చలనశీలమగు వాయువుతో కూడి రంధ్రముల గుండా (శబ్దవాయువులుగా ప్రసరించుచుండగా) వినటం జరిగిందో అవియే “చెవులు" అను పేరుతో పిలువబడుచున్నాయి సుమా! అటు తర్వాత ఏ ప్రదేశమునుండి స్పర్శ జ్ఞానమును పొందానో అవియే 'త్వక్కు' (చర్మము) అని చెప్పబడుతోంది. దేనిచే 'స్పర్శ' అనుభవించబడుతోందో అదియే 'సత్-సంవేదన' రూపమగు (లేక, స్పర్శేంద్రియ విషయమైన) వాయువు-అనబడుతోంది.
ఈ విధంగా దర్శనేంద్రియ-శబ్దేంద్రియ-స్పర్శేంద్రియ అనుభవకర్తనయ్యాను కదా! అప్పుడు “రుచి ఆస్వాద - స్వరోచ్ఛారణ నిర్వర్తించెదనుగాక”! అనే మరొక ఇచ్ఛ జనించింది. మరుక్షణం రస సహితమైన 'రసేంద్రియం' ఏర్పడింది. అట్లాగే ఘ్రాణేంద్రియం గురించిన సంకల్పముచే ఘ్రాణేంద్రియం సంభవించింది.
Page:125
చూచావా, రామచంద్రా! ఈ ప్రకారంగా వాస్తవానికి ఆకాశ రూపుడనే అయినట్టి నాకు నా యొక్క అనంత తత్త్వములోని ఒకానొక విభాగంలో సమస్త దేహఇంద్రియ-విషయ సంపత్తి నా యొక్క ఇచ్ఛా ప్రభావంచే చేకూరింది. ఇట్టిదియే ప్రతి ఒక్క జీవుని భౌతిక దేహ సంపత్తి విశేషమని గమనించు.
ఇక్కడ రెండు విషయాలు గమనించు -
1.) నేను యథాతథంగా అనంతమగు చిదాకాశ స్వరూపుడనుగానే ఉండి ఉన్నాను. కాబట్టి, నా యందు ఒకానొక విభాగము అనునది “స్వప్నతుల్యము-కల్పనా మాత్రము” కనుక, వాస్తవానికి ఏదీ కూడా చేకూరనిదియే అగుచున్నది. ఒక దృశ్యమును చూస్తున్న ద్రష్ట తన స్వరూపమును యథాతథంగా కలిగి ఉంటూనే దృశ్యమును దర్శిస్తూ ఉంటాడు కదా! దృశ్యమును పొందుతూనే స్వస్వరూపతః మార్పు-చేర్పులు లేకయే ఉంటాడు కదా! ఇదియే ఇక్కడ అక్కడి నా "స్వరూప తతంగము” విషయమై మనకు దృష్టాంతం.
2.) నేనే కాదు. నీవు, ఇక్కడి సభికులు, తదితర జ్ఞాన అజ్ఞాన సమన్వితులగు భూతవర్తమాన-భవిష్యత్ ద్రష్టలందరిపట్లా నాలాగానే తమ స్వస్వరూపమునందు ఎట్టి మార్పు చేర్పులు లేకుండానే స్వప్నతుల్య మనదగు ఈ శబ్ద స్పర్శ-రూప-రస-గంధముల యొక్క భోగ జ్ఞానము. ఉదయిస్తోంది సుమా! నాకు బలాత్కరంగా దేహ ఇంద్రియత్వం ఉదయించింది. ఆ దేహేంద్రియ విషయములను అభిమానించుచూ ఉండనారంభించాను. అట్టి అభిమానమే నీవంటి వారిచే (అనగా శాస్త్రకారులచే) ‘అహంకారము' అని చెప్పబడుతోంది. అట్టి అహంకారము ఇంకొంత ఘనీభూతం కాగా ‘ఇప్పుడు చూచెదనుగాక! ఇప్పుడు వినెదనుగాక! ఇప్పుడు ఆఘ్రాణించెదను గాక! ఇప్పుడు! ఇప్పుడీ స్పర్శానుభవం పొందెదను గాక! ఇక రుచిని పొందెదను గాక' అను రూపంగా ప్రవర్తన బయల్వెడలుచుండగా అదియే 'బుద్ధి' అని చెప్పబడుతోంది. ఆ బుద్ధి మరికొంత ఘనీభూతమై సంకల్ప-వికల్ప పరంపరలను పొందనారంభించింది. అట్టి సంకల్ప-వికల్పములనే ‘మనస్సు’ అని అంటున్నారు. ఆ మనస్సే విషయములను మరల మరల స్మరించుచుండగా 'చిత్తము’ అని వ్యవహరించబడుతోంది.
ఈ విధంగా వాస్తవానికి చిదాకాశరూపుడనగు నేను సూక్ష్మ శరీరధారినైనాను. అంతఃకరణ రూపు డనైనాను. అప్పుడాస్థితిలో వాయువు కంటే కూడా అత్యంత సూక్ష్మమైన ఆకృతితో కేవలం ఆకాశ మాత్రుడనుగానే ఉన్నాను. అప్పటికీ నేను నిరాకారడను అగుటచేత ఏ పదార్థము చేతనూ నిరోధించ బడనివాడనుగానూ ఉన్నాను. అట్లా పూర్వ కల్పితమైన బ్రహ్మదేవుని శరీరమును భావన చేయుచు చాలాకాలం ఉన్నాను. అప్పుడు "నేను చతుర్ముఖ దేహధారిని అవుతాను" అనే ఒకనొక వృత్తి నా యందు కలిగింది. అట్టి వృత్తిలో నలువైపులా ఎగురసాగాను. అట్లా ఎగురుచూ ఒకానొక శబ్దం ఉచ్చరించాను. అట్లు బాలరూపుడనగు నేను మొట్టమొదటగా ఏ శబ్దమును ఉచ్చరించానోఆ శబ్దమే మరల అక్కడి ప్రపంచమున 'ఓంకార' రూపంగా ప్రసిద్ధికెక్కి ఉన్నది.
Page:126
ఈ ప్రకారంగా నేను సృష్టి కర్తను, జగద్గురువును, బ్రహ్మదేవుడను అయినాను. ఆపై మనోమయుడనగు నాచేత అనేక సృష్టులు కల్పించబడ్డాయి. ఆ రీతిగా... బ్రహ్మరూపుడనే అయిన నేను 'నిజ స్థూల శరీరము’ అను ఆవరణ సహిత బ్రహ్మాండమును, ఆ బ్రహ్మాండము యొక్క బాహ్య రూపమును ఒక్కసారే గాంచసాగాను. అయితే...
ఏవమస్మి సముత్పన్నో న తు జాతోఽస్మి కించన ।
దృష్టవానస్మి బ్రహ్మాండం, బ్రహ్మాండాంతం న కించన ॥
వాస్తవానికి “బ్రహ్మాండము - బ్రహ్మాండము యొక్క బాహ్యము” అనబడు దృశ్యమేదియు అననిదే అయి ఉన్నది సుమా!
శ్రీరాముడు : మహర్షీ! "బ్రహ్మాండములు-వాటి బాహ్యము చూస్తూ ఉండినాను”... అని అంటూనే, “అట్టి దృశ్యమేదీ లేనేలేదు”... అని ఇంతలోనే వాఖ్యానిస్తున్నారు. కనబడుతూ కూడా లేకుండట మేమిటి? మీ వాక్యార్థం వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నంలో స్వప్న స్వభావ చమత్కారంచేత అనేక పదార్థ జాలములు కనబడవచ్చుగాక! అవన్నీ ఎక్కడున్నాయి? లేవు కదా! అట్లాగే "బ్రహ్మదేవుని స్వప్నమే ఈ జగత్తు" అని మనం ఇతఃపూర్వం సిద్ధాంతీకరించుకున్నాం కదా! అప్పటి సృష్టికర్తయగు బ్రహ్మదేవత్వము వహించినప్పటి ఆ నా ఆ బ్రహ్మాండముల కల్పన దర్శనములు అట్టివే! (స్వప్నసదృశమైనవే!)
ఆ విధంగా మనోమయుడనగు నేను జగద్రూపుడను అయ్యాను. కానీ అట్లేమియు కాకయే ఉన్నాను. ఎందుకంటే సమస్తమూకూడా దృశ్యశూన్యమగు చిదాకాశమే అయి ఉన్నది కదా!
జగత్ మృగతృడ అంబూని భాంతి సంవిది సంవిదః ।
న బాహ్యమస్తి, నో బాహ్యే, ఖే తద్వ్యోమ తథా స్థితమ్ ॥
జ్ఞానస్వరూపుడగు పరమాత్మయందు జ్ఞాన రూపములే అయినట్టి అనేక జగత్తులు మృగతృష్ణా జలతరంగాలలాగా భాసిస్తున్నాయి. వాస్తవానికి ‘బాహ్యము' అనునదీ లేదు. 'బాహ్యమందలి జగత్తు' అనబడునదీ లేదు. ఇదంతా కూడా "చిదాకాశమే చిదాకాశమున” మట్టియందే మట్టి బొమ్మలు ఉన్నట్లుగా ఉన్నట్లగుచున్నది. ఎండమావులలో జలం ఉన్నదా? లేదు. మరి జలం ఎందుకు కనిపిస్తోంది? దానికి కారణమంటూ ఏదీ లేకపోయినప్పటికీ చూచేవాని యొక్క అంతః కరణము నందు గల దాహబుద్ధియే (లేక) దృశ్యబుద్ధియే అట్లా ఎడారిలోని మృగతృష్ణయందు జలభ్రాంతిని వీక్షింపజేస్తోంది కదా!
అట్లాగే... బ్రహ్మమునందు వాస్తవానికి 'జగత్తు' అనబడునదేదీ లేదు. అయితే ఆత్మయే నిష్కారణంగా అజ్ఞానా వృతమైన సంవిత్ స్వభావం చేత ఈ జగద్భాంతిని గాంచుచున్నది. అ జగత్తు అనబడేది అసత్తే అయినప్పటికీ స్వప్ననగరం వలె, మనోరాజ్యం వలె, సంకల్ప దృశ్య పరంపర వలె హృదయమున వ్యాపించి ఉంటోంది.
ఈ జగత్తు “అద్దమునందు ప్రతిబింబించిన దృశ్యము” వంటిది.
Page:127
అద్దంలో ఏమీ లేకపోయినా అనేక వస్తువులు కనబడతాయికదా, బ్రహ్మమునందు జగత్తులు లేకపోయినప్పటికీ ఉన్నట్లే కనబడుచున్నాయి. వాస్తవానికి ఈ జగత్తుగా కనిపించేదంతా అసత్తే సుమా!
శ్రీరాముడు : మహాత్మా! ఎవరో కల్పించిన మాయా జగత్తు మా హృదయదర్పణంలో ప్రతిబింబించటం చేతనే కదా మేము అజ్ఞానంతో ఉంటున్నాం? ఇదంతా ఎందుకు జరుగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'జగత్ కల్పన'కు అధిష్ఠానమగు 'చిత్ శిల'లో 'జగత్భావన' ఉదయించినప్పుడే ఈ జగత్తును చిత్లాస్వరూపుడగు ఈ జీవుడు గాంచగలడు. 'కల్పన' అను తన ఒకానొక విభాగంలో ప్రవేశించిన తర్వాతనే జీవుడు జగత్తును పొందుచున్నాడని గ్రహించు. అట్టి కల్పనలో ఎవడు ప్రవేశించడో, అట్టివాడు 'జగత్తు' అనబడు దానికి పొందకయే ఉంటాడు. ఉదాహరణకు, మన ప్రక్కనే ఒకాయన నిదురిస్తూ ఏదో దీర్ఘమైన స్వప్నం కంటున్నాడనుకో! అతని చిత్తమునందు ప్రవేశించకుండా అతని స్వప్న విశేషములను మనం పొందజాలము కదా! అట్లాగే ఈ జీవుడు 'కల్పన' అనే బ్రహ్మదేవుని చిత్తము నందు ప్రవేశించిన తర్వాతయే ఈ జగత్తులను పొందుచూ జన్మజన్మాంతర పరంపరలను అవిశ్రాంతంగా పొందుచున్నాడని గ్రహించు.
సర్వదా సర్వత్రా మూడు దృష్టులు పాల్గొనుచున్నాయని ఇక్కడ గమనించు.
1.) ఆధిభౌతిక దృష్టి (స్థూల దృష్టి) : ఇట్టి ఆధిభౌతిక దృష్టికి పదార్థాజాలం మాత్రమే కనబడు తుంది. ఏ లోకాలోక పర్వత శిలపై నాకు ఏ బ్రహ్మాండం కనిపించిందో... ఆధిభౌతిక దృష్టికి అది కేవలం ‘లోకాలోక పర్వతంపై గల ఒక శిల"గా మాత్రమే కనబడగలదు. స్థూలదేహం తాదాత్మ్యంతో దర్శించేవారికి స్థూల విషయాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
2.) అతివాహిక దృష్టి (సూక్ష్మదృష్టి) : అతివాహిక దేహంతో పరమబోధ దృష్టితో చూచినప్పుడు నాకు ఆ లోకాలోకపర్వత శిలలో బ్రహ్మాండము అగుపించింది. అయితే నాకు కనిపించిన ఆ బ్రహ్మాండ సృష్టి అంతా కూడా అనేక జగద్విశేషములతో నాకు కనిపించనప్పటికీ, ఆత్మజ్ఞానులగు యోగుల దృష్టికి అదంతాకూడా నిర్మలపరమాత్మ రూపమే అగుచున్నది.
3.) ఆత్మజ్ఞాన దృష్టి (పర దృష్టి) : జ్ఞాన దృష్టిచే ఈ జగత్తంతా కూడా సర్వత్రా నిర్వాణరూపమగు బ్రహ్మం గానే కన్పట్టుచున్నది. అట్టి దృష్టి లేనివారికి అట్లు అగుపించటం లేదు.
ఇక్కడ ఒక విశేషంఈ మూడింటిలో ఎవరిలో ఏ దృష్టి అత్యధికంగా ఉంటుందో వారికి ఆ రీతిగా ఈ జగత్తు అగుపిస్తోంది.
యత్ పశ్యత్యవదాతా ధీః సో ఉపపత్తి విచారణా ।
న తత్ నేత్రైః త్రిభిః శర్వో, న ఇంద్రో నేత్రశతైరపి ॥
ఉపపత్తి, విచారణ సహితమైన శుద్ధ బుద్ధి దేనిని గాంచుచున్నదో అద్దానిని మూడు కనులు గల శివుడుగాని, నూరుకళ్ళు గల ఇంద్రుడుగాని గాంచజాలరు సుమా!
Page:128
శ్రీ వసిష్ఠ మహర్షి : "ఆకాశంలాగానే పృథ్వి కూడా అనేక సృష్టులతో పూర్ణమైయున్నది కదా!” అని నేను యోగ దృష్టితో గమనించాను. అప్పుడు పృథ్వి యొక్క 'ధారణ' తో కూడిన 'ధ్యాత' ను అయ్యాను. పృథ్వి యొక్క సర్వ సూక్ష్మ స్థూల తత్త్వములు నా స్వరూపమునకు అభిన్నమైనవేనను అనుభవం కలిగినవాడనయ్యాను.
శ్రీరాముడు :“నేను పృథ్వితత్త్వ స్వరూపుడుగా (పృథ్వీధ్యాతగా) అయ్యాను" అని మీరు అంటున్నారు కదా! అనగా “నేను వసిష్ఠుడను” అను దేహ-భౌతికానుభూతిని త్యజించి పృథ్వీరస స్వరూపులైనారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : లేదు. ఒక చక్రవర్తి తన దేహంలో అహంభావాన్ని త్యజించకయే “ఈ సమస్త భూమండలము నా సామ్రాజ్యమే కదా!”... అను మమత్వం ధరించి ఉంటాడు చూచావా? అట్లాగే నా చిత్స్వరూపాన్ని గ్రహించి ఉండియే పృథ్వి యొక్క అహంభావంచే పృథ్వి రూపధారిని అయినాను. అట్టి పృథ్వి యొక్క ధారణచే పృథ్వి అభిమానినయ్యాను. అనగా అట్టి పృద్వీ అవ్యభిమాన సమన్విత మైన బుద్ధితో తాదాత్మ్యం చెందినవాడనై ద్వీప-పర్వత-తృణ వృక్షాదులన్నీ నా శరీరమే అయి ఉన్నట్లు అనుభూతిని పొందాను. వివిధ వృక్షాలతో, పలురత్నాలతో, నగర-గ్రామ-అరణ్య-పర్వత ప్రాంతాలతో, ద్వీప-పర్వత-తృణ వృక్షాదులన్నీ నా శరీరమే అయి ఉన్నట్లు అనుభూతిని పొందాను. వివిధ వృక్షములతో, పలు రత్నములతో, నగర-గ్రామ-అరణ్య-పర్వత ప్రాంతాలతో, ద్వీప-సముద్ర వివిధ జీవులతో, ప్రాణ-అపాన సంచారములతో, దశదిక్కులతో కూడిన పృథ్వియే నా దేహంగా అనుభవం పొందాను. సర్వ జీవరాసులలోని చైతన్యమే నా నిజ చైతన్యంగా అనుభవమై ఈ పృథ్వి అంతా నా శరీరంగా నాకు గ్రాహ్యం కాసాగింది. నదీ నద-వన-సముద్ర-పర్వత-స్థాణువుల తోను, ప్రాణుల భోగ్య పదార్థములతోను, స్థూల-ఎడారులతోను వ్యాప్తమైన భూతలరూపం పొందిన వాడనై “భూదేవత” అని చెప్పబడేది నేనే అయ్యాను. అప్పుడు కూడా చిదానందస్వరూపుడనగు నేను యథాతథంగానే ఉండి ఉన్నాను. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాను సుమా!
అట్లు భూతల రూపమును పొందినట్టి నేను తదంతర్గతంగా ఏ ఏ విశేష స్థితులను అనుభవించానో,... విను. ఇవన్నీ నాయందు నేనే నా దృశ్యజగత్ శరీరంలో పొందసాగాను!
ఒకచోట స్త్రీలు నృత్య-గాన-జానపదగీతాలు ఆలపిస్తూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. మరొక చోట మరికొందరు స్త్రీలు పతీ-పుత్రాదుల మరణమును చూచి అతిదీనంగా శబ్దాలు చేస్తూ ఏడ్చుచున్నారు. ఒకచోట జనులు గొప్ప క్షామంచే పీడింపబడుచూ దీనాలాపనలు చేస్తున్నారు. మరొక చోట జనులు ఉత్సవ వేడుకలలో మునిగి - తేలుచున్నారు. ఒకచోట ఉత్తమ స్నేహయుక్తులై సరస సల్లాపములు ఆడుకొనుచున్నారు.
Page:129
ఇంకొక చోట ఒకరినొకరు వేధించుకోవటం, బాధించుకోవటం, హింసించుకోవటం జరుగుచుండుటచే ఆ వాతావరణం ఆవేశము, భయము-దుఃఖములతో నిండిపోయి ఉన్నది.
నా యొక్క భూతత్వాభిమానత్వం వలన అవన్నీ నేనే పొందుచున్నవాడిని కాసాగాను.
ఇంకా...
ఒకచోట “అగ్ని” దీపశిఖలుగా ప్రకాశించుచు ఆ ప్రదేశమంతా పండుగలాగా శోభింప జేస్తోంది. మరొకచోట ఆ అగ్ని యొక్క మహాదాహముచే దేహములు-గృహాలు దగ్ధం అయిపోతు న్నాయి. ఒకచోట తాటాకజలంలో జనులు స్నానాలు చేస్తూ సేదతీర్చుకొంటున్నారు. మరొకచోట జలప్రవాహంచే గ్రామాలు గ్రామాలు మునిగి-కొట్టుకుపోతూ ఉంటే జనుల హాహాకారాలు మిన్నుముట్టుచున్నాయి.
ఒకచోట వివేకియగు రాజు యొక్క పాలనలో ప్రజలు ప్రశాంతంగా, హాయిగా రోజులు గడుపు చున్నారు. ఇంకొకచోట సామంతరాజులు ఇళ్ళపై బడి కొల్లగొట్టుచుండగా తమ మానప్రాణ-ధనాదులకు రక్షణలేక, ప్రజలు భయవిహ్వలు లగుచున్నారు.
కొన్నిచోట్ల ప్రచండ రాక్షస పిశాచాదులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంకొక చోట జల సమృద్ధిచే పంటలు పచ్చదనంతో రమణీయంగా క్షేత్రములుగా ఒప్పుచున్నాయి.
ఒకచోట పిల్లగాలులచే మేఘాలు నృత్య భంగిమగా కదల్చబడుచుండగా ఆ వాతావరణంలో జనులు అత్యంత ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నారు. ఇంకొకచోట ప్రచండవాయువులచే మేఘములు కదలుచుండగా, పిడుగులు నేలరాలుచూ జనులను భయంకంపితులను చేస్తున్నాయి.
ఒకచోట సర్వాలంకారయుక్తంగా గృహములు ప్రకాశిస్తూ ఉంటే, మరొకచోట పడిపోతున్న గోడలను పట్టించుకునే నాథుడు లేక వెలవెలబోతున్నాయి.
ఒకచోట యుద్ధ నినాదాలు. మరొక చోట సుఖ-శాంత జీవన స్రవంతి. ఒకచోట వాయు ఝంకారాలు మరొక చోట ప్రశాంత వీచికలు. ఒకచోట శవాలు కాలుతున్నాయి. మరొకచోట నేల మరుభూమిగా అయి బూడిదచే కప్పబడి ఉన్నది. ఒకచోట కీటకము వంటి జీవులు అనేక దుఃఖములు-వేదనలు అనుభవిస్తూ నా యొక్క ఉనికి గుర్తించి "ఓ పరమాత్మా! వసిష్ఠ మునీంద్రా! మమ్ములను కాపాడండి! మేము ఈ దుఃఖ భారములను మోయలేం!".... అని ఆక్రందనలు సలుపుచుండటం వినిపిస్తోంది. ఒకచోట వటవృక్షం మొదలైనవాటి కొమ్మలు నేల మీదికి ఉండటం చేత అక్కడి నేలపై అనేక ఫలములు వ్రాలి కుళ్ళిపోతున్నాయి. మరొకచోట ఒక్క ఫలము రాలితే చాలు, అనేకమంది జీవులు దానిని భక్షించటానికి పరుగులు తీస్తున్నారు. ఒకచోట ఎండవేడిమికి నేల నుండి సెగలు వస్తున్నాయి. మరొకచోట దట్టమైన వృక్షములు అడ్డగించుటచే సూర్యకిరణములు నేలను తాకలేకపోతున్నాయి. ఒకచోట గజముల యొక్క దంతముల ఒరిపిడికి మహా వృక్షములు శిథిలావస్థను పొంది ఏ క్షణమైనా నేలకూలటానికి సిద్ధంగా ఉన్నాయి.
ఒకచోట జనులు అనేక లౌకిక-రాజకీయ-ఆర్థిక వ్యవహారములలో మునిగి తేలుచున్నారు.
Page:130
అట్లు మునిగి తేలుతున్నట్లు కనిపిస్తూనే వారిలో కొందరు అంతరంగమున విషయములకు అతీతమైన ఆత్మతత్త్వమును అనుభవిస్తూ అంతా ఒక లీలగా, క్రీడగా, మాయగా, స్వప్నతుల్యంగా, భావ చమత్కార మాత్రంగా, అసత్యంగా దర్శిస్తున్నారు.
వేరేచోట కొందరు నేత్రములు మూసుకొని సూక్ష్మమగు ఆత్మతత్త్వమును ఆస్వాదిస్తూ ఆనందపరవశులై ఉంటున్నారు. ఒకచోట ఈగలు, దోమలు ముసురుతూ మృష్టాన్నం లభిస్తున్నందుకు సంతోషిస్తూ ఉంటే, ఆ ప్రదేశమును ఏహ్యతతో మరి కొందరు జీవులు దర్శిస్తున్నారు.
కొన్ని దుష్ట భ్రమరములు (తుమ్మెదలు) ఏనుగు దేహమును బాధిస్తూ ఉండగా, ఆ ఏనుగు తొండముతో తుమ్మెదలను పారత్రోలుతూ యాతనపడుతూ ఉంటే, అది చూచి ఆ తుమ్మెదలు ఏదో 'ఆట'ను చూచినట్లు ఆనందిస్తున్నాయి.
ఒకచోట కమలము సరస్సులో ఉండి పరవశంతో సువాసనలు వెదజల్లుతూ ఉంటే.... ప్రక్కనే కొద్ది క్షణముల వరకు గర్విస్తూ నిలిచిన మరొక కమలం ఏనుగు యొక్క దుష్ట క్రియచే పెకలించబడి ఒడ్డున ఎండకు ఎండి వడలుతూ కనిపిస్తోంది.
ఒక చోట క్రిమికీటకములు జనిస్తున్నాయి. మడొకచోట నాశనం పొందుచున్నాయి. ఒక చోట వర్షపుజల్లుకు విత్తనములు అంకురిస్తూ ఉండగా, మరొక చోట నీరు లభించక ఆ విత్తులు ఎండి వడలుచున్నాయి.
ఓ రామచంద్రా! ఈ విధంగా నా యొక్క భూతత్త్వధారణా క్రమంలో అనేక పరస్పర అనుకూల వ్యతిరిక్తాలగు వ్యవహార సరళితో కొనసాతూండటం నాకు అనుభవం కాసాగింది.
శ్రీరాముడు : గురువర్యా! జగత్తులను గాంచుట కొరకై మీరు పృథ్వి యొక్క ధారణను అనుసంధించారు కదా! అనగా మీరు ఆ సమయంలో ఈ కనిపించే భూలోకాంతర్గత భౌతిక స్వరూపములుగా అయ్యారా? లేక మానసిక అనుభవ మాత్రంగా పొందారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ మృత్తిక (మట్టితో కూడిన) పాషాణమయమగు విశాల రూపంగా పొందినదంతా కూడా కల్పన! నా దృష్టిచే మనోమాత్ర వికారమే! అందుచేత అదంతా మానసికమేనని అనవచ్చు. అయితే తత్త్వదృష్టిచే (లేక) వాస్తవ దృష్టిచే చూస్తే నేను నేనుగా యథాతథంగానే సర్వతా ఉండనే ఉన్నాను. కాబట్టి.... నేను మృత్తికారూపమూ పొందలేదు,... మనస్సు రూపమూ పొందకయే ఉన్నాను. చమత్కారమైన ఒక నిత్యసత్య రహస్యం ప్రతిపాదిస్తున్నాను. విను.
అమానసం మహీపీఠం న సంభవతి కించన ।
యత్ అసద్వేత్సి యత్ సత్వా, మనో మాత్రకమేవ తత్ ॥
Page:131
మనస్సుకు భిన్నంగా ‘భూతలము’ అనబడేదేది ఎవ్వరికీ, ఎప్పుడూ సంభవించుటయే లేదు. ఓ రాఘవా! సత్తు కావచ్చు, అసత్తు కావచ్చు-ఏదైనా సరే... ఎప్పుడైనా, ఎక్కడైనా ఎవరిచేతనైనా, పొందబడుచున్నదంతా కూడా మనోమాత్రమే అయి ఉన్నది.
శ్రీరాముడు : స్వామీ! "నేను యథాతథంగా ఉంటూనే,.. కల్పనా దృష్టిచే భౌతిక జగత్తుగా అయ్యాను” అని అంటున్నారు కదా! అసలు మీరెవరు? మీ అసలు స్వరూపమేమిటి? ఈ వసిష్ఠ నామధేయ రూపమే మీ అసలైన రూపమా? లేక బ్రహ్మాండముల మధ్య సంచారం చేయుచు మహా ప్రళయమునకు కూడా సాక్షిరూపమగు వేరొక రూపమేదైనా ఉన్నదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి నేను శుద్ద చిదాకాశరూపుడను, నేనే కాదు. నేను నీవు తదితరులలో ప్రతిఒక్కరూ కూడా! అట్టి శుద్ధ చిద్రూపుడనగు నేను ఒకానొకప్పుడు 'స్ఫురణ’ను కలిగి ఉండటం జరుగుతోంది. నా యొక్క స్ఫురణమేది కలదో,.. అదియే 'సంకల్పము' అనబడుతోంది.
అట్టి చిదాత్మ యొక్క స్ఫురణయే మనస్సు కూడా! అదియే భూతలం-అదియే జగత్తు! అదియే నీవు చూస్తున్న ఈ భౌతికదేహం కూడా! అదియే బ్రహ్మదేవుడు. ఊహాలోకంలో నగరాలు కనిపించునట్లు,... చిదాకాశంలో మానసికాకాశం సంకల్ప నగరం వలె స్ఫురించుచున్నది.
ఓ రామచంద్రా! ఈ విధంగా ఈ భూమండలం నా యొక్క సంకల్ప మాత్రము, మనో మయము అయి, నా యొక్క ధారణభ్యాసముచే నాకు పరిపుష్ఠం అగుచున్నది.
ఓ ప్రియ జనులారా! ఈ భూమండలం మీకు ఏఏ విధంగా కనిపిస్తోందో,... అదంతా వాస్తవం కాదు. మరి? ఎవరెవరికి ఎట్లెట్లు అనుభవ మగుచున్నదో అదంతా మనస్సు యొక్క స్వయంకృత మైన కల్పనా చమత్కారమే సుమా! ఈ విధంగా ఈ జగత్తంతా కూడా “నిర్విషయమైనట్టి చిదాకాశము యొక్క స్ఫురణ మాత్రమే”... అయి ఉన్నది.
వాస్తవానికి చిదాకాశమే అయి ఉండినప్పటికీ, ఈ జగత్తు స్థూలరూపంగా అనుభవసిద్ధ మగుచున్నది. స్వప్నంలో విశాల భూమి కనబడినప్పటికీ అదంతా తన స్వప్నత్వమును త్యజింపకయే ఆ రూపంగా ఉంటోంది కదా!
అలాగే జాగ్రత్లో గాంచబడుచున్న ఈ పృథ్వి మొదలైనవి 'ఇదం' అనే ప్రత్యయార్థము అయిన దృశ్య ప్రతీతికి విషయము అయి ఉండికూడా ఇది తన మానసిక రూపత్వము త్యజించటమే లేదు. ఆకాశములో బాల్యమునుండి నీలత్వము చూస్తున్నాం. ఆకాశము శూన్యస్వరూపమే కదా! ఎట్టి పదార్థము కలిగి ఉండకపోయినప్పటికీ ఆకాశం నీలంగా ఎందుకు కనబడుతోంది? చిరకాలం అభ్యాసవశం చేత. అట్లాగే, అభ్యాసవశం చేతనే మట్టి గోడను మట్టిగా కాకుండా గోడగాను, ఇనుప కత్తిని ఇనుముగా కాకుండా కత్తిగాను, బంగారపు కత్తిని కత్తిగా కాకుండా బంగారంగాను చూడటం జరుగుతోంది. ఏదైనా ఒక వస్తువును చూస్తున్నప్పుడు,.. ఆ వస్తువు యొక్క దైనందిన ప్రయోజనమును దృష్టిలో ఉంచుకునియే చూడటం అభ్యాసవశంగా, జరుగుతుంది గాని, ఆ వస్తువును యథాతథంగా చూడటం సామాన్యంగా జరగకపోవటం ప్రతి ఒక్కరి యొక్క అనుభవమే!
Page:132
ఇదం స్థిరం సుకఠినం వితతం భూమి మండలమ్ ।
‘అస్థి’ ఇతి జాయతే బుద్ధిః, వ్యోమ్నీవ చిరవేదనాత్ ॥
ఆకాశం యొక్క నీలత్వం మొదలైనవాటివలె చిరకాలమైన అభ్యాసం చేతనే ఈ ఎదురుగా కనబడుచున్న జగత్తు "స్థిరంగా అతి కఠినంగా, సువిశాలంగా”... ఉన్నదాని వలె కనిపిస్తోంది.
అయితే శ్రుతి వాక్యములు ఈ జగత్తు గురించి మరొక విధంగా ప్రతిపాదిస్తున్నాయి. (ఉదా: “వాచారంభమ్-వికారో నామధేయమ్ మాట్లాడుకోవటానికి ఇక్కడ అనేక నామరూప విషయాత్మక విశేషాలు కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది మొదలే లేదు” ఇత్యాది వాక్యాలు). కనుక అజ్ఞానుల అనుభవానికి ప్రసిద్ధమై తోచే ఈ భూతలం, ఇందలి వస్తుజాలం మొదలైనవి వాస్తవానికి విజ్ఞుల దృష్టిలో లేకయే ఉన్నాయి. మరి? మనస్సు యొక్క సూక్ష్మ రూపమే జగత్తుగా మనస్సుచే పొందబడుచున్నదని గ్రహించు. ఆదిసృష్టి మనోమయమే అయి ఉన్నది. అట్టి మనోమయమగు 'ఆదిసృష్టి' యొక్క "ఆద్యము-మనోనిర్మితము-ఏకము” అయినట్టి ఏ సూక్ష్మరూపం కలదో,... ఆ సూక్ష్మరూపమే ఈ విధంగా స్థూలత్వము పొందియున్నది.
దృష్టాంతానికి 'స్వప్నం’ తీసుకుందాం. స్వప్నంలో మొట్టమొదటిది అగు స్వప్నచైతన్యమే (స్వప్న స్ఫూర్తియే) స్వప్న నగరముల రూపంగా భాసిస్తోంది కదా! సృష్ట్యాదియందలి మనోచైతన్యమే ఈ విధంగా జగద్రూపంగా స్థితి పొంది ఉంటోంది. ఓ రామచంద్రా! ఈ కనిపించే భూ-స్వర్గపాతాళలోకాలు, ఈ కనకబడే సమస్త దృశ్యమూ కూడా ఎల్లవేళలా 'చిద్రూపము' అనే పిల్లవాని యొక్క మనోరాజ్యము - అని గ్రహించు.
శ్రీరాముడు : స్వామీ! చిద్రూపము సదా స్వయముగా నిర్మలము-నిర్విషయము అయి ఉండగా అద్దానికి ఈ 'దృశ్యము' అనబడు మానసికమైన వ్యవహారం, ఆ తర్వాత దృశ్యాంతర్గత అనుభవ పరంపరలు, దేహ-దేహాంతరం ఎచ్చటి నుండి ఎందుచేత ఎట్లా ప్రాప్తిస్తున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "నిర్మలము-విషయరహితము" అగు చిద్రూపము నుండి ‘సంకల్పము’ అనే ఒకానొక చైతన్యతత్త్వము అనిర్వచనీయ కారణంగా బయల్వెడలుతోంది. అయితే నిశ్చల జలంలో చంచల తరంగత్వము బయల్వెడలుచున్నప్పటికీ... ఆ తరంగములు జలముకంటే వేఱ? కాదు. అట్లాగే చిద్రూపమగు ఆత్మయొక్క 'సంకల్పము' అనునది ఆత్మ చైతన్యము కంటే భిన్నంకాదు. ఈ జగత్తు అనబడేది అట్టి 'సంకల్పము’ యొక్క ప్రయోజనమే అయి ఉన్నది. అనగా ఈ జగత్తు అనబడేది సంకల్పమయం మాత్రమే!
వాస్తవానికి ఈ జగత్తు సంకల్ప నిర్మితమే అయి ఉండటంచేత ఇది జగత్తుగా వాస్తవం కాదు. సత్యము కాదు. ఆకారయుతం కూడా కాదు. ఇది ప్రకాశమానము (తెలియబడుటకు విషయమై ఉన్నది) కాదు. మరి ఈ దృశ్యము ఎందుకు ఎట్లా ఉంటోందంటావా?
దృశ్యమస్తి అపరిజ్ఞాతం, పరిజ్ఞాతం న విద్యతే ।
పరిజ్ఞాతం తదేవ అస్య శృణోషి యదిదం చిరమ్ ॥
Page:133
చిన్మాత్రమగు ఆత్మ గురించిన అజ్ఞానముచేతనే ఈ జగత్తు (అజ్ఞాత దృష్టికి) ఉన్నట్లుగా అనిపిస్తోంది. నా నుండి నీవు ఆత్మ జ్ఞానమును వింటున్నావు కదా! అట్టి జ్ఞానముచే "ఈ కనబడేదంతా చిద్రూపమే”... అని గ్రహించబడుచున్నది. ఈ భూమండలం-ఆకాశం-నక్షత్రాలు – తదితర లోకాలు మొదలైన దృశ్య మంతా "అద్వైతము-ఏకము-శాంతము" అగు చిన్మాత్రమే... తనయందు తాను ఈ రీతిగా స్ఫురిస్తోంది" - అని గ్రహించాలి సుమా! "దీనికి కారణం ఎవరు?” అని సభికులెవరైనా అనుమానిస్తారేమో! అందుకే చెప్పుచున్నాను. ధగధగాయమానమైన ఒక మణి ఉన్నదనుకో, అది ఎఱుపు-తెలుపు నలుపు కాంతి పుంజములను స్వభావ సిద్ధంగా వ్యక్తీకరిస్తోంది కదా! అట్లాగే చిదాకాశముకూడా స్వభావసిద్ధంగా ఈ 'జగత్తు' అనే ప్రదర్శనమును వ్యక్తీకరిస్తోంది. వాస్తవానికి చిదాకాశము యథాతథంగానే ఉన్నది. గాలి గాలిగానే ఉండి తనయందు తరంగములను, వాయుగుండములను వ్యక్తీకరించటం లేదా! ఇదీ అట్టిదే!
వాస్తవానికి పరమాత్మ ఏమియు చేయటంలేదు. యథాతథమయ్యే ఉంటున్నారు. తన యొక్క చిన్మాత్రస్వరూపమును త్యజించటమే లేదు. వాయువు తరంగత్వం ప్రదర్శించేటప్పుడు తన యొక్క వాయుత్వం కోల్పోతోందా? లేదే! పైగా, 'తరంగత్వం' అనునది వాయువు యొక్క స్వభావమే అయి ఉన్నదికదా!
కాబట్టి, సూక్ష్మమగు 'మానసిక రూపం' గాని, స్థూలమగు 'భూతల రూపం' గాని యథార్థానికి లేవు. అవి దృష్టి యొక్క దర్శనాచమత్కృతులే సుమా! దృష్టి ఆత్మ నుండి బయల్వెడలుచూ, ఆత్మకు అభిన్నమైయున్నది.
ఆకాశం రూపరహితం. కానీ, ఒక దిక్కువైపుగల ఆకాశమును చూస్తే, ఆ ఆకాశం అర్ధ చంద్రాకార రూపయుక్తంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే... చిదాకాశమే భూతల రూపంగా నిరంతరం కనిపిస్తూ ఉంటోంది. నిర్మల చిత్ ఏ స్వభావమాత్ర స్ఫురణ కలిగి ఉంటోందో... ఆ స్ఫురణమే అతి నిర్మలమగు భూమండలంగా కనిపిస్తోంది. కాబట్టి చిదాకాశమే ఇట్లు భేదరూపంగా అజ్ఞానంచేత కనిపిస్తోంది అని అనక తప్పదు. ఓ రామచంద్రా! ఈ కనబడే భూమి, ఆధార రహితంగా ఉంటున్న భూమండలము ఈ రెండూ కూడా స్వప్నపురంలాగా మహా చైతన్యం యొక్క స్ఫురణ (లేక) వివర్త రూపము మాత్రమేనయ్యా! ఇదీ చిదాకాశమే! నిరాధారమగు అదీ చిదాకాశమే! అజ్ఞానం చేతనే ఇవి భాసిస్తున్నాయి. జ్ఞానము చేతనో ఇది గాని, అదిగాని ఎచ్చటా లేనేలేవు.
కాబట్టి... ఈ భూత-భవిష్యత్ వర్తమాన కాలములందలి ముల్లోకములలోని సర్వప్రాణికోట్ల యొక్క స్థితి స్వప్నజగత్తు వలె, ఊహా సంకల్పనిర్మిత-నగరము వలె భ్రాంతి మాత్రమే అయి ఉన్నది. అదంతా కూడా 'మనో రాజ్యదశ' వంటిది. అవన్నీ కూడా ఆత్మ సత్తా-అధిష్ఠాన సత్తా రూపములే అయి ఉన్నాయి. అనేక తరంగాలకు జలమునకు భేదమెక్కడిది?
అందుచేత రామచంద్రా! నేను ఇతఃపూర్వం చెప్పిన జగత్తులను ధారణ చేస్తున్నప్పుడు “ఈ జగత్తులు ఇందలి సమస్త పదార్థములు నేనే" అను ధారణను వహించినవాడనై వాటినన్నిటినీ నా స్వరూపములుగానే గాంచాను, అనుభవించాను.
Page:134
తత్సమయంలో నిర్వికారమగు ఆత్మయే స్వరూపముగా కలిగినవాడనై ఉన్నాను కూడా!
ఓ ప్రియ రాఘవా! “జనన మరణ రహితము-చిన్మాత్రము” అగు పరమాత్మ తత్త్వమే... అజ్ఞాన దశయందు... తనయొక్క 'శుద్ధాత్మరూపము'ను త్యజించకుండానే... ఈ అనేక భేదములతో కూడిన యథాస్థితమగు చరాచర ప్రపంచమును... 'సద్రూపము' వలె... ధరించుచున్నది. కానీ, జ్ఞానదశయందు అట్లేమీ ధరించకయే ఉన్నది.
శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ! మీరు ఇప్పుడేమో జగత్తు యొక్క ‘ధారణ’ చేస్తూ ప్రేమద్వేషం, సంతోషం-విషాదం, సుఖం-దుఃఖం వంటి ఆయా మానసిక స్థితులన్నీ మీవిగా ధారణచేస్తూ మీ భౌతిక జగత్స్వరూపాన్ని మీరే అనుభవిస్తున్నారని చెప్పారు కదా! ఇంతకు ముందు మీరు లోకాలోక పర్వతంపై గల గండశిలలోను, తదితర శిలలలోను, వృక్షములలోను, ఆకులలోను కూడా అనేక అసంఖ్యాక బ్రహ్మాండాలను చూచానని చెప్పారు. ధారణాదృష్టిచే జగత్తు పొందుచు న్నప్పుడు కూడా భూమండలంలోని ప్రతి వస్తువులోను అనేక బ్రహ్మాండాలు మీకు కనిపించాయా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఏ దృష్టితో చూస్తుంటే అవియే కనిపిస్తాయి. దృష్టియే సృష్టి సుమా! అందుచేత పృథ్వీధారణా దృష్టి యొక్క విశేషప్రసరణం చేత “అణువణువు అంతర్గత జగత్ సమూహ దృష్టి” అప్పటికి (పృథ్వి ధారణా దృష్టి సమయంలో) ప్రదర్శితమవటం లేదు.
నా యొక్క 'పృథ్విధారణ' అను చమత్కారంచే... జాగ్రదావస్థ యందలి భూమండల రూపమును, స్వప్నావస్థయందలి భూమండల రూపమును రెండింటినీ పొందసాగాను కదా! అట్లు పొందుచూ ‘ఈశ్వర సాక్షి' దృష్టిచే దేనిదేనిని ప్రత్యక్షంగా అనుభవించానో ఆ వివరాలు చెపుతాను.
ఆ లోకాలోక పర్వత శిలలో ఎట్లా బ్రహ్మాండములను అవలోకించానో, ఈ పృథ్వి మొదలైన వాటియందు కూడా అనేక జగత్సమూహములు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే రామచంద్రా! ‘జగత్రణ’చే నాకు ప్రాప్తించిన దృశ్యమైనా, ఈ వర్తమానంలో మనిద్దరికీ కనిపిస్తున్న దృశ్యమైనా (లేక) ఇదంతా ద్వైతమయంగా కనిపించవచ్చు గాక! అయినా కూడా ఇదంతా కూడా అద్వైతమగు ప్రశాంత పరమాత్మ స్వరూపమే అయిఉన్నది. ఎందుచేతనంటావా?...
జగన్తి సన్తి సర్వత్ర, సర్వత్ర బ్రహ్మ సంస్థితమ్ ।
సర్వం శూన్యం పరం శాంతం, సర్వమ్ ఆరంభమంన్థరమ్ ॥
ఇక్కడ సర్వత్రా జగత్తులూ ఉన్నాయి. అదే సమయంలో సర్వత్రా బ్రహ్మమే ఉన్నది. ఈ సర్వము దృశ్య శూన్యము-శాంతము అయి ఉన్నది. అదే తరుణంలో సర్వము దృశ్య సహితము, అనేక కార్యరంభములచే వ్యగ్రము కూడా అయి ఉన్నది.
Page:135
సర్వత్రైవ అస్తి పృథ్వ్యాధి, స్థూలం, తచ్చ న కించన ।
చిద్వ్యోమైన యథా స్వప్నపురం పరమజాతవత్ ॥
స్థూలములైన పృథ్వి మొదలైనవి అంతటా నిండి ఉన్నాయి. కానీ వాస్తవానికి అవేవీ లేనే లేవు. అవేవీ ఉత్పన్నమే అయి ఉండలేదు.
శ్రీరాముడు : ...!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. యథార్థంగా ఉత్పన్నమే అయి ఉండకపోయినప్పటికీ స్వప్న నగరంలో మనుష్యులు-భవనాలు అనుభవ విషయములుగా అగుచూ ఉండటం లేదా? ఇదీ అంతే! ఇంకొక చమత్కారం కూడా!
నేహనానాస్తి, నో నానా, న నాస్తిత్వం, నచాస్తితా
“అహమ్” ఇత్యేవ నైవాస్తియత్ర, తత్ర కుతో అస్థి కిమ్?
సముద్రంలో అసంఖ్యాక జలబిందువులు తరంగాలు లేస్తున్నాయి. ఇంతలోనే కనబడకుండా పోతున్నాయి. మహా సముద్రంలో ఒక తరంగానికి ఉనికి ఎక్కడ? ఉత్పత్తి ఎక్కడ? వినాశన మెక్కడ? జలమునకు వేరైనది మహాసముద్రంలో (తరంగరూపంగా) ఎక్కడ ఉనికిని పొందుతోంది? అట్లాగే, ఇక్కడ ఏకమూ లేదు, అనేకమూ లేదు. అస్తిత్వమూ లేదు, నాస్తిత్వమూ లేదు. ఆ ఏక - అనేకముల అభిమానియగు 'నేను' అనబడు అహంకారమే మొట్టమొదట లేదు. 'నేను' అనబడుదాని వాస్తవరూపం బ్రహ్మమే! ఇక అట్టి అహంకారమునకు (నేను-అనుదానికి) అనుభవమయ్యే తదితర విషయ సమూహముల గురించి మనం వేరుగా చెప్పుకునే దేమున్నది? ఘనీభూతమై అనుభవమగు చున్నప్పటికీ ఈ 'నేను' మొదలైన రూపములు వాస్తవానికి లేవు. ఒకవేళ ఉన్నాయని అనుకుంటే, అప్పుడు వాటియొక్క రూపం 'నిరామయము-అజము-అప్రమేయము అగు బ్రహ్మమే అయి ఉన్నది. సృష్టికి ముందు ఈ అహంకారము-జగత్తు మొదలైనవి చిదాకాశరూపమే అయి ఉన్నాయి. వాయు తరంగత్వానికి పూర్వం ఆ తరంగం వాయురూపమే అయి ఉన్నది కదా! సృష్టి యొక్క అనంతరం ఈ అహంకార జగత్తులు చిదాకాశరూపమే సంతరించుకోబోతున్నాయి. ఏదైతే మొట్టమొదట చిట్టచివర చిదాకాశమే అయి ఉండుచుండగా, ఇక మధ్యలో కనిపించేదంతా స్వప్న పురము వంటిది కాక మరేమిటి? స్వప్న చైతన్యంలోనుంచి స్వప్నదృశ్యం బయల్వెడలి తిరిగి అదంతా స్వప్నచైతన్యంలోనే లయం అగుచున్నట్లుగా... ఈ జాగ్రత్ చైతన్యంలోంచి సంకల్పరూపంగా బయల్వెడలిన అహంకార జగత్ అనుభవపరంపరంతా తిరిగి జాగ్రత్ చైతన్యంలోనే లయం కాబోవుచున్నది. కనుక అద్దాని యొక్క (అహంకారము-జగత్తుల)... 'ఉన్నది-లేదు' అనే ప్రసక్తి ఎక్కడిది? స్వప్నంలోని నగరం స్వప్నంలో ఉన్నవానికి ఉన్నది. ఆ స్వప్నము గురించి సంభాషించే మనకు లేదు. జగత్తు-అహంకారము అజ్ఞాన దృష్టికి కనబడుచున్నాయి. అత్మానుభవదృష్టికి స్వప్నతుల్యమగుచున్నాయి.
Page:136
పృథ్విధారణారూపిగా అయి ఆ విధంగా అనేక జగత్తులు వీక్షించాను కదా! ఆ తర్వాత జలరూపమును ధరించాను. అట్టి జలరూపధారణచే మరల అనేక జగత్తులు చూచాను. వాస్తవానికి ‘చిద్రూపుడను’ గానే ఉండి ఉన్నప్పటికీ జలరూపం పొంది 'సముద్రం' అనే మందిరంలో ప్రవేశించి 'గుల్-జల్' శబ్దముల ఉచ్చారణ చేశాను. తలలో పేను వసించునట్లుగా నేను చెట్లు-పూలుఆకులలో వాటి వాటి వలయాది ఆకారములలో రసరూపంగా విశ్రమించి కాలక్రమంగా పరిపుష్టమగు ఆకులలో నాడీ సమూహాన్ని రచించాను. జలంలోని రసరూపం ధరించిన నేను ఆ జలం త్రాగిన ప్రాణుల హృదయాలలో ప్రవేశించాను. వాత-పిత్తాది ధాతువులను స్పృశించాను. ఒకచోట వికలత్వం పొందాను. ఇంకొక చోట ఖండనం చేశాను. మంచు కణములను అధిరోహించి శయనించాను. ఒక్కొక్కసారి దీర్ఘమైన ప్రవాహంగా పయనించి, శ్రమించి ఆనకట్ట యొక్క స్పర్శచే విశ్రాంతి తీసుకున్నాను. అప్పుడప్పుడు నా యొక్క చైతన్య రూపమును మరచి ఆ ఆవర్తములలో అనేక భ్రమలకు లోనయ్యాను. “అందుకు ప్రాయశ్చిత్తార్థమా?” అన్నట్లుగా అక్కడక్కడ గోతులలోను, నూతుల ప్రక్కల పడి శిథిలమైపోయాను. పర్వత శిఖరాలపై నుండి క్రింది సెలయేరులోకి జారి పడి అనేక విభాగాలుగా చీలిపోయాను. అప్పుడప్పుడు ఆవిరిగా మారి ఆకాశంలో ప్రవేశించగా నక్షత్రములు నాకు మణిభూషణములుగా అయినట్లు కనిపించాయి. మేఘపీఠములలోంచి మరల విద్యుత్ స్పర్శచే జలబిందువులుగా మారి నేలకు చేరాను. జలస్వరూప ధారణచే నేను పిపిలీకము (చీమ) వంటి చిన్నచిన్న జీవుల సూక్ష్మనాడులలో కూడా ప్రవేశించి అక్కడి జలముతో ఏకం అయ్యాను. మధుర పానీయముల రూపం ధరించి జిహ్వ యొక్క పరమాణువులలో ప్రవేశించి జిహ్వకు ఉత్తమానుభవమును సాక్షాత్కరింపజేశాను. ఆ అనుభవమంతా జ్ఞానరూపమగు మనో బుద్ధులచే దర్శించాను కానీ... దేహ స్వరూపంగా కాదు. వాస్తవానికి, 'విషయం' (లేక) దృశ్యం అనేది ఆనంద రూపం కాదు. అందులో ఆత్మ సుఖం యొక్క లేశమైనా లభించదు. మనస్సే విషయం యొక్క రూపానికి ఆధారమై ఉన్నది. అయితే, ఈ మనస్సు ఎద్దానినైతే విషయరూపంగా ప్రకాశింపజేస్తోందో... అట్టిదంతా అసత్తున్ను, జీవులను వ్యామోహపరచేదీ అయి ఉన్నది. ఆత్మ మనస్సును స్వస్వరూపచమత్కారంగా సందర్శిస్తున్నప్పుడు మాత్రమే ఈ సర్వం ఆత్మానంద దరహాసమై అనుభవం కాగలదు.
❖
జలరూపినై నాయందలి 'నాచు' మొదలైన ఉచ్ఛిష్టములను తుమ్మెదలకు ఆహారంగా ఇచ్చి వేశాను. సర్వ ఋతువుల యొక్క రసరూపంగా గాలిలో ప్రవేశించి జలరూపంలో 14 విధములగు జీవుల అవయవముల సంధులలో ప్రవేశించి అక్కడ వసించాను. మరికొన్ని సమయములలో జలకణ రూపధారినయి వాయు తరంగములను అధిరోహించి నిర్మలాకాశమార్గంలో విహరిస్తూ జనులకు సుంగధ సుఖములను అందిస్తూ, ఆహ్లాదపరుస్తూ సంచారం చేశాను.
Page:137
ఓ రామచంద్రా! ఆ సమయంలో 'పరమాణువు' లో కూడా ప్రవేశించి, అందులో గల వివిధ జగత్తులను అనుభవించాను. వాస్తవానికి సమస్త పదార్థముల అభ్యంతరమును ఎరుగునట్టి “జ్ఞాత-చిద్రూపుడను” అయి ఉండి కూడా 'జలధారణ'చే అజ్ఞాతం వలె అనేక చోట్ల స్థితిని పొందాను. ఆయా చోట్ల అనేక కోట్ల బ్రహ్మాండాల ఆవిర్భావం, తిరోభావం కూడా కాకతాళీయంగా దర్శించటం జరిగింది.
ఈ ప్రకారంగా అనేక జగత్తులు చూచాను. కానీ, వాటి భావము- అభావము-సాకారమునిరాకారము ఇవన్నీ కూడా ఆకాశము కంటే అతి నిర్మలమగు చిదాకాశమే అయి ఉన్నాయి. ఓ రామచంద్రా! జాగ్రత్-స్వప్న సుషుప్తులనబడే అవస్థాత్రయం గాని, ఈ దేహ-ఇంద్రియ బాహ్యప్రపంచముగాని-ఇవన్నీ కూడా వాస్తవానికి ఆత్మ దృష్ట్యా ఒకింతైనా కూడా లేకయే ఉన్నాయి. ఆ ఆత్మ చైతన్యము దృశ్య స్వభావం కాదు, అదృశ్య స్వభావం కాదు. దృశ్యాదృశ్య స్వభావం కూడా కాదు. అది అఖండాకాశరూపమే అయి ఉన్నది.
తత్ త్వమ్ అసి! - అదియే నీవు. (తత్త్వమ్)
సోఽహమస్మి! తదితరమపి తదేవ! - నేను అదియే! తదితరులందరి రూపం అదియే!
కాబట్టి రామచంద్రా! “అఖండవాక్యార్థబోధ” చే సమస్త ద్వైతమును దాటివేయి. సర్వదా శుద్ధ చిదాకాశరూపుడవై ఉండు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా పృథ్వి రూపధారణ, జల రసరూప ధారణ నిర్వర్తించిన నేను తేజోరూపాన్ని ధరించి సంచరించనారంభించాను. “సూర్య-చంద్ర-నక్షత్రాల అవయవ యుక్తమగు తేజస్సే నేను” అను అనుభూతిని ఆశ్రయించి... అట్లే అయ్యాను. సత్వ ప్రధానుడనై సమస్త జగత్తునందు గల తేజము నేనే అయ్యాను. రాజుయొక్క కీర్తి అనేక గృహములలో కీర్తించబడునట్లు, అనేక ఇండ్లలోని దీపముల వెలుగునై గృహములలోని అనేక వస్తువులను ప్రకాశింపజేయసాగాను. సూర్యచంద్ర కిరణాలలో ప్రవేశించి అనేక జీవుల దృష్టిని పులకింప జేయసాగాను. పదార్థముల రూపాలను మరుగున పరిచి ఉంచే అంధకారాన్ని పటాపంచలు చేయసాగాను. సువర్ణంలోని మెఱుపురూపినయ్యాను. మాణిక్య ముత్యములలోని తేజోపుంజాలుగా అయ్యాను. ఆ నా తేజముచే పాతాళాది అధోలోకములను కొంచెం ప్రకాశింప జేశాను. అవి స్వతహాగా తమోలోకములు కదా! భూలోకమును సగం ప్రకాశింపజేశాను. సూర్య-చంద్ర-నక్షత్రదేహాది అనేక విషయములను ఇముడ్చుకొన్న తేజో మహాసముద్రమే నేనయ్యాను. ధాతువులలో లోహత్వము, మనుజాదులలో పరాక్రమము, రత్నాదులలో కాంతి, వర్షాదులలో విద్యుత్ప్రకాశము, నేత్రములలో దృశ్యత్వము, స్నేహత్వము, హాస్యత్వము, శృంగారత్వము-ఇవన్నీ తేజోరూపమే కాబట్టి వీటినన్నిటికీ కారణభూతుడనై ఉండసాగాను.
Page:138
అంతేకాకుండా యోధులందలి వీర్యత్వము, దేవతలందలి వరప్రదానత్వము, అసురులందలి దేవతా శత్రుత్వము, సర్వజీవులందలి బలము, స్థావరము లందలి ఉన్నత రూపత్వము-నా స్వరూపముగా అనుభవం పొందసాగాను. “అవన్నీ నావే... నేనే” ...అను అనుభూతిని పొందసాగాను. ఇంకా మరుభూమి (ఎడారి) లో నదులు (ఎండమావులు) కనిపించునట్లుగా “నేను సూర్య స్వరూపుడను" ... అనే అనుభవం ద్వారా దశదిక్కులలో నా కిరణాలతో వ్యాపించినవాడనై 'జగత్తు' అనే పక్షిని పట్టుకొనినవాడివలె అయ్యాను. చంద్రబింబమును కిరణస్పర్శచే ప్రకాశింపజేసి, తద్వారా వృక్షములకు రసస్ఫూర్తిని ప్రసాదించుచున్నవాడనై ప్రకాశించాను. ఆకాశమునందు నక్షత్ర స్వరూపుడనై జగత్తు అనే గ్రహానికి అలంకార రూపుడ నైనాను. సముద్ర గర్భంలోను, వర్తకుల త్రాసులలోనూ ప్రకాశించే రత్నముల కాంతిపుంజములు నేనయ్యాను. సముద్రగర్భంగా నా అగ్ని స్వరూపాన్ని చూచి భీతిల్లి పరిభ్రమిస్తున్న సముద్ర గర్భ (తిమింగలములు మొదలైన) జీవులను చూచి వినోదించాను. సూర్య కిరణ స్వరూపుడనై దేహధారుల దేహములను స్పర్శిస్తూ, పరవశం పొందాను. మేఘ-పర్వతాలలో ప్రవేశించి అక్కడక్కడ విద్యుత్-దావానల రూపం అనుభవించాను. అగ్నిరూపం పొంది కట్టెల నుజ్వలింపజేస్తూ సుందర దేహములను భస్మీభూతం చేశాను. యజ్ఞవాటికలో ప్రవేశించి హవిస్సులను మంత్ర ముగ్ధంగా దహింపజేశాను. కొన్ని గృహములను దహించి ఆ కుటుంబ సభ్యులను దుఃఖితులుగా చేశాను. మానవ-నాగ-గంధర్వ-అసుర స్త్రీల స్తనములపై ముత్యములలోని కాంతిపుంజములుగా తేలియాడాను. మిణుగుఱుపురుగు రూపం ధరించి స్త్రీల ముఖములను స్పర్శిస్తూ ఇంతలోనే బాటసారుల పాదప్రహారానికి గుఱి అయ్యాను. ఇట్లు అనేక ఉన్నత అవనత స్థితులను పొంద సాగాను. దేహగృహంలో దేవతా స్త్రీల సుందరదేహములను దర్శించాను. ఒకచోట జ్వాలారూపినై సువర్ణము–ఇనుము మొదలైన లోహములను ఖండనం చేయసాగాను. మరొకచోట కల్పాంతాగ్ని రూపం ధరించి ప్రళయ సమయంలో జగత్తును భస్మీభూతం చేసి ఆకాశమున మేఘరూపంతో కప్పివేశాను. మరొకచోట బడబాగ్ని రూపంలో సముద్ర జలమంతా త్రాగివేసి ఆ శూన్య ప్రదేశంలో నృత్యం చేశాను. అగ్నిరూపం ధరించి అనేక జీవరాశుల దేహాలను పొట్టన పెట్టుకున్నాను. ఇంకొక చోట లోహమును ఆశ్రయించి కమ్మరి యొక్క సమ్మెట ప్రహారములు స్వీకరిస్తూ అగ్ని కణముల రూపంలో నలువైపులా వెదజల్లబడ్డాను. మరొకచోట వజ్ర వైడూర్యాది రూపము ధరించి ఎక్కడో భూగర్భంలో ఉండిపోయి ఏ ప్రాణికీ కనబడకుండా యుగములు గడిపివేశాను.
శ్రీరాముడు : మానప్రదుడగు ఓ మునీంద్రా! ఇక్కడ నాదొక చిన్న సందేహం. తేజోరూపియై అనేక అనుభవములను పొందినట్టి మీరు సుఖమును అనుభవించారా? లేక దుఖమును పొందారా? ఈ విషయం బోధ కొరకై చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఒక మనుజుడు చేతనరూపుడే అయిఉండి కూడా గాఢ నిద్రాసమయంలో జడత్వమును పొందుచున్నాడు కదా! అట్లాగే చిదాకాశము అన్యమగు ఆయా స్వరూపాదులను అనుభవించటం జరుగుతోంది. ఎప్పుడైతే బ్రహ్మము తనను తాను 'పృథ్వి' మొదలైన రూపములుగా అనుభవించనారంభిస్తుందో.... ఆ మరుక్షణం సుషుప్తునివలె, జడునివలె తనయందు ఉంటుంది.
Page:139
అయినా కూడా బ్రహ్మము ఏ క్షణమందు కూడా మరొక స్థానం గాని, రూపంగాని పొందటంలేదు. అటువంటప్పుడు ఇక దానికి దుఃఖ ప్రసంగం ఎక్కడిది? వాస్తవానికి ఈ ఆకాశము-పృథ్వి-జలము-తేజస్సు మొదలైనవన్నీ అద్దాని సద్రూపములే గాని అసద్రూపములు కావు. బ్రహ్మము సర్వదా అవికారముగానే ఉంటోంది. అట్లా ఉంటూ, అయ్యది ద్రష్ట-దృశ్యములను ప్రకాశింపజేయుచు ప్రకాశించుచున్నది.
ఏతత్ సత్యపరిజ్ఞానం యస్య ఉత్పన్నమ్ అఖండితమ్ ।
న తస్య పంచభూతాని న దృశ్య - ద్రష్టృ విభ్రమః ॥
ఇట్టి సత్యమగు ‘అఖండజ్ఞానం' ఎవనికి ఉత్పన్నం అవుతుందో... వానికిక పంచభూతములు ఉండవు. ద్రష్ట-దృశ్యముల గురించిన భ్రమ ఉండదు.
కనుక రామచంద్రా! ఆ సమయంలో శుద్ధమగు బ్రహ్మరూపముచేతనే అదంతా నేను అనుభవించటం జరిగింది. ఎందుకంటావేమో? ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా అనుభవించబడాలంటే అయ్యది బ్రహ్మ స్వరూపం అయితేనే సాధ్యం. దృశ్యమంతా కూడా నాకు బ్రహ్మరూపంగానే కన్పట్టుచూ, బ్రహ్మానుభవంగానే అగుచున్నది. అట్లా కాకుండా ఎప్పుడైనా నన్ను నేను పంచ భూతాలుగానో, దేహము-శిల మొదలైన రూపముగానో గాంచటం జరిగిందే అనుకో! అప్పుడు? అప్పుడు నేను సర్వదా జడుడనే అవుతాను. జడమైనదానికి అనుభవమేమున్నది? స్మరణ ఎక్కడ నుండి వస్తుంది? కనుక ఓ సభికులారా! ‘అనుభవము' అనునది ఉన్న కారణంగా మీరంతా కూడా నా వలెనే బ్రహ్మమే స్వరూపంగా కలిగి ఉన్నారని గ్రహించండి. నావలె తత్త్వ సందర్శనం చేయగల సామర్థ్యం కలిగియే ఉన్నారు. అంతేగాని, ఈ దృశ్యత్వం - ద్రష్టత్వం అనేది వాస్తవం కాదు. అవన్నీ ఉన్నప్పుడు కూడా ఆత్మానుభవం నుండి చ్యుతి పొందకయే ఉండండి. అచ్యుతులై ప్రకాశించండి!
శ్రీరాముడు : స్వామీ! ఎక్కడ బ్రహ్మము ఉంటే అక్కడ 'అనుభవము' 'స్మరణ' ఉంటాయని అంటున్నారు కదా! గాఢనిద్రా స్థితిలో ఈ జీవునికి అనుభవము స్మరణలు ఉండవు కదా! అనగా ఈ జీవుడు జడత్వము సంతరించుకున్నట్లా? ఆ సమయంలో కూడా అతడు చైతన్యరూపమగు బ్రహ్మమేనని అనవచ్చునా? అనకూడదా?
శ్రీ వసిష్ఠ మహర్షి :
‘సుప్తోఽస్మి' ఇతి దృఢం భావం బుద్ధవాన్ చేతనోఽపిసన్ ।
నైద్రమేవైత్యలం జాడ్యం లసచ్చేతతి కిం చ న ॥
గాఢ నిద్రలో కూడా 'నేను నిద్రపోతున్నాను' అని మనం ఎఱుగుచున్నాం కదా! ఎఱుగు చున్నాం కాబట్టే మెలకువరాగానే “ఆహా! మంచి నిద్రపోయానండి" అని చెప్పగలుగుచున్నాం. అనగా నిద్రపోతున్నప్పుడు కూడా అప్పటి అజ్ఞానమును (ఈ జాగ్రతన్ను ఎఱుగుచున్నట్లే) స్వప్రకాశమగు ఆత్మ ఎఱుగుచునే ఉన్నది.
Page:140
ఎవడైతే జ్ఞానంచే ప్రబుద్ధుడు అవుతాడో... అతడు తన ఈ ఆధిభౌతిక దేహమును శమింప జేసుకున్నవాడై నిర్మల బోధరూపమగు సూక్ష్మ దేహమున ఉదయించినవాడు అగుచున్నాడు.
ఆ సూక్ష్మ దేహమును, 'అనురూప శరీరం' (లేక) 'మహచ్ఛరీరం' అని కూడా అంటున్నాం. అట్టి జ్ఞానమయమగు సూక్ష్మమైనట్టి అనురూప శరీరంచేత, (లేక) మహమచ్చరీరం చేత యోగి అగు జీవన్ముక్తుడు తన ఇచ్ఛానుసారంగా మెలగుచూ ఉంటాడు. బోధరూపమగు నిర్మల సూక్ష్మ దేహంచే అట్టి జీవుడు అభేద్యములైన శిలా గర్భంలో ప్రవేశించి మరల బయల్వెడలగలడు. ఇంకా పాతాళమునందలి ఆకాశమును కూడా పొందగలడు. అందుచేతనే నేను అప్పుడు అనంతముచిదాకాశ వాయువు-తేజము మొదలైన రూపాలన్నీ ధరించి అనుభవించాను. ఎందుకంటే చిత్స్వరూపమగు ఆత్మకు వజ్ర-శిల-పాతాళ ఆకాశ-స్వర్గాదులందు శీఘ్రంగా రాకపోకలు నిర్వర్తించ గలగటంలో అడ్డుపడగలిగినదేమున్నది? అయితే, ఆత్మ... బోధమాత్ర శరీరముచే జడపదార్థములందు ఎంత వరకు ఉంటుందో... అంత వరకు అట్టి రూపముతోటే స్థితి కలిగి ఉంటుంది. అది ఎప్పుడు తన ఇచ్ఛచే మరొక చోటికి వెళ్ళదలచుకుంటుందో... అచ్చట ‘చలనము’ మొదలైన క్రియాశ్రమ లేకుండానే అప్పటికప్పుడు వెలయగలదు. ఎందుకంటే ఆత్మకు గమన ఆగమనములు (పోక-రాకలు) కూడా 'స్థితి' వంటిదే! ఈ దేహములాగా “ఇక్కడికి రావటంఅక్కడికి పోవటం”... వంటివి కాదు.
బోధమాత్రం విదుర్దేహమ్ అతివాహికమ్ అవ్యయమ్ ।
ఇదానీం త్వం తమేవ ఇహ బుధో అనుభవసి స్వయమ్ ॥
బుద్ధిశాలివగు రామచంద్రా! బోధమాత్రమునే (నిర్విషయమగు ఎఱుక స్వరూపమునే) శాస్త్రములు అవ్యయమగు 'అతివాహిక దేహం' అని, 'సూక్ష్మ శరీరం' అని కూడా అంటున్నాయి. నీవు అనుకోవాలేగాని ఇచ్చటే, ఇప్పుడే అతివాహిక దేహం యొక్క ధారణలచే జగద్రూపమును (అనగా నీ యొక్క దేహము / రూపం ఈ జగత్తంతా అయినట్లు) నా వలెనే అనుభవం పొందగలవు. ఓ సభికులారా! ఓ తదితర ప్రియ ముక్షువులారా! మీలో ఎవరైతే 'నా యొక్క స్వరూపము సర్వదా ఈ దేహారంభ-దేహాంతములచే స్పర్శించబడని అప్రమేయ-కేవల సాక్షీ స్వరూపమే అయి ఉన్నది. అట్టి నా స్వరూపము విషయములకు, వృత్తులకు, ఇంద్రియ విశేషములకు సంబంధించనిది' అను అవగాహనచే సూక్ష్మ దేహము అను వాహనం ధరిస్తారో... అప్పుడిక నా వలెనే జగత్ స్వరూప ధారణ తప్పక సుసాధ్యమేనని గ్రహించి ఉండండి. మీరు తత్త్వజ్ఞులయ్యెదరు గాక! తత్త్వజ్ఞులు బోధచే “సూర్యాదులందు నేను కేవలం చిన్మాత్రాకాశ రూపుడనై ఉన్నాను" అని మొట్టమొదట గ్రహిస్తున్నారు. “నేను ఈ కనబడే సర్వ సహజీవులలోను చిన్మాత్రాకాశ రూపుడనై ఉండనే ఉన్నాను” ...అను అనుభవమును పుణికి పుచ్చుకుంటున్నారు. ఆ తర్వాత వారు తమ ఇచ్ఛచే సూర్యుడు మొదలైన సమస్త జగత్తును అస్తమింపజేసి అద్దానినంతా (తదితర సహజీవులందరితో సహా) 'కేవలీ ఆత్మత్వము’ తోటి స్థాపింపజేయుటలో శక్తులై ఉంటున్నారు. అప్పుడు ఈ జగత్తు ఇట్లే వారికీ విద్య మానమై ఉన్నప్పటికీ... ఇదంతా ద్రష్ట-దృశ్యరహితమగు ఆత్మ స్వరూపంగా అగుపించుచున్నది.
Page:141
శ్రీరాముడు : మహాత్మా! జ్ఞానికి ఈ జాగ్రత్ జగత్తు ఎట్లా కనిపిస్తుంది? అజ్ఞానికి ఎట్లా కనిపిస్తుంది? వేర్వేరుగానా? ఒక్కతీరుగానా?
శ్రీ వసిష్ఠ మహర్షి : మన స్నేహితుడొకడు మన ప్రక్కనే నిద్రిస్తూ స్వప్నం కంటున్నాడనుకో... మన యొక్క (జాగ్రత్) దృష్టికి ఆ మన నిదురిస్తూ స్వప్నం కంటున్నట్టి స్నేహితుని స్వప్నజగత్తు అసత్తుల్యమే కదా! అదంతా మన దృష్టిలో అజ్ఞానావృతమగుటచే "అసత్తు-శూన్యము-మెలకువగా ఉన్నవానికి అలభ్యము” అని మనకి అనిపిస్తుంది కదా! కాని ఆ స్వప్నద్రష్టకు స్వప్నం సత్యంగానే ఉంటోంది. అట్లాగే జ్ఞాని యొక్క దృష్టి యందు (అజ్ఞానికి) నానా విధములుగా, సత్యముగా నిత్యముగా కనిపించే ఈ జాగ్రత్ జగత్తు కేవలం అసత్తే అయి ఉన్నది. ఒకడు తన మనోరాజ్యములో కనిపించిన అగ్ని తన దేహమును స్పర్శిస్తున్నట్లుగా ఊహించు చున్నప్పటికీ, అతని భౌతిక దేహం ఆ ఊహాకల్పిత అగ్నిచే తాకబడక యథాతథంగా ఉంటుంది కదా! అట్లాగే కొంచెం ఇచ్ఛచేత నేను శిల- అగ్నివాయు జల పూర్వక ధారణ పొందుచున్నప్పటికీ... నాకేమి దుఃఖాదులు ఏమాత్రం కలుగనే లేదు. ఏ జీవుడైనా ఏది ఎట్లున్నప్పటికీ "నేను సర్వాత్మకము-నిత్య నిర్మలము-భావాతీతముత్రిగుణాతీతము అగు ఆత్మ స్వరూపుడను. తదితర జీవులు-జగత్తులు నా యొక్క విభూదియే, విభాగమే”... అను ఆత్మజ్ఞానమును సుస్థిరీకరించుకొని ఉంటాడో-ఇక ఈ దుఃఖాదులు తామరాకును నీరు అంటనట్లుగా - అతనిని స్పృశించనేలేవు.
ఓ రామచంద్రా! ఈ విధంగా తేజోదశ (లేక) అగ్ని రూపము పొందిన నేను ఇట్లు అనేక దేహాలలో ప్రవేశించి పరిరక్షణ సంహారములను నిర్వర్తించాను. అనేక అరణ్యాలను దావానల స్వరూపుడనై దహించాను. దుష్టుల ఐశ్వర్యంలాగా అనేకసార్లు చంచల జ్వాలలతో ప్రవృద్ధమవటంఇంతలోనే ఉపశమించటం అనుభ వించాను. అట్టి నా సుదీర్ఘ సంచార సంరంభంతో పరమాణువులో కూడా ప్రవేశించి అక్కడ అనేక జగత్తుల ఉత్పత్తి-ఉనికి-వినాశనములను చవిచూచాను. సాక్షినై సందర్శించాను.
ఆ జగత్తులు, ఆ యానము-అంతా చిదాకాశము మాత్రమే. ఈ కనబడే వర్తమాన జగత్తు కూడా చిదాకాశమే! ఇందులోని వస్తువులు, సంఘటనలు, జీవులు, జడములు, రాకలు, పోకలు, ఉత్పత్తులు, వినాశనములు, నేను, నీవు, లోకములు, భూత-భవిష్యత్ వర్తమాన కాలమాన పరిస్థితులు-ఇవన్నీ “చిదాకాశమే చిదాకాశమున ఇట్లు కన్పట్టటం” అని గ్రహించు.
ఓ జనులారా! "అదేమిటి? ఇక్కడ వస్తువులు-విషయములు-సుఖములు-దుఃఖములుబంధువులు—తదితరులు-ఆర్థిక సామాజిక స్థితిగతులు ఇవన్నీ జగత్తులో తారసపడుచుండగాచిదాకాశమే ఇదంతా-అనునది ఎట్లా కుదిరేది?” అని అంటారా?
ఇందుకు “స్వప్నద్రష్ట నుండి బయల్వెడలి, స్వప్న ద్రష్టలోనే ఉంటూ, స్వప్న ద్రష్టలోనే లయ మొందుచున్న అనేక వృత్తాంత పరంపరలు కలిగి ఉంటున్న స్వప్నజగత్తే” మనందరికీ దృష్టాంతం.
Page:142
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ విధంగా పృథ్వి రూపధారణ, జలరూపధారణ, తేజోరూపధారణ అవధరించి అనేక జగత్తులను సందర్శించిన తర్వాత కూడా ఇంకా “ఈ జగత్ వ్యవహార పరంపరను సందర్శించాలి. పరామర్శించి రావాలి!" అనే కుతూహలం నాలో కొనసాగుతూనే ఉండసాగింది. అందుచేత తేజోరూపధారణ నుండి 'వాయు స్వరూపుడను' అను ధారణను ఆశ్రయించాను. మరుక్షణం వాయురూపినై వాయువు ఉన్నంత వరకు విస్తరించిన దేహస్వరూపుడనైనాను. లతలను, దేహుల ముఖములను, పుష్పములను, సుగంధములను పరిపాలించసాగాను. అనేక చోట్లకు ప్రసరిస్తూ కొన్ని చోట్ల మంచు బిందువులను లీలావినోదంగా హరించాను. మత్తు పానీయములు త్రాగి విశ్రమించిన జీవుల సర్వాంగములను స్పృశిస్తూ మరింతగా ఆహ్లాదపరచాను. అతి నేర్పరితనంతో పూలతలను నాట్యమాడించాను. ఓషధి-లతఫలాదులను ఉల్లాసంగా స్పృశించి ఆనందించాను. పుష్ప సుగంధములను నా వాయు దేహముపై అలంకారముగా ధరించాను. మంగళ సమయంలో శీతల సుందర- సుగంధములచే స్త్రీలకు ప్రీతి జనకమై ప్రవర్తించిన నేనే వినాశనసమయంలో భయంకర రూపమును ధరించి దృఢపర్వతములను కూడా ఎండుటాకులవలె పెల్లగించి మరీ ఆకాశంలోకి విసిరాను.
నా వాయు స్వరూపమునకు రంగు అంటూ ఏదీ లేకపోయినప్పటికీ స్వర్గంలోని నందనవనంపై ప్రసరిస్తూ అక్కడి మందారకుసుమములచే ఎఱుపురంగును సంతరించుకున్నాను. నరకలోకంలో ప్రవేశించినప్పుడు అక్కడి అగ్ని సమూహముల నుండి బయల్వెడలిన పొగను వెంటనిడుకొని నల్లగా కనిపించసాగాను. సముద్రపు అలలపై సుతారముగా విహరించాను. అప్పుడప్పుడు ప్రకాశమానుడగు మేఘములను మోసుకువచ్చి చంద్రబింబమును కప్పివేశాను. మరొకప్పుడు నా ప్రసరణ శక్తిచే ఆ మేఘములను తొలగిస్తూ చంద్రుని ప్రకాశమానునిగా కూడా చేశాను. నక్షత్రములను కదిలేటట్లు చేశాను. ముల్లోకములలోని సిద్ధులు విమానాలను అధిరోహించి సంచరించుటకై బయల్వెడలుచుండగా, వారి విమానములు ప్రయాణించుటకై అనుకూలంగా వాయు వీచికలను ప్రసరింపజేశాను.
ఈ చిత్తము వలెనే శీఘ్రగామినై అటు నుండి ఇటు, ఇటు నుండి అటు సంచరించసాగాను. అవయవములు లేకపోయినప్పటికీ సర్వుల అవయవములు నావే అయ్యాయి. నా శ్రమను మఱచి ఇతరుల శ్రమ పోగొట్టాను. చంద్రకిరణములలోని అమృతమును గ్రోలి తిరిగి ఆ రసమును భూమిలో ప్రవేశింపజేశాను. మేఘములను అధిరోహించి ఊయల ఊగాను. దంపతుల ముఖములను స్పృశించి వారికి కలిగిన రతిశ్రమను తొలగించాను. రహదారిపై వేగంగా ప్రసరించి అక్కడి ధూళితో ఆకాశమును కప్పి క్రమంగా ఆ ధూళిని గృహద్వారముల గుండా గృహములలో ప్రసరింపజేశాను.
Page:143
సంగీత వాద్యములలో ప్రవేశించి అనేక సంగీత శబ్దములను పలికాను. జలకణములను అభరణములుగా ధరించాను. కొన్నిచోట్ల ధూళిని తొలగించి ఆ ధూళికి శత్రువువలె అయ్యాను. పుష్పములలోని పుప్పొడిని నలువైపులా వెదజల్లి తద్వారా 'జీవులను సుఖింపజేయటం' అను పుణ్యక్రియకు కారణమైనాను.
ప్రాణుల యొక్క అంగ-ఉపాంగములందు వర్తించుచు అక్కడి నాడీ మండలమునకు ప్రేరణ కలిగించాను. ప్రాణరూపినై జీవుల ‘హృదయములు' అనే మర్మస్థానములను 'స్పందన’ను ప్రేరేపించి జీవులు జీవించటానికి కారణభూతుడనైనాను.
యోగుల ధారణశక్తికి, సహకరిస్తూ వారి ఆయా చక్రస్థానములలో ప్రతిక్షేపించబడినవాడినై, తద్ద్వారా వారి అధ్యాత్మయానానికి సహకారం అందించాను. నిత్యము ఏకాంతంగా విహరిస్తూ కొన్ని చోట్ల అగ్నియొక్క ప్రజ్వలనానికి సహకారం అందిస్తూ మరికొన్ని చోట్ల అగ్ని ఆరిపోవటానికి కారణమగుచూ సంచరించాను.
విమానములకు నేను భూమిగా అయ్యాను. సంతాపములు తొలగిస్తూ జీవులకు సుఖమును అందించాను. 'ప్రాణ-అపానకళలు' అనే త్రాళ్ళరూపం ధరించి దేహరూపయంత్ర సంచాలనం నిర్వర్తించాను. సముద్ర తరంగములను నా వేగముచే ఖండించాను. ధూళిని ప్రసరింపజేసి సముద్రంలో ద్వీపములను నిర్మించాను.
మనోరాజ్యమువలె జీవులకు ఎదురుగానే వాయుమహాసముద్రంగా ఉండి వారి కంటికి మాత్రం కనబడకయే ప్రవర్తించసాగాను. తాటియాకు విసనకఱ్ఱలచే కదలించబడి, దేహములకు స్పర్శానుభవమును పొందింపజేశాను. ప్రళయకాలంలో ఒక క్షణమాత్రంలో సమస్త పర్వతములను పెకలించి వేసి సముద్ర మధ్యంలోకి విసరివేశాను.
వివిధ వర్ణములుగల ధూళిని ఆకాశంలో సమావేశపరచి ఆనందించాను. ఎండుగడ్డి పరకలు ఎగిరెగిరి పడటానికి కారణమైనాను. “సూర్యుడు-జలము-మేఘము-వర్షము” అనే యజ్ఞ కార్యక్రమంలో మంత్రోచ్చారణ వలె పాలు పంచుకున్నాను. ఆకాశంలో షికారు చేశాను. దేహయంత్రంలో త్రాణను అయ్యాను. జలములను ఎండింపజేశాను.
1.) మేఘములను ధరించటం, 2.) తృణములను (గడ్డిపరకలను) కదలించటం, 3.) జలాదులను శోషింపజేయటం, 4.) గంధమును ధారణ చేయటం, 5.) తాపములను హరించటం, 6.) నెయ్యి మొదలైన వాటిని పిండీకరించటం (గడ్డ కట్టింపజేయటం) అనే ఈ 6 క్రియలను ప్రళయ సమయం వరకు అవిశ్రాంతంగా నిర్వర్తిస్తూనే ఉన్నాను.
రసాకర్షణ యందు అత్యంత వేగిరం చూపసాగాను. నాడులను ప్రేరేపించటం ద్వారా దేహముల కాళ్ళు-చేతులు కదలటానికి హేతువునయ్యాను. 'శరీరం' అనే నగరంలో నిరాటంకంగా నా ప్రయాణ మార్గాన్ని నిర్మించుకోసాగాను. 'అన్నరసం' పట్టుకొని ప్రాణ-అపానముల ద్వారా దేహమంతా అందించి దేహములను సేవించాను.
Page:144
శరీరములు ఒకప్పుడు నిర్మించబడటంలోనూ, మరొకప్పుడు నేలకూలటంలోనూ పాత్ర వహించాను. అన్నరసము యొక్క మలము యొక్క సూక్ష్మ తరములైన సారభాగముల యొక్కరక్త మాంసముల యొక్క వాతపిత్తాది ధాతువుల యొక్క సంయోగములందు, వేఱుపరచుటయందు బహుప్రావీణ్యం ప్రదర్శించాను.
ఓ రామచంద్రా! వాయువునందు గల ప్రతి సూక్ష్మణువు నందు అసంఖ్యాక జగత్తులు నాకు కనిపించాయి. అట్టి ప్రతి జగత్తులోనూ ఇట్లాగే భూమి ఆకాశం నక్షత్రాలు మొదలైనవన్నీ అతి విస్తారంగా ఏర్పడి ఉన్నాయి. ఆయా జగత్తులలో కూడా ఇప్పటిదాకా చెప్పినట్లే వాయు స్వరూపధారినై వెలయుచు సంచరించాను. అక్కడ ప్రతి పరమాణువులోనూ సృష్టి సమూహములు చలించుచున్నాయి. కానీ, పరమార్థ దృష్టియందు ఏదీ కూడా చలించకయే ఉన్నది. ఎందుకంటావా? దృశ్యశూన్యాకారమగు పరబ్రహ్మము నందు దేనికి గమనాగమనములు ఉంటాయి?
ఓ రామచంద్రా! మరల చెప్పుచున్నాను. చంద్ర - సూర్య - వాయు - అగ్ని - ఇంద్ర - వరుణ - కుబేరాది దేవతలతోను, బ్రహ్మ - విష్ణు - మహేశ్వర - గంధర్వ - విద్యాధర - మహాసర్పములతోను, సముద్ర - పృథ్వి - పర్వత - ద్వీప - ఆకాశ - మహాసముద్ర - లోకాంతర - లోకేశులతోడను, క్రియా-కాలకళాదుల క్రమముతోను, స్వర్గ - భూమి - పాతాళ - తదితర లోకాంతరములతోను, భావ - అభావ - వృద్ధి - క్షయ - జన్మ - జరా మరణ విభ్రమ ములతోను కూడిన అనేక జగత్తులు ప్రతి పరమాణువులోను ఉన్నాయి. నాకు కనిపించాయి. నాకు కనిపిస్తున్నాయి. ఈ బ్రహ్మాండములు ఎందులో జనించి నశిస్తున్నాయో, అట్టి స్వస్వరూపాత్మను సంతరించుకొన్న వారే.... వీటన్నిటినీ అధిగమించినవారగుచున్నారు సుమా! సర్వ భావనలకు, భావన ధారణలకు మూలము-ఆధారము అయిన ఆత్మయే నేనని ఎఱిగియే లీలగా వాయుదేహంతో అనేక జగత్-జీవుల పరంపరలను నా దేహ విభాగము వలె అనుభవించసాగాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా నేను ఆకాశము-వాయువు-జలము-అగ్ని (తేజస్సు)–పృథ్వి అనబడే పంచభూత స్వరూపధారిని అయి అచ్చట గల త్రిలోకములలోనూ విహరించాను. ఒకదాని తర్వాత మరొకటిగా, అన్ని భూతముల రూపం మార్చి మార్చి ధరించాను. పృథ్వి-జలము-అగ్ని-వాయువుల యొక్క సమూహ (పిండీకరణం) రూపం ధరించి వృక్షములలో వసించుచూ వేఱు చివరల యందుండి భూమియందలి రసమును పానం చేశాను. చంద్ర కిరణములలో ప్రవేశించి ఊయలలూగాను, ఋతువులలో ప్రవేశించి ఆయా సమయములలోని పుష్పముల సుగంధం గ్రోలాను. మేఘములపై పచార్లు చేశాను. కోమలములైన అంగములపై విశ్రమించాను. మృదు-మధుర శబ్దములు ఆలపించాను. బ్రహ్మాండ రూపుడనై ఉన్నత పర్వతముల శిఖరము నుండి నదీజలం వెంట భూమిపై గల విస్తార ప్రదేశం వరకు ప్రవహించాను.
Page:145
పర్వతములు నా అంగములయ్యాయి. నదులన్నీ నాకు నాడీ మండలంగా అయ్యాయి. సిద్ధ విద్యాధరాది ప్రాణి సమూహములు నా దేహమునందు విశ్రాంతి తీసుకోసాగాయి. సూర్యుడుచంద్రుడు-నక్షత్రములు మొదలైన రోదసీ స్వరూపాలు నా అనుగ్రహముచే శరీరములు సంపాదించుకొన్నవారై సంతోషముగా అనేక రంగులు ప్రదర్శించువారయ్యారు.
సప్త సముద్రములు - సప్త ద్వీపములు కలిగి సప్త రూపములతో వెలయు పృథ్వి నా ముంజేతికి కంకణంగా స్థాపితం అయింది. విద్యాధర స్త్రీలకు నేను కనబడకయే, వారికి హృదయ స్పర్శానందమును కలిగించి పులకింపజేయసాగాను.
నదులు నాకు రసపూరితమైన నాడులైనాయి. పర్వతములు నాకు ఆస్థికలు (బొమికలు) వలె అయ్యాయి. జీవులందరు నాకు వింజామరలుగా అయ్యారు. సూర్యచంద్రులు పరిచారకులై నా హృదయ కమలంలో వసించసాగారు. సమస్త పాతాళము నాకు పాదములుగా అయింది. భూతలమేమో పొట్టగా రూపుదిద్దుకున్నది. ఆకాశము నాకు శిరస్సుగా అయింది.
దిక్షు సర్వాసు సర్వత్రా సర్వదా సర్వకారిణా ।
సర్వాత్మనాపి అసర్వేణ శూన్యరూపేణ సంస్థితమ్ ॥
నేను సర్వదిశలందు సర్వత్రా సర్వదా సదా స్వరూపమైనాను. సర్వ కార్య నిర్వహణాధికారినై సంచరించాను. అయినా కూడా అసర్వముగానే జగద్రహితంగానే) ఉన్నాను. సర్వ ద్వైతశూన్యమైనట్టి 'చిన్మాత్రము'గానే సర్వదా ఉండి ఉన్నాను.
పరిచ్ఛిన్నత్వము-అపరిచ్ఛిన్నత్వము; సాకారము-నిరాకారము; జడత్వము-చేతనత్వము... ఈ విరుద్ధ ధర్మముల యొక్క సముచ్ఛయమును నేనప్పుడు నా స్వరూపము నందే బాగుగా అనుభవించాను. మైనాక పర్వతాలలో అంతర్లీనంగా అనేక పర్వతాలు ఉంటాయి చూచావా? అట్లాగే పర్వత-నదీ-సముద్రములు, సూర్య-చంద్రులతో కూడిన అనేక బ్రహ్మాండములు నాయందే దర్శించాను. అనుభవించాను. జడమగు అద్దంలో అనేక నగరములు ప్రతిబింబిస్తాయి కదా? చిద్రూపుడనగు నాయందు ప్రకటితము-అప్రకటితము (గుప్తములు) అగు అనేక బ్రహ్మాండ పరంపరలను ధరించినవాడ నయ్యాను.
ఏవం జల - అనిల - అగ్నిత్వం భూమిత్వం ఖాత్మనా మయా ।
కృతం చితేవ స్వప్నేషు! బత! మాయా విజృంభితమ్ ॥
ఓ రామచంద్రా! ఈ విధంగా పృథ్వి- జలము-అగ్ని-వాయువు-ఆకాశముల రూపమును స్వప్నము నందలి చైతన్యం స్వప్న నగరమును ధరించునట్లు - నేను ధరించాను. ఆహాఁ! ఈ మాయ యొక్క విజృంభణము ఎంతటి ప్రతాపం కలిగి ఉన్నది! ఎందుకంటే అట్టి స్థితిలో అగ్నివాయువు-పృథ్వి-జలం-ఆకాశాలలో అణువణువులోనూ అసంఖ్యాకమైన పృథ్వి-పంచభూతాలుసూర్యచంద్రులతో కూడిన అసంఖ్యాక జగత్తులు నాకు కనిపించాయి. ప్రతి పరమాణువులోనూ ఇట్లే వ్యాప్తమగు ఆకాశము కలదు.
Page:146
ఆ ఆకాశము యొక్క ప్రతి పరమాణువులోనూ మరల బ్రహ్మాండ పరంపరలు ఉన్నాయి. అట్లాగే స్వప్నంలో అంతర్గతంగా కనిపించే నగరంలోని ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండ పరంపరలు ఉన్నాయి.
శ్రీరాముడు : మీరు ఆ విధంగా భూమండలం ఇత్యాది రూపాలను ఎద్దాని సహాయంతో ధరించారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ భూమండలం-తేజస్సు-ఆకాశం-జలం-వాయువు మొదలైన జగదాత్మక రూపాలన్నీ నా యొక్క “అధ్యాస” అనుదాని బలంతోనే ధరించాను. కాబట్టి సర్వ జగద్రూపుడనై ఉన్నప్పటికీ వాస్తవానికి నేను ఎచ్చట కూడా ఒకింతైనా వ్యాపించి ఉండనేలేదు. వ్యాపకరహిత చిదాత్మనే నేను కదా! అయినాకూడా మనుష్యులు మొదలైన దేహధారుల నిమిత్తమై వృక్షంతృణం-అంకురాలను ఉత్పత్తి చేస్తూ... అంతే కాకుండా, భూమి ద్వారా వర్షాదుల జలమును ఆకర్షించాను. యుద్ధంలో శత్రురాజును జయించినట్లు నేను సర్వ ద్వైతరూప సంహార మగు బోధ రూపాన్ని సముపార్జించుకున్నాను. అట్టి శుద్ధ బోధరూపుడనగు నాలో లక్షల కొలది బ్రహ్మాండాలు (అధ్యారోపదృష్టిచే) వర్తించుచున్నాయి. అరోపిత దృష్టిచే అవేవీ నాయందు ఏ సమయమందునూ లేవు. చైతన్యమే చైతన్యమునందున్న స్వకీయమైన చమత్కృతులకు కర్త సుమా! నిజసత్తాస్ఫూర్తి రూపముచే స్వయముగా జగత్తుల రూపమున తనకు అభిన్నంగా చైతన్యమే రచించుకుంటోంది. (లేక) ప్రకటించుకుంటోంది. అట్టి చైతన్యమే నీ స్వరూపం! నా స్వరూపం! సభికులందరి స్వరూపం! “అనుభవము”, “రచన”, “ఇష్టము” ఇవన్నీ ఎక్కడెక్కడుంటాయో, అవన్నీ కూడా పరమార్థ చైతన్యము యొక్క చమత్కారమే తప్ప మరింకేమీ కాదు.
❖
అధ్యారోపదృష్టిచే : ప్రతి వస్తువులోను స్వసత్తరూపంగా నేనే స్ఫురిస్తున్నాను కదా! కాబట్టి సర్వరూపుడను, సర్వకర్తను కూడా అయి ఉన్నాను.
అపవాదదృష్టిచే : సమస్తము బ్రహ్మాండరూపమే! కనుక నేను సర్వదా ప్రబుద్ధుడను, నిరామయుడను, కేవలము శుద్ధబోధ రూపుడను, బ్రహ్మరూపుడను అయి ఉన్నాను. ప్రతి వస్తువునందు, ఉన్నట్టి ప్రతి జీవునియందు ఉన్నట్టి “బ్రహ్మము” నందు సర్వసృష్టి (సర్వ జగత్తు) యొక్క అధ్యాస ఉండనే ఉన్నది. అందుచేతనే ప్రబుద్ధుని దృష్టిలో ఈ జగత్తంతా కూడా సర్వత్రా సర్వాత్మకమై, సర్వవ్యాపకమై, సర్వాశ్రయమైనట్టి బ్రహ్మమే అయి ఉన్నది.
అరోపిత దృష్టి : ఉన్నది ఉన్నట్లుగా గాంచుచూ, లేనిది లేనట్లుగా గమనించటం.
అధ్యారోప దృష్టి : లేని దానిని సహాయంగా తీసుకొని ఉన్నది నిరూపించుకొని దర్శించటం.
అపవాద దృష్టి : లేనిది ఎందుకు లేదో నిరూపించుకొని ఉండటం.
ఇక, ప్రబుద్ధుని దృష్టియందో... అది నేను చెప్పజాలను, ఎందుకంటే అతని దృష్టికి స్థిరత్వం లేదు. ఒకప్పుడు ప్రమోదంగా, మరొకప్పుడు విషాదంగా, ఇంకొకప్పుడు పేలవంగా, మరొకప్పుడు స్థైర్యంగా అతని అనుభవం ఉంటోంది. కాబట్టి 'ఇది ఇట్లు' అనునదేమీ లేకపోవుట చేతనే 'అతని దృష్టి ఇట్లా ఉంటుంది' అని మేము చెప్పలేకపోతున్నాం!
Page:147
కనుక, ఓ రామచంద్రా! ఇప్పుడు చెప్పే సారవిషయాలు విను.
ఆకాశకోశ విశదాత్మని చిత్స్వరూపే యేయం సదా కచతి సర్గ పరంపరేతి ।
సాన్త స్తదేవ కిలతాప ఇవాన్త రూష్మా, భేదోపలంభ ఇతినాస్తి సదస్త్యనన్తమ్ ॥
1.) చిత్స్వరూపము (పరమాత్మ) సర్వదా ఆకాశము వలె అత్యంత నిర్మలమైనది.
2.) అట్టి నిర్మల చిత్స్వరూపమగు ఆత్మలో ఈ సృష్టిపరంపరలు సదా భాసిస్తూనే ఉంటాయి.
3.) అట్లా జగత్తు రూపంగా భాసించేదంతా కూడా చిద్రూప బ్రహ్మమే అయి ఉన్నది.
ఒక చిన్న దృష్టాంతం - 1.) తాపము, 2.) ఉష్ణము... ఈ రెండు శబ్దములు వేర్వేరు అయినప్పటికీ వాటి అర్థం మాత్రం ఒక్కటే కదా! "తాపము నందు ఉష్ణము కలదు" అనే వాక్యం, లేక “ఉష్ణ తాపము” అనే శబ్దం భాషాపరంగా ఉన్నప్పటికీ ఆ రెండు శబ్దములు సమానార్థ వాచకాలే కదా!
అట్లాగే... 1.) బ్రహ్మము, 2.) జగత్తు... అను ఈ రెండు శబ్దములకు వాస్తవానికి భేదమేమీ లేదు. ఆ రెండింటికీ వాస్తవమైన అర్థం ఒక్కటే. వాస్తవానికి... నామరూపాత్మకమైన దృశ్యము లేదు. అనంతము - సద్రూపము అగు "బ్రహ్మము" మాత్రమే ఉన్నది.
ఓ జనులారా! ప్రియ శ్రోతలారా! సభికులారా! అట్టి అఖండ అప్రమేయ బ్రహ్మమే ఈ రామబ్రహ్మము. మీరందరు ఈ రామబ్రహ్మ స్వరూపులేనని గ్రహించండి!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ విధంగా విద్యాధరి యొక్క అభ్యర్థనను అనుసరించి లోకాలోక పర్వత శిలలోని బ్రహ్మాండములో ప్రవేశించి, ఆ బ్రహ్మాండము మహాప్రళయకాలంలో లయమైపోగా, రుద్రభగవానుని నృత్యమును, కాళీదేవి యొక్క ఆవిర్భావమును, రుద్రభగవానుని స్పర్శచే ఆయనయందు లయమవటం, ఆ తర్వాత రుద్ర భగవానుడు కూడా సూక్ష్మరూపి అయి అంతర్ధానం కావటం, తదనంతరం ఆ శిలలోని తదితర భాగములలోను, తదితర శిలలలోను, ఇతర సర్వ పదార్థములందు అనేక బ్రహ్మాండములను సందర్శించటం, ఆ తర్వాత నా స్వరూపము నందే అనేక బ్రహ్మాండములు అగుపించటం, అటుపై నేను ఆకాశ వాయు-పార్థివ-అగ్ని-జల అభిమానినై సంచరించటమూ, ఇక ఆపై విరాట్ పురుషుడనై అనేక ఇంద్ర - అగ్ని - వాయు - త్రిలోక త్రిమూర్తులతో కూడిన బ్రహ్మాండములకు శరీరధారిని అవటము-ఇదంతా వర్ణించి చెప్పాను కదా! ఆ తర్వాత కొన్ని సిద్ధ లోకాలు కూడా సందర్శించాను.
అదంతా అయిన తర్వాత... ఇక సర్వకౌతుకములను త్యజించి నెమ్మదిగా అంతకుముందు ఆకాశంలో నేను సంకల్ప బలంతో నిర్మించుకున్న ఏకాంత మండపం వైపుగా వెళ్ళటం జరిగింది.
Page:148
శ్రీరాముడు : స్వామీ! అవునూ? మీరు అనేక బ్రహ్మాండములలో సంచరిస్తూ నిర్వికల్ప ధ్యానము కొఱకై చిదాకాశమునందు ఒకానొక విభాగమున తదితరులకు జేరవీలుకాని ఏకాంత ప్రదేశంలో మనో నిర్మిత కుటీరం చేరారు కదా! ఇప్పుడా కుటీరం తిరిగి జేరుచుండగా జరిగిన విశేష చమత్కారాలు ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ విషయాలకే ఇక వస్తున్నాను. విను.
ఆ విధంగా కౌతుకముచే ఆ జగత్తులను దర్శించిన తర్వాత అట్టి క్రియ నుండి ప్రయత్నపూర్వకముగా వైదొలగాను. ఇతఃపూర్వపు ఆకాశమున మనో నిర్మితమైన సమాధి కుటీరం క్రమంగా సమీపించాను. కుటీరంలో ప్రవేశించాను. ప్రవేశించి ఇతఃపూర్వపు నా భౌతిక శరీరము కొరకై అటూ ఇటూ చూచాను. ఆ దేహం కనిపించలేదు. అయితే నా భౌతికదేహం ఉండవలసిన చోటుకు కొంచెము ప్రక్కగా ఎవరో సిద్ధుడు కనిపించారు. ఆయన సమాధియందు ఉన్నట్లుగా ఉన్నారు. కొంచెము సమీపంగా వెళ్ళి చూచాను.
ఔను! ఆయన సమాధియందు నిమగ్నమై ఉన్నారు. బ్రహ్మపదమును పొంది సౌమ్యత్వము వహించినట్లుగా కనిపిస్తున్నారు. సూర్య భగవానుని వలె గొప్ప తేజస్సు ఆయన ముఖంలో కనిపించింది. పద్మాసనము వైచుకొని ఉన్నారు. పరమ శాంతమూర్తియై ఇష్ట విషయము పట్ల చిత్తము స్థిరమగుటచే నిశ్చలులై ఉన్నారు. ఆయన ఆశ్రయించిన సుఖాసనమును అనుసరించి వృషణములు పాదముల చీలమండలం మధ్యగా ఉన్నాయి. ఆయన సర్వ జగద్విషయములకు ఆవల గల పరబ్రహ్మమునందు నిష్ఠ వహించి ఉన్నారని గమనించాను. ఆయన ముఖం విభూదిత్రిరేఖలతో సౌమ్యంగా, గంభీరంగా ప్రకాశిస్తోంది. భుజస్కంధములు సమముగానూ, నిలువుగానూ ఉండగా కంఠం అతి సుందరంగా శోభిస్తోంది.
ఆయన ప్రసన్నమైనట్టి సుఖముతో కూడి శిరస్సుచే అతి సుందరుడుగా కనిపిస్తున్నారు. నాభి వద్ద ఆయన అరచేతులు తెరుచుకొనిన భంగిమలో అవధరించబడి ఉన్నాయి. హృదయము బాహ్యముగా ఏతెంచు మహాతేజస్సుతో శోభిల్లుతోంది. కనురెప్పలు రెండూ మూసుకొని ఉన్నాయి. ఆయనలో బాహ్యేంద్రియ వ్యాపారములు అగుపించటమే లేదు. ఒక ప్రశాంత గాంభీర్య సరోవరము వలె మౌనస్థితిచే ఉట్టిపడుచున్నారు. అంతఃకరణము ధీర శాంత వృత్తిచే ప్రకాశిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నిర్వికల్పమును ఆశ్రయించి ఉండటం చేత ఆయన నా రాకను గమనించే కనిపించటం లేదు. ఆ మునివర్యుని దేహమును ఆ స్థితిలో వీక్షించి నా యొక్క శుద్ధ చిత్తముతో ఇట్లా చింతించాను.
ఆహా! ఈయనెవరో మహాసిద్ధుడు అయి ఉంటారు. ఈ మహాత్ముడు నాలాగానే ఏకాంతమున విశ్రాంతి పొందాలని ఆకాశమున ఎక్కడో ఉన్న ఈ కుటీరానికి వచ్చారు. ఈయన సత్య సంకల్పుడు అయి ఉండటంచేతనే “సమాధియోగ్యమైన ఏకాంత స్థానం పొందాలి" అనే యోచనతో ఈ కుటీరంలో ప్రవేశించి ఉంటారు.
Page:149
నా భౌతిక దేహమును నేను చిరకాలంగా ఉపేక్షించి ఉన్నాను కదా! అందుచేత నా శరీరమును మరణించిన దానిగా భావించి ఇక నా రాక కొరకై వేచి ఉండక, ఆ నా శరీరమును ఎక్కడో పడవైచి, తాను ఇచట ఈ సమాధి స్థితిని ఆశ్రయించి ఉంటారు.
ఆ నా స్థూల శరీరం నశించియే ఉంటుంది. ఇక ఇక్కడ నాకు పనేమున్నది? కనుక ఈ సూక్ష్మశరీరం తోనే సప్తర్షి మండలములోని నిజాశ్రమమును చేరెదను గాక...!
ఈ విధంగా యోచించిన నేను సప్తర్షి మండలము వైపుగా ప్రయాణమునకు సంసిద్ధుడనైనాను. వెంటనే నా సంకల్పముచే నిర్మించబడిన ఆ కుటీరం నా యొక్క సంకల్పక్షయ ప్రభావం చేత క్షణంలో నశించిపోయి ఆ స్థానంలో శూన్యాకాశం యథాతథంగా ఉండటం జరిగింది. ఇప్పటి ప్రవృత్తి (లేక, ఆలోచన) ఇతఃపూర్వపు ప్రవృత్తి (లేక ఆలోచన)ని తొలగించివేస్తూ ఉంటుంది కదా! ఎప్పుడైతే సంకల్ప నిర్మాణకుటీరం (నాయొక్క సప్తర్షిమండలము వైపుగా వెళ్లాలనే ఉత్కర్ష “పూర్వ సంకల్పత్యాజ్యం + నూతన సంకల్ప ఆవిర్భావం" ప్రభావం చేత) నిరాధారమై అదృశ్యమైందో, ఆ క్షణంలో సమాధినిష్ఠుడైన ఆ సిద్ధపురుషుడు నిరాధారుడై క్రింద పడసాగారు. స్వప్నం శమించగానే స్వప్ననగరం కూడా శమించునట్లు నా సంకల్ప-ఉపశమనంచే నిరాధారుడైన ఆ మునీంద్రుని దేహం మేఘమును వదలిన జలధార వలె నేలపై పడిపోవుచుండటం నేను గమనించాను. అప్పటికి నా తప్పు నేను గమనించాను.
"ఆహా! 'ఎంతకాలమైతే నేనిక్కడ ఉంటానో అంత వరకు ఈ మనోకల్పిత కుటీరం ఇట్లే ఉండుగాక!’ అని సంకల్పించిన ఈ కుటీరం, నా ధ్యాస సప్తర్షిమండలం వైపుకు మళ్ళగానే, మటుమాయమైనది కదా! అరె! ఈ సిద్ధపురుషుడు ఇప్పుడు నేలపై పడుచున్నారు! ఎంత తప్పు జరిగింది! ఇప్పుడు వీరి దేహమునకు ఏదైనా హాని జరుగదు కదా?”
అని తలచి ఉలిక్కిపడ్డాను. ఆ సిద్ధపురుషుని వైపుగా చూచాను. ఆయన దేహం క్షయించిన పుణ్యమప్పటి వైమానిక దేవత వలె, మూలము ఛిన్నమైనప్పటి మహా వృక్షము వలె ఆకాశము నుండి విడువబడిన శిలవలె క్రిందపడసాగటం చూచాను. “మహనీయుల పట్ల, సుజనుల పట్ల దోష ప్రవర్తన ఉండకూడదు” అనే ధర్మముచే ప్రేరితుడనై సూక్ష్మ శరీరముతోనే ఆ సిద్ధపురుషుని శరీరము వెంట భూతలము వైపుగా రాసాగాను.
వాయు మండలము యొక్క పరివర్తనములచే ప్రేరితమై వాయుతరంగములచే మోయబడుచూ ఆ సిద్ధుని భౌతికదేహం సప్తద్వీపములకు సప్త సముద్రములకు ఆవల ఉన్న ఒక దేవతల క్రీడాస్థలముపై పడసాగటం అల్లంత దూరంగా గమనించాను. ఆయన దేహం యోగబలంచే వజ్ర-శిలాదుల వలె దృఢంగా ఉండటంచేతను, ప్రాణాయామధారణచే దూదిపింజమువలె అతితేలికగా ఉండటం చేతనూ అంతదూరం నుండి నేలను తాకుతున్నప్పటికి ఆ దేహమునకు ఏమీ కాలేదు.
Page:150
ఆయన చిత్తము అన్యత్రా తీవ్రంగా లగ్నమై ఉండటంచేత ఆయన సమాధికి కూడా ఎటువంటి భగ్నము వాటిల్లలేదు. ముందుగా ఆయన అరికాళ్ళు నేలను తాకాయి. క్రమంగా ఆయన శరీరం నేలపై ఆసీనమైనది. ఆయన శిరస్సు ఊర్ధ్వంగాను, ప్రాణ పానములు ఊర్ధ్వగమనం కలిగి ఉండటంచేతనూ ఆయన నేలపై గల ఒకచోట ఇతఃపూర్వపు పద్మాసనంతోనే స్థానం పొందారు.
అప్పుడు నేను ఆయనను సమీపించాను. ఆ సిద్ధపురుషుడు ఇతఃపూర్వం మానసిక కుటీరంలో పద్మాసనాసీనుడై ఉన్నట్లే ఉన్నారు. సమాధి నుండి మేల్కొననే లేదు. అప్పుడు ఆయనను సమాధి నుండి మేల్కొలుపుటకై ప్రయత్నశీలుడనైనాను. అట్టి ప్రయత్నంలో భాగంగా ఆకాశంలో మేఘములను ఉత్పన్నం చేసి వర్షమును కురిపించాను. బిగ్గరగా గర్జనలు చేయసాగాను. ఆయన ఉన్న దిశగా పెద్దపెద్ద శబ్దములతో వడగళ్ళ వాన కురిపించాను. ఎట్లాగైతేనేం, కొంతసేపటికి ఆ మహాత్ముని బోధితునిగా చేశాను. సమాధి నుండి మేల్కొలుప గలిగాను. అప్పుడాయన ప్రకాశమానమైన అంగములు కలిగినవారై క్రమంగా కనులు తెరచారు. ఆ విధంగా సమాధి నుండి మేల్కొనినట్టి మహనీయుడు సిద్ధుడు అగు ఆ మునివరేణ్యుని ఎదుట స్నేహపూర్వకంగా నిలబడి చేతులు జోడించి నమస్కరించాను. అప్యాయంగాను, నిర్మలవృత్తితోనూ ఇట్లా ప్రశ్నించాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ మునివర్యా! మీరు ఎవరు? ఏ చోట ఉండేవారు? ఆ మనో నిర్మిత ఆకాశ కుటీరంలో ఎందుకు ప్రవేశించారు. దయచేసి మీ వివరాలు తెలియజేయవలసినదిగా నా విన్నపం.
నేనిట్లా అడుగుతూ ఉంటే ఆ సిద్ధపురుషుడు అప్పుడే నిద్రనుండి లేచినవాని వలె నా వైపు తేరి పార చూచారు. క్రమంగా కొద్దిసేపు కనులు మూసుకొని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించారు. ఆపై ఇట్లా అన్నారు.
సిద్ధ పురుషుడు : మహాత్మా! దయచేసి కొద్దిసేపు ఉండండి. నా వృత్తాంతమును స్మరించుకోనివ్వండి. ఆ తర్వాత మీకు అన్నీ వివరిస్తాను. రండి! ఇటు వచ్చి సుఖాసీనులుకండి.
ఇట్లా పలికి ఆయన కొద్దిసేపు మరల కనులు మూసుకున్నారు. రోజంతా జరిగిన ఏవేవో విషయాలన్నీ సాయంకాలం జనులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు చూచావా? అట్లా ఆయన విషయములు స్మరించటంలో నిమగ్నమైనారు. కొద్ది క్షణములలో తన పూర్వ వృత్తాంతమంతా చింతనచేసి స్మరించారు. తటాలున లేచి నన్ను సమీపించి రెండు చేతులు ప్రేమపూర్వకంగా స్పృశించారు. నేను కూడా మర్యాదపూర్వకంగా లేచి వారి కరచాలనము స్వీకరించాను. ఇద్దరం ఒకరి వైపు మరొకరం ప్రేమ పూర్వకంగా చూచి చిరునవ్వు నవ్వుకున్నాం. ఇద్దరం సుఖాశీనుల మైనాం. ఆ తర్వాత ఆయన పెదవులు విప్పారాయి. చంద్రకిరణములవలె అతిశీతలములు, ఆనందదాయకములు, అనింద్యములు, ఆక్షేపణ చేయటానికి వీలేలేనివి, సుభోదయములు అగు మనోహర వాక్యాలు ఈ విధంగా పలికారు.
సిద్ధ పురుషుడు : మహాత్మా! ఇప్పుడు మిమ్ములను గుర్తించాను. సప్తర్షి మండలంలో వసిస్తూ ఆత్మజ్ఞాన బోధతో లోకపావనం చేసే మహత్గురువులగు వసిష్ఠ మహర్షియే మీరు కదా!
Page:151
ప్రణామములు! తమ పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామములు. మొట్టమొదటిసారి మీ దర్శనమైనప్పుడు మీకు నమస్కరించనందుకు నన్ను క్షమించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను. “క్షమ”యే సత్పురుషుల స్వభావం అయి ఉంటుంది కదా!
మహర్షీ! నేను “ఎవరు-ఎక్కడివాడను” అనునవి పెద్దగా మీకు చెప్పతగ్గ విషయమేమీ కాదు. అయితే ఏ సాలోచనాస్థితిచే నేను అక్కడి మనోకల్పిత ఆశ్రమంలో ప్రవేశించటం జరిగిందో... ఆ విశేషాలు చెబుతాను. వినండి.
మహాత్మా! ఇంతకు చాలాకాలం ముందు ఒకప్పుడు నేను “భోగములు పొందెదను గాక” అనే కౌతుకమును చేబూని మోహ ప్రదములగు దేవతల ఉపవన భూములలో సంచరించాను. అనేక చోట్ల చిరకాలం పరిభ్రమించాను. నదిలో తరంగం అనేక చోట్లకు తిరిగి తిరిగి వస్తున్నట్లు నేను ఈ చిత్తమును ఆశ్రయించి అనేక స్థానములలో తిరుగాడుచూ సుదీర్ఘకాలం గడిపాను. ఈ సంసార సాగరంలో “దృశ్యములు” అనే తరంగములచే వ్యాకులుడనై అనేక దుఃఖములు పొందాను. వర్షం కోసం ఎదురుచూచే చాతకపక్షి ఆకాశం వైపుగా చూస్తూ అతి దీర్ఘకాలం వేదనతో గడుపుతుంది చూచారా? నేను కూడా 'ఏదేదో కావాలి... పొందాలి... దక్కాలి... లభించాలి... తారసపడాలి... చూడాలి...రావాలి...పోవాలి.... చేరాలి... ఆస్వాదించాలి'... అని తలచుచూ ఈ సంసార మహారణ్యంలో సుదీర్ఘకాలంగా పచార్లు చేస్తూ అనేకసార్లు భ్రమ-విభ్రమములకు లోను అయ్యాను. ఇట్లా బహుదూరపు బాటసారిలాగా పయనించి, అలసి, సొలసిపోయాను. ఆహా! ఈ ప్రపంచంలో భోగాలలో “అజ్ఞానం” అనే ఉప్పు-చేదు తప్పించి వేరైన రమ్య వస్తువు ఏమున్నది? ఈ జగత్తు జ్ఞానము మాత్రమే సార వస్తువుగా కలిగి ఉన్నది. కాబట్టి సర్వ దుఃఖప్రదములగు వ్యవహారములను త్యజించి "ఆత్మజ్ఞాన సముపార్జన" యందే నిమగ్నం కావాలని నిశ్చయించు కున్నాను.
శబ్ద - రూప - రస - స్పర్శ - గన్ధ మాత్రాదృతే పరమ్ ।
నేఽహ కించన నామాస్తి కిమ్ ఏతావత్ అహమ్ రమే ॥
ఈ బ్రహ్మాండ లో ఎక్కడికి వెళ్ళినాకూడా శబ్ద స్పర్శ రూప-రస-గంధములనబడే 5 తన్మాత్రలు తప్ప అన్యమైన వస్తువేమున్నది? అవన్నీ పరిచ్ఛిన్న మాత్రములే కదా! అట్టి పరిచ్ఛిన్నదుఃఖ రూపములైన వాటియందు నేను ఎందుకు రమించాలి? పైగా, ఈ శబ్ద స్పర్శాదులన్నీ కూడా స్వయంగా 'సత్తా' కలిగిలేవు మరి? చిదాకాశము యొక్క సత్త చేత మాత్రమే అవన్నీ సత్త కలిగి ఉన్నాయి. చిదాకాశసత్తను వేతేచేసి చూస్తే అవి శూన్యరూపములే కదా!
లేక... సమస్తమూ చిన్మాత్రమే అయి ఉన్నది. చిన్మాత్రమునకు వేరుగా ఏదీలేదు. కనుక “అసత్తు” అగు ఆకారము కలిగియున్న ఆ ఈ శబ్దములందు నష్ట బుద్ధిచేతనే నేను వ్యామోహము, కౌతుకము కలిగియున్నాను కదా! ఈ శబ్దాది విషయములు విషము వలె “ఉన్మాదము - వైషమ్యము-మరణము” నకు దారి చూపటానికే ఉన్నాయిగాని, వాస్తవము-శాశ్వతము అగు ఆనందం కలగజేయటానికి కానేకాదు.
Page:152
స్త్రీలు నా యొక్క బుద్ధిమాంద్యంచేత నాకు కామవికారము కలుగజేయటానికే తారసపడుచున్నారు. అనురాగములన్నీ చిట్టచివరకు విరసత్వమునకే దారి తీస్తున్నాయి. ఇట్టి వాటిని నమ్ముకొని వీటిలో రమించువాడు వీటిచేతనే హతుడు కాక ఏమవుతాడు? ఈ జీవితంలో "ఏదో లభిస్తుందిలే” అనుకొని వేటివేటికో ప్రయత్నములు చేస్తూ కాలం-ఆయుష్షు వృథా చేసుకొంటూ ఉండగా, ఇంతలో నాచులో ఆహారం కోసం వెతుకులాడే చేపపిల్లకు కొంగ ఎదురగుచున్నట్లు ఎక్కడినుండో వార్ధక్యం వచ్చి వాలుతోంది. ఇక శరీరం సంగతి అందామా! సముద్రంలో బుద్బుదం బయల్వెడలి అతి శీఘ్రంగా నశించునట్లుగానే, ఈ దేహం ఎదురుగా కనబడుతూ-కనబడుతూనే ఇంతలో ఆరిన దీపంలాగా అంతర్ధానమౌతోందే!
ఈ “జీవితము” అనబడేది అనేక విక్షేపములతోను, కల్లోలములతోను కూడుకొని ఉంటోంది. దీనికి జననము ఒక తీరమైతే, మరణము మరొక తీరం.... దీనిలో సుఖ దుఃఖ పరంపరలు అనుక్షణం పాల్గొను చున్నాయి. యౌవనోల్లాసము ఒకవైపు పొంగుతుంటే, మరొకవైపు వార్ధక్యం గుంటనక్కలా దాగి ఉండి 'ఎప్పుడు క్రుంగతీద్దామా?' అని ఎదురుచూస్తూ ఉంటోంది. కాకతాళీయంగా లభించే ఇక్కడి సుఖాలు క్షణభంగురాలు, దుఃఖ మిశ్రితాలు కూడా! ఇదంతా అనేక అసమంజస వ్యవహారాల చేతనూ, మూర్ఖ ప్రలాపముల చేతనూ నిండి ఉన్నది. ఇందులో ఎటువైపు తొంగి చూచినా రాగద్వేషములే అగుపిస్తున్నాయి. ఇక్కడి మహత్తరమని చెప్పబడే కార్యక్రమములన్నీ లోభ మోహములతో నిండి ఉంటున్నాయి. కాస్త ఎప్పుడన్నా చల్లగా (అనుకూలంగా) అనిపించినా కూడా, ఇంతలోనే అనేక తాపత్రయములు సర్వదా సంసిద్ధమగుచు అనేక దుఃఖములు జనింపజేస్తున్నాయి.
స్వామీ! నదీజలం చూచారా? ఎప్పటికప్పుడు పాతనీరు ప్రవహిస్తూ పోవటం, క్రొత్తనీరు రావటం జరుగుతుంది కదా! అట్లాగే ఈ సంసారమునందలి పుత్ర-మిత్ర-ధనాది పదార్థములన్నీ కూడా వెనుకటివన్నీ ఎటకోపోవుచూ, ఇంతలో క్రొత్తవి వచ్చిపడుతున్నాయి. ఈ విధంగా వెనుకటివన్నీ గతించుచు, క్రొత్తవి ఏతెంచుచూ ఉండగా... ఇట్టి పదార్థ సమూహముల వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమున్నది చెప్పండి? అటువంటి సంబంధ బాంధవ్యములపై నమ్మకము ఉంచి బ్రతుకును గడపటం ఎంతటి అవివేకం? బుద్ధి కలవాడెవడూ వీటిని నమ్మి ఉండడు. మహాత్మా! ఇంకా నదీజలమే నయం. ఎందుకంటారా? నదుల జలాలన్నీ ప్రవాహరూపంలో పోతున్నాయి. మరల పర్వత-మేఘాదుల సహాయంతో ఏతెంచుచున్నాయి. కానీ ఈ దేహమో! పోవటమేగాని, మరల వెనకకు రావటమనేది జరగనే జరగదు కదా! కమ్మరివాని చక్రంలాగా ఈ సంసార చక్రం మహాపరిభ్రమణం పొందుచుండగా ఇందలి వస్తువులు, జీవులు, సందర్భములు, సంబంధములు, దేహములు- ఇవన్నీ ప్రతిక్షణం అనేక పరివర్తనములు పొందుచున్నాయి. ఇక్కడ అతి భయంకరులు, శత్రురూపులు అగు “విషయములు” అనే అతి చతురులైన చోరులు నలువైపులా సంచరిస్తున్నారు. మామూలు దొంగలైతే రాత్రిపూట మాత్రమే ఇళ్ళలో ప్రవేశిస్తారు. మరి ఈ విషయచోరులో? మేము నిదురించేటప్పుడు, మేల్కొనునప్పుడు కూడా మా హృదయ గృహములలో ప్రవేశించి మా వివేకమును ఇట్టే దొంగిలించుచున్నారు.
Page:153
ఆయుషః ఖండ ఖండాశ్చ నిపతన్తః పునః పునః ।
న కశ్చిత్ వేత్తి కాలేన, క్షతాని దివసాన్యహో! ॥
అరెరే! ఏమి ఆశ్యర్యం! 'ఇప్పుడు ఇక్కడికెళ్ళాలి, అప్పుడు అతని సంగతి చూడాలి...' ఇటువంటి పిచ్చిపిచ్చి మాటలతో, వృథా వ్యవహారములతో అనేకమంది జనులు ఒక ప్రక్క సమయమును గడపి వేస్తున్నారు. మరొకవైపు ఏమగుచున్నదో గమనించారా స్వామీ! ప్రతిక్షణం ఆయువు రోజుల రూపంలో తరిగిపోతూ ఉంటే... ఇది ఎవరూ ఎఱుగుటయే లేదే?
ఇదమద్య తథేదం చ తథేదమ్ ఇదమస్య మే ।
ఏవం కలనయా లోకో గతం ప్రాప్తం న వేత్త్యహో! ॥
“ఓహో! ఇది నేడు లభించింది. ఇక అది రేపు లభిస్తుందిలే! ఇది నాది. అది నీది. ఇదేమో వీనిది" ఈ, ఈ, మొదలైన అనేక కల్పనలలో మునిగి తేలుచున్న అనేకులు ఇటు గడచిపోతున్న ఆయువును గాని, అటు దగ్గర పడుచున్న మృత్యువును గాని గమనించటమే లేదే!
భుక్తం పీతం అనన్తాసు, భ్రాన్తం చ వనభూమిషు ।
దృష్టాని సుఖదుఃఖాని కిమన్యదిహ సాధ్యతే? ॥
హే మహర్షీ! అనేక పదార్థములను తిన్నాను, త్రాగాను, అనేక చోట్ల సంచారములు సల్పాను. అనేక సుఖ-దుఃఖములు అనుభవించాను. అయితే ఎందుకు? ఇక్కడ సాధించటానికి శాశ్వతమైన ఫలము ఏది, ఎక్కడున్నది? స్వామీ! అనేక పదార్థములను అనుభవించుచూ అనేక సుఖదుఃఖాలను మేము పొందాం? వాటిలో ఆత్యంతికమైన దుఃఖ రహితమైన సుఖం ఎక్కడున్నది? పోనీ, సుఖం ఉన్నదను కొన్నప్పటికీ, అది సుఖం ప్రసాదించగలిగేది ఎంతసేపు? అసలీ పదార్థములచే లభించే సుఖం నిత్యమైనది ఎట్లా అవుతుంది? అందుచేత ఈ జగత్పదార్థముల పట్ల ఉత్కంఠ కలిగి ఉండటం అనేది అవివేకమని, అజ్ఞానమని, అనవసరమని నేను గమనించాను. ఈ సుఖదుఃఖానుభవాలను రుచిచూచి, ఇక వాటిని పరిశీలించాను. అనేక భోగాలూ చూచాను. వాటిలో ఉండే అనిత్యత్వాన్నీ చూచాను. కానీ మహాత్మా! పూర్ణ విశ్రాంతిని ప్రసాదించగలిగే ప్రదేశం గాని, పదార్థం గాని, స్థానంగాని నాకు ఈ లోకాలలో ఎక్కడా కనిపించనేలేదు. అవివేకము చేత అనేక సుఖమయ స్థానములు కనబడుచున్నప్పటికీ, అవన్నీ ఎండమావుల వంటివేనని గమనించాను. ఎత్తైన పర్వతాలు అధిరోహించి చూచాను. మేరు పర్వతము యొక్క సుందర ప్రదేశములు దర్శించాను. లోకపాలకుల నగరములలో కూడా సంచరించాను. ఎంత వెతికినా కూడా నాకు సహజమైనది-శాశ్వతమైనది అగు ఒక్క వస్తువు కూడా మచ్చుకకైనా కనిపించ లేదు. వృక్షములన్నీ... కొయ్యతో నిండి ఉన్నాయి.
ప్రాణులందరు... రక్త - మాంసములచే నిండి ఉన్నారు. భూమి అంతా మట్టియే కదా! ఈ ప్రపంచమంతా... దుఃఖములచేతను, అనిత్యత్వములచేతను వ్యాప్తమైయున్నది. అసారములగు ఇట్టివాటిని చూచి ధైర్యం ఎట్లా కలుగుతుంది చెప్పండి? "ఆఁ! అదేం లేదు. ఇక్కడ మాకు ధనం ఉన్నది. లేదా, మేం ప్రయత్నిస్తే లభిస్తుంది. మిత్రులు ఉన్నారు. సుఖములు లభిస్తున్నాయి. ఇంకేం!
Page:154
ఇట్లా ఇవన్నీ అనుభవించాలే గాని ఇంక దేని గురించో ఎందుకు?”... అని కొందరు జీవులు నూతిలో కప్పలవలె రోజులు గడపటానికి మాత్రమే సంసిద్ధపడుచున్నారు. కానీ, మునీంద్రా! కాస్త వివేకంతో కళ్ళు తెరచి చూస్తేనో?
న ధనాని న మిత్రాణి న సుఖాని న బాంధవాః ।
శక్నువంతి పరిత్రాతుం కాలేన ఆకలితం జనమ్ ॥
'మృత్యువు' అనే పెనుభూతం క్రీనీడలాగా ఈ సంసారంలోని ప్రతి జీవుని వెంటనంటియే ఉంటోంది కదా! కాలపురుషుడు అనునిత్యంగా విలయతాండవం చేస్తూనే ఉన్నాడు. కాలునిచే ఏ క్షణమైనా మ్రింగి వేయబడటానికి బలికి తెచ్చిన మేకలవలె సిద్ధంగా ఉన్న ఈ మనుజుని దేహమును ఆ కాలతాండవం నుండి ఏ బంధుజనులు, ఏ ధనములు, ఏ మిత్రులు, ఏ సంపదలు, ఏ సుఖాలు రక్షించగలుగుతాయి? వీథిలో ఉంచబడిన ముత్యాలహారంలాగా కాలమనే దొంగ ఈ దేహమును ఎప్పుడు దొంగిలిస్తాడో ఎవరికైనా తెలుస్తోందా? ధూళి ఒకచోట ప్రోగయి ఒక ఆకారంలా కనబడు చున్నది చూచారా! అట్లా 'పరమాణువులు' అనే ధూళిచే తయారుచేయబడిన ఈ శరీరం అనేక సంబంధ బాంధవ్యముల మధ్య కొద్దికాలం తైతక్కలాడుతోంది. ఈ మనుజ శరీరంలోని ఆ పరమాణువులు ఎప్పుడు ఎటు దారి చూచుకొనుటచే ఈ దేహం పడిపోగలదో చెప్పలేం. పర్వతా లపై పడియున్న మేఘములు క్షణ క్షణం క్షీణిస్తూ ఉంటాయి చూచారా? అట్లా అనేక విషయాలందు లీనమైయున్న ఈ మనుజుడు అనేక క్షీణదశలను పొందుచూ పైకి మాత్రం 'అది చేస్తాను, ఇది చూస్తాను’ అంటున్నాడే కానీ, అభ్యంతరమున మాత్రం... పురుషార్థరహితుడై, నిష్ప్రయోజనములైన ఏవేవో కార్యవ్యవహారములను నిర్వర్తిస్తూ చివరికి ఒక రోజు మరణమును పొందుచున్నాడు.
ఇదంతా పరిశీలించిన తర్వాత నాకిక సుందర స్త్రీలుగాని, ఐశ్వర్యములుగాని, రమణీయాలని అనిపించటం లేదు. ఎందుకంటే ఈ జీవితమే అతి చంచలమై ఉండగా, ఇక ఇక్కడ-అక్కడ కనిపించే ఆయా సరదా వ్యవహారాల వల్ల ఏం ప్రయోజనం? హే మహాత్మా! ఈ ప్రపంచంలో ఎచట దేనిని చూచుకొని 'ఇక ఫరవాలేదులే' అని ధైర్యం నమ్మకం కలిగి ఉండగలమో చెప్పండి? నేడో రేపో క్రూరమృత్యువు వచ్చి శిరస్సుపై పాదాలు ఉంచి ఆపదను తెచ్చిపెట్టటం తథ్యమే కదా!
ఈ శరీరం ఎండుటాకు వలె పతనశీలమై ఉన్నది. 'జీవితం' అనబడునది శిథిలమైన స్థితిని కలిగియున్నది. ఇక ఆ నా బుద్ధిని చూస్తే... ఇది అధీరత్వముచే కుంచించుకుపోయి ఉంటోంది. ఇక్కడి రసములన్నీ నీరసములుగా కనిపిస్తున్నాయి. నీరసమైన భోగములచేతను, వాటి గురించిన కోర్కెలచేతనూ, జ్ఞాపకములచేతనూ మాత్రమే ఆయువంతా గడచిపోతోంది. అతి దీర్ఘకాలం జీవించినప్పటికీ కూడా నేను ఏ ఉత్తమ పురుషార్థమును సంపాదించుకోనే లేదు.
హే మహాత్మా! ఈ విధంగా విమర్శచేయగా చేయగా... నా యందలి మోహం కొంచెం కొంచెం తొలగసాగింది.
Page:155
ఈ ‘దేహం’ వలన ఇక్కడ ఏం పొంది ఏం ప్రయోజనం? ఎందుకంటే 'దేహి'గా ఈ దేహాన్ని ఆశ్రయించిన నేను ఒకానొకప్పుడు ఈ దేహమును ఇక్కడే త్యజించనున్నాను కదా! ఇక ఈ దేహము ఉన్నది కాబట్టి తారసపడే శబ్ద స్పర్శ రూప-రసాది విషయముల పట్ల నాకు ఆసక్తి ఎందుకు?
“అట్టి ఆసక్తి ఉండకపోవటమే ఉత్తమ స్థితి! ఆసక్తి కలిగి ఉండటమే అధమస్థితి”... అనే నిర్ణయానికి వచ్చాను. ఈ స్వప్నతుల్య జగత్తులో సంపదలు వచ్చిపడుచున్నప్పుడు వివేకి అయినవాడు 'ఇక ఫరవాలేదులే’ అని మురిసిపోడు. "అయ్యబాబోయ్! ఈ సంపదలు నన్ను మోహింప జేయ గలవు కాబట్టి ఇది ఆపద సమయమే కదా!”... అని గ్రహించినవాడై, వాటి పట్ల అనాసక్తియ కలిగి ఉంటాడు.
ఆహా! జలము నిమ్న-ఉన్నత (పల్లము-ఎత్తు) ప్రదేశములకు ప్రవాహపతితంగా కొనిపోబడు చున్నది చూచారా? అట్లాగే ఈ జీవుడు విధి-నిషేధముల చేతను, శాశ్వత-అశాశ్వతములచేతను యథేచ్చగా ఎచ్చటెచ్చటికో గొనిపోబడుచున్నాడు. 'విషయాలు’ అనే విషవాయువులు ప్రసరించుటచే హృదయమందలి వివేక-విజ్ఞానములు మూర్ఛిల్లుచున్నాయి.
మాయ యొక్క “ఆవరణ శక్తి”చే ... సద్రూపమగు 'పరబ్రహ్మము' అసత్తుగా కనిపిస్తోంది. అద్దాని “విక్షేపశక్తి”చే... 'అసత్తు' అగు జగత్తు సద్రూపము వలె భాసిస్తోంది. ఇదే మాయ యొక్క ఘటనాఘటన సామర్థ్యం కదా! అరెరే! రెండు తీరముల మధ్య వేగంగా ప్రవహిస్తూ ప్రవాహం సముద్రం జేరుచున్నట్లుగా... జన్మ మృత్యువుల మధ్య ప్రవహిస్తున్న ఈ జీవులు ‘విషయములు’ అనే మహాసముద్రం వైపుకే అతి వేగంగా పయనిస్తున్నారేగాని, 'జీవితము' అనే సందర్భమును సద్వినియోగపరచుకోవటమే లేదే!
విడువబడిన బాణం మరల వెనుకకు తిరగదు చూచారా? ... కృతఘ్నులు మైత్రిని తిరిగి వెనుకకు అందజేయరు కదా!... ఈ మనస్సు విషయములవైపు పయనిస్తూ శ్రేయోదాయకమైన ఆత్మజ్ఞానమువైపు మరలటమే లేదే?
సుఖాన్యేవాతి దుఃఖాని, సంపదః పరమాపదః ।
భోగా భవమహారోగా రతిరేవ పరారతిః ॥
పైకి సుఖాలుగా కనిపించేవన్నీ నిజానికి దుఃఖరూపాలే! సంపదలుగా కనిపించేవన్నీ ఆపదరూపాలే! భోగాలన్నీ... సంసార మహారోగాలు మాత్రమే! ఆసక్తియే..... పరమ దుఃఖం.
ఆపదః సంపదః సర్వాః సుఖం దుఃఖాయ కేవలమ్ ।
జీవితం మరణాయైవ బత! మాయా విజృంభితమ్ ॥
సంపదలన్నీ ఆపదలే! సుఖం కేవలము దుఃఖము కొరకే అయి ఉన్నది. పుట్టటం చావటం కొరకే అవుతోంది. ఆహా! మాయ యొక్క విజృంభణ ప్రభావం ఎంతటిది? కాలము యొక్క మహా ప్రవర్తనముచే ఇష్టానిష్టములతో కూడి అనేక అల్ప సుఖాలు కనబడుచున్నాయి. ప్రియవస్తువును చూచి సంతోషించినంతసేపు పట్టటం లేదు... వాటి యొక్క వియోగం అట్టి వియోగం అతి దీర్ఘకాలంగా మనస్సును శిథిలం చేసి వేస్తోంది.
Page:156
ఇక విషయభోగములందామా! అవన్నీ పాముయొక్క పడగల వంటివి మాత్రమే! ఎందుకంటే వాటిని కొంచెం స్పృశిస్తే చాలు... వెంటనే కరుస్తున్నాయి. విచారణ చేసి చూస్తే అవి ఆనందకరములూకావు, దుఃఖకరములూ కావు. విచారణ లేకపోతే అవన్నీ దుఃఖమార్గాలే!
ఇక్కడ కనబడే చేష్టలలో చాలా వరకు ఆయాసరహితమైన “ఆత్మ పదము” నకు దారి చూపేవిగా లేవు. పైగా ఆయా చేష్టల పరిణామం అతి కుటిలమైన ఆకారాన్నే కలిగి ఉంటున్నాయి. చివరకు భయంకరమైన కష్టములను ప్రసాదించునవి అగుచున్నాయి. ఈ విధంగా “కాలక్షేపం” క్షిప్ నాశనం/ వృథా) అగుచున్నది. కట్టుకంబమునకు త్రాళ్ళచే కట్టబడి ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తూ క్రమంగా చిక్కి శల్యమయ్యే ఏనుగులు ఉంటాయే! ఆ రకంగా, భోగాశ యందు బంధించబడిన తృష్ణాసహితులగు మూఢ జీవులకు అడుగడుగునా అవమానములు తటస్థిస్తున్నాయి. సంపదలు-స్త్రీలు-ఇవన్నీ కూడా తరంగములవలె క్షణభంగురములైనవి. పైగా అవన్నీ సర్పము యొక్క పడగ క్రింద ఉన్న వస్తువుల వంటివి. విషసర్పపు పడగనీడలో క్రీడించాలని ఏ బుద్ధిమంతుడైనా అనుకుంటాడా? ఒకవేళ ఈ సంపదలు, ఈ స్త్రీలు మనోహరములైనవేనని నమ్మినప్పటికీ,... మదించిన స్త్రీ యొక్క కడగంటి చూపులాగా ఈ జీవితమే అతిచంచలం కదా!
ఆపాతరమణీయేషు రమక్తే విషయేషు యే ।
అత్యంత విరసానేషు, పతన్తి నిరయేషు తే ॥
విచారణ చేయకపోవటంచేత మాత్రమే రమణీయములు పరిణామమున అత్యంత నీరసాలు... అగు ఈ విషయములను ఎవరు తత్పరులై సదా సంపాదించుకోవాలని అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారో... వారికి పతనం తప్పదు. ఈ ఆయుష్షు అనబడేదానిని ఎంతో శ్రమించి, ఎన్నో పుణ్యకార్యములు చేసి కదా, సంపాదించుకుంటున్నాం! అట్టి ఆయుష్షు శీతఉష్ణములు, క్షుత్-పిపాసలు (ఆకలి-దాహములు) మొదలైన ద్వంద్వములచే నిరోధించబడి చేయి జారిపోతోంది. ఇక సముపార్జనకు పైకి రమణీయంగా కనిపించే ధనము మొదలైనవి కష్టసాధ్యాలు, అస్థిరములు, దోషబుద్ధిగల వారిచే మాత్రమే సేవించబడేవి అగుచున్నాయి. అటువంటి ధనాదులు నాకెప్పుడూ సంతుష్టి కలుగజేయజాల వనునది సుస్పష్టంగా గమనించాను. అవి విచారణ చెయ్యక పోవుటచే మాత్రమే ప్రియంగా కనిపిస్తున్నాయి. తుదకు దుఃఖాన్నే కలుగజేస్తున్నాయి. క్షణకాలం విలాసంగా కనబడి, చివరకు శాంతికి భంగం కలుగ జేసేవన్నీ, మోహపూరితాలని విజ్ఞులు మాత్రమే గమనిస్తున్నారు. ఇక్కడి సముపార్జనలన్నీ కూడా ఆ పాతరమణీయాలు, శీఘ్రంగా నశించేవి, దుఃఖ-ఆపదలు కలుగజేసేవి అగుచున్నాయి. కాబట్టి వాటితో సంబంధం మోసపూరితు లగు శత్రువులతో సంబంధం వంటిదే!
ఇక యౌవనం యొక్క శోభ అందామా? అది శరత్కాల మేఘము యొక్క ఛాయ వలె నశ్వర మైనది. దాని రాక - దాని పోక అంతా చమత్కారమే! ఆరంభంలో రమణీయం-చివరికి సంతాప కరం! ఇక 'మృత్యువు' అనే సంఘటన ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు ఎందుకు, ఎట్లా జరుగుచున్నదో ఏ జీవుడూ చెప్పగలిగేది కాదు. అయితే అది తప్పక వస్తుందని, అంతా హరించివేయనున్నదని అందరికీ తెలిసినదే కదా!
Page:157
అయినాకూడా, వర్తమానములో అనేక అసందర్భప్రలాపాలను, అప్రస్తుత ప్రసంగాలను చేస్తూ విలువైన కాలం వృథా చేసుకుంటున్నారే! ఏది పొందినా, పొందకున్నా చివరికి మృత్యువు అన్నిటినీ తప్పక హరించివేయనున్నది కదా!
అన్తకః పర్యవస్థాతా, జీవితే మహాతామపి ।
చలన్తి ఆయూంషి శాఖాగ్రలంబా అంబూనీవ దేహినామ్ ॥
ఈ సర్వ ప్రాణుల ఆయువులు వృక్షాగ్ర భాగంలో గల ఆకుల చివర వ్రేలాడే జలబిందువు కాక మరేమిటి?
జీరన్తే జీర్యతః కేశా, దంతా జీర్యన్తి జీర్యతః ।
క్షీయతే జీర్యతే సర్వం, ‘తృష్ణైవ' ఏకా న జీర్యతే ॥
ఇక వార్ధక్యం! కేశములు, దంతములు శిథిలమైపోతున్నాయి. దేహమంతా శిథిలమగు చున్నప్పటికీ తృష్ణ మాత్రం క్షయింపక వర్తిస్తూనే ఉన్నది. ఆ తృష్ణ భావికాలపు అనేక దేహపరంపరా మహారణ్యానికి త్రోవతీయించుచున్నది కదా! ఎన్ని సంపాదించినా, ఏది పొందినా ఈ తృష్ణాగ్ని చల్లారటమే లేదు.
బాల్యము యౌవనము వలె... యౌవనము బాల్యమువలె... గడచిపోతున్నాయి. ఈ రెండు క్షణభంగురమే అవటంచేత సాదృశ్యమే (ఒకదాని వంటిదే రెండవది అగుచున్నది. దోసిలిలోని నీరులాగా జీవితం శీఘ్రంగా నశించిపోతోంది. గడచిపోయిన జీవితం నదీ ప్రవాహంలాగా మరల వెనుకకు మరలే ప్రసక్తే లేదు కదా! ఏఏ దేహాలు ఇప్పుడు అనేక కార్య సంరంభములలో నిమగ్నమై కనిపిస్తున్నాయో... అవన్నీ కూడా మరికొంత కాలం తర్వాత అట్లా ఉండటం లేదు. లేదా, అసలే ఉండటం లేదు. రమ్యము-స్థిరము-సత్యముగా భాసించే అనేక పదార్థాలు అతి త్వరలో అరమ్యముగా, అస్థిరంగా అసత్యముగా అయి పోతున్నాయి. నిన్న ఉన్నది ఈ రోజుకు కనబడటంలేదు. ఈ రోజున ఉన్నది రేపు ఉండకయే పోవచ్చు.
ఇదంతా ఇట్లా ఉండగా... ఇదే జగత్తులో... కొందరు మహాశయులు, మహనీయులు ఉన్నారు. వారు 'జీవితము' అనే అవకాశాన్ని వాసనలను పెంపొందించుకోవటానికి కాకుండా తన ఇతఃపూర్వపు దుర్వాసనలను రహితం చేసుకోవటానికి శక్తి యుక్తులన్నీ ఉపయోగించి ప్రయత్నిస్తూ... తద్వారా వాసనారాహిత్యము వైపుగా పయనిస్తున్నారు. వారి చిత్తము క్రమంగా 'ఆత్మ విశ్రాంతి' అనే సుఖ స్థానమును సమీపించుచుండుటచే వారి ఆయుష్షు - అవకాశములు సద్వినియోగం అవుతున్నాయి. ఈ చిత్తమునకు 'వాసనారాహిత్యం'చే లభించగలిగే సుఖం-స్వర్గ-భూ-పాతాళాలలో మర్కెడా కూడా లభించజాలదు కదా! ఏ భోగ స్థానములలోనూ మనస్సుకు, ప్రశాంతత కలుగదు. ఒక్క ఆత్మ విశ్రాంతియే అద్దానికి శరణ్యం కదా!
ఓ మాననీయా! వసిష్ఠ మహర్షీ! ఇట్లా నేను వైరాగ్యం సముపార్జించాను. సమస్త మనోహర పదార్థములను వాటి వృత్తులతో సహా జయించివేశాను. క్రమంగా అహంకార రహితుడనైనాను. అతి దీర్ఘకాలంగా అటువంటి అభ్యాసముచే నాకు స్వర్గ-మోక్షములపట్ల కూడా విరక్తి ప్రాప్తించింది.
Page:158
అప్పుడిక తమవలెనే ఏకాంత ప్రదేశంలో ఆత్మవిశ్రాంతిని పొందాలని నిర్ణయించుకున్నాను. ఒక రోజు ఆకాశ సంచారం చేస్తూ ఆ ఏకాంత ప్రదేశంలో మీరు నిర్మించియున్న కుటీరం చూచాను. అది మీచే నిర్మించబడిన కుటీరమని నాకు తెలియదు. ఎవరో సిద్ధుడు ఆ ఆ గృహంలో ఉండి అప్పటికి కైవల్యం పొంది ఉంటారేమోనని అనుకున్నాను. అక్కడ ఏ జీవుడూ వచ్చే అవకాశం లేదని, నాకు ఏకాంత విశ్రాంతికి ఏమాత్రం భంగం రాదని తలచినవాడనై ఆ ఆశ్రమ మధ్య భాగంలో ఆసీనుడనై సుఖాసనం స్వీరించాను. ప్రాణ-అపానములను అనుసంధించి ‘ఆత్మావలోకనము’ అనే నిర్వికల్ప సమాధియందు నిమగ్నుడనైనాను.
హే మహాత్మా! వసిష్ఠ మహర్షీ! ఈ విధంగా నా వృత్తాంతమంతా మీకు నివేదించాను. మీ అనుజ్ఞ లేకుండా మీ కుటీరంలో ప్రవేశించిన అపరాధమునకు నన్ను క్షమించవేడుకొనుచున్నాను. మీ యొక్క దండనగాని, అనుగ్రహముగాని-ఏది ఉచితమని మీరనుకొంటే అది నాకు శిరోధార్యం. మీ దర్శనం అయినందుకు సర్వేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరల మీకు వినమ్రుడనై నమస్కరిస్తున్నాను. హే మునివరేణ్యా! మేము సిద్ధులమైనప్పటికీ కూడా అన్ని విషయాలు చూచినంత మాత్రం చేతనే గ్రహించగలిగిన వారమైనప్పటికీ కూడా ఎప్పుడు ఈ అంతఃకరణము ఒక విషయమున విచారణచే పూర్వాపరాలు పరిశీలించదో, అంతవరకు ప్రతికాలములందలి వృత్తాంతము గమనించదు కదా! బుద్ధిని ఏకాగ్రపరిస్తేనే ఏ విషయమైనా అవగాహనకు వస్తుంది కదా! అప్పుడే ఆ ఒకానొక విషయము యొక్క జ్ఞానం కలుగుతుంది. బుద్ధిని ఏకాగ్రపరచి పరిశీలించక పోతే ఏదీ తెలియదు. “ఎవరో సిద్దులు ఇక్కడ ఆశ్రమం మనస్సుచే నిర్మించి ఆ తర్వాత త్యజించి ఉంటారులే”... అని అనుకోబట్టి, "ఈ ఆశ్రమం (కుటీరం) వసిష్ఠ మహర్షికి చెందినది”... అని గుర్తించటం జరుగలేదు. బ్రహ్మాదుల మనస్సు కూడా ఇట్లే ఇట్టి స్వభావమే (అభిప్రాయము ననుసరించే అవగాహన) కలిగి ఉంటుంది. ఇక సామాన్య సిద్ధుడనగు నా వంటివారి గురించి వేరే చెప్పేదేమున్నది? కనుక మీరు ఆజ్ఞాపిస్తే ప్రాయశ్చిత్తం నిర్వర్తించటానికి నేను సంసిద్ధుడనై మీ పాదాలు ఆశ్రయించుచున్నాను.
ఓ రామచంద్రా! ఆ విధంగా అత్యంత మధురమైన వైరాగ్య ప్రదమైన వాక్యాలు పలికిన ఆ సిద్ధుని ఆప్యాయంగాను, మిత్రపూర్వకంగానూ చూస్తూ చిరునవ్వుతో ఇట్లా పలికాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ సిద్ధ పురుషా! మీకు స్నేహపూర్వకంగా ప్రతి నమస్కారం సమర్పిస్తున్నాను. మీ వైరాగ్య వాక్యాలు అత్యద్భుతములు, పరమసత్యములు, జీవులకు సన్మార్గ సూచకములు అయి ఉన్నాయి. మహాత్మా! ఇందులో మీ దోషమేమీ లేదు. నేను కూడా ఏకాగ్రబుద్ధితో మీ గురించి విచారణ చేయలేదు. దేహధారులగు యోగులకు కూడా ఏకాగ్రబుద్ధితో విచారణ అనుసంధించక పోతే త్రికాల జ్ఞానము సంభవించదను మాట పరమసత్యము. అదియే కొంచెము సేపటి క్రితం నాపట్ల నిజమైనది. “ఈ సిద్ధ పురుషుడు ఇక్కడ నిర్వికల్ప సమాధిలో ఉండి ఉన్నారు. సరే, ఇక నేను నా నిజస్థానమగు సప్తర్షి మండలమును చేరెదను గాక”... అని ధాన్యము మరల్చాను.
Page:159
అట్లు మరల్చుచున్నప్పుడు “సంకల్పము యొక్క ఉపసంహారముచే ఈ మనోనిర్మిత ధ్యానగృహం అదృశ్యమౌతుంది కదా"... అని నేను జ్ఞప్తి చేసుకోలేకపోయాను. “ఈ మహనీయుని సమాధి కొనసాగినంత వరకు ఈ మనోకల్పిత సిద్ధాశ్రమం యథాతథంగా ఉండుగాక”... అని సంకల్పించి ఉంటే మీరు ఆసీనులైన ఆ ధ్యాన గృహం యథాతథంగా ఉండేది. మీ నిశ్చల సమాధికి ఆటంకం కలిగేదే కాదు. ఈ విషయం విన్నవించుకొని మీ యొక్క క్షమను వేడుకోవాలనే ఉద్దేశంతోనే మిమ్ములను అనుసరించి, ఇటువచ్చి మిమ్ములను నిశ్చల సమాధినుండి నిదురలేపాను.
కాబట్టి నా అపరాధమును మీరే క్షమించండి. మహాత్మా! ఇక లేవండి. పోదాం. మీరు మీ సిద్ధలోకములకు, నేను నా నిజస్థానమైనట్టి సప్తర్షిలోకములకు వెళ్ళెదముగాక! ఎందుకంటే విక్షేపరహితమైన స్థితి కొఱకై మన మన స్వస్థానములను జేరటమే ఉచితము, సాధనను కొనసాగించుకోవటానికి సానుకూల్యము కదా!
ఓ రామచంద్రా! ఇట్లు మేమిద్దరమూ కుశల ప్రశ్నల పూర్వకంగా పరస్పర ఆమోదములను, మర్యాదలను తెలుపుకున్నాం. ఆ తర్వాత యంత్రముచే ఆకాశమునకు విసరబడిన గులకరాళ్లవలె విశాల ఆకాశమున కొంతసేపు కలసి ప్రయాణించాం. ఆ తర్వాత పరస్పర ప్రణామపూర్వకంగా ఒకరివద్ద మరొకరం సెలవు తీసుకొని మామా అభిమత స్థానములకు బయల్వెడలాం. నేను కొన్ని సిద్ధ లోకములు, లోక పాలుర నగరములను సందర్శించి, అక్కడి సిద్ధులతో సంభాషించి, అటు తర్వాత సప్తర్షి మండలం జేరాను.
❖
ఓ రామచంద్రా! ఇదీ కథ! ఈ విధంగా నాకు స్వయంగా అనుభూతమైన ఒకానొక సంఘటనను ఆమూలాగ్రం ఈ 'పాషాణోపాఖ్యానం' అనే పేరుతో నీకు తెలియజేశాను. ఆ సిద్ధుడు దృశ్యజగత్తును ఎట్లు నిర్వచించారో కూడా వివరించాను.
కనుక ఓ సర్వసభికులారా! ఈ సంసారము యొక్క ఆశ్చర్యకరమైన వైచిత్రమంతా గమనించి మీమీ ఆశయములను ఎక్కడెక్కడ ఎంత వరకు అవసరమో అంతవరకు తగిన రీతిని సంస్కరించుకొనెదరు గాక!
శ్రీరాముడు : మహర్షీ! మీరు "పాషాణోపాఖ్యానం" ద్వారా అణువణువునా జగత్తులు ఉన్నాయని, అవన్నీ భ్రాంతి చేతనే ఏర్పడి ఉంటున్నాయని, వాస్తవానికి ఆత్మకు అన్యమైనది ఎక్కడా ఏదీ లేనేలేదని సుస్పష్టపరచారు. అట్లాగే ఈ మాయ ఎంతటిదో, సంసారము ఎంతటి దుర్భరమో కూడా సిద్ద పురుషుని వాక్యములు ఉటంకిస్తూ తెలియపరిచారు. మీ బోధ అమోఘం.
Page:160
అయితే... మీరు ఆ మానసిక కల్పిత కుటీరంలో మీ దేహము ఉంచి లోకాలోక పర్వత శిలలోని బ్రహ్మాండ దర్శనం, ప్రళయకాల రుద్ర, ఛాయదేవిల విలయతాండవం తదితర బ్రహ్మాండము దర్శనం చేశారు కదా! తమ భౌతిక దేహమేమో ఆ కుటీరమునందున్న పృథ్వియందు ధూళిమయమై పోయింది. అప్పుడు మీరు సిద్ధపురుషునితో సంభాషించి వీడుకోలు చెప్పిన తరువాత ఏ దేహములతో ఏ ఏ సిద్ధలోకములకు వెళ్ళి అక్కడ సంభాషించటం మొదలైనవి నిర్వర్తించారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! ఆ వృత్తాంతం కూడా విను. అది మరచాను. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను.
ఆ సిద్ధ పురుషునితో సంభాషించిన సువర్ణమయమైన భూమినుండి బయలుదేరాను. ‘జగత్తు’ అనే గృహంలో ఆ చోట ఈ చోట సంచరించాను. సిద్ధుల లోకములందు, లోకపాలకుల నగరమునందు తిరిగి తిరిగి ఇంద్రుని పట్టణం చేరాను. అదంతా స్థూల దేహరహితుడనగు నేనే మనోమాత్ర సూక్ష్మదేహంతోనే నిర్వర్తించాను. మనోమాత్ర దేహుడనై ఉండటంచేత నన్ను ఎవరు గాంచుటయే లేదు. అయితే నేను తదితరులను గాంచుచునే ఉన్నాను. ఆ సమయంలో చిదాకాశమయ స్వరూపుడనగు నేను ఆకాశమువలె సూక్ష్మాతిసూక్ష్మమైన ఆకృతి కలవాడనయ్యాను అప్పుడు నాకు- అధారము లేదు, అధేయము లేదు.
అట్లా ఆ సమయంలో స్థూల పదార్థములను ఎఱుగుచుండే మీ వంటివారివలె గ్రహీతగాని, గ్రాహ్యముగాని (గ్రహించువాడు-గ్రహించబడునది అనునవి గాని) లేవు. దేశకాలములచే ఈ భౌతిక పదార్థాలన్నీ మార్పు చేర్పులు పొందుతూ ఉంటాయి కదా! ఆ నా చిదాకాశ సూక్ష్మరూపము దేశకాలములచే పరివర్ధనం అయ్యేది కూడా కాదు. అంతేకాదయ్యా! అప్పుడు నా స్వరూపము మననశీలమగు మనోమాత్రమే కదా! కనుక నాకు అప్పుడు ఈ పృథ్వి ధర్మాలు, ప్రాణ ధర్మాలు మొదలైనవేవీ లేవు. అప్పుడు నా రూపం సంకల్ప పురుషుని వంటిది. 'ఆలోచన' ఎక్కడికైనా ప్రసరించగలదు కదా! ఆ ప్రసరణను గోడలు గాని భౌతికమైన దూరాలుగాని, కాలము యొక్క పరిమితాలుగాని నిరోధించలేవు కదా! అట్లాగే నేను అప్పుడు స్థూల పదార్థ సమూహములచే నిరోధింపబడనివాడుగా ఉన్నాను.
స్వయముగా స్వానుభవము పట్ల ఉన్ముఖుడనైనవాడుగా ఉన్నాను. మనోమయమాత్రులగు ప్రాణులతోటి మాత్రమే వ్యవహరించువాడనై ఉన్నాను.
శ్రీరాముడు : స్వామీ!
1.) స్థూల దేహరాహిత్యం
2.) కేవలం మనోమయసహితులై ఉండటం
3.) స్వానుభవముపట్ల మాత్రమే ఉన్ముఖులై ఉండటం
4.) భౌతిక పదార్థములచే నిరోధింపబడజాలని స్వరూపం కలిగి ఉండటం
5.) మనోమయులగు ప్రాణులతోటి మాత్రమే వ్యవహరించువారై ఉండటం
Page:161
ఈ 5 విషయాలు ఏ విధంగా సాధ్యమో, ఎట్లా అవగాహన చేసుకోవాలో మరికొంచెం దృష్టాంతపూర్వకంగా వివరించండి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అటువంటి అనుభవమునకు ఇక్కడ “స్వప్నానుభవమే” దృష్టాంతమైయున్నది. అయితే ఎవరైతే స్వప్నానుభవమును ప్రమాణముగా అంగీకరించరో వారికి నేను నా ఆ అనుభవం గురించి చెప్పటం ఎట్లా కుదురుతుంది?
ఒకడు స్వప్నంలో ఏ దేహముతో సంచరిస్తూ ఆ స్వప్నాంతర్గత జనులతో సంభాషిస్తూ స్వప్న నగరంలో విహరిస్తున్నాడు? ఏ పాదాలతో పర్వత శిఖరాగ్రములు అధిరోహించటం మొదలైనవన్నీ నిర్వహిస్తున్నాడు? అది మెలుకువతో ఉన్నవారికి, (ఆ ఇంటిలోని తదితర కుటుంబ సభ్యులకు) తెలుస్తుందా? లేదు. అట్లాగే నేను అక్కడి ఆకాశచారులగు దేవతలకు కూడా కనిపించుటయే లేదు. అయితే పృథ్వి సంబంధమైన ఆకారము కలిగి భాసించే తక్కిన ప్రాణులను నేను మాత్రం చూస్తూనే ఉన్నాను. సూక్ష్మ శరీరధారినగు నన్ను మాత్రం ఎవరూ చూడలేకయేపోతున్నారు.
శ్రీరాముడు : స్వామీ! నాదొక సందేహం. మీరు దేహరహితులు, ఆకాశ శరీరధారులు అగుటచేత ఆకాశచారులగు దేవతలకు కూడా కనిపించటం లేదు కదా! మరి ఆ సిద్ధ పురుషుడు సువర్ణ భూమిపై మిమ్ములను ఎట్లా గాంచగలిగారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మావంటివారు (జ్ఞాన సిద్ధులకు) "జ్ఞాన సత్య సంకల్పము”చే కల్పితములైన సర్వపదార్థములను గాంచగలరు. అయితే, ఒకడు 'సత్య సంకల్పుడు’ అయినప్పటికీ అతడు సంకల్పించని వస్తువును గాంచలేడు.
వాస్తవానికి ఈ జీవులందరు మొట్టమొదట సూక్ష్మ శరీరధారులే. అయితే దేహ సంబంధమైన లౌకిక పదార్థములను, భౌతిక పదార్థములను చూచుచుండే చిరకాలాభ్యాసముచే ఈ జీవులు సూక్ష్మత్వమును ఏమఱచటం, గమనించజాలకపోవటం జరుగుతోంది. ఒకడు నిర్మలాత్ముడై, సూక్ష్మ శరీరధారణను సముపార్జించినప్పటికీ లౌకిక పదార్థాలలో వ్యవహారాలలో నిమగ్నుడైనప్పుడు తన సూక్ష్మ రూపమును క్షణకాలంలో ఏమరుస్తూ ఉంటాడు.
ఇక ఆ సిద్ధునికి నేను ఎట్లా కనిపించానని అడిగావు కదా! దానికి కారణం విను. "ఈ సిద్ధుడు నన్ను చూచునుగాక” అని నేను సంకల్పించాను. కాబట్టే అతడు స్వసంకల్పముచే నన్ను గాంచగలిగాడు.
ఆ తరుణంలో "అయ్యెయ్యో! ఈ మహానుభావుడగు సిద్ధపురుషుడు నా మనస్సుచే కల్పించ బడిన కుటీరంలో తపస్సు చేస్తున్నాడు కదా!” అనునది ఒక్క క్షణం ఏమరచి, “ఈ సంకల్పిత కుటీరం మీరు ఉన్నంత వరకు నిలుచును గాక” అని సంకల్పించకుండా, “నేను సప్తర్షి మండలానికి మరలే వరకు ఈ కుటీరం ఇట్లే ఉండుగాక” అను ఇతఃపూర్వపు సంకల్పమును గుర్తుపెట్టుకోకుండా, నా దృష్టిని యథాలాపంగా నా నిజస్థానం వైపుకు మరల్చాను కదా! అక్కడి మనోకల్పిత కుటీరం తన ఆలంబనం కోల్పోయింది.
Page:162
అప్పుడు, “ఈ సిద్ధపురుషుడు సమాధినిష్ఠలో ఉండగా ఈతని దేహమునకు హాని కలుగలేదు కదా?”... అనే ఆదుర్దాతో “ఈయనకు నేను కనిపించెదనుగాక”... అని సంకల్పించాను. అట్లే కనిపించాను కూడా!
శ్రీరాముడు : స్వామీ! ఈ నా ప్రశ్నకు ఒకప్పుడు సమాధానం చెప్పారు. అయినా కూడా ఇక్కడ సందర్భానుచితం కాబట్టి మరల అడుగుచున్నాను. మామూలు జీవులు “ఇది ఇట్లా ఉండాలి. అది అట్లే ఉండకూడదు”.….. అని సంకల్పించినప్పటికీ... అది చాలా సందర్భములలో నెరవేరటం లేదు. మీరు సంకల్పించగానే అది అట్లే సిద్ధిస్తోంది. ఇది ఎందుచేత అట్లు జరుగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవనికైతే చిరకాలంగా “బ్రహ్మము వేరు-నేను వేరు" అను భేదము దృఢపడి ఉంటుందో... అట్టివాడు సంకల్పించిన పదార్థములను, తదితరములను సంకల్పానుసారం పొంద లేడు. శాస్త్రార్థపరిపక్వతచే ఎవరికైతే "సర్వమునకు అంతర్యామి-బహిర్యామియగు శుద్ధ బ్రహ్మమే నా స్వరూపం కదా" అనే అనుభూతి సుస్థిరమగుచూ, జీవ-బ్రహ్మముల భేదము నశించిపోతూ ఉంటుందో... అట్టి సిద్ధుడు సత్య సంకల్ప యోగ్యుడౌతాడు. అనగా అట్టివాడు “ఇది ఇట్లు ఉండు గాక” అను సంకల్పము నిర్వర్తించుటచే అది అట్లే అనుభూతమవగలదు. ఆ సిద్ధపురుషుడు జీవబ్రహ్మైక్య భావము కలిగి ఉండటంచే “నన్ను చూచుట” అనుదానిలో సంకల్పయోగ్యుడైనాడు.
ఈ విధంగా ఆ సిద్ధ పురుషుని సంకల్పము - నా సంకల్పము - ఉభయములు యోగ్యములై మేమిరు వురము అత్యంత ఆదరపూర్వకంగా సంభాషించుకోవటానికి వీలు ఏర్పడింది.
శ్రీరాముడు : మహర్షీ! ఒకవేళ ఇద్దరు సిద్దులు పరస్పర విరుద్ధమైన సంకల్పములు కలిగి ఉన్నారనుకోండి. అనగా వారిద్దరు పరస్పర విరుద్ధమైన అభీష్టములతో ఒకరు కనబడాలని, మరొకరు కనబడకూడదని-సంకల్పించారనుకోండి. అప్పుడేమౌతుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : నీవు చెప్పినట్లు ఇద్దరు సిద్ధులు పరస్పర విరుద్ధ సంకల్పములు కలిగి ఉన్నారనుకో. అనగా ఒకరు “ఈతనిని నేను గాంచెదను గాక!" అని, మరొకరు "ఈతనికి నేను కనబడకుండెదను గాక"... అని సంకల్పించటం జరిగితే... అప్పుడు వారిద్దరిలో ఎవరి సంకల్ప బలము ప్రబలమై, అధిక నిర్మలమై ఉంటుందో... అతని సత్యసంకల్పమే జయించినదై తదనుకూలంగా జరుగుతుంది.
ఆ విధంగా నేను సిద్ధుల స్థానములందు, లోకపాలుర పురములందు తిరుగుచూ ఉండగా నేనప్పుడు వ్యవహారాధిక్యత వలన నా యొక్క 'సూక్ష్మ రూపత్వము'ను మరిచాను. అప్పుడు నేను “కొందరితోకూడి ఆ మహాకాశమున వ్యవహరించాలి” అనే ఉద్దేశమునందు కొంచెం కొంచెం ప్రవృత్తుడనైనాను. అయితే అట్టి చంచలరూపుడనగు నన్ను అచ్చట ఎవ్వరూ (ఎంత సంకల్పించి నప్పటికీ) గాంచుటయే లేదు. ఒకసారి దేవలోకంలో నేను బిగ్గరగా అరిచాను. కాని ఏం లాభం? స్వప్నంలో స్వప్నద్రష్ట ఎంత అరచినప్పటికీ మెళకువతో ఉన్నవారికి వినిపించదు చూచావా?
Page:163
ఆ విధంగా నా అరుపులను తదితర ఆకాశవాసులకు వినిపించలేకపోయాను. మననశీలమగు మనోరూపము ధరించి నేను ఇతరులను గమనించటం, గ్రహించటం వారికి అవలంబనము ఒసగుట - ఇటివంటి వ్యాపారములలో ప్రవృత్తుడను కాగలిగాను. కానీ నన్ను గుర్తించటం గ్రహించటంలో ఇతరులను సమర్థులుగా చేయలేకపోయాను.
ఓ రాఘవా! ఈ ప్రకారంగా నేను ఆకాశములో పిశాచమై సంచరించాను. ఆయా దేవతల అనిర్వచనీయ స్థానములలో నేను పిశాచరూపినై తిరుగాడసాగాను. సుదీర్ఘకాలం పిశాచత్వము అనుభవించాను.
శ్రీరాముడు : స్వామీ! వసిష్ఠ మహర్షీ! “నేనప్పుడు పిశాచినై (పిశాచత్వము వహించి) దేవతా భూములలో సంచరించాను”... అని మీ యొక్క స్వానుభవమును చెప్పుచుండగా నా మనోవీథిలో ఒకానొక సందేహం ఉత్పన్నమయింది.
పిశాచాః సన్తిలోకేస్మిన్ కిమాకారాః? కిమాస్పదాః?
కింజాతీయాః? కిమాచారాః? కీదృశాః? కీదృశాశయాః?
ఈ ప్రపంచంలో 'పిశాచములు' అనబడేవి ఉన్నాయా? ఉంటే అవి ఏ ఆకారమును కలిగి ఉంటాయి? అవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయి? ఈ లోకంలో జంతు -మానవ మొదలైన అనేక జీవజాతులున్నాయి కదా! మరి పిశాచములు అనబడేవి ఏ జాతికి చెందినవి? ఏఏ ప్రవర్తనలు ఆచారములు అవి కలిగి ఉంటాయి? ఏ ఉద్దేశములు ఆశయములు కలిగి ఉంటాయి? ఎటువంటి అలవాట్లతోగూడి వర్తిస్తూ ఉంటాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి :
పిశాచాః సన్తి లోకేస్మిన్, యాదృశాః తాదృశాత్ శృణు!
ఓ రామచంద్రా! ఈ ప్రపంచంలో పిశాచములు ఎట్టివారై ఉందురో,. వారిని గురించి చెపుతాను విను.
న సభ్యోఽసౌ న యో వక్తి ప్రసంగా పతితం వచః ॥
సభ్యత్వము (లేక) సానుకూలమైన నడవడిక లేకుండా, ప్రసంగానుసారంగా మాట్లాడకుండా ఏదో ఆవేశంగా, అసందర్భంగా పలికేవాడు పిశాచజాతికి చెందినవాడే అవుతాడు.
పిశాచాః కేచిత్ ఆకాశసదృశాః సూక్ష్మ దేహకాః ।
హస్త-పాదాది సంయుక్తాః, పశ్యన్తి త్వమివ ఆకృతిమ్ ॥
కొందరు పిశాచములు ఆకాశమువలె సూక్ష్మ-మనోమయ దేహధారులై ఉంటారు. స్వప్నం వలె మనఃకల్పితమైన కాళ్ళు చేతులు కలిగి ఉంటారు. వారు నీ వలెనే-నా వలెనే తక్కిన ఆకారములను గాంచకలుగుతూ ఉంటారు.
కొందరు పిశాచములు కొందరి చిత్తములలో ప్రవేశించగలుగుతారు. భ్రమ రూపముభయదాయకము అగు తమ ఛాయచే వారలను ఆక్రమించ గలుగుతారు. వారికి వివిధ దుః ఖాదులు కలుగజేసే చేష్టలతో తమ ఆశయములను ఉద్భోధ చేస్తూ ఉంటారు.
Page:164
మరికొందరు పిశాచములు, కొందరు జీవులలో ప్రవేశించి వారిని చంపుతారు కూడా! ఋణాను బంధమును అనుసరించి వారి ధాతువులను భుజిస్తారు. ఆ జీవుల రక్తాన్ని పానం చేస్తారు. వారి చిత్తమును ఆక్రమించి వారి బలమును తేజమును నశింపజేస్తారు.
పిశాచములలో కొందరు ఆకాశమువలె అతి సూక్ష్మరూపులై ఉంటారు. కొందరు కొండంత ఆకారంలో కూడా ఉంటారు. కొందరు స్వప్నమనుజుల ఆకారం ధరిస్తారు. మఱికొందరు సాకారరూపమును ధరించి ఇంతలోనే అంతర్ధానమై ఆకాశరూపులగుతారు. నిరాకారులౌతూ ఉంటారు. కొందరు పిశాచులు మేఘమువంటి రూపము కలిగి ఉంటారు. మరికొందరు వాయువువంటి రూపం కలిగి ఉంటారు. ఇంకొందరు పిశాచులు ఆయా భూతగ్రస్తులగు జీవుల భ్రమానుసారం దేహం ధరించి వర్తిస్తూ ఉంటారు.
అయితే రామచంద్రా! ఈ జీవునికి మూడు దేహాలు ఉన్నాయి -
1.) భౌతిక దేహం
2.) మానసిక దేహం (సూక్ష్మదేహం, అతివాహిక దేహం)
3.) ఆత్మ
పిశాచములకు భౌతిక దేహం ఉండదు. కానీ వారు బుద్ధిమయ-మనోమయ శరీరధారులై ఉంటారు. వారికి భౌతిక దేహము ఉండదు. కాబట్టి దేనినీ గ్రహించటానికి యోగ్యులు, సమర్థులు కారు. వారు ఆకాశమువలె శూన్యరూపధారులై తమ ఆకృతిని తామే అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పిశాచులు వారిలో ఒకరినొకరిని గాంచగలుగుతూ ఉంటారు. వారికి పూర్వాభ్యాసకారణంగా దాహం వేస్తుంది. ఆకలి వేస్తుంది. కాని బాహ్య జలాదులను త్రాగలేరు. దేనినీ భుజించనూలేరు. ఏ పదార్థమునూ ఆధారముగా గైకొనుటకుగాని, తమ ఇచ్ఛవచ్చినట్లు దానము చేయుటకుగాని, గ్రహించుటకుగాని శక్యులు కారు.
ఇచ్ఛా - ద్వేష - భయ - క్రోధ - లోభ - మోహ సమన్వితాః ।
మంత్ర - ఔషధ - తపో - దాన - ధైర్య - ధర్మ వశీకృతాః ॥
మరియు వారు ఇచ్ఛ - ద్వేషము - భయము - క్రోధము - లోభము మోహము మొదలైనవన్నీ కలిగి ఉంటారు. మంత్రము - ఔషధము - తపస్సు - దానము - ధైర్యము - ధర్మములచే వారు వశీకృతులు అవుతూ ఉంటారు. ఒక్కొక్కచోట వారు 'సత్వావష్టంభము' అనే యోగధారణచే వశీభూతులౌతూ ఉంటారు. బీజా క్షరములచే రచించబడిన యంత్రము చేత కట్టుబడి ఉంటారు. మంత్రముచే ఆరాధింపబడి భూతవిద్య ఎఱిగిన మనుజులకు వశీభూతులై వారికి కనిపిస్తూ ఉంటారు. వారిచే (అట్టి మంత్రములను ఆశ్రయించి ఆరాధించువారిచే) ఆయా క్రియలందు, సేవలందు నియోగించబడుచూ ఉంటారు.
పిశాచములు దేవయోనికి చెందినవారే! అందుచేత వారిలో కొందరు దేవతల వలెనే అణిమ-గరిమ-మహిమ-ఈసిత్వసిద్ధి ప్రాకామ్యసిద్ధి ఇచ్ఛా సిద్ధి-వసిత్వ సిద్ధి-లఘిమ అనబడే అప్లైశ్వర్యములు కలిగి ఉంటారు. కొందరు శ్రీమంతులై ఉంటారు.
Page:165
మరికొందరు పిశాచములు నాగముల (పాముల) లక్షణములు కలిగి ఉంటారు. మరికొందరు పిశాచములు కుక్క-నక్కలను బోలినవారై గ్రామములలోను, అరణ్యములలోను నివసిస్తూ ఉంటారు.
మరి కొందరు ఎముకలు - పెంట ప్రోగులు మొదలైనవాటితో కూడిన కల్మషస్థానములలోను, నరక సమానములైన అపవిత్ర ప్రదేశములలోను నివసిస్తూ ఉంటారు.
ఓ రామచంద్రా! ఈ ప్రకారంగా పిశాచముల యొక్క స్థానము-ఆకారము-ఆచారము గురించి చెప్పాను. దేహరహితమైన దేహాకార భావితులే పిశాచములు సుమా!
అయితే “పిశాచములు ఎక్కడి నుండి జనిస్తున్నాయి?”... అనే విషయం ఇప్పుడు వివరిస్తాను. శ్రద్ధగా విను.
శుద్ధ బ్రహ్మము చేత్యరహితమై (దృశ్యరహితమై, విషయరహితమై) సర్వ దృశ్య వ్యవహారములకు మునుముందే ఉన్నది. సర్వవ్యాపకమై, సర్వశక్తియుతమై ఉన్నది. అది వాస్తవానికి అట్లే తన స్వభావ-స్వరూపములను విడువకయే, బంగారము బంగారత్వము విడువకయే ఆభరణత్వము ప్రకటించునట్లుగా, జలము జలత్వము విడువకయే తరంగత్వము ప్రదర్శిచునట్లుగా, - విషయముల యొక్క సంకల్పములను స్వభావసిద్ధంగా ఆశ్రయిస్తోంది. అట్లు సంకల్పిస్తూ తనను తాను 'పురుషుడు’ అను రెండవ రూపముగా గాంచుచున్నది.
“ఇది నేను –ఇది నా యొక్క ఆలోచన/ భావన" అను రెండుగా తనను తాను బ్రహ్మము గాంచటం ప్రారంభించగానే అప్పుడు అద్దానికి (అనగా అట్టి దర్శనము యొక్క వ్యవహార ప్రారంభ చమత్కారమును) శాస్త్రములు “ప్రథమాంకురము” అని, “జీవుడు” అని పేర్లు పెట్టాయి.
ఇది నేను - ఇది నా ఆలోచన / భావన అనే ప్రథమాంకురమే జీవుడు అనబడువాని ప్రారంభం (సంకల్ప ప్రారంభమే జీవుని ప్రారంభం) అని అనుకున్నాం కదా! ఆ 'సంకల్పము' ప్రౌఢము అభిమానయుక్తము అగుచుండగా అద్దానిని 'అహంకారము' అని పిలుస్తున్నారు.
అహంకారము మరికొంత పరిపుష్టం కాగా అద్దానిని 'మనస్సు' అని ఆత్మజ్ఞులు పేర్కొను చున్నారు. అట్టి మనస్సుల సమష్టి రూపమే “సంకల్పాకాశరూపధారి” యగు బ్రహ్మదేవుడు. ఈ జగత్తంతా ఎవరి యొక్క 'సమాలోచన' (లేక) సంకల్పమో... ఆ ప్రథమ పురుషునికి 'హిరణ్యగర్భుడు' అని 'బ్రహ్మదేవుడు’ అని, 'సృష్టికర్త' అని పేర్లు ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ గ్రహించవలసినదేమిటంటే... ఈ జగత్తు వాస్తవానికి అసత్తు. అసత్తగు ఈ జగత్తునకు 'అసత్తు - ఆకార రహితము' అగు మనస్సే బీజము. ఈ ప్రకారంగా మనస్సే బ్రహ్మదేవుడై ఒప్పుచున్నారు. ఆ బ్రహ్మదేవుడు దేహవంతుడై కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి నిర్మలాకాశరూపుడే! ప్రతి జీవుని మనస్సు ఆ బ్రహ్మదేవుని రూపమే!
Page:166
అతడు విద్యమానుడై కనబడుచున్నప్పటికీ స్వప్న పురుషుని (స్వప్నాంతర్గత పురుషుని) ఆకారమువలె అతడు సర్వదా తెలియబడనివాడే. బ్రహ్మదేవునికి ఈ మట్టి-గాలి మొదలైన వస్తువులతో నిర్మించబడిన ఆకారము లేదు. అతడు 'సూక్ష్మ శరీరధారి' అయి ఉన్నాడు. ఎట్లాగంటే.... ఆకాశమునకు గాని, సంకల్ప (ఊహ) పురుషునకు గాని పృథ్వి మొదలైన వాటితో చేయబడిన ఆకారం ఎక్కడిది? దృష్టాంతానికి నీ మనస్సు ఆకాశమున కల్పిత (ఊహానిర్మిత) నగరమును వీక్షించగలదు చూచావా? అట్లాగే మనస్సు తనయందు కల్పించబడిన 'బ్రహ్మ దేవత్వము'ను గాంచుచున్నది.
బ్రహ్మదేవుడు దేనిదేనిని ఏ ఏ సంకల్పితమైన దానిగా ఎఱుగుచున్నాడో... ఆయా పదార్థములన్నీ తత్ సంకల్ప ప్రయోజనంగా అట్లే సత్యము అయినట్లు గాంచుచున్నాడు, అనుభవించుచున్నాడు. ఉదాహరణకు, ఒక యువకుడు “ఆహాఁ! ఆ స్త్రీ ఎంత సుందరంగా ఉన్నది? ఆమెతో సంభాషణం ఎంత మధురంగా ఉంటుంది?"... అని భావన చేసి అదంతా ఆమెతోటి సంభాషించు సందర్భమున అట్లే అనుభవిస్తాడు కదా! ఇక వాస్తవం ఏమిటి అంటావా? “66 ఆ స్త్రీ దేహం కూడా రక్త మాంస నిర్మితమైన తదితర దేహము వంటిదే” అనుకుంటే అట్లాగే అగుచున్నది. "కాదు ఇటువంటి అందమైన స్త్రీలు ఎక్కడో గాని ఉండరు”... అని అనుకుంటే అది అట్లే ప్రాప్తిస్తుంది. అట్లాగే బ్రహ్మదేవుడు తన సంకల్పితమైన జగత్తును సత్యము అయిన దానివలె అనుభవం పొందుచున్నాడు.
ఏ ఏ జీవులు కలరో వారందరి స్వరూపం కూడా ఆ చిద్వస్తువే కదా! అందుచేతనే వారందరు జ్ఞానశక్తిని కలిగియే ఉన్నారు. అందుచేత ఈ ఈ జీవులు కూడా నిజ - కల్పితములను ఎందుకు గాంచలేరు? గాంచగలరు. ప్రతిజీవుడు నిజకల్పిత విశేషములను అనుసరించే ఇక్కడ 'జగత్తు' అనబడు దానిని పొందుచున్నాడు.
ఈ జగత్తు ఎట్టిది? ఆ బ్రహ్మదేవుని “భావన-యోచన కూడా సంకల్పరూపమే” అగుటచే ఈ జగత్తు బ్రహ్మదేవుని ప్రతిభాసయే అయి ఉన్నది. చిత్రకారుడు సృష్టించిన చిత్రం చిత్రకారుని ఊహలోంచే వచ్చింది. కాబట్టి అతని ప్రతిభాసయే కదా! ఈ జగత్తు కూడా అట్టి (బ్రహ్మదేవుని) ప్రతిభాసయే! ఇది బ్రహ్మదేవుని సుదీర్ఘ- సుందర స్వప్నము మాత్రమే! అయితే చిరకాలము తదేక భావనచే ఇది ఘనీభూతమై, పరిపుష్టమై వెలయుచున్నది. వాస్తవముగా బ్రహ్మమే రూపముగా కలవాడు, మనోమాత్ర దేహధారి అగు బ్రహ్మదేవుని చిరకాల భావనచే ఆతని సృష్ట్యానుభవమే ఈ రీతిగా ఆధిభౌతిక రూపంతో (స్థూలరూపంతో) లెస్సగా ప్రకటనమయింది. ఆయన యొక్క అనేకానేక సంకల్పములు సంపుటమగుటచే ఈ జగత్తు భేద సమూహరూపములతో భాసించుచు ఇది “సృష్టి” అని చెప్పబడుతోంది.
ఆ బ్రహ్మదేవుడూ... అతని సంకల్పముచే ఉత్పన్నమైన ఈ జగత్తు... ఈ రెండు కూడా పరమార్థమున బ్రహ్మరూపములే! ఈ రెండూ (బ్రహ్మము-జగత్తు కూడా) సదా (వాస్తవానికి) ఉత్పత్తి-భేద రహితములే!
Page:167
ఆకాశము-శూన్యము; వాయువు-స్పందము; జలము-తరంగము; మట్టి-బొమ్మ; బంగారము-ఆభరణము; ఇనుము-ఆయుధము ... ఇవన్నీ ఏకరూపములే కదా! వాస్తవానికి బ్రహ్మము-బ్రహ్మదేవుడు-సృష్టి ఏక రూపములే అయి ఉన్నాయి.
శ్రీరాముడు : హే మహాశయా! ప్రథమ సంకల్ప పురుషుడగు బ్రహ్మదేవుడు తన సంకల్ప స్వరూపమగు ఈ సృష్టిని 'సత్యము' అని ఎఱుగుచున్నారా? లేక 'అసత్యము' అని ఎఱుగుచున్నారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు నీ సంకల్ప పురుషునికి (నీ కల్పముల అనుభవమునకు కర్తృత్వము వహించే నీ యొక్క చైతన్య విభాగమునకు) సద్రూపములైన నగరాదుల పంచభూతత్వము మరొకరు తెలియజేయవలసిన పని లేకుండానే అసత్యమనియే ఎఱుగుచున్నావు కదా! అనగా, నీవు నీ ఊహలో కనిపించిన నగర వీథులు నీచే అనుభవించబడుచున్నప్పటికీ “ఇదంతా ఊహయే గాని పాంచభౌతిక సత్యం కాదు” అని నీకు నీవే ఎఱిగియే ఉంటున్నావు కదా! అట్లాగే సమష్టిమనోరూపుడు, వాస్తవానికి ఆత్మస్వరూపుడు అగు బ్రహ్మదేవుడు కూడా జగత్తు యొక్క భూతమయత్వమంతా “మిథ్యయే” అని ఎఱిగియే ఉంటున్నాడు.
బ్రహ్మదేవుడు తన చిత్సత్తచే పరిపుష్టములైనట్టి బ్రహ్మాండరూపమగు స్వశరీరము యొక్క ఆయా ధాతువులకు “ఇది పృథ్వి, ఇది జలము, ఇది అగ్ని తేజస్సు, ఇది వాయువు, ఇది ఆకాశము అను ‘పంచసంజ్ఞలను’ ఒసగుచున్నాడు. ఆ పంచ సంజ్ఞలు కలసి ఈ 'జగత్తు' అను రూపమున స్థితినొంది ఉంటోంది. ఇక బ్రహ్మదేవుని సత్యాసత్య భావన గురించి అంటావా...?
నీవు స్వప్నం పొందుచున్నప్పుడు ఆ స్వప్న సమయంలో ఆ స్వప్నాంతర్గత విశేషాలన్నీ అసత్యములే అయినప్పటికీ సత్యమనియే అనుకుంటున్నావు కదా! సత్యములనుకొనే అనుభవము పొందుచున్నావు. ఆ స్వప్నము అయి పోయిన తర్వాత ఎవరూ నీకు చెప్పకుండానే “అదంతా అసత్యమే కదా” అని నీకు నీవే గమనిస్తున్నావు. అట్లాగే ఒకడు ఊహాలోకంలో ఉంటూ ఆ ఊహలో కనిపించినవి అసత్యములే అయినప్పటికీ సత్యమువలె అనుభవం పొందుచున్నాడు కదా! అట్లాగే బ్రహ్మదేవుడు కూడా సంకల్ప జనితమగు ఈ జగత్తును ఇది అసత్యమే అయినప్పటికీ సత్యరూపముగనే అనుభవించుచున్నాడు.
బ్రహ్మదేవుడు అతని సంకల్పము కూడా - (తరంగం జలమే అయినట్లుగా) - పరమార్థమున చిదాకాశ రూపమే అయి ఉన్నది. అయితే, నామరూపాత్మకమగు ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మదేవుని సంకల్ప మాత్రమే కాబట్టి "ఆ జగత్తులోని అనేక పదార్థములు-అనేక జీవులు మొదలైనవాటి దృష్ట్యా ఇదంతా స్వప్నతుల్యమే” అని కూడా తప్పక చెప్ప బడుచున్నది. కాబట్టి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి-వినాశనము కూడా సంకల్పము చేతనే గావించబడినవై స్థితి నొందియున్నవి.
మనోరూపుడగు బ్రహ్మదేవుడు (లేక సృష్టికర్త) ఎంతటి సత్యమో... అంతటి సత్యమే ఈ చంద్ర-సూర్యాదులు కూడా! అవన్నీ భౌతికంగా అగుపిస్తున్నప్పటికీ బ్రహ్మదేవ మనో నిర్మితాలేనని గ్రహించు. బ్రహ్మదేవుని మనస్సువలెనే అవి కూడా అర్థక్రియా సామర్థ్యములు అగుచున్నాయి.
Page:168
కాబట్టి రామచంద్రా! ఈ సమస్త జగత్ సమూహములు కూడా మనోరాజ్యమనియే చెప్పబడుచున్నది. అంతేకాదు. వాస్తవానికి జగత్తు దృశ్యశూన్యము, నిరాలంబము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నది. స్వప్నంలో కనిపించే పర్వతములు, నగరములు, జనులు స్వప్న ద్రష్ట యొక్క స్వరూపములే కదా! అంతకుమించి ఆ స్వప్నాంతర్గత విశేషములకు వేరే స్వరూపం ఎక్కడున్నది? స్వప్న ద్రష్ట స్వతహాగా చిదాకాశరూపుడేనాయె! ఈ విధంగా స్వప్న ద్రష్ట స్వప్నాంతర్గత విశేషాలు చిదాకాశ రూపములే అయి ఉన్నాయి. అట్లాగే బ్రహ్మదేవుడు + ఆయన స్వప్న మాత్రమైన ఈ జాగ్రత్-జగత్తు..... ఈ రెండూ కూడా నిర్మల చిదాకాశరూపములే అయి వెలయుచున్నాయి. ఈ జగత్తు స్వప్న పురమువలె అభాస మాత్రమే! ఇద్దాని యొక్క ఉత్పత్తి-స్థితి-ప్రళయము కూడా ఊహ-సంకల్పము-స్వప్నముల వలె మిథ్యగానే ఉదయించినవై ఉన్నాయి.
కానీ యథార్థానికి ఈ సమస్తము కూడా అవ్యయమగు బ్రహ్మమే అగును సుమా! ఓ రామచంద్రా! చిదాకాశ రూపములమే అగు నీ యొక్క- నా యొక్క ఈ జగత్తు యొక్క గాని ఏమి ఉత్పన్నమౌతోంది? ఏమి నశించుతోంది చెప్పు? నీ స్వస్వరూపమునకు-నా స్వస్వరూపమునకు కూడా జగత్తు ఉండటం చేతగాని, లేకుండటం చేతగాని మార్పు చేర్పులు ఏముంటాయ్? ఏమి ఉండవు. ఇక ఇక్కడి రాగ ద్వేషములు మొదలైన వంటావా? అవన్నీ కేవలం ప్రయోజన శూన్యములు, అపార్థకములు, అనర్థకములు, స్వప్నంలోని సింహాన్ని చూచి జాగ్రత్తులో ఉలిక్కిపడటం వంటిది మాత్రమేనని కూడా గమనించెదవు గాక!
ఓ రామచంద్రా! వాస్తవానికి పరమార్థ దృష్టియందు... సృష్టి యొక్క కారణము లేదు. సృష్టి లేదు. అసృష్టి లేదు... ఏ జీవ-జగత్తులు ఒకప్పుడు భాసించి-మరొకప్పుడు భాసించకయే ఉన్నాయో...అవన్నీ కూడా సదా ఆవరణరహితమగు బ్రహ్మమే అయి ఉన్నాయి.
చైతన్యము అత్యంత శూన్యము-విశాలము-నిర్మలము అయి ఉన్నది. చైతన్యమునందు అద్దానికి ఏమాత్రం అన్యం కానట్టి, 'చిదాకాశము' ఉన్నది. ఆ చికాశమునందు చిదాకాశ స్వరూపములే అగు అనేక భూతకోట్లు ఉత్పన్నం అయి ఉన్నాయి. ఉత్పన్నం కాబోతున్నాయి.
కానీ యథార్థానికి ఆ చిదాకాశమునందు క్షేత్రమూ లేదు, బీజమూ లేదు, ఏదీ నాటబడనూలేదు, ఉత్పన్నము అయి ఉండనూలేదు. మరి? మాయ చేతనే అంతయు ఇట్లు స్థితినొందియున్నది. మాయ భ్రమచేతనే నిర్మితమౌతోంది. భౌతిక రూపములుగా సృష్టి పరంపరలుగా కనిపించేదంతా భ్రమ తొలగితే చిదాకాశముగానే కనిపించగలదు. అట్టి కల్పనా క్షేత్రంలో కనిపించే రకరకాల శిలలే దేవతలు, దేవర్షులు, మనుష్యులు, నాగాదిజాతులు, క్రిమికీటకాదులు మొదలైనవి. అటువంటి కల్పనా క్షేత్రంలో ఉన్నవే మరొక జాతియగు పిశాచులు కూడా! వారు మహాభారభూతులు. వారి ఆకారము పంచభూత పదార్థరహితం కాబట్టి వారు శూన్యరూపులే! వారు ఎప్పుడో ఇతఃపూర్వమే భౌతికదేహం దృష్ట్యా నశించి ఉన్నవారు. దేహరహితులై దేహాకారముగా ఉన్నవారే పిశాచులు.
Page:169
శ్రీరాముడు : మహర్షీ! బ్రహ్మదేవుడు తన ఇచ్ఛ చేతనే ఈ రకరకాల జీవజాతులను సృష్టించుచున్నాడు కదా!... అలాంటప్పుడు ఆయన తన ఇచ్ఛచే 'దేవర్షులు' మొదలైన వారినే సృష్టించవచ్చును కదా! మరి దుష్ట జీవులగు పిశాచములు మొదలైనవి ఎందుకు సృష్టించటం?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఒక కథా రచయిత (నవలా రచయిత) పాఠకుల అభిలాషను అనుసరించి మంచి చెడులను కలగలిపి కథారచన / నవలారచన కొనసాగిస్తాడు కదా! అట్లాగే సృష్టికర్త యొక్క సృష్టిసంబంధమైన ఇచ్ఛ కూడా జీవుల కౌతుక విశేషమును అనుసరించే ఉంటోంది.
బ్రహ్మదేవుని ఇచ్ఛపై అట్టి ఆక్షేపణ తగదు. ఎందుచేతనంటే అతని ఇచ్ఛ పూర్వకల్పము నందలి ప్రాణుల కర్మ-వాసనాదులను అనుసరించే ప్రవర్తించుచున్నదగుచున్నది. వాస్తవానికి సమస్త ప్రాణికోట్లు సమస్త మనోమాత్ర శరీరధారులు, ఇవన్నీ కూడా పృథ్వి మొదలైనవి లేనివారై ఉండి, కేవలం చిదాకాశరూపములై ఉన్నారు. అట్టి స్వతహాగా నిర్మల చిదాకాశ రూపులగు ఈ ప్రాణుల యొక్క చిరకాలాభ్యాసముచే "ఆధిభౌతిక రూపత్వము” పొందుచున్నారు. అదంతా “ఒక స్వప్నము దీర్ఘకాలం అనుభవించటంచే జాగ్రద్దశను పొందుచున్నట్లుగా” ఏర్పడి ఉంటున్నాయి. (ఉదాహరణకు లవణ మహారాజు అనుభవం “మహేంద్రజాలం", “భృగుయమ సంవాదము”, “గాధి వృత్తాంతం - మనోదర్పణం“ మొదలైనవి).
చిదాకాశమునందే దీర్ఘకాలికమైన భావపరంపరాభ్యాసంచే ఆధిభౌతికత్వం అనుభవించ బడుతోంది. అట్లాగే పిశాచ జాతులు కూడా! వారు సర్వ జీవుల వలెనే శుద్ధ చైతన్యరూపులే! అట్టి శుద్ధ చైతన్యరూపులు తమ శుద్ధత్వము ఏమరచి దీర్ఘకాలం 'సంకల్పనగరం'లో విహరిస్తూ సూక్ష్మదేహధారులైనారు. వారు మరల ఇంకనూ స్థూలదేహం పొందలేదు. ఆధిభౌతికదేహసూక్ష్మ దేహత్వముల మధ్య వారు సంచారము చేస్తున్నారు. అనగా (1) వారు సూక్ష్మ దేహం పొందారు. ఇంకనూ స్థూల దేహం పొందలేదు. లేదా (2) స్థూలదేహం కోల్పోయారు. సూక్ష్మదేహులై బలవత్తరమైన స్థూల దేహాభిలాష కలిగి ఉండి ఇంకనూ స్థూలదేహం పొందలేదు. ఇదివారి జాతిధర్మం. అనగా వారు సూక్ష్మ-స్థూల దేహముల మధ్య అనేకానేక ధ్యాసల మధ్య కొట్టుమిట్టాడుచున్నారు.
పిశాచాద్యాస్తథా ఏతే తథా భూత అధిభౌతికాః ।
తిష్ఠంతి తుష్టమనసః స్వసంసార విహారిణః ॥
పిశాచాదులు తమ యొక్క చిరకాలాభ్యాసంచే ఆధిభౌతికత్వ స్వభావాన్ని తమ స్వరూపముపై ఆపాదించుకొని ఇక ఈ సంసారమున సుదీర్ఘ విహారం చేస్తున్నారు. స్వజాతి యోగ్యమైన భోగములను పొందుచు, మరికొన్ని సందర్భములలో ఏవేవో భోగముల కొరకై ఉబలాటముఆందోళన-ఆర్తి-ఆవేదనలు చెందుచూ సంసారారణ్యంలో సంచారములు సలుపుచున్నారు.
వారిలో కొందరు క్రమేపీ సాధనానుకూలమైన ఆధిభౌతిక దేహం పొందుచున్నారు. కొందరు ఇంకనూ పొందుటకై ఆరాటపడుచున్నారు. మరికొందరు పిశాచత్వం ధరించి సుదీర్ఘకాలం గడపుచునే ఉన్నారు.
Page:170
శ్రీరాముడు : మహర్షీ! ఆ పిశాచములు కూడా స్వజాతీయమైన పరస్పర సంబంధములుసంభాషణలు—మొదలైనవి కలిగి ఉంటాయా?
శ్రీ వసిష్ఠ మహర్షి : గ్రామస్థులు గ్రామస్థులను చూస్తారు చూచావా? స్వప్నలోక నివాసులు (ఉదాహరణకు గంధర్వలోకం) పరస్పరం గాంచుచూ సంభాషించుకొంటూ ఉంటారు కదా! అట్లాగే కొన్ని పిశాచజాతులు పరస్పరం వ్యవహరించుకొంటూంటారు. మరికొన్ని పిశాచజాతులుమనుజుని యొక్క స్వప్నజీవుల వలె పరస్పరం గాంచుచుండటం లేదు, పరస్పరం సంభాషించు కోవటం లేదు.
ఓ రామచంద్రా! ఈ పిశాచములు పరాన్నభుక్కు-పరరక్తభుక్కు-పర మనోహక్కులుగా అధికంగా ఉంటూ ఉంటాయి. ఒక్క పిశాచ జాతులే కాకుండా, అదే రీతిగా కుంభాండ జాతి జీవులు, యక్షజాతి జీవులు, ప్రేతజాతిజీవులు ఉంటారు. వారందరికి కూడా కారణం దేహం (లేక) సూక్ష్మ దేహం (లేక, మానసిక దేహం) ఉంటుంది.
యథా తత్ర ఇహ వైనిమ్నా, జలం తత్రావ తిష్ఠతే ।
తథా యత్ర పిశాచాద్యాః "తమః” తత్ర అవతిష్ఠతే ॥
ఎక్కడ పల్లం ఉంటే అక్కడ నీరు నిలుస్తూ ఉంటుంది కదా! అట్లాగే పిశాచాదులు ఎక్కడ ఉంటే వారి వారి పాపములు తారతమ్యమును బట్టి అధికమైన, అల్పమైన తమోగుణస్థితి కలిగి ఉంటుంది, ప్రదర్శితమౌతూ ఉంటుంది.
ఒక్కొక్క పిశాచము మధ్యాహ్న సమయంలో స్వయంగా ఒకని ఎదుట నిలబడితే అతని ఎదుట అంధకారం ఆవరిస్తుంది. ఆ పిశాచము వలన అనుభవించే అంధకారమును ఈ సూర్యుడు తొలగించలేడు. పిశాచ జీవునికి కనబడే అంధకారం అధికంగా ఆ పిశాచ స్వరూపదేహియే స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు.
ఆహా! మాయయొక్క ప్రభావం ఎంతటిది! సభౌతిక దేహులమగు మనం వ్యవహరించాలంటే సూర్యుడు-చంద్రుడు తేజోమండలములు వెలుగు కావాలి కదా! పిశాచములు అదేరీతిగా వ్యవహరించటానికి “చీకటి” కావాలి. గుడ్లగూబలాగా పిశాచాదులు స్వభావంగానే వెలుతురులో నిర్బలులై ఉంటారు. అంధకారంలో ప్రబలులై ఉంటారు. ఆహా! ఏమి ఆశ్చర్యం! ఈ సృష్టిలో కొందరు జీవులకు వెలుతురు ప్రియమైతే, మరికొందరు జీవజాతులకు చీకటి ప్రియమౌతోంది!
ఓ రామచంద్రా! “దేవతల లోకపాలకుల నగరాలలో పిశాచమై సంచరించాను” అను ప్రసంగవశంగా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పిశాచములు గురించిన కొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావించాను. "శిష్యుడు అడిగిన సందేహమునకు సమాధానం గురువు చెప్పాలి" అనే సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ పిశాచముల గురించి చెప్పానే గాని, మన సంవాదమునకు ఇంతకు మించిన వివరాలు సందర్భోచితం కాదు.
Page:171
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా అప్పుడు పంచభూత రహితమగు "కేవల చిదాకాశ మాత్ర దేహధారి” ని అయి పిశాచముగా ఆకాశమున అనేక స్థానములలోనూ లోకములలోనూ సంచరించానని చెప్పాను కదా! ఆ సమయంలో చంద్ర - సూర్య - ఇంద్ర - హరి - హరాదులు గాని, దేహ-సిద్ధ-గంధర్వ-కిన్నర అప్సరస గణములు గాని నన్ను చూడజాలకుండిరి. నేను వారిని ఆక్రమించుచున్నప్పుడు కూడా నన్ను వారు ఆక్రమించలేకపోయేవారు. నా వాక్యములు వారికి వినబడేవి కావు. ఈ విధంగా మత్తును పొందిన సజ్జనునిలాగా కర్తవ్య విచార శూన్యుడనై మోహమును పొంది కొంతకాలం అట్లా గడిపాను. అట్లా సంచరిస్తూ సంచరిస్తూ ఉండగా ఒకానొకప్పుడు కాకతాళీయంగా 'అరెఁ! ఏమిటిది? నన్ను ఎవరూ చూడలేక పోతున్నారు, వినలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పిశాచత్వము తొలిగేది ఎట్లా?' అనే ఆవేశముతో కూడిన ఆవేదన నా యందు బయలుదేరింది. “ఈ ఒంటరితనం నేను త్యజించాలి. ఎట్లా?" ... అని యోచించసాగాను. అప్పుడు నా హృదయస్థానంలో ఒకానొక ఆలోచన తళుక్కున మెఱిసింది. "అరె! నేను ఈ విషయం ఎట్లా మఱచాను? మేము సత్యసంకల్పులం కదా! 'ఇది ఇట్లు అగుగాక’ ...అని తలచగానే అతి అట్లే ప్రాప్తించగలదు కదా!" అనే మాట జ్ఞాపకమునకు వచ్చింది. అప్పుడు నేను దేవతాలోకంలో ఉండటంచేత "ఈ దేవతలందరు నన్ను చూచెదరు గాక!" అని మననపూర్వకంగా కొంతసేపు సంకల్పించాను. వెంటనే ఆ దేవలోకంలోని దేవతా జీవులకు ఇంద్రజాలంలో ఎదురుగా కొండలు కనిపించునట్లు నేను అప్పటికప్పుడు జన్మించినట్లుగా కంటికి కనిపించసాగాను. అప్పుడు నేను ఆయా లోకములకు ప్రామాణ్యములైన యథా స్థితములైన ఆచారములు కలిగి ప్రవర్తించసాగాను. శంకారహితుడనై వర్తించటం ప్రారంభించాను. దేవతల గృహములలో వారితో సంభాషించటం ఆరంభించాను.
అప్పుడు నా ఇతఃపూర్వపు వృత్తాంతం తెలియని దేవతలు కొందరు, “ముంగిటయందలి పృథ్వి నుండి ప్రప్రథమంగా ఆవిర్భవించారు. కాబట్టి ఈయన పార్థివ వసిష్ఠుడు" అని చెప్పుకోసాగారు.
మరికొందరు “ఈతడు ఆకాశమున సూర్యకిరణముల నుండి వెలువడటం మేము చూచాం. కాబట్టి ఈయన 'తేజస వసిష్ఠుడు’” అని సంభాషించుకోసాగారు. అట్లాగే వాయుమండలము నుండి నేను ఉద యించటం వీక్షించిన ఆకాశవాసులగు దేవతలచే “వాత వసిష్ఠుడు” అని పిలువబడసాగాను.
కొందరు మునీశ్వరులు నేను జలము నుండి వెలవడుచున్నట్లు గాంచినవారై “ఈయనే వారి వసిష్ఠుడు” అని ప్రకటించసాగారు. ఆకాశము నుండి వినిర్గతుడవటం గాంచిన మరికొందరు ఆకాశవాసులు “ఆకాశ వసిష్ఠుడు” అని సంబోధించసాగారు.
Page:172
ఈ విధంగా వివిధ కల్పనలచే నా నామము - జన్మ గురించి ఊహ-అపోహలు కల్పించబడ్డాయి. అప్పటి నుండి లోకములలో ఒకచోట పార్థివుడు అని, మరొకచోట అమ్మయుడు (జలమయుడు) అని, ఇంకొకచోట 'తైజసుడు' అని, వేరొక చోట 'మారుతుడు' అని, ఒకానొక చోట ‘ఆకాశమయుడు' అని ప్రసిద్ధికెక్కాను.
ఆ తర్వాత చిరకాలాభ్యాసంచే కాలక్రమంగా నా మనస్సు పరిణతి పొందింపబడినది. అనగా క్రమంగా నాపట్ల అతివాహిక దేహము (సూక్ష్మదేహము) ఆధిభౌతిక దేహము (స్థూల దేహము) ప్రకటనమయ్యాయి. అయినా కూడా, రామచంద్రా! నా యొక్క ఆత్మజ్ఞాన బలంచేత నా దృష్టియందు... 1.) అతివాహిక దేహము (సూక్ష్మ దేహము); 2.) ఆధిభౌతిక దేహము (స్థూల దేహము)... ఈ రెండూ కూడా చిదాకాశరూపములుగా కన్పట్టాయిగాని ఏదో క్రొత్తది పొందినట్లుగాని, పాతదేదో త్యజించినట్లుగాని నాకు ఆ సమయమందుకూడా అనిపించనేలేదు. ఇప్పుడూ అనిపించటం లేదు. నేను ఏకాంతాకాశ ప్రదేశమున ప్రకాశించినప్పుడు, లోకాలోక పర్వతశిలలో బ్రహ్మాండమును దర్శించినపుడు, మహారుద్ర-ఛాయాదేవిల ప్రళయ తాండవం దర్శిస్తు న్నప్పుడు, పిశాచ స్వరూపినై సూక్ష్మ దేహమునకు కూడా ఆవల సంచరించుచున్నప్పుడు, “సర్వతత్త్వ రూపమగు ఆత్మయే నా స్వరూపం”.... అని సుస్థిరీకరించుకొని ఉండుటచే ఇప్పుడు సూక్ష్మ-స్థూల దేహాలు పొందుచున్నప్పుడు కూడా యథాతథమైన 'ఆత్మభావన'యే పుణికిపుచ్చుకొని ఉన్నాను.
అప్పుడు-ఇప్పుడు కూడా నా చైతన్యము 'ఆత్మ భావము' తోటియే స్ఫురిస్తోంది గాని.... దేహాత్మ భావనతోటి కాదు.
ఓ రామచంద్రా! 'ఆత్మజ్ఞాన బోధ' సందర్భంగా ఈ పాషాణోపాఖ్యానం అనే ఆఖ్యాయిక ద్వారా నా స్వానుభవమును సోదాహరణపూర్వకంగా వివరించాను. ఈ ప్రకారంగా, ఈ చోట నేనే ఆకాశాది పంచభూతములతోటి స్పురిస్తున్నప్పటికీ నిరాకారమగు పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నాను. అట్లాగే నీవుగాని, ఈ సభలో మరెవరైనా గాని నిర్మలము-సుతీక్షము-సువిశాలము అగు బుద్ధితో తమ స్వరూపమును నిరాకారమగు పరబ్రహ్మముగా తప్పక గాంచవచ్చును.
వాస్తవానికి సర్వదా నిరాకార పరబ్రహ్మ స్వరూపుడనే అయినప్పటికీ మీ అందరి ఉపదేశం మొదలైన వాటి కొఱకై నేను ఈ సాకార వసిష్ఠముని రూపం ధరించి మీ ఎదురుగా కనిపిస్తున్నాను.
శ్రీరాముడు : స్వామీ! మీరు జీవన్ముక్తులా? విదేహముక్తులా? ఈ ఇద్దరిలో భేదమేమైనా ఉన్నదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! ఈ "జీవన్ముక్తుడు-విదేహముక్తుడు” అనునవి శాస్త్రములు బోధకొరకై కల్పించి, బోధానంతరం ఆ రెండు శబ్దములు భేదమును అభేదముగా చేసివేస్తున్నాయి. శిష్యుడు పూర్ణ జ్ఞాని అగుచుండగా ఇక ఇత్యాది శబ్దముల అర్థ పరిశీలన క్రమంగా అనావశ్యకమగుచున్నది. అయినా నీవు అడిగావు కాబట్టి ఇక్కడ చెప్పుచున్నాను. విను.
Page:173
విదేహముక్తుడు బ్రహ్మమాత్రుడై చిదాకాశమాత్రుడై స్థితి కలిగి ఉంటున్నాడు. అతని లోక సందర్శనము ఈ కనబడే స్థూల - సూక్ష్మములకు అతీతమైనదై ఉంటోంది.
జీవన్ముక్తుడో... వ్యవహారం ఆచరిస్తున్నప్పటికీ చిదాకాశరూపుడే అయి వెలయుచున్నాడు. ఉభయులూ కూడా తమ చిదాకాశ రూపమునే ఆయా సర్వస్థితి గతులలోను అనుభవిస్తున్నారు. ఉభయములు తమ వాస్తవతత్త్వమును ఎఱిగి అనుభూతపరచుకునియే ఉంటున్నారు. ఇక వారిద్దరి మధ్య భేదమెక్కడిది? నాకేమి అగుపించటం లేదు. బ్రహ్మముకంటే అన్యమైనదేదీ నాకు ఎక్కడా కనిపించటమే లేదు. బ్రహ్మీదృష్టి నాకు తొలగకపోవుటచే, స్థూలదేహి - సూక్ష్మదేహి - వాయుదేహి - జలదేహి - పార్థివదేహి - తేజోదేహి - ఆకాశదేహి - పిశాచదేహి - వర్తమాన దేహిని అగుచున్నప్పుడు, అగుచుండనప్పుడు కూడా నేను ఆత్మనే! నాకు తదితరంగా కనిపించేదంతా కూడా ఆత్మయే! స్వప్నం కంటున్నప్పుడు ఆ కలలో కనిపించే స్వప్నాంతర్గత మనుజుడు వాస్తవానికి ఆకారరహితుడే కదా! అట్లాగే నాకు ఆకారముతో కనిపించే తదితర జీవులంతా ఆత్మ స్వరూపులేనని నా దృష్టికి సుస్పష్టంగా అన్ని స్థితులలోను, పరిస్థితులలోను అనిపిస్తోంది.
ఇదంతా భౌతిక దృష్టిగలవానికి భౌతికంగాను, ఆత్మ దృష్టి గల వానికి ఆత్మతత్త్వముగాను అనుభూతమౌతుంది. అందుచేత ఓ జనులారా! మీరు ఆత్మ తత్త్వమును విని పఠించి గ్రహించి అప్పుడు ఈ జగత్తులను దర్శించండి. ఇకప్పుడు మీకు నా వలెనే “సర్వము ఆత్మ స్వరూపము” అను రీతిగా అగుపించకపోతే నన్ను అడగండి.
చూచావా రామచంద్రా! ఈ విధంగా బ్రహ్మదేవుని మొదలుకొని సమస్త శరీరములు, ఈ సమస్త సృష్టులు అజ్ఞాన దృష్టికి ఆధిభౌతికంగా ఉత్పన్నమయినట్లుగా అనిపిస్తోంది. కానీ యథార్థానికి అవేవీ ఏనాడు ఉత్పన్నమే అయి ఉండలేదు. ఊహ (సంకల్పము)చే బ్రహ్మదేవుడు సమష్టి సృష్టిని (మాయచే) కల్పించుచుండగా, ఊహచేతనే జీవుడు జగత్తులను అనుభవించుచున్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఈ జీవుడు కూడా వాస్తవానికి సర్వదా ఏకాత్మ స్వరూపులే! ఉభయులు ఏకస్వరూపులే!
ఈ ‘ఆకాశ వసిష్ఠుడు’ అని మీ అందరిచే పిలువబడే నేను నిజమనస్సు యొక్క అభ్యాసము చేతగాని, (లేక) మీ యొక్క అభ్యాసము చేతగాని, (లేక) మీ యొక్క బుద్ధిని అనుసరించిగాని ఇట్లు ఈ విధంగా ఆధిభౌతిక దేహముతో స్థితిని కలిగి కనిపిస్తున్నాను.
ఇది నా యొక్క విషయమే కాదు. ఈ సభలో నారద-వ్యాస-విశ్వామిత్రాది మహనీయులగు ఎందరో ఆత్మజ్ఞులు ఉన్నారు. వారందరు నా వలెనే 'సర్వము ఆత్మయే' అనే అనుభవమును పుణికిపుచ్చుకొనియే ఈ సభకు వేంచేసి మన ఈ అధ్యాత్మ శాస్త్ర సంవాదాన్ని వింటూ అంగీకార తేజస్సును అందిస్తున్నారు. నాకు వలెనే బ్రహ్మదేవునికి, ఈ సభలోని తత్త్వజ్ఞులకు, తదితర ఆత్మజ్ఞులగు మహనీయులకు స్వదృష్టిలో ఈ జగత్తంతా కూడా చిదాకాశ మాత్రమే అయి ఉన్నది.
Page:174
పరీక్షకుల దృష్టియందు ఈ సమస్తము మనోమాత్రమే అయి ఒప్పుచున్నది.
బాలుర దృష్టికి బేతాళము (వాస్తవానికి లేకపోయినా) కనిపిస్తుంది చూచావా? ఎందుచేత? అజ్ఞానముచేత కదా! అట్లాగే ఈ సమస్త సృష్టి కూడా జ్ఞానము సంపాదించని వారి దృష్టియందు వజ్రమువలె దృఢరూపమును పొంది ఉంటోంది. దూరపు దేశంలో ఉన్న బంధువు పట్ల గల బంధుత్వబుద్ధి ఆ బంధువుకు సంబంధించిన వాసన సన్నగిల్లుటచే క్రమంగా ఉపశమిస్తుంది చూచావా? అట్లాగే ఎఱుగబడుచూ-ఎఱుగబడుచూ ఉండగా అల్పకాలంలోనే ఈ సృష్టి పట్ల ఏర్పడిన ఆధిభౌతికత్వము శమించిపోగలదు. నిద్రలేచిన తర్వాత "అయ్యో! నా స్వప్నంలోని ధనం ఎవరు దొంగిలించారో?”... అనే దుఃఖం ఎవరికైనా ఉంటుందా? అట్లాగే ఎఱుగబడిన తర్వాత అహంకారరూపమగు సృష్టి యొక్క స్థూలత్వము కూడా శమించుచున్నది. అది 'ఎండమావులు’ అని, ఎఱిగిన తర్వాత అందులో దాహం తీర్చుకోవాలని ఎవరూ అనుకోరుకదా! జ్ఞానదృష్టిచే దృశ్యదృష్టులు ఉపశమిస్తున్నాయి. ఈ వసిష్ఠ రామ సంవాదము అను మహారామాయణము వంటి శాస్త్రములను కొంచెం పరిశీలించినంత మాత్రం చేతనే అట్టి జీవన్ముక్తత్వము నిరంతరము లభిస్తూ ఉండగా... ఇంత మాత్రం కార్యం ఆచరించటంలో ఏమి కష్టమున్నది? కనుక 'జీవన్ముక్తత్వం' అసాధ్యం అను సిద్ధాంతం మేము ఒప్పుకోం.
సంసారవాసనాభావరూపే సక్తా ను యస్యధీః ।
మన్గో మోక్షే నిరాకాక్షీ స శ్వా కీటో అధవా జనః ॥
ఎవని బుద్ధి అయితే సంసారవాసనావశంచే అభావరూపములగు దేహము-ఇంద్రియము మొదలైన పదార్థములందు ఆసక్తి కలిగి ఉంటుందో, మోక్షము విషయములో ఆశయము ఉండకుంటుందో... అట్టి మనుజుడు శునకము-కీటకము తోటి సమానుడే అవుతాడు. అంతకుమించి నేనేం చెప్పగలను?
ఓ జనులారా! 'జీవన్ముక్త బుద్ధి' తో అనుభవించే శబ్ద స్పర్శాది భోగకలాపములు ఎట్లా ఉంటాయో... మూర్ఖ-అజ్ఞాన బుద్ధిచే సేవించబడే శబ్దాది భోగాలు ఎట్లా ఉంటాయో.... ఈ రెండింటికి ఉన్న భేదమేమిటో కొంచెం యోచించండి. మొదటిదేమో చిద్రూపముచే ఆనందప్రదమౌతుంది. రెండవదో... జడ రూపముచే దుఃఖ ప్రదంగానే అగుచున్నది. సుమా!
ఈ వాసిష్ఠ రామాయణము మొదలైన ఆత్మశాస్త్ర గ్రంథాలను కాస్త పరిశీలించినంత మాత్రం చేతనే సమస్త పదార్థములపట్ల అంతఃకరణ శీతలత్వం ఉదయిస్తుంది. "జీవన్ముకత్వం సుసాధ్యమే. అత్యవసరం కూడా” అని సుస్పష్టమౌతుంది.
చిత్తము యొక్క శీతలత్వమే మోక్షము - సుఖము కూడా! చిత్తము యొక్క సంతాపమే బంధం. ఆశ్చర్యం! అట్టి "చిత్తము యొక్క శీతలత్వం ఎట్లా సంపాదించుకోగలం?”... అనే విషయంలో జనులు ఆశ్రద్ధ కలిగి ఉన్నారే! లోకముయొక్క మూఢత్వము ఎటువంటిది? అందుకే అవతారమూర్తియగు నీ రాక జనులకు అత్యవసరమైయున్నది.
Page:175
ఈ మనుజులు స్వభావముచేతనే విషయములకు వశీకృతులై ఉంటున్నారు. కాబట్టే పరస్పర యుద్ధము, చౌర్యము, స్త్రీ-ధనములను సంపాదించాలనే తీవ్రమైన పట్టుదలలు కలిగి ఉంటున్నారు. ఇట్టి భ్రాంతి-సంతాపములతో కొట్టుమిట్టాడుచూ ఒక దుఃఖము నుండి మరొక దుఃఖమునకు, ఒక భయము నుండి మరొక భయమునకు చనుచుండు జనులకు 'ఆత్మజ్ఞానము' తప్పితే ఔషధం ఏమున్నది? అట్టివారు ఈ దృశ్యముపట్ల కొంచెం విరక్తి కలిగి ఈ ముముక్షు శాస్త్రము యొక్క అర్థ విచారణ, నిదిధ్యాసాది ఉపాయములు, తత్త్వజ్ఞానుల సంవాదమును-బోధన వినటం ప్రారంభించితే అతి త్వరలో యథార్థ వస్తువగు ఆత్మను అవలోకించినవారై సుఖించగలరు.
శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! శ్రీ వసిష్ఠ మహర్షి ఇట్లా పలికి 17వ రోజు సంవాదమును ముగించారు. క్రమంగా సూర్యుడు అస్తమించసాగాడు. సభికులంతా లేచి పరస్పర నమస్కారములు సమర్పించుకొని సాయం సంధ్యాది దైవీక్రియలకు ఆయత్తం కాసాగారు.
(పదిహేడవ రోజు విచారణ పూర్తి అయింది)